సునీల్ కనుగోలు మాటే శాసనం.. ఈయన చెప్పిన వారికే ఏఐసీసీ సీట్లు!

సునీల్ కనుగోలు.. గతంలో ఈ పేరు అక్కడక్కడా వినిపించినా కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తర్వాత ఈ పేరు మార్మోగిపోతోంది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద అసెట్ గా సునీల్ కనుగోలు మారిపోయారని చెప్పొచ్చు. గతంలో కర్ణాటక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో ఈయన మాటే శాసనంగా మారిపోయింది.  తన వ్యూహలు, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించేస్తున్న సునీల్ మాటే ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కూడా వేద వాక్కుగా మారిపోయింది. అంతకు ముందు ఎన్నికల వ్యూహకర్త అంటే ప్రశాంత్ కిషోర్ పేరు మాత్రమే వినిపించేది.  ఇప్పుడు సునీల్ కనుగోలు పేరు అదే స్థాయిలో వినిపిస్తుంది. అవుతుందా లేదా.. బీజేపీ సక్సెస్ సీక్రెట్ గా మారిన మోడీ-షాల ద్వయం వ్యూహాలను సునీల్ ఛేదించగలరా అనే అనుమానాల మధ్యనే కర్ణాటకలో ఆయన వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి.  కర్ణాటకలో కాంగ్రెస్ కోసం ఏడాది కాలంగా ఆయన చేసిన సేవలు భేష్ అనిపించాయి. లెక్కలేసి పక్కగా ప్లాన్ అమలు చేయడంతో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. మ్యాజిక్ ఫిగర్ కు మించి స్థానాలను గెలిచిన కాంగ్రెస్ కర్ణాటకలో సింగిల్ గానే అధికారంలోకి వచ్చేసింది. ఒక్క కర్ణాటకలో అధికారంలోకి రావడం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు జవసత్వాలు నింపింది. ఇంతటి విజయానికి కారణమై, పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన కనుగోలుకు సిద్ద రామయ్య సర్కార్ పెద్దపీట వేసింది. ప్రభుత్వ మీడియా సలహాదారుడిగా నియమించింది.  నెక్ట్స్ టార్గెట్ గా ఇప్పుడు సునీల్ తెలంగాణ మీద ఫోకస్ చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ఇక్కడ అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. మొత్తం ఆరు పాయింట్లతో సెగ్మెంట్లలో కనుగోలు విశ్లేషణ తెలంగాణలో కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు సునీల్ అభ్యర్థులను ఎలా ఫైనల్ చేస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే సునీల్ అభ్యర్థుల ఎంపికలో ఒకదశ పూర్తి కాగా వివరాలను నేరుగా ఏఐసీసీ అధిష్టానికే అప్పగించినట్లు తెలుస్తుంది. రాష్ట్రస్థాయి నేతల సిఫారసులు, రిఫరెన్సులు లేకుండా ఢిల్లీ పెద్దలు కూడా సునీల్ నివేదికలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సునీల్ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఆసక్తి ఉన్న నేతలు దరఖాస్తు చేసుకోవాలనే ప్రతిపాదన తీసుకురాగా.. ఇప్పటికే టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 119 స్థానాలకు గాను వెయ్యికి పైగా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో పార్టీ స్టేట్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై దరఖాస్తుల్ని పరిశీలించింది. నియోజకవర్గాల వారీగా పరిశీలించి 1:3 నిష్పత్తిలో  అభ్యర్థులను ఫిల్టర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే, ఇదంతా కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో  భాగంగా గతంలో చేసినట్లే ఇప్పుడు కూడా చేసినా ఫైనల్ గా సునీల్ ఫైనల్ చేసిన అభ్యర్థులకే టికెట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. ఈ నెలలో హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, సోనియాగాంధీ పర్యటన ఉండగా ఈ హడావిడి ముగిసిన అనంతరం అభ్యర్థుల తొలి జాబితా వెలువడనున్నట్లు తెలుస్తుంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే 30 మంది పేర్లతో తొలి జాబితా సిద్దమైనట్లు తెలుస్తుంది. ప్రత్యామ్నాయ అభ్యర్థుల గురించి ఆలోచించాల్సి న అవసరం లేని ముప్పై నియోజకవర్గాలతో సునీల్ టీం ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చేయగా ఆ  30 స్థానాల్లో ఎలాంటి మార్పులు లేకుండా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఫస్ట్ లిస్ట్ సునీల్ నివేదిక ప్రకారం వస్తే.. ఇక మిగతా నియోజకవర్గాలలో కూడా నేతల రిఫరెన్సులు ఏ మాత్రం పనిచేయవు. ఫైనల్ గా కాంగ్రెస్ అభ్యర్థులను సునీల్ నివేదికలేఎంపిక చేయనున్నాయి.

చంద్రబాబు అరెస్ట్.. అనుమానాలే నిజమయ్యాయి!

కేసులు ఆరోపణలు, సాక్ష్యాధారాలు నిబంధనలతో పని లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అన్న ఒకే ఒక లక్ష్యంతో గత నాలుగున్నరేళ్లుగా జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. అమరావతి రాజధానిగా నిర్ణయించడం వెనుక భూముల కుంభకోణం ఉందనీ, ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ మొదలు పెట్టి చంద్రబాబుపై జగన్ సర్కార్, వైసీపీ చేయని ఆరోపణ లేదు. వేయని నింద లేదు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబుపై చేసిన ఆరోపణల్లో ఒక్కటీ రుజువు చేయలేకపోయింది కానీ.. మూడు రాజధానుల నుంచి, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం వరకూ ప్రతి విషయంలోనూ జగన్ సర్కార్ న్యాయస్థానాలలో మొట్టికాయలు తింది. జగన్ ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలకు తిలోదకాలిచ్చి పని చేసిన అధికారులకు కోర్టు అక్షింతలు వేసింది. కొన్ని సందర్భాలలో శిక్షలు విధించి కూడా సామాజిక సేవ వంటి వాటికి పరిమితం చేసి గట్టిగా హెచ్చరించి వదిలిపెట్టింది. అలా ఈ నాలుగున్నరేళ్లలో జగన్ గారు ఏం చేస్తున్నారయ్యా.. అంటే నిర్ణయాలు తీసుకోవడం కోర్టులు కళ్లెం వేయడంతో వాటిని సవరించుకోవడంతోనే సరిపోయిందన్న సమాధానమే వస్తుంది. రాష్ట్ర ప్రగతి కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి. విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెంపు. సంక్షేమం పేరిట పందేరం చేసిన సొమ్ముకు అంతకింతా ప్రజల నుంచే పన్నుల రూపంలో వసూలు చేయడం వినా జగన్ సర్కార్ సాధించినదేమీ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో జనంలో జగన్ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. జగన్ సభలలోంచి జనం గుంపులు గుంపులుగా లేచి వెళ్లిపోవడాన్ని దీనికి తార్కానంగా పరిశీలకులు చూపుతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలకు ఎదురైన ప్రజా నిరసనే జగన్ పాలన పట్ల ప్రజలలో ఉన్న ఆగ్రహాన్ని ఎత్తి చూపిందంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాకపోతే మరెప్పూడూ కాదు అన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఇక టార్గెట్ చంద్రబాబు అన్నట్లు ఆయన అరెస్టు చూసి ఎన్నికలకు వెళ్లి ఇంటికి వెళ్లిపోదాం అని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే గత కొద్ది రోజులుగా చంద్రబాబు అరెస్టు గురించిన ఫీలర్లు అధికార పార్టీ వదులుతూ వచ్చిందనీ, అయితే ఏ కేసులో, ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేస్తారన్నది వెల్లడించకుండా రోజుల వ్యవధిలో చంద్రబాబు అరెస్టు ఖాయమంటై వైసీపీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం చేసింది. దాంతో చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని మూడు రోజుల కిందట చంద్రబాబు చెప్పారు.  ఒక్క చాన్స్ ను పూర్తిగా దుర్వినియోగం చేసుకున్న జగన్ మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని నిర్ధారణకు వచ్చారనీ, దీంతో తాను ప్రజలలోకి వెళ్ల కుండా అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు.  తనపై  దాడులు అందులో భాగమేనని అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజలలో మమేకం కాకుండా అడ్డుకునేందుకు తమ పార్టీ శ్రేణులపై  రౌడీలతో దాడులు చేయిస్తున్నారని.. ఇవేవీ జగన్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనీ, జనాదరణ, జనాభిమానం మెండుగా ఉన్న తనను ప్రజలలోకి వెళ్లకుండా ఆపడంలో విఫలమైన జగన్ సర్కార్ ఇక ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెడుతూ, జైలుకు పంపాలని కుట్ర పన్నిందని చంద్రబాబు మూడు రోజుల కిందటే ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ పాలన అంతం కావడం కోసం రాష్ట్రంలో ఇంటికి ఒకరు చొప్పున తనతో ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  జగన్ అరాచక పాలన అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదనీ, ఆరేడు నెలలలో జరిగే ఎన్నికలలో  తెలుగుదేశం అనూహ్య మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  నిప్పులా బతికిన తనను తప్పుడు వ్యక్తిగా చూపేందుకు జగన్ పన్నుతున్న కుట్రలు ఫలించవన్నారు.  అంగళ్ళలో తనమీద హత్యా ప్రయత్నం చేసి తిరిగి తనపైనే ఐపీసీ 307కింద కేసు పెట్టారని  కావాలని తప్పుడు కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. యువగళం పాదయాత్రకు వచ్చి దాడులు చేసి టిడిపి నేతలపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఏపీ సీఎం సైకోలా వ్యవహరిస్తున్నారని, సైకో పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.  ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ వచ్చే సమయానికి చంద్రబాబును అరెస్టు చేసి జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని  కొందరు ప్రభుత్వ పెద్దలు కంకణం కట్టుకున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. చివరికి ఆ ప్రచారమే నిజమని తేలింది.  ఎప్పుడో విచారణ ముగిసిపోయిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తే ఆందోళనలు చెలరేగుతున్నాయి. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ వారిని హౌస్ అరెస్టులు, అరెస్టులూ చేస్తూ రాష్ట్రాన్నే జైలుగా మార్చేస్తున్నారు. మరి ఇంతకీ చంద్రబాబు ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నారు. ఒక వేళ ఆయన అరెస్ట్ అయితే టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకోనున్నాయో చూడాల్సి ఉంది.

సకల శాఖల మంత్రే సీఐడీ సూపర్ బాస్!

