ఏపీలో రజనీకాంత్ ఎన్నికల ప్రచారం?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ అస్పష్టంగా ఉన్న రాజకీయాలు ఇప్పుడు కొత్త కోణంలో స్పష్టమవుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చంద్రబాబును జైల్లో కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి మరీ పొత్తులపై సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరితో పాటు కమ్యూనిస్టులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతో టీడీపీ-జనసేన కూటమికి ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్ పెరిగిపోయారు. ఇటు ఈ కూటమికి సినీ పరిశ్రమలో కూడా అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటు నందమూరి, మెగా కుటుంబాల హీరోలు కూటమికి మద్దతుగా ఉండనున్నారు. దీంతో పాటు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈసారి తెలుగుదేశం, జనసేన కూటమికి అండగా ఏపీలో ఎన్నికల ప్రచారం చేస్తారన్న ప్రచారం జోరందుకుంది.  నందమూరి కుటుంబంతో పాటు చంద్రబాబుతో రజనీకాంత్ కు మంచి స్నేహ సంబంధాలున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇటు మెగా కుటుంబంతో కూడా రజనీకాంత్ కు మంచి అనుబంధం ఉంది. మరోవైపు రజనీకాంత్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. త్వరలోనే బీజేపీ రజినీని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించనుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.  ఈ పరిణామాలన్నిటినీ పరిశీలిస్తే రజనీకాంత్ ఈసారి ఏపీలో ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు. ఒకవేళ బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలవకపోయినా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో ఉన్న సత్సంబంధాల కారణంగా వ్యక్తిగతంగా  రజనీకాంత్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి. పరిస్థితులను నిశితంగా గమనిస్తే.. మునిగిపోయే పడవను వదిలేసినట్లుగా బీజేపీ కూడా  జగన్ పార్టీకి దూరం జరిగి తెలుగుదేశం, జనసేన కూటమిలో కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.   దీంతో వచ్చే ఎన్నికలలో రజనీకాంత్ తెలుగుదేశం, జనసేన కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఖాయమేనని చెబుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని, ఆయన  ఎప్పుడూ తప్పు చేయరని, చేసిన అభివృద్ధి, సంక్షేమాలే ఆయనకు రక్ష. అవే ఆయనను బయటకు తీసుకవస్తాయి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమి చేయలేవు  అంటూ లోకేష్‌కు ధైర్యం చెప్పారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆ మధ్య నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన రజనీకాంత్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు  విజన్ గురించి  వివరిస్తూ ఆయనపై   పొగడ్తల వర్షం కురిపించారు. ఆ పొగడ్తలలో రాజకీయ అంశాలేమీ లేకపోయినా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా  వైసీపీ నేతలు రజనీకాంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి ఒకింత ఆలస్యంగానైనా రజనీకాంత్ స్పందించి వైసీపీ నేతలపై చురకలు వేశారు.   ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కూడా రజనీకాంత్ స్వచ్ఛందంగా స్పందించారు. అరెస్టును ఖండించారు. ఈ పరిణాలన్నిటినీ చూస్తే వచ్చే ఎన్నికలలో విపక్ష కూటమికి రజనీ తనవంతు సహకారం అందిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి రజనీకాంత్  సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజాసేవ చేయాలని భావించినా.. ఏవేవో కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో రాజకీయ రంగంలో తన మార్క్ చూపాలని భావించిన రజనీకాంత్ అది కుదరక పోవడంతో ఒకింత అసంతృప్తి ఆయనలో ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.   ఈ నేపథ్యంలోనే  బీజేపీ ఆయనకు గవర్నర్ పదవిని ఆఫర్ చేసిందన్న ప్రచారం కూడా ఉంది.  అయితే దాని కంటే ముందు.. వచ్చే ఎన్నికలలో దక్షణాది రాష్ట్రాలలో ఆయన  ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని  రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సొంత రాష్ట్రం కర్ణాటక, ఆయన్ను సూపర్ స్టార్ ను చేసిన తమిళనాడు, తనను ఆదరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆయన పొలిటికల్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో కూడా రజనీ ఎన్నికల ప్రచారానికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు

మాజీ మంత్రి  గౌతు శివాజీ అరెస్ట్  పలాస లో ఉద్రిక్తత

వైసీపీ ప్రభుత్వ  అరాచకాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి.    మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ , రిమాండ్ కు చట్టవిరుద్దమని టీడీపీతో బాటు ఎన్డియే, ఇండియా కూటమిలకు చెందిన భాగస్వామ్య పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  ఈ అరెస్ట్  ను నిరసిస్తూ మాజీ మంత్రి గౌతు శివాజీ   నేత‌ృత్వంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.  ఈ ఆందోళనను భగ్నం చేయడానికి జగన్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి శివాజీని ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో గౌతు శివాజీ అస్వస్థకు గురయ్యారు. ఆ వివరాలేంటో చూద్దాం... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తూ 3వ రోజు పలాస కేటి రోడ్లో రీలే నిరాహార దీక్షను టీడీపీ శ్రేణులు చేపట్టారు. దీక్షకు సంఘీభావం తెలుపుతున్న మాజీ మంత్రి గౌతు శివాజీ ను కాశిబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసి  పోలీస్ స్టేషన్ కు  తరలించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో గౌతు శిరీష, టిడిపి నాయకులు నినాదాలు చేస్తూ ర్యాలీగా కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.మాజీ మంత్రి గౌతు శివాజీ పోలీస్ స్టేషన్లో అస్వస్థకు గురు కావడంతో తక్షణమే వైద్యం నిమిత్తం కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అస్వస్థకు గురైన మాజీ మంత్రి గౌతు శివాజీ కి వైద్యం పేరుతో గుర్తుతెలియని ప్రాంతానికి పోలీసులు తరలింపు....కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట గౌతు శిరీష, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన శివాజీ ఆచూకీ తెలియకపోవడం  పోలీసులకు అడిగిన చెప్పకపోవడంతో శిరీష టిడిపి నాయకులు స్టేషన్ వద్ద ఆందోళన చేపడుతుండగా శిరీష తండ్రి ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన చెందుతూ వినిపిస్తున్నారు

చంద్రబాబు అరెస్ట్.. తప్పుడు చర్య .. మాజీ ఐఏఎస్,ఐపీఎస్ ల ముక్తకంఠం

నాలుగు దశాబ్దాలు పైబడిన ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి.. 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేయడం పట్ల సర్వత్రా నిరసన, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు హయాంలో  జరిగిన అభివృద్శి ఎప్పటికీ ఆదర్శంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా విభజిత ఆంధ్రప్రదేశ్  అభివృద్ధి కోసం ఆయన ప్రణాళికలు, అమరాతి రాజధాని గురించి   ప్రపంచ దేశాలు సైతం గుర్తించి ప్రశంసలు కురిపించాయి.   మహిళలు, నిరుపేదలు, నిరుద్యోగులు, వృద్దుల సంక్షేమం కోసంఎన్నో పథకాలు. ఉద్యోగ, ఉపాధిలో దేశానికే ఆదర్శం.. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమం గురించి చెప్పుకుంటూ పోతే అంతం అనేది ఉండదు. అలాంటి నాయకుడిని ఎఫ్ఐఆర్ లో  పేరు కూడా లేని కేసులో అరెస్ట్ చేయడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటున్నారు. హై ప్రొఫైల్ ఉన్న నేతను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అన్న నిబంధనను తుంగలో తొక్కి  అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి హైడ్రామా.. వేకువ జామున అరెస్ట్ చేయడం, 24 గంటలు గడిచిచే వరకూ  న్యాయమూర్తి ఎదుట హాజరు పరచకపోవడం లాంటి పరిస్థితులను యావత్ ప్రజానీకం తప్పుపడుతుంది. చంద్రబాబు అరెస్టుపై ఏపీలోని అన్ని ప్రతిపక్షాలే కాకుండా జాతీయ స్థాయిలో అన్ని రాజకీయపార్టీలూ తప్పుపట్టాయి. ఖండించాయి.  మ నేషనల్ మీడియాలో కూడా  చంద్రబాబు అరెస్టుపైనే చర్చ నడుస్తున్నది. మరోవైపు మేధావులు కూడా ఈ అరెస్టు వ్యవహారాన్ని కక్ష  సాధింపు చర్యగానే చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు, కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటించాయి హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక , చెన్నై లాంటి  నగరాలలో యువత  చంద్రబాబుకు మద్దతుగా  నిరసనలు చేపడుతున్నారు. వీరే కాదు రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు కూడా చంద్రబాబు అరెస్టును తప్పుబడుతున్నారు. ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ  ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగడుతున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ వ్యవహరించిన విధానాన్ని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తప్పు పట్టారు. అవినీతి నిరోధక చట్టాన్ని అనుసరించే విధానంలో నిబంధనలు పాటించలేదన్నారు.  ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పూర్తి వివరాలు పంచుకున్నారు. చంద్రబాబుకు ఇచ్చిన అరెస్ట్ మెమో ప్రకారం.. ఆయన అరెస్ట్ నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. ఈ కేసులో తప్పు ఒప్పులను న్యాయస్థానాలు తెలుస్తాయని.. కానీ అరెస్ట్ సహేతుకంగా చట్టబద్ధంగా జరగలేదని నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. అరెస్టు సమయంలో ప్రొసీజర్ పాటించడంలో సీఐడీ అధికారులు విఫలమైనట్లు  వివరించారు. నమోదు చేసిన సెక్షన్లు, కేసు వివరాలను సమీక్షించిన ఆయన గవర్నర్ ఆమోదం లేకుండా అరెస్ట్ చేయడం చట్టాన్ని ఉల్లఘించడమేనని పేర్కొన్నారు. అంతకు ముందు ఈ కేసులో సీఐడీ అధికారులు ప్రవర్తించిన తీరు అనుమానం కలిగించేలా ఉందని మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఆరోపించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఏర్పాటు చేసిన సమయంలో  ఈయనే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కాగా.. అప్పుడు నిధులు కూడా ఈయన చేతుల మీదుగానే విడుదల అయ్యాయి. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన పీవీ రమేష్.. తన స్టేట్‍మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతి  కలిగించిందన్నారు. స్కిల్ డెవలప్‍మెంట్ లో ఆర్థికశాఖ ఏ తప్పూ చేయలేదని విస్పష్టంగా చెప్పారు. సీఐడీ తీరుపై తనకు అనుమానం కలుగుతోందనీ, తాను చెప్పిన విషయాలను  సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందని సందేహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానం.. మరి వారి పేర్లు ఎందుకు లేవని నిలదీశారు. సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మి నారాయణ కూడా పలు మీడియా ఛానెళ్ల చర్చా కార్యక్రమాలలో మాట్లాడుతూ.. సీఐడీ పీసీ చట్టంలోని 17ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని.. కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో అది జరగలేదన్నారు. ఇప్పుడైనా గవర్నర్ అనుమతిస్తేనే ఆ సెక్షన్ ఈ కేసు వర్తిస్తుందని.. లేకపోతే ఆ సెక్షన్ పని చేయదని వివరించారు ఈ సెక్షన్ పై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా చంద్రబాబుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. వీరే కాదు.. వీరి బాటలో మరికొందరు రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయన అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. 

