కోపంగా, మొండిగా ఉన్న మొగుళ్లను దారిలో పెట్టే సూపర్ చిట్కాలు..!

భార్యాభర్తల మధ్య సంబంధం చాలా లోతైనది. ఇది రెండు హృదయాలను కలుపుతుంది. ప్రేమ, ఆటపట్టించుకోవడం, నవ్వు, గొడవలు,అపార్థాలు.. ఇలా  అన్నీ భార్యాభర్తల బంధంలో బాగంగా ఉంటాయి. అయితే కొన్ని జంటల్లో అర్థం చేసుకునే భర్తలు ఉంటారు. మరికొన్ని జంటల్లో పురుషా హంకారం కలిగిన భర్తలు ఉంటారు.  కొన్ని జంటల్లో చెడ్డ భర్తలు ఉంటారు. అయితే ఒకవైపు మంచితనం ఉన్నా..  అతిగా కోపంగా,  మొండిగా ఉండే భర్తలు  ఉంటారు. ఇలాంటి వారిని అటు వదులుకోలేరు, ఇటు వారి ప్రవర్తనను మార్చుకోలేరు.  దీని కారణంగా భార్యలు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే అతిగా కోపంగా, మొండిగా ఉండే భర్తలను దారిలో పెట్టే సూపర్ చిట్కాలు ఉన్నాయి.  వాటిని పాటిస్తే  భర్తలను మార్చుకోవడం సాధ్యమే.. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రశాంతత..  భర్త  కోపంగా  ఉన్నప్పుడల్లా, అతనికి ప్రతిస్పందించకూడదు.   ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి.  భర్త ఉన్న గది నుండి బయటకు వెళ్లి వేరే చోటికి వెళ్లాలి. ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. సింపుల్ గా చెప్పాలంటే.. అతను కోపంగా ఉన్నప్పుడు అతన్ని మీరు అవాయిడ్ చేస్తున్నారని అతనికి అనిపించాలి. ఎక్స్ప్లెయిన్..  భర్త కోపంగా ఉన్నప్పుడు అతనితో ఏమీ మాట్లాడకూడదు. కానీ అతని కోపం తగ్గినప్పుడు అతనితో ప్రశాంతంగా మాట్లాడి అతని ప్రవర్తన గురించి, అతను చేస్తున్న పని గురించి వివరించి చెప్పాలి. అతని ప్రవర్తన వల్ల అవతలి వ్యక్తులు ఎలా బాధపడుతున్నారో తెలియజేయాలి.  అతని భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అతను ఎందుకు అంత కోపంగా ఉంటాడో తెలుసుకోవాలి. ఈ ప్రశ్న అతన్ని ఆలోచింపజేస్తుంది.  కారణం.. అసలు అతను కోపంగా ఎందుకు ఉంటాడు అనే విషయం తెలుసుకోవాలి. ఒకవేళ అతని కోపానికి కారణం, లేదా తప్పు  భార్య వైపు ఉందని తెలిస్తే.. అది సరైనది అయితే భార్య మారడానికి ప్రయత్నించడంలో తప్పులేదు. ఒకవేళ అతని  కోపానికి కారణం మరేదైనా అయితే దానికి పరిష్కారాన్ని కనుగొనవచ్చు. కౌన్సెలింగ్.. భర్త కోపంగా ఉన్నప్పుడల్లా పిల్లల సహాయంతో దాన్ని తగ్గించవచ్చు.   ఎందుకంటే తల్లిదండ్రుల కోపం వారి పిల్లలను చూసిన తర్వాత కామన్ గానే తగ్గుతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా  భర్త కోపాన్ని తగ్గించుకోకపోతే  బంధువు లేదా కుటుంబ పెద్దల  సహాయం తీసుకోవచ్చు. లేదంటే కౌన్సిలర్ లను కూడా కలవచ్చు.  ఇలా చేస్తే  భర్తకు వారు అర్థమయ్యే చెప్పి ప్రవర్తన మార్చే ప్రయత్నం చేస్తారు. దూరం.. భర్త తన కోపాన్ని తగ్గించుకోకుండా తన ప్రవర్తన మార్చుకోకుండా ఉంటే పెద్దలు సలహాతో భర్తకు కొన్నాళ్లు దూరంగా ఉండవచ్చు. ఇది కేవలం పెద్దల సలహాతో మాత్రమే జరగాలి.  బంధం విచ్చిన్నం  కాదనే నమ్మకం ఉంటేనే ఈ స్టెప్ తీసుకోవాలి. మనుషుల మధ్య దూరం కూడా కొన్ని సార్లు తప్పులు సరిదిద్దుకోవడానికి, ఆలోచించడానికి సహాయపడుతుంది.  ఇవన్నీ చేయడం ద్వారా భర్త ప్రవర్తన మార్చుకోవచ్చు.                           *రూపశ్రీ.

దీపావళి పండుగ అంతరార్థం!

  మన దేశంలో జరుపుకుంటున్నన్ని పండుగలు ఏ ఇతర దేశాల్లోనూ జరుపుకోరు. అయితే ఇన్ని పండుగలనూ, పర్వ దినాలనూ ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? పండుగ రోజున అభ్యంగనస్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకుని తినడం, బంధు మిత్రులతో సంతోషంగా గడపడం… పండుగలు జరుపుకోవడంలో ఇంతకన్నా వేరే ప్రయోజనాలు లేవా? అని తరచి చూస్తే.. సత్ప్రవర్తన, సదాచారాలను అలవరచు కోవడానికీ. సంస్కృతీ, సంప్రదాయాలను ఇనుమడింపజేసుకోవడానికీ ఉద్దేశించినవే పండుగలు. జీవితం అనే నదికి సంస్కృతీ సంప్రదాయాలు రెండు తీరాల లాంటివి. అందులో ప్రవహించే నీరే ధర్మం. మోక్షానికి ఆధారమైన ధర్మాన్ని ఆచరించినప్పుడే అనంతమయిన సముద్రంలో నది సంగమించినట్లు మానవుడు మాధవునిలో ఐక్యం చెందుతాడు. జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇదే మానవ జన్మ పరమార్థమైన 'మోక్షం'. దేశమంతటా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే ముఖ్యమైన పండుగల్లో 'దీపావళి' ఒకటి. మన జీవితాల్లో దుఃఖమనే చీకటి పోయి సంతోషమనే వెలుగు వెల్లివిరియాలని, అజ్ఞానమనే చీకటి పోయి జ్ఞానకాంతులు విరాజిల్లాలనీ ఆకాంక్షిస్తూ జరుపుకొనే పండుగ 'దీపావళి'. మన జీవితాలు శాంతిసౌఖ్యాలతో విలసిల్లాలంటే మనలో సత్యధర్మాలు, త్యాగం, సేవాభావాలనే సుగుణాలు వికసించాలి. అలాగే అజ్ఞానం తొలగాలంటే ఆత్మజ్ఞాన ప్రాప్తికి సాధన చేయాలి. దీపావళి పండుగకు సంబంధించి అనేక కథలు మన పురాణాల్లో ఉన్నాయి. వాటిలో నరకాసురుని సంహారం ఒకటి. ప్రాగ్జ్యోతిష పురాన్ని నరకాసురుడు పాలించేవాడు. ఆ రాక్షసుడు దేవతల్ని హింసించేవాడు. నరకాసురుని బారి నుండి తమను రక్షించాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి వేడుకొన్నాడు ఇంద్రుడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్ధం చేసి, నరకాసురుణ్ణి సంహరించాడు. అసురులు పెట్టే బాధల నుండి విముక్తి కలిగిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం 'దీపావళి' పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది..  శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడు  దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెందాడ నీ ప్రావీణ్యంబులు సూడఁగోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి నన్నీ వెంటం గొనిపొమ్ము.. అని సత్యభామ అడుగుతుంది.   'ప్రభూ! నీవు రణరంగంలో విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే నీ ప్రావీణ్యం చూడాలని కోరికగా ఉంది. ప్రాణనాథా! నా మాట మన్నించి నన్ను దయతో నీ వెంట తీసుకొని పొమ్ము” అని సత్యభామ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది.  అప్పుడు శ్రీకృష్ణుడు రణరంగం విహార స్థలం కాదనీ అక్కడ వినిపించేవి తుమ్మెదల ఝంకారాలు కావనీ.. భయంకరమైన ఏనుగుల ఘీంకారాలనీ.. అక్కడ ఉన్నవి రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షస సైన్య సమూహాలు అనీ సత్యభామను నిరుత్సాహపరుస్తాడు. అప్పుడు సత్యభామ దానవులైన నేమి? మఱి దైత్య సమూహము లైన నేమి? నీ మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక?.. అని అంటుంది.  "ప్రభూ! దుర్గాల్లాంటి నీ బాహువులు నాకు అండగా ఉండగా రాక్షస సైన్యం వల్ల నాకేం భయం?”. అని శ్రీకృష్ణునిపై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. అందుకు శ్రీకృష్ణుడు సంతోషించి సత్యభామను తనతోపాటు యుద్ధ రంగానికి తీసుకువెళ్ళాడు. వీణను కూడా పట్టుకోవడం చేతకాని సత్యభామ విల్లును ఎలా పట్టుకుంటుందీ, దారానికి ముత్యాలు గుచ్చలేని కోమలి వాడి అయిన బాణాలను ఎలా సంధిస్తుందీ అని అందరూ సందేహించారు. అందరి సందేహాలూ పటాపంచలయ్యేలా సత్యభామ బాణాల వర్షం కురిపించి రాక్షస సైన్యాన్ని యుద్ధ రంగం నుండి పారిపోయేలా చేసింది. అప్పుడు 'విజయం నిన్నే వరించింది' అంటూ సత్యభామ ధైర్య సాహసాలను మెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పటి వరకూ యుద్ధమంటే తెలియని సత్యభామ అంతటి పరాక్రమాన్ని ఎలా ప్రదర్శించగలిగింది? ఆమెకు ఆ శక్తి ఎలా వచ్చింది? సత్యభామకు ధైర్యసాహసాల్ని ప్రదర్శించే శక్తి శ్రీకృష్ణుని నుండి వచ్చింది. ఓ భార్యకు భర్త అండ ఉంటే దక్కిన విజయమది. స్త్రీలో అంతర్లీనంగా ఉన్న శక్తి బయటకు వచ్చి చేకూర్చిన విజయమది. ప్రతి మహిళకు ఇలాంటి సహకారం తప్పనిసరిగా అవసరం.                                   *నిశ్శబ్ద.

నెగిటివ్  ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా బయటపడవచ్చు..!

