హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం అసాధ్యం!!

కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, కమిషనర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు. కరోనా విషయంలో వాస్తవ పరిస్థితికి, మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఏమాత్రం పొంతన లేదని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను గందరగోళ పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రి కరోనా పేషంట్లతో కిక్కిరిసిపోతున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. గాంధీ ఆసుపత్రిలో 2150 మందికి చికిత్స అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో కేవలం 247 మంది కరోనా పేషంట్లు మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారికి చికిత్స అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు. పేషంట్లు ఎక్కువైతే చికిత్స అందించే ఏర్పాట్లు లేవని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. 9.61 లక్షల పీపీఈ కిట్లు, 14 లక్షల ఎన్-95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్స్ 3600 సిద్ధంగా ఉన్నాయి. వెంటిలేటర్లు, టెస్ట్ కిట్లు, ఇతరత్రా పరికారలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎంతమందికైనా చికిత్స అందించడానికి వైద్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నదనే ప్రచారం చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సోకివారికి వైద్య సేవలు అందించేవారికి కూడా వైరస్ సోకుతున్నది. ఇది కేవలం తెలంగాణలోనే జరగడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్ లో కూడా 480 మందికి కరోనా వైరస్ సోకింది. ఐసిఎంఆర్ అంచనా ప్రకారమే భారత్ లో 10వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది. కేవలం తెలంగాణలో మాత్రమే వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నట్లు దుష్ప్రచారం చేయడం బాధాకరమని అధికారులు చెప్పారు. ఏ కారణంతో చనిపోయినా సరే, మరణించిన ప్రతీ ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయడం అసాధ్యమని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ప్రతీ రోజు సగటున 1000 మంది వరకు మరణిస్తుంటారు. వారందరికీ పరీక్షలు చేయడమే పనిగా పెట్టుకుంటే, ఆసుపత్రుల్లో ఇతర వైద్య సేవలు అందించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌లు మృతదేహలకు పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదని అధికారులు గుర్తు చేశారు. కోర్టులో కొందరు కావాలనే పిల్స్ వేయడంవల్ల వైద్యాధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తోందన్నారు. పిల్స్ వేసి వైద్యాధికారుల సమయాన్ని వృథా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాగా, కరోనావిషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలే తప్ప, అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, అదే సమయంలో ప్రజలు కూడా ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువైనా సరే, తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.

భారత్ లో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే

భారత్‌లో రోజుకి 9 వేలకు పైగా కరోనా‌ కేసులు నమోదవ్వడం సాధారమైపోయింది. గత 24 గంటల్లో దేశంలో 9,987 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గత 24 గంటల్లో కరోనాతో 331 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,66,598కి చేరగా, మృతుల సంఖ్య 7,466కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 1,29,215 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,29,917 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 49,16,116 కరోనా టెస్ట్‌లు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లోనే 1,41,682 టెస్టులు నిర్వహించారు. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 49 శాతంగా ఉంది.

సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ!!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సినీ పెద్దలు భేటీ కానున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సినిమా, టీవీ‌ షూటింగ్‌లకు అవకాశం ఇవ్వాలని చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ పెద్దలు నేడు సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో చిరంజీవి నేతృత్వంలోని సినీ బృందం భేటీ కానుంది. చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్‌, కొరటాల శివ, జీవిత, సి.కళ్యాణ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్ లకు అనుమతులు, థియేటర్లలో ప్రదర్శనలు వంటి అంశాలపై వారు సీఎం జగన్ తో చర్చించనున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలతో షూటింగ్ లకు అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా షూటింగ్ లకు అనుమతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే థియేటర్లలో ప్రదర్శనలకు మాత్రం ఇప్పుడే అనుమతినిచ్చే అవకాశం కనిపించడంలేదు.

కేరళ ఏనుగు ఘటనలో కొత్త కోణం

కేరళ రాష్ట్రంలో పేలుడు పదార్థాలు నింపిన పండు తిని గర్భంతో ఉన్న ఏనుగు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఏనుగు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది.  అడవి పందుల నుంచి పంటపొలాలలను కాపాడుకునేందుకు కొందరు స్థానికులు ఆ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన పండ్లను ఎరగా వేస్తారని, అటువంటి ఒక పండునే ఈ ఏనుగు తిన్నదని పర్యావరణ శాఖ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని పర్యావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ఎవరిదీ ఉద్దేశపూర్వక తప్పు లేదని, అయినప్పటికీ, నిందితులను వదిలేది లేదని స్పష్టం చేసింది. ఏనుగు మరణానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకుని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని పర్యావరణ శాఖ తెలిపింది.