కవిత అరెస్ట్ ఖాయమేనా? ఈడీ పిలుపు అందుకేనా?

కారణాలు ఏమైనా గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో కొంత స్తబ్దత చోటు చేసుకుంది. సందడి తగ్గింది. ముఖ్యంగా, బీఆర్ఎస్, బీజేపీ జుగల్ బందీ కొంత  విశ్రాంతి తీసుకుంది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా కాలంగా కమలం జోలికి వెళ్ళడం లేదు. మోదీని మాటనడం లేదు. కొద్ది కాలం క్రితం వరకు కేంద్ర ప్రభుత్వం, కమలం పార్టీ పై కత్తులు దూసిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో కమలం కంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.  అయితే ఇప్పడు మళ్ళీ మరోమారు తెలంగాణ రాజకీయాలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య తగవుకు తెరలేచింది. ఏడాదికి పైగా సా గుతున్న ఢిల్లీ లిక్క స్కామ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవితకు  మరో మారు విచారణకు  విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అదికూడా ఎప్పుడో కాదు, నోటీసు  ఇచ్చిన 24 గంటలు తిరక్క ముందే అంటే శుక్రవారం(సెప్టెంబర్ 15) విచారణకు రావాలని గురువారం (సెప్టెంబర్ 14) ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో మళ్ళీ మరో మారు, బీఆర్ఎస్, బీజేపీ జుగల్బందీకి తెరలేచింది. అది కూడా ఇటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామం సహజంగానే  రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయం  తర్వాత  దూకుడు పెంచిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, ఆరెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రచారం చేస్తూ వచ్చింది. ఆ ప్రచారానికి  కవిత కేసు కేంద్ర బిందువుగా నిలిచింది. గత సంవత్సరం మార్చిలో ఈడీ కవితను విచారించిన సమయంలో బీజేపీ రాష్ట నాయకులు  ఇంకేముంది   కవితను జైలుకు పంపించబోతున్నామని గంభీర ప్రకటనలు చేశారు. అయితే, తర్వాత ఆర్నెల్లుగా ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి కదలికలు లేకపోవడంతో   కేసీఆర్‌తో బీజేపీకి రాజీ కుదిరిందని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం సాగించింది. దానికి తోడు, బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో ఇటు పార్టీలో అటు ప్రజల్లో కూడా  బీఆర్ఎస్, బీజేపీ, రహస్య బంధం విషయంలో అనుమానాలు బలపడ్డాయి. దీంతో అంతవరకు బీఆర్‌ఎస్ ను ఢీకొనే విషయంలో కాంగ్రెస్ తో పోటాపోటీగా ఉన్న బీజేపీ గ్రాఫ్‌ పడిపోయింది. కార్యకర్తల్లో నీరసం ఆవహించింది. కవితను అరెస్టు చేస్తే కానీ తెలంగాణలో మళ్లీ పుంజుకోలేమనే అభిప్రాయాన్ని ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి చెప్పారు. ఢిల్లీ నుంచి నియోజకవర్గాల పర్యటనకు వచ్చిన జాతీయ నాయకులకూ కార్యకర్తల నుంచి అంతే  ఫీడ్‌బ్యాక్‌  బలంగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి లిక్కర్ కేసులో కవిత ను ఈడీ మరోసారి విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదలా ఉంటే గడచినా ఐదారు నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో  కవిత  స్పెసిఫిక్ గా  కనిపించక పోయినా, విచారణ సంస్థలు-, సిబిఐ, ఈడీ కేసును క్లోజ్ చేయ  లేదు. ఈ నేపధ్యంలోనే  ఈ కేసులో కీలకంగా మారిన  సౌత్ గ్రూప్  లో సభ్యులుగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌, శరత్‌ చంద్రారెడ్డి  అప్రూవర్లుగా మారారు. అలాగే కవిత బినామీగా చెబుతున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్‌గా మారారని అంటున్నారు. ఈ నలుగురు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా కవితను ఈడీ అధికారులు  మరో మారు కవితను విచారించే అవకాశముందని అంటున్నారు. అలాగే, ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసిన ఇండో స్పిరిట్స్‌ సంస్థలో కవిత తరఫున అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లై ప్రాతినిధ్యం వహించారు. ఆ సంస్థలో అరుణ్‌ పిళ్లైకి ఉన్న వాటాలు కవితవేనని ఈడీ చెబుతోంది. మద్యం విధానం రూపకల్పన సమయంలో ఢిల్లీ ఒబెరాయి హోటల్‌లో జరిగిన సమావేశంలో అరుణ్‌ పిళ్లై, కవిత పాల్గొన్నారు. హైదరాబాద్‌ లోనూ సౌత్‌ గ్రూపు సభ్యుల సమావేశం జరిగినట్లు ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. అప్రూవర్లుగా మారిన వారు కవితకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చినందునే తాజాగా కవితను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వారు ఇచ్చిన వాంగ్మూలాలను, ఈడీ సేకరించిన ఆధారాలను కవిత ముందుంచి అధికారులు ప్రశ్నించే అవకాశముందని అంటున్నారు. అయితే, కవితను ఇప్పుడైనా  ఈడీ అరెస్ట్ చేస్తుందా? చేస్తే.. రాష్ట్ర రాజకీయాలపై  ముఖ్యంగా  అసెంబ్లీ ఎన్నికలపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పడు .. రాష్ట్ర రాకీయాలను వేడెక్కిస్తోంది.

చంద్రబాబుతో ములాఖత్ కు భువనేశ్వరికి అనుమతి నిరాకరణ

స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి చేసుకున్న ములాఖత్ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. నిబంధనల మేరకు  వారంలో మూడు సార్లు ములాఖత్ కు అవకాశం ఉన్నప్పటికీ భువనేశ్వరి దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే చంద్రబాబుకు జైల్లో సరైన భద్రత కల్పించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయనకు కల్పించాల్సిన ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించలేదని.. తొలిసారి ములాఖత్ తరువాత  భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెవలుపై వెడుతుండటంతో అసలు రాజమహేంద్రవరం జైలులో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక తన ములాఖత్ దరఖాస్తున్న జైలు అధికారులు తిరస్కరించడంపై భువనేశ్వరి జగన్ సర్కార్ అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ములాఖత్ కు అవకాశం ఉన్నా తిరస్కరించడం కచ్చితంగా కక్ష సాధింపు ధోరణేనని అన్నారు.   మరో వైపు చంద్రబాబుకు జైల్లో భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆయనను ప్రజలకు చూపాలని, ఆయన ఆరోగ్యపరిస్థితి, జైల్లో అందుతున్న సౌకర్యాల గురించి ఆయన నోటి వెంటే తెలుసుకుంటామని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఐయామ్ విత్ బాబు, ఇయామ్ విత్ సీబీఎన్, జైటీడీపీ, జై తెలుగుదేశం హ్యాష్ ట్యాగ్ లతో ఆ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

వైసీపీలో అడుగంటిపోయిన గెలుపు ఆశ!