  నేటి బిజీ జీవితాల కారణంగా  చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ పరిస్థితులు,  ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, కొత్త పుంతలు తొక్కుతున్న సంస్కృతి మొదలైనవన్నీ నేటి తరం  మనస్సుల్లో  నెగిటివ్ ఆలోచనలకు  కారణం అవుతున్నాయి. వీటి కారణాల వల్ల చాలా మంది మనసులు మరింత అపవిత్రంగా మారుతున్నాయి. ఈ ఆలోచనలు మనస్సులో బాగా పాతుకుపోయిన కొద్దీ జీవితంలో ప్రశాంతత, ఆనందం మాయమవుతాయి. ఈ ప్రతికూల ఆలోచనల నుండి తమను తాము  ఎలా బయటపడేసుకోవాలో తెలుసుకుంటే.. ప్రతికూల ఆలోచనలు వదిలించుకునే మార్గాలు.. ప్రతికూల ఆలోచనలు పోవడానికి దైవ సహాయం చాలా బాగా సహాయపడుతుంది. ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవడానికి దైవ ప్రార్థనలు,  జపం, భజనలు మొదలైనవాటిని  అనుసరించవచ్చు. ఇది మనస్సును చాలా వరకు క్లియర్ చేయడంలో  సహాయపడుతుంది.  రోజూ ఇలా చేస్తే నెగిటివ్  ఆలోచనలు వాటికవే క్రమంగా  మాయమవుతాయి. మనిషిని స్నేహం చాలా ప్రభావితం చేస్తుంది. చెడు సహవాసం  వ్యక్తి ఆలోచనలను,  మనస్సును ప్రభావితం చేస్తుంది. చెడు వ్యక్తుల స్నేహంలో, సాహచర్యంలో ఉంటే.. వారితో ఉండే వారి ఆలోచనలు కూడా చెడుగా మారతాయి.  నెగిటివ్ ఆలోచనలు సులభంగా పుట్టుకొస్తాయి.  అందుకే  మంచి వ్యక్తులతో సమయాన్ని గడపాలి. అది  మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. పుస్తక పఠనం  వల్ల  ఆలోచనలను సమతుల్యంగా ఉంచుకోవచ్చు.  మనస్సును పాజిటివ్ శక్తితో నింపుకోవడానికి, ఎల్లప్పుడూ గ్రంథాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలు, నైతిక విలువలు కలిగిన గ్రంథాలు,  గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు మొదలైనవి  చాలా సహాయపడతాయి. ఆలోచనలను శుభ్రంగా ఉంచుకోవాలన్నా,  చెడు తలపుల   నుండి దూరంగా ఉండాలన్నా ప్రకృతితో సమయం గడపడం చాలా సహాయపడుతుంది. ఇది  మనస్సును ఎల్లప్పుడూ స్వచ్చంగా  ఉంచడంలో సహాయపడుతుంది.   మనస్సులో వచ్చే చెడు ఆలోచనలను కూడా వదిలించుకోవచ్చు. దేవుని నామాన్ని జపించడం వల్ల నెగిటివ్  ఆలోచనలకు దూరంగా ఉండవచ్చు. దైవ నామ స్మరణ వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతూ,  నెగిటివ్ ఆలోచనలు మెల్లిగా తగ్గుతాయి.                                *రూపశ్రీ.

నేడు శ్రీ కృష్ణదేవరాయల జయంతి లేక వర్థంతి? రాయల గురించి  చాలామందికి తెలియని నిజాలివి..!

  శ్రీకృష్ణదేవరాయలు 1471 జనవరి 17 (తదితరాభిప్రాయాల ప్రకారం) జన్మించి, 1529 అక్టోబరు 17లో మరణించినవాడయ్యారు. విజయనగర సామ్రాజ్యాన్ని 1509–1529 మధ్య పాలించారు. తుళువ వంశానికి మూడవ రాజుగా ఆయన రాజ్యపీఠాన్ని పొందాడు.  ఆయనకు “ఆంధ్ర భోజుడు”, “కన్నడ రాజ్య రమారమణ”, “మూరు రాయల గండ” వంటి బిరుదులు కూడా ఉన్నాయి. చరిత్రలో సరిగా పొందుపరచబడని కొన్ని విషయాలు.. రాయల మరణ తేదీ.. 2020లో కర్ణాటకలో హొన్నెనహల్లి గ్రామంలోని ఒక శిలాశాసనం ద్వారా శ్రీకృష్ణదేవరాయల మరణ తేదీ ప్రామాణికంగా తేలింది — 1529 అక్టోబర్ 17 న ఆయన మరణించినట్టు శాసనంలో ఉంది.  ఈ శాసనంలో, “కృష్ణదేవరాయ” మరణం తర్వాత హొన్నెనహల్లు గ్రామాన్ని, విష్ణుహనుమంతుని పూజారులకు దీనంగా బహుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.  ఈ శాసనం ద్వారా  కృష్ణ దేవరాయల మరణం గురించి ఖచ్చితమైన సమాచారం లభించింది.  వజ్రశక్తి బిరుదు.. “మూరు రాయల గండ” అంటే.. మూడు రాజుల అధిపతి అనే బిరుదు రాయల వారికి  ఉంది. అంటే మూడు శక్తులను  ఏకంగా ధిక్కరించిన రాజు అని భావించబడుతుంది. అయితే, “ముగ్గురు రాయల గండ”గా ప్రస్తావించబడటం అనేదే కాకుండా.. రాయల వారి సామ్రాజ్య విస్తీర్ణం, రాజకీయ ప్రభావం, మౌలిక సైనిక శక్తి అనే మూడు శక్తుల సమన్వయం కూడా ప్రతిబింబిస్తుందని చెబుతారు. ఉండంతుల జీవనకవి.. ఒక  కథనం ప్రకారం, ఒక చాకలి వ్యక్తి   చిన్న పద్యం  చెప్పినప్పుడు  ఆ పద్యం విన్న కృష్ణదేవరాయలు కలింగ మీద విజయం సాధించాడట.  ఒక సాధారణ వ్యక్తి మాటలు కూడా రాజును ప్రభావితం చేయగలవని, రాజు ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉండాలని అంటుంటారు.  సైన్య ఎంపిక.. ప్రాచీన కాలంలో శత్రురాజులు మత బేధాలు సృష్టించి దాడులకు పాల్పడే వారు. కానీ కృష్ణదేవరాయలు తన సైన్య ఎంపికలో మత పరిమితి లేకుండా  ప్రతిభ ఉన్న అన్ని మతాల వ్యక్తులను ఎంపిక చేశారని  కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కృష్ణదేవరాయలు విజయాలకు గల కారణాల్లో సైన్యం ఎంపిక కూడాీ ఒక కారణం అని అంటారు. అంతేకాదు.. యుద్దంలో  వారిని వైద్యం కోసం తీసుకెళ్లడానికి అంబులెన్స్ తరహా పద్దతి  ఉండేదట.  వైద్యులు, విదేశీ సైనిక సలహాదారులు కూడా ఉండేవారని అంటారు . “విజయనగరం – అత్యుత్తమ నగరం”.. పోర్టుగీసు ప్రయాణికుడు డొమింగో పేస్ వ్రాసిన రచనలో, అతను విజయనగరం గురించి “the best provided city in the world” అని వ్యాఖ్యానించాడు. ఆయన ఉహించిన ఆహార, వాహన వ్యవస్థలు, నీటి సరఫరా, స్ధానిక సంస్థలు.. ఇతర అవసరాల కేటాయింపు విషయాలు, నగర నిర్మాణ వ్యూహాలు.. ఇలా చాలా అంశాలు విజయ నగరాన్ని అప్పట్లో అత్యుత్తమ నగరం అని,  సంపన్న నగరం అని పేర్కొంటున్నాయి.                                         *రూపశ్రీ.

భార్యను బాగా చిరాకు పెట్టే భర్త అలవాట్లు ఇవి.. రిపీట్ అయితే రిలేషన్ ఢమాల్..!

  వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధం  సంఘర్షణతో నిండి ఉంటుంది. విభిన్న వ్యక్తిత్వం కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం,  పరిస్థితులకు అలవాటు పడటం అనేది చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది.  ఇద్దరూ కలిసి అన్ని సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లడాన్నే  ప్రేమ,  అర్థవంతమైన బంధం అని అంటారు. కానీ కొన్నిసార్లు ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య  సంబంధాన్ని నాశనం చేసే విధంగా ఏదైనా మాట్లాడతాము. ముఖ్యంగా భర్త మాట్లాడే కొన్ని మాటలు,  చేసే పనులు, అలవాట్లు భార్యను చాలా చిరాకు పెడతాయి.  ఇవి పదే పదే రిపీట్ అయితే  భార్యాభర్తల బంధం నిలబడదని, ఇద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగి విడిపోవడానికి దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంతకీ భార్యను చిరాకు పెట్టే ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. పరిస్థితిని తెలివిగా చక్కబెట్టుకోవచ్చు.   పోలికలు ప్రధాన సమస్య.. తన భర్త తనను మరొక స్త్రీతో పోల్చినప్పుడు ఏ భార్య కూడా ఇష్టపడదు. కొన్నిసార్లు భర్త అనుకోకుండా  భార్యను పోల్చడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల భర్తలకు భార్యల నుండి   ఎదురుదెబ్బ తగులుతుంది. ముఖ్యంగా బాగా చదువుకుని ఆర్థికంగా సంపాదిస్తూ,  సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే అమ్మాయిలు భర్త తనను ఇతర అమ్మాయిలతో పోల్చడాన్ని అస్సలు రిసీవ్ చేసుకోలేదు. పదే పదే భార్యను ఇతరులతో పోల్చడం కొనసాగిస్తే అది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. పోలికలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి,  సంబంధాలను దెబ్బతీస్తాయి. కాబట్టి వాటిని నివారించడం మంచిది. గౌరవం లేకపోవడం..  గౌరవం లేకపోవడం భార్యను బాధపెడుతుంది. ప్రతి స్త్రీ తన భర్త తన గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటుంది.  కానీ భర్త ఆమెను పదే పదే విస్మరిస్తే, అది ఆమెను బాధపెడుతుంది. మరీ ముఖ్యంగా నలుగురిలో ఆమెకు గౌరవం ఇవ్వకుండా చిన్నతనం చేసి మాట్లాడితే ఏ మహిళా దాన్ని పాజిటివ్ గా తీసుకోదు. సమయం కేటాయింపు.. ఈ రోజుల్లో అందరివీ బిజీ జీవితాలు అయిపోయాయి.  కుటుంబ సభ్యులతో కూర్చుని తీరికగా నాలుగు మాటలు మాట్లాడటానికి లేదా వారితో సమయం గడపడానికి కూడా సమయం లేకుండా చేస్తాయి. అయితే భార్యాభర్తల విషయంలో ఈ కారణాలు పనికిరావు. భర్త భార్యకు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి.  ఆమెతో మాట్లాడాలి. సంతోషంగా సమయాన్ని స్పెండ్ చేయాలి.  లేకపోతే ఇది ఇద్దరి మధ్య దూరం పెంచి విడిపోవడానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అబద్దాలు చెప్పడం.. చాలామంది భర్తలు అబద్దాలు చెబుతూ భార్యలను పిచ్చివాళ్లను చేస్తుంటారు. భర్త చెప్పేది అబద్దం అని అర్థమైనా చాలా వరకు భార్యలు లైట్ తీసుకుంటారు.  కానీ ఎంతకాలం? పదే పదే అబద్ధం చెప్పే పురుషుడిని స్త్రీలు ఇష్టపడరు. అది వారి భర్త అయినా,  బయటి వాళ్లు అయినా కూడా.  అందుకే భర్త  వీలైనంత తక్కువగా మాత్రమే భార్య దగ్గర అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాలి లేదా అసలు అబద్ధం చెప్పకుండా ఉండటం మేలు. వినే ప్రవర్తన.. ప్రతి స్త్రీ తనతో ఉండే వ్యక్తి తాను చెప్పేది వినాలని కోరుకుంటుంది.  తను చెప్పేది అతను అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది. భార్య చెప్పేది వినకుండా, ఆమె భావాలను పట్టించుకోకుండా వెళ్లిపోయే వ్యక్తితో ఆమె కలిసి ఉండలేదు. కాబట్టి భార్య చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం భర్త తప్పకుండా చేయాల్సిన పని.                                 *రూపశ్రీ.

రాంగ్ రిలేషన్.. దీన్ని గుర్తించడం ఎలా? ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని వదిలించుకోవాలి?

