బాధించే గతం నుండి బయటపడటానికి గొప్ప మార్గాలు!

చాలామంది గతంలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూసి ఉంటారు. వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ తమలో తాము కుమిలిపోతుంటారు. స్ఫూర్తివంతమైన విషయాలు చదివినంత సేపు వారికి ఎంతో ధైర్యం వస్తుంది. కానీ తరువాత అంతా మామూలే! ఇలాంటి వారికి తమ బాధలను స్నేహితులతో చెప్పుకోవాలంటే  ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. అలాంటి సమయంలో ఈ పరిస్థితుల నుండి బయటపడే మార్గాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.. మన సమస్యలన్నింటికీ ముఖ్యకారణం మనస్సు వర్తమానంలో ఉండక పోవడమే! గతాన్ని తలుచుకుంటూ బాధపడడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మనస్సు స్వభావం. గతంలోని చేదు అనుభవాలను పూడ్చిపెట్టి, భవిష్యత్తు గురించి ఆలోచనల్ని అరికట్టినప్పుడు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్ని తీర్చిదిద్దుకోవడం సాధ్యమవుతుంది. ఈ సమస్యను మూడు మార్గాలను అనుసరించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. భగవంతునితో మొరపెట్టుకోవడం :  ఒక్కసారి భగవద్భక్తుల జీవితాల్ని తరచి చూస్తే వారంతా ఎన్ని కష్టాల్ని అనుభవించారో మనకు అర్థమవుతుంది. ఆ మహాభక్తులు అనుభవించిన కష్టాలు మేరు పర్వతమంతైతే మన కష్టాల్ని ఆవగింజతో పోల్చవచ్చు. కానీ మనకు కలిగిన ఆవగింజంత కష్టానికే అవధుల్లేని అశాంతికి లోనవుతుంటాం. మరి వారు మేరుపర్వతమంత కష్టాల్ని సైతం అవలీలగా ఎలా దాటగలిగారు? తమ బాధలను భగవంతునితో మొరపెట్టుకోవడం వల్లనే అది సాధ్యమయిందని నిరూపించారు సఖుబాయి, జనాబాయి, మీరాబాయి, ముక్తాబాయి, కాన్హోపాత్ర లాంటి అనేక మంది భక్త శిరోమణులు. It is difficult to live without someone to whom we can open our hearts. But to whom can we better dis- close them than to God! - Thomas A. Kempis ఈ ప్రపంచంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించే తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు, శ్రేయోభిలాషి అన్నీ ఆ భగవంతుడు మాత్రమే! కాబట్టి మన బాధలను భగవంతుని వద్ద విలపిస్తూ విన్నవించుకుంటే మేరు పర్వతమంత కష్టమైనా దూదిపింజలా ఎగిరిపోతుంది. 'వ్యాకుల మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనల్ని తప్పక వింటాడు'. ఈ మార్గాన్ని అనుసరించడం కష్టమైనప్పటికీ ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు! స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడడం: మనోవ్యధలను తొలగించేందుకు ఔషధంలా ఉపయోగపడే వారు మంచి స్నేహితులు. No medicine is more valuable, none more. efficacious, none better suited to be cure of all our miseries than a friend - St. Aleredx మన బాధలను స్నేహితులతో చెప్పుకోవడానికి ఆత్మాభిమానం అడ్డువస్తోందని అనుకోవడానికి కారణం స్నేహితుడు, మనం వేర్వేరు అనే భేద భావం ఉండడం వల్లనే! 'నిజమైన స్నేహితుడు ఇద్దరిలో ఉన్న ఒకే ఆత్మ'  A true friend is one soul in two bodies - Aristotle కాబట్టి బాధలను తలచుకుంటూ కుమిలి పోవడం కన్నా స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడడం వల్ల మనస్సు తేలికపడుతుంది. కార్యకలాపాల్లో మనస్సును నిమగ్నం చేయడం :  వీలైనంత వరకూ ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసిమెలిసి ఉండడం, ఏదో ఒక పనిలో మనస్సును నిమగ్నం చేయడం వల్ల గతాన్ని మరిచిపోవడం సాధ్యమవుతుంది. స్వామి వివేకానందుని పాశ్చాత్య శిష్యురాలైన మేడం ఈ. కాల్వే మనోవేదనకు గురైనప్పుడు ఆమెను ఓదారుస్తూ స్వామీజీ! ఇలా అన్నారు : "నువ్వు గతాన్ని మరిచిపో. నీ దుఃఖాలను గురించి మౌనంగా తలపోస్తూ కూర్చోవద్దు. నీలోని భావోద్వేగాలను ఏదో ఒక బాహ్యరూపంలో సృజనాత్మకంగా వ్యక్తీకరించే ప్రయత్నం చెయ్యి" అన్నారు.  స్వామీజీ సలహాను పాటించిన ఆమె జీవితం ప్రశాంతమయమైంది. ఈ మూడు మార్గాల్లో ఏ ఒక్క మార్గాన్ని అవలంబించినా.. మనస్సు గతంలోనికి అడుగుపెట్టదు. పట్టుదలతో ప్రయత్నిస్తేనే ఏదైనా సాధ్యమవుతుందన్న విషయాన్ని మాత్రం మరువకూడదు.                                     *నిశ్శబ్ద.

మతం గురించి వివేకానంద చెప్పిన మాటలు ఏంటంటే..

ఈ ప్రపంచంలో మతానికున్న శక్తి చాలా పెద్దది. కొందరు మతాన్ని ఆయుధంగా మలచుకుంటారు. ప్రపంచాన్ని అయోమయంలోకి తోస్తారు. భారతదేశం భిన్న మతాల సమ్మేళనం. అయితే ఈ మతాల కొట్లాటలు ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. ఈ మతం గురించి స్వామి వివేకానంద చెప్పిన మాటలు వింటే మతం గురించి అందరికీ అవగాహన వస్తుంది. వివేకానంద ఏమి చెప్పాడంటే… మతం యొక్క అసలు రహస్యం ఆచరణ రూపంలో నిరూపితమవుతుంది కానీ సిద్ధాంతాల్లో కాదు. మంచిగా నడచుకోవడం, మంచిని ఆచరించడం అదే మత సారాంశం. భగవన్నామాన్ని బిగ్గరగా అరవడం మతం కాదు. భగవానుని నిర్ణయాలను అమలు చేయడమే నిజమైన మతం. నైతిక పథంలో వ్యక్తి సంచరించాలి. వీరోచితంగా నడచుకోవాలి. హృదయపూర్వకంగా కర్తవ్యాన్ని నిర్వహించాలి. సడలని నైతిక పథంలో, భయమెరుగని సాహసంతో వ్యక్తి జీవించాలి. వ్యక్తి పవిత్రాత్ముడైతే అతడు అపవిత్రతను దర్శించలేడు. దానికి కారణం అతని అంతరంగ ప్రవృత్తే బాహ్యంలో ప్రతిబింబించడం. మన లోపల మలినం ఉంటే తప్ప బాహ్యప్రపంచంలో మలినాన్ని చూడలేం. ఈ విజ్ఞానాంశాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో అనుసరించడం శ్రేయస్కరం. సర్వజన సంక్షేమం, నైతిక పథ గమనం సాధించాలంటే ముఖ్యంగా స్వార్థరాహిత్యాన్ని అవలంబించాలి. 'నీ కొరకు నేను, నా కొరకు కాదు' అనే భావాన్ని ప్రతి వ్యక్తీ అలవరచుకోవాలి. స్వర్గం, నరకం అనేవి ఉన్నాయో లేవో ఎవరికీ అవసరం లేదు. ఆత్మ పదార్థమనేది ఉందో, లేదో ఆలోచించాల్సిన పని లేదు. 'చిత్తు, సత్తు' అంటూ వాటిని గురించి వితర్కించుకోవాల్సిన పని లేదు. మన ఎదురుగా కనిపించే ప్రపంచాన్ని గురించి మాత్రమే మనం విచారించాలి. ఈ ప్రపంచం అంతా దుఃఖ భూయిష్ఠంగా ఉంది. బుద్ధుడి లాగే మనం కూడా ప్రపంచంలో సంచరించి, ప్రజల కష్టాల్ని రూపుమాపడానికి శాయశక్తులా కృషి చేయాలి. ఆ ఉద్యమంలో మనం ఆత్మాహుతికి కూడా సిద్ధమవ్వాలి. ఒక వ్యక్తి నాస్తికుడా, ఆస్తికుడా, భౌతికవాదా, వేదాంతా, క్రైస్తవుడా, మహమ్మ దీయుడా అని విచారించాల్సిన పని లేదు. పరోపకారం పరమోత్కృష్ట ధర్మం. అలాగే పరపీడనం పరమ నికృష్టకార్యం. పరులను ప్రేమించడం ఉత్తమ లక్షణం కాగా, ఇతరులను ద్వేషించడం హైన్యం. దైవశక్తి పట్ల విశ్వాసం, ఆత్మ విశ్వాసం సద్గుణాలు అవుతాయి. సంశయించే ప్రవృత్తి పాపంగా పరిగణిత మవుతుంది. సమైక్యభావం శ్లాఘనీయం. భేదభావం నైచ్యం అవుతుంది. ఇదీ విలివేకానందుడు చెప్పిన మాటలు.. *నిశ్శబ్ద.

వాడు చెప్పేది నేను వినడం ఏంటి? అనే ఆలోచనలో మీరూ ఉన్నారా? అయితే ఇది చదవండి!

ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడమనేది ఎప్పుడో పోయింది. పరుగులు పెట్టే జీవితంలో ఎవరికీ పక్కవాళ్లు చెప్పేది ఎంతటి విషయమైనా సరే ఏకాగ్రతతో వినే తీరిక, ఓపిక - రెండూ లేవు. వాళ్ళ దోవన వాళ్ళు చెప్పుకుపోతుంటే మన దోవన మనం ఏదో ఆలోచిస్తుంటాం. కాలక్షేపం బాతాఖానీలు, కబుర్లూ అయితే మనస్సుపెట్టి వినకపోయినా ఫరవాలేదు కానీ ఇతరత్రా ఏ మంచి విషయమైనా శ్రద్ధగా వినాలి. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. అధికారంలో ఉన్నవాళ్ళు, కింద వాళ్ళ పట్ల శ్రద్ధ కనబరిచి వాళ్ళు చెప్పేది సహనంతో వింటే ఉత్తమ పాలకులూ, ఉత్తమ అధికారులూ అవుతారు. నవ విధ భక్తిమార్గాలలో కూడా శ్రవణానికే మొదటి స్థానం కల్పించారు. శ్రవణం సరిగ్గా ఉంటే, మిగిలినవన్నీ తేలిగ్గా సిద్ధిస్తాయి. శ్రవణం అంటే వినడం. ఆ వినడమేదో శ్రద్ధగా వినాలి. భావప్రసారమంటే వ్రాయడం, మాట్లాడడం, సంభాషించడమే కాదు, వినడం కూడా! ఇతరులు చెప్పింది సరిగ్గా వినక పోవడం వల్ల మనఃస్పర్థలు వస్తాయి. 'శ్రద్ధయా శ్రవణం కుర్యాత్. శ్రద్ధతో వినాలని శాస్త్రం చెబుతోంది. శ్రవణమే జ్ఞానానికి తొలి మెట్టు. అది లేకుంటే జ్ఞానం ఉదయించదు. విషయాన్ని కూలంకషంగా తెలుసు కోవాలంటే ఓపిగ్గా వినాలి. ప్రహ్లాదుడి కథ మనందరికీ తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రాన్ని తల్లి లీలావతికి నారదమహర్షి ఉపదేశిస్తుండగా శ్రద్ధగా విన్నాడు కాబట్టే విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడయ్యాడు. వినదగు నెవ్వరు చెప్పిన  వినినంతనె వేగపడక వివరింపదగుస్ కని కల్ల నిజము దెలిసిన  మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా ముందు వెనుకలు ఆలోచించి, మంచిచెడ్డలు విచారించి, నిజానిజాలు తెలుసుకొని, తెలివిగా వ్యవహరించాలి. అలాంటి వాడే నిజమైన వివేకవంతుడని సుమతీ శతకకారుడు బద్దెన చెప్పాడు. అందరూ అలవరచు కోవలసిన మంచి గుణమిది. ఎవరు ఏం చెప్పి ఉద్రేకాలకు, ఉద్వేగాలకు లోను కాకుండా శాంతంగా వినాలి. వాస్తవ దృక్పథంతో వినాలి. ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో ఏదీ వినకూడదు. అలాగే చెప్పేది పూర్తిగా వినకుండా ఏ నిర్ణయానికీ రాకూడదు. ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడడం మంచిది కాదు. అలా చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ముఖ్యమైన విషయమేదో వినకుండా పోయే ప్రమాదం ఉంటుంది. మనం ఎదుటివారికి ఏదైనా చెబుతున్నప్పుడు వాళ్ళ నుంచి సానుకూల స్పందన కోరుకుంటాం. అలాగే ఎవరైనా! నచ్చితే మెచ్చుకోలు మాట ఏదైనా అనండి. కనీసం తల ఆడించండి. ఓ చిరునవ్వు నవ్వండి. నచ్చకపోతే మాత్రం మెత్తగా, అన్యాపదేశంగా చెప్పండి. కటువుగా చెప్పకండి. దీనిని పాటించడం వల్ల మనకూ చెప్పేవారికీ మధ్య  సదవగాహన, సద్భావన పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యం.. వినేవాడికి చెప్పేవాడు లోకువ కాదని తెలుసుకోండి. పక్కవాడు చెప్పేది శ్రద్ధగా వింటేనే మనకు గ్రహణశక్తీ, సహనమూ పెరిగేది. *నిశ్శబ్ద.

మీరు చేసే ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారా?

ప్రస్తుత సమాజంలో చదివింది ఒకటయితే చేసే ఉద్యోగం మరొకటి అవుతుంది. చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకటం చాలా కష్టంగా వుంటుంది. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక అవసరాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ కారణాలు కావచ్చు చదివిన చదువుకు సంబంధించినది కాకుండా పరిచయం లేని, దాని గురించి ఏమీ తెలియని ఉద్యోగం చేయాల్సి రావచ్చు.  చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లభించకపోవటం వల్ల మనలో నిరాశ, అసంతృప్తి అనేవి చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తుతం ఉన్న యువతలో చాలా బాగా గమనించవచ్చు. దానివల్ల  మానసిక ప్రశాంతత అనేది కరువైపోతుంది. ఈ మానసిక ప్రశాంతత లేని కారణంగానే  ఇబ్బందులకు గురి అవుతున్నాము. మానవ జీవితాలలో అత్యంత ప్రాముఖ్యత వహించే అంశం ఉద్యోగం, మనకు అనుకూలమైన ఉద్యోగం దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి చెందుతూనే మనకు అనుకూలమైన ఉద్యోగం దొరికేంత వరకు దాని కోసం కృషి చేయాలి, దానిని సాధించుకోవాలి. అంతే తప్ప మనకు తగినది దొరకలేదనే కారణంతో ఏదీ చేయకుండా కాలాన్ని వృధా చేస్తూ ఉండటం వివేకవంతుల లక్షణం కాదు.  దీనికంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది అని మనం మానసికంగా ఫీల్ అవ్వాలి అటువంటి మంచి ఉద్యోగం పొందే సామర్థ్యాన్ని, అంటే అర్హతలు మనకున్నాయో లేదో గమనించుకుని ఆ అర్హతలు సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చెయ్యాలి. అలాగని చెప్పి, ఉన్న ఉద్యోగం వదులుకుని, నిరుద్యోగిగా ఆఫీసులచుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. చేస్తున్న ఉద్యోగం మంచి క్రమశిక్షణతో అంకిత భావంతో చేస్తూనే మన సమర్ధతకు సరిపోయే ఉద్యోగం కోసం కృషి చేయాలి. కృషి చేస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిదేదీ లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగాలు లేక, దొరికిన ఉద్యోగాలు చేయలేక ఆత్మనూన్యతాభావంతో ఎన్నో రకాలైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కాని అది సమంజసం కాదు. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే అసమర్ధుడిగా ముద్రపడే ప్రమాదం ఉంది. అందుకే దొరికిన ఉద్యోగం చేసుకుంటూ మనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలి. నిజానికి పరిచయం లేని పని దొరికినా ఆ కొత్త పనిలో విషయాన్ని, ఆ పనికి సంబంధించిన మెలకువలను ఆసక్తిగా తెలుసుకునేవాడు ప్రతిభావంతుడు అవుతాడు. ఎదురయ్యే ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకోవడమే వివేకవంతుల విజయాల వెనుక కారణం. ప్రస్తుతం సమాజంలో వ్యక్తి నైపుణ్యానికి తెలివికి విలువలేని కాలంలో తనకు గుర్తింపు లేదనో, తన తెలివికి తగ్గ ఉద్యోగం లేదనో బాధపడుతూ అశాంతికి గురి అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలివిని మన నైపుణ్యాన్ని గుర్తించే రోజు ఒకటంటూ వుంటుందని గ్రహించాలి, విశ్వసించాలి. పరిస్థితులను అర్ధం చేసుకుని జీవించాలి. మనం వున్న పరిస్థితులలో మౌనంగా ఉంటూ, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటూనే నిత్య జీవితంలో తమ ప్రతిభను వెల్లడించాలి, మనం కొంతమందిని చూస్తూ వుంటాము. వారు ఎదుటివారి దోషాలు చూపటం వల్ల తాను గొప్పవాడైనట్టు భావిస్తుంటారు. తప్ప, తమలోనూ లోపాలున్నాయని అనుకోరు. ఎదుటివారిలో తప్పులు వెతకడం మాని, తనలోని లోపాలను గుర్తించి, సరిదిద్దుకునే వ్యక్తికి ఉన్నత అవకాశాలు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి.                                       ◆నిశ్శబ్ద.

ఈ ఒకే ఒక్క గుణం మనిషి పతనానికి కారణం అవుతుంది!!

మనిషిని అధమ స్థితిలోకి నెట్టేసే దారుణమైన గుణం అహంకారం. అహంకారం గురించి కలిగిన నష్టాలను చరిత్రలో ఒకసారి పరికిస్తే.. మహాభారతంలో దుర్యోధనుడు స్వయంగా ఏమీ రాజ్యాన్ని సంపాదించుకోలేదు. కానీ కాలానుగుణంగా, వారసత్వంగా అధికారం సంప్రాప్తించింది. ఆ ఆధిపత్యం ఆయనలో అంతకు పదింతల అహంకారాన్ని తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ శకునుతో పాటు దుష్టులందరూ వచ్చి చేరారు. యువరాజుగా యౌవనంలో ఉన్న ఆయనకు గర్వం కళ్ళను నెత్తికెక్కించింది. ఇక నన్ను ఎదిరించేవారు ఎవరుంటారన్న అహంభావానికి మనస్సులో బీజం పడింది. అప్పటి వరకూ సోదరసమానులైన పాండవులతో అతను సఖ్యంగానే ఉన్నప్పటికీ ఆయనలోని అధికారమదం వారిపై విషభావనలను ఎగజిమ్మింది. ఫలితంగా పెద్దల మాటలను పెడచెవిని పెట్టాడు. సాక్షాత్తూ కాలస్వరూపుడైన భగవంతుడు ప్రత్యర్థిగా ఉన్నాడని తెలుసుకోలేనంత గర్వాంధకారుడయ్యాడు. తన బలగం, బలం అతి స్వల్పమైనా, దానినే దుర్యోధనుడు అత్యధికమైందిగా భావించాడు. పాండవులను హేళన చేశాడు.  ఒక్క యాదవుడిని, అదీ యుద్ధం చేయకుండా సారథిగా రథం తోలుతానన్న వాడిని నమ్ముకొని కురుక్షేత్ర రణరంగంలోకి కాలుమోపుతున్నారని అవమానపరిచాడు. 'తాత్కాలిక సంపదలను, వైభవాలను చూసుకొని పొగరుతో ఎదుటివారిని చులకన చేసే వారి సంపదలు చెదిరిపోవటమే కాకుండా, వారికి పూర్వుల నుంచి సంక్రమించిన వారసత్వ వైభవాలు కూడా సమూలంగా నాశనమవుతాయి' అని విదురుడు లాంటివారు హితవు పలుకుతారు. అయినా దుర్యోధనుడు తలబిరుసుతో దాయాదులతో సమరానికే సిద్ధ పడ్డాడు. ఫలితంగా రణభూమిలో అసువులుబాసాడు. తాత్కాలికమైన పేరు ప్రతిష్ఠలనూ, ధన, పరివారాలనూ చూసుకొని విర్రవీగే అవివేకులను హెచ్చరిస్తూ కాలమహిమను అభివర్ణిస్తూ శంకర భగవత్పాదులు ఇలా అన్నారు..... మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల స్సర్వమ్ ।  మాయామయ మిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ॥ ధనం, పరివారం, యౌవనం ఉన్నాయని గర్వించకు. క్షణంలో కాలం వాటన్నింటినీ హరించివేస్తుంది. ఇదంతా మాయామయ మనీ, మిథ్య అనీ, అశాశ్వతమని గ్రహించి, జ్ఞానివై పరబ్రహ్మాన్ని పొందడమంటున్నారు. కాలవశాన సంప్రాప్తించినవి కాలంతోనే సమసిపోతాయని తెలుసుకోలేక, మనలో చాలామంది. అహంకారంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.  నిజానికి ఈ ప్రపంచంలో మనం సాధించామనుకుంటున్నవన్నీ మధ్యలో వచ్చి, మధ్యలోనే వెళ్ళిపోతాయి. అందం కావచ్చు, అందలం కావచ్చు ఏదైనా శాశ్వతంగా మనతోనే ఉండిపోదు. అలాంటి తాత్కాలికమైన తళుకుబెళుకులను చూసుకొని అహంకరిస్తే, అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు. మహా మహా సామ్రాజ్యాలే కాలగర్భంలో కలిసిపోయాయి. మగధీరులనిపించుకున్న మహారాజులే నేడు మౌనంగా సమాధుల్లో సేద తీరుతున్నారు. కాలమే మనందరితో భిన్నమైన పాత్రల్ని పోషింపజేస్తుందని తెలుసుకోలేక ఆయా స్థానాలతో విపరీతంగా తాదాత్మ్యం చెందుతున్నాం. వాటినే మన నిజ స్వరూపాలుగా నిర్వచించుకుంటున్నాం. తీరా అవి చేజారిపోయాక, విలపిస్తూ ఉన్నాం.   కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే?... అంటాడు బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడితో! పూర్వం ఎందరో రాజులు ఉన్నారు! వారికి ఎన్నో రాజ్యాలూ ఉన్నాయి! వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదను మూటకట్టుకొని పోలేదు కదా! ప్రపంచంలో వారి పేరు కూడా మిగల్లేదు కదా! ఈ విషయం అర్థం చేసుకుంటే మనిషి జీవితం ఎంతో బాగుంటుంది.                                      *నిశ్శబ్ద.