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం, తదననంతర పరిణామాల నేపథ్యంలో వైసీపీ శ్రేణులలో, నేతలలో అంతర్మథనం మొదలైంది. జగన్ భస్మాసుర హస్తం తన నెత్తినే కాకుండా మొత్తం పార్టీ నెత్తిన పెట్టేశారా అన్న అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అసలే ప్రజా వ్యతిరేకతతో ఎన్నికలు ఎదుర్కోవడమే కష్టం అనిపిస్తున్న తరుణంగా, ఆ వ్యతిరేకత ప్రజాగ్రహంగా మారేందుకు చంద్రబాబు అరెస్టు ఉదంతం దోహదపడిందని వారు అంటున్నారు. సాధారణంగా ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా తదుపరి ఎన్నికలను ఎదుర్కొనేందుకు తన పాలనా కాంలో చేసిందేమిటో, మరో సారి అవకాశం ఇస్తే ఏం చేస్తాము అన్నది చెప్పుకుంటుంది. అయితే జగన్ మాత్రం తన పాలనను విధ్వంసంతో మొదలెట్టి.. ఆరాచకత్వంతో ముగించాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తున్నదని అన్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ జనంలో జగన్ ప్రభుత్వం పట్ల, ఆయన పాలన పట్ల వ్యతిరేకత మాత్రమే ఉండేది.. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో అది ఆగ్రహంగా  మారిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ ప్రజాగ్రహాన్ని తట్టుకోవడం కష్టమని, రేపు ఎన్నికల ప్రచారం కోసం వారి ముందుకు వెళ్లే సాహసం ఏ వైసీపీ కార్యకర్తా చేయలేని పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయనీ వారు అంటున్నారు. ఇదంతా జగన్ స్వయంకృతాపరాధమేనని చెబుతున్నారు.  చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ ను గమనించిన ఎవరికైనా సరే జగన్ వ్యక్తిగత ద్వేషంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఇట్టే అవగతమైపోతుందని అంటున్నారు. అందుకే ఇంత కాలం జగన్ ఎన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా.. ఎందుకొచ్చిన గొడవ.. బయటకు వచ్చి నిరసనలు తెలిపితే కేసులంటూ వేధిస్తారు అంటూ ఆందోళనలకు దూరంగా ఉన్న జనబాహుల్యం.. చంద్రబాబు అరెస్టుతో ఏమైనా ఫరవాలేదు.. వీఆర్ విత్ బాబు అంటూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వైసీపీ శ్రేణులే వివరిస్తున్నాయి. వైసీపీ నాయకులే కాదు.. క్యాడర్ కూడా ఇక నుంచి పార్టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న బావన వ్యక్తం చేస్తున్నారు.  అన్నిటికంటే ప్రధానంగా స్కిల్ స్కాం జరిగిందని కానీ, చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని కానీ జనం నమ్మడం లేదు. దీనిని కుట్రపూరితంగా, కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఆయనపై మోపి.. కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా అరెస్టు చేశారనీ, తాను అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యాను కనుక విపక్ష నేతపైనా ఎదో విధంగా అవినీతి బురద జల్లాలన్న ద్రోహపూరిత ఉద్దేశంతోనే జగన్ సర్కార్ చంద్రబాబును అరెస్టు చేసిందని జనం భావిస్తున్నారు.  ఆ కారణంగానే రాజకీయాలకు అతీతంగా  దేశవ్యాప్తంగా చంద్రబాబుకు సంఘీభావం లభిస్తోంది.  1984లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడు ఎంతగా ప్రజాగ్రహం వ్యక్తమైందో..ఇప్పుడు చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా అదే స్థాయిలో ప్రజాగ్రహం వ్యక్తం అవుతోంది. అప్పట్లో లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలు బీజేపీ, కమ్యూనిస్టులు ఒకే వేదికపైకి వచ్చి ఎలా ఎన్టీఆర్ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారో.. అదే విధంగా  ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముక్తకంఠంతో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాయి.  ఈ అరెస్టుతో జగన్ తన పతనాన్ని తానే శాశించుకున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అంతే కాకుండా ఇంత కాలం జగన్ పార్టీలో కొనసాగిన తమ రాజకీయ భవిష్యత్ ను కూడా అంధకారబంధురం చేశారని అంటున్నాయి.   అలాగే చంద్రబాబు అరెస్టుతో డోలాయమానంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పొత్తును కూడా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించడం ద్వారా  ఖరారయ్యేలా చేసింవది కూడా జగనేననీ అంటున్నారు.  మొత్తంగా వైసీపీలో అత్యధికులు ఇప్పుడు పార్టీకి సాధ్యమైనంత దూరంగా ఉంటే గెలుపు, ఓటమి విషయాలు తరువాత ప్రజాగ్రహానికి గురికాకుండా ఉంటామని, అదే చాలనీ భావిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఏమూలో మిణుకు మిణుకు మంటున్నట్లు ఉన్న గెలుపు ఆశ ఇప్పుడు పూర్తిగా అడుగంటిపోయిందన్న భావన వైసీపీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. 

చంద్రబాబు అరెస్టు.. అన్ని వైపుల నుంచీ నిరసనలతో జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్  రాష్ట్రంలోనే కాదు , జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్లిస్తోంది. ఏపీలో జగన్ అరాచక పాలనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ జగన్ ను అన్ని విధాలుగా సమర్థిస్తూ, ఆర్థిక అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం కూడా జగన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ముందస్తు కోసమో, మరిన్ని అప్పుల కోసమో.. అదీ కాకపోతే వచ్చే ఎన్నికల వరకూ చంద్రబాబును జైలులోనే మగ్గేలా రూపొందించిన తన వ్యూహాలకు మద్దతు కోసమే జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీలతో భేటీకి అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రం భగ్గుమంటున్నా.. ఆయన మాత్రం నీరో చక్రవర్తిలా తాడేపల్లి ప్యాలెస్ లో ఏ  క్షణంలో హస్తిన నుంచి పిలుపు వస్తుందా అన్న ఎదురు చూస్తున్నారు. రోమ్ నగరం తగలడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నారట. అలాగే ఏపీ భగ్గు మంటుంటే.. తన అరాచక, అక్రమ, అడ్డగోలు పాలన పట్ల జనాగ్రహం పెల్లుబుకుతుంటే జగన్ మాత్రం మౌనంగా.. హస్తిన పెద్దన కరుణకటాక్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టును రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిబంధనలను తుంగలోకి తొక్కి.. ఏ  మాత్రం నిలబడని కేసులు పెట్టి.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసిన తీరు పట్ల సర్వత్రా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ, తెలంగాణలలోనే కాకుండా తమిళనాడు, బెంగళూరు సహా ఎక్కడికక్కడ జనం, ఐటీ ఉద్యోగులు, మహిళలూ స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ ప్లకార్డులు చేతబట్టి సంఘీభావం తెలుపుతున్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు కూడా బాబును అరెస్టు చేసిన తీరును తప్పుపడుతున్నారు. జగన్ సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని విమర్శిస్తున్నారు. ఓ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయితే.. అమరావతి కేసులో జగన్ సర్కార్ హైకోర్టు తీర్పును ధిక్కరించి వ్యవహరిస్తున్న తీరుపై మండి పడుతూ.. తానైతే ముఖ్యమంత్రి జగన్ ను జైలుకు పంపేవాడినని పేర్కొన్నారు.  ఇక ఇలా నలుమూలల నుంచీ జగన్ సర్కార్ చంద్రబాబు అరెస్టు విషయంలో వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతుండటంతో కేంద్రం కూడా జగన్ విషయంలో ఇక కఠినంగా వ్యవహరించక తప్పదన్న నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై ఎన్ఎస్జీ కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, జైలులో ఆయన భద్రత తదితర అంశాలపై ఎన్ఎస్జీ ఆ నివేదికలో పేర్కొందని చెబుతున్నారు. అంతే కాకుండా  చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడకు రోడ్డు మార్గంతో తరలించిన తీరుపై కూడా ఎన్ఎస్జీ ఆ నివేదికలో సవివరంగా పొందుపరిచిందంటున్నారు.  అలాగే ఏ మాత్రం పటిష్ట భద్రత లేని ఏసీబీ కోర్టు హాలులో చంద్రబాబు గంటల తరబడి ఉన్న విషయాన్నీ ఎన్ఎస్జీ ఆ నివేదికలో పేర్కొందంటున్నారు. అలాగే చంద్రబాబు పర్యటనలలో రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు గురించి కూడా సోదాహరణంగా ఆ నివేదిక పేర్కొందంటున్నారు. ఎన్ఎస్జీ నివేదికకు తోడు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఏపీలో జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందంటూ కేంద్ర హోంశాఖకు నివేదికలు అందాయని చెబుతున్నారు.  వీటికి తోడు జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయం చూసుకుని చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా దేశ ప్రతిష్ట మసకబారేవిధంగా జగన్ వ్యవహరించారని కూడా కేంద్రం భావిస్తున్నది. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన చంద్రబాబు పట్ల ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలకు గౌరవం ఉంది. అటువంటి చంద్రబాబును అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేయడంతో కేంద్రం ప్రతిష్ట మసకబారిందన్న అభిప్రాయం కూడా బీజేపీ అధినాయకత్వంలో వ్యక్తం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చంద్రబాబును నిన్న రాజమహేంద్రవరం జైలులో కలిసిన తరువాత జనసేనాని పవన్  కల్యాణ్ తెలుగుదేశం, జనసేన కలిసే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించడం కూడా కేంద్రం తన వైఖరిని పునస్సమీక్షించుకోవలసిన అవసరాన్ని ఎత్తి చూపిందని అంటున్నారు.    ఇక తెలుగుదేశం అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటములలో భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ రెండు కూటములలోని భాగస్వామ్య పార్టీలూ బేషరతుగా చంద్రబాబుకు మద్దతు పలకడం, జగన్ సర్కార్ అక్రమ అరెస్టును ఖండించడంతో తమ చర్యను సమర్ధించుకోలేక వైసీపీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. అదే సమయంలో ప్రధాని, హోంమంత్రి నుంచి అప్పాయింట్ మెంట్ కూడా లభించకపోవడంతో కేంద్రం జగన్ కు దూరం జరుగుతోందన్న సంకేతాలను ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ప్రకటించగానే, అలా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమహేంద్రవరం నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో హస్తిన బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బీజేపీ పెద్దలనే కాకుండా, జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల అధినేతలనూ కలిసి చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే పార్లమెంటు ప్రత్యేక  సమావేశాలలో చంద్రబాబు అరెస్టు తీరుపై అన్ని పార్టీల నేతలూ గళమెత్తేలా వారి సంఘీభావాన్ని కూడగట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. 