  ప్రేమ, స్నేహం, బార్యాభర్తల బంధం, బంధుత్వం.. ఇలా రిలేషన్ ఏదైనా సరే.. ఆ బంధానికి కీలకంగా మారేది ప్రేమ.  ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటే బంధాలు ఎంత కాలమైనా బాగుంటాయి. కానీ అవి లేకపోతే బంధం బలహీనం అవుతుంది. నిజానికి ఏ బందంలో అయినా ప్రేమ, గౌరవం, అభిమానం.. మొదలైనవన్నీ ఒక్కసారిగా పుట్టవు, అలాగే ఒక్కసారిగా తగ్గిపోవు. విచ్చిన్నమయ్యే బందాలు చాలా వరకు ప్రేమ కనుమరుగవుతూ చివరకు ఇది ఇక అవసరం లేదు అనుకునే స్థితికి చేరతాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది ఇది బ్యాడ్ టైం.. కొంత కాలం ఓపిక పడితే అంతా సర్దుకుంటుంది అనుకుంటూ ఉంటారు.  తమకు తాము సర్దిచెప్పుకుంటారు, ఓదార్చుకుంటారు. అయితే ఎక్కువకాలం ఇబ్బంది పెట్టే బంధాలను వదిలేసుకోవడం అంటే జీవితంలో ఓడిపోయినట్టు అనుకుంటారు చాలామంది. అందుకే ఓపికగా భరిస్తుంటారు. కానీ నిజం ఏమిటంటే.. అలాంటి బంధాలలో ఎక్కువ కాలం ఉంటే మనుషులు కూడా చాలా దెబ్బతింటారని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. అసలు ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టే బంధాలలో ఉండటం వల్ల కలిగే నష్టం ఏంటి?ఇలాంటి బంధాన్ని వదిలేయడం మేలు అని ఎలా నిర్ణయించుకోవాలి? తెలుసుకుంటే.. బంధం వదులుకోవడానికి ఎందుకు భయపడతారు.. బంధాలను విడిచిపెట్టడానికి చాలామంది  భయపడతారు. దీనికి సన్‌క్ కాస్ట్ ఫాలసీ కారణమని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. దీని అర్థం..  ఒక సంబంధంలో సంవత్సరాల తరబడి  ఎమోషన్స్ ను, ప్రేమను,  కాలాన్ని పెట్టుబడి పెట్టి, ఆ తరువాత  అకస్మాత్తుగా దాన్ని వదిలేస్తే, ప్రతిదీ వృధా అయినట్లు అనిపిస్తుందని అందరూ  నమ్ముతారు. ఇంత దాకా వచ్చాం, ఇంత ప్రయాణం చేశాం  ఎందుకు విడిపోవాలి? కాస్త సర్దుకుపోయి ముందుకు ప్రయాణం చేస్తే మేలు కదా  అని అనుకుంటారు.  గడిచిన కాలాన్ని, బంధంలో ఉన్న గత ఎమోషన్స్ ను చూసి  బంధాలను విడిచిపెట్టడానికి భయపడతారు. కానీ ప్రేమ అనేది ప్రయత్నానికి ప్రతిఫలం ఇచ్చే ప్రాజెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక సంబంధం ఆరోగ్యంగా ముందుకు వెళ్లకుండా  ఆగిపోయినప్పుడు, విడిపోతే తప్పు చేసినట్టు అవుతుందనో  లేదా రిలేషన్ లో ఏం జరిగినా తప్పకుండా ఉండాలి అనే కారణంగానో దానిలో ఉండటం చాలా హాని కలగిస్తుందని  అంటున్నారు. తప్పుడు సంబంధంలో ఆత్మగౌరవం పోతుంది.. చెడు సంబంధంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల  స్వీయ-గుర్తింపు,  ఆత్మగౌరవం క్రమంగా క్షీణిస్తుంది. ఎమోషన్ అవుతూ  ఇబ్బంది పెట్టే  సంబంధాలలో ఉండే చాలా మంది ఏదో బ్రతికేద్దాం అనే విధానంలో ఉంటారు. అంతే కానీ వారి జీవితంలో సంతృప్తి ఉండదు. ఇలాంటి సంబంధంలో ఎక్కువ కాలం జాప్యం చేస్తూ ఉండిపోవడం వల్ల  సొంత నిర్ణయాలను అనుమానించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. బంధం గురించి ఆలోచిస్తూ చాలా వరకు అవసరాలను కూడా అణచివేస్తారు,  గొడవలు రాకుండా ఉండాలని, బంధాన్ని   కాపాడుకోవడానికి తమను తాము  తగ్గించుకుంటారు అని నిపుణులు అంటున్నారు. అయితే నిజమైన ప్రేమ ఎదుటి వ్యక్తిని  ఎప్పుడూ తగ్గించదు. మనిషిని చులకనగా,  తక్కువ చేసి చూసే  సంబంధాలలో ఉండి   ఆత్మగౌరవం కోల్పోవడం,  మనసును బాధపెట్టుకోవడం   ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. అందుకే సంబంధంలో విడిపోవాల్సిన అవసరం వచ్చినప్పుడు  తమను తాము మోసం చేసుకోకుండా విడిపోవడం మేలని అంటున్నారు. సిగ్గు భారం ఆరోగ్యంగా లేని  సంబంధాలలో వ్యక్తులు తరచుగా తమ భాగస్వాములను సమర్థించుకుంటారు. తమ ప్రవర్తనను సమర్థించుకుంటారు.  బంధంలో కలిగే  అసౌకర్యాన్ని విస్మరిస్తారు. ఇది చాలా వరకు వారిని స్నేహితులు,  కుటుంబం నుండి దూరం చేస్తుంది. పరిస్థితులు విచ్ఛిన్నం కావడం ప్రారంభించినప్పుడు, దానిని ఎదుర్కోవడం కష్టం, అలాంటప్పుడు  ఒంటరిగా,  ఇబ్బందిగా ఫీలవుతారు. చాలామంది సర్దుకుపోతే బంధాలు నిలబడతాయని అనుకుంటారు కానీ.. ఇది మనుషులను మానసికంగా దహించివేస్తుంది. అవతలి వ్యక్తులు మారతారు అనే ఆశ,  పొరపాటున లేదా అపార్థాల వల్ల ఏదైనా సమస్యలు వస్తే మనుషులు మారే అవకాశం ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా మనిషిని బాధపెట్టేవారు మారడం కష్టం.  స్వార్థం కాదు,  అవగాహన.. బంధం  సరైనది కానప్పుడు దాన్ని  ముగించడం అనేది బలహీనత కాదు. బంధం గురించి అర్థం చేసుకోవడం ద్వారానే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. నిజాయితీగా ఉండటూ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తీసుకునే నిర్ణయాలు చాలా వరకు తప్పేమో అనిపిస్తూ ఉంటాయి.  బంధం నుండి విడిపోవడం చాలా బాధాకరమైనదే అయినా బాధను  జీవితాంతం భరించడం కంటే విడిపోయి కొద్ది రోజులలో తిరిగి జీవితాన్ని ఆశాజనకంగా మార్చుకోవడం ఎంతో ఉత్తమం.                                       *రూపశ్రీ.

ఎక్కువ ఎమోషన్ అవుతుంటారా..ఇదెంత డేంజరో తెలుసా?

  భావోద్వేగాలు జీవితానికి అర్థాన్ని, లోతును వ్యక్తం చేస్తాయి. అవి సంబంధాలను బలోపేతం చేస్తాయి.  ఎమోషన్ అయ్యే వారి పట్ల ప్రజల స్పందన కూడా చాలా వేరుగా ఉంటుంది. కానీ ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు అవి బలహీనతగా మారవచ్చని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు. చాలామంది ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావ్ అని అనడం వినే ఉంటారు. అంటే.. ఎమోషన్ అయ్యేవారిని అదే ఎమోషన్ ద్వారా వాడుకునే వారు ఉంటారు.   ఎమోషన్ అవ్వడం తప్పు కాదు కానీ.. ఎమోషన్స్ ను డీల్ చేయడం కూడా అంతే ముఖ్యం.  ముఖ్యంగా మహిళలు ఎమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఎమోషన్స్ ఎక్కువైతే ప్రమాదం అని ఎందుకు అంటున్నారు? వీటి గురించి తెలుసుకుంటే.. ఎమోషన్స్ వీక్నెస్ అవుతాయా? ప్రతి వ్యక్తిలో బలాలు,  బలహీనతలు ఉంటాయి.  చాలామంది బలహీనతను కూడా బలంగా మార్చుకోవాలి అని చెబుతూ ఉంటారు. అయితే ఇతరులు ఏమనుకుంటారో.. ఇతరులు మన వల్ల బాధపడతారేమో.. అనే కారణంగా కొందరు అందరికీ ఫేవర్ చేయడం,  అందరికీ నచ్చినట్టు ఉండటం,  కాదు అని చెప్పలేక ప్రతి పనిని అడిగినప్పుడల్లా చేసిపెట్టడం,  ఇతరుల ఎక్స్పెక్టేషన్స్ ను నెరవేర్చడానికి వారి మెప్పు పొందడానికి ప్రయత్నించడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల జరిగేది ఏంటంటే.. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోల్పోవడం జరుగుతుంది.  ముఖ్యంగా మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఈ సమస్యకు లోనవుతూ ఉంటారు. ఇతరులు సెంటిమెంటల్ గా మాట్లాడటం, బాధపడటం,  నటించడం వంటి వాటిని కూడా చాలా సులువుగా నమ్మేసి ఆర్థికంగా, వ్యక్తిత్వ పరంగా కూడా నష్టపోతారు.  అందుకే ఎమోషన్స్ ఇతరుల వీక్నెస్ కాకూడదు అని చెబుతారు. వద్దు అని చెప్పడం అవసరమా? ఎవరైనా ఏదైనా మాట సహాయం లేదా ఆర్థిక సహాయం అడిగినప్పుడు, వేరే ఇంకైదైనా అవసరం కోసం అడిగినప్పుడు చాలామంది కాదనలేక అన్నింటికి సరే అని చెబుతుంటారు. ఇలాంటి మొహమాటాల వల్ల కొన్ని సార్లు నష్టపోతుంటారు. మరికొన్ని సార్లు అవమానాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు.   కానీ లైఫ్ స్టైల్ నిపుణులు చెప్పే మాట ఏంటంటే.. నో చెప్పడం చాలా సమస్యలను దూరంగా ఉంచుతుంది.  ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు సాధ్యం కాకపోతే లేదా ఆ  పని   తెలియకపోతే.. నో అని చెప్పడం వల్ల చాలా వరకు నెగిటివ్ ఫీలింగ్ పెంచుకుంటారు. కానీ.. నో చెప్పడం అలవాటు లేనివారిని అందరూ ఎక్కువగా వాడుకుంటారు. తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. అందుకే నో అని చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఎమోషన్స్ ను డీల్ చేయాలి.. ఎమోషన్స్ ఉన్న వ్యక్తే నిజానికి  సరైన మనిషి అంటారు.  కానీ ఎమోషన్ లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అది చాలా ప్రమాదం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి, సబబు అనిపిస్తే మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.  ముఖ్యంగా ఇతరుల విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది చాలా ముఖ్యం. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు లేదా ఎవరి విషయంలో అయినా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వెంటనే కాకుండా కాస్త ఆలోచించి ముందడుగు వేయాలి. బౌండరీస్ ఉండాలి.. ప్రతి విషయానికి కొన్ని బౌండరీస్ ఉండటం చాలా మంచిది. ఇది జీవితాన్ని స్పష్టతతో ఉండేలా చేస్తుంది. అలాగే బౌండరీస్ నిర్థేశించుకున్నవారు బలహీనులుగా కాకుండా బలమైన వ్యక్తులుగా అనిపిస్తారు. బౌండరీస్ ఉంటే.. తన గౌరవాన్ని తాను కాపాడుకుంటూ ఇతరులను ఒక పరిథి వరకు మాత్రమే సహాయం చేయడం చేయవచ్చు.  ఆరోగ్యకరమైన రిలేషన్ కు ఇది చాలా అవసరం. బాధ కాదు.. అర్థం చేసుకునే మనసు కావాలి.. ప్రతి వ్యక్తి ఇతరులకు వంద శాతం నచ్చరు. అలాగే అందరికీ నచ్చరు. అంతే కాదు.. ఏ వ్యక్తి ఇతరులకు ఎల్లకాలం అందుబాటులో ఉండరు కూడా. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే డిపెండింగ్ అనేది దానికదే  తగ్గుతుంది. అంతేకాదు.. ఎమోషన్స్ ను నియంత్రించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.                              *రూపశ్రీ.

