ఏ సంస్కృతి నుంచి వెలసిన కమలాలు మీరు.. కేటీఆర్ పై బి.నరసింగరావు ఫైర్

చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు చేరాయా? ఆ పాములే.. ఆ చీమలను నిర్ధాక్షణ్యంగా కాటేస్తున్నాయా?. పాము కాటున పడిన చీమలు.. చిక్కి శల్యమై తెరమరుగైపోగా.. మిగిలి ఉన్న చీమలు.. పాములు బుసలు కొడుతోన్న ఆహంకారాన్ని కలిసికట్టుగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాయా? అనే ఓ చర్చ అయితే తెలంగాణ గడ్డపై ఇప్పుడిప్పుడే ఊపిరిలూదుకొంటోంది. అదీ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. దశాబ్ది ఉత్సవాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్న వేళ... ఈ చర్చ ఊపందుకోవడాన్ని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో స్వాగతిస్తోంది. చలిచీమల చేత చిక్కి అన్న సుమతీ శతకంలోని పద్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు.  తాజాగా తెలంగాణ పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌పై ప్రముఖ దర్శకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, జాతీయ, అంతర్జాతీయ సినిమా పురస్కార గ్రహీత బి. నర్సింగరావు నిప్పులు చెరుగుతూ రాసిన బహిరంగ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సదరు లేఖ.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడమే కాదు.. హాట్‌టాపిక్‌గా మారి.. తెలంగాణ సమాజంలో ప్రకంపనలు రేపుతోంది. అంతే కాదు సదరు బహిరంగ లేఖలో నర్సింగరావు.. చాలా పదునైన పదాలు వాడారు. అంటే... రాజ్యం ఏలుడు కాదు.. విజ్జత ఉండాలి.  కేటీఆర్.. నీ గతమేందో మరిచినవా? అపాయింట్‌మెంట్ అడిగితే 40 రోజులుగా ఇవ్వవా?, అత్యంత ఉన్నత వ్యక్తులను అణచివేస్తారా?, నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి.. నాకు రెండు చిల్లి గవ్వలు కూడా కావు, ఏ సంస్కృతి నుంచి వెలిసిన కమలాలు మీరు అంటూ నిప్పులు చెరిగారు.  అయితే నర్సింగరావు ఏ అంశాలపై చర్చించేందుకు కేటీఆర్ అపాయింట్‌మెంట్ కోరారో? ఆయనను కలిసేందుకు నిరాకరించారో? అనేది మాత్రం తెలియరాలేదు. కానీ ఈ అంశం మాత్రం ప్రస్తుతం తెలంగాణ సమాజంలో పొగలు సెగలు కక్కుతూ.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  అసలు నర్సింగరావు రాసిన లేఖలో ఏముందంటే..  వాడు  నచ్చాడా కేటీఆర్ నీకు.. నేను నచ్చలేదా.. ఏ రకంగా నిన్ను అంచనా వేయవచ్చు... 40 రోజుల నుంచి ప్రతీ రెండు రోజులకు ఒకసారి నిన్ను అపాయింట్‌మెంట్ అడిగితే నువ్వు నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వవా.. నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి  నాకు రెండు చిల్లి గవ్వలు కూడా కావు అని పేర్కొన్నారు. అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు.. అంత గొప్ప హీనులు నీ సలహాదారులు... అంత గొప్ప ఏలిక నీది.. ఏ సంస్కృతి నుంచి వెలిసిన కమలాలు మీరు మీ గత జాడలు(అడుగుల) అనవాళ్లు మరిచారా.. ఇవన్నీ రేపు బహిరంగంగా మాట్లాడుకుందామంటూ ముగించారు.  అయితే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొన్ని దశాబ్దాల కిత్రమే ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, కవిగా బి. నర్సింగరావుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు మా భూమి, దాసి, రంగుల కల, మట్టి మనుషులు తదితర చిత్రాలు.. దేశ విదేశాల్లో ప్రదర్శించబడి.. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలను సైతం ఆయన అందుకొన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన క్రియాశీలంగా వ్యవహరించారు.  ఆ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఆ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ఆయన అత్యంత కీలకంగా  వ్యవహరించారు. అందుకోసం కేసీఆర్ సర్కారుతో కలిసి అడుగులు వేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల ప్రయారిటీలు మారడంతో..  ఉద్యమకారులకు ప్రగతి భవన్ ద్వారాలు తెరుచుకోవడం బంద్ అయింది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించిన.. ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను హేళన చేసిన ఆంధ్ర ప్రాంత నటులు, దర్శకులు, సినీ ప్రముఖులకు మాత్రం ప్రగతిభవన్‌లో ఎర్ర తీవాచి పరిచి మరీ స్వాగతం పలికారు... పలుకుతున్నారు. అందుకు ఇటీవల టాలీవుడ్ ప్రముఖ హీరో శర్వనంద్ వివాహ రిసెప్షన్‌కు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను స్వయంగా కలిసి.. ఆహ్వానించారు. ఈ రిసెప్షన్‌కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.  అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... పలువురు హీరోలతో కేసీఆర్, కేటీఆర్.. సమావేశమవుతోన్నారు. వారికి అపాయింట్‌మెంట్లు సైతం ఇస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం లో కీలకంగా వ్యవహరించిన వారికీ, ఉద్యమంతో నేరుగా సంబంధం ఉన్నవారిని కేసీఆర్ ఫ్యామిలీ సాధ్యమైనంత దూరం పెడుతూ వస్తున్నదని ఇప్పటికే ఓ భావన తెలంగాణ సమాజంలో బలంగా వేళ్లూనుకొంది. అంతేకాదు కేసీఆర్ ప్రస్తుత కేబినెట్‌లో.. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వారు ఎంత మంది ఉన్నారంటే.. ఒక్క సారి ఆలోచించాల్సిందే. ఇక కేసీఆర్‌తోపాటు.. తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసిన.. ఈటల రాజేందర్‌ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో.. ఏ పార్టీలో ఉన్నారో అందరికీ తెలిసిందే. అలాగే ప్రొపెసర్ కోదండ రామ్.. ఎక్కడ ఉన్నారు. అదే విధంగా ప్రత్యేక తెలంగాణ కోసం.. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి.... దేవుడిచ్చిన అన్న అంటూ నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను పొగిడిన విజయశాంతి అలియాస్ రాములమ్ము.. ప్రస్తుతం ఏ పార్టీ జెండా మోస్తోందోనన్న విషయం విదితమే.  అలాగే తెలంగాణ ఉద్యమంతో సంబంధమున్న మృతుల కుటుంబాలకు న్యాయం జరిగిందా? అర్హులైన యువతకు ప్రభుత్వ కొలువులు వచ్చాయా?, ఆన్నదాతల ఆక్రందనలు ఆగాయా? రైతుల ఆత్మహత్యలకు పుల్‌స్టాప్ పడిందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. కొత్త పరిపాలన, కొత్త పథకాలతో అంతా కొత్త శోభ సంతరించుకొందా? లేక... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలన సాగినట్లే.. ఆట ఒకటే కానీ.. ఆటగాళ్లు మాత్రమే మారారా? అంటే అవుననే సమాధానం అయితే తెలంగాణ సమాజంలో ఓ వెల్లువలా వెల్లువెత్తుతోంది. ఇంకా చెప్పాలంటే పాత సీసాలో కొత్త సారా అన్నట్లుగా ఉందని ఇప్పటికే తెలంగాణ సమాజం ఒక్కటై స్పష్టం చేస్తోంది. అంతేకాదు ఉద్యమ సమయంలో నక్సలైట్ల అజెండా మాది అని ప్రకటించిన నాటి కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించి.. తెలంగాణ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడిన తర్వాత.. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతోన్న అన్యాయాలను ఎవరైనా ప్రశ్నించినా.. అలాగే లోపాలను ఎత్తి చూపినా. వారి పరిస్థితి ఏమిటన్నది తెలంగాణ సమాజం ప్రత్యక్షంగా చూస్తోంది.

హైడ్రామాకు నేటితో తెర

బీఆర్ఎస్ అసమ్మతి నేతలు పొంగులేటి, జూపల్లి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మార్గం సుగుమం అయ్యింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే వార్తలకు ఇక తెరపడనుంది. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై వీరిరువురు బుధవారం అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.   బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పట్ల అసంతృప్తిని తొలుత పొంగులేటి ఒక్కరే ప్రకటించారు.  తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తోడయ్యారు. వీరిద్దరు కలిశాక తాము ఎటువైపు వెళ్లాలన్నదానిపై ఇద్దరి మధ్య అంతర్గత సమావేశాలు జోరుగా  సాగాయి. కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఆదివారం  జూపల్లి కలిశారు.ఇది కాజువల్ సమావేశమేనని జూపల్లి అంటున్నారు.తామిద్దరం పాత స్నేహితులమని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లిలు విలేకరులతో అన్నారు.30 ఏళ్లుగా స్నేహితులుగా కొనసాగుతున్నామని ఇరువురు నేతలు తమ అనుబంధాన్ని తెలిపారు.   పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరే విషయమై చాలా రోజుల నుంచి సస్పెన్షన్ నెలకొంది.  అదే సమయంలో ఇద్దరూ కలిసి పలువురు నేతలతో రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. వారం రోజుల క్రితం వీరికి బీఆర్‌ ఎస్ కే చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి జత కలిశారు. దీంతో ముగ్గురూ కలిసి టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవితో చర్చలు జరిపారు. ఈ 14న సంయుక్తంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గ్గురు నేతలు కాంగ్రె్‌సలోకి వెళ్లడమనేది అధికార బీఆర్‌ఎ్‌సకే కాకుండా బీజేపీకి కూడా నిరాశ కలిగిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఈ పరిణామం భవిష్యత్తులో తమకు బూస్ట్‌గా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్‌ గద్వాల జోగుళాంబ జిల్లాలో జరిపిన పర్యటనలో పాల్గొని ఆశ్చర్యపరిచారు. కేసీఆర్‌ వెంట పర్యటన ఆసాంతం ఉండడంతోపాటు గద్వాలలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. సభావేదికపై బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి కూర్చున్నారు. దీంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ త్రిముఖ వ్యూహం