ఢిల్లీకి లోకేశ్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి రాజమహేంద్రవరం నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులను జాతీయ స్థాయిలో లోకేశ్ వివరించనున్నారు. అలాగే చంద్రబాబు కేసు అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదులతో ఆయన చర్చించనున్నారు. అదీకాక రాష్ట్ర పరిస్థితులు, కక్ష సాధింపు రాజకీయాలపై పార్లమెంట్ల్‌లో చర్చించేలా టీడీపీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ ఎంపీలో లోకేశ్ మాట్లాడనున్నారని సమాచారం.  మరోవైపు చంద్రబాబునాయుడి అరెస్ట్ అక్రమమని.. ఈ విషయంపై జాతీయ స్థాయిలో మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో.. స్పందన వచ్చింది. చంద్రబాబును రాజకీయకక్షోనే అరెస్టు చేశారని వివిధ పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. జాతీయ మీడియా కూడా ఈ ఘటనపై విస్తృతంగా కవరేజీ ఇస్తోంది. దీంతో ఈ అంశంపై మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వాలని లోకేశ్ నిర్ణయించిన్నట్లు సమాచారం.   ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దాడులు చేసిన వారిని వదిలేసి.. బాధితులపైనే కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు  ఆరోపిస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినన్ని అరాచకాలు దేశంలో మరెక్కడా జరిగి ఉండవని.. వాటన్నింటినీ మీడియాకు వివరించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు చేసి.. తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వంటి వాటిని సోదాహరణగా చూపిస్తూ.... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందని.. దీనిపై జాతీయస్థాయిలో హైలెట్ చేయాలని నారా లోకేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.    అలాగే అదే సమయంలో.. ఏ మాత్రం ఆధారాలు లేని కేసుల్ని ప్రతిపక్ష నేతలపై ఎలా అధికార ఫ్యాన్ పార్టీ బలవంతంగా రుద్దుతుందో కూడా ఈ సందర్భంగా వివరించనున్నట్లు తెలుస్తోంది. వ్యాపార సంస్థలపై ప్రభుత్వం జరిపిన దాడులు..  మార్గదర్శి, అమరరాజా వంటి సంస్థలపై జరిగిన దాడుల గురించీ వివరించి.. రాష్ట్రంలో అరాచక పాలన గురించి నారా లోకేశ్ వివరిస్తారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నాశనం చేసిన వైనాన్ని వివరించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 73 ఏళ్ల  చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్‌లో లేకుండా... రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోకుండా..  కనీసం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  మరోవైపు కుదిరితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా లోకేశ్ కలిసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. ఏపీలో పరిస్థితుల్ని ఢిల్లీ వేదికగా అందరి ముందు ఉంచాలని నారా లోకేష్ బలంగా నిర్ణయం తీసుకున్నారని.. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ హస్తిన వెళ్లినట్లు తెలుస్తోంది.

యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు జగన్ మరణశాసనం!

ఏపీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ పట్టా చేతికి రాగానే పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెడుతున్న ఏపీ యువత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు ముందు ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే ముందుగా మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ, నాలుగేళ్లలో వాలంటీర్ ఉద్యోగాలు, గ్రామ సచివాలయంలో పోస్టులు ఇచ్చారు. అది కూడా వైసీపీ కార్యకర్తలకేనని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లు అయినా ఆ ఊసేలేదు. ఈ నాలుగేళ్ళలో ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఓ సారి జాబ్ క్యాలెండ్ ప్రకటించినా అందులో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు 50కి మించలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మూడు సార్లు డీఎస్సీ ప్రకటిస్తే ఇప్పుడు జగన్ నాలుగేళ్ళలో ఒక్కటేసారి డీఎస్సీ ప్రకటించారు. అందులో కూడా యాభై లోపే  ఉద్యోగాలను భర్తీ చేశారు.  ప్రభుత్వ ఉద్యోగాల సంగతలా ఉంటే పోనీ ప్రైవేట్ ఉద్యోగాలైనా ఉన్నాయా అంటే కొత్తగా రాష్ట్రానికి వచ్చిన ఒక్క  కంపెనీ లేదు. వేల కోట్ల పెట్టుబడులు.. వందల కంపెనీలు వచ్చాయని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. నిరంతరం కొత్త కంపెనీలను ఆహ్వానించాల్సిన మంత్రులు ప్రతిపక్షాలను వేధించేందుకు, ప్రతిపక్ష నేతలను తిట్టిపోసే పనిలో ఉంటున్నారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి అయితే.. ఉద్యోగాల గురించి అడిగితే కోడి గుడ్డు పొదగాలంటే సమయం పడుతుందని గుడ్డు సిద్దాంతాలు చెప్తున్నారు. కనీసం రాష్ట్రంలో ఉన్న కంపెనీలను తరలిపోకుండా కాపాడుతున్నారా అంటే వాళ్ళని  వాటాలు, కమిషన్ల కోసం  వేధించి అధికార పార్టీ నేతలే తరమేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కియా పరిశ్రమ ప్రతినిధులను బెదిరించడం.. దశాబ్దాలుగా చిత్తూరు జిల్లాకు తలమానికంగా అవతరించిన అమర్ రాజా బ్యాటరీస్ సంస్థను కాలుష్యం పేరిట వేధించడం, ఆ కంపెనీ ఏపీని వదిలేసి తెలంగాణకు తరలిపోవడం రాష్ట్ర ప్రజలంతా చూసినదే. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేక ప్రైవేట్ రంగంలో ఉపాధి దొరకక ఏపీ యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. కొత్త సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే భయపడే విధంగా ఏపీ పాలకులు పనిగట్టుకొని మరీ చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కూడా. సీమెన్స్, డిజైన్టెక్ సంస్థలతో ఒప్పందం ద్వారా టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల 13 వేల మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో 75 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 6 చోట్ల ఎక్స్లెన్స్ కేంద్రాలు, 36 శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చారు. అప్పుడు ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు తమకి అప్పుడు పెట్టిన ఖర్చును వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేస్తామని ముందుకు వస్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ తమ భవిష్యత్ కుఎంత ఉపయోగపడిందో చెప్తూనే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు.  యువతకి బంగారు బాటలు వేసిన స్కిల్ డెవలప్మెంట్ సంస్థను తప్పుడు సంస్థగా ముద్ర వేసిన ఈ ప్రభుత్వ నిర్ణయం విద్యార్థుల పాలిట శాపంగా పరిగణించాల్సిందే. ఇప్పటికే ప్రపంచ పారిశ్రామిక రంగం దృష్టిలో ఏపీ అంటే బ్యాడ్ నేమ్ ఉంది. ఇప్పుడు ఈ స్కిల్ స్కాం పేరుతో పూర్తిగా బ్లాక్ లిస్టులో పెట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఉద్యోగాలంటే కేవలం వాలంటీర్లు, సచివాలయాలనే చూపించే ఈ ప్రభుత్వానికి స్కిల్ డెవలప్మెంట్ లాంటి సంస్థలలో అవినీతి కనిపించడం పెద్ద విడ్డూరం కాకపోయినా దీని పర్యవసానం మాత్రం రాష్ట్రంలో యువత అనుభవించాల్సిందే. మొత్తంగా స్కిల్ స్కాం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఏపీ యువతను నట్టేట ముంచేశారని, వారి భవిష్యత్ కు మరణశాసనం లిఖించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. జూనియర్ ఉలిపికట్టె తీరు!