ప్రతి మనిషిలోనూ ఓ వేటగాడు

ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా జనం ‘పోకెమాన్‌ గో’ ఆటని ఆడుతూ కనిపిస్తున్నారు. ఇది వేలంవెర్రిగా మారిందని పెద్దలు తిట్టుకుంటున్నా, దీని పర్యవసానాల గురించి పరిశోధనలు జరుగుతున్నా... ఆటలు ఆడేవారు మాత్రం పోకెమాన్ల వెంట పడుతూనే ఉన్నారు. ‘ఇంతకీ మనిషి ఈ ఆటకి ఎందుకింతగా వ్యసనపరుడయ్యాడు?’ అన్న ప్రశ్నకి ఓ స్పష్టమైన జవాబు లభిస్తోంది.   తన జీవితమే ఒక పరిశోధన రష్యాలో పుట్టి పెరిగిన ‘వ్లాదిమిర్‌ డినెట్స్’ అనే ఆయన, ప్రస్తుతం అమెరికాలో మనస్తత్వ శాస్త్రంలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పోకెమాన్‌గో పిచ్చి గురించి వ్లాదిమిర్‌కి కూడా కొన్ని సందేహాలు వచ్చాయి. మనిషిలో స్వతహాగా ఉండే వేటగాడి మనస్తత్వం వల్లే మనం ఈ ఆటని ఇష్టపడుతున్నామా అన్న అనుమానం కలిగింది. దాంతో ఒక్కసారి తన జీవితంలో జరిగిన విషయాలనే ఒక్కొక్కటిగా నెమరువేసుకుంటూ ‘మనిషిలో వేటగాడు’ అనే ఆలోచనకు ఓ రూపం ఇచ్చేందుకు ప్రయత్నించారు.   వేటే ఆధారం ఇప్పుడంటే తాజా ఆకుకూరలు, షడ్రసోపేతమైన ఆహారాలు లాగిస్తున్నాం కానీ, ఆదిమానవులుగా ఉన్నప్పుడు మనం వేట మీదే కదా ఆధారపడింది. ఆ వేటతోనే కదా వారి ఆకలి తీరింది. కాబట్టి మిగతా జంతువులలాగానే మనిషిలో ఇంకా ఆ వేట తాలూకు ఛాయలు పోలేదంటారు వ్లాదిమిర్‌. అందుకు తన జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు. వ్లాదిమిర్‌ చిన్నప్పుడు తన తండ్రి సీతాకోక చిలుకల వెంటపడటాన్ని గమనించేవాడు. ఆయన సీతాకోక చిలుకల్ని గమనిస్తూ, వాటి వెంటపడుతూ, వాటిలో అరుదైనవాటిని సేకరిస్తూ ఉండేవారట. వ్లాదిమిర్‌కు ఐదేళ్లు వచ్చేసరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి అక్కడ ఉండే జంతువులని గమనించే అలవాటు మొదలైంది. తరువాత కాలంలో వ్లాదిమిర్‌, మాస్కో మహానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ అతను పార్కుల్లో పక్షులనీ, పెరట్లో పురుగులనీ గమనించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అరుదైన జంతువులని గమనించడాన్నే వ్యాపకంగా పెట్టుకొన్నాడు. చివరికి జంతువుల స్వభావాల మీదే డాక్టరేటు పుచ్చుకున్నాడు.   అన్నీ వేటగాడి సూచనలే సీతాకోక చిలుకల వెంటపడటం, పక్షులను గమనించడం, జంతువులని పరిశీలించడం, పురుగులను పట్టుకోవడం... ఇవన్నీ మనలో దాగి ఉన్న వేటగాడి చర్యలే అంటారు వ్లాదిమిర్‌. అంతేకాదు పోకెమాన్‌గోలో లేని జంతువులను ఊహించుకుంటూ వాటి వెంటపడటం కూడా మనలోని వేటగాడిని తృప్తి పరుస్తోందని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ‘వేటగాడి’లో ఉండే పోరాటపటిమని లక్ష్యసాధన కోసం ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలనిస్తుందని సూచిస్తున్నారు.   -నిర్జర.

మనకు మనమే మిత్రుడు, శత్రువు అంటారు ఇందుకే..

మనిషి జీవితంలో మానసిక దృక్పథం గొప్ప పాత్ర పోషిస్తుంది. సరైన మానసిక దృక్పథంతో, మనల్ని మనం చక్కగా అదుపులో పెట్టుకున్నప్పుడు, మన శ్రేయస్సును మనమే ప్రోదిచేసుకుంటాము. అలా కాక చెదిరిన మనస్సుతో, అజ్ఞానపు మబ్బులు క్రమ్మిన మనస్సు మనకే శత్రువుగా తయారవుతుంది. మనల్ని మనం కించపరుచుకున్న ప్రతిసారీ మనలోని ఉన్నతమైన ఆత్మకు మనం వ్యతిరేకంగా పనిచేస్తున్నామన్న మాట.  నిజానికి మనల్ని మనం కించపరచుకున్నప్పుడు మనలో ఉన్న ఆత్మశక్తిపై మనకు నమ్మకం లేదని అర్థం. మనల్ని మనం నాశనం చేసుకోవడానికి ఇదే కారణం. అదే విధంగా, మనం గర్వం, అహంకారంతో మిడిసిపడుతున్నప్పుడు కూడా మనం ఆ ఆత్మశక్తి నుంచి మరలిపోతున్నామన్నమాట. ఈ అహంకారం రెండు విధాలుగా పనిచెయ్యగలదు. దంభాన్ని, దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పుడే కాక విషాదంలో, నిస్పృహలో మునిగిపోయినప్పుడు కూడా ఈ అహంకారమే మనలో పనిచేస్తూ ఉంటుంది. దీనిని బట్టి, మనకు అన్నిటికన్నా మించి ఒక సమస్థితి కలిగిన మనస్సు కావాలి అని అర్థమవుతుంది. ఆ సమస్థితితో మనస్సు ఒక అంచు నుంచి మరొక అంచుకు పరుగులు తీయకుండా ఉండాలి. మనం ధనవంతులమనీ, అధికారం కలవారమనీ మిడిసిపడటం ఒకవైపు అయితే, మనకేమీ లేదనీ, పేదవారమనీ, దుఃఖాలలో మునిగి ఉన్నామనీ అనుకోవడం రెండవవైపు. ఈ రెంటికీ మధ్యనున్న మార్గాన్ని మనం అనుసరించాలి. వేదాలలో కనిపించే బోధలు, మనకు ఆ మార్గాన్ని అత్యంత శక్తిమంతంగా, స్పష్టంగా చూపాయి. మిగిలిన విషయాలన్నింటికన్నా మిన్నగా మనకు ఈ సమస్థితి కావాలనీ, ఇది కేవలం ఆధ్యాత్మిక జీవితంలోని ఉన్నత శిఖరాలకు చేరుకునేవారి కోసం మాత్రమే కాక మన రోజువారీ జీవితంలో కూడా అంతే అవసరం.  కొందరు చిన్నచిన్న విషయాలను కూడా తట్టుకోలేరు. వాతావరణం కొద్దిగా వేడెక్కినా, కొద్దిగా చలిగాలి వీచినా వారు గోరంతలు కొండంతలు చేసి తమ బాధల్ని వివరిస్తారు. కానీ అదంతా వారి మనస్సులో తయారయినదే. నిజానికి మనం అత్యంత విషాదం అని భావించే పరిస్థితి కూడా మన మనస్సులో తయారు చేసుకున్నదే. మన విషయమేమిటో మనమే ముందుగా గమనించాలి. ఒకరోజు మనం మంచి ఉత్సాహం నిండిన మనస్సుతో, ధైర్యంతో, నిర్భయంగా, అంతా భగవదర్పణమే అన్నట్టు పనిచేస్తాము. మరొకరోజు నిరాశతో, సంశయంతో, అసంతృప్తితో పనిచేస్తాము. వీటియొక్క ప్రభావం మన జీవితం మీద ఎలావుంటుందో మనం గమనిస్తే, 'మనకు మనమే మిత్రుడు, మనకు మనమే శత్రువు' అని ఎందుకు చెప్పారో ఇట్టే అర్ధమవుతుంది. నిస్పృహ వల్ల మనల్ని మనమే అధోగతి పాలుచేసుకోవడం కాక తోటివారిని కూడా మనతో పాటు క్రిందికి లాగుతాము.  ఎవరైతే అలాంటి నిరాశానిస్పృహలలో మునిగిపోయి ఉంటారో, వారికి వేరొకరి జీవితాన్ని తాకే అధికారం లేదు అని ఒక గొప్ప గురువు చెప్పుతూ ఉండేవాడు. జీవితమనేది విషాదంగా ఉండటం కోసం కాదు. మన నెత్తిమీద ఉన్న బరువును వేరొకరిని మోయమనడం సమంజసం కాదు. విచ్చలవిడి ప్రవర్తన వల్ల ప్రయోజనం లేదు.  కొందరు విషాదంలో మునిగితేలుతూ ఉంటారు. చూడబోతే వారికి అదే చాలా ఇష్టంగా కనిపిస్తున్నట్టు తోస్తుంది. మీరు వారిని అందులోనుండి ఒకసారి బయటకు లాగితే వాళ్ళు తిరిగి అందులోనే పడిపోతూ ఉంటారు. వారికి ఆ నిస్పృహ అనే పంజరంలో ఉండటం అలవాటయిపోయింది. ఇక వారు తమకు తామే అందులోనుంచి బయట పడాలి. ప్రపంచంలోని మతాలన్నీ కలసి, అత్యున్నతమైన ఆదర్శాలన్నీ వారికి బోధించినా, వారిని వారు మేల్కొల్పుకునేవరకూ, వాటివల్ల వారికి ఏ ప్రయోజనమూ ఉండదు. అందుచేతనే భగవద్గీత ఎలుగెత్తి ఘోషించింది - "నిన్ను నీవు, నీచేతనే ఉద్దరించుకోవాలి! నిన్ను నీవు దిగజార్చుకోకూడదు!" అని.                                         ◆నిశ్శబ్ద.