హెల్త్ ఇన్సురెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

  నిన్నటి వరకు లైఫ్ ఇన్సురెన్స్ కు డిమాండ్ ఉండేది.  ఇప్పుడు వెహికల్స్ కు, ఇల్లు కొనుగోలుకు.. ఇలా అన్నింటికి ఇన్సురెన్స్ వచ్చింది.  అయితే ఈ ఇన్సురెన్స్ లు ఒక ఎత్తు,  హెల్త్ ఇన్సురెన్స్ ఒక ఎత్తు.  నేటి కాలంలో కుటుంబంలో ఎవరో ఒకరు ఏద ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా చాలా మంది హెల్త్ ఇన్సురెన్స్ మీద చాలా దృష్టి పెడుతున్నారు. వీటికి తగ్గట్టు ఇప్పట్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రమోషన్లు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి.  కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకునే ప్రతి ఒక్కరు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. అవేంటో తెలుసుకుంటే..  హెల్త్ హిస్టరీ.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకునే ముందు కుటంబంలో ఎంత మంది ఉంటే అంత మంది ఆరోగ్యం గురించి పూర్తీగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా పూర్తీగా అందరి గురించి ఆలోచించుకుంటే మంచి ప్లాన్ ఎంచుకోవడానికి,  తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ కుటుంబ సభ్యుల ఆరోగ్య చికిత్సకు చక్కగా సహాయపడుతుంది.  అలా కాకుండా అందరూ ఎక్కువగా ఏది తీసుకుంటున్నారు? ఆర్థికంగా ఏది బాగుంది అనేవి చూసి తీసుకుంటే.. ఆ తర్వాత అది కుటుంబ సభ్యులకు ఉపయోగపడదు. క్లెయిమ్ టైమ్.. ఆరోగ్య భీమాకు క్లెయిమ్ టైమ్ డేట్ ఉంటుంది.  ఈ గడుపు తేదీ తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి.  కాబట్టి పాలసీ క్లెయిమ్ కోసం వెయిటింగ్ డేట్ ను చెక్ చేసుకోవాలి. సాధారణంగా కంపెనీలు ఈ వెయిటింగ్ పిరీయడ్ ను 30 రోజులుగా అమలుపరుస్తుంటాయి.  అయితే కొన్ని అనారోగ్యాలకు ఈ వ్యవధి చాలా ఎక్కువ అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకునే ముందు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.  సెటిల్మెంట్ పర్సెంటేజ్.. హెల్త్ ఇన్సురెన్స్ తీసుకునేటప్పుడు కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని చెక్ చేయాలి.  ఎక్కువ సెటిల్మెంట్ నిష్పత్తి ఉంటే తరువాత క్లెయిమ్ లకు దారితీయవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ప్రీమియంతో తప్పటడుగు.. చాలామంది తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇలా తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీలు చాలా వరకు అంత మంచిగా ఉండవు.  ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉన్నా సరే.. అది ఆరోగ్య అవసరాలకు బాగా సహాయపడే ప్లాన్ ను మాత్రమే ఎంచుకుంటే బెటర్. రిలెటెడ్ హాస్పిటల్స్.. హెల్త్ ఇన్సురెన్స్ ఏ కంపెనీ నుండి తీసుకుంటే.. ఆ కంపెనీ కి  రిలేటెడ్ గా ఉన్న హాస్పిటల్ లిస్ట్ ను తప్పనిసరిగా చెక్ చేయాలి.  ఇలా చేయడం వల్ల డబ్బు కట్టకుండా హెల్త్ ఇన్సురెన్స్ కింద ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం లభిస్తుంది. ఒక కంపెనీకి ఎక్కువ నెట్వర్క్,  హాస్పిటల్స్ లిస్ట్ ఎక్కువ ఉంటే అది బాగా సహాయపడగలుగుతుంది. క్లెయిమ్ రూల్స్.. కొన్ని కంపెనీలు పేషెంట్ కనీసం 24 గంటలు హాస్పిటల్ లో చేరితేనే క్లెయిమ్ లను చెల్లిస్తాయి.  అలాంటి సందర్బాలలో ఆ అవసరాన్ని మినహాయించే  డే కేర్ సౌకర్యం ఉందా లేదా అనేది చూసుకోవాలి. కండిషన్స్, రూల్స్.. హెల్త్ పాలసీ అయినా, జీవిత భీమా అయినా, వేరే ఇన్సురెన్స్ అయినా.. ఏదైనా సరే.. భీమాను కొనుగోలు చేసేముందు దాని కండిషన్స్,  రూల్స్ ను తప్పకుండా చదవాలి.  వాటిలో మినహాయింపులు,  రూల్స్ ను,  అలాగే పేమెంట్స్ ఇలా అన్ని అంశాలను కూడా చెక్ చేసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చాక మాత్రమే కొనుగోలు చేయాలి.                                   *రూపశ్రీ.

ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటే ఇవి ఫాలో అవ్వండి..!

సంతోషం సగం బలం అన్నారు.. ఈ వాక్యంతో పాట కూడా ఉంది. మనిషి సంతోషంగా ఉంటే అదే సగం బలంగా ఉన్నట్టు. మనిషి శరీరం ఎంత బలంగా ఉన్నా.. ఆ మనిషి సంతోషంగా  లేకపోతే ఏదో కోల్పోయిన అనుభూతి ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది.  చాలామంది తమ జీవితాలలో చాలా కారణాల వల్ల సంతోషాన్ని కోల్పోతుంటారు.  ఎప్పుడూ దిగులుగా ఉండటం,  ఆందోళనతో ఉండటం,  భయంతో ఉండటం, తమ మీద తమకు నమ్మకం లేకపోవడం.. ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ సంతోషాన్ని కోల్పోతుంటారు.  కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే దేంతోనూ, ఎవరితోనూ సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండవచ్చు.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. పోలిక వద్దు.. మనిషికి ఉన్న అతిపెద్ద రోగం పోల్చుకోవడం. ఇతరులతో ఎప్పుడూ పోల్చుకుంటూ ఉంటారు.అది కూడా జీవితానికి మేలు చేసే విషయాల కంటే మనిషి ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టే వాటినే పోల్చుకుంటూ ఉంటారు.   వాళ్లు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం?  వాళ్లకు డబ్బు చాలా ఉంది,  మనకు లేదు. వాడు ఏకంగా చాలా పెద్ద తప్పు చేశాడు. నేను చేసింది చిన్నదే.. వాళ్లలాగా మనం స్టైల్ గా ఉండాలి.  వాళ్ళలాగా మనకు కారు,  ఇల్లు,  లగ్జరీ లైఫ్ ఉండాలి. ఇలా చాలామంది పోల్చుకోవడం వల్ల తమకున్న కాసింత తృప్తిని కూడా పోగొట్టుకుంటారు. అతి ఆలోచనలు.. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.  భవిష్యత్తు గురించి ఒక హద్దు వరకు ఆలోచన,  ప్రణాళిక ఉండాలి. కానీ కొందరు జరిగిపోయిన విషయాల గురించి పదే పదే ఆలోచన చేస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఇదే ఆలోచనల్లో మునిగిపోయి ఉంటారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సమయాన్ని ఇలా అతి ఆలోచనలతో వృధా చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. సంతోషంగా ఉండాల్సిన భవిష్యత్తు కూడా క్లిష్టంగా మారుతుంది. పగ వద్దు.. ఒకరిని మరొకరు బాధ పెట్టుకోకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ నేటికాలంలో ఒకరిని ఒకరు బాధపెట్టుకుంటే దాని వల్ల బాధపడాల్సింది ఏమీ లేదు.  ఎవరైనా ఏదైనా అంటే దానికి రివేంజ్ తీర్చుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దీనివల్ల మనసులో ప్రశాంతత, సంచోషం కనుమరుగవుతాయి.  ఇతరులు అన్న మాటలను, చేసిన మోసాన్ని పట్టించుకోవడం మానేసి, తప్పు చేసిన వారిని మనసారా క్షమించేసి ,  ఆ విషయం గురించి అక్కడితో మరచిపోతే సంతోషంగా ఉండొచ్చు. నెగిటివ్ కు దూరం.. మంచి మనుషులను కూడా చాలా చెడ్డగా మార్చేది నెగిటివ్ ఆలోచన.  నెగిటివ్ గా ఆలోచించే వారికి దగ్గరగా ఉన్నా, అలాంటి వాతావరణంలో ఉన్నా అది క్రమంగా మెదడుకు స్లో పాయిజన్ లా పని చేస్తుంది. ఇది క్రమంగా బుర్రను పాడు చేసి ఏ విషయాన్ని అయినా సరే.. చాలా చెడ్డగా చిత్రీకరిస్తుంది. దీని వల్ల మంచి విషయాలను కూడా చెడుగా ఊహించి సంతోషాన్ని కోల్పోతారు. అందరి సంతోషం కోసం.. మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉండగలం అని చాలా మంది అనుకుంటారు. ఇది నిజమే అయినా కేవలం చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచడం అనే ప్రయత్నంలో కాలాన్నిగడిపేసి తమ సంతోషాన్ని పట్టించుకోని వారు చాలామంది ఉంటారు. అందరి సంతోషం మాత్రమే కాదు.. తమ సంతోషం తాము చూసుకోవడం, తమ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే జీవితం చుట్టూ ఉన్న అందరి కోసం త్యాగం అయిపోతుంది. వాయిదాలు వద్దు.. ఎప్పటి పనిని అప్పుడు చేసుకోవడం వల్ల మానసకి ప్రశాంతత ఉంటుంది. అలా కాకుండా పనులను వాయిదా వేస్తూ ఉంటే అవన్నీ పేకుకుని పోయి ఆందోళన,  ఒత్తిడి పెంచుతాయి. ఇవి మనిషి జీవితంలో సంతోషకర క్షణాలను తినేస్తాయి. ఈ వ్యక్తులకు దూరంగా ఉండాలి.. నెగిటివ్ పీపుల్స్ చాలా చోట్ల తారసపడుతూ ఉంటారు.  బంధువులలో అయినా,  స్నేహితులలో అయినా,  ఆఫీసులో అయినా,  వేరే ఎక్కడైనా సరే.. చెడ్డ వ్యక్తులు  ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి.  వీరి ఆలోచనలు, ప్రవర్తన,  వీరు చేసే పనులు అన్నీ చాలా నెగిటివ్ గా ఉంటాయి. ఇలాంటి వారికి దగ్గరగా ఉంటే.. వారు కూడా చెడ్డ వ్యక్తులుగా మారే అవకాశం ఉంటుంది. పర్ఫెక్షన్ ను పట్టుకుని వేలాడకూడదు.. చాలామంది మంచివారికి,  బాగా పని చేసేవారికి ఉండే చెడ్డ అలవాటు పర్ఫెక్షన్ ను పట్టుకుని వేలాడటం.  పర్పెక్ట్ గా ఉండటం మంచిదే కానీ.. పూర్తీ ఎఫర్ట్ పెట్టి పని చేశాక కూడా ఇంకా పర్ఫెక్ట్ గా లేదు అనుకుంటూ ఒత్తిడికి లోనవడం మాత్రం సంతోషాన్ని దెబ్బతీస్తుంది.  పర్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉన్నా, అన్నింటిలో దాన్ని ఎక్స్‌పెక్ట్ చేసినా ప్రశాంతత పోతుంది.                  *రూపశ్రీ.

సరైన సమయంలో సరైన, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ఎలా?

వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్.. ఈ మాట చాలా మంది వినే ఉంటారు.  ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని అందరూ నమ్ముతారు. అట్లాగే ఒక  నిర్ణయం జీవితాన్ని మారుస్తుంది.  సరైన సమయంలో సరైన, తెలివైన  నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితం చాలా మారిపోతుంది.  అదే సరైన నిర్ణయం కాకుండా చెత్త నిర్ణయం తీసుకుంటే జీవితం పూర్తీగా తలకిందులు అవుతుంది.  చాలామందికి తెలిసి కూడా పొరపాటు చేసేది ఇక్కడే.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. పూర్తీగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని దాని వల్ల నష్టం జరిగినప్పుడే అయ్యో అని అనుకుంటారు.  అసలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎందుకు ముఖ్యం? ఇలా సరైన నిర్ణయం తీసుకోగలగాలి అంటే ఏం చేయాలి?  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే జీవితాన్ని అద్బుతంగా మార్చుకోవచ్చు. ఒక్క ఉదాహరణ.. స్టీవ్ జాబ్స్ నిర్ణయం.. 1985లో స్టీవ్ జాబ్స్ కంపెనీతో విభేదాలు పెరిగినప్పుడు, అతను ఆపిల్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో అతని కెరీర్ ముగిసిందని అందరూ అనుకున్నరు. కానీ స్టీవ్ వదులుకోలేదు. అతను NeXT,  Pixar వంటి కంపెనీలను ప్రారంభించాడు. అతను కస్టమర్ల అవసరాలను తెలుసుకోవడం,  అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. తరువాత 1997లో, స్టీవ్ జాబ్స్ ఆపిల్‌కు తిరిగి వచ్చి దానిని ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మార్చాడు. ఇదంతా అతని సరైన నిర్ణయాల వల్లే జరిగింది. సరైన నిర్ణయం వల్ల జరిగే అద్భుతం ఇదే.. నిర్ణయం తీసుకోవడం అంటే మ్యాజిక్ చేయడం  కాదు, అదొక కళ. జీవితంలో ప్రతి మలుపులోనూ మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి  హృదయాన్ని,  మనస్సును ఎలా బాలెన్స్  చేసుకోవాలో ఈ కళ నేర్పుతుంది. నిర్ణయం తీసుకునే కళ.. మెదడు పనిచేసే విధానం చాలా ప్రత్యేకమైనది. నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కాహ్నెమాన్ తన "థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో" అనే పుస్తకంలో మానవులు రెండు విధాలుగా ఆలోచిస్తారని వివరించారు. వేగంగా.. సహజంగా.. ఇది  త్వరగా నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే ఆలోచన. ఉదాహరణకు, మనం అకస్మాత్తుగా రోడ్డుపై కారును చూసినప్పుడు ఆగడం. కాహ్నెమాన్ దీనిని "సిస్టమ్ 1" అని పిలిచాడు. నెమ్మదిగా..  తార్కికంగా.. నెమ్మదిగా.. తార్కికంగా చేసే  ఆలోచనలో లోతైన విశ్లేషణ ఉంటుంది, ఉదాహరణకు కొత్త ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు అన్ని అంశాలను  పరిగణలోకి  తీసుకోవడం. దీనిని "సిస్టమ్ 2" అంటారు. విజయం వెనుక బలం ఇదే.. విజయవంతమైన వ్యక్తులు ఈ రెండింటిని సరిగ్గా ఉపయోగిస్తారట. అందుకే వారు విజేతలు కాగలరని, వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగారని అంటారు. భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా 2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR)ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో JLR నష్టాల్లో ఉంది, కానీ రతన్ టాటా తక్షణ నష్టాలను దాటి భవిష్యత్తు వైపు దృష్టి సారించాడు. ఆయన నిర్ణయం టాటా మోటార్స్‌కు లాభాలన అందించడమే కాకుండా, ప్రపంచంలో భారతీయ ఆటో పరిశ్రమ బలాన్నిచాటి చెప్పింది. నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను ఎలా మెరుగు పరచుకోవాలి? నిర్ణయాలు తీసుకునే  నైపుణ్యం  సహజంగా రాదు. దీనిని నేర్చుకోవచ్చు,  మెరుగుపరచవచ్చు.  నిర్ణయాలను బలోపేతం చేయడానికి ఇక్కడ కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి:  శ్వాస.. ఏదైనా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోాల్సి వస్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక్క క్షణం ఆగి, లోతైన శ్వాస తీసుకొని ఆలోచించాలి. ఇది  మనసును ప్రశాంతపరుస్తుంది. వాస్తవాలను చెక్ చేయాలి..: ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు, కనీసం 2-3 ముఖ్యమైన సమాచారాన్ని సేకరించండి. ఉద్యోగ మార్పు, జీతం, పని సంస్కృతి,  వృద్ధిని పరిశీలించడం లాంటివి చూసుకోవాలి. ఎమోషన్స్  అర్థం చేసుకోవాలి.. "నేను ఈ నిర్ణయం భయంతో తీసుకుంటున్నానా? లేక కోపంతో తీసుకుంటున్నానా?" అని  భావోద్వేగాలను  విశ్లేషించుకుని వాటిని అర్థం చేసుకోవాలి. చిన్న ప్రారంభం.. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు చిన్న నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏమి ధరించాలి, ఏమి తినాలి వంటి నిర్ణయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. నష్టాలన అర్థం చేసుకోవాలి..  ప్రతి నిర్ణయం తీసుకునే ముందు, అది తప్పు అయితే ఏమి జరుగుతుందో అని ఆలోచించాలి. ఆ నష్టాన్ని  తట్టుకోగలరా లేదా అని ఆలోచించాలి. అనుభవాల నుండి నేర్చుకోవాలి..  గతంలో జరిగిన  తప్పులను ఎప్పటికీ  గుర్తుంచుకోవాలి.   వాటిని పునరావృతం చేయకుండా ఉండాలి.                                   *రూపశ్రీ.

క్షమించడం ఎంత పవర్ ఫుల్ గా పని చేస్తుందో తెలుసా?

  జీవితంలో తప్పొప్పులు జరుగుతూ ఉంటాయి.  మనల్ని కొందరు బాధపెడతారు.  మనం కొందరి వల్ల బాధపడుతూ ఉంటాము. మనల్ని బాధపెట్టిన వాళ్ల మీద కోపం రావడం చాలా సహజం.  అలాగే మనం బాధపెట్టిన ఎదుటివారికి కూడా మన మీద అంతే కోపం వస్తుంది.  పలు సందర్భాలలో ఇలాంటి కోపాలు, ఎదుటి వారి నుండి ఇబ్బంది,  ఎదుటి వారి వల్ల సమస్యలు ఎదుర్కుంటూనే ఉంటాం. అయితే మనల్ని ఎవరు బాధపెట్టినా వాళ్లను ఏమీ అనకుండా కేవలం క్షమించేసి మన పని మనం చేసుకోవడం చాలా పవర్ ఫుల్ ఆయదం లాంటిదని అంటారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  క్షమా గుణం అంత గొప్పది,  అంత శక్తివంతమైనది ఎలా అయ్యింది? దీని గురించి తెలుసుకుంటే.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణంగా తప్పులు చేస్తుంటారు. అయితే ఎదుటివారు చేసే తప్పులను పట్టుకుని ఉండటం వల్ల మనకే హాని కలుగుతుందని అంటున్నారు. అందుకే వాళ్ల తప్పులను పట్టుకోవడానికి బదులుగా వారిని క్షమించడం మంచిదని అంటున్నారు. ఎదుటి వారి తప్పుల్ని పట్టుకోవడం అంటే కచ్చితంగా కోపంతో ఉండటం.  ఇలా కోపంతో, ఆగ్రహంతో ఉండటం వల్ల మనిషి మానసిక భారం పెరుగుతుంది. అదే అవతలి వ్యక్తిని క్షమించి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తే మానసిక భారం తగ్గుతుందట. క్షమించడం వల్ల మనసుకు ప్రశాంతత, ఓదార్పు లభిస్తాయి.  ఇతరులను  క్షమించడం,  కోపాన్ని వదిలేయం వల్ల నెగిటివ్ ఆలోచనల నుండి విముక్తి పొందుతారు. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటారో అప్పటి నుండి మనలో తప్పు ఆలోచనలు, చెడు స్వభావం అన్నీ మాయమవుతాయి. కష్టాలు మనిషికి కాక,  మానుకు వస్తాయా? అనే మాట తరచుగా వింటూనే ఉంటాం.  అలాగే కోపం కూడా అంతే.. మనిషికే కోపం అధికం. అలాగే దాన్ని బయటపెట్టడం కూడా అధికం.  ఇక్కడ విషయమేమిటంటే.. మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటుంది.  అదుపు చేసుకునే స్వభావం ఉంటుంది.  కాబట్టి కోపాన్ని వదిలేయాలి. ఇలా చేస్తే..ముఖ్యంగా మానవ సంబంధాలు చాలా మెరుగుపడతాయి. ఒక్క  క్షమాపణ తెగిపోయే బంధాలను కూడా నిలబెడుతుంది. క్షమాపణను ఆధ్యాత్మిక కోణంలో కూడా పరిశీలించవచ్చు. ఏ మతమైనా, ఏ చెప్పిన విధానాలు అయినా పరిశీలిస్తే.. క్షమాపణ అనేది చాలా గొప్ప ధర్మం అని అర్థమవుతుంది. క్షమాపణ మనిషికి గొప్ప వ్యక్తిత్వం గల వాడిగా మార్చుతుంది. క్షమించడం వల్ల మనిషిలో ద్వేషం, అసూయ వంటివి మాయమవుతాయి.  వాటి స్థానంలో కరుణ, ప్రేమ చేరతాయి.  ఈ మంచి గుణాలు మనిషిని జీవితాంతం మరింత అందంగా,  ఆరోగ్యంగా ఉంచుతాయి.                                 *రూపశ్రీ.

పాత స్మార్ట్ ఫోన్ అమ్మాలనుకుంటున్నారా..ఈ 5 జాగ్రత్తలు అస్సలు మిస్ కావద్దు..!

   ఈ రోజుల్లో  ప్రతి ఒక్కరూ కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలని కోరుకుంటారు. కానీ చాలామంది  తొందరపడి ముందు వెనుకా ఆలోచించకుండా  పాత ఫోన్‌ను అమ్మేస్తారు లేదంటే  వేరొకరికి ఇస్తారు. పాత ఫోన్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుకు మరికొంత డబ్బు సమకూర్చుకుని కొత్త ఫోన్ కొనడం చాలామంది చేసే ప్లాన్. అయితే పాత ఫోన్ అమ్మే ముందు ఫోన్ డేటాను సరిగ్గా తొలగించకపోవడం అతిపెద్ద తప్పని సైబర్ నిపుణులు అంటున్నారు.  పాత ఫోన్ ఫోటోలు, వాట్సాప్ చాట్‌లు, బ్యాంకింగ్ వివరాలు, ఇమెయిల్‌లు,  పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేస్తుంది. అది పొరపాటు తప్పుచేసే వ్యక్తుల చేతుల్లోకి వెళితే చాలా నష్టాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. చాలా మంది ఫోన్ అమ్మే ముందు ఫ్యాక్టరీ రీసెట్ చేయడం లేదా తొలగించడం చేస్తే డేటా తొలగిపోతుంది అనుకుంటారు. కానీ ఇలా చేయడం  వల్ల డేటా పూర్తిగా తొలగించబడదు. అలా చేసిన డేటాను దాన్ని తిరిగి పొందవచ్చు. కాబట్టి పాత  ఫోన్‌ను విక్రయించే లేదా మార్పిడి చేసే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు  తీసుకోవడం చాలా ముఖ్యం. పాత ఫోన్ అమ్మే ముందు ఈ జాగ్రత్తలు  తీసుకోవాలి.. ఫోన్ Android Lollipop (5.0) లేదా ఆ తర్వాతి వెర్షన్‌ లో ఉంటే అందులో FRP (ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్) ఫీచర్ ఉంటుంది.  దానిని తీసివేయాలి, లేకుంటే  పాత ఫోన్ కొనే వ్యక్తి ఫోన్‌ను ఉపయోగించలేరు.  ఫోన్ పాత వెర్షన్‌ను అమలు చేస్తుంటే,  ఈ దశను స్కిప్ చేయవచ్చు.  ఫోన్ వెర్షన్‌ను చెక్  చేయడానికి, సెట్టింగ్‌లు > అబౌట్ ఫోన్ > ఫోన్ > సాఫ్ట్‌వేర్ సమాచారం కు వెళ్లాలి. ఫ్యాక్టరీ రీసెట్ చేసేముందు.. పాత ఫోన్ ను అమ్ముతున్నా లేదా.. కొత్త ఫోన్ కొనడానికి ఫోన్ ను ఎక్స్చెంజ్ కోసం ఇస్తున్నా  ఫ్యాక్టరీ రీసెట్ చేయడం సరిపోదు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో పాత డేటాను తిరిగి పొందవచ్చు. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి, నకిలీ డేటాను అప్‌లోడ్ చేసే ఉపాయాన్ని కనిపెట్టారు. దీన్ని చేయడానికి.. ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు  ఫోన్‌లోని అనవసరమైన (జంక్) డేటాను యాడ్ చేయాలి. ఇది  ఫోన్ స్పేస్ ను ఫుల్ చేస్తుంది. అంటే పెద్ద వీడియో ఫైల్‌లు, పాటలు, సినిమాలు లేదా మీకు అవసరం లేని ఏదైనా ఇతర డేటా యాడ్ చేయవచ్చు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఫోన్  అసలు డేటా ఇప్పటికే ఎన్‌క్రిప్ట్ చేయబడి, ఈ కొత్త అనవసరమైన డేటా అందులో యాడ్ చేశాక, పాత ఫైల్‌లు పూర్తిగా  హైడ్ అయిపోతాయి. అటువంటి పరిస్థితిలో,  పాత ఫోన్ కొనుక్కున్న కొత్త వ్యక్తి ఫోన్ నుండి డేటాను తిరిగి పొందడానికి ప్రయత్నించినప్పటికీ, వారు ఈ జంక్ ఫైల్‌లను మాత్రమే కనుగొంటారు,  వ్యక్తిగత సమాచారాన్ని కాదు. కాబట్టి పాత ఫోన్ అమ్మే ముందు లేదా కొత్త ఫోన్ కోసం ఎక్స్చేంజ్ కు ఇచ్చే ముందు ఈ పద్దతిని తప్పకుండా ఫాలో కావాలి.                         *రూపశ్రీ.