కర్నాటక ఎన్నికలు బీజేపీకి కొత్త పాఠాలు నేర్పించాయి. పెళ్లికి, తద్దినానికి ఒకే మంత్రం పఠించే బీజేపీకి కర్నాటక ఫలతాలు చేదు జ్ణాపకాలను మిగిల్చాయి. దీంతో ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో వర్కౌట్ కావని అర్ధం చేసుకున్న బీజేపీ ఇప్పుడు కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ బీజేపీ రథ సారథి బండి సంజయ్ పార్టీ బండిని స్పీడుగా తోలుతున్నాడని అధిష్ఠానం భావిస్తూ వచ్చింది. తీరా ఇప్పుడు  చూస్తే అదంతా డొల్లేనని తేలిపోయింది.  అధిష్ఠానం పెట్టిన చీవాట్లతో బండి చప్పుడు చేయకుండా కూర్చున్నారు.  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ది కూడా పులేషం అని తేలిపోవడం, ఎంఐఎంతో సంబంధాలు క్రమంగా దెబ్బతినడంతో బీజేపీ ఈ సారి టీడీపీతో కలిసి వ్యూహరచనకు దిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అక్కడ నాయకులు ఎక్కువ కావడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారన్న తృప్తి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ తృప్తి కూడా లేకపోవడంతో అన్ని సమస్యలకూ పరిష్కారంగా తెలుగుదేశం పార్టీని బీజేపీ ఎంచుకుంది.  తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు చేసింది. బీజేపీకి దగ్గరగా మసలుతున్న జనసేన ఈ విషయంపై ఇంత వరకూ స్పందించ లేదు. ఆంధ్రకంటే ఆర్నెళ్లు ముందుగా జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని బీజేపీ, టీడీపీలు భావిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు పార్టీలూ ఈ అంశంపై ఇంత వరకూ ప్రకటన విడుదల చేయలేదు. మరో వూపు 460 లోక్ సభ స్థానాల గెలుపును టార్గోట్ చేస్తూ నితీష్ కుమార్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ, జాతీయ పార్టీలను ఏకం చేస్తున్నారు. ఆ కూటమిలో టీడీపీ, బీఆర్ఎస్ ఉంటాయా లేదా అనేది ఇంకా తేలలేదు. మరో వైపు 2024 ఎన్నికలలో 460 సీట్లను గెలవాల్సిందేనంటూ మోడీ ఇచ్చిన ఆదేశాలపై బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఇప్పటికి ఉన్న సమాచారాన్ని బట్టి 250 స్థానాలలో బీజేపీ విజయం సాధించగలదని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది.  మిగిలిన 210 స్థానాల సాధించి మోడీ కళ్లలో ఆనందం చూడడానికి అమిత్ షా, నడ్డాలు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో మంతనాలు జరుపుతున్నారు. తమిళనాడులో డీఎంకే మినహా అన్ని పార్టీలు, కర్నాటకలో జేడీఎస్, ఆంధ్రాలో వైసీపీ, టీడీపీ,  జనసేన పార్టీ, తెలంగాణలో     టీడీపీలతో సన్నిహితంగా  ఉండాలని బీజేపీ భావిస్తోంది.  కేరళలో సింగిల్ డిజిట్ స్థానాలు వస్తాయని బీజేపీ నమ్మకంతో ఉంది.  దక్షిణాదిలో కర్నాటక నుంచి పాతిక మంది, తెలంగాణ నుండి నలుగురు సభ్యులు లోక్ సభకు ఎన్నిక కాగా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి చంద్రబాబునాయుడు ఆపద్బాంధవుడిగా కనిపించారు. అమిత్, షా నడ్డాలు కూడబలుక్కొని టీడీపీ అధినేతను ఢిల్లీకి పిలిపించుకుని వ్యూహరచనకు శ్రీకారం చుట్టారు. దక్షిణాదిలో బీజేపీ పట్ల ఉన్న ఆదరణ సరిగ్గా అంచనా వేయగలిగిన చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వ్యూహాన్ని పదునుపెట్టే పనిలో ఉన్నారని పరిశీలకులు భావిస్తున్నారు. 

వివేకా హత్య వెనుక అంత:పుర రహస్యం?

అయ్యిందేదో అయిపోయింది. ఎలాగో అలా కడపను దక్కించుకుని ఆబోరు కాపాడుకుంటే చాలు అన్నట్లుగా తయారైంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. సొంతబాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో పార్టీ పరువే కాకుండా వ్యక్తిగతంగా తన పరువూ మసకబారిన పరిస్థితుల్లో.. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా కపడ లోక్ సభ స్థానాన్ని గెలుచుకోలేకపోతే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నారు. వివేకా హత్య వెనుక అంత:పుర రహస్యం ఉందనీ, ఆధిపత్య పోరు ఉందనీ, అందుకే అవినాష్ ను కాపాడేందుకు జగన్ ప్రయత్ని స్తున్నారనీ జనం నమ్ముతుండటంతో.. అలాంటిదేమీ లేదని చాటేందుకైనా  కడప లోక్ సభ స్థానంలో అవినాష్ రెడ్డి బదులు మరో అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఒక వేళ అవినాష్ రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చినా అక్కడ గెలిచే పరిస్థితి లేదనీ, స్థానికంగా అవినాష్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని సొంత సర్వేలే తేల్చేయడంతో ఇక అవినాష్ ను వదిలించేసుకోవడమే మేలన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారంటున్నారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టు కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని పూర్తిగా వినియోగించడమే కాకుండా శక్తికి మించి ప్రయత్నించిన జగన్ ఇంకా అదే పద్ధతి కొనసాగిస్తే అవినాష్ పై వ్యక్తమౌతున్న వ్యతిరేకత తనపై ప్రతిఫలించచే అవకాశాలున్నాయని గ్రహించారు. దీంతో వచ్చే ఎన్నికలలో కడప నుంచి ఎవరిని నిలబెడితే విజయం తథ్యం అన్న అన్వేషణ ప్రారంభించారు. అయితే కడప నుంచి వైఎస్ కుటుంబం బయట నుంచి ఎవరు నిలబడినా విజయం సాధించే అవకాశం లేదని అక్కడి పార్టీ శ్రేణులే చెబుతుండటంతో జగన్ తన తల్లినే అక్కడ వైసీపీ అభ్యర్థిగా నిలబెడితే బెటర్ అన్న భావన కు వచ్చారు.  అయితే ఇందుకు విజయమ్మ అంగీకరిస్తారా అన్న విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచీ   గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తల్లిని జగన్  సాగనంపి ఆమెకు పార్టీతో ఉన్న సంబంధాన్ని తెంపేశారు. ఆ తరువాత నుంచీ ఆమె తన కుమార్తె షర్మిలతో పాటే ఆమె పార్టీ వైఎస్సార్టీపీ గౌరవాధ్యక్షురాలిగా పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు. అంతే కాదు     జగన్మాత ఇప్పుడు కుమారుడిని ఇంటికి కూడా వెళ్లేందుకు సుముఖంగా లేరు. అందుకే ఇటీవల అమరావతి వచ్చినప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ గడపలో అడుగు పెట్టలేదు. తన స్థాయికి ఏ మాత్రం తగకపోయినా సజ్జల నివాసానికి వెళ్లారు. దీంతో జగన్ కోరినంత మాత్రాన ఆమె కడప లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి అంగీకరిస్తారా అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.  ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో అవినాష్ రెడ్డికి మాత్రం కడప నుంచి పోటీ చేసే అవకాశం జగన్ ఇవ్వరన్నది మాత్రం కచ్చితమేనని అన్నారు. వివేకా హత్య కేసులో ఔట్ కమ్ ఏమిటన్నది పక్కన పెడితే.. వైసీపీకి అవినాష్ రెడ్డికి ఉన్న సంబంధం దాదాపుగా తెగిపోయినట్లేనని చెబుతున్నారు.   వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయాన్ని కడప వాసులు గట్టిగా నమ్ముతుండటమే ఇందుకు కారణమని  వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.   దీంతో జగన్ కు అవినాష్ ను కడప నుంచి దూరం పెట్టడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే అవినాష్ ను కాకుండా మరెవరిని నిలబెట్టాలన్న విషయానికి వస్తే.. అక్కడా జగన్ కు తాను దూరం పెట్టిన తల్లిని మళ్లీ తీసుకువచ్చి నిలబెడితే తప్ప ఆ సీటును కాపాడుకోలేని పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే జగన్ వెళ్లి తల్లిని కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడమని అర్ధిస్థారా? అలా అర్ధించినా, గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి ‘సగౌరవంగా’ సాగనంపిన కొడుకు అభ్యర్థనను ఆమె ఔదాలుస్తారా అన్నవి ప్రశ్నలే? మొత్తం మీద అక్కడ నిలబడేది ఎవరన్నది పక్కన పెడితే ఆ సీటు అవినాష్ చేయి జారిందని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు.  

