చెడు స్నేహాలు..... పర్యవసానాలు!

జీవితంలో అన్ని విషయాలలోనూ మంచి చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. వాటిని బట్టే మనుషులను కూడా మంచి చెడు అని పేర్కొంటాము.  ఎదుటివాడి ఆశయాలను, ఇష్టాయిష్టాలను గౌరవించే స్నేహమే నిజమైన స్నేహం. తాను చెప్పిందే ఎదుటివాడు వినాలి, తాను రమ్మన్నప్పుడు రావాలి, చేయమన్న పని చేయాలి అనేది బానిసత్వం అవుతుంది. అది స్నేహం ఎప్పటికీ కాదు. తన స్నేహితుడిలోని లక్షణాలను విశ్లేషించి, స్నేహం గురించి విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. జీవితంలోని ప్రతి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. గమనిస్తే అనేక మంది విజేతలు ఏదో ఓ దశలో సమాజంలో పిచ్చివారుగా పరిగణనకు గురైనవారే. తమ లక్ష్యంపై వారి దృష్టి ఎంతగా కేంద్రీకృతమై ఉంటుందంటే ఇతర విషయాలన్నీ వారికి పనికిరానివిగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇతర విషయాలను పట్టించుకోవడం మానేస్తారో అప్పుడే వారి మీద విమర్శలు మొదలవుతాయి. అవెలా ఉంటాయంటే స్థాయి పెరిగేకొద్దీ మనుషుల్ని మరచిపోతారు అనేలా. తన దృష్టి దేనిపై కేంద్రీకృతమై ఉందో ఆ విషయానికి సంబంధించినవి మాత్రమే విజేతలకు గుర్తుంటాయి. ఒకే రకమైన పక్షులు ఒకే గూటికి చేరతాయంటారు. కాబట్టి మనిషి మంచివాడైనా, చెడ్డవారితో స్నేహం వాడి మంచితనాన్ని మరుపుకు తెస్తుంది. ఒకే గూటి పక్షి అయిపోతాడు.  "తాటి చెట్టు పాలు తాగడం" కథ ఇక్కడ వర్తిస్తుంది. మంచివాడైనా, దుష్టులతో కలిసి తిరిగితే చెడ్డవాడనే అని అందరూ అంటారు. స్వతహాగా ఇతను మంచివాడే అయినప్పటికీ, చెడ్డ లక్షణాలు ఉండి ఉంటాయని అనుమానిస్తారు. చెడ్డవాడుగానే పరిగణిస్తారు. సాధారణంగా, ప్రతివ్యక్తికీ ఇష్టాయిష్టాలుంటాయి. ఆ ఇష్టాయిష్టాలు అతడు పెరిగిన వాతావరణం, సంస్కారం వంటి అంశాలపై ఆధారపడి వుంటాయి. ఆ ఇష్టాయిష్టాల ఆధారంగా అతడు కొందరు వ్యక్తులకే సన్నిహితుడవుతాడు. అందరితో కలిసి తిరుగుతున్నా కొందరితోనే అత్యంత సన్నిహితంగా వెళ్ళగలుగుతాడు. ఈ సన్నిహితులెవరో గమనిస్తే చాలు, వ్యక్తి స్వభావ స్వరూపాలు బోధపడతాయి. వారు మంచివారైతే పరవాలేదు. అదే వారు చెడ్డవారైతే వ్యక్తి మంచి వాడైనా అనుమానాస్పదుడే అవుతాడు. ఎందుకంటే అటువంటి వారి ప్రభావం వ్యక్తిపై ఎంతైనా వుంటుంది. ఏదో ఓ రోజు అది ఫలితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచనలపైనే దృష్టిని నిలపాలి. అలా కాక దుర్మార్గులు, దుష్టులుగా పరిగణించే వారి సాంగత్యంలో వుంటే వాళ్ళ నడుమ తుచ్ఛమైన ఆలోచనలే వస్తాయి. అవి మనపై ప్రభావం చూపిస్తాయి. కొందరు అంటారు మనం బాగుంటే ఇతర విషయాలు మనల్ని ఏమీ చేయలేవు అని.  వజ్రం ఎంత విలువైనది అయినా దాన్ని బంగారంలో పెట్టి ఆభరణంగా మారిస్తే దాని స్వరూపం ఎంతో బాగుంటుంది. అదే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి గులకరాళ్ల మధ్య వేస్తే దాన్ని గుర్తించేవారెవరు?? పరీక్షల కోసం బాగా చదివే విద్యార్థిని మాటమాటికి వచ్చి బయటకు రమ్మని పిలిచే స్నేహం అంత మంచిది కాదు. చాలా మంది తాము బాగా చదువుకుని తమ విరామ సమయాన్ని గడపడానికి వచ్చి, ఏమీ చదవనట్టు పరీక్షంటే లెక్కలేనట్టు మాట్లాడతారు. కష్టపడి చదివే వాడిని వెక్కిరిస్తారు. దాంతో చదివేవాడు సైతం తానేదో తప్పు చేస్తున్నట్లు బాధపడతాడు. చదువు వదలుతాడు దెబ్బ తింటాడు. కాబట్టి, చదవాలనుకున్న వాడు చదువుతుంటే వచ్చి ఏకాగ్రతకు భంగం కలిగించేవాడి స్నేహాన్ని నిర్మొహమాటంగా వదల్చుకోవాలి. ఎందుకంటే కొందరు పైకి మంచిగా నటించినా మనసులో వేరే రకంగా భావిస్తూంటారు. అటువంటివారితో స్నేహం ఎప్పడైనా ముప్పు తెస్తుంది. ఈవిషయం అందరూ గమనించండి. చెడ్డవారితో స్నేహాన్ని వదులుకోండి. తమ జీవితానికి చెడ్డవారి వల్ల కలిగే నష్టాన్ని ఆ నష్టం ఎదురయ్యే వరకు కాకుండా వ్యక్తుల ప్రవర్తనలో గుర్తించి దూరంగా ఉంటేనే మంచిది.                                       ◆నిశ్శబ్ద.

మనిషి జీవితం పరిపూర్ణత సాధించాలంటే తెలుసుకోవలసింది ఇదే..

జీవితంలో మనిషికి ఎన్నెన్నో అలవాట్లు ఉంటాయి. వాటిల్లో కొన్ని ఉపయోగకరమైతే మరికొన్ని పతనానికి దారితీస్తాయి. ఈ అలవాట్లకి కారణం అతని మానసిక ఆలోచనా ధోరణే తెలివైనవాడు తన ఆలోచనా ధోరణిని నియంత్రిస్తే, మూర్ఖుడు ఆలోచనల చేత నియంత్రింపబడతాడు. తెలివైనవాడు ముందు తను ఏం ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో నిర్ణయించుకుంటాడు. బాహ్య విషయాలు అతని ఆలోచనా ధోరణిని భంగపరచకుండా జాగ్రత్త వహిస్తాడు. కానీ తెలివి తక్కువవాడు అలా కాదు. అస్థిరమైన ఆలోచనలతో ఇతర విషయాల ప్రభావంతో తన నిర్ణయాలను క్షణం క్షణం మార్చుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తాడు. ఆలోచనా రాహిత్యం మనిషిని ఉన్మత్తుడ్ని చేస్తుంది. మనిషి వైఫల్యానికి ప్రధాన కారణం అతని అశ్రద్ధతో కూడిన ఆలోచనా ధోరణులే సరైన, నిజమైన ఆలోచన గల మానసిక ప్రవృత్తి మాత్రమే మనిషి తప్పుడు జీవితాన్ని సరిచేయగలదు. సరైన, నిర్దుష్టమైన నడవడిక మాత్రమే మనిషి జీవితంలో శాంతిని ప్రసాదించి, సఫలీకృతుడ్ని చేయగలదు. ఆలోచనలని నియంత్రించాలంటే ముందు మనలో గజిబిజిగా కలిగే ఆలోచనలను క్రమబద్దం చేయాలి. తార్కికతను అలవర్చుకోవాలి. ఒకదానికి మరోదానికి మధ్యన సారూప్యత, సామరస్యత ఉండాలి. పొంతన లేనట్లుండే అనంతమైన ఆలోచనా పరంపరల్ని ఓ క్రియాశీలకమైన రూపంలోకి మరల్చుకోవాలి. మన ఆచనలు మన నియమాలకు గానీ లేదా మన ధోరణికి గానీ విరుద్దంగా వుండకూడదు. మనం ఇతరుల మీద చూపించే జాలిగానీ, దయగానీ, క్షమగుణం గాని మనల్ని ఇబ్బందుల్లో పడేయగూడదు. నీతితో కూడిన నియమాలకు నీతికర వాతావరణంలో కూడా కట్టుబడి వుండాలి. మనలో కలిగే ఆలోచనలలో, స్పందనలలో ఏవి నిజాలో, ఏవి అపోహలో తేల్చుకోవాలి. మనలోని విజ్ఞాన పరిధుల్ని కనుగొనాలి. మనకేం తెలుసో మనకి తెలియాలి. అలాగే, మనకేం తెలియదో కూడా మనకు తెలియాలి. ఏవి సత్యాలో, ఏవి అభిప్రాయాలో మనం గ్రహించాలి. చాలా మంది తమ నమ్మకాలని తమకు తెలిసిన జ్ఞానంగా భావిస్తారు, అది సమంజసం కాదు. తప్పుగా ఆలోచించే వాడి చేష్టలు కూడా దుర్మార్గంగా వుంటాయి. దానికి తగ్గట్టు సమస్యలు అవిశ్రాంతంగా వచ్చి పడుతుంటాయి. తనని ఇతరులు నాశనం చేస్తారని, మోసం చేస్తారని, తనకి కీడు తలపెడతారని ఊహిస్తుంటాడు. తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో ధర్మాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. ఫలితంగా తన దుర్మార్గపు అంచనాలకు తానే బలి అవుతాడు, ఆత్మ పరిశీలన లేకపోవడం చేత దుర్మార్గానికి సన్మార్గానికి మధ్య తేడా గ్రహించలేడు. కాని సరైన పంథాలో ఆలోచించేవాడు అలాకాదు. తన గురించి గాని, తన వ్యక్తిగత శ్రద్ధ గురించిగాని ఆలోచించడు. తనపై ఇతరులు ప్రదర్శిస్తున్న ఈర్ష్యాద్వేషాలు అతనికి మానసిక అస్తిరతను కలిగించవు. అతనెప్పుడు “ఫలానావ్యక్తి నాకు కీడు తలపెట్టాడు" అని ఆలోచించడు. కేవలం తన దుశ్చేష్టలే తనని నాశనం చేస్తాయి తప్ప ఇతరుల చేష్టలు  తననేమి చేయలేవని గ్రహిస్తాడు. తన భవిష్యత్తు, తన ఎదుగుదల కేవలం తన చేతుల్లోనే వుందని గ్రహిస్తాడు. విషయాసక్తి, విషయావగాహన వుంటుంది. యదార్థాలని యదార్థాలుగా చూస్తాడు కష్టాలు వచ్చినప్పుడు విపరీతంగా కదిలిపోడు. అలాగే ఆనందవు సమయాలలో వివరీతంగా చలించడు జీవితపు ఆటుపోట్లకు తట్టుకునే మానసిక స్థైర్యాన్ని సంతరించుకుంటాడు. తన చుట్టూ వున్న ప్రకృతినుంచీ, తన చుట్టూవున్న సమాజం నుంచీ నిరంతరమూ నేర్చుకుంటూనే వుంటాడు. మనిషి ఎంతైనా నేర్చుకోవచ్చు కానీ, దానికి తగ్గ సమయస్ఫూర్తి ధర్మచింతన లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ముందు మనిషి తనని తాను జయించుకోగలిగిన నాడు ఆధర్మాన్ని జయించగలడు. కష్టాలు, బాధలు చిరాకులు ప్రతి మనిషికీ వుంటాయి. అయితే వాటిని ఓపికతో, ఓ నిర్దుష్టమైన ప్రణాళిక, వ్యూహంతో ఛేదించ గలిగిననాడు మనిషి జీవితం పరిపూర్ణతను సంతరించుకుంటుంది.                                  ◆నిశ్శబ్ద.

కథలు చెప్పడం వల్ల పిల్లలకు నేర్పే దేమిటి??

