బీజేపీ.. రజినీకాంత్.. ఓ డైలీ సీరియల్!

మీరిస్తానంటే నేనొద్దంటానా"అంటున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇంతకీ ఎవరు ఇస్తానంటున్నారు? ఏం ఇస్తానంటున్నారు? అనేగా మీ డౌట్. ఇంకెవరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. రజినీని ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించాలని చూస్తోందట. ఈ విషయంపై రజినీ స్పందించలేదు కానీ, ఆయన సోదరుడు సత్యనారాయణ మాత్రం "దేవుడు శాసిస్తాడు, మా అన్నయ్య పాటిస్తాడు" అన్నట్టుగా.. "పదవుల కోసం పాకులాడరు.. పదవి వస్తే మాత్రం తిరస్కరించరు" అంటూ గవర్నర్ పదవి తీసుకోవడం ఇష్టమేనని తన మాటనే రజినీ మాటగా చెప్పేశారు. కానీ ఫైనల్ గా రజినీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే. సినిమాల్లో రజినీకాంత్ దారి రహదారే కానీ.. రాజకీయాల్లో మాత్రం గతుకుల రోడ్డే. సినిమాల్లో జస్ట్ అలా స్టైల్ గా నడిచి ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఆయన.. రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి మాత్రం ధైర్యం చెయ్యట్లేదు. ఇదిగో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. వచ్చేస్తున్నా అంటూ 2017 నుంచి ఊరించారు రజినీ.  2020 లో అయితే.. రేపు లేకుంటే ఎల్లుండే పార్టీ ప్రకటన అంటూ నెలకోసారి హడావుడి జరిగింది.  అలా ఊరించి ఊరించి చివరికి అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అంటూ రాజకీయ ప్రవేశం చేయకుండానే ఆ అంశానికి, అంకానికి శుభం కార్డు వేశారు సూపర్ స్టార్. తాజాగా గవర్నర్ పదవి వార్తలతో దాని సీక్వెల్ కథ మొదలైంది. రజినీకాంత్ ముందు నుంచి బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. బీజేపీకి కూడా సౌత్ లో సూపర్ స్టార్ లాంటి బ్రాండ్ కావాలి. అందుకేనేమో గవర్నర్ పదవి ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ పదవి వల్ల రజినీకి కొత్తగా ఒరిగేదేమి లేదు. ఈ ఐదేళ్ల పదవి కంటే కూడా ఆయనకు జనాల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. అయితే రజినీకి గవర్నర్ పదవి ఇచ్చి, తమవాడు అనిపించుకోవడం వల్ల బీజేపీకి బోలెడంత లాభముంది. తమిళనాడులో బీజేపీ ఒక్కసారిగా పుంజుకునే అవకాశముంది. అప్పుడు డీఎంకే ని ఢీ కొట్టే పార్టీ బీజేపీనే అవుతుంది. ఇదంతా జరగాలంటే రజినీపై అధికారికంగా కమలం ముద్ర పడాలి.  ఇటీవలి కాలంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంలతో రజనీ భేటీ కావడం గమనిస్తే,  బీజేపీ పదవి ఇస్తే ఆయన తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఆయన మనసు ఎప్పుడైనా మారొచ్చు. రాజకీయాల్లోకి రావాలని చూసి దానిని నాంచి నాంచి చేతులెత్తేశారు. ఇప్పుడు గవర్నర్ గిరీ విషయంలో కూడా.. ఎక్కడ కొన్ని వర్గాలకు దూరం అవుతానోనన్న భయంతో నాంచి నాంచి చివరికి సైడ్ అయిపోయే అవకాశముంది.

తారస్థాయికి చేరిన ప్రజా వ్యతిరేకత.. డిఫెన్స్‌లో జగన్?!

మాది పేదల ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలన్నదే మా ఎజెండా. ఇందుకోసం ఎలాంటి మధ్య వర్తులూ లేకుండా, ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా, రాజకీయాలకు అతీతంగా తమ పథకాలు ప్రజలకు చేరాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇదీ జగన్మోహన్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చెప్పిన మాట. ఇందుకోసం వైసీపీ ప్రభుత్వం ఎంచుకున్న విధానమే నవరత్నాలు. నవరత్నాలలో సంక్షేమంతో పాటు మరికొన్ని అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. అయితే, మిగతా హామీలను పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరిట బటన్ నొక్కి ఖాతాలలోకి నగదు బదిలీ చేయడం మొదలు పెట్టింది. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ లాంటి పేదవాడికి అక్కరకు వచ్చే పథకాలను కూడా కాదని కేవలం బటన్ బటన్ నొక్కుడు కార్యక్రమానికే జగన్ పరిమితమయ్యారు.  ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం దాదాపు రూ. 2.30 లక్షల కోట్ల నగదును  బటన్ నొక్కుడు ద్వారా  బదిలీ చేసింది. అయినా ప్రజలలో అసంతృప్తి తారస్థాయికి చేరింది. సంక్షేమం పేరిట పంచిన దాని కంటే మూడింతలు ఎక్కువగా ప్రజల నుండి పన్నుల రూపంలో ముక్కు పిండి వసూలు చేయడం, అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి ప్రజల కొనుగోలు శక్తి నశించిపోయినా.. ప్రతి వస్తువు కొనుగోలులో పన్ను  పోటు ప్రజలలో అసంతృప్తిని  పెంచేసింది.  నిజానికి గత ప్రభుత్వంతో పోలిస్తే జగన్ సర్కార్  సంక్షేమానికి ఖర్చు చేసిన నిధులు ఎక్కువేం కాదు. గతంలో రకరకాల మార్గాల ద్వారా ప్రజలకు చేర్చిన నగదును ఇప్పుడు బటన్ నొక్కి ప్రజల ఖాతాలకు చేర్చారు. కానీ గత ప్రభుత్వానికి మించి పన్నుల బాదుడు,  ఉపాధి అవకాశాల క్షీణత ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చి పెట్టింది. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలకు ఏదో ఒక రూపంలో ఫలాలు అందించినా తమ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత లేదని అధికార పార్టీ ఇప్పుడు తెగ ఆందోళన చెందుతోంది. తలకి ఇంత లెక్కన ప్రజల ఖాతాలలోనే జమ చేసినా ప్రజలలో వ్యతిరేకత పెరుగిపోతుండడం ఇప్పుడు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.  ప్రజలలో ఏ వర్గాన్ని కదిలించినా అసహనం.. ఏ నోట విన్నా  అసంతృప్తి.. ఆగ్రహం, ఎవర్ని కదిలించినా కన్నీటి కష్టాలే. ప్రభుత్వం అంత చేశాం.. ఇంత చేశాం అని చెప్తున్నా ప్రజలలో మాత్రం ప్రభుత్వంపై ఏ మాత్రం సానుకూలత కానరావడం లేదు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. ఈసారి మళ్ళీ తమదే అధికారమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా వైసీపీ నేతలు  మనోవేదనకు గురవుతున్నట్లు కనిపిస్తున్నది.  ఇప్పటికే కొన్ని సర్వే ఫలితాలు ప్రజలలోని ఈ అసంతృప్తిని బహిర్గతం చేసి గణాంకాలతో సహా  జగన్ పార్టీ పరాజయం అనివార్యం అంటూ తేల్చేశాయి.. దీంతో వైసీపీ, మరీ ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకత, అసంతృప్తిపై డిఫెన్స్ లో పడిపోయినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్ల పాటు అభివృద్ధి, ఇన్ఫ్రా స్ట్రక్చర్, ప్రజల అవసరాలను అన్నీ వదిలేసి.. కేవలం బటన్ నొక్కడం.. తిరిగి పన్నుల పేరిట అంతకంత ముక్కుపిండి వసూలు చేయడంతో ప్రజలు విసిగి వేసారిపోయినట్టు నిర్ధారణ చేసుకున్న జగన్ ఇప్పుడు మరోసారి విజయం కోసం ఏం చేయాలన్నది తెలియక తల బద్దలు కొట్టుకుంటున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.   కడుపు మండిన పేదవాడిని నమ్మించి మరో సారి బుట్టలో వేసుకోవడానికి ఏం చేయాలో  తెలియని పరిస్థితుల్లో జగన్, వైసీపీ వ్యూహకర్తలు ఉన్నారంటున్నారు.  జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో సగటు ప్రజల ఆదాయాలు పెరగకపోగా.. ఏటేటా ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకవైపు కేంద్రం బాదుతుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అంతకు మించి  బాదుడే బాదుడు అంటూ ప్రజలను కుంగదీసింది. తమ జీవన స్థితిగతులు నానాటికీ దిగజారుతుండటంతో జగన్ సర్కార్ పై ప్రజలలో తీవ్ర అసహనం కనిపిస్తోంది. ఆ అసహనమే ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

విశాఖ జైల్లో మొద్దు ‘సీన్’?!