తెలుగుదేశం గూటికి కమేడియన్ సప్తగిరి

సినిమాలలో పాపులారిటీ సంపాదించుకుంటే అది రాజకీయ ఎంట్రీకి ఒక షార్ట్ కట్ 2019 ఎన్నికలకు ముందు వరకూ కూడా రాజకీయాలలోకి ప్రవేశించాలన్న ఉత్సాహం ఉత్సుకత చూపిన నటులు చాలా మందే ఉన్నారు. అలా 2019 ఎన్నికల ముందు రాజకీయాలలోకి వచ్చిన వారిలో ప్రముఖంగా ఇద్దరు కమేడియన్లను చెప్పుకోవాలి. వారిలో ఒకరు అలీ అయితే మరొకరు ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్. పోసాని కూడా ఉన్నారనుకోండి.. కానీ ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలోనే రాజకీయాలలోకి వచ్చారు. సో ఇక్కడ చెప్పుకుంటున్న 2019 ఎన్నికలలో రాజకీయ ప్రవేశాల జాబితాలోకి ఆయన రారు. ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. ఆయన రాజకీయ ప్రవేశం ఉత్సాహంతో నేల విడిచి సాము చేశారు. వైసీపీ తరఫున ప్రచారంలో నేల విడిచి సాము చేశారు. తన రాజకీయ ప్రవేశానికి బాట పరిచిన సినీ పరిశ్రమపైనే విమర్శలు గుప్పించారు. పరిశ్రమలో అగ్రనటులుగా వెలుగొందుతున్న వారిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను కించపరిచే విధంగా తీవ్ర విమర్శలు చేశారు. సరే ఆయన ఏం చేసినా చివరకు ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. జగన్ కూడా పృధ్వీ శ్రమను గుర్తించారు. ఎస్వీబీసీ పదవి ఇచ్చి సముచిత స్థానమే కల్పించారు. కానీ ఓ వివాదంలో చిక్కుకున్న పృధ్వీని ఆ తరువాత పార్టీ పట్టించుకోలేదు. కూరలో కరివేపాకులా తీసి పారేసింది. ఇచ్చిన పదవినీ ఊడబీకేసింది. ఆ తరువాత పృధ్వి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా అయ్యింది. ఎన్నికల ప్రచార  సమయంలో ఆయన సినీ ఇండస్ట్రీపై గుప్పించిన విమర్శల కారణంగా సినిమా అవకాశాలూ కోల్పోయారు. రాజకీయంగా ఎవరికీ పట్టని వ్యక్తిగా మిగిలిపోయారు. ఇప్పుడిప్పుడే తేరుకుని మెల్లిమెల్లిగా సినిమాల్లోనూ, టీవీషోల్లోనూ కనబడుతున్నారు. రాజకీయంగా కూడా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేనకు అనుకూలంగా గళమెత్తుతున్నారు. ఆ పార్టీలోకి ఆయన ప్రవేశానికి జనసేనాని తలుపులు తెరుస్తారా లేదా అన్నది అనుమానమే. ఇక అలీ విషయానికి వస్తే ఆయన రాజకీయ అడుగులు వేయడానికి ముందు అన్ని పార్టీలనూ చుట్టేశారు. ఎక్కడ తనకు గుర్తింపు, సముచిత స్థానం లభిస్తుందా అని గాలించారు. చివరకు ఆయనకు వైసీపీలో అయితే తనకు మంచి భవిష్యత్ ఉంటుందని నిర్ణయించుకుని ఆ పార్టీ గూటికి చేరారు. ఇందు కోసం ఆయన అంగీకరించినా అంగీకరించకపోయినా, ఇండస్ట్రీలో ఆయనకు అత్యంత ఆత్మీయుడిగా భావించే పవన్ కల్యాణ్ ను దూరం చేసుకున్నారు. అలీ వైకాపా గూటికి చేరిన తరువాత ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ ఇండస్ట్రీలో మననుంచి సహాయ సహకారాలు పొందిన వారు కూడా హ్యాండిచ్చారు అని పరోక్షంగా అలీపై వ్యాఖ్యలు చేశారు. సరే అదలా ఉంచితే.. వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి చట్టసభలో అడుగుపెట్టాలన్న అలీ కల నెరవేరలేదు. పోనీ వక్ఫ్ బోర్డు చైర్మన్, రాజ్యసభ అంటే వేరే ఆశలు పెంచుకున్నా అవీ నెరవేరలేదు. మూడేళ్ల ఎదురు చూపుల తర్వాత వందల సంఖ్యలో ఉన్న సలహాదారుల పోస్టులలో ఒక అనామక పోస్టును అలీకి ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు జగన్. సరే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. చిరంజీవి వంటి మెగాస్టార్ నుంచి అందరూ తన వద్దకు రావాల్సిందే.. తాను చెప్పింది వినాల్సిందే అన్నట్లుగా వ్యవహరించారు. ధియేటర్ల టికెట్ల ధరలు తగ్గించేసి మొత్తం పరిశ్రమ అంతా నువ్వే దిక్కు అని ఆయన వద్దకు వాలిపోయేలా చేసుకున్నారు. దీంతో సినీ పరిశ్రమ నుంచి ఎవరూ కూడా రాజకీయ ప్రవేశం చేయడానికి ముందుకు రావడానికి వెనుకాడే పరిస్థతి ఏర్పడింది. అందుకే గతంలో పోలిస్తే రాజకీయ ప్రవేశం చేయాలని ఉత్సాహం చూపు నటుల సంఖ్య గనణీయంగా తగ్గింది. పరిశ్రమ నుంచే వచ్చి రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలోకి వచ్చి చేరేందుకు కూడా నటులు జంకే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ఒక యువ నటుడు, కమేడియన్, హీరో..తన విలక్షణ నటనతో తక్కువ కాలంలోనే మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి అలియాస్ సప్తగిరి ప్రసాద్ తన రాజకీయ అరంగేట్రంను ప్రకటించారు. అభివృద్ధి, దార్శనికతకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రకటించి త్వరలో ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు చెందిన సప్తగిరి పార్టీ ఆదేశిస్తే జిల్లాలో ఎక్కడ నుంచైనా ఎన్నికల బరిలోకి దిగుతానంటున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆయనతో కలిసి అడుగులేశాననీ, ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాననీ చెప్పిన సప్తగిరి సినిమాలలో ఎలాగైతే నిజాయతీగా, చిత్తశుద్ధితో కష్టపడ్డానో తెలుగుదేశం పార్టీలో కూడా అలాగే చిత్తశుద్ధి, నిజాయితీతో పని చేసి ప్రజాసేవలో నిమగ్నమౌతానని చెబుతున్నారు. మహామహులుగా పేరొందిన సీనియర్ దిగ్గజాలు కూడా రాజకీయాల వైపు చూడడానికి కూడా భయపడుతున్న ఈ సమయంలో ధైర్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలో చేరతానంటూ ముందుకు వచ్చిన సప్తగిరి ఏ మేరకు రాణిస్తారో చూడాలి. 

పరారీలో జబర్దస్త్ కమేడియన్

జబర్దస్త్ టీవీ షోలో లేడీ గెటప్స్ వేసి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న హరి.. మళ్ళీ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో అక్రమంగా తరలిసున్న రూ.60 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక హరి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు అతనికి పలువురు స్మగ్లర్లతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం హరి పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గతంలోనూ పలుసార్లు ఎర్రచందనం స్మగ్లింగ్ లో హరి పేరు వినిపించింది. అతనిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కేసులు నమోదైనా, అరెస్ట్ అయినా అతని తీరులో మార్పు రావడంలేదు అంటున్నారు. జబర్దస్త్ ద్వారా వచ్చిన అంతో ఇంతో పేరు తో సినిమాల్లోనూ ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ పదే పదే ఎర్రచందనం స్మగ్లింగ్ లో అతని పేరు వినిపిస్తుండటంతో.. ఇక నటుడిగా అతని కెరీర్ కి ఫుల్ స్టాప్ పడినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వారాహియాత్ర కు ముందు పవన్ ముందస్తు మాట!