ప్రస్తుతం ఎదిగే పిల్లలు ఏదైనా చేయాలంటే పెద్దలు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటారు. కానీ వరించుట్టూ ఉండే స్నేహితులు వారిని వివిధ రకాలుగా మాటలతో మనస్తత్వం మారిపోయేలా చేస్తారు. ఉదాహరణకు… ఓ అబ్బాయి కాలేజీలో చేరాడు. అతడి మిత్రులంతా కలసి సినిమాకు వెళ్ళాలని పథకం వేశారు. అయితే క్లాసులు ఎగ్గొట్టి, పెద్దల అనుమతి లేకుండా సినిమా చూడటం తప్పు అని తల్లిదండ్రులు నేర్పారు ఆ పిల్లవాడికి. కానీ సినిమా చూసినంత మాత్రాన ఏమీ కాదని మిత్రులు ప్రోత్సహిస్తూంటారు. ఎందరో సినిమాలు చూస్తున్నారు. అందరూ పాడైపోతున్నారా? అని వాదిస్తారు. ఇటువంటి పరిస్థితిలో పిల్లవాడు విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలి.  "సినిమాకు వెళ్ళకపోవటం" అంటే పేరెంట్ గెలిచినట్టు "వాళ్ళొద్దంటే మానెయ్యాలా?" అనో "వెళ్ళకపోతే మిత్రులు హేళన చేస్తారనో" సినిమాకు వెళ్తే "చైల్డ్" గెలిచినట్టు. అలా కాక "ఇప్పుడు ఆ సినిమా చూడాల్సిన అవసరం అంతగా లేదు. సినిమా కన్న క్లాసు ప్రాముఖ్యం అధికం" అని విశ్లేషించి నిర్ణయం తీసుకున్నా, "క్లాసులో చెప్పేది చదువుకోవచ్చు, నష్టం కూడదీసుకోగలిగిందే కాబట్టి ఇప్పుడు సినిమా చూసినంత మాత్రాన పెద్దగా నష్టం లేదు" అని తర్కించి నిర్ణయం తీసుకున్నా, "అడల్ట్" పని చేస్తున్నట్టు. ఇలా మానవమనస్తత్వం పని తీరును ఆధునిక మానసికశాస్త్రవేత్తలు వివరిస్తారు. అంటే, ఊహ తెలియని దశ నుంచీ ప్రతీదీ పిల్లవాడిపై ప్రభావం చూపిస్తాయన్నమాట. అటువంటప్పుడు ఉయ్యాలలో నిద్రిస్తున్న పిల్లవాడి కోసం పాడే పాటల ప్రభావం అతడిపై చూపటంలో ఆశ్చర్యం ఉందా! అది అబద్ధం అవుతుందా? పాకే వయసు రాగానే 'చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ' అంటూ నేర్పేవి పనికి రాకుండా పోతాయా? ఆ తరువాత చెప్పే పురాణకథలు, ప్రభావరహితం అవుతాయా? బాల్యంలో కృష్ణుడి అల్లరి చేష్టలు పిల్లవాడి ఊహాప్రపంచానికి రెక్కలనిస్తాయి. తానూ కృష్ణుడిలా సాహసకార్యాలు, అవీ లోకకల్యాణకారకాలైన సాహసకార్యాలు చేయాలన్న తపన పిల్లవాడిలో కలుగుతుంది. ఆ వెంటనే చెప్పే ధ్రువుడి కథ, అష్టావక్రుడి కథ, సత్యహరిశ్చంద్రుడు, హనుమంతుడు, రాముడు, లవకుశుల కథలు పిల్లలకు స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా హనుమంతుడి కథలు, సాహసాలు సూపర్ మేన్, బ్యాట్ మేన్ లను మరపిస్తాయి. వాటి కన్నా ఆరోగ్యకరమైన వినోదాన్నిచ్చి, ఉన్నతమైన ఆదర్శాన్ని నిలుపుతాయి. పిల్లలను అమితంగా ఆకర్షించే అనేకాంశాలు హనుమంతుడి కథల్లో ఉన్నాయి. అంటే నీతులు చెప్పకుండా, ఉపన్యాసాలు ఇవ్వకుండా కేవలం కథలు చెప్పటం ద్వారా. పిల్లల వ్యక్తిత్వవికాసానికి బీజాలు వేసే వ్యవస్థ అన్నమాట మనది. ఇళ్ళల్లో తల్లికి సమయం లేకపోతే, తాతయ్యనో, నాయనమ్మనో, బాబాయిలో, అత్తయ్యలో, ఎవరో ఒకరు సాయంత్రం కాగానే పిల్లలను పోగేసి కథలు చెప్పేవారు. పురాణకథలతో పాటు జానపదకథలూ వినిపించేవారు. చారిత్రకగాథలు చెప్పేవారు ఆయా కథలు పిల్లలను ఎంతగా ఆకట్టుకునేవంటే మళ్ళీ సాయంత్రం కోసం పిల్లలు ఎదురుచూసేవారు. నెమ్మదిగా ఈ కథలు దేశభక్తుల కథలుగా రూపాంతరం చెందేవి. రాణా ప్రతాప్ త్యాగం, శివాజీ సాహసం, భగత్ సింగ్ బలిదానం, ఝాన్సీలక్ష్మి వీరత్వం..... ఇలా ప్రారంభం నుంచీ పిల్లల ముందు ఉత్తమాలోచనలు, ఉత్తమ ఆదర్శాలు నిలపటం జరిగేది. పిల్లలు పాఠశాలలకు వెళ్ళి కొత్త ప్రపంచద్వారాలు తెరుచుకునేసరికి, ఆ ప్రపంచపు తాకిడిని తట్టుకుని విచక్షణతో నిర్ణయాలు తీసుకునే విజ్ఞానం వారికి అందేది. దాంతో ప్రలోభాలను తట్టుకుని సరైన మార్గం ఎంచుకోగలుగుతాడు పిల్లవాడు. ఇదీ పిల్లలకు కథల వల్ల పెద్దలు నేర్పే మంచి. ఇలాంటి వాటిలో పిల్లలు విలువలు సులువుగా గ్రహిస్తారు. తద్వారా వారిలో స్నేహితులు రెచ్చగొట్టినా అది నాకు అవసరం లేదు, చదువుకోవాలి అనే మాటను ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా చెప్పగలుగుతారు.                                            ◆నిశ్శబ్ద.  

మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవాలి?

ప్రతి మనిషీ తన జీవితంలో తన వ్యక్తిత్వం ఎలా ఉందో ఒకసారి గమనించుకుని విశ్లేషించుకుంటే  తను సరిగానే ఉన్నాడా లేదా తనని తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయం అర్థమవుతుంది. మనం చేసే ప్రతికార్యమూ, శరీరంలోని ప్రతిచలనమూ, మనం చేసే ప్రతి ఆలోచనా మనస్సులో ఒక విధమైన సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈ సంస్కారాలు పైకి మనకు కనబడకపోయినా అంతర్గతంగా ఉండి అజ్ఞాతంగా పనిచెయ్యడానికి తగినంత శక్తిమంతాలై ఉంటాయి. ఇప్పుడీ క్షణంలో ఉన్న  స్థితి ఇంతకు క్రితం  జీవితంలో ఏర్పడివున్న సంస్కారాల సాముదాయక ఫలితం. నిజంగా వ్యక్తిత్వం అంటే ఇదే. ప్రతి మానవుడి స్వభావము అతనికి ఉన్న అన్ని సంస్కారాలచే నిర్ణయించబడుతుంది. మంచి సంస్కారాలు ప్రబలంగా ఉంటే వ్యక్తిత్వం మంచిదౌతుంది. చెడు సంస్కారాలు ప్రబలంగా వుంటే స్వభావం చెడ్డదౌతుంది.  ఒకవ్యక్తి ఎప్పుడూ చెడుమాటలను వింటూ, చెడు ఆలోచనలను చేస్తూ, చెడుపనులు చేస్తూవుంటే అతడి మనస్సు చెడు సంస్కారాలతో నిండి ఉంటుంది. అతడికి తెలియకుండానే అవి అతడి తలపులలో, చేతలలో తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఈ చెడు సంస్కారాలు సదా పని చేస్తూంటే చెడే వాటి ఫలితమౌతుంది. చెడు సంస్కారాల మొత్తం అతనిచే చెడుపనులను చేయించడానికి బలీయ ప్రేరకమవుతున్నది.  ఒకరి వ్యక్తిత్వాన్ని నిజంగా నిర్ణయించాలని చూస్తే అతడు చేసిన  మహత్కార్యాలను పరికించకూడదు. ప్రతి మూర్ఖుడూ ఏదో ఒకానొక సందర్భంలో వీరుడు కావచ్చు. మామూలు పనిలో నిమగ్నుడై ఉన్నప్పుడు మనిషిని గమనించాలి. ఒక గొప్ప వ్యక్తి నిజమైన వ్యక్తిత్వాన్ని అలాంటి పనులే వ్యక్తం చేస్తాయి. గొప్ప సందర్భాలు అట్టడుగు వ్యక్తిని సైతం ఏదో కొంత గొప్పదనం సంతరించుకొనేలా చేస్తాయి. కాని ఎక్కడ ఉన్నప్పటికీ సర్వదా ఎవరు గుణసంపన్నుడో అతడే నిజానికి మహోన్నతుడు.  మన భావనలు తీర్చిదిద్దిన మేరకే మనం రూపొందుతాం కాబట్టి  భావనల విషయంలో శ్రద్ధ వహించాలి. మాటలు అప్రధానం. భావనలు సజీవాలు, అవి సుదూరాలకు పయనిస్తాయి. మన ప్రతి భావన మన స్వీయ నడవడితో మిశ్రితమై ఉంటుంది.. మంచి పనులు చేయడానికి నిరంతర దీర్ఘకాలం ప్రయత్నం అవసరం. అది ఫలించకపోయినా మనం కలత చెందకూడదు. మనం చేసే ప్రతి కార్యం  సరస్సు పైభాగంలో చలించే అల లాంటిది. ఇదంతా అభ్యాసమే.. మనం సజ్జనులుగా ఉన్నా, దుర్జనులుగా ఉన్నా అంతా అభ్యాస ఫలితమే. కాబట్టి ఒక అభ్యాసాన్ని అలవాటు చేసుకోవటం లేదా వదలిపెట్టటం మన చేతులలోనే ఉంది. అందుకని ప్రస్తుతమున్న మన స్వభావం గూర్చి మనం నిరాశ చెందనవసరం లేదు.  ఒకవ్యక్తి ఎంత చెడ్డవాడైనాసరే, 'అతనిక మంచివాడు కాలేడు' అని చెప్పవద్దు. ఎందుకంటే, అతని ప్రస్తుత ప్రవర్తన అతను గతంలో చేసిన పనుల ఫలితం. అదే అతను కొత్తగా కొన్ని పనులు మొదలుపెట్టి మంచి మార్గంలో ప్రయాణిస్తే అతను తన వ్యక్తిత్వాన్ని మార్చుకుని మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది.  మనిషి తన వ్యక్తిత్వాన్ని అలాగే మార్చుకోవాలి.                                       ◆నిశ్శబ్ద.

ఒంటరితనం బాధిస్తోందా?? మీకోసమే ఇది!

ఎన్నో నిద్రలేని రాత్రులు  ఒంటరిగా పక్కమీద కూర్చుని అనంతార్థాల విశ్వాన్ని అర్ధరహితంగా గమనిస్తున్నప్పుడు చాలామందికి తోడుగా ఎవరుంటారో తెలుసా??.... ఒంటరి తనమే.. భయంకరమైన ఒంటరితనం వెంటగా ఉంటుంది. అయితే చాలామందికి ఒంటరిగా ఉండటానికి, ఒంటరి తనానికి మధ్య ఉన్న సన్నని గీత కనబడదు. చుట్టూ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటే అది భౌతికంగా ఒంటరిగా ఉండటం. కానీ చుట్టూ ఎవరున్నా లేకపోయినా మనసులో ఒక అంధకారం ఉంటే అది మానసికంగా మనిషిని నిలువనీయని ఒంటరితనం అవుతుంది. ఒంటరి తనానికి, ఒంటరిగా ఉండటానికి తేడా ఉంటుంది.  అయితే   ఒంటరి తనమే మనిషిని ఒంటరిగా వుండేటట్లు చేస్తుంది. ఒంటరిగా ఉండటం యాదృచ్ఛికం కావచ్చు. కానీ అది తాత్కాలికమైనది, లేదా స్వయంకృతం.  కానీ ఎలా చూసినా ఒంటరి తనం మాత్రం శాపం.  అది శాశ్వతంగా అంటి పెట్టుకొనుండేది. ఇదే ఒంటరి తనంతో బాధపడే ఒక వ్యక్తి ఆవేదన, మన జీవితాలలో రెండు విషయాలెప్పుడూ మనని వెంటాడుతుంటాయి. అవి, ప్రేమ-ఒంటరి తనం. ప్రేమ బలమైనది. శక్తివంతమైనది. కానీ, అదెప్పుడు శిఖరాగ్రాలలోనే ఉండదు. కాబట్టి, ప్రేను క్షీణించినప్పుడల్లా ఒంటరితనం విజృంభిస్తుంది. ఈ ఒంటరితనాన్ని ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరతాడు అయితే ప్రధానంగా బడిలో చదువుకునే పిల్లలు, కాలేజీ విద్యార్థులు, గృహిణిలు, విడాకులు తీసుకున్న దంపతులు దీని బారిన అధికంగా పడుతుంటారు. మనిషి మీద ఒత్తిడి అధికమవుతున్న కొద్దీ ఈ ఒంటరి తనం అధికమవుతుంది. శిశువుకి తల్లితో సాన్నిహిత్యం లేకపోతే ఒంటరితనం ప్రాప్తిస్తుంది. పిల్లలకి ఆటపాటల్లో తల్లిదండ్రుల సహచర్యం లేకపోయినా లేదా వాళ్ళతో మాట్లాడేవారే కరువయినా గానీ వారు ఒంటరితనానికి లోనవుతారు. స్కూల్లోగానీ, ఆటల్లోగానీ తన స్నేహితులచే తిరస్కరింపబడేవాడు. భయంకరమైన ఒంటరితనానికి లోనవుతాడు. ఒంటరి తనానికి కారణాలు అనేకం. మనిషి సహజ పద్ధతివల్ల అయితేనేమి, బుద్ధికౌశల్యం లోపించడం వల్ల అయితేనేమి, పేదరికంవల్ల అయితేనేమీ, తప్పు చేసినందుపల్లె గానీ లేదా వైఫల్యాల వల్ల అయితేనేమి ఒంటరితనం అలవడుతుంది. ఆకర్షణీయంగా లేవనే భావన, అంగవైకల్యాలు ఒంటరి తనాన్ని అధికం చేస్తాయి. ఒక్కోసారి అస్వస్థతవల్ల కూడా ఒంటరితనం ఏర్పడవచ్చు.. అయితే, తమలోని ఒంటరితనపు భావనే తమ అస్వస్థతకు అసలైన కారణమని చాలామంది గ్రహించరు. ఒక్కోసారి మనం నివసిస్తున్న పరిసరాలు కూడా మనని ఒంటరితనానికి లోనుచేస్తాయి. ఆందోళనలు, వాతావరణ కాలుష్యం, రణగొణ ధ్వనులతో నిండిపోయిన పట్నవాసం, నైతిక విలువలు లోపించిన కుటుంబ సభ్యుల ప్రవర్తన, ప్రేమ రాహిత్యం, గుర్తింపులేని గానుగెద్దు జీవితం ఇవన్నీ మానసికంగా మనని కృంగదీసి మనని ఒంటరి వాళ్ళని చేయవచ్చు. ఒంటరి తనానికి కారణాలేమైనా కానివ్వండి దానివలన ఏర్పడే ఫలితాలు మాత్రం చాలా బాధాకరమైనవి. ఒంటరి తనమనేది పూర్తిగా మానసికమైనది. కాబట్టి, అన్నిటి కన్నా ముందు మానసికంగా ఒంటరితనాన్ని ఎదుర్కోడానికి సన్నద్ధులు కావాలి. నలుగురు మధ్య గడిపినంత మాత్రాన ఒంటరితనం పారిపోదు. ఒంటరితనం వేరు. ఒంటరిగా ఉండటం వేరు.  ఒంటరితనం కన్నా ఆందోళన చెందటమే నయం ఆందోళనకన్నా మనం ఈర్ష్యపడే వ్యక్తితో స్నేహామే నయం అన్నాడో ప్రఖ్యాత రచయిత కాబట్టి మన మనస్సు క్లిష్టమైన వ్యక్తితో సంపూర్ణంగా "స్నేహం చెయ్యాలి ఒక్కోసారి కొన్ని రకాల వ్యక్తుల సమక్షంలో మనం ఒంటరితనాన్ని పూర్తిగా మర్చిపోగలుగుతాం. అటువంటి వ్యక్తుల మనస్తత్వాన్ని గ్రహించి మీరు వ్యక్తిత్వాన్ని  అలాగే మలుచుకోడానికి ప్రయత్నించవచ్చు.. మనసులోని కల్మషాన్ని, ఈర్ష్యాద్వేషాల్ని, ద్వంద ప్రవృత్తుల్ని తగ్గించుకోగలిగిననాడు ఒంటరితనం దానంతట అదే నిష్క్రమిస్తుంది. బ్రతుకు శాపం గావచ్చు. కానీ ఆహ్లాదమైన స్నేహం వరం. దాన్ని తాము అనుభవిస్తూ..  ఇతరులకు పంచితే.. అదే ఒంటరితనాన్ని తరిమి కొట్టడానికి తిరుగులేని సాధనం అవుతుంది.                                              ◆నిశ్శబ్ద.