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో" అన్నట్టుగా ఉంది నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తీరు. "నందమూరి కుటుంబసభ్యులందరిదీ ఒక దారి.. నాది మాత్రం మరో దారి" అన్నట్టుగా ఆయన అడుగులు పడుతున్నాయి.  ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ అక్రమం అంటూ కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఎందరో తమ స్వరం వినిపిస్తున్నారు. కానీ కుటుంబసభ్యుడైన జూనియర్ మాత్రం.. తన మావయ్య చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తూ కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. నేరుగా కలవాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో స్పందించలేదేమో.. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉండి ఉంటాడు, త్వరలోనే వెళ్ళి బాబుని కలుస్తాడు అని కొందరు నందమూరి అభిమానులు సర్ది చెప్పుకున్నారు. కానీ బాబు అరెస్ట్ అసలు తనకు పట్టనట్టుగా జూనియర్ విదేశాలకు చెక్కేయడం అటు నందమూరి, ఇటు టీడీపీ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. సైమా అవార్డుల వేడుక సెప్టెంబర్ 15,16 తేదీల్లో దుబాయ్ లో జరగనుంది. ఈ వేడుక కోసం తన కుటుంబంతో కలిసి దుబాయ్ పయనమయ్యాడు తారక్. ఇప్పటిదాకా ఆయన దేవర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు అనుకున్నారంతా. కానీ ఆయన మాత్రం ఎంచక్కా దుబాయ్ వెళ్తున్నాడు. విదేశాలకు వెళ్ళే టైం ఉంది కానీ.. బాబుని, బాబు కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పే టైం లేదా?. ఆఖరికి ఇతర భాషకు చెందిన రజినీకాంత్ వంటి వారు బాబు కుటుంబానికి ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. కానీ తారక్ మాత్రం కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఎంతసేపూ తన సినిమాలు, తన అవార్డులు, తన పేరు తప్ప.. కుటుంబం సభ్యులకి ఏం జరిగినా పట్టించుకోడా అంటూ నందమూరి అభిమానులు కాస్త ఘాటగానే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.  మాట్లాడితే తాత పేరు చెప్పుకునే తారక్.. మేలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకి వెళ్లకుండా ఫ్రెండ్స్ తో కలిసి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇటీవల తన తాత పేరు మీద కేంద్రం వెండి నాణేలు విడుదల చేస్తే, ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టాడు. ముందే షూటింగ్ కి డేట్స్ ఇచ్చి ఉన్నాడేమో, తన వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి వెళ్ళలేదేమో అని అప్పుడూ అభిమానులు సర్దిచెప్పుకున్నారు. కానీ ఇప్పుడు బాబు అరెస్ట్ అయితే అసలు ఏమాత్రం పట్టనట్టు అవార్డుల ఫంక్షన్ కోసం విదేశాలకు వెళ్లిన తీరుపై మాత్రం కాస్త గట్టిగానే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పొత్తు ఖాయం.. విజయం తథ్యం.. బాబుతో ములాఖత్ అనంతరం పవన్ కల్యాణ్ ప్రకటన

ఇంత కాలం ఏపీలో పొత్తుపొడుపుల విషయంలో ఉన్న సందిగ్ధత, సస్పెన్స్ కు జనసేనాని పవన్ కల్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. స్కిల్ స్కాంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కలిసే ఉంటాయని విస్ఫష్టంగా ప్రకటించారు. రెండు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పొత్తు తన పార్టీ కోసమో, తెలుగుదేశం పార్టీ కోసమో కాదనీ, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమని చెప్పారు. జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడమే లక్ష్యమని పవన్ కల్యాణ్ ప్రకటించారు.  అసలు రాష్ట్రంలో పొత్తుల గురించిన చర్చను లేవదీసిందే పవన్ కల్యాణ్ అన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. జగన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే పవన్  కల్యాణ్ వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వనని శపథం చేశారు. ఆయన ఆ ప్రకటన చేసి చాలా కాలమైంది. అప్పటి నుంచీ రాష్ట్రంలో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది. ఒక దశలో క్షేత్ర స్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలలో పాల్గొన్నాయి. దీంతో రెండు పార్టీల మధ్యా పొత్తు ఖాయమన్న భావనే సర్వత్రా వ్యక్తం అయ్యింది. దీనిపై వైసీపీ పలు మార్లు విమర్శలు గుప్పించింది. దమ్ముంటే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలంటూ.. పవన్ కల్యాణ్ కు సవాళ్లు విసిరింది. సింహం సింగిల్ గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయంటూ రజనీకాంత్ సినిమాలోని పంచ్ డైలాగులతో ఎద్దేవా చేసింది. అయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్న మాటకే పవన్ కల్యాణ్ కట్టుబడి ఉన్నారు. అదే సమయంలో ఇప్పటికే ఆయన బీజేపీ మిత్రపక్షంగా ఉండటంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2014 ఎన్నికల నాటి పరిస్థితే 2024లోనూ పునరావృతమౌతుందంటూ విశ్లేషణలు సాగాయి.  అయితే తెలుగుదేశం కూటమితో బీజేపీ చేతులు కలుపుతుందా అన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కోసమే ఇప్పటి వరకూ పొత్తుపై ప్రతిష్ఠంభన కొనసాగుతూ వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు తరువాత జనసేనాని వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. అరెస్టును ఖండించడం.. హుటాహుటిన బెజవాడ బయలుదేరడం, ఆయన స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్ కు అధకారులు అనుమతి నిరాకరించడం, అయినా తగ్గకుండా ముందుకు సాగడం, పోలీసులు అడ్డుకుంటే రోడ్డుపైనే పడుకోవడం ద్వారా అన ఆగ్రహాన్ని ప్రస్ఫుటంగా చాటారు. సరే ఇప్పుడు రాజమహేంద్రవరం జైలులో ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిసిన తరువాత బీజేపీ విషయం పక్కన పెట్టేసి జనసేన తెలుగుదేశం పొత్తు గ్యారంటీ అని విస్ఫష్టంగా ప్రకటించేశారు. దీంతో ఇక ఏపీలో  జనసేన తెలుగుదేశంతో కలిసి సాగుతుందన్న విషయం స్పష్టమైపోయింది. ఇక తేలాల్సింది సీట్ల పంపకం. ఇరు పార్టీల మధ్యా గతంలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు జరిగాయనీ, మూడు నాలుగు స్థానాల విషయంలో ఒకింత ప్రతిష్ఠంభన ఉన్నా దాదాపుగా పాతిక స్థానాల వరకూ జనసేన పోటీ చేస్తుందన్న విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందనీ  వార్తలు వచ్చాయి.  ఇక ఇప్పడు బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. జనసేనాని పొత్తు ప్రకటనతో ఇక బీజేపీకి ఒక వేళ తెలుగుదేశం, బీజేపీ కూటమితో జట్టుకట్టినా  సీట్ల విషయంలో  బార్గెయినింగ్ కెపాసిటీ ఏ మాత్రం ఉండదు. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఒకే ఒక్క కారణం తప్పితే.. ఏపీలో ఆ పార్టీకి స్టేక్ లేదు. ఎంతగా లెక్కలు చూసుకున్నా రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఒక శాతం కంటే తక్కువే. అలాంటి పార్టీ కోసం తెలుగుదేశం, జనసేనలు పాకులాడతాయని భావించజాలం. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పర్యటనలకు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే జనసేనాని వారాహి యాత్ర సైతం బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిది. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగితే అధికార వైసీపీ పుట్టి మునగడం ఖాయమన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వేళ బీజేపీ ఈ కూటమిలో చేరినా.. అది ఈ కూటమికి ఏమాత్రం లబ్ధి చేకూర్చదు సరికదా? భారంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఇప్పుడు పొత్తు విషయంలో జనసేనాని బీజేపీ విషయం ఎత్తకుండా ప్రకటించేయడంతో రాష్ట్రంలో బీజేపీ ఒక చర్చించాల్సిన పార్టీగా, ఆ పార్టీ ఎటు అన్నది పెద్దగా ప్రాముఖ్యత లేని అంశంగా మారిపోయిందని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పొత్తులు ఖాయం అన్నది తేలిపోయిన తరువాత చర్చ అంతా ఈ రెండు పార్టీల మధ్యా సీట్ల పంపకం గురించే. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే జనసేన, తెలుగుదేశం మద్య సీట్ల సర్దుబాటు విషయంలో ఒక ప్రాథమిక అవగాహన కుదిరిందని అంటున్నారు.  2019 ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగిందనడంలో సందేహం లేదు.  ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి. జనసేన బలం ఎంతగా పెరిగినా ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు సాధించగలుగుతుంది అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇప్పటికీ కష్టమే. ఆ పార్టీ పెరిగిన బలానికి అనుగుణంగా సీట్లు వస్తాయా అన్న విషయంలో పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం జరిగిందని చెప్పలేం. అయితే తెలుగుదేశం విషయం అలా కాదు.  ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన తొలి నుంచీ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి  గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేపట్టారు. శిక్షణ శిబిరాలు నిర్వహించి, సభ్యత్వాలు నమోదుపైనా దృష్టి సారించారు. ఆ తరువాత పార్టీలో చంద్రబాబు కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్‌ చేశారు. శిక్షణ శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ లేకపోయినా, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటానికి అదే కారణం.  అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు బలంగా చాటుకుని, స్థిరంగా నిలిచింది. ఏపీలో జగన్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడానికి అవసరమైన శక్తి, బలం, బలగం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం  మాత్రమే.   వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్   తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉందని ప్రకటించి జగన్ ఓటమిని దాదాపు ఖాయం చేసేశారనే చెప్పాలి. అయితే పొత్తులో భాగంగా జనసేన గౌరవప్రదమైన భాగస్వామ్యం అంటున్నది. అంటే ఎన్ని స్థానాలలో ఆ పార్టీకి పోటీ చేసే అవకాశం దక్కితే గౌరవ ప్రదం అన్న సంశయం అయితే పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సీట్ల సర్దుబాటుపై ప్రథమికంగా వచ్చిన అవగాహన మేరకు జనసేన పాతిక నుంచి ముఫ్ఫై సీట్లలో పోటీ చేస్తుందని, సీట్ల పంపకంలో పీటముడి పడకుండా పొత్తుకు ఢోకా లేకుండా ఉండేందుకు ఇరు పార్టీలూ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చాయని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది.  ఇక పాతిక ముప్ఫై స్ధానాలకు జనసేనకు కేటాయించే విధంగా ఇరు పార్టీల మధ్యా అవగాహన కుదిరినట్లేనని కూడా అంటున్నారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరడం వెనుక కూడా సీట్ల పంపకం విషయంలో ఇరు పార్టీల మధ్యా ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే అని చెబుతున్నారు.   ఇక ఇటీవలి సర్వేలలో కూడా తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు వైసీపీ ఓటమికి రాచబాట పరిచినట్లేనని వెల్లడైన నేపథ్యంలో జనసేనాని పొత్తుపై విస్ఫష్ట ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన వాస్తవ బలం ఆధారంగా సీట్ల సర్దుబాటు ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ మౌనం..తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆగ్రహం

తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై రాష్ట్రంలో నిరసన జ్వాలలు రగులుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంలో తదుపరి ఏం జరగనుందన్న ఉత్కంఠ  సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే ఈ అక్రమ అరెస్టుపై దేశవ్యాప్తంగా  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జాతీయ నేతలు సైతం ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫారుక్‌ అబ్దుల్లా, శిరోమణి అకాళీదళ్‌ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ డిప్యుటీ సీఎం, ఎంపీ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా వంటి సీనియర్‌ నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ముందు ముందు మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపే ఛాన్స్ కనిపిస్తున్నది. అలాగే పలువురు జాతీయ నేతలు చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు రాజమహేంద్రవరం వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన, ప్రకంపనలు సృష్టిస్తున్న చంద్రబాబు అరెస్టుపై సాటి తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ నుండి కూడా   వివిధ పార్టీల నేతలు కూడా స్పందిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు. సీనియర్ నేతలు వీహెచ్ లాంటి వారైతే చంద్రబాబు లాంటి నాయకుడిని అరెస్టు చేయడం ఏపీలో పరిస్థితులకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అయితే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చంద్రబాబు అరెస్టుపై తీవ్ర విమర్శలు చేశారు. సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిని కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు. మరో తెలంగాణ బీజేపీ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కూడా చంద్రబాబు అరెస్టును తప్పు బట్టారు. అర్ధరాత్రి వేళ అరెస్టులకు తెగబడడం ఏమిటని ప్రశ్నిచారు. పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుపై నేతలు మండిపడుతున్నారు. అయితే  జాతీయ స్థాయిలో నేతల నుండి చంద్రబాబు అక్రమ అరెస్టుపై స్పందన వస్తున్నా తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మాత్రం ఇప్పటి వరకూ పన్నెత్తి మాట్లాడలేదు.  స్పందించలేదు. వారి మౌనమే ఇప్పుడు రాజకీయ వర్గాలలో  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన అనంతరం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కూడా జాతీయ స్థాయి నేతలే. దేశ రాజకీయాలపై కూడా స్పందించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. అందునా ఏపీలో కూడా బీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నది. ఏపీలో బీఆర్ఎస్ క్రీయాశీలంగా ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. ఆ రాష్ట్రంలో ఏపీ బీఆర్ఎస్ శాఖఉంది. రాష్ట్ర కార్యాలయం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్నారు.  ఇలాంటి తరుణంలో ఏపీలో ఇంతటి బర్నింగ్ ఇష్యు నడుస్తున్న వేళ, అందునా తెలంగాణ పాలిట కల్పతరువుగా మారిన హైదరాబాద్ నగర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించిన చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం తెలంగాణలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ సర్కిల్ లో  ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున బాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఐయామ్ విత్ బాబు అన్న ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చారు. వారంతా స్వచ్ఛందంగా ఆందోళన బాట పట్టారు. ఇప్పటి దాకా ఉద్యోగులు తమ వేతనాల గురించో, ఇతర సమస్యల గురించే ఆందోళనలకు దిగడం చూశాం. కానీ ఐటీ ఉద్యోగులు తమ జీవితాలలో ఐటీ వెలుగులు నింపిన వ్యక్తి పట్ల కృతజ్ణతతో, ఆయన అక్రమ అరెస్టు పట్ల ఆవేదనతో బయటకు రావడం బహుశా ఇదే మొదటి సారి. ఇక కూకట్‌పల్లిలో చంద్రబాబు మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌ను కేసీఆర్‌, కేటీఆర్‌ ఖండించకపోవడం పట్ల వీరంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అప్రజాస్వామిక అరెస్ట్పై హైదరాబాద్ సెటిలర్స్ భగ్గుమంటున్నారు. చంద్రబాబు అరెస్ట్పై  తెలంగాణ పౌరహక్కుల సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ అభిమానులు నిరసనల్లో పాల్గొని అటు ఏపీ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ నేతలపై కూడా మండిపడుతున్నారు. అయినా కేసీఆర్, కేటీఆర్ నుండి ఎలాంటి స్పందన లేదు. జగన్ మోహన్ రెడ్డితో మైత్రి కారణంగానే కేసీఆర్ అండ్ కో ఈ అంశంపై స్పందించడం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్, కేసీఆర్ ఒక్కటేనని.. ఇద్దరూ చంద్రబాబును ఉమ్మడి శత్రువుగానే చూస్తున్నారని.. అందుకే ఈ అక్రమ అరెస్టును ఖండించడం లేదని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.

కళ్ళ ముందున్న సాక్ష్యాలు కనిపించవా?

అబద్ధం చెప్పినా అతికి నట్లుండాలి, అలాగే అబద్ధాలు చెప్పే వారికి జ్ణాపకశక్తీ ఎక్కువ ఉండాలి కానీ  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు దడి కట్టినట్లు కూడా లేవు.. సర్కార్ జ్ణాపక శక్తి కూడా అంతంత మాత్రమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో లేని అవినీతిని చూపించేందుకు అబద్ధాల కట్టుకధలు అల్లుతోంది. పచ్చి అబద్ధాలను పక్కా నిజాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. నిజానికి, నిజంగా అవినీతి జరిగినా జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోక పోవును, కానీ, ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అన్నది అసలు ప్రశ్నే కాదు. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని  ఏదో విధంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపాలి, అందుకోసమే జగన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్  స్కాం ను తెరపైకి తెచ్చింది. ఆ ఒక్క  పాపపు ఆలోచనతో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ఆయన బృందం కట్టు కథలు అల్లుతోంది.కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలను కప్పి పెట్టి కట్టుకధలతో అబద్ధాలను నిజం చేసే విఫల ప్రయత్నం చేస్తున్నది.  నిజానికి, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు అదే పనిలో ఉన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలుగు దేశం పార్టీ నాయకులు, క్యాడర్ ను వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎందరో  తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. చివరకు తెలుగు దేశం ఓటర్లపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.  ప్రజా వేదిక కూల్చి వేతతో పరిపాలనకు శ్రీకారం చుట్టిన జగన్ రెడ్డి అప్పటి నుంచే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు ప్రారంభించారు. ఇందులో ఏమీ రహస్యం లేదు. ఇది  జగన్ ఎరిగిన సత్యం.  అప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబ సభ్యులను, సన్నిహితులను  ఏదో విధంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం సాగిస్తూనే ఉన్నారు. అప్పటి నుంచే జగన్ రెడ్డి చంద్రుడిపై మచ్చలు వెతికే ప్రయత్నం సాగితున్నారు. అయితే గడచిన నాలుగున్నరేళ్ళుగా ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసేందుకు చేసిన కుట్ర పూరిత ప్రయత్నాలు బూమరాంగ్  అయ్యాయి. న్యాయ స్థానాల ముందు జగన్ రెడ్డి ‘స్కిల్స్’ పని చేయలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో  చంద్రబాబు నాయుడిపై అవినీతి బురద చల్లి  బద్నాం చేసేందుకు విఫల ప్రయత్నం చేసిన అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎదురైన అనుభవమే,  జగన్ రెడ్డికీ ఎదురైంది.  అందుకే  అధికారం ఆఖరి క్షణాలకు చేరుకున్న సమయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరిగిన మంచిని మరుగు పరిచి కుట్రపూరితంగా అవినీతి బురద చల్లేందుకు, తద్వారా చంద్రబాబు నాయుడు పై కక్ష తీర్చుకునే అకృత్యానికి  తెగబడింది. కళ్ల ముందు అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నా.. వాటిని పరిశీలించకుండా చంద్రబాబును ఇరికించడమే లక్ష్యంగా కుట్రకు తెరలేపింది.  ఇక్కడే జగన్ రెడ్డి ప్రభుత్వ జ్ణాపక శక్తి ఎంత ఘనంగా ఉందో ప్రపంచానికి తేటతెల్లమైంది కూడా. స్కిల్ డెవలప్ మెంట్ లో ఏపీ నంబర్ వన్ అంటూ ఆ చంద్రబాబు దూరదృష్టి కారణంగా దక్కిన ఫలాలను మీడియాలో జగన్ రెడ్డి ప్రభుత్వమే ప్రకటనలు విడుదల చేసింది. స్కిల్  డెవలప్ మెంట్ ప్రాజెక్టు అద్భుత ఫలితాలను ఇచ్చిందని ప్రపంచానికి చాటింది.  ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయిన జనగ్ రెడ్డి సర్కార్ ఇప్పుడు తాను నాడు ఘనంగా ప్రకటనల రూపంలో ప్రచారం చేసిన స్కిల్ ఘనతను చెరిపివేయడానికి శతథా ప్రయత్నించి నవ్వుల పాలు అవుతోంది. ఇక విషయానికి వస్తే.. విద్యార్థులు, నిరుద్యోగుల భవితకు బాటలు వేసే స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు పెద్ద స్కామ్‌ అని, దానికి సూత్రధారి చంద్రబాబే అని జగన్‌ సర్కారు విషం చిమ్ముతోంది.  ప్రభుత్వ నిధులు రూ.370 కోట్లు దుర్వినియోగమయ్యాయని, అవన్నీ షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరాయని గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ చేసిన ఆరోపణలనే ఇప్పుడు సీఐడీ కూడా అచేస్తోంది.  చంద్రబాబు నాయుడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపింది. అయితే అదే నిజమైతే, ఇంజనీరింగ్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు, నైపుణ్యాభివృద్ధి ఇన్‌స్టిట్యూట్లు ఎలా ఏర్పాటు చేశారు?  372 అత్యాధునిక సాంకేతిక ల్యాబ్‌లు స్థాపించడం, 3,37,869 మందికి శిక్షణ ఇవ్వడం, 2,394 జాబ్‌మేళాలతో  85,711 మందికి ఉద్యోగాలు కల్పించడం వాస్తవం కాదా?  స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వెబ్‌సైట్‌ చూస్తే ఈ విషయాలు తెలుస్తాయి కదా. ప్రాజెక్టులో కీలకమైన మౌలిక వనరులు, ల్యాబ్‌లు, నెట్‌వర్క్‌ కేంద్రాలను పరిశీలించకుండానే ప్రభుత్వం ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించింది. వాస్తవాలను దాచిపెడుతోంది. అయితే  ఇవేవీ దాచేస్తే దాగే సత్యాలు కాదు. ఎందుకంటే, ఈరోజుకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలలో శిక్షణ కొనసాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు.  85,711 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో 35వేలమంది విద్యార్థులు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాలు సాధించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2016-17 నుంచి 2019 వరకు 64,444 మందికి ఉద్యోగాలు వచ్చాయి. జగన్‌ సర్కారు వచ్చాక మూడున్నరేళ్లలో 21,267 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వీరిలోనూ గత ప్రభుత్వ కాలంలో (2019-20)లో శిక్షణ పొందినవారు 15,372 మంది ఉన్నారు. అంటే సీమెన్స్‌ ప్రాజెక్టు కార్యకలాపాలు, శిక్షణ ఫలితం కళ్లముందు కనిపిస్తోంది. ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శాఖ అధికారిక వెట్‌సైట్‌లో ఈ వివరాలను నిర్ధారించుకోవచ్చు. సంవత్సరాల వారీగా అందులో సవివరమైన గణాంకాలు ఉన్నాయి.అయితే  ఇవేవీ, జగన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియవా? అంటే తెలుసు. ఇది నిలిచే కేసు కాదని జగన్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు. అయినా  అబద్ధాలు, అసత్య ప్రచారంతో అందరినే నమ్మించ వచ్చనే, మొండి వైఖరీ,  మూర్ఖపు ఆలోచన, అహంకారంతో ప్రభుత్వం చంద్రబాబు అరెస్ట్ చేసింది . జైలుకు పంపింది . కానీ, అందరినీ అన్ని వేళలా మోసం చేయడం, మోసాలలో పుట్టి మోసాలలో పెరిగిన  వారికైనా సాధ్యమయ్యే పని కాదు.అందుకు మూల్యం చెల్లించక తప్పుదు.

