శ్రీరామ వైభవం!

రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           

ఈ మూడు పనులు చేసే మగాళ్లకు తమ భార్యల మీద అస్సలు కోపముండదట!

భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కోపం రావడం సహజం. ఆ కోపం చాలా మటుకు ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది కూడా. కొందరి విషయాలలో మాత్రమే కోపాలు కాస్తా గొడవలకు, అవి కాస్తా తెగదెంపులకు దారి తీస్తాయి. ఎలాంటి గొడవలు జరిగినా, ఏ సమస్య వచ్చినా అవి చాలా వరకు పరిష్కారం అవడం అనేది భార్యాభర్తలు వాటికి రియాక్ట్ అవ్వడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే.. భార్యాభర్తల సాధారణ ప్రవర్తన కూడా వారికి తమ భాగస్వామి మీద కోపం వస్తుందా? రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సాధారణంగా మగవారు చేసే మూడు పనులు వారికి తమ భార్యల మీద కోపం వస్తుందా రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుందట. ఇంతకీ భర్తలు చేసే ఆ మూడు పనులేంటంటే.. సహాయం..  పనిని జెండర్ ఆధారంగా విభజించకుండా అన్ని పనులు అందరూ చేయవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారో అలాంటి భర్తలు భార్యలను అస్సలు కోపగించుకోరట. పైపెచ్చు ఇలాంటి భర్తలు తమ భార్యలకు ఎంచక్కా సహాయం కూడా చేస్తారట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే భర్తలు సహాయం చేస్తే భార్యలు చాలా సంతోషిస్తారు.  భర్తలకు అనుగుణంగా ఉంటారు. భార్యలు కూడా  ఇలాంటి భర్తలకు కోపం తెప్పించే పనులు అస్సలు చెయ్యరు. ప్రేను వ్యక్తం చేయడం.. చాలామంది మగాళ్లకు భార్య మీద బోలెడు ప్రేమ ఉంటుంది. కానీ అదంతా ఇంట్లోనో లేక పడక గదిలోనో మాత్రమే బయట పెడుతుంటారు. కానీ భార్య మీద ఉన్న ప్రేమను ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా బయటపెట్టే భర్తలకు తమ భార్యలంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇలాంటి భర్తలకు అస్సలు భార్యలమీద కోపం అనేది కల్లో కూడా ఉండేమో అన్నంత ప్రేమగా ఉంటారు. నలుగురిలో భార్య మీద కోప్పడే మగాడు కాదు.. నలుగురిలో భార్య మీద ప్రేమ కురిపించే మగాడిని చూసి భార్య గర్వపడుతుంది. అలాంటి భర్తను గౌరవిస్తుంది. సమయాన్ని  గడపడం.. భార్య కోసం సమయాన్ని వెచ్చించే భర్త ఎప్పుడూ భార్య మీద కోపం చేసుకోడు. ఎందుకంటే అతను భార్య కోసం సమయాన్ని వెచ్చించడంలోనే అతని ప్రేమ వ్యక్తం అవుతుంది. ఇక తన కోసం సమయం కేటాయిచే  భర్తంటే భార్యకు కూడా గౌరవం. ఇద్దరూ కలిసి గడిపే సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు మద్దతుగా ఉండటం ఇలా అన్నీ వారి బంధాన్ని దృఢంగా మారుస్తాయి.                                                 *నిశ్శబ్ద. 

అహల్య వృత్తాంతం మనకు తెలియజేసే నీతి ఏమిటి?

ఒక సాధారణ స్త్రీగా జీవించి ఉంటే ఏనాడో కాలగతిలో ఆమెను మరచిపోయి ఉండేవాళ్ళం ఏమో... కానీ విధివైపరీత్యం ఆమెను పతివ్రతా శిరోమణిగా చేసింది. ఆమె గౌతమ మహర్షి భార్య అయిన అహల్య, ఒక సన్న్యాసికీ, మహర్షికి మధ్య తేడా ఉంది. సన్న్యాసి అంటే గృహసంబంధమైన బాంధవ్యాలు ఉండవు. అన్నింటినీ పరిత్యజిస్తారు. ఋషికి కుటుంబం ఉంటుంది కాని నగరంలో జీవించరు. సమాజానికి దూరంగా జీవిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరమాత్మను తెలుసుకోవడంలో మునిగి ఉంటారు. శిష్యులకి విద్యను బోధిస్తూ తమ జీవనాన్ని సాగిస్తారు. పూర్వం విద్యార్థులు గురువు దగ్గర ఉండి వారితో కలిసి జీవిస్తూ, క్రమశిక్షణతో విద్య నేర్చుకుని విద్యాభ్యాసం పూర్తయ్యాక తిరిగి సమాజంలోకి అడుగు పెట్టేవారు. ఈ విధంగానే గౌతమ మహర్షి కూడా తన భార్యతో కలిసి అడవిలో జీవించేవాడు. అహల్య అంకితభావంతో భర్తకి సేవ చేసేది. అయితే ఆమె ప్రమేయం లేకుండానే అహల్య జీవితంలో ఒక అపశృతి దొర్లింది. తప్పులు అందరూ చేస్తూనే ఉంటారు కాని, ఆ రోజుల్లో చిన్న తప్పుకి కూడా పెద్ద శిక్షలు ఉండేవి. అహల్య తెలిసి చెయ్యకపోయినా జరిగిన తప్పుకి ఆమె బాధ్యురాలయింది. నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే గౌతముడు అహల్య తనని మోసం చేసిందనుకుని భ్రమపడి కోపంతో మండిపడ్డాడు. ఒక్క క్షణం ఓర్పు వహించి ఉంటే తన భార్య తప్పిదం ఏమిటో ఆయనకి అర్థమై ఉండేది. కాని తొందరపాటుతో వెంటనే శపించాడు. గౌతమ మహర్షి అహల్యని పాషాణంగా మారమని శపించాడు. అహల్య తన దురదృష్టానికి చింతించక శిక్షను ఆహ్వానించింది. చిన్ననాటినుండి ఓర్పుకి మొదటి ఉదాహరణ భూదేవే అని తెలుసుకుంది. అందువలన తెలియక జరిగినా తన పొరపాటు ఉంది కనుక అందుకు శిక్ష అనుభవించడానికి ఆమె సిద్ధపడింది. కోపం శాంతించిన తరువాత గౌతముడికి తన భార్య వల్ల జరిగిన తప్పు అంత పెద్దదేమీ కాదని తెలుసుకున్నాడు. అయినా తను వేసిన శిక్ష పెద్దది అనుకుని పశ్చాత్తాప పడ్డాడు. అయితే ఇచ్చిన శాపాన్ని ఆమె అనుభవించక తప్పదు కదా! గౌతముడు భార్యతో "మనం చేసిన దుష్కర్మలకు ప్రతిఫలం స్వీకరించాలి. పూర్వ జన్మ కర్మ ఫలితంగా భావించి నీవు సహనంతో అనుభవించాల్సిందే! నీవు త్వరలోనే రక్షించబడతావు, శ్రీరామచంద్రుడు ఇటుగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అతడి పాదస్పర్శ ద్వారా నీకు శాపవిమోచనం కలుగుతుంది. ఒక ఆదర్శ వనితగా నువ్వు చరిత్రలో గొప్ప ఉదాహరణగా నిలిచిపోతావు" అని ఓదార్చాడు. అహల్య తనకు వచ్చిన ఆపదను అనుభవించడానికి సిద్ధపడింది. ఉలిదెబ్బలు తగలనిదే శిల్పం తయారు కాదు. కష్టం లేనిదే ఘనకార్యాలు సాధించబడవు. జీవితంలో రాయిగా బ్రతకటం కంటే దురదృష్టకరమైన సంఘటన మరొకటి ఉండదేమో! అహల్య ఇప్పుడు ఈ విపత్తునే ఎదుర్కొంటోంది. కానీ ఈ ఆపదను ఒక అవకాశంగా మలుచుకుంది. ఏ మాత్రం కలత చెందక, నిరాశా నిస్పృహలకు గురికాకుండా, తన సమయాన్నంతా భగవత్ ప్రార్ధనలో గడపసాగింది. ఎవ్వరూ వినాశనాన్ని పొందరని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే జరిగినదానికి కోపంగాని, బాధగాని ఆమెకి లేవు. తనకి కలిగిన పరిస్థితికి తలవంచి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడుపుతోంది. కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మంచి పనులు చేస్తూపోతే కష్టాలు అనుభవిస్తున్నామనే ఆలోచన కలగదు.  విధిని ఎవరూ ఎదిరించలేరు. వేదాంతం మనకు ఈ విధంగా బోధిస్తుంది, దుర్భర పరిస్థితులు ఎల్లకాలం ఉండవు. ఏదో ఒకనాడు అవి తొలగిపోగలవు. పాపాలు తప్పిదాల నుండే ఉద్భవిస్తాయి. గతంలో విషబీజాలు నాటి ఉంటే దాని ఫలితం వచ్చే తీరుతుంది కదా! అయితే ప్రారబ్ధం అనుభవించడం ద్వారా గత కర్మల బీజాలను నాశనం చేయవచ్చు, ఆగామి కర్మలను మొలకెత్తనివ్వని రీతిగా మలుచుకోవచ్చును. లేదా మంచి విత్తనాలను నాటడం ద్వారా చక్కటి ఫలితాలను పొందవచ్చును. ప్రారబ్ధం అనేది బంగారానికి సానపెట్టడం వంటిది. గత కాలపు చేదు అనుభవాలను గుర్తుపెట్టుకుని, వర్తమానంలో గరిక పోచలను కాకుండా మధుర ఫలాలను ఇచ్చే మేలురకపు విత్తనాలను నాటాలి!  నిష్కామసేవ చేస్తూ మంచితనాన్ని కలిగి ఉండాలి. వ్యతిరేకపు ఆలోచనలను రానివ్వక మంచి భావాలను కలిగి ఉండాలి. గతం ఎంతటి చేదుదైనా, భవిష్యత్తుని రూపొందించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇది అహల్య వృత్తాంతం మనకు చెప్పకనే చెబుతుంది.                                     ◆నిశ్శబ్ద.

