మహిళా న్యాయమూర్తులకు న్యాయం ఎక్కడ?

చట్టం సమాజంలో, దేశంలో ప్రతి పౌరుడికి కొండంత భరోసా ఇస్తుంది. పౌరులందరికి సమన్యాయం చేసేది చట్టమే. అయితే ఆ చట్టం సరైన విధంగా ఉంటేనే ఆ సమన్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో సమన్యాయం అనే మాట కాసింత చర్చలకు దారి తీస్తుంది.  ముఖ్యంగా లింగ సమానత్వం అనే విషయం మీద ఎప్పుడూ సమాజంలో ఏదో ఒక చర్చ,  అభిప్రాయం పుట్టుకొస్తూనే ఉంటుంది.  పదుగురికి న్యాయం అందించే న్యాయ సేవ విభాగంలో మహిళలు కూడా ప్రవేశించి,  న్యాయ దేవతలకు ప్రతి రూపంగా నిలుస్తున్నారు.  న్యాయ సేవలో మహిళల పాత్రను,  ఆవశ్యకతను గుర్తు చేస్తూ.. మహిళలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 10 వ తేదీన  అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం జరుపుకుంటారు. చట్టం గురించి  అద్భుతమైన విషయం ఏమిటంటే అది న్యాయంగా ఉండాలి. న్యాయం గుడ్డిది, పక్షపాతంతో  లేనిది,  అందరికీ సమానంగా ఇవ్వబడుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. అయినప్పటికీ భారతదేశ న్యాయవ్యవస్థను  పరిశీలిస్తే ఒక విచిత్రమైన విషయాన్ని గమనించవచ్చు. న్యాయం గుడ్డిది కావచ్చు, కానీ అది చాలా స్పష్టంగా ఒక రూపంలో న్యాయాన్ని వ్యక్తం చేస్తుంది.  న్యాయం అనగానే చాలా మందికి నల్లకోటు, టై ధరించిన లాయర్ ఏ గుర్తుకువస్తాడు. ప్రతి సంవత్సరం మార్చి 10న  ప్రపంచం అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళలు చట్టాన్ని  అర్థం చేసుకోగలరని న్యాయ సేవలో భాగం కాగలరని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ దినోత్సవాన్ని 2021లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్థాపించింది.  మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2022లో జరుపుకున్నారు. న్యాయవ్యవస్థలో మహిళల సహకారాన్ని  గుర్తు చేసుకోవడానికి, న్యాయపరమైన పాత్రలను కొనసాగించడానికి ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహించడానికి దీనిని ప్రవేశపెట్టారు.  ఖతార్ రాష్ట్రంలో సాంప్రదాయకంగా లింగ సమానత్వం లేదు. కానీ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశ్యంతో దినోత్సవాన్ని ఖతార్ రాష్ట్రం రూపొందించిందని అంటున్నారు. సమన్యాయం ? భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటి.  అపారమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. అయినప్పటికీ భారతదేశ హైకోర్టులలో సిట్టింగ్ జడ్జిలలో కేవలం 14% మాత్రమే మహిళలు ఉన్నారు . ఇది గత సంవత్సరాలతో పోలిస్తే (2023లో 13%,  2022లో 11%) మెరుగుదల. కానీ, సూటిగా చెప్పాలంటే, ఇది కొద్ది శాతం మాత్రమే మెరుగైనది.  ప్రస్తుతం భారతదేశంలోని 754 హైకోర్టు న్యాయమూర్తులలో, కేవలం 106 మంది మహిళలు మాత్రమే ఉన్నారు . ఒక మహిళా న్యాయమూర్తి సగటు పదవీకాలం 4.5 సంవత్సరాలు . అంటే అన్ని న్యాయమూర్తుల మొత్తం సగటు కంటే ఒక సంవత్సరం తక్కువ.  ఇది  ఆందోళ కలిగించే అంశం . ఎందుకిలా అనే ఆలోచన వస్తే.. మహిళలకు న్యాయ విభాగంలో సరైన చోటు ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. కొన్ని హైకోర్టులు బాగానే పనిచేస్తున్నాయి. ఉదాహరణకు పంజాబ్ & హర్యానాలో 14 మంది మహిళా న్యాయమూర్తులు , మద్రాసులో 12 మంది, బొంబాయిలో 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఢిల్లీలో 9 మంది ఉన్నారు, దేశ రాజధానితో పోలిస్తే ఇది  తక్కువే. ఇతర ప్రాంతాలలో అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాలలో మహిళా న్యాయమూర్తులు లేరు.  సిక్కిం, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, ఇతరు రాష్ట్రాలలో కేవలం ఒకరే ఉన్నారు. . జమ్మూ & కాశ్మీర్, లడఖ్ లలో ఇద్దరు.. ఇది కేవలం  నెంబర్స్ లెక్కపెట్టడంలో తమాషా చూడటం లా చాలా మందికి అనిపిస్తుందేమో..  కానీ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయిలలో మహిళలు లేరని చెప్పడానికి నిదర్శనం.  చట్టపరమైన నిర్ణయాలకు పురుషులు ఎక్కువగా బాధ్యత వహించడంలో సమస్య ఏమిటంటే, వారు ఎక్కువగా పురుషాధిక్య తీర్పులను తీసుకుంటారు. ఇది  దురుద్దేశంతో కాదు కానీ అలవాటు, పక్షపాతం,  చట్టపరమైన చరిత్ర అనే ఒక వాక్యాన్ని చూపి మహిళలను చిన్న సహాయక పాత్రలుగా మలిచేస్తున్నారు. మహిళా న్యాయమూర్తులు ఎందుకు చాలా తక్కువ మంది ఉన్నారని  అడిగితే అనేక రకాల నమ్మశక్యం కాని సమాధానాలు లభిస్తాయి.. మహిళలు తగినంత అర్హత కలిగి ఉండరని చాలా మంది అంటారు. కానీ చాలా  లా స్కూల్స్‌లో మహిళలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు, తరచుగా వారి తరగతిలో అగ్రస్థానంలో పట్టభద్రులవుతారు. సమస్య సామర్థ్యం కాదు అవకాశం లేకపోవడం.  మహిళలకు న్యాయ విభాగంలో తగినంత అవకాశాలు ఇవ్వరు. న్యాయమూర్తి పదవికి మహిళలు దరఖాస్తు చేయరని కొందరు అంటారు. కానీ..  మహిళలు దరఖాస్తు చేయకపోవడం నిజమేనట.. ఎందుకంటే  అవి లభించవని మహిళలకు  తెలుసట. న్యాయ నియామకాలను కొలీజియంలు (ముఖ్యంగా, కొత్త నియామకాలను సిఫార్సు చేసే సీనియర్ న్యాయమూర్తుల చిన్న సమూహాలు) నిర్ణయిస్తాయి. ఈ సమూహాలు చారిత్రాత్మకంగా పూర్తిగా పురుషులతో కూడుకున్నవి, అంటే వారు సహజంగానే ఎక్కువ మంది పురుషులను ప్రోత్సహించడం వైపు మొగ్గు చూపుతారు. న్యాయవాద వృత్తికి సమయం ఎక్కువ కేటాయించాలని చెబుతారు.  కానీ అది నిజం కాదు.. మహిళలు వంటగదిలో ఉండటమే మంచిది అనే ఒక మూర్ఖత్వపు ఆలోచన చాలామందిలో ఉండిపోయింది.  ఇలా మహిళలకు చాలా విధాలుగా న్యాయ విభాగంలో అడ్డుగోడలు ఉన్నాయి.  మహిళలు ఈ విభాగంలో రాణించాలంటే అందరి తోడ్పాటు, ప్రోత్సాహం తప్పకుండా లభించాలి.   అప్పుడే  న్యాయ దేవతలాగా, మహిళా న్యాయ మూర్తులు న్యాయాన్ని త్రాసులో సమంగా తూచగలుగుతారు.                                      *రూపశ్రీ.

మహిళలు అభివృద్ది చెందుతూ ఉంటే.. దేశమూ ఎదుగుతూ ఉంటుంది..!

  ఆడవారిని ప్రకృతిలా భావిస్తారు.  శక్తిగా పూజిస్తారు.  అలాంటి ఆడవారి గౌరవార్థం, వారికి ప్రత్యేక గుర్తింపు,  వారి హక్కులు,  వారి లక్ష్యాలు, వారి కలల గురించి ప్రోత్సాహం ఇచ్చేందుకు.. ఇలా ఎన్నో అంశాలు దృష్టిలో ఉంచుకుని మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.  ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాలలో మహిళల విజయాలను, ప్రయత్నాలను గౌరవించడానికి ఒక ప్రపంచ వేదికగా పనిచేస్తుంది. 2025 సంవత్సరానికి " మహిళలు,  బాలికలకు హక్కులు. సమానత్వం. సాధికారత" అనే థీమ్ ప్రముఖంగా నిలిచింది.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే.. మహిళా దినోత్సవం..  బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ (1995) ను స్వీకరించినప్పటి నుండి లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి  మహిళాదినోత్సవానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ వార్షికోత్సవం చట్టపరమైన సంస్కరణలు, ఆర్థిక విషయాలు, సామాజిక సమానత్వం,  లింగ వివక్షతలకు వ్యతిరేకంగా పోరాటంలో సాధించిన పురోగతిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. భారతదేశంలో.. భారతదేశం మహిళా కేంద్రీకృత అభివృద్ధి నుండి మహిళలు చురుకుగా పురోగతిని నడిపించే  వైపు దృష్టి సారిస్తోంది. ఈ పరివర్తన విధాన చట్రాలు, శాసన పురోగతులు,  విద్య, ఆర్థిక సంస్కరణలు,  నాయకత్వాన్ని ప్రోత్సహించే అట్టడుగు స్థాయి నుండి తీసుకునే చొరవలో కనిపిస్తుంది. 2025 మహిళాదినోత్సవానికి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలు తమ విజయగాథలను నమో యాప్ ఓపెన్ ఫోరమ్ ద్వారా పంచుకోవాలని ప్రోత్సహించారు . మార్చి 8న వారి విజయాలను ప్రేరేపించే, ప్రదర్శించే వేదికను అందించారు. లింగ సమానత్వం.. చట్టాలు.. అంతర్జాతీయంగా లింగ సమానత్వాన్ని సాధించడానికి వివిధ చట్టాలను ప్రపంచ వ్యాప్తంగా చేసిన ఏర్పాటులో భారతదేశం కూడా ప్రముఖంగా ఉంది. *మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (1948) *మహిళలపై అన్ని రకాల వివక్షత నిర్మూలనపై సమావేశం (CEDAW), 1979 *బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ (1995) *UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎజెండా 2030) మహిళా సాధికారతకు ప్రభుత్వ చట్టాలు.. విద్యా హక్కు చట్టం, 2009:  ఉచిత,  తప్పనిసరి విద్య రెండూ హామీ ఇవ్వబడ్డాయి. బేటీ బచావో బేటీ పడావో (BBBP): బాలికల విద్యను పెంపొందించడానికి, బాల-లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి చొరవలు కీలకమైనవి. సమగ్ర శిక్షా అభియాన్: ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను పెంపొందించడం, సమానత్వం,  నాణ్యమైన అభ్యాసాన్ని నిర్ధారించడం. జాతీయ విద్యా విధానం (NEP) 2020: రాజ్యాంగ విలువల ప్రకారం న్యాయమైన, సమ్మిళితమైన,  వైవిధ్యమైన సమాజాన్ని నిర్మించడంలో సహాయపడే బాధ్యతాయుతమైన,  చురుకైన పౌరులను తయారు చేయడం దీని లక్ష్యం. భారతదేశంలో మహిళా ఆరోగ్య విజయాలు.. భారతదేశంలో ప్రసూతి మరణాల రేటు ఎక్కువగా ఉండేది. అయితే 2014-16,  2018-20 మధ్య ప్రసూతి మరణాల రేటు (MMR) వరుసగా 130 నుండి 97కి తగ్గింది .  5 సంవత్సరాలలోపు పిల్లల మరణాల రేటు (U5MR) 2015లో 43 నుండి 2020లో 32కి పడిపోయింది . మహిళల ఆయుర్దాయం 71.4 సంవత్సరాలకు (2016-20) పెరిగింది, 2031-36 నాటికి అంచనాలు 74.7 సంవత్సరాలకు చేరుకుంటాయని అంటున్నారు. ఆర్థిక సాధికారత & ఆర్థిక చేరిక మహిళల స్వాతంత్య్రాన్ని,  భద్రతను కల్పించడంలో ఆర్థిక స్వయం ప్రతిపత్తి కీలక పాత్ర పోషిస్తుంది. భారత శ్రామిక శక్తిలో మహిళలు.. భారతదేశంలో మహిళలు ఇప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో చేరడానికి, పోరాట పాత్రలను పోషించడానికి,  భారత సాయుధ దళాలలో భాగంగా సైనిక్ పాఠశాలల్లో చేరడానికి అవకాశం కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 5% మంది పైలట్లతో పోలిస్తే, భారతదేశంలో 15% మంది మహిళలు ఉన్నారు. స్టార్టప్‌లలో మహిళలను ప్రోత్సహించడానికి SIDBI నిధులలో 10% మహిళలు నేతృత్వంలోని సంస్థలకు కేటాయించబడ్డాయి.                                    *రూపశ్రీ.

వరకట్నానికి వ్యతిరేకంగా... ఓ తల్లి పోరాటం!