సీఐడీకి సూపర్ బాస్ గా ప్రభుత్వ ముఖ్య సలహాదారు మారిపోయారా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుని ఈ ఉదయం సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా ఏ కేసులో ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పడానికి వెనుకాడారు. అన్ని అరెస్టు చేసిన తరువాత రిమాండ్ రిపోర్టులో చూపిస్తామంటూ దాటవేశారు. ఈ విషయంపై గట్టిగా అడిగిన  చంద్రబాబు తరఫు న్యాయవాదులకు స్టఫ్ లేదంటూ పోలీసు అధికారి అనుచిత వ్యాఖ్యలు సైతం చేశారు. ఆ తరువాత ఉపసంహరించుకున్నారు అది వేరే సంగతి. అరెస్టు చేస్తున్నామని చెబుతూ పోలీసులు చూపిన ఎఫ్ఐఆర్ లో అసలు చంద్రబాబు పేరే లేదు. దీంతో ఈ విషయంపై గట్టిగా నిలదీసిన న్యాయవాదులకు సమాధానం చెప్పలేక పోలీసులు అన్నీ రిమాండ్ రిపోర్టులు ఉంటాయష అంటే దాటేశారు.  అసలింతకీ ఈ  చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు రెండేళ్ల కిందటిది. దీనిపై  సీఐడీ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. ఈ విషయాన్ని సీఐడీ పోలీసులు నేరుగా చెప్పడానికి జంకారు. అయితే సకల శాఖల మంత్రిగానే ఇప్పటి వరకూ పాపులర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు సీఐడీ బాస్ అవతారమెత్తి మరీ వక్కాణిస్తున్నారు.  ఇలా చంద్రబాబు అరెస్టయ్యారో లేదో అలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలందరినీ అరెస్టులు, గృహ నిర్బంధాలూ చేస్తూ సీఐడీ మొత్తం రాష్ట్రాన్నే ఒక పెద్ద జైలుగా మార్చేస్తుంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి సీఐడి పలు కడిగిన ముత్యమనీ, ఇప్పటి వరకూ సీఐడీ చేసిన అరెస్టులు, నమోదు చేసిన కేసులూ అన్నిటికీ పూర్తి సాక్ష్యాధారాలున్నాయని చెప్పుకొచ్చారు.   అయితే అసలు వాస్తవమేమింటే.. ఏపీ సీఐడీ ఇప్పటి వరకూ పలువురు రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేసింది. వారిలో అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఉన్నారు.  అయితే  ఒక్క కేసులోనూ ఆధారాలు చూపించి చార్జిషీటు దాఖలు చేసిన దాఖలాలు కనిపించవు. పోలీసులు ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ వస్తున్న సజ్జల .. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత సీఐడీ తరఫున వకాల్తా పుచ్చుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు రాత్రికి రాత్రి జరిగిందని కాదని నమ్మబలికే ప్రయత్నం చేశారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి అవసరమైన అన్ని సాక్ష్యలూ, ఆధారాలు ఉన్నాయన్నారే కానీ అవేమిటో మాత్రం సజ్జల వెల్లడించలేదు.  ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయడం, ప్రశ్నించడం సాధారణమేనన్న సజ్జల తన అరెస్టు గురించి చంద్రబాబుకు కూడా తెలుసుననీ, అందుకే మూడు రోజుల ముందట  నుంచీ తాను అరెస్టయ్యే అవకాశాలున్నాయంటూ సెంటిమెంటును, సానుభూతిని పొందేందుకు ప్రయత్నాలు మొదలెట్టారని సజ్జల చెప్పుకొచ్చారు. అయినా చంద్రబాబును అరెస్టు చేసిన నిముషాల వ్యవధిలోనే.. సజ్జల మీడియా ముందుకు వచ్చి సీఐడీ వద్ద అన్ని సాక్ష్యాధారాలూ ఉన్నందునే అరెస్టయ్యారని చెప్పడానికి ఎందుకు అంత ఉత్సాహపడ్డారన్న సందేహం వైసీపీ శ్రేణుల్లోనే కాదు, పోలీసు వర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది. అసలు చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత సీఐడీ మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ వారికా అవకాశం ఇవ్వకుండా సజ్జల వచ్చి తాను చెప్పాల్సింది చెప్పేశారు. కాదు కాదు.. సీఐడీ అధికారులు ఏం చెప్పాలో సజ్జల తన ప్రెస్ మీట్ ద్వారా ఆదేశాలు జారీ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . నిజంగా స్కల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి చంద్రబాబుపై  పక్కా ఆధారాలు ఉంటే.. ఇలా అర్థరాత్రి హడావుడి అరెస్టు చేయకుండా.. ఆయన ప్రమేయంపై ఉన్న ఆధారాలను సాధ్యమైనంత ఎక్కువగా  ప్రచారం చేసి మరీ అరెస్టు చేసేవారు.  నాలిక గీసుకోవడానికి కూడా పనికి రాని ఐటీ షోకాజ్ నోటీసుకే విస్తృత ప్రచారం కల్పించిన వైసీపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి చంద్రబాబుపై నిజంగా ఆధారాలు ఉంటే.. మరింత ప్రచారం చేసేవారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ హయాంలో  సీఐడీ పెట్టిన కేసులు, చేసిన అరెస్టులు ఏవీ కోర్టులో నిలవలేదనీ.. ఇప్పుడు ఇది కూడా అంతేననీ అంటున్నారు. 

రోడ్డుపై బైఠాయించిన లోకేష్

తెలుగుదేశం అధినేత  చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరసనకు దిగారు. కోనసీమ జిల్లా   కోనసీమ జిల్లా   పొదలాడలో ఉన్న లోకేశ్‌ తండ్రి అరెస్టు వార్త వినగానే బెజవాడకు బయలు దేరారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో  లోకేష్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.   రాజోలు సీఐపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా తనను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు.  తన తండ్రి అరెస్టు అయితే కుటుంబ సభ్యుడిగా వెడుతున్న తనను అడ్డుకునే హక్కు మీకెవరిచ్చారని ప్రశ్నించారు. తాను ఒక్కడినే వెడుతున్నాననీ, వెంట ఎవరూ రావడం లేదనీ స్పష్టం చేశారు.   ఇలా ఉండగా పోలీసులు మీడియానే కాకుండా  ఆహారం, నీరు కూడా లోకేష్ క్యాంప్ సైట్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పొదలాడలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. జగన్ సర్కార్ నియంతృత్వానికి చంద్రబాబు అరెస్ట్, లోకేష్ ను బెజవాడ వెళ్లకుండా అడ్డుకోవడం పరాకాష్ట అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం పోలీసు క్యాంపుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

చంద్రబాబు అరెస్టు.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు హౌస్ అరెస్ట్

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబు నాయుడిని  పోలీసులు అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు.ప్రభుత్వ వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను చంద్రబాబు నుంచి అరెస్టుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. నంద్యాలోని ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఆయన బస చేసిన బస్సులోనే ఆయనతో మాట్లాడిన డీఐజీ రఘురామ రెడ్డి ఆ సందర్భంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు న్యాయవాదుల వద్ద స్టఫ్ లేదని వ్యాఖ్యానించి ఆ తరువాత ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. మొత్తం మీద చంద్రబాబును అరెస్టు చేసినట్లు ప్రకటించిన సీఐడీ పోలీసులు ఆయనను   స్కిల్ డెవలెప్‌మెంట్‌ కేసులో అరెస్టు చేసినట్లు ప్రకటించారు.  చంద్రబాబును  ఆయన కాన్వాయ్‌లోనే ఎన్‌ఎస్‌జీ భద్రతతో ఓర్వకల్లు విమానాశ్రయానికీ, అక్కడ నుంచి విజయవాడకు తరలించనున్నట్లు చెప్పారు. ఇలా ఉండగా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు ఆయన హై బీపీ, సుగర్ ఉందని పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అదలా ఉంటే తొలుత శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నంద్యాలలో చంద్రబాబు బసచేసిన ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగేదేశం ముఖ్యనాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేశారు.  ఐటీ నోటీసుల కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేస్తారని మొదట ప్రచారం జరిగినప్పగటికీ, ఆ కేసులో షోకాజ్‌ నోటీసు మాత్రమే వచ్చినందున అరెస్ట్‌ చేసే అవకాశం లేదని, అన్నమయ్య జిల్లా అంగళ్లు దాడి ఘటనలో ఆయన్ను అరెస్ట్‌ చేస్తున్నారనీ అంటున్నారు. మొత్తంగా చంద్రబాబు అరెస్టుకు జగన్‌ సర్కార్ పావులు కదుపుతున్న తీరు కుట్రపూరితంగాఉందని, ఆయన అరెస్టుకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు రావడమే ఇందుకు నిదర్శనమని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి  ఎందుకంటే శని, ఆదివారాలు కోర్టుకు సెలవు. కేసులో మోపిన అభియోగాల తీవ్రత దృష్ట్యా మేజిస్ట్రేట్‌ ఇంటి వద్ద చంద్రబాబును హాజరు పరిచినా అప్పటికప్పుడు బెయిలు మంజూరయ్యే అవకాశాలున్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.   అదలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సమయం గడిచే కొద్దీ  రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెన్షన్ వ్యాపించింది. నంద్యాల చంద్రబాబు బసచేసిన ఫంక్షన్ హాల్ వద్దకు పోలీసులు చేరుకున్న వార్త తెలిసిన క్షణాలలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. నంద్యాల నుంచే కాకుండా చుట్టుపక్కన జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం నాయకులు నంద్యాల ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు.    ఇలా ఉండగా చంద్రబాబును అరెస్టు చేస్తున్నామంటూ పోలీసులు చూపిన ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదని న్యాయవాదులు డిఐజీని ప్రశ్నించగా, అన్ని పత్రాలూ ఉన్నాయనీ, హైకోర్టుకు సమాచారం ఇచ్చామనీ చెప్పారు. అరెస్టు తరువాత అన్ని వివరాలూ చెబుతామంటూ మాట దాటేశారు.జగన్ ప్రభుత్వం తనను ఏదో విధంగా అరెస్టు చేయడానికి కుట్ర పన్నుతోందన్న అనుమానాన్ని చంద్రబాబు మూడు రోజుల కిందటే వ్యక్తం చేశారు.  ఆయన అనుమానించినట్లే నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఇక అప్పటి నుంచీ శనివారం తెల్లవారే వరకూ హైడ్రామా కొనసాగింది. ఊహాగానాలే తప్ప అసలు చంద్రబాబును ఏ కేసులో అరెస్టు చేస్తున్నారన్నది కూడా పోలీసులు చెప్పడానికి వెనుకాడారు.  చంద్రబాబును  ఎలాగైనా జైలుకు పంపాలన్న ప్రభుత్వాధినేత జగన్ ఆదేశాన్ని శిరసావహించేందుకు పోలీసులు అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారని తెలుగుదేశం శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి.  డీఐజీతో చర్చల సందర్భంగా చంద్రబాబు తాను తప్పు చేస్తే నడి రోడ్డులో ఉరి తీయాలని   కానీ చేసిన తప్పేంటో .. కేసేంటో చెప్పకుండా అరెస్ట్ కు ప్రయత్నించడం ఏమిటన్ననియంతృత్వం కాకమరేమిటని చంద్రబాబు, నిలదీశారు. అయితే డీఐజీ మాత్రం వివరాలన్నీ  రిమాండ్ రిపోర్టులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. సర్వ విలువలనూ, నిబంధనలనూ తుంగలో తొక్కి చంద్రబాబును అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు చంద్రబాబు న్యాయవాదులు తమను చుట్టుముట్టి బెదరిస్తున్నారంటూ ఎదురు ఆరోపణలు చేయడం అందరినీ విస్మయపరిచింది. అయితే పోలీసుల వితండ వాదనకు చంద్రబాబు న్యాయవాదులు దీటుగా బదులిచ్చారు మా హక్కుల గురించి ప్రశ్నిస్తే… బెదిరించడం ఎలా అవుతుదని నిలదీశారు. మొత్తం మీద గంటల తరబడి సాగిన హై డ్రామా అనంతరం చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసి ఆయన కాన్వాయ్ లోనే ఓర్వకల్లు విమానాశ్రయానికి తరలించారు.  

