ఈ అలవాట్లు ఉంటే ఎంత సంపాదించినా చిల్లిగవ్వ మిగలదు.!

చాణక్య నీతి ఆచార్య చాణక్యుడి మాటలు తప్పు అని రుజువు కాలేదు. ఈ కారణంగానే నేటికీ చాలామంది చాణక్యుడి మాటలను అనుసరిస్తున్నారు. మీరు మీ జీవితంలో విజయం సాధించాలనుకుంటే, మీరు అతని విధానాల నుండి కొన్ని చిట్కాలను తీసుకోవచ్చు.ఆచార్య చాణక్యుడి తత్వానికి ప్రాచీన కాలం నుండి నేటి వరకు ప్రాముఖ్యత ఉంది. ఆచార్య చాణక్యుడి మాటలు ఎప్పుడూ తప్పు కాదంటారు. నేటికీ ప్రజలు దీనిని పాటించడానికి కారణం ఇదే.మీరు మీ జీవితంలో విజయం సాధించాలంటే, మీరు అతని సూత్రాల నుండి కొన్ని చిట్కాలను తీసుకోవచ్చు.అయితే కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదని చెప్పాడు చాణక్యుడు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. సోమరిపోతుల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు: ఆచార్య చాణక్యుడు ప్రకారం, సోమరితనం  ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేడు. అలాగే లక్ష్మీదేవి కూడా అలాంటి వారిని అనుగ్రహించదు.అలాంటి పరిస్థితిలో లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం కోరుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టాలి. పిసినారితనం: సహాయం చేయడంలో లేదా దానధర్మాలు చేయడంలో కఠోరమైన వ్యక్తి తన జీవితాంతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాడని చాణక్యుడి తత్వం చెబుతోంది. ఎందుకంటే దానధర్మాలతో సంపద పెరుగుతుందని చాణక్యుడు చెప్పాడు. దేవుడు కూడా సంతోషిస్తాడు. డబ్బు వృధా : చాణక్య నీతి ప్రకారం, తమ చెడు సమయాల కోసం డబ్బును పొదుపు చేయని, అనవసరంగా ఖర్చు చేసే వ్యక్తులు జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. అంతేకాదు, అలాంటి వారి జీవితం ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి డబ్బు విలువను గుర్తించాలి. అలాగే డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి.  

ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా.. విరాళానికి మీ చెయ్యి ముందుకు రావాలి!

భారతదేశం నా మాతృ భూమి.. భారతీయులందరు నా సహోదరులు.. ఈ మాట చిన్నప్పటి నుండి కంఠస్థం చేసినదే. అయితే సగటు సాధారణ పౌరుడు ఇలాంటి ప్రతిజ్ఞలలోనూ, మేరా భారత్ మహాన్.. అనో..  భారత్ మాతా కీ జై.. అనో నినాదాలు ఇస్తూ పైపైకి దేశ భక్తి చాటుకుంటారు. దేశం కోసం ఎవరైనా సైనికులు వీర మరణం పొందితే ఇతనే నిజమైన సైనికుడు, దేశ భక్తుడు అంటూ కీర్తిస్తారు. తప్పితే సగటు పౌరుడు ఇంకేమీ చెయ్యలేడు. కానీ ప్రతి పౌరుడు దేశం మీద తమకున్న భక్తిని చాటుకోవడానికి, దేశానికి తనూ సహాయం చెయ్యడానికి ఫ్లాగ్ డే ఆప్ ఇండియా సరైన రోజు. అసలేంటీ ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా? దీని చరిత్ర ఏంటి? భారతదేశ పౌరులు దీని సందర్భంగా ఏం చెయ్యవచ్చు? వివరంగా తెలుసుకుంటే.. ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా.. భారత్ ను తమ ప్రాణాలను పణంగా పెట్టి సంరక్షిస్తున్న మన దేశ సూపర్ హీరోల సహాయార్థం ఈ ఫ్లాగ్ డే ఆప్ ఇండియాను జరుపుకుంటారు. దేశానికి సేవలు అందించే నౌకాదళం, వైమానిక దళం, భారత సైన్యంలోని సైనికుల కోసమే దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మూడు శాఖలలోని సైనికులు దేశం కోసం పోరాడుతూ మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడానికి, వారికి ఆర్థిక సహాయం చెయ్యడానికి  ఈరోజున భారత జండాతో పాటు ముదురు నీలం, లేత నీలం, ఎరుపు రంగులలో ఉన్న చిన్న జెండాలను అందజేస్తారు. వీటిని అందుకున్నవారు బదులుగా డబ్బును విరాళంగా ఇస్తారు. ఈ జెండాను దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తారు. ఈ డబ్బును సైనికుల కుటుంబాల కోసం వినియోగిస్తారు. చరిత్రలో ఏముంది?  ఇది 1949, ఆగస్టు 29న ప్రారంభమైంది. అప్పటి భారత రక్షణ మంత్రి ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన  జెండా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం జెండాలను పంపిణీ చేయడం ద్వారా నిధులు సేకరించి ఆ నిధులను  సైనికుల కుటుంబాలకు సహాయంగా ఇవ్వాలని నిర్ణయించబడింది. భారత్ పౌరులు ఏం చేయవచ్చు.. ఈ నిధుల సేకరణ ముఖ్యంగా వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు సాధారణ పౌరులు బాధ్యత వహించే దిశగా సాగుతుంది. అమర వీరులకు, యుద్ద బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి కూడా ఈ నిధులు సేకరిస్తారు. భారత పౌరులు దేశంలో సురక్షితంగా జీవించడానికి దేశ సరిహద్దులలో సైనికుల  ధైర్యసాహసాలే కారణమని తెలుసుకోవాలి. ఇందుకోసం వారి కుటుంబాల పట్ల బాధ్యతగా ఉండాలి. తమకు తోచినంత మెరుగైన విరాళాలు ఇవ్వాలి. దేశానికి సైనికులు సేవ చేస్తే.. వారి కుటుంబాలకు అండగా ఉండగలమనే భరోసాను భారత పౌరులే  ఇవ్వాలి.                                                         *నిశ్శబ్ద.  

సెల్ఫ్ లవ్ ఎందుకు ముఖ్యం?

  సెల్ఫ్ లవ్ అంటే తమను తాము ప్రేమించుకోవడం. ప్రేమ అనేది ప్రతీ మనిషికి అవసరం. చాలామంది ఇంట్లో వారు, స్నేహితులు, తెలిసిన వారు ఇలా అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇలా ఎంత చేసినా వారిలో ఏదో అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. దీనికి కారణం సెల్ప్ లవ్ లేకపోవడమే. తనను తాను ప్రేమించుకోలేని వ్యక్తి ఇతరుల అవసరాలు తీర్చి వారిని సంతోష పెట్టగడేమో కానీ వారి దృష్టిలో ఖచ్చితంగా చులకన భావానికి లోనవుతాడు. దీనిక్కారణం తనకంటూ ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చుకోకపోవడమే. అసలు  జీవితంలో సెల్ఫ్ లవ్ ప్రాముఖ్యత ఏంటి? సెల్ఫ్ లవ్ వైపు ఎలా వెళ్లాలి? సెల్ఫ్ లవ్ ప్రతి వ్యక్తికి ముఖ్యం. ఇదే వ్యక్తికి గుర్తింపునిస్తుంది.  ఇతరులు గౌరవించేలా చేస్తుంది. నిజానికి సెల్ఫ్ లవ్ కలిగిన వ్యక్తులు ఇతరులకు ప్రేమను అందించగలుగుతారు. ఇతరుల నుండి ప్రేమను, గౌరవాన్ని పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే ఇతరులు మిమ్మల్ని ప్రేమిస్తారనే విషయాన్ని అస్సలు  అంగీకరించలేరు. నన్నెవరు ప్రేమిస్తారు? నన్నెవరు గౌరవిస్తారు?  అని తమను తాము చిన్నతనం చేసుకుంటారు. తమను తాము ప్రేమించుకునే వ్యక్తులు ఎప్పుడూ సంబంధాల విషయంలో నిజాయితీగా ఉండగలుగుతారు. ప్రేమ విలువను గుర్తించగలుగుతారు.  ఇతరులతో ప్రేమగా మాట్లాడగలుగుతారు. ఇవి  ప్రతి మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. తమను తాము ప్రేమించుకోవడం ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలకు పునాది వేస్తుంది.  ఎందుకంటేఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, సెల్ఫ్ లవ్ మొదలైనవి ఒకదానితో ఒకటి ముడి పడి ఉంటాయి. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకుంటే ఇతరులతో బంధాలకు విలువ ఇవ్వడంలోనూ, ఇతరులను అర్థం చేసుకోవడంలోనూ ఎలాంటి పొరపాట్లు చేయరు. దీనివల్ల బంధాలు దృఢంగా ఉంటాయి. సెల్ఫ్ లవ్ అనేది తన గురించి తాను కేర్ తీసుకోవడంలోభాగం. ఇతరులేమన్నారు, ఇతరులు ఏమంటున్నారు? ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతూ ఉంటే  వ్యక్తి ఒత్తిడికి లోనవుతారు. అదే తమను తాము ప్రేమించుకుంటే స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. తమకు మంచి ఏది? చెడు ఏది? అనే విషయాలను గుర్తించి మంచిని తీసుకుని చెడును వదిలి ముందుకు సాగుతారు. అన్నింటికంటే ముఖ్యంగా స్వీయ ప్రేమ కలిగినవారు నిజాయితీగా ఉంటారు. ఇతరులతో కూడా అంతే నిజాయితీగా ఉండగలుగుతారు.  ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నిజాయితీని పాటిస్తారు.  ఇది లేకపోతే వ్యక్తులలో నటన, అబద్దాలు ఆడటం, బ్యాలెన్సింగ్ లేకపోవడం జరుగుతుంది.                                             *నిశ్శబ్ద.  

పిల్లలతో తల్లిదండ్రుల సంభాషణ ఎందుకంత ముఖ్యం.

నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. పిల్లల గురించి ఎవరైనా ఏదైనా వాక్యం చెప్పమంటే మొదట ఇదే చెబుతారు. ఆ తరువాత పిల్లల్లో దేవుడుంటాడని కూడా చెబుతారు. పిల్లలు పుట్టినప్పుడు చాలా అపురూపంగా చూసుకుంటాం. ఏడుస్తుంటే ఆకలేస్తుందేమో అని కంగారు పడతాం.  స్థోమతను బట్టి మంచి మంచి బట్టలు వేసి వారిని చూసి మురిసిపోతాం. బొమ్మలు కొనివ్వడం నుండి అడిగిన దానికల్లా తల ఊపుతాం. వారిని అంత ప్రేమగా పెంచి.. మూడు నాలుగేళ్లు నిండగానే ఇక వారి గురించి అంతగా పట్టించుకోవడం మానేస్తాం. చాలా మంది ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకు అన్నీ ఇస్తున్నాం, అన్నీ సమకూరుస్తున్నాం, లోటు చేయడం లేదు కదా అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పని, వారికి అడిగిందల్లా ఇవ్వడం కాదు ప్రేమను పంచాలని, పసి మనసుల్లో బరువు దించాలని, వారితో మాట్లాడాలని పిల్లల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, కౌన్సెలింగ్ నిపుణులు చెబుతున్నారు. పిల్లలతో తల్లిదండ్రుల అనుబంధం ఎలా ఉండాలి?  పిల్లలకు కావాల్సిందేమిటి? పిల్లలతో సంభాషణ ఎందుకంత ముఖ్యం?  వంటి  విషయాల గురించి చర్చించేందుకు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బంధాన్ని దృఢంగా మార్చేందుకు ప్రతి ఏడాది డిసెంబర్ 5 వ తేదీన పిల్లలతో సంభాషణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని ప్రకారం పిల్లలతో తల్లిదండ్రులకు ఉండాల్సిన అనుబంధం గురించి మరింత అవగాహన కల్పిస్తారు. బిజీ జీవితాలు గడిపే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా చేతులారా వైఫల్యాలకు గురిచేస్తారో వారికర్థమయ్యేలా చెప్పడం, పిల్లల విషయంలో వారు ఎలా ఉండాలో తెలియజేయడం, వారి మనసు పొరల్లో ఉన్న సందేహాలు, భయాలు, అపోహలను నివృత్తి చేయడం ఈరోజు ఉద్దేశం. పిల్లలతో ఎందుకు మాట్లాడాలి? తల్లిదండ్రులు పిల్లలను గొప్పగా పెంచాలని అనుకుంటారు. అందుకోసమే బోలెడంత డబ్బు ఖర్చు చేస్తారు. నిజానికి పిల్లలకోసం డబ్బు ఖర్చు చేయడం కాదు, వారితో మాట్లాడితే పిల్లలు జీవితంలో విజయం సాధిస్తారు. ఉత్తమ పౌరులుగా  మారుతారు. ఎందుకంటే సంభాషణలోనే వారి భవిష్యత్తు నిర్మాణమవుతుంది. పిల్లలతో మాట్లాడే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనుబంధం చాలా దగ్గరగా, స్నేహభావంతో ఉంటుంది. పిల్లలు కొన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడతారు. కొన్ని చెబితే ఏమనుకుంటారో అని సందేహంతో ఉంటారు. కొన్ని విషయాలు అడిగితే తల్లిదండ్రులు కోపం చేసుకుంటారేమో అని చెప్పలేరు. తల్లిదండ్రులు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం. వాళ్లు రక్తం పంచుకుపుట్టిన పిల్లలు. వారికంటే బయటి ప్రపంచం, డబ్బు, విలాసాలు ఏవీ ముఖ్యం కాదు.  అందుకే వారితో మాట్లాడుతుంటే తల్లిదండ్రులే తమకు గొప్ప స్నేహితులు అని భావిస్తారు. పిల్లలతో ఏం మాట్లాడాలి? పిల్లలతో ఏం మాట్లాడాలనే డైలమా చాలామంది తల్లిదండ్రులలో ఉంటుంది. అయితే పిల్లతో మాట్లాడటానికి వారిలో పరిణితి పెంచడానికి, వారిని ఆలోచించేలా చెయ్యడానికి చాలా అంశాలున్నాయి. పిల్లలు ఇంట్లో,  స్కూల్ నుండి రాగానే, స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు. చాలా  సందర్బాలలో బోలెడు అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారు ఏ విషయాల మీద ఎక్కువ ఆసక్తిగా ఉన్నారో గమనించాలి. వాటి గురించి పిల్లలతో మాట్లాడాలి. అందులో తప్పొప్పులు వారితో చర్చించాలి. దీనివల్ల పిల్లలో ఆలోచనా సామర్థ్యం, అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.  చాలామంది తల్లిదండ్రులు  పిల్లలు స్కల్ నుండి పిల్లలు ఇంటికి రాగానే.. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అని అడుగుతారు. పిల్లలు కూడా చాలావరకు అల్లరి చేయడం స్కూల్లో పనిష్మెంట్ కు గురికావడం జరుగుతూ ఉంటుంది. ఈ  విషయం చెప్పేటప్పుడు పిల్లలు నిరాశగా, బాధగా ఉంటారు. అదే ఈ ప్రశ్న కాకుండా వేరే ప్రశ్నలు అడిగితే పిల్లలు సంతోషిస్తారు. ఎంతో ఉత్సాహాంతో తల్లిదండ్రులతో మాట్లాడతారు. ఈరోజు స్కూల్లో ఏ పని బాగా చేశావనో..  క్లాసులో జరిగిన సరదా సంఘటన ఏంటనో.. అడగాలి. ఇవే కాకుండా.. ఏ సబ్జెక్ట్ కష్టంగా అనిపించిందని, మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఎలా ఉందని కూడా అడగచ్చు. వీటి వల్ల పిల్లలు సంతోషంగా సమాధానాలు ఇస్తారు. పిల్లలను నొప్పించిన సంఘటనలు ఏవైనా ఉన్నా నోరువిప్పి చెబుతారు.  దానివల్ల పిల్లలకు ఏ విషయాన్ని దాపరికం లేకుండా చెప్పడం అలవాటు  అవుతుంది. స్నేహితుల గురించి, స్నేహితులతో జరిగే సంఘటనల గురించి వారితో సాన్నిత్యం, గొడవలు మొదలైనవన్నీ అడగాలి. ఎవరు బాగా స్నేహంగా ఉంటారో, వారు ఎలా చదువుతారో, వారు ఎలాంటి వారో అడిగి తెలుసుకుంటూ ఉంటే స్నేహం వల్ల పిల్లలు తప్పు దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడవచ్చు. పిల్లలు తప్పు చేస్తే ఎప్పుడూ దండించకూడదు. వాటికి తగిన ఉదాహరణలు చెబుతూ వారు చేస్తున్న తప్పుల వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వివరించాలి. అంతే..  పిల్లలు ఆ తరువాత ఎప్పుడూ తప్పు చెయ్యలేరు. దగ్గర కూర్చుని చెప్పే మాటలు మనసును తాకుతాయి. అదే కోపంగా చెప్పేమాటలు వారి అహాన్ని దెబ్బ కొడతాయి. అందుకే కోపంతో ఎప్పుడూ ఏదీ చెప్పకూడదు. అది భయాన్ని పెంచుతుందే కానీ వారి మనసును మార్చదు.                                          *నిశ్శబ్ద.  

కౌగిలింతలకు ఇన్ని అర్థాలున్నాయా?

కౌగిలి ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక బంధాన్ని తద్వారా మానసిక బంధాన్ని కూడా బలపరుస్తుంది. ముఖ్యంగా జీవిత  భాగస్వాములు ఒకరినొకరు కౌగిలించుకోవడం వల్ల వారి మనసులో ఉన్న విషయాలను బయటకు తెలియజేస్తుంటారు. ఒక గట్టి కౌగిలి భాగస్వాముల మధ్య ఉండే అపార్దాలను, కోపతాపాలను, పొరపొచ్చాలను మాయం చేస్తుంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా భాగస్వాములు  కౌగిలించుకోవడం మంచిదేనని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతున్నారు. అయితే కౌగిలి లోనూ రకాలున్నాయని. వాటికి బోలెడు అర్థాలున్నాయని తెలిసింది. ఇంతకీ ఎలా కౌగిలించుకుంటే ఏమర్థమో తెలుసుకుంటే.. ఎదురుగా భుజం మీద వాలి కౌగిలించుకుంటే.. ఒకరికొకరు ఎదురుగా కౌగిలించుకున్నప్పుడు జీవిత భాగస్వామి భుజం మీద తలను పెట్టుకోవడానికి ఇష్టపడితే వారు ప్రేమను ఆశిస్తున్నట్టు.  ఇద్దరి మధ్య అవగాహన, అర్థం చేసుకునే గుణం మెండుగా ఉన్నట్టు. ఇది ఒకానొక సురక్షిత భావనను అందిస్తుంది. వెనుక నుండి కౌగిలించుకుంటే.. వెనుక నుండి కౌగిలించుకోవడం వల్ల భార్య లేదా భర్త చాలా  మిస్సవుతున్నారని అర్థమట. అదే విషయాన్ని చెప్పడానికి వెనుక నుండి కౌగిలించుకుంటారట.  ఒకవేళ ఎప్పుడూ ఇలాగే కౌగిలించుకుంటూ ఉంటే ఎప్పుడూ ప్రేమను కోరుకుంటున్నారని అర్థమట. భుజాలను పెనవేసుకుని కౌగిలించుకుంటే.. భుజాలను పెనవేసుకుని కౌగిలించుకుంటే ఆ కౌగిలిలో ప్రేమ, నమ్మకం పాళ్లు ఎక్కువ ఉన్నాయని అర్థం. అలాగే ఆ భాగస్వాముల మధ్య శృంగార జీవితం కూడా బాగా ఉన్నట్టు. ఈ కౌగిలి ద్వారా ఇద్దరి మధ్య రొమాంటిక్  ఫీలింగ్ మరింత పెరుగుతుంది. గట్టి కౌగిలి.. జీవిత భాగస్వాములు ఒకరినొకరు దగ్గరగా, గట్టిగా రెండు చేతులతో కౌగిలించుకుంటే వారిద్దరూ ఒకరికొకరు దగ్గరగా ఉండాలని, ఎప్పటికీ విడిపోకూడదని కోరుకుంటున్నారని అర్థం. ఒకరినొకరు తీవ్రంగా  ఇష్టపడటం ఈ కౌగిలి  తెలుపుతుంది. ఒక చేత్తో కౌగిలించుకుంటే.. ఒక చేత్తో కౌగిలించుకుంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్నేహ భావాన్ని సూచిస్తే.. రెండోది బహిరంగంగా కౌగిలించుకోవడం ఇష్టం లేదని తెలపడం. ఇది నిబద్దతకు, సామాజిక అవగాహనకు సంబంధించినది.                                            *నిశ్శబ్ద.  