1979- శశిబాల ఒక అందమైన 20 ఏళ్ల యువతి. దిల్లీలోని ప్రఖ్యత లక్ష్మీబాయ్‌ కాలేజి నుంచి డిగ్రీని కూడా సాధించింది. శశిబాలకు పది నెలల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు తను ఆర్నెళ్ల గర్భవతి కూడా! బయట నుంచి చూసేవారికి ఇదంతా ఓ అందమైన జీవితం తాలూకు వర్ణనగా తోచవచ్చు. కానీ శశిబాల వ్యక్తిగత జీవితం ఆ చిత్రానికి తలకిందులుగా కనిపిస్తుంది. పెళ్లయిన దగ్గర్నుంచి శశిబాల అత్తమామలు కట్నం కింద ఏదోఒక వస్తువుని తీసుకురమ్మంటూ గొడవచేస్తూనే ఉన్నారు. శశిబాల తన తల్లి సత్యరాణి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ, తల్లీకూతుళ్లు వారి కోరికను ఎలా తీర్చాలా అని మదన పడుతూనే ఉన్నారు. సత్యరాణి వితంతువు, పైగా శశిబాలతో పాటు ఆమె మీద మరికొందరి బిడ్డల భారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఓ రోజు సత్యరాణికి, శశిబాల అత్తగారింటి నుంచి వెంటనే రమ్మంటూ కబురు వచ్చింది.     పరుగుపరుగున వెళ్లిన ఆమెకు తన బంగారు కూతురు నల్లటి ముద్దగా ఓ మూల కనిపించింది. ‘నీ కూతురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ చెత్తని ఇక్కడి నుంచి పట్టుకుపో!’ అన్నారు శశిబాల అత్తగారు. కూతురి శవాన్ని కప్పేందుకు వాళ్లు ఒక దుప్పటిని అందించేందుకు కూడా సిద్ధపడలేదు. 1980వ దశకంలో ఇలాంటి సంఘటనలు చాలానే వినిపించేవి. కిరసనాయిలు పోసుకునో, చీరకు నిప్పంటుకునో నిస్సహాయంగా ఎందరో ఆడవాళ్లు చనిపోయేవారు. అవన్నీ ప్రమాదాలో ఆత్మహత్యలో కాదనీ, వరకట్నపు హత్యలనీ తెలిసినా ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి. కానీ సత్యరాణి అలా నిశ్శబ్దంగా ఊరుకోదల్చుకోలేదు.   స్కూటరు కొనిపెట్టలేదన్న కారణంగా తన అల్లుడు ఆమెను చంపేశాడంటూ కేసుని నమోదు చేసింది. అయితే అప్పట్లో చట్టాలు ఇంత కఠినంగా ఉండేవి కాదు. పెళ్లి సమయంలో అందుకున్నవే కట్నకానుకల కిందకి వస్తాయన్న నిర్వచనం ఉండేది. పైగా చావుకి సంబంధించిన ఆరోపణలను నిరూపించే బాధ్యత మృతుల తరఫు న్యాయవాదులకే ఉండేది. సత్యరాణి ఒక పక్క తన కూతురి చావుకి సంబంధించిన కేసులను పోరాడుతూనే, మరో పక్క వరకట్నపు చావులను ఎదుర్కొంటున్న ఎందరో అభాగ్యుల కోసం గొంతు విప్పడం మొదలుపెట్టింది. తమ కూతురు వరకట్నం కారణంగా చావుని ఎదుర్కొందిని భావించిన ప్రతి ఒక్కరి పోరాటానికీ ఆసరాగా నిలిచేది.       సత్యరాణి తనలాంటి దుస్థితిలో ఉన్న మరికొందరితో కలిసి శక్తిశాలిని పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. వరకట్నపు వేధింపులను ఎదుర్కొనేవారికి ఈ సంస్థ నిలువనీడను కల్పించేది. సత్యరాణికి చదువు లేదు. వయసు పైబడుతోంది. పైగా చెట్టంత కూతురిని పోగొట్టుకుంది. అయినా వరకట్నానికి వ్యతిరేకంగా తన పోరులో రవ్వంత కూడా వెనక్కి తగ్గలేదు. రానురానూ సత్యరాణి ఉద్యమం ఫలితాలనివ్వసాగింది. వరకట్న వ్యతిరేక చట్టానికి ప్రభుత్వం మరింత పెట్టాల్సి వచ్చింది. వరకట్నం అంటే కేవలం డబ్బే కాదు, వస్తువుని కోరడం కూడా వరకట్న పరిధిలోనే వస్తాయంటూ చట్టాన్ని మార్చింది కేంద్రం. పెళ్లైన ఏడేళ్ల లోపు స్త్రీ ఆత్మహత్య చేసుకున్నా కూడా, అందుకు కారణం అత్తవారింటి ఆరళ్లు కూడా కావచ్చునంటూ మరో సవరణ కూడా చేసింది.   ఒక పక్క సమాజంలో మార్పు రావడం, మరో పక్క చట్టాలకు పదునెక్కించడంతో... వరకట్న హత్యలు కొంతమేరకన్నా తగ్గాయి. ముఖ్యంగా ‘వంటగదిలో ప్రమాదాలు, ఆత్మహత్యలు’ చాలామేరకు తగ్గాయి. నేరాల తగ్గుదలను చాలామంది గమనించారు కానీ, అందుకు కారణమైన సత్యరాణి వంటి తల్లుల పోరాటాన్ని పెద్దగా గమనించింది లేదు. వరకట్న చావులను తగ్గించడంలోనే సత్యరాణి విజయం సాధించడమే కాదు, మారిన చట్టాలకు అనుగుణంగా తన అల్లుడికి శిక్షపడేలా కూడా విజయం సాధించింది. 2014లో సత్యరాణి తన 85వ ఏట ప్రశాంతంగా కన్నుమూసింది. కానీ ఆమె జీవితం ఏనాడూ వృధాగా పోలేదు. ఒక తల్లిగా తాను పొందిన గర్భశోకాం, మరో తల్లికి కలుగకుండా ఉండేందుకే అనుక్షణం పోరాడింది. ఎందరో కూతుళ్లకి న్యాయాన్ని సాధించింది. మరెందరో వధువులు వరకట్నపు కోరల్లో చిక్కుకోకుండా తన జీవితాన్ని అడ్డు వేసింది.   - నిర్జర.

భారతీయ మహిళకు గౌరవమెంత?

మహిళలు భార్యగా, తల్లిగా నిర్వహించే బాధ్యతలు ఎంతో విలువైనవి.. బాలచంద్రునికి వీరతిలకం దిద్దిన మగువ మాంచాలను, భరతజాతికి ఛత్రపతిని ప్రసాదించిన మహారాజ్ఞి జిజాబాయిని చరిత్ర ఎన్నటికీ మరచిపోదు. కుటుంబానికి కేంద్రబిందువుగా భర్తపై, బిడ్డలపై స్త్రీ ప్రభావం గణనీయమైనది. "నా జీవితంలో ఇద్దరు దయామయుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. అనురాగాన్ని, ఆదర్శాల్ని గోరుముద్దలుగా కలిపి తినిపించిన మా అమ్మ ఒకరు; చేతి బంగారు గాజుల్ని అమ్మి నా పై చదువులకు డబ్బు కట్టిన మా అక్క ఒకరు... నేను సాధించిన విజయాలన్నీ వారి పాదాల వద్ద వినమ్రంగా అర్పిస్తాను" అంటారు భారతరత్న అబ్ధుల్కలామ్. అందుకే ఇంటిని నందనంగా తీర్చిదిద్దినా, నరకంలా మార్చినా కారణం ఇల్లాలే.  మగవారూ మారాలి... ఇంటినీ, ఇంటి పేరునూ వదలి అర్థాంగిగా తమ ఇంట అడుగుపెట్టిన మగువ పట్ల మగవారు కూడా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సహధర్మచారిణిగా ఆదరించాలి. భార్య అంటే తమ అసహనాన్ని, ఆవేశాన్ని భరించే బానిసగా భావించటం తగదు. సంపాదన ఒక్కటే గొప్పతనానికి గీటురాయి కాదు. కుటుంబ నిర్వహణ, ఆలనాపాలనా... ఇవన్నీ నిజంగా స్త్రీమూర్తి కార్యపటిమకు ప్రతీకలే. అతివలు చేసే ఇంటి పనులను చులకనగా చూడటం పురుషులు మానుకోవాలి. తనభార్య సీతలా ఉండాలని, పరాయి స్త్రీ మాత్రం సినిమాతారలా పలకరించాలనుకునే వికృత స్వభావాల నుంచి పురుషులు సంస్కారవంతులుగా ఎదగాలి. సప్తపది నడిచిన భర్తే భార్యను గౌరవించకపోతే ఇక సంతానం ఏం గౌరవిస్తుంది!  మేడిపండు మన సమాజం...  ఇటీవల ప్రపంచవ్యాప్తంగా స్త్రీని గౌరవించే విధానంపై పరిశోధనలు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచం మొత్తంలో మహిళలను గౌరవించడంలో స్కాండినేవియన్ దేశాలు భౌగోళికంగా చిన్నవైనా ముందువరుసలో ఉన్నాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా వెనుకవరుసలో నిలిచాయి. ఇక 'యత్రనార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః' అంటూ ఉపదేశాలు వల్లించే భారతీయులు కూడా చివరిస్థానంలో ఉన్నారు. మేడిపండు మనస్తత్వం గల వ్యక్తులతో నిండివున్న మన సమాజం తలదించుకోవాల్సిన కఠోర వాస్తవమిది. భారతీయ మహిళే ఫస్టు.. భారతనారీమణుల సాంప్రదాయిక జీవనశైలికి ప్రపంచదేశాలే నీరాజనాలు పలుకుతున్నాయి. అస్తిత్వానికి, అపరిమిత స్వాతంత్ర్యానికి భేదం తెలియని పాశ్చాత్య మహిళాలోకం స్త్రీవాదం పేరుతో నేలవిడిచి సాముచేసింది. ఏకంగా సామాజిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసుకుంది. భారతీయ మహిళలు మాత్రం తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటూ సాగుతున్నారు.  భారతీయ మహిళలకు గుర్తింపు కాదు గౌరవం కావాలిప్పుడు. అది కూడా బయటకు పొగుడుతూ వెన్నుపోటు పొడిచేది కాదు.. మహిళను తనను తానుగా గుర్తించే గౌరవం కావాలి.                                        ◆నిశ్శబ్ద.

బాధించే గతం నుండి బయటపడటానికి గొప్ప మార్గాలు!

  చాలామంది గతంలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూసి ఉంటారు. వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ తమలో తాము కుమిలిపోతుంటారు. స్ఫూర్తివంతమైన విషయాలు చదివినంత సేపు వారికి ఎంతో ధైర్యం వస్తుంది. కానీ తరువాత అంతా మామూలే! ఇలాంటి వారికి తమ బాధలను స్నేహితులతో చెప్పుకోవాలంటే  ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. అలాంటి సమయంలో ఈ పరిస్థితుల నుండి బయటపడే మార్గాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.. మన సమస్యలన్నింటికీ ముఖ్యకారణం మనస్సు వర్తమానంలో ఉండక పోవడమే! గతాన్ని తలుచుకుంటూ బాధపడడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మనస్సు స్వభావం. గతంలోని చేదు అనుభవాలను పూడ్చిపెట్టి, భవిష్యత్తు గురించి ఆలోచనల్ని అరికట్టినప్పుడు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్ని తీర్చిదిద్దుకోవడం సాధ్యమవుతుంది. ఈ సమస్యను మూడు మార్గాలను అనుసరించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. భగవంతునితో మొరపెట్టుకోవడం :  ఒక్కసారి భగవద్భక్తుల జీవితాల్ని తరచి చూస్తే వారంతా ఎన్ని కష్టాల్ని అనుభవించారో మనకు అర్థమవుతుంది. ఆ మహాభక్తులు అనుభవించిన కష్టాలు మేరు పర్వతమంతైతే మన కష్టాల్ని ఆవగింజతో పోల్చవచ్చు. కానీ మనకు కలిగిన ఆవగింజంత కష్టానికే అవధుల్లేని అశాంతికి లోనవుతుంటాం. మరి వారు మేరుపర్వతమంత కష్టాల్ని సైతం అవలీలగా ఎలా దాటగలిగారు? తమ బాధలను భగవంతునితో మొరపెట్టుకోవడం వల్లనే అది సాధ్యమయిందని నిరూపించారు సఖుబాయి, జనాబాయి, మీరాబాయి, ముక్తాబాయి, కాన్హోపాత్ర లాంటి అనేక మంది భక్త శిరోమణులు. It is difficult to live without someone to whom we can open our hearts. But to whom can we better dis- close them than to God! - Thomas A. Kempis ఈ ప్రపంచంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించే తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు, శ్రేయోభిలాషి అన్నీ ఆ భగవంతుడు మాత్రమే! కాబట్టి మన బాధలను భగవంతుని వద్ద విలపిస్తూ విన్నవించుకుంటే మేరు పర్వతమంత కష్టమైనా దూదిపింజలా ఎగిరిపోతుంది. 'వ్యాకుల మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనల్ని తప్పక వింటాడు'. ఈ మార్గాన్ని అనుసరించడం కష్టమైనప్పటికీ ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు! స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడడం: మనోవ్యధలను తొలగించేందుకు ఔషధంలా ఉపయోగపడే వారు మంచి స్నేహితులు. No medicine is more valuable, none more. efficacious, none better suited to be cure of all our miseries than a friend - St. Aleredx మన బాధలను స్నేహితులతో చెప్పుకోవడానికి ఆత్మాభిమానం అడ్డువస్తోందని అనుకోవడానికి కారణం స్నేహితుడు, మనం వేర్వేరు అనే భేద భావం ఉండడం వల్లనే! 'నిజమైన స్నేహితుడు ఇద్దరిలో ఉన్న ఒకే ఆత్మ'  A true friend is one soul in two bodies - Aristotle కాబట్టి బాధలను తలచుకుంటూ కుమిలి పోవడం కన్నా స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడడం వల్ల మనస్సు తేలికపడుతుంది. కార్యకలాపాల్లో మనస్సును నిమగ్నం చేయడం :  వీలైనంత వరకూ ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసిమెలిసి ఉండడం, ఏదో ఒక పనిలో మనస్సును నిమగ్నం చేయడం వల్ల గతాన్ని మరిచిపోవడం సాధ్యమవుతుంది. స్వామి వివేకానందుని పాశ్చాత్య శిష్యురాలైన మేడం ఈ. కాల్వే మనోవేదనకు గురైనప్పుడు ఆమెను ఓదారుస్తూ స్వామీజీ! ఇలా అన్నారు : "నువ్వు గతాన్ని మరిచిపో. నీ దుఃఖాలను గురించి మౌనంగా తలపోస్తూ కూర్చోవద్దు. నీలోని భావోద్వేగాలను ఏదో ఒక బాహ్యరూపంలో సృజనాత్మకంగా వ్యక్తీకరించే ప్రయత్నం చెయ్యి" అన్నారు.  స్వామీజీ సలహాను పాటించిన ఆమె జీవితం ప్రశాంతమయమైంది. ఈ మూడు మార్గాల్లో ఏ ఒక్క మార్గాన్ని అవలంబించినా.. మనస్సు గతంలోనికి అడుగుపెట్టదు. పట్టుదలతో ప్రయత్నిస్తేనే ఏదైనా సాధ్యమవుతుందన్న విషయాన్ని మాత్రం మరువకూడదు.                                     *నిశ్శబ్ద.