జగన్ అంటే దుల్కర్ సల్మాన్ కీ దడే!

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటుడిగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఆయన కెరీర్‌లో చేయని పాత్ర లేదు. మలయాళంలోనే కాదు, ఇతర భాషల్లో కూడా ఆయనకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కూడా విభిన్నమైన క్యారెక్టర్లు, విభిన్నమైన సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. మలయాళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న దుల్కర్‌ డబ్బింగ్‌ సినిమాలతోనే కాదు స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.  ఇప్పుడు దుల్కర్‌ చేస్తున్న సినిమాల కంటే ముందే ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. అదే ‘యాత్ర2’. 2019లో వై.యస్‌.రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన ‘యాత్ర’ చిత్రంలో వైఎస్‌ఆర్‌గా మమ్ముటి నటించారు. వైఎస్‌ఆర్‌ పాత్రలో మమ్ముట్టి జీవించారు. ఈ సినిమా  2019 ఎన్నికలలో వై.ఎస్‌.జగన్‌ విజయానికి ఎంతగానో దోహదపడిందనడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2024 ఎన్నికల నేపథ్యంలో మళ్లీ వి.రాఘవ్‌ దర్శకత్వంలో ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వైఎస్‌ఆర్‌, జగన్‌ మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించనున్నారు. మొదట ఈ సినిమాలో వై.ఎస్‌.జగన్‌ పాత్రకు దుల్కర్‌ సల్మాన్‌ని అనుకున్నారట. తండ్రి మమ్ముట్టి వైఎస్‌ఆర్‌గా నటించారు కాబట్టి తనయుడు దుల్కర్‌ అయితే జగన్‌ పాత్రకు అతికినట్లు సరిపోతాడని భావించిన దర్శకుడు దుల్కర్‌కు  ‘యాత్ర 2’ గురించి చెప్పి ఆ సినిమీలో జగన్ పాత్ర పోషించాలని కోరారట. అయితే ఇందుకు దుల్కర్ విముఖత చూపారు.  తాను వై.ఎస్‌.జగన్‌ పాత్ర పోషించడం వల్ల రాజకీయంగా  ఇబ్బందులు వస్తాయని, అది తన సినిమా కెరీర్‌ని దెబ్బ తీస్తుందని  దుల్కర్‌ భావించి ఆ ఆఫర్‌ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడని చెబుతున్నారు.  దీంతో జగన్‌ పాత్ర కోసం జీవాని ఫిక్స్‌ చేసుకున్నారు. మొత్తం మీద జగన్ రాజకీయ ప్రత్యర్థులకే కాదు.. సినీ జీవులకూ దడే అంటే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాలలో హాల్ మార్క్ నిబంధనల పరిధిలోకి మరిన్ని జిల్లాలు

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం  కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ నిబంధనను అమలులోకి  తీసుకువచ్చింది. హాల్ మార్క్ ద్వారా బంగారు ఆభరణాల కొనుగోలు దారులు  స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  2021 జనవరి 15 నుంచి బంగారు నగలకు హాల్‌మార్క్ నిబంధనను తప్పనిసరి అయినప్పటికీ ఈ నిబంధన ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలోనే అమలులో ఉంది. తాజాగా దీనిని విస్తరించడంతో తెలంగాణలో కొత్తగా ఈ నిబంధన పరిధిలోకి మరో ఐదు జిల్లాలు చేరాయి.   ఇప్పటి వరకూ తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు మాత్రమే హాల్ మార్క్ నిబధన పరిధిలో ఉండగా ఇప్పుడు   మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను చేర్చింది. దీంతో తెలంగాణలో  12 జిల్లాలు బంగారు నగలకు హాల్‌మార్క్ నిబంధనల పరిధిలోకి వచ్చినట్లైంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ ఈ నిబంధన పరిధిలో   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు మాత్రమే ఉండగా ఇప్పుడు  అన్నమయ్య ,కోనసీమ , ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలయాడ్ అయ్యాయి. దీంతో ఏపీలో హాల్‌మార్క్ నిబంధనల పరిధిలోకి వచ్చిన జిల్లాల సంఖ్య 17కు పెరిగింది. 

హోంగార్డ్ రవీంద్ర మృతి.. దిగి వచ్చిన ప్రభుత్వం    

అసెంబ్లీ ఎన్నికలు దూసుకొచ్చేస్తున్నాయి.. ముచ్చటగా మూడోసారి అధికారం అందుకొనేందుకు బీఆర్ఎస్  పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అండ్ కో ఓటర్లను కాకా పట్టేందుకు.. తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అందులోభాగంగా.. డబుల్ బెడ్ రూం ఇళ్లు లబ్దిదారులకు కేటాయించే కార్యక్రమాన్ని కారు పార్టీ నేతల కనుసన్నల్లో కేటాయిస్తున్నారు.  అలాగే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని.. అందుకోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఇప్పటికే గులాబీ బాసు సూచించారు. అలాగే ప్రజలకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన వాయు వేగంతో కదులుతోంది. అలాంటి వేళ.. జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని.. ఉన్నతాధికారులు తమను వేధిస్తున్నారంటూ.. హోంగార్డులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ.. తమను పోలీసులతో సమానంగా చూడాలంటూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ కామాండెంట్ కార్యాలయం ఎదుట ఎం రవీంద్ర ఓంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నారు. 60 శాతంపైగా కాలిన గాయాలతో.. అతడిని తొలుత ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  అయితే అతడి పరిస్థితి విషమంగా మారడంతో.. కంచన్ బాగ్‌లోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. ఉపిరితిత్తులు దెబ్బతినడంతో.. వెంటిలేటర్‌ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు. ఆ క్రమంలో శుక్రవారం అంటే ఆగస్ట్ 8వ తేదీన రవీంద్ర మరణించారు. అతడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  రవీంద్ర మృతితో హోం గార్డులు జేఏసీ ఆందోళన బాట పట్టింది. ఈ నెల 16వ తేదీ వరకు విధులు బహిష్కరించాలంటూ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తమై.. పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఓ ప్రచారం అయితే ఊపందుకొంది. ఆ క్రమంలో హోంగార్డులందరు డ్యూటీలో తప్పని సరిగా ఉండాలని.. డ్యూటీలో లేని హోంగార్డులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో ఉండాలని సూచించారు. అలాగే వీరంతా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్‌పెక్టర్లను ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌లో పని చేసే వారుసమ్మెకు దిగితే.. వారిని విధుల నుంచి బహిష్కరిస్తామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.    మరోవైపు.. హోంగార్డు రవీంద్ర భార్య సంధ్య ఇతర కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తన భర్త ఉన్నతాధికారుల వేధింపుల వల్లే మరణించారంటూ ఆరోపించారు. తన భర్త ఆత్మహత్మకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని.. అందుకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారుల పేర్లను సైతం ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.  అలాగే ఆమె ఆందోళన చేస్తున్న క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమెను పరామర్శించారు.  ఇంకోవైపు ఆందోళనకు దిగిన హోంగార్డు భార్యతో పోలీస్ ఉన్నతాధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతమయ్యాయి.  రెండు రోజుల తర్వాత నగర పోలీస్ కమిషనర్ వద్దకు తీసుకెళ్లనున్నట్టుగా డీసీపీ హామీ ఇచ్చారు. అలాగే హోంగార్డు ఉద్యోగం కాకుండా పోలీస్ శాఖలో మరో ఉద్యోగం  ఇప్పించే ప్రయత్నం చేస్తామని  సంధ్యకు డీసీపీ హామీ ఇచ్చారు. ఈ హామీతో సంధ్య సానుకూలంగా స్పందించారు. దీంతో ఆమె తన ఆందోళన విరమించారు.