జీవితానికి పట్టుదల ఎందుకు అవసరమో తెలిపే విషయాలు...

మనిషికి జీవితంలో పట్టుదల అనేది ఎంతో ముఖ్యం. ఈ పట్టుదల అనేది కేవలం మనిషికే కాదు సకల పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది. దానికి ఒక మంచి ఉదాహరణ… టిట్టభ అనే పక్షి కథ..  టిట్టభ అనే పక్షి జంట ఒకటి సముద్రతీరంలో గూడు కట్టుకుని ఉండేది. ఆడపక్షి గుడ్లు పెట్టినప్పుడల్లా, సముద్రరాజు అలలతో వాటిని ముంచెత్తి, మింగేసేవాడు. సముద్రుని దురాగతాన్ని గమనించిన మగపక్షి, 'సముద్రాన్నే ఎండగట్టి, నా గుడ్లను స్వాధీనపరచుకొంటాను' అంది. ఆ పిట్ట తన ముక్కుతో, రెక్కలతో నిరంతరాయంగా సముద్ర జలాలను భూమిపైకి వేయసాగింది. ఇతర పక్షులు, ఆ మగ టిట్టిభ పక్షి విషయం తెలుసుకొని, తాము కూడా ఈ మహత్తర కృషిలో పాలుపంచుకున్నాయి. పక్షిజాతులన్నీ సమైక్యంగా చేస్తున్న పనిని గమనించి, గద్దలు, రాబందులు మొదలైన పక్షిజాతులన్నీ క్రమంగా ఆ పనికి పూనుకున్నాయి. ఈ సంగతి విన్న పక్షిరాజు గరుత్మంతుడు కూడా వైకుంఠం వదలి వచ్చి, పక్షి సమూహాలతో చేయి కలిపాడు. వాహనం లేక కష్టపడుతున్న విష్ణువు స్వయంగా సముద్ర తీరం చేరాడు. గరుత్మంతుడు పక్షిజాతుల దైన్యాన్ని తన స్వామికి నివేదించాడు. కరుణామయుడైన శ్రీమహావిష్ణువు సముద్రరాజుకు నచ్చజెప్పి, ఆ తీతువు పక్షి జంటకు గుడ్లను తిరిగి అప్పగించేటట్లు చేశాడు. 'హితోపదేశం'లోని ఈ కథ పట్టుదల ఫలితాన్ని చెబుతుంది. శ్రమశీలికి అపజయం ఉండదు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇది ఒక పక్షి కథనం మాత్రమే.. మన చరిత్రలో దీనికి మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా విశేష ఖ్యాతిని ఆర్జించిన అబ్రహామ్ లింకన్ 1816 నుంచి 1860 వరకు అనుభవించిన కష్టనష్టాలు, జయాప జయాలు అంతులేనివి. ఆయన ఎనిమిదిసార్లు దేశాధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు. మూడుమార్లు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. రెండుసార్లు  వ్యాపారంలో దివాలా తీశాడు. ఆరు నెలల పాటు తీవ్ర మనస్తాపంతో కుమిలిపోయాడు. పదిహేడేళ్ళ పాటు ఋణగ్రస్తుడిగా గడిపాడు. చివరకు  1860 ఎన్నికలలో గెలిచి, అమెరికా అధ్యక్షుడయ్యాడు. బానిస వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడి చరిత్రకెక్కాడు. ఆయన అంత సాధించడానికి ప్రధాన కారణం పట్టుదల, అచంచల దీక్ష. దృఢ సంకల్పం ఉంటే తప్పకుండా సంకల్ప సిద్ధి కలుగుతుంది. నెపోలియన్ చక్రవర్తి ఆకారంలో చాలా పొట్టి. అలాంటి వాడు ప్రపంచాన్నే జయించాడు. అందుకు కారణం - ఉక్కు లాంటి చెక్కు చెదరని అతని మనసే!  గొప్ప వక్తగా పేరు తెచ్చుకున్న డెమస్తనీస్ కు నిజానికి మహా నత్తి. ఆయన నాలుక కింద గులకరాళ్ళు ఉంచుకొని, సాగర తీరంలో కేకలు వేసి, తనకున్న నత్తిని పోగొట్టుకొన్నాడు. మహావక్తగా నివాళులందుకొన్నాడు. సహనం, పట్టుదల వల్లనే ఆయన ఆ స్థాయికి ఎదగగలిగాడు.  ప్రజల ఎగతాళినీ, నిందలనూ లెక్కచేయకుండా బీదవాడైన బెంజిమిన్ డిజ్రేలీ ఇంగ్లండు ప్రధాని కావడానికి కారణం అతని పట్టుదలే. రోమన్  సామ్రాజ్య ఉత్థాన పతనాలు రాయడానికి గిబ్బన్ 20 ఏళ్ళు కష్టపడ్డాడు. వంద కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణమైనా సరే ఒక్క అడుగు వేయడంతోనే ప్రారంభమవుతుంది. 'ఉద్యమేన హి సిద్ధ్యంతి' అనడంలోని పరమార్థం అదే. అసాధ్యం సాధ్యం కాగలదు. కాబట్టి మనిషి తనలో ఉన్న పట్టుదలను పెంపొందించుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎవరికో సాధ్యం కాలేదు మనకేం సాధ్యమవుతుందిలే.. వంటి నిరాశా వాదాలు వదిలిపెట్టాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది.                                ◆నిశ్శబ్ద.  

పౌరులకు, వ్యక్తులకు మధ్య బేదం ఇదే..

ప్రతి సంవత్సరం జనవరి 12 న యువజన దినోత్సవం జరుపుకుంటారు. ఈ దేశానికి యువత అవసరాన్ని, భారతీయ హిందూ ధర్మ విశిష్టతను, విదేశాలలో సైతం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన స్వామి వివేకానంద పుట్టిన రోజును ఇలా యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద భారతదేశం గురించి, దేశ భవిష్యత్తు గురించి, భారత పౌరుల గురించి తన మాటల్లో ఇలా చెప్పారు.. స్వామి వివేకానంద నిద్రాణమై ఉన్న భారత జాతిని 'లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు ఆగవద్దు!' అని మేల్కొలిపారు. సుమారు వెయ్యి సంవత్సరాలుగా బానిసత్వాన్ని అనుభవిస్తూ, కొన ఊపిరితో ఉన్న భారతజాతిని 'సమస్త శక్తి మీలోనే ఉంది. మీరేమైనా సాధించగలరు!' అని జాగృతం చేసారు.  దేశ భవిష్యత్తు గురించి చెబుతూ భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకంటే అగ్రస్థానానికి చేరుకుంటుందని అన్నారు. స్వామీజీ 1897 జనవరి 25న రామనాథపురంలో తన ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించారు....ఇక తెల్లవారదనుకున్న రాత్రి మెల్లమెల్లగా గడిచిపోతున్నట్లుంది. భరించరాని తీవ్ర వేదన ఉపశమిస్తున్నట్లనిపిస్తుంది.... భారతమాత దీర్ఘనిద్ర నుండి మేల్కొంటోంది.... ఇంక ఆమెనెవరూ ఆపజాలరు! ఇక ఆమె నిద్రపోదు". స్వామీజీ చెప్పిన భవిష్యవాణి నిజం కావాలంటే మనం ఏం చెయ్యాలి? వ్యక్తులు పౌరులుగా మారాలి నేటి యువత విదేశాలు భోగభాగ్యాలకు ఆకర్షితులవుతున్నారు. ఇటు భారతీయ సంస్కృతిని వదులుకోలేక, అటు విదేశీ సంస్కృతిని కాదనలేక సందిగ్ధంలో పడుతోంది. బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం చాలా గొప్పదన్న విషయం మనమంతా తెలుసు కోవాలి. విదేశాలలో వేదాంతభేరిని మ్రోగించి, భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఒక ఆంగ్లేయ మిత్రుడు స్వామీజీని "ఇక్కడి భోగభాగ్యాలను చూసిన తరువాత భారతదేశంపై మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు. సమాధానంగా స్వామీజీ, "భారతదేశం నుండి వచ్చేముందు నా దేశాన్ని ప్రేమించాను. ఇప్పుడు నా దేశపు దుమ్ము, ధూళి, గాలి సర్వస్వం నాకు పవిత్రమైనవిగా భాసిస్తున్నాయి" అన్నారు. నేడు మన దేశస్థులు తమ దేశానికి సేవ చేయడం మాట అటుంచి భారతమాతను విమర్శించడంలోనే ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి భారతీయుడు తమ దేశ గొప్పతనాన్ని తెలుసుకొని భారత పౌరునిగా మారడానికి ప్రయత్నించాలి. ఒకసారి ప్రముఖ భారత న్యాయవాది నానీ ఫల్కీవాలా జపాన్ వెళ్ళినప్పుడు ఆ దేశమంత్రిని ఇలా ప్రశ్నించారు. "భారతదేశంలో కావలసిన సంపదలున్నాయి. భారతీయులు తెలివైనవారు. అయినప్పటికీ భారతదేశం జపాన్లాగా ఎందుకు అభివృద్ధి చెందలేకపోతోంది?" అని.  సమాధానంగా జపాన్ మంత్రి “జపాన్లో ఒక మిలియన్ పౌరులున్నారు. భారతదేశంలో ఆరువందల మిలియన్ల వ్యక్తులున్నారు" అని తన అభిప్రాయాన్ని చెప్పారు.  'దేశం మనకు ఏమి చేసింది' అని తలచేవారు వ్యక్తులు, 'దేశానికి మనం ఏం చేసాం' అని ప్రశ్నించుకునేవారు పౌరులు. తమ స్వార్థం కోసం ఆలోచించేవారు, తమ ప్రయోజనాల కోసం జీవించేవారు వ్యక్తులు. ఇతరుల కోసం ఆలోచించేవారు, ఇతరులకు సేవ చేసేవారు పౌరులు. ప్రతి ఒక్క భారతీయుడు వ్యక్తి నుంచి పౌరునిగా మారాలి. యువశక్తి జాగృతం కావాలి నేడు భారతీయులు అందరికంటే తెలివైనవారని ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. అయితే మనం అక్కడితో ఆగిపోకుండా ప్రతిభావంతులంగా మారాలి. దీనికోసం నేటి యువత విద్యతో పాటు విలువలను అలవరచుకోవాలి, మనోబలాన్ని పెంపొందించుకోవాలి. జ్ఞానంతో పాటు హృదయాన్ని విశాలం చేసుకోవాలి. స్వామీజీకి యువశక్తిపై అత్యంత విశ్వాసం ఉంది. యువత తమ అంత రంగంలో ఉన్న అనంత శక్తిని జాగృతం చేసి భారతమాతను ముందుకు తీసుకుపోవాలి.. ప్రతి ఒక్క భారతీయుడు భారత పౌరునిగా మారి, తమ శక్తిని జాగృతం చేస్తే, కొద్ది రోజులలోనే భారతదేశం అగ్రస్థానానికి చేరుకుంటుంది. వివేకానందుని భవిష్యవాణి సత్యమవుతుంది. ఇది మనందరి చేతులలోనే ఉంది.                                  ◆నిశ్శబ్ద. 

లక్ష్మీ రావే మా ఇంటికి!