ఏపీలో ముందస్తు ముచ్చటకు తెరపడటం లేదు. నిర్ణీత గడుపు మేరకే ఎన్నికలకు వెడతాం అని వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ విస్పష్టంగా తేల్చేసినా ఇటు జనాలు కానీ, అటు రాజకీయ నాయకులు కానీ ఆయన మాటలను విశ్వసించడం లేదు. ఆయన ఏం చెప్పినా చేసేది మాత్రం చెప్పిన దానికి సరిగ్గా విరుద్ధంగా ఉంటుందంటూ సోదాహరణంగా వివరిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తథ్యమని అన్నారు. ఆయన తన వారాహి యాత్ర ప్రారంభించడానికి రోజుల ముందు చేసిన ఈ ప్రకటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చకూ తావిచ్చింది. ముందస్తు ఆలోచనే లేదనీ, ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలు గడువు ఉందనీ, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయనీ, ఇటీవలి కేబినెట్ సమావేశంలో జగన్ కుండబద్దలు కొట్టిన చందంగా విస్పష్టంగా చెప్పారు. అయితే ఆయన మాటలను విపక్షాలు, జనమే కాదు, సొంత పార్టీ నేతలు కూడా పెద్దగా నమ్మడం లేదనడానికి వైసీపీలో కూడా సాగుతున్న ముందస్తు చర్చే నిదర్శనం.  తాజాగా ఏపీ లో ముందస్తు ఎన్నికలు ఉంటాయంటూ జనసేనాని పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చే శారు. జగన్ చెప్పినట్లు తొమ్మిది నెలలు కాదనీ, ఆరు నెలల్లోనే అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.  మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమిపూజ  సోమవారం (జూన్ 12) భూమి పూజ చేసిన పవన్ కల్యాణ్  ఏపీ, తెలంగాణలలో ఒకే సమయంలో ఎన్నికలు జరుగుతాయనీ, రెండు రాష్ట్రాలలోనూ జనసేన పోటీ చేస్తుందనీ స్పష్టత ఇచ్చారు.  ఇక రెండు రాష్ట్రాలలోనూ కూడా జనసేన పొత్తులతోనే ఎన్నికల బరిలో దిగుతుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఏపీలో అయితే తెలుగుదేశంతో  జనసేన కలిసి నడుస్తుందన్న క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలో కూడా తెలుగుదేశం, జనసేన మధ్య పోటీ ఉంటుందన్న సంకేతాలను పవన్ కల్యాణ్ తన తాజా ప్రకటన ద్వారా ఇచ్చేశారు. సీట్ల ఒప్పందం సహా అన్ని విషయాలూ చర్చించుకునే పొత్తుల విషయంలో ముందుకు వెళతామన్న పవన్ కల్యాణ్  ఈ విషయంలో తాను వినా పార్టీలో ఎవరూ మాట్లాడవద్దని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇక ముందస్తు ముచ్చట విషయానికి వస్తే జగన్ ఏ ముహూర్తంలో హస్తిన నుంచి అత్యవసర మంత్రివర్గ భేటీకి నిర్ణయం తీసుకున్నారో ఆ క్షణం నుంచే రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు జరుగుతాయని రాజకీయ సర్కిల్స్ లో మొదలైన చర్చ జగన్ స్వయంగా ముందస్తు ఉండదని స్పష్టం చేసినా ఆగడం లేదు.  తెలుగుదేశం నేతలైతే రాష్ట్రానికి పట్టిన శని ముందస్తుగా వదిలిపోవాలంటే ముందస్తు ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాయి. పరిశీలకులైతే.. కేంద్రంలోని బీజేపీ అండదండలు అందించకుంటే ఆగస్టు తరువాత ఒక్క రోజు కూడా జగన్ ప్రభుత్వాన్ని నడపలేరనీ, ఆర్థిక పరిస్థితే అందుకు కారణమని అంటున్నారు. తాజాగా కాళహస్తిలో నడ్డా, విశాఖలో అమిత్ షా మాటలను బట్టి చూస్తే.. కేంద్రం నుంచి ఇక జగన్ సర్కార్ కు తోడ్పాటు అందే అవకాశాలు అంతంతమాత్రమేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు ముందస్తు వినా మరో మార్గం లేదని అంటున్నారు.వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించేసింది. ఆగస్టులో తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల అధికారులను పరిశీలనకు పంపనుంది. దీంతో ఇప్పటికిప్పుడు జగన్ నిర్ణయం తీసుకుని అసెంబ్లీ రద్దుకు ప్రతిపాదనలు పంపినా తెలంగాణ అసెంబ్లీతో ఏపీ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. అయినా జగన్ మాటలపై విశ్వసనీయత లేకపోవడం వల్లనే ఏపీలో ముందస్తుపై చర్చ ఎడతెగకుండా జరుగుతూనే ఉంది. 

అమిత్ షా నోట ఎన్డీయే మాట

ఆంధ్రప్రదేశలో ప్రధానంగా మూడు పార్టీలే క్రియాశీలంగా ఉన్నాయని చెప్పవచ్చు. పేరుకు జాతీయ పార్టీలే అయినా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి అంతంత మాత్రమే. మీడియా సమావేశాలలోనూ, ఆ పార్టీ జాతీయ నేతలు వచ్చినప్పుడు జరిగే సభల్లోనూ తప్ప ఆ పార్టీ వాయిస్ పెద్దగా వినిపించదు. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక బీజేపీ ఉనికి ఒకింత ఎక్కువగా కనిపిస్తుంటుంది అంతే. కానీ ఎన్నికలు, ఓట్లు విషయానికి వచ్చే సరికి రాష్ట్రంలో ప్రధాన పోటీ  తెలుగుదేశం, వైసీపీల మధ్యే. ఇక జనసేన అయితే తెలుగుదేశంతో కలిసి ఎన్నికలలో పోటీ చేయడం అన్నది దాదాపుగా ఖరారైంది. అంతే కాకుండా ఆ పార్టీ ప్రస్తుతానికి బీజేపీతో మిత్రపక్షంగా కూడా కొనసాగుతోంది. ఎలా చూసినా ఏపీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షం అయితే అధికారికంగా లేదనే చెప్పాలి. అటువంటి వేళ విశాఖలో జరిగిన సభలో అమిత్ షా ఏపీలో ఎన్డీయే ప్రస్తావన తెచ్చారు. రాష్ట్రం నుంచి ఎన్డీయేకే కనీసం 20 స్థానాలు దక్కాలని ఆయన సభాముఖంగా అన్నారు. ఆయన మాటలు యథాలాపంగా అన్నవి అయితే కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా బరిలోకి దిగేటట్లు ఉంటే బీజేపీకి 20 స్థానాలు రావాలని పిలుపునచ్చి ఉండేవారు. అందుకు భిన్నంగా ఎన్డీయేకు అన్నిస్థానాలు కావాలని పిలుపునివ్వడం రాజకీయ చర్చకు తెరలేపింది. ఆయన తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలిసి సాగుతుందన్న సంకేతాలిచ్చారా? లేదా జనసేన, బీజేపీ కూటమిగా వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటాయన్న ఉద్దేశంతో అన్నారా అన్నదానిపై రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే అమిత్ షా ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ ఒంటరిగా మాత్రం పోటీ చేయడం లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. అదే సభలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఆయన కూడా ఏపీలో మిత్రపక్షంగా ఉన్నజనసేన చెప్పిన ప్రభుత్వ ఓటు చీలనివ్వకూడదన్న స్టాండ్ తీసుకున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యమౌతున్నాయన్నది మాత్రం అమిత్ షా మాటల ద్వారా తేటతెల్లమైపోయింది. ఈ నేపథ్యంలోనే జనసేనాని గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాను బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడతాను అన్న మాటను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  

బీజేపీ.. వైసీపీ లవ్ బ్రేకప్!?

నాలుగేళ్లకు పైగా అవిచ్ఛన్నంగా సాగుతున్న బీజేపీ, వైసీపీ లవ్ బ్రేకప్ అయ్యిందా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  వైసీపీ, బీజేపీ బంధం తెగిపోయిందా అంటే ఔనని కానీ, కాదని కానీ చెప్పే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇరు పార్టీల బంధం పరస్పర ప్రయోజనాలతో కూడుకుని ఉన్నదని, ఆ ప్రయోజనాలు సిద్ధించవని నిస్సందేహంగా తేలిపోతే తప్ప ఆ బంధం తెగిపోయే అవకాశాలు లేవనీ చెబుతున్నారు. అసలు బీజేపీ, వైసీపీల మధ్య లవ్..లవ్ జిహాద్ వంటిదేనని పరిశీలకులు అంటున్నారు. తనపై కేసుల నుంచి రక్షణ కోసం జగన్.. రాజ్యసభలో వైసీపీ మద్దతు కోసం బీజేపీ ఒకరికొకరు అండగా ఉంటున్నారే తప్ప అందులో ప్రజలకు సంబంధించిన అంశమేదీ లేదని పరిశీలకులు పలు సందర్భాలలో విశ్లేషించారు. ఈ పరస్పరాధార బంధం వెనుక అనేక విచిత్రాలు ఉన్నాయి. జగన్ పార్టీ వైసీపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షం కాదు. అలాగే ఏపీలో ఆ రెండూ మిత్ర పక్షాలు కావు. వైసీపీని గట్టిగా వ్యతిరేకించే జనసేన ఏపీలో బీజేపీకి మిత్ర పక్షం. అయినా సరే మిత్రపక్షానికి మించిన ప్రాముఖ్యతను  కేంద్రంలోని బీజేపీ సర్కార్ జగన్ ప్రభుత్వానికి ఇస్తుంది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అప్పులు తీసుకునే అవకాశం లేకుండా చేసిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీలోని జగన్ సర్కార్ కు మాత్రం కావాలని కోరిన ప్రతి సందర్భంలోనూ అప్పులకు అనుమతి ఇచ్చేస్తొంది. అభివృద్ధి అనే మాటే లేకుండా అప్పులు చేసి మరీ బటన్ లు నొక్కి ఎన్నికల ప్రయోజనాల కోసం సోమ్ములు పందేరం చేస్తున్న జగన్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణా  రాహిత్యాన్ని ఖండించని కేంద్ర సర్కార్.. బహిరంగ వేదికలపై మాత్రం ఉచిత హామీలు అనుచితం అని ప్రసంగాలు దంచుతూ ఉంటుంది.   మొత్తంగా జగన్ అక్రమాస్తుల కేసులో చాలా గట్టిగా వినిపించిన క్విడ్ ప్రోకో..యే వైసీపీ, బీజేపీ బంధానికి కూడా కారణమన్నది పరిశీలకుల విశ్లేషణ.   ఇప్పటి వరకూ రెండు పార్టీల మధ్యా ఎప్పుడైనా విమర్శలు చోటు చేసుకున్నా అవన్నీ కూడా ప్రేమికుల మధ్య వచ్చే చిలిపితగవుల వంటివేనని అంటున్నారు.  అయితే అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో  తాజాగా అమిత్ షా, నడ్డాల ఏపీ పర్యటన బ్రేకప్ చేప్పేసిందా అన్న స్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. షా నడ్డాలు గతంలో  అంటే ఈ నాలుగేళ్ల పైచిలుకు కాలంలో ఎన్నడూ లేని విధంగా  జగన్ సర్కార్ అక్రమాలు, అన్యాయాలు, కుంభకోణాలే లక్ష్యంగా ఏపీ గడ్డపై నుంచే తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై విమర్శలేంటి అంటూ మొహమాటంతో  ప్రసంగ అనువాదాన్ని ఒకంత తీవ్రత తగ్గించి చేసిన జీవీఎల్ ను అయితే అమిత్ షా వేదికమీదే తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ, బీజేపీ లవ్ కు బ్రేకప్ పడిపోయిందా అన్న అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ఇటీవల అమిత్ షా, నడ్డాలతో హస్తినలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు భేటీని ఒక కారణంగా చూపుతున్నారు. నిజమే చంద్రబాబు తనంత తానుగా హస్తిన వెళ్లి నడ్డా షాలతో భేటీ కాలేదు. అమిత్ షా నివాసంలో చంద్రబాబుతో నడ్డా షాలు భేటీ అయ్యారు. ఆ భేటీలో చర్చలు ఏమిటి? నిర్ణయాలు ఏమిటి? అన్నది పక్కన పెడితే.. బీజేపీ, వైసీపీల బంధం బ్రేక్ కావడానికి అదీ ఒక కారణమేనని అంటున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఆ రెండు పార్టీల బ్రేకప్ విషయంలో అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదంటున్నారు. 