ఉత్సాహం.. విశ్వాసం జీవితంలో ఎందుకు ముఖ్యమంటే!

ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనాన్ని కోల్పోకుండా, సాహసోపేతంగా జీవిస్తూ ముఖంపై చిరునవ్వులు చెదరనీయకుండా ఉండగలుగుతున్నామంటే మన వ్యక్తిత్వం వికసించిందన్నమాటే! దృఢమైన వ్యక్తిత్వం కలిగినవాళ్ళు అప్రమత్తంగా ఉంటారు, అలా అని అతిజాగ్రత్తను ప్రదర్శించరు. కచ్చితంగా ఉంటారు, అలా అని మూర్ఖంగా ఆలోచించరు. పట్టుదలగా ఉంటారు, అలా అని మొండిపట్టుగా ఉండరు. సరదాగా ఉంటారు, అలా అని చౌకబారుగా ప్రవర్తించరు. ఏ స్థానంలో ఉన్నా ఇలాంటి కొన్ని మౌలికలక్షణాలను అలవరచుకుంటే మన నడవడిక నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. మూడు మాటల్లో చెప్పాలంటే ఉల్లాసం... ఉత్సాహం... విశ్వాసం ముప్పేటలా అల్లుకున్నదే జీవనసూత్రం! నిజమైన జీవనసూత్రం.. ఉల్లాసం...   నిరంతరం దీర్ఘాలోచనలతో, ముభావంగా ఉండేవారు జీవితంలో ఏమీ సాధించలేరు. ముఖ్యంగా యుక్తవయస్సులో భవిష్యత్తుకు ఒక ప్రణాళిక రచించుకునే కాలంలో శారీరకంగా, మానసికంగా ఉల్లాసం తొణికిసలాడాలి. నలుగురితో సరదాగా, కలివిడిగా కలసిపోవాలి. అందుకే "ఆధ్యాత్మికంగా పరిణతిని సాధించిన వ్యక్తి ఎల్లప్పుడూ ఆహ్లాదంగా, ఆనందంగా కనిపిస్తాడు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండేవారు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లే!" అంటారు స్వామి వివేకానంద. నేడు సమాజంలో కూడా గొప్పగొప్ప విజయాలు సాధించినవారందరూ తమతో పాటు తమ పరిసరాల్ని కూడా ఆహ్లాదభరితంగా ఉంచుకుంటారు. అలాగని నలుగురిలో వెకిలిగా ప్రవర్తించడం సమంజసం కాదు. హుందాగా ఉంటూనే, చిరునవ్వును ఆభరణంగా ధరిస్తూ కనిపించాలి. ఫలితంగా ఎంతటి ఒత్తిళ్ళనైనా సునాయాసంగా అధిగమించవచ్చు. ఎదుటివారితో సామరస్యంగా పని చేయించుకోవచ్చు. ఉత్సాహం...  విద్యార్థి దశలో కానీ, ఉద్యోగిగా బాధ్యత నిర్వహణలో కానీ, ఉత్సాహంగా ఉపక్రమించకపోతే ఉత్తమ ఫలితాలు రావు. ఉత్సాహంగా ఉండేవ్యక్తులే సమాజాన్ని ఆకర్షించగలరు. నలుగురితో  సంబంధాలను కొనసాగించగలరు. Sportive Attitude పెంపొందించుకోగలరు. అలాంటివారు ఎలాంటి పని ఒత్తిళ్ళకూ లోనుకారు. అందుకే ఆస్కార్ వైల్డ్ 'కొందరు ఎక్కడికి వెళితే అక్కడ ఆనందాన్ని కలిగిస్తారు, మరికొందరు అక్కడి నుండి ఎప్పుడు వెళితే అప్పుడు ఆనందం కలుగుతుంది' అంటారు. అందుకే ఉత్సాహంతో, సంతోషంతో మొదటి రకం వ్యక్తుల్లా ఉండేందుకు ప్రయత్నించాలి. విశ్వాసం…  ఒక ఊరిలో ఓ ఏడాది తీవ్ర కరవుకాటకాలు సంభవించాయి. గ్రామస్థులంతా కలసి సమీప ఆలయంలో సాధనలు చేస్తున్న సాధువును ఆశ్రయించారు. తమ గ్రామాన్ని వరుణుడు కరుణించేట్లు ప్రార్థించమని ఊరి ప్రజలంతా ఆ సాధువుని వేడుకున్నారు. వారి వేడుకోలుకు స్పందించిన సాధువు "మీ గ్రామం కోసం తప్పకుండా ప్రార్థనలు చేస్తాను. రేపు ఉదయం అందరూ ఈ ఆలయానికి రండి ప్రార్థనలతో వర్షం కురిపిస్తాను” అన్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ ఊరి జనమంతా తండోపతండాలుగా ఆలయ ప్రాంగణంలో ఆసీనులయ్యారు. అప్పుడు ఆ సాధువు మాట్లాడుతూ 'నేను చెప్పిన ప్రకారం మీరంతా ఇక్కడికి వచ్చారు మంచిదే! కానీ మీలో ఎవరికీ నా మాటపై విశ్వాసం లేదు. ఒక్క బాలుడికి తప్ప!' అని అన్నాడు.  'ఎవరా బాలుడు? అతడిలో ప్రత్యేకత ఏమిటి?' అన్నట్లు అందరూ ఆశ్చర్యంగా ఆ సాధువు వైపు చూశారు. అప్పుడు ఆ సాధువు, గొడుగుపట్టుకొని గుంపులో ఉన్న ఓ ఏడేళ్ళ బాలుణ్ణి చూపించాడు. 'ఆ బాలునికి గల విశ్వాసంతో ఇప్పుడు వర్షం కురుస్తుంది' అంటూ దేవుణ్ణి ప్రార్థించి వాన కురిపించాడు. మనలో కూడా చాలామందిలో ఈ ప్రగాఢవిశ్వాసమే కొరవడుతోంది. మనపై మనకు విశ్వాసం, మన చుట్టూ ఉన్న సమాజంపై విశ్వాసం ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. 

మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే మూడు విషయాలు!

మనిషి జీవితంలో బలాలు, అవకాశాలు, భయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటి గురించి తెలుసుకుంటే... బలాలు మనిషి జీవితంలో బలాలు మాత్రమే కాదు. బలహీనతలు కూడా ఉంటాయి. అయితే నేటి కాలంలో మనుషులు తమలో ఉన్న బలాలను పక్కన పెట్టి తమలో ఉన్న చిన్న బలహీనతల్ని కూడా భూతద్దంలో చూస్తారు. ఫలితంగా తమలో చాలా పెద్ద లోటుపాట్లు ఉన్నాయని అవి తమ జీవితాన్నే కుదిపేస్తున్నాయనే ధోరణిలోకి వెళ్ళిపోతారు. స్నేహితులను, బంధువులను, ఆత్మీయులను కలిసినప్పుడు తమ గురించి తాము ఓపెన్ గా మాట్లాడుకోగలిగే చనువు ఉంటే గనుక అలాంటి సందర్భంలో  సహజంగా చాలామంది తమలో చాలా బలహీనతలు ఉన్నాయని అంటూంటారు. కానీ అందరూ గ్రహించని ముఖ్య విషయం ఏమిటంటే… అందులో అధికశాతం ఊహించుకున్నవే.  ఇక్కడ బలహీనతలంటే మొహమాటం, ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆందోళన.. లాంటి వైఖరులన్నమాట. ఉదాహరణకి చెప్పుకుంటే తను చదివే కోర్సు పూర్తయిపోగానే తరువాత ఏది ఎంపిక చేసుకోవాలనే నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొందరు చాలా బాధపడిపోతారు. అలాంటి పరిస్థితిలో వారి మనసులో ఉండే భావం ఎలాంటిదంటే ఒకరి మీద ఆధారపడాల్సి వస్తోందే అనే బాధ, నాకు నేను ఎలా నిర్ణయం తీసుకోవాలి నాకు తెలియనప్పుడు అనే సంఘర్షణ ఒక విద్యార్థిలో ఏర్పడటం తన బలహీనతగా భావిస్తాడు. అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదు. కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే, తెలుసుకుంటే అన్నీ సాధ్యమవుతాయి. మనిషిలో ఉండే బలహీనతలు ఎప్పటికీ బలహీనతలుగా ఉండిపోవు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఆ బలహీనతలు క్రమంగా అధిగమించవచ్చు. అవకాశాలు అవకాశాల గురించి చాలామందికి అవగాహన సరిగా ఉండదు. తమ ముందున్నవి అవకాశాలే కాదు అన్నంత నిర్లక్ష్యంగా, అవగాహనా లోపంతో ఉంటారు చాలామంది.  చదువుకునే విద్యార్థుల నుంచి, ఉద్యోగాలు చేసే వారి వరకు తాము ముందుకు పోవడానికి గల అవకాశాలను గుర్తించడం అరుదు. చదువుకునే విద్యార్ధినీ విద్యార్థులు, తాము బాగా చదువుకుంటే భవిష్యత్తులో ఏమి సాధించగలరో, తమ కుటుంబ గౌరవ ప్రతిష్ఠలు ఎలా పెంచగలరో గుర్తించాలి. చదువు పూర్తి చేస్తే తండ్రి వ్యాపారంలో చేరవచ్చు. విదేశాల్లో ఉన్న బంధువులు స్పాన్సర్ చేయవచ్చు. ఇక్కడే ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని ఆదుకోవచ్చు... ఇలా తమ జీవితానికి ఉన్న మార్గాలను అనుసరించి ఆలోచించాలి. నిజానికి ఈనాటి యువతరానికి ఇవన్నీ తెలియకకాదు. అన్నీ తెలుసు. కానీ బద్ధకం, నిర్లక్ష్యవైఖరి, చెడు అలవాట్లు అడ్డుపడుతున్నాయి.  భయాలు  మనిషి పతనానికి మూలకారణం భయం. ఒక పని ప్రారంభించే ముందు విజయం సాధించగలమా లేదా అనే చిన్న భయం ఉండవచ్చు. దాంతో మధ్యలో సమస్యలు రావచ్చు. విజయమార్గంలో వైఫల్యాలు ఉంటాయి తప్పదు. విజయం అనేది ప్రయాణం తప్ప, గమ్యం కాదని గుర్తించాలి. అర్థం లేని భయాలు, భీతులు మన విజయానికి ఆటంకం కాకుండా ధైర్యం తెచ్చుకోవాలి. “నేను మాట్లాడలేను, నావల్లకాదు" వంటి మాటలకు ముగింపు చెప్పాలి.మాట్లాడటం అందరికీ వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేను?? విషయం గురించి కొంచెం అవగాహన పెంచుకుంటే ఆ అవగాహన ఉన్న విషయాన్ని మాట్లాడటమే క్షదా చేయాల్సింది. అలాంటప్పుడు మాట్లాడలేమనే భయం ఎందుకు?? ఇలాంటి ప్రశ్నను తమకు తాము వేసుకోవాలి. అలా వేసుకుంటే ఒకానొక ప్రేరణ ఎవరిలో వారికి కలుగుతుంది.  కాబట్టి మనిషి జీవితంలో బలహీనతలు, అవకాశాలు, భయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిని సరైన విధంగా డీల్ చేయడం నేర్చుకోవాలి.                                ◆నిశ్శబ్ద.

వ్యక్తిగత అభివృద్దిని దెబ్బతీసే వినికిడి సమస్యకు చెక్ పెట్టాలి..!