లక్ష్మీ అంటే మహావిష్ణువు భార్య, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంపదలుంటాయి. ఆమె వెళ్లే ప్రతి చోట డబ్బు తిరగడుతూ ఉంటుంది. అందుకే పెద్దలు ఆంటారు డబ్బును, లకహ్మి దేవిని వేరు వేరుగా కాకుండా ఒక్కటిగా చూస్తారు. డబ్బు అంటే లక్ష్మీదేవినే అని అంటారు. డబ్బు దగ్గరుంటే ఈ కాలంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. కమర్షియల్ జీవితాల ప్రపంచంలో డబ్బు లేకుండా బతకడం కష్టమే కదా!! కాదని కొందరు వాదించవచ్చు. కానీ ఇలా బతకడం అలవాటు పడిపోయిన మనిషికి డబ్బు లేకపోతే ఏమీ తోచదు. అందరికీ మనసులో ఉంటుంది బోలెడు డబ్బు దగ్గరుండాలని. ఆ డబ్బుతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలని, ఎన్నో నచ్చినవి, అవసరమైనవి తీసుకోవాలని. కొన్ని కలలను తీర్చుకోవాలని. కానీ డబ్బులు ఏమీ చెట్లకు కాయవు కదా!! మరి డబ్బు మనదగ్గరకు ఎలా వస్తుంది?? కష్టపడినా తగినంత డబ్బు చేతికి రావడం లేదని, కష్టానికి తెగగా ఫలితం లేదని చెప్పేవాళ్ళ కోసం కొన్ని డబ్బులు చేతిలో ఒడిసిపట్టే చిట్కాలు!! అనవసరపు ఆడంబరాలు వద్దు!! కొన్ని విషయాల్లో పిసినారితనంగా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది. కొన్నిసార్లు లేనిపోని మోహమాటాలతో కొన్ని ఆడంబరాలు చేయాల్సి రావచ్చు. అలాంటి సందర్భాలను సున్నితంగా ఏదో ఒక పని చెప్పి తప్పించుకోవచ్చు. ఇక్కడ ఎవరూ రూపాయి కూడా చెయ్యి చాచి ఇచ్చేవాళ్ళు లేరండి. సగటు మధ్య మరియు దిగువ తరగతి మనిషికి ఆడంబరాలు నెత్తిమీద కొండంత బరువులా ఉంటాయి.  సింప్లిసిటీ!! నిజం చెప్పాలంటే ఈ సింప్లిసిటీ మనిషిని కమర్షియల్ గా ఎదిగేలా చేస్తుంది. ప్రతిదాంట్లో అతిగా ఉండకపోవడం ఎన్నో ఖర్చులను అవుతుంది. కట్టు బొట్టు నుండి, తిండి విషయం వరకు. వాడే వస్తువుల నుండి ఎక్పెక్ట్ చేయడం వరకు అన్నింటిలోనూ సింప్లిసిటీ ఉన్నవాళ్లు ఖర్చుపెట్టడంలో కూడా అనవసరమైన వాటికి సున్నితంగా దూరం వెళ్ళిపోతారు. పొదుపు సూత్రాలు!! నిజానికి పొదుపు అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలసి చేసే ప్లాన్. అయితే ఒక రిలేషన్ లోకి వెళ్లే ముందు నుంచే పొదుపు ప్లాన్ చేయడం వల్ల రిలేషన్ తరువాత చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చు. ప్రస్తుతకాలంలో పని చేయకుండా ఇంటిదగ్గరే ఉండే ఆడవాళ్లు చాలా తక్కువ. కాబట్టి పొదుపు చేయడం కూడా సులభమే. నిజానికి మగవాళ్ల కంటే ఆడవాళ్లే పొదుపు విషయంలో ముందుంటారు. అయితే ఆడవాళ్లు చేసే ఖర్చుల గురించి మాత్రం మాట్లాడకూడదు సుమా!! ఇన్వెస్ట్మెంట్!! చాలామంది బంగారం కొనడం, భూములు కొనడం ద్వారా తమ డబ్బును పెంచుకుంటారు. బంగారం, భూములు ఈ వేగవంతమైన కాలంలో అవి కూడా వేగంగా తమ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. బంగారం కేవలం పెట్టుకోవడానికి మాత్రమే కాదు ఆర్థిక స్థాయిని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక భూములు కూడా క్రమంగా ధర పెరిగేవే. అపార్టుమెంట్లు తప్ప గతిలేని ఈ కాలంలో భూములు బంగారం పండించకపోయినా డబ్బులను పుష్కలంగా సమకూరుస్తాయి. వ్యాపారాలు!! ప్రజలు ఎక్కువగా ఆధారపడే ఏ విధమైన వ్యాపారం అయినా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సంపాదించడానికే తమ సమయాన్ని వినియోగిస్తూ కనీసం వండుకోలేని మనుషులున్న కాలంలో చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో మంచి రాబడి పొందుతున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. ఆడవాళ్లు అయితే తమకు రుచికరంగా వండటం వస్తే ఏదైనా బిజినెస్ గా మార్చేయచ్చు. రుచి దొరకక జనాలు చచ్చిపోతున్నారండి బాబు.  పైన చెప్పుకున్నట్టు కొన్ని పాటిస్తే లక్ష్మీ రావే మా ఇంటికి అని మరీ బతిమలాల్సిన అవసరం లేదు.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

ఒత్తిడులను అధిగమించకపోతే జరిగే నష్టమిదే...

సమస్య ఎదురవగానే మనస్సు దానిని అసలు గుర్తించదు. అది ఒక గదిలో జంబుఖానా క్రింద దుమ్మును దులపడం లాంటిది. నేలపై బాహ్యంగా ఏమీ కనిపించకపోయినా, జంబుఖానా క్రింద చాలా దుమ్ము ఉంటుంది. కానీ దుమ్మును ఆ విధంగా కప్పి ఉంచడం వల్ల గది అంతా ఎంతో పరిశుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే విధంగా, సమస్య ఉత్పన్నమైనప్పుడు, శిక్షణ లేని మనస్సు ఆ సమస్యను తనకు తెలియకుండానే చైతన్యయుతమైన మనస్సు నుండి బయటకు త్రోయాలని అనుకుంటుంది. అప్పుడా సమస్య జంబుఖానా క్రింది దుమ్ము లాగా అచేతనమైన మనస్సు పొరలలోకి వెళ్ళి, అక్కడ స్థిరపడుతుంది. ఆ సమస్య తీరిపోదు కానీ, జరిగేది ఏమంటే అది మన కళ్ళ ముందు ఉండదు, కనిపించదు. ఏ సమస్య అయినా సరే పై స్థాయిలో కనిపిస్తూ ఉంటేనే మనం దాన్ని పట్టించుకోగలుగుతాం. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే.. మనస్సు సమస్యలను ఎదుర్కోలేదు. ఎందుకు ఎదుర్కోలేదు అంటే.. సమస్యలను ఎదుర్కోవడం అంటే బాధాకరం కాబట్టి, సమస్యలు అంటేనే శారీరకంగానో.. మానసికంగానో.. భౌతికంగానో.. ఇబ్బంది పడటం. ఆ ఇబ్బందిని ఓర్చుకోవడం.. చాలామందికి అలా ఓర్చుకోవడంలో కష్టం, బాధ ఎదురవుతాయి. కాబట్టి సమస్యను ఎదుర్కోవడం మనిషికీ.. మనసుకు కూడా అసలు ఇష్టముండదు. కానీ సమస్య అలాగే ఉంటే ఏమి జరుగుతుంది?? అది అట్లాగే ఒక దొంతర కింద దాగిపోయి ఎప్పుడో ఆ దొంతర తొలగ్గానే దుమ్ము మురిగ్గా.. పరిసరాలను అపరిశుభ్రం చేసి, శ్వాసకు ఇబ్బంది కలిగించినట్టు సమస్య కూడా మనిషిని ఇబ్బంది పెడుతుంది.   కానీ మనసు ఏమి చేస్తుంది??  సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవిక పరిస్థితులను ఆ విధంగా అణచి వేయడం వల్ల సమస్యల పట్ల మనకున్న భయాలు, అపోహలు మనస్సులోని అచేతనమైన పొరకు త్రోసివేయబడతాయి. అప్పుడు ఈ అచేతనపు పొరలలో ఉన్న అచేతన ప్రేరణలు, శక్తులు మనస్సును నియంత్రించడం ప్రారంభిస్తాయి. అప్పుడది సమస్య పరిష్కారాలను అన్ని రకాల పద్ధతుల ద్వారా వాయిదా వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ రోజు ఎన్నడూ రాదు. సుదీర్ఘకాలం అట్లాగే దాన్ని పరిష్కరించకుండా ఉంచితే చిన్న సమస్యలు కూడా క్లిష్ట సమస్యలుగా మారతాయనే విషయం మనస్సు మరచిపోతుంది. సమస్యలను పరిష్కరించడం ద్వారానే వాటిని అధిగమించగలం. ఒక సామెతలో చెప్పినట్లు, "సరియైన సమయంలో ఒక కుట్టు వేస్తే, తొమ్మిది కుట్లు వేయాల్సిన అవసరం రాకుండా నివారించవచ్చు" ఒక చిన్న నిప్పురవ్వను ఆర్పకపోతే పెద్ద మంట అవుతుంది. నిప్పురవ్వగా ఉన్నప్పుడు దాన్ని ఆర్పడం తేలిక. కానీ సరైన సమయంలో ఆ పని చేయకపోతే, అది ప్రజ్వరిల్లుతుంది. దీని ఫలితంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్య నుండి పారిపోవడం, అసలు చూడకుండా ఉండడం, లేదంటే వాయిదా వేయడం అనే స్వభావాన్ని మానేయాలి. ఏదో ఒక భయంతో బయటకు చెప్పలేనిదాన్ని మనం తరచూ పూర్తిగా అణచివేసే ప్రయత్నం చేస్తుంటాం. ఉదాహరణకు నలుగురితో చెడుగా ప్రవర్తించడం మర్యాద కాదు కాబట్టి మన కోపాన్ని వ్యక్తపరచం. కానీ అది ఎంతకాలం కొనసాగుతుంది? ఏదో ఒక రోజున అంతా బట్టబయలవుతుంది. ఇతరులపై కోపం చూపలేకపోతే అది మన ఆరోగ్యాన్నే దెబ్బ తీస్తుంది. అది కడుపులో పుండునో, అధిక రక్తపోటునో, లేదంటే గుండె ఆగిపోవడాన్నో, గుండె పోటునో కలగజేస్తుంది. అందుచేత మన లోపల ఉన్న ఈ ఒత్తిళ్ళను అధిగమించడం నేర్చుకోవాలి. అది కూడా ఇతరులను నొప్పించకుండా.. మన అసంతృప్తులు ఇతరుల మీదకు వెళ్లకుండా మన ఒత్తిడులను అధిగమించాలి.                                        ◆నిశ్శబ్ద.

ప్రవాస భారతీయులు దేశ ప్రగతికి కీలకం!

ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులకంటూ ప్రత్యేకత ఉంటుంది. భారతీయతను తాము వెళ్లిన చోటుకు వ్యాప్తి చేయడం,  భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఇతర దేశాలలో కూడా పాటించడం, అందులో ఉన్న గొప్పదనాన్ని అందరికీ తెలియజేయడం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో ఎన్నో అభివృద్ధి మార్గాలలో భారతీయుల విజ్ఞానం కూడా భాగమవుతుండటం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం.  విదేశాలకు వెళ్లిన భారతీయులు చదువులు, ఉద్యోగాల నిమిత్తం అక్కడ ఉంటూ భారతీయులను ఒకే తాటిపై ఉంచేందుకు, వారు భారతీయతను మరచిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రవాస భారతీయులు దివాస్ ను జరుపుకుంటూ వస్తున్నారు. దీని వెనుక ఉన్న  మరొక విషయం ఏమిటంటే ఈ ప్రవాస భారతీయ దివాస్ ను మన జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ తన విద్యాభ్యాసం ముగించుకుని తిరిగి భారతదేశానికి వచ్చిన సందర్భంగా  జనవరి 7 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు జరుపుకుంటారు.  భారతదేశ ప్రతిష్ట, గౌరవం ఇనుమడించడంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తుల పాత్ర చాలా ఉంటుంది. వీరందరూ తమ ప్రతిభతో విదేశాలలో గొప్ప అవకాశాలు పొందడమే కాకుండా  భారతదేశ ఉనికిని పలుచోట్లకు తీసుకెళ్తున్నారు. మొదట ఈ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని 2003 సంవత్సరం జనవరి 7 నుండి 9 వరకు ప్రతి సంవత్సరం నిర్వహించేవారు. అయితే 2015 సంవత్సరం దీనికి సవరణలు చేసి ప్రతి సంవత్సరం కాకుండా రెండేళ్లకు ఒకసారి దీన్ని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో 2023 సంవత్సరంలో ప్రవాస భారతీయ దివాస్ నిర్వహించబడుతుంది.  ఈ సంవత్సరం జనవరి 7 వ తేదీన మొదలయ్యే ప్రవాస భారతీయ దినోత్సవం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో జరగనుంది. విదేశాలకు వెళ్లే భారతీయులు భారతదేశం గర్వపడేలా చేయాలన్నది కూడా ఈ దినోత్సవంలో చర్చించే ఓ ముఖ్యమైన అంశం. ప్రవాస భారతీయ దినోత్సవ వేడుక సందర్భంగా ఎంతో మంది అతిథులు, విదేశాలలో ఉన్న భారతీయ కమ్యూనిటీకి చెందినవారు పాల్గొంటారు. స్వదేశీ-విదేశీ సంబంధాలను మెరుగుపరడంలో కూడా విదేశాలకు వెళ్లే భారతీయుల పాత్ర ఉంటుంది. భారతదేశం వివిధ రసంగాలలో అభివృద్ధి చెందడానికి గొప్పగా సహకరించిన విదేశాలకు వెళ్లిన భారతీయులకు ఈ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డ్ ను వీరికి అందజేస్తారు. అలాగే ఈరోజు జరుపుకోవడం వల్ల భారతీయులు, ఇక్కడ ప్రభుత్వాలు, అధికారులు భారతీయుల పట్ల బాధ్యతను, సహకారాన్ని అందించేందుకు ఆరోగ్యకరమైన సత్సంబంధాలు పెంపొందించుకునే అవకాశం కూడా ఉంటుంది. విదేశాలలో నివసించే భారతీయులకు అక్కడ ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్వదేశీ అధికారుల మద్దతు, అక్కడి వారు ఇక్కడికి తిరిగిరావడానికి దేశ అధికారులతో మాట్లాడటం వంటి కీలక అంశాలు మెరుగుపడతాయి.  భారతదేశానికి మాత్రమే కాకుండా వివిధ దేశాలకు కూడా ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పడాలంటే స్వదేశం నుండి ఇగ్గర దేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తుల పాత్ర కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ప్రవాస భారతీయులు ఎప్పుడూ దేశ ప్రగతిలో తాము కూడా కీలకమనే విషయాన్ని మరచిపోకండి. అలాగే దేశం మీకోసం ఎప్పుడూ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని మరవకండి.                                    ◆నిశ్శబ్ద.