కాలుష్యపు కోరలను తుంచివేయాలి!

కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన అతిపెద్ద సమస్య. సరిగ్గా గమనిస్తే మనిషి పూర్తీగా కాలుష్యపు వలయంలో నివసిస్తున్నాడు. అందమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం, గాలిలో నాణ్యత అనేవి మచ్చుకైనా కనిపించవు. పట్టణీకరణ అభివృద్ది చెందేకొద్దీ వాతావణ కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో మొబైల్, ఒక్కొక్కరికి ఒక్కో బైక్, అదనంగా అందరూ కలసి బయటకు వెళ్లడానికి కారు.. ఇలా చెబుతూ పోతే వాహనాల రద్దీ కారణంగా వాతావరణం కలుషితం అవుతోంది. ఇక వ్యాపారాల కారణంగా ఏర్పడిన ఫ్యాక్టరీలు.. వాటి నుండి వెలువడే పొగ కారణంగా గణనీయంగా గాలి కాలుష్యం, ఫ్యాక్టరీ వ్యర్థాల కారణంగా నీటి కాలుష్యం కూడా జరుగుతోంది. కనీసం మనిషి చేతుల్లో నియంత్రించగలిగిన వాటిని కూడా నియంత్రించకుండా చాలావరకు ప్రజలే వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. వీటన్నింటి గురించి చర్చించి వాతావరణ కాలుష్య కాలుష్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేయాలని ప్రతి ఏటా డిసెంబర్ 2వ తారీఖున ప్రపంచ వాతావరణ కాలుష్య నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజు చరిత్ర, దీని ప్రాధాన్యత, ప్రజల భాద్యత మొదలైన విషయాలు తెలుసుకుంటే.. పర్యావరణ కాలుష్యం  ప్రజల ఆరోగ్యం,  భూమిపై దాని ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఈ కారణంగా ఈ భూమితో పాటు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.  ప్రపంచాన్ని కబళిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది  ప్లాస్టిక్ కాలుష్యం. నేల నాణ్యతను దిగజార్చడం నుండి సముద్ర జీవులను చంపడం వరకు ప్లాస్టిక్ కాలుష్యం దారుణంగా ఉంటుంది. ఇది  త్వరలోనే ప్రజల ఉనికికి కూడా శాపంగా మారే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్యసమితి (UN), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), గ్రీన్‌పీస్  సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు కాలుష్యాన్ని నియంత్రించడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను కోరుతున్నాయి. అయితే బాధ్యత మన ప్రభుత్వాలపై మాత్రమే  ఉందని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ప్రభుత్వాలు, ప్రతినిధులు మాత్రమే ముందుకు వచ్చి చేస్తే పరిష్కారమయ్యే సమస్య కాదు ఇది.  పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయడానికి  ప్రజలే  ముందుకు రావాలి. పరిశోధనలు  వివిధ సర్వేల ఆధారంగా, వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తోందని అంచనా వేయబడింది, అయితే ఇది తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, ఇటీవలి సంవత్సరాలలో వాయు కాలుష్యం కారణంగా మరణాల రేటు బాగా పెరిగింది. వాతావరణంలోని మార్పులే కాకుండా కరోనా వంటి దారుణమైన దాడుల తర్వాత చాలామంది ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయింది. ఈ కారణంగా ప్రజలు చిన్న చిన్న సమస్యలకే మరణాలకు లోనవుతున్నారు. ఎక్కువశాతం మంది శ్వాస సంబంధ సమస్యలతోనే మరణిస్తున్నారు. దీని కారణంగా, WHO భారతదేశం, బంగ్లాదేశ్, ఖతార్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్,మంగోలియా వంటి కొన్ని దేశాలకు కఠినమైన గాలి నాణ్యత నిబంధనలను విధించింది. మనలో చాలా మందికి మనం తీసుకోగల నివారణ చర్యల గురించి తెలుసు,కానీ వాటిని పాటించము. సమస్య మనది కాదులే అనే నిర్లక్ష్యం చాలామందిలో ఉంటుంది. మొక్కలను నాటడం, సరైన స్థలంలో చెత్తను వేయడం, ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేయడం, పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను ఉపయోగించడం. పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ప్రకృతి సంపదను పెరిగేలా చేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. కానీ దీన్ని పాటించేవారు తక్కువ. తెలిసిన వారికే కాదు.. తెలియని వారికి అజ్ఞానంలో  ఉన్నవారికి కూడా  జ్ఞానోదయం చేయాలి. కాలుష్యం  వల్ల ఎదురయ్యే  ప్రాణాంతక పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, పరిస్థితి  తీవ్రతను తెలియజేయాలి. అంతేకాకుండా  వీటిని ఇంటి నుండే ప్రారంభించాలి. కాబట్టి మీరు మీ పిల్లలు,  యువ తరానికి స్థిరమైన భవిష్యత్తును సృష్టించాలనుకుంటే, వాతావరణాన్ని కాపాడే విషయంలో ఎలాంటి జాప్యం చేయకూడదు. ఇతరులు చేయట్లేదు మనమెందుకు చేయాలనే వాదాన్ని పక్కన పెట్టి  మీకు మీరుగా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రకృతి సంపదను పెంచడానికి కృషి చేయాలి. ఇలా చేస్తే సగటు పౌరుడిగా సమాజం కోసం తమ వంతు కృషి చేసినట్టే.                                                    *నిశ్శబ్ద.  

మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ విషయాలను మర్చిపోవద్దు..!

చాణక్య నీతి శాస్త్రంలో జీవితంలోని ప్రతి అంశం చక్కగా వివరించబడింది. ఆచార్య చాణక్యుడు తన జీవిత అనుభవాల ద్వారా వృత్తి, స్నేహం, వైవాహిక జీవితం, సంపద, విద్య, వ్యాపారం మొదలైన అన్ని విషయాలపై నైతిక పాఠాలను అందించాడు. ఇదిలా ఉంటే పెళ్లి గురించి ప్రస్తావించాడు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా వివరించాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. అది జీవితాంతం ఉండే అనుబంధం. వైవాహిక జీవితం సాదాసీదాగా, ప్రేమగా ఉండాలంటే ఇరువైపులా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పరస్పర సామరస్యం,  ప్రేమపై ఆధారపడిన సంబంధం మాత్రమే బలపడుతుంది. కాబట్టి చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఏ అంశాలు దారితీస్తాయో ఇక్కడ వివరాలు ఉన్నాయి. చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఒకరికొకరు సహచరులు, పోటీదారులు కాదు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, భార్యాభర్తలిద్దరూ కలిసి ముందుకు సాగడం ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే రెండు సమస్యలనూ ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చేసి పరిష్కరించుకోవాలి. ఆచార్య చాణక్య ప్రకారం ప్రతి సంబంధానికి వారి వ్యక్తిగత పరిమితులు ఉంటాయి. అదేవిధంగా, భార్యాభర్తల మధ్య కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ మూడవ వ్యక్తికి చెప్పకూడదు, లేకుంటే వారి పరస్పర సంబంధంలో చీలిక ఉండవచ్చు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి అవసరాలను ఒకరు చూసుకోవాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, మనం ఒకరి భావాలను గౌరవించుకోవాలి. మద్దతు ఇవ్వాలి.  మీ వైవాహిక జీవితం విజయవంతంగా ముందుకు సాగాలంటే , భార్యాభర్తలు ప్రతి విషయంలోనూ ఓపిగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మీ సంబంధంలో చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్నేహపూర్వక దృక్పథం ఉండాలి. సంబంధం ఒకరికొకరు మద్దతు ఇచ్చే స్నేహితులలా ఉండాలి. ఇద్దరి మధ్య సమానత్వ భావన ఉంటే ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు.