.హవ్వా..ఇంత అవమానమా..?   ఏపీలో ఆ మంత్రి చాంబర్ కు తాళం..!

 ఏపీలో ఓ మంత్రి కి ఘోర పరాభవం ఎదురైంది. జీతాలు చెల్లించడం లేదంటూ ఏకంగా మంత్రి ఛాంబర్ కు సిబ్బంది తాళాలు వేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చకు కారణమైంది. విషయం తెలిసి అధికార వైసీపీలోని కీలక నేతలు కూడా షాక్ కు గురయ్యారు. బిల్లులు చెల్లించలేదంటూ గ్రామాల్లోని సచివాలయాలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి, సిబ్బంది తమ నిరసన తెలపడం అప్పుడప్పుడు జరిగే విషయం. కానీ,  జీతాలు చెల్లించ లేదంటూ ఏకంగా ఒక మంత్రి కార్యాలయానికి అక్కడ పనిచేసే సిబ్బంది తాళాలు వేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని సెక్రటేరియట్ లో చోటు చేసుకోగా, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పిఆర్ శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఈ పరాభవం ఎదురయింది. ఏపీ సెక్రటేరియట్ లోని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీకి సిబ్బంది తాళం వేసి మూసి వేశారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఈ పని చేయడం గమనార్హం. ఈ శాఖ పరిధిలో పని చేస్తున్న సిబ్బందికి ఎనిమిది నెలలుగా జీతాలు లేవంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఈ పని చేశారు. డిసెంబర్ నెల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. ఇప్పుడు ఏకంగా మంత్రి పేషీకి తాళం కూడా వేసి తమ నిరసనను తెలియజేశారు. సాధారణంగా మంత్రి పేషీ రోజూ తెరిచేవారు. అధికారులు సిబ్బంది వచ్చి తమ విధులను నిర్వర్తించేవారు. అయితే, ఎనిమిది నెలలుగా జీతాలు కూడా చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. మంత్రి చాంబర్ కు తాళం వేశారు. జీతాలు విషయం గురించి అధికార యంత్రాంగానికి, మంత్రికి ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం స్పందించకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన మనస్థాపానికి గురై ఈ పని చేసినట్లు తెలుస్తోంది. తొమ్మిది నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో తాము ఎలా బతకాలో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా తమ ఆవేదనను అర్థం చేసుకోవాలంటూ ఉద్యోగులు బావురుమంటున్నారు.జీతాలు చెల్లించక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తాము మరో దారి లేక విధులకు హాజరు కావడం మానేశారు సదరు ఉద్యోగులు. డ్యూటీకి రాని సంగతి తెలిసినా అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. మంత్రి చాంబర్ కు తాళం వేసి వెళ్లిపోయారు. మంత్రి పేషీకి వేసిన తాళం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో పని చేయడానికి వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విధులు నిర్వహించే పరిస్థితి ఉద్యోగులకు ఏర్పడింది. ఏకంగా సెక్రటేరియట్ లోని మంత్రి పేషీ మూతపడడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పరిపాలనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. ఈ వ్యవహారంపై మంత్రితోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉండబోతుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..జీవీఎల్ బోల్తాపడ్డాడు!

ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందన్నది సామెత.  బీజేపీ ఎంపీ జీవీఎల్ పరిస్థితి సరిగ్గా ఆ సామెతకు తగినట్టు సరిపోతుంది. ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా ఎందుకు మారిపోతోందో.. బీజేపీ నాయకత్వానికి జేవీఎల్ కారణంగానే  స్పష్టంగా అర్థమైపోయింది.  ఏపీలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు గురించి బీజేపీ అధిష్ఠానానికి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. కానీ తెలుగుదేశం ఎన్డీయే భాగస్వామిగా ఉన్న సమయం నుంచీ.. రాష్ట్ర పరిస్థితుల గురించి తనదైన శైలిలో రిపోర్టులు ఇస్తూ హైకమాండ్ కు దగ్గరైన జీవీఎల్. ఆ ఫిర్యాదులన్నిటినీ పూర్వ పక్షం చేసేలా పార్టీ హైకమాండ్ వద్ద తన పలుకుబడిని ఉపయోగించారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం, వైసీపీ విజయంతో జీవీఎల్ సమాచారంపై అధిష్టానం నమ్మకం పెంచుకుంది. అందుకే పలుకుబడి ఉన్న కన్నాను తప్పించి మరీ సోము వీర్రాజుకు జీవీఎల్ సిఫారసుపై పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ తరువాత పరిస్థితి గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఏపీలో ఏకంగా అధికార పార్టీ నేతలు బీజేపీ సీనియర్ నేతలపైనే దాడులకు పాల్పడటం వంటి సంఘటనలతో అధిష్ఠానం బీజేపీపై దృష్టి సారించింది. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడవాడలా చార్జ్ షీట్లు వేయాలంటూ సాక్షాత్తూ మోడీ ఇచ్చిన ఆదేశాలే అమలుకు నోచుకోకపోవడంతో  బీజేపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. స్వయంగా రంగంలోకి దిగడంతో అనివార్యంగా చార్జ్ షీట్ల కార్యక్రమం చేపట్టింది. కానీ అది తూతూ మంత్రంగానే సాగుతోంది.  సరిగ్గా ఈ సమయంలోనే మోడీ 9 ఏళ్ల పాలన విజయాలను ప్రజలలో ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా తొలుత పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఆ తరువాత ఒక రోజు వ్యవధిలోనే అమిత్ షా ఏపీలో పర్యటించారు. నడ్డా శ్రీకాళహస్తిలో, అమిత్ షా విశాఖలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. మోడీ ప్రభుత్వ విజయాల ప్రచారం కంటే తమతమ ప్రసంగాల్లో రాష్ట్రంలోని జగన్ సర్కార్ వైఫల్యాలు, అక్రమాలు, అవినీతిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి విమర్శలు గుప్పించారు. నడ్డా ప్రసంగంపై వైసీపీ నేతలు బూతులతో విరుచుకుపడ్డారు. అది పక్కన పెడితే విశాఖలో అమిత్ షా ప్రసంగాన్ని అనువదించిన జీవీఎల్ కు   అ సభావేదికపైనే ఘోర పరాభవం జరిగింది. తన ప్రసంగ అనువాదంలో జీవీఎల్ సొంత పైత్యం జోడిస్తున్నారని అర్థమైన అమిత్ షా వేదికపైనే నేనేం మాట్లాడుతున్నా మీరేం చెప్తున్నారంటూ నిలదీశారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న జేవీఎల్ అవమానంతో తలదించుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే అమిత్ షా జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల వాడిని తగ్గించి.. అమిత్ షా ప్రసంగ సారాన్ని నిర్వీర్యం చేసేలా జీవీఎల్ అనువాదం ఉంది. ఆ విషయాన్ని అమిత్ షా గుర్తించి వార్నింగ్ ఇచ్చారు. దీంతో జీవీఎల్గత్యంతరం లేక అమిత్ షా ప్రసంగ పాఠాన్ని ఉన్నదున్నట్లుగా అనువాదం చేసి చెప్పాల్సి వచ్చింది. అయితే అప్పటికే జగన్ పై అమిత్ షా చేసిన ఎన్నో విమర్శలను జీవీఎల్ సభలో చెప్పలేదు. వాటిని  స్కిప్ చేశారు. షా నిలదీసిన తరువాతే.. ఒక ప్యాడ్ తీసుకుని ఆయన మాటలు రాసుకుని అనువాదం చేశారు. ఇప్పుడు బీజేపీ అధిష్ఠానం వద్ద కానీ, పార్టీ రాష్ట్ర శాఖలో కానీ జీవీఎల్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. విశాఖ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న జీవీఎల్ కు ఇప్పుడు లోక్ సభ స్థానం కాదు కదా.. కనీసం త్వరలో ముగియనున్న ఆయన రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరించే అవకాశం కూడా లేదని పార్టీలోనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పార్టీ అధికార ప్రతినిథి హోదా కోల్పోయిన జేవీఎల్ కు ముందు ముందు బీజేపీలో మరిన్ని పరాభవాలు తప్పవని పార్టీ నేతలు చేబుతున్నారు.  