యుద్ధం ముగింపా? కాదు అదే మొదలు వీరి జీవిత పోరాటానికి!

"యుద్ధం" ప్రపంచ దేశాల నుండి సాధారణ పౌరుల వరకు ఉలిక్కిపడే విషయమిది. కేవలం ఒక చిన్న పదంలో ఎంతో భీభత్సం దాగుంది. ఎన్నో జీవితాల దైన్యం నిమిళితమై ఉంది, వందలు, వేలు, లక్షల కొద్దీ ప్రాణాలు ప్రశ్నార్థకమై నిలుచుంటాయి. ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం నుండి నేడు ఇంకా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వరకు, యుద్ధానికి ఫలితం ఏమిటి అనేది ప్రతి దశలో తెలుస్తూనే ఉంది అందరికీ. మరీ ముఖ్యంగా ఈ యుద్ధాలలో జరిగిన నష్టం ఏమిటి?? కేవలం ప్రాణాలు, ఆస్తుల నష్టాలేనా??   యుద్దాల వల్ల సంభవించే మరొక భయంకరమైన పరిణామం ఉంది. అదే భవిష్యత్తరాలు అనాథలుగా మారడం. మరీ ముఖ్యంగా ఈ యుద్ధాల వల్ల చిన్న పిల్లల జీవితాలు దుర్భరంగా మారతాయి.  యుద్ధాలలో మరణించే వారి పిల్లల బాధ్యత తీసుకునేవారు ఎవరూ ఉండరు. వారు శరణార్ధులుగా ఇతర దేశాలకు వలస పోయి అనాథలుగా బ్రతకాల్సి వస్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఐక్యరాజ్యసమితి యుద్ధ అనాథల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 6వ తేదీన జరుపుతూ వస్తోంది.  దీని ఉద్దేశం ఏమిటి??  యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవం లక్ష్యం.  ఈ రోజు యుద్దాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల కష్టాలను, వారు పెరుగుతున్నప్పుడు ఎదుర్కొనే మానసిక, సామాజిక, శారీరక పరిస్థితులను, వారి ఇబ్బందులను, వారి కనీస అవసరాల కోసం, భద్రత కోసం వారు చేసే పోరాటాన్ని అందరికీ తెలిసేలా చేయడం ముఖ్య ఉద్దేశం.   పరిస్థితులు ఎలా ఉన్నాయి?? యుద్దాలు పరిణమించడం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనాథలుగా మారుతున్న వారి లెక్కలను ఐక్యరాజ్యసమితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 మిలియన్ల మంది అనాథలు ఉన్నారు, ఇందులో ఆసియాలో 61 మిలియన్లు, ఆఫ్రికాలో 52 మిలియన్లు, లాటిన్ అమెరికా, కరేబియన్‌లలో 10 మిలియన్లు, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో 7.3 మిలియన్లు ఉన్నారు. ఈ లెక్క లక్షలాది మంది పిల్లలు అనాథలుగా మారారనే దానికి  సాక్ష్యంగా స్పష్టతను ఇస్తుంది.  చేదు నిజం ఏమిటంటే..  మొత్తం అనాథల్లో 95 శాతం మంది ఐదేళ్లకు పైబడిన వారే.  అంటే ఐదేళ్ల నుండే తమవారిని కోల్పోయి అగమ్యగోచరమైన పరిస్థితిలో పిల్లలున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో అనాథల సంఖ్య చాలా తక్కువగా ఉంది.  కానీ, యుద్ధాలు, భయంకరమైన అంటువ్యాధులకు గురైన ప్రదేశాలలో, అనాథల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎదుర్కొంటున్న పరిణామాలు ఏమిటి?? దేశాల మధ్య రగిలే సమస్యలు కాస్తా ఇరుదేశాల్లోని ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి యుద్ధానికి దారితీసినప్పుడు లక్షలు, కోట్ల మంది ఎంతో సునాయాసంగా జీవితాలను జార్చుకుంటున్నారు. దేశాల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ప్రజలకు లేకపోవడం వల్ల ఆ దేశాల చర్యలకు ప్రజలు బలిపశువులవుతున్నారు. యుద్ధాలలో పెద్దవారు, యువకులు మరణించగా దిక్కుతోచని స్థితిలో పసిపిల్లలు అనాథలవుతున్నారు. వీరు ఆహారం, ఆశ్రయం, భద్రత విషయంలో ప్రతి రోజునూ లెక్కపెట్టుకుంటూ జీవించాల్సి వస్తోంది. గత లెక్కల చిట్టా ఏమి చెబుతోంది?? ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం అనాథల సంఖ్య 1990 నుండి 2001 వరకు పెరిగింది.  అయినప్పటికీ, 2001 నుండి,  ఈ సంఖ్య స్థిరంగా తగ్గుతూ వచ్చింది. ఆ కాలంలో సంవత్సరానికి 0.7% మాత్రమే నమోదు అయింది.   1990లో 146 మిలియన్లు, 1995లో 151 మిలియన్లు, 2000లో 155 మిలియన్లు,  2005లో 153 మిలియన్లు, 2010లో 146 మిలియన్లు  2015లో 140 మిలియన్లు గా నమోదయ్యాయి. ప్రస్తుతం ఏమి చేయొచ్చు?? ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి అందరికీ తెలిసిందే.. రెండు దేశాల మధ్య సమస్యగా మొదలైన ఈ యుద్ధం కాస్తా మరింత దీర్ఘకాలం కొనసాగితే మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచం మొత్తం మీద కోట్ల కొద్దీ మరణాలు సంభవించడమే కాకుండా ఎంతో మంది పిల్లలు అనాథలుగా మారతారు. కాబట్టి దేశాల మధ్య సమస్యలకు యుద్దమే పరిష్కారం కాదనే విషయం మనకు తెలిసిన సగటు పౌరుడి చేతిలో దాన్ని అడ్డుకునే అస్త్రం లేకపోయినా అనాథలను ఆదుకునే మనసు, వారికి ఆశ్రయమిచ్చే తాహతు మనకున్నప్పుడు అలాగే చేయడం అందరి ధర్మం. యుద్ధం ముగింపు కాదు, కొన్ని కోట్లమంది పిల్లల జీవితాల పోరాటానికి అది మొదలవుతుంది.                                       ◆నిశ్శబ్ద.

మూఢనమ్మకాలు ముంచేస్తాయ్!

నమ్మకాలు మనిషిని బలంగా ఉంచేవి, అభివృద్ధికి దోహదం చేసేవి అయి ఉండాలి. అంతేకానీ మనిషిని పిచ్చోళ్ళలా మార్చేవి కాకూడదు. కొన్ని నమ్మకాల వెనక శాస్త్రీయ కారణాలు ఉంటాయి. వాటిని కొట్టి పడేయలేం. కానీ మరికొన్ని కారణాలు ఎలాంటి శాస్త్రీయ కారణాలు లేకుండా కేవలం ఆచరించాలని చెబుతారు. అంతేనా వాటివల్ల మనుషులకు ఆర్థిక నష్టమే కాకుండా సమయానికి కూడా నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు జీవితంలో ఎంతో ముఖ్యమైన అవకాశాలు కోల్పోవచ్చు, మరికొన్నిసార్లు ఎంతో గొప్పవైన మానవ సంభంధాలకు నష్టం కలగచ్చు. మొత్తానికి మనుషులను మనుషుల అభివృద్ధిని సమాజాన్ని వెర్రివాళ్లను చేసే మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి.  బయటకు వెళ్తున్నప్పుడో లేక ముఖ్యమైన పనిమీద వెళ్తున్నప్పుడో పిల్లి ఎదురయ్యిందనో లేదా భర్త చనిపోయిన ఆడవాళ్లు ఎదురయ్యారనో, చనిపోయిన శవాన్ని ఎవరో తీసుకెళ్తున్నారనో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.  చాలామంది వీటిని అరిష్టం అని అపశకునం అని అనుకుంటారు. ముఖ్యమైన పనుల కోసమో, చాలా అవసరమైన వాటికోసమో ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఎదురవ్వగానే 90% ఖచ్చితంగా తిరిగి ఇంటికి వెళ్లడం, లేదా అలా ఎదురైన తరువాత సాదారణంగానే ఎక్కడో ఒకచోట కూర్చోవడం వంటివి చేస్తుంటారు. దానివల్ల వాళ్లకు ఆలస్యం అవడం, ముందున్నంత మానసిక దృఢత్వం తరువాత కోల్పోవడం జరుగుతుంది. ఒక్కసారి బాగా గమనిస్తే తుమ్ము వచ్చిందనో, పిల్లి ఎదురొచ్చిందనో చేసే ఆలస్యాలు, అపశకునం కాబట్టి ఏదో సమస్య ఎదురవుతుందని దానిగురించి చేసే ఆలోచనలు చెయ్యాల్సిన పనులను సరిగ్గా చేయనివవ్వు, సరిగ్గా జరగనివ్వవు. మనం చేసే ఆలస్యానికి సమయానికి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ లేదా బస్ ఎక్కడికీ వెళ్లకుండా మనకోసం స్టాప్ లోనే ఉంటాయా ఏంటి??  ముఖ్యమైన పనులు చెయ్యాల్సినప్పుడు మానసికంగా దెబ్బతింటే అప్పుడు చేసేపనిని సరైన ద్యాసతో చేయలేము. మనమే పనిమీద సరైన దృష్టిపెట్టకుండా ఎదురైన పిల్లుల మీద, చనిపోయిన మనుషుల మీద కారణాలు తోసేయడం ఎంతవరకు సరైనది. కాలం మారిపోయింది మూఢనమ్మకాలు ఇప్పుడెక్కడున్నాయిలే అని అందరూ అనుకుంటారు కానీ అభివృద్ధి చెందుతున్న, ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.  అప్పుడెప్పుడో బాగా చదువుకుని లెక్చరర్ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు కూతురిని చంపేయడం మూఢనమ్మకం అయితే తాజాగా ఒక దినపత్రికలో అష్టమి నాడు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త భార్యను హింసించడం అనే సంఘటన గురించి తెలిసినప్పుడు  ఈ సమాజంలో నమ్మకాలు ప్రజలను ఎంతగా వెర్రివాళ్లను చేస్తున్నాయో అర్థమవుతుంది. నమ్మకాలు ఏవైనా మనిషి మానసిక స్థితిని దెబ్బకొట్టేవే. ఆ విషయం అర్ధం చేసుకున్నప్పుడు ఏదో ఎదురొచ్చిందని, మరింకేదో అడ్డొచ్చిందని ఆగిపోరు. ఎదురయ్యే జంతువుల్ని, మనుషుల్ని, సంఘటనలను చూసుకుంటూ తమ పనులను నిర్లక్ష్యం చేయరు. ప్రతిదాంట్లో మంచిని చూస్తూ ప్రతి సమస్యకు తమ నమ్మకమే బలం అని తెలుసుకున్నవాళ్ళు తాము మొదలుపెట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసుకుని కార్యశూరులు అవుతారు. అంతేకానీ మూఢనమ్మకాల మధ్య జీవితాన్ని ముంచేసుకోరు.                                 ◆ వెంకటేష్ పువ్వాడ.

మనిషి ధర్మం ఎలా ఉండాలో తెలుసా?