కష్టసమయాల్లో పాటించాల్సిన ఐదు నియమాలు ఇవే!

కొందరు సమస్యలకు అంతగా టెన్షన్ పడరు. తేలికగా తీసుకుని పరిష్కరించుకుంటారు. కొందరైతే భయాందోళనకు గురవుతారు. ప్రతివ్యక్తి జీవితంలో ఏదొక సమయంలో కష్టాలను ఎదుర్కొవల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో ప్రతి వ్యక్తి కూడా తనదైన శైలిలో సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధమవుతాడు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా భావిస్తుంటారు. అలాంటివారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 5 విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి: ఏవ్యక్తినైనా సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు..అతను పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఎందుకంటే మీరు సంక్షోభం నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉన్న వ్యూహాన్ని కలిగి ఉన్నట్లయితే..ఆ సమస్య నుంచి తేలికగా బయటపడతారు. ముందుగానే సిద్ధంగా ఉండాలి: ఆచార్య చాణక్యుడు తెలిపిన ప్రకారం..ఒక వ్యక్తికి కష్టాలు వచ్చినప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు చుట్టిముట్టినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవల్సి వస్తుందని ముందే ఊహించాలి. అందుకు తగ్గట్లుగానే సిద్ధపడాలి. సమస్య నుంచి పారిపోవడం కంటేనూ దానిని ఎదుర్కొనేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఓపిక పట్టాలి: చాణక్య విధానం ప్రకారం...ఒక వ్యక్తి తన ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ సహనంకోల్పోకూడదు. ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండాలి. మరీ ముఖ్యంగా పరిస్థితి ఏమైనప్పటికీ ఆ సమయంలో సహనం కోల్పోకూడదు. మీకు మంచి రోజులు వచ్చేంత వరకు ప్రశాంతంగా వేచి ఉండాలి. కుటుంబ సభ్యులతో బాధ్యతగా: చాణక్య నీతి ప్రకారం, సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం కూడా వ్యక్తి మొదటి కర్తవ్యం. కుటుంబ సభ్యులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకోవాలి. డబ్బు ఆదా చేయాలి: ఎప్పుడూ డబ్బు ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.  

పీరియడ్స్ గురించి పిల్లలకూ అవగాహన కావాలి.. ఎందుకంటే!

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.  ఈకాలంలో చిన్న పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవడం కామన్ అయిపోయింది. తల్లిదండ్రులు మందలించారనో, మొబైల్ ఫోన్ ఇవ్వలేదనో, పరీక్షలు తప్పారనో ఇలా చాలా కారణాలు వింటూనే ఉన్నాం. కానీ మొదటిసారి పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని చూసి,  పీరియడ్స్ సమయంలో నొప్పి భరించలేక  14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాజాగా అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. పీరియడ్స్ ప్రతి ఆడపిల్ల జీవితంలో ముఖ్యమైన దశ. సాధారణంగా అమ్మాయిలు పీరియడ్స్ ను, పీరియడ్స్ సమయంలో నొప్పిని, ఆ సమయంలో కలిగే ఇతర ఇబ్బందులను ఎదుర్కోవడం సజహమే.  కానీ మొదటిసారి నెలసరికి లోనయ్యే బాలికలకు దీని గురించి చాలా గందరగోళం ఉంటుంది. ఇప్పటి జనరేషన్ కు తగినట్టు ఆడపిల్లలతో పాటూ మగపిల్లలకు కూడా పీరియడ్స్ అనే విషయం గురించి అవగాహన ఉండనే ఉంటుంది. కానీ వీటిని స్వయంగా అనుభవించడంలోనే ఇబ్బంది దాగుంటుంది.  దీని గురించి బాలికలకు  అవగాహన కల్పించడం చాలా ముఖ్యం.  తద్వారా బాలికలలో నెలసరి సమయాల్లో ఎదురయ్యే మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోవడం వీలవుతుంది. ముంబైలో జరిగిన ఉదంతం గురించి ప్రస్తావనలోకి వెళితే ఆత్మహత్య చేసుకున్న బాలికకు అదే మొదటిసారి పీరియడ్స్ రావడం. అంతకు ముందెప్పుడూ ఆమె తల్లి ఆమెకు పీరియడ్స్ గురించి చెప్పలేదు. పైపెచ్చు వారికి ఆర్థిక స్థోమత లేని కుటుంబం కావడంతో బాలికను పాఠశాలకు కూడా పంపలేదు. దీంతో బాలికకు తల్లి నుండి కానీ, సమాజం నుండి కానీ పీరియడ్స్ అనే విషయం గురించి అవగాహన లేదు.  14ఏళ్ళ బాలికకు మొదటిసారి రక్తస్రావం చూసి భయపడింది.  ఆమె తల్లి ఆ పాపకు అది అందరికీ సాధారణం అని వివరించి చెప్పింది. కానీ ఆ పాప  అప్పటికే రక్తస్రావం గురించి ఆందోళనలో ఉంది. పైగా తన శరీరంపై తనకు అసహ్యం కలుగుతోందని తల్లికి చెప్పింది.  కానీ కూతురు అర్థం చేసుకుంటుందని ఆ పాప తల్లి అనుకుంది. కానీ ఆ పాపకు పీరియడ్స్ వచ్చిన రెండవరోజున దారుణమైన  వార్త వినాల్సి వచ్చింది. ఆ పాప ఒత్తిడి, ఆందోళన,  తన శరీరం మీద తనకు  పుట్టిన అసహ్యం కారణంగా  ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త కారణంగా పీరియడ్స్ గురించి ఆడపిల్లలో అవగాహన పెరగాలని అంటున్నారు. కొందరు పీరియడ్స్ గురించి బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడరని, అది బాలికల జీవితానికి చాలా చేటు చేస్తుందని అంటున్నారు. కాబట్టి బాలికలకు చిన్నవయసులోనే ఈ విషయాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.                                               *నిశ్శబ్ద.  

పిల్లల కారణంగా తల్లిదండ్రులలో కోపమా? ప్రశాంతంగా ఎలా ఉండొచ్చంటే...

  ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అదొక సందడి అంటారంతా.. కానీ ఆ పిల్లల అల్లరిని భరిస్తూ వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉండే  తల్లిదండ్రులకు మాత్రం అదొక పెద్ద టాస్క్ లాగే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా  రెండేళ్లు పైబడిన పిల్లలు అయితే అల్లరి విషయంలో మరీ దారుణంగా ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు గీయడం, ఇల్లంతా చిందరవందర చేయడం, నీళ్లు పారబోయడం, వస్తువులు విరగ్గొట్టడం చేస్తుంటారు. ఇవన్నీ చూస్తూ చాలామటుకు తల్లులు పిల్లల మీద అరిచేస్తుంటారు. కోపంతో రెండు దెబ్బలు కూడా వేస్తారు. ఆ తరువాత తమ పిల్లల్ని కొట్టినందుకు, తిట్టినందుకు బాధపడతారు కూడా. అయితే తల్లులు పిల్లల మీద అరవడానికి, కొట్టడానికి బదులు పిల్లలు అల్లరి చేసినా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. విశ్రాంతి.. విశ్రాంతి లేకపోవడం తొందరగా కోపం రావడానికి  కారణమవుతుంది.  పూర్తి లేదా తగినంత విశ్రాంతి తీసుకోకపోతే ప్రతి చిన్న,  పెద్ద విషయానికి చిరాకుగా  కోపంగా ఫీలైపోతారు. అందుకే ఒక్కోసారి మీ కోసం సమయాన్ని వెచ్చించాలి.  ఇష్టమైన ఆహారం లేదా ఏదైనా తినడం,  త్రాగడం మొదలైనవి మనస్పూర్తిగా చెయ్యాలి. కాసింత వాకింగ్ చేయడం లేదా రిలాక్స్ గా పడుకవడం చేయాలి.  వీపును నిటారుగా ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోవాలి.. అకస్మాత్తుగా  విరిగిన పాత్రతో పిల్లవాడు ప్రత్యక్షం అవ్వగానే మొదట చాలమందికి కోపమే వస్తుంది. వెంటనే గట్టిగా అరిచేస్తారు కూడా. అయితే పిల్లాడిపై కోపం తెచ్చుకునే ముందు పిల్లాడు చెప్పేది వినాలి.  అసలు వస్తువు కానీ వేరే ఇతరం ఏదైనా కానీ ఎలా పోయింది, ఎలా పగిలిపోయింది అనేది మొదట తెలుసుకోవాలి.  అది పిల్లాడే పగలగొట్టాడు అనే విషయం స్పష్టంగా తెలియకుండా పిల్లాడి మీద కోప్పడటం మాత్రం కరెక్ట్ కాదు. అరవకండి.. చాలా సార్లు పిల్లలు  ఏదైనా పనిని చెప్తే దాన్ని సరిగ్గా చేయరు. లేదంటే  చెప్పిన పనిని చెడగొడుతుంటారు. దీనివల్ల  తల్లికి పిల్లాడి మీద చెప్పలేనంత కోపం వస్తుంది.  తల్లి తన కోపాన్ని పిల్లలపై అరుస్తూ వెళ్లగక్కుతుంది. కానీ అరవడం కాకుండా, పిల్లవాడు చేసిన తప్పుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి.  పిల్లవాడు తనకు తెలియకుండా కూడా తప్పు చేయవచ్చు కదా.. కోపం పరిణామాలు.. చాలా సార్లు తల్లి కోపం పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఒక పిల్లవాడు ఎక్కడికో స్నేహితుడి పార్టీకి వెళ్ళడానికి ఆనందంగా సిద్ధమవుతున్నాడు కానీ ఆలస్యం అవుతోంది అనుకుందాం. తల్లి కోపం,  అరుపుల కారణంగా  పిల్లల రోజంతా చెడిపోవచ్చు. అందుకే ముందు కోపం కారణంగా  వచ్చే పరిణామాల గురించి ఆలోచించండి.                                           *నిశ్శబ్ద.

