అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
posted on Jun 14, 2023 @ 6:10PM
తెలంగాణలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. బిఫోర్ జాయ్ తుఫాన్ నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దు అయినట్లు.. బీజేపీ వర్గాలు తెలిపాయి. ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయినప్పటికీ.. రాజకీయాల కంటే ప్రజలను కాపాడుకోవడం ముఖ్యమని .. ఈ తుపాన్ తీవ్రత గుజరాత్, మహారాష్ట్రలో తీవ్రంగా ఉందని.. అందుకే ఖమ్మం సభను వాయిదా వేసినట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా బుధవారం (జూన్ 14) రాత్రి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. గురువారం (జూన్ 15) ఖమ్మంలో జరిగే సభకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అదే రోజు ఉదయం తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో ఆయన భేటీ కావాల్సి ఉంది.
అలాగే టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్, ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, అలాగే ఒక పత్రికాధిపతితో సమావేశం కావాల్సి ఉంది. అయితే అమిత్ షా పర్యటన రద్దు కావడంతో.. ఈ భేటీలు, సమావేశాలన్నీ రద్దయ్యారు. అమిత్ తెలంగాణ పర్యటన ఎప్పుడు అనేది బీజేపీ మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
ఈ ఖమ్మం వేదికగా జరిగే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో కమలం తీర్థం పుచ్చుకొనేందుకు ఇప్పటికే రంగం సిద్దమైంది. కానీ అమిత్ షా పర్యటన ఆగిపోవడంతో.. వీరి చేరికలు సైతం ఆగాయి. అయితే సాధ్యమైనంత త్వరలో ఖమ్మం వేదికగా బీజేపీ భారీ సభ నిర్వహించి.. వారికి పార్టీ కండువా కప్పే కార్యక్రమం ఉంటుందని సమాచారం.