కేశినేని స్వరం మారిందా.. తత్వం బోధపడిందా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని  ఏం మాట్లాడినా ముక్కుసూటిగా ఉంటుందంటారు. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంచి పలుకుబడి కలిగిన రాజకీయవేత్త అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా బెజవాడ రాజకీయాలలో ఆయన ఆధిపత్యం తిరుగులేనిది. అందుకు ఆయన గత ఎన్నికలలో విజయవాడ నుంచి ఎంపీగా ఎన్నిక కావడమే అంటారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో  అత్యధిక అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధించినా.. లోక్ సభ సభ్యుడిగా కేశినేని నాని గెలవడమే బెజవాడలో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనంగా చెబుతారు. అటువంటి నాని ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ఏం కాబోతోందన్న బెంగలో పడ్డారు. అసలు ఆయన రాజకీయాలలోకి రావడమే కాకతాళీయం అంటారు ఆయన ప్రస్థానం గురించి తెలిసిన వారు. అసలు నాని రాజకీయ నాయకుడు కాదు.. సినిమా హీరో కావాల్సిన వారు. తొలుత ఆయన తన భవిష్యత్ కు, ఎదుగుదలకు సినీ హీరోగా కెరీర్ ప్రారంభించాలని భావించారు. ఇందు కోసం ఆయన దర్శక రత్న దాసరి వద్దకు వెళ్లారు. దాసరి అప్పట్లో కొత్త నటీనటులతో ఓ సినిమా తీసే యోచనలో ఉన్నారు. అందులో ఇద్దరు హీరోలలో ఒకరిగా నానికి దాదాపు చాన్స్ ఇచ్చేశారు. అయితే అప్పట్లో కేశినేని నానితో పోటీ పడి చివరి నిముషంలో కేశినేని నాని అవకాశాన్ని తన్నుకు పోయిన వ్యక్తి కలెక్షన్ కింగ్ గా విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన మోహన్ బాబు. ఔను అప్పటిలో చివరి క్షణంలో సినీమా హీరోగా అవకాశం తప్పిపోవడంతో కేశినేని నాని ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. కేశినేని ట్రావెల్స్ స్థాపించి రవాణా రంగంలో రాణించారు. అక్కడి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీగా ఎదిగారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన కెరీర్ లో ఏరీ ఆయన చాయిస్ కాదు.. చాన్స్ అంతే. రాజకీయంగా తన ఎదుగుదలకు దోహదపడిన తెలుగుదేశంతో గత కొంత కాలంగా ఆయన అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలై విపక్ష పాత్రకు పరిమితమైన నాటి నుంచీ  అధికార వైసీపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లుగా నాని తీరు ఉంది.  పార్టీలోని కొందరు నాయకులతో తన కున్న విభేదాలను అడ్డుపెట్టుకుని తన స్థాయిని మరిచి మరీ  సొంత పార్టీ తెలుగుదేశంపై, ఆ పార్టీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించి ఉద్దేశపూర్వకంగా పార్టీకి దూరం అవుతున్న సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ  కేశినేని నాని అదే సమయంలో అధికార వైసీపీ నేతలపై పొగడ్తల వర్షం కురిపించి ఇక తెలుగుదేశం పార్టీ కూడా తనను లెక్కలోంచి తీసేసే పరిస్థితిని స్వయంగా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని వైసీపీ గూటికి చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు పలు సందర్భాలలో విశ్లేషించారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే నిర్ణయానికి వచ్చేసి కేశినేని నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికలలో   విజయవాడ లోకసభ స్థానం నుంచి కేశినేని చిన్నిని పార్టీ అభ్యర్థిగా నిలపాలన్న నిర్ణయానికి వచ్చేసింది.  దీంతో బెజవాడ బరి అన్నదమ్ముల సవాల్ గా మారనున్నదన్న భావన సర్వత్రా కలిగింది. అయితే వైసీపీ పట్ల పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతను గమనించారో ఏమో కానీ కేశినేని నాని తన ప్రయాణం తెలుగుదేశంతోనే అని పదే పదే చెబుతూ పార్టీ అధిష్ఠానం మెప్పు పొందాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే  ఆయన పదే పదే తాను విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రానున్న ఎన్నికలలో నిలబడతానని చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హస్తినలో ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా నిరాకరించిన సంగతిని మరిచిపోయి ఆయన వంటి దార్శనికుడు, నిజాయితీ పరుడు లేడంటూ కీర్తిస్తున్నారు. తాజాగా కంచికచర్లలోని ఏకత్వ ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కు హాజరైన కేశినేని నాని మరోసారి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి నిజాయితీ పరుడు లేడన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయాలలో మచ్చ లేని వ్యక్తిగా చంద్రబాబుది స్వచ్ఛమైన వ్యక్తిత్వమన్నారు. ఇంతకీ అంత చేసిన కేశినేని నాని ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం విశ్వాసాన్ని పొందగలరా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు కు ఐటీ నోటీసులపై స్పందించిన కేశినేని నాని నోటీసులు పెద్ద విషయం కాదన్నారు. వివరణ ఇస్తే సరిపోతుందనీ దానిపై అనవసర ఊహాగానాలు వ్యర్థమని వైసీపీకి చురకలంటించారు. అక్కడితో ఆగకుండా తాను తెలుగుదేశంలోనే ఉన్నాననీ, ఉంటాననీ చెబుతూ వచ్చే ఎన్నికలలో విజయవాడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా తానే బరిలో ఉంటానన్నారు.  ఇక ఏపీలో పొత్తులపై చర్చ గురించి మాట్లాడుతూ పొత్తుల విషయం పూర్తిగా తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయమేననీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే క్యాడర్ అంతా దానికి కట్టుబడి ఉంటుందన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అసత్యాలనీ, తాను పార్టీలోనే పార్టీతోనే ఉంటానని స్పష్టం చేశారు. 

మా ఎన్నికలు మరోసారి గోల గోల?!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు పదవీ కాలం ఆక్టోబర్ రెండో వారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆక్టోబర్ 10 తేదీన మళ్లీ మా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ అందుకు సంబంధించిన హడావుడి ఏమీ  మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌లో  కనిపించకపోవడం పట్ల ఫిలింనగర్ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మా ఎన్నికలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే..  ఆ క్రమంలో  2021, ఆక్టోబర్ 10న  మా ఎన్నికలు జరిగాయి. ఆక్టోబర్ 13న మా అధ్యక్షుడిగా మంచు విష్ణు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.  మళ్లీ ఈ ఏడాది అంటే 2023, అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉందని.. కానీ దీనిపై ఇప్పటి వరకు టాలీవుడ్ పెద్దలు పెదవి విప్పకపోవడంపై ఆశ్చర్యం  వ్యక్తమౌతోంది.  2021లో జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ వర్గం, మంచు విష్ణు వర్గం హోరా హోరీగా తలపడ్డాయి. అందులో భాగంగా వారు సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొన్నారు.  ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. అప్పటి  మా ఎన్నికలు  అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి.. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే తాను మా అధ్యక్షుడిగా ఎన్నికైతే... చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు కార్యక్రమాలు చేస్తానంటూ ఆ సమయంలో స్పష్టమైన హామీలు  ఇచ్చారు. అయితే ఆ హామీలు ఎంత వరకు అమలు అయ్యాయన్న ప్రశ్నకు   మంచు విష్ణు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.  మరి మా అధ్యక్ష పదవి కాలం అక్టోబర్‌లో ముగియనుంది. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ మా ఎన్నికల హడావుడి మొదలు కాకపోవడంపై పిలింనగర్ వర్గాలు ఓకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఈ సారి మా ఎన్నికల్లో ఎవరు బరిలో దిగుతారు? ఒ కరే నిలబడి.. మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా చేసుకుంటారా? లేక పోటీ అనివార్యమౌతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదీకాక.. జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత.. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ చాలా ఒడుదుడుకులు ఎదుర్కొంది. సినిమా థియేటర్ల టికెట్ ధరల తగ్గింపు అంశంలో జగన్ పార్టీ వ్యవహారించిన తీరు.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంతో జగన్ పార్టీపై చిత్ర పరిశ్రమ చాలా గుర్రుగా ఉందనే   ప్రచారం జరిగింది. జరుగుతోంది. మరోవైపు  ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు.. ఏపీ సీఎం జగన్‌కు సమీప బంధువు అన్న విషయం అందరికీ తెలిసిందే.  ఇదే విషయాన్ని గత మా ఎన్నికలకు ముందు మంచు విష్ణు వివిధ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్యూలో వివరించిన విషయం కూడా తెలిసిందే.  కానీ సినిమా థియేటర్ల టికెట్ల ధరలు తగ్గింపు అంశంపై మా అధ్యక్షుడిగా మంచు విష్ణు కానీ.. ఆయన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కానీ చొరవ తీసుకొని.. ఏపీ ప్రభుత్వంతో భేటీ అయి చర్చింలేదు.  ఇటువంటి పరిస్థితుల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు.. టాలీవుడ్ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఎక్కడ ఉన్నారనే ఓ ప్రశ్న సైతం నేటికి ఫిలింనగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మా ఎన్నికలు మళ్లీ అక్టోబర్‌లో నిర్వహిస్తే.. అధ్యక్ష పదవికి ఎవరు నిలబడతారు? టాలీవుడ్‌లోని సమస్యలపై ప్రభుత్వంతో పోరాడే సత్తా ఉన్న వాళ్లు నిలబడతారా? లేకుంటే.. మాటల్లో తప్ప చేతల్లో హీరోయిజాన్ని ప్రదర్శించలేని వారే నిలబడతారా? అని ఫిలింనగర్ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. మా ఎన్నికలకు సమయం అసన్నమవుతోన్నా.... సినిమా పెద్దల్లో మాత్రం ఉలుకు పలుకు లేకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న అనుమానం కూడా ఫిలింనగర్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. 