ఎదుటివారిని సంతోషపెట్టడమనే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే

ఎదుటివారిని సంతోషపెట్టడమనే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే.. సంతోషం సగం బలం అని అంటారు. మనం సంతోషంగా ఉంటే సరిపోదు, మనవాళ్లన,  ఇతరులను కూడా సంతోషపెట్టాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత అని చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది మంచి విషయమే అయినా ఇలాంటి అలవాటు క్రమంగా మనిషి దుఃఖానికి కూడా కారణం అవుతుందంటున్నారు రిలేషన్ షిప్ కౌన్సిలర్లు. దీనికి కారణం ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసం తాపత్రయపడేవాళ్ల గురించి పట్టించుకునేవారు బహుశా తక్కువే ఉంటారు. మరికొందరు ఇలాంటివారి సంతోషాన్ని కూడా అణిచివేయాలని, చిదిమేయాలని చూస్తారు. దీనికి కారణం తమను పట్టించుకోకుండా వ్యక్తిగత సంతోషం గురించి ఆలోచిస్తారేమో అనే అనుమానంతో కూడిన స్వార్థం. ఇతరుల సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారు భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడతారు. తమకంటూ ఎలాంటి వ్యక్తిగత ఆనందాలు ఏర్పరచుకోలేరు. ఇతరుల సంతోషం కోసం ఆరాటపడే అలవాటు మార్చుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే  ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సంతోషం అవసరం. ఈ అలవాటు ఎలా మార్చుకోవాలంటే.. కాదని చెప్పడం నేర్చుకోవాలి.. ఎవరైనా ఏదైనా అడిగితే కాదని చెబితే వారు బాధపడతారేమోననే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన ఇలాంటి వారు తమకు నష్టం కలిగినా, తమకు ఇబ్బంది ఉన్నా ఇతరులకు కాదని చెప్పకుండా అనవస ప్రయాసలు పడుతుంటారు. చిన్న విషయాలలో ఇలా ఉన్నా పర్లేదు.. కానీ పెద్ద పెద్ద విషయాలలో మాత్రం ఇలాంటి మొహమాటపు బరువు మీద వేసుకోకూడదు. ఏ పని అయినా చేసే ఉద్దేశ్యం లేకపోయినా, వీలు లేకపోయినా, తెలియకపోయినా నావల్ల కాదు అని స్పష్టంగా చెప్పడం మంచిది. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మంచిదని పెద్దలు చెప్పిన మాట మరవకూడదు. సరిహద్దు గీతలుండాలి.. ఇతరులు అతి చనువుగా దగ్గర చేరి స్వార్థంతో పనులు చేయించుకుంటారు. మీ సమయాన్ని చాలా ఈజీగా లాక్కుంటారు. ఆ పనులన్నీ అయ్యాక కోల్పోయిన సమయం గుర్తొచ్చినప్పుడు, వ్యక్తిగతంగా నష్టపోయనప్పుడు తప్ప  తాము చేసిన పని పర్యావసానం అర్థం కాదు చాలామందికి. కొందరైతే తమ అవసరాలు ఖచ్చితంగా తీరాల్సిందేనని బలవంతం చేస్తారు. ఎమోషన్ బ్లాక్మెయిల్ కు కూడా వెనుకాడరు. అందుకే ప్రతి ఒక్కరినీ ఒక్క సరిహద్దు గీత వద్దే ఉంచాలి. మార్పు సాధ్యమే.. ఇతరులను సంతోషపెట్టడమనే అలవాటు వల్ల నష్టాలు ఎదుర్కొన్నా సరే కొందరు అంత ఈజీగా మారలేరు. మారాలని అనుకుని  తరువాత మళ్లీ మామూలైపోయేవారు ఉంటారు. కానీ ఈ అలవాటు మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటూ వాటిలో లీనమైపోవడం మంచిది. దీనివల్ల ఇతరులు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు పనులున్నాయని చెప్పడానికి వీలవుతుంది. పైపెచ్చు మీ జీవితంలో అభివృద్ది కూడా మొదలవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎవరితో అయినా ఏదైనా మాట్లాడుతున్నా మరీ మెతకగా మాట్లాడకూడదు. "నో" అనే మాట చెప్పడానికి సంకోచించకూడదు. చాలా ధృడంగా ఆ మాట చెప్పాలి. లేదంటే స్వార్థపరులు ఆ మాటను కూడా చాలా సిల్లీగా కొట్టిపడేసి తమ అవసరాలు తీర్చమని ఫోర్స్ చేస్తారు. వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని గుర్తించాలి.. ఇతరుల కోసం బ్రతుకుతూ ఇతరులను సంతోషపెట్టేవారు ఎక్కువగా తమ ఇష్టాలను, వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే తమకంటూ ఇష్టాలు, వ్యక్తిగత జీవితం ఉన్నాయనే విషయాన్ని గుర్చించరు. కానీ వాటిని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీస్ లో కొలీగ్స్, బంధువులు ఇలా అన్నిచోట్లా మీకు ఇష్టాఇస్టాలను వ్యక్తపరచడం, నచ్చని వాటిని నచ్చలేదని చెప్పడం అలవాటు చేసుకోవాలి. మీకంటూ స్వంత అభిప్రాయాలు, నిర్ణయాలు ఉన్నాయని ఇతరులు గుర్తించేలా మీరే చేయాలి.                                                      *నిశ్శబ్ద

ఇలాంటి వారితో స్నేహం చేస్తే మీ కెరీర్ నాశనమే..

ప్రతిమనిషి జీవితంలో బంధాలు, అనుబంధాలతో పాటు కెరీర్ గురించి కూడా శ్రద్ద పెడతాడు. నిజానికి బంధాలు అనుబంధాలు అనేవి కాలంతో పాటూ కొత్తగా కూడా పుడతాయి. కానీ కెరీర్ అనేది చాలా ముఖ్యం. ఏ వయసులో చెయ్యాల్సిన పని ఆ వయసులో చెయ్యకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. చదువు..  ఉద్యోగం.. ఈ రెండూ జీవితంలో ఎంత బాగా బ్రతకగలం అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. ఇవి రెండూ బాగుండాలన్నా ఆ తరువాత జీవితం సజావుగా సాగాలన్నా జీవితంలో నమ్మకమైన మనుషులతో స్నేహం అవసరం. ఎందుకంటే జీవితంలో అన్ని విషయాలను స్నేహితులతో పంచుకుంటారు. ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో ఆచార్య చాణక్యుడు  నొక్కి చెప్పాడు. చాణక్యనీతిలో ఎవరిని నమ్మకూడదని చెప్పాడంటే.. ఆయుధాలు ఉపయోగించే వ్యక్తులను అస్సలు నమ్మకూడదు. కత్తులు, పిస్టల్, ఇతర ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నవారు ఎక్కువ కోపం స్వభావం కలిగినవారై ఉంటారు. వీరికి కోపం వస్తే కొన్నిసార్లు ముందు వెనుక ఆలోచించకుండా ప్రమాదం తలపెడతారు. అందుకే ఆయుధాలు ఉన్నవారితో దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. బలవంతులతో స్నేహం ఎప్పటికైనా ముప్పేనని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే బలవంతులు తమ స్వార్థం కోసం మనుషుల్ని ఉపయోగించుకుంటారు. అది పెద్ద తప్పేం కాదనే వాదనలో ఉంటారు. వారి కారణంగా జీవితంలో ముఖ్యమైన కాలాన్ని నాశనం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. బలవంతులు అంటే డబ్బు మదం కలిగినవారు. చెడు అలవాట్లున్న ఆడవారిని నమ్మడం కూడా ఇబ్బందులలో అడుగేసినట్టేనట. తమ సంతోషం కోసం, సుఖాల కోసం, అవసరాల కోసం భర్తను, పిల్లల్ని, కుటుంబాన్ని వదిలేసే మహిళలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనిషిలో ఎలాంటి ఆలోచనలున్నాయో, వారు ఎప్పుడేం చేస్తారో తెలియనప్పుడు వారితో ఉండటం అస్సలు మంచిది కాదు. ఇలాంటి ఆడవాళ్లు బాగా నాటకీయంగా ఉంటారు. హింస ప్రవృత్తి కలిగిన వారికి దూరంగా ఉంటే చాలా మంచిది. హింసను చూసి ఆనందపడేవారు చివరికి మిమ్మల్ని కూడా హింసిస్తూ పైశాచికానందం పొందే అవకాశం లేకపోలేదు. ఇతరుల మీద అసూయను, ఇతరుల ఎదుగుదలను చూసి ఎప్పుడూ కుళ్లుకునేవారితో స్నేహం కూడా మంచిది కాదు. అలాంటి వారు ఇతరులు ఎదిగితే చూడలేరు. స్నేహమనే పేరున్నా సరే.. మీరు ఎదిగినా కూడా ఓర్చుకోలేరు.                                          *నిశ్శబ్ద.

మీ ప్రేమ జీవితం సక్సెస్ కావాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించాల్సిందే..!

మానవ జీవితానికి సంబంధించి చాణక్యుడు,  మనకు అనేక విషయాలను బోధించాడు ఇవన్నీ కూడా కౌటిల్యుని శాస్త్రంలో పొందుపరిచారు.  మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు చాణక్యనీతి మార్గం చూపిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, ఆర్థికవేత్త, అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన విధానాలు ప్రజల మనోధైర్యాన్ని పెంచేలా పనిచేస్తాయి. చంద్రగుప్త మౌర్యుని గురువుగా ఉన్న చాణక్యుడు కూడా ప్రేమ గురించి చాలా విషయాలు చెప్పారు. అందుకు సంబంధించిన నాలుగు విషయాలు తెలుసుకుందాం. భాగస్వామి పట్ల గౌరవం: తన ప్రేయసిని లేదా భార్యను గౌరవంగా చూసే వ్యక్తి తన సంబంధాన్ని ఎప్పటికీ విడగొట్టుకోలేడని చాణక్యుడు తన విధానంలో చెప్పాడు. అలాంటి వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. ప్రేమలో నిజాయితీ: తన ప్రేమను పూర్తి నిజాయితీతో నెరవేర్చుకునే వ్యక్తి అంటే మరొక స్త్రీ వైపు చూడని వ్యక్తి, అతని సంబంధం ఎప్పుడూ విచ్ఛిన్నం కాదు. దీనికి విరుద్ధంగా, ఒక వ్యక్తి తన భాగస్వామి కాకుండా మరే ఇతర స్త్రీ గురించి తన మనస్సులో తప్పుగా భావించినా అతని ప్రేమ విజయవంతం కాదు. ఆనందం: చాణక్య నీతి ప్రకారం, తన జీవిత భాగస్వామికి  మానసిక ఆనందాన్ని అందించే వ్యక్తియే శారీరక సంతృప్తిని కూడా అందిస్తాడు. అలాంటి వారికి వైవాహిక జీవితంలో ఎప్పుడూ అడ్డంకులు లేవు. భాగస్వామికి భద్రత:  తన భార్యను సురక్షితంగా ఉంచే వ్యక్తితో అతడి ప్రేమ జీవితం కూడా చక్కగా సాగుతుంది. ఒక స్త్రీ తన భర్తలో తన తండ్రి రూపాన్ని చూసుకుంటుంది.  అలాగే స్త్రీ  తన భాగస్వామి  ఒక తండ్రి లాగా రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది.  అంతే కాదు తాను ఎక్కడికి వెళ్లినా తనకు ఎలాంటి పరిస్థితి వచ్చిన తన భర్త తోడు ఉండాలని ఆమె ఆశిస్తుంది.

ప్రశాంతమైన జీవితానికి పది సూత్రాలు..

