martyrs day history

ఆ వీరుల  త్యాగాలే మన జాతికి  అందిన గొప్ప   ఫలాలు..... 

  ఎక్కడ అణచివేతకి గురి కాబడతారో,  అక్కడ.. ఆ అణచివేతని అంతం చేయటానికి  వీరులు ఉద్భవిస్తారు.  జాతి గౌరవం కోసం వారి ప్రాణాలు కూడా త్యాగం చేస్తారు అన్నది మనకి చరిత్ర చెబుతున్న నిజం. వందల సంవత్సరాలు విదేశీయులు మన భరతమాత గుండెల మీద గుద్దుతుంటే రక్తం మరిగి ఎదురుతిరిగిన బిడ్డలెందరో  పోరాడి అమరులయ్యారు. అలా మన దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ ప్రజల క్షేమం కోసం ప్రాణాలర్పించిన   అమరవీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మరవకూడదు.  దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల త్యాగాలను గౌరవిస్తూ.. గుర్తుచేసుకుంటూ ముందు తరాలు కూడా త్యాగం విలువను గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో    అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అమరవీరుల దినోత్సవం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో యువకులైన  భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు  1931లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవ కార్యక్రమాలు నిర్వహించినందుకు ఉరిశిక్షకి గురయ్యారు. అప్పుడు వాళ్ళు బ్రిటీష్ వారికి  లొంగిపోకుండా భారత జాతికి పోరాట స్ఫూర్తిని రగిలించి మరీ  అమరులయ్యారు. వీరు ధైర్యం, ప్రతిఘటనకు ప్రతీకలుగా మారి, భవిష్యత్ తరాల కోసం ప్రేరణగా నిలిచారు. అందుకే వారు ఉరివేయబడ్డ ఆ దినమే అమరవీరుల దినంగా మన దేశం జరుపుకుంటోంది.  అమరవీరుల దినోత్సవం చారిత్రాత్మకంగా ఎప్పుడు  ప్రాముఖ్యత పొందిందంటే.. మనం జాతిపితగా పిలుచుకునే  మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత 1948, జనవరి 30న హత్యకి గురి కాబడి అమరులయ్యారు. అప్పటినుంచి గాంధీగారు అహింసా విధానంలో భరతమాత కోసం చేసిన ఉద్యమాలు,  త్యాగాలని స్మరించుకోవటానికిగానూ, అలాగే మన దేశం కోసం ప్రాణాలర్పించిన ఎంతోమంది వీరులని స్మరించుకోవటానికిగానూ ప్రతీ సంవత్సరం జనవరి 30న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాము. మహాత్మా గాంధీ .. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్‌లో జన్మించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అహింసా, సత్యాగ్రహాలను ప్రవేశపెట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. 1915లో దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తరువాత  ఖేదా, చంపారన్ ఉద్యమాలు నడిపి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారు. 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1930లో దండీ ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నడిపారు. గాంధీజీ శాంతి, సమానత్వం, సామరస్యానికి మార్గదర్శకుడిగా నిలిచారు. గాంధీజీ యొక్క అహింసా, సివిల్ నిరసన తత్త్వాలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాయి. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన "జాతిపిత", "బాపూజీ" గా ప్రసిద్ధి చెందారు. ప్రపంచవ్యాప్తంగా అహింస, శాంతికి ప్రతీకగా నిలిచారు. భారత స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది వీరులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకోవటం కోసం, వారు దేశం పట్ల చూపిన  దేశభక్తి, ధైర్యం, వారు చూపిన  అంకిత భావం, దేశానికి దేశ స్వేచ్ఛకు ఇచ్చిన  విలువలను గుర్తు చేసుకునే సందర్భంగా ఈ రోజు నిలుస్తుంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమర వీరులకు దేశం నివాళులు అర్పించేది ఈరోజే. ఈ దినోత్సవం  జాతీయ ఐక్యతకు పిలుపునిస్తుంది. ఇది ప్రజలను ఒకతాటిపైకి తెచ్చి, పోరాటాల చరిత్రను గౌరవించేలా చేస్తుంది.  అమర వీరుల కథలు భవిష్యత్తు తరాలకు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను కాపాడేందుకు ప్రేరణగా నిలుస్తాయి.  దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, వేడుకలు నిర్వహిస్తారు. సంస్మరణ కార్యక్రమాలు, విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.  ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి, ప్రధానమంత్రి,  ఇతర ప్రముఖులు మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటారు. వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాల వద్ద నివాళులు అర్పిస్తారు. పాఠశాలలు, కళాశాలల్లో  ప్రత్యేక అసెంబ్లీలు నిర్వహిస్తారు. విద్యార్థులు నాటకాలు, కవితలు, ప్రసంగాలు ద్వారా అమర వీరుల జీవితాలను గుర్తుచేసుకుంటారు.  సాంస్కృతిక,  విద్యా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు.  మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కలిగించే కధనాలు, చిత్రాలను ప్రసారం చేస్తారు.   రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అమర వీరులకు ఘనంగా నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమాలు సమాజంలో బాధ్యతాయుతమైన వ్యవస్థను నిర్మించడానికి ప్రేరణగా నిలుస్తాయి. దేశం భవిష్యత్తు, దేశ రక్షణ,  దేశ అభివృద్ది ప్రతి పౌరుడి బాధ్యత అనే విషయాన్ని కూడా ఈరోజు అందరికీ గుర్తు చేస్తుంది.                                         *రూపశ్రీ  

What should be the virtue of man

మనిషి ధర్మం ఎలా ఉండాలో తెలుసా?

మనిషి ఎలా ఉండాలి?? అతడి ధర్మం ఎలా ఉండాలి?? అతడు ఎలా నడుచుకోవాలి?? అనే విషయం గురించి ఓ ఉదాహరణా కథనం ఉంది.  పూర్వం జపాన్లో కైచూ అనే గొప్ప జెన్ మాస్టర్ క్యోటో ప్రాంతంలో ఒక ఆలయానికి అధిపతిగా ఉంటుండేవాడు. ఒకసారి క్యోటో గవర్నర్ ఆ ఆలయానికి మొదటిసారి వచ్చాడు. జెన్ మాస్టర్ సహాయకుడు, గవర్నర్ గారి విజిటింగ్ కార్డు పట్టుకెళ్ళి మాస్టర్కు ఇచ్చాడు. ఆ కార్డు మీద "కిటగానీ, క్యోటో గవర్నర్" అని ఉంది. "నాకు ఇతగాడితో ఏమీ పనిలేదు. వెళ్లిపొమ్మను” అన్నాడు కైచూ. సహాయకుడు గవర్నర్ వద్దకు వచ్చి 'మన్నించండి' అంటూ జరిగిన విషయం చెప్పాడు.  “పొరపాటు నాదే సుమా” అంటూ గవర్నర్ కలం చేత బుచ్చుకొని, తన పేరు మాత్రమే ఆ కార్డు మీద ఉంచి, 'క్యోటో గవర్నర్' అనే పదాలు కొట్టేసి కార్డును సహాయకుడి చేతుల్లో పెడుతూ “మళ్ళీ ఒకసారి మీ మాస్టర్ వద్దకు వెళ్ళి అడిగిచూడు” అన్నాడు. అది చూసిన జెన్ మాస్టర్ "ఓహో! వచ్చింది కిటగానీయా? అయితే అతణ్ణి నేను చూడాలనే అనుకుంటున్నాను రమ్మను” అన్నాడు ఈసారి.  మనిషి తన హోదాతో ఒకటైపోతాడు. పిల్లవాడు పుట్టినప్పటి నుంచీ ఇతడు జీవితంలో ఏమవుతాడో అనే చింత తల్లిదండ్రులకు దాదాపు ఆనాటినుంచే ప్రారంభం అవుతుంది. జాతకచక్రం వేయించి చూస్తారు. గొప్ప కంప్యూటర్ ఇంజనీరో, లేక ఏదో పెద్ద సంస్థకు అధిపతిగా ఉంటాడనో, గొప్ప డాక్టరో, సైంటిస్టో అవుతాడని చెప్పించుకొని సంతోషపడతారు. పిల్లవాడు చేతులు, కాళ్ళు ఆడించి కాస్త పాకే సమయానికల్లా అతడి ముందు ఒక కలమూ, కాస్త ఎడంగా ఒక ఉంగరమూ, అలాంటివే మరేవో అక్కడ పెట్టి ఏది పట్టుకుంటాడో అని వేచి చూస్తుంటారు. అంటే సరస్వతీదేవికి అంకితమవుతాడా లేక లక్ష్మీకటాక్షం అనుభవించనున్నాడా అనే విషయం కనుగొంటారన్నమాట. అయినా కాకపోయినా అప్పటికి అదే పెద్ద సంతృప్తి. ఏవో బంగారు కలలు కంటూ కాలం గడుపుతుంటారు.  కానీ ఆకాశమంత అవకాశంతో పుట్టిన ఆ శిశువు ఈ కాస్తతోనే సంతృప్తి పడాలా? గొప్ప ఇంజనీర్ కావడంతో అతడి జన్మ సఫలీకృతమైనట్లేనా? ఫలానా కీర్తిగడించిన ఇంజనీర్ మావాడే, నాకొడుకే, మామేనల్లుడే, మాఊరి వాడేనండోయ్ అని చెప్పుకోడానికేనా? జీవితం అంత పరిమితమైనదా? ఈ జీవితానికి అంతకన్నా విస్తృత అవకాశాలు లేవా? సాక్షాత్తూ జీవితాన్నే దర్శించి అంబరమంత ఎత్తు ఎదిగిన మహనీయులు, అంత ఎలా సాధించారు? వారు కూడా ఈ కాస్తతోనే సరిపెట్టుకొని ఉంటే, ఇంతటితోనే సంతృప్తి చెంది ఉంటే, మనిషిగా ఎదిగి ఉండేవారా?  మరి పిల్లవాడు అలా ఎదగడానికి మనం దోహదం చేసే బదులు, ఇంజనీర్ అవమనో, వృత్తిపరంగా మరేదో సాధించమనో, మనమెందుకు అతడి జీవితాన్ని సంకుచితం చేస్తున్నాం? అంటే మనకీ స్వయంగా అపరిమిత, విశాల జీవితమంటే ఏమిటో సరియైన అవగాహన లేనందువల్లనే కదా?  జన్మించేటప్పుడు ప్రతిశిశువూ అనంతమైన స్థితిలోనే పుడతాడు. అతడు ఎంతైనా ఎదగగలడు. ఒకప్పుడు రాముడనే దేవుడు, కృష్ణుడనే దేవుడు కూడా ఇలానే తల్లి గర్భాన పుట్టారు. దేవుణ్ణి మీరు నమ్మితే ఈ పిల్లవాడు కూడా ఆ  ''పొటెన్షియాలిటీ' తోనే పుట్టాడు. మనం ఈ పిల్లజీవితాలను సంకుచితపరచకుండా, పరిమితం చేయకుండా స్వేచ్ఛగా  అంటే విచ్చలవిడిగా కాదు, సంతోషంగా, కోమలమైన స్పృహతో ఎదగనిస్తే వీరు కూడా ఆ పురాణపురుషులంతటి వారవుతారేమో?  'అందరూ అంతంతటి వారెలా అవుతారు?' అనే వేళాకోళం అటువుంచి, అరుణాచల రమణుడూ,  జిడ్డు కృష్ణమూర్తి, అంత ఎత్తుకు ఎలా ఎదగగలిగారు? వారిని గురించి కూడా తల్లిదండ్రులు అలానే అనుకొని ఉండవచ్చు కదా? “వెర్రి వేషాలు వేయకు. కుదురుగా చదువుకొని పెద్ద ఆఫీసరన్నా అవు, లేదా నీ కర్మ అదేనైతే, ఎక్కడో గుమాస్తాగా నీ బతుకు ఈడ్చెయ్" అని వారి రెక్కలు కత్తిరించేసినట్లయితే ఏమయ్యేది? అందువల్ల పిల్లవాణ్ణి సాధారణ చదువులు చదివిస్తూ, వాటిలో ప్రావీణ్యత గడిస్తూ ఉన్న సమయంలో కూడా స్వేచ్ఛగా ఎదగనివ్వాలి. . ఎత్తుకున్నప్పటినుంచి మీ అభిప్రాయాలను గురించి మీరు స్వయంగా ఎరగని మతసిద్ధాంతాలతో అతణ్ణి 'కండీషన్' చేయకూడదు. అతడు కోరుకున్న వృత్తిని స్వీకరించనివ్వాలి. అతడి భవిష్యత్తును మీ అభిమతానుసారంగా మలచడానికి ప్రయత్నించకూడదు. తాను ప్రేమించని వృత్తిని చేపట్టిన సదరు పిల్లవాడు ఆ వృత్తిలో ధనం ఎంతైనా సంపాదించ వచ్చు. తల్లిదండ్రుల్ని తూగుటుయ్యాలలో ఊగించవచ్చు. కానీ అతడికి మాత్రం సంతోషముండదు. అలా దిగులుగా తిరుగుతూనే ఉంటాడు.అంటే ఇష్టం లేని పనిలో డబ్బు వస్తుందేమో కానీ తృప్తి మాత్రం రాదు.                                  ◆నిశ్శబ్ద.

important amendments in the Constitution of India

 భారత రాజ్యాంగంలో జరిగిన అతి ముఖ్యమైన సవరణల గురించి తెలుసా?