బీఆర్ఎస్ రహస్య బంధం.. బీజేపీతోనా.. కాంగ్రెస్ తోనా?

తెలంగాణ రాజకీయాల్లో ఒక చిత్రమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు   అధికార బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం, అక్రమ సంబంధం ఉందని ఒకరిపై ఒకరు ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అధికార బీఆర్ఎస్ రహస్య మిత్రులెవరు? అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. అలాగే  రేపటి ఎన్నికల్లో జరగరానిది జరిగి  హంగ్ అసెంబ్లీ అనివార్యమై ఏ రెండు పార్టీలు చేతులు కలుపుతాయి? అనే ప్రశ్న కూడా చక్కర్లు కొడుతోంది.  కాంగ్రెస్, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ నాయకులు చాలావరకు, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఆ రెండు పార్టీల మధ్యా లోపాయికారీ ఒప్పందం ఉందనే  ప్రచారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. ఆరెండు పార్టీల మధ్య పొత్తు ఉంది కాబట్టే లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితను అరెస్ట్ చేయలేదని, కాళేశ్వరం అవినీతిపై బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులు ఆరోపణలు చేయడమే కానీ విచారణ జరగడం లేదని ఆరెండు పార్టీల మధ్య రహస్య పొత్తుకు ఇంతకంటే ఇంకేమి, ఆధారం కావాలని  ప్రశ్నిస్తున్నారు.  మరో వంక అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన  కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటి సీనియర్ నాయకులు కొందరు రేపు ఎన్నికల అనంతరం అవసరం అయితే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బహిరంగంగానే ప్రకటించారు. అంతే కాదు పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఆయన వర్గానికి చెందిన కొందరు నాయకులు కాంగ్రెస్ లో కేసీఆర్  కోవర్ట్లులున్నారని బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. జగ్గా రెడ్డి వంటి కొందరు సీనియర్లు ఇదే విషయంగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. అదే విధంగా పీసీసి మాజీ  చీఫ్, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి సైతం కోవర్డ్ కామెంట్స్  పై తీవ్రంగా స్పందించారు.  అంతే కాదు  రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే, కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేల..ఫిరాయింపులు ఆపలేమని, అది అయ్యే పని కాదని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బహిరంగంగా అంగీకరించారు. ఒక విధంగా ఆయన ముందుగానే చేతులు ఎత్తేసారు. అంతే కానీ, అధికారంలోకి రాకున్నా  ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తామని చెప్పలేక పోతున్నారు. అంతకు  మించి  నడుస్తున్న చరిత్రను చూసినా తెలంగాణ రాష్టం ఏర్పడిన అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మూడొంతుల మంది, బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అదలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసే 25 నుంచి 30 మంది అభ్యర్ధులకు బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. టికెట్ కు అప్లై చేసేందుకు, చెల్లించిన రూ.50 వేల ఫీజు మొదలు, టికెట్ కొనుక్కునేందుకు అవసరమైన, సొమ్ములు,ఎన్నికల ఖర్చులు పూర్తిగా భరించడంతో పాటు గెలిచినా, ఓడినా వారి రాజకీయ భవిష్యత్ కు బీఆర్ఎస్ హామీ ఇస్తోందని అంటున్నారు. అలాగే  కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్ధుల మంచి చెడులు, ఆర్థిక అవసరాలు చూసేందుకు  బీఆర్ఎస్ ఒక ప్రత్యేక వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని, ఆ బాధ్యతలను కొందరు  కీలక నేతలకు అప్పగించిందని ప్రచారం జరుగుతోంది. అలాగే అటు నుంచి, బీఆర్ ఎస్ చెన్నూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ చీఫ్ విప్ బాల్కసుమన్, కాంగ్రెస్ లోనూ మన వాళ్ళే ఉన్నారు.  వాళ్ళు మన వాళ్ళే ... మనమే కావాలని మన వాళ్ళు కొంత మందిని కాంగ్రెస్ లోకి పంపించాము .. ఆ కాంగ్రెస్ నాయకులు కూడాఎన్నికల తర్వాత మన పార్టీలోకి వస్తారు. గతంలో చెన్నూర్’ నుచి పోటీ చేసిన ఎంపీ వెంకటేష్ మన పార్టీలోకి వచ్చారు.ఇప్పడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా రేపు మన పార్టీలోకే వస్తారు  అంటూ బహిరంగ ఉపన్యాసమే చేశారు. అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కల్వకుట్ల కవిత సైతం కొందరు కాంగ్రెస్ నాయకులను పొగడ్తలతో ముంచెత్తుతున్నట్లు వార్తలొచ్చాయి.  అంతే కాదు  బీఆర్ఎస్ తన రెండు దశాబ్దాల   ప్రస్థానంలో అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది. అందుకు ఒకే ఒక్క మినహయింపు బీజేపీ. ఈ 20 ఏళ్ళు పైబడిన ప్రస్థానంలో బీఆర్ఎస్. ఏ ఒక్క ఎన్నికల్లోనూ బీజేపీతో పొట్టు పెట్టుకోలేదు. అలాగే రాష్ట్రం ఏర్పడిన అనంతరం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు సహా  అన్ని పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ మళ్ళీ ఒకే ఒక్క మినహాయింపు బీజేపీ .. 2014లో  బీజేపీ టికెట్’పై ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక్కరూ పార్టీ మారలేదు. 2018లో ఒక్కరే గెలిచినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో ఇద్దరు తోడైనా .. పార్టీ మారలేదు.   మరో వంక, రాజకీయ విశ్లేషకులు కూడా ఏ విధంగా చూసినా, అవసరం అయితే  బీఆర్ఎస్ , కాంగ్రెస్ తో జట్టు కడుతుందే కానీ, బీజేపీతో కలవదని, అంటున్నారు.