భర్త ప్రతి రాత్రి ఇంటర్నెట్ లో ఈ పని చేస్తున్నాడా...భార్యలు అలెర్ట్ కావాల్సిందే!

స్మార్ట్‌ఫోన్‌లు,  ఇంటర్నెట్‌లు అనే ఈ రెండు  జీవితంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంబంధ స్వభావం మారిపోయింది. మనుషులు ఎదురెదురుగా ఉన్నప్పటికీ   ఎదురుగా ఉన్న మనుషుల మీద కాకుండా  మొబైల్ ఫోన్‌లలో బిజీగా ఉండటానికే ఇష్టపడతారు చాలామంది. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటివి జరిగితే వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది.  ఇది ఇద్దరి మధ్య దూరం పెరిగేలా చేస్తుంది. అయితే భర్త ఇంటర్నెట్ లో ఏ విషయాలు సెర్చ్ చేస్తున్నాడు? అనే విషయం మీద భార్యలు ఎంత అలెర్ట్ గా ఉండాలనే విషయం ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా చాలామంది మగవాళ్లు రాత్రి పూట  మొబైల్ లో ఆడవాళ్ల ప్రోఫైల్ లు, వారి ఫొటోలు చూడటానికి చాలా  ఆసక్తి చూపిస్తుంటారు. ఇంతకీ ఈ అలవాటు ఎందుకంత మంచిది కాదు.. ఈ అలవాటును భార్యలు ఎలా ఎదుర్కోవాలి?  తెలుసుకుంటే.. ఇతర మహిళల ప్రోఫైల్ లు..   చాలామంది భర్తలు రాత్రి సమయంలో భార్య పనులు చేసుకుంటున్నప్పుడో, భార్య పడుకున్న తర్వాతో ఇంటర్నెట్ లో ఇతర మహిళల ప్రొఫైల్ లు సెర్చ్ చేసి, వారి ఫొటోలు చూస్తుంటారు. సాధారణంగా కొంతమంది మహిళలు ఫేవరెట్ హీరోయిన్ లేదా సెలెబ్రిటీ ఫొటోస్ చూస్తున్నాడు ఏం అవుతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు. కానీ ఇది అక్కడితో ఆగకుండా ఇతర మహిళల వరకు వెళితే మాత్రం ఆడవాళ్లు అలెర్ట్ కావాల్సిందే. దీని కారణంగా భర్తలు భార్యలను బాడీ షేమింగ్ చేయడం, ఇతర మహిళల అందంతో భార్యలను పోల్చడం వంటి ఎన్నింటికో దారితీస్తుంది. అభ్యంతరం.. భర్తలు ఇలా ఇతర మహిళల ప్రొఫైల్స్ సెర్చ్ చేస్తుంటే.. భార్యలు ఆభ్యంతరం చెప్పాలి. నా భర్త పరాయి మహిళల ఫొటోలు చూస్తున్నాడు అని మనసులో ఫీలవ్వడం కంటే నేరుగా భర్తతో అలా చూడద్దని చెప్పడం మంచిది. అలా చెప్పిన తరువాత వారు అదే పని కంటిన్యూ చేస్తుంటే సింపుల్ వారితో మాట్లాడటం తగ్గిస్తే సరి..  వారు నెట్ లో ఇతర మహిళల ఫొటోలు చూడాలని అనుకున్నప్పుడల్లా తాము తప్పు పని చేస్తున్నామేమో అనే ఫీలింగ్ వారికే కలుగుతుంది. క్రమంగా ఆ అలవాటు కూడా తగ్గుతుంది. తప్పు ఎక్కడుందంటే.. చాలా వరకు మగాళ్లు ఇతర మహిళల పట్ల, ఇతర మహిళల ఫ్రొఫైల్స్, ఫోటోస్ చూడటం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారంటే దానికి పెద్ద కారణం వారికి భార్య నుండి అసంతృప్తి ఎదురవుతున్నట్టు. చాలా వరకు భార్యలు ఇంటి పని, ఉద్యోగాల కారణంగా తమ పట్ల తాము చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ మహిళలు తమ పట్ల తాము కేర్ గా ఉంటూ, అందంగా ముస్తాబవుతుంటే భర్త కూడా ఇతర మహిళల వైపు కన్నెత్తి చూడడు. కాబట్టి భర్తలను మార్చుకునే మార్గం భార్యల చేతుల్లోనే ఉంది.                                                 *నిశ్శబ్ద.

మన ఉగాది!!

నిజమే ఉగాది పండుగ మనదే. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది తోనే ప్రారంభమవుతుంది.  మన కొత్త సంవత్సరం అంతా ఎంతో కళను నింపుకుని ఉంటుంది. సాంప్రదాయంగా ఉంటుంది. ముఖ్యంగా కృత్రిమత్వంలో పడిపోతున్న మనిషిని బయటకు తీసుకొచ్చి కాసింత ప్రకృతి మధ్య నిలబెడుతుంది. ఇంతకూ మన ఉగాది మనకు మాత్రమే తెలుసా!! మనకు తెలిసిన ఉగాది ఏంటి?? మనం రేపటి తరానికి ఉగాది గురించి చెబుతున్నది ఏంటి??  ఉగాది వెనుక కథ!! సోమకుడు అనేవాడు వేదాలను హరించాడు(దొంగిలించాడు). అలా వేదాలను దొంగిలించిన సోమకుడిని  మత్స్యవతారంలో ఉన్న  విష్ణువు వధించి(సంహరించి, చంపి) వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినంను పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.  అయితే చైత్రశుక్లపాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా మారిన కారణంతో ఆ యోధుడిని స్మరించుకుంటూ ఉగాది జరుపుకుంటారని చారిత్రక వృత్తాంతం. ఇలా కారణాలు ఎన్ని ఉన్నా ఉగాది అనేది ఓ కొత్తదనానికి సూచిక.  ఆశను మొలిపించే తరుణం!! మనిషి తరతరాలుగా ఓ నమ్మకంతో ఉన్నాడు. అదే కొత్తదనంలో జీవితం కొత్తగా మారుతుందని. అది చాలా మంచి ఆశావహదృక్పథం కలిగి ఉంటుంది. ఆకురాల్చు కాలంలో చెట్ల ఆకులు అన్నీ పోయాక, మోడువారి ఏమీలేనితనంతో ఉన్నప్పుడు, వసంతం వస్తుంది, మెల్లిగా చివురులు తొడుగుతాయి చెట్లు. అవన్నీ పచ్చని ఆశల చివురులు, ఉగాదిలో దాగున్నది అదే అంటారు అందరూ. షడ్రుచులు-జీవితసారం!! ఉగాది రోజు అందరి ఇళ్లలో ఉండే ప్రత్యేక విందు ఉగాది పచ్చడి. నిజానికి జీవితమంతా ఆ పచ్చడిలోనే ఉందని చెబుతారు పెద్దలు. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, ప్రేమలు, పొట్లాటలు ఇలా అన్నీ ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులలో కలిసిపోయి ఉంటాయని చెబుతారు. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడికి నత ప్రత్యేకత వచ్చి పడింది. అలాగే మరొక విషయం కూడా. ఉగాది సమయంలోనే కొత్త బెల్లం దొరుకుతుంది, మామిడికాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఈ సమయానికి కాస్త చిన్న చిన్నగా ఉన్న వగరుతో ఉన్న కాయలు వస్తాయి. ఇంకా ఎంతో గొప్ప ఔషధ మూలాలు కలిగిన వేపచెట్లకు పువ్వులు పూస్తాయి, కొత్త చింతపండు ఎర్రెర్రగా నిగానిగలాడుతూ అందరి ముందుకూ వస్తుంది.  వీటన్నింటి కలయిక అయిన వేపపచ్చడి ఆరు రుచులతో కనువిందు చేస్తుంది. సంప్రదాయపు గీతిక!! ఉగాది రోజు మగవాళ్ళు అందరూ పంచెకట్టులోనూ, ఆడవాళ్లు పట్టుచీరల్లోనూ, పిల్లలు కొత్త బట్టల్లోనూ మెరిసిపోతూ ఉంటారు. ఆ వస్త్రధారణలో అసలైన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. నగరాలలో కృత్రిమత్వంలో మునిగిపోయిన యువత ఎంతో అందంగా, పద్దతిగా, బుద్దిగా ఇలా తయారైతే ఇంటిల్లిపాదికీ ఎంత సంతోషమో!! ఇంకా పంచాంగ శ్రవణం మరొక వేడుక, పిండి వంటల సంబరం మరొక ఎత్తు. ఇలా అన్ని విధాలుగా ఉగాది మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది. మనిషి జీవితానికి అసలైన నిర్వచనాన్ని ఉగాది చెబుతుంది. అభివృద్ధి వేగంలో మనిషి మర్చిపోతున్న అసలైన నడవడికను మన ఉగాది మనకు తిరిగి అందిస్తుంది. అందుకే ఇది మన తెలుగుసంవత్సరం అని గొప్పగా జరుపుకోవాలి.                                    ◆ వెంకటేష్ పువ్వాడ.

స్వేచ్ఛ మనిషి మీద చూపే ప్రభావం ఎలా ఉంటుంది?