  ఒక మతానికి పవిత్ర గంథం ఎలాంటిదో ఒక దేశానికి రాజ్యాంగం కూడా అలాంటిదే.  భారత రాజ్యాంగం విషయానికి వస్తే  భారతీయులకు అది చాలా  సౌకర్యాలు, చాలా షరతులు, మరెంతో సౌకర్యవంతమైన జీవితాన్ని అందిస్తుంది.  రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 వ తేదీన ఆమోందించారు అనే విషయం తెలిసిందే. అందుకే గణతంత్ర్య దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. అయితే రాజ్యాంగాన్ని రచించి ఆమోదం పొందిన తరువాత అవసరాన్ని బట్టి దాన్ని సవరణ చేస్తుంటారు.   ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన సవరణలు జరిగాయి అవేంటంటే.. 7వ సవరణ.. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ సిఫారసు మేరకు భాష ప్రాతిపదికన రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరించబడ్డాయి.  ఈ సవరణ దేశానికి మెరుగైన పాలన నిర్మాణాన్ని అందిచంలో  ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. 42వ సవరణ.. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలో 42వ సవరణ జరిగింది. ఇందులో ప్రభుత్వం న్యాయవ్యవస్థ అధికారాలను పరిమితం చేసి కేంద్రానికి మరిన్ని అధికారాలు ఇచ్చింది. 44వ సవరణ.. ఆస్తి హక్కు అనేది మొదట ప్రాథమిక హక్కులలో బాగంగా ఉండేది. అయితే ఈ 42వ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితా నుండి తొలగించారు. అలాగే దీన్ని చట్టబద్దమైన హక్కుగా మార్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను సమతుల్యం చేసేందుకు ఈ సవరణ అవసరమైనట్టు పేర్కొన్నారు. 61వ సవరణ.. రాజకీయంలో యువత కీలకంగా ఉండాలని, ప్రభుత్వాల ఏర్పాటులో యువత ఆలోచనలు కీలకంగా ఉండాలని, యువశక్తిని చైతన్యం చేసేందుకు ఓటింగ్ వయస్సును కూడా సవరించారు. 61వ సవరణలో  ఓటు హక్కు వయసును 21 ఏళ్ళ నుండి 18 ఏళ్లకు తగ్గించింది. 73  వ సవరణ.. గ్రామ పంచాయితీలను బలోపేతం చేసేందుకు, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. 86వ సవరణ.. రాజ్యాంగంలో పిల్లల చదువు కోసం జరిగి మార్పు దేశ భవిష్యత్తును,  పిల్లల జీవితాలను ఎంతగానో మార్పు దిశగా తీసుకెళ్లిందని చెప్పవచ్చు. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్భంద విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. ఇది పిల్లల ప్రాథమిక హక్కులలో భాగంగా ఉంది. 101వ సవరణ.. 101వ సవరణలో జియస్టి ని ప్రవేశపెట్టారు.  వస్తువులు సేవల పన్నును అమలు చేశారు. దీని వల్ల దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టారు. 102 వ సవరణ.. 102వ సవరణ జాతీయంగా వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించింది. 103వ సవరణ.. సాధారణ వర్గానికి చెందిన,  ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉద్యోగాలు,  విద్యలో 10శాతం రిజర్వేషన్లు ఇచ్చింది.  ఈ రిజర్వేషన్ ఇప్పటికే రిజర్వేషన్ పొందుతున్న SC, St< OBC కేటగిరీ వారికి వర్తించదు. 104వ సవరణ.. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి రిజర్వు చేయబడిన సీట్లను రద్దు చేసింది.                               * రూపశ్రీ.

Punjab Kesari Lala Lajpat Rai jayanthi

ఉద్యమాన్ని నిప్పురవ్వలా రగిలించిన గాయం.. 

 "నా శరీరంపై కొట్టిన  దెబ్బలు భారతదేశంలో  బ్రిటీష్ సామ్రాజ్యపు  శవపేటికకి  కొట్టే చివరి మేకులుగా మారుతాయి” అన్న ఆయన మాటలు  నిజంగానే  ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల రక్తాన్ని మరిగించి, ఉద్యమానికి స్పూర్తినిచ్చి బ్రిటీష్ పిడికిలిలో బిగుసుకున్న దేశ స్వాతంత్ర్య సాధన వైపు అడుగులు వేయించింది.   ‘పంజాబ్ కేసరి’ అనే బిరుదుని పొందిన  లాలా లజపతిరాయ్  విప్లవకారుడు, నాయకుడు, రచయిత, హిందూ ప్రధాన ఉద్యమ నేత, శక్తివంతమైన ప్రసంగాలివ్వటంలో దిట్ట. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బిపిన్ చంద్రపాల్, తిలక్ లతో కలిసి ‘లాల్ బాల్ పాల్’ త్రయంగా  పేరు పొందారు. ఆయన భారత స్వాతంత్ర్య సంగ్రామానికి చేసిన సేవలు అమోఘమైనవి. ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవితం గురించి,  దేశభక్తి, రాజకీయ ప్రయాణం గురించి తెలుసుకుంటే.. లాలా లజపతి రాయ్.. లాలా లజపతి రాయ్  1865 జనవరి 28న పంజాబ్లో ఉన్న ధూదికే అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి గొప్ప గృహిణి. తన పిల్లలలో గాఢ నైతిక విలువలను నాటింది ఆమెనే. ఆయన లా రీసెర్చి చేయడానికి లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాలలో చేరాడు. అక్కడే  ఆయన భవిష్యత్ స్వాతంత్ర్య సమరయోధులైన లాలా హన్స్ రాజ్, పండిట్ గురు దత్ వంటి వారిని కలుసుకున్నారు. లా పూర్తి చేసిన తర్వాత  హర్యానాలోని హిస్సార్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.  1892లో లాహోర్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. చైతన్యోద్యమాలకు ప్రసిద్ధి చెందిన ఆయన అనేక సమావేశాలను నిర్వహించి, అనాథాశ్రమాలను స్థాపించారు. ఆయన ప్రజాసేవా కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. భారత స్వాతంత్య్రానికి కట్టుబడిన  ఆయన దృఢసంకల్ప స్వభావం చాలా గొప్పది.  ఆయన ఆర్యసమాజానికి మంచి సేవకుడు. దయానంద వేదిక్ పాఠశాలను జాతీయ స్థాయిలో స్థాపించి,  హిందూ సమాజంలో ఆర్య సమాజాన్ని పునరుద్ధరించిన దయానంద సరస్వతిని  గౌరవించారు. జాతీయత భావన.. రాజకీయ ప్రయాణం..! లాలా లజపత్ రాయ్ కి పుస్తకాలు  చదవడం అంటే చాలా ఇష్టపడేవారు. ఇటలీ విప్లవ నేత గ్యూసెప్పె మజ్జిని నిర్దేశించిన దేశభక్తి, జాతీయతా స్ఫూర్తి ఆయనను ఎంతో ప్రభావితం చేసినట్లు చెప్పబడింది.  బ్రిటిష్ పాలన నుండి దేశాన్ని విడిపించటం కోసం ఆయన తన  లాయర్ వృత్తిని వదిలేసారు. పంజాబ్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి అనేక రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1888, 1889లలో జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలలో ప్రతినిధిగా పాల్గొన్నారు. బిపిన్ చంద్ర పాల్, అరవిందో ఘోష్, బాల గంగాధర్ తిలక్ వంటి ప్రముఖ అతివాద నాయకులతో కలిసి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో కొందరు నాయకులు ప్రచారం చేసే మితవాద రాజకీయాల వల్ల కలిగే  దుష్పలితాలను ఆయన చాటి చెప్పారు. 'పూర్ణ స్వరాజ్' కోసం ఆయన డొమినియన్ స్టేటస్ డిమాండ్‌ను విసిరి, తాము ఎదుర్కొన్న వ్యతిరేకతని  బలంగా చెప్పగలిగారు.  భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎంత క్రూరంగా ఉందో  ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని భావించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలోని పరిస్థితులను ప్రపంచానికి వివరించాల్సిన అవసరాన్ని గుర్తించారు. 1917లో న్యూయార్కులో ఇండియన్ హోంరూల్ లీగ్ ఆఫ్ అమెరికాను స్థాపించి 1920 వరకూ అక్కడే ఉన్నారు. ఆయన స్వదేశీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల వాడకాన్ని  తీవ్రంగా వ్యతిరేకించి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు సాయం అందించేందుకు, స్వయం సమర్థత పెంపొందించేందుకు స్వదేశీ ఉత్పత్తులనే  వాడమన్న  సందేశం బాగా వ్యాప్తి చేశారు. ఆయన్ని 1920లో కోల్‌కతాలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించమని ఆహ్వానించారు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించగా ఆ ఉద్యమాన్ని ఈయన పంజాబ్‌లో నడిపించారు.  చౌరీ-చౌరా ఘటన కారణంగా గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేశారు. ఈ నిర్ణయాన్ని లజపత్ రాయ్ తీవ్రంగా  విమర్శించి,  కాంగ్రెస్ ఇండిపెండెన్స్ పార్టీని ఏర్పాటు చేయాలనుకున్నారు.  1921 నుండి 1923 వరకు ఆయన జైలులోనే ఉన్నారు.  విడుదలైన తర్వాత ఆయనను శాసనసభకు ఎన్నికయ్యారు. 1928లో, బ్రిటిష్ సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని శాసనసభ తీర్మానాన్ని  ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనే లాహోర్‌లో జరిగిన నిరసన సమయంలో, పోలీసుల లాఠీ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ గాయాలు ఉద్ధం సింగ్, భగత్ సింగ్ వంటి యువతకు స్ఫూర్తినిచ్చాయి.  వారి కృషే మనకి  స్వాతంత్ర్యం అందించింది. ఈ దాడి తర్వాత 17 రోజులకే, 1928 నవంబర్ 17న లాలాజీ తన చివరి శ్వాస విడిచారు.  మనకి స్పూర్తి కావాలి..  లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప నాయకుని  గురించి  ప్రతి పౌరుడూ తెలుసుకోవాలి. వారు మన దేశం కోసం చేసిన నిస్వార్ధ సేవలకి కృతజ్ఞతను తెలపాలి. అణచివేయబడుతున్నప్పుడల్లా  వారి ఉద్యమ స్పూర్తి మనకి గుర్తురావాలి. వారిలోని ధైర్యం మన గుండెల్లో నిండాలి. వారి పట్టుదల, కృషి మన భారత దేశ సంకెళ్లని ఎలా ఐతే తెంచగలిగిందో, వారు మనకోసం కలలు కన్న భారత నిర్మాణం కోసం  మన కృషి, పట్టుదల కూడా అలాగే ఉండాలి. ఆయన గాయం నుండి మనమూ ఒక పాఠం నేర్చుకోవాలి.                                                        *రూపశ్రీ.

if your words are palatable whole village respects you

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు ఇందుకే….

మాట్లాడటం కూడా ఒక కళ అంటారు కొందరు. అంతి తడబాటు లేకుండా, విషయాన్ని సూటిగా, స్పష్టంగా, అది ఎదుటి వారికి నచ్చని విషయమైనా వారు నొచ్చుకోకుండా ఉండేలా చెప్పడానికి మనిషిలో ఎంతో చతురత, అంతకు మించి సమయస్ఫూర్తి ఉండాలని చెబుతారు. దీనికి ఉదాహరణగా రామాయణంలో హనుమంతుడిని చూపించేవారు ఎంతోమంది ఉన్నారు. ఎదుటివారిని మెప్పించేలా మాట్లాడటం, తనది కాని చోటుకు వెళ్లి అక్కడి నుండి క్షేమంగా తిరిగి రావడం హనుమ కార్యసాధనలో ఆయన మాటతీరే ఆయనకు బోలెడు సహాయం చేసిందని చెప్పవచ్చు.  అందుకే మన మాట తీరు అనేది చాలా ముఖ్యమని పెద్దలు చెబుతారు. మనం ఎవరితో మాట్లాడినా ఎదుటివారు మన మాట తీరుని బట్టి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం. మన మాట తీరుపైనే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మన మాట తీరులోనే మనలో ఉండే సభ్యత, సంస్కారం బయటపడతాయి. మనం మాటల ద్వారానే ఎదుటివారి యొక్క ప్రశంసలను పొందవచ్చు. మనం ఎప్పుడైనా సరే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి దానికి తగ్గట్టుగా విషయాన్ని మార్చి మాట్లాడాలి. అంతేకానీ మనం మాట్లాడుతున్నది ఇక ఆపకూడదు మొత్తం చెప్పేయాలి అనే ఆలోచనలో ఎదుటివారి పరిస్థితి అసలు గమనించకుండా మాట్లాడకూడదు. మనం ఎప్పుడూ కూడా ఏదైనా ఒక విషయం గురించి చర్చించేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. ఎందుకంటే సనుగుకుంటూ మాట్లాడితే మన మాటలు ఎదుటివారికి అర్ధం కావు. అట్లాగే వారు మనం చెప్పే దానిపట్ల ఆసక్తి చూపరు. ఎప్పుడూ మన గురించి, మన గొప్పలు గురించి గానీ, మన కుటుంబ సభ్యుల గురించిన ఎటువంటి గొప్పలను కూడా చెప్పుకోకూడదు. అట్లాంటి విషయాలు వినడానికి ఎదుటివారు ఆసక్తి చూపరు. మన దగ్గర నుంచి ఎప్పుడు తప్పించుకుందామా అన్నట్లుగా చూస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితి ఎదుటివారికి రానివ్వకూడదు.  కొంతమంది మాట్లాడేటప్పుడు నోటిలో నుంచి తుంపర ఎదుటివాళ్ళ మీద పడుతుంది. అది మంచి పద్ధతి కాదు. మనకు అట్లాంటిది ఉంటే గనుక ఎదుటివారు మనతో మాట్లాడటానికి సంకోచిస్తారు. మన ప్రక్కన కూర్చోవాలన్నా, మనతో భోజనం చేయాలన్నా, మనతో మాట్లాడాలన్నా వారు ఇష్టపడరు. మనల్ని ఎప్పుడూ దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాంటి అలవాటు ఎవరికైనా ఉంటే అది మానుకోవటం చాలా మంచిది. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. అనవసరంగా ఏ విషయం గురించీ మాట్లాడకూడదు. అట్లాగే అవసరానికి మించి ఎక్కువగా కూడా మాట్లాడకూడదు. అధిక ప్రసంగం అనర్ధాలకు మూలం. Speech is silver but silence gold అని ఒక వాక్యం ఉంది. అది అక్షరాల నిజం. అంటే దీని అర్ధం అన్ని వేళలా మౌనంగా ఉండమని కాదు. అవసరమైన చోట ఇది పాటిస్తే చాలు జీవిత గమనాన్ని మార్చుకుని మంచివైపుకు పయనం చేయగలుగుతాము.                                        ◆నిశ్శబ్ద.