బీజేపీని లెక్క చేసేదేమిటంటున్న జగన్?

ఒక్క రెండు సభలు.. బీజేపీ- వైసీపీ బంధాన్ని తెంచేశాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలు, కుంభకోణాల మయమని తాజా పర్యటనలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు చేసిన విమర్శలు.. ఆ పార్టీతో వైసీపీకి ఉన్న నాలుగేళ్ల బంధాన్ని పుటుక్కున తెంచాశాయి. అయితే ఈ తెగదెంపులు వ్యూహాత్మకమా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కలిసి ఉంటే కలిసి మునిగిపోవడం కంటే.. వేరువేరుగా ఉంటే కనీసం ఒకరైనా మిగులుతామన్న ఉద్దేశంతోనూ అమిత్ షా నడ్డాలు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారని విశ్లేషిస్తున్నారు. నడ్డాపై వైసీపీ మంత్రులు బూతులతో విరుచుకుపడటం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు కానీ, ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బీజేపీ లేక్కేమిటన్నట్లు మాట్లడడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ నేతలూ, మంత్రులు, సలహాదారుల చేత మాట్లాడించి తాను మౌనం పాటించే జగన్  సోమవారం (జూన్ 12) పిల్లలకు స్కూలు బ్యాగులూ, పుస్తకాలు పంచేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో ఒక్క సారిగా బీజేపీపై తన వాగ్ధాటిని మరీ అంత పదునుగా కాకున్నా ప్రదర్శించారు. రాష్ట్రంలో తమకు బీజేపీ అండ అవసరం లేదన్నారు. ఆ పార్టీ సహకారం లేకున్నా గెలుస్తామంటూ ధీమాను ప్రదర్శించారు. జగన్ నోటీ వెంట బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట రావడం దాదాపుగా ఇదే తొలిసారి. రాష్ట్రం ఏ గంగలో మునిగినా ఫరవాలేదు.. కేంద్రం అండతో కేసుల నుంచి గట్టెక్కితే చాలన్నట్లుగా అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లూ వ్యవహరించిన జగన్ చివరికి ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన ఈ సమయంలో బీజేపీ లేక్కేమిటి అన్నట్లు మాట్లాడటం మామూలు విషయం కాదంటున్నారు.  అయితే బీజేపీ అంటే లెక్క చేయడం, చేయకపోవడం జగన్ ఇష్టం. కానీ ఆ విషయాన్ని చెప్పడానికి ఆయన ఎంచుకున్న వేదికే అభ్యంతరకరం. పిల్లలకు పుస్తకాలు, బ్యాగులూ పంచే ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటమేమిటన్న విమర్శలు సహజంగానే వెల్లువెత్తుతున్నాయి. అయితే అటువంటి విమర్శలను సీఎం పెద్దగా పట్టించుకోరన్నది ఇప్పటికే పలు సార్లు రుజువైంది. ప్రభుత్వ కార్యక్రమంలో తప్ప  జగన్ మాట్లాడేందుకు మరో వేదికే లేని పరిస్థితి గత ఏడాదిన్నర కాలంగా ఏపీలో నెలకొని ఉంది. జగన్ తన రాజకీయ విమర్శలకు ప్రభుత్వ కార్యక్రమాలనే వేదిక చేసుకుంటున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పించేందుకు అదే సరైన వేదికగా ఆయన ఫిక్సైపోయారు. పార్టీ పరంగా సభలూ, సమావేశాలూ నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఫిక్సైపోయారు. ప్రభుత్వ కార్యక్రమాలకు బెదిరించో, బామాలో, ప్రలోభపెట్టో తీసుకు వచ్చిన జనాలే ఆయన ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లి పోతున్న పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే గడపగడపకూలో జరిగిన మర్యాదే తనకూ జరుగుతుందన్న విషయాన్ని ఆయన ఆకలింపు చేసుకోవడంతో తన వెర్షన్ చెప్పుకోవడానికి ఆయన బటన్ నొక్కుడు సభలనూ, ఇలా పందేరాల సభలనే వేదిక చేసుకుంటున్నారు. బీజేపీని తాను లెక్క చేయనని గంభీరంగా చెప్పిన జగన్ అదే సమయంలో తన ప్రభుత్వంపై బీజేపీ అగ్ర నేతలు చేసిన ఆరోపణలు, విమర్శల గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారి విమర్శలను కనీసం ఖండించే ధైర్యం కూడా చేయలేదు. షా, నడ్డాలు తన ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కారణం తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటూ చెప్పుకొచ్చారు.  చంద్రబాబుపై విమర్శలతో సరిపెట్టకుండా దూషణల పర్వానికీ దిగారు.  బీజేపీ అండగా లేకపోవచ్చు..మీడియా సహకారం అందక పోవచ్చు..దత్తపుత్రుడు అండ దండలు లేకపోవచ్చు…కానీ తన ధైర్యం ప్రజలేనని చెప్పుకున్నారు. మరి ఆ ప్రజల ముంగిటకు వెళ్లకుండా పరదాలెందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  అంతే కాదు చంద్రబాబు మినీ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట అని చెప్పుకొచ్చారు. తాను పేద ప్రజలకు డబ్బులు ఇస్తున్నానని… అది కూడదంటూ విపక్షాలు పోరాటం చేస్తున్నాయనీ ఆరోపించారు.   జగన్ ఇటీవలి ప్రసంగాలు విపక్షాల సంగతేమో కానీ సొంత పార్టీ వైసీపీ శ్రేణులనే తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ఇంకా ఎన్నికల సమరం మొదలు కాకముందే ఓటమి భయాన్ని ప్రదర్శిస్తున్న నాయకుడిని జనం ఎలా నమ్ముతారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ బీజేపీ అండ అవసరంలేదన్న మాటతో తన నెత్తిన తానే చేయిపెట్టుకున్నట్లైందని, మునక ఖాయమని అంగీకరించేసినట్లేనని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతోంది. 

బ్యూరోక్రాట్లకు రాజకీయాలు అందని ద్రాక్షపండేనా?

భారత రాజ్యాంగం పరిపాలనను రెండు రకాలుగా వర్గీకరించింది. అందులో ఒకటి ఎన్నికకాబడ్డ(ఎలక్టెడ్) రెండవది ఎంపిక (సెలెక్టెడ్). ప్రజల ఓటుతో ఎన్నికలలో విజయం సాధించిన రాజకీయ నాయకులు మొదటిరకం కాగా, అత్యున్నత చదువులు చదివి సివిల్ సర్వెంట్లుగా పని చేసే వారు రెండవ రకం పాలనా బాధ్యులు. రాజకీయాలలో ముగిని తేలే మన రాజకీయ నాయకులు ఎట్టిపరిస్థితుల్లోనూ సివిల్ సర్వెంట్ల అవతారం ఎత్తలేరు. కానీ కనీసం 30 సంవత్సరాలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన సివిల్ సర్వెంట్లు రాజకీయాల రుచి మరుగుతున్నారు. రాజకీయరంగంలో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. అయితే వారిలో అతి కొద్ది మంది మాత్రమే, అతి కొద్ది కాలం మాత్రమే రాజకీయాలలో మనగలుగుతున్నారు.   బ్యూరోక్రాట్ల రాజకీయ రంగ ప్రవేశానికి తెలుగురాష్ట్రాలలో ఆద్యుడు ఎవీఎస్ రెడ్డి. డిఫెన్స్ లో పని చేస్తూ, ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఏవీఎస్ రెడ్డి భారతదేశం అనే పార్టీని స్థాపించి రాజకీయాలలోకి అడుగుపెట్టారు.  సర్వీసులో ఉండగానే రాజకీయ పార్టీ  ప్రకటన అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉద్యోగానికి  రాజీనామా  చేసి పార్టీని  ప్రకటించిన ఏవీఎస్ రెడ్డి రాజకీయాలు తనకు సరికావని గ్రహించి కొంత కాలం ఉద్యోగానికి దూరంగా ఉన్నారు. తిరిగి ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సర్వీసు ముగించారు. ఆయన బాటలో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, వరప్రసాద్, లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి బ్యూరోక్రాట్లు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ తరఫున 2009 లో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీలో కాలు పెట్టగా, వరప్రసాద్ తిరుపతి పార్లమెంటు నియోజవర్గం నుండి, ప్రస్తుతం గూడూరు అసెంబ్లీ నుండి చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహించారు. గతంలో రావెల కిషోర్ బాబు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేయగా, ఆదిమూలం సురేష్ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ 2019లో విశాఖ నుండి ఓడిపోగా, తోట చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.  బ్యూరోక్రాట్ లుగా సమర్థవంతంగా పని చేసిన వారు రాజకీయాలలో ఎందుకు మనలేకపోతున్నారన్న అంశంపై చర్చ సాగుతోంది.  రాజకీయాలను దగ్గరగా చూసిన అనుభవంతో, ఈ వ్యవస్థను మార్చాలన్న ఆవేశం బ్యూరోక్రాట్ లను రాజకీయాలవైపు మరలిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.  తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ తదననంతరం ఫక్తు రాజకీయ పార్టీగా మారడమే రాజకీయమని విశ్లేషకుల వాదన. తీరా రాజకీయాలోకి వచ్చిన తరువాత ఇక్కడి పరిస్థితిని అర్ధం చేసుకుని నోరెళ్లబెడుతున్నారని, నిజాలు నిలకడగా తెలిశాక ఏమి చేయాలో పాలుపోని స్థితిలో బ్యూరోక్రాట్ లు ఉన్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.  రాజకీయాలలో మనుగడ సాగించాలంటే కావలసిన వనరులు సేకరించడంలో బ్యూరోక్రాట్లు విఫలం అవుతున్నారు. రాజకీయ నాయకులకు ఏండే జనాకర్షణ, ప్రజలలో మమేకమయ్యే అలవాటు ఐఏఎస్ లకు ఉండక పోవడం మరో కారణంగా చెప్పాలి. ఇలా ఉంటే ఐఆర్ఎస్ అధికారిగా పని చేస్తూ ఆప్ అనే రాజకీయపార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ దేశంలో బలమైన రాజకీయశక్తిగా ఎదుగారు. ఇందుకు కారణాలను అన్వేషిస్తే కేజ్రీవాల్ ఉద్యోగ జీవితమే ఒక ఉద్యమంలా సాగింది. రాజకీయాల ద్వారా సమాజాన్ని మార్చాలనే ఆలోచన కేజ్రీవాల్ కు మొదటి నుండీ ఉంది. అన్నాహజారే లోక్ పాల్ బిల్లు ఆందోళన కేజ్రీవాల్ కు కలసి వచ్చింది. బీజేపీ లోపాయకారి మద్దతుతో ఆప్ స్థాపన, గెలుపు కేజ్రీవాల్ కు సాధ్యమైంది. కానీ తెలుగు రాష్ట్రాలలో బ్యూరోక్రాట్ ల పరిస్థితి భిన్నంగా ఉంటోంది. కేవలం రిటైర్ మెంట్ బెనిఫిట్ గా రాజకీయాలను చూడడంతో మన బాబులకు భవిష్యత్ ఉండటం లేదు. 