ఈకాలంలో డబ్బు అయితే ఈజీగా సంపాదించగలుగుతున్నారు కానీ ప్రశాంతతను సంపాదించుకోలేకపోతున్నారు. ప్రశాంతత లేనిదే సంతోషాలుండవు.  ఒకవేళ జీవితంలో సంతోష క్షణాలు వచ్చినా అవి దీర్ఘకాలం ఉండవు. సంతోషాలు జీవితంలో ఉన్నా వాటిని అనుభూతి చెందలేరు. అందుకే ఎవరు చూసినా జీవితంలో ప్రశాంతత కరువైందని అంటూ ఉంటారు. కానీ ప్రశాంతత కావాలంటే జీవితంలో కొన్ని మార్పులు, కొన్ని నిజాలు, కొంత అవగాహన చాలా ముఖ్యం. ప్రశాంతమైన జీవితం సొంతం కావాలంటే ఈ కింది పది సూత్రాలను తూ.చా తప్పకుండా పాటించాలి.  అప్పుడు ప్రశాంతత కరువైందిరా బాబూ.. అని గోడు వెళ్లబోసుకోనక్కర్లేదు. ఇంతకీ ఆ సూత్రాలేంటో చూస్తే.. నేనేదీ ప్లానింగ్ చేసుకోను, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ నిజానికి నేటికాలంలో వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని, చిన్న చిన్న సంతోషాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటే ప్లానింగ్ ముఖ్యం. ఉదయం నుండి రాత్రి వరకు ఆఫీసు పని నుండి ఇంట్లో పనుల వరకు.. ప్రణాళికా బద్దంగా పూర్తీ చేస్తుంది ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ అయిపోయి మిగిలిన కొద్దో గొప్పో సమయం మీద ప్రభావం ఉండదు.  లోతుగా చేసే శ్వాస వ్యాయామాలు ఒత్తిడి  మీద మంత్రంలా పనిచేస్తాయి. ప్రతిరోజూ వీటిని ఫాలో అవుతుంటే చాలు ఏ పని చేయాలన్నా కంగారు, హడావిడి లేకుండా చెయ్యగలుగుతారు. శ్వాస వ్యాయామాల పుణ్యం  మంచి ప్రశాంతత చేకూరుతుంది. కేవలం శ్వాస వ్యాయామాలే కాదు శారీరక వ్యాయామాలు కూడా అవసరం. శారీరక వ్యాయామం వల్ల శరీరంలో ఎండార్పిన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.  ఇప్పట్లో శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలు ఏమీ లేవు, దీని కారణంగా చాలా తొందరగా శరీరాలు బలహీనం అవుతున్నాయి. హార్మోన్ల స్థితిలో మార్పు,  అవయవాల సామర్థ్యం తగ్గడం జరుగుతున్నాయి. అందుకే ప్రతిరోజూ కనీసం 30 నుండి 60 నిమిషాల వ్యాయామం చెయ్యాలి. ధ్యానం మనిషిని అంతర్గతంగా రిపేర్ చేస్తుంది. మనసు నుండి శరీర అవయవాల వరకు ధ్యానం చేకూర్చే మేలు అంతా ఇంతా కాదు. గుండె ఆరోగ్యం, మానసిక ఒత్తిడి మొదలైన వాటిపై ప్రభావవంతంగా ఉంటుంది. మనసును నియంత్రిస్తుంది. తద్వారా ప్రశాంతత చేకూరుస్తుంది. మనిషి ప్రశాంతతలో నిద్ర కూడా కీలకమైనది. చక్కని నిద్ర మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  ప్రతిరోజూ కనీసం 7-8 గంటల మంచి నిద్ర బోలెడు రోగాలను దూరం చేస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలామంది ఒత్తిడిగా ఉన్నప్పుడు, పనులు చకచకా జరగాలన్నా కాఫీ, టీ తాగి చురుగ్గా మారతారు. కానీ ఇవి తాత్కాలికంగా ఒత్తిడిని తగ్గిచ్చినట్టు అనిపిస్తాయి కానీ వీటిలో కెఫిన్ మానసిక సమస్యలు పెంచుతుంది. కాఫీ టీ బదులు, లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం, మరీ ముఖ్యంగా హెర్బల్ టీలు ప్రశాంతతను చేకూరుస్తాయి. చాలామంది ఎమోషన్ గా ఉంటుంటారు. కానీ ఎమోషన్స్ పెంచుకోవడం జీవితంలో దుఃఖానికి కారణం అవుతుంది. ఆర్థిక నష్టాలు అయినా, వ్యక్తిగత విషయాలు అయినా నిరాశ పరిస్తే వాటిని ఒక అనుభవంగా తీసుకోవాలి. ఇలాంటి వారు దాదాపుగా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఆఫీస్ లో ఎంతో బాగా పనిచేస్తున్నాం కానీ గుర్తింపు లేదు, ఇంట్లో అందరి విషయంలో బాధ్యతగా ఉంటున్నాం కానీ గౌరవించరు. అందరికీ సాయం చేస్తుంటారు కానీ ఎవరూ పొగడరు. అందరితో మంచిగా ప్రేమగా ఉంటాం కానీ ఎవరూ మనల్ని తిరిగి అలా ట్రీట్ చేయరు. చాలామంది జీవితాల్లో జరిగేవి ఇవి.  జీవితం గురించి  అర్థం చేసుకునేవారు వీటిని పట్టించుకోరు. ఇతరుల నుండి ఏమీ ఆశించరు. కానీ కొందరు మాత్రం ప్రతి పని నుండి గుర్తింపో, ఆర్థిక లాభమో ఆశిస్తారు. ఇలాంటి వారే ప్రశాంతతకు దూరం అవుతారు. ఆఫీసు పనులు, ఇంటి పనులు, ఇతర బాధ్యతలు అన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని అనుకుంటున్నారా? ఎప్పుడూ పనులు, బాధ్యతలే కాదు. విశ్రాంతి కూడా కావాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలి. ఇంకా ఎక్కువ ప్రశాంతత కావాలంటే ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణం చేస్తుండాలి. అది మానసికంగా చాలా మంచి ఊరట ఇస్తుంది. వంట, సంగీతం వినడం, డ్యాన్స్, పుస్తకాలు చదవడం, ఆర్ట్స్, విభిన్న కళలుంటే వాటిని కంటిన్యూ చేయడం. కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలా ఏదో ఒక అదనపు వ్యాపకం ఉండాలి. ఇవి ఒత్తిడి తగ్గించి ఉల్లాసాన్ని పెంచుతాయి.                                 *నిశ్శబ్ద.  

డబ్బున్నవారు చేసే పెద్ద తప్పులివే.. చాణక్యుడు ఏం చెప్పాడంటే..

చాణక్యుడి గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఈయన చెప్పిన ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలి గానీ జీవితంలో వైఫల్యం అనేదే ఎదురుకాదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితాలు, వ్యక్తుల మద్య సంబంధాలు.. ఇలా ఒక్కటనేమిటి? ఎన్నో విషయాల గురించి చాణక్యుడు కుండ బద్దలు కొట్టినట్టు విషయాలను స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా డబ్బు చేతికి వచ్చినప్పుడు చాలామంది తమకు తెలియకుండానే కొన్ని, తెలిసి కొన్ని తప్పులు చేస్తారు. వీటి వల్ల  వ్యక్తుల దగ్గర డబ్బున్నా  ప్రశాంతత, సంతోషం అనేది మాత్రం అస్సలుండవట. మరికొందరు పతనానికి చేరుకుంటారట. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకుంటే.. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చాలామంది తాము ఇబ్బంది పడిన రోజులను, బాధతో గడిపిన రోజులను మరచిపోతాడు. పూర్తీగా చేతిలో డబ్బుందనే మాయలో పడిపోతారు. ఇలా మరచిపోవడం,  కష్ట సమయాలను, బాధల్ని మరచిపోవడం, డబ్బు విషయంలో తప్పు పనులు చేయడానికి దారితీస్తుంది. దీనివల్ల మళ్లీ డబ్బు లేని స్థితికే చేరుకుంటాడు. సహజంగా ప్రతి ఒక్కరూ డబ్బులేనప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తారు. డబ్బున్నప్పుడు. డబ్బులోనే సంతోషాన్ని చూస్తున్నప్పుడు దేవుడిని పక్కన పెడతాడు.  ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొన్నిసార్లు తప్పు మార్గంలో కూడా వెళతాడు. ఇలాంటి వారు డబ్బును మధ్యలోనే పోగొట్టుకుంటారు. తిరిగి అశాంతికి, కష్టానికి, బాధలకు దగ్గరవుతారు. కొంతమందికి డబ్బు చేతికి రాగానే అహంకారం వస్తుంది. కుటుంబ సభ్యులతోనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు.  అయితే పొరపాటున కూడా కుటుంబ సభ్యుల ముందు డబ్బు గర్వాన్ని చూపించకూడదు. డబ్బు ఈరోజు ఉండి రేపు పోవచ్చు. కానీ మరణం వరకు తోడుండే ఆత్మీయులు మాత్రం డబ్బు వల్ల దూరం అయితే మళ్లీ దగ్గరకు రావడం కష్టం. డబ్బు సంపాదించడం మంచిదే కానీ డబ్బు సంపాదించడమే పరమావధి కాకూడదు. మరీ ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మరీ డబ్బు సంపాదించే పనులు ఎప్పుడూ చేయకూడదు.  అలాంటివారితో ఎక్కడా ఎవరూ బ్రతకలేరు. ముఖం మీదనే చెప్పి దూరం వెళ్లిపోతారు. అందుకే డబ్బుకోసం ఆత్మగౌరవం విషయంలో అస్సలు రాజీ పడవద్దు. డబ్బు దండిగా ఉన్నప్పుడు అయినా, డబ్బు లేనప్పుడు అయినా ఒకే విధంగా ఉండే వాడే ఎప్పటికైనా జీవితంలో సఫలం అవుతాడు. డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చు చేస్తే అది చాలా తప్పు. కానీ డబ్బు ఉన్నప్పుడు అందులో కొంత భాగాన్ని మతపరమైన కార్యక్రమాలలో  వినియోగించడం ఉత్తమమని చాణక్యుడు చెప్పాడు. డబ్బు వృధా కంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతరులకు సహాయం చెయ్యడం చాలా మంచిది. దీని వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత చేకూరతాయి. డబ్బు సంపాదించడం ధనవంతుడు కావడం  గొప్పే.. కానీ  ఆ డబ్బును ఇతరులకు హాని తలపెట్టడానికి ఉపయోగిస్తే మాత్రం పతనానికి చేరుకుంటారు. ఇలాంటి పనులవల్ల ఎంత గొప్ప ధనవంతుడు అయినా పేదవాడిగా మారిపోవడం ఖాయమని చాణక్యుడు చెప్పాడు.                                           *నిశ్శబ్ద.

నమ్మకం విజయానికి తొలి అడుగు అంటారెందుకు?