Republic Day special story

రిపబ్లిక్ డే  పరేడ్ గురించి ఈ నిజాలు తెలుసా?

  రిపబ్లిక్ డే.. భారతీయులు ఎంతో గొప్పగా జరుపుకునే జెండా పండుగ. గణతంత్య్ర దినోత్సవాన్ని భారతదేశం చాలా ఘనంగా జరుపుకుంటుంది. గణతంత్ర్య దినోత్సవంలో భాగంగా చాలా రకాల ఈవెంట్లు జరుగుతాయి.  త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటే దేశ పౌరుల గుండెలు దేశభక్తితో  ఉప్పొంగుతూ ఉంటాయి. 2025, జనవరి 26 వ తేదీన గణతంత్ర్య దినోత్సవ వేడుకకు భారతదేశం ఇప్పటికే చాలా సన్నద్ధం అయ్యింది. ముఖ్యంగా గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగే పరేడ్ కు చాలా ప్రాముఖ్యత ఉంది.  గణతంత్ర్య దినోత్సవం వెనుక కారణం.. గణతంత్ర్య పరేడ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుంటే.. 1950, జనవరి 26 వ తేదీన రాజ్యాంగాన్ని అమోదించారు.  భారత ప్రజల జీవితాన్ని, వారి స్థితి గతులను మార్చేసే రాజ్యాంగం అమోదించబడిన సందర్భంలా దేశం ఒక గణతంత్ర్య రాజ్యంగా ప్రకటించబడింది.  ఇది భారతదేశంలో జాతీయ సెలవు దినం కూడా.  ఈరోజు దేశ ప్రజలు దేశం పట్ల బాధ్యత కలిగి  ఉండాలని, దేశం కోసం త్యాగాలు చేసిన వీరులను గుర్తు చేసుకోవడమే కాకుండా..  రాజ్యాంగ ప్రాముఖ్యతను అందరికీ అర్థమయ్యేలా చేయడం కూడా ముఖ్య అంశమే. గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని  గణతంత్ర్య దినోత్సవ పరేడ్ ను న్యూ ఢిల్లీ లోని కర్తవ్య మార్క్ లో జరుపుతారు.   76వ  గణతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్న సందర్భంగా .. కర్తవ్య మార్క్ లో జరిగే పరేడ్ గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి.  1930లో భారత జాతీయ కాంగ్రెస్ చేసిన పూర్ణ స్వరాజ్ ప్రకటన జ్ఞాపకార్థం జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటారు. ఈ ప్రకటన బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించినట్టు దేశ పౌరులకు పిలుపు ఇచ్చింది. అందరికీ రిపబ్లిక్ డే రోజు జరిగే పరేడ్ గురించి మాత్రమే తెలుసు. కానీ రిపబ్లిక్ డే పరేడ్ కోసం సన్నద్ధత ఒక సంవత్సరం ముందు జూలైలో ప్రారంభమవుతుంది. పాల్గొనేవారు తమ భాగస్వామ్యాన్ని అధికారికంగా తెలియజేస్తారు.  కవాతు రోజున వారు తెల్లవారుజామున 3 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు. అప్పటికి దాదాపు 600 గంటల పాటు సాధన చేసి ఉంటారు. ప్రతి సంవత్సరం, రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఒక దేశ ప్రధాని లేదా రాష్ట్రపతి లేదా పాలకులను ఆహ్వానిస్తారు. ఈ ఏడాది అంటే 2025 రిపబ్లిక్ డే కి అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో విచ్చేయనున్నారు. గన్ సెల్యూట్ ఫైరింగ్ జాతీయ గీతం సాగే  సమయానికి సరిపోతుంది. గీతం ప్రారంభంలో మొదటి గన్‌షాట్ పేలుతుంది.  తరువాత  52 సెకన్ల తర్వాత కాల్చబడుతుంది. షాట్లు తయారు చేయబడిన ఫిరంగులు 1941లో తయారు చేయబడ్డాయట.  సైన్యం  అన్ని అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటాయి. ప్రతి సంవత్సరం, రిపబ్లిక్ డే కోసం ఒక థీమ్ నిర్ణయించబడుతుంది. ఈ థీమ్ లో పేర్కొన్న లక్ష్యాలను చేరుకునే దిశగా..  దాన్ని సాధించే దిశగా దీనిని వివిధ రాష్ట్రాలు,  ప్రభుత్వ శాఖలు పనిచేస్తాయి. గణతంత్ర దినోత్సవ పరేడ్ 2025లో టేబుల్‌యాక్స్ థీమ్‌ను స్వర్ణిమ్ భారత్ – విరాసత్ ఔర్ వికాస్ (బంగారు భారతదేశం – వారసత్వం,  అభివృద్ధి)గా నిర్ణయించారు. సాంకేతికత, మౌలిక సదుపాయాలు,  సాంస్కృతిక వారసత్వం వంటి వివిధ రంగాలలో భారతదేశ పురోగతిని వారు ప్రదర్శిస్తారు.  రిపబ్లిక్ డే  కవాతు రాష్ట్రపతి భవన్ (ప్రెసిడెంట్ హౌస్) సమీపంలోని రైసినా హిల్ నుండి కర్తవ్య మార్గం వెంట, ఇండియా గేట్ దాటి, చారిత్రాత్మక ఎర్రకోట మీదుగా ప్రారంభమవుతుంది. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ మైలురాయి పత్రాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు, ఇది భారత ప్రభుత్వ చట్టం 1935 స్థానంలో ఉంది. 1950లో న్యూ ఢిల్లీలోని ఇర్విన్ స్టేడియం (ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం)లో మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన 100 కంటే ఎక్కువ విమానాలు మరియు 3,000 మంది సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు, ప్రాణాలను కాపాడటంలో లేదా అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడటంలో అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించిన పిల్లలను గౌరవించటానికి జాతీయ శౌర్య పురస్కారాలు ప్రకటించబడతాయి. పద్మ అవార్డులు - భారతదేశ అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటి.  దేశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన వారిని గుర్తించి భారత రాష్ట్రపతి ఒక గొప్ప వేడుకలో పద్మ అవార్డులు అందజేస్తారు.                                                *రూపశ్రీ.  

National Voters Day

అసమర్ధ నాయకత్వాన్ని వధించే నేటికాలపు బ్రహ్మాస్త్రం ఓటు .. 

  ఓటూ...ఓటూ నువ్వేం చేయగలవని దాన్నడిగితే,  “నేను మీరంతా ఆరాటపడే డబ్బు నోట్లని రాత్రికి రాత్రే వరదలా పారించగలను... రాజుల్లా బ్రతుకుతున్న రాజకీయ నాయకులని కూడా కూలివాడి ఇంటి ముందు  నిలబెట్టించగలను.. మీరు బాధ్యతగా ఉంటే మీ చేతుల్లో ఆయుధమై దేశ భవిష్యత్తుని, మీ భవిష్యత్తుని  మార్చేయగలను” అని అంటుందేమో.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఉన్న ప్రజలకి  ఓటు విలువ గురించి బాగా తెలిసుండాలి. మనల్ని మనమే బాగుపర్చుకోవటానికి  రాజ్యాంగం మన చేతిలో పెట్టిన బ్రహ్మాస్త్రం లాంటిది ఈ ఓటు. దేశ పౌరులందరూ  ఓటుకున్న నిజమైన విలువ తెలుసుకుని, నామమాత్రపు ప్రలోభాలకి లొంగిపోకుండా దాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నప్పుడు దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే  ప్రజాస్వామ్యంలో ఓటుకున్న ప్రాముఖ్యత, బలాన్ని ప్రజలకి తెలియజేసే ఉద్దేశంతో ప్రతీ సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము.   ఎప్పుడు మొదలైంది.... 1950, జనవరి 25న భారత ఎన్నికల సంఘం(ECI) స్థాపనకు  గుర్తింపుగా   2011 నుంచి  జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని   జరుపుకోవటం మొదలుపెట్టారు. ఈ రోజు  ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనేలా  ప్రోత్సహించడానికి, అర్హత కలిగిన ప్రతీ పౌరుడు ఓటరుగా నమోదు కావాలనే అవగాహన కలిగించడానికి ప్రారంభమైంది. కాలక్రమేణా ఇది ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ప్రజలకి  అవగాహన కలిగించడం, ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది జరిగే 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం నాటికి  భారత ఎన్నికల సంఘం  స్థాపన జరిగి 75 ఏళ్లు పూర్తవుతుంది.   ఓటు  విలువ.. మందుకో, నోటుకో లేక ఇతర ప్రలోభాలకో  అమ్ముడుపోయి  రాజ్యాంగం మనకిచ్చిన  విలువైన ఓటు  హక్కుని  వృధా చేసుకోవద్దనీ, సరిగా వినియోగిస్తే  దేశ భవిష్యత్తును రూపుదిద్దడంలో  ఓటుదే ప్రధాన పాత్ర అనే విషయాల గురించి ప్రజల్లో అవగాహన కలిగాలి.  ఓటు హక్కు వయస్సుని 21 నుంచి 18కి కుదించారు కనుక అధిక యువ జనాభా ఉన్న భారత దేశ భవిష్యత్తుని మార్చగల శక్తి యువ ఓటర్లలో ఉంటుంది. అందుకే బాధ్యతగా ఉండి సరైన నాయకుణ్ణి ఎన్నుకోవటంలోనే తమ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న నిజాన్ని యువ ఓటర్లు గ్రహించేలా చేయటానికి,  నిష్పక్షపాతంగా  ఎన్నికలు జరిగేందుకు  కృషి చేసిన అధికారులు, భాగస్వాములు, సంస్థలను "ఉత్తమ ఎన్నిక పద్ధతుల పురస్కారాలు" ఇచ్చి గుర్తించడానికి గానూ  ఈరోజు  ఒక వేదికవుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు .. ఓటుహక్కు అనేది పౌరులకు తమ నాయకులను తామే  ఎంపిక చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలపర్చే అవకాశం ఇస్తుంది.  జవాబుదారీగా ఉండే అవకాశం ఇస్తుంది. ఎన్నికల సమయంలో ఓటర్లు  తీసుకున్న నిర్ణయాలే దేశ విధానాలు, అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఓటు హక్కు అన్ని వర్గాల వారు ఉపయోగించటం వల్ల  అన్ని కమ్యూనిటీల నుండి విభిన్న ప్రతినిధులు ఎన్నికై  వారి భావాలని, బాధలని  దేశానికి  వినిపించేందుకు అవకాశం దొరుకుతుంది.  99.1 కోట్ల ఓటర్లను నమోదు చేసి భారతదేశం ఒక సరికొత్త రికార్డు నెలకొల్పింది. అందులో యువ ఓటర్లు  21.7 కోట్లు మంది ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఓటు హక్కు విలువ ఎంత అంటే.. భారతదేశంలో ఉన్న వందకోట్ల ప్రజానీకం విలువంత..   కాబట్టి ఎవరూ ఓటు హక్కును తృణ ప్రాయంగా త్యజించడం లేదా అవగాహన లేకుండా ఓటు వేయడం చేయకూడదు. ఓటింగులో ఉన్న సవాళ్లు.. ఇప్పటి ఎన్నికల్లో ఎక్కువగా ఓటు వేయటానికి ఆసక్తి చూపించనిది ఎవరని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.. ఎందుకంటే  విధ్యాబుద్ధులు లేని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే  గిరిజన తెగవారు కూడా ఓటుహక్కు వినియోగించుకుంటుంటే, ఎంతో చదువుకుని నగరాల్లో స్థిరపడి నాగరికత గురించి లెక్చర్లు ఇచ్చేవారు మాత్రం ఓటు వేయకుండా ఎన్నికల రోజుని ఒక సెలవురోజులా చూస్తున్నారు.  ఇది ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉంది.  ఓటు హక్కు, ఎన్నికల  ప్రక్రియల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా మంది ఓటు వేయకుండా ఉండిపోతున్నారు. అలాగే జీవనోపాధి కోసం  దూర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు వచ్చే వీలు లేక, తగిన సౌకర్యాలు కల్పించలేకపోవటం వల్ల కూడా  ఓటింగ్ తగ్గుతుందని చెప్పాలి. ఓటు..  ప్రతి పౌరుడి బాధ్యత.. మన ఒకరి ఓటుతో   పెద్దగా ఒరిగేదెముందిలే? అని ఆలోచించే ప్రతీ ఒక్కరు మరో సారి పునరాలోచించాలి ఎందుకంటే ఒక ఇంటి పెద్ద సరిగా లేకుంటే కుటుంబం ఎలా నాశనమవుతుందో, ప్రజలు ఎన్నుకునే నాయకుడు అవినీతిపరుడో, అసమర్ధుడో అయితే సమాజం, దేశం నాశనమవుతాయన్న నిజాన్ని గ్రహించాలి. అన్నీ తెలిసినవాళ్ళు చదువుకున్న మూర్ఖుల్లా మిగిలిపోకుండా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో ఓటు హక్కు విలువను నలుగురికీ తెలియజేయాలి.  ప్రజాస్వామ్య వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పౌరులంతా భాగస్వాములు కావాలి. అప్పుడే ఓటు విలువ,ఓటు వేసే మనిషి విలువ కూడా పదిలంగా ఉంటుంది.                                    *రూపశ్రీ.

National Education Day

తెలియని తాళం వేసిన అన్ని తలుపులని విద్య తెరవగలదు!

