బీసిసిఐని  క‌ల‌వ‌ర‌పెడుతున్న జ‌డేజా మోకాటి గాయం

రవీంద్ర జడేజా తన కుడి మోకా లికి గాయమైంది. పాకి స్తాన్, హాంకాంగ్‌లతో ఈవెంట్‌లో మొద టి రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వా త ఆసియా కప్ 2022 లో కొన‌ సాగ‌ లేదు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం జట్టు కాంబినేషన్‌ను కలవర పెడుతోంది, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బిసిసిఐ) దాని గురించి సంతోషంగాలేదు. జడేజా గాయంతో మేము సంతోషంగా లేము.అతను సాహసోపేత కార్య కలాపాలు చేస్తూ ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఉండాలి. కానీ అతను బాధ్యత వహించ లేదు, ప్రపంచకప్ దారిలో ఉంద ని అనుకోలేదు. జడేజా ఈ చర్య తో మేము సంతోషంగా లేమ‌ని బిసీసీఐ అధికారులు తెలిపారు. మంగళవారం, జడేజా మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు, తన శస్త్రచికిత్స విజయవంత మైందని జడేజా మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియ‌జేశాడు. శస్త్రచికిత్స విజయవంతమైంది. బిసిసిఐ, నా సహచరులు, సహాయక సిబ్బంది, ఫిజియోలు, వైద్యులు. అభిమానులు అంద‌ రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు జ‌ద్దూ. వీలైనంత త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తానని, శుభాకాం క్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని జడేజా తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. జడేజా గాయపడే వరకు 2022 ఆసియా కప్‌లో ఘన విజయం సాధించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో, అతను 35 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు, రెండు ఓవర్లలో 0/11 గణాంకాలను నమోదు చేశాడు. హాంకాంగ్‌తో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో, అతను బ్యాటింగ్ చేయలేదు కానీ బంతితో 1/15 తీసుకున్నాడు మరియు నిజంగా బాగా ఫీల్డింగ్ చేశాడు. స్టార్ ఆల్ రౌండర్ ఈ ఏడాది ఇప్పటివరకు చాలా బాగా ఆడాడు. ఈ ఏడాది తొమ్మిది టీ20ల్లో జడేజా ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 50.25 సగటుతో 201 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు ఈ సంవత్సరం ఫార్మాట్‌లో 46 ప‌రుగులు. ఇది కాకుండా, అతను 1/15 అత్యుత్తమ గణాంకాలతో ఐదు వికెట్లు తీశాడు. ఈ ఏడాది మూడు టెస్టుల్లో అతను ఐదు ఇన్నింగ్స్‌ల్లో 82.00 సగటుతో 328 పరుగులు చేశాడు. అతను ఈ సంవత్సరం క్రికెట్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో రెండు సెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 175 ఈ సంవత్సరం ప్రారంభంలో అతను శ్రీలంకపై చేశాడు. అతను ఈ ఫార్మాట్‌లో 5/41 అత్యుత్తమ గణాంకాలతో 10 వికెట్లు కూడా తీసుకున్నాడు. అలాగే, మూడు వన్డేల్లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో 36.00 సగటుతో 36 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ స్కోరు 29. ఈ ఏడాది ఫార్మాట్‌లో వికెట్ కూడా తీశాడు.