ప్రతి మనిషి తన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది గట్టిగా మాట్లాడేది స్వేచ్ఛ గురించే.. ఒకప్పుడు స్వేచ్ఛ లేని జీవితాలు చాలా ఉండటం వల్ల స్వేచ్ఛ స్ఫహించుకోవడం లక్ష్యమని, అది హక్కు అని సమాజంలో పౌరులు గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే..  స్వే చ్ఛకు సంబంధించి పలువురిలో ముఖ్యంగా నేటి యువతరంలో చాలా దురభిప్రాయలు వున్నాయి. స్వేచ్ఛకు వారు ఇచ్చుకునే నిర్వచనాలు పూర్తిగా వేరుగా ఉంటున్నాయి. కేవలం డబ్బు ఉండటాన్ని, భౌతికంగా నచ్చినట్టు జీవించడాన్ని, ముఖ్యంగా విచ్చలవిడితనాన్ని మాత్రమే స్వేచ్ఛగా భావించే  పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొని వుంది.  ఈ కంజ్యూమరిస్ట్ ధోరణి తాలూకు స్వేచ్ఛ వాస్తవానికి మనిషిని మానసికంగా ఎదగనీయదు. ఇదంతా కేవలం పైకి కనిపించే ఆడంబరం మాత్రమే. ఇలా ఉండటం వల్ల మనిషిలో కలిగే మార్పులు ఏమీ లేకపోగా ఇంకా వ్యక్తిత్వ పరంగా దిగజారిపోతాడు.  తమ అస్థిత్వంలో భద్రతా రాహిత్యానికి లోనయ్యే వ్యక్తులు, తమ చుట్టూ సిరి సంపదలను, వస్తు సముదాయాన్ని పోగు చేసుకోవటం ద్వారా ఈ అభద్రతా భావాన్ని అధిగమించాలని చూస్తున్నారు. అయితే ఈ పోటీ ప్రపంచంలో శృతిమించిన భౌతిక సంపదలను సంపాదించడం. వాటి వల్ల సుకెబాన్ని పొందాలనే తాపత్రయం మనిషిని విముక్తి చేయలేదు.  కాలంతో పాటు ఈ సంపాదన… సుఖాల దారులు క్రమంగా మరొకరితో పోల్చుకుంటూ పెరుగుతూ ఉంటాయే తప్ప తృప్తితో ఆగిపోయేవి కాదు. ఇలా పోటీగా ఇతరులతో పోల్చుకునే మనస్థత్వం వ్యక్తిని మరింత అభద్రతా భావానికి గురిచేస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ తాలూకు నిజమయిన సారం యొక్క వక్రీకరణ. దీనికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు.  ఇద్దరు స్నేహితులు ట్రెక్కింగుకు వెళ్లి ఒక కారడవిలో చిక్కుకు పోయారు. ఆ అడవి నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో వీరిలో ఒకరు తాను స్వేచ్ఛా మానవుడినని, తన యిష్టమైన రీతిగా అడవినుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకోగలనని భావించాడు. కాగా రెండో వ్యక్తి ప్రకృతిలో కొన్ని నియమ నిబంధనలు సూత్రాలు వున్నాయని భావించి ఆ అడవినుంచి బయట పడేందుకు సూర్యచంద్రుల స్థానాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకొన్నాడు. అంటే అతను ప్రకృతి నియమాలకు లోబడి తన మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు.  ఇద్దరిలో ఎవరు ఖచ్చితంగా అడవినుంచి బయట పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయో మనం వేరే ఆలోచించనవసరం లేదు. ప్రకృతి నియమాలకు లోబడి ప్రవర్తించిన వ్యక్తికే ఆ కారడవినుంచి సజీవంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉదాహరణ మనం ప్రజల మధ్య నివసిస్తున్న తీరుకు కూడా వర్తిస్తుంది. మన నాగరిక సమాజంలో విజయవంతంగా జీవితంలో ముందుకు దూసుకు వెళ్ళాలంటే, ఈ సమాజానికి కూడా కొన్ని నియమనిబంధనలు, సూత్రాలు వర్తిస్తాయని గుర్తించిన వారికే అది సాధ్యమవుతుంది. అలా కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ భ్రమలో విశృంఖలంగా ప్రవర్తించే వ్యక్తి స్వేచ్ఛారహితుడిగానూ, చివరకు వైఫల్యం చెందే వాడిగానే మిగిలిపోతాడు.                                          ◆నిశ్శబ్ద.

హనీమూన్ వెళ్తే ఈ 5 తప్పులు చేయకండి.. మీ లైఫ్ ఖతం..!

పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కొత్త జంటలకు  అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఈ సమయంలో కుటుంబం,  బంధువులకు దూరంగా.. కొత్త జంట  ఒకరినొకరు తెలుసుకోవటానికి,  అర్థం చేసుకోవడానికి, ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి వారికి మాత్రమే కేటాయించిన  సమయం పొందుతారు. అది ప్రేమ వివాహమైతే  వేరే విషయం. కానీ పెద్దలు  కుదిర్చిన వివాహమైతే భార్యాభర్తలు కలిసి గడిపేందుకు, వారు ఒకరినొకరు తెలుసుకునేందుకు  ఇదే తొలి అవకాశం అవుతుంది. సాధారణంగా హనీమూన్ అనేది శారీరక సంబంధాలతో మాత్రమే ముడిపడి ఉంటుంది. అయితే మొదటి సారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన జంట మధ్య చాలా  లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ సమయంలో కొన్ని పొరపాట్లు జరిగితే వారి వైవాహిక జీవితం  సంతోషంగా ఉండటానికి బదులు, కొత్త జీవితం కాస్తా కలతలకు నిలయంగా మారుతుంది.  హనీమూన్ లో కొత్తజంట చేయకూడని 5 తప్పులేంటో తెలుసుకుంటే.. పెళ్లిలో జరిగిన తప్పులను ప్రస్తావించొద్దు.. పెళ్లి అన్నాక ఏవో ఒక చిన్న లోటు పాట్లు, తప్పులు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి.  రెండు వైపుల నుండి వాదనలు, అభిప్రాయ బేధాలు ఏర్పడి  ఉండవచ్చు. కానీ హనిమూన్ కు వెళ్లినప్పుడు ఈ విషయాలను కొత్త జంట చర్చిస్తూ కూర్చోకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. ఏకాంతంగా గడిపి, గొప్ప జ్ఞాపకాలను పోగుచేసుకోవాల్సిన సమయంలో జరిగిన గొడవల గురించి  అస్సలు మాట్లాడొద్దు. ఎక్స్పెక్టేషన్స్ వద్దు.. హనిమూన్ అనగానే ముందుగానే అక్కడ అలా ఉండాలి, ఆ సమయం ఇలా గడవాలి వంటి విషయాలను ముందుగానే అంచనా వేసుకోకూడదు. కేవలం హనిమూన్ ప్లాన్ మాత్రమే నిర్ణయించుకోగలుగుతారు. అక్కడికి వెళ్లిన తరువాత ఇద్దరి సహకారం మీద, అక్కడి వాతావరణం మీద మాత్రమే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందే ఏదేదో ఊహించుకుని ఆ తరువాత డిజప్పాయింట్ అవ్వకూడదు. గతాలు వద్దూ.. ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామి వద్ద నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. ఈ కారణంగా చాలామంది తమ గతం గురించి చెబుతుంటారు. గతంలో ఎవరితోనైనా ప్రేమ, వారితో రిలేషన్షిప్, స్నేహం, వారితో సన్నిహితంగా ఉన్న క్షణాలు ఇలాంటివి ప్రస్తావించకూడదు.  ముందు ఏం జరిగిందో అనే విషయాలు మనసు నుండి తీసేయడం మంచిది. కొత్త భాగస్వామితో జీవితాన్ని కొత్తగా సంతోషంగా ప్రారంభించాలి. వాదన వద్దూ.. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరనే మాట ఎంత వాస్తవమో... ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు  ఒకేలా ఉంటాయనే మాట అంతే వాస్తవం.  హనీమూన్ లో ఇద్దరు వ్యక్తుుల విభిన్న ఆలోచనలు, ఇష్టాలు, నిర్ణయాలు గొడవలకు, వాదనలకు కారణం కాకూడదు. ఏదైనా అభిప్రాయ బేధం వచ్చినా అది గొడవగా మారకముందే దాన్ని ఆపేసి కాసేపు మౌనంగా ఉండటం మంచిది. గదికే పరిమితం కావద్దు.. హనీమూన్ కోసం ఎక్కడెక్కడికో ప్రయాణం చేసి వెళ్లి తీరా ఆక్కడికి వెళ్లాక అక్కడ కేవలం మీకు కేటాయించిన గదిలోనే ఉండిపోకూడదు.  అక్కడ చుట్టు ప్రక్కల ప్రాంతాలను, వాతావరణాన్ని, సంస్కృతిని గమనించి, అర్థం చేసుకుని, జీవితానికి వాటిని అన్వయించుకుంటే మీ జీవితంలో హనీమూన్ ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది.                                           *నిశ్శబ్ద.

సుధామూర్తి గారి సలహా.. పిల్లల్ని ఇలా పెంచితే డాక్టర్లు, ఐఏఎస్ లు కావడం ఖాయమట!