  ‘’విద్య లేనివాడు వింత పశువు” అనే పాత తెలుగు సామెత వినటానికి కొంచెం కఠినంగా అనిపించినప్పటికీ,   మనిషికి విద్య  ఎంత ముఖ్యమో మొట్టికాయ పెట్టి  మరీ చెప్పినట్టు ఉంటుంది. జ్ఞానం అనేది  ఒక శక్తి. అది విద్య నుంచే మొదలవుతుంది.  ఇప్పుడు విద్య అనేది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే కాదు ఒక కనీస అవసరం.  ఇది వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతికి మూలస్తంభం. ఈ రోజుల్లో సమాజంలో మనగలగలగాలంటే  డబ్బు ఎంత ముఖ్యమో, విద్య అంత కన్నా ముఖ్యం. ఒక మనిషిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపగలిగే శక్తి విద్యకుంది. అందుకే  దీని ప్రాముఖ్యతని, అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ  2018లో  విద్య దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి ఏడాది జనవరి 24న  ప్రపంచమంతటా అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి  విద్య ప్రాముఖ్యత  గురించి, అందరికీ విద్య అందించటంలో ఎదురవుతున్న సవాళ్ళ గురించి, వాటిని పరిష్కరించడానికి  కొత్త పరిష్కారాల  గురించి తెలుసుకుంటే..... అందరికీ విద్య  అవసరమే..... విద్య ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి మాత్రమే కాకుండా, సమాజం అభివృద్ధికి కూడా కీలకంగా ఉంటుంది. నిరక్షరాస్యతను తగ్గించడం, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం వంటి అంశాల్లో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మెరుగైన ఆర్థిక అవకాశాలను అందించి ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తుంది. మన దేశ జనాభాలో సంపన్నులకంటే దరిద్రంలో బ్రతికేవారి సంఖ్యే ఎక్కువ కనుక  ఆ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే విద్య అనే ఆయుధం చేపట్టాలి. అందుకే ఒక చిన్న కూలిపని చేసుకునే వ్యక్తి కూడా తన కష్టం తమ పిల్లలకి రాకూడదని పిల్లలను  చదివించి వారి  భవిష్యత్తుని తీర్చిదిద్దాలనుకుంటున్నారు.  విద్య  ద్వారానే సమానత్వం సాధ్యమవుతుంది.  అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులు కూడా ఎంతో వివక్ష, అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ విద్యనే ఆయుధంగా మలచుకుని గొప్పవాళ్లయ్యారు. దేశ చరిత్రలోనే నిలిచిపోయారు.. ‘విద్య అనేది పులిపాల వంటిది, దాన్ని తాగినవారు గర్జించకుండా ఉండలేరు” అనేది ఆయన మాట. అలాగే లింగ సమానత్వం, సామాజిక అసమానతలను తగ్గించడం వంటి ఇతర  లక్ష్యాలను సాధించడంలో  కూడా  విద్య సాయపడుతుంది. అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025 థీమ్.... "ఏఐ మరియు విద్య- ఆటోమేషన్ ప్రపంచంలో మానవ ఏజెన్సీని సంరక్షించడం" అనే థీమ్ ను 2025 అంతర్జాతీయ విద్య దినోత్సవం సందర్భంగా ఎంచుకున్నారు. ఈ థీమ్ అంతర్జాతీయ విద్యా సవాళ్లపై ఏ‌ఐ ప్రభావమేంటో తెలుసుకోవటంపైన,  అలాగే సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మానవ స్వేచ్ఛను ఎలా పరిరక్షించాలి, నిర్వహించాలి,  పెంపొందించాలి అనే దానిపై కేంద్రీకృతమవుతుంది. సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకుని, దానిని సమర్థంగా ఆవిష్కరించడానికి వ్యక్తులు, సముదాయాలను సన్నద్ధం చేయడంలో విద్య  శక్తిని గ్రహింపజేస్తుంది. అందరికీ విద్య అందించటంలో ఎదురవుతున్న  సవాళ్లు…… విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించినప్పటికీ,  ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది పిల్లలు, యువత విద్యను పొందడంలో లేదా మొదటిపెట్టిన చదువు  పూర్తిచేయడంలో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. చాలా కుటుంబాలు మౌలిక అవసరాలను తీర్చాటానికే  ఇబ్బంది పడుతూ, పాఠశాల ఫీజులు, యూనిఫాంలు, పుస్తకాలను కొనలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు లక్షలాది మంది విద్యను అడ్డుకుంటూ, పిల్లలను పాఠశాలల నుండి దూరం చేస్తున్నాయి.  చాలా ప్రాంతాల్లో సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక కారణాల వల్ల అమ్మాయిలను విద్య నుండి దూరం చేస్తున్నారు.   ముఖ్యంగా  కుటుంబాల నుండి విడిపోయిన పిల్లలు లేదా చాలా పేదరికంలో ఉన్న పిల్లల విద్యావకాశాలని  చాలా ప్రభావితం చేస్తున్నాయి.   అందరికీ విద్య  చేరేలా ఏం చేయగలం..... 244 మిలియన్లకు పైగా పిల్లలు, యువతులు ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు. పాఠశాలకు వెళ్లే 600 మిలియన్లకు పైగా పిల్లలు ప్రాథమిక అక్షర, సంఖ్యాజ్ఞానం సాధించలేకపోతున్నారు. ఎందుకంటే విద్యపట్ల అవగాహన లేకపోవటం, నాణ్యమైన విద్య అందకపోవటం జరుగుతోంది.  అప్పట్లో మన ఊళ్లలోనే చదువుకోవటం ఎంత ముఖ్యమో చెప్పటానికి ‘అన్నాదమ్ముల నాటకం’ వేసి అందరికీ అవగాహన కలిగించే ప్రయత్నం చేసేవారు గుర్తుందా.... మరి అలాంటిది సోషల్ మీడియా యుగంలో ఉన్న మనకి విద్య పట్ల అవగాహన వ్యాప్తి చేసే మార్గాలు చాలా ఉన్నాయి. విద్యకి  గ్లోబల్గా ఉన్న సవాళ్ళని గుర్తించి సోషల్ మీడియాలో అందరి దృష్టికీ తీసుకురావాలి. #అందరికీ విద్య, #నాణ్యమైన విద్య  వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి గణాంకాలు, కథనాలు, విశ్లేషణలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలి. ఎదురవుతున్న సవాళ్ళకి పరిష్కారాలు చూపించే  ఆన్‌లైన్ లేదా స్థానిక ఈవెంట్‌లలో పాల్గొనాలి.  విద్యలో సమానత్వం, అందుబాటులో ఉన్న విద్యను ప్రోత్సహించటం వంటి  విద్యా సంస్కరణలను సమర్థించాలి. విద్య కేవలం పాఠశాల స్థాయిలోనే కాకుండా నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా ఉండేలా నూతన విద్యా విధానాల అమలు కోసం పిలుపునివ్వాలి.  పర్యావరణ సంరక్షణ, సాంకేతికత, ఆర్థిక సుస్థిరత వంటి అంశాలను విద్య ద్వారా నేర్పించాలి. చదువుకోవాలనే తపన ఉన్న పేదపిల్లలకి  ఆర్ధిక సాయం అందించే మార్గాలు చూపాలి. పనులకి వెళ్ళి చదువుకి దూరమైపోతున్న పిల్లల్ని గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించి, చదువుకి దగ్గర చేయాలి.  ‘అందరికీ విద్య- మనందరి భాద్యత’ అన్న మాటని అందరం నిలబెట్టుకోవాలి.                             *రూపశ్రీ.

National Girl Child Day

ఆమె కనే కలలకి రెక్కలనివ్వు.. అంతరిక్షపు అంచులని కూడా  తాకగలదు.. 

  భారతీయ సమాజంలో ఇప్పటికీ ఒక మచ్చలా ఉండిపోయిన అంశం.. ఆడపిల్లని ఒక పెద్ద భారంగా చూడటం లేదా అప్రయోజకురాలని ముందే నిర్ణయించేయటం. కాలం ఎంతలా మారినా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట  తల్లిదండ్రుల నోటి నుంచో, ఏ బంధువుల నోటి నుంచో ‘ఆ...డపిల్ల పుట్టిందా..!’ అన్న పెదవి విరుపు మాట వినాల్సి వస్తుంది.  ఇన్నేళ్ల తర్వాత కూడా ఇది జరుగుతోందంటే అది నిజంగా మన సమాజపు దౌర్భాగ్యమనే చెప్పాలి. ఊరికో అమ్మవారిని కొలిచే సాంప్రదాయం ఉన్న భారతీయులు తమ ఇంట్లో ఆడపిల్ల పుడితే అపురూపంగా చూడలేకపోతున్నారు. వీర వనితల గురించి, సమాజం మీద వారు చూపించిన ప్రభావం గురించి పురాణాలు, గత చరిత్రలు సాక్ష్యాలుగా నిలుస్తున్నా కూడా ఆడపిల్ల జీవితం అమ్మ కడుపులోనో, రోడ్డు పక్కన చెత్తబుట్టలోనో అంతమవుతూనే ఉంది. ఇప్పుడిప్పుడు కొంత మార్పు మొదలైనా కూడా అదంతా పైపై మెరుగులా స్త్రీ జాతికి ఏదో మేలు జరిగిపోతోందనే మాటలు మాత్రం ఎక్కువ ఉంటాయి. సమాజంలో మహిళల ప్రాధాన్యతపై అవగాహన పెంచడానికి,  భారత యువ జనాభాలో కీలక భాగమైన బాలికల ప్రాముఖ్యతను ప్రజలకు చాటి చెప్పడానికి, వారి విద్య గురించి అవగాహన కల్పించడానికి 2008 నుంచి  ప్రతీ సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాలికలకూ బంగారు జీవితం.. ఆపిడ్డలలు  తమ కుటుంబంలోనూ, సమాజంలోనూ చాలా వివక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ వివక్షని నిర్మూలించటానికి, సమాజంలో ఆడపిల్లల  పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చటానికి, మన నాగరికత మనుగడకి బాలికలు కూడా ముఖ్యమేనన్న  విషయం అర్ధమయ్యేలా వివరించటానికి జాతీయ బాలికా దినోత్సవం మంచి వేదిక అవుతుంది. ఆడపిల్లలు ఎంతో వివక్ష ఎదుర్కొంటున్న రోజుల్లోనే వారి  విద్య కోసం ఎన్నో కష్టాలని, అవమానాలని ఎదుర్కొని మరీ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మారిన  సావిత్రిబాయి ఫూలే, తొలి మహిళా వైద్యురాలిగా మారిన చంద్రపభా సైకియాని,  ఫాతిమా షేక్ లాంటి పలువురు సంఘ సంస్కర్తల   త్యాగాలను, పోరాటాన్ని ఈ రోజు మనకి  గుర్తు చేస్తుంది. ఆడపిల్లల భ్రూణ హత్యలని నిరోధించటం, బాలికల విద్యను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను గుర్తుచేస్తుంది. బాలికల హక్కులు, సమాజంలో వారి పాత్రపై అవగాహన పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. భారతదేశ భవిష్యత్తుకు బాలికలు కూడా కీలకమైన భాగమనీ, వారిని రక్షించడం, విద్యను అందించడం, సమాన అవకాశాలు కల్పించడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. 2025 థీమ్..... భారత ప్రభుత్వం జాతీయ బాలిక దినోత్సవం 2025కి గానూ, “ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకి సాధికారత కల్పించటం” అనే అంశాన్ని ఎంచుకుంది.  ఈ థీమ్ మన దేశ భవిష్యత్తు బాగుండాలంటే దాని నిర్మాణంలో బాలికలకి కూడా సమ ప్రాధాన్యమిచ్చి, సాధికారత కల్పించాలన్న విషయాన్ని తెలియజేస్తుంది. సమాజ అభివృద్ధిలో  వారి పాత్రను హైలైట్ చేస్తుంది. సాధించాల్సిన లక్ష్యాలు.... బాలికల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి,  సమాజంలో మగవారితోపాటూ సమానావకాశం ఇవ్వాలి.  వారికి  నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి కలలను సాధించడంలో సహాయం చేయాలి.  బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు, స్వయం సమర్థతను పొందేందుకు,  స్వంతంగా చురుకైన  నిర్ణయాలు తీసుకోగలిగేలా  ప్రోత్సహించాలి.  భారతదేశంలో బాలికల అభ్యున్నతికి, సంక్షేమానికి  మద్దతు ఇచ్చేలా చర్యలు తీసుకోవటం,  విధానాలను రూపొందించటం చేయాలి. బాలికల పట్ల అడుగడుగునా జరిగే అత్యాచారాలు, దౌర్జన్యాలని అరికట్టి సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి సమాజాన్ని  ప్రోత్సహింఛాలి.     బాలికల అభివృద్ధితోనే  మన దేశ అభివృద్ధి..... ప్రతీ బాలికకు తగిన గౌరవం, అవకాశాలు లభించేవరకు ఈ దినోత్సవ లక్ష్యం నెరవేరనట్టే అర్ధం. ప్రతి ఒక్కరూ బాలికలను రక్షించి,  వారికి భవిష్యత్తు అందించడానికి కృషి చేయాలి.  బాలికలను శక్తివంతం చేసి, సమాజపు మూస ధోరణిలను పగలగొట్టాలి.  ప్రతీ  బాలికలోనూ  అపారమైన సామర్థ్యం ఉందని గుర్తుచేస్తూ, వారి ప్రతిభను గుర్తించి, ప్రశంసించడం  ద్వారా మనం మరింత గొప్ప సమాజాన్ని నిర్మించగలుగుతాం. లింగ సమానత్వం ఒక కల కాదు నిజమేనని నిరూపించేలా అడుగులు వేస్తూ,  అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అందరూ అర్ధం చేసుకోవాలి. వారు అనుకుంటే అంతరిక్షం కూడా చేరుకోగలరన్న నమ్మకాన్ని మన ఇంటి ఆడపిల్లకి ఇచ్చిననాడు, భారతదేశంలోని ఆడబిడ్డలంతా వారి శక్తి సామర్ధ్యాలతో సమాజపు రూపురేఖలనే మార్చగలుగుతారు. ఆడపిల్లే కదా అని అలుసుగా చూడకు... ఆమె లేకపోతే సమాజం ఒంటెద్దు బండిలా కుంటుతూ నడుస్తుందన్న నిజాన్ని గ్రహించు.                                               *రూపశ్రీ.

parakram diwas celebrations

నేతాజీ సుభాస్ చంద్రబోస్.. పరాక్రమ్ దివస్2025..!