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.  ఇంద్రియాలలోకి కళ్లు ప్రధానం. కానీ ఇంద్రియాలలో ఏ ఒక్కటి సరిగా పని చేయకపోయినా ఇబ్బంది పడవలసిందే. ముఖ్యంగా ఇతరులు చెప్పేది వినడంలో,  చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడంలో చెవులు కీలకపాత్ర పోషిస్తాయి.  కానీ వినికిడి లోపిస్తే  మాత్రం వ్యక్తుల జీవితాలలో చాలా ఇబ్బందులు ఎఎదుర్కోవాల్సి వస్తుంది.  ఈ వినికిడి సమస్య గురించి,  వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల గురించి అవగాహన పెంచడానికి   ప్రతి సంవత్సరం మార్చి 3న, ప్రపంచవ్యాప్తంగా చెవి సమస్యలు,  వినికిడి లోపాన్ని నివారించడం గురించి అవగాహన పెంచడానికి  ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. ప్రతి సంవత్సరం వినికిడి సమస్యల శాతం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. దీని గురించి చర్యలు తీసుకోవడానికి ఈ ఏడాది థీమ్ ను అరెంజ్ చేశారు.  "మారుతున్న మనస్తత్వాలు: అందరికీ చెవి,  వినికిడి సంరక్షణను వాస్తవికతగా మార్చడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోండి" అనే థీమ్‌తో ఈ ఏడాది చర్యలు సాగుతాయి. వినికిడి లోపం అనేది రోజురోజుకు  పెరుగుతున్న ప్రజారోగ్య సమస్య.  ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్లకు పైగా ప్రజలు దీని బారిన పడ్డారు. దాదాపు 80% మంది తక్కువ,  మధ్య-ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు.  ఆగ్నేయాసియా ప్రాంతంలోనే 400 మిలియన్ల మంది ప్రజలు వినికిడి సమస్యలను ఎదుర్కొంటున్నారని అంచనా. ఇవి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఈ సంఖ్య 660 మిలియన్లకు పెరగవచ్చని అంటున్నారు. పైన చెప్పినవి  కేవలం గణాంకాలు మాత్రమే కాదు. జీవితాలు, జీవనోపాధి,  వ్యక్తుల అభివృద్దిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నందుకు అవి సాక్ష్యాలు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  ఇలాంటి  వ్యక్తుల జీవితాల గురించి ఈ సంఖ్య స్పష్టం చేస్తుంది. పరిష్కరించబడని వినికిడి లోపం చాలా తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటుంది .  మాట్లాడటానికి, చదువుకోవడానికి, ఉపాధి,  మానసిక ఆరోగ్యాన్ని.. ఇలా చాలా విషయాలు  ప్రభావితం చేస్తుంది. అయితే చాలా వరకు చెవి సమస్యలు  సమర్థవంతమైన, ఖర్చుతో కూడుకున్న చికిత్సల ద్వారా నయం చేయవచ్చు.  అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 80% కంటే ఎక్కువ చెవి,  వినికిడి సంరక్షణ అవసరాలు తీరడం లేదు. దీన్ని తగ్గించడమే ఈ వినికిడి సమస్య దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. ప్రజలు తాము నివసించే  ప్రాంతంలో చెవి,  వినికిడిని బలోపేతం చేయడంలో సభ్య దేశాలు సాధించిన పురోగతి అందరికీ ఆదర్శం కావాలి.  బంగ్లాదేశ్, మయన్మార్,  నేపాల్  మొదలైన దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో  వినికిడి సమస్య ఉన్న ప్రాంతాలలో పరిస్థితులను అంచనా  వేశాయి.  చెవి,  వినికిడి సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. మయన్మార్ కమ్యూనిటీ స్థాయిలో కంటి సంరక్షణ, వృద్ధుల సంరక్షణ,  మానసిక ఆరోగ్య సేవలతో చెవి,  వినికిడి సంరక్షణను అనుసంధానించింది. భూటాన్ పిల్లలకు ఉచిత వినికిడి పరీక్షలు,  వినికిడి సహాయ సేవలను అమలు చేసింది. ఇండోనేషియా పాఠశాలల్లో ఇంటిగ్రేటెడ్ హియరింగ్,  విజన్ స్క్రీనింగ్‌ను ప్రారంభించింది. సహాయక ఉత్పత్తులపై శిక్షణ వినికిడి మాడ్యూళ్ల  క్షేత్ర-పరీక్ష భారతదేశంలో జరుగుతోంది. ఈ ప్రపంచ వినికిడి దినోత్సవం నాడు ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు, పౌర సమాజం,  వ్యక్తులు చెవి,  వినికిడి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వినికిడి సమస్య వల్ల ఎదురయ్యే సవాళ్లను  సవాలు చేయాలని ప్రజలందరూ కృషి చేయాలి.  వినికిడి సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.   చాలా వరకు వినికిడి సమస్యలు మొదట్లోనే గుర్తించి తగిన వైద్యం తీసుకోవడం వల్ల నయం అవుతాయి. కానీ వినికిడి సమస్య పెరిగిన తరువాత దాన్ని నయం చేయడం కష్టం.  వినికిడి పరికరాలు,  శస్త్ర చికిత్సలు మొదలైనవి మాత్రమే ఈ సమస్యకు పరిష్కారంగా నిలుస్తాయి. కానీ వినికిడి సమస్య ఉన్న వ్యక్తులను ఎక్కువకాలం అలాగే ఎలాంటి వైద్యం లేకుండా వదిలెయ్యడం వల్ల అది కాస్తా మానసిక సమస్యగా మారే అవకాశం ఉంది.  కాబట్టి ఈ సమస్య గురించి ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు.                                                      *రూపశ్రీ.

జనౌషది దివస్ వీక్.. జెనరిక్ మందుల గురించి అవగాహన పెంచే వేదిక..!

  జనరిక్ ఔషధాల గురించి అవగాహన పెంచడానికి,  నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి మార్చి మొదటి వారాన్ని 'జన్ ఔషధి సప్తాహ్' లేదా జనరిక్ మెడిసిన్ వీక్‌గా జరుపుకుంటారు. ఇది 'జన్ ఔషధి దివస్' లేదా జనరిక్ మెడిసిన్‌తో ముగుస్తుంది. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ కార్యక్రమం జనరిక్ ఔషధాల వాడకం గురించి ప్రజలకు తెలియజేయడం,  అందరికీ సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తుంది. జెనరిక్ ఔషధాలు.. డోసేజ్ , భద్రత, బలం, వాటిని ప్రజలలోకి తీసుకొచ్చే విధానం, నాణ్యత,  జనరిక్ మందులను  ఉద్దేశించిన ఉపయోగం వంటి వివిధ అంశాలలో ఇప్పటికే ఉన్న బ్రాండ్-నేమ్ ఔషధాలను ప్రతిబింబించేలా రూపొందించబడిన జెనరిక్ మందులు సమానమైన క్లినికల్ ప్రయోజనాన్ని అందిస్తాయి. జెనరిక్ ఔషధ ఉత్పత్తి,  ఎగుమతిలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులో ఉండేలా, తక్కువ ఖర్చులో వైద్యం జరిగేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.  జనరిక్ ఔషధాల అవసరం.. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు వారి ఆర్థిక పరిమితులకు మించి వైద్యం ఖర్చులు అవుతున్నాయి. తక్కువ ఖర్చుతో కూడిన అధిక-నాణ్యత గల జనరిక్ ఔషధాల గురించి అవగాహన కల్పించడం ఈ జెనరిక్ మందుల దినోత్సవ  ప్రాధాన్యత. దాదాపు 60% భారతీయ కుటుంబాలకు ఆరోగ్య బీమా లేకపోవడంతో, వారి జేబులోంచి వేద్యం ఖర్చులు  చాలా మందిని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నాయి. జన్ ఔషధి కేంద్రాల పాత్ర.. ప్రధాన మంత్రి జన్ ఔషధి పరియోజన (PMBJP) కింద పనిచేసే జన్ ఔషధి కేంద్రాలు  పేదరికానికి పరిష్కారంగా నిలుస్తాయి.  ఈ కేంద్రాలు మొదటి మూడు బ్రాండెడ్ ఔషధాల సగటు ధరలో 50% పరిమిత ధరలకు జనరిక్ ఔషధాలను అందిస్తాయి. తత్ఫలితంగా, జన్ ఔషధి మందులు కనీసం 50% చౌకగా ఉంటాయి.  కొన్నిసార్లు వాటి బ్రాండెడ్ మందుల  కంటే 80% నుండి 90% తక్కువ ఖరీదులో దొరుకుతాయి.  దీని వల్ల  వినియోగదారులకు డబ్బు పొదుపు అవుతుంది. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (PMBJP).. రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం నవంబర్ 2008లో ప్రారంభించిన PMBJP, జనరిక్ ఔషధాలను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో గణనీయంగా దోహదపడింది. నవంబర్ 30, 2023 నాటికి భారతదేశం అంతటా 10,000  జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. PMBJP 2023లో దాదాపు 1000 కోట్లు ఆదా చేసింది. ఇది దేశంలో జనరిక్ ఔషధాల చరిత్రలో ఒక మైలురాయిగా నమోదైంది. PMBJP ప్రభావం.. ధరల విషయంలో PMBJP విధానం అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రజలకు మంచి  పొదుపు మార్గంగా మారింది. ఉదాహరణకు వివిధ బ్రాండ్ పేర్లతో యూనిట్‌కు రూ. 72 ఖరీదు చేసే టెల్మిసార్టన్ 40 mg మాత్రలు, యూనిట్‌కు దాదాపు రూ. 12 కు జెనరిక్ షాపులలో అందుబాటులో ఉన్నాయి. జన ఔషధి కేంద్రాల ద్వారా మందులను అందించడం ద్వారా దేశ పౌరులకు సుమారు 5000 కోట్లు ఆదా చేయడం PMBJP సాధించిన విజయం. భవిష్యత్తు లక్ష్యాలు,  విస్తరణ..   మరిన్ని వర్గాలకు సేవ చేయడం,ఎక్కువ మందికి చేరువ కావాలనే ఉద్దేశ్యంతో PMBJP మార్చి 2026 నాటికి దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారణాల జన్ ఔషది కేంద్రాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుకాణాలలో 1,700 కంటే ఎక్కువ మందులు,  200 శస్త్రచికిత్సా వస్తువులు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ 10 లక్షలకు పైగా ప్రజలు ఈ దుకాణాలను సందర్శిస్తున్నారు. ఇది తక్కువ ఖర్చులో లభించే జనరిక్ ఔషధాలపై పెరుగుతున్న నమ్మకం.  దీని వల్ల ప్రజలు ఈ మందులను వాడటానికి మరింత ఆసక్తి చూపిస్తారు. భారతీయ ఔషధ పరిశ్రమ,  జనరిక్ మందులు: ప్రపంచవ్యాప్తంగా  వాల్యూమ్ పంగా మూడవ స్థానంలో,  విలువ పరంగా 13వ స్థానంలో ఉన్న భారతదేశ ఔషధ పరిశ్రమ, 60 చికిత్సా వర్గాలలో 60,000 కంటే ఎక్కువ జనరిక్ ఔషధాలను తయారు చేస్తుంది. ప్రతి ఏడాది జనరిక్ మందుల ప్రస్థానం పెరుగుతుందని నిపుణులు ఆశిస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలకు అనుగుణంగా ప్రజలు కూడా జనరిక్ మందులను ప్రోత్సహించడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవడమే కాకుండా  తక్కువ ఖర్చులోనే ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవచ్చు.                                        *రూపశ్రీ.

మనిషి గతిని,  ప్రపంచాన్ని మార్చేస్తున్న సైన్స్.. జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం..!