ఇంజనీర్, సామాజిక కార్యకర్త,  రచయిత సుధా మూర్తి పిల్లల కోసం కథలు వ్రాస్తారు. ఆమె మానవతావాద సమస్యల గురించి,  సామాజిక సమస్యలపై  మాట్లాడటంలోనూ ఎప్పుడూ ముందుంటారు.  భారతదేశంలో విద్య, గ్రామాల అభివృద్ధి,  మహిళల అభ్యున్నతిలో ఆమె చాలా దోహదపడింది. ఆమె  జీవితమంతా ఒక ప్రేరణ కంటే తక్కువ కాదు. ఆమె జీవితంలో వివిధ సందర్భాలలో పేర్కొన్న ఎన్నో స్పూర్తిదాయక విషయాలు పిల్లలను ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి. మీ పిల్లలు ఆత్మవిశ్వాసం,  ధైర్యం కోల్పోకూడదని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటే, సుధా మూర్తి చెప్పిన స్పూర్తిదాయకమైన విషయాలను తప్పక పిల్లలకు చెప్పాలి. ఇవి చెబితే ఏ పిల్లవాడు అయినా ఆత్మవిశ్వాసాన్ని పోగుచేసుకుంటాడు. జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తాడు. ఐఏఎస్, డాక్టర్ లాంటివి కూడా వారికి చిన్న లక్ష్యాలుగా అనిపిస్తాయి.  కలలను ఎప్పటికీ వదులుకోవద్దు.. జీవితంలో  కలలను ఎప్పటికీ వదులుకోకూడదని సుధా మూర్తి అన్నారు. మొదలుపెట్టిన పని ఎంత కష్టమైనా పూర్తి చేయాలి. కష్టపడి పనిచేయడం వల్ల కలలు నెరవేరుతాయి. పిల్లలు దీన్ని అర్థం చేసుకుంటే వారు చిన్న వైఫల్యాలకు భయపడటం మానేస్తారు. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి.. జీవితంలో నేర్చుకోవడం ఏ సందర్భంలోనూ  ఆపకూడదని సుధా మూర్తి అన్నారు. ప్రపంచంలోకి ఎప్పుడూ కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి.  సాంకేతికతతో ఎంత చురుగ్గా, ఎంత అవగాహనతో  ఉంటే, జీవితంలో  ముందుకు వెళ్లడం అంత సులభం అవుతుంది. నేర్చుకోవడం మెదడు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. అపజయానికి భయపడవద్దు.. సుధా మూర్తి చెప్పిన మాటల ప్రకారం  అపజయానికి భయపడకూడదు.  వైఫల్యాల నుండి నేర్చుకుని మళ్లీ ప్రయత్నించాలి. విజయానికి మార్గంలో వైఫల్యం తప్పనిసరి. పిల్లలు వారి వైఫల్యం నుండి నేర్చుకుంటే వారు జీవితంలో ముందుకు సాగకుండా ఎవరూ ఆపలేరు. ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వాలి..  ఎవరి జీవితం  గురించి వారు ఆలోచించడం  సరికాదు.  సమాజంలో జీవిస్తున్నాము కాబట్టి ఇతరుల భావాలను, వారి  అవసరాలను గౌరవించడం ముఖ్యం. తనకే పరిమితమైన మనిషి ఎప్పటికీ ముందుకు వెళ్లలేడు. పిల్లలు చిన్నతనం నుండే ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవాలి. పిల్లలు ఈ మూడు విషయాలను అర్థం చేసుకున్నా, పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పినా.. ఆ పిల్లలు జీవితంలో తప్పకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు.                                             *నిశ్శబ్ద.

ఆత్మవిశ్వాసానికి ఎంతటి శక్తి ఉంటుందంటే.. ఈ కథనమే గొప్ప ఉదాహరణ!

ఆత్మవిశ్వాసంతో కొండను పిండి చేయవచ్చుననడానికి   దశరథ్ మంజీ సజీవ సాక్ష్యం. బీహార్ రాజధాని పాట్నాకు దాదాపు వంద కిలోమీటర్ల దూరాన ఒక గ్రామం ఉంది. దాని పేరు గెహ్లోర్. ఆ గ్రామానికీ, ప్రక్క గ్రామానికీ మధ్య ఒక కొండ అడ్డంగా ఉంది. గెహ్లోర్ ప్రజలు నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసహాయం పొందాలన్నా ఆ కొండ చుట్టూ తిరిగి, అవతలి గ్రామానికి పోవాలి. అలా వెళ్ళడానికి సుమారు 32 కిలోమీటర్ల దూరం ఉంది. కొండను తొలిస్తే కేవలం మూడు కిలోమీటర్ల దూరం.  మూడు కిలోమీటర్ల దూరానికి అనవసరంగా 32 కిలోమీటర్లు కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. శ్రమ దండుగ, సమయం వ్యర్థం. అయినా ఆ గ్రామ ప్రజలు అలాగే తంటాలు పడుతున్నారు. ఆ గ్రామంలోని దశరథ్ మంజీ అనే రైతు ఒకనాడు కొండ అవతల పొలంలో సేద్యం చేస్తున్నాడు. అతని భార్య ఫాగుణీదేవి భర్తకు అన్నం తీసుకొని, కుండ నెత్తి మీద పెట్టుకొని కొండ మధ్యలోనున్న చిన్న చరియ గుండా పోతుండగా రాళ్ళు గుచ్చుకొని క్రింద పడింది. అన్నం నేలపాలయింది. ఆమె గాయాల పాలైంది. ఆ గాయాలతోనే ఆమె మృత్యువుకు బలైంది. కలత చెందిన దశరథ్ మంజీ కొండను తొలిస్తే తప్ప గ్రామానికి మేలు జరుగదని మనస్సులో నిర్ణయించుకొన్నాడు. ఊరి ప్రజలనందరినీ సమావేశపరిచి "నేను ఈ కొండను తొలుస్తాను. అవతలికి దారి చేస్తాను” అని ప్రకటించాడు. ఆ ప్రకటన విని జనమంతా నవ్వుకున్నారు. "ఒరేయ్! కొండను తొలుస్తాడట మొనగాడు" అని అపహేళన చేశారు. అయినా దశరథ్ మంజీ వారి మాటలను పెడచెవిన పెట్టి, చేతులతో ఉలి, సుత్తి పట్టాడు. గుండెల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుకొన్నాడు. ఎవరి సాయం కోసం ఎదురుచూడకుండా తలవంచుకొని, మౌనంగా, గంభీరంగా అడుగులు వేస్తూ కొండను సమీపించాడు. వినమ్రంగా నమస్కరించి కొట్టడం మొదలుపెట్టాడు. రోజులు, నెలలూ కాదు, ఇరవై రెండు సంవత్సరాలు కొండను కొట్టాడు. మూడు కిలోమీటర్ల పొడవు ముప్ఫై అడుగుల వెడల్పుతో దారి చేశాడు. దశరథ్ మంజీ కొండంత ఆత్మ విశ్వాసం ముందు కొండ చిన్నబోయింది. అతని ఆత్మవిశ్వాసం ముందు తలవంచుకుని దాసోహమంది. మంజీ కృషినీ, ఆత్మ విశ్వాసాన్నీ, పట్టుదలనూ చూసి గ్రామ ప్రజలందరూ విస్తుబోయారు. దశరథ్ కొండను తొలిచి తయారు చేసిన మార్గంలో ఇప్పుడు వాహనాలు కూడా వెళ్తున్నాయి. రోడ్డు కూడా వేశారు. అయితే దశరథ్ మంజీ అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో ఈ మహాకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినా ఆ దృశ్యాన్ని చూసే అదృష్టం అతని భార్యకు లేదు. మంజీ ఆత్మవిశ్వాసానికి కృతజ్ఞతగా గెహ్లోర్ ప్రజలు తమ గ్రామం పేరును మార్చి, దశరథ్ నగర్ అని పిల్చుకుంటున్నారు.  చిన్న చిన్న సమస్యలకే నీరసించిపోయే వారికి ఆత్మవిశ్వాసంతో కొండను తొలిచిన దశరథ్ మంజీ ఆదర్శనీయుడు.                                               *నిశ్శబ్ద.

ఆధ్యాత్మిక విజయానికి అసలు అర్థం ఇదే..!

ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించడం గురించి చెప్పుకొనే ముందు అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. భగవత్ దర్శనమే ఆధ్యాత్మిక జీవితమా లేక మానవాతీత శక్తులను సాధించడమా లేక పూజలు, వ్రతాలు, తపస్సు చేసి ప్రాపంచిక జీవితంలో విజయం సాధించడమా? పరమేశ్వరుడి దర్శనమే చాలు అనుకుంటే రావణాసురుడికి ఆ దేవదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మన దేశంలో మానవాతీత శక్తులున్నవారు చాలా మందే ఉన్నారు. కొందరు లోహాన్ని బంగారం చెయ్యగలరు, కొందరు గాలిలో ఎగరగలరు, కొందరు ముందు జరగబోయేదాన్ని చెప్పగలరు, మరికొందరు కాయసిద్ధిని సాధించి తమ ఆయుర్దాయాన్ని పొడిగించు కోగలరు. పూజలూ పునస్కారాలూ చేసి సంపద, కీర్తి, అధికారాలను పొందేవారి సంఖ్య చెప్పలేనంత ఉంది. మరి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి? పూజలు చెయ్యొచ్చు, భక్తిని పెంపొందించుకోవచ్చు కానీ భగవంతుణ్ణి ఏమీ అడగకూడదు. "భగవంతుడా! నా కోరిక తీర్చు. నాకు అది ఇవ్వు... ఇది ఇవ్వు... నా కోరిక తీరిస్తే నీకు నేను ఏదో చేస్తాను..." అనడం భక్తి కాదు. అది భగవంతుడితో వ్యాపారం. దీనికి ఉదాహరణగా కింద విషయాన్ని చెప్పుకోవచ్చు.  పర్షియాను జయించి, ఉత్తర భారత దేశంలో పురుషోత్తముడనే రాజును ఓడించి, దక్షిణాపథం వైపు దూసుకుని వెళుతున్నాడు అలెగ్జాండర్ చక్రవర్తి. అతని రథానికి ఇరువైపులా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నారు జనం. అతని ఆధిపత్యాన్ని ఎదిరించలేక తల వంచుతున్నారు. రథంలో పయనిస్తున్న అలెగ్జాండర్ దృష్టి ఒక వ్యక్తి పైన పడింది. అతను తల వంచి నమస్కరించలేదు. అలెగ్జాండర్ వైపు తదేకంగా చూస్తున్నాడు. అది గమనించి వెంటనే ఒక సైనికుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి "బతికి ఉండాలంటే తలదించు. లేకపోతే ప్రాణాలతో ఉండవు" అని బెదిరించాడు. అయితే అతను ఆ సైనికుడి మాటలు వినిపించుకోలేదు. ఇది చూసిన అలెగ్జాండర్ తన రథం ఆపి, ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. “నేనెవరో తెలుసా" అని గర్జించాడు. అతను బదులు చెప్పకుండా అలెగ్జాండర్నే చూడసాగాడు. అలెగ్జాండర్ కోపంగా తన ఖడ్గం తీసి, "తల వంచక పోతే శిరచ్ఛేదన చేస్తాను" అని హెచ్చరించాడు. అయినా ఆ వ్యక్తి నిశ్చలంగా ఉన్నాడు. అలెగ్జాండర్ అతని మీద పట్టరాని కోపంతో తన చేతిలోని కత్తిని ఎత్తాడు. అయినా అతడు చలించలేదు. అలెగ్జాండర్ నిశ్చేష్టుడయ్యాడు. ధైర్యాన్ని కోల్పోయాడు, మానసికంగా దుర్బలుడయ్యాడు. "నీకు మరణమంటే భయం లేదా?” అని అలెగ్జాండర్ అడగగా ఆ వ్యక్తి మందహాసంతో “లేదు" అన్నాడు. తన జీవితంలో ఇప్పటి వరకూ ఇలాంటి వ్యక్తిని ఎదుర్కోలేదని గ్రహించాడు అలెగ్జాండర్. ఎదురులేని వీరుడిగా పేరుగాంచిన అలెగ్జాండర్కు ఆ వ్యక్తిని తాను ఎదిరించలేనని తెలిసింది. “మరణమంటే ఈ వ్యక్తికి భయం లేదెందుకు?" అని మనస్సులో పదే పదే అనుకున్నాడు. "నువ్వెవరు? నీకు మరణమంటే ఎందుకు భయం లేదు?" అని అడిగాడు. ఆ వ్యక్తి "నేను శరీరాన్ని కాదు, బుద్దిని కాదు, మనస్సును కాదు. నాకు చావు, పుట్టుకలు లేవు. లేని చావుకు భయం ఎందుకు? నువ్వు ప్రపంచ సామ్రాట్ వి కావచ్చు కానీ నిన్ను నువ్వు శరీరమని అనుకుంటున్నావు. ఎంత రాజ్యం ఉంటే ఏమిటి, ఏదో ఒక రోజు మరణిస్తావు. అప్పుడు నీకు కావాల్సింది ఆరడుగుల నేల మాత్రమే. ఆఖరికి నువ్వు సాధించేది అదే" అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ 'ఆ వ్యక్తి ఒక మహాయోగి' అని గ్రహించాడు. వెంటనే యుద్ధప్రయత్నాన్ని విరమించుకొని, ప్రణామం చేసి వెనక్కి తిరిగాడు. ఆధ్యాత్మికత అంటే మనోబుద్ధి అహంకారాలను జయించి తాను ఆత్మస్వరూపుడననే జ్ఞానం పొందడమే. ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అదే 'అసలైన విజయం!'                                            *నిశ్శబ్ద.  