  “నాకు నీ రక్తమివ్వు, నేను నీకు స్వేచ్చనిస్తాను” అనే  నినాదం ఈ దేశ భవిష్యత్తును మరో మలుపుకు తీసుకెళ్లింది.   బానిస సంకెళ్లలో నలిగిపోతున్న ఈ దేశం   అడుక్కోవటం వల్లనో లేక బ్రతిమిలాడడటం వల్లనో స్వేచ్ఛ సంపాదించలేదని, పోరాటం చేసి ఆ  సంకెళ్లని ఈ దేశ ప్రజలే  తెంచుకోవాలన్న సందేశాన్ని భారత పౌరులకి సూటిగా అందజేయగలిగింది ఈ నినాదమే..  స్వాతంత్ర్యం కోసం మనం అమరులమయినా పర్వాలేదు, మన సమాధులే మెట్లుగా స్వతంత్ర సాధనవైపు అడుగులు పడితే చాలు అనుకున్న గొప్ప దేశ భక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయనకున్న అపారమైన దేశభక్తి స్వాతంత్ర్య పోరాటంలో అనేకమందికి స్ఫూర్తిగా నిలిచింది. సివిల్ సర్వీసెస్ కూడా వదిలేసి భారతదేశానికి సేవ చేయాలనే తపనతో స్వాతంత్ర్య పోరాటంలో భాగమైన మహనీయుడాయన. స్వాతంత్య్ర పోరాటంలో తన అపూర్వమైన నాయకత్వం, ధైర్యం, త్యాగంతో లక్షలాదిమందికి స్ఫూర్తిగా నిలిచి, భారతీయుల హృదయాల్లో ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు నేతాజీ సుబాష్ చంద్రబోస్..  ఆయన త్యాగాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన జయంతి దినమైన జనవరి 23ను ‘పరాక్రమ దినోత్సవం’గా గుర్తించి ప్రతీ సంవత్సరం జరుపుకుంటుంది. ఈ రోజు  గురించి, నేతాజీ  పోరాటం గురించి,  ఆయన నాయకత్వం గురించి తెలుసుకుంటే. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. నేతాజీ 1897,జనవరి 23న  ఒడిషాలోని కటక్‌లో జన్మించారు. ఆయనలో చిన్ననాటి నుంచే దేశభక్తి భావనలు గాఢంగా పెరిగాయి.  ఆయన తల్లిదండ్రుల సూచనతో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసి ‌ఎస్) కోసం సిద్ధమయ్యారు. 1920లో సివిల్ సర్వీస్ పరీక్షలో పాసయ్యారు. కానీ 1921 ఏప్రిల్‌లో భారతదేశంలో జరుగుతున్న జాతీయవాద ఉద్యమాల గురించి తెలుసుకుని అక్కడ రాజీనామా చేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. గాంధీజీ అనుచరుడిగా, చిత్తరంజన్ దాస్ రాజకీయ శిష్యుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన నేతాజీ తర్వాత యువజన నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. తర్వాత నేతాజీ  విధానాలు నచ్చకపోవటంతో   గాంధీగారి మద్దతు దొరకలేదు.  అయినా సరే భారత స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు సుబాష్ చంద్రబోస్. ఆయన నాయకత్వం భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశను అందించింది. “స్వాతంత్ర్యం ఎవరూ ఇవ్వరు,  దాన్ని మనమే సంపాదించుకోవాలి” వంటి నినాదాలు కోట్లాది మందికి స్ఫూర్తి నిచ్చాయి. స్వాతంత్య్రాన్ని  సాధించడానికి ఆయన ప్రదర్శించిన పట్టుదల, అనుసరించిన తెలివైన విధానాలు ఆయనను జాతీయ నాయకుడిగా నిలిపాయి.  స్వాతంత్ర ఉద్యమానికి చేసిన కృషి.. రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగి, 1938-39లలో  ఐ‌ఎన్‌సి  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నేతాజీ. మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ఈయన విభేధించారు.  ఈ  కారణంగా రాజీనామా చేసి స్వతంత్ర మార్గంలో స్వాతంత్ర్యం సాధించాలన్న తన విధానాన్ని అమలు చేశారు. 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి, వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆక్టివ్గా ఉన్న ప్రతీ వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి,  స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పనిచేశారు. ఆయన 1941లో భారతదేశం నుండి జర్మనీ వెళ్ళి కూడా భారత స్వాతంత్ర్యం కోసం పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్, జర్మనీతో స్నేహం చేయటం ద్వారా, వలస పాలనకు వ్యతిరేకంగా భారత్ పోరాటాన్ని బలపరిచారు.  1943లో ఆయన సింగపూర్‌కు వచ్చి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు నాయకత్వం వహిస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను(ఇండియన్ నేషనల్ ఆర్మీ) పునర్నిర్మించారు. భారతీయ యుద్ధ ఖైదీలు, ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులని కలిపి  దాదాపు 45,000 మంది సైనికులతో ఈ ఐ‌ఎన్‌సి ఏర్పాటు చేశారు. ఇది భారత స్వాతంత్య్రానికి సమర్థవంతమైన సాధనంగా మారింది. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశాన్ని బ్రిటీష్ పాలననుంచి విముక్తి చేయడంలో విఫలమైనప్పటికీ,   స్వాతంత్ర్య ఉద్యమానికి  స్పూర్తినివ్వటంలో కీలక పాత్ర పోషించింది. "ఢిల్లీ చలో", "జై హింద్" వంటి ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదాలు  భారతీయుల ఐక్యతను, ధైర్యాన్ని పెంచాయి. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో రాణి ఝాన్సీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేయడం స్వతంత్ర పోరాటంలో మహిళల పాత్రను ప్రోత్సహించింది. నేతాజీ అనుసరించిన విధానాలు, సైనిక చర్యలవల్ల మున్ముందు భారత సైన్యం తమకి విశ్వాసంగా ఉంటుందన్న నమ్మకం లేదన్న విషయం   బ్రిటిషు వారికి అర్ధమైంది. తద్వారా భారత స్వాతంత్ర్య ప్రక్రియ వేగవంతమైంది.   ఆయనే త్యాగమే మనకు స్పూర్తి..  మన దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో జీవితాన్ని త్యాగం చేసిన  గొప్ప నాయకుడు నేతాజీ..  ఆయనను గౌరవించడానికి ఒక అద్భుత అవకాశం ఆయన జన్మదినం. ఆయన 128వ జయంతి సందర్భంగా ఆయన చూపిన  ధైర్యం, పట్టుదల, త్యాగం, ఆయన పోరాటం, ఆయన నాయకత్వం వంటివన్నీ అందరికీ స్పూర్తిగా నిలవాలి. ఆయన చేసిన కృషిని, దేశ నిర్మాణానికి ఇచ్చిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ స్వేచ్ఛ, అభివృద్ది కలిగిన భారతదేశ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలి. ప్రతీ పౌరుడు ఐకమత్యం, ధైర్యం, దేశం పట్ల అంకితభావం అనే ఉన్నత లక్షణాలని అలవర్చుకోవాలి. నేతాజీ హిమాలయాలకు వెళ్ళిపోయాడని,  ఆయన అక్కడే ఉంటాడని చాలా వార్తలు వ్యాపించాయి.  హిమశిఖరాలలో తానూ ఒక శిఖరంగా మారి ఈ దేశానికి ఆయన ఎప్పుడూ కాపు కాస్తుంటాడని భారతీయ దేశభక్తులు,  నేతాజీ త్యాగాన్ని అర్థం చేసుకున్న వారి విశ్వాసం. నేటి కాలం యువత దేశం తల ఎత్తుకునేలా చేయడమే ఆయనకు ఇచ్చే గొప్ప బహుమానం అవుతుంది.                                          *రూపశ్రీ.

who want to become rich should stay away from these places

ధనవంతులు కావాలని అనుకునేవారు ఈ ప్రదేశాలకు దూరంగా ఉండాలి..!

  ఆచార్య చాణక్యుడే కౌటిల్యుడు అని కూడా పేరు పొందాడు. ఈయన రాజనీతిని మాత్రమే కాకుండా ఆర్థిక నీతిని, తత్వజ్ఞానాన్ని కూడా బోధించాడు. ఆయన సలహాల ద్వారా, ఈయన మార్గనిర్దేశకత్వంలో చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.  మనిషి జీవితంలో ధనవంతులు కావాలన్నా,  పేదవాడు కావాలన్నా అది అతను తీసుకునే నిర్ణయాలు,  అతని ఆలోచలన మీదనే ఆధారపడి ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.  ముఖ్యంగా ఒక వ్యక్తి ధనవంతుడు కావాలనే ఆలోచినలో ఉంటే కొన్ని రకాల  ప్రదేశాలకు దూరంగా ఉండాలట. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుంటే.. ధనమేరా అన్నింటికి మూలం అని రాశాడు ఓ రచయిత.  డబ్బు మనిషి జీవితాన్ని శాసిస్తోంది. అలాంటి డబ్బును కూడబెట్టుకోవాలని, జీవితంలో ఉన్నతంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. అయితే డబ్బు అభివృద్ది చెందేలా చేయడం కూడా ఓ కళనే.. అది అందరికీ సాధ్యం కాదు. కానీ కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉండటం వల్ల డబ్బు వృథా కావడాన్ని అరికట్టవచ్చు. ఉపాధి లేని ప్రదేశాలు.. ఉపాధి ఉంటేనే మనిషి ఆర్థికంగా ఎదగగలడు. వాణిజ్య కార్యకలాపాలు లేని ప్రదేశాలో నివసించడం మంచిది కాదట. ఉపాధి సరిగా లేని ప్రదేశాలలో నివసించే ప్రజలు పేదరికంలోనే ఎక్కువ మగ్గిపోతారట. వేదాల పరిజ్ఞానం ఉన్న పండితులు,  బ్రాహ్మణులు నివసించని ప్రాంతాలలో నివసించడం కూడా మంచిది కాదట. బ్రాహ్మణులు  సమాజంలో మతపరమైన, సాంస్కృతిక విలువలను రక్షిస్తారు.  అలాంటి బ్రాహ్మణులు లేని స్థలంలో పురోగతి అనేది ఎక్కువగా ఉండదట.  బ్రాహ్మణులు ఉన్న ప్రదేశాలలో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని అంటారు.  పాజిటివ్ వైబ్రేషన్ లేకుంటే ఆర్థిక వృద్ధి కూడా ఉండదు. నీరు లేని ప్రాంతాలు.. నీరు లేని జీవితాన్ని ఊహించలేము. నదులు, చెరువులు,  ఇతర నీటి వనరులు ఉన్న ప్రదేశాలలోనే జీవించాలి. ఇవి  లేని ప్రదేశాలలో నివసించేవారు ఆర్థికంగా అభివృద్ది చెందలేరు. నీటి ఎద్దటి ఉన్న ప్రాంతాలలో నివసిస్తే  చాలా వరకు నీటి సమస్యల కారణంగా సమయం వృథా అవుతుంది.  చాలా వరకు సంపాదనా అవకాశాలకు అంతరాయం కూడా ఏర్పడుతుంది.   వైద్య సౌకర్యాలు.. వైద్య సౌకర్యాలు ప్రతి ఒక్కరికీ చాలా అవసరం.  అత్యవసర సమయంలో వైద్య సదుపాయం ఉన్నప్పుడు చాలా మంది ప్రాణాలు నిలబడతాయి. ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించగలిగే వైద్య సేవలు లేని ప్రదేశాలలో నివసిస్తే ఆర్థిక  ఎదుగుదల ఉండదు.                                     *రూపశ్రీ.  

parakram diwas celebrations

నేతాజీ సుభాస్ చంద్రబోస్.. పరాక్రమ్ దివస్2025..!