సైన్స్ మానవ జీవితాన్ని చాలా మార్చేసింది.  ఈ ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు చేయడానికి సైన్స్ ఏ ప్రధాన కారణం. సైన్స్ వల్ల మనిషికి ఎన్నో కొత్త సౌలభ్యాలు చేకూరుతున్నాయి.  అయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీన జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం జరుపుకుంటున్నారు.  ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంగా చాలా చోట్ల,  చాలా పాఠశాలల్లో సైన్స్ ఎగ్జిబిషన్లు,  సైస్స్ ఫెయిర్ లు జరుగుతాయి.  అసలు జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం వెనుక గల కారణం ఏంటి? దీన్ని ఎందుకు జరుపుకుంటారు? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి ? తెలుసుకుంటే.. 1928లో భారత భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్,  రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1986 నుండి భారతదేశం శాస్త్రీయ విజయాలను గుర్తించడానికి,  రోజువారీ జీవితంలో సైన్స్ పాత్ర గురించి అవగాహన పెంపొందించడానికి ఈ రోజును జరుపుకుంటోంది. థీమ్.. 2025 జాతీయ సైన్స్ దినోత్సవం  థీమ్ "విక్షిత్ భారత్ కోసం సైన్స్ అండ్ ఇన్నోవేషన్‌లో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కల్పించడం." భారతదేశంలోని పాఠశాలలు, కళాశాలలు,  పరిశోధనా సంస్థలు విద్యార్థులను ప్రేరేపించడానికి,  శాస్త్రీయ పురోగతిపై ఆసక్తిని ప్రోత్సహించడానికి వ్యాస రచన, ప్రసంగ పోటీలు,  ప్రదర్శనలు వంటి వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. అసలు రామన్ ఎఫెక్ట్ అంటే.. జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని రామన్ ఎఫెక్ట్ కనుగొన్న జ్ఞాపకార్థం జరుపుకుంటున్నాం.  అయితే అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అనే విషయం చాలా మందికి తెలియదు. సి.వి. రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నాడు. ఇది కాంతి ఒక పారదర్శక పదార్థం గుండా వెళ్లి దాని అణువులతో సంకర్షణ చెందినప్పుడు దాని పరిక్షేపణను వివరిస్తుంది. చాలా కాంతి ఒకే దిశలో కొనసాగుతుంది. కానీ ఒక చిన్న భాగం శక్తిలో మార్పుతో చెల్లాచెదురుగా ఉంటుంది, దీని వలన తరంగదైర్ఘ్యంలో వైవిధ్యాలు ఏర్పడతాయి. రామన్ ఎఫెక్ట్ లో మార్పులు.. రకాలు.. స్టోక్స్ షిఫ్ట్ (శక్తి నష్టం): కాంతి ఒక పదార్థంతో సంకర్షణ చెందినప్పుడు, కొన్ని ఫోటాన్లు వాటి శక్తిలో కొంత భాగాన్ని అణువులకు బదిలీ చేస్తాయి, దీనివల్ల కంపనాలు ఏర్పడతాయి. దీని ఫలితంగా అసలు కాంతి కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యం (తక్కువ శక్తి) కలిగిన చెల్లాచెదురైన కాంతి వస్తుంది. ఈ మార్పు రసాయన సమ్మేళనాలు,  వాటి పరమాణు నిర్మాణాలను అధ్యయనం చేయడంలో సహాయపడుతుంది. యాంటీ-స్టోక్స్ షిఫ్ట్ (శక్తి లాభం): కొన్ని సందర్భాల్లో ఇప్పటికే అధిక శక్తిని కలిగి ఉన్న అణువులు చెల్లాచెదురుగా ఉన్న కాంతికి శక్తిని బదిలీ చేస్తాయి. ఇది అసలు కంటే తక్కువ తరంగదైర్ఘ్యం (అధిక శక్తి) కలిగిన కాంతికి దారితీస్తుంది. ఉష్ణోగ్రత కొలతలు,  అధిక-శక్తి పరమాణు స్థితులను అధ్యయనం చేయడంలో యాంటీ-స్టోక్స్ స్కాటరింగ్ ఉపయోగపడుతుంది. ఈ సూత్రంపై ఆధారపడిన రామన్ స్పెక్ట్రోస్కోపీని రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, వైద్య పరిశోధన,  ఫోరెన్సిక్ సైన్స్‌లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ భౌతిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది కొత్త శాస్త్రీయ పరిశోధనలకు మార్గం సుగమం చేసింది. ఈ విజయానికి గుర్తింపుగా ఆయనకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. దీనితో ఆయన సైన్స్‌లో ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయుడిగా నిలిచారు. సివి రామన్ రచనలు భారతదేశంలో,  ప్రపంచవ్యాప్తంగా సైన్స్ పై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. ఆయన రచనలు శాస్త్రవేత్తలు, పరిశోధకులు,  విద్యార్థులను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. రామన్ ఎఫెక్ట్ వివిధ శాస్త్రీయ రంగాలలో ఒక ముఖ్యమైన సాధనంగా మిగిలిపోయింది, ఆరోగ్య సంరక్షణ, మెటీరియల్ సైన్స్,  ఫోరెన్సిక్ పరిశోధనలలో పురోగతికి దోహదపడుతుంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా భారతదేశం సివి రామన్ ను గౌరవిస్తుంది.  సైన్స్ ను,  సైన్స్ ద్వారా బోలెడు  ఆవిష్కరణలను ఈ ప్రపంచంలో అన్వేషించడానికి యువతను ప్రోత్సహిస్తుంది.                                      *రూపశ్రీ.  

మీకు మంచి లైఫ్ పార్ట్నర్ కావాలా.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..!

  ప్రతి మనిషి తన జీవితంలో వివాహం అనే దశను చేరుకుంటాడు.  సంసార సాగరంలో ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుని ఈదుతూ ఉంటాడు. చాలామంది సింగిల్ గా ఉన్నప్పుడు జీవితం చాలా బాగుండేది.. వివాహం అయ్యాక స్వేచ్ఛ పోయింది అనే మాట అంటుంటారు. ఇంకొందరు ఏమో తన ఆలోచనలు, అభిరుచులకు సరైన భాగస్వామి రాలేదు అని అంటుంటారు. ఇప్పటికే పెళ్లైన వారిలో చాలామంది పెళ్లే వద్దు బాబోయ్ అని వివాహ బంధం గురించి తమ అనుభవాలను చెప్పి ఇతరులను భయపెడుతూ ఉంటారు. అయితే మంచి లైఫ్ పార్ట్నర్ ఉంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.  మంచి పార్ట్నర్ ను ఎంచుకునే విషయంలో ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలు వెల్లడించాడు.  అవేంటో తెలుసుకుంటే.. పెళ్ళి చేసుకునే ఆలోచన ఉన్నవారు.. లైఫ్ పార్ట్నర్ ను ఎంచుకునే విషయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. నిజాయితీ.. నిజాయితీగా ఉండే వ్యక్తులు మాత్రమే జీవితంలో మంచి లైఫ్ పార్ఠ్నర్ లు కాగలరు. అబద్దాల కోరును ఎవరూ నమ్మరు.  ఒకవేళ పెళ్లి తరువాత ఇలాంటి వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నా అబద్దాలు చెప్పడం వల్ల ఆ సంసారం ఎప్పటికీ సంతోషంగా ఉండదు. దయ.. ఇతరుల పట్ల దయా గుణం కలిగిన వారు మంచి లైఫ్ పార్ట్నర్ లు గా ఉండగలరు. బయటి వ్యక్తుల పట్ల దయ చూపించే వారు భాగస్వామి విషయంలో మరింత ప్రేమ, దయ,  సానుభూతి, పరిస్థితులను అర్థం చేసుకోవడం చేయగలరు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలలో బ్యాలెన్స్డ్ గా ఉండగలరు. మర్యాద.. ఇతరులకు మర్యాద గౌరవం ఇవ్వడం తెలిసిన వ్యక్తి ఎప్పటికీ ఎవరినీ అకారణంగా నొప్పించరు. తన  లైఫ్ పార్ట్నర్ ను కూడా చాలా విలువైన వ్యక్తిగా భావిస్తారు. మర్యాద ఇవ్వడం,  గొప్ప స్థానాన్ని ఇవ్వడం చేస్తారు.   అయితే ఈ గుణాలన్నీ ఉన్నట్టు నటించే వ్యక్తులు కొందరు ఉంటారు. కాబట్టి వ్యక్తులను సులువుగా ఎంచుకోకుండా కాస్త సమయం తీసుకోవడం మంచిది.  వ్యక్తి గురించి విచారించడం కూడా మంచిది.  ఒక వ్యక్తి జీవితంలో జీవితాంతం కలిసి ఉండేది భాగస్వామి మాత్రమే కాబట్టి.. భాగస్వామి విషయంలో ఎప్పుడూ తొందరపాటు అడుగులు వేయకూడదు.                                                 *రూపశ్రీ.

వీర సావర్కర్‌.. భారతదేశ గతినే మార్చిన పోరాట యోధుడు..!

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కవి, సామాజిక సంస్కర్త అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి చాలా మందికి తెలియదు.  వీర్ సావర్కర్ వర్ధంతి 2025 ఫిబ్రవరి 26న జరుపుకుంటారు. ఆయన జాతీయవాద భావజాలం,  విప్లవాత్మక స్ఫూర్తికి ప్రసిద్ధి చెందారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు,  యువ దేశభక్తులకు స్ఫూర్తినిచ్చారు. స్వాతంత్ర్య పోరాటానికి ఆయన చేసిన కృషి,  హిందూత్వానికి ఆయన ఇచ్చిన మద్దతు ఇప్పటికీ  చాలా చర్చించుకోవలసిన విషయమే..  ఇవి చాలా చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వీర్ సావర్కర్ వర్ధంతి 2025.. వీర్ సావర్కర్ ఫిబ్రవరి 26, 1966న తన 82 సంవత్సరాల వయసులో బొంబాయి (ఇప్పుడు ముంబై)లోని తన నివాసం సావర్కర్ సదన్‌లో మరణించారు. ఆయన మరణం సహజ కారణాల వల్ల జరిగింది, కానీ ఫిబ్రవరి 1, 1966 నుండి ఆయన మరణించే వరకు నిరాహార దీక్ష చేశారు. ఆయన మరణించే ముందు ఆత్మహత్య నహి ఆత్మార్పణ్ (ఆత్మహత్య కాదు, స్వీయ లొంగిపోవడం) అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. అందులో ఒక వ్యక్తి జీవిత లక్ష్యం నెరవేరిన తర్వాత, వారు ఇకపై సమాజానికి తోడ్పడలేకపోతే, వారు తమ స్వంత షరతుల ప్రకారం జీవితాన్ని విడిచిపెట్టాలని ప్రస్తావించారు. ఎటువంటి విస్తృతమైన ఆచారాలు లేకుండా సరళమైన అంత్యక్రియలను ఆయన కోరారు.  ఆయన అంతిమ కర్మలను ఆయన  కుమారుడు నిర్వహించారు. ఇదే జీవితం.. వీర్ సావర్కర్ మే 28, 1883న మహారాష్ట్రలోని భాగూర్‌లో జన్మించారు. చిన్నప్పటి నుండే భారతదేశ స్వేచ్ఛ పట్ల బలమైన మక్కువను ప్రదర్శించాడు. పూణేలోని ఫెర్గూసన్ నుండి కళాశాల విద్యను పూర్తి చేశాడు. తరువాత న్యాయశాస్త్రం అభ్యసించడానికి లండన్‌కు వెళ్లాడు, అక్కడ అతను ఇండియా హౌస్‌లో చురుకైన సభ్యుడయ్యాడు. 1909లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవాత్మక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు సావర్కర్ అరెస్టు అయ్యారు.  రెండు జీవిత ఖైదులు విధించి అండమాన్- నికోబార్ దీవులలోని సెల్యులార్ జైలుకు పంపారు. జైలు శిక్ష అనుభవించినప్పటికీ,  చరిత్ర, రాజకీయాలు,  సంస్కృతిపై విస్తృతంగా రాయడం కొనసాగించారు. గణనీయమైన మేధో వారసత్వాన్ని మిగిల్చాడు. వీర్ సావర్కర్ రచనలు.. వీర్ సావర్కర్ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు రచయిత, ఆలోచనాపరుడు,  సామాజిక సంస్కర్త కూడా, ఆయన వివిధ రంగాలలో కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవాత్మక ఉద్యమాలను ప్రేరేపించడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన మిత్ర మేళా, అభినవ్ భారత్ సొసైటీ (యంగ్ ఇండియా సొసైటీ), జాతీయవాద భావజాలాలను ప్రోత్సహించడం,  యువ భారతీయులకు ప్రతిఘటన కోసం శిక్షణ అందించడం లక్ష్యంగా ఫ్రీ ఇండియా సొసైటీ వంటి సంస్థలను స్థాపించారు. కుల వ్యవస్థ రద్దు.. వీర్ సావర్కర్ కుల వ్యవస్థను "చరిత్రలోని చెత్తబుట్టల్లో పడవేయడానికి అర్హమైనది" అని నమ్మాడు. ఆయన కులాంతర భోజనం,  అన్ని హిందువులకు ఆలయ ప్రవేశం వంటి సామాజిక సంస్కరణలను చురుకుగా ప్రోత్సహించాడు. సాహిత్య రచనలు.. ఆయన రచనలలో "ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్" కూడా ఉంది, ఇది 1857 తిరుగుబాటును భారతదేశపు మొట్టమొదటి వ్యవస్థీకృత స్వాతంత్ర్య పోరాటంగా పునర్నిర్వచించింది. ఇది బ్రిటిష్ కథనాలను సవాలు చేసింది. ఆయన రాసిన "హిందుత్వ: హిందువు ఎవరు?" అనే పుస్తకం హిందూత్వ భావజాలానికి పునాది వేసింది. వేద సాహిత్య ప్రచారం.. వీర్ సావర్కర్ వేద గ్రంథాలను భారతదేశం నాగరికతకు అందించిన ప్రత్యేక సహకారంగా భావించి వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేశాడు. శాస్త్రీయ దృక్పథం & పారిశ్రామికీకరణ.. వీర్ సావర్కర్ సైన్స్, ఆధునిక పారిశ్రామిక అభివృద్ధిని సమర్థించాడు. భారతదేశం "యూరప్ కంటే 200 సంవత్సరాలు వెనుకబడి ఉంది" అని నమ్మారు. జాతీయ వృద్ధికి కీలకమైన చోదక శక్తిగా శాస్త్రీయ పురోగతిని ఆయన ప్రోత్సహించారు. హిందూత్వ తత్వశాస్త్రం.. వీర్ సావర్కర్ హిందూ తత్వశాస్త్రాన్ని ఎంతో గొప్పగా ప్రశంసించారు.  పాటించారు.   ఆయన దీనిని భారతదేశ సాంస్కృతిక,  జాతీయ గుర్తింపుగా నిర్వచించారు. ఇది ఆధునిక రాజకీయ ఆలోచనను రూపొందిస్తుంది. వీర్ సావర్కర్ వారసత్వం.. వీర్ సావర్కర్ వారసత్వం ఆధునిక భారతదేశాన్ని రూపొందిస్తూనే ఉంది, ఎందుకంటే ఆయన హిందూత్వ భావజాలం,  జాతీయవాదానికి చేసిన కృషి చర్చనీయాంశంగా  ఉంది. అనేక రాజకీయ పార్టీలు,  సంస్థలు ఆయన స్వావలంబన,  ఐక్య భారతదేశం అనే దార్శనికత నుండి ప్రేరణ పొందాయి. ఆయన పుస్తకాలు, ప్రసంగాలను పండితులు,  చరిత్రకారులు అధ్యయనం చేస్తున్నారు, జాతీయవాదం, సామాజిక సంస్కరణ,  స్వపరిపాలనపై ఆయన ఆలోచనల గురించి లోతుగా పరిశీలిస్తున్నారు.  ఆయన  భావజాలం స్వాతంత్ర్యానంతరం వివిధ ఉద్యమాలతో ప్రతిధ్వనించింది. 1980లలో ప్రారంభమైన నర్మదా బచావో ఆందోళన్, పర్యావరణ పరిరక్షణ,  పెద్ద ఆనకట్ట ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులైన వర్గాల హక్కులను కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది. సావర్కర్ ప్రధానంగా సాంకేతిక పురోగతి,  జాతీయ పురోగతిపై దృష్టి సారించినప్పటికీ, అతని ఆలోచనలు స్థిరమైన అభివృద్ధి కోసం, పర్యావరణ,  సామాజిక సమస్యలతో వృద్ధిని సమతుల్యం చేయడం కోసం  ఆధునిక ఉద్యమాలలో ఔచిత్యాన్ని పొందుతాయి. *రూపశ్రీ.