పేద సీఎం జగన్ విదేశీ పర్యటన ఖర్చెంతో తెలుసా?!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2 శనివారం రాత్రి 9.30 గంటలకు తన సతీమణి భారతితో కలిసి జగన్ లండన్‌  పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన పూర్తిగా సీఎం జగన్ తన వ్యక్తిగత పర్యటన. అక్కడే ఉంటున్న తమ పిల్లలు హర్షారెడ్డి, వర్షా రెడ్డిలతో  గడిపేందుకు చేస్తున్న పర్యటన. సెప్టెంబర్ 11న సీఎం జగన్ తిరిగి మళ్లీ రాష్ట్రానికి రానున్నారు. అప్పటి వరకూ జగన్ అక్కడి నుండే  పాలన సాగించనున్నారు. అయితే, జగన్ లండన్ పర్యటన ఖర్చు, ఆయన ప్రయాణ వివరాలు, వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ ధనం వినియోగం ఇదే రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిన సంగతి తెలిసిందే. అటువంటి ధనిక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అంతకు మించి లగ్జ్యూరియస్ గానే ఉంటుంది అందులో సందేహం లేదు. ఆ విషయాన్నే వైసీపీ నేతలు మళ్లీ మళ్లీ చెబుతూ.. జనం సొమ్ముతో జల్సాలు చేసే సీఎం కాదు మా జగన్ అంటూ కీర్తిస్తున్నారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. జనానికి గుర్తు చేస్తున్నారు.  ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేసే సీఎం కాదని, కేవలం రూ.20 విలువ చేసే వాటర్ బాటిల్ మాత్రమే తాగుతారని, సీఎంగా జీతాన్ని కూడా జగన్ త్యాగం చేశారని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తానో సర్వసంగ పరిత్యాగిననీ,   పేదల పక్షపాతినని సందర్భం వచ్చినా రాకపోయినా.. సందర్భం ఉన్నా, లేకపోయినా  చెప్పుకుంటూ జగన్ కూడా తన భుజాలను తానే చరుచుకోవడం కూడా కద్దు.  అయితే  అదే సీఎం ఆ మధ్య తాడేపల్లి నుండి తెనాలి వరకూ జస్ట్ 28కిలో మీటర్ల  రోడ్డు ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ పై వెళ్లారు. అప్పుడే దానిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఆ తర్వాత అమరావతి రాజధానిలో తన ఇంటికి అత్యంత సమీపంలో జరిగిన ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికీ హెలికాప్టర్లోనే వెళ్లారాయన.  జస్ట్ పది నిమిషాల రోడ్డు ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ లో వెళ్లిన పేద సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఆయనను ట్రోల్ చేశారు. అదలా ఉండగా  ఇప్పుడు జగన్ లండన్ పర్యటన ఖర్చు కూడా విమర్శల పాలవుతోంది. జగన్ దంపతులు ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. అది కూడా ఏదో ఆషామాషీ ఫ్లైట్ కాదు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానాలలో ఒకటైన ఎంబ్రాయెర్ లినేజ్ 1000 ఫ్లైట్ . 435 కోట్ల రూపాయల విలువైన ఈ విమానంలో సుమారు 19 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. ఈ విమానం అద్దె గంటకు సుమారు 14 వేల 850 డాలర్లు. మన కరెన్సీలో చూస్తే గంటకు సుమారు 2 లక్షల 71 వేలు. విజయవాడ నుంచి లండన్ వెళ్లేందుకు సుమారు 11 గంటల సమయం పడుతుంది.. అలాగే అటు నుంచి రావడానికి మరో 11 గంటలు పడుతుంది. దీంతో పాటు ఇంధనం నింపుకోవడానికి నిలిపే సమయానికి కూడా అద్దె కట్టాల్సిందే. ఫ్లైట్ ఫ్యూయల్ అండ్ ఆపరేషన్ కాస్ట్ కూడా అద్దెకి తీసుకున్న వారే చెల్లించాలి. ఈ లెక్కన చూస్తే  జగన్  లండన్ పర్యటనకు ఒక్క విమాన ఖర్చు రూ.40 కోట్ల పైమాటే. అంతేకాదు, ఒకవేళ విమానాన్ని పర్యటన మొత్తం తనతో ఉంచుకోవాలని అనుకుంటే అక్కడ దానికి పార్కింగ్ ఛార్జీలు, ఫైలట్ మెయింటనెన్స్, ఇతరత్రా ఖర్చులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ఈ ఖర్చు మరో 10 లేక 20 కోట్లు పెరిగిపోతుంది. జగన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్లినా ఈ ఖర్చు మొత్తం ప్రభత్వ ఖజానా నుండే  చెల్లిస్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.  ఈ క్రమంలో తాను పేద సీఎంను అని.. పేదల పెన్నిధిని అంటూ జగన్ చెప్పుకోవడం, ఆయన పార్టీ నేతలు తానతందాన అనడం ఎవర్ని మభ్య పెట్టడానికనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే జగన్ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. పేద సీఎం తన కుమార్తెపై ప్రేమ చూపేందుకు  రూ.40 కోట్లు ఖర్చు పెట్టారు,  కానీ ప్రజల పనులు మాత్రం చేయరు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ పేదవాళ్లు చేయాల్సిన పనులు చేస్తున్నారా అంటూ నిలదీశారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా జగన్ లండన్ పర్యటన వ్యయంపై  తెగ ట్రోల్స్ వస్తున్నాయి. అనగనగా ఓ పేదవాడు.. వాడి ఇంట్లో డ్రైవర్లు, పనిమనుషులు, వంట మనిషి అందరూ పేదవారే అంటూ సాగే ఓ సినిమా వీడియోతో సీఎంను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. జగన్ గతంలో దావోస్ కు వెళ్ళినపుడు కూడా ప్రభుత్వ ఖర్చుతో అత్యంత విలాసవంతమైన విమానంలోనే వెళ్లారు. ప్రయాణికుల విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణించడమూ ఆడంబరమే అవుతుందని ఆయన భావిస్తారేమో పాపం. అందుకే సొంతంగా అత్యంత విలాసవంతమైన విమానాన్ని అద్దెకి తీసుకొని సతీసమేతంగా కుమార్తెల వద్దకు వెళ్లారు ఈ పేద సీఎం.

జగన్ యాత్ర.. ప్రజలకు దూరంగానేనా?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ.. భవిష్యత్త్ గ్యారంటీ, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు పేరుతో చేపట్టిన యాత్రలు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహీ యాత్రతో... ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ   యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సాధారణంగా ఎన్నికల సంవత్సరంలో అధికార పార్టీ కూడా తన పాలనలో ప్రజలకు అందించిన ప్రయోజనాలు, సంక్షేమం, రాష్ట్ర ప్రగతి తదతర అంశాలతో ప్రజలలోకి విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అయితే ఏపీలో అధికార వైసీపీ మాత్రం ఆ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చేసింది, చెప్పుకోవడానికీ ఏం లేదన్న భావనా, గడపగడపకూ, జగనన్నే మా నమ్మకం కార్యక్రమాలలో ఎదురైన అనుభవమే మళ్లీ పునరావృతం అవుతుందన్న భయమో కానీ వైపీపీ ఇంత వరకూ ప్రజల ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన తరువాత వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రజలలో మమేకం కావడానికి ఓ యాత్ర చేపట్టేందుకు నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ ఆ పర్యట నుంచి తిరిగి రాగానే యాత్రకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు.  గతంలో అంటే విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేశారు. అయితే ఈ సారి యాత్ర మాత్రం పాదయాత్ర కాదు..   ప్రజా యాత్రలాగా రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలు పేర సంక్షేమ పథకాలంటూ బటన్ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లోకి నగదు జమచేస్తున్నారు. ఆ విషయాన్నే ప్రధానంగా ప్రచారం చేస్తూ.. ప్రజలకు తన ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని మరోసారి వారికి వివరించడం, అదే సమయంలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం లక్ష్యంగా జగన్ ఈ యాత్రకు సంకల్పించినట్లు చెబుతున్నారు. అన్నీ కుదిరితే వచ్చే నెల చివరి వారం నుంచీ జగన్ యాత్ర ప్రారంభం అవుతుందని అంటున్నారు.  ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్, ఏర్పాట్లు తదితర అంశాలను ఖరారు చేసేందుకు జగన్  ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు  ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఓ కమిటీని వేసినట్లు చెబుతున్నారు.   ఈ యాత్రలో భాగంగా  రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు సీఎం జగన్ బస చేసి స్థానిక ప్రజలతో మమేకం అవుతారనీ, పనిలో పనిగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుంటారనీ,  అలాగే  ఆయా నియోజకవర్గంల్లోని పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే పని కూడా చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  జగన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రచ్చబండ కార్యక్రమాన్ని రూపొందించిన  విషయం తెలిసిందే. ఆ క్రమంలో 2009, సెప్టెంబర్ 2 వ తేదీ.. కర్నూలు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వైఎస్    హెలికాప్టర్  ప్రమాదంలో కన్నుమూసిన సంగతి విదితమే.  అప్పట్లోవైఎస్  రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు గ్రామస్థాయిలోని  ప్రజలకు అందుతున్నాయా లేదో తెలుసుకోవడం లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం నిర్వమించేవారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి  వైఎస్ పథకాలకు అద్భుతమైన ప్రజాస్పందన అప్పట్లో వచ్చింది. అందుకే ఆయన రచ్చబండ కార్యక్రమానికి ధైర్యం చేయగలిగారు. అయితే అందుకు భిన్నంగా జగన్ పథకాలకు ప్రజాదరణ సంగతి అటుంచి తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తున్నది. ఈ తరుణంలో జగన్ రచ్చబండ పేరుతో  ప్రజల మధ్యకు వెళ్లితే.. ప్రజల నుంచి వ్యతిరేకతను ఆయన ప్రత్యక్షంగా చూసే వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా  జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను  ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత  పట్టించుకోలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విపక్ష నేతగా రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చి.. ఆ తర్వాత మూడు రాజధానులను తెరపైకి తీసుకు వచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్నే కాదు.. ప్రత్యేక హోదాను సైతం పక్కన పెట్టేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల మధ్యకు సీఎం  జగన్ వెళ్తే... ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఆయన స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందని పరిశీలకులు అంటున్నారు.  అదీకాక సీఎంగా   జగన్  ఇప్పటి వరకూ చేపట్టిన  పర్యటనల్లో రహదారులకు ఇరువైపులా పరదాలు కట్టుకొని వెళ్లారు. అలాగే సీఎం పర్యటన కావడంతో భారీగా పోలీసులు మోహరించి జనం ఆయన సమీపానికి రాకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నారు.  చెట్లను సైతం నరికేశారు. వీటన్నిటికీ మించి సీఎం క్యాంప్ కార్యాలయానికి  మూడు నాలుగు కిలోమీటర్ల దూరానికి సైతం ఆయప హెలికాఫ్టర్‌లో వెళ్తున్నారు. అలాంటి సీఎం జగన్   రాజధాని అమరావతి ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించగలరా? అని రాజకీయ విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వేళజగన్  ఆ ప్రాంతానికి వెడితే గిడితే  భూములు ఇచ్చిన రైతుల ఆవేదనను, ఆవేశాన్ని, వారి ఆగ్రహాన్ని చవి చూడక తప్పదని అంటున్నారు.  ఏది ఏమైనా  జగన్ రచ్చబండ కార్యక్రమం అంటూ ప్రజల్లోకి వెళ్లడం అంటూ జరిగితే.. గతంలో గడపగడపకూ కార్యక్రమంలో ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎదుర్కొన్న చేదు అనుభవాలు జగన్ కు కూడా ఎదురు కాక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా కాకుండా ఆయన అధికారిక పర్యటనల్లాగే పరదాలు అడ్డు పెట్టుకుని పోలీసులను మోహరించి ప్రజలకు దూరంగా జగన్  యాత్ర జరిగితే.. ఆయన పట్ల, ఆయన ప్రభుత్వం పట్లా ఇప్పటికే ఉన్న ప్రతికూలత మరింత పెరగడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించదని అంటున్నారు. 

తెలంగాణలో చతుర్ముఖ పోటీ.. కమలనాథుల వ్యూహమేనా?