డాక్టర్ గారంటేనే ముద్దు.. కోడెల శివరాం మాకొద్దు!

కోడెల శివరామ్.. ఇప్పుడు తెలుగుదేశం రెబల్ గా తన తండ్రి సేవలను పార్టీ గుర్తించడం లేదంటూ రోడ్డెక్కారు. అయితే ఆయన తండ్రి సెంటిమెంట్ సత్తెనపల్లిలో వర్కౌట్ అయ్యే పరిస్థితులు ఇసుమంతైనా లేవని ఆ నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. కోడెల శివప్రసాద్ పట్ల నియోజకవర్గ ప్రజలలో అపార గౌరవాభిమానాలు ఉన్నాయి. ఆయన ప్రజా సేవానిరతి, నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని ఇప్పటికీ జనం గొప్పగా చెప్పుకుంటారు. అయితే అదే సమయంలో ఆయన కుమారుడి పట్ల మాత్రం నియోజకవర్గ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.  గతంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన సాగించిన దౌర్జన్యాలను ఇప్పటికీ జనం నెమరు వేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు సత్తెన పల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా తెలుగుదేశం పార్టీ కన్నా లక్ష్మీనారాయణను నియమించిన నేపథ్యంలో శివరాం పార్టీపై తిరుగుబాటు చేసినా ఆయనకు జనం నుంచి మద్దతు కరవవ్వడానికి ఆయన తీరే కారణమని అంటున్నారు. అంతే కాకుండా తండ్రి పేరు చెప్పుకుని సెంటిమెంట్ పంపడించి సానుభూతిని సంపాదించుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆయన ప్రయత్నాలకు విరుగుడుగానా అన్నట్లు.. గుంటూరు జిల్లాలో వివిధ పోలీసుస్టేషన్లలో ఆయనపై ఉన్న కేసుల గురించి జనం చర్చించుకుంటున్నారు. అలాగే ఆయన బాధితులంతా ఒకే వేదికమీదకు వచ్చి శివరాంకు వ్యతిరేకంగా నిరసనగళం ఎత్తేందుకు సమాయత్తమౌతున్నారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియమించడాన్ని తప్పుపడుతూ రోడ్డుకెక్కిన కోడెల శివరామ్ ను నియోజకవర్గ తెలుగుదేశం క్యాడర్ విస్మరిస్తోంది. ఆయనకు అండగా కదిలేందుకు ముందుకు రావడం లేదు. అంతే కాకుండా నియోజకవర్గంలోని ఆయన సామాజిక వర్గీయుల మద్దతు కూడా శివరాంకు దక్కడం లేదు.   ఇప్పుడు శివరాంకు నియోజకవర్గంలో అండగా నిలబడుతున్న వారెవరైనా ఉన్నారా అంటే గత ఎన్నికల సమయంలో కోడెలపై చేయి చేసుకున్న వైసీపీ వర్గీయులేనని నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. కోడెల తలపెట్టిన ర్యాలీలో కనిపించిన వారంతా వైసీపీవారేనని చెబుతున్నారు.   అదీ కాక కోడెల శివప్రసాద్ జీవించి ఉన్న సమయంలో పలు సందర్భాలలో తన వారసులెవరూ రాజకీయాల్లోకి రారని చెప్పిన సంగతిని ఈ సందర్భంగా జనం గుర్తు చేసుకుంటున్నారు.  

బండికి ఉద్వాసన.. ఈటలకు పగ్గాలు?

తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బీజేపీలో ఇదే హాట్  టాపిక్. అయితే ఇది నిజమా అంటే అవుననో కాదనో చెప్పే పరిస్థితి లేదు. నిజం ఒకప్పుడు బీజేపీలో కేవలం బీజేపీ గోత్రీకులే ఉన్నప్పుడు ఇలాంటి లీకుల సంస్కృతీ  ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు పూర్తిగా మారిపోయింది. బీజేపీలో కాషాయ గోత్రీకులే కాదు, నానావర్ణ గోత్రీకులు వచ్చి చేరారు. అందులో కొందరిలో పూర్వాశ్రమ వాసనలు  పూర్తిగా పోలేదు. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ .. అంతే కాదు ఏడడుగులు కలిసి నడిస్తే వారు వీరవుతారు అన్నట్లుగా  బయటి వాసనలు లోపలికి చేరుతున్నాయి. బీజేపీలో పుట్టి పెరిగిన నేతలకు కూడా ఆ వాసనలు అంటుతున్నాయి. అందుకే ముందెన్నడూ లేని లీకులు  చిట్ – చాట్  చప్పుళ్ళు ఇప్పుడు బీజేపీలోనూ వినిపిస్తున్నాయి.  అలాగని బీజేపీలో ఏమీ జరగడం లేదని కాదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో,  ముఖ్యంగా అధికారం ఆశించి కమల గూటికి చేరిన నాయకులలో పునరాలోచనలు మొదలయ్యాయి. అలాగే కర్ణాటక ఫలితాలను సమీక్షించుకున్న బీజేపీ  జాతీయ నాయకత్వం  దక్షిణాదిలో కథ అడ్డం తిరిగిందనే వాస్తవాన్ని గుర్తించింది. ఒక అంచనాకు వచ్చింది. అందుకే  దక్షిణాదిలోనే కాదు, ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లతో పాటుగా తెలంగాణపైనా ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. మార్పులు చేర్పుల గురించి పునరాలోచన చేస్తోంది. ఏమి చేస్తే ఎన్నిక గండం గట్టెక్కగలం అనే ఆలోచనలకు పదును పెడుతోంది.  అందులో భాగంగా, కర్ణాటక ప్రభావం కొంచెం  ఎక్కువగా ఉండే తెలంగాణలో నాయకత్వం మార్పుతో సహా  ప్రజలను ఆకట్టుకునేందుకు  వివిధ ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు జరుపుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో, విభిన్న కోణాల్లో చర్చ జరుగుతోంది. అందులో ఒకటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్  ని ఆ పదవి నుంచి తప్పించి హుజూరాబాద్  ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రతిపాదనపై  బీజేపీ అగ్రనాయకత్వంలో చర్చ జరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే బండికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని అంటున్నారు. అలాగే ఈటలకు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ పదివి ఇచ్చే ప్రతిపాదనపైనా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అలాగే మరో ప్రత్యామ్నాయంగా మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి, ఈటలకు ప్రచార కమిటీ,బాధ్యతలు అప్పగించడం ద్వారా బండి, ఈటల, అరుణ త్రిముఖ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళే ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఈ పైవేవీ కాదు ..యథాతథ స్థితి కొనసాగుతుందనే కోణంలోనూ   చర్చ జరుగుతోంది. ఒక విధంగా చూస్తే 2014ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే విషయంలో పార్టీలో చాలా  తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, మరో కొందరు ముఖ్య నాయకులు మోడీని పీఎం అభ్యర్ధిగా ప్రకటించే విషయంలో అభ్యతరం వ్యక్తం చేశారు. అయితే , చివరకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.  ఒక సారి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నాయకులం దరూ ఒకే తాటిపై నడిచారు. బీజేపీ 30 ఎల్లా చరిత్రను తిరగరాసింది. సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సంఖ్యాబలం ( 283) సీట్లు గెలుచుకుంది.    అదలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతి పార్టీ కూడా పరిస్థితిని సమీక్షించు కుంటుంది . అవసరమైన మేరకు వ్యూహాలను మార్చు కుంటుంది. అదే  పని బీజేపే చేస్తోంది. అవసరం అయితే, నాయకత్వాన్ని మార్చుకుంటుంది. అనేక రాష్టాలలో ముఖ్యమంత్రులనే మార్చిన సందర్భాలున్నాయి. ఇది అన్ని పార్టీలలో ఉన్నదే. ఇప్పుడు తెలంగాణలో   అదే పని కాంగ్రెస్ చేస్తోంది. అదే పని బీఆర్ఎస్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు బీజేపీ మీద ఒంటి కాలు మీద లేచిన బీఆర్ఎస్ నాయకత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్  పార్టీ అయితే ఏకంగా పార్టీ హై కమాండ్ ను ఢిల్లీనుంచి బెంగుళూరుకు మార్చుకుంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్న పొంగులేటి , జూపల్లి వంటి నాయకులు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  తో చర్చలు జరుతున్నారు. సో .. మీడియా ఫోకస్ బీజేపీ మీద ఉన్నా, తెలంగాణ రాజకీయాలలో పార్టీలతో ప్రమేయం, లేకుండా అంతర్మథనం సాగుతోంది. చివరకు, ఏమి జరుగుతుంది? బీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? కాంగ్రెస్ కథేంటి? బీఆర్ఎస్ వ్యూహం ఏమిటి? అనేది ఇప్పుడే తేలేది కాదు.