ఇక జనంలోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆగ్రహ జ్వాలలతో రాష్ట్రం రగిలిపోతున్నాది. చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా  యువగళం పాదయాత్రకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రేక్ ఇచ్చారు. అయితేచంద్రబాబు కుటుంబం జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు అక్రమ అరెస్టును, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజలలోకి మరింతగా తీసుకువెళ్లేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుంది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ఇక జనంలోకి రానున్నారు. జగన్ ప్రభుత్వ అరాచక పాలనను, అక్రమ అరెస్టులు కేసులతో రాష్ట్రంలో భయానకవాతావరణం సృష్టిస్తున్న తీరునూ ప్రజలలో ఎండగట్టే ఉద్దేశంతో వీరిరువురూ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ పాదయాత్రకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు తెలుగుదేశం ముఖ్య నాయకులతో రాజామహేంద్రవరంలో నారా లోకేష్ భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇక భువనేశ్వరి, బ్రాహ్మణి పాదయాత్రపై గురువారం (సెప్టెంబర్ 14) సాయంత్రానికి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ లోగా లోకేష్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో భేటీ అనంతరం నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు. లోకేష్ తో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. కాగా ఇప్పటికే నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబును జగన్ సర్కార్ వేధిస్తున్న తీరును ప్రజల కళ్లకు కట్టినట్లు తెలియజేశారు. రెండు రోజుల కిందట జైల్లో చంద్రబాబును భువనేశ్వరి బ్రాహ్మణి కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడిన భువనేశ్వరి ఏమీ లేని ఒక కేసులో చంద్రబాబును ఇరికించి.. జైల్లో ఆయన కట్టించిన భవనంలోనే కట్టి పారేశారనీ, ఎటువంటి సౌకర్యాలూ లేవనీ, ఆయన భద్రతపై కూడా తన ఆందోళన ఉందనీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా భువనేశ్వరి జైలు నుంచి బయటకు వస్తుంటే తనలో ఒక భాగాన్ని అక్కడే వదిలేసినట్లు ఉందని అనడం అందరినీ కదిలించింది. ఆ తరువాత కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ సందర్భంగా సీఐడీ కౌంటర్ కు సమయం కోరడంతో చంద్రబాబు అరెస్టును సమర్ధించుకునేలా ఒక్క ఆధారం కూడా సీఐడీ వద్ద లేదన్న సంగతి సర్వులకూ అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి, బ్రహ్మణిలు పాదయాత్ర చేయాలని, జనంలో మమేకమై జగన్ సర్కార్ దురాగతాలను, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలలో ఎండగట్టాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అదీ కాక భువనేశ్వరి తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎక్కడకూ పోదనీ, జనంతోనే ఉంటుందనీ, తన భర్త జనం కోసమే తపిస్తున్నారనీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, కష్టాలు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తారని చెప్పడమే కాదు.. చంద్రబాబు భార్యగా, ఎన్టీఆర్ కుమార్తెగా మీకు హామీ ఇస్తున్నాను అని కూడా చెప్పారు. ఆ మేరకే ఇప్పుడు ఆమె జనంలోకి రావడానికి సంసిద్ధమయ్యారు అని పరిశీలకులు చెబుతున్నారు.  

స్కిల్ త్రైపాక్షిక ఒప్పందమేనని సీఐడీ చీఫ్ ఒప్పుకోలు.. తడబాటుతో నవ్వుల పాలు!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టుకు ఒక్క ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. న్యాయ నిపుణులు చంద్రబాబును ఏపీ సర్కార్ అరెస్టు చేసిన తీరుపై దిగ్భ్రమ వ్యక్తం చేస్తున్నారు. సమస్త విలువలకూ తిలోదకాలిచ్చి.. అరెస్టు చేయడమే లక్ష్యం అన్నట్లుగా నమోదు చేసిన కేసులు, కోర్టులో వాదనలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలలో ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి వీఆర్ విత్ సీబీఎన్ అంటూ ఆందోళన బాట పట్టారు. జాతీయ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా నేతలంతా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ గురువారం (సెప్టెంబర్ 14) రాజమహేంద్రవరం వచ్చి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆయనతో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఉన్నారు. ఇక రోజు రోజుకూ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు, నిరసనలూ జోరందుకుంటున్నాయి. చంద్రబాబు తన అరెస్టుపై దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయడానికి సీఐడీ సమయం కోరడాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు. అసలు ఎందుకు అరెస్టు చేశారో, నిబంధనలు ఏమిటో, నమోదు చేసిన సెక్షన్లు ఏమిటో తెలియకుండానే అరెస్టు చేసి ఇప్పుడు సమర్ధించుకోవడానికి దారి లేక వాయిదాలు కోరుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ సీఐడీ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందనీ, అడ్డగోలు అరెస్టులు కేసులతో వైసీపీ వ్యతిరేకులను, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలను విమర్శిస్తున్న వారిని వేధించడానికే పరిమితమైందన్న విమర్శలను ఎదుర్కొంటున్నది. కోర్టులు కూడా పలు సందర్భాలలో సీఐడీ తీరును తప్పుపట్టాయి. అయినా అధికార వైసీపీ అగ్రనేతల కనుసన్నలలో పని చేయడానికి అలవాటు పడిపోయిన సీఐడీ తీరు మారడం లేదు. చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా నిబంధనలకు తిలోదకాలిచ్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరి వాంగ్మూలం ఆధారంగా అయితే చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ చెబుతోందో ఆ మాజీ ఐఏఎస్ అధికారే సీఐడీ ప్రకటనను తప్పుపట్టారు. ఇక టెక్ డిజైన్ సంస్థ తాము స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు పరికరాలు అందించామనీ, సీమెన్స్ తో కలిసి అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఎటువంటి అవకతవకలూ లేవని ఆ సంస్థ ఎండీ కుండబద్దలు కొట్టారు. ఇక సకల శాఖల మంత్రి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీమెన్స్ కు అసలు స్కిల్ తో సంబంధం లేదని చెప్పడాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి ఆధారాలతో సహా ఎండగట్టారు. అయినా వైసీపీ సర్కార్ మాత్రం పాత పాటనే పాడుతోంది. ఆధారాలు చూపమంటే దాట వేస్తూ.. సీఐడీ ఆరోపణలనే పదేపదే చెబుతూ గొబెల్స్ ప్రచారం చేస్తున్నది. అయితే తెలుగుదేశం నాయకులు ఆధారాలతో సహా బయటపెడుతుండటంతో ప్రజలకు వాస్తవం బోధపడి స్వచ్ఛందంగా చంద్రబాబుకు సంఘీభావంగా రోడ్లపైకి వస్తున్నారు. ఇంతకీ అసలు స్కిల్ కేసుతో సీమెన్స్ కు సంబంధం లేదంటూ సజ్జల వంటి వారు, వారి మాటలకు వంత పాడుతున్నట్లుగా సీఐడీ   సిమెన్స్ పేరును అడ్డగోలుగా తెలుగుదేశం వాడేస్తోందనీ, ఆ ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ సంస్థే చెప్పిందంటూ సజ్జల మాటలనే సీఐడీ చెబుతోంది. ఇందుకు సంబంధించి వైసీపీ అనుకూల మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వారుస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ స్కిల్ ప్రాజెక్టుతో సీమెన్స్ కు సంబంధం లేదన్నది ఆ వార్తల సారాంశం, సీఐడీ కూడా అదే చెబుతూ వస్తోంది.  కానీ కోర్టులలో తమ అసంబద్ధ వాదన నిలవదు, అసలు వాస్తవం బయటపడుతుందన్న భయమో ఏమో కానీ.. సీఐడీ చీఫ్ మీడియా సమావేశంలో  అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్ సంస్థతోనే   ఒప్పందం కుదుర్చుకుందని, ఆ సంస్థకు రూ. 58 కోట్లు అందాయని అంగీకరించారు. తమ ఆరా అంతా మిగిలిన సొమ్ముగురించేనంటూ చెప్పుకువచ్చారు.  ఇప్పటి వరకూ అసలు సీమెన్స్ కు సంబంధం లేదని వాదిస్తూ వచ్చిన సీఐడీ ఇప్పుడు టెక్ డిజన్ సంస్థలా సీమెన్స్ కూడా మీడియా ముందుకు వస్తుందోమోనన్న భయంతో  మాట మారుస్తోంది. అసలు స్కిల్ డెవలమ్ మెంట్ సెంటర్లు పని చేయలేదని చూపేందుకు  చంద్రబాబు అరెస్టు తరువాత వాటికి తాళాలు వేస్తోంది. మొత్తం మీద గుడ్డ కాల్చి ముఖాన వేసి ఆ మసి మీరే తుడుచుకోవాలన్నట్లు జగన్ సర్కార్, ఏపీ సీఐడీ తీరు ఉంది. అయితే స్వాష్ పిటిషన్ తో వైసీపీ సర్కార్ కుట్రలన్నీ తేటతెల్లం అయ్యాయి. కౌంటర్ కు వారం గడువు అడగడంతోనే సీఐడీ వద్ద ఈ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క ఆధారం లేదని తేటతెల్లమైపోయిందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇక సీఐడీ కస్టడీ పిటిషన్ పై విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఏసీబీ కోర్టును ఆదేశించడంతో.. సీఐడీ  అక్రమంగానే చంద్రబాబు విషయంలో వ్యవహరించిందన్నది రుజువైపోయినట్లేనని న్యాయనిపుణులు అంటున్నారు. మరో వారం పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉంటే ఉండొచ్చు కానీ ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడి పులుకడిగిన ముత్యంలా  తిరిగి వస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.