అన్నింటికంటే విలువైనది

అనగనగా ఓ కాకి! దానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా తనలాంటి కాకులే కనిపించేవి. తోటి కాకుల కావుకావులతో దాని చెవులు చిల్లులు పడిపోయేవి. అసలు ఆ కాకులను చూడగానే జనమంతా విసుక్కునేవారు. ఏదో కాసిన ఎంగిలి మెతుకులు విదిలించి వాటిని వదిలించుకునేవారు. రోజురోజుకీ ఆ కాకికి తన మీద తనకే అసహ్యం వేయడం మొదలైంది. ‘కావుకావుమంటూ కరుకుగా అరవాలి. సర్వభక్ష్యాలనూ తిని కడుపు నింపుకోవాలి. ఇదీ ఓ బతుకేనా!’ అనుకుంటూ ఓ రోజు దీర్ఘాలోచనలో ఉండగా... దానికి పక్కనే ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఒక తీయని గొంతు వినిపించింది.   కాకి పక్కకి తిరిగి చూసేసరికి మామిడి చెట్టు మీద ఒక కోయిల కనిపించింది. ‘మిత్రమా! నీ గొంతు భలే మధురంగా ఉంది సుమా! పైగా నాలాగా నువ్వు నానాచెత్తా తినాల్సిన అవసరం లేదు. హాయిగా ఆ మామిడి చిగురులతో కడుపు నింపుకోవచ్చు. నీ గొంతు విన్న ఈ లోకం ఉగాది వచ్చేసిందని పొంగిపోతుంది. నీదెంత అదృష్టజాతకం’ అని తెగ పొగిడేసింది. ‘ఆ నాదీ ఒక బతుకేనా!’ అంది కోకిల నిట్టూరుస్తూ. ఆపై ‘నా రంగు నీకంటే నలుపు. పైగా వసంత రుతవులో తప్ప కూయలేను. అంతదాకా ఎందుకు! ఆఖరికి నా పిల్లలని కూడా నేను పొదగలేక, నీ గూటిలోకి చేరుస్తుంటాను. నా జాతి ముందుకి సాగుతోందంటే అది నీ చలవే. ఇక అదృష్టం అంటావా! ఆ మాట వస్తే చిలుకే గుర్తుకువస్తుంది. పంచరంగుల వన్నెలు, పంచదార పలుకులు దాని సొంతం కదా’ అని నిట్టూర్చేసింది.   కోకిల మాటలు విన్న కాకికి అందులో నిజం లేకపోలేదనిపించింది. వెంటనే ఓ చిలుకని వెతుక్కుంటూ బయల్దేరింది. కొన్ని గడియలు గడిచేసరికి ఓ జామచెట్టు మీద మాంచి దోరపండుని తింటున్న చిలకమ్మ కనిపించింది. ‘చిలుకా క్షేమమా! ఇప్పటిదాకా నీ అదృష్టం గురించే నేనూ కోకిలా మాట్లాడుకున్నాము. నిన్ను చూస్తుంటే కోకిల చెప్పినదానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. ఏమి అందం, ఏమి గాత్రం... పైగా కమ్మని జామపళ్లతోనే కడుపు నింపుకునే భాగ్యం. అసలు బతుకంటే నీదే!’ అంటూ పొగడ్తలను వల్లె వేసింది.   ‘ఉష్‌! గట్టిగా అరవబాక. ఏ వేటగాడన్నా వింటే నన్ను పట్టుకుపోయి పంజరంలో బంధించేయగలడు. అయినా నాదీ ఒక అందమేనా? నాదీ ఒక స్వరమేనా? అసలు నువ్వెప్పుడన్నా నెమలి అనే పక్షిని చూశావా? అది పురివిప్పి నాట్యమాడటాన్ని గమనించావా? అదీ అందమంటే! అదీ నాట్యమంటే! అదీ అదృష్టమంటే!’ అంటూ నోరు తెరుకుని ఉండిపోయింది. కాకికి చిలుక మాటలు నిజమే కదా అనిపించాయి. తానెప్పుడూ నెమలి నాట్యం గురించి వినడమే కానీ చూసే అదృష్టం కలుగలేదు. ఈసారి ఆ నాట్యమేదో తను కూడా చూసి తీరాలి. చిలుక చెప్పిన మాటలను పూర్తిగా రూఢిచేసుకోవాలి. నెమలి జీవితమే అన్నింటికంటే అదృష్టజాతకం అని రుజువుపరుచుకోవాలి. అలా అనుకుంటూ నెమళ్లు ఎక్కువగా తిరుగాడే ప్రాంతానికి వెళ్లి కాపువేసింది.   కాకి అదృష్టం ఏమో కానీ, కాసేపట్లోనే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గుంపులోని నెమళ్లు కొన్ని పురివిప్పి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఆ నాట్యాన్ని చూసి కాకి కళ్లు చెదిరిపోయాయి. ఏం అందం! ఏం నాట్యం! ఏం ఈకలు! ఏం హొయలు! అనుకుంటూ ఆశ్చర్యపోయింది. వెంటనే ఓ నెమలి దగ్గర వాలి ‘ఆహా అదృష్టమంటే మీదే కదా! అసలు పక్షిజాతిలో మిమ్మల్ని మించినవారు లేనే లేరు. మీ గాత్రం, మీ నాట్యం, మీ అందం.... ముందర మా బతుకులన్నీ బలాదూర్‌’ అనేసింది.   ఆ మాటలు విన్న నెమలి కళ్లలోంచి కన్నీరు ఒలికింది ‘ఓసి పిచ్చిదానా! నాదీ ఒక బతుకేనా! మబ్బు పట్టినప్పుడు తప్ప నేను నాట్యం చేయలేను. మిగతా సమయాలలో ఈ ఈకలు నాకు బరువు. పైగా ఈ ఈకల కోసమే వేటగాళ్లు నన్ను వేటాడుతూ ఉంటారు. ఈ శరీరాన్ని వండుకు తినేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక అన్నింటికీ మించిన దౌర్భాగ్యం చెప్పనా! పక్షినన్న మాటే కానీ ఆకాశంలో అంతెత్తున ఎగరగలనా? నా మటుకు నాకైతే నిన్ను చూసినప్పుడల్లా భలే ఈర్ష్యగా ఉంటుంది. ఏది పడితే అది తిని బతికేస్తావు. ఆకాశంలో చక్కుర్లు కొడుతూ తిరిగేస్తావు. నీకు వేటగాళ్ల బాధ లేదు. ఆకలితో ఉండే రోజూ ఉండదు. హాయిగా వేళకింత తింటూ, పిల్లల్ని కంటూ, గూట్లో గువ్వల్లే బతికేస్తావు. అసలు అదృష్టమంటే నీది. అన్నింటికంటూ అమూల్యమైన స్వేచ్ఛ నీ దగ్గర ఉంది. అన్నింటికంటే శాపమైన ఆకలి నీ జోలికి రాదు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెమలి మాటలకు కాకి మనసు ఆకాశంలో తేలిపోయింది. ఆ మనసుతో పాటే తాను కూడా రివ్వున నింగికి ఎగిరిపోయింది. (జానపద కథ ఆధారంగా) - నిర్జర.

కష్టనష్టాలు చూసి దిగులుపడుతున్నారా?

జీవితం అనేది సుఖదుఃఖాల కలయిక. మనం సుఖాన్ని ఎలా అనుభవిస్తామో, దుఃఖాన్ని కూడా సహించగలిగి ఉండాలి. జీవితాన్ని అన్ని కోణాలలో పరిశీలిస్తే జీవన సంబంధాల విలువ, ప్రాముఖ్యత మనకు అర్ధమవుతుంది. కానీ ఈ విషయం అర్ధం చేసుకోకుండా చాలామంది సంతోషాలు, సుఖాలు మాత్రమే కావాలని అనుకుంటారు. అది చాలా పొరపాటు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి.  మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి చీకటి వెలుగులులాంటివి. చీకటి తరువాత వెలుగు, వెలుగు తరువాత చీకటి ఇలా ఒకదాని తరువాత ఒకటి ఎలాగ వస్తూ పోతూ ఉంటాయో అలాగే మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి కూడా ఒకదాని తరువాత ఒకటి వస్తూపోతూ ఉంటాయి. వాటి గురించి మనం ఆలోచించ కూడదు. కష్టం వచ్చినప్పుడు బాధపడి, సుఖం వచ్చినప్పుడు ఆనందించకూడదు. కష్టసుఖాలను సమానంగా అనుభవించే గుణాన్ని కలిగి ఉండాలి. ఇలా కష్టసుఖాలను సమానంగా చూసే స్వభావం ఉన్నవారు అన్ని పరిస్థితులను తట్టుకుని నిలబడగలరు.  ముఖ్యంగా ఓటమికి వెనకడుగు వేయడం, కష్టాలు వచ్చినప్పుడు భయపడటం వంటి స్వభావం తగ్గిపోతుంది. రెండింటిని సమానంగా చూడటం నేర్చుకుంటే. అప్పుడే మనిషి తన జీవితంలో ఎదగగలడు. ప్రస్తుత సమాజంలో అందరూ కూడా అశాశ్వతమైన విషయాలపై మోజు పెంచుకొని జీవన సమరంలో అలసిపోతున్నారు. నిరంతరం అశాంతి, ఆందోళనలు, అలజడుల మధ్య మనిషి జీవితం కొనసాగుతుంది. మనిషికి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అయినా సరే వాటికోసమే పోరాటం సాగించి జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నాడు. జీవితంలో పోరాటం అనేది ఉండాలి. ఎందుకంటే జీవితమంటేనే పోరాటం, పోరాటంలోనే ఉంటుంది జయం అన్నారు. అంతేకానీ జీవితాన్నే పోరాటంగా చేసుకోకూడదు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సంఘటనలు, జ్ఞాపకాలు, అనుభూతులు, సామాజిక బంధాలు జీవితంలో పెనవేసుకు పోతాయి. విజయవంతమైన, ఫలప్రదమైన జీవితం గడపటానికి ఈ బంధాలు, వాటి మధ్య పటిష్టత చాలా అవసరం. ప్రస్తుత సమాజంలో జీవితం వేగవంతం కావటం,  తీరికలేని పరిస్థితి, పట్టణాలలో స్థిరపడటం, ప్రవాస జీవితం మొదలైన కారణాల వల్ల మనుషుల మధ్య బంధాలు బలహీనంగా ఉన్నాయని చెప్పవచ్చు.  పూర్వకాలంలో పండుగలు, పుణ్యకార్యక్రమాలకు కుటుంబ సభ్యులు అందరూ సమావేశమయ్యేవారు. కష్టసుఖాల గురించి చర్చించుకొనేవారు. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత కాలంలో తగ్గిపోతున్నాయి. ఫోనులలో పలకరించటం, తమకు తీరికలేదని చెప్పటం ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రకంగా అనుబంధాలలో స్వచ్ఛత లోపించటం కనిపిస్తుంది. జీవితం అనేది చాలా విలువైనది. మన విలువైన జీవితాన్ని అంతం చేసుకోవటం అనేది సమర్ధనీయం కాదు. ఎందుకంటే చాలామంది యువకులు, గృహస్తులు తాత్కాలిక భావోద్వేగాలకు లోనయి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. జీవితం విలువ తెలుసుకున్నవారు మాత్రమే జీవితాన్ని అర్ధం చేసుకుంటారు. ఆర్ధిక బాధలు, ప్రేమ విషయాలలో విఫలం కావటం, అవమానం, మానసిక ఒత్తిడి, తీవ్ర అనారోగ్యం, అనుకున్నవి జరగలేదనే తీవ్ర ఆవేదన, డిప్రెషన్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జీవితానుభవం ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలి.                                         ◆నిశ్శబ్ద.

ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే కథ!

మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్థంభం. ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు, జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరతారు.ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు. అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం. తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పు దారిలో వెళ్తున్నారని అర్థం. మనిషి ధర్మం గా ఉండాల్సిన అవసరం గురించి, ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి, ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే ఒక కథ ఇది!! ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది. అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు అతడి భార్య అక్కడికి వచ్చింది.  "ఏమిటండీ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు" అని అడిగిందామె. యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది" అని బదులిచ్చాడు అతడు. "అవునా నేను నిన్న పొరపాటున  తాంబూలాన్ని యజ్ఞకుండంలో ఉమ్మేశాను. అదే ఇలా బంగారం అయ్యిందేమో!!"  "తాంబూలం అమ్మితే బంగారు ముద్ద రావడం ఏమిటే!! నీ బుద్దిలేని ఆలోచన కాకపోతే" అని విసుక్కున్నాడు అతడు. "సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను. రేపు ఏమవుతుందో చూద్దాం" అన్నదామె. అతను సరేనని చెప్పడంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మేసింది. మరుసటిరోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారు ముద్ద కనిపించింది. వారికి రోజు తాంబూలం ఉమ్మి వేయడం, మరుసటిరోజు బంగారు ముద్ద తీసుకోవడం అలవాటు అయిపోయింది. అలా చేయడం వల్ల కొద్ధి కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులు అయిపోయారు. వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది. ఆ ఊర్లో మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయడం బంగారు ముద్దలు తీసుకోవడం అందరికీ అలవాటు అయింది.  అందరూ ధనవంతులైపోతున్నారు. అయితే ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా ఆమె యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు. అందరూ ధనవంతులవుతుంటే, తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు. చివరికి భర్త ఎంతకీ మాట వినకపోవటంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది. చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు. వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇళ్ళు తగలబడిపోసాగాయి.  అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు "ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది. అలా కాక ధర్మచ్యుతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారి తీస్తుంది. ఇన్నాళ్ళూ మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది. మనం ఊరిని వదిలాం. అసూయా, ద్వేషాలతో ఊరు నాశనమైంది" అని. అది విన్న భార్యకు విషయం అర్థమైంది. ప్రస్తుతం మన సమాజం ఆ ఊళ్ళోవారున్న స్థితిలో ఉంది. ధనసంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరివాళ్ళలాగా, ప్రస్తుతసమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డీ మేసేందుకు సిద్ధమౌతోంది. ఎంత ధనం సంపాదిస్తే, అంత అశాంతి పాలవుతోంది. నైతికవిలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది. మన తరువాతి తరాలైనా ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే "ఉత్తమ ఆదర్శం" ఎంతో అవసరం.                                    ◆నిశ్శబ్ద.

నేటి యువత తెలుసుకోవలసిన ముఖ్య విషయమిదే!

శాంతి సమాజ సౌధానికి పునాదిరాళ్ళు నేటి యువతీ యువకులే! అలాంటి యువతరం నేడు మానసిక ఉద్రేకాలకు లోనై హింసా ప్రవృత్తి మార్గాన్ని అనుసరించడం బాధాకరం! ఈ రోజు సమాజంలో పాశ్చాత్య పోకడలు, భౌతిక ఆకర్షణలతో పాటు మరెన్నో పరిస్థితులు యువతను దారుణాలకు ఉసిగొల్పుతున్నాయి. ఇదే భావనతో కురుక్షేత్ర సమరంలో అర్జునుడు...  అథ కేన ప్రయుక్తో యం పాపం చరతి పూరుషః | అనిచ్ఛన్నపి వార్డేయ బలాదివ నియోజితః ॥  'పరమాత్మా! మానవుడు పాపమాచరించేందుకు అసలు హేతువేమిటి? ఇష్టం లేకున్నా కూడా మనుష్యులు ఎవరో బలవంతంగా ప్రోత్సహించినట్లు పాపం ఎందుకు చేస్తున్నారు? పాపాచరణకు కారణం బాహ్యమా? ఆంతరంగికమా? అని శ్రీకృష్ణభగవానుడిని ప్రశ్నిస్తాడు అర్జునుడు. దీనికి సార్వకాలికమైన, సార్వజనికమైన విశ్లేషణతో ఆ జగదేకనాయకుడు అద్భుతమైన వివరణనిస్తాడు. రజోగుణం నుంచి పుట్టిన కోరిక, అది తీరనప్పుడు కలిగే క్రోధమే పాపం చేయటానికి ప్రధాన కారణాలని స్పష్టం చేస్తాడు భగవానుడు. ఈ రోజు కూడా మనం పరిశీలిస్తే 'తీరని కోరికలు; తీరకపోతే కలిగే కోపాలే' యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ రెండింటి వలన కలిగే పరిణామాలు, మనిషిని రాక్షసుడిగా మార్చేస్తున్నాయి. అందుకే మన సనాతన ధర్మం మనిషిలోనే ఉండి, మనిషికి శత్రువుగా మారి అతనిని నేరప్రవృత్తి వైపునకు మరలించే ఆరుగుణాలను 'షడ్-రిపు'గా అభివర్ణించాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు! ఇవన్నీ మానవుడు పుట్టినప్పటి నుంచీ మనస్సును ఆవరించి అల్లకల్లోల పరుస్తున్నా, వాటి నుంచి బయటపడే మార్గాన్ని కూడా మన సనాతన ధర్మంలో విపులంగా సూచించారు. మనిషి తలచుకుంటే ఈ కామక్రోధాలను తన అదుపులో పెట్టుకోగలడు. ఇతర జీవజాతులకు ఆ అవకాశమే లేదు.  దురదృష్టవశాత్తూ ఆధునిక నాగరకతలో యువతీయువకులు మనస్సుకు ఈ రకమైన శిక్షణనివ్వటంలో ఘోరంగా విఫలమవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కింది నాలుగు అంశాల్లో తమ మానసిక సమతౌల్యాన్ని కోల్పోవటం వల్లే యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంతటి నేరాలకైనా ఒడిగడుతున్నారు. అవి... మానసిక ఉద్వేగం (emotionality)  క్రియాశీలత (activity) ప్రచోదనం (impulsivity) సాంఘికంగా సర్దుబాటు (sociability)  ఒక కోరికవైపు మనస్సు మొగ్గుచూపగానే వెంటనే అది 'ఎమోషనల్' అయిపోతోంది. దానిని ఎలాగైనా తీర్చుకోవాలన్న తపన పెరుగుతోంది. ఈ సమయంలోనే ఆ కోరిక సక్రమమైందా? కాదా? అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించుకోవాలి. తరువాతే మన క్రియాశీల, ప్రచోదక శక్తులను వినియోగించుకోవాలి. అప్పుడే మనస్సు సరైన దిశలో పయనించటం అలవరచుకుంటుంది. లేనట్లయితే, కనిపించిన ప్రతి కోరికనూ మనస్సు తీర్చుకోమంటుంది. ప్రలోభాలతో ప్రమాదంలోకి పడవేస్తుంది. ముఖ్యంగా మన నడవడిక, కామ, క్రోధాలు సమాజంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో ఆలోచించుకోవాలి.  పుట్టే  ప్రతి కోరికను తీర్చుకుంటూ దాన్ని సంతృప్తిపరచాలని ప్రయత్నించటాన్ని మించిన అమాయకత్వం మరోటి లేదు. అవి ఎంత తీర్చితే, అంతకు వందరెట్లు ఆవురావురుమంటూ వెంట పడతాయి. చివరకు మన పతనానికే కారణమవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విశృంఖల ఇంద్రియవాంఛలే (unrestrained sensual desires) సభ్యసమాజంలో నేరధోరణికి ప్రధాన కారణం. అందుకే ఎక్కడో ఒక దగ్గర వాటికి భరతవాక్యం పలకాలి. అందుకే భగవద్గీతలాంటి ధార్మిక సారస్వతం 'వాంఛలను అణచుకోమని' చెప్పటం లేదు. వాటిని అధిగమించి ఉన్నతమైన అంశాలపైకి మనస్సును తీసుకువెళ్ళమంటోంది.                                     ◆నిశ్శబ్ద.