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా  2019 ఎన్నికల ముందు   అప్పటి  ప్రతిపక్షనేత   జగన్‌పై కోడికత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ.. దాదాపు నాలుగున్నరేళ్లుగా జైల్లో ఉన్న కోడికత్తి శ్రీను ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే ఓచర్చ పోలిటికల్ సర్కిల్‌‌లో సాగుతోంది.  కోడి కత్తి దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ కుమారుడిని బెయిల్‌పై విడిపించాలంటూ కొడికత్తి శ్రీను తల్లిదండ్రులు ఇప్పటికే పలుమార్లు   జగన్ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొన్నారు.  అలాగే ఈ అంశంపై సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి   వారు స్వయంగా వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ విషయాలన్నిటిపైనా రాజకీయ పరిశీలకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. బాధితుడిగా కోర్టుకు హాజరు కావడానికి జగన్ ఎందుకు ఇష్టపడటం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.  మరోవైపు.. కోడికత్తి శ్రీను కూడా మొద్దు శ్రీనులాగానే హత్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య చేసిన మొద్దు శ్రీను..  ఆ తర్వాత అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తూ... అదే  జైల్లో ఉన్న ఓం ప్రకాశ్ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి రాజకీయ వర్గాల చర్చల్లో  ప్రస్తావనకు వస్తోంది. అదే తరహాలో కోడికత్తి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనపల్లి శ్రీను  సైతం జైల్లోనే హత్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం ఆ చర్చల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు బుధవారం(సెప్టెంబర్ 6)  విశాఖపట్నం కోర్టు వద్ద ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు   జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని చెప్పిన రోజు.. వైసీపీ నేతలు తప్పించి మరెవరూ  ప్రత్యక్ష సాక్షులుగా (ఐ విట్నెస్‌లు) లేరని,  అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్, సెక్యూరిటీ అధికారులు.. తాము ఈ దాడిని చూడలేదని చెప్పారన్నారు.   ఆయితే ఆ రోజు కోడికత్తి బొత్స సత్యనారాయణ సమీప బంధువు మజ్జి శ్రీను వద్ద మాత్రమే ఉందని... ఏపీ పోలీసుల మీద నమ్మకం  లేదంటూ మందుగా కోడికత్తి సమర్పించలేదన్నారు. ఈ కేసులో కర్మ కర్త క్రియా అన్నీ మజ్జి శ్రీనివాసేనని కోడికత్తి శ్రీను తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆ సమయంలో మజ్జి శ్రీను.. తన పోనును పోలీసులు అడిగితే.. ఎందుకు డిపాజిట్ చేయలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఉద్దేశపూర్వకంగానే జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనుపై కేసుపెట్టారన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని.. వాటిని సమయం వచ్చినప్పుడు బయట పెడతానని అబ్దుల్ సలీం స్పష్టం చేశారు.   హరీశ్ సాల్వే వివాహానికి హాజరయ్యేందుకు లండన్ కు వెళ్లే తీరిక ఉన్న జగన్ కు.. కోడికత్తి కేసులో బాధితుడిగా విశాఖకు వచ్చే పాటి తీరిక లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. ఒక ఎస్సీ యువకుడు నాలుగున్నరేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నా? తనపైనా దాడి జరిగిందని స్వయంగా ఫిర్యాదు చేసి పట్టుబట్టి మరీ  ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్న జగన్ బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకుండా ఉండటం ఎంత మాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు.  జగన్ పై కోడికత్తి దాడి జరిగినప్పుడు జనుపల్లి శ్రీనివాస్ ఫుడ్ కోర్టులో అనుమతితోనే పని చేస్తున్నాడని అయితే ఆ రోజు  ఐదుగురు వైసీపీ నేతలు పాస్‌లు లేకుండానే  విమానాశ్రయంలోకి ప్రవేశించిన విషయాన్ని కోర్టు ముందుంచామని చెప్పారు.  అలాగే కోడికత్తి దాడి జరిగిన రోజు.. పోలీస్ స్ట్రైకింగ్ ఫోర్స్ జీపుపై  దాడి చేసిన వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.   2023 ఆగస్ట్ వరకు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి దాడి కేసు విచారణ జరిగింది. ఇటీవలే  ఆ కేసును విశాఖకు బదిలీ చేశారు. ఆ క్రమంలో కోడికత్తి శీను  ఇన్నాళ్లు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి  ప్రతీ వాయిదాకు  విశాఖకు తీసుకు రావడం కష్టమన్న ఉద్దేశంతో అతడిని  విశాఖ సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టును ఎన్ఐఏ  అభ్యర్థనను కోర్టు అంగీకరించడంతో . కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంకోవైపు.. విశాఖ సెంట్రల్ జైల్లో ఇటీవల మత్తు పదార్థాల కలకలం సృష్టించిన విషయం విదితమే.  కోడికత్తి కేసు ఏళ్ల తరబడి ముందుకు సాగకపోవడం ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైయస్ జగన్ కోర్టుకు హాజరు కాకపోవడం చూస్తుంటే.. పరిటాల రవి హత్య కేసులో జరిగిన విధంగానే  మొద్దు శ్రీను సీను విశాఖ జైల్లో రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.  

తెలంగాణ బీజేపీ ఎవరికి వారే యమునా తీరే తీరు!

ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడ లేకపోతున్నారా? అసలు ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కమలం గూటికి చేరినప్పుడే ఆయన గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోయారు.  ఆ పార్టీలో ఆయన ఎక్కువకాలం ఇమడలేరని జోస్యాలు చెప్పారు. అసలు వామపక్ష భావజాలం ఉన్న ఈటల చేరితే కాంగ్రెస్ లో చేరాలి.. అందుకు భిన్నంగా బీజేపీలో  ఎందుకు చేరారన్న సందేహాలు అప్పట్లోనే రాజకీయ వర్గాలలో, పరిశీలకులలో వ్యక్తం అయ్యాయి.   అయితే ఇప్పటి దాకా బీజేపీలో ఉక్కపోతకు గురైనా ఈటల మాత్రం సంయమనంతో సర్దుకుని ఉన్నారు. బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తో విభేదాలను రచ్చ చేయకుండా అధిష్ఠానంతో మాట్లాడుకుని చక్కదిద్దుకున్నారు. అసలు బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం వెనుక ఈటలను సంతృప్తి పరిచే ఉద్దేశమే ఉందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు చేశారు. సరే బండి సంజయ్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో చేరికల కమిటీని ఏర్పాటు చేసిన బీజేపీ ఆ కమిటీకి చైర్మన్ గా ఈటలను నియమించింది. ఈటల ఆధ్వర్యంలో  బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయనీ... ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయనీ అంతా ఆశించారు. అదలా ఉంటే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల నియామకానికి ముందు పార్టీలో ఈటలకు చాలా చాలా అవమానాలు ఎదురయ్యాయని చెబుతారు.  కానీ ఈటల బీజేపీలో చేరిన క్షణం నుంచి రాష్ట్రంలో ఆ పార్టీ నిర్వహించిన అన్ని కార్యక్రమాలలోనూ భాగస్వామిని చేయడం, అమిత్ షా, మోడీ వంటి అగ్రనేతల సభలలో కూడా వేదికపై ఆసనం ఇవ్వడంతో  ఈటలకు బీజేపీలో ఉక్కపోత అన్న వార్తలు వదంతులేనా అన్న భావన కూడా సర్వత్రా కలిగింది.   అయితే బండితో విభేదాలు ఉన్నప్పటికీ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీలో ఈటల గౌరవానికి ఎటువంటి భంగం వాటిల్లలేదు. కానీ కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత మాత్రం ఉద్దేశ పూర్వకంగా ఈటలను తక్కువ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని ఈటల సన్నిహితులు అంటున్నారు.  ముఖ్యంగా చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న తాను పార్టీలోకి చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగడాన్ని ఈటల సహించలేకపోతున్నారని అంటున్నారు. తాజాగా మాజీ మంత్రి కృష్ణయాదవ్  పార్టీలో చేరిక చివరి క్షణంలో ఆగిపోవడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కారణమని అంటున్నారు. దీనితో ఈటల ఇక పార్టీలోకి చేరికల విషయంలో ఎటువంటి ప్రయత్నాలూ చేయడం లేదని అంటున్నారు. అలాగే.. ఈటల ద్వారా పార్టీలోకి స్పష్టమైన హామీతో చేరిన తుల ఉమ వంటి వారికి పోటీగా ఇతరులను తీసుకురావడం వంటి ఘటనలతో ఈటల పార్టీ వ్యవహారాలలో పెద్దగా పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అదే విధంగా అమిత్ షా ఇటీవల ఖమ్మం వచ్చారు. ఆ సభావేదికపై బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరికలు ఉంటాయన్న ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ నేతలతో తన సంబంధాలను ఉపయోగించుకుని అక్కడ అసంతృప్తులను ఈటల బీజేపీలో చేరుస్తారని బీజేపీ హైకమాండ్ కూడా భావించింది. అయితే ఈటల మాత్రం తాను పార్టీలోకి తీసుకువచ్చిన వారికీ, తన ద్వారా వద్దామనుకున్న వారికీ వెల్ కమ్ అంతంత మాత్రంగా ఉండటంతో చేరికల విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోవడం లేదని బీజేపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే ఈటల అసంతృప్తిని పార్టీ హైకమాండ్ కూడా లైట్ గా తీసుకుంటోందనీ అంటున్నారు.  దీంతో బీజేపీ తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారిపోయింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఎవరికి వారు తమ వర్గం పైచేయిగా ఉంటే చాలన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో తెలంగాణ బీజేపీ పరిస్థితు మూడు గ్రూపులూ ఆరు వర్గాలు అన్నట్లుగా తయారైంది.