డాక్టర్‌ అనితారాణి వ్యవహారంపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశం.. ఇంతలోనే ట్విస్ట్!!

తనను వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ డాక్టర్ అనితారాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, డాక్టర్‌ అనితారాణి వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై నిజానిజాలేంటో తేల్చాలంటూ సీఐడీ దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ఓ వైపు సీఎం ఆమె వ్యవహారంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశిస్తే, మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా వైద్య ఆరోగ్యశాఖపై అసత్య  ప్రచారం చేశారంటూ డాక్టర్‌ అనితారాణిని అధికారులు సస్పెండ్ చేశారు. అనితారాణి మానసిక స్థితి సరిగా లేదని చిత్తూరు జిల్లా వైద్యాధికారి పెంచలయ్య చెబుతున్నారు. ఇప్పటివరకు పనిచేసిన ప్రతిచోట తన తీరుతో వివాదాస్పదమయ్యారని, ఇప్పటికే పలుమార్లు సస్పెండ్‌ అయ్యారని తెలిపారు. అనితారాణిపై గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని, రోగులతో కూడా గొడవలు పెట్టుకునేవారని పెంచలయ్య తెలిపారు. గతంలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పని చేసినప్పుడు ఆరు నెలలకు మించి ఆమె ఎక్కడ పని చేయలేదని గుర్తు చేశారు. డాక్టర్‌ అనితారాణి ఆరోపణలు అవాస్తవమని పెంచలయ్య కొట్టిపారేశారు. అయితే అనితారాణి వ్యవహారంపై సీఎం సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత.. ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేయటం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ ఎమ్మెల్యేలు అందుకే పార్టీ మారలేదట

కొద్ది రోజుల క్రితం ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఐన వైసిపిలోకి జంప్ అంటూ వార్తలు వచ్చాయి. ఒక పక్క మహానాడు జరగబోతుండగా మరో పక్క ఆ ఎమ్మెల్యేలు వైసిపి కీలక నేతలతో చర్చలు పూర్తయ్యాయి ఇక పార్టీ మారడమే.. అని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఐతే తరువాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారడం లేదని కావాలనే కొంత మంది తమ పై కుట్ర చేస్తున్నారని మీడియా ముందు వివరణ ఇవ్వడం జరిగింది. ఐతే ఇది మహానాడు టైం లో కేవలం చంద్రబాబును ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తో వైసిపి పార్టీ వేసిన ప్లాన్ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. వైసిపికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపధ్యం లో ఆ పార్టీకి వేరే పార్టీ ఎమ్మెల్యేల తో పనేంటని వారు అంటున్నారు. ఐతే తమ పార్టీలోకి వచ్చే వారికీ ఎటువంటి రాచమర్యాదలు ఉండవని కేవలం వారి నియోజకవర్గం పనుల్లో ప్రభుత్వ సహకారం ఉంటుందని వైసిపి నేతలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయం లో ఇప్పటికే టీడీపీ ని వీడి వైసిపిలో చేరిన వంశీ, మద్దాలి గిరి వంటి వారికి తమ నియోజక వర్గాల్లో ఆల్రెడీ ఉన్న పార్టీ నాయకుల హవా నడుస్తున్న నేపథ్యంలో వీరికి పెద్దగా ఒరిగిందేమి లేదని టాక్. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారే విషయం పక్కన పెట్టేశారని కూడా టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలపై తమ ఆదేశాలు అమలు చేయడం లేదని హైకోర్టు మండిపడింది. ఆదేశాలు అమలు కాకపోతే వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ధిక్కరణ చర్యలు చేపడతామని, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న ఆదేశాలు కూడా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.  అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని, విచారణ జరగాల్సి ఉందని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.  ప్రజలకు కరోనా ర్యాండమ్ టెస్టులు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తగినంత రక్షణ కిట్లు సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా సోకిందని అభిప్రాయపడింది. మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించిన హైకోర్టు.. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. ఈ నెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్యశాఖను హైకోర్టు ఆదేశించింది.