నాలుగు కొవ్వొత్తులు..

అది ఒక చీకటి గది. చీకటంటే అలాంటి ఇలాంటి చీకటి కాదు... చిమ్మ చీకటి. బయట ఉన్న కిటికీలలోంచి కూడా కారు నలుపు రంగు తప్ప మరేమీ కనిపించడం లేదు. అలాంటి గదిలోకి ఓ కుర్రవాడు ప్రవేశించాడు. తడుముకుంటూ తడుముకుంటూ ఓ నాలుగు కొవ్వొత్తులను పోగేసి వెలిగించాడు. కాసేపు ఆ కాంతిలో ఏదో చదువుకున్నాడు. ఇంకాసేపు ఏదో రాసుకున్నాడు. చివరికి అలా చల్లగాలి పీల్చుకుందామని బయటకు వెళ్లిపోయాడు. కుర్రవాడు అలా బయటకి వెళ్లాడో లేదో కొవ్వొత్తులన్నీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. మొదటి కొవ్వొత్తి అంది కదా... ‘నేను శాంతికి ప్రతిరూపాన్ని. నన్ను ఎక్కువసేపు నిలిపి ఉంచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే నేను త్వరగా వెళ్లిపోతున్నాను. మరో నిమిషంలో ఆరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను,’ అంటూ భగభగా మండిపోవడం మొదలుపెట్టింది. అన్నట్లుగానే మరో నిమిషంలో ఆరిపోయింది. మొదటి కొవ్వొత్తి అలా ఆరిపోయిందో లేదో, రెండో కొవ్వొత్తి కూడా చిటపటలాడటం మొదలుపెట్టింది. ‘నేను నమ్మకానికి ప్రతిరూపాన్ని. నా అవసరాన్ని ఎవరూ త్వరగా గమనించరు. పైగా శాంతి కూడా లేనిచోట, ఎవరైనా నమ్మకాన్ని ఎలా నిలిపి ఉంచగలరు. అందుకే నేను కూడా ఆరిపోతున్నాను,’ అంటుండగానే వెలుగు తగ్గిపోయి, చివరికి ఆరిపోయింది. రెండో కొవ్వొత్తి ఇలా కొండెక్కిందో లేదో, మూడో కొవ్వొత్తి నసగడం మొదలుపెట్టింది. ‘నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. తమ పక్కనున్న వారితో సైతం ప్రేమగా ఉండేందుకు ఇష్టపడరు. పైగా శాంతి, నమ్మకం లేని చోట నేను మనుగడ సాగించడం చాలా కష్టం. అందుకే నేను కూడా వారి బాటనే అనుసరిస్తాను,’ అంటూ ఏడుస్తూ రెపరెపలాడసాగింది. అలా అటూఇటూ ఊగిసలాడి చివరికి ఆరిపోయింది. నాలుగో కొవ్వొత్తి మాత్రం నిబ్బరంగా అలాగే నిలిచి ఉంది. కాసేపటికి కుర్రవాడు గది లోపలకి రానే వచ్చాడు. తాను వెలిగించిన మూడు కొవ్వొత్తులూ అలా ఆరిపోవడం చూసి అతనికి బాధ కలిగింది. కానీ నాలుగో కొవ్వొత్తి నిబ్బరం చూసి అంతే ఆశ్చర్యం వేసింది.‘మిగతా కొవ్వొత్తులన్నీ ఆరిపోయినా, నువ్వు మాత్రం ఎలా నిలిచి ఉన్నావు?’ అని నాలుగో కొవ్వొత్తిని అడిగాడు కుర్రవాడు. ‘నేను ఆశకు ప్రతిరూపాన్ని! నేను అంత త్వరగా పరాజయాన్ని ఒప్పుకోను. అసలు పరాజయానికి విరుగుడే నేను కదా! విజయం దక్కేదాకా మీరు పోరాడేందుకు నేను అండగా నిలిచి ఉంటాను. ఇక ఈ చీకటి నాకో లెక్కా! పైగా నన్ను ఉపయోగించి మిగతా కొవ్వొత్తులను కూడా వెలిగించేందుకు సాయపడతాను. నేను ఉన్నంతకాలం శాంతి, నమ్మకం, ప్రేమ అనే గుణాలకు లోటు ఉండదు,’ అని చెప్పింది. కుర్రవాడు ఆ కొవ్వొత్తితో మళ్లీ మిగతా మూడు కొవ్వొత్తులనీ వెలిగించాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

తప్పటడుగులలో విజయాలు!

"బుడిబుడి అడుగులు వేసే పిల్లలు ఎన్నో తప్పటడుగులు వేస్తారు. వాటి నుంచేగా సరిగ్గా నడవడం నేర్చుకునేది".- ఇది పెద్దల మాట.  అడుగు ఎలా? పెద్దలంటే పెద్దలు, జీవితంలో అనుభవం సాదించేసి, జీవిత సారాన్ని ఒడిసిపట్టి, తప్పేది, ఒప్పేది అనేది చిటికెలో చెప్పేసేవాళ్లే కాదు, బాల్య దశ దాటి, యౌవనంలో దూకి, గందగరగోళంలో, ఆవేశాల నిర్ణయాల్లో బోల్తా పడుతూ, మళ్ళీ పైకి లేస్తూ మళ్ళీ అదే ఆవేశంలో మళ్ళీ అదే పడటాలు, లేవడాలతో కుస్తీ పడుతూ  చివరకు ఒక అనుభవం అర్థమయ్యి దానికొక అర్థవంతమైన దారి తెలిసి అప్పుడు అటూఇటూ ఊగకుండా, ఎలాంటి భయం లేకుండా ధీమాగా అడుగేసి, ఆ అడుగు తాలూకూ భయాన్ని కడిగేసి విజయమనే సంతకాన్ని చేస్తారు. కానీ పెద్దలు ఏమి చేస్తున్నారు? తప్పటడుగు  పడగానే దాని అనుభవంతో తదుపరి సరైన అడుగు వేస్తారులే అనుకోవాల్సిన పెద్దలు తప్పు చేసేస్తున్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. నేటి కాలంలో తమ పిల్లలు తప్పు చేస్తే, వాటిని కవర్ చేసి ఆ పిల్లలను సేవ్ చేసే తల్లిదండ్రులే ఎక్కువ కనబడుతున్నారు. ఫలితంగా ఆ పిల్లలకు తప్పు అంటే ఏమిటో పూర్తిగా అర్థమవడం లేదు. దాని మూలంగానే అదేమీ పెద్ద సమస్య కాదుగా అన్నట్టు తయారవుతున్నారు పిల్లలు. పైగా తాము ఏదైనా తప్పు చేస్తే తమ తల్లిదండ్రులు తమను సేవ్ చేస్తారనే ధీమా వాళ్ళను ఇంకా, ఇంకా తప్పులు చేయిస్తోంది. కానీ పెద్దలు మాత్రం వాటిలో పిల్లల పట్ల ప్రేమను, వారిని కాపాడుకోవాలనే తపనను కనబరుస్తారే తప్ప, వాళ్ళ తప్పును తెలియచేసి, వాళ్ళను బాధ్యాతాయుత పౌరులుగా తయారు చేయడం లేదు. పిల్లలకు ఏమి చెప్పాలి? తప్పులు చేయడం సహజం. అందులో అవగాహన లేని ప్రాయంలో తప్పులు చేయడం మరింత ఎక్కువ. అది ఏ విధమైన తప్పు అనేది అనవసరం కానీ తప్పు చేసిన తరువాత ఆ తప్పుకు గల కారణాలు, దాని పర్యావసనాలు, దాని తాలూకూ ఇబ్బందులు, జీవితం మీద దాని ప్రభావం ఇలాంటివన్నీ పిల్లలకు దగ్గరుండి చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగింది?? అది ఎందుకు తప్పుగా పరిగణించబడుతోంది?? వంటి విషయాలను వివరించాలి. దానివల్ల పిల్లల్లో విస్తృత జ్ఞానం పెరుగుతుంది. ఏదైనా చేసేముందు దాని గూర్చి అన్ని కోణాలలో ఆలోచించడం అలవడుతుంది. హద్దులు, ముద్దులు! చాలామంది పిల్లలు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు వారి తల్లిదండ్రులు వెంటనే వద్దు అంటారు.  కానీ వారు చేయాలి అనుకుంటున్న పని ఎందుకు చేయాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళతోనే చెప్పిస్తూ, దాని తాలూకూ ప్రశ్నలు బయటకు తీస్తూ, ఆ ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళతోనే చెప్పిస్తూ ఉండటం వల్ల వాళ్లలో ఎలాంటి పనులు చేయాలనే అవగాహన వస్తుంది.  ఏదో పిల్లల మీద ఇష్టం కొద్ది, ప్రేమ ఎక్కువగా ఉండటం వల్ల వారు అడిగింది సమంజసం కాకపోయినా దానికి సరేనని చెప్పే తల్లిదండ్రులు కూడా బోలెడు మంది ఉన్నారు. వాళ్లకు తాత్కాలిక సంతోషం కనబడుతుంది కానీ భవిష్యత్తు గురించి భయం ఉండదు. పైగా బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇంత డబ్బుంది నా పిల్లల భవిష్యత్తుకు ఇంకేం సమస్య అని అనుకుంటారు. కానీ డబ్బు ఎంత పెట్టినా వ్యక్తిత్వం ఉన్నతంగా అభివృద్ధి చెందదు అనే విషయం అర్ధం చేసుకోరు. మార్గదర్శి… తనను ఒక ఉదాహరణగా చెబుతూ కనువిప్పు కలిగించే వారిని మార్గదర్శి అనవచ్చు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉండాలి. అలాగని సారూప్యత లేని విషయాల్లో కాదు. కొన్ని ఉదాహరణలు, కొన్ని జీవిత అనుభవాలు, కొన్ని ప్రేరణాత్మక సంఘటనలు, కొన్ని కష్టాలు, కొన్ని కన్నీళ్లు జీవితంలో ఉన్నవి అన్ని పిల్లలకు కొన్ని చిన్న సంఘటనలుగానో, కథలుగానో, అనుభవాలుగానో చెబుతూ ఉండాలి. వాటి వల్ల పిల్లలు తప్పటడుగుల నుండి పాఠాలు నేర్చుకుని, అందులో నుండి విజయాలు సాదించగలుగుతారు!! ◆ వెంకటేష్ పువ్వాడ