  “నాకు నీ రక్తమివ్వు, నేను నీకు స్వేచ్చనిస్తాను” అనే  నినాదం ఈ దేశ భవిష్యత్తును మరో మలుపుకు తీసుకెళ్లింది.   బానిస సంకెళ్లలో నలిగిపోతున్న ఈ దేశం   అడుక్కోవటం వల్లనో లేక బ్రతిమిలాడడటం వల్లనో స్వేచ్ఛ సంపాదించలేదని, పోరాటం చేసి ఆ  సంకెళ్లని ఈ దేశ ప్రజలే  తెంచుకోవాలన్న సందేశాన్ని భారత పౌరులకి సూటిగా అందజేయగలిగింది ఈ నినాదమే..  స్వాతంత్ర్యం కోసం మనం అమరులమయినా పర్వాలేదు, మన సమాధులే మెట్లుగా స్వతంత్ర సాధనవైపు అడుగులు పడితే చాలు అనుకున్న గొప్ప దేశ భక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయనకున్న అపారమైన దేశభక్తి స్వాతంత్ర్య పోరాటంలో అనేకమందికి స్ఫూర్తిగా నిలిచింది. సివిల్ సర్వీసెస్ కూడా వదిలేసి భారతదేశానికి సేవ చేయాలనే తపనతో స్వాతంత్ర్య పోరాటంలో భాగమైన మహనీయుడాయన. స్వాతంత్య్ర పోరాటంలో తన అపూర్వమైన నాయకత్వం, ధైర్యం, త్యాగంతో లక్షలాదిమందికి స్ఫూర్తిగా నిలిచి, భారతీయుల హృదయాల్లో ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు నేతాజీ సుబాష్ చంద్రబోస్..  ఆయన త్యాగాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన జయంతి దినమైన జనవరి 23ను ‘పరాక్రమ దినోత్సవం’గా గుర్తించి ప్రతీ సంవత్సరం జరుపుకుంటుంది. ఈ రోజు  గురించి, నేతాజీ  పోరాటం గురించి,  ఆయన నాయకత్వం గురించి తెలుసుకుంటే. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. నేతాజీ 1897,జనవరి 23న  ఒడిషాలోని కటక్‌లో జన్మించారు. ఆయనలో చిన్ననాటి నుంచే దేశభక్తి భావనలు గాఢంగా పెరిగాయి.  ఆయన తల్లిదండ్రుల సూచనతో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసి ‌ఎస్) కోసం సిద్ధమయ్యారు. 1920లో సివిల్ సర్వీస్ పరీక్షలో పాసయ్యారు. కానీ 1921 ఏప్రిల్‌లో భారతదేశంలో జరుగుతున్న జాతీయవాద ఉద్యమాల గురించి తెలుసుకుని అక్కడ రాజీనామా చేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. గాంధీజీ అనుచరుడిగా, చిత్తరంజన్ దాస్ రాజకీయ శిష్యుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన నేతాజీ తర్వాత యువజన నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. తర్వాత నేతాజీ  విధానాలు నచ్చకపోవటంతో   గాంధీగారి మద్దతు దొరకలేదు.  అయినా సరే భారత స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు సుబాష్ చంద్రబోస్. ఆయన నాయకత్వం భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశను అందించింది. “స్వాతంత్ర్యం ఎవరూ ఇవ్వరు,  దాన్ని మనమే సంపాదించుకోవాలి” వంటి నినాదాలు కోట్లాది మందికి స్ఫూర్తి నిచ్చాయి. స్వాతంత్య్రాన్ని  సాధించడానికి ఆయన ప్రదర్శించిన పట్టుదల, అనుసరించిన తెలివైన విధానాలు ఆయనను జాతీయ నాయకుడిగా నిలిపాయి.  స్వాతంత్ర ఉద్యమానికి చేసిన కృషి.. రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగి, 1938-39లలో  ఐ‌ఎన్‌సి  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నేతాజీ. మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ఈయన విభేధించారు.  ఈ  కారణంగా రాజీనామా చేసి స్వతంత్ర మార్గంలో స్వాతంత్ర్యం సాధించాలన్న తన విధానాన్ని అమలు చేశారు. 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి, వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆక్టివ్గా ఉన్న ప్రతీ వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి,  స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పనిచేశారు. ఆయన 1941లో భారతదేశం నుండి జర్మనీ వెళ్ళి కూడా భారత స్వాతంత్ర్యం కోసం పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్, జర్మనీతో స్నేహం చేయటం ద్వారా, వలస పాలనకు వ్యతిరేకంగా భారత్ పోరాటాన్ని బలపరిచారు.  1943లో ఆయన సింగపూర్‌కు వచ్చి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు నాయకత్వం వహిస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను(ఇండియన్ నేషనల్ ఆర్మీ) పునర్నిర్మించారు. భారతీయ యుద్ధ ఖైదీలు, ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులని కలిపి  దాదాపు 45,000 మంది సైనికులతో ఈ ఐ‌ఎన్‌సి ఏర్పాటు చేశారు. ఇది భారత స్వాతంత్య్రానికి సమర్థవంతమైన సాధనంగా మారింది. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశాన్ని బ్రిటీష్ పాలననుంచి విముక్తి చేయడంలో విఫలమైనప్పటికీ,   స్వాతంత్ర్య ఉద్యమానికి  స్పూర్తినివ్వటంలో కీలక పాత్ర పోషించింది. "ఢిల్లీ చలో", "జై హింద్" వంటి ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదాలు  భారతీయుల ఐక్యతను, ధైర్యాన్ని పెంచాయి. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో రాణి ఝాన్సీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేయడం స్వతంత్ర పోరాటంలో మహిళల పాత్రను ప్రోత్సహించింది. నేతాజీ అనుసరించిన విధానాలు, సైనిక చర్యలవల్ల మున్ముందు భారత సైన్యం తమకి విశ్వాసంగా ఉంటుందన్న నమ్మకం లేదన్న విషయం   బ్రిటిషు వారికి అర్ధమైంది. తద్వారా భారత స్వాతంత్ర్య ప్రక్రియ వేగవంతమైంది.   ఆయనే త్యాగమే మనకు స్పూర్తి..  మన దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో జీవితాన్ని త్యాగం చేసిన  గొప్ప నాయకుడు నేతాజీ..  ఆయనను గౌరవించడానికి ఒక అద్భుత అవకాశం ఆయన జన్మదినం. ఆయన 128వ జయంతి సందర్భంగా ఆయన చూపిన  ధైర్యం, పట్టుదల, త్యాగం, ఆయన పోరాటం, ఆయన నాయకత్వం వంటివన్నీ అందరికీ స్పూర్తిగా నిలవాలి. ఆయన చేసిన కృషిని, దేశ నిర్మాణానికి ఇచ్చిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ స్వేచ్ఛ, అభివృద్ది కలిగిన భారతదేశ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలి. ప్రతీ పౌరుడు ఐకమత్యం, ధైర్యం, దేశం పట్ల అంకితభావం అనే ఉన్నత లక్షణాలని అలవర్చుకోవాలి. నేతాజీ హిమాలయాలకు వెళ్ళిపోయాడని,  ఆయన అక్కడే ఉంటాడని చాలా వార్తలు వ్యాపించాయి.  హిమశిఖరాలలో తానూ ఒక శిఖరంగా మారి ఈ దేశానికి ఆయన ఎప్పుడూ కాపు కాస్తుంటాడని భారతీయ దేశభక్తులు,  నేతాజీ త్యాగాన్ని అర్థం చేసుకున్న వారి విశ్వాసం. నేటి కాలం యువత దేశం తల ఎత్తుకునేలా చేయడమే ఆయనకు ఇచ్చే గొప్ప బహుమానం అవుతుంది.                                          *రూపశ్రీ.

Relationship Tips

భార్యాభర్తల బంధంలో నమ్మకం పెరగాలంటే  ఇలా చేయండి..!

  నమ్మకం ఏ బంధం లో అయినా మూలకారణం అవుతుంది.  నమ్మకం లేకపోతే చిన్నచిన్న విషయాలే పెద్ద సమస్యలకు కారణం అవుతాయి. ఇక జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తల మధ్య ఈ నమ్మకం ఎక్కువే ఉండాలి.  చాలా వరకు భార్యాభర్తల రిలేషన్ అనేది నమ్మకం లోపించడం వల్లే విఫలం అవుతుంటాయి. నమ్మకం లేని చోట కనీసం మనుషుల మీద మంచి అభిప్రాయం కూడా ఉండదు. భార్యాభర్తల మధ్య నమ్మకం పెరగడానికి  ఏం చేయాలో తెలుసుకుంటే..  భార్యాభర్తల తమ మనసులో ఉండే భయాలు,  గత అనుభవాలను షేర్ చేసుకోవడం,  ఏ విషయాన్ని అయినా మొదట తన భాగస్వామితోనే చెప్పుకోవడం వంటివి చేయడం వల్ల అవతలి వ్యక్తి  మనసులో ఒక మంచి అబిప్రాయం,  నమ్మకం ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది భార్యాభర్తల మద్య బంధాన్ని బలంగా ఉంచుతుంది. తప్పులు అందరూ చేస్తారు.  అలాగే భార్యాభర్తలు కూడా తప్పులు చేస్తుంటారు.  భార్యాభర్తలు ఇద్దరూ తమ భాగస్వామి తప్పు చేసినప్పుడు వారిని నిందించడం చేస్తుంటారు. అయితే అలా నిందించడానికి బదులుగా తప్పు చేయడానికి గల కారణాలు తెలుసుకుని దానికి సరైన పరిష్కారం చెప్తే ఇంకొకసారి తప్పు చేయకుండా సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తారు. అంతేకాదు.. భాగస్వామి తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించడమే కాదు.. తను తప్పు చేసినా  దాన్ని ఓపెన్ గా చెప్పి అంగీకరించే స్వభావం కూడా కలిగి ఉండాలి.  అలా ఉంటే ఇద్దరూ బాగుంటారు. ఇద్దరూ కలిసి చేసే ఏ పని అయినా చాలా మంచి అనుభవాన్ని ఇస్తుంది.  ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది ఇద్దరినీ దగ్గర చేస్తుంది. మంచి, చెడులను పరస్పరం పంచుకోవడం,  ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా ఇద్దరి మధ్య బంధం బాగుంటుంది.  ఒకరి మీద మరొకరికి నమ్మకం కూడా ఏర్పడుతుంది. చెబితే నమ్మరు కానీ ఫోన్లు చేసుకోవడం,  మెసేజ్ చేయడం కంటే ఉత్తరాలు రాసుకోవడం,  ఒకరికి ఒకరు కాగితాలలో ఏదైనా సమాచారాన్ని షేర్ చేసుకోవడం వంటివి   చాలా మంచి అనుభవాన్ని ఇస్తాయి.                                               *రూపశ్రీ.

madapati hanumantha rao life story

ఆంధ్ర మహాసభల రూపశిల్పి..ఆంధ్ర పితామహుడు.. మన మాడపాటి హనుమంతరావు..!

  జాతి పిత అనే పేరు అందరూ వినే ఉంటారు.  జాతిపితగా గాంధీని పిలుస్తారని తెలుసు. కానీ ఆంధ్రదేశ పితామహుడి గురించి తెలుసా? అసలు ఆంధ్రదేశానికి పితామహుడిగా ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసా? ఆంధ్రదేశ ప్రజలకు తెలియని ఆంధ్ర పితామహుడు మన మాడపాటి హనుమంతరావు  గారు.  మాడపాటి హనుమంతరావు గారు ప్రముఖ రాజకీయ నాయకుడు,  రచయిత,  ఆంద్రోద్యమ వ్యాప్తిలో కీలక పాత్ర పోషించాడు.  మాడపాటి హనుమంతరావు గారి గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  ఆయన జీవితం ఏంటి? ఆయన ఆంధ్ర పితామహుడుగా ఎలా పిలవబడ్డాడు.. మొదలైన విషయాలు తెలుసుకుంటే.. మాడపాటి హనుమంతరావు గారు కృష్ణా జిల్లా, నందిగామ తాలూకా, పొక్కునూరులో వెంకటప్పయ్య,  వెంకట సుబ్బమ్మ దంపతులకు 1885, జనవరి 22న జన్మించారు.  వీరు ఆరువేల నియోగి బ్రాహ్మణులు. ఈయన తండ్రి గ్రామాధికారిగా చేసేవారు. మాడపాటి వారు మంచి కవి,  రచయిత కూడా.  ఆయన చాలా కథలు రాశారు.  ఇవి పుస్తక రూపంలో కూడా వెలువడ్డాయి. తెలంగాణా ఆంద్రోద్యమం ఈయనకు రచయితగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.  ఈయన బహుభాషా వేత్త. పాత్రికేయునిగా కూడా తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ప్రాంతంలో నైజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను మేల్కొలిపి  ఆంధ్ర మహాసభను నెలకొల్పారు.  రాజకీయంలో ఈయన మితవాదిగా ఉన్నారు. పేరుకు మితవాదిగా ఉన్నా ఈయన తరువాతి తరం వారు అతివాదులుగా రాణించడానికి ఈయన నాయకత్వమే కారణమని విమర్శకుల అభిప్రాయం.  తెలంగాణలో చైతన్యానికి ఆయన చేసిన  తొలి ప్రయత్నాలే కారణం.  అందుకే ఈయన అంటే అందరికీ ఇష్టం ఉండేది. ఆంధ్ర మహాసభకు ఈయన పెద్ద దిక్కులా ఉండేవారు. నిజాం పాలన కారణంగా తెలంగాణలో తెలుగు భాష దెబ్బతింటున్నప్పుడు  తెలుగు భాష, తెలుగు సంస్కృతి వికాసానికి చాలా కృషి చేశారు. ఆయన కృషిని గురించి ప్రస్తావిస్తూ రావి నారాయణరెడ్డి "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా మాడపాటి వారిదే. నాతోటి యువకులెందరో ఆయన వల్ల ప్రాభావితులై ఆంధ్ర వాఙ్మయంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి ఆంధ్ర పితామహుడన్న బిరుదు ఆయన పట్ల సార్థకతను సంతరించుకుంది." అన్నారు. ఆంద్రోధ్యమంలో పనిచేయగలిగిన వారిని స్వయంగా గుర్తించి వారికి తగిన భాద్యతలు అప్పగించేవారట.  ఇలా సమర్థులైన  తెలంగాణ వారే తరువాతి తరంలో తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో నాయకత్వాన్ని సమర్థవంతంగా నడపగలిగారని అంటారు. గ్రంథాలయోధ్యమంలోనూ చెప్పుకోదగ్గ కృషి సాగించారు మాడపాటి వారు. సన్మానాల ద్వారా తనకు వచ్చే డబ్బును కూడా గ్రంథాలయాల అభివృద్దికే ఉపయోగించారు.  భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత  పాఠశాలను హైదరాబాద్ లోని నారాయణగూడలో స్ఖాపించారు.  ఈ పాఠశాల ఇప్పటికీ ఉంది.  ఈయన ప్రజా జీవితాలలోనే ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల రాజకీయ రంగంలో అంత చురుగ్గా ఉండలేకపోయారు. ఆంధ్రోద్యమాన్ని బలోపేతం చేయాలంటే గ్రంథాలయాల స్థాపన జరగాలి, మాతృభాష పట్ల అభిమానం పెరగాలి. ఆంధ్రోద్యమ స్ఫూర్తి పల్లెసీమల ద్వారా వ్యాపించాలి. గ్రామీణ జనావళికి సర్కారీనౌకర్ల వల్ల ఏర్పడే పీడను తొలగించాలి. ఉద్యమంలో రాజకీయ క్రీనీడలు చోటు చేసుకోకుండా చూడాలి. ప్రభుత్వానికి అధికార వర్గానికి ఆంధ్రోద్యమ కార్యకర్తలపై అనుమానాలు ప్రబలకుండా జాగ్రత్తపడాలని ఆయన అనుకునేవారు. మాడపాటి హనుమంతరావు తన ప్రజాజీవితంలో ఒకే ఒకసారి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని శాసనసభకు 1952లో పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరుగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలోనూ ఆయనకు స్థానం దక్కింది. ఆ శాసనమండలికి తొలి అధ్యక్షునిగానూ ఆయన వ్యవహరించారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతికి కృషి చేసిన మాడపాటి వారు చిరస్మరణీయులుగా నిలిచారు.                                   *రూపశ్రీ. 

 future faking problems

ఫ్యూచర్ ఫేకింగ్.. చాలామంది జీవితాలు నాశనం అయ్యేది దీనివల్లే..!