మనిషికి జీవితంలో నమ్మకమనేది ఎంతో ముఖ్యం. అది మనిషి జీవితాన్ని ఎప్పుడూ మెరుగ్గా ఉండేలా, ధైర్యంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఓ చిన్న కథ అదే చెబుతుంది….. పూర్వం ఒక రాజు వుండేవాడు. అతని భార్య గొప్ప అందగత్తె.  ఆమెను చాలా ప్రేమతో చూసుకునేవాడు. ఆమెకు ఎక్కడ లేని నగలను దేశ విదేశాల నుంచి తీసుకువచ్చే వాడు. అరేబియా నుంచి నగల వర్తకులు నేరుగా ఆమె భవనానికి వచ్చి నగలు అమ్మేవారు. ఇలా 25 సంవత్సరాలు గడిచాయి. ఆమె అందం తగ్గింది. రాజు మరో భార్యను చేసుకున్నాడు. క్రమక్రమంగా ఆమె దగ్గరికి రావటం తగ్గించాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. పెద్దభార్య భర్త తనదగ్గరకి తిరిగి రాకపోతాడా అని ఎదురు చూస్తుండేది. ఆ రాజ్యంలో జరుగుతున్న విశయలు ఏమీ తెలియని ఒక అరేబియా వర్తకుడు రాజ్యానికి వచ్చాడు. అతడు తన దగ్గరవున్న అత్యంత ఖరీదైన నగను పెద్ద రాణికి అమ్మడానికి సరాసరి ఆమె భవనానికి వచ్చాడు. ఆ నగను ఆమెకు చూపించాడు. ఆ రాణి ఆ నగ పనితనానికి ముచ్చటపడి కొనాలని ఆసక్తి చూపి, భర్త నిరాదరణ గుర్తుకువచ్చి మానివేసింది.  ఆమె అనాసక్తిని అరేబియా వర్తకుడు మరొక విధంగా తలచి "అమ్మా, ఈ హారానికయ్యే సొమ్మును నాకు వెంటనే ఇవ్వవలసిన అవసరం లేదు. నేను వర్తకం నిమిత్తం మరిన్ని దేశాలు తిరగవలసివస్తుంది. సంవత్సరం తరువాత నేను మీ రాజ్యానికి తిరిగివస్తాను. అప్పుడు నాకు సొమ్ము ఇవ్వవచ్చు" అన్నాడు.  రాణి ఇంకా తటపటాయిస్తూండగా ఆమె కొడుకైన యువరాజు ఆ హారాన్ని తీసుకొని, తల్లి మెడలో అలంకరించాడు. వర్తకుడు ఆనందంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు తల్లితో "ఎందుకమ్మా అంత ఆలోచిస్తున్నావు? సంవత్సరం లోపల ఏమైనా జరగవచ్చు. నాన్నగారు మనసు మారి మళ్లీ నీ దగ్గరకు రావచ్చు, రాజ్యాధికారం అంటే విరక్తి కలిగి నన్నే రాజుగా ప్రకటించవచ్చు. పిన్ని ఆరోగ్యానికి భంగం కలిగి రాజు నిన్నే ఆదరించవచ్చు, రాజు దురదృష్టం కొద్దీ మరణిస్తే నేనే యువరాజును కాబట్టి రాజ్యాధికారం నాకే రావచ్చు. నాన్నగారు అనారోగ్యానికి లోనైనా నాకే రాజ్యాధికారం రావచ్చు. సంవత్సరంలోపు ఏమైనా జరగవచ్చు, నేను పొరుగు రాజ్యాన్ని జయించి రాజును కావచ్చు. గుర్రం ఎగరవచ్చు, కుక్కలు సింహాలను ఎదిరించవచ్చు. సంవత్సరంలో ఈ నగల వ్యాపారి మరణించవచ్చు, ఒక సంవత్సరం తరువాత మన దగ్గరడబ్బు లేకపోతే నగ నచ్చలేదని తిరిగి అతనికే ఇచ్చేయవచ్చు. సంవత్సరం తరువాత మనదే రాజ్యం అన్న నమ్మకాన్ని పెంచుకో అమ్మా మనకి మంచి జరుగుతుంది అన్నాడు.  వర్తకుడు తిరిగివచ్చేగడువు మూడు రోజులలోకి వచ్చింది. పెద్దరాణి ఆందోళన పడసాగింది. యువరాజు ధైర్యంగా ఉన్నాడు. పరిస్థితులలో ఏ మార్పు లేదు. రెండు రోజులలోకి వచ్చింది గడువు, పెద్దరాణి నగను వర్తకుడికి ఇచ్చేయడానికి సిద్ధపడింది ఇంతలో పిడుగులాంటి వార్త. రాజుగారిని హఠాత్తుగా కొంతమంది దొంగలు బంధించటం జరిగింది. యువరాజు ధైర్యంగా అడవికి వెళ్ళి, ఆ దొంగలను బంధించి, రాజును విడిపించాడు. రాజుగారు సంతోషించి యువరాజుకు రాజ్యం అప్పగించడానికి సిద్ధపడ్డాడు. గడువు చివరిరోజు యువరాజుకి రాజుగా పట్టాభిషేకం జరుగుతున్నది. ఆ సమయానికి అక్కడికి వచ్చిన అరేబియా వర్తకుడిని యువరాజు సాదరంగా ఆహ్వానించి, అతనికి నగకి ఇవ్వలసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చి ఉచితరీతిన సత్కరించి పంపాడు. ఏ పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని పొగొట్టుకోకూడదు. నమ్మకమనే విశ్వాసాన్ని మించిన శక్తి లేదు. భవిష్యత్తు మనదేనన్న నమ్మకంతో జీవించాలి. పైన చెప్పుకున్న కథ అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏ పరిస్థితులలో అయినా నమ్మకం, ధైర్యం కలిగి ఉన్నపుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలిగేది. ఆ విషయం ఎప్పటికీ మరచిపోకూడాది.                                       ◆నిశ్శబ్ద.

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోని మీద ఆధారపడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా  జీవితాల్లో అతిపెద్ద మలుపు తీసుకునేది పెళ్లితోనే. సింపుల్ గా పెళ్లికి ముందు, పెళ్ళి తరువాత అనే  వ్యత్యాసాన్ని చెప్పేయచ్చు. ఉమ్మడి కుటుంబాలు, బంధువులు, స్నేహితుల సర్కిల్ ఎక్కువగా  ఉంటే ఆటోమేటిక్ గా పెళ్లి వయసొచ్చిన యువతీయువకుల కోసం పెళ్లి సంబంధాలు అంటూ కబుర్లు వస్తూనే ఉంటాయి. కానీ యెవరికి ఎవరే యమునాతీరే అనేట్టు ఉన్న నేటికాలం జీవితాలల్లో సంబంధాల కోసం ముందుకొచ్చి సహాయం చేసే చుట్టారు, స్నేహితులు తక్కువే. పైపెచ్చు మంచి సంబంధాలు కావాలనే కారణంతో చాలామంది  దగ్గరలో ఉన్నవాటిని పట్టించుకోరు. మంచి సంబంధాల కోసం మ్యాట్రిమోనిలో వెతుకుతుంటారు. అయితే మ్యాట్రిమోనిలో సంబంధాలు వెతికేవారు ఈ కింది విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రోపైల్ గూర్చి అవగాహన ఉందా? పెళ్లి సబంధాల కోసం మ్యాట్రిమోనిలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిలో వరుడు లేదా వధువు ప్రోపైల్ విషయంలో అవగాహన ఉండాలి. వధువు లేదా వరుడి ఫ్రోపైల్స్ రెండు రకాలుంటాయి. ఒకటి ప్రీ ఫ్రోపైల్, రెండు పెయిడ్ ఫ్రోపైల్. ఫ్రీ ప్రోఫైల్ అనేది ముందునుండే ఉన్నది. పెయిడ్ ఫ్రోపైల్ అనేది మ్యాట్రిమోనికి డబ్బు కట్టి క్రియేట్ చేయించుకునేది. దీంట్లో చాలావరకు పేక్ ఉంటాయి. అధికశాతం మంది ఇక్కడే మోసపోతారు. సామాజిక మాద్యమంతో జాగ్రత్త.. సోషల్ మీడియా ఇప్పుడు చాలా భీభత్సంగా  మారింది.  కాస్త మాటలు మొదలైతే చాలు  ఎంతో సులువుగా దగ్గరైపోయేవారు ఉన్నారు. సన్నిహింతంగా మాట్లాడగానే వ్యక్తిగత సమాచారం షేర్ చేసేవారున్నారు. వీటి వల్ల  భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి పొరపాటున కూడా వివరాలు ఎవరికీ ఇవ్వకండి. దూరమే శ్రేయస్కరం.. పెళ్ళి ఖాయం అయినా పెళ్ళి పూర్తయ్యే వరకు కాబోయే భార్యాభర్తలను అస్సలు కలవనిచ్చేవారు కాదు ఒకప్పుటి పెద్దలు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి పిక్స్ అనే మాట వినగానే పెళ్లి జరగడానకి ముందు బోలెడు సార్లు కలుస్తారు. షాపింగ్ చేస్తారు. టూర్లకు కూడా వెళతారు. కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండటం మంచిది. పెళ్లి జరిగే వరకు అమ్మాయిలు తమను తాము సేప్టీగా ఉంచుకోవడం మంచిది. అదే విదంగా సోషల్ మీడియా పరిచయాలు ప్రేమ, పెళ్లికి దారితీస్తే పెద్దల నిర్ణయం తరువాతే వాటి విషయంలో ప్రోసీడ్ అవ్వడం మేలు. మనీ మాటర్స్.. పెళ్లి ఓకే అనగానే కొందరు, పెళ్లి వలలోకి లాగడానికి కొందరు, పెళ్లి పేరుతో మోసం చెయ్యడానికి మరికొందరు డబ్బును, బహుమతులను ఇవ్వడం, ఆశించడం చేస్తారు. అయిచే పెళ్లి  జరిగే వరకు ఇలాంటి పనులు చేయకపోవడమే మంచిది.  

కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఎలాంటి  లాభాలో తెలుసా!