గురువంటే గూగులే.. ఉపాధ్యాయులు ఎందుకు.. విద్యాశాఖ మాజీ మంత్రి పాండిత్యం!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.. సెప్టెంబర్ 5వ తేదీన ఒంగోలులో నిర్వహించిన గురుపూజోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్లొన్నారు. ఈ సందర్బంగా ఆయన  బైజూస్‌తో టెక్నాలజీ అంతా ట్యాబ్‌ల్లో వచ్చిందని.. గురువులు బదులు ఇప్పుడు గూగుల్ వచ్చిందన్నారు. గురువులకు తెలియనివి కూడా గూగుల్‌లో కొడితే తెలిసిపోతుందని చెప్పారు. ఇంకా కాస్త ముందుకెళ్లి గూగుల్ వచ్చిన తర్వాత గురువుల అవసరం లేదంటూ మంత్రి సురేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువుల్లో కంటే గూగుల్‌లో మెటిరియల్ ఎక్కువగా లభిస్తుందంటూ ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలు అటు మీడియలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్  అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యాలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. మంత్రి సురేశ్ వ్యాఖ్యలు అర్థరహితం.. అసంబద్దమని వారు  కొట్టిపారేస్తున్నారు. అసలు ఆయన గురుపూజోత్సవ కార్యక్రమంలో గురువులను సన్మానించారో? లేక అవమనించారో? ముందుగా ఆయన తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచంలో ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం ఇంతవరకు ఎక్కడా ఏదీ లేదని వారు వివరిస్తున్నారు. సాంకేతికత అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం గురువులతో బోధనలు జరుగుతున్నాయని.. ఈ విషయాన్ని మంత్రిగారు గమనించాలంటూ.. ఉపాద్యాయ సంఘాల నేతలు మంత్రిగారికి హితవు పలుకుతున్నారు.  మరోవైపు మంత్రి సురేశ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జగన్ తొలి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పదవి వెలగబెట్టారని.. ఆ సమయంలో ఈ మంత్రి పుంగవులకి గురువు కంటే గూగుల్‌లోనే ఎక్కువ మెటిరియల్ దొరుకుతుందని తెలిసి ఉంటుందని  చురకలంటిస్తున్నారు. అయినా పెద్ద చదువులు చదువుకొని.... సెంట్రల్ సర్వీస్‌లో ఉద్యోగం చేసిన సురేష్   గురువుకి గూగుల్‌కి మధ్య తేడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటే.. ఆయన జ్ణానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటున్నారు.    జగన్ తొలి కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా.. జగన్ మలి కేబినెట్‌లో మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రిగా ఉన్నఆదిమూలపు సురేష్ కు గురు పూజోత్సవంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో  తెలియనంత అజ్ణానం గూడుకట్టుకుందని అంటున్నారు. అయినా జగన్ తొలి, మలి కేబినెట్‌లో మంత్రి పదవులు తారుమారు అయినా.. బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌లు ఇద్దరు ఇద్దరేనని.. వీరిరువురూ కూడా సింగిల్ పీస్  డైమండ్ లనీ నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి  జగన్‌కి ఇలాంటి వాళ్లే కావాలని.. అందుకే వీరిద్దరు.. జగన్ తొలి, మలి కేబినెట్‌లలో  కొనసాగుతున్నారని అంటున్నారు.  అదీకాక...  మన పెద్దలు గురు బ్రహ్మ, గురు విష్ణు,  గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ  తస్మై శ్రీ గురువే నమ: అని అన్నారని..  కానీ అదే మీరైతే.. గూగుల్ బ్రహ్మ, గూగుల్ విష్ణు, గూగుల్ దేవో మహేశ్వరహ గూగుల్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గూగులే నమ: అని అన్నా అంటారని నెటిజన్లు..  మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తమదైన శైలిలో చురకలంటిస్తున్నారు.  ఇక మాతృదేవో భవ.. పితృ దేవో భవ.. ఆచార్య దేవో భవ అని మన పూర్వికులు అన్నారని.. అదే మీరైతే.. ఆచార్య దేవో భవాకు బదులు గూగుల్ దేవో అన్న అనగల   సమర్థులని నెటిజన్లు ఆదిమూలపు సురేష్ ను ఓ ఆటాడుకుంటున్నారు. 

వారానికి మూడు రోజులు విశాఖలోనే జగన్?.. దసరాకి గృహ ప్రవేశం!

ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటి?.. ఏమో మన ఏపీకి కూడా మూడు రాజధానులు వస్తాయేమో. ఇదీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ 2019లో చేసిన ప్రకటన. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డే ఈ విషయాన్ని ముందు బయటపెట్టగా.. ఆ తర్వాత మిగతా వైసీపీ నేతలు ప్రజల చెవులలో ఊదరగొట్టారు. అయితే ప్రభుత్వం ఇది ప్రకటించి నాలుగేళ్లు అయ్యింది. మూడు రాజధానులు లేవు. ఉన్న అప్పటి వరకూ ఉన్న ఒక్క రాజధాని అమరావతిలో కొత్తగా ఒక్క ఇటుక పెట్టింది లేదు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికీ మా నినాదం మూడు రాజధానులే. అందులో పరిపాలన విశాఖ నుండే అన్నది వైసీపీ నేతల వాదన. అయితే, ప్రస్తుతం ఈ అంశం కోర్టుల పరిధిలో ఉండగా అక్కడ విచారణ పూర్తయ్యేసరికి ఈ ప్రభుత్వానికి ఉన్న ఐదేళ్ల గడువూ పూర్తయిపోతుంది.  అందుకే అనధికారికంగా అయినా విశాఖ నుండి పరిపాలన చేసి తన పరువు కాపాడుకోవాలని సీఎం జగన్ ఆరాటపడుతున్నారు. జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేశారు. అమరావతి రైతులు ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకురావడం, విపక్షాల తీవ్ర వ్యతిరేకత, కోర్టులలో పిటిషన్ల దాఖలు చేయడంతో కోర్టులు అమరావతి రాజధానికే అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి.  హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లగా అక్కడ కూడా వ్యతిరేక తీర్పు వస్తుందనే ఆలోచనతో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నారు కూడా. అయితే  సుప్రీం కోర్టులో వ్యవహారం మాత్రం ఇంకా విచారణ దశలోనే ఉంది. గతంలో ప్రభుత్వం అమరావతి రైతుల నుండి భూములను తీసుకున్న సమయంలో చేసుకున్న ఒప్పందాలను బట్టి చూస్తే ఈ అంశంలో ఇప్పటి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఈ విషయం ఇప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. కానీ, తాము చెప్పినట్లుగా విశాఖను పరిపాలన రాజధాని చేయాలి. అధికారికంగా ఎలాగూ వీలు పడదు కనుక కనీసం అనధికారికంగా విశాఖ నుండి పరిపాలన చేసి పరువు నిలుపుకోవాలన్నది సీఎం జగన్ ఆరాటం. ఇందుకోసమే విశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. రుషికొండపై కట్టడాల నిర్మాణం గురించి ఆంధ్ర ప్రజానీకం మొత్తానికి తెలిసిందే. పర్యాటక భవనాల పేరిట ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు పరిపాలన భవనాలని ముందుగా వైసీపీ అధికారికంగా ప్రకటించి తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఇది కాకుండా విశాఖ నగరంలో కూడా మరో చోట సీఎం నివాసానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సీఎం నగరానికి వస్తున్నారని పలుచోట్ల త్వరితగతిన అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నారు. ఇవి నాసిరకంగా ఉంటున్నాయన్న విమర్శలు కూడా ఇప్పటికే వినపడుతున్నాయి. కాగా  జగన్ విశాఖ నుండి పరిపాలనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తున్నది. ఈ దసరాకి సీఎం విశాఖ నుండి పరిపాలన మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి సమాచారం వస్తున్నది. ఇప్పటికే విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ హోదాను పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా ఐజీ ర్యాంక్ హోదాలో ఉన్న విశాఖ కమిషనరేట్ ని అడిషనల్ డీజీ హోదాకు అప్ గ్రేడ్ చేశారు. ఈ మేరకు హోం శాఖ   ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇదంతా జగన్ ఇక్కడ నుండే  పాలన సాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగమేనని చెప్పొచ్చు. ఇక  రుషికొండ వద్ద కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఒకటి మంచి వ్యూ పాయింట్ తో ఉన్నదానిలో సీఎం జగన్ నివాసం ఉండనున్నట్లు తెలుస్తుంది. అలాగే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సంబంధించిన ఒక భవనంలో క్యాంప్ కార్యాలయాన్ని  ఏర్పాటు చేసుకోనున్నట్లు చెప్తున్నారు. ఈ దసరా ముహూర్తాలలో ఈ రెండు భవనాలకు సీఎం దంపతులు గృహ ప్రవేశం చేయనుండగా..  దాదాపుగా వైసీపీ పార్టీ వ్యవహారాలను కూడా విశాఖ కేంద్రంగా నడిపించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వారానికి మూడు రోజుల పాటు విశాఖ నుండి జగన్ పరిపాలన సాగిస్తారని..  సోమవారం నుండి బుధవారం వరకూ జగన్ విశాఖలోనే ఉండనున్నారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. దసరా తర్వాత మూడు రోజులు విశాఖ, నాలుగు రోజులు తాడేపల్లిలో జగన్ అందుబాటులో ఉండనున్నట్లు చెప్తున్నారు.  మరి ఇది ఎంత వరకు వాస్తవ రూపం దాలుస్తుందో చూడాల్సి ఉంది.

ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు.. సంకటంలో ఇండియా కూటమి

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిథి స్టాలిన్ చేసిన ఒక ప్రకటన దేశ వ్యాప్తంగా ఇచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని భగ్నం చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కూమటి భాగస్వామ్య పక్షంలోని పార్టీకి చెందిన మంత్రి అన్న కారణంతో ఉదయనిథి స్టాలిన్  వ్యాక్యలు సమర్థిస్తే ఒక తంటా.. ఖండిస్తే మరో తంటా అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. పోనీ ఎటువంటి స్పందనా లేకుండా వదిలేద్దామా అంటే అదీ కుదిరే పని కాదు. ఆయన మొత్తంగా హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న భావన ప్రజలలో బలంగా ఏర్పడే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సంఘ్ పరివార్ పార్టీలూ, హిందుత్వ వాదులూ బలంగా ప్రచారం చేస్తున్నారు. అన్నిటికీ మించి సనాతన ధర్మాన్ని కరోనా వంటి మహమ్మారితో పోల్చడం ద్వారా ఉదయనిథి స్టాలిన్  దేశంలోని మెజారిటీ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్న భావన మెజారిటీ ప్రజలలో వ్యక్తం అవుతున్నది.   అన్నిటికీ మించి ఉదయనిథి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ హ్యాట్రిక్ అనుమానం అన్నట్లుగా మారిన బీజేపీ అధికార ఆశలకు ఊపిరులూదిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధానిగా మోడీ వైఫల్యాల మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఉదయనిథి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఆ చర్చను పక్కదారి పట్టించడమే కాకుండా హిందుత్వే వచ్చే సార్వత్రిక ఎన్నికల అజెండాగా మార్చేశాయని అంటున్నారు.  ఇక సంఘ్ పరివార్ ఉదయనిథి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ ఈ వివాదాన్ని రగులుస్తూనే ఉంటుందని చెబుతున్నారు.  ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ కు ఇప్పటి వరకూ కనిపిస్తున్న సానుకూలత మాయమైపోయి ప్రమాదం కనిపిస్తోందనీ, ఇప్పుడ కాంగ్రెస్ హిందు వ్యతిరేకం కాదన్నది రుజువు చేసుకోవాల్సిన అనివార్యతను తెచ్చి పెట్టిందని అంటున్నారు. ఏది ఏమైనా సనాతన ధర్మంపై ఎన్నికల వేళ ఉదయనిథి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆయాచిత బ్రహ్మాస్త్రంగా లభించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి బలోపేతానికి కూడా ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు గండి కొట్టినట్లేనని చెబుతున్నారు.  ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకుంటే విపక్ష పార్టీలు ఇండియా కూటమితో కొనసాగలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఉదయనిథి వ్యాఖ్యలను విస్మరించి డీఎంకే ఉన్న ఇండియా కూటమిలో కొనసాగితే.. కూటమిలోని భాగస్వామ్య పక్షాల ఉనికే ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తూ  కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం.. ఇలా ఒకటేమిటి కాంగ్రెస్ సహా ఇండియా భాగస్వామ్య పార్టీలన్నీ సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండించాయి. ఉదయనిథి స్టాలిన్ మాటలతో ఏకీభవించడం లేదని ప్రకటించాయి. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కీలక నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇంతవరకూ స్పందించపోవడాన్ని బీజేపీ ఎత్తి చూపుతూ ఈ విషయంలో గాంధీ ద్వయం వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నది.  కాంగ్రెస్ పార్టీ ఆది నుంచీ సెక్యులరిజం ముసుగులో హిందూత్వకు వ్యతిరేకంగానే పని చేస్తున్నదంటూ హిందూ సంఘాలు విమర్వలు గుప్పిస్తున్నాయి.  దీనిని బట్టే ఉదయనిథి స్టాలిన్ సతానత ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఏ స్థాయిలో ఇరుకున పడేశాయో అర్ధం చేసుకోవచ్చు.  ఈ విషయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు మరెన్నో రోజులు మౌనంగా ఉండే అవకాశం లేదు. వారి మౌనం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చక తప్పదు. సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమ స్టాండ్ ఏమిటన్నది ఎటువంటి శశబిషలకూ తావు లేకుండా సోనియా రాహుల్ లు నోరు విప్పక తప్పని  పరిస్థితి. ఏది ఏమైనా సనాతన ధర్మంపై ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నిస్సందేహంగా బీజేపీ వ్యతిరేక  కూటమి ఐక్యతపై ప్రభావం చూపకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

జమిలి సాధ్యాసాధ్యాలు.. లాభ నష్టాలు.. ఒక పరిశీలన!

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 22 వరకూ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న నూతన పార్లమెంటు భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. నూతన పార్లమెంటు భవనంలో6 పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగడం ఒక విశేషమే కానీ.. ఈ ప్రత్యేక సమావేశాలలో అజెండా ఏమిటన్నదానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ విపక్షాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో ఏ ఎంజెండా ఉండాలని భావిస్తున్నాయో తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ సంగతి పక్కన పెడితే ఎలాంటి ఎజెండా ప్రకటించకుండా కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు తేదీలు ప్రకటించేయడం దేశ వ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది. కేంద్రం ముఖ్యంగా మూడు అంశాలు టార్గెట్ గా ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాటిలో ప్రధానంగా జమిలి ఎన్నికలు, ఇండియా పేరును ఎరాడికేట్ చేసి ఇక నుంచి అన్ని భాషలలోనూ దేశాన్ని భారత్ అని మాత్రమే సంబోధించాలన్న తీర్మానం చేయడం, మహిళా బిల్లు అని చెబుతున్నారు. వీటిలో మహిళా బిల్లు విషయంలో కేంద్రానికి పెద్ద పట్టింపు ఉందని ఎవరూ భావించడం లేదు. కానీ జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు విషయాలను కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు, వాటి విషయంలో తన పంతం నెగ్గించుకోవాలన్న పట్టుదలను కూడా ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు.    ముఖ్యంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది గత ఐదేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక నినాదంగా ప్రచారంలోకి తీసుకు వచ్చింది. వాస్తవానికి జమిలి ఎన్నికలు అన్నది ఏదో కొత్తగా మోడీ సర్కార్ మెదడులోంచి పుట్టుకొచ్చిన వినూత్న ఆలోచనేం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి రెండు సార్వత్రిక ఎన్నికలూ జమిలి ఎన్నికలే. అప్పట్లో పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకే సారి ఎన్నికలు జరిగాయి. అయితే ఆ తరువాతే కేంద్రంలోనో, రాష్ట్రాలలోనో తలెత్తిన రాజకీయ పరిణామాల కారణంగా మధ్యంతర ఎన్నికలు అనివార్యం కావడంతో జమిలి ఎన్నికలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచీ రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికలూ, ఆ తరువాత పార్లమెంటు గడువు మిగిసిన తరువాత పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడం రివాజుగా మారిపోయింది. అంటే ఆచరణలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ, పార్లమెంటుకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమన్న సంగతి పదే పదే రుజువైంది. కానీ కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం జమిలి ఎన్నికల వల్ల పలు ప్రయోజనాలున్నాయనీ గత ఐదేళ్లుగా ప్రచారం చేస్తూనే ఉంది. వాటి నిర్వహణ కోసం చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. మోడీ సర్కార్ జమిలి వల్ల ప్రయోజనాలు అంటూ చెబుతున్న అంశాలు కూడా కొత్తవేమీ కాదు. ప్రజాధనం వృధాను అరికట్టడం, శాంతి భద్రతల సమస్య తలెత్తకపోవడం, అన్నిటికీ మించి ఏడాది పొడవునా ఎన్నికలు జరిగే పరిస్థితిని నివారించడం తద్వారా.. ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగే పరిస్థితి ఏర్పడుతుందన్నది మోడీ సర్కార్ వాదన. ఇందుకోసం ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాల అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ   నివేదికను ఈ పార్లమెంటు ప్రత్యేక  సమావేశాలలోనే చర్చించి నిర్ణయం తీసుకునే దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తున్నది.   కాగా మోడీ సర్కార్ జమిలి వల్ల ప్రయోజనాలను ఏకరవు పెడుతుంటే.. నిపుణులు జమిలి కారణంగా ఎదురయ్యే నష్టాలను వివరిస్తున్నారు. జమిలి ఎన్నికల వల్ల జాతీయ సమస్యలు, ప్రాంతీయ సమస్యలూ  ఓవర్ ల్యాప్ అవుతాయని... ఓటర్ కన్ఫ్యూజ్ అవుతారనీ, అన్నిటికీ మించి ప్రాంతీయ పార్టీల ఉనికికి, మనుగడకు జమిలి ఎన్నికలు తీరని నష్టం చేకూరుస్తాయనీ వివరిస్తున్నారు.   దేశంలో  3800 పైగా ఉన్న ఎమ్మెల్యే స్థానాల ఎన్నికలు ప్రధానంగా స్థానిక అంశాల పైన ఆధారపడి ఉంటాయి. దానికి విరుద్ధంగా 543 ఎంపీ స్థానాల లోక్ సభ ఎన్నికల ప్రక్రియ దేశ పరిస్థితులు పైన  ఆధారపడి ఉంటాయి. ఈ రెండు ఎన్నికలు అలాగే స్థానిక ఎన్నికలు ఒకేసారి జరపడం ద్వారా అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా   అయోమయంలో పడే పరిస్థితి లేకపోలేదని అంటున్నారు. అన్నిటికీ మించి జమిలి ఎన్నికల వల్ల రాష్ట్రాల ప్రాధాన్యతాంశాలు మరుగున పడిపోతాయనీ, దీని వల్ల కేంద్ర లబ్ధి పొందడమే కాకుండా.. ఫెడరల్ స్ఫూర్తికి భంగం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఇప్పటికే కేంద్రంలోని మోడీ సర్కార్ చాలా వరకూ రాష్ట్రాల అధికారాలను తగ్గించేసిందనీ, ముఖ్యంగా ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఉద్యోగుల నియామకాలు కూడా కేంద్రం అధీనంలోకి తెచ్చేసుకుందనీ, జమిలి ఎన్నికల ఆచరణలోకి వస్తే మిగిలిన రాష్ట్రాల పరిస్థితి కూడా అంతే అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  

తెలంగాణలో కాంగ్రెస్ సానుకూలతను ప్రతికూలంగా మార్చుకుంటోందా?

తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు రంగం సిద్ధమైందా? 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వలె చివరి నిముషంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా వాతావరణం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయా? వైఎస్ ఇమేజ్ అంటూ షర్మిలను పార్టీలోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ తప్పులో కాలేస్తోందా? వైఎస్సార్టీపీ విలీనం కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఉన్న సానుకూలతను ప్రతికూలతగా మార్చేస్తుందా, రాష్ట్రంలో మరోసారి ఉద్యమకాలం నాటి పరిస్థితి ఏర్పడేందుకు దోహదం చేస్తుందా? అంటే పరిశీలకులు ఆ అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.   ఆంధ్రా మూలాలున్న లీడర్లు ఇక్కడ రాజకీయంగా యాక్టివ్​ కావడం,  వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కాంగ్రెస్​ సీనియర్​ నేత కేవీపీ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్​ పెట్టిన నేపథ్యంలో ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ గా మారిన తరువాత ఇక తెలంగాణ సెంటిమెంట్ అధికార పార్టీకి ఇసుమంతైనా దోహదపడే అవకాశాలు లేవని అంతా భావించారు. అయితే తెలంగాణ రాజకీయాలలో ఏపీ ప్రాంతానికి చెందిన నేతలు చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తుండటంతో  బీఆర్ఎస్ కు వాతావరణం అనుకూలంగా మారుతోందా అన్న అనుమానాలను పరీశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ మరో సారి దెబ్బతినడం ఖాయమన్న విశ్లేషణలు చేస్తున్నారు.    2014లో జరిగిన  ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్​ బలంగా పనిచేసింది. అయితే ఆ పరిస్థితి   2018  ఎన్నికల సమయంలో పెద్దగా కనిపించలేదు. అప్పుడు నాటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎన్నికల అజెండాగా అంతా భావించారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు  చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ కలిసి తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా కూటమి కట్టారో..అభివృద్ధి, సంక్షేమం అజెండాలు పక్కకు పోయి తెలంగాణ సెంటిమెంట్ బలంగా పని చేసింది. తెలుగుదేశం  అధినేత   చంద్రబాబు  తెలంగాణ  ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తిగానే జనం చూశారు. ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీనే కాదు.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఆ ఎన్నికలలో తిరస్కరించారు.  ఎంత లేదన్న కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు కాురుణంగా 2018 ఎన్నికలలో పాతిక నుంచి ముప్ఫై స్ధానాలలో కాంగ్రెస్​ దెబ్బతిని పరాజయం పాలైందని అప్పట్లో కాంగ్రెస్ నాయకులే బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. పొత్తు లేకుండా నాటి ఎన్నికలలో కాంగ్రెస్ కచ్చితంగా మరో పాతిక నుంచి ముప్ఫై స్థానాలలో విజయం సాధించి ఉండేదనీ, అప్పుడు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు పెద్దగా స్పందన ఉండి ఉండేది కాదనీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు.   ఏతా వాతా అప్పుడూ, ఇప్పుడూ కూడా కాంగ్రెస్ చెప్పేదేంటంటే అప్పట్లో తాము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని నష్టపోయామని.  తాము చంద్రబాబు వల్ల నష్టపోయాయని అప్పట్లో పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా అంగీకరించిన సంగతి కూడా తెలిసిందే.అయితే ఐదేళ్లు గడిచిపోవచ్చాయి. మళ్లీ రాష్ట్రంలో ఎన్నికల సమయం వచ్చేసింది. కాంగ్రెస్ కు వాతావరణం సానుకూలంగా ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ మరో సారి షర్మిల పార్టీ విలీనం అంటూ ఆ సానుకూలతను ప్రతికూలంగా మార్చుకునే దిశగా ఆడుగులు వేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏపీ నుంచి ఎవరైనా రాష్ట్రానికి రావాలంటే వీసా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గతంలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఇప్పటికీ మరచిపోలేదు. అటువంటి నాయకుడి కుమార్తె  షర్మిలను తెలంగాణ సమాజం అంగీకరించి ఆదరించే పరిస్థితులు ఇప్పటికీ లేవు.  అందుకే  షర్మిల  వైఎస్సార్టీపీ పేర తెలంగాణలో రాజకీయంగా ఎదుగుదామని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు   తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3,600 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేసినా, ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను మించి  ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించినా..   జనం నమ్మలేదు. తెలంగాణలో ఆమె కానీ, ఆమె పార్టీ కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఈ పరిస్థితుల్లో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ ఆయ్యారు. కాంగ్రెస్ కూడా రెడ్ కార్పెట్ పరిచి వెల్ కమ్ చెబుతున్నట్లుగానే కనిపిస్తోంది.  టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకించినా,  వీహెచ్ వంటి సీనియర్ నేతలు అభ్యంతరం చెప్పినా కాంగ్రెస్ హై కమాండ్ ఖాతరు చేస్తున్నట్లు కనిపించదు.  షర్మిల పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసుకుని ఆమెను తెలంగాణ రాజకీయాలకు దూరం పెట్టినా పెద్దగా ప్రయోజనం అయితే ఉండే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమె ఏపీ రాజకీయాలలో చూపే ప్రభావం కూడా అంతంత మాత్రమేననీ, వైఎస్ ఇమేజ్ పేరిట ఆమె ఏపీ రాజకీయాలలో అక్కడి అధికార జగన్ పార్టీకి ఒకింత నష్టం చేకూరిస్తే చేకూర్చవచ్చు కానీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేంతగా ప్రభావితం చేయలేరనీ అంటున్నారు.  

లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ?!

ముందస్తు ఎన్నికలు జరగనున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు  రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ముందస్తు లేకపోయినా ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడింది.  ఎన్నికలకు ఇంకా  ఏడెనిమిది నెలల సమయం మాత్రమే  ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో దిగి ప్రత్యక్ష యుద్ధం మొదలు పెట్టాయి. అధికార పార్టీ కూడా ఒకవైపు ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. ఇలాంటి తరుణంలో కొందరు సీనియర్ నేతలు మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది. అలాంటి వారిలో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ కూడా ఒకరు. ప్రత్యక్ష రాజాకీయాలతో పాటు ఎన్నికల సర్వేలు నిర్వహించి తన ఫలితాలతో తెలుగు రాష్టాల ప్రజలకు బాగా సుపరిచితుడైన లగడపాటి ఇప్పుడు మళ్ళీ రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. విజయవాడ  ఎంపీగా పనిచేసిన లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.  2004 ఎన్నికలకు ముందు వైఎస్‌ తో కలసి రాష్ట్రమంతా పాదయాత్ర చేసినవారిలో లగడపాటి కూడా ఒకరు.  ఆ తర్వాత వైఎస్ కోటరీలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన లగడపాటికి ఆర్ధిక పుష్టి ఉండడంతో వైఎస్ 2004 ఎన్నికల్లో తొలిసారి అవకాశం ఇచ్చారు. 2004లో టీడీపీ అభ్యర్థి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ను ఓడించగా.. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసిన ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయం సాధించారు.  ఇక 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ లగడపాటి గట్టిగా పోరాడిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ తలపులు మూసి విభజన చేసిన సమయంలో లగడపాటి పెప్పర్‌ స్ప్రే చల్లారంటూ తీవ్ర ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమైనా.. లగడపాటి రాజగోపాల్ నిర్వహించే ఎన్నికల సర్వేలకు విపరీతమైన ఆదరణ ఉండేది. సొంతంగా తన టీమ్‌ ద్వారా సర్వేలు నిర్వహించే లగడపాటి చెప్పే ఎన్నికల ఫలితాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఆతృతగా ఎదురు చూసేది. అయితే 2019 ఎన్నికల ముందు లగడపాటి నిర్వహించిన సర్వే ఆధారంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పారు. కానీ, అందుకు విరుద్ధంగా వైసీపీ ఘనవిజయం సాధించింది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు రావడంతో ఇకపై సర్వేలు కూడా నిర్వహించనని ప్రకటించారు. అప్పటి నుండి పూర్తిగా తన వ్యాపారాలపై దృష్టి పెట్టిన లగడపాటి ఇప్పుడు మళ్ళీ రాజకీయాలలోకి పునఃప్రవేశానికి సిద్ధమవుతున్నట్టు విజయవాడ రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది. ఆ మాటకొస్తే గతంలో 2019 ఎన్నికల్లో కూడా లగడపాటి టీడీపీలో చేరతారని, మళ్ళీ ఆయన రాజకీయాలలోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు. అయితే, ఈసారి ఆయన రీఎంట్రీ ఖాయమని గట్టిగా వినిపిస్తుంది. ఈ మధ్యనే విజయవాడలో రాజగోపాల్ తన మద్దతుదారులతో సమావేశమైన నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది.  త్వరలోనే విజయవాడలోని అన్ని నియోజకవర్గాల్లో లగడపాటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ నెలాఖరులో లగడపాటి సమావేశాలకి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక, ఆయన స్థానమైన విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేని నానీ ఉండగా.. వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేయనని ప్రకటించారు. దీంతో ఇక్కడ టీడీపీ నుండి కేశినేని నానీ తమ్ముడు చిన్నీ కానీ మరో బలమైన నేతను రంగంలోకి దింపాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. వైసీపీ కూడా ఇక్కడ గట్టి అభ్యర్థి కోసం వెతుకులాడుతుంది. ఈ క్రమంలో లగడపాటి మళ్ళీ రాజకీయాలలోకి వస్తే టీడీపీలో చేరతారా? లేక వైసీపీ నుండి పోటీ చేస్తారా అన్న ఆసక్తి కలుగుతున్నది. దీంతో పాటు అసలు లగడపాటి మళ్ళీ రాజకీయాలలోకి వస్తారా? లేక గతంలో మాదిరి ఈసారి కూడా ఇది ప్రచారంగానే మిగిలిపోతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

విశాఖ సీపీ బదలీ వెనుక ఎంపీ హస్తం? !

ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. జగన్ ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 5) ఆదేశాలు జారీ చేసింది. ఆ బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారుల జాబితాలో విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ పేరు కూడా ఉంది. ఆయన బదలీపై ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో వాడి వేడిగా  చర్చ జరుగుతోంది. ఎందుకంటే విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా త్రివిక్రమ్ వర్మ చార్జ్ తీసుకుని  జస్ట్ 5 నెలలు కూడా గడవక  ముందే ఆయనపై బదిలీ వేటు పడడం వెనుక ఎంపీ ఎంవీవీ హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఈ ఏడాది అంటే 2023 ఏప్రిల్‌ 12వ తేదీన త్రివిక్రమ వర్మ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.  ఆ కొద్ది రోజులకే అంటే జూన్ రెండో వారంలో విశాఖపట్నం ఎంపీ, వైసీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ  ఫ్యామిలీ కిడ్నాప్ కావడం.. ఆ తర్వాత ఈ కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కాగా.. ఈ విషయం ఢిల్లీలోని కేంద్ర పెద్దల వరకు వెళ్లడం..   ఆ క్రమంలో అధికార పార్టీ ప్యామిలీ కిడ్నాప్ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. చివరకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి.. ఆంధ్రప్రదేశ్‌లో తాను వ్యాపారాలు  చేయలేనని.. తన బిచాణా మొత్తం పక్కనే ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ఎత్తేస్తానంటూ ప్రకటించడంతో.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని స్వయంగా అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిదే  బయట ప్రపంచానికి తెలిపినట్లు అయింది.  అయితే ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ జరిగినా.. ఆ వ్యవహారాన్ని బయటకు రాకుండా ఆదిలోనే కంట్రోల్ చేయడంలో.. విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా త్రివిక్రమ వర్మ పూర్తిగా విపలమయ్యారని, అందువల్ల ఈ కిడ్నాప్ వ్యవహారం కారణంగా జగన్ ప్రభుత్వ పరువు కొండెక్కిందని,  విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ కారణంగానే ఇదంతా జరిగిందంటూ.. పార్టీలోని పెద్ద తలకాయిలు అప్పుడు పెదవి విరిచాయనే ఓ చర్చ సైతం అధికార వైసీపీలో నేటికి కొన సాగుతోంది.  అంతేకాదు.. విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారంపై అధికార వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్రంలోని పెద్దలకు లేఖలు రాయడం..  దీనిపై లోక్‌సభలోనే రఘురామకృష్ణం రాజుపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీరియస్ కావడం.. దీంతో సభలోని సభ్యులంతా.. ఏం జరిగిందంటూ వీరిద్దరి వ్యవహారంపై ఆరా తీయడంతో.. ఢిల్లీ వేదికగా పార్టీ పరువు గంగలో కలిసింది. ఈ నేపథ్యంలోనే అదును చూసి ఎంపీ చక్రం తిప్పి కమిషనర్ త్రివిక్రమ్ పై బదలీ వేటుకు కారణమయ్యారని అంటున్నారు.    అదీ ముఖ్యమంత్రి  జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన  మూడు రోజులకే.. ఇలా 11 మంది ఐపీఎస్‌లను బదిలీ చేయడం పట్ల పోలిటికల్ సర్కిల్‌లో విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయి కానీ.. ముఖ్మమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో.. ఎవరి ఆదేశాలతో ఈ బదిలీలు జరిగాయన్న చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో  జోరందుకుంది.

మాజీ ఎంపీ, నటి రమ్య కన్నుమూత..ఈ ఫేక్ న్యూస్ వెనుక ఉన్నదెవరు?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) కన్నుమూశారని ప్రచారం జరుగుతోంది. 40 ఏళ్ళ రమ్య గుండెపోటుతో బుధవారం ( సెప్టెంబర్ 6) తుదిశ్వాస విడిచినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.   అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆమె సన్నిహితలు చెబుతున్నారు. ఈ ఫేక్ ప్రచారం ఎవరి పని అని అభిమానులు ఆరా తీస్తున్నారు.  రమ్య తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అభిమన్యు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'లో ప్రియగా తన నటనతో కట్టిపడేసారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఎంపీగా పనిచేశారు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీల విషయాలలో ఫెక్ న్యూస్ తలనొప్పులు సాధారణంగా వైరల్ అవుతుంటాయి.  సినీ సెలబ్రిటీల విషయంలో అయితే  ఫలానా వ్యక్తితో డేటింగ్ లో ఉన్నారు, ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. రాజకీయ ప్రముఖుల విషయంలో ఫలానా పార్టీలోకి మారుతున్నారు. మరో పార్టీతో మంతనాలు జరుపుతున్నారు వంటి వార్తలు సర్క్యులేట్ అవుతుంటాయి. అంతవరకు ఓకే గానీ.. మరీ బతికున్న వ్యక్తులను చంపేస్తూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను సృష్టిస్తుంటారు. తాజాగా ప్రముఖ నటి , మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) విషయంలోనూ అటువంటి ప్రచారమే జరిగింది. ఆమె గుండెపోటుతో మరణించారంటూ  ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా పోస్ట్ అయ్యిందో లేదో  అలా ఆ వార్త నిమిషాల్లో వైరల్ గా మారింది. కొన్ని వెబ్ సైట్లు, ఛానల్స్ సైతం ఆ వార్తను ప్రచారం చేశాయి. దీంతో పరామర్శలు స్టార్ట్ అయ్యాయి. రమ్య(దివ్య)కి, ఆమె సన్నిహితులకు పలువురు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఈ ఫేక్ న్యూస్ గురించి తెలియక.. ఎక్కడో జెనీవాలో గాఢనిద్రలో ఉన్న రమ్య.. ఒక్కసారిగా ఈ న్యూస్ గురించి తెలిసి షాక్ అయ్యారట. నేను బ్రతికే ఉన్నాను, ఎవరో ఏదో ట్వీట్ చేస్తే దానిని గుడ్డిగా ప్రసారం చేస్తారా అని రమ్య తనను సంప్రదించిన మీడియా వర్గాలు, సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారట. ఇటీవల కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించారు. ఆ వార్తనే కాస్త ఆలస్యంగా 'స్పందన'కు బదులుగా పొరపాటున 'దివ్య స్పందన' అని రాసి పోస్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా బతికున్న వ్యక్తులను చనిపోయారంటూ ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అలాంటి వార్తల వల్ల కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు కంగారు పడతారు. సెన్సిటివ్ గా ఉండే వ్యక్తులకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి.. అలాంటి వార్తల వల్ల  ప్రమాదం జరిగే అవకాశముంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

రెండు రోజుల్లో చంద్రబాబు అరెస్ట్?

తనను ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు బుధవారం ప్రసంగించారు. ఆ సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు  సంచలనంగా మారాయి. అధికారపక్షం తనను బయటకు రాకుండా అడ్డుకుంటున్నదనీ.. తనపై కూడా దాడులు చేస్తున్నారని.. తమ పార్టీ శ్రేణులపై కూడా రౌడీలతో దాడులు చేయిస్తున్నారని.. ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు చొప్పున తనతో పాటు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. తనపై కూడా దాడులు జరిగే అవకాశం కూడా ఉందని  వ్యాఖ్యానించారు. అయితే వైసీపీ నేతలు ఎన్ని చేసినా  ఏం చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న చంద్రబాబు, మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు తెలుగుదేశమే విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. నిప్పులా బతికిన తనను తప్పుడు వ్యక్తిగా చూపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అంగళ్ళలో తనమీద హత్యా ప్రయత్నం చేసి తిరిగి తనపైనే ఐపీసీ 307కింద కేసు పెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు తామే దాడులు చేసినట్టు ఒత్తిడి చేస్తూ స్టేట్మెంట్లు రాయిస్తున్నారని, కావాలని తప్పుడు కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. యువగళం పాదయాత్రకు వచ్చి దాడులు చేసి టిడిపి నేతలపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఏపీ సీఎం సైకోలా వ్యవహరిస్తున్నారని, సైకో పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. అసలు చంద్రబాబును ఏ కేసులో అరెస్ట్ చేస్తారనే చర్చలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో  ఐటీ శాఖ నుండి చంద్రబాబుకు షోకాజ్ నోటీసులు వచ్చినట్టుగా ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురింది. గత ప్రభుత్వ హయంలో వివిధ కాంట్రాక్టుసంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని, ఈ కేసులోనే ఐటీశాఖ నోటీసులు ఇచ్చినట్లు జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. లెక్క చూపని డబ్బు రూ.118 కోట్లు ఆయన వద్ద ఉందని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించినట్లు కథనంలో రాసుకొచ్చారు. ఈ కథనం ఆధారంగానే చంద్రబాబుపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. కాగా, ముందస్తు సమాచారం లేకుండా చంద్రబాబు ఎప్పుడూ మాట తూలరు. సరైన ఆధారం ఉంటేనే ఆయన మీడియాకు చెబుతారు. ఇలాంటి సమయంలో తన అరెస్ట్ ను ఆయనే ఇప్పుడు ధృవీకరించడం టీడీపీ వర్గాల్లో అలజడి సృష్టిస్తున్నది.   అయితే వస్తున్న కథనాల ప్రకారం చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చింది ఐటీ విభాగం. కానీ, ఐటీ విభాగానికి అరెస్ట్ చేసే అధికారం లేదు. ఈడీకి అరెస్ట్ చేసే అధికారాలు ఉన్నాయి. అంటే ఈ వ్యవహారం ఇప్పుడు ఈడీకి అప్పగించనున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజులలో ఈ వ్యవహారం ఈడీకి వెళ్తుంది.. అప్పుడు తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు చెప్పినట్లు భావించాల్సి వస్తుంది. మరోవైపు చంద్రబాబును అరెస్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదని.. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచే ఈ అరెస్టులు ఉండనున్నాయని కూడా మరో వాదన వినిపిస్తుంది. ఏపీ సర్కారే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి ఒక్కసారైనా చంద్రబాబును అరెస్ట్ చేయాలని సీఎం జగన్ ఆశపడుతున్నారని.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ వచ్చే సమయానికి ఆయన కోరిక తీర్చాలని కొందరు ప్రభుత్వ పెద్దలు కంకణం కట్టుకున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి ఇంతకీ చంద్రబాబు ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నారు. ఒక వేళ ఆయన అరెస్ట్ అయితే టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకోనున్నాయో చూడాల్సి ఉంది.