మనిషి ఎలా ఉండాలి?? అతడి ధర్మం ఎలా ఉండాలి?? అతడు ఎలా నడుచుకోవాలి?? అనే విషయం గురించి ఓ ఉదాహరణా కథనం ఉంది.  పూర్వం జపాన్లో కైచూ అనే గొప్ప జెన్ మాస్టర్ క్యోటో ప్రాంతంలో ఒక ఆలయానికి అధిపతిగా ఉంటుండేవాడు. ఒకసారి క్యోటో గవర్నర్ ఆ ఆలయానికి మొదటిసారి వచ్చాడు. జెన్ మాస్టర్ సహాయకుడు, గవర్నర్ గారి విజిటింగ్ కార్డు పట్టుకెళ్ళి మాస్టర్కు ఇచ్చాడు. ఆ కార్డు మీద "కిటగానీ, క్యోటో గవర్నర్" అని ఉంది. "నాకు ఇతగాడితో ఏమీ పనిలేదు. వెళ్లిపొమ్మను” అన్నాడు కైచూ. సహాయకుడు గవర్నర్ వద్దకు వచ్చి 'మన్నించండి' అంటూ జరిగిన విషయం చెప్పాడు.  “పొరపాటు నాదే సుమా” అంటూ గవర్నర్ కలం చేత బుచ్చుకొని, తన పేరు మాత్రమే ఆ కార్డు మీద ఉంచి, 'క్యోటో గవర్నర్' అనే పదాలు కొట్టేసి కార్డును సహాయకుడి చేతుల్లో పెడుతూ “మళ్ళీ ఒకసారి మీ మాస్టర్ వద్దకు వెళ్ళి అడిగిచూడు” అన్నాడు. అది చూసిన జెన్ మాస్టర్ "ఓహో! వచ్చింది కిటగానీయా? అయితే అతణ్ణి నేను చూడాలనే అనుకుంటున్నాను రమ్మను” అన్నాడు ఈసారి.  మనిషి తన హోదాతో ఒకటైపోతాడు. పిల్లవాడు పుట్టినప్పటి నుంచీ ఇతడు జీవితంలో ఏమవుతాడో అనే చింత తల్లిదండ్రులకు దాదాపు ఆనాటినుంచే ప్రారంభం అవుతుంది. జాతకచక్రం వేయించి చూస్తారు. గొప్ప కంప్యూటర్ ఇంజనీరో, లేక ఏదో పెద్ద సంస్థకు అధిపతిగా ఉంటాడనో, గొప్ప డాక్టరో, సైంటిస్టో అవుతాడని చెప్పించుకొని సంతోషపడతారు. పిల్లవాడు చేతులు, కాళ్ళు ఆడించి కాస్త పాకే సమయానికల్లా అతడి ముందు ఒక కలమూ, కాస్త ఎడంగా ఒక ఉంగరమూ, అలాంటివే మరేవో అక్కడ పెట్టి ఏది పట్టుకుంటాడో అని వేచి చూస్తుంటారు. అంటే సరస్వతీదేవికి అంకితమవుతాడా లేక లక్ష్మీకటాక్షం అనుభవించనున్నాడా అనే విషయం కనుగొంటారన్నమాట. అయినా కాకపోయినా అప్పటికి అదే పెద్ద సంతృప్తి. ఏవో బంగారు కలలు కంటూ కాలం గడుపుతుంటారు.  కానీ ఆకాశమంత అవకాశంతో పుట్టిన ఆ శిశువు ఈ కాస్తతోనే సంతృప్తి పడాలా? గొప్ప ఇంజనీర్ కావడంతో అతడి జన్మ సఫలీకృతమైనట్లేనా? ఫలానా కీర్తిగడించిన ఇంజనీర్ మావాడే, నాకొడుకే, మామేనల్లుడే, మాఊరి వాడేనండోయ్ అని చెప్పుకోడానికేనా? జీవితం అంత పరిమితమైనదా? ఈ జీవితానికి అంతకన్నా విస్తృత అవకాశాలు లేవా? సాక్షాత్తూ జీవితాన్నే దర్శించి అంబరమంత ఎత్తు ఎదిగిన మహనీయులు, అంత ఎలా సాధించారు? వారు కూడా ఈ కాస్తతోనే సరిపెట్టుకొని ఉంటే, ఇంతటితోనే సంతృప్తి చెంది ఉంటే, మనిషిగా ఎదిగి ఉండేవారా?  మరి పిల్లవాడు అలా ఎదగడానికి మనం దోహదం చేసే బదులు, ఇంజనీర్ అవమనో, వృత్తిపరంగా మరేదో సాధించమనో, మనమెందుకు అతడి జీవితాన్ని సంకుచితం చేస్తున్నాం? అంటే మనకీ స్వయంగా అపరిమిత, విశాల జీవితమంటే ఏమిటో సరియైన అవగాహన లేనందువల్లనే కదా?  జన్మించేటప్పుడు ప్రతిశిశువూ అనంతమైన స్థితిలోనే పుడతాడు. అతడు ఎంతైనా ఎదగగలడు. ఒకప్పుడు రాముడనే దేవుడు, కృష్ణుడనే దేవుడు కూడా ఇలానే తల్లి గర్భాన పుట్టారు. దేవుణ్ణి మీరు నమ్మితే ఈ పిల్లవాడు కూడా ఆ  ''పొటెన్షియాలిటీ' తోనే పుట్టాడు. మనం ఈ పిల్లజీవితాలను సంకుచితపరచకుండా, పరిమితం చేయకుండా స్వేచ్ఛగా  అంటే విచ్చలవిడిగా కాదు, సంతోషంగా, కోమలమైన స్పృహతో ఎదగనిస్తే వీరు కూడా ఆ పురాణపురుషులంతటి వారవుతారేమో?  'అందరూ అంతంతటి వారెలా అవుతారు?' అనే వేళాకోళం అటువుంచి, అరుణాచల రమణుడూ,  జిడ్డు కృష్ణమూర్తి, అంత ఎత్తుకు ఎలా ఎదగగలిగారు? వారిని గురించి కూడా తల్లిదండ్రులు అలానే అనుకొని ఉండవచ్చు కదా? “వెర్రి వేషాలు వేయకు. కుదురుగా చదువుకొని పెద్ద ఆఫీసరన్నా అవు, లేదా నీ కర్మ అదేనైతే, ఎక్కడో గుమాస్తాగా నీ బతుకు ఈడ్చెయ్" అని వారి రెక్కలు కత్తిరించేసినట్లయితే ఏమయ్యేది? అందువల్ల పిల్లవాణ్ణి సాధారణ చదువులు చదివిస్తూ, వాటిలో ప్రావీణ్యత గడిస్తూ ఉన్న సమయంలో కూడా స్వేచ్ఛగా ఎదగనివ్వాలి. . ఎత్తుకున్నప్పటినుంచి మీ అభిప్రాయాలను గురించి మీరు స్వయంగా ఎరగని మతసిద్ధాంతాలతో అతణ్ణి 'కండీషన్' చేయకూడదు. అతడు కోరుకున్న వృత్తిని స్వీకరించనివ్వాలి. అతడి భవిష్యత్తును మీ అభిమతానుసారంగా మలచడానికి ప్రయత్నించకూడదు. తాను ప్రేమించని వృత్తిని చేపట్టిన సదరు పిల్లవాడు ఆ వృత్తిలో ధనం ఎంతైనా సంపాదించ వచ్చు. తల్లిదండ్రుల్ని తూగుటుయ్యాలలో ఊగించవచ్చు. కానీ అతడికి మాత్రం సంతోషముండదు. అలా దిగులుగా తిరుగుతూనే ఉంటాడు.అంటే ఇష్టం లేని పనిలో డబ్బు వస్తుందేమో కానీ తృప్తి మాత్రం రాదు.                                  ◆నిశ్శబ్ద.

ఆశించకుండా చేసే మేలు ఎలా ఉంటుంది?

మునుపటి తరాల్లో వారం చేసుకుంటూ చదువుకున్న విద్యార్థులు ఎందరో వుండేవారు. చదువుకోవాలనే వారి అభిలాషా, చదువుకునే  వారిపై ఈ గృహస్థుల అభిమానమూ చూడముచ్చటగా వుండేవి. భారతదేశ అధ్యక్షపదవి అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటివాడే చిన్నతనంలో వారాలు చేసి చదువుకునేంత బీదరికం అనుభవించాడని ఆ తరం వారు చెప్పుకుంటారు. గుణవంతులు, ప్రతిభావంతులు అయిన మరెందరో ఆ విధంగా కష్టపడి చదివి ఆ తర్వాతి జీవితంలో ఎంతగానో గొప్పగా ఎదిగిన వారున్నారు. తనతో సహపంక్తి భోజనం చేసిన కుర్రాడు. ఎన్నో ఏళ్ళ తర్వాత ఏదో ఒక ఉన్నతస్థానం ఆక్రమించినప్పుడు తానే స్వయంగా అతడి సహాయం కొరకై ఎదురుచూచే సందర్భం రాకపోయినా, అతడు ఆనాడు తనకు భోజనసదుపాయం ఏర్పరిచిన గృహయజమానిని కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకున్నాడని ఎవరైనా చెప్పినప్పుడో, ఏదైనా సందర్భం పురస్కరించుకొని ఆ పెద్దమనిషి ఈ గృహస్థును ప్రత్యక్షంగా సత్కరించినప్పుడో ఇతడి ఆనందానికి అంతు ఉండదు. దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి.. అమెరికాలోని లీలాండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున విద్యార్థులు అనుకోని ఆర్థిక ఇబ్బందులకు గురైనారు. ప్రఖ్యాత సంగీతజ్ఞుడు సాడీరుస్కీచేత పియానో వాద్యకచేరీ పెట్టించి ఇంత డబ్బు వసూలు చేయగలిగితే తమ ఇబ్బందినుండి బయట పడచ్చుకదా అని ఒక విద్యార్థికి తట్టింది. సాడిరుస్కీ కచేరీల ఏర్పాట్లు చూసే మానేజర్ను వెళ్ళి కలిశారు. పియానో కచేరీకి రెండువేల డాలర్లు ముట్టచెప్పవలసి వుంటుందన్నాడు ఆ మానేజర్, విద్యార్థులు అలాగేనంటూ వసూళ్ళు ప్రారంభించారు. ఇద్దరు విద్యార్థులూ ఎంతో ప్రయత్నించారు కానీ, పదహారు వందల డాలర్లకన్నా వసూలు చేయలేక పోయారు. కచేరీ జయప్రదంగా ముగిసిన తర్వాత, వారిద్దరూ సాడిరుస్కీవద్దకు వెళ్ళి తాము చేసిన ప్రయత్నం అంతా వివరించి ఎంత శ్రమించినప్పటికీ చివరకు పదహారు వందల డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగామని చెప్పుకుంటూ, ఆ పదహారు వందల డాలర్లతో బాటు మరో నాలుగువందల డాలర్లకు ఓ ప్రామిసరీ నోటు వ్రాసి సాడిరుస్కీ చేతిలో ఉంచారు.  వారు చెప్పినదంతా వినిన సాడిరుస్కీ "అలా కుదరదు బాబూ" అంటూ ఆ ప్రామిసరీ నోటును చింపేసి, పదహారు వందల డాలర్లు వారికి తిరిగి ఇస్తూ “ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి మీ కెంత ఖర్చయిందో అది ముందు తీసేసుకోండి. ఆ మిగిలిన మొత్తంలో చెరి పదిశాతం వంతున మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలంగా వుంచేసుకోండి. ఆ మిగతాది నాకివ్వండి" అంటూ అంత మాత్రమే తీసుకున్నాడు. కాలచక్రం దొర్లింది. ప్రథమ ప్రపంచ సంగ్రామం ప్రారంభమై అనేక దేశాల ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసి అంతమైంది. సాడిరుస్కీ మాతృదేశం పోలండ్ ఆర్థికంగా చితికిపోయింది. ఆ దేశ ప్రజలకు తినడానికి తిండికూడా కరువైన గడ్డురోజులు వచ్చాయి. ఆవేశపూరితుడైన సాడిరుస్కీ తన దేశీయుల్ని గట్టెక్కించడానికి అహర్నిశలూ తన శాయశక్తులా కృషిచేస్తున్నాడు. ఆ విపత్సమయంలో తన మాతృదేశాన్ని ఆదుకోగలిగినవాడు అమెరికా దేశ ప్రెసిడెంట్ ఒక్కడేనన్న సంగతి సాడిరుస్కీ గ్రహించాడు.  “మాకీతరుణంలో సహాయం చేసి పుణ్యం కట్టుకోండి”. అని సాడిరుస్కీ తన దేశం తరపున అమెరికన్ అధ్యక్షుడికి విజ్ఞప్తి పంపించీ పంపించక ముందే, పోలీష్ ప్రజలకు పంపిణీ చేయడానికిగాను వేలాది టన్నుల ఆహారధాన్యాలు పోలండ్ లోని ఆహారమంత్రికి అందడం ప్రారంభమైంది. క్షుధార్తులైన వారి ఆహారావసరాలు తీర్చి మరుక్షణం పారిస్ పట్టణంలో మకాం వేసుకున్న అమెరికన్ ప్రెసిడెంట్ హార్బర్ట్ హోవర్ను కలుసుకోడానికి అక్కడికి హుటాహుటిన వెళ్ళిన సాడిరుస్కీ "సకాలంలో సహాయం అందించి మా దేశవాసుల్ని రక్షించినందుకు కృతజ్ఞత తెలుపుకోడానికి వచ్చాను" అన్నాడు. “దానిదేముంది లెండి సాడిరుస్కీ మహాశయా, మీ ప్రజల అవసరం ఎలాంటిదో నాకు అవగతమైంది. అదీకాక చాలా ఏళ్ళ క్రితం నేను చదువుకుంటున్న రోజుల్లో ఒకమారు చాలా ఆర్థిక ఇబ్బందులకు లోనైనాను. అప్పుడు మీరు నాకూ, నా స్నేహితుడికీ చాలా ఉదారంగా సహాయపడ్డారు లెండి" అని చిరునవ్వుతో సాడిరుస్కీ చేతులు పట్టుకున్నాడు హార్బర్ట్ హోవర్. ఆశించకుండా చేసే సహాయం వల్ల తిరిగి మనిషికి దక్కే ఫలితాలు ఇలాగే ఎంతో అద్బుతంగానూ, ప్రయోజనం చేకూర్చేవి గానూ ఉంటాయి.                                         ◆నిశ్శబ్ద.

కొత్తబంగారు లోకం ఇదిగో ఇలా సొంతం!! 