కర్నాటక ఎన్నికల తరువాత తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ తన వ్యూహాలను పూర్తిగా మార్చేసింది. కర్నాటక ఓటమితో ఆ పార్టీ నేర్చుకున్న గుణపాఠాలు ఏమిటన్నది పక్కన పెడితే.. ఆ పార్టీ అంత వరకూ అనుసరించిన   పెళ్లికి, తద్దినానికి ఒకే మంత్రం పఠించే  విధానానికి తెలుగు రాష్ట్రాలలో చెల్లు చీటీ అయితే చెప్పేసింది.  ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో వర్కౌట్ కావని డిసైడైపోయిన కమలనాథులు తెలుగు రాష్ట్రాలలో  కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.   తెలంగాణలో అప్పటి వరకూ తిరుగులేని పార్టీగా, రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం ఖాయంగా భావిస్తూ వచ్చిన  కమలం హైకమాండ్ .. కర్నాటక  ఫలితాల తరువాత తెలంగాణ బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలను చూసి తెల్లబోయింది.  వెంటనే ప్రక్షాళన అంటూ  రాష్ట్ర పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టింది. బండి సంజయ్ నుంచి  రాష్ట్ర పగ్గాలు తప్పించి వాటిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కట్టబెట్టింది. అయితే రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన పేర బీజేపీ  హైకమాండ్ చేసిన వైద్యం వికటించింది. అప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న పార్టీలో విభేదాలు.. ఈ మార్పుల తరువాత ఒక్క సారిగా  బహిర్గతమయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సభ వేదికపై నుండే బండి మద్దతు దారులు హడావుడి చేశారు. దీంతో కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం కాస్తా బండి సంజయ్ సన్మాన సభగా మారిపోయింది. అధిష్టానం నిర్ణయం పట్ల తన అసంతృప్తిని, వ్యతిరేకతను కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు వంటి వారు అన్యాపదేశంగానైనా అదే సభావ వేదిక పై నుంచి వెల్లడించేశారు. ఇక విజయశాంతి వంటి వారు ఆ కార్యక్రమం నుంచి అర్ధంతరంగా వాకౌట్ చేసి తన నిరసన తెలియ చేశారు.  అది మొదలు తెలంగాణ బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోయింది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అస్త్ర సన్యాసం చేసేశారు. దీంతో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయంటూ బీజేపీ ఆర్భాటంగా చెప్పిన అమిత్ షా ఖమ్మం సభ చప్పగా ముగిసింది.   దీంతో  అప్పటి వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా.. రాష్ట్రంలో ద్విముఖ పోరుతోనే తమకు ప్రయోజనంగా  భావించి అడుగులు వేసిన బీజేపీ వ్యూహం మార్చి రాష్ట్రంలో త్రిముఖ పోరు జరిగితేనే రాజకీయంగా లబ్ధి పొందుతామన్న నిర్ణయానికి వచ్చింది.  ఈ వ్యూహంలో భాగంగానే  బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకు దూరంగా ఉంటున్నట్లు కలర్ ఇస్తోందనీ, తెలంగాణలోని అన్ని స్థానాలలోనూ తెలుగుదేశం పోటీ నిర్ణయం వెనుక బీజేపీ వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా తెలుగుదేశం తెలంగాణలో ఇప్పటికీ బలమైన పార్టీయే ఇందులో సందేహం లేదు. అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం గత ఎనిమిదిన్నరేళ్లుగా కాడె వదిలేయడం వల్ల క్యాడర్ స్దబ్దుగా మిగిలిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారిపోయిందో.. అప్పటి నుంచీ తెలుగుదుశం తెలంగాణలో తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. తెలంగాణ సెంటిమెంట్ ఇక పని చేయదన్న అంచనాతో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో.. మరీ ముఖ్యంగా విశ్వనగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందే విషయంలో తెలుగుదేశం పాత్ర, చంద్రబాబు దార్శనికతను తెలంగాణ ప్రజకు గుర్తు చేస్తూ విస్తృతంగా జనంలోకి వెడుతున్నది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ఖమ్మంలో నిర్వహించిన సభ అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా తెలుగుదేశం కూడా పోటీలో నిలవడం ఖాయమన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతోంది. ఈ పరిస్థితినే బీజేపీ కేంద్రంలో మరో సారి అధికారంలోకి రావడానికి అనువుగా మార్చుకునే విధంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో పొత్తులు లేకుండా  బలమైన శక్తిగా తెలుగుదేశం బరిలో నిలిస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు దెబ్బతింటాయనీ, రాజకీయంగా కమలం లబ్ధి పొందుతుందనీ భావిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఇప్పటికే తన ఖాతాలో పడిందని అంచనా వేస్తున్న బీజేపీ.. ఇప్పుడు తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల బరిలో గట్టిగా నిలబడితే కాంగ్రెస్ బలహీనం అవుతుందని భావిస్తున్నది. రాష్ట్రంలో నేరుగా అధికారంలోకి రాలేకపోయినా.. చతుర్ముఖ పోటీ వల్ల  తెలంగాణలో హంగ్ ఏర్పడితే.. అప్పుడు రాష్ట్రంలో చక్రం తిప్పే అవకాశం తమదే అవుతుందని కమలనాధులు భావిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇందుకోసమే ఏపీలో కమలం పార్టీ తటస్థ వైఖరిని అవలంబిస్తోందనీ, తెలుగుదేశం పార్టీతో పూర్తి అవగాహనతోనే.. ఈ వ్యూహాన్ని పక్కాగా ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తోందనీ వివరిస్తున్నారు. దీంతో తెలుగురాష్ట్రాలలో నేరుగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోయినా.. ఆ రెండు రాష్ట్రాలలో కింగ్ మేకర్ పాత్ర పోషించి తద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి  పెద్ద పంఖ్యలో లోక్ సభ సభ్యుల మద్దతు కూడగట్టేలా కమలనాథులు వ్యూహరచన చేశారని చెబుతున్నారు. 

ఏపీలో బీజేపీ తటస్థం.. అసలు వ్యూహం ఏమిటంటే?