షూటింగ్ లకు తెలంగాణ సర్కార్ అనుమతి

తెలంగాణలో సినిమా, టీవీ షూటింగులు కొనసాగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ.. సినిమా, టీవీ షూటింగ్ లు కొనసాగించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే, థియేటర్లు తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

పది మంది ఎమ్మెల్యేలు గోడ దూకేస్తారట.. టీడీపీ ఎమ్మెల్యే సంచలనం 

కరోనా ధాటికి కొంత స్తబ్దుగా మారిన రాజకీయాలు తాజాగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కరణ బలరాం వ్యాఖ్యలతో మళ్ళీ వేడెక్కాయి. తన కుమారుడిని వైసిపి లోకి పంపి ప్రస్తుతానికి ఎటు వైపు ఉన్నారో తెలియని సీనియర్ ఎమ్మెల్యే కరణం చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. గతంలో చంద్రబాబు చేసిన నిర్ణయాలతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. జగన ఏడాది పాలన ను విమర్శించినా ప్రజలు మాత్రం సీఎం జగన్ తోనే ఉన్నారని అయన అన్నారు. గత ఎన్నికలలో టీడీపీ ఓటమి పై ఇప్పటికయినా ఆ పార్టీ సమీక్షించుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం రాజకీయాలలో విలువలు లేవని ఐతే ఎమ్మెల్యేలు మాత్రం నియోజక వర్గ అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని ఆయన అన్నారు. త్వరలో 10 నుండి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గోడ దూకే ఛాన్స్ ఉందని ఈ సందర్బంగా అయన బాంబు పేల్చారు.

కేటీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్.. నేనే జేసీబీ నడిపి అక్రమ నిర్మాణం కూలగొడతా!!

జన్వాడలో అక్రమంగా ఫాంహౌస్ నిర్మాణం చేపట్టిన మంత్రి కేటీఆర్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, తప్పు చేసి దొరికిపోయాక కూడా ఏమాత్రం సిగ్గుపడడంలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. 111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారని రేవంత్ ఆరోపించారు. ఆ స్థలం కేటీఆర్‌ లీజుకు తీసుకున్నారని బాల్క సుమన్‌ చెబుతున్నారని, అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్‌ కూడా ట్వీట్‌ చేశారని రేవంత్ గుర్తుచేశారు. అయితే, జన్వాడ ఫాంహౌస్‌ 301 నుంచి 313 సర్వే నెంబర్లలో విస్తరించి ఉందన్న రేవంత్.. 301 సర్వే నెంబర్లో కేటీఆర్‌ సతీమణి పేరిట 3 ఎకరాలు ఉందని తెలిపారు. భూములు లేవని కేటీఆర్‌ పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్నారని మండిపడ్డారు. కేటీఆర్‌ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే బర్తరఫ్‌ చేయాలని రేవంత్‌ డిమాండ్ చేశారు. వట్టినాగులపల్లిలో తమకు భూములున్న మాట వాస్తవమేనన్నారు. తన అక్రమ నిర్మాణం ఎక్కడున్నా కూల్చడానికి సిద్ధమని.. మీరు సిద్ధమా? అని రేవంత్ ప్రశ్నించారు. తాను, తన బావమరిది వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఆ భూముల్లో తాను అక్రమంగా ఒక్క అంగుళంలో నిర్మాణం చేపడుతున్నా కూలగొట్టేందుకు తాను సిద్ధమేనని, తన లాగా కేటీఆర్ కూడా అక్రమ నిర్మాణాలను కూలగొట్టగలరా? అని రేవంత్ సవాల్ విసిరారు. "వట్టినాగులపల్లి లో భవనమో, భవంతో ఉందన్నారు కదా. ఒకవేళ, అక్కడేదైనా అక్రమ నిర్మాణం ఉందంటే నేనే జేసీబీ నడిపి కూలగొడతా. ఆ తర్వాత జన్వాడ వెళదాం. మనిద్దరం ప్రజల ముందు పరీక్షకు నిలబడదాం" అంటూ కేటీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా రేవంత్ మండిపడ్డారు. ఆయన కొడుకు చేసిన అక్రమాలపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి అంటూ నిలదీశారు. తండ్రీకొడుకులు కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజల్ని బలిచేసి విలాసవంతమైన ఫాంహౌస్ లు నిర్మించుకొని పత్తిత్తుల్లాగ మాట్లాడుతున్నారు అంటూ కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కరోనా ను జయించాడు.. కానీ పోలీసులు అరెస్ట్ చేసారు

ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణుకుతోంది. ఎటు పక్క నుండి ఈ వైరస్ తలుపు తడుతుందోనని అందరు భయపడుతుంటే ఆ మహానుభావుడు మాత్రం కరోనా ను జయించిన ఆనందం లో ఊరేగింపు జరిపి పోలీసుల చేతికి చిక్కాడు. అసలు విషయంలోకి వస్తే బెంగుళూరు లోని పేదరాయణ పుర కార్పొరేటర్ కు కొద్దీ రోజులక్రితం కరోనా సోకింది. ఐతే ప్రభుత్వ ఐసోలేషన్ వార్డులో ఉంచి మంచి ఫుడ్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు డిశ్చార్జ్ చేసారు. ఐతే కరోనా ను జయించిన ఆనందం లో అయన అనుచరులు పెద్ద ఊరేగింపుతో టపాసులు కాలుస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు అదే అయన పీకకు చుట్టుకొంది. లాక్ డౌన్ టైం లో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా హడావిడి చేసినందుకు పోలీసులు అయన ను అరెస్ట్ చేసారు. అయినా ఇది కరోనా సమయం అని మరిచిపోయి ప్రవర్తిస్తే తరువాత పరిస్థితులు మన చేతుల్లో ఉండవని గ్రహించకపోతే పర్యవసానం ఇలాగే ఉంటుంది.

తెలంగాణలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలి: గవర్నర్ తమిళిసై

తెలంగాణలో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన విధానాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆమె ఈ రోజు నిమ్స్ హాస్పిటల్ ను సందర్శించి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐసిఎంఆర్ నిబంధనల ప్రకారం పరీక్షలు చేస్తున్నప్పటికీ మరిన్ని పరీక్షలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. కరోనా బారిన వైద్యులు మరియు సిబ్బందిని ఆమె స్వయంగా వెళ్లి పరామర్శిచారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఆమె అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ ను విఐపిలకు అలాగే వైద్యులకు మాత్రమే చికిత్స అందించే విధంగా ఇక్కడ ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు నిమ్స్ లోని నలుగురు ప్రొఫెసర్లు, 8 మంది వైద్యులు, 8 మంది పారామెడికల్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వీరితో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్న ఇతర వైద్యులు మరియు స్టాఫ్ ను క్వారంటైన్ లో ఉంచారు.

డాక్టర్ సుధాకర్ లాగానే నన్ను వేధించారు.. కన్నీటి పర్యంతమైన దళిత మహిళా డాక్టర్

వైజాగ్ లో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ విషయం లో ఎం జరిగిందో అందరికి తెలిసిందే. తాజాగా తిరుపతి లోని ఒక దళిత మహిళా డాక్టర్ కు ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు తెలుస్తోంది. దళిత మహిళనైన తనను వైసిపి నేతలు అసభ్య పదజాలం తో దూషించి వేధించారని ప్రభుత్వ మహిళా డాక్టర్ సంచలన ఆరోపణలు చేసారు. తిరుపతి కి చెందిన మహిళా వైద్యురాలు అనితారాణి ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో రెండు నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు అతి గతి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు లో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలు గా ఆమె పనిచేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం వచ్చినా.. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె ఇక్కడే ఉద్యోగంలో చేరారు. ఐతే ఆమె పెనుమూరు లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దిగువ స్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు తన పై కక్ష కట్టారని ఆమె పేర్కొన్నారు. గత మార్చ్ 22 జనతా కర్ఫ్యూ రోజు న కొంత మంది తాను ఉంటున్న హాస్టల్ లోనే తనను నిర్బంధించి స్థానిక వైసిపి నేతలను పిలిచారన్నారు. ఆ తరువాత తనను వారంతా కలిసి అనేక రకాలుగా దుర్భాషలాడుతూ, తనను వేధించారని ఈ సందర్బంగా బాత్ రూమ్ కు వెళ్లిన తన ఫోటోలు, వీడియోలు తీసి దారుణమైన వ్యాఖ్యలు చేసి మానసికంగా వేధించారని ఆమె తెలిపారు. ఇదే విషయమై వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఐతే పోలీసులు మాత్రం కేసు ఫైల్ చేయకుండా ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు స్టేషన్ లోనే కూర్చో బెట్టారని ఆమె ఆరోపించారు. అదే సమయంలో కేసు పెట్టవద్దని తన పై అధికారుల ద్వారా ఫోన్ లో వత్తిడి తెచ్చారని చెప్తూ ఆమె విలపించారు. తాజాగా ఆమె ఈ విషయం గురించి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఫోన్ లో వివరించడం తో ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే ఇదే విషయమై ఆమె తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తోంది.

తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. అసలీ 'జీవో 111' అంటే ఏంటి?

ప్రస్తుతం తెలంగాణలో 'జీవో 111' చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ 'జీవో 111' కు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించడంతో ఈ మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద అనుమతి లేకుండా డ్రోన్లు తిప్పడంతో రేవంత్ అరెస్ట్ కూడా అయ్యారు. తరువాత బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే, తాజాగా ఫామ్ హౌస్ వ్యవహారంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో.. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ నేతలకే చాలామందికి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, సామాన్యులు మాత్రం అసలు ఈ 'జీవో 111' అంటే ఏంటి?.. 'జీవో 111' కి విరుద్ధంగా నిర్మాణాలు ఏంటి? అంటూ చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ ‌కు వరదలు రాకుండా దాదాపు వందేళ్ల క్రితం మూసీ నదిపై ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ అని రెండు రిజర్వాయర్లు కట్టారు. ఈ రిజర్వాయర్లు అప్పట్లో సుమారు పది లక్షల మంది దాహాన్ని తీర్చేవి. అయితే, నగరం నానాటికీ విస్తరిస్తున్న క్రమంలో ఈ రిజర్వాయర్లకు ప్రమాదం ఏర్పడింది. వీటి చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విస్తరించి.. ఎన్నో​ నిర్మాణాలు వెలిశాయి. దీంతో, సహజ సిద్ధంగా రిజర్వాయర్లకు వచ్చే నీటికి అడ్డుకట్ట పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఆ రెండు రిజర్వాయర్లు కనుమరుగైపోతాయనే ఆందోళన నుంచే 'జీవో 111' పుట్టింది. ఆ రెండు రిజర్వాయర్లను కాపాడే చర్యలు చేపట్టమని సుప్రీం కోర్టు ఆదేశించడంతో.. 1996లో నాటి ప్రభుత్వం జీవో 111ని జారీ చేసింది. దీని ప్రకారం ఆ రెండు రిజర్వాయర్ల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టరాదు. ఒక స్థలంలో పది శాతం మేరకు, కేవలం నివాసం కోసం మాత్రమే.. అది కూడా జీ ప్లస్‌ 2(మొత్తంగా మూడంతస్తులు)కి మించకుండా నిర్మాణం చేపట్టాలి.  ఆ రెండు రిజర్వాయర్ల పరిధిలోని ఆరు మండలాలు శంషాబాద్‌, మొయినాబాద్‌, షాబాద్‌, శంకరపల్లి, రాజేంద్రనగర్‌, చేవెళ్ల కు 'జీవో 111' వర్తిస్తుంది. ఈ మండలాల పరిధిలో మొత్తం 84 గ్రామాలు ఉన్నాయి. ఈ 84 గ్రామాలలో జీవో 111 కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. కానీ, బడా బాబులు మాత్రం జీవో 111 నిబంధనలను పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం జీవో 111 పరిధిలో 13 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని అంచనా. 4,000 వరకు ఫామ్‌హౌస్​లు, 50 వరకు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండొచ్చని తెలుస్తోంది. జీ ప్లస్‌ టూ నిబంధనకు తూట్లు పొడుస్తూ ఐదు, ఆపై అంతస్తులతో కట్టిన అక్రమ నిర్మాణాలు ఈ ప్రాంతంలో ఎన్నో కనిపిస్తాయి. మరి ఇప్పుడు అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాల పని పడతారేమో చూడాలి.

క‌రోనాను జయించిన న్యూజిలాండ్‌.. యాక్టివ్ కేసులు జీరో!

కరోనాను అరికట్టడానికి ప్రపంచ దేశాలు నానా పాట్లు పడుతున్న వేళ.. న్యూజిలాండ్ మాత్రం కరోనాను జయించిన దేశంగా అవతరించింది. తమ దేశంలో చివరి కరోనా పేషంట్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటించారు. ఆక్లాండ్‌కు చెందిన క‌రోనా బాధిత మ‌హిళ సెయింట్ మార్గరెట్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడంతో.. ఇప్పుడు ఆ దేశంలో కరోనా యాక్టివ్ కేసులు జీరో అయ్యాయి. ఫిబ్రవరి 28న న్యూజిలాండ్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఫిబ్రవరి 28 నుండి మే 22 వరకూ 1504 కేసులు నమోదు కాగా, మే 22 తర్వాత కొత్త కేసులు నమోదు కాలేదు. చివరి కరోనా పేషెంట్ తాజాగా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో, ఇప్పటివరకూ మొత్తం 22 మంది చనిపోగా, 1482 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా ఇప్పుడా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. అమెరికాతో సహా ఎన్నో అగ్ర దేశాలు కరోనా నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్న వేళ.. న్యూజిలాండ్ సాధించింది గొప్ప విజయమే అని చెప్పాలి. ప్రపంచంలో లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలుచేసిన దేశాల్లో న్యూజిలాండ్‌ ముందు వరుసలో ఉంది. అందుకే, ఇప్పుడా దేశం కరోనా నుంచి పూర్తిగా ఫ్రీ అయిపోయింది. ఇళ్ల నుంచి ఎవ్వర్నీ బయటకు రానివ్వలేదు. అత్యవసర, నిత్యవసరాలకు మాత్రమే బయటకు పంపారు. అది కూడా పూర్తీ జాగ్రత్తలు పాటించారు. దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యం లోకి కూరుకుపోయినా పర్వాలేదన్న అక్కడి ప్రధాని.. ఒక్కసారి కరోనా వెళ్లిపోతే మళ్లీ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని, అందుకోసం అందరం కలిసి గట్టిగా ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు. అటు ప్రధాని, ఇటు ప్రజలు కలిసి ఉక్కు సంకల్పంతో కరోనాను జయించారు. 

పీఐబీ అధికారికి కరోనా.. ఆందోళనలో కేంద్ర మంత్రులు!

దేశమంతటికీ కరోనా సమాచారం అందిస్తున్న పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - జాతీయ మీడియా కేంద్రం) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ ధాట్ వాలియాకు కరోనా వైరస్ సోకింది. అనారోగ్యంతో బాధపడుతున్న వాలియాకు పరీక్షలు నిర్వహించిన అధికారులు కరోనా పాజిటివ్ గా తేల్చారు. వాలియాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో జాతీయ మీడియా కేంద్రాన్ని మూసివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం వాలియా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం పీఐబీ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. నేటి నుంచి పీఐబీ కార్యక్రమాలు, విలేకరుల సమావేశాల నిర్వహణను శాస్త్రిభవన్ కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు.  కాగా, కరోనా సోకిన పీఐబీ అధికారి వాలియా.. జూన్ 3వ తేదీన కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమార్, ప్రకాష్ జవదేకర్ లతో కలిసి.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఆ రోజు మీడియా సమావేశానికి వచ్చిన వారందరినీ హోమ్ క్వారంటైన్ చేయాలని నిర్ణయించామని, వారికి కరోనా పరీక్షలు చేయిస్తామని అధికారులు తెలిపారు.

కరోనా విజృంభణ.. నాలుగో స్థానానికి చేరువలో భారత్!!

భారత్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 9,983 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనాతో 206 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,56,611కి చేరగా, మృతుల సంఖ్య 7,135కి చేరుకుంది. ఇప్పటివరకు 1,24,095 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 1,25,381  మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల్లో స్పెయిన్‌ను దాటి భారత్‌ 5వ స్థానానికి చేరింది. ప్రస్తుతం దాదాపు 2,86,000 కేసులతో యూకే నాలుగో స్థానంలో ఉండగా.. 2,41,000 కేసులతో స్పెయిన్‌ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న భారత్.. కరోనా ఉధృతి ఇలాగే కొనసాగితే.. మూడు నాలుగు రోజుల్లో నాలుగో స్థానానికి చేరే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.