కొత్తలోకం అంటే వేరే ఎక్కడో వేరే గ్రహం గురించి మాట్లాడటం లేదు. ప్రతిమనిషి జీవితంలో వాళ్ళ భవిష్యత్తు గురించి కొన్ని ఆశలు, కొన్ని ఆశయాలు, మరికొన్ని దుఃఖాలు, ఇంకొన్ని సమస్యలు ఉండనే ఉంటాయి. అయితే వటన్నిటీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనే దాని మీద వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.  నేటి యువతకు రేపటి గురించి ఎంతో పెద్ద కలలు ఉండటం సహజం. అయితే ఆ కలను సాధించుకుంటున్నవాళ్ళు ఎంతమంది అని తరచి చూస్తే చాలా కొద్ది జీవితాలు మాత్రమే  విజయ తీరాలు చేరుకుంటున్నాయని చెప్పవచ్చు. ఐటీఏ ఆ కొన్ని జీవితాలు కూడా నిజంగా తాము కన్న కలను నిజం చేసుకున్నారా లేక సమాజాన్ని, కుటుంబాన్ని కాంప్రమైజ్ చేయడానికి వాటి దృష్టిలో ప్రాముఖ్యత ఉన్న దాన్ని సాధించి బతికేస్తున్నారా?? ప్రశ్న చిన్నదే కానీ దానిలో లోతు, దాని కారణాలు మాత్రం చర్చిస్తే పెద్ద గ్రంథం అవుతుంది. చిన్నప్పటి నుండి కొన్ని విషయాలను బుర్రలో నూరిపోసి, బలవంతంగా కొన్ని, సమాజం కొన్ని ఎట్లా అయితేనేం కారణాలు ఎన్ని ఉన్నా మొత్తానికి తమకోసం తాము బతకడం అనే విషయాన్ని మాత్రం అందరి జీవితాల నుండి తొలగించారు మరియు తొలగించుకున్నారు మనుషులు. ఏదైనా గట్టిగా అడిగినా మంచి కోసమే అనే చెప్పేవాటిలో మంచి ఎంత ఉందో అర్థం చేసుకునే మానసిక పరిణితిని పెద్దలు తమ పిల్లల్లో పెంపొందించేందుకు కృషి చేస్తే చాలు కదా అనిపిస్తుంది. ఇక యువత ఆవేశం, తొందరపాటుతో చేసే ఎన్నో పనులు తమ లక్ష్యాలు దారితప్పడానికి కారణం అవుతున్నాయి. వాటిని పునర్విమర్శ చేసుకోకుండా ప్రపంచం పెద్దదంటూ పరిగేడితే లక్ష్యం చేరుకోగలరో లేదో కానీ అలసట మాత్రం తప్పకుండా వస్తుంది. అందుకే తాము వెల్లదల్చుకున్న దారి గురించి అనుభవం ఉన్నవాళ్ళతో చర్చించి సురక్షితంగా సరైన మార్గంలో వెళ్లడం సబబు. ఆశకు రెక్కలు ఇవ్వాలి!! ఆశించడం తప్పేమి కాదు. ఈ ప్రపంచంలో మనిషిని గొప్పగా ఎదిగేలా చేసేది ఆశనే. అందుకే రేపటి జీవితం గురించి ఆశ ఉండాలి. ప్రతి మనిషి నిన్నటి కంటే అంతో ఇంతో మెరుగవుతూ ఉండాలి. దానికి తగ్గట్టు తమ అనుభవాల ద్వారా జీవితానికి జ్ఞానాన్ని పొగుచేసుకోవాలి. వ్యక్తిత్వ పరంగానూ, ఆలోచనాపరంగానూ ఎదగాలి. అప్పుడు ఆశ కూడా జీవితానికి తగ్గట్టు కదులుతూ సంతోషాన్ని కలిగిస్తుంది.  ప్రాధాన్యత ప్రత్యేకత!! ప్రతి మనిషి ఎదుటి మనిషికంటే రూపంలోనూ, ఆలోచనల్లోనూ, వ్యక్తిత్వ పరంగా ఇంకా సామాజిక ఆర్థిక స్థాయిల పరంగా విభిన్నమైనవాడు. ఒకే కుటుంబంలో ఉన్న ఎవరూ ఒకే ఆలోచన కలిగి ఉండరు. అలాంటప్పుడు జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాల్లో వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలానే ఉందాం. వాళ్ళు అది సాధించారు మనం ఇది సాధిద్దాం అని ఎందుకు అనుకుంటారు. జీవితంలో ముఖ్యమైనది ఏది?? దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి?? తమలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?? దాన్ని ఎలా పదును పెట్టుకుని తమకే గుర్తింపు తెచ్చేలా చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఆనందం ఎక్కడో లేదు మనసులోనే!! నిజమే ఆనందం మనసులోనే ఉంటుంది. దాన్ని తెలుసుకునావాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండగలరు. వస్తువులలోనూ, ఎదుటి వాళ్ళ స్పందనలోనూ ఆనందాన్ని వెతుకునేవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. వాళ్ళను అశాంతి ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఆనందానికి కీ ని మీదగ్గరే ఉంచుకోవాలి. అడ్డంకులూ అవరోధాలు హుష్ కాకి!! మనం వెళ్లాల్సిన ఊరికి ప్రయాణం చేసేటవుడు మధ్యలో దారి బాగోలేకపోయినా, వెహికల్ పాడైనా వేరే వెహికల్ లో, జాగ్రత్తగా వెళ్తాము అంతేకానీ ఆ ఊరికి వెళ్లడమే మనేస్తామా లేదు కదా!! ఇదీ అంతే. మనం అనుకున్న లక్ష్యంలో ఏదైనా సమస్య ఎదురైతే పరిష్కరించుకుంటే పోతుంది. కానీ ఈకాలం వాళ్లకు తెగ్గొట్టడం వచ్చినంత బాగా తిరిగి అతికించడం, దానికోసం కష్టపడటం, ఓర్పుగా ఉండటం రావు. వాటిని అలవాటు చేసుకోవాలి. మనస్ఫూర్తిగా మంత్రం వెయ్యాలి!! దేనికైనా మనసుతో తృప్తిగా చేయడం ముఖ్యం. అందుకే మనిషి స్వచ్ఛంగా ఉండాలి. కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ లాంటివి మనసులో అసలు ఉంచుకోకూడదు. ప్రేమించడం తెలిసిన మనిషి దాన్ని తిరిగి ఆశించకుండా కేవలం ఇవ్వడంతోనే సరిపెట్టుకుంటే ఎంతో గొప్ప ప్రశాంతత దొరుకుతుంది.  ఆశలు, లక్ష్యాలు, ఆశయాలు వీటన్నిటిని ఆశవహాదృక్పథంతో మనసు తలుపులు తెరిచి ముందుకు వెళ్తే కొత్తబంగారు లోకం సాక్షాత్కరిస్తుంది. ◆ వెంకటేష్ పువ్వాడ

కొత్త సంవత్సరం కొత్త గోల్స్ లో వీటిని తప్పక చేర్చండి!!

కొత్త సంవత్సరం అనగానే చాలామంది కొన్ని గోల్డ్ పెట్టుకుంటారు. అన్ని లిస్ట్ కూడా రాసేసుకుంటారు. కానీ అవన్నీ న్యూ ఇయర్ రోజు అందరికీ శుభాకంక్షాలు తెలుపుతూ, పార్టీలు చేసుకుంటూ ఆ సందడిలో మొదటి రోజే లక్ష్యాలకు పంగనామాలు పెడతారు. అయితే… కొత్త సంవత్సరం సందర్భంగా ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా అవన్నీ పాటిస్తేనే తగిన పలితం ఉంటుంది. లిస్ట్ లో రాసుకున్నంత సులువుగానే వాటిని కూడా అటక ఎక్కిస్తారు. కానీ… కొత్త సంవత్సరం గోల్డ్ లిస్ట్ లో ఎన్ని రసుకున్నా… వాటిలో ఎన్ని ఫాలో అయినా… అవ్వకపోయినా… ప్రస్తుతం మీరు చదవబోయే వాటికి మాత్రం తప్పకుండా చోటు కల్పించి వాటిని ఫాలో అయితే.. కొత్త ఏడాదిలో మీ జీవితంలోంచాలా గొప్ప మార్పు చూస్తారు. అవి ఏమిటంటే… కొత్త స్నేహం.. స్నేహితులు ఇప్పటికే చాలామంది ఉన్నారు. మళ్లీ కొత్త కొత్త స్నేహం ఏంటి?? అని అనుమానం, కొత్త స్నేహాలు ఎందుకు?? అనే ప్రశ్న చాలామందిలో పుడుతుంది. అయితే స్నేహితులు ఇంతమందే ఉండాలి.. కొత్తగా ఎవరితోనూ స్నేహం చేయకూడదు అనే రూల్స్ ఏమీ జీవితాల్లో లేవు కదా… కొత్త స్నేహం మొదలుపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? అనే ప్రశ్న ఆ తరువాత పుట్టచ్చు… స్నేహాలు పెరగడం వల్ల ఎప్పుడూ వ్యక్తికి ఇతరులతో సంబంధాలు విస్తృతం అవుతాయి. ఈ కారణంగా సర్కిల్ పెరుగుతుంది. దీనివల్ల మనకు ఉన్న ఆత్మీయులు ఎక్కువ అవుతారు. మనిషి సంఘజీవి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. పదిమందితో సత్సంబంధాలు కలిగి, పందిమందితో సంతోషంగా జీవించేవాడికి సమస్యల వల్ల కలిగే ఇబ్బందులు చిన్నవిగా అనిపిస్తాయి. కాబట్టి కొత్త స్నేహం మొదలుపెట్టండి..  ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఎన్నో సాధించగలుగుతారు. నిజానికి ఆరోగ్యం సరిగా లేకపోయినా అన్ని ఇబ్బందులనూ ఎదుర్కొంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. మన చుట్టూనే అలాంటి వారు మనకు ప్రేరణ కలిగిస్తూ ఉంటారు. అయితే ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యకరంగా జీవించడం ఎంతో ముఖ్యం. అదే మనకు శ్రీరామ రక్ష. బరువుకు బ్రేక్స్… కొందరు అధికబరువు ఉంటారు. నిజానికి దీనివల్ల శరీరాన్ని చుట్టుముట్టే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ చేయాల్సిన మొదటిపని శరీరానికి తగిన బరువు ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడం. ఒకవేళ తగిన బరువుకంటే ఎక్కువ ఉంటే బరువు తగ్గడం మీద దృష్టి పెట్టడం. బ్యాడ్ హబిట్స్ కు బై బై.. చెడు అలవాట్లు అనగానే చాలామంది ఏవేవో ఉహించుకుంటారు. తినకూడని పదార్థం తినడం, సమయవేళలు పాటించకపోవడం, అతిగా తినడం, సంబందం లేకపోయినా ఇతరులతో గొడవ పడటం, నోటి దురుసు, ఇతరులను నొప్పించేలా మాట్లాడటం ఇలా చూసుకుంటే చాలా చిన్న విషయాలలో కూడా తప్పుగా ప్రవర్తించేవారు ఉంటారు. ఇలాంటి వాటిని సురిచేసుకుని చూస్తే తమ జీవితం ఎంత మారుతుందో వారికే స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. ఆహార మంత్రం!! చలి వనికిస్తుంది, మళ్ళీ కోవిడ్ వేవ్స్ వినబడుతున్నాయి. మరి సాదారణంగా సరిపోతుందా?? లేదు కదా.. పోషకాహారం తీసుకోవాలి. తాజాగా ఉండేలా చూసుకోవాలి. రుచి గురించి కాదు, ఆహార నాణ్యత గురించి, అది శరీరానికి చేసే మేలు గురించి ఆలోచించి ఆహారం విషయంలో అడుగులు వెయ్యాలి.  ఇలా పైన చెప్పుకున్న విషయాలను  మీ న్యూ ఇయర్ లిస్ట్ లో చేరిస్తే.. జీవితాన్ని ఎంతగానో మార్పుకు లోను చేసి సంతోషంగా ఉండటానికి కారణం అవుతుంది.                                         ◆నిశ్శబ్ద.

మీరూ.. గతంలో జీవిస్తున్నారా? అయితే ఇది చదవండి!