ఏపీలో బీజేపీ ఉత్తుత్తి పోరాటం

భారతీయ జనతాపార్టీ.. దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ. విపక్షాల ఐక్యతా యత్నాలను భగ్నం చేసి కేంద్రంలో ముచ్చటగా మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న పార్టీ. ఇందు కోసం ఆ పార్టీ అనసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి దోహదం చేసేవిగా లేవన్న విమర్శలను ఇసుమంతైనా పట్టించుకోకుండా బీజేపీయేతర పార్టీలను బలహీనం చేసేందుకు ఎత్తులు, పై ఎత్తులూ వేస్తున్న పార్టీ. అనుకూల సర్వేలనండి, మరోటేదైనా అనండి 2024 సార్వత్రిక ఎన్నికలలో మోడీ నాయకత్వానిదే విజయం అని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఓ వైపు కాంగ్రెస్ బలంగా పుంజుకుందని చెబుతున్న సర్వేలే.. మోడీ మరోసారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని పేర్కొంటున్నాయి.  ఇవన్నీ పక్కన పెడితే కేంద్రంలో అధికారంలో ఉన్నది పేరుకు ఎన్డీయే సర్కారే కానీ.. ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఎప్పుడో నామావశిష్ఠంగా మారిపోయాయి. ఎన్డీయే కూటమిలో ఉన్న ఏ పార్టీకీ కూడా సార్వత్రిక ఎన్నికలలో సింగిల్ డిజిట్ కు మించి స్థానాలొచ్చే అవకాశం లేదనీ.. మరో సారి కేంద్రంలో మోడీ సర్కార్ ఖాయమంటే తేల్చిన సర్వేలే కుండబద్దలు కొడుతున్నాయి. అంటే భాగస్వామ్య పార్టీలను నిర్వీర్యం చేసి బీజేపీ ఆయా పార్టీలు గతంలో బలంగా ఉన్న రాష్ట్రాలలో వాటి ఉనికిని నామమాత్రం చేయడంలో బీజేపీ విజయవంతమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉదాహరణగా శివసేన, ఎన్సీపీల పరిస్ధితిని చూపుతున్నారు. ఇక ఉత్తరాదిన ప్రాంతీయ పార్టీలన్నీ ఎప్పుడో బీజేపీ తోక పార్టీలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. ఎక్కడో బీహార్ వంటి ఒకటి రెండు చోట్ల ఇందుకు మినహాయింపు ఉండే ఉండొచ్చు కానీ మొత్తంగా బీజేపీ పెద్దన్న పాత్ర పోషించి దేశంలోని చిన్నా చితకా పార్టీలన్నిటినీ దాదాపు నిర్వీర్యం చేసేసింది. అయితే ఈ క్రమంలో ఆమెకు దక్షిణాది రాష్ట్రాలు ఏ మాత్రం కొరుకుడు పడలేదు. దొడ్డి దారిన కర్నాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్నా.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకుంది. ఆ ఒక్క ఓటమి దక్షిణాదిలో బీజేపీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా బలహీన పరిచింది. సరే తెలంగాణలో ఏదో మేరకు పార్టీ అధికారం కోసం తలపడుతోందనిపించే పరిస్థితిని కాపాడుకుంటోంది. కానీ ఏపీలో మాత్రం బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకులు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్లుగా ఉన్నారు. ఏపీలో బీజేపీ రాజకీయం ఏమిటో? ఆ పార్టీ రాష్ట్ర నేతలకు ఇసుమంతైనా తెలియదు. బీజేపీ అధినాయకత్వం ఏపీ విషయంలో అనుసరిస్తున్న విధానం ఢిల్లీలో దోస్తీ, గల్లీలో ఘర్షణ అన్నట్లుగా ఉంది. దీంతో బీజేపీ ఏపీ నేతలు తాము  యుద్ధం చేస్తున్నామా? సొంత పార్టీ చేతుల్లోనే పావులుగా మారి ఉన్న కొద్ది పాటి గౌరవాన్నీ కోల్పోతున్నామో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. తాము రాష్ట్రంలో అధికార పార్టీతో పోరాడుతున్నామా?  లేక తమ విమర్శలన్నీ అధినాయత్వం రాష్ట్రంలో జగన్ సర్కార్  కొనసాగిస్తున్న రహస్య మైత్రి కారణంగా గాలిలో కలిసిపోతున్నాయా అర్థం కాని అయోమయంలో ఉన్నారు.  రాష్ట్రంలో తమ ప్రత్యర్థి ఎవరో తెలియని గందరగోళంలో ఉన్నారు. చీకట్లో కన్నుకొడుతున్నారు.  హస్తినలో బీజేపీ అధినాయకత్వం జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండదండలు అందిస్తుంటే.. ఇక్కడ మాత్రం తాను యుద్ధం చేస్తున్నట్లు చేయాల్సి వస్తున్నది. ఆ కరణంగానే తమ విమర్శలు తమలపాకుతో తడిమినట్లుగాఢిల్లీ రాజు ఇక్కడ తమ ప్రత్యర్ధికి దన్నుగా నిలిస్తే, తాము మాత్రం అదే ప్రత్యర్ధిపై యుద్ధం చేయాల్సిన వైచిత్రి. తమ గమ్యం.. గమనం ఏమిటో.. ఎటువైపో తెలియని విషాదం.   పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టగానే జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై గణాంకాలతో సహా కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ కు వివరించారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు కూడా చేశారు. అయితే విత్త మంత్రి నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పందనా లేదు. పైపెచ్చు నిబంధనలకు విరుద్ధంగా జగన్ సర్కార్ ఎటువంటి రుణాలూ తీసుకోలేదంటూ కేవలం ఆర్బీఐ నివేదికలను ఉటంకిస్తూ క్లీన్ చిట్ ఇచ్చేశారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు దిగ్భ్రాంతి చెందారు.  ఏపీలోని అధికార వైసీపీపై తమను ఉత్తుత్తి యుద్ధం చేయమని పార్టీ అధిష్ఠానం చెబుతోందా అన్న అనుమానాలు పార్టీ రాష్ట్ర నాయకులలో వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగనన్న.. ఢిల్లీ నేతలతో అంటకాగుతుంటే, మరోవైపు తాము మాత్రం అదే జగనన్న సర్కారుపై.. యుద్ధం చేయాల్సిన  విచిత్ర పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. జగన్ పై బీజేపీ ఏపీ నాయకులు విమర్శలు గుప్పించడం.. అభాసుపాలు కావడం రివాజుగా మారిపోయింది.  ఈ  పరిస్థితి బీజేపీ నాయకులలో పార్టీ పట్ల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నది. ఏపీలో మా పార్టీ అగ్రనాయకత్వం ఏం చేస్తోందో, ఏం చేయాలనుకుంటోందో మాకైతే అర్ధం కావడం లేదు. కనీసం పార్టీ అగ్రనాయకత్వానికైనా అర్ధం అవుతోందా? అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయనీ ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారంటేనే ఏపీలో బీజేపీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం అవుతోంది. ఇటీవల జగన్ సర్కార్ టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులను నియమించింది. ఆ నియామకాల్లో బోర్డు సభ్యుడిగా నియమితులైన వారిలో సగం మందికి పైగా బీజేపీ అగ్రనేతల సిఫారసు మేరకు నియమితులైన వారే కావడాన్ని బట్టే జగన్ ప్రభుత్వం, బీజేపీ అధినాయకత్వం మధ్య సమన్వయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తమ పార్టీ పెద్దల సిఫారసులకు అనుగుణంగానే  తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాలు జరిగాయన్న సంగతి రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి తెలియకపోవడాన్ని బట్టే పార్టీ అధిష్ఠానం రాష్ట్ర నాయకీత్వానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటన్నదిద తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉంటేనే ఆబోరు దక్కుతుందన్న భావనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.  

దాడులు వైసీపీవి.. కేసులు తెలుగుదేశం కార్యకర్తలపై

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా భీమవరం నియోజకవర్గం తాడేరు వద్ద లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా ఈ రాళ్ల దాడి జరిగింది. లోకేశ్ పాదయాత్ర కాన్వాయ్ పై వైసీపీ మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. యువగళం కాన్వాయ్ లోని పలు వాహనాలను ధ్వంసం అయ్యాయి. దీంతో పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన ఉన్న భవనాల పైకి ఎక్కి రాళ్ల దాడికి పాల్పడడంతో పాటు వైసీపీ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. వైసీపీ నేతలు ఎంత కవ్వింపు చర్యలకు దిగినా సహనం కోల్పోకుండా నిలిచిన తెలుగుదేశం కార్యకర్తలు  రాళ్లదాడితో తిరగబడ్డారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు వైసీపీ కార్యకర్తలకు రక్షణగా నిలిచారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మొదటి నుంచి వైసీపీ ఆటంకాలు కలిగిస్తూనే ఉంది. యువగళంపై దాడులు చేస్తున్నది. వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పి ఘర్షణలు సృష్టిస్తున్నది. లోకేష్ ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చూస్తూ రకరకాల కేసులు పెడుతున్నారు. ఏకంగా పోలీసుల అండతోనే  వైసీపీ ఈ దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పుంగనూరు, ఎమ్మిగనూరు, పెదపారుపూడి.. ఇలా అనేక ప్రదేశాల్లో వైసీపీ  లోకేష్  పాదయాత్రలో ఘర్షణలు సృష్టించింది. పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  అయితే ఈ అన్ని సందర్భాలలోనూ పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తాజాగా భీమవరం నియోజకవర్గం తాడేరు పాదయాత్రలో కూడా అదే  జరిగింది. తాడేరులో పాదయాత్ర కొనసాగుతుండగా.. వైసీపీ కార్యకర్తలు చుట్టుపక్కల భవనాల పైనుంచి వైసీపీ జండాలు ఊపుతూ టీడీపీ శ్రేణులను కవ్వించారు. అదే భవనాలపై నుంచి ముందుగానే సిద్ధం చేసుకున్న రాళ్ళు, సోడా సీసాలూ విసురుతూ దాడులకు తెగబడ్డారు. అదే సమయంలో పాదయాత్ర జరుగుతున్న రోడ్డు పక్కనే కర్రలతో సిద్దంగా ఉన్న మరికొందరు వైసీపీ కార్యకర్తలు యువగళం వాలంటీర్లను చుట్టుముట్టి చితకబాదారు. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో సహా పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మూడు వైపుల నుంచి ఒకేసారి దాడులు జరుగడంతో ఊహించని ఈ పరిణామానికి నారా లోకేష్‌తో సహా అందరూ షాక్ అయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వైసీపీ కార్యకర్తలను అడ్డుకొనే ప్రయత్నం చేయకపోగా వారు కూడా యువగళం వాలంటీర్లపైనే తమ ప్రతాపం చూపడంతో కాసేపు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.  ఈ దాడుల అంశంలో మంగళవారం అర్ధరాత్రి ప్రాంతంలో యువగళం క్యాంప్ సైట్ పై పోలీసులు దాడి చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ పాదయాత్రతో అలసిపోయి నిద్రిస్తున్న వాలంటీర్లు, కిచెన్ సిబ్బంది సహా మొత్తం 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు వాహనాల్లో యువగళం వాలంటీర్లను తరలించారు. ఈ వాలంటీర్లను రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ చితకబాదారు. అనంతరం బుధవారం ఉదయం సిసిలీలోని వైసీపీ నేతకు చెందిన రాజ్యలక్ష్మి మెరైన్ ఎక్స్ పోర్ట్స్ ఫ్యాక్టరీలో బంధించారు. విషయం బయటకి పొక్కడంతో అందరిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తుంది. పోలీసుల అదుపులో ఉన్న యువగళం వాలంటీర్లపై 307 సెక్షన్ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ కార్యకర్తలను భీమవరం, నర్సాపురం, వీరవాసరం పోలీస్ స్టేషన్లకు తిప్పారని, చివరికి వైసీపీ నేత ఫ్యాక్టరీలో బంధించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. రాళ్ల దాడిలో దెబ్బలు తిన్న తమనే అరెస్టు చేయడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించాకే యాత్ర చేపట్టమని, వైసీపీ కార్యకర్తలతో కవ్వింపు చర్యలు చేపట్టి, ఇప్పుడు వాలంటీర్లను అరెస్టులు చేశారని మండిపడుతున్నారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని తెలుస్తుండగా.. వైసీపీ వర్గాలు ఇలాంటి ఏర్పాట్లు చేసుకొంటున్నారని ముందే తెలిసినప్పటికీ పోలీసులు వారిని నిలువరించలేదు. పైగా ఘర్షణలలో వారికే అండగా నిలబడి.. చివరికి తిరిగి టీడీపీ కార్యకర్తలు, వాలంటీర్లపైనే కేసులు పెట్టడం చూస్తుంటే రాష్ట్రంలో ఎలాంటి అరాచక పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