కొబ్బరినీరు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అనుకోవచ్చు. ఈ సహజసిద్దమైన నీటిలో ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, కాల్షియం, అమైనో ఆమ్లాలు,  యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్ లు, విటమిన్-బి కాంప్లెక్స్ లు, విటమిన్-సి ఇలా చాలా పోషకాలు ఉంటాయి. అనారోగ్యం చేసినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, ఎండ కారణంగా అలసిపోయినప్పుడు, వయసు పెరుగుతున్నా యవ్వనంగా ఉండాలని ఇలా చాలా కారణాలుగా కొబ్బరి నీరు తాగుతారు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఇష్టపడే కొబ్బరి నీరు అమృతంతో సమానమనడంలో సందేహం లేదు. లేత కొబ్బరి  బొండాంలో ఉండే కొబ్బరి నీరు కాస్త ఉప్పగా ఉంటుంది. ఈ నీరు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. కొబ్బెర పట్టిన కొబ్బరి బొండాంలో నీరు తియ్యగా ఉంటుంది. ఇందులో కేలరీలు కాసింత ఎక్కువ ఉన్నా ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. అయితే కొబ్బరి నీరు తాగే సమయాన్ని బట్టి దాన్నుండి కలిగే ప్రయోజనాలు కూడా మారతాయి. ఏ సమయంలో తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయంటే.. ఉదయాన్నే పరగడుపున.. ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది ఉదయాన్నే లేత కొబ్బరి బొండాం నీటిని తాగుతారు. అధిక వేడి శరీరం ఉన్నవారికి ఇది భలే ఉపయోగపుడుతుంది. ఎందుకంటే పరగడుపున కొబ్బరినీరు తాగితే శరీరంలో అధిక ఉష్టోగ్రత తగ్గిస్తుంది. భోజనం తరువాత.. భోజనం తరువాత కొబ్బరి బోండాం తాగేవారు తక్కువే. అయితే భోజనం చేసిన కొద్దిసేపటి తరువాత కొబ్బరి బోండాం నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి చాలా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి కాబట్టి జీర్ణం కావడం సులువే.  కడుపు ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడేవారు ఇలా భోజనం తరువాత కొబ్బరినీరు ట్రై చేయవచ్చు. నిద్రపోయే ముందు.. రాత్రి పడుకునేముందు పాలు తాగే వారు అధికం. కానీ పడుకునే ముందు కొబ్బరినీరు తాగితే మానసిక సమస్యలు చాలా దూరం ఉంటాయి. ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి శరీరంలో టాక్సిన్ లు తొలగిస్తుంది. వ్యాయామం తరువాత.. అధికంగా వ్యాయామం చేసేవారు, ఆటగాళ్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల కొరత ఏర్పడుతుంది. అలాంటి సందర్బాలలో కొబ్బరి నీరు తాగడం వల్ల కోల్పోయిన  ఎలక్ట్రోలైట్లు భర్తీ అవుతాయి. ఆటలోనూ, వ్యాయామంలోనూ అలసిన శరీరానికి ఇది ఓదార్పును ఇస్తుంది. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.  తల్లి పాలలో లాక్టిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇదే పదార్థం కొబ్బరినీళ్లలో కూడా ఉంటుంది. దీని కారణంగా కొబ్బరినీరు తాగితే మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మద్యం తాగాలని అనిపించినప్పుడు.. మద్యం తాగే అలవాటున్న చాలామంది తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటారు. కొందరు మద్యం మానేయాలని ప్రయత్నించినా అందులో సఫలం కాలేరు. అయితే మద్యం తాగాలని అనిపించినప్పుడల్లా కొబ్బరినీరు తాగాలి. మద్యానికి బానిసైనవారు మద్యం తాగకపోతే తల తిరిగడం, తలనొప్పి, వికారం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కొబ్బరినీరు ఈ లక్షణాలు తగ్గిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లను కూడా భర్తీ చేస్తుంది.                                                         *నిశ్శబ్ద.

ఉపన్యాసకులు ఎలా ఉండాలి?

ఓ సభ నిండా శ్రోతలు ఉన్నప్పుడు వారి ముందు మాట్లాడటం, వారిని మెప్పించేలా మాట్లాడటం ఒక గొప్ప కళ. నేటి కాలంలో ఇలా మాట్లాడేవారు చాలా అరుదు. ఒకసారి చరిత్రలోకి చూస్తే…….. చికాగోలో ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనకు సమయం ఇచ్చేందుకే ఎవ్వరూ ఇష్టపడలేదు. అయిష్టంగా, మొక్కుబడిగా సమయం కేటాయించారు. ఐతే ఆరంభ వాక్యాలతోనే వివేకానంద అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. సంక్లిష్టమైన, మతపరమైన ఉపన్యాసాల నడుమ శ్రోతలను "సోదరసోదరీమణులు" గా సంబోధించటంతోటే శ్రోతల పైమెట్టునున్న వాడిలా కాక, వారిలో తానూ ఒకడైపోయాడు. విశ్వవేదికపై వివేకానందుడు ఓ శక్తిగా అవిర్భవించాడు. ఉపన్యాసాలిచ్చేవారు గమనించాల్సిన అంశం ఇది. వీలైనంత త్వరగా ఎదురుగా ఉన్న శ్రోతలతో సంబంధం ఏర్పరచుకోవాలి. శ్రోతల కన్నా తాను ఒక మెట్టు పైనున్న వాడిలా కాక తానూ శ్రోతలలో ఒకడన్న భావనను శ్రోతలకు కలిగిస్తే తోటే ఉపన్యాసకుడు. సగం విజయం సాధించినట్టే. ఆధునిక సమాజంలో 'వాజ్ పేయి' ఉపన్యాసాలంటే, సభల పేరు చెప్తే ఆమడ దూరం పారిపోయేవారు కూడా సభలకు పరుగెత్తి వస్తారు. ఇతర రాజకీయనాయకులంతా ఓ వైపు, ఉపన్యాసాలలో వాజ్ పేయి ఒక్కడూ ఓ వైపు. గమనిస్తే, వాజ్ పేయి ఉపన్యాసాలలో ఏ నాడూ తాను ఓ మెట్టు పైనున్నాడన్న భావన శ్రోతలకు కలగనివ్వడు. పైగా చమత్కార పూరితమైన సంభాషణలతో సభను అలరిస్తాడు. మామూలుగా మనం మాట్లాడే పదాలనే విరిచి పలకటం, వాటిని పలుకుతున్నప్పుడు తానూ ఆనందం అనుభవిస్తూ పలకటం, వల్ల వాజ్ పేయి మామూలు మాటలు కూడా సభలో ప్రేక్షకులను ఉర్రూతలూపుతాయి. పైగా, తన ఉపన్యాసంలో సమకాలీన సంఘటనలను, ప్రాంతీయఘటనలను వ్యంగ్యంగా ప్రస్తావించటంతో వాజ్ పేయి ఉపన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి. వాజ్ పేయి తరువాత శ్రోతలను అంతగా అలరించేవి అబ్దుల్ కలామ్ ఉపన్యాసాలు. వాజ్ పేయి ధోరణికి, వాక్ శైలికి పూర్తిగా భిన్నమైంది అబ్దుల్ కలాం ధోరణి. అయితే ఇద్దరిలో మనం గమనించాల్సిన అంశం, వారు వీలైనంతగా శ్రోతలకు దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తారు. శాస్త్రవేత్తగా తన ఇమేజీని వాడుకుంటూ, ప్రతి ఒక్కరికీ మంచిని బోధించాలన్న నిజాయితీని ప్రదర్శిస్తూ, అబ్దుల్ కలామ్ శ్రోతలను స్ఫూర్తిమంతం చేయగలుగుతున్నాడు. గమనిస్తే రాజకీయ సంబంధిత ఉపన్యాసాలిస్తున్నప్పుడు అబ్దుల్ కలామ్ వ్యవహారశైలి మొక్కుబడిగా ఉంటుంది. అదే పిల్లల నడుమ, విద్యార్థుల నడుమ ఆయన చైతన్యంతో ఉట్టిపడుతూ, చైతన్యాన్ని కలిగిస్తాడు.  దీన్ని బట్టి గ్రహించాల్సిందేమిటంటే, ఉపన్యాసకుడు తనకు ఏ అంశాలపై పట్టు ఉందో, ఏ అంశంపై తాను శక్తిమంతంగా మాట్లాడగలడో తెలుసుకొని ఉండాలి. లేకపోతే వేదికనెక్కి అభాసుపాలు కాక తప్పదు. ప్రస్తుతం మన నాయకులనేకులకు తాము మాట్లాడాల్సిన అంశాలపై పట్టు ఉండదు. ఏదో రొటీన్ గా, మొక్కుబడిగా మాట్లాడతారు. దాంతో సభలంటేనే విసుగు పుడుతుంది. సాహిత్య సభలు కూడా ఇలాగే తయారయ్యాయి. సాహిత్యసభలు తమ పూర్వవైభవాన్ని కోల్పోవటం వెనుక ఉపన్యాసకులలో నిజాయితీ లోపించటం ప్రధానకారణం. పొగడ్తలతో ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేయటం, ఏ సభకు ఆ సభలోని వ్యక్తే కాళిదాసుకు పెద్దన్న అన్నట్టు మాట్లాడటం సర్వసాధారణమై పోయింది. విమర్శలు భరించే సహనం లేకపోవటంతో పొగడ్తలే దివ్యౌషధంగా మారాయి. దాంతో సాహిత్యసభలు విలువను కోల్పోయి పరిహాసాస్పదం అయ్యాయి. సభల్లో మాట్లాడేటప్పుడు ఉపన్యాసకుడు ముందుగా తాను మాట్లాడే అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండటం తప్పనిసరి, చమత్కారపూరిత సంభాషణ లేకున్నా, విభిన్నభావాలు ప్రదర్శించలేకున్నా, శ్రోతల దృష్టిని నిజాయితీగా, విజ్ఞానవంతంగా ఉండే ఉపన్యాసకుడు ఆకర్షించగలుగుతాడు. ఇలాంటి ఉపన్యాసకులే ప్రజల మనసుల్లో కూడా అంతో ఇంతో గుర్తుగా నిలిచిపోతారు.                                       ◆నిశ్శబ్ద.

విజయం సాధించాలంటే ఈ విషయాలను గుర్తంచుకోవాలి..!

మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సలహాలను నేటికీ మనం మన పెద్దలు లేదా తెలిసిన వారి నుండి వినవచ్చు. భగవద్గీత యొక్క ఈ జ్ఞానం నేటి ఆధునిక యుగంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు ఈ బోధనలను తెలుసుకుని, వాటిని తెలివిగా అనుసరించి, వాటిని మీ జీవితంలో చేర్చుకుంటే, మీ పురోగతిని ఎవరూ ఆపలేరు. భగవద్గీతలో జీవిత సారాంశం ఉందని మన పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాలు మీ జీవితంలో కూడా ఉపయోగపడతాయి. ఐతే భగవద్గీతలో మనిషి ప్రగతి సాధించాలంటే ఏం చేయాలి అని చెప్పారు..? మీ కోపాన్ని నియంత్రించుకోండి: కోపం గందరగోళాన్ని సృష్టిస్తుంది, గందరగోళం తెలివిని పాడు చేస్తుంది, బుద్ధి చెడిపోతే, తర్కం నాశనం అవుతుంది, తర్కం నాశనం అయినప్పుడు, వ్యక్తి నాశనం అవుతాడు. అందువల్ల అతను తన అన్ని పనులలో వైఫల్యాన్ని ఎదుర్కొంటాడు. అదే వీక్షణ: జ్ఞానాన్ని,  చర్యను ఒకటిగా చూసే వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి. ఎవరైతే జ్ఞాని అయినా లేదా అతను జ్ఞానవంతుడు అయినా, అతని అభిప్రాయం కూడా సరైనదే. ఏ సమస్యను ఏ కోణంలో చూడాలో ఆయనకు అవగాహన ఉంది. మానసిక నియంత్రణ: మన మనస్సు ఎప్పుడూ మన అదుపులో ఉండాలి. మన మనస్సును అదుపులో ఉంచుకున్నప్పుడే అన్ని కార్యాలలో విజయం సాధించగలుగుతాము. మనసును అదుపులో పెట్టుకోని వారికి మనస్సే శత్రువులా ప్రవర్తిస్తుంది. స్వపరీక్ష: పురోగతి సాధించడానికి స్వీయ మూల్యాంకనం చాలా ముఖ్యం. మనం చేస్తున్న పని, ఎంచుకున్న మార్గం, తీసుకున్న నిర్ణయం అన్నీ సరైనవేనా.? లేక తప్పా? దాని గురించి ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో మన హృదయాల్లోని అజ్ఞానపు సందేహాలను తొలగించి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎంచుకుంటే, మీరు తప్పకుండా అందులో పురోగతి సాధిస్తారు. ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది: ఈ జీవితంలో మనం ఏమీ కోల్పోలేదు లేదా వృధా చేయలేదు. మీరు ఏమి చేసినా, దాని నుండి మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఇది మీ జీవితాన్ని మార్చడానికి మీకు సహాయం చేస్తుంది. సాధన తప్పనిసరి: మనస్సు చంచలంగా ఉంటే లేదా మీ మనస్సును నియంత్రించడం మీకు కష్టంగా అనిపిస్తే, మీరు మంచి అలవాట్ల ద్వారా దానిని నియంత్రించవచ్చు. మీ మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడే మీ చర్యలు, మీ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఆలోచించండి: మనిషి తాను సాధించాలనుకున్నది ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తే ఏదైనా సాధించగలడు. ఏ పని చేసినా అందులో నమ్మకం ఉంటేనే చేయాలి. ఇలా చేయండి: క్రియలో నిష్క్రియతను,  నిష్క్రియంలో చర్యను చూసేవాడు తెలివైనవాడు. ఈ వ్యక్తులు తాము చేసే పనిలో ఆనందాన్ని పొందినప్పుడు మాత్రమే సంతృప్తిని అనుభవిస్తారు.

ప్రాణాలను తీసే COPD మీద అవగాహన కావాలిప్పుడు..

COPD అనే పదం విన్నప్పుడు చాలామంది మహిళలలో ఎదురయ్యే PCOD ని పొరపాటున ఇలా చదివారా ఏమైనా అనే సందేహం వస్తుంది. అయితే అది ఇది వేరు వేరు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 ను ప్రపంచ COPD దినోత్సవంగా జరుపుకుంటున్నారు.   COPD అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది శ్వాస సంబంధ సమస్యల రుగ్మత. శ్వాస నాళాలు కుచించుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది శ్వాస సంబంధ సమస్యల కారణంగా మరణాలు సంభవిస్తాయి. ఎక్కువకాలం బ్రోన్కైటిస్ సమస్య కొనసాగడం, ఎంఫెసెమా వంటి రెండు శ్వాస సంబంధ వ్యాధులు  COPD లో చేర్చబడ్డాయి. అసలు COPD ని ఎందుకంత ప్రమాదకరమైన సమస్యగా చెబుతున్నారు? దీని ప్రభావమెంత? దీని కారణాలు, దీని నివారణా మార్గాలేంటి? తెలుసుకుంటే.. COPD అనేది ప్రపంచంలో ఎక్కువ మొత్తం  ప్రజల మరణాలకు కారణం అవుతున్న జబ్బులో మూడవది.  ఈ సమస్యలో రోగనిర్థారణ ఎంత త్వరగా జరిగితే అంత  తొందరగా చికిత్స తీసుకోగలుగుతారు.  ఎక్కువ కాలం బ్రతకగలుగుతారు.  అయితే గత ముప్పై సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే COPD సమస్య ప్రభావం చాలా పెరిగింది. మరీ ఎక్కువగా గత 10 సంవత్సరాల నుండి COPD తీవ్రంగా ఉంది. కరోనా తరువాత ఇది ప్రాణాంతకంగా రూపొంతరం చెందింది. మనిషి శ్వాసించాలంటే ఊపిరితిత్తులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.  అయితే COPD సమస్యలో ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. ఈ COPD లక్షణాలు కింది విధంగా ఉంటాయి. COPD సమస్య ఉన్నవారిలో ఛాతీ నుండి కఫం, శ్లేష్మంతో కూడిన దగ్గు వస్తుంది. ఛాతీ, ఊపిరితిత్తులలో తరచుగా ఇన్ఫెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఛాతీ చాలా బిగుతుగా ఉంటుంది. తుమ్ములు, ముక్కు కారడం, అలసట, బలహీనత వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఊపిరి తీసుకునేటప్పుడు గురక  వస్తుంటుంది. సాధారణంగా జలుబు వస్తే రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది. లేదంటే నాలుగైదు రోజులు వేధిస్తుంది. మెడిసిడ్ వాడితే తగ్గిపోతుంది. కానీ COPD సమస్యలో జలుబు దీర్ఘకాలంపాటు కొనసాగుతుంది. ఈ లక్షణాలు అన్నీ ఉన్నట్టైతే  ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇది చాలామందిలో ధూమపానం, మద్యపానం కారణంగా వస్తుంటుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉండే వదిలేయాలి.                                                        *నిశ్శబ్ద.  

భవిష్యత్తును శాసించే బాలలు...

భారత ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహార్ లాల్ నెహ్రు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయన పుట్టిన రోజును బాలల దినోత్సవం పేరిట జరుపుకుంటారు. నిజానికి ఐక్యరాజ్య సమితి బాలల దినోత్సవాన్ని నవంబర్ 20వ తేదీన జరుపుకోవాల్సిందిగా ప్రకటించింది. కానీ భారతీయులు మాత్రం నవంబర్ 14న జవహార్ లాల్ నెహ్రూ జయంతి రోజునే జరుపుకుంటున్నాం. దీనికి కారణం జవహార్ లాల్ నెహ్రూ బాలబాలికల విద్యను ఎంతగానో ప్రోత్సహించారు.  తమ విద్యకు ఆయన అందించిన ప్రోత్సాహానికి పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని ముద్దుగా పిలుచుకుని తమ ప్రేమను చాటుకున్నారు.  నవంబర్ 14వ తేదీనే బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పిల్లలకూ కొన్ని హక్కులున్నాయని, ఆ హక్కులకు అనుగుణంగా  వారు జీవించాలని బాలల దినోత్సవం నొక్కి చెబుతుంది. అంతే కాదు.. సమాజంలో పిల్లలకు విద్య అందడం నుండి వారి సంక్షేమం వరకు చాలా విషయాల గురించి ప్రభుత్వాలు చర్చిస్తాయి. పసిడి నవ్వుల చాచాజీ.. పుట్టినరోజు ఈ రోజు పిల్లల పండుగ ఈ నాడు ఈ గేయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. జవహార్ లాల్ నెహ్రూను పిల్లలు ముద్దుగా చాచాజీ అని పిలుస్తారు. దీనివెనుక కారణం.. భారత్  బ్రిటీషర్ల చేతుల్లో నలిగి స్వాతంత్ర్యం పొందిన తరువాత ఈ దేశాన్ని సరైన మా్ర్గంలో నడిపించే ఉద్దేశ్యంతో నెహ్రూ ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయాల అనుగుణంగా ఆయన నిరంతరం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సి వచ్చేది. ఆయనకు స్వతహాగా పిల్లలన్నా, గులాబీ పువ్వులన్నా ఎనలేని మక్కువ. ఈ కారణంగా ఆయన ఎక్కడికి వెళ్లినా పిల్లలను చాలా ఆప్యాయంగా, ప్రేమగా పలకరించేవాడు, వారిని దగ్గరకు తీసుకునేవాడు. దీంతో పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారు. నెహ్రూకు గులాబీలంటే మక్కువ అని తెలిసి గులాబీ పువ్వులతో ఆయన్ను చుట్టుముట్టేవారు. అలా పిల్లలకు ఆయన పట్ల ప్రేమాభిమానాలకు గుర్తుగానూ, పిల్లల విద్య కోసం ఆయన చేసిన కృషి ఫలితంగానూ ఆయన జయంతిని  బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈరోజున ఏం చెయ్యచ్చు.. పిల్లలకు కూడా రాజ్యంగంలో కొన్ని హక్కులున్నాయని చదువుకుంటూనే ఉన్నాం. కానీ నిజానికి పిల్లలకున్న హక్కుల గురించి  తెలిసిన వారు చాలా తక్కువ.  బాలల దినోత్సవం రోజున ఈ హక్కుల గురించి చర్చించి పిల్లలు వాటిని ఉపయోగించుకునేలా చేయాలి. చాలామంది పిల్లలకు విద్య, ఆహారం, స్వేచ్చ లభించడం లేదు. ఇటువంటి పిల్లలను గుర్తించి వారిని వారికి న్యాయం జరిగేలా చేయాలి. పిల్లలలో లింగ సమానత్వం పాటించాలి. మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువ అనే చాదస్తపు ఆలోచనలు వదిలి పిల్లలను సమానంగా పెంచాలి. ఉరుకులు పరుగుల ఉద్యోగాల కాలంలో పిల్లలను పట్టించుకోవడం గురించి ఆలోచించాలి. వారికి తగినంత సమయం కేటాయించాలి. వారితో ప్రేమగా మాట్లాడాలి, ఆలోచనలు పంచుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో స్నేహితుల మాదిరిగా ఉండాలి. అలా ఉంటే పిల్లలు ఉత్తమ పౌరులుగా అభివృద్ది పెంచుతారు. తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని పంచుకోగలుగుతారు. బడి వయసు పిల్లలను బడికి వెళ్లేలా చేయడం, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు అనే మాట గుర్తుంచుకుని పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల విషయంలో బాధ్యతగా ఉండాలి.                                                     *నిశ్శబ్ద.