ఏపీ ట్రెజరీ అధికారులకు ఐటీ నోటీసులు

టీడీఎస్‌ చెల్లింపుల వ్యవహారంలో ఐటీశాఖ ఏపీ ట్రెజరీ విభాగానికి నోటీసులు జారీ చేసింది. ఉద్యో గుల వేతనాల నుంచి మినహా యిస్తున్న టీడీఎస్‌ మొత్తాలను జమ చేయక పోవడంపై ఐటీ శాఖ వివరణ కోరినట్టు సమా చారం. ఏపీలోని ట్రెజరీ విభాగం ఉన్న తాధికారులతో పాటు అన్ని జిల్లాల ట్రెజరీ, సబ్ ట్రెజరీ అధికారులకు లేఖలు పంపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా ఉద్యోగులనుంచి వసూలు చేసిన టీడీఎస్‌ ఐటీ విభాగానికి జమ చేయక పోవటం పై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆలస్యంగా చెల్లిస్తే చట్టప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించింది. మూలాధారం వద్ద పన్ను మినహాయించబడినది (టీడీఎస్‌) అనేది ఆదాయ ఉత్పత్తి సమయంలో నేరుగా పన్ను వసూలు చేసే ఒక వ్యవస్థ. భారతదేశంలోని ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, టీడీఎస్‌ చెల్లింపుదారు ద్వారా తీసివేయబడుతుంది మరియు అతను చెల్లింపుదారు తరపున ప్రభుత్వానికి చెల్లింపు చేస్తాడు. ఉదాహరణకు, ఉద్యోగికి జీతం చెల్లించే యజమాని టీడీఎస్‌ని తీసి వేయవలసి ఉంటుంది. దానిని ఉద్యోగి తరపున ప్రభుత్వానికి చెల్లించాలి. అదేవిధంగా, ఒక ఇంటి కొను గోలు దారు విక్రేత తరపున ప్రభుత్వానికి టీడీఎస్‌ని తగ్గించి, చెల్లించవలసి ఉంటుంది. ఐటీ చట్టాల ప్రకారం, జీతం, వడ్డీ, అద్దె, కమీ షన్, బ్రోకరేజ్ మొదలైన వాటిపై చెల్లింపుదారుడు టీడీఎస్‌ తీసివేయబడుతుంది. ఏపీలోని అన్ని జిల్లాల ట్రెజరీ అధికారులు, సబ్ ట్రెజరీ అధికారులకు ఐటీ శాఖ‌ లేఖలు పంపింది. బెజవాడలోని ఐటీ శాఖ, టీడీ ఎస్ రేంజ్ నుంచి అందరికీ తాఖీదులు పంపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల ఉద్యోగుల నుంచి టీడీఎస్ వసూలు చేశారని పేర్కొన్న ఐటీ అధికారులు టీడీఎస్ మొత్తాన్ని ఏడాది చివరి వరకు జమ చేయలేదని ఐటీ శాఖ పేర్కొన్న‌ది.వెంటనే ప్రతినెల టీడీ ఎస్ మొత్తాన్ని చెల్లించాల్సిందేనన్న ఐటీ ఆదేశించింది. ఆలస్యంగా చెల్లిస్తే ఐటీ చట్టంలోని సెక్షన్ 192(1) ప్రకారం వడ్డీ వసూలు చేస్తా మని హెచ్చరించింది. అంతేగాక అధికారులంతా ఈ నిబంధ‌న‌లు పాటించాల‌ని ఐటీ సూచించింది.

న‌ర‌స‌రావుపేట డీఎస్పీ, ప్ర‌భుత్వ వైద్యుడికీ కోర్టు నోటీసులు

ఎవ‌రిమీద‌యినా క‌క్ష తీర్చుకోవాలంటే కుట్ర‌ప‌న్ని కొట్టించ‌డం, కేవ‌లం ఆస్ప‌త్రి లో చేరేలాగా చేయ‌డ‌మే చేసి ఆనందించ‌డం గ‌మ‌నిస్తుంటాం. కానీ సినిమాటిక్‌ గా కొట్టిన‌ట్టు సీన్ క్రియేట్ చేసి మ‌రీ పోలీసు కేసు, జైల్లో పెట్టించ‌డాలు కూడా చేయ‌వ‌చ్చ‌ని న‌ర‌స‌రావుపేట సంఘ‌ట‌న తెలియ‌జేసింది. ఏకంగా న్యాయ‌మూర్తే ఆశ్చ‌ర్య‌పడేలా జ‌రిగింది.  రొంపిచ‌ర్ల మండ‌లం సుబ్బ‌య్య‌పాలెంలో గ‌త నెల 27న గంగినేని పున్నయ్య అనే వ్య‌క్తి త‌న‌పై గొడ్డ‌లితో దాడిచేశాడ‌ని అదే గ్రామా నికి చెందిన తురిమెల్ల చెంచారావు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పున్న‌య్య‌మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు.  న‌ర‌స‌రావుపేట ప్ర‌భుత్వఆస్పత్రిలో చెంచారావు చికిత్స పొందారు. తీవ్ర‌గాయాలు అయిన‌ట్టు ఆ ఆస్ప్ర‌తి వైద్యుడు రాజ‌శేఖ‌ర్ రిపోర్టు కూడా ఇచ్చారు. విన‌డానికి ఇదంతా బాగానే ఉంది. ఇదంతా నిజ‌మే అయ్యో ఎంత‌గా గాయ‌ప‌డ్డాడో చెంచారావు అను కున్నారంతా. డాక్ట‌ర్‌గారి నివేదిక అంత‌లా ప్ర‌భావం చూపిందిమ‌రి.    శ‌నివారం చెంచారావు కేసు కోర్టుకి వ‌చ్చింది. చెంచారావు దెబ్బ‌ల‌ను జ‌డ్జి స్వ‌యంగా ప‌రిశీలించాల‌నుకున్నారు. చిత్ర‌మేమంటే ఆయ‌న‌కు చెంచారావు ఒంటి మీద ఒక్క గాయం క‌నిపించ‌క‌పోవ‌డం. అస‌లు క‌త్తిపోట్లు ఎక్క‌డున్నాయి, చిన్న గాయం కూడా లేని మ‌నిషికి  తీవ్ర‌గాయాల‌కు చికిత్స చేశామంటూ డాక్ట‌రు రిపోర్టు ఇవ్వ‌డ‌మేమిట‌ని జ‌డ్జిగారు ఆశ్చ‌ర్య‌ప‌డ్డారు. నిందితుడుకి బెయిల్ రాకుండా కావాలనే తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లు ధ్రువీకరించుకున్న  జడ్జి వెంటనే పున్నయ్య కి బెయిల్ మంజూరు చేశారు. జరిగిన ఘటనపై పది రోజుల్లో  సమాధానం చెప్పాలని డీఎస్పీ కి, ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర్ కి నోటీసులు ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో చట్టసభలు .. ఛీ ..ఛీ!