 ఇంకొంచెం సంతోషంగా జీవిద్దాం 

 జీవించడానికి, బతకడానికి మధ్య ఒక సన్నని గీతను చూపెడుతుంటారు కొందరు. అయితే సాధారణ జీవితాల్లో బంధాలు, భాధ్యతలు, సర్దుకుపోవడాలు త్యాగాలు, వీటన్నిటికీ మించి  కాలం తో పాటు అన్నిటికి అలవాటు పడుతూ కుటుంబంలో అందరితో సమన్వయంగా ఉంటూ ఇలా కొనసాగడం ఎక్కువ మంది చేసే పని. బహుశా ఇట్లా చేసే పనుల్లో ఇష్టం, తృప్తి కంటే బాధ్యత కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే మెంటాలిటీనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక విషయం. ఇలా చేసే పని వల్ల సంతోషం ఉంటుందా?? యాంత్రికంగా, కృత్రిమత్వంగా చేసే పనికి, ఇష్టంగా చేసే పనికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆ రెండిటి మీదనే మనిషిలో తృప్తి తాలూకూ స్పందనలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని బహుశా చాలామంది గమనించరు. అలా గమనించకపోవడం అనేది కూడా ఆ యాంత్రికం మరియు కృత్రిమత్వంలో భాగమే. అయితే కొందరు మాత్రం చేసే పనిలో కూడా ఎంతో తృప్తిని చవిచూడగలుగుతారు కారణం ఏమిటి అని ప్రశ్న వస్తే కొందరు చెప్పే సమాధానం. బహుశా నచ్చిన పని కావచ్చు అందుకే అంత సంతోషం అనేస్తారు.  కానీ అసలు నచ్చిన పని ఏమిటి?? నచ్చని పని ఏమిటి?? మనిషికి, సంతోషానికి, ఇష్టానికి మధ్య సంబంధం ఏమిటి?? ఇవన్నీ ఆలోచించాల్సి వస్తే మొదట మనసును ప్రభావితం చేసిన పరిస్థితులు, చేతనైనది, చేతకానిది, లేదా నైపుణ్యం సాధించింది ఇలా ఎన్నో పరిగణలోకి వస్తాయి. కానీ ఏ పనిని అయినా ఒక అవగాహనతో, ఒక ప్రణాళికతో చేయాలని అనుకుంటే మాత్రం తప్పని సరిగా ఆ పనిలో తృప్తిని పొందగలం. వాస్తవాన్ని స్వీకరించి, కాలాన్ని ప్రేమించాలి వాస్తవం ఏది అనేది తెలిసినప్పుడు దాన్ని నిజాయితీగా స్వీకరించాలి. ఎప్పుడూ అది కాదు, అది బాగలేదు, అది నాకు సంబంధించినది కాదు వంటి మభ్యపెట్టుకునే ఆలోచనల్లో ఉండకూడదు. వాస్తవాన్ని ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు స్వీకరిస్తామో అప్పుడు కాలాన్ని కూడా ప్రేమించగలుగుతాము. ఇదంతా కూడా కొన్ని భ్రమలు, కొన్ని కల్పనలను బుర్రలో నుండి వదిలేసి స్పష్టమైన కోణంలో ఆలోచించడం వల్ల కలిగేది.  ఒక వస్తువును చూడాలి అంటే కాగితాన్ని అడ్డు పెట్టుకుంటే ఎలాగైతే మసకగా కనిపిస్తుందో అలాగే కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమాలు, షరతులు, మనసును కట్టిపడేసే పద్ధతులు అన్నిటి మధ్య చూస్తే వాస్తవం అనేది స్పష్టంగా కనిపించదు, అర్థం కాదు. అలా కాకుండా కేవలం విషయాన్ని, దాని తాలూకూ కారణాలను మాత్రమే చూస్తూ, విశేక్షించుకుంటే వాస్తవం తొందరగా బోధపడుతుంది. ఇక కాలాన్ని ప్రేమించడమంటే అన్ని దశలను కూడా ప్రేమించడం. ఇక్కడ మనిషి పరిపక్వతను సూచించేది ఏదైనా ఉందంటే అది కచ్చితమై కాలం. అదే వర్తమానం. పరిపక్వత కలిగిన మనిషి గతాన్ని గురించి బాధపడడు, భవిష్యత్తు గురించి ఖంగారు పడడు. కేవలం వర్తమానాన్ని ఎంత సమర్థవంతంగా ఎంత సంపూర్ణంగా వినియోగించుకుంటున్నాం. మన పనులను వర్తమానంలో ఎంత బాగా చేస్తున్నాం అనే విషయం మీదనే శ్రద్ధ పెడతాడు. కాబట్టి ఇక్కడ తెలిసొచ్చేది ఏమిటంటే మనం సాధారణంగా ఏ పని చేసిన కూడా దాన్ని మనసుకు తీసుకునే విధానంలోనే సంతోషం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే చేసే పని ఏదైనా దాన్ని ఇష్టంతో చేయగలిగితే మరింత సంతోషంగా ఉండవచ్చు. ఆ పాజిటివ్ కోణమే మీ జీవితాన్ని కూడా సంతోషంగా ఉంచుతుంది.                                                                                                                                                                                                                                                                                              ◆ వెంకటేష్ పువ్వాడ

మంచి నిద్రకు అద్భుతమైన మందు!!

ఈ కాలంలో హాయిగా నిద్రపోవడం కూడా అదృష్టమే. ఎంతో మంది నిద్రలేమితో సతమతమవుతుంటారు. నిద్ర పట్టాలని ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటారు. కానీ ఏవీ చక్కని పలితాన్ని ఇవ్వవు. కొందరు ధ్యానం అంటారు అయిదు నిమిషాలు స్థిరంగా కూర్చోలేరు. మరికొందరు ఒత్తిడి అంటారు దానివల్ల నిద్రలేమి అంటారు దాని కోసం డాక్టర్లను సంప్రదిస్తారు. మందులు వాడుతూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు అలా మందుల వల్ల నిద్రకు అలవాటు పడి తరువాత వాటిని వాడటం ఒక్కరోజు ఆయన ఇక నిద్ర ఖరాబ్. మళ్లీ నిద్ర రాదు, పట్టదు. ఇంకొందరికి ఆలోచనలు.  జీవితం గూర్చి, భవిష్యత్తు గూర్చి.మరికొందరికి ఓర్వలేనితనం వల్ల నిద్ర పట్టదు. చెప్పుకోవడానికి, వినడానికి కాస్త ఆస్చశ్రయంగా అనిపించినా ఇది నిజం. ఒకరు ఎదుగుతున్నారంటే భరించలేని వాళ్ళుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఇతరులు ఎదిగిపోతున్నారని ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇదే కోవకు చెందినవాళ్ళు మరికొందరు ఉంటారు. ఇంకొందరు అయితే చాటింగ్ లు, బ్రౌజింగ్ లు, అనవసరపు పనులు చేస్తూ చేతులారా నిద్రను దూరం చేసుకుంటారు. ఇట్లా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు. నిద్ర పట్టకపోవడానికి కూడా బోలెడు కారణాలు ఉన్నాయి. అయితే నిద్రకు ఒక చక్కని మందు ఉంది. అదేంటో తెలియాలి అంటే కింద విషయం చదవాలి. అనగనగా ఒకరాజు. ఆయన గొప్పవాడు. రాజ్యం ఉంది, సంపదలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. సకల సౌభాగ్యాలు ఉన్నాయి. కానీ ఆయనకు లేనిది ఒకటే నిద్ర. నిద్ర పట్టదు. పరుపు మీద పడుకుని దొర్లి దొర్లి పెడతాడు. కానీ నిద్ర రాదు. ఒకరోజు రాత్రిపూట నిద్రపట్టక తోటలోకి వెళ్ళాడు. ఆ తోటకు ఆనుకుని అడవి ఉంది. ఆ అడవి నుండి ఆ వేళ ఏదో శబ్దం వస్తోంది. ఈ సమయంలో ఎవరో చూడాలి అనుకుని తోట నుండి అడవిలోకి వెళ్ళాడు రాజు. ఆ అడవిలో ఒక వ్యక్తి చెట్టు నరుకుతూ కనిపించాడు. వెన్నెల వెలుగు ఉండటంతో పని జరుగుతోంది.  "నువ్వు రాత్రిపూట నిద్రపోకుండా చెట్టు నరుకుతున్నావు. నీకు నిద్ర పట్టదా" అని అడిగాడు రాజు. రాజు సాధారణ బట్టలు వేసుకుని ఉండటంతో ఆ వ్యక్తి అతన్ని రాజు అనుకోలేదు. "ఎందుకు రాదు అలా పడుకుంటే కొన్ని సెకండ్లలోనే .శవం మాదిరి నిద్రపోతాను. కానీ పని జరిగితేనే డబ్బులొస్తాయి. కాబట్టి తప్పదు పని చేయాలి" అన్నాడు ఆ వ్యక్తి. "ఏంటి సెకండ్లలోనే నిద్ర వచ్చేస్తుందా నేను నమ్మను" అన్నాడు రాజు. "నమ్మకపోతే నేను ఏమి చేయలేను" అన్నాడు ఆ వ్యక్తి. "ఒకపని చేద్దాం. నేను నీ బదులు చెట్టు నరుకుతాను. నువ్వు సెకండ్లలోనే నిద్రపోతా అన్నావుగా నిద్రపో చూద్దాం" అన్నాడు రాజు. ఆ వ్యక్తి సరేనని గొడ్డలి రాజుకు ఇచ్చి చెట్టుకింద అలా పడుకుని నిమిషంలోపలే గురక పెట్టి నిద్రపోయాడు. "పట్టు పరుపులు, మెత్తని దుప్పట్లు అన్ని ఉన్నా నాకు నిద్ర రాదు. వీడు చెట్టు కిందనే ఇట్లా ఎలా నిద్రపోయాడు" అనుకున్నాడు రాజు. ఆ తరువాత వాడికి మాట ఇచ్చాను కాబట్టి చెట్టు నరకాలి అనుకుని చెట్టు నరికేసాడు. అలవాటు లేని పని అవ్వడం వల్ల చేతులు బొబ్బలెక్కాయి. చెమటతో శరీరం తడిసి ముద్దయ్యింది.అలసట కలిగింది. కాళ్ళు, చేతులు లాగేసాయి. మెల్లిగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతడి పక్కనే అలా నడుము వాల్చాడు. నిమిషంలోపలే హాయిగా నిద్రపోయాడు. ఉదయాన్నే రాజుకు మెలకువ రాగానే అనుకున్నాడు. మనిషికి శారీరక కష్టమే మంచి నిద్రను ప్రసాదిస్తుంది అని.  కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే మంచి నిద్ర కావాలి అంటే కష్టపడి పనిచేయాలి. దురదృష్టం కొద్దీ ఈ కాలంలోప్రతి ఇంట్లో పని దొంగలు ఎక్కువ ఉంటున్నారు. పని మనుషులను పెట్టుకోవడం కూడా అందుకు ఓ కారణం. మనిషి శరీర ఆరోగ్యానికి, మంచి నిద్రకు ఏ వైద్యుడు ఇవ్వలేని గొప్ప ఔషధం కష్టం. అందుకే కష్టపడాలి. నష్టం ఏమి ఉండదు. ◆ వెంకటేష్ పువ్వాడ  

అనుమానం!

అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమైన, అందమైన కోటలెన్నింటిలో నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత్రమైన మహలుని నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్దాలగది నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు.   శిల్పి చూపించిన అద్దాల గది, అలాంటి ఇలాంటి గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప్రవేశిస్తే వారిని ప్రతిబింబించేలా గదిలో అన్నివైపులా అద్దాలే! గది పైకప్పు, కింద గచ్చు కూడా అద్దాలతోనే తయారుచేశాడు. కంట్లో నలుసు కూడా కనిపించేంత స్పష్టంగా ఉన్నాయా అద్దాలు. లోపలికి ప్రవేశించిన మనిషికి తాను ఎక్కడ నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని ఉన్నాయి ఆ అద్దాలు. అంతేకాదు! ఆ అద్దాల గదిలోని శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా ప్రతిధ్వనించేవి. రాజుగారు నిర్మించిన ఈ కొత్త మహలు గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే అదృష్టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు తెగ ఎదురుచూడసాగారు. ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి ప్రవేశించింది. లోపలికి అడుగుపెట్టగానే దానికి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి చెంతన ఉండే అర్హత తన ఒక్కదానికే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపెట్టడానికి ఒక్కసారిగా తన వాడి పళ్లను చూపించింది. చిత్రం! అవి కూడా అలాగే తనని భయపెట్టేందుకు కోరలు చూపించాయి. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఒక్కసారి గట్టిగా మొరిగింది కుక్క! దానికి నాలుగువైపుల నుంచీ భీకరంగా శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇక తన చుట్టూ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తప్పలేదు. గాల్లోకి ఎగిరెగిరి పడుతూ, లేని శత్రువులను ఉన్నారనుకుని అద్దాల మీద పడుతూ నానా భీభత్సం సృష్టించింది. ఉదయాన్నే అద్దాల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క నిర్జీవంగా కనిపించింది. రాత్రంతా తన ప్రతిబింబాలతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడిపోయింది. మన మనసు కూడా అద్దాల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో మనమీద మనమే పోరాటం చేస్తూ ఉంటాము! కానీ అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే!

యోగం జీవనరాగం!

భారతీయ సనాతన వ్యవస్థ చాలా గొప్పది. ఎన్నో వేల సంవత్సరాల నుండి మహర్షులు, ఋషులు, పూర్వీకులు కొన్ని విశిష్టమైన జీవనవిధానాలను ఆచరిస్తూ తమ ముందు తరాల వారికి కూడా వాటిని అందజేశారు. అలా తరాలుగా వస్తున్న గొప్ప జీవనశైలిలో ఎంతో అద్భుతమైనమార్గం యోగ. యోగను రోజువారీ చేసేపనులలో అంటే ఉదయం లేవడం, ఇంటి  పనులు, వ్యాయామం, ఆహారం తినడం వంటి పనుల్లా యోగా కూడా ఒక గంటనో, లేక కొన్ని నిమిషాలో సాగే ప్రక్రియగా భావిస్తారు చాలామంది. యోగ అంటే ఏంటి? యోగ అంటే శరీరాన్ని వివిధ భంగిమలలోకి వంచి ఆసనాలు వేయడం అని కొందరు అనుకుంటారు. ధ్యానం చేయడం అని మరికొందరు అనుకుంటారు. రెండింటిని కలిపి చేయడం అని కొందరు అనుకుంటారు. కానీ యోగ అనేది ఒకానొక జీవనవిధానం అనే విషయం కొద్దిమందికే మాత్రమే తెలుసు.  మనుషుల జీవన విధానాలు కూడా వర్గాలుగా ఉన్నాయా?? వేరు వేరుగా ఉంటాయ అని అనుమానం వస్తుంది. మనిషి జీవనశైలిని బట్టి మనిషి జీవనవిధానం విభిన్నంగా ఉంటుంది. ఆ విభిన్నతే మనిషి శారీరకంగా మానసికంగా ఎలా ఉన్నాడు అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతూ ఈ వేగవంతమైన కాలంలో కూడా నిశ్చలమైన మనసును కలిగి ఉండటం, సహజత్వానికి, ప్రకృతికి దగ్గరగా జీవించడమే యోగమని ఆ మార్గాన్ని యోగ అని అంటారు. జీవితాన్ని రీఛార్జి చేస్తుంది! యోగ అనేది జీవితాన్ని రీఛార్జి చేసే గొప్ప మార్గం. నిజానికి ఇది ఒక మంచి మెడిసిన్ లాంటిది. జీవితం నిస్సారంగా మారిపోయి ఎలాంటి ఆశ లేదనుకునే స్తాయిలోకి జారిపోయినప్పుడు యోగ మనిషికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది.  జీవన సరళి! అప్పటివరకు గందరగోళంగా ఉన్న జీవితాన్ని ఒక గట్టుకు చేర్చేదే యోగ.  క్రమశిక్షణను, స్పష్టతను కలిగి ఉండేది.  ఉదయాన్నే లేచి ఆసనాలు చేసి, ముక్కు మూసుకుని ప్రాణాయామం, ధ్యానం చేయగానే యోగ చేసినట్టు కాదు. జీవితంలో ప్రతిరోజూ ప్రతి  క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి పనిని అనుభూతి చెందుతూ చేయడమే యోగం.  నేటి కాలంలో యోగ ప్రాముఖ్యత! ప్రస్తుత కాలంలో యోగ అంటే ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం ఇవే అనుకుంటున్నారు. నిజానికి ఇవన్నీ చేయడం కూడా ఇప్పటి జనాలకు పెద్ద టాస్క్ లాగా తయారయ్యింది. పట్టుమని పది నిమిషాల ధ్యానం, నాలుగు రకాల ఆసనాలు వేయడం రానివాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు అందరూ చెప్పుకునే యోగ గురించి అయినా సరిపడినంత అవగాహన కలిగించడం ఎంతో ముఖ్యం. యోగా క్లాసులు, అవగాహన సదస్సులు, నాటి మన మహర్షుల జీవనవిధానం వంటివి తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పట్లో అయితే సద్గురు జగ్గీ వాసుదేవ్, బాబా రాందేవ్ వంటి గురువులు యోగా మీద అవగాహన పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. భారతీయ యోగ గొప్పతనాన్ని గుర్తించిన విదేశీయులు సైతం భారతీయ జీవనవిధానానికి తమ మద్దతు తెలుపుతూ దాన్ని పాటిస్తూ తమ తమ జీవితాలను ఎంతో అందంగా మార్చుకుంటున్నారు. పెద్ద పెద్ద వృత్తులలో ఉన్నవారు, విద్యాధికులు యోగా మార్గాన్ని అనుసరిస్తూ లక్ష్యాలు సాధిస్తూ తమ విజయాలు అందరి ముందుకు తెస్తున్నారు. కాబట్టి యోగ అనేది రోజువారీ జీవితంలో మనం అన్నం తిన్నట్టు, నిద్రపోయినట్టు అప్పుడప్పుడూ చేసే ప్రక్రియ కాదు. నిరంతరంగా శ్వాసక్రియ జరిగినట్టు నిరంతరంగా జీవితంలో అది ఒక భాగం అయిపోవాలి. అప్పుడు ఆ యోగ మనిషి శరీరానికి జీవశక్తిని పెంపొందిస్తుంది, జీవితానికి అద్భుత రాగమవుతుంది.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

ప్రస్తుత సమాజాన్ని తప్పుదోవలో నడుపుతున్నది ఎవరు?

ప్రస్తుతసమాజాన్ని వ్యాపారసంస్కృతి నిర్దేశిస్తున్నది. వ్యాపారంలో ప్రచారం అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందంటే ప్రస్తుతం వ్యాపార ప్రచారం ఇరవై నాలుగు గంటలూ ప్రతి నట్టింటా వికృతరూపంలో నర్తనమాడుతోంది. పుట్టినప్పటి నుంచీ జీవితంలో అనుభవించగల సౌఖ్యాలు ప్రతివాడికీ ప్రతి వయసు నుంచీ తెలుస్తున్నాయి. ఆ సౌఖ్యాల సాధనకు ఏకైక మార్గం డబ్బు సంపాదన. దాంతో వ్యక్తి అభివృద్ధిని డబ్బు సంపాదనతో కొలవటం తప్పనిసరి అయింది. తమ పిల్లవాడు డబ్బు సంపాదించకపోతే పనికి రానివాడన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. దాంతో ప్రతివాడి జీవితలక్ష్యం ఎలాగోలాగ, వీలైన రీతిలో డబ్బు సంపాదించటమే అన్నది స్థిరమైపోయింది. సమాజం అవినీతిమయమై విలువలు తరగటంలో ప్రధానంగా తోడ్పడిన అంశం ఇది. డబ్బు మీద ఆశను కల్పించి, పెంచటంలో పాశ్చాత్య ప్రచారసంస్థలు గణనీయమైన విజయాన్ని సాధించాయని చెప్పవచ్చు. ప్రేమప్రచారం సమర్థంగా జరిగింది. యువతీ యువకులు కలిస్తే ప్రేమించి తీరాలన్న అభిప్రాయం ఏర్పడింది. కాలేజీలకు వెళ్ళేది ప్రేమించటం కోసమేనన్న అభిప్రాయం విస్తృతంగా ప్రచారమైంది. టూత్ పేస్టుతో పళ్ళు తోముకుంటే అమ్మాయి వచ్చి ఒళ్ళో వాలుతుంది. ఓ మోటర్ సైకిల్ కొంటే, ఇతరుడితో ఉన్న అమ్మాయి, వాడిని వదిలి వీడి దగ్గరకు వచ్చేస్తుంది. ఓ షేవింగ్ లోషన్ వాడగానే అమ్మాయి ప్రత్యక్షమైపోతుంది. ఇంకో మౌత్ ఫ్రెష్నర్ ఉపయోగిస్తే అమ్మాయిలు ఎగురుకుంటూ వచ్చి పడిపోతారు. ఇంకేదో సువాసన ద్రవ్యం వాడితే అమ్మాయిలు వెర్రెక్కి వెంటపడతారు. మరింకేదో కంపెనీ కళ్ళద్దాలు పెట్టుకుంటే, అమ్మాయిలు నిజంగానే పడిపోతుంటారు. ఈ ప్రచారం వల్ల, అబ్బాయిలకు అమ్మాయిలంటే ఎంతగా చులకన అభిప్రాయం కలుగుతుందో ఆలోచిస్తే, ఈ తరానికి మనం చేస్తున్న అన్యాయం అర్థమౌతుంది. అలాగే, ఓ అమ్మాయి "మిస్ యూనివర్స్" గా ఎన్నికై, సినిమాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించింది. ఆమె మిగతావారందరికీ ఆదర్శమైంది. ప్రతి వారూ అందంగా ఉండాలని పోటీలు మొదలుపెట్టారు. విదేశీ కాస్మెటిక్ కంపెనీలకు లాభం. విదేశీ ఎక్సర్ సైజ్ పరికరాల తయారీదారులకు లాభాలు. ఇక అమ్మాయిలు ఉన్నది అబ్బాయిలను ఆకర్షించేందుకే అన్న ప్రచారం పుట్టినప్పటి నుంచీ ఉగ్గు పాలతో అబ్బాయిలు నేర్చుకుంటున్నారు. ఓ అమ్మాయి ఓ క్రీమ్ వాడగానే అబ్బాయిలు వెంటపడతారు. ఓ హెయిర్ షాంపూ వాడితే ముగ్ధులైపోతారు. కంపెనీ ఐస్ క్రీమ్ అసభ్యంగా తింటూంటే కుర్రాళ్ళు సర్వం మరచిపోతారు.  ముఖం మీద మొటిమలు ఉంటే అబ్బాయిలు మెచ్చరు. కాబట్టి ఓ కంపెనీ మొటిమల మందు వాడితే ఇక అబ్బాయిలు క్యూలు కడతారు. ఇంకేదో పౌడరు, మరింకేదో అందాన్ని పెంచే వస్తువు.... కానీ అన్నీ అబ్బాయిలను ఆకర్షించేందుకే. ఐతే వీటన్నిటికీ డబ్బు కావాలి. డబ్బు కావాలంటే పరీక్షల్లో పాసవాలి. మార్కులు రావాలి. అప్పుడు కార్లు కొనవచ్చు, అమ్మాయిల్ని వెంట తిప్పుకోవచ్చు. ఇదీ ప్రస్తుతసమాజం ఆలోచిస్తున్న దిశ.  పైన చెప్పుకున్నవి అన్ని గమనిస్తే వ్యాపార సామ్రాజ్యాలు చాలావరకు ప్రస్తుత సమాజానికి నష్టం చేకూరుస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.                                     ◆నిశ్శబ్ద.

