పీఐబీ అధికారికి కరోనా.. ఆందోళనలో కేంద్ర మంత్రులు!
posted on Jun 8, 2020 @ 10:21AM
దేశమంతటికీ కరోనా సమాచారం అందిస్తున్న పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - జాతీయ మీడియా కేంద్రం) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ ధాట్ వాలియాకు కరోనా వైరస్ సోకింది. అనారోగ్యంతో బాధపడుతున్న వాలియాకు పరీక్షలు నిర్వహించిన అధికారులు కరోనా పాజిటివ్ గా తేల్చారు. వాలియాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో జాతీయ మీడియా కేంద్రాన్ని మూసివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం వాలియా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సోమవారం పీఐబీ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. నేటి నుంచి పీఐబీ కార్యక్రమాలు, విలేకరుల సమావేశాల నిర్వహణను శాస్త్రిభవన్ కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు.
కాగా, కరోనా సోకిన పీఐబీ అధికారి వాలియా.. జూన్ 3వ తేదీన కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమార్, ప్రకాష్ జవదేకర్ లతో కలిసి.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఆ రోజు మీడియా సమావేశానికి వచ్చిన వారందరినీ హోమ్ క్వారంటైన్ చేయాలని నిర్ణయించామని, వారికి కరోనా పరీక్షలు చేయిస్తామని అధికారులు తెలిపారు.