రాష్ట్రంలో ఒక్కరోజే 149 మంది కరోనాతో మృతి!!

భారత్ లో గత 24 గంటల్లో దేశంలో 9,996 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 357 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,579కి చేరగా, మృతుల సంఖ్య 8,102కి చేరుకుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,41,029 మంది కోలుకోగా.. ప్రస్తుతం 1,37,448 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, మహారాష్ట్రలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రను కలవరపెడుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 3,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, బుధవారం ఒక్కరోజే 149 మంది కరోనాతో. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 357 మంది ప్రాణాలు కోల్పోతే, అందులో ఒక్క మహారాష్ట్రలోనే 149 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆ రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,041 కాగా.. కరోనా మరణాల సంఖ్య 3438 కి చేరింది.

జూనియర్ డాక్టర్ల ఆందోళన.. గాంధీ కి మంత్రి ఈటెల

హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి హాస్పిటల్ లో ఓ రోగి చనిపోవడంతో రోగి బంధువులు డాక్టర్లపై దాడి చేశారు. ఆ దాడిని ఖండిస్తూ రాత్రి నుంచి జూడాలు ఆందోళన చేశారు. దీంతో హాస్పిటల్ లో ఎమర్జన్సీ సర్వీసులు తప్ప అన్ని సేవలు నిలిచిపోయాయి. సీఎం కేసీఆర్ గానీ, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గానీ వచ్చి తమకు హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదలమని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఈటెల రాజేందర్ జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపటానికి గాంధీ హాస్పిటల్ కు వచ్చారు. మొదట చర్చలు జరిపేందుకు జూనియర్ డాక్టర్లను సచివాలయంకు రావాలని కోరగా దానికి వారు నిరాకరించారు. దీంతో స్వయంగా మంత్రి గాంధీ హాస్పిటల్ కు వచ్చారు. గాంధీలో డాక్టర్ ల పై దాడి కొత్తేమి కాదని, కానీ కరోనా వైరస్ వచ్చిన తరువాత దాడులు మరింత పెరిగాయని, హాస్పిటల్ లో సెక్యూరిటీ కూడా తగ్గిందని వారు మంత్రికి మొరపెకున్నారు. బేగంపేట్ కు చెందిన ఓ వ్య‌క్తి (55) క‌రోనా వైర‌స్ సోక‌డంతో మూడు రోజుల క్రితం గాంధీ హాస్పిటల్ లో చేరారు. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సీపీఏపీ మాస్క్‌ను తీసేసి వాష్‌రూమ్‌కు వెళ్లార‌ని, అప్పుడు గుండె నొప్పి వ‌చ్చి మంగ‌ళ‌వారం రాత్రి 7.30కు అత‌డు చ‌నిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే అత‌డు చ‌నిపోయాడ‌ని ఆరోపిస్తూ మృతుడి బంధువులు వైద్య సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. తమకి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో మంత్రి ఈటెల వారితో సమావేశమయ్యారు. వారికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం.. రేవంత్ రెడ్డికి గట్టి షాక్!

జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఊరట లభించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) జారీచేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. జీవో 111కు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారని, ఆ నిర్మాణం పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఎన్జీటీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వలు ఇవ్వడాన్ని సవాల్ చేశారు. ఆ ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేస్తూ ఆయన హైకోర్టుకు నివేదిక అందించారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అసహనం వ్యక్తం చేశారు. కక్షపూరితంగా ఫిర్యాదు చేశారని, రేవంత్‌పై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు కేటీఆర్ కు ఊరట కలిగిస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కేటీఆర్ తో పాటుగా తెలంగాణ ప్రభుత్వానికి, హెచ్ఎండీఏ, పీసీబీ లకు నోటీసులు జారీ చేసిన ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడం ఓ రకంగా రేవంత్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి.

టీడీపీకి గట్టి దెబ్బ.. వైసీపీలో చేరిన మాజీ మంత్రి

ప్రకాశం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. సీనియర్‌ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. శిద్దా రాఘవరావుతో పాటు ఆయన కుమారుడు సుధీర్ కూడా వైసీపీలో చేరారు. తండ్రీకొడులిద్దరికి సీఎం జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాస్‌, ఆదిమూలపు సురేష్‌, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, శిద్దా రాఘవరావు మంగళవారమే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావుకు గ్రానెట్ క్వారీలున్నాయి. వ్యాపారపరమైన ఒత్తిడులు కారణంగానే ఆయన అధికార పార్టీ గూటికి చేరారని ప్రచారం జరుగుతోంది.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాట్లలో జగన్ ప్రభుత్వం!

కారణం ఏదైతేనేం సీఎం జగన్ మాకు రాజధానిగా అమరావతి కాదు అని డిసైడ్ ఐన తరువాత విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఎవరెంత మొత్తుకున్నా బ్యాక్ గ్రౌండ్ లో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అని వార్తలు వస్తుంన్నాయి. దీనికి మరింత బలం చేకూర్చే తాజా వార్త ఏంటంటే సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మరి కొంత మంది అధికారులు, ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ అండ్ టీమ్ తో కలిసి విశాఖలోని పలు ప్రదేశాలు సందర్శించారు. రాజధాని కోసం అనువైన భవనాలు, ప్రదేశాలను ఎంపిక చేసే ప్రక్రియ లో భాగంగా ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ తన 12 మంది సభ్యుల బృందతో కలిసి ఈ పర్యటనలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఒక వైవు కరోనా మరో వైపు కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అవి తేలేలోపుగా భవనాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యం లో ఈ పర్యటన జరిగినట్లు తెలుస్తోంది.

ఇంకెన్నిసార్లు కోర్టుతో మొట్టికాయలు తింటారు?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ సర్కార్ కి సుప్రీం కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. అంతేకాదు, జగన్ సర్కార్‌పై ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలతో ఆటలు తగదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై పలువురు విమర్శలు గుప్పించారు. తప్పులు సరిచేసుకొని ఇకనైనా పద్దతిగా ఉండాలని హితవు పలికారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఒకే విషయంలో పదే పదే ఇంకెన్ని సార్లు కోర్టుతో మొట్టికాయలు తింటారు? అంటూ జగన్ సర్కార్ ని ప్రశ్నించారు. "నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గారి కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని స్వాగతిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తప్పును సరిచేసుకుని రాజ్యాంగ వ్యవస్థలతో గౌరవంగా వ్యవహరించాలి." అని కన్నా పేర్కొన్నారు. ఏపీ ఎలక్షన్ కమిషన్ విషయంలో ప్రభుత్వ వాదన నమ్మదగినదిగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, రాజ్యాంగ సంస్థలతో ఆటలు వద్దని హెచ్చరించడం.. రాష్ట్ర ప్రభుత్వ మనుగడను ప్రశ్నార్థకంలోకి నెట్టిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేశాక... ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కును కోల్పోయిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలతో ఆడుకోవద్దని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మరో మొట్టికాయని అన్నారు. అధికారంలో కొనసాగే అర్హత ఈ ప్రభుత్వానికి లేదన్నారు. నైతిక విలువలుంటే వైఎస్ జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

ఏపీలో టెన్త్ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి

తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ బాటలోనే తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఏపీలో కూడా టెన్త్ పరీక్షలు రద్దవుతాయన్న ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఏపీలో టెన్త్ పరీక్షలు జరిగి తీరుతాయని తేల్చిచెప్పారు. షెడ్యూల్ ప్రకారమే జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.  అయితే, 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహిస్తామని  చెప్పారు. అనవసరమైన ప్రచారాలతో విద్యార్థులను గందరగోళానికి గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నామని.. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం విషయంపై జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

మన్యంలో మైనింగ్‌ మాఫియా.. మంత్రి మేనల్లుడి కనుసన్నల్లో!!

విశాఖ మన్యంలో మైనింగ్‌ మాఫియా అలజడి మళ్లీ మొదలైంది. ఖనిజ సంపద‌ తరలింపునకు రంగం సిద్ధమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన్యంలో లేటరైట్‌, బాక్సైట్‌ వంటి ఖనిజాలు దాగున్నాయి. అయితే, వాటి కోసం పచ్చటి అడవిని గుల్ల చేయొద్దని గిరిజనులు ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూనే ఉన్నారు. గతంలో వారి విన్నపాల మేరకు ఆగిన తవ్వకాల అలజడి.. ఇప్పుడు మళ్లీ మొదలైంది. దీనికి ఒక ప్రముఖ మంత్రి మేనల్లుడు చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉన్న ఆయన కనుసన్నల్లోనే ఖనిజం తవ్వకాలకు ఒప్పందాలు కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివాసీల వ్యతిరేకతతో గత ప్రభుత్వ హయాంలో మూతబడిన చాపరాతిపాలెం, సిరిపురం క్వారీలను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌కు ముందే ఈ క్వారీల్లో నమూనాల కోసం తవ్వకాలు కూడా నిర్వహించారు.  విశాఖ ఏజెన్సీలోని గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో విలువైన ఖనిజ సంపద ఉంది. 1990-92 ప్రాంతంలో జర్రెల అటవీ ప్రాంతంలోని కోండ్రుపల్లితో పాటు అరకులోయ, తూర్పుగోదావరి సరిహద్దుల్లో కేంద్ర భూగర్భ గనుల శాఖ అధికారులు మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ 615.27 టన్నుల విలువైన బాక్సైట్‌ గనులు ఉన్నాయని గుర్తించారు. అదే సమయంలో అల్యూమినియం శాతం అధికంగా ఉన్న బాక్సైట్‌ తరహా గనులను లేటరైట్‌ పరిధిలోకి తీసుకొచ్చి తవ్వకాలు సాగించేందుకు ఓ మాఫియా తీవ్రంగా ప్రయత్నించింది. 1997-99 ప్రాంతంలో సిరిపురం, చాపరాతిపాలెంలో బాక్సైట్‌ తరహా లేటరైట్‌ గనుల తవ్వకాలకు అనుమతులు పొందేందుకు పావులు కదపడం ప్రారంభించారు. ప్రభుత్వం స్థానిక ఆదివాసీలకు పంపిణీ చేసిన డీ-ఫాం పట్టాభూములను లేటరైట్‌ తవ్వకాల కోసం చినరాజుపాకలు గ్రామానికి చెందిన గిరిజనుడు దోనె పోతురాజు పేరిట హైదరాబాద్‌కు చెందిన ఓ మైనింగ్‌ వ్యాపారి అనుమతులు పొందారు. దోనె పోతురాజు పేరు మీద 2001 అక్టోబరు 14నుంచి 2021 అక్టోబరు 13వరకు 4.270 హెక్టార్ల డీ-ఫాం పట్టాభూముల్లో లేటరైట్‌ గనుల తవ్వకాలు నిర్వహించుకునేందుకు భూగర్భ గనుల శాఖ అనుమతులు మంజూరు చేసింది. అలాగే వలసంపేట గ్రామానికి చెందిన గిరిజనుడు పొత్తూరు దేముడు పేరిట చాపరాతిపాలెంలో గల 11.610 హెక్టార్ల భూమిలో లేటరైట్‌ గనుల తవ్వకాలకు విజయవాడ ప్రాంతానికి చెందిన బినామీ మైనింగ్‌ వ్యాపారి లైసెన్స్‌ తీసుకున్నారు. ఆయనకు 2004 జనవరి 13నుంచి 2024 జనవరి 12వరకు భూగర్భ, గనులశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ క్వారీల్లో మైనింగ్‌ వ్యాపారులు విడతల వారీగా 60 శాతంకి పైగా తవ్వకాలు నిర్వహించి అల్యూమినియం కంపెనీలకు విక్రయించుకుని రూ.కోట్లు సంపాదించారు. 2016-17లో ఈ క్వారీల్లో తవ్వకాలు నిర్వహించొద్దని డిమాండ్‌ చేస్తూ గిరిజనులు ఆందోళనలు ఉధృతం చేశారు. వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు అప్పటి సీఎం చంద్రబాబు తవ్వకాలను నిలిపివేయించారు. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ఉన్న బాక్సైట్‌ను పోలిన లేటరైట్‌ను వెలికితీసేందుకు మరో ముఠా ప్రయత్నాలు మొదలెట్టింది. మూతబడిన చాపరాతిపాలెం, సిరిపురం క్వారీల్లో తవ్వకాలు పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది. క్వారీల లీజుదారులైన దోనె పోతురాజు, పొత్తూరు దేముడు వెనుకున్న బినామీ వ్యాపారులను ఒప్పించి ప్రభుత్వ అండతో తాజాగా తవ్వకాలకు ఓ ముఠా ఏర్పాట్లు చేసుకుందని తెలుస్తోంది. రాష్ర్టానికి చెందిన ఒక ప్రముఖ మంత్రి మేనల్లుడి కనుసన్నల్లో లేటరైట్‌ తవ్వకాలకు ఒప్పందాలు కుదిరినట్టు సమాచారం. ఈ రెండు క్వారీల్లో తవ్వకాలు సాగించి వెలికితీసిన లేటరైట్‌ను ఒకచోటకు చేర్చి మిక్సింగ్‌ చేసి మంత్రి మేనల్లుడికి అప్పగించనున్నారని.. దాన్ని ఆయన ప్రభుత్వ అండదండలతో పొరుగు రాష్ట్రాల్లోని సిమెంట్‌, అల్యూమినియం కంపెనీలకు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతోంది.

జగన్ సర్కార్‌కు సుప్రీంలోనూ ఎదురుదెబ్బ.. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలొద్దని హెచ్చరిక

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. నిమ్మగడ్డ‌ను కమిషనర్‌గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలతో ఆటలు తగదని హెచ్చరించింది.  ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ వెనుక ఉన్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆర్డినెన్స్‌లు ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ‌రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. 

మరో ఆందోళనకర అంశం.. విషమంగా ఉన్న రోగుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానం

భారత్ లో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. రోజుకి దాదాపు పదివేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే, కరోనా కేసుల్లో మహారాష్ట్ర చైనా దేశాన్ని దాటేసింది. ముంబై వూహాన్‌ నగరాన్ని దాటేసింది. కొద్దిరోజుల్లో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాలలో భారత్ మూడో స్థానానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి చాలదు అన్నట్టు, తాజాగా మరో ఆందోళనకర అంశం బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకి ఆరోగ్యం విషమంగా ఉన్న రోగుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు వరల్డో మీటర్‌ ప్రకటించింది. కరోనా బారినపడినవారిలో అత్యధికంగా అమెరికాలో 16,907 మంది క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. భారత్‌లో వారి సంఖ్య 8,944 అని పేర్కొంది. బ్రెజిల్‌లో మన కంటే మూడు రెట్లు కేసులు అధికంగా ఉన్నప్పటికీ అక్కడ విషమ స్థితిలో ఉన్నవారు 8,318 మాత్రమే. రష్యా(2,300)లో సీరియస్‌ కేసుల సంఖ్య భారత్‌లో నాలుగో వంతు కావడం గమనా ర్హం. ఆరోగ్యం విషమంగా ఉన్న రోగుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు ఆందోళన కలిగిస్తోంది.

బాలకృష్ణ దెబ్బకు కొడాలి నాని గప్‌చుప్!?

అగ్ర హీరో, హిందూపూర్ శాసనసభ్యులు నటసింహం నందమూరి బాలకృష్ణ దెబ్బకు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గప్‌చుప్ అయ్యారా? ఎక్కడా కనిపించడం లేదేంటి? అని సోషల్ మీడియాలో పోస్టులు దండిగా పడుతున్నాయి. ఎందుకు? కారణం ఏమిటి? తెలుసుకోవాలంటే కాలంలో కొంచెం వెనక్కి వెళదాం!  వైసీపీ ప్రభుత్వం పేదలకు రేషన్ లో సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికలకు ముందు వరాలు గుప్పించింది. తీరా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ హామీని పక్కన పెట్టింది. దీనిపై బాధ్యత గల ప్రతిపక్షంగా తెలుగుదేశం నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకు, కొడాలి నానికి కోపం వచ్చింది. ఓ మీడియా సమావేశంలో నోరు జారి మాట్లాడారు. "సన్నాసి! సన్న బియ్యం ఇస్తానని  చెప్పామని. ఎవడికి చెప్పాం? మీ అమ్మా మొగుడికి వచ్చి చెప్పానా? సన్నబియ్యం ఇస్తానని?" అని పద్దతి లేకుండా మాట్లాడారు.  కట్ చేస్తే... నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా టీజర్ విడుదలైంది. అందులో 'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. 'శ్రీనుగారూ... మీ నాన్నగారు బాగున్నారా?' అనే దానికి, 'శ్రీనుగారూ మీ అమ్మామొగుడు బాగున్నారా?' అనేదానికి చాలా తేడా ఉంది లమ్డీ కొడకా'' అని బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు. ఈ కౌంటర్ కొడాలి నానికి అని ట్విట్టర్ టాక్. ఆల్రెడీ కొడాలి నాని మాటలను, తర్వాత బాలకృష్ణ వార్నింగ్ ఇస్తున్న డైలాగ్ ఎడిట్ చేసి వీడియో వదిలారు.  

అధికారాన్ని వాడుకొని సీఎం జగన్ సొంత కంపెనీ కి ప్రయోజనాలు!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ కి చెందిన కంపెనీకి ప్రభుత్వం నుంచి నజరానాలు అందుతూనే ఉన్నాయి. ఇటీవల, సరస్వతి పవర్స్ కు కృష్ణా నది నీళ్ళు, శాశ్వత నీటి కేటాయింపులు ఇచ్చిన ప్రభుత్వం, తాజాగా మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. సరస్వతి సిమెంట్స్ మైనింగ్ లీజ్ ను, ఏకంగా 50 ఏళ్ళుకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు జిల్లాలో 613.70 హెక్టార్లలో ఉన్న మైనింగ్ ను, 50 ఏళ్ళ పాటు సరస్వతీ సిమెంట్స్ కు కేటాయిస్తూ, జీవో నెంబర్ 30 విడుదల చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కంపెనీలో జగన్ కు 26.4 కోట్లు విలువ చేసే షేర్లు వాటా ఉండగా, ఆయన సతీమణికి 13.8 కోట్ల విలువ చేసే షేర్లు వాటా ఉంది. సీఎం జగన్ సొంత కంపెనీ కి ప్రయోజనం సమకూర్చుకోవడానికి తన అధికారాన్ని వాడుకోవడం సిగ్గుచేటని టీడీపీ విమర్శిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. సీఎం జగన్ తన కంపెనీకి సున్నపురాయి గనులను 50 ఏళ్లకు పొడిగించుకున్నారని.. కృష్ణా నీళ్లు కేటాయించుకున్నారని.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా సొంత కంపెనీ కోసం అధికారాన్ని వాడుకోలేదని విమర్శించారు. తనకు ఒక్క చాన్సు ఇవ్వాలని ప్రజలను కోరింది అన్నీ సొంతానికి చేసుకోవడానికేనా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

పుట్టినరోజు నాడే కరోనాతో కన్నుమూసిన ఎమ్మెల్యే!!

తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 35 వేలకు పైగా కేసులు, 300 మందికిపైగా మరణాలు సంభవించాయి. కరోనా మహమ్మారి తమిళనాడులో ఓ డీఎంకే ఎమ్మెల్యేను కూడా బలితీసుకుంది. కరోనా కారణంగా చేప్పాక్కం ఎమ్మెల్యే అంబజగన్ (62) ప్రాణాలు కోల్పోయారు. కరోనా‌ సోకిన అంబజగన్.. చెన్నైలోని ఓ ఆసుపత్రి‌లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. భారత్ లో కరోనాతో ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, నేడు ఆయన పుట్టిన రోజు కూడా. పుట్టిన రోజు నాడే కరోనా మహమ్మారి ఆయనను బలి తీసుకుంది. కాగా, దివంగత కరుణానిధి, డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడైన అంబజగన్.. 2001, 2011, 2016 లలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సినీ పరిశ్రమతోనూ ఆయనకు అనుబంధముంది. డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా వ్యవహరించారు. నటుడు జయం రవితో ‘ఆదిభగవాన్’ అనే సినిమా నిర్మించారు. అంబజగన్ మృతికి ముఖ్యమంత్రి పళనిస్వామి, స్టాలిన్‌తోపాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.

భారత్ లో కరోనా విజృంభణ.. వుహాన్ ను దాటేసిన ముంబై!

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొద్దిరోజులలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాలలో మూడో స్థానానికి చేరినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో రోజుకి దాదాపు పది వేల కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 9,985 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 279 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,76,583కి చేరగా, మృతుల సంఖ్య 7,745కి చేరుకుంది. ప్రస్తుతం 1,33,632 యాక్టీవ్ కేసులున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే మొత్తం కేసుల విషయంలో మహారాష్ట్ర, చైనాను అధిగమించగా.. తాజాగా ముంబై నగరం, కేసుల విషయంలో వూహాన్ ను దాటేసింది. కరోనాకి పుట్టినిల్లు చైనాలోని వుహాన్. అలాంటిది మహారాష్ట్ర, చైనాను దాటేస్తే.. మహారాష్ట్రలోని ముంబై నగరం, వూహాన్ ను దాటేసింది. ఇప్పటివరకు ముంబైలో 51,100 పైగా కేసులు నమోదయ్యాయి. ఇక వుహాన్ లో 50,333 కేసులు నమోదు కాగా, 3,869 మంది మరణించారు. ముంబైలో మరణాల సంఖ్య 1,760గా ఉంది. మరణాల విషయంలో మాత్రం వుహాన్ తో పోలిస్తే ముంబైలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.

మంత్రిగా నేను చంద్రబాబుకు చెప్పా.. నువ్వు జగన్ కు చెప్పలేవా

ఏ రాష్ట్రం లోనైనా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కామన్. ఐతే ఏపీలో మాత్రం దాని తీవ్రత ఎక్కువే అని చెప్పవచ్చు. తాజాగా చంద్రబాబును విమర్శించిన మంత్రి బొత్స పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విరుచుకు పడ్డారు. బొత్స ఉత్తరాంధ్ర ద్రోహి అని, చంద్రబాబును విమర్శించే అర్హత బొత్సకు లేదని అయ్యన్న అన్నారు. వోక్స్ వ్యాగన్ వైజాగ్ కు వచ్చి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేదని వేలాది మందికి ఉపాధి లభించేదని అయన అన్నారు. ఒకప్పుడు వైఎస్ మరణానికి జగన్ కారణమని చెప్పిన బొత్స ఇపుడు అదే జగన్ వద్ద చేరి భజన చేస్తున్నారని విమర్శించారు.  గతంలో బొత్స కూడా మద్యం వ్యాపారం చేసారని, ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు ఆదాయం వస్తే చాలన్నట్లుగా వారి ధరణి ఉందని విమర్శించారు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న తను వైజాగ్ లో పేదల భూములు కబ్జా కు గురవుతున్నాయని ఫిర్యాదు చేసానని మరి ఇపుడు బ్రాందీ పేరుతో విషం అమ్మవద్దని జగన్ వద్ద ఎందుకు చెప్పలేక పోతున్నారని ఆయన బొత్సను నిలదీశారు. చంద్రబాబు హయాం లో ఏపీకి అనేక పరిశ్రమలు వచ్చాయని ఐతే జగన్ ఏడాది పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అయ్యన్న విమర్శించారు. అధికార పార్టీ నేతలు రాజధాని అమరావతిని స్మశానం అంటున్నారని, ఐతే ప్రభుత్వానికి 65 సార్లు మొట్టికాయలు వేసిన హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ అక్కడే ఉన్నాయని అయన గుర్తు చేసారు.

గూగుల్‌లో మరో భారతీయుడికి కీలక పదవి

సెర్చ్ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్ సీఈఓ గా భారత సంతతి వ్యక్తి సుందర్‌ పిచాయ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మరో భారత సంతతి వ్యక్తికి గూగుల్‌లో కీలక పదవి వరించింది. ఆ సంస్థ సెర్చ్‌ హెడ్‌గా భారత సంతతికి చెందిన ప్రభాకర్‌ రాఘవన్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న బెన్‌ గోమ్స్‌ ‌కు గూగుల్ మరో కీలక పదవి కట్టబెట్టింది. తమిళనాడుకు చెందిన ప్రభాకర్ రాఘవన్ 1960, సెప్టెంబర్ 25న జన్మించారు. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌ పూర్తిచేసిన ప్రభాకర్‌.. బెర్క్‌లీ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. 2012లో గూగుల్‌లో చేరిన ఆయన 2018లో గూగుల్‌ అ‍డ్వర్టైజింగ్‌, కామర్స్‌ బిజినెస్‌ హెడ్‌గా ఎదిగారు. దీనిలో భాగంగా సూపర్ విజన్ సెర్చ్ డిస్‌ ప్లే పర్యవేక్షణతో పాటు వీడియో అడ్వర్టైజింగ్ అనలిటిక్స్, షాపింగ్, పేమెంట్స్ వంటి వ్యవహారాలను చూసుకున్నారు. అంతకుముందు, ఆయన గూగుల్ యాప్ప్ వైస్ ప్రెసిడెంట్ గాను, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్‌‌లోనూ పనిచేశారు. గూగుల్‌లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. ఐబీఎం, యాహూ సంస్థల్లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. కొత్త బాధ్యతల్లో ప్రభాకర్‌ రాఘవన్‌ అనుభవం ఎంతో ఉపకరిస్తుందని సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు.

ఏపీలో షూటింగ్‌లకు సీఎం‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ఏపీలో కూడా సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అనుమతిచ్చారని‌ చిరంజీవి తెలిపారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా సినీ పరిశ్రమ అభివృద్దిపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అయితే ఇక్కడ కూడా సీఎం జగన్‌ షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారన్నారు. విశాఖలో స్టూడియోకి గతంలో వైఎస్సార్ చేసిన భూ కేటాయింపులను పునపరిశీలిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారన్నారు. థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్‌ ఛార్జీలు ఎత్తివేయాలని కోరామని తెలిపారు. నంది వేడుకలు పెండింగ్‌లో ఉన్నాయి. 2019-20కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం అన్నారు.

జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్

బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియాకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం వారిద్దరికీ ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో నాలుగు రోజుల క్రితమే జ్యోతిరాదిత్య ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన తల్లి మాధవిలో కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ.. వైద్య పరీక్షలు జరపగా ఆమె కరోనా పాజిటివ్ అని తేలింది. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య కీలక నేత. మార్చి నెలలో ఆయన కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడంతో కమల్‌నాథ్ సర్కారు కూలిపోయి.. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. కాగా, పార్టీలో చేరిన వెంటనే జ్యోతిరాదిత్యను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది.

సిఐడి పై నమ్మకం లేదు... సిబిఐకి అప్పగించండి

చిత్తూరుకు చెందిన దళిత మహిళా డాక్టర్ అనితా రాణి వైసిపి నాయకుల పై చేసిన ఆరోపణల పై సీఎం జగన్ సిఐడి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. స్థానిక ఆసుపత్రి లో దిగువ స్థాయి సిబ్బంది అవినీతి గురించి ప్రశ్నించడంతో కొంత మంది వైసిపి నేతలు తన పై కక్ష కట్టి వేధించారని దీని పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి రెండు నెలలు అయినా ఎవరు పట్టించుకోలేదని మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం తో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది.  తాజాగా దీని పై స్పందించిన ఆమె తనను వేధించింది వైసిపి నేతలు కావడం.. అలాగే సిఐడి రాష్ట్ర ప్రభుత్వ అధీనం లో పనిచేసే సంస్థ కావడం తో ఆ దర్యాప్తు పై తనకు నమ్మకం లేదని అందుకే హైకోర్టు ద్వారా సిబిఐ విచారణ కోరనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, ఇప్పటికే వైజాగ్ కు చెందిన డాక్టర్ సుధాకర్ కేసులో సిబిఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.