మనిషిలో విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా?

అనగనగా ఓ రాజ్యం ఉండేది.  ఆ రాజ్యానికి ఓ రాజున్నాడు, రాణి కూడా ఉంది. ఆ రాజ్యంలో ఓ సన్యాసి కూడా ఉన్నాడు. ఆ సన్న్యాసి ప్రత్యేకత ఏమిటంటే, అతడు అబద్ధం వినలేడు. అబద్ధం ఆయన చెవిన పడిన వెంటనే అది అబద్దం అని ఆయనకు తెలిసిపోతుంది. దాని కారణం వల్ల ఆయన తన తల మీదున్న ఓ వెంట్రుకని లాగి పడేసేవాడు. అది ఆయనకు అలవాటో లేక అది అందులో ఏదైనా రహస్యం ఉందొ ఎవరికీ తెలీదు. కానీ అలా అబద్దం వినగానే వెంట్రుక లాగి పడేయడం ఆ రాజ్య రాజుకి తెలిసింది. ఆయన గొప్ప సన్యాసి అనే కారణంతో పట్టణం పొలిమేరల్లో ఉన్న వనంలో ఓ ఆశ్రమం కట్టించి ఇచ్చాడు రాజు.  అయినా సరే, ఏవో అబద్ధాలు ఆయన చెవిన పడుతూనే ఉన్నాయి. ఆయన వెంట్రుకలు పీక్కుంటూనే ఉన్నాడు. చివరికి ఆయన తలపై ఒకే వెంట్రుక మిగిలింది. అదొక్కటే పోతే ఆయన మరణిస్తాడు అని తెలిసి ఆ సన్యాసి ఉంటున్న ఆశ్రమ పరిసరప్రాంతాలలో ఎవరూ మాట్లాడకూడదని ఆజ్ఞ జారిచేసాడు రాజు. రాజు ఆజ్ఞ ప్రకారం అక్కడ ఎవరూ తిరిగేవారు కాదు, ముఖ్ట్లాడేవారు కూడా కాదు.  పట్టణం పొలిమేరలో ఆశ్రమానికి పక్కనే ఒక తోట ఉంది. అది రాజుగారి తోట. ఓ రోజు రాజు, రాణి తోటలో విహరిస్తున్నారు. శృంగారసరససల్లాపాలు ఆడుతున్నారు. రాణి మీదకు ఓ పువ్వు విసిరాడు రాజు, ఆ దెబ్బకు తట్టుకోలేక పడి పోయినట్టు నటించింది రాణి. వెంటనే రాజు ఆమెకు ఉపశమనాలు చేయటం ప్రారంభించాడు. ఇంతలో రాజుకు 'హుం'కారం వినిపించింది.  "అంతా అబద్ధం నటన!" అంటూ అరుస్తూ రాజు, రాణి ఉన్నచోటుకు వచ్చాడు సన్న్యాసి. "నాకు తెలుసు, రాణికి దెబ్బ తగలలేదు. అంత సుకుమారి కాదామె!" అని అరచి, తలమీద ఉన్న ఒక్క వెంట్రుక పీకేసుకుని అక్కడే పడి మరణించాడు సన్న్యాసి. జరిగిందానికి రాజు విచారించాడు. ముఖ్యంగా సన్న్యాసి విచక్షణరాహిత్యానికి మరింత విచారించాడు. ఎందుకంటే, రాణిది నటనే అయినా శృంగార సమయంలో అది చెల్లుతుంది. ఇది అర్థం కాని సన్న్యాసి మాటల అర్థం వెంట పడ్డాడు కానీ సందర్భాన్ని పట్టించుకోలేదు. సందర్భాన్ని బట్టి మనుషుల మాటల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలనేది ఇక్కడి విషయం. పిల్లలకు బ్రహ్మభావన వివరించేటప్పుడు ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాలి. "ప్రపంచమంతా బ్రహ్మమయం" అన్న భావనను అపార్థం చేసుకునే  మూర్ఖులు ఉన్నారు ఈ ప్రపంచంలో.  ప్రపంచమంతా బ్రహ్మమయమై, అంతా ఆయన ఇష్టప్రకారం జరిగితే మనం చేసేదేం లేదు. అంతా కర్మప్రకారం జరుగుతుందని చేతులు ముడుచుకుని కూర్చునే ప్రయత్నాలు చేస్తారు కొందరు. అబద్ధాల విషయంలో సన్న్యాసి ప్రదర్శించిన మూర్ఖత్వం లాంటిదే ఇది కూడా. కాబట్టి సృష్టికర్తపై మనుషులకు ఉన్న విశ్వాసం ఆ వ్యక్తిలో శక్తిలా ఎదగాలి తప్ప, బలహీనతలా మారకూడదు. బలహీనతలా ఎలా మారుతుందో మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం నిజజీవితంలో వాటిని  అనుభవిస్తూనే ఉంటాం కూడా.. దాన్ని శక్తిగా మార్చుకోవడమే మనుషుల్లో ఉండాల్సిన గుణం.                                     ◆నిశ్శబ్ద.

తల్లిదండ్రులు తెలియకుండా చేస్తున్న ఈ తప్పులు పిల్లలను దూరం చేస్తాయ్..!

  పిల్లలను పెంచడం అనేది బాధ్యతాయుతమైన,  కష్టమైన పని. తల్లిదండ్రుల ప్రతి మాట పిల్లల జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును  మెరుగ్గా ఉంచడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులుగా మారడం ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన అనుభూతి, కానీ తల్లిదండ్రులుగా సమర్థవంతమైన బాధ్యత కత్తిమీద సాము వంటిదనే చెప్పవచ్చు.  ప్రస్తుత కాలంలో పెంపకం కూడా చాలా మారిపోయింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల సమయం లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలు తల్లిదండ్రులకు  ఇబ్బందిగా మారుతున్నాయి. తమ పిల్లలకు మంచి పెంపకాన్ని అందించాలంటే డబ్బు బాగా సంపాదించాలని  తల్లిదండ్రులు  పగలు రాత్రి కష్టపడి పనిచేస్తారు.    విద్య, మంచి బట్టలు,  ఖరీదైన వస్తువులు ఇస్తారు.  అయితే, ఇవన్నీ ఉన్నప్పటికీ చాలా సార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దూరం అవుతుంటారు. పిల్లలను వారి తల్లిదండ్రుల నుండి దూరం చేసే తల్లిదండ్రుల 3 తప్పులు ఉన్నాయి.  అవేంటంటే..   రిజెక్ట్ చేయడం.. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాట ఏ విధంగానూ వినడం లేదని ఆందోళన చెందుతుంటారు.   ఈ కారణంగా తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య గొడవలు అవుతుంటాయి. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు,  పిల్లల మధ్య సరైన వాతావరణం  లేకపోవడం. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు చెప్పే ప్రతిదాన్ని పట్టించుకోకపోవడం లేదా పిల్లలు చెప్పిన దాన్ని వ్యతిరేకించడం, రిజెక్ట్ చేయడం చేస్తారు.దీని కారణంగా  పిల్లలు కూడా తల్లిదండ్రులతో అదే విధంగా ప్రవర్తిస్తారు.ఈ సమస్య పోవాలంటే పిల్లలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కూర్చుని పిల్లలతో మాట్లాడాలి. సమయం.. నేటికాలం  తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని  డబ్బు సంపాదనలో మునిగిపోతున్నారు.  దీని కారణంగా వారికి పని ఒత్తిడి పెరుగుతుంది.   పగలు మరియు రాత్రి పనిపై దృష్టి పెట్టడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీని కారణంగా పిల్లలు ఒంటరితనం ఫీలవుతారు.  తల్లిదండ్రులు  పిల్లల మధ్య దూరం పెరగడానికి ఇదే కారణం. పోలిక..  తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చుతారు. చదువు అయినా, ఆటలు అయినా, ప్రతి చిన్న విషయానికి  పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారి మనస్సులలో న్యూనతా భావన ఏర్పడుతుంది. దీని కారణంగా, పిల్లలు తల్లిదండ్రులపై కోపంగా ఉండి, వారికి దూరంగా ఉండటం మొదలుపెడతారు. తమ తల్లిదండ్రులను శత్రువులుగా భావిస్తారు.                                     *రూపశ్రీ.

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

  వివాహం  తర్వాత అబ్బాయి,  అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోతుంది. దీన్ని జన్మజన్మల బంధం అంటారు.  దీనికి తగినట్టు భార్యాభర్తలు ఇద్దరూ వివాహం తరువాత అన్యోన్యంగా లేకపోయినా.. ఏవైనా విషయాలలో ఇబ్బందులు, అపార్థాలు తలెత్తినా ఆ బందం చాలా క్లిష్టంగా మారుతుంది.  వివాహ సంబంధంలో భాగస్వామి మద్దతు ఇవ్వకపోతే ఆ సంబంధాన్ని కొనసాగించడం చాలా కష్టమవుతుంది. కుటుంబ సభ్యుల ఇష్టానుసారం పెద్దలు కుదిర్చిన వివాహం జరగడంలో చాలా వరకు పెద్దల ఇష్టం.. ఇరు కుటుంబాల ప్రయోజనాలు అన్నీ దృష్టిలో ఉంటాయి. కానీ కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు మాత్రం ఇబ్బందులలో ఇరుక్కుపోతారు. కేవలం అమ్మాయి,  అబ్బాయి ఒకరినొకరు చూసుకుని ఇష్టపడితే సరిపోదు. చాలా విషయాలలో స్పష్టత అవసరం అవుతుంది.  జీవితంలో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాలలో వివాహం ఒకటి. అందుకే ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు తెలివిగా వ్యవహరించడం ముఖ్యం. పెళ్లికి ముందు.. ప్రతి వ్యక్తి,  కుటుంబం భిన్నంగా ఉంటారు. కాబట్టి కుటంబాలను,  అమ్మాయి లేదా అబ్బాయిని పలుమార్లు కలవడం చాలా ముఖ్యం. అయితే చాలా వరకు కేవలం ఒకసారి అటువైపు వారు, ఇటువైపు వారు ఒకరింటికి ఒకరు వెళ్లి విషయాలు మాట్లాడుకుని పెళ్లి ఖాయం చేసుకుంటారు. కానీ  పెళ్లి చేయాలని అనుకున్న తరువాత తొందర పడకుండా  3 నుండి 5 సార్లు ఒకరింటిని మరొకరు సందర్శించడం చాలా మంచిది. ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి,  కుటుంబాలను తెలుసుకోవడానికి,  ఒకరినొకరు తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునేవారు ఒక్కసారి కుటుంబాలను, ఇళ్లను చూసి పెళ్లి ఖాయం చేసుకోవద్దు. ఇది ఇబ్బందులనే కాదు.. మోసాన్ని కూడా  వెంటబెట్టుకుని ఉంటుంది. మొదటిసారి పరిచయాలు చేసుకోవడం, అబ్బాయి లేదా అమ్మాయి విద్య,  ఉద్యోగం, కుటుంబం గురించి మాట్లాడటం,  వారి ఆసక్తులు, అభిరుచులు,  నచ్చినవి, నచ్చినవి అన్ని తెలుసుకోవాలి.  వీలైతే పెద్దల అనుమతి తీసుకుని అమ్మాయి, అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకోవడం మంచిది. చాలా మంది పెద్దలు అమ్మాయి, అబ్బాయి ఒకటైతే తరువాత వారే అన్నింటికి అడ్జస్ట్ అయిపోతారు అని అంటుంటారు. కానీ అది చాలా తప్పు.   ఇద్దరూ అపార్థాలు చేసుకుంటే బంధం అస్సలు నిలబడదు. రెండవ సారి కలిసినప్పుడు అమ్మాయికి, అబ్బాయికి జీవితం గురించి ఉండే లక్ష్యాలు, నెరవేర్చుకోవాలని అనుకునే కలలు,  కెరీర్,  ప్రణాళికలు, జీవనసైలి, భవిష్యత్తు గురించి ఉన్న ఆలోచనలు అన్నింటి గురించి మాట్లాడుకోవాలి. కుటుంబ విలువలు, సాంప్రదాల గురించి,  వివాహం తరువాత రెండు కుటుంబాల గురించి ఇద్దరూ నడుచుకోవలసిన విధానం గురించి మాట్లాడుకోవాలి.  చాలామంది పెళ్లి తర్వాత ఆడపిల్ల ఇంటికి ప్రాముఖ్యత అవసరం లేదని అనుకుంటారు. కానీ ఇది అమ్మాయిని చాలా బాధపెడుతుంది.  అలాగే పండుగలు, ఆచారాల గురించి కూడా తెలుసుకోవాలి. మూడవసారి ఇద్దరూ ఒకరికి ఒకరు ఎంత ప్రాధాన్యత ఇస్తారు.  ఇద్దరి మధ్య ఎంతవరకు సమన్వయం కుదిరింది వంటి విషయాలు అర్థం చేసుకోవాలి. ఇద్దరూ మాట్లాడుకొనేటప్పుడు ఒకరిని మరొకరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది ముఖ్యం. రెండు వైపులా కుటుంబాలు,  స్నేహితులు మొదలైన విషయాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. నాలుగవ సారి కలిసినప్పుడు బాధ్యతల గురించి, అంచనాల గురించి. ఆర్థిక విషయాల గురించ, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల గురించి. భాగస్వామికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి.. ఇలా అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. రెండు వైపులా కుటుంబాలు ముందే చెప్పకుండా కూడా ఒకరి కుటుంబాన్ని మరొక కుటుంబం కలవచ్చు. దీనివల్ల కుటుంబాల ప్రాధాన్యతలు అర్థం అవుతాయి. వివాహ బంధం కుదుర్చుకోవడానికి ఏదైనా సంశయం అనిపిస్తే ఎలాంటి  మొహమాటానికి పోకుండా నిజాయితీగా  సమస్యను చెప్పి సంబంధం విడిచిపెట్టడం లేదా.. సమస్య పరిష్కారానికి ముందే సరైన ప్రణాళిక చేయడం ముఖ్యం.  ఇలా అన్ని విధాలా అన్ని సార్లు కలిసి మాట్లాడుకున్న తరువాతే సంబంధాలు ఖాయం చేసుకోవడం మంచిది. లేకపోతే నేటి కాలపు తొందరపాట్ల వల్ల పెళ్లి అనేది మూణ్ణాళ్ల ముచ్చట అవుతుంది.                                   *రూపశ్రీ.  