మనిషి తన జీవితంలో చేసే పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది వర్తమానంలో ప్రయాణిస్తూ గతంలో జీవిస్తూ ఉండటం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుత కాలంలో ఎంతోమంది చేస్తున్న పని అదే..  "మా తాతలు నేతులు త్రాగారు మీరు మా మూతులు వాసన చూడండి," అన్నాడట వెనకటికొకాయన. కొందరికి తమ పూర్వీకులు చాలా గొప్పవారని వీరు వారి సంతతి వారేనని మన సాంప్రదాయం సంస్కృతి వారిలో కూడా వారసత్వంగా వచ్చిందని గొప్పలు చెప్పకుంటూ వుంటారు చాలామంది.  సూర్యునికి  ఎదురుగా నిలబడితే మనిషి తన నీడను కూడా తాను చూసుకోలేడు. అలాగే గతంలో జీవించడం అలవరచుకుంటే ప్రస్తుత జీవితం శూన్యమవుతుంది. ఈ విషయం ఎంత చెప్పినా ఎవరికీ అర్థం కాదు.  యుద్ధం జరిగిన దేశాలలో ఎంతో ఆస్తి నాశనమయిన వారిని మనం చూశాం ఎంతో ధనం, ఎన్నో భవంతులు, మరెన్నో ఫ్యాక్టరీలు పోగొట్టుకుని నేలమట్టమయిన ధనికుల చరిత్రలను మనం చూస్తూ ఉంటాం. అంతటి ప్రాభవాన్ని చవిచూసిన ప్రభుద్దులు అంతా కోల్పోయాక బ్రతకడం కోసం ఒక చిన్న ఉద్యోగిగా మారి,  మరోక వ్యక్తి దగ్గర గుమాస్తాగానో, వేరే ఇంకో పనో  పనిచేస్తూ ఉంటారు. చిన్న చిన్న షాపులలో సెల్స్ మెన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వారు ఎంతోమంది ఉంటారు. వారు అవకాశం దొరికితే కమ గత వైభవాన్ని చెప్పుకోలేకుండా వుండలేరు. మేము ఒకప్పుడు బాగా వున్నవారమే. బ్రతికి చెడ్డవారం అంటూ వాపోతారు.  ఆ రోజుల్లో మీరు మా  ఇంటికి వచ్చివుంటే మిమ్మల్ని ఏ విధంగా అతిధ్యంతో ముంచెత్తేవాడినో... అంటూ గతంలోకి పోయి నాటి సుఖ భోగాల గుర్తులలోనూ, , ఆలోచనా పరంపరలతోనూ  తన గత వైభవ చరిత్రను కథలు కథలుగా వినిపిస్తారు. అది నిజమే కావచ్చు కాని మనకు అదంతా గత చరిత్ర క్రింద అనిపిస్తుంది. 'గతజల సేతు బంధనం దేనికి' అనిపిస్తుంది. ప్రస్తుతం అటువంటి చరిత్రలని ఆదరించి ఆదుకునేవారు మన నవసమాజంలో కనిపించరు. గతాన్ని ప్రస్తుతంతో పోల్చడం ఎవరికి ఇష్టం ఉండదు. అదంతా యదార్ధమే కావచ్చు కాని ప్రస్తుతానికి చరిత్ర అనేది అప్రస్తుతం, లాభంలేని వ్యర్థ కాలక్షేపానికి మాత్రమే అలాంటివన్నీ ఉపకరిస్తాయి.  అలాంటి కథలన్నీ వినడానికి అంత ఓపిక ఎవరికీ లేదు.  ఈ రోజుల్లో నీ పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తారు కాని,  ఎప్పుడో గడిపిన సుఖ సంతోషాల గురించి, సమస్తం చెయ్యి జారిపోయిన తరువాత పూర్వం బ్రతికిన రోజుల గురించి ఎవరికీ అవసరం లేదు.  కొందరు వ్యక్తులు ఇలా చెప్పేటప్పుడు ఉన్నఫీ ఉన్నట్టు చెబుతూ ఉంటారు. అయితే మరికొందరు ఆనాటి వైభోగం ఏదీ ఇప్పుడు లేదు కాబట్టి, ఇప్పుడు తనని ఎవసరూ ఆధారాలు చూపించమని అడగరు కాబట్టి లేనివన్నీ కల్పించి కథలు అల్లుతారు.  అందులో మూడు వంతులు ఆతిశయోక్తులే ఉంటాయి. దురదృష్టవశాత్తు ప్రపంచంలో అనేక ప్రమాదాలు సంభవించి ఎన్నో కోట్లమంది నిరాశ్రయులుగా మారిపోయారు. కొన్ని ప్రాంతాలు ప్రపంచపటం నుంచే తొలిగిపోయాయి. కోట్లాది ఆస్తులు నామరూపాలు లేకుండా పోయాయి. కాని రుజువులు లేని నిజాలను మనం విశ్వసించం, అది మానవ నైజం. పోయిందని చెబితేనే నమ్మం అలాంటిది జరిగిపోయిన వాటిని కథలుగా చెప్పుకుంటూ ఉండటం ఎంతవరకు అవసరం. బహుశా కొందరు తమ గత జీవితాన్ని గుర్తుచేసుకుని వాస్తవంలో ఇలా ఉన్నామే అని బాధపడుతూ ఉంటారు. ఎన్నో సుఖాలు అనుభవించిన జీవితం కష్టాల మధ్య ఇబ్బందులు పడుతూ ఉండాల్సి వస్తోందే అని సంఘర్షణకు గురవుతుంది. కానీ గతాన్ని ఆలోచించడం వల్ల, దాని గురించి ఇతరులకు చెప్పుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమి ఉండదని తెలుసుకోవాలి. గతం ఏమీ లేదని, వర్తమానమే జీవితానికి మొదలు అని తనకు తాను చెప్పుకుని సాగిపోవాలి. అప్పుడే జీవితంలో ముందుకు సాగగలడు.                                         ◆నిశ్శబ్ద.

స్వేచ్ఛ మనిషి మీద చూపే ప్రభావం ఎలా ఉంటుంది?

ప్రతి మనిషి తన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది గట్టిగా మాట్లాడేది స్వేచ్ఛ గురించే.. ఒకప్పుడు స్వేచ్ఛ లేని జీవితాలు చాలా ఉండటం వల్ల స్వేచ్ఛ స్ఫహించుకోవడం లక్ష్యమని, అది హక్కు అని సమాజంలో పౌరులు గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే..  స్వే చ్ఛకు సంబంధించి పలువురిలో ముఖ్యంగా నేటి యువతరంలో చాలా దురభిప్రాయలు వున్నాయి. స్వేచ్ఛకు వారు ఇచ్చుకునే నిర్వచనాలు పూర్తిగా వేరుగా ఉంటున్నాయి. కేవలం డబ్బు ఉండటాన్ని, భౌతికంగా నచ్చినట్టు జీవించడాన్ని, ముఖ్యంగా విచ్చలవిడితనాన్ని మాత్రమే స్వేచ్ఛగా భావించే  పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొని వుంది.  ఈ కంజ్యూమరిస్ట్ ధోరణి తాలూకు స్వేచ్ఛ వాస్తవానికి మనిషిని మానసికంగా ఎదగనీయదు. ఇదంతా కేవలం పైకి కనిపించే ఆడంబరం మాత్రమే. ఇలా ఉండటం వల్ల మనిషిలో కలిగే మార్పులు ఏమీ లేకపోగా ఇంకా వ్యక్తిత్వ పరంగా దిగజారిపోతాడు.  తమ అస్థిత్వంలో భద్రతా రాహిత్యానికి లోనయ్యే వ్యక్తులు, తమ చుట్టూ సిరి సంపదలను, వస్తు సముదాయాన్ని పోగు చేసుకోవటం ద్వారా ఈ అభద్రతా భావాన్ని అధిగమించాలని చూస్తున్నారు. అయితే ఈ పోటీ ప్రపంచంలో శృతిమించిన భౌతిక సంపదలను సంపాదించడం. వాటి వల్ల సుకెబాన్ని పొందాలనే తాపత్రయం మనిషిని విముక్తి చేయలేదు.  కాలంతో పాటు ఈ సంపాదన… సుఖాల దారులు క్రమంగా మరొకరితో పోల్చుకుంటూ పెరుగుతూ ఉంటాయే తప్ప తృప్తితో ఆగిపోయేవి కాదు. ఇలా పోటీగా ఇతరులతో పోల్చుకునే మనస్థత్వం వ్యక్తిని మరింత అభద్రతా భావానికి గురిచేస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ తాలూకు నిజమయిన సారం యొక్క వక్రీకరణ. దీనికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు.  ఇద్దరు స్నేహితులు ట్రెక్కింగుకు వెళ్లి ఒక కారడవిలో చిక్కుకు పోయారు. ఆ అడవి నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో వీరిలో ఒకరు తాను స్వేచ్ఛా మానవుడినని, తన యిష్టమైన రీతిగా అడవినుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకోగలనని భావించాడు. కాగా రెండో వ్యక్తి ప్రకృతిలో కొన్ని నియమ నిబంధనలు సూత్రాలు వున్నాయని భావించి ఆ అడవినుంచి బయట పడేందుకు సూర్యచంద్రుల స్థానాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకొన్నాడు. అంటే అతను ప్రకృతి నియమాలకు లోబడి తన మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు.  ఇద్దరిలో ఎవరు ఖచ్చితంగా అడవినుంచి బయట పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయో మనం వేరే ఆలోచించనవసరం లేదు. ప్రకృతి నియమాలకు లోబడి ప్రవర్తించిన వ్యక్తికే ఆ కారడవినుంచి సజీవంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉదాహరణ మనం ప్రజల మధ్య నివసిస్తున్న తీరుకు కూడా వర్తిస్తుంది. మన నాగరిక సమాజంలో విజయవంతంగా జీవితంలో ముందుకు దూసుకు వెళ్ళాలంటే, ఈ సమాజానికి కూడా కొన్ని నియమనిబంధనలు, సూత్రాలు వర్తిస్తాయని గుర్తించిన వారికే అది సాధ్యమవుతుంది. అలా కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ భ్రమలో విశృంఖలంగా ప్రవర్తించే వ్యక్తి స్వేచ్ఛారహితుడిగానూ, చివరకు వైఫల్యం చెందే వాడిగానే మిగిలిపోతాడు.                                          ◆నిశ్శబ్ద.

మనిషిలో సంఘర్షణలు.. వాటి తీరు..

మనిషి తన జీవితంలో సంఘర్షణలు ఎదుర్కోవడం  సహజం. సంఘర్షణ అంటే ఏమిటి?? అని ప్రశ్న వేసుకుంటే మనసులో ఉన్న అభిప్రాయానికి, బాహ్య పరిస్థితుల వల్ల ఎదురయ్యే అనుభవాలను మధ్య మనిషికి అంతర్గతంగా అంగీకారం కుదరకపోవడం వల్ల కలిగేది సంఘర్షణ. ఏకాభిప్రాయం ఎప్పుడైతే కలగదో.. అప్పుడు మనిషి వ్యతిరేకభావంలోకి వెళతాడు. మనిషిలో ఉన్న వ్యతిరేకభావం కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సి వస్తుంది. ఈ తరహా రెండు విరుద్ధ భావాల మధ్య మనిషి ఊగిసలాడటం వల్ల కలిగేది సంఘర్షణ. మనిషిలో ఇలాంటి సంఘర్షణలు చాలానే ఉంటాయి. చాలా సందర్భాలలో సంఘర్షణలు అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ సంఘర్షణలలో కూడా రకాలు ఉన్నాయని… అవి వివిధ వైఖరులు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు.  కావాలి-వద్దు అనిపించే సంఘర్షణలు:- కొన్నిటి నుండి దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఉన్నదాన్ని వదిలేసుకోవాలని అనిపిస్తుంది. కానీ అది వదిలేసుకొని వెళ్ళిపోతే ఆ తరువాత జీవితం క్లిష్టం అవుతుందేమో అనే భయం, ఈ సమస్యను చూసి వెళ్ళిపోతే.. ఆ తరువాత కూడా సమస్యలు ఎదురవ్వడం వల్ల ఇబ్బంది తప్పదనే ఆలోచన మనిషిని సంఘర్షణలోకి నెట్టేస్తాయి.  ఉదాహరణకు..  భర్త పెట్టే కష్టాల్ని భరించలేని ఓ మహిళ వివాహ బంధం నుంచి విముక్తి పొందాలని ఆలోచించవచ్చు. అయితే వివాహంలో ఉన్న భద్రత, విడిపోతే ఎదురయ్యే సమస్యల గురించి కూడా ఆమె ఆలోచిస్తూ ఉండిపోతుంది. భర్తకు దూరంగా వచ్చేసే  స్త్రీ గురించి ఈ సమాజం ఆలోచనా తీరు, సమాజంలో పౌరుల ప్రవర్తన ఆ మహిళను ఒక నిర్ణయం తీసుకోనీయకపోవచ్చు.  ఇక్కడ ఆ మహిళ ఏ నిర్ణయం తీసుకున్నా దానికుండే మంచీ చెడు, కష్టనష్టాలు దానికుంటాయి. జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఎదురౌతూ ఉంటాయి. అవి ఒత్తిడికి దారి తీసి అదే క్రమంగా డిప్రెషన్ అనే సమస్యను క్రియేట్ చేస్తుంది.  అదే విధంగా  పెద్ద చదువులు చదవాలని అనుకొనే విద్యార్ధి ఏమి చదవాలా అనే ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఆ ఆలోచనలోనే సంఘర్షణకి లోను కావచ్చు. అయిదారు సబ్జెక్టులలో ఒకటి ఎంచుకోవటం అతనికి కష్టం కావచ్చు. రెండూ కావాలనిపించే సంఘర్షణ:- దీన్నే చాలామంది అవ్వా కావాలి, బువ్వా కావాలి అని సామెతకు అన్వయిస్తారు. ఒక వ్యక్తి దగ్గర చాలా మొత్తమే డబ్బు ఉంది. ఆ డబ్బు ఆ వ్యక్తికి ఇల్లు కాని, కారు కాని ఏదో ఒకటి  కొనుక్కోవటానికి సరిపోతుందనుకుంటే… ఇక్కడ అతనిలో సంఘర్షణ మోడ్స్లవుతుంది. ఇల్లు కొనుక్కుందామని అనుకుంటే… కారు గుర్తుకు వస్తుంది. పోనీ కారు కొనుక్కుందామని అనుకుంటే… ఇల్లు గుర్తుకువస్తుంది. రెండూ కావాలని అనిపిస్తుంది కానీ ఏదో ఒకటే అతని తాహతుకు సరిపోతుంది. ఇందులో పైన చెప్పుకున్నా సంఘర్షణ కంటే దీని తీవ్రత తక్కువే ఉన్నా ఇది సాధారణంగా పెద్దలలో కంటే.. పిల్లలలో ఇంకా యువతలో ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది.  రెండూ వద్దనిపించే సంఘర్షణ:- ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది కొందరి పరిస్థితి. కానీ ముందుకో, వెనక్కో తప్పకుండా అడుగు వెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ  వ్యక్తికి మాత్రం రెండు దారులూ ఇష్టం ఉండవు. ముందు వెళ్లడమూ నచ్చదు, వెనక్కు రావడమూ నచ్చదు. ఇలాంటి సందర్భాలలో సంఘర్షణ ఏర్పడుతుంది. కొందరికి ఒకవైపు పెళ్లి వయసు దాటిపోతూ ఉంటుంది. మరొకవైపు ఉద్యోగం ఉండదు. రెండూ ఉండక మనిషి జీవితం స్తబ్దుగా ఉంటుంది. కానీ ఓ వయసు దాటాక ఉద్యోగం చేయడం మీద ఆసక్తి పోతుంది, అలాగే పెళ్లి అంటే ఆసక్తి పోతుంది. కానీ పెద్దల పోరు వల్ల రెండూ చేయాల్సి వస్తుంది. ఇలాంటి వ్యక్తి సంఘర్షణ మాటల్లో చెప్పలేనిది. కొందరు ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అనే ఆలోచన చేస్తుంటారు కూడా.  ఇలా మనిషి తన జీవితంలో ఎన్నో సంఘర్షణలకు లోనవుతూ ఉంటాడు.                                       ◆నిశ్శబ్ద.