జగన్ సర్కార్ కు ఆగస్ట్ డెడ్ ఎండ్?

జగన్ అధికారానికి కేంద్రం చరమగీతం పాడబోతోందా? అంటే వైసీపీ రెబల్ ఎంపీ  రఘురామకృష్ణం రాజు ఔననే అంటున్నారు. జగన్ ముందస్తుకు వెనకడుగు వేసినా ఆయన ప్రభుత్వం ఆగస్టు తరువాత అధికారంలో కొనసాగేందుకు అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయని రఘురామకృష్ణం రాజు విశ్లేషిస్తున్నారు.  ఆయన మాటల ప్రకారం ఆగస్టు నాటికి  ఏపీలో జగన్ సర్కార్ ను రద్దు అవుతుంది. జగనే తనంతట తాను అందుకు ముందుకు వస్తారు.   ఏపీలో  తాజాగా పర్యటించిన నడ్డా మాటలను తార్కానంగా చూపుతున్నారు. నడ్డా మాటలను బట్టి చూస్తే జగన్ సర్కార్ కు ఇక ఏ వైపు నుంచీ అప్పుపుట్టే అవకాశం ఇసుమంతైనా లేదు.  అలా అప్పు పుట్టక పోతే జగన్ సర్కార్ ఒక్క పూట కూడా నడిచే అవకాశం లేదు. ఈ కారణాన్ని చూపుతూనే రఘురామకృష్ణం రాజు అగస్టు తరువాత జగన్ సర్కార్ కొనసాగే అవకాశాలు లేవని అంటున్నారు. అందుకే ఆగస్టులో జగన్ సర్కార్ ను రద్దు చేసి తెలంగాణ ఎన్నికలతో పాటుగానే ముందస్తుకు సమాయత్తమౌతారని ఆయన గట్టిగా చెబుతున్నారు.  ముందస్తుకు వెళ్లడం జగన్ కు సుతరామూ ఇష్టం లేకపోయినా.. చివరి క్షణం వరకూ అధికారాన్ని అంటిపెట్టుకునే ఉండాలన్నది జగన్ అభిమతమే అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు ఏ మాత్రం సహకరించడం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు తగినట్టుగానే  రఘురామకృష్ణం రాజు తన రచ్చబండ కార్యక్రమంలో  వైసీపీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించడానికి శ్రీకారం చుట్టిందని, ఆర్థిక వెసులు బాటు కేంద్రం నుంచి అందకపోతే ప్రభుత్వ మనుగడ కష్టమని జగన్ కు స్పష్టంగా తెలుసును కనుకనే ఒక వైపు ముందస్తు లేదని అంటూనే మరో వైపు అందుకు అవసరమైన సన్నాహాలను చేసుకుంటున్నారని చెప్పారు.  ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా విశాఖ తూర్పులో తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడం, వైసీపీకి చెందిన వారి కుటుంబాలలో లేని వారి పేర్లను కూడా ఓటర్ల జాబితాలో చేర్పించడాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు. ముందస్తు ముచ్చట ఎత్తిందీ వైసీపీయే, ఇప్పుడా ముచ్చట లేదంటున్నదీ ఆ పార్టీయే అన్నది ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నారు. విపక్షాలను కన్ఫ్యూజ్ చేయడం ద్వారా ఎన్నికలలో లబ్థి పొందాలన్నదే జగన్ వ్యూహంగా పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ముందస్తు లేదన్న భావనతో విపక్షాలు ప్రమత్తంగా ఉండడాన్ని జగన్ అవకాశంగా మలచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.   ఇంకా ఆయన ఏమన్నారంటే జేపీ నడ్డా, అమిత్ షాల విమర్శలు జగన్ సర్కార్ పై, జగన్ పాలనపై క్షిపణి దాడుల్లా ఉన్నాయన్నారు. ఆ విమర్శలపై వైపీసీ నేతలు తమ సహజసిద్ధమైన బూతుల పంచాగంతో విరుచుకుపడుతుండటం చూస్తుంటే.. కేంద్రంలోని మోడీ సర్కార్ అండదండలు ఇంకెంత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశాలు లేవని అవగతమౌతోందన్నారు.  

బాబు ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ షురూ..?

మరో తొమ్మిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఏపీ    రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి.ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో బీజేపీ పార్టీ పెద్దల ఆలోచనలో మార్పులు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. అంతా ల్యాండ్, లిక్కర్ స్కాంలు నడుస్తున్నాయి అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేవన్నీ స్కామ్ లే.రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. రాయలసీమ అభివృద్ధిని వైసీపీ విస్మరించింది అంటూ జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇది ఇలా ఉండగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఏపీ సీఎం జగన్ పాలనపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. మోడీ 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి సంబంధించి విశాఖ రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.రైతుల ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉందని తెలిపారు. సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే సీఎం జగన్ తన బొమ్మ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని అమిత్ షా ఆరోపించారు.రాష్ట్రానికి మోదీ బియ్యం ఇస్తుంటే జగన్ తన బొమ్మ వేసుకుంటున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలో కేంద్రం ఇస్తున్న నిధులు ఏమయ్యాయో జగన్ చెప్పాలని అమిత్ షా ప్రశ్నల వర్షం కురిపించారు. విశాఖను విద్రోహశక్తులుగా మార్చారని, అధికార పార్టీ వైసిపి నేతలకు రాష్ట్రవ్యాప్తంగా భూమాఫియా మైనింగ్ మాఫియాలతో  కోట్లకు పడగలెత్తారని షా  తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కేంద్రం గమనిస్తూనే ఉంది. రాష్ట్రంలో జగన్ పాలనలో నాలుగేళ్లలో అవినీతి కుంభకోణాలు తప్ప మరేం చేయలేదు. ఇలా ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కారుపై బీజేపీ విమర్శల దాడి పెంచడం చర్చనీయాంశమవుతోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ సర్కారుపై యుద్ధం చేస్తున్న పెద్దగా వర్కవుట్ కాలేదు. కేంద్ర పెద్దలతో జగన్ సాన్నిహిత్యం, పరస్పర రాజకీయ సహకారం, ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటుతున్న ఏపీ సర్కారును నియంత్రించకపోవడం వంటి వాటితో బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అయితే దానిని అధిగమించేందుకు ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఏపీకి క్యూకట్టడమే కాకుండా జగన్ సర్కారు తీరును ఎండగడుతున్నారు. ఇక ముందు ఇదే దూకుడును కొనసాగించనున్నారు. ఇదంతా ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ అని.. ఇక బీజేపీ ..జగన్ సర్కార్ పై దాడి మరింత ముమ్మరం చేయనున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక పోటీ?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ కు ఈ ఏడాది చివరిలో ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం తదితర జిల్లాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటే వాయనాడ్ ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు? అన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనర్హత వేటు కారణంగా ఆ ఉప ఎన్నికలో రాహుల్ గాంధీ పోటీకి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే   ప్రియాంకా వాద్రా  పేరు తెరమీదకు వచ్చింది. అయితే గతంలో  ఇదే నియోజక వర్గం నుంచి గెలిచిన, కేరళ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్  ఎంఐ షనవాస్ కే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తారన్న చర్చ కూడా జరగుతోంది.  అసలు వాయనాడ్ ఉప ఎన్నిక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరుగుతుందని అంతా భావించినా,  ఎన్నికల కమిషన్  ఆ ఎన్నికలతో పాటు వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక కు నోటిఫికేషన్ ఇవ్వలేదు.  ఫిబ్రవరి వరకూ ఉన్న వేకెన్సీలను మాత్రమే క్లియర్ చేశామని అప్పట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  అప్పట్లో  తెలిపారు. వాయనాడ్ వేకెన్సీని మార్చిలో నోటిఫై చేశామని, రాహుల్ గాంధీ తనకు రెండేళ్ళ జైలు శిక్షపై  అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఉన్నందున తాము తొందరపడటం లేదని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఏ సీటైనా ఖాళీ అయితే ఆరు నెలల్లోపు దానిని భర్తీ చేయాల్సి ఉంటుంది.  ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చివరిలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.