కేంద్రంలోని మోడీ సర్కార్ అయితే జమిలి లేకుంటే మినీ జమిలి అని ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది. దీని ద్వారా రాజకీయంగా బోలెడు లబ్ధి ఉందని భావిస్తోంది. ప్రజా వ్యతిరేకతను తట్టుకుని ముచ్చటగా మూడో సారి కేంద్రంలో మోడీ సర్కార్ కొలువు దీరాలంటే ముందస్తే బెస్ట్ అని డిసైడైపోయినట్లు కనిపిస్తోంది. అదే జరిగితే రాష్ట్రాలలో జాతీయ అంశాలు, జాతీయ స్థాయిలో స్థానిక అంశాలు మిక్స్ అయిపోయి గట్టెక్కేయగలమన్నది మోడీ సర్కార్ భావనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజాగ్రహం బీజేపీకి ఓట్ల రూపంలో  లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ భావిస్తోంది. మిగిలిన రాష్ట్రాలలో సంగతి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం బీజేపీ వ్యూహాలు ఏవీ ఫలించేలా కనిపించడం లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. సనాతన ధర్మం వివాదం, జమిలి ఎన్నికల నిర్ణయం ఇలా నేల విడిచి ఎన్ని సాములు చేసినా వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు మూడో సారి అధికారంలోకి రావాలంటే చెమటోడ్చినా ఫలితం ఉంటుందా? ఉండదా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్షాల ఐక్యతను దెబ్బ కొట్టైనా సరే అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతున్నది. ఉత్తరాదిలో ఎలాగోలా పాస్ మార్కులు సంపాదించేసుకోగలమన్న ధీమాతో ఉన్న బీజేపీకి దక్షిణాది మాత్రం కొరుకుడు పడటం లేదు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన చేదు అనుభవం, ఆ తరువాత అప్పటి వరకూ అధికారమే తరువాయి అన్నట్లుగా కనిపించిన తెలంగాణలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోవడం.. చేరికల పేరిట బయట నుంచి తెచ్చుకున్న నాయకులకు.. తొలి నుంచీ పార్టీలోనే ఉన్న వారికి మధ్య పొరపచ్చాలతో మొదటికే మోసం అన్నట్లుగా తయారైన పరిస్థితి బీజేపీని గాభరాపెడుతున్నాయనడంలో సందేహం లేదు. దీంతో దక్షిణాది రాష్ట్రాలలో అధికారం సంగతి తరువాత కనీసం ముందస్తు ఎత్తుతో ఆ రాష్ట్రాలలో కొన్న పార్లమెంటు స్థానాలనైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  జీరో అక్కౌంట్ ఉన్న ఏపీలో కనీసం కొన్ని ఎంపీ స్థానాలను దక్కించుకోవడం లేదా.. ఆ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే పార్టీని తమ కూటమిలో చేర్చుకోవడం లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్నదని అంటున్నారు. అందులో భాగంగానే బీజేపీ బీజేపీలో తటస్థ వైఖరి అవలంబిస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి శతధా ప్రయత్నిస్తున్నదని చెబుతున్నారు.  ఏపీలో అధికారంలో  ఉన్న జగన్ సర్కార్ కు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే.. రాష్ట్రంలో మాత్రం ఢీ అంటే ఢీ అనేలా విమర్శలు గుప్పిస్తున్నది. కేంద్రంలో మోడీ సర్కార్ ఏపీ సర్కార్ విధానాలకు వత్తాసు పలుకుతుంటే.. అవే విధానాలను ఏపీ బీజేపీ ఎండగడుతోంది. ఇలా ద్వంద్వ ప్రమాణాలతో బీజేపీ ఏపీ ప్రజలను తాను రాష్ట్రంలో తటస్థంగా ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా పరిమితిని మించి అప్పులు చేస్తున్నదని ఏపీ బీజేపీ విమర్శలు గుప్పించి గణాంకాలతో సహా వివరిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం జగన్ సర్కార్ అలా నిబంధనలకు విరుద్ధంగా పరిమితిని మించి అప్పులు తీసుకోవడానికి అనుమతులు ఇస్తోంది. జమిలి పేర కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందస్తుకు వెళితే అప్పుడు సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇప్పటికే తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే 119 స్థానాలలోనూ పోటీలో ఉంటామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించేశారు. ఆయన ఈ ప్రకటన చేసే సమయానికి జమిలి ప్రస్తావన లేదు. అయితే ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరిగే అవకాశాలు కనిపిస్తుండటం.. అలా జరిగితే ఏపీలో పొత్తు, తెలంగాణలో పోరు అనే విధానం అంతిమంగా తెలుగుదేశం, బీజేపీలకు రెండు రాష్ట్రాలలోనూ నష్టం చేకూరుస్తుంది. అందుకే తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఏపీలో పోటీ చేసినా ఆ కూటమిలో బీజేపీ చేరే అవకాశాలు దాదాపు మృగ్యం. అంటే ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ కూడా బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ విధానం వల్ల ఏపీలో బీజేపీ స్వయంగా పార్లమెంటు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఏమీ మెరుగు అవ్వవు. 2019 ఎన్నికలలో లాగే ఈ సారీ కూడా ఆ పార్టీ అటు ఏపీ అసెంబ్లీలో కానీ, ఇటు ఏపీ నుంచి లోక్ సభకు కానీ ఖాతా తెరిచే అవకాశాలు ఉండవు. అయితే బీజేపీ తన తటస్థ వైఖరి వల్ల ఎన్నికల తరువాత ఏపీలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న పార్టీని తన కూటమిలో చేర్చుకోవడం ద్వారా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎంపీల మద్దతును పొందేందుకు అవకాశాలను సజీవంగా ఉంచుకుంటోందని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఒకే సమయంలో ఏపీలో అధికార, విపక్షాలకు తాను దగ్గరగా ఉన్నామన్న సంకేతాలను ఇస్తోంది.  అందుకే బీజేపీ తెలుగు రాష్ట్రాలలో ఒకే సారి అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నది. ఇరు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరిగితే.. జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉన్న చంద్రబాబు ఏపీలో ప్రచారానికే పరిమితమౌతారు. ఆయనకు తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం పెద్దగా ఉండదు. దీంతో ఆయన ప్రచారం వల్ల తెలంగాణలో బీజేపీపై ప్రభావం పడే అవకాశాలు దాదాపుగా మృగ్యమైపోతాయి. దీంతో తెలంగాణలోని తెలుగుదేశం ఓటు బ్యాంకును బీజేపీ తన వైపునకు తిప్పుకునే అవకాశాలు మెరుగౌతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే సమయంలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి కేంద్రంలో బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేసిన కేసీఆర్ కూడా జమిలి అనే సరికి పూర్తిగా తెలంగాణకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత సార్వత్రిక ఎన్నికలు జరుగుతాన్న ఉద్దేశంతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేశారు. ఎప్పుడైతే జమిలి ప్రతిపాదన తెరపైకి వచ్చిందో ఆయన మహారాష్ట్ర పర్యటనలు కూడా ఆగిపోయాయి. అభ్యర్థుల ఎంపిక, జాబితా ప్రకటన, అసంతృప్తులను బుజ్జగించడం, ఎన్నికల వ్యూహరచన, బీఆర్ఎస్ ను తెలంగాణలో మరోసారి అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రణాళికల రచన వీటితోనే ఆయనకు సరిపోతున్నది. దీంతో బీఆర్ఎస్ ప్రభావం దేశంలో మరే ప్రాంతంలోనూ ఇసుమంతైనా కనిపించడం లేదు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలు అన్న బీజేపీ వ్యూహం తెలంగాణలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ అనే చెప్పాలి. అదే సమయంలో ఏపీలో బీజేపీ తటస్థ వైఖరి అంతిమంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలలో ఎవరికి ప్రయోజనం చేకూరినా ఆ ఫలితం మాత్రం బీజేపీకి అనుకూలంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో ముందస్తేనా?.. జగన్ కు మరో దారి లేదా?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అడుగు ముందుకు వేయాలన్నా, వెనక్కు వేయాలన్నా ఆదేశాలు కేంద్రంలోని మోడీ సర్కార్ నుంచే రావాల్సి ఉంటుంది. అడ్డగోలు అప్పుల కోసం.. కేసుల నుంచి రక్షణ కోసం జగన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ కాళ్లు ముందు మోకరిల్లేలా చేసింది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల దగ్గర నుంచి కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కంటే ముందుగానే జై కొడుతోంది. అటువంటి పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే జగన్ కూడా అందుకు సై అంటూ ఏపీ అసెంబ్లీ రద్దు కు సిద్ధపడక తప్పదు. ఇప్పటికే మోడీ సర్కార్ ఈ ఏడాది డిసెంబర్ చివరిలో లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని మోడీ సర్కార్ జమిలి యోచనలో ఉందనీ, అందుకోసం అవసరమైన సన్నాహాలన్నిటినీ చాపకింద నీరులా సాగించేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో అందరి దృష్టి సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలపైనే ఉంది. మరీ ముఖ్యంగా ఒడిషా, ఏపీ రాష్ట్రాలలోని ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటాయన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే బీజేపీ ముందస్తుకు వెడితే.. ఈ రెండు రాష్ట్రాలూ కూడా ముందస్తుకు సై అంటాయా నో అంటాయా అన్ని చర్చ జరుగుతోంది. ఒక వేళ మోడీ సర్కార్ ప్రతిపాదనకు ఈ రెండు రాష్ట్రాలూ నో అనడమంటూ జరిగితే మోడీ జమిలి లేదా మినీ జమిలి ప్రతిపాదనకు పురిట్లోనే సంధి కొట్టినట్లు అవుతుంది. అయితే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ముందస్తుకు వెళ్లినా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ కారణంతోనే ఆయన ఇప్పటికే ముందస్తుకు సిద్ధమని కేంద్రానికి తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీ విషయానికి వస్తే అన్ని వైపుల నుంచీ సమస్యలతో సతమతమౌతున్న జగన్ ముందస్తుకు వెడితే ముందస్తు మునక తప్పదన్న భావనలో ఉన్నారు. అప్పులు పుట్టడం గగనంగా మారి బటన్ నొక్కుడు కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తుండటంతో ముందస్తుకే మొగ్గు చూపాలా? లేదా  చివరి క్షణం వరకూ అధికారంలో కొనసాగి ఆ తరువాతే అదృష్టాన్ని పరీక్షించుకోవాలా? అన్న మీమాంసలో జగన్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి శ్రీశ్రీ రాసిన సంధ్యా సమస్యలు కవితలోలా ఏం చేయాలో, ఏం తేల్చుకోవాలో అర్ధం కాని అయోమయంలో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి బీజేపీ ఆదేశిస్తే జగన్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సై అనక తప్పదు. ఆయన ప్రభుత్వం బీజేపీ గుప్పెట్లో బందీ అయిన పరిస్థితిలో ఉందని అంటున్నారు.   బీజేపీముందస్తుకు  సిద్ధపడితే జగన్ ఆ పార్టీని అనుసరించక తప్పదని.. నో అనే అవకాశమే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రజలు ఐదేళ్ల పాటు అధికారంలో  ఉండేందుకు తీర్పు నిచ్చారనీ, తము ఐదేళ్లూ అధికారంలో కొనసాగుతామని అందులో మరో ఆలోచనే లేదనీ ప్రభుత్వ సలహాదారు సజ్జల వంటి వారు గంభీర ప్రకటనలు చేస్తున్నా..అదంతా మేకపోతు గాంభీర్యమేనని అంటున్నారు.  అసలు రాష్ట్రంలో ముందస్తు ప్రస్తావన తెచ్చినదే సజ్జల అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ ముందస్తు దిశగా అడుగులు వేస్తే.. జగన్ ఆ అడుగుల్లో అడుగులు వేయడం తప్ప మరో గత్యంతరం లేదని చెబుతున్నారు.   అయితే బీజేపీకి ఉన్న అతి పెద్ద ఆందోళన ఏమిటంటే.. ముందస్తు సరే ఎలాగోలా ఎదుర్కోగలం.. కానీ జమిలి అయితే మాత్రం మునిగిపోవడం ఖాయం అన్న భయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై ప్రజా గ్రహం ఎంత ఉందో.. అంత కంటే ఎక్కువ కేంద్రంలోని మోడీ సర్కార్ పై ఉంది. జగన్ అడ్డగోలు విధానాలకు అంతకు మించి అడ్డగోలుగా మద్దతు ఇచ్చిన బీజేపీకీ గతం కంటే ఓటు గణనీయంగా తగ్గింది. ఈ విషయాన్ని ఇటీవల పలు సర్వేలు బయటపెట్టాయి.   అంటే జమిలి అంటూ జరిగితే జగన్ తన ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకతనే కాకుండా బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా మోయాల్సి ఉంటుంది. అంటే ముందుస్తుగానే జగన్ సర్కార్ దుకాణం మూతపడుతుందన్న భయం వైసీపీలో వ్యక్తం అవుతోంది.  ఈ నేపథ్యంలోనే జమిలిపై ఏకాభిప్రాయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఏదో గొణుగుడు వ్యవహారం కాకుండా.. గట్టిగా బీజేపీని వ్యతిరేకించలేని  బలహీనత వైసీపీలో ఉంది. బీజేపీ నిర్ణయం తీసుకుని ఆదేశించినా జగన్ సర్కార్ ముందస్తుకు ముందుకు రాకపోతే కేసులు చుట్టుముట్టి పుట్టిముంచుతాయని జగన్ ఆందోళన. అందుకే మునిగిపోతామని తెలిసినా బీజేపీ ఆదేశిస్తే జగన్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు  సై అనక తప్పని అనివార్య పరిస్థితిలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీజేపీ.. రజినీకాంత్.. ఓ డైలీ సీరియల్!

మీరిస్తానంటే నేనొద్దంటానా"అంటున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇంతకీ ఎవరు ఇస్తానంటున్నారు? ఏం ఇస్తానంటున్నారు? అనేగా మీ డౌట్. ఇంకెవరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. రజినీని ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించాలని చూస్తోందట. ఈ విషయంపై రజినీ స్పందించలేదు కానీ, ఆయన సోదరుడు సత్యనారాయణ మాత్రం "దేవుడు శాసిస్తాడు, మా అన్నయ్య పాటిస్తాడు" అన్నట్టుగా.. "పదవుల కోసం పాకులాడరు.. పదవి వస్తే మాత్రం తిరస్కరించరు" అంటూ గవర్నర్ పదవి తీసుకోవడం ఇష్టమేనని తన మాటనే రజినీ మాటగా చెప్పేశారు. కానీ ఫైనల్ గా రజినీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే. సినిమాల్లో రజినీకాంత్ దారి రహదారే కానీ.. రాజకీయాల్లో మాత్రం గతుకుల రోడ్డే. సినిమాల్లో జస్ట్ అలా స్టైల్ గా నడిచి ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఆయన.. రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి మాత్రం ధైర్యం చెయ్యట్లేదు. ఇదిగో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. వచ్చేస్తున్నా అంటూ 2017 నుంచి ఊరించారు రజినీ.  2020 లో అయితే.. రేపు లేకుంటే ఎల్లుండే పార్టీ ప్రకటన అంటూ నెలకోసారి హడావుడి జరిగింది.  అలా ఊరించి ఊరించి చివరికి అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అంటూ రాజకీయ ప్రవేశం చేయకుండానే ఆ అంశానికి, అంకానికి శుభం కార్డు వేశారు సూపర్ స్టార్. తాజాగా గవర్నర్ పదవి వార్తలతో దాని సీక్వెల్ కథ మొదలైంది. రజినీకాంత్ ముందు నుంచి బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. బీజేపీకి కూడా సౌత్ లో సూపర్ స్టార్ లాంటి బ్రాండ్ కావాలి. అందుకేనేమో గవర్నర్ పదవి ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ పదవి వల్ల రజినీకి కొత్తగా ఒరిగేదేమి లేదు. ఈ ఐదేళ్ల పదవి కంటే కూడా ఆయనకు జనాల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. అయితే రజినీకి గవర్నర్ పదవి ఇచ్చి, తమవాడు అనిపించుకోవడం వల్ల బీజేపీకి బోలెడంత లాభముంది. తమిళనాడులో బీజేపీ ఒక్కసారిగా పుంజుకునే అవకాశముంది. అప్పుడు డీఎంకే ని ఢీ కొట్టే పార్టీ బీజేపీనే అవుతుంది. ఇదంతా జరగాలంటే రజినీపై అధికారికంగా కమలం ముద్ర పడాలి.  ఇటీవలి కాలంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంలతో రజనీ భేటీ కావడం గమనిస్తే,  బీజేపీ పదవి ఇస్తే ఆయన తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఆయన మనసు ఎప్పుడైనా మారొచ్చు. రాజకీయాల్లోకి రావాలని చూసి దానిని నాంచి నాంచి చేతులెత్తేశారు. ఇప్పుడు గవర్నర్ గిరీ విషయంలో కూడా.. ఎక్కడ కొన్ని వర్గాలకు దూరం అవుతానోనన్న భయంతో నాంచి నాంచి చివరికి సైడ్ అయిపోయే అవకాశముంది.