ఇలా చేస్తే ఆర్థికంగా ఎదగకుండా ఎవ్వరూ ఆపలేరు..!

ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకుంటాడు.  ముఖ్యంగా డబ్బు కారణంగా ఎలాంటి సమస్యలు రాకూడదని అనుకుంటాడు.  అయితే.. చాలా మంది నేటి కాలంలో ఎదుర్కొనేది డబ్బు పరమైన సమస్యలే ఎక్కువ.  ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న వేసుకుంటే చాలా కారణాలు కనిపిస్తాయి. డబ్బు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనే విషయాలు చాలా తక్కువ మంది ఆలోచిస్తారు.  కొందరైతే డబ్బు లెక్కల గురించి ఇంట్లో వాళ్లు అడిగితే నేనేమైనా తిన్నానా అందరి కోసం ఖర్చు పెడుతున్నాగా అని అంటుంటారు. అయితే ఆర్థిక సమస్యలు రాకూడదన్నా,  ఆర్థికంగా బలంగా ఎదగాలన్నా కొన్ని మార్గాలు చాలా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే.. బలహీనతలు బయట పెట్టకూడదు.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. అయితే ఇలా బలహీనత ఉన్నట్టు బయట ఎవరికీ చెప్పకపోవడం మంచిది.  ఎందుకంటే బలహీనతను క్యాష్ చేసుకునేవారు ఉంటారు.  ఆ బలహీనతల మీద తాము ప్రయోజనం పొందాలని అనుకునేవారు ఉంటారు. అందుకే ఆర్థికంగా ఎదగాలంటే బలహీనతలను బయటపెట్టకూడదు. తెలివిగా ఖర్చు చేయాలి.. డబ్బు సంపాదించడం కాదు.. ఖర్చు పెట్టడంలోనే అసలైన స్కిల్ దాగుంటుంది.  తక్కువ ఖర్చులు చేస్తూ ఎక్కువ పొదుపు చేస్తుంటే ఆర్థికంగా మెరుగవుతూ ఉంటారు.  తక్కువ ఖర్చు చేసినప్పుడు ఎవరైనా పిసినారి లాంటి పదాలు వాడినా పట్టించుకోకూడదు.  ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎవరూ ఒక్క రూపాయి ఇవ్వరు.  ఒకవేళ ఎవరైనా అలా ఇచ్చినా వంద రూపాయలు చేతిలో పెట్టి వేలాది రూపాయలు ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుంటారు. కాబట్టి ఖర్చు పెట్టడమే తెలివిగా చేయాలి. దీనివల్ల పొదుపు సాద్యమవుతుంది. వాదన.. మూర్ఖులు చాలామంది ఉంటారు.  తాము చెప్పిందే కరెక్ట్ అనుకేవారు ఎక్కువ.  అంతేకాదు.. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం కూడా మూర్ఖత్వమే..  ఇలాంటి మూర్ఖులతో వాదన చేయడం వల్ల సమయం వృధా.. మనిషి ఆర్థికంగా ఎదగాలని ఎప్పుడైతే అనుకుంటాడో.. అప్పుడు సమయానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. లక్ష్యాలు.. నేను ఇది చేయాలని అనుకుంటున్నాను,  ఇది సాధించాలని అనుకుంటున్నాను.  ఇంత పెట్టుబడి పెడతాను.. ఇలాంటివి ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. లక్ష్యం ఏదైనా సరే.. సాధించేవరకు ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది. స్వ కష్టం.. తన కష్టాన్ని తాను నమ్ముకునేవాడు ఎప్పటికీ చెడిపోడు. తన పని కోసం  మరెవరిపైనా ఆధారపడకూడదు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి సాధించలేనిది ఏదీ లేదు. కావలసిందల్లా తన పట్ల దృఢ సంకల్పం,  నిజాయితీ. విద్యపై దృష్టి.. విద్య అనేది ఒక వ్యక్తి జీవితానికి కీలకం. జీవితంలో పురోగతికి ఇది చాలా అవసరం.  గురువు ప్రతిచోటా గౌరవించబడతాడు. పుస్తకాలు కూడా ఒక వ్యక్తికి మంచి స్నేహితుడు. అవకాశాలు..  ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉంటాయి. కానీ తెలివైన వారు  వాటిని గుర్తించి సరైన సమయంలో అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అలాంటి వారు  అవకాశాల కోసం వెతకాల్సిన అవసరం లేదు. అవి వాటంతట అవే తమ వద్దకు వస్తాయి.                           *రూపశ్రీ.

మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం మంచిదేనా?

మనమందరం మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఇతరులతో పోల్చుకుంటాము. కొన్నిసార్లు మనం ఇతరులను చూసి ఆశ్చర్యపోతుంటాము.  "అతనికి  నా కంటే మంచి ఉద్యోగం  ఎందుకు వచ్చింది?" "అతని దగ్గర పెద్ద కారు ఉంది,  నా దగ్గర లేదు ఎందుకు?" "అతను నా కంటే గొప్పగా ఎందుకున్నాడు?" ఈ ప్రశ్నలు మన మనస్సులను పదే పదే  సంఘర్షణలోకి నెట్టుతూ ఉంటాయి. ఎంత ఆపాలని అనుకున్నా ఆగవు. కానీ చాలామంది ఒకటి మరిచిపోతారు "నిన్నటి కంటే నేను మెరుగ్గా ఉన్నానా?" అని తమను తాము ఎప్పుడూ ప్రశ్నించుకోరు. వ్యక్తి జీవితంలో గుర్తింపు అనేది ఇతరులతో పోల్చుకుంటే వచ్చేది కాదు.. జీవితంలో ఏదో ఒకటి నేర్చుకుంటూ,  ఏదో ఒకటి చేస్తూ ఉండటం ద్వారా  ఎదుగుతూ ఉంటే అప్పుడు గుర్తింపు వస్తుంది.  అందుకే ఇతరులతో పోల్చుకోవడం చాలా హానికరం అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు. ఇతరులతో పోల్చుకోవడం ఎందుకు హానికరం? సాధారణంగా మన చుట్టూ జరిగే విషయాలను గమనించడం ద్వారా నేర్చుకోవడం మానవ స్వభావం. ఈ ప్రక్రియలో ఇతరులతో పోల్చుకోవడం కూడా జరుగుతుంది. ఇలా పోల్చుకోవడం ప్రారంభించినప్పుడు  తరచుగా నేర్చుకోవడంలో  విఫలమవుతాము. ఈ అలవాటు తెలియకుండానే  పెరుగుతుంది.  ఈ అలవాటు వ్యక్తులను  బలహీనపరుస్తుంది. దీని వల్ల  తమను తాము తక్కువ చేసుకుని చూసుకోవడం అనే పెద్ద తప్పు చేస్తుంటాం. ఇతరులతో పోల్చుకుంటే జరిగేది ఇదే.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది.. మనం పదే పదే ఇతరులతో పోల్చుకున్నప్పుడు, మన  ప్రయత్నాలు,  విజయాలు చిన్నవిగా అనిపిస్తుంటాయి.  ఎప్పుడూ ఇతరులకంటే తక్కువ అనుకుంటూ ఉంటే పెద్ద విజయాల వైపు ఆలోచన కూడా క్రమంగా తగ్గుతుంది.చేతులారా ఎదుగుదలను నరికేసుకున్నట్టే అవుతుంది. మెదడుపై భారం పెరుగుతుంది.. సోషల్ మీడియాలో చాలామంది సక్సెస్ ఫుల్ లైఫ్ ను చూపిస్తూ ఉంటారు. తమ గెలుపును మాత్రమే చూపిస్తారు.  అయితే ఇలా కేవలం గెలుపును మాత్రమే చూసేవారికి గెలుపు వెనుక,  సంతోషం వెనుక కష్టం, బాధ,  ఇబ్బందులు ఇలా అన్నీ ఉంటాయి.   పోల్చుకున్నప్పుడు తమకు ఎప్పుడూ కష్టాలు, ఇబ్బందులు తప్ప సంతోషం అనేది లేదు అనే అభిప్రాయం ఏర్పడి మెదడుపై భారం పడుతుంది. ఎదుగుదల తగ్గుతుంది..  ఇతరుల జీవితాలపై మాత్రమే దృష్టి పెట్టినప్పుడు, మన స్వంత బలాలు,  కలలను మరచిపోతాము. మన ఆలోచన, సామర్థ్యం  తప్పుదారి పడుతుంది.  దీని వలన మనం చేయవలసిన పనులు సరైన ఎఫర్ట్ పెట్టి  చేయము. కాబట్టి పోల్చుకునే అలవాటు మనిషిని పోటీ తత్వంలోకి తీసుకెళ్తుంది అనే మాటను పక్కన పెడితే మనిషిలో కాన్పిడెంట్ తగ్గించి జీవితంలో ఎదుగుదలను నెమ్మదిచేసే అవకాశమే ఎక్కువ. అందుకే పోల్చుకోవడం మంచిది కాదు.                                      *రూపశ్రీ.

ఎవరికీ, దేనికి "నో" చెప్పలేరా..అందరూ మీ మీద ఆధిపత్యం చేస్తున్నారా? ఇలా చేయండి..!

  అందరి జీవితాలు పైకి కనిపించినట్టు ఉండవు. కొందరి  జీవితాలు అంతా బాగుంది అనుకునేలా ఉంటాయి కానీ బాగుండవు.  మరికొందరు మంచి చదువు, ఉద్యోగం, సంపాదన.. అన్నీ ఉన్నా.. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నా.. తనకంటూ ఏమీ లేదు అనే ఫీలింగ్ లో ఉంటారు.  ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆ వ్యక్తుల వ్యక్తిత్వం కారణంగానే.. ఎవరైనా ఏదైనా పని చెప్పినా నో చెప్పలేని బలహీనత కొందరిలో ఉంటుంది. దీనికి మొహమాటం అనే ట్యాగ్ తగిలిస్తారు.  అలాగే కొన్ని విషయాలు తప్పైనా సరే.. పెద్దవాళ్లు చెప్పారని, పై అధికారులు చెప్పారు  కాబట్టి వారు చెప్పింది వినాలి, చేయాలి అనే స్వభావం ఉంటుంది.  ఒకవైపు ఇదంతా తప్పు, నేను చెప్పింది వీళ్లు వినరు ఎందుకు అనే ఆలోచన ఉంటుంది. మరొకవైపు ఎదురుచెప్పలేని పరిస్థితి ఉంటుంది.  మనసులో భయం,  ఏదైనా ఎదురు చెబితే తనతో మాట్లాడరేమో,  తన మీద కోపం చేసుకుంటారేమో.. ఇలాంటి భయాలు మనసులో ఉంటాయి.  ఇలా ఉంటే అందరూ ఆ వ్యక్తి మీద ఆధిపత్యం చెలాయిస్తారు. అన్ని విదాలుగా వ్యక్తిని అణిచివేయాలని చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితి నుండి ఎలా బయటపడాలి. తెలుసుకుంటే.. చాలా మంది తమ భావాలకు, అవసరాలకు విలువ ఇవ్వని వాతావరణంలో పెరుగుతారు. ఒక పిల్లవాడు ఏడిస్తే, "నోరు మూసుకో, ధైర్యంగా ఉండు" అని అంటారు. ఒక పిల్లవాడు ఏదైనా అడిగితే, "వద్దు అని చెప్పడం లేదా ఎప్పుడూ చూడని వాడిలా ప్రవర్తిస్తావ్ " అని ఎగతాళి చేస్తారు. లేదా ఒక పిల్లవాడు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే "పెద్దలతో వాదించకు" అని వాళ్ళను సైలెంట్ చేస్తారు. పిల్లలు చాలా తెలివైనవారు.   వాతావరణానికి త్వరగా అనుగుణంగా మారడం నేర్చుకుంటారు. అటువంటి వాతావరణంలో పెరుగుతున్న పిల్లవాడు తమ భావాలను,  అవసరాలను వ్యక్తపరచడానికి తగిన వాతావరణం లేదని కూడా తెలుసుకుంటారు. అయితే పెద్దవాళ్లు మాత్రం  వారిని అర్థం చేసుకోవడానికి  బదులుగా తిడతారు. తత్ఫలితంగా పిల్లలు తమ భావోద్వేగాలను, కోరికలను,  బాధను అణచివేయడం మొదలుపెడతారు. అయితే బాల్యంలో జరిగే ఈ పరిస్తితులు పెద్ద అయ్యాక ప్రవర్తనా విధానాలుగా మారతాయని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. ఇలాంటి ప్రవర్తన పెద్దయ్యాక శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. పిల్లలను అణిచివేయడం వల్ల కలిగే ప్రభావాలు..  ఆత్మగౌరవం కోల్పోతారు.. తన భావాలు లేదా అవసరాలు ముఖ్యమైనవి కాదని పిల్లలు అనుకుంటే తమను తాము తక్కువగా చూసుకునే అవకాశం ఉంటుంది. వాళ్లకు  ఆత్మగౌరవం ఉండదు. ఆత్మగౌరవం తక్కువగా ఉన్నవారు ఇతరుల నియంత్రణలోకి వెళ్లే అవకాసం ఎక్కువగా ఉంటుంది. భయం,  సంకోచం.. తమకు ఏం కావాలి అనే విషయాలను  వ్యక్తపరచలేని పిల్లలు తరచుగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా సంబంధాలలో తమ అభిప్రాయాలను  వ్యక్తపరచడానికి వెనుకాడతారు. అవతలి వ్యక్తి కోపంగా ఉంటాడనో లేదా తమ నుండి దూరం అవుతాడనో వారు భయపడతారు. చాలా చిన్న విషయాలకు కూడా భయపడుతూ చాలా ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తాయి.  ఈ కారణాల వల్ల ఎప్పుడూ ఎదుటివారి కోసం సర్థుకుపోతూ ఉంటారు. కోపం పెరుగుతుంది  మనసులో ఉన్న ఎమోషన్స్ ను  నిశ్శబ్దంగా భరించే అలవాటు  ఉంటే ఆ అలవాటు తర్వాత కోపం లేదా చిరాకుగా వ్యక్తమవుతుంది. మనం మన భావోద్వేగాలను ఎక్కువసేపు అణిచివేసినప్పుడు, అవి లోపల పేరుకుపోతాయి.  తరువాత అనారోగ్యకరమైన మార్గాల్లో వ్యక్తమవుతాయి. సంబంధాలలో అసమానత.. ఇతరులను సంతోషపెట్టడంలో ఎప్పుడూ తమను తాము కోల్పోతారు.  అంతేకాదు.. తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటారు. ఇంత చేసినా సంబంధాలలో సమానత్వం మాత్రం ఏ కోశానా కనిపించదు. మానసిక ఆరోగ్యంపై ప్రభావం.. ఎప్పుడూ ఇతరుల చేతుల్లో అణిచివేడబడే వారు  ఒత్తిడిగా ఫీలవుతారు.  ఎప్పుడూ  అసంతృప్తి నిరాశ, ఆందోళన,  నిద్ర భంగం, తలనొప్పి, రక్తపోటు మొదలైన శారీరక రుగ్మతలకు కూడా దారితీయవచ్చు. దీన్నుండి ఎలా బయటపడాలి.. ఒకరు తమ మీద ఆధిపత్యం చేయడం, అణిచివేయడం చేస్తుంటే.. దాన్నుండి బయట పడటానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి. తమకు కొన్ని కోరికలు ఉన్నాయని, భావాలు, అబిప్రాయాలు ఉన్నాయని.. వాటిని చిన్న విషయాల ఆధారంగా వ్యక్తపరచాలి. ముఖ్యంగా తమ భావాలను బయటి వ్యక్తుల నుండి మొదలుపెట్టడం మంచిది.  స్నేహితులు, ఆఫీసులో కొలీగ్స్, తెలిసిన వ్యక్తులు.. ఇట్లా వీళ్ల దగ్గర మెల్లిగా ఓపెన్ అయ్యి మొహమాటానికి అన్నిటికి తల ఊపకుండా తన అబిప్రాయాన్ని,  నిర్ణయాన్ని చెప్పేయాలని. ఇది ఆత్మవిశ్వాసం పెంచుతుంది. నచ్చని విషయాలు, లేదా తనకు తెలియని విషయాల దగ్గర నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా బలవంతం చేయడం లేదా కోప్పడటం లాంటివి చేస్తే "నాకు చేయాలని అనిపించడం లేదు, నాకు ఇప్పుడు చేసే ఉద్దేశం లేదు" లాంటి వాక్యాలతో చాలా గౌరవంగా సమాధానం చెప్పాలి. ఇలా చెబుతున్నప్పుడు మొదట్లో భయంగా ఉంటుంది. అంతే కాదు.. దీనివల్ల చుట్టూ ఉండే పేక్ స్నేహాలు,  అవసరం కోసం మాత్రమే చుట్టూ తిరిగే వ్యక్తులు కాస్త దూరం జరిగే అవకాశం ఉంటుంది. కానీ..అలాంటి వాళ్లు దూరం జరిగినందుకు సంతోషపడి సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. ఇలా చేస్తే వ్యక్తిత్వాన్ని మళ్లీ బిల్డ్ చేసుకోవచ్చు.                                       *రూపశ్రీ.

భర్తతో ఎప్పుడూ గొడవలేనా? ఈ చిట్కాలతో బంధం పదిలం..!

జీవితంలో భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది. అలాగే కీలకమైనది కూడా.  ఇరువురి జీవితాలను మలుపు తిప్పేది వివాహ బంధమే.. అయితే.. భార్యాభర్తల బందం ముడిపడినంత సులువుగా నిలబడదు.  ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి.  ఎన్ని సమస్యలు వచ్చినా బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. అయితే అసలు గొడవలు లేకపోతే బంధం పదిలంగా ఉంటుంది కదా.. చాలా వరకు భార్యాభర్తల బంధంలో గొడవలు వస్తూ ఉంటాయి.  భర్తతో పదే పదే గొడవలు జరుగుతున్నాయని భార్యలు వాపోతుంటారు.  ఈ గొడవలు తారాస్థాయికి చేరితే బంధమే ప్రశ్నార్థకమవుతుంది.  అయితే ఎప్పుడూ భర్తతో గొడవలు జరుగుతున్న వారికి కొన్ని చిట్కాలు చెబుతున్నారు రిలేషన్షిప్ నిపుణులు. వారు చెప్పిన చిట్కాలు పాటిస్తే భార్యాభర్తల బందం పదిలంగా ఉంటుందట. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రశాంతంగా మాట్లాడాలి..  కోపంగా మాట్లాడటం మానుకోవాలి ప్రశాంతంగా మాట్లాడాలి.గొడవ సమయంలో వెంటనే రియాక్ట్ కాకూడదు.  దీని  వల్ల సంబంధం మరింత క్లిష్టమవుతుంది. లోతైన శ్వాస తీసుకోవాలి.  గొడవ జరిగేటప్పుడు, గొడవ జరిగిన వెంటనే కూడా  ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయాలి.  ఆ తరువాతే సమస్య గురించి  చర్చించాలి. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవాలి.. ఒకరు చెప్పేది ఒకరు వినడం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  గొడవలు జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాలి తప్పదు అనే పిచ్చి లాజిక్ లు పెట్టుకుని వెంటనే ఏదో ఒకటి మాట్లాడటానికి  ప్రయత్నించవద్దు. గొడవలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ల వెర్షన్ లోనే మాట్లాడుతూ ఉంటారు.  ఈ కారణంగానే బంధాలు విఫలం అవుతాయి.  అందుకే గొడవలు జరిగినప్పుడు భాగస్వామి బావాలు, తన అభిప్రాయాలు,  ఉద్దేశ్యాలు అన్నీ అర్థం చేసుకోవడం ముఖ్యం. సమయం.. భార్యాభర్తలు ఇద్దరూ బంధం బలంగా ఉండాలన్నా,  వారిద్దరూ సంతోషంగా ఉండాలన్నా నాణ్యమైన సమయాన్ని గడపాలి.  ఇలా చేయడం వల్ల  సంబంధానికి కొత్త ఉత్సాహం వస్తుంది. పని , బాధ్యతలతో నిమగ్నమై ఉండటం వల్ల సంబంధంలో దూరం పెరుగుతుంది.  భాగస్వామితో సమయం గడపాలి,మాట్లాడాలి,నవ్వాలి, అట్లాగే.. ఆనందించాలి. సమస్యలు, పరిష్కారం..  సంబంధాన్ని సమస్యగా చూస్తే అది చాలా భారంగా, అలాగే మనుషులు అనవసరమైన వాళ్లుగా అనిపిస్తారు.  అందుకే ఎప్పుడు కూడా భార్యాభర్తలు తమ బంధాన్ని సమస్యగా చూడకూడదు. ఏదైనా సమస్య వస్తే దానికి  పరిష్కారం వెతకాలి.   వివాదాలు సమస్యల వల్లే వస్తాయి. సమస్య వచ్చినప్పుడు గొడవ పడటం కాదు.. ఇద్దరూ కలిసి సమస్యను చర్చించి దానికి పరిష్కారాన్ని వెతుక్కోవాలి.  ఒకరిని ఒకరు నిందించుకోకూడదు. క్షమాపణ ముఖ్యమే..  చిన్న చిన్న గొడవలకు క్షమాపణ అడగడం అస్సలు తప్పు కాదు.   ప్రతి సంబంధంలోనూ అపార్థాలు వస్తుంటాయి. క్షమాపణ చెప్పడం వల్ల హృదయం తేలిక అవుతుంది. ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచడానికి సహాయపడుతుంది. అవగాహన.. ఇద్దరి మధ్య కేవలం ప్రేమ ఉంటే సరిపోదు.. అవగాహన కూడా ఉండాలి. ప్రేమ , అవగాహనతో బంధాన్ని బలంగా మార్చుకోవాలి. చిన్న చిన్న సంతోషాలు క్రియేట్ చేసుకోవాలి. ప్రేమగా మాట్లాడటం, సర్ప్రైజ్ చేయడం,  చిన్న బహుమతులు ఇవ్వడం.. ఇవన్నీ పాజిటివ్ గా ఆలోచించి పాటిస్తే సాధ్యమే. వీటి వల్ల గొడవలు వచ్చినా తేలిపోతాయి.                                 *రూపశ్రీ.

లవ్ బ్రేకప్ తర్వాత బాధ నుండి బయటపడే మార్గాలు తెలుసుకోండి..!

  ప్రేమ.. రెండక్షరాల పదం.. రెండు మనసుల కలయిక.  అయితే మనసులు కలిసినట్టు మనుషులు ఉండలేరు. మనుషుల పంథా వేరు.. మనసుల పంథా వేరు.. మనసు కావాలని అడిగింది మనిషికి కష్టంగా అనిపించవచ్చు. మనసు బాగుందని చెప్పింది.. మనిషికి బాలేదు అనిపించవచ్చు.  ముఖ్యంగా ఇద్దరు వేర్వేరు మనుషులు ప్రేమ మొదలైనప్పుడు అన్నింటిని పక్కన పెట్టేస్తారు.. కానీ ఇద్దరూ ఒకరికొకరు అలవాటు అయిపోయాక.. ఇద్దరిలో తప్పులు,  లోపాలు,  సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఈ కారణాల వల్ల జరిగేదే బ్రేకప్..  లవ్ బ్రేకప్ ఈ కాలంలో చాలా సాధారణం అయిపోయింది. కానీ అది ప్రతి మనిషికి చెప్పలేనంత బాధను పరిచయం చేస్తుంది. ప్రేమలో మోసపోవడం లేదా ప్రేమ వైఫల్యం.. వీటి వల్ల మనసు అనుభవించే నరకం అంతా ఇంతా కాదు.. కొందరైతే రోజులు, నెలలు, ఏళ్లకేళ్లుగా బాధలో మునిగిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తు అంటూ ఏమీ లేకుండా చేసుకుంటారు.  ప్రేమలో వైఫల్యం ఎదురైనా,  ప్రేమలో మోసపోయినా దాన్నుండి బయటకు రావాలి.  అప్పుడే భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. అంగీకారం.. ప్రేమలో మోసపోయినప్పుడు లేదా ప్రేమలో వైఫల్యం ఎదురైనప్పుడు కోపం , విచారం,నిరాశ వంటి భావోద్వేగాలు సహజం. వాటిని అణచివేయడానికి ప్రయత్నించే బదులు, వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి.  ఏడుపు వస్తే  ఏడవడం, మనసులో ఏం అనిపిస్తే అది రాసుకోవడం లేదా నమ్మకమైన స్నేహితులతో మాట్లాడటం వల్ల  తేలికగా అనిపించవచ్చు. మనసులోని బరువు తగ్గడం వల్ల ప్రేమ చేసిన గాయం నుండి కోలుకోవడం కాస్త సులువు అవుతుంది. సమయం.. ప్రేమలో వైఫల్యం ఎదురవడం లేదా మోసపోవడం వంటివి జరిగినప్పుడు దాన్నుండి బయట పడటానికి సమయం పడుతుంది.  అంతేకాదు.. దీన్నుండి బయట పడాలంటే తమకు తాము సమయం కేటాయించుకోవాలి. సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. జరిగిన బాధాకర సంఘటన నుండి బయట పడటానికి చాలామంది కొత్త స్నేహం, కొత్త పరిచయం, కొత్త ప్రేమ ఎంచుకుంటారు. అయితే ఇది చాలా తప్పు. లవ్ బ్రేకప్ నుండి కలిగే బాధను అధిగమించడానకి తన మీద తాను దృష్టి పెట్టి తనను తాను డవలప్ చేసుకోవడం చాలా మంచి మార్గం.  అనుకున్న లక్ష్యాలు,  కన్న కలలు,  అభిరుచులు, ఆసక్తులు.. ఇలా.. అన్నింటిని నిజం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. దీని వల్ల రెండు లాభాలు ఉంటాయి.  ఒకటి ప్రేమ గాయాన్ని మరచిపోవచ్చు.. రెండవది అనుకున్న లక్ష్యాలు,  కలలు నేరవేర్చుకోవడం వల్ల  మనోధైర్యం పెరుగుతుంది.  జీవితంలో ఏదైనా సాధించగలం అనే నమ్మకం పోగవుతుంది. సోషల్ మీడియాకు దూరం.. సోషల్ మీడియా చాలా వరకు దూరమైన ప్రియురాలిని లేదా ప్రియుడిని గుర్తు చేస్తూ ఉంటుంది. లవ్ బ్రేకప్ నుండి బయట పడాలంటే దానికి  సోషల్ మీడియా నుండి కొంతకాలం విరామం తీసుకోవడం మంచి మార్గం. డిజిటల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.  ఇది  మనస్సును క్లియర్ చేసుకోవడానికి , మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తుంది. సెల్ఫ్ లవ్.. ప్రేమలో  మోసపోయినప్పుడు చాలామంది చేసే పని తమను తాము  నిందించుకోవడం.  కానీ వేరొకరి తప్పుడు నిర్ణయం వల్ల జరిగిన సంఘటనకు తమ విలువను తాము ఎప్పుడూ తగ్గించుకోకూడదు.  ఎదుటి వారు చేసిన తప్పు వల్ల తమ విలువ తగ్గదని కూడా గుర్తుంచుకోవాలి.  తనను తాను ప్రేమించుకోవడం, తన బలాలను గుర్తించడం, తనను తాను మెచ్చుకోవడం, తన గెలుపులను గుర్తు చేసుకోవడం.. ఇవన్నీ కూడా తన మీద తనకు ప్రేమ పెరిగేలా చేస్తాయి. కొత్త ప్రారంభాలు.. పైన చెప్పుకున్నట్టు అన్నీ పాటిస్తూ ఉంటే.. కాలక్రమేణా బాధ తగ్గడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే బాధ తగ్గుతుందో.. అప్పుడు కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి.  ఆ ప్రారంభానికి సిద్ధం కావాలి.కొత్త స్నేహితులను ఎంచుకోవడం, కొత్త కార్యకలాపాల్లో పాల్గొనడం. జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేయడం,  జీవితంలో మరింత ఎదగడానకి ప్రణాళికలు వేసుకోవడం, ఎప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నించడం.. ఇవన్నీ ఉంటే..  కొత్త ప్రారంభాలు  కొత్త అనుభవాలను , ఆనందాన్ని తెస్తాయి.                             *రూపశ్రీ.

ఆయుధ పూజ ఎందుకు నిర్వహిస్తారు? దీని ప్రాముఖ్యత ఏంటి..

నవరాత్రి వేడుకలలో ఆయుధ పూజ  చాలా ముఖ్యమైనది.  దీన్నే అస్త్ర పూజ అని కూడా పిలుస్తారు.  ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో నవరాత్రి నవమి తిథి నాడు జరుపుకునే ప్రముఖ పండుగ ఆయుధ పూజ. 2025 లో ఆయుధ పూజ అక్టోబర్ 1 బుధవారం నాడు వచ్చింది. ఈ పండుగను కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,  కేరళలో విస్తృతంగా జరుపుకుంటారు. సాంప్రదాయకంగా ఆయుధాలను పూజించడానికి ఈ రోజు చాలా ముఖ్యమైనది.  పనిముట్లు, యంత్రాలు, వాహనాలు, పుస్తకాలు,  ల్యాప్‌టాప్‌ల వంటి ఆధునిక పరికరాలకు కూడా ఆయుధ పూజ వర్తిస్తుంది. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో విశ్వకర్మ పూజ మాదిరిగానే ఆయుధ పూజ మనిషిలో నైపుణ్యాలు, కొత్త వస్తువుల  ఆవిష్కరణ,  మానవ జీవితానికి  సహాయపడే సాధనాలను గౌరవించడానికి ఒక వేదికగా మారుతుంది. ఆయుధ పూజ ప్రాముఖ్యత.. ఆయుధ పూజ అనేది  కేవలం ఒక సంప్రదాయం కాదు.. దీని వెనుక  లోతైన సాంస్కృతిక,  ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఈ రోజున అందరూ తమ పనిముట్లను భక్తితో, గౌరవంగా చూస్తారు. తమ పనిముట్లకు కృతజ్ఞత తెల్పుకునే సమయం ఇది. గృహోపకరణాల నుండి పారిశ్రామిక యంత్రాల వరకు ప్రతి వస్తువును  పురోగతికి సాధనంగా చూస్తారు. ఆయుధ పూజ సమయంలో పనిముట్లు,  ఆయుధాలను పూజించడం వలన జ్ఞానం, సృజనాత్మకత, శ్రేయస్సు,  విజయం,  ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు.. తమ జీవితానికి ఆయుధాలు దైవస్వరూపాలుగా భావించడం జరుగుతుంది. దుర్గాదేవి ఆశీర్వాదం.. నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది రోజులు మహిషాసురుడితో పోరాడింది.  ఎంత పోరాడినా ఆ రాక్షసుడు మరణించకపోవడంతో దేవతలందరూ తమ తమ ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు. ఈ ఆయుధాలతో దుర్గాదేవి మహిషాసురుడిని వధించింది.  తనకు ఎంతో సహాయం చేసిన ఆయుధాలకు ఆ అమ్మవారు తన ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కారణంగా తాము ఉపయోగించే ఆయుధాలు,  పనిముట్లను ఆయుధ పూజ రోజు పూజించడం,  గౌరవించడం చేస్తున్నారు.                                      *రూపశ్రీ.

భార్యాభర్తల బంధం బాగుండటానికి సాక్షాత్తు సీతారాములు చెప్పిన సలహాలు ఇవి..!

భారతీయ సంస్కృతిలో సీతారాముల వివాహం అయినా, వారి బందం అయినా కేవలం ఒక మతపరమైన సంఘటన మాత్రమే కాదు, ఆదర్శవంతమైన వైవాహిక జీవితానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. రాముడు,  సీత మధ్య సంబంధం త్యాగం, నమ్మకం, గౌరవం,  అంకితభావం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నేటికీ సంబంధాలను బలోపేతం చేయడానికి మూలంగా నిలుస్తుంది. నేటికాలంలో విభేదాలు,  స్వార్థం కారణంగా సంబంధాలు తరచుగా బలహీనపడతాయి. సీతారాముల  వైవాహిక జీవితం ప్రేమ,  నమ్మకంతో ప్రతి సవాలును ఎదుర్కోవచ్చని  బోధిస్తుంది. బంధం బలంగా ఉండటానికి సీతారాములు చెప్పిన సలహాలు.. నమ్మకమే పునాది.. రాముడు,  సీత ఒకరికొకరు  నమ్మకాన్ని ఇచ్చుకున్నారు. రాముడితో పాటు వనవాసానికి వెళ్లడానికి సీత ముందుకువచ్చింది. అడవిలో అయినా సరే తన భర్త తనకు రక్షణ ఇవ్వగలడని సీతమ్మ నమ్మింది.  రాముడు తన భార్య గౌరవం,  భద్రతను అన్ని పరిస్థితులలోనూ చూసుకున్నాడు. కష్టాలలో కూడా కలిసి ఉండటం.. సీతారాముడి జీవితాలు పోరాటాలతో నిండి ఉన్నాయి. వనవాసానికి వెళ్లడం, యుద్ధం, అగ్ని పరీక్షలు అనుభవించారు. కానీ ఏ కష్టం వచ్చినా ఒకరిని ఒకరు వదులుకోవాలని అనుకోలేదు. కష్ట సమయాల్లో ఒకరికొకరు మద్దతుగా ఉండటం  గొప్ప బలం అని వారు చెప్పకనే చెప్పారు. సంబంధంలో గౌరవం.. రాముడిని మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు.  కుటుంబం, సమాజం,  మతం  పరిమితులను ఎప్పుడూ పాటించాలని అనుకున్నాడు. క్రమశిక్షణ,  మర్యాదలకు కట్టుబడి ఉన్నప్పుడే సంబంధాలు విజయవంతమవుతాయని తన జీవితం ద్వారా నిరూపించాడు. త్యాగం, అంకితభావం.. సీతమ్మ తల్లి తన సొంత సుఖాలను త్యాగం చేసి రాముడితో వనవాసాన్ని ఇష్టపూర్వకంగా ఎంచుకుంది. సీతమ్మను వనవాసానికి వెళ్లమని ఎవరూ బలవంతం చేయలేదు.   ఈ త్యాగం ఇప్పటికీ  సంబంధాలు స్వార్థం మీద కాదు, నిస్వార్థత మీద నిలబడి ఉంటాయని బోధిస్తుంది. ప్రాధాన్యత.. రాముడు,  సీత ఒకరి కోరికలను, భావాలను పరస్పరం గౌరవించుకున్నారు. దీర్ఘకాలిక సంబంధానికి పరస్పర గౌరవం చాలా ముఖ్యం. సీత  రాముడి గౌరవార్థం  రాజభవనాన్ని విడిచిపెడితే.. రాముడు రాజు అయినప్పటికీ సీతమ్మ తల్లి కోసం రావణుడితో యుద్దమే చేశాడు. సీతమ్మ కోసం తానే నేరుగా లంకకు వెళ్ళాడు.                               *రూపశ్రీ.