మనిషిలో మరొక అంతర కోణం!

హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు. పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ. మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది. మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.  పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన. కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు. కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం                                    ◆నిశ్శబ్ద.

నాన్నంటే నీలాకాశం..

ప్రతి వైకాఠి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీయమైనది. తాము తినకపోయినా పిల్లల కడుపు నింపడానికి ఎన్నో ఇబ్బందులు పడే తల్లిందండ్రులు ఎందరో ఉన్నారు. తల్లి నవమాసాలు మోసి కంటే, తండ్రి జీవితాన్ని ఇస్తాడు. తన జీవితం ముగిసేవరకు నేలమీద తిరగాడుతున్న బిడ్డకు ఆకాశమంత గొడుగై ధైర్యాన్ని, భరోసాను ఇస్తూ కాపాడుకుంటాడు. కానీ గుర్తింపు విషయంలో  నాన్నలు ఎందుకో వెనకబడుతారు.. భార్య కడుపులో నలుసు పడింది మొదలు బిడ్డకోసం ఆరాటపడే మగాళ్లు తండ్రులయ్యాక తమను తాము కోల్పోతారు.  భర్తగా, తండ్రిగా ఆ రెండు పాత్రల్లోనే జీవితాన్ని లాగిస్తారు. భార్య, పిల్లల కోరికల్ని నెరవేర్చడానికి ఎంత కష్టాన్ని అయినా సంతోషంగా అనుభవిస్తారు.  పిల్లల ప్రపంచం.. ప్రతి తండ్రికి తన పిల్లలంటే వల్లమాలిన ప్రేమ. భార్య కంటే కూడా పిల్లల మీద తండ్రికి ప్రేమ ఉంటుంది. ప్రతి తండ్రి మనసులో తన కొడుకు ఓ రాజకుమారుడు, కూతురు ఓ రాజకుమారిలా మెదులుతారు.  చిట్టి చిట్టి పాదాలతో తండ్రి గుండెల మీద పిల్లలు తంతున్నా వారికేమీ బాధ ఉండదు. కానీ పిల్లలే పెద్దయ్యాక తండ్రుల నమ్మకం మీద, తండ్రి గుండెల మీదా తన్నేసి పోతుంటారు. పాపం మగాళ్లకు ఏడవడం కూడా ఇబ్బందే.. కానీ తండ్రులు అయితే బిడ్డల్ని తలచుకుని మనసులోనే ఏడుస్తారు.  నాన్నంటే భరోసా.. చిన్నప్పుడు ఎవరైనా కొడితే మా నాన్నకు చెబుతా అని ధైర్యంగా చెప్పుకోవడం నుండి.. పిల్లలు పెరిగి పెద్దయ్యాక నాన్నకు చెప్పి తీరాలా?? అని ఎన్నో వెర్రి పనులు చేసి తీరా సమస్యల్ని నెత్తికి తెచ్చుకున్నాకా అదే నాన్న పంచన చేరి తన బాధను చెప్పుకునే కుర్రాళ్ళలు లెక్కే లేదు ఈకాలంలో.  చందమామ కావాలని మారం చేసిన బాలరాముడికి నీళ్లలో చందమామను చూపించి ఏమార్చిన  దశరథుడి లాంటి మనసు ప్రతి తండ్రిలోనూ ఉంటుంది. దశరథుడి వల్ల రాముడికి కీర్తి దక్కిందా?? రాముడి వల్ల దశరథుడి పేరు కీర్తికెక్కిందా అని తరచి చూస్తే.. పితృవాక్య పాలకుడైన రాముడి వలన దశరథుడికి దక్కిన కీర్తి, గౌరవం గొప్పదని చెప్పవచ్చు.  ఓడి గెలిచే నాన్న.. పిల్లల దగ్గర ఓడిపోవడానికి తండ్రి ఏమాత్రం బాధపడడు. తనకు తలకు మించిన పనులలో అయినా ప్రత్యక్షంగా పిల్లల్ని వారించినా, వ్యతిరేకత వెలిబుచ్చినా, చివరికి పిల్లల కోరికను తీర్చడంలో నాన్న ఎప్పుడూ ముందుంటాడు. అందుకే తను ఓడిపోయినా గెలుస్తాడు నాన్న. ప్రతి తండ్రి ఓ నీలాకాశం లాంటి వాడు. ఉరుముతాడు, మెరుస్తాడు, మండుతాడు, రాత్రివేళ నిశ్శబ్దంలో ఒంటరిగా జీవితాన్ని నెమరు వేసుకుంటాడు. ఆ ఆకాశానికి చల్లని వెన్నెల జత చేయాల్సింది పిల్లలే..                                        ◆నిశ్శబ్ద.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి?

పిల్లలకు ఈమధ్య కాలంలో మెదడు చురుగ్గా అవ్వడం కోసం ఫోనెటిక్ నెంబర్స్ గురించి చెబుతున్నారు. అయితే ఈ నంబర్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇది ప్రాచీన కాలంలో గ్రీకు దేశంలోవారు తమ జ్ఞాపకశక్తితో రాజుల మెప్పు పొందేందుకు అక్కడి  ఆస్థాన పండితులు కనుగొన్నారు. అచ్చుల హల్లుల ఉచ్ఛారణకు ఒక్కొక్క అంకెను కేటాయించి వాటితో పెద్ద పెద్ద అంకెలను పదాలుగా గుర్తుంచుకొని ఆ అంకెలను వెంటనే ఏ క్రమంలో అడిగితే ఆ క్రమంలో చెప్పగలగడం ఈ పద్ధతి యొక్క విశేషం. ఈ విధానాలతో అనేక మంది జ్ఞాపక శక్తి ప్రదర్శనలు ఇస్తూ మానవ మెదడు యొక్క అద్భుత శక్తిని తెలియచేయడం అందరికీ తెలిసినదే. ఈ ప్రదర్శనల వల్ల ఏమిటి లాభం అనే సందేహం కొంతమంది మేధావులకు ఉన్నప్పటికీ తమకు తెలివితేటలు లేవు తాము సరిగా చదవలేమని ఆత్మన్యూనత భావంతో బాధపడే విద్యార్థులలో ఇటువంటి ప్రదర్శనలు మంచి ఆత్మవిశ్వాసం కలిగిస్తాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అన్నింటికన్నా జ్ఞాపకశక్తికి అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఆ విషయం పట్ల ఒక వ్యక్తికున్న ఆసక్తి మరియు ప్రాధాన్యత. చాలా మంది డబ్బు విషయంలో గాని, ఇష్టమైన వారి పుట్టినరోజు విషయంలో గాని, తమ అభిమాన హీరో సినిమా వివరాల గురించి గాని, అభిమాన క్రికెటెర్ల రికార్డుల గురించి గాని ఏ మాత్రం మరచిపోవడం ఉండదు. ఎందుకంటే వాటికి వారు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి. అలాగే చదువు కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడిన విషయం అనే అవగాహన మరియు శ్రద్ధ వారికి కల్పిస్తే వాటికి సంబంధించిన విషయాలను వారు మరచిపోయే పరిస్థితి తలెత్తదు.  బాల్యం యొక్క అమాయకత్వం వలన తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన వారు చదువు పట్ల ఆసక్తి కనబరచకపోవచ్చును. పై విషయాలన్నింటినీ చదివాక ఏమి అర్థం అవుతుందంటే... శారీరకంగా, పుట్టుకతో ప్రతీ విద్యార్థికి ఒకే రకమైన మేథస్సు, సామర్ధ్యం ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలియచేసారు. పైన పేర్కొన్న అంశాలు చదివితే అందరికీ అదే అనిపిస్తుంది. ఈ మెదడు దాని సామర్ధ్యం అందరికీ ఒకేలా ఉన్నప్పుడు మరి అందరి యొక్క పనితీరు, ఫలితాలు మరియు పెరఫార్మెన్స్ ఒకేలా ఎందుకు ఉండటం లేదు. ఈ విషయం గురించి ప్రశ్న వేసుకుంటే… చాలామంది తెల్ల ముఖాలు వేస్తారు.  దీనికి సరైన విధంగా అర్థమయ్యేట్టుగా కంప్యూటర్ పరిభాషలో చెప్పుకుంటే హార్డ్వేర్ అందరికీ ఒకేలా ఉంది కాని సాఫ్ట్వేర్ సరిగా తయారుచేయాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులది మరియు ఇటు ఉపాధ్యాయులదే. అన్నింటికన్నా ఒక విషయం బాగా గుర్తుండాలంటే ఆ విషయం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని ఆ విద్యార్థి గ్రహించాలి. అందుకే శ్రద్ధ అంటే తెలుసుకోవాలనే ఉత్సుకత, తెలుసుకోడానికి సంసిద్ధత మరియు నేర్పుతున్నవారిపట్ల గౌరవభావం. అందువలనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది మరియు ఆసక్తి కరంగా బోధించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే.. మరి వారి సహజ సామర్థ్యాలు మరుగునపడకుండా వారికి వారు సంపూర్ణంగా ఉపయోగపడే విధంగా తయారుచేయవలసిన గురుతర బాధ్యత అటు తల్లిదండ్రుల చేతిలో ఇటు ఉపాధ్యాయుల చేతిలో ఉంటుందనడం నిర్వివాదాంశం కదా!! ఇదే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. వాటిని పాటించాలి.                                   ◆నిశ్శబ్ద.