ఉగ్గుపాల వంటి మాతృ భాషను మరవకూడదు.. 

మనం మాట్లాడటానికి  భాష ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతీ వ్యక్తికీ మొదట పరిచయమయ్యేది మాతృభాషే.  ఈ భాష ద్వారానే మనం మొదటిసారి మాట్లాడటం, వినటం, అర్థం చేసుకోవటం నేర్చుకుంటాం. మన అనుభవాలను, భావోద్వేగాలను  వ్యక్తపరచగలుగుతాము.  ఇది మన సంస్కృతిని, మూలాలను గుర్తుచేస్తుంది.  అనుబంధాలను మరింత బలపరుస్తుంది. ప్రతి మనిషికి తన మాతృభాషంటే ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది.  కానీ నేటి కాలంలో పర బాషలు మాతృభాషను మసకబారేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంగ్ల భాష వల్ల జీవితం అభివృద్ది అవుతుందని,  అందలాలు ఎక్కవచ్చని తలచి.. చిన్న పిల్లలకు ఉగ్గుపాల లాగా ఆంగ్లభాషను నేర్పుతున్నారు చాలామంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషా వైవిధ్యాన్ని, మాతృభాషా పరిరక్షణను ప్రోత్సహించేందుకు  ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం  జరుపుకుంటారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఈ దినోత్సవం ఎప్పుడు మొదలైంది.. మాతృభాషా దినోత్సవం 1999వ సంవత్సరంలో జరిగిన యునెస్కో జనరల్ కాన్ఫరెన్సు మీటింగులో ఆమోదించించబడింది.  దీనికి బంగ్లాదేశ్ లో  జరిగిన బంగ్లా భాషోద్యమం ప్రేరణగా నిలిచింది.  ప్రపంచవ్యాప్తంగా భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి  ఈ దినోత్సవాన్ని 2000వ సంవత్సరం నుండి  జరుపుకుంటున్నారు.  ఇది 2025నాటికి  25వ వార్షికోత్సవ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు  జరుపుకోనుంది. మమతల భాష.. మాతృభాష అనేది మన సంస్కృతి, సంప్రదాయాలు, జ్ఞానాన్ని  తరతరాలకు అందించే సాధనం. అంతేనా  మనిషికి మొదట మమతానురాగాలను పంచేది మాతృభాషే.. మాతృభాషలో చదువుకుంటే విషయాలను అర్థవంతంగా, సులభంగా గ్రహించగలం. దీన్ని కాపాడితేనే భవిష్యత్తు తరాలకు మన భాషను, సంస్కృతిని అందించగలుగుతాం.  తక్కువమంది మాట్లాడే  భాషలను, ఆదివాసీ భాషలను కాపాడకపోతే వారి జాతి, సంస్కృతి కూడా  అంతమైపోతుంది. అందుకే ప్రతీ ఒక్కరు వారి మాతృభాషని రక్షించుకోవాలి. నేటి పిల్లలలో చాలామంది ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ఆరాటంలో అది సరిగా నేర్చుకోలేక, ఇటు మాతృభాష కూడా చదవటం రాక ప్రశ్నార్ధకంగా  మిగిలిపోతున్నారు. ప్రతీ మనిషికి ప్రాధమిక విద్య మాతృభాషలోనే జరిగితే వారి భవిష్యత్తుకి ఉపయోగపడుతుందని చాలా పరిశోధనలు చెప్తున్నా కూడా ఇప్పటి వాళ్లు అర్ధం చేసుకోలేకపోతున్నారు.  మాతృభాష అమ్మ మాటలాంటిది. మన మాతృభాషకి మర్యాదనిస్తూనే, ఇతరుల భాషని  గౌరవించాలి. భారతదేశంలోని  భాషా వైవిధ్యం...... భారతదేశం అనేక భాషలకు పుట్టినిల్లు. ఇక్కడ 1,600 కంటే ఎక్కువ భాషలు, మాండలికాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో 22 భాషలు అధికారికంగా గుర్తించబడ్డాయి. హిందీ, బెంగాళీ, తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ, పంజాబీ, మలయాళం, ఒడియా వంటి భాషలు ఎక్కువమంది  మాట్లాడే భాషలుగా ఉన్నాయి. భారత ప్రభుత్వం తమిళం, సంస్కృతం, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన భాష హోదా కూడా ఇచ్చింది. తక్కువమంది మాట్లాడే  భాషని, రాసే లిపిని, వారి సంస్కృతులని  పరిరక్షించుకునే హక్కుని 29వ ఆర్టికల్  ద్వారా  మన రాజ్యాంగం కల్పిస్తుంది. భాష సంరక్షణ పథకాల అమలు ద్వారా,  ప్రాచీన భాషలకు గుర్తింపునివ్వటం ద్వారా, పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన చేయటం ద్వారా ,  భాష పరిశోధనని  ప్రోత్సహించటం ద్వారా భాషలు అంతరించిపోకుండా  కాపాడడం వీలవుతుంది. వివిధ భాషలను పరిరక్షించడం ద్వారా సమాజంలోని ప్రజలు ఒకరినొకరు గౌరవించే తత్త్వాన్ని అలవర్చుకుంటారు.  ఇది అంతర్గత ఐక్యతని  పెంపొందిస్తుంది.   తెలుగు భాష తీయదనం..... తెలుగు భాషను "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" గా పిలుస్తారు.  దీని మాధుర్యం, వ్యాకరణ పరిపుష్టత,  ప్రాచీన సాహిత్య సంపద కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రాముఖ్యత కలిగిన ద్రావిడ భాష గానూ,  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రధాన భాషగానూ  ప్రాచుర్యంలో ఉంది.  ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది పైగా తెలుగు భాష మాట్లాడేవారున్నారు. ఇతర దేశాల్లో కూడా తెలుగు మాట్లాడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.   భాషా పరిరక్షణ, భాషా వైవిధ్యం, మాతృభాషల ప్రాముఖ్యతను గుర్తు చేయడమే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ లక్ష్యం.   మాతృభాషను గౌరవించి, భవిష్యత్ తరాలకు అందించడం మన కర్తవ్యంగా భావించాలి. మన మాతృభాషను గౌరవిస్తూ, తద్వారా దేశ భాష వైవిధ్యాన్ని కూడా సంరక్షించాలి. "భాష మన సంస్కృతికి ప్రతిబింబం" కాబట్టి మన భాషను కాపాడటం మన బాధ్యత!                                   *రూపశ్రీ.

జీవితంలో ఎదగాలన్నా, ఆగిపోవాలన్నా కారణం ఇవే!

మనిషి జీవితంలో వర్తమానం మాత్రమే చాలా ముఖ్యమైన అంశం. అయితే గతం అనేది అనుభవాలు మిగులుస్తుంది, అదే జ్ఞాపకాలను మనదగ్గర వదిలిపోతుంది. ఆ జ్ఞాపకాలను తలచుకుంటూ ఉంటే గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉన్నట్టే. చాలామంది గతంలో ఇలా అని వాటి గురించి ఆలోచిస్తూ వర్తమానంలో సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు.  గతాన్ని, వర్తమానాన్ని రెంటినీ సరిచూసుకుంటూ గతాన్ని తలచుకుంటూ అక్కడే ఉండిపోతారు కొందరు. వర్తమానంలో లక్ష్యాలను నిర్ణయించుకోవాలి, ఆ లక్ష్యాలను సాధిస్తూ వ్యక్తిత్వాన్ని క్రమంగా ఒక ఉన్నత స్థాయికి చేర్చుకోవాలి. అప్పుడే వ్యక్తిత్వం ఎదిగినట్టు అవుతుంది. మనుషులకు సంస్కారం ఎంతో ముఖ్యం. ఒక సమాజ పౌరుడిగా, నాయకుడిగా, ప్రతిభ కలిగిన కళాకారులుగా, గొప్ప ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలుగా ఈ సమాజంలో రూపాంతరం చెందాలి. అప్పుడే సమాజం ముందుకు సాగుతుంది. గతాన్ని గురించి ఆలోచించే వ్యక్తుల వల్ల సమాజం, కులం, దేశం ముందుకు కదలకుండా అభివృద్ధి అనేది లేకుండా అక్కడే ఆగిపోతాయి. వారి అభివృద్ధి శూన్యంగా ఉంటుంది. ఈ ప్రపంచం అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం మనిషి ఆదిమకాలం నుండి అక్షరాస్యుడిగా ఎదగడం అనే విషయాన్ని అందరూ చూపిస్తారు. అయితే గతాన్ని గురించే ఆలోచించేవారు ఆధునిక సమాజంలో ఆదిమానవులు జీవించినట్లుగా ఉంటుంది. అంటే అభివృద్ధి శూన్యమని అర్థం. ఎప్పుడూ గతానికి అనుకూలంగా బతకకూడదు. మనిషి జీవితం ఎలా ఉండాలంటే వర్తమానం నుండి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తున్నట్టు ఉండాలి. అంటే వర్తమానం నుండి గతం ఆలోచించడం అనేది ఇంకా వెనక్కు వెళ్తున్నట్టు అని అర్థం.  అనవసరమైన భయాలు, అనుమానాలు వదిలివేయాలి. ఈ ప్రపంచంలో సంస్కృతి, అలవాట్లు గతంనుంచి వస్తున్నవే. అవి ఇప్పక్టికిప్పుడు పుట్టి మనుషుల్ని నసహణం చేయలేదు. సంస్కృతి, అలవాట్లు అనేవి ఎప్పుడూ జీవితంలో ఎదుగుదలకు ఆటంకాలు కాకూడదు. జీవితంలో ఎదుగుదలకు ఇబ్బంది అయ్యే ఆలోచనలను, స్నేహాలు, న్యాయకత్వాలను వదిలేసుకోవాలి.   ఈకాలంలో మనిషి తనకు తాను ఎంపిక చేసుకోగలిగినన్ని అవకాశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇది రాజులకాలం నాటి పాలన కాదు, భూస్వాముల నాటి అజమాయిషీ కాదు, కుల వ్యవస్థలో కూరుకుపోయే దశ కాదు. ఇది మనిషి చైతన్యవంతుడై ఈ ప్రపంచాన్ని శాసించవలసిన పారిశ్రామిక సమాజం, ప్రజాస్వామిక సమాజం, ప్రపంచీకరణ పొందుతున్న ప్రజాస్వామిక సమాజం. జీవితాన్ని గెలుచుకోవడం వైపే మనుషుల ఆలోచనలుండాలి. జీవితాన్ని గెలుచుకోవడానికి స్ఫూర్తిని ఇచ్చే వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే మనిషి ఆలోచన మారుతుంది.  ఈ ప్రపంచంలో మనిషిని ఒక వృత్తంలో ఉంచడానికి ఎన్నో పద్ధతులను, మరెన్నో విషయాలను నిర్ణయించారు. వీటిలో మతాలు, మతాల విశ్వాసాలు కూడా ఒకటి. ఎన్నో సిద్ధాంతాలు మనుషుల్ని కొన్ని అవకాశాలకు దూరం చేస్తాయి  వాటిని నమ్మితే మంచి, లేకుంటే చెడు అన్నట్టు అవి నొక్కి వక్కాణిస్తాయి. కానీ నిజానికి ఇలాంటి ఆలోచనలే నిజమైన సమస్యలు సృష్టిస్తాయి. ఈ ప్రపంచంలో మనిషి ఎదుగుదలకు తెలివి, కష్టం, ఆత్మవిశ్వాసం వంటివి మాత్రమే దోహదం చేస్తాయి తప్ప మతవిశ్వాసాలు, మతపరమైన నమ్మకాలు కాదు. ప్రతిదీ హేతుబద్ధంగా ఆలోచించాలి. హేతుబద్ధంగా ఆలోచించినప్పుడే విషయం పూర్తిగా అర్థమవుతుంది. మతపరమైన కారణాల వల్లనో, ఇతర కోణాల్లోనో ఆలోచిస్తే వాటిలో ఖచ్చితమైన సారాంశం అర్థం కాదు. ఏదైనా మనసును కల్లోలం చేస్తే దాన్నుండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటపడాలి. ఎదుగుదలకు తగిన నమ్మకాలు ఏర్పరుచుకోవాలి. నూతన జ్ఞానం అందిన కొద్దీ విశ్వాసాలను మార్చుకోవాలి. ఎంత ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటే అంత ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అంత మంచి ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకోగలుగుతాము.  మానవ సంబంధాలలో ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి. అవే  విలువలు. విలువలున్న చాలామందికి  లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు  ఉద్యోగం గురించి కావచ్చు, వేరే ఇతర విషయాలు కావచ్చు. ఇంకా జీవితం, స్నేహాలు, ప్రేమ ఇవన్నీ కూడా విలువలతో కూడుకుని ఉంటాయి. భారతీయ సంస్కృతి కూడా గొప్ప విలువలు కలిగినదే.  వీటి గురించి సరైన సమయంలో సరైనవిధంగా నిర్ణయాలు తీసుకోవాలి. సకాలంలో తీసుకునే నిర్ణయాలు మనిషి జీవితాన్ని ఎంతో అందంగా మారుస్తాయి.  తీసుకునే నిర్ణయాలు సరైనవే అయినా ఆలస్యమైతే అవకాశాలు చేజారుతాయి కదా. ఏవో భయాలు, శకునాలు అడ్డుపెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోతే అపుడు జరిగేది నష్టమే. ఏఏ విలువలు, లక్ష్యాలు, మన సంస్కృతి మొదలైనవాటిని ఒక కోణంలో నుండి చూసే అలవాటు వల్ల అందరికీ ఆవైపు మాత్రమే అర్థమవుతుంది. అందుకే విషయాన్ని మొత్తం క్షుణ్ణంగా అన్ని కోణాల్లో నుండి చూడాలి, అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎదగడానికి, ఆగిపోవడానికి కూడా ఒక విషయాన్ని చూసే కోణం కారణమవుతుంది.                                         ◆నిశ్శబ్ద.