  ఫ్యూచర్ అంటే భవిష్యత్తు..  రేపు అనేది కూడా భవిష్యత్తు కిందకే వస్తుంది.  రేపు అనేది ఎప్పుడూ బావుంటుంది.  చాలా వరకు రేపటి గురించి పాజిటివ్ గానే ఆలోచిస్తారు.  కానీ రేపు అనేది  చాలా అందంగా ఉంటుందని నమ్మించి ఆ తర్వాత మోసం చేయడమే ఫ్యూషర్ పేకింగ్ అని పిలవబడుతోంది. చాలా వరకు ఈ ఫ్యూచర్ ఫేకింగ్ లో ప్రేమ, వివాహం బంధాలలో చిక్కుకున్న వాళ్లే బలి అవుతూ ఉంటారు.  అసలు ఈ ఫ్యూచర్ పేకింగ్ కారణంగా ఎందుకు నష్టం జరుగుతుంది? దీని కారణంగా ఎవరు ఎలా బలి అయిపోతున్నారు తెలుసుకుంటే.. నువ్వు బాగా చదువుకుంటే నీ భవిష్యత్తు అందంగా ఉంటుంది. మంచి ఉద్యోగం వస్తుంది అని పెద్దలు పిల్లలకు చెబుతారు. ఇది పిలల్ల భవిష్యత్తును మంచిదిశగా తీసుకెళ్తుంది. కానీ ప్రేమించిన అమ్మాయితో  అబ్బాయి  భవిష్యత్తు గురించి ఆశ కల్పించి,  భవిష్యత్తులో  తనను చూసుకునే విధానం గురించి అందంగా, గొప్పగా చెప్పి  వాస్తవ జీవితంలో ఆ అమ్మాయిని  శారీరకంగా లేదా ఆర్థికంగా ఉపయోగించుకోవడం అనేది ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది.  ఎందుకంటే అమ్మాయికి తన ప్రేమికుడు చెప్పిన మాటలన్నీ కేవలం ఆశ పెట్టడం కోసం చెప్పిన మాటలే తప్ప అవన్నీ వాస్తవంగా అతను చేయడు.   పైన చెప్పుకున్నట్టే.. వివాహం అయిన తరువాత భార్యను మభ్యపుచ్చి  భార్యను ఇబ్బందుల పాలు చేసి,  ఆర్థికంగా అయినా వేరే ఇతర విషయాలలో అయినా లాభపడే భర్తలు చాలామంది ఉన్నారు.  భార్యకు భవిష్యత్తు గురించి ఆశను,  సంతోషాన్ని ఎర వేసి భార్యను  మోసం చేసేవారు ఉంటారు.  ఇందులో భార్య నష్టపోవడమే కాకుండా భవిష్యత్తులో తనకంటూ ఎలాంటి సంతోషం లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది.   మనుషులకు రేపటి మీద ఆశ చూపడం,  భవిష్యత్తులో అది చేస్తా, ఇది చేస్తా అని అబద్దపు వాగ్దానాలు చేసి వారు లాభపడిన తరువాత   అవన్నీ వట్టి మాటలుగానే మిగిలిపోతాయి. ఇది కేవలం భార్యాభర్తలు, ప్రేమ వంటి స్థితులలోనే కాకుండా  వృద్దులు, పిల్లలు కూడా ఈ ఫ్యూచర్ పేకింగ్ లో బలైపోయే అవకాశాలు ఉన్నాయి.    అందుకే భవిష్యత్తు గురించి ఎవరైనా చేసే వాగ్థానాల కోసం  వర్తమానంలో నష్టపోవడానికి ఎప్పుడూ సిద్దపడకూడదు.                                       *రూపశ్రీ.  

ఈ ఒకే ఒక్క గుణం మనిషి పతనానికి కారణం అవుతుంది!!

మనిషిని అధమ స్థితిలోకి నెట్టేసే దారుణమైన గుణం అహంకారం. అహంకారం గురించి కలిగిన నష్టాలను చరిత్రలో ఒకసారి పరికిస్తే.. మహాభారతంలో దుర్యోధనుడు స్వయంగా ఏమీ రాజ్యాన్ని సంపాదించుకోలేదు. కానీ కాలానుగుణంగా, వారసత్వంగా అధికారం సంప్రాప్తించింది. ఆ ఆధిపత్యం ఆయనలో అంతకు పదింతల అహంకారాన్ని తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ శకునుతో పాటు దుష్టులందరూ వచ్చి చేరారు. యువరాజుగా యౌవనంలో ఉన్న ఆయనకు గర్వం కళ్ళను నెత్తికెక్కించింది. ఇక నన్ను ఎదిరించేవారు ఎవరుంటారన్న అహంభావానికి మనస్సులో బీజం పడింది. అప్పటి వరకూ సోదరసమానులైన పాండవులతో అతను సఖ్యంగానే ఉన్నప్పటికీ ఆయనలోని అధికారమదం వారిపై విషభావనలను ఎగజిమ్మింది. ఫలితంగా పెద్దల మాటలను పెడచెవిని పెట్టాడు. సాక్షాత్తూ కాలస్వరూపుడైన భగవంతుడు ప్రత్యర్థిగా ఉన్నాడని తెలుసుకోలేనంత గర్వాంధకారుడయ్యాడు. తన బలగం, బలం అతి స్వల్పమైనా, దానినే దుర్యోధనుడు అత్యధికమైందిగా భావించాడు. పాండవులను హేళన చేశాడు.  ఒక్క యాదవుడిని, అదీ యుద్ధం చేయకుండా సారథిగా రథం తోలుతానన్న వాడిని నమ్ముకొని కురుక్షేత్ర రణరంగంలోకి కాలుమోపుతున్నారని అవమానపరిచాడు. 'తాత్కాలిక సంపదలను, వైభవాలను చూసుకొని పొగరుతో ఎదుటివారిని చులకన చేసే వారి సంపదలు చెదిరిపోవటమే కాకుండా, వారికి పూర్వుల నుంచి సంక్రమించిన వారసత్వ వైభవాలు కూడా సమూలంగా నాశనమవుతాయి' అని విదురుడు లాంటివారు హితవు పలుకుతారు. అయినా దుర్యోధనుడు తలబిరుసుతో దాయాదులతో సమరానికే సిద్ధ పడ్డాడు. ఫలితంగా రణభూమిలో అసువులుబాసాడు. తాత్కాలికమైన పేరు ప్రతిష్ఠలనూ, ధన, పరివారాలనూ చూసుకొని విర్రవీగే అవివేకులను హెచ్చరిస్తూ కాలమహిమను అభివర్ణిస్తూ శంకర భగవత్పాదులు ఇలా అన్నారు..... మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల స్సర్వమ్ ।  మాయామయ మిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ॥ ధనం, పరివారం, యౌవనం ఉన్నాయని గర్వించకు. క్షణంలో కాలం వాటన్నింటినీ హరించివేస్తుంది. ఇదంతా మాయామయ మనీ, మిథ్య అనీ, అశాశ్వతమని గ్రహించి, జ్ఞానివై పరబ్రహ్మాన్ని పొందడమంటున్నారు. కాలవశాన సంప్రాప్తించినవి కాలంతోనే సమసిపోతాయని తెలుసుకోలేక, మనలో చాలామంది. అహంకారంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.  నిజానికి ఈ ప్రపంచంలో మనం సాధించామనుకుంటున్నవన్నీ మధ్యలో వచ్చి, మధ్యలోనే వెళ్ళిపోతాయి. అందం కావచ్చు, అందలం కావచ్చు ఏదైనా శాశ్వతంగా మనతోనే ఉండిపోదు. అలాంటి తాత్కాలికమైన తళుకుబెళుకులను చూసుకొని అహంకరిస్తే, అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు. మహా మహా సామ్రాజ్యాలే కాలగర్భంలో కలిసిపోయాయి. మగధీరులనిపించుకున్న మహారాజులే నేడు మౌనంగా సమాధుల్లో సేద తీరుతున్నారు. కాలమే మనందరితో భిన్నమైన పాత్రల్ని పోషింపజేస్తుందని తెలుసుకోలేక ఆయా స్థానాలతో విపరీతంగా తాదాత్మ్యం చెందుతున్నాం. వాటినే మన నిజ స్వరూపాలుగా నిర్వచించుకుంటున్నాం. తీరా అవి చేజారిపోయాక, విలపిస్తూ ఉన్నాం.   కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే?... అంటాడు బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడితో! పూర్వం ఎందరో రాజులు ఉన్నారు! వారికి ఎన్నో రాజ్యాలూ ఉన్నాయి! వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదను మూటకట్టుకొని పోలేదు కదా! ప్రపంచంలో వారి పేరు కూడా మిగల్లేదు కదా! ఈ విషయం అర్థం చేసుకుంటే మనిషి జీవితం ఎంతో బాగుంటుంది.                                      *నిశ్శబ్ద.

మీ భర్త రొమాంటిక్ గా ఉండటం లేదా? ఇలా చేసి చూడండి..!

భార్యాభర్తల మధ్య  బంధం దృఢంగా ఉండటానికి,  భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని కీలకంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఫిజికల్ రిలేషన్,  ప్రేమను వ్యక్తం చేయడం, చనువుగా ఉండటం,  ఇద్దరూ కలిసి సమయాన్ని గడపడం వంటివి ఎన్నో ఉంటాయి.  చాలామంది భార్యలు తమ మనసులో భర్త పట్ల తమకున్న ప్రేమను,  వారి పట్ల తమ ఇష్టాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తుంటారు. కానీ మగాళ్లు మాత్రం తమ మనసులో విషయాలు బయట పడకుండా కొందరు,  అసలు ఎలాంటి రొమాంటిక్ సెన్స్ లేకుండా ఎప్పుడూ గంభీరంగా ఉండటం,  తమ పనులలో తాము నిమగ్నం అయి ఉండటం వంటివి చేస్తుంటారు.  దీని కారణంగా భార్యలు చాలా డిజప్పాయింట్ అవుతుంటారు.  తమ వైవాహిక జీవితం ఆశించినంత రసభరితంగా లేదని వాపోతుంటారు.  అలాగని తమ భర్తలు చెడ్డ వారు ఏమీ కాదని చెబుతుంటారు.  ఇలాంటి భార్యలు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. వారి భర్తలు భార్యలను ప్రేమలో ముంచెత్తుతారు. తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఓపెన్ గా మాట్లాడాలి.. ప్రతి భార్య చాలా వరకు తను ఏమీ చెప్పకుండా, అడగకుండానే తన భర్త తన ముందు ప్రేమను వ్యక్తం చేయాలని,  తనను సంతోషపెట్టాలని అనుకుంటుంది. కానీ భర్త రొమాంటిక్ గా లేనప్పుడు భార్య ఓపెన్ గా మాట్లాడటం ముఖ్యం.  తను కోరుకుంటున్నది ఏంటి? జీవితంలో ఉండాల్సిన విషయాలేంటి? భార్యాభర్తలు ఎలా ఉండాలని తను అనుకుందో.. ఇద్దరికీ సాధ్యాసాధ్యమైన విషయాలు ఏంటో.. భర్త ఏ విషయాల పట్ల నిరాసక్తిగా ఉంటున్నాడో,   ఎందుకు నిరాసక్తిగా ఉంటున్నాడో.. మొదలైన విషయాలన్నీ ఫిర్యాదు చేస్తున్నట్టు కాకుండా, భర్తను నిందిస్తున్నట్టు కాకుండా..  సౌమ్యంగా తన మనసును అర్థం అయ్యేలా చెప్పాలి. ఇలా చేస్తే భర్త కూడా భార్య మనసును అర్థం చేసుకుని భార్య కోరుకున్నట్టు ఉండటానికి తన వంతు ప్రయత్నం చేయగలడు. సర్ఫ్రైజ్.. చిన్న చిన్న సర్ప్రైజ్ లు భార్యభర్తల మధ్య బంధాలను దృఢంగా ఉంచుతాయి. భర్త కోసం కూడా అదే విధంగా సర్ప్రైజ్ ప్లాన్ చేయవచ్చు.  లేదంటే భర్తకు నచ్చిన ఆహారాన్ని వండి పెట్టవచ్చు. అతను చాలా రోజుల నుండి కొనాలనుకుని కొనలేకపోయిన  వస్తువును అతనికి ఇవ్వవచ్చు. ఇవన్నీ చేస్తే భార్య భర్త గురించి ఎంత ఆలోచిస్తోందో అనే విషయం భర్తకు అర్థమవుతుంది. అతను కూడా భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి సమయం కేటాయించుకుంటాడు. ఆప్యాయత.. భార్యాభర్తలు రొమాంటిక్ గా ఉండాలంటే వారి మద్య ప్రేమ కూడా బలంగా ఉండాలి.  ఇద్దరి మధ్య ప్రేమ, అప్యాయత,  ఒకరి పట్ల ఒకరు చూపించే బాధ్యత వంటివి ఇద్దరినీ దగ్గర చేస్తాయి. అప్పుడప్పుడు భార్యభర్తలు ఒకరిపట్ల  ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకోవాలి.  ప్రేమికులలాగా చిలిపి పనులు చేయడం,  సమయాన్ని గడపడం,  ప్రేమను వ్యక్తం చేయడానికి తమకు తూచిన విషయాలను కవితాత్మకంగా వ్యక్తం చేయడం, చూపులు,  సైగలతోనే మాట్లాడటం వంటివి రొమాంటిక్ ఫీలింగ్ ను పెంచుతాయి. స్పేస్.. ఒక మనిషిని అతిగా పట్టించుకోవడం కూడా అవతలి వారికి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.  భార్యాభర్తలు కూడా అంతే.  వారు ఇద్దరూ ఓ శాశ్వత బంధంలో ఉన్నా సరే.. ఇద్దరికి స్పేస్ అవసరమే.. భర్తకు ఉన్న స్నేహాలు, పరిచయాలలో అతను తనంతకు తాను భార్యకు పరిచయం చేసే వరకు భార్య పట్టించుకోకపోవడమే మంచిది. ప్రతి వ్యక్తి తన ప్రేమను వ్యక్తం చేయడానికి వివిధ మార్గాలు   ఉంటాయి.  వారు ఆ మర్గాన్ని ఎంచుకుని తమ ప్రేమను వ్యక్తం చేసేవరకు ఓపిక పట్టాలి తప్ప రొమాంటిక్ తెలియని వ్యక్తి అని అనకూడదు. ఈ కాలంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే తమ మనసులో విషయాలను వ్యక్తం చేయడానికి చాలా సమయం తీసుకుంటారు.  కాబట్టి అబ్బాయిలకు  సమయం ఇవ్వాలి.  బలవంతంగా అతను ఏదో చెయ్యాలని చేయడానికి బదులు, అతను సహజంగా భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేసేవరకు అతనితో ఫ్రెండ్లీగా ఉంటూ సాగాలి. అంగీకారం.. భార్యాభర్తలు ఒకరి పట్ల మరొకరు ప్రేమను పెంచుకోవాలన్నా, దాన్ని వ్యక్తం చేయాలన్నా అంగీకార గుణం బాగా సహాయపడుతుంది.  భర్త అలవాట్లు, అతని ఇష్టాలు, అభిరుచులను భార్య గౌరవిస్తూ ఉంటే సహజంగానే భర్తకు తన భార్య పట్ల ఎనలేని ప్రేమ,  గౌరవం పెరుగుతాయి. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించడమే కాకుండా ఒకరికి నచ్చిన పనులు  ఇద్దరూ కలిసి చేస్తుంటే ఒకరి పట్ల మరొకరికి ప్రేమ పెరుగుతుంది.  దాన్ని వ్యక్తం చేసే సందర్బాలు కూడా పెరుగుతాయి. గ్రహించడం ముఖ్యం.. ప్రేమ అంటే పెద్ద పెద్ద సర్ప్రైజ్ లు ఇవ్వడం,  పెద్ద బహుమతులు ఇవ్వడం, ఖరీదైన వస్తువులు ఇవ్వడం.  పనులు పదులుకుని మరీ సమయాన్ని కేటాయించడం కాదు.. భర్తలు తమకున్న సమయంలోనే భార్యలను సంతోషపెట్టాలని చూసేవారు ఉంటారు.  భార్యకు చిన్న పనులలో సహాయం చేయడం,  భార్య చెప్పే విషయాలను ఓపికగా వినడం, భార్య బాధలో ఉన్నప్పుడు ఆమెకు ఊరట ఇవ్వడం మొదలైనవన్నీ భార్య పట్ల ప్రేమతో చేసేవే. కొందరు సింపుల్ గా తమ ప్రేమను వ్యక్తం చేస్తారు.  ఈవిషయాన్ని భార్యలు గుర్తిస్తే  భర్తకు తమ పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది.                                                *రూపశ్రీ. 