అంతర్గత శక్తులను బయటకు తీయడం ఎలా?  నిపుణులు చెప్పిన మార్గాలేంటో తెలుసుకోండి!

  సినిమాల్లోని సూపర్‌హీరోల మాదిరిగానే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అంతర్నిర్మితమై ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి ఎదురయ్యే అనారోగ్యాలు, గాయాలతో పోరాడుతూ ఉంటుంది.  ఇలా కేవలం శరీరమే కాదు.. మనిషి మనసు కూడా ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి  మనసు, శరీరం రెండూ కలసి ఎలా పనిచేస్తాయో..  మనిషిలో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడం ఎలాగో తెలుసుకుంటే.. బాల్యం.. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. పెద్దయ్యాక ప్రతి ఒక్కరూ బ్యాలంలోకి వెళ్లిపోవాలని అంటుంటారు. అదొక అందమైన దశ. అమాయకత్వం, ప్రేమ, సంతోషం, కల్మషం లేని వ్యక్తిత్వం బాల్యంలో ఉంటుంది. ఒకవేళ ఇలా ప్రేమ, ఆప్యాయతల మధ్య కాకుండా నిర్లక్ష్యం చేయబడటం, హింసకు గురికావడం వంటివి బాల్యంలో జరిగి ఉంటే అవి మానసికంగా చాలా బాధపెడతాయి. బాల్యంలో ఏం జరిగిందో అర్థం చేసుకోవడం వల్ల భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకోవచ్చు. తప్పులను సరిదిద్దుకోవచ్చు. బాద్యత కలిగిన పెద్దలుగా ఎదగవచ్చు. ట్రీట్మెంట్..  చాలామందిలో చిన్నతనంలో జరిగిన ఎన్నో అనుభవాలు మనసులో పాతుకుపోయి ఉంటాయి.  వర్తమానానికి తగినట్టు కాకుండా మనసులో పాతుకుపోయిన విషయాలకు అనుగుణంగా నటిస్తుంటారు. దానికి తగినట్టు ప్రవర్తిస్తుంటారు. అయితే మనసులో ఉన్న ఈ పాత విషయాలను మార్చేయడం ద్వారా మనసులో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయగలరని అంటున్నారు నిపుణులు. తద్వారా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకునే అవకాశం పొందగలం. చిత్తశుద్ది.. వర్తమానం గురించి తెలుసుకోవడం కోసం సమర్థవంతమైన మార్గాలలో మైండ్‌ఫుల్‌నెస్ ఒకటి. అంటే ప్రస్తుతం జరుగుతున్నవాటిని జడ్జ్ చేయకుండా వాటిని నిశితంగా గమనించడం.  వర్తమానంలో భావాలు, అనుభూతులు, ఆలోచనలు, చుట్టూ జరుగుతున్న విషయాలు మొదలైనవాటిని గమనించాలి. మైండ్‌ఫుల్‌నెస్ పాత బాధలను నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రస్తుత క్షణంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు పాత విషయాలను బాగా అర్థం చేసుకోవచ్చు. వాటిని అంతే ధీటుగా ఎదుర్కోవచ్చు. తద్వారా మనసుకు చికిత్స చేయవచ్చు. క్షమాపణ.. క్షమాపణ అడగడం, ధన్యవాదాలు చెప్పడం, ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేయడం వంటివి వ్యక్తిలో ఉండే ప్రతికూల శక్తులను బయటకు విడుదల చేస్తాయి.  ప్రతికూల ప్రభావాలకు బాధ్యత వహించడం, పశ్చాత్తాపాన్ని, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడం ద్వారా వ్యక్తిలో అంతర్గత శాంతి నెలకొంటుంది. ఇది వ్యక్తిగతంగానూ, ఇతరులతోనూ సామరస్యాన్ని నెలకొల్పుతుంది. శ్వాస ఉపయోగించడం.. గతాన్ని నయం చేయడానికి శ్వాసను ఉపయోగించడం చాలా గొప్ప మార్గం. పాత జ్ఞాపకాలను, మనసులో ఉన్న విషయాలను వదిలించకోవడానికి శ్వాసమీద దృష్టి పెట్టడం, నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా మనస్సును, శరీరాన్ని  శాంతపరచవచ్చు. ఇది గతంలో ముడిపడిన భావోద్వేగాలకు విశ్రాంతి ఇవ్వడానికి, వాటిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. జర్నలింగ్.. రిఫ్లెక్షన్స్.. ఆలోచనలను, భావాలను రాయడం వల్ల గతాలకు సంబధించిన గాయాలను, భావోద్వేగాలను నయం చేయడం సులువుగా ఉంటుంది. వ్యక్తులు తమను తాము అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ప్రతికూల విధానాలను విడిచిపెట్టి, ఆరోగ్యకరమైన మార్గంలోకి మెదడును, ఆలోచనలను  తీసుకెళ్లడంలో ఇది సహాయపడుతుంది. సపోర్ట్.. ఏ విషయంలో అయినా స్వంతంగా చేసే ప్రయత్నాల కంటే ఒకరి మద్దతుతో చేసే ప్రయత్నాలు ఎప్పుడూ మంచి ఫలితాలు ఇస్తాయి. భావోద్వేగాలకు సంబంధించిన గాయాలు నయం చేయడంలో సామాజిక మద్దతు కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికి వ్యక్తి గురించి ఆలోచించేవారు, అన్ని విషయాలలో మద్దతు ఇచ్చే వారుంటే తప్పొప్పుల గురించి చర్చించి మాట్లాడటం, అర్థం చేసుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గతాన్ని వదిలించుకునే క్రమంలో ఎప్పుడూ ఒంటరితనం వేధించదు. మనస్సు, శరీరం రెండూ ఏకమైనప్పుడు , అవి రెండూ కలిస్తే ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకున్నప్పుడు స్వతహాగానే మనిషిలో అంతర్గత శక్తులు బయటకు వస్తాయి.                                          * నిశ్శబ్ద.

షాపింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

  షాపింగ్‌పై నియంత్రణ కోల్పోయి అవసరం లేని వస్తువులు కూడా కొనేసి, ఇంటికి వచ్చాక లెక్కలు కట్టి బాధపడేవారు చాలామందే ఉంటారు. ఇలా అవసరాన్ని మించి హ్యాండ్ బ్యాగ్‌లో లేదా ATM లో ఉన్న డబ్బంతా ఖర్చుచేస్తే ఆ నెలంతా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. * ఈ విషయంలో సెల్ఫ్ కంట్రోల్, ముందుచూపు చాలా అవసరం. అందుకే షాపింగ్‌కు వెళ్ళేముందు కావాల్సినంత డబ్బు మాత్రమే తీసుకువెళ్ళండి. ATM కార్డులో పుష్కలంగా బ్యాలెన్సు ఉంది కదా అని ఎడా, పెడా ఉపయోగించకండి. ఈ కార్డులు హ్యాండ్ బ్యాగులో ఉంటే అవసరానికి మించి కొనడానికి ఉత్సాహపడతారు. కాబట్టి వీలయినంతవరకూ వాటిని బైటకు తీయవద్దు. * షాపింగ్‌కు వెళ్ళే ముందే ఇంటి దగ్గర ఒక చిన్న స్లిప్‌మీద ఏమేమి కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంత డబ్బు వాటికి అవసరం అవుతుంది అని చిన్న జాబితా తయారుచేసుకోండి. జాబితా తయారుచేసుకున్నాకా మీ వద్ద ఉన్న డబ్బుకు మించి జాబితా తయారైతే అవసరం లేని వస్తువులేమైనా ఉన్నాయో చూసుకుని వాటిని తొలగించండి. ఇంకా వీలైతే అత్యవసరం ఉన్న వాటినే లెక్కలో ఉంచుకోవాలి. షాపింగ్ కు వెళ్ళాక తయారుచేసుకున్న జాబితాలో నుంచే కొనుగోళ్ళు ప్రారంభించాలి. *  వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దు. చాలామంది కూడా ప్రకటనలపైనా, ఫ్రీ గిఫ్ట్‌లపైనా దృష్టి పెడుతుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా కొనుగోళ్ళు చేస్తే తగిన నియంత్రణలో ఉన్నట్లు లెక్క. * కొంతమంది బోర్‌గా ఉందని, ఏం తోచక షాపింగులు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. బోర్ కొట్టేవాళ్ళు కాలక్షేపానికి మరేదైనా పనిమీద మనసు లగ్నం చేస్తే బాగుంటుంది. అంతేకాని షాపింగు చేయడాన్ని ఎంచుకోవద్దు. * నెలంతా అవసరమయ్యే అన్ని ఖర్చులు రాసుకుని ఆ తర్వాతే షాపింగు ఖర్చు తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే వచ్చిన డబ్బంతా షాపింగ్‌కు ఖర్చుపెట్టి ఆ తర్వాత అప్పులు చేయవద్దు. * హైక్లాస్ అయినా మిడిల్, లోయర్ క్లాసుల వాళ్ళయినా షాపింగ్‌లో నియంత్రణ కలిగి ఉండటం చాలా మంచిది.

ప్రతి మనిషిలోనూ ఓ వేటగాడు!

ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా జనం ‘పోకెమాన్‌ గో’ ఆటని ఆడుతూ కనిపిస్తున్నారు. ఇది వేలంవెర్రిగా మారిందని పెద్దలు తిట్టుకుంటున్నా, దీని పర్యవసానాల గురించి పరిశోధనలు జరుగుతున్నా... ఆటలు ఆడేవారు మాత్రం పోకెమాన్ల వెంట పడుతూనే ఉన్నారు. ‘ఇంతకీ మనిషి ఈ ఆటకి ఎందుకింతగా వ్యసనపరుడయ్యాడు?’ అన్న ప్రశ్నకి ఓ స్పష్టమైన జవాబు లభిస్తోంది. తన జీవితమే ఒక పరిశోధన రష్యాలో పుట్టి పెరిగిన ‘వ్లాదిమిర్‌ డినెట్స్’ అనే ఆయన, ప్రస్తుతం అమెరికాలో మనస్తత్వ శాస్త్రంలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పోకెమాన్‌గో పిచ్చి గురించి వ్లాదిమిర్‌కి కూడా కొన్ని సందేహాలు వచ్చాయి. మనిషిలో స్వతహాగా ఉండే వేటగాడి మనస్తత్వం వల్లే మనం ఈ ఆటని ఇష్టపడుతున్నామా అన్న అనుమానం కలిగింది. దాంతో ఒక్కసారి తన జీవితంలో జరిగిన విషయాలనే ఒక్కొక్కటిగా నెమరువేసుకుంటూ ‘మనిషిలో వేటగాడు’ అనే ఆలోచనకు ఓ రూపం ఇచ్చేందుకు ప్రయత్నించారు. వేటే ఆధారం ఇప్పుడంటే తాజా ఆకుకూరలు, షడ్రసోపేతమైన ఆహారాలు లాగిస్తున్నాం కానీ, ఆదిమానవులుగా ఉన్నప్పుడు మనం వేట మీదే కదా ఆధారపడింది. ఆ వేటతోనే కదా వారి ఆకలి తీరింది. కాబట్టి మిగతా జంతువులలాగానే మనిషిలో ఇంకా ఆ వేట తాలూకు ఛాయలు పోలేదంటారు వ్లాదిమిర్‌. అందుకు తన జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు. వ్లాదిమిర్‌ చిన్నప్పుడు తన తండ్రి సీతాకోక చిలుకల వెంటపడటాన్ని గమనించేవాడు. ఆయన సీతాకోక చిలుకల్ని గమనిస్తూ, వాటి వెంటపడుతూ, వాటిలో అరుదైనవాటిని సేకరిస్తూ ఉండేవారట. వ్లాదిమిర్‌కు ఐదేళ్లు వచ్చేసరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి అక్కడ ఉండే జంతువులని గమనించే అలవాటు మొదలైంది. తరువాత కాలంలో వ్లాదిమిర్‌, మాస్కో మహానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ అతను పార్కుల్లో పక్షులనీ, పెరట్లో పురుగులనీ గమనించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అరుదైన జంతువులని గమనించడాన్నే వ్యాపకంగా పెట్టుకొన్నాడు. చివరికి జంతువుల స్వభావాల మీదే డాక్టరేటు పుచ్చుకున్నాడు. అన్నీ వేటగాడి సూచనలే సీతాకోక చిలుకల వెంటపడటం, పక్షులను గమనించడం, జంతువులని పరిశీలించడం, పురుగులను పట్టుకోవడం... ఇవన్నీ మనలో దాగి ఉన్న వేటగాడి చర్యలే అంటారు వ్లాదిమిర్‌. అంతేకాదు పోకెమాన్‌గోలో లేని జంతువులను ఊహించుకుంటూ వాటి వెంటపడటం కూడా మనలోని వేటగాడిని తృప్తి పరుస్తోందని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ‘వేటగాడి’లో ఉండే పోరాటపటిమని లక్ష్యసాధన కోసం ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలనిస్తుందని సూచిస్తున్నారు.   -నిర్జర.

మనిషిలో ఉండాల్సిన గొప్ప గుణం ఇదే!

మనిషి జీవితంలో ఒకదాని తరువాత ఇంకోటి కావాలని అనుకుంటూనే ఉంటాడు. అంటే మనిషికి తృప్తి ఉండటం లేదు. ఇంకా ఇంకా కావాలనే అత్యాశ మనిషిని నిలువనీయదు. కానీ ఈ ప్రపంచంలో తృప్తి మించిన సంపద లేదన్నది అందరూ నమ్మాల్సిన వాస్తవం. అది పెద్దలు, యువత అందరూ గుర్తించాలి. ముఖ్యంగా యువతరం తృప్తి గురించి తెలుసుకుని  దాన్ని గుర్తించాలి.   ఈ సమాజంలో అందరికీ కూడా తృప్తి అనేది కరవు అయ్యింది. ఎందుకు అంటే మనిషిలో ఇంకా కావాలి అనే అత్యాశ వల్ల తృప్తి అనేది లేకుండా అందరూ స్వార్థంతో జీవిస్తున్నారు. దాని వలన మనశ్శాంతి కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఏదీ లేదు. ఈ సమాజానికి మేథావులు, శక్తివంతులు, ఆదర్శవ్యక్తులు ఎంత అవసరమో అంతకంటే గుణవంతులు ఎక్కువ అవసరం. అటువంటి గుణసంపద యువతీ యువకులు కలిగి ఉండాలి. సంస్కారం, సమగ్ర వ్యక్తిత్వం, సేవాగుణం ఈ కాలంలో ఉన్న యువతలో ఉండటం చాలా అవసరం.  మనిషి దిగజారితే పతనం అంటారు. ఈ పతనావస్థ స్థాయికి జారడం  చాలా సులభం. పతనావస్థకు జరినంత సులువు కాదు విజయం సాధించడమంటే. విజయం గురించి ఆలోచించటం మంచిదే కాని పతనం చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. గొప్పపేరు సంపాదించడం కంటే మంచితనం సంపాదించటం చాలా మేలు. వినయ విధేయతలతో కూడిన క్రమశిక్షణ అనేది ఈ కాలంలో యువతకు చాలా ముఖ్యం. తాము ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచన యువతలో ఉండాలి తప్ప ఈకాలంలో మనకు తీసుకోగలిగినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు సమాజంతో పని ఏంటి?? అనే ఆలోచనతో అసలు ఉండకూడదు.   ఈ దేశ భవిష్యత్తు అనేది యువతీ యువకులపై ఆధారపడి వుంది. అందుకే యువతకు ఓ బాధ్యత ఉందని,  యువత తాను చెయ్యవలసిన పనిని సక్రమంగా ఒక క్రమపద్ధతితో చేయాలని పెద్దలు చెబుతారు. ఏ పనిని అయినా సక్రమంగా చేయగలిగినట్లయితే తాను అభివృద్ధి చెందగలడు. అట్లాగే దేశాన్ని అభివృద్ధి చేయగలడు. ఇదీ యువతలో దాగున్న శక్తి. వ్యక్తిగత అభివృద్ధిపై దేశాభివృద్ధి ఆధారపడి వుంటుంది. దేశాభివృద్ధి అనేది ఆ దేశంలో నివసించే ప్రజల ఆర్థికాభివృద్ధిని బట్టి చెప్పవచ్చు. ఇకపోతే ఈ దేశానికి మూలస్థంబాలు అయిన యువత భవిష్యత్తు అంతా వారు విద్యావంతులు అవ్వడంలోనే ఉంటుంది. ఎంత కష్టపడి చదివితే అంత గొప్ప స్థాయికి చేరుకొగలరు అనే విషయాన్ని యువత ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. యువత కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇవి చెప్పటం చాలా సులభం కాని చెయ్యటం కష్టం. కానీ ఆర్థిక స్థోమత పెంచుకోవాలంటే కష్టపడటం అవసరమే అవుతుంది. సవాళ్ళను అధిగమించి అనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించగలిగినట్లయితే సంతృప్తి అనేది దానంతట అదే వస్తుంది. తృప్తికి మించిన సంపద ఇంకొకటి లేదు.  అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనిషి జీవితంలో ఉండాల్సిన గొప్ప గుణం ఏదైనా ఉందంటే అది తృప్తిపడటమే అని.                                         ◆నిశ్శబ్ద.