తారస్థాయికి చేరిన ప్రజా వ్యతిరేకత.. డిఫెన్స్‌లో జగన్?!

మాది పేదల ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలన్నదే మా ఎజెండా. ఇందుకోసం ఎలాంటి మధ్య వర్తులూ లేకుండా, ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా, రాజకీయాలకు అతీతంగా తమ పథకాలు ప్రజలకు చేరాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇదీ జగన్మోహన్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చెప్పిన మాట. ఇందుకోసం వైసీపీ ప్రభుత్వం ఎంచుకున్న విధానమే నవరత్నాలు. నవరత్నాలలో సంక్షేమంతో పాటు మరికొన్ని అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. అయితే, మిగతా హామీలను పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరిట బటన్ నొక్కి ఖాతాలలోకి నగదు బదిలీ చేయడం మొదలు పెట్టింది. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ లాంటి పేదవాడికి అక్కరకు వచ్చే పథకాలను కూడా కాదని కేవలం బటన్ బటన్ నొక్కుడు కార్యక్రమానికే జగన్ పరిమితమయ్యారు.  ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం దాదాపు రూ. 2.30 లక్షల కోట్ల నగదును  బటన్ నొక్కుడు ద్వారా  బదిలీ చేసింది. అయినా ప్రజలలో అసంతృప్తి తారస్థాయికి చేరింది. సంక్షేమం పేరిట పంచిన దాని కంటే మూడింతలు ఎక్కువగా ప్రజల నుండి పన్నుల రూపంలో ముక్కు పిండి వసూలు చేయడం, అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి ప్రజల కొనుగోలు శక్తి నశించిపోయినా.. ప్రతి వస్తువు కొనుగోలులో పన్ను  పోటు ప్రజలలో అసంతృప్తిని  పెంచేసింది.  నిజానికి గత ప్రభుత్వంతో పోలిస్తే జగన్ సర్కార్  సంక్షేమానికి ఖర్చు చేసిన నిధులు ఎక్కువేం కాదు. గతంలో రకరకాల మార్గాల ద్వారా ప్రజలకు చేర్చిన నగదును ఇప్పుడు బటన్ నొక్కి ప్రజల ఖాతాలకు చేర్చారు. కానీ గత ప్రభుత్వానికి మించి పన్నుల బాదుడు,  ఉపాధి అవకాశాల క్షీణత ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చి పెట్టింది. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలకు ఏదో ఒక రూపంలో ఫలాలు అందించినా తమ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత లేదని అధికార పార్టీ ఇప్పుడు తెగ ఆందోళన చెందుతోంది. తలకి ఇంత లెక్కన ప్రజల ఖాతాలలోనే జమ చేసినా ప్రజలలో వ్యతిరేకత పెరుగిపోతుండడం ఇప్పుడు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.  ప్రజలలో ఏ వర్గాన్ని కదిలించినా అసహనం.. ఏ నోట విన్నా  అసంతృప్తి.. ఆగ్రహం, ఎవర్ని కదిలించినా కన్నీటి కష్టాలే. ప్రభుత్వం అంత చేశాం.. ఇంత చేశాం అని చెప్తున్నా ప్రజలలో మాత్రం ప్రభుత్వంపై ఏ మాత్రం సానుకూలత కానరావడం లేదు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. ఈసారి మళ్ళీ తమదే అధికారమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా వైసీపీ నేతలు  మనోవేదనకు గురవుతున్నట్లు కనిపిస్తున్నది.  ఇప్పటికే కొన్ని సర్వే ఫలితాలు ప్రజలలోని ఈ అసంతృప్తిని బహిర్గతం చేసి గణాంకాలతో సహా  జగన్ పార్టీ పరాజయం అనివార్యం అంటూ తేల్చేశాయి.. దీంతో వైసీపీ, మరీ ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకత, అసంతృప్తిపై డిఫెన్స్ లో పడిపోయినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్ల పాటు అభివృద్ధి, ఇన్ఫ్రా స్ట్రక్చర్, ప్రజల అవసరాలను అన్నీ వదిలేసి.. కేవలం బటన్ నొక్కడం.. తిరిగి పన్నుల పేరిట అంతకంత ముక్కుపిండి వసూలు చేయడంతో ప్రజలు విసిగి వేసారిపోయినట్టు నిర్ధారణ చేసుకున్న జగన్ ఇప్పుడు మరోసారి విజయం కోసం ఏం చేయాలన్నది తెలియక తల బద్దలు కొట్టుకుంటున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.   కడుపు మండిన పేదవాడిని నమ్మించి మరో సారి బుట్టలో వేసుకోవడానికి ఏం చేయాలో  తెలియని పరిస్థితుల్లో జగన్, వైసీపీ వ్యూహకర్తలు ఉన్నారంటున్నారు.  జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో సగటు ప్రజల ఆదాయాలు పెరగకపోగా.. ఏటేటా ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకవైపు కేంద్రం బాదుతుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అంతకు మించి  బాదుడే బాదుడు అంటూ ప్రజలను కుంగదీసింది. తమ జీవన స్థితిగతులు నానాటికీ దిగజారుతుండటంతో జగన్ సర్కార్ పై ప్రజలలో తీవ్ర అసహనం కనిపిస్తోంది. ఆ అసహనమే ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

విశాఖ జైల్లో మొద్దు ‘సీన్’?!

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా  2019 ఎన్నికల ముందు   అప్పటి  ప్రతిపక్షనేత   జగన్‌పై కోడికత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ.. దాదాపు నాలుగున్నరేళ్లుగా జైల్లో ఉన్న కోడికత్తి శ్రీను ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే ఓచర్చ పోలిటికల్ సర్కిల్‌‌లో సాగుతోంది.  కోడి కత్తి దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ కుమారుడిని బెయిల్‌పై విడిపించాలంటూ కొడికత్తి శ్రీను తల్లిదండ్రులు ఇప్పటికే పలుమార్లు   జగన్ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొన్నారు.  అలాగే ఈ అంశంపై సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి   వారు స్వయంగా వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ విషయాలన్నిటిపైనా రాజకీయ పరిశీలకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. బాధితుడిగా కోర్టుకు హాజరు కావడానికి జగన్ ఎందుకు ఇష్టపడటం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.  మరోవైపు.. కోడికత్తి శ్రీను కూడా మొద్దు శ్రీనులాగానే హత్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య చేసిన మొద్దు శ్రీను..  ఆ తర్వాత అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తూ... అదే  జైల్లో ఉన్న ఓం ప్రకాశ్ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి రాజకీయ వర్గాల చర్చల్లో  ప్రస్తావనకు వస్తోంది. అదే తరహాలో కోడికత్తి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనపల్లి శ్రీను  సైతం జైల్లోనే హత్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం ఆ చర్చల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు బుధవారం(సెప్టెంబర్ 6)  విశాఖపట్నం కోర్టు వద్ద ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు   జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని చెప్పిన రోజు.. వైసీపీ నేతలు తప్పించి మరెవరూ  ప్రత్యక్ష సాక్షులుగా (ఐ విట్నెస్‌లు) లేరని,  అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్, సెక్యూరిటీ అధికారులు.. తాము ఈ దాడిని చూడలేదని చెప్పారన్నారు.   ఆయితే ఆ రోజు కోడికత్తి బొత్స సత్యనారాయణ సమీప బంధువు మజ్జి శ్రీను వద్ద మాత్రమే ఉందని... ఏపీ పోలీసుల మీద నమ్మకం  లేదంటూ మందుగా కోడికత్తి సమర్పించలేదన్నారు. ఈ కేసులో కర్మ కర్త క్రియా అన్నీ మజ్జి శ్రీనివాసేనని కోడికత్తి శ్రీను తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆ సమయంలో మజ్జి శ్రీను.. తన పోనును పోలీసులు అడిగితే.. ఎందుకు డిపాజిట్ చేయలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఉద్దేశపూర్వకంగానే జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనుపై కేసుపెట్టారన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని.. వాటిని సమయం వచ్చినప్పుడు బయట పెడతానని అబ్దుల్ సలీం స్పష్టం చేశారు.   హరీశ్ సాల్వే వివాహానికి హాజరయ్యేందుకు లండన్ కు వెళ్లే తీరిక ఉన్న జగన్ కు.. కోడికత్తి కేసులో బాధితుడిగా విశాఖకు వచ్చే పాటి తీరిక లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. ఒక ఎస్సీ యువకుడు నాలుగున్నరేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నా? తనపైనా దాడి జరిగిందని స్వయంగా ఫిర్యాదు చేసి పట్టుబట్టి మరీ  ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్న జగన్ బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకుండా ఉండటం ఎంత మాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు.  జగన్ పై కోడికత్తి దాడి జరిగినప్పుడు జనుపల్లి శ్రీనివాస్ ఫుడ్ కోర్టులో అనుమతితోనే పని చేస్తున్నాడని అయితే ఆ రోజు  ఐదుగురు వైసీపీ నేతలు పాస్‌లు లేకుండానే  విమానాశ్రయంలోకి ప్రవేశించిన విషయాన్ని కోర్టు ముందుంచామని చెప్పారు.  అలాగే కోడికత్తి దాడి జరిగిన రోజు.. పోలీస్ స్ట్రైకింగ్ ఫోర్స్ జీపుపై  దాడి చేసిన వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.   2023 ఆగస్ట్ వరకు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి దాడి కేసు విచారణ జరిగింది. ఇటీవలే  ఆ కేసును విశాఖకు బదిలీ చేశారు. ఆ క్రమంలో కోడికత్తి శీను  ఇన్నాళ్లు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి  ప్రతీ వాయిదాకు  విశాఖకు తీసుకు రావడం కష్టమన్న ఉద్దేశంతో అతడిని  విశాఖ సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టును ఎన్ఐఏ  అభ్యర్థనను కోర్టు అంగీకరించడంతో . కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంకోవైపు.. విశాఖ సెంట్రల్ జైల్లో ఇటీవల మత్తు పదార్థాల కలకలం సృష్టించిన విషయం విదితమే.  కోడికత్తి కేసు ఏళ్ల తరబడి ముందుకు సాగకపోవడం ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైయస్ జగన్ కోర్టుకు హాజరు కాకపోవడం చూస్తుంటే.. పరిటాల రవి హత్య కేసులో జరిగిన విధంగానే  మొద్దు శ్రీను సీను విశాఖ జైల్లో రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.