వేమన జయంతి..  వేమన వాక్కులు.. జగతికి చుక్కానీ లు..!

  విశ్వదాభిరామ వినురవేమ..  ఈ వాక్యం దాటి ఏ విద్యార్థి ముందుకు వెళ్లడు.  పిల్లల నాల్కల మీద నాట్యం అడే తొలి పద్యాలు వేమన పద్యాలే.. ఎంతో సులువుగా ఉంటూ ఎంతో లోతైన విషయ సమాచారాన్ని తెలపడం వేమన పద్యాల విశిష్టత.  వేమన 1367-1478 కాలాల మధ్య జీవించాడు.  సి.పి బ్రౌన్ వేమన పద్యాలను పుస్తక రూపంలో అచ్చు వేయించడం ద్వారా వేమన పద్యాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.  అంతేనా.. సి.పి బ్రౌన్ వేమన పద్యాలను ఇంగ్లీషులోకి కూడా అనువదించాడు. పామరులకు అర్థమయ్యే భాషలు పద్యాలు చెప్పిన ప్రజాకవి వేమన. ఆటవెలది పద్యాలతో అందరిని మెప్పించిన వేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా యోగి వేమన గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే.. యోగి వేమన ఎంత ప్రాచీన కవినో అందరికీ తెలిసిందే.. అయితే ఈయన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈయన కులం నుండి ఈయన జన్మ వృత్తాంతం, కవిగా మారిన వైనం అన్నీ ఇప్పటికీ  స్పష్టత లేకుండానే ఉన్నాయి. వేమన గురించి పరిశోధన చేసిన వారు ఒక్కొక్కరు ఒకో విధమైన విశ్లేషణ,  ఒకో విధమైన కథనం అందించారు. అయితే వీటిలో వేమన వేశ్యాలోలుడి నుండి కవిగా మారిన కథనే చాలా ఆదరణ పొందింది.  పైగా వేమన కవిగా మారిన విధానం,  వేమన పద్యాల మకుటం గురించి కూడా స్పష్టత ఇస్తుంది. వేమన కథ.. కొండవీటిని పరిపాలించిన కోమటి వేమారెడ్డి అసలు పేరు అనువేమారెడ్డి. ఈయన చిన్నతమ్ముడే వేమన్న.  వేమన వదిన నరసాంబారాణి. వేమన ఒక వేశ్య వలలో చిక్కుకుంటాడు. వేశ్య ఏది అది కాదనకుండా ఆమె ముందు ఉంచేవాడు.  ఒకరోజు వేశ్య తనకు రాణి అయిన నరసాంబారాణి ఆభరణాలు వేసుకుని సంతోషపడాలని ఉందని వేమనకు చెబుతుంది.  వేమన వేశ్య మాటను కాదనలేక తన వదినతో ఆభరణాలు అడుగుతాడు.  నరసాంబారాణి తన ముక్కుకు ఉన్న బులాకీ తప్ప మిగిలిన ఆభరణాలు అన్నీ వేమనకు ఇచ్చి పంపుతుంది. కానీ వేశ్య మాత్రం తనకు బులాకీ కూడా కావాల్సిందే అని పట్టుబడుతుంది. దీంతో వేమన బులాకీ కూడా అడుగుతాడు.  అయితే నరసాంబారాణి తన బులాకీని ఇస్తూ నేను ఇచ్చిన ఆభరణాలు అన్నీ వేసుకుని నగ్నం ఉన్నప్పుడే నువ్వు ఆమెను చూడు అని చెప్పి పంపుతుంది.   వేమన వేశ్యను అలాగే చూడగా అతనికి స్త్రీలు అంటే విరక్తి పుట్టింది.  వెంటనే కోటకు వెళ్లిపోయాడు. నరసాంబారాణి నగలను తయారుచేసే అభిరాముడు ఎప్పుడూ కోటకు ఆలస్యంగా వచ్చేవాడు. ఇది గమనించిన వేమన అతను ఎందుకు కోటకు వస్తున్నాడో తెలుసుకోవాలని అభిరాముడిని కంట కనిపెట్టాడు.  అభిరాముడు దగ్గరలో ఒక కొండ గుహలో ఉన్న అంబికాశివయోగిని సేవించడం వేమన్న చూశాడు.  అంబికాశివయోగి అబిరాముడితో రేపు రా నీకు మంత్రోపదేశం చేస్తాను అంటాడు.  అయితే వేమన్న అంబికాశివయోగిని బంధించి అబిరాముడిలాగా కొండ గుహకు వెళతారు.  యోగి వేమన్న చెవిలో మంత్రోపదేశం చేసి నాలుక మీద బీజాక్షరాలు రాస్తాడు. దీంతో వేమన్నకు పాండిత్యం లభిస్తుంది.  అబిరాముడికి దక్కాల్సినది తనకు దక్కినందుకు వేమన పశ్చాత్తాప పడి అబిరాముడి కాళ్ల మీద పడి.. తను రాసే పద్యాల మకుటంలో అభిరాముడి పేరు చేర్చి అభిరాముడి పేరును చిరస్థాయిగా నిలిచేలా చేశాడు. ఇదీ వేమన వెనుక ఉన్న కథ. యోగి వేమన గురించి తెలుగు సాహిత్యం చాలా గొప్పగా చెప్తుంది.  తెలుగు కవులు, రచయితలు వేమన పద్యాల లోతును, పద్యాల విశిష్టతను తమ పరిశోధనలు,   విశ్లేషణల ద్వారా తెలిపారు.  వేమన గురించి,  వేమన పద్యాల గురించి ఎన్నో పరిశోధనా వ్యాసాలు కూడా వెలువడ్డాయి. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నార్ల వెంకటేశ్వరరావు  వేమన జీవిత చరిత్రను రాయగా అది 14 భాషలలోకి అనువాదం అయ్యింది.  ఐక్యరాజ్యసమితి -యునెస్కో విభాగం వారు ప్రపంచ భాష కవులలో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను కూడా ఎన్నుకుని ఆయన పద్యాలను వివిధ భాషలలోకి అనువదించారు.                                             *రూపశ్రీ.

సైకోపాత్ లైఫ్ పార్ట్నర్ లకు ఉండే లక్షణాలు ఇవే..!

  సైకోపాత్.. వినడానికి కాస్త భయం పుట్టించే పదం.  మానసికంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు సైకోపాత్ లాగా బిహేవ్ చేస్తుంటారు.  సాధారణంగా బయట ఎవరికో ఇలాంటి సమస్య ఉంటే పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ  రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులతో జీవితం పంచుకోవాల్సి వస్తే మాత్రం అది నరకమే.  సైకోపాత్ ల ప్రవర్తన, వారి స్వభావం చాలా ప్రమాదకంగా ఉంటుంది. సైకోపాత్ లకు ఉన్న కొన్ని లక్షణాలు తెలుసుకుంటే.. సైకోపాత్  లక్షణాలున్న లైఫ్ పార్ట్నర్ ను గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తమ నిజమైన వ్యక్తిత్వాన్ని దాచడంలో చాలా తెలివైనవారు.  సైకోపాత్ భాగస్వామితో జీవించడం  మానసిక,  భావోద్వేగ ఆరోగ్యానికి ప్రమాదకరం. అబద్దం చెప్పే అలవాటు.. సైకోపాత్‌లు తమ అసలు వ్యక్తిత్వాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు చిన్న విషయాల గురించి కూడా అబద్ధాలు చెబుతారు. తమ అబద్ధాలను నిజమని నిరూపించుకునేందుకు కొత్త కథలను అల్లుతూనే ఉంటారు. అతని మాటలు తరచూ ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటాయి. ఎమోషన్స్.. ఎలాంటి   తప్పు చేయకపోయినా,  ఏమాత్రం సంబంధం లేకోపోయినా సరే.. తప్పు చేసిన భావనను కల్పించేలా వారు ప్రవర్తిస్తారు.  అవి వారితో రిలేషన్ లో ఉన్న వారిని  మళ్లీ మళ్లీ అపరాధ భావంలోకి లాగేస్తాయి. సైకోపాత్ లైఫ్ పార్ట్నర్స్ తమ భాగస్వాములను  నియంత్రించడానికి ఎమోషన్స్ తో ఆడుకుంటారు.   ఇలాంటి వారితో రిలేషన్ లో ఉంటే తమ రిలేషనే్ బలంగా ఉందని వారితో రిలేషన్ లో ఉన్నవారికి అస్సలు అనిపించదు. విమర్శ.. సైకోపాత్‌లు తమతో రిలేషన్ లో ఉన్నవారిని  అవమానపరచడానికి ఎటువంటి చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. అలాంటి వారికి తమతో రిలేషన్ లో ఉన్న వారి తప్పులను పదే పదే ఎత్తి చూపడం అలవాటుగా ఉంటుంది. ముఖ్యంగా వారితో రిలేషన్ లో ఉన్న వారి ఆత్మగౌరవాన్ని నాశనం చేసేందుకు చాలా ప్రయత్నిస్తారు. ప్రతిస్పందన.. సాధారణంగా మనిషికి ఎదుటివారు ఎమోషన్స్ లో ఉన్నప్పుడు రెస్పాండ్ కావడం అనే అలవాటు ఉంటుంది.  కానీ సైకోపాత్ లతో రిలేషన్ లో ఉంటే వారి నుండి ఎలాంటి ప్రతిస్పందన లభించదు. ఎమోషన్ అవుతున్న వ్యక్తులను ఊరడించక పోగా.. విమర్మలు గుప్పించి మరింత బాధపెట్టడానికి, తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే వారు ఆలోచిస్తారు. నిందలు.. సైకోపాత్ లు తాము చేసే తప్పులను ఎప్పుడూ అంగీకరించరు.  ప్రతిసారీ ఎదుటి వారినే నిందిస్తుంటారు.  తాము చేసిన తప్పులకు కూడా ఎదుటివారినే భాద్యలను చేసి వారిని దూషించి మరీ సంతోషపడతారు. వారికి అహం కూడా ఎక్కువగా ఉంటుంది. వారి అహాన్ని తృప్తి పరచుకోవడానికి  తమ భాగస్వామిని ఎంత బాధపెట్టడానికి అయినా సైకోపాత్ లు వెనుకాడరు. నియంత్రణ.. సైకోపాత్ లు తమతో రిలేషన్ లో ఉన్నవారిని ఎప్పుడూ నియంత్రించాలని  కోరుకుంటారు.  వారు ప్రథితీ తమ కనుసన్నల్లో జరగాలని అనుకుంటారు. వారి నిర్ణయాలతో వారి భాగస్వాములను పదే పదే ఇబ్బంది పెడతారు. వారితో రిలేషన్ లో ఉండేవారు చాలా వరకు స్వతంత్రత కోల్పోతుంటారు. ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోలేరు. కోపం.. సైకోపాత్ లకు కోపం ఎక్కువ.  చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ఉంటారు. ఒక్కోసారి కోపంలో హింసాత్మకంగా కూడా మారుతుంటారు .  ఆ తరువాత తమ ప్రవర్తనకు తమ భాగస్వామినే భాధ్యులను చేస్తారు.                                          *రూపశ్రీ.