శాశ్వత అధికారం దిశగా మోడీ అడుగులు.. విపక్షాల ఆందోళన!

ప్రధాని నరేంద్రమోడీ నియంతృత్వ పోకడలు దేశానికి చేటుగా పరిణమిస్తున్నాయని విపక్షాలు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నాయి. అంతేనా మోడీ నేతృత్వంలో  కేంద్ర సర్కార్ రాష్ట్రాల ఆదాయాన్నీ, హక్కులను హరించేస్తున్నదన్న ఆందోళన బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే మోడీ మరో సారి ప్రధాని అయితే.. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారంటూ విపక్షాలు విమర్శనాస్త్రాలు  సంధిస్తున్నాయి. అసలింతకీ మోడీ మరో సారి అధికారంలోకి వస్తారా? రారా అన్నది పక్కన పెడితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల పేరిట ఆయన రాజ్యాంగాన్ని మర్చే ప్రయత్నాలు ఇప్పుడే ప్రారంభించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇటీవలే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సమావేశాలు మణిపూర్ హింసాకాండపై సుదీర్ఘ ప్రతిష్ఠంభణతో వాయిదాల పర్వం నడిచింది. ఈ సమావేశాలలోనే విపక్షాలు మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి కూడా. ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందనుకోండి అది వేరే సంగతి. ఆ సమావేశాలు ముగిసిన వెంటనే  మళ్లీ ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణ ఎందుకు? అజెండా ఏమిటి? అన్న విపక్షాల ప్రశ్నలకు మోడీ సర్కార్ సమాధానం చెప్పడం లేదు. కానీ ఇస్తున్న లీకులు.. మంత్రులు, బీజేపీ నేతల మాటలను బట్టి రెండు కీలక అంశాలను ఈ ప్రత్యేక సమావేశాలలో చేపట్టి సభ ఆమోదం పొంది చట్టం చేయాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోడీ సర్కార్ ఉన్నట్లు అవగతమౌతున్నదని పరీశీలకులు వివరిస్తున్నారు. వాటిలో ఒకటి జమిలి ఎన్నికలు కాగా మరొకటి దేశం పేరు మార్పు. ఈ రెండు అంశాలలో బీజేపీ సక్సెస్ అయితే  మోడీ హ్యాట్రిక్ సాధించే వరకూ ఆగనవసరం లేకుండానే నియంత అయిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయినా మోడీలోని నియంతృత్వ పోకడలు ఆయన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. కీలక అంశాల విషయంలో ఇసుమంతైనా ఆమోదయోగ్యం కాని మౌనం వహించడం.. ఎన్నికల ప్రచారాలలో ఉద్వేగభరిత  ప్రసంగాలు, విపక్షాలపై విమర్శల దాడులతో విరుచుకుపడటం తప్ప మోడీ కనీసం తన ప్రభుత్వ విధానాలను వివరించేందుకు మీడియా సమావేశాలు సైతం ఏర్పాటు చేయరని పరిశీలకులు అంటున్నారు. భారత్ గా దేశం పేరు మార్పు, జమిలి ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశాల నిర్వహణ ద్వారా మరో  మారు తాను అధికారంలోకి రావడానికి రాచబాట పరుచుకుని.. ఆ తరువాత చైనా అధ్యక్షుడి బాటలో జీవితకాల ప్రధానిగా ప్రకటించు కుంటారన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.   2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, శాశ్వతంగా అధికారంలో  ఉండేలా, రాజ్యంగాన్ని మార్చి రాజరిక వ్యవస్థను ప్రవేశ పెడుతుందని ఇప్పటికే ఆప్ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా, మోడీ కుట్రలను ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యత అనివార్యమని పదే పదే చెబుతోంది.  నిజానికి, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావలసిన అవసరాన్ని, ఒక్క ఆప్ మాత్రమే కాదు, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఎప్పుడో గుర్తించాయి. అందుకే దేశాన్ని ఈ విపత్తు నుంచి కాపాడేందుకు, విపక్ష పార్టీలు అన్నీ కలిసి పోటీ చేయాలని, లేదంటే, 2024 ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ను అడ్డుకోవడం అయ్యే పనికాదన్న భావన దాదాపు అన్ని బీజేపీయేతర పార్టీలలోనూ వ్యక్తమౌతున్నది.   

రాజకీయంగా మద్దాలి గిరికి ఇక ఫుల్ స్టాపేనా?

గుంటూరు తూర్పు శాసనసభ నియోజక వర్గానికి వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా షేక్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, పశ్చిమ నియోజకవర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రతినిధ్యం వహిస్తున్నారు. అయితే మద్దాలి గిరి వైసీపీలో కి జంప్ అయిన విషయం తెలిసిందే. దాంతో గుంటూరు రెండు నియోజకవర్గాలు వైసీపీ చేతిలోకి వచ్చేసినట్లైంది. అలా నాలుగేళ్లు గడిచి పోయాయి. కానీ మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ రెండు నియోజకవర్గాలలో ఎవరికి ఇవ్వాలనే దానిపై జిల్లా ఇన్‌ఛార్జ్‌ విజయసాయి రెడ్డి ఇటీవల సమీక్షా సమావేశం జరిపారు. తూర్పు నియోజకవర్గం మహమ్మద్ ముస్తఫా షేక్ పనితీరు, ఐప్యాక్ నివేదిక అంతా బాగానే ఉందంటూ నివేదిక ఇవ్వడంతో  సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫాకే మళ్లీ టిక్కెట్ ఖాయమని భావిస్తున్నారు. అయితే ఈసారి తనకు బదులు తన కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు అవకాశం ఇవ్వాలని ముస్తాఫా జగన్‌ను అభ్యర్ధించారు. అందుకు... విజయసాయి రెడ్డి సమీక్షా సమావేశంలో చర్చించి   సుముఖత వ్యక్తం చేశారు. దీంతో గుంటూరు తూర్పు అభ్యర్థి ఎవరన్న విషయంలో వ్యవహారం అంతా సాఫీగానే ముగిసినట్లైంది. అయితే  గుంటూరు వెస్ట్  నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక మాత్రం వైసీపీకి తలనొప్పి  తెస్తున్నది. గుంటూరు పశ్చిమ టికెట్‌ కోసం గత ఎన్నికలలో పోటీ చేసి... మద్దాలి గిరి చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధి ఏసు రత్నంకి జగన్‌ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా నేటికీ ఆయననే పశ్చిమ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిస్తున్నారు.   కనుక మళ్ళీ తనకే ఎమ్మెల్యే టికెట్‌ వస్తుందనే నమ్మకంతో ఆయన నియోజకవర్గంలో పని చేసుకొంటున్నారు. నియోజకవర్గంలో కులాల లెక్కల ప్రకారం చూసినా మళ్ళీ తనకే టికెట్‌ గ్యారెంటీ అను ఏసురత్నం ధీమాగా ఉన్నారు.  అయితే విజయసాయి రెడ్డి  నిర్వహించిన సమీక్షా సమావేశంలో వీరిద్దరిలో ఎవరికి టికెట్‌ ఇవ్వాలనే విషయం తేల్చ లేదు. దీంతో   గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు నిలబడతారన్న విషయంలో పార్టీ వర్గాల్లోనే కాకుండా ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న మద్దాలి గిరి, ఏసురత్నంలలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసే విషయంలో  అటు గిరి ఇటు ఏసురత్నం ఇద్దరూ పట్టుదలగా ఉన్నారు.  ఒకవేళ ఏసురత్నంకే టికెట్‌ కేటాయిస్తే తెలుగుదేశం నుంచి    వైసీపీలోకి జంప్ చేసిన మద్దాలి గిరి రాజకీయ జీవితానికి చుక్కప డినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గన్నవరంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు... వైసీపీ టిక్కెట్ తో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావ్... మళ్లీ టిక్కెట్ వచ్చే పరిస్థితి లేదన్న విషయం నిర్ధారణ అయిపోవడంతో తెలుగుదేశం గూటికి చేరి ఆ పార్టీ టికెట్ ను దాదాపుగా దక్కించేసుకున్నారు.  అయితే మద్దాలి గిరి  తెలుగుదేశం నుంచి విజయం సాధించి వైసీపీ గూటికి చేరి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.