సమానతలు లేని సమాజమే మన ధ్యేయం.. 

    రాజుల కాలం నుంచి రాజ్యాంగాలు రాసుకున్న కాలం దాకా వచ్చిన మన సమాజంలో  ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం దొరకని అంశం ఒకటుంది. అదే సామాజిక న్యాయం.  ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయం సాధించాల్సిన  ఆవశ్యకతని గుర్తించి  2007లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని  ప్రకటించింది.  2009 నుండి ప్రతి సంవత్సరం  ఫిబ్రవరి 20న అధికారికంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  ఈ దినోత్సవం ప్రధానంగా పేదరిక నిర్మూలన, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక అసమానతల తొలగింపు, లింగ సమానత్వం, ఉపాధి హక్కులు, సమానావకాశాల ప్రోత్సాహం వంటి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు  సహాయపడుతుంది. విభిన్న సంస్కృతులు, భిన్న సామాజిక స్థాయిలున్న భారతదేశంలో  సామాజిక న్యాయం అందించటం ఎంత అవసరమో, అది సాధించటంలో  ఉన్న సవాళ్లేమిటో, మన దేశం తీసుకుంటున్న చర్యలేమిటో తెలుసుకుంటే.. భారతదేశంలో సామాజిక న్యాయం.. చరిత్రపరంగా భారతదేశం సామాజిక అసమానతలు, కుల వివక్ష, లింగ వివక్ష, ఆర్థిక అసమానత వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. అయితే, భారత రాజ్యాంగ నిర్మాత అయిన  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం సామాజిక న్యాయం అనే భావనకి  ప్రత్యేక  స్థానాన్నిచ్చింది.  భారత రాజ్యాంగం కుల, మత, లింగ, ప్రాంత, ఆర్థిక వివక్ష లేకుండా సమాన హక్కులు కల్పించటం ద్వారా,   సంపద కొద్దిమంది చేతిలో మాత్రమే కేంద్రీకృతం కాకుండా  ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా,  ప్రతీ పౌరుడికి సమాన రాజకీయ హక్కులు ఉండేలా చూస్తుంది. అలాగే  సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాలకి విలువనిచ్చింది.  ఈ లక్ష్యాలను అనుసరించి ప్రభుత్వం విభిన్న సంక్షేమ పథకాలు, చట్టాలు, విధానాలు అమలు చేస్తోంది. సామాజిక న్యాయం కోసం.. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం విద్య-ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యార్థులకు ఉచిత వసతి గృహాలు, స్కాలర్‌షిప్లు, ఎస్సీ/ఎస్టీ సబ్‌ ప్లాన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను  అమలు చేస్తున్నారు. “ఎం‌జిఎన్‌ఆర్‌ఈజిఏ” పధకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని  పేదల కోసం 100 రోజుల పనిని కల్పించి,    లక్షలాది గ్రామీణ కుటుంబాలకి  ఉపాధినిస్తున్నారు.  మహిళలపై వివక్ష తగ్గించేందుకు, లింగ సమానత్వం పెంచేందుకు ప్రయత్నం చేస్తూనే,  ‘బేటీ బచావో, బేటీ పడావో’ వంటి పధకాల ద్వారా  బాలికల భద్రత, విద్య, ఆర్థిక స్వతంత్రతల మీద   దృష్టి పెట్టారు. "ప్రతి భారతీయుడికి గృహం" అనే లక్ష్యంతో ఉన్న  ప్రభుత్వం ‘ప్రధాన్ మంత్రీ ఆవాస్ యోజన’ పథకం ద్వారా పేదలకు తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణం చేస్తుంది. ఆర్థికంగా బలహీనమైన  కుటుంబాలకు 5 లక్షల రూపాయల  వరకు ఉచిత వైద్యం అందించే లాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా పేరు పొందిన ‘ఆయుష్మాన్ భారత్’ పధకాన్ని మన దేశం అమలు చేస్తుంది. అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్ భద్రత కోసం , ఉద్యోగ అవకాశాలు, బీమా వంటివి అందించటం కోసం  ‘ఇ-శ్రమ్ పోర్టల్’ నిర్వహిస్తుంది.   సమస్యలు-సవాళ్లు.. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ సమాజంలో మార్పు రాకపోవటంతో  భారతదేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కులం ఆధారంగా వివక్ష కొనసాగుతోంది.  అందుకే సామాజిక ఆలోచనని మార్చే ప్రయత్నం చేయాలి. విద్య, ఉపాధి, వేతనాల్లో మహిళలకు సమాన అవకాశాలు దొరక్క లింగ అసమానత కొనసాగుతూ ఉంది. భారతదేశంలో కోటీశ్వరులు ఉన్నప్పటికీ, పేదరికంలో బతికే కోట్ల మంది ప్రజలు కూడా ఉన్నారు. వీరిని దారిద్ర్య రేఖనుంచి పైకి తీసుకొచ్చి  ఆర్థిక న్యాయం చేయటానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి.  ఇప్పటికీ విద్య, వైద్య సేవల్లో అసమానత ఉంది.  కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో  నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం మనకు సమాజంలోని అసమానతలను గుర్తించి, వాటిని తొలగించే మార్గాలను అన్వేషించేందుకు ప్రేరణ కల్పిస్తుంది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో సామాజిక న్యాయం అమలు చేయడం అత్యంత కీలకం. సమాన అవకాశాలు, సమాన హక్కులు, సామాజిక సంక్షేమం అనే విలువలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వ విధానాలు, చట్టాలు ఎంతగానో సహాయపడతాయి. అయితే ప్రతీ పౌరుడు సామాజిక న్యాయం అమలు చేయడంలో పాత్ర వహించాలి. కుల వివక్ష, లింగ వివక్ష, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు సమాజంగా కలిసి కట్టుగా పనిచేయాలి.                                          *రూపశ్రీ.

విద్యార్థులు విజయం సాధించాలి అంటే.. ఈ పనులు చెయ్యాలి!

  ప్రతీ విద్యార్థి సర్వసాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య పట్టుదల కోల్పోవడం. సాధారణంగా విద్యార్థి మనస్తత్వం ఎలా ఉంటుందంటే 'సినిమాకు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు వర్షం కురిస్తే దాన్ని ఆటంకంగా భావించడు. అదే వర్షం కళాశాలకు బయలుదేరుతున్నప్పుడు పడితే దాన్ని మాత్రం పెద్ద ఆటంకంగా భావిస్తాడు'. అందుకు కారణం అతడి అభిరుచి చదువుపై కన్నా సినిమాపైనే అధికంగా ఉండడమని మనకు అర్థమవుతుంది. అభిరుచి - ఉత్సాహం - మనోబలం = లక్ష్యసిద్ధి.  ముందు మనం చేసే పని మీద అభిరుచి కలిగి ఉండాలి. ఎప్పుడైతే పని పట్ల అభిరుచి ఏర్పడుతుందో అప్పుడు దాన్ని సాధించేందుకు ఉత్సాహం పెరుగుతుంది. అలాంటి ఉత్సాహం ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొనే మనోబలాన్ని సమకూరుస్తుంది. ఆ మనోబలంతో లక్ష్యాన్ని సాధించవచ్చు. విద్యార్థి అయినా, వ్యాపారవేత్త అయినా, శాస్త్రవేత్త అయినా, ఏ ఇతర రంగానికి చెందినవారైనా తమ లక్ష్యసిద్ధికి పైన తెలిపిన సూత్రమే అనుసరణీయం. మానవుని ప్రగతి సౌధానికి ఉత్సాహమే పునాది. ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చనే మనోబలం చేకూరుతుంది. అది లేకపోతే అంతా అసాధ్యంగా తోస్తుంది.  Enthusiasm is at the bottom of all progress. With it there is accomplishment. Without it there is only disappointment. Mary Mc Carthy ఉత్సాహం గమ్యాన్ని చేర్చే వాహనమైతే, దాన్ని నడిపించే ఇంధనమే మనోబలం. జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ సాధించ లేకపోవడానికి కారణం మనోబలం లేకపోవడం. ఏమీ లేకపోయినా దేనినైనా సాధించడానికి కారణం మనోబలం కలిగి ఉండడం. కాళ్ళు, చేతులు లేని అవిటివారైనా, చూపు లేని అంధులైనా, మాటరాని మూగవారైనా, కటిక దారిద్య్రం కబళించినా మనోబలంతో దేనినైనా సాధించవచ్చని నిరూపించిన మహాత్ములెందరో ఉన్నారు. అలాంటి మహాత్ముల గురించి తెలుసుకుంటే మన లక్ష్యసిద్ధికి కావాల్సిన అభిరుచి, ఉత్సాహం, మనోబలం పెంపొందుతాయి. అంధత్వం, మూగతనం, చెవుడు - మూడూ కలిసి పరిహాసం చేసినా దిగులుచెందక అంతరిక్షంలో తొలిసారిగా పయనించిన మహిళ తెరిస్కోవా. చెవిటివాడైనా సంగీత సామ్రాజ్యానికి సామ్రాట్గా నిలిచాడు బెతోవెన్. కటిక దారిద్య్రం కాఠిన్యం  ప్రదర్శించినప్పటికీ విద్యావంతులై భారత ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి, అమెరికా అధ్యక్షునిగా అబ్రహం లింకన్లు ఖ్యాతి గడించారు. ఆగని కెరటాలలా ఒకదాని తరువాత ఒకటి వచ్చే అపజయాలకు నిరాశ చెందకుండా ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగారు థామస్ ఆల్వా ఎడిసన్. ఇలాంటి స్ఫూర్తి దాతలు ఎంతోమంది ఉన్నారు. వీరందరినీ చరిత్ర పుటల్లో చిరస్మరణీయులుగా చేసిన ఒకే ఒక్క మహత్తరశక్తి 'మనోబలం'. అలాంటి మనోబలం, ఆత్మశక్తి మనలో కూడా వృద్ధి చెందాలంటే… మనోబలం పెంపొందడానికి  స్వామి వివేకానంద ఇచ్చిన సందేశాలు ప్రతి నిత్యం మననం చేయాలి. To succeed, you must have tremen- dous perseverance, tremendous will. "I will drink the ocean," says the perse- vering soul, "At my will mountains will crumble up". Have that sort of energy, that sort of will, work hard, and you will reach the goal. - Swami Vivekananda మనోబలానికి మారుపేరుగా నిలిచిన మారుతి వజ్రాసనంలో కూర్చొని ఉండడాన్ని చిత్రపటాల్లో మనం గమనించవచ్చు. వజ్రాసనం మనోబలాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఐదు నిమిషాల పాటు 'వజ్రాసనం' అభ్యసించాలి. ఆత్మశక్తికి ప్రతీకలుగా నిలిచిన వీరహనుమాన్, ధీర వివేకానందలను ఆదర్శంగా తీసుకొని ఈ రెండు సూచనల్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే, మనోబలం తప్పక పెంపొందుతుంది. అప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా సాధించవచ్చు. ఇది విద్యార్థులందరికీ ఎంతగానో తోడ్పడుతుంది.                                        *నిశ్శబ్ద.