రాష్ట్ర విభజన వలన తెలుగు ప్రజలకు ఏమి మేలు జరిగిందో, ఏమో కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ, ప్రజాస్వామ్య  వ్యవస్థలు మాత్రం అధ:పాతాళానికి దిగజారి తెలుగు ప్రజల గౌరవాన్ని జాతీయ స్థాయిలో దిగజార్చివేస్తున్నాయి. ఇక చట్ట సభల తీరు అయితే చెప్పనే అక్కరలేదు. అసలు చట్ట సభలు ఎందుకు దండగ, అనే అభిప్రాయానికి ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలూ వచ్చాయా? అనే విధంగా చట్టసభల తీరు తెన్నులు రోజురోజుకు, నానాటికీ తీసికట్టు నాగం బొట్లు అన్నట్లు జారుడు బండపై దిగజారి పోతున్నాయి. ఇది ఎవరో ఒకరిద్దరు ప్రముఖుల అభిప్రాయం మాత్రమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏ ఒకరిని కదిల్చినా,  అందరి అభిప్రాయమూ అదేగా వుంది.   రాజకీయ సంస్కారం అనేది. కాగడాలు కాదు, ఫ్లడ్ లైట్స్ పెట్టి వెతికినా ఉభయ తెలుగు రాష్ట్రలలో ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా చట్టసభల్లో  సభ్యుల ప్రవర్తన, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సహా మంత్రులు అధికార పార్టీ సభ్యుల ప్రవర్తన ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఉందని వేరే చెప్ప నక్కర్లేదు. చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు పిల్లలు చూడకూడదనీ, చూస్తే ఆ భాష విని పిల్లు చెడి పోతారని తల్లి తండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. ఏపీ అసెంబ్లీ విషయాన్నే తీసుకుంటే, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, అధికార పార్టీ సభ్యుల దుష్ప్రవర్తన భరించలేక, ఆవేదనతో సభను బహిష్కరించారు.  ఎంతో అనుభవం, అంతకు మించిన ఓర్పు ఉన్న చంద్రబాబు నాయుడే, కలత చెంది నిండు సభలో కన్నీరు  పెట్టుకోవలసి వచ్చిందంటే, అధికార వైసీపీ సభ్యుల  ప్రవర్తన ఎంత దుర్మార్గంగా వుందో వేరే చెప్పనక్కర్లేదు. అయితే, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అందుకే, సభలో ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులను దూషించి ఆనందం పొందిన ముఖ్యమంత్రి, అధికార వైసేపీ సభ్యులు అవే అవమానాలను అనుభవిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి భారతి పై ఆరోపణలు రావడంతో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విలవిలలాడి పోతున్నారు.  నిజానికి, ఆ కేసులలో  భారతి ప్రమేయం ఉందా లేదా అనేది ఇప్పడు అప్రస్తుతం. కానీ, రాజకీయ  విమర్శలు నిందలు గీత దాటి కుటుంబ సభ్యులు,ముఖ్యంగా ప్రత్యర్ధుల కుటుంబ సభ్యులను మరీ ముఖ్యంగా మహిళలను అసభ్యంగా దూషించడం తేలికే కానీ, సీన్ రివర్స్ అయితే భరించడం కష్టం. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  అది అర్థమైందో లేదో కానీ,   భారతి పై వస్తున్న ఆరోపణలను ఖండించడం లేదని, అయన మంత్ర్రుల పై మండిపడడం చూస్తుంటే ముల్లు గట్టిగానే గుచ్చుకున్నట్లుందని అంటున్నారు.  ఇక తెలంగాణ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల వరకు ప్రతి ఒక్కరూ భాష విషంలో గీత దాటడమే కాదు. ప్రజాస్వామ్య విలువలు పాటించడం వరకు ఏ ఒక్క విషయంలోనూ రాజకీయ మర్యాదలనే కాదు, రాజ్యాంగ మర్యాదలనూ పాటించడం లేదు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయాన్నే తీసుకుంటే పరిస్థితి  ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పనక్కర లేదు.    ఈ అన్నిటినీ మించి, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నీళ్లు వదిలేశాయని, రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. నిజానికి చట్ట సభల అవసరమే లేదన్న తీరున సభా సంప్రదాయాలనే కాదు, రాజ్యాంగ విధులకు, విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత లేదన్నా సంవత్సరంలో కనీసం 60 రోజులు ఉభయ సభలు సమావేశమయ్యేవి. ఇంతో కొంత మేరకు ప్రజాసమస్యలు చర్చకు వచ్చేవి. ముఖ్యంగా పెద్దల సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేవి.  అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు తమ సమస్యలను ఆందోళనల రూపంలోనో, అభ్యర్ధనల రూపంలో ప్రభుత్వ దృష్టికి తెచ్చే అవకాశం ఉండేది. ఇప్పడు, సభా దినాలు కుదించుకు పోయాయి. తెలంగాణ వర్షాకాల సమావేశాలు మూడాంటే మూడే రోజులు జరుగు తున్నాయి. ఏపీలో,గత బడ్జెట్ సమావేశాలు కొవిడ్  సాకుగా చూపి ఒకే ఒక్క రోజు నిర్వహించారు. రూ. 2.56లక్షల కోట్ల ప్రజాధనానికి సంబదించిన బడ్జెట్ ను, ఆర్థిక మంత్రి బుగ్గన తూతూ మంత్రంగా సగం చదివి, సగం చదవకుండానే సభ  ఆమోదం కోరారు.  అసెంబ్లీలో చర్చలు జరిగితేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ప్రభుత్వాలు అసెంబ్లీ పని దినాలను నరుక్కుంటూ పోతున్నాయి.  చర్చలు జరపడానికి ఆసక్తి చూపించడం లేదు. కేవలం రాజ్యాంగ నిబంధనలను పాటిస్తున్నామని చెప్పుకునేందుకు మాత్రమే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో  శాసన సభ సమావేశాలు, ఒక మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నారు.నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు తిరిగులేనంత మెజార్టీ ఉంది. తమ వాదన బలంగా వినిపించుకునే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేల వాదన ఏ కొంచెం వినలేని అసహనాన్ని  ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయి. ఇది శోచనీయం. అందుకే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి  పెద్దలు చట్టసభల తీరు పట్ల అసంతృప్తి, ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.

రెబల్ స్టార్ కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు కన్నుమూత

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తెల్లవారు జామున కన్ను మూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. తెలుగు సినీ, రాజకీయ రంగాలలో తనదైన ముద్రవేసిన కృష్ణం రాజు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1940 జనవరి 20న జన్మించిన రెబెల్ స్టార్ అసలు పేరు ఉప్పలపాటి కృష్ణంరాజు. 1966లో చిలకాగోరింక సినిమాతో వెండితెరకు పరిచయమైన కృష్ణంరాజు  మొత్తం183పై చిలుకు సినిమాలలో నటించారు.   5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు. కృష్ణంరాజు చివరిగా నటించిన చిత్రం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున ఏజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  కృష్ణంరాజు మృతి వార్త తెలుసుకున్న   ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్ కు చేరుకున్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కృష్ణం రాజు తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించిన కృష్ణం రాజు ఆ తరువాత బీజేపీలో చేరి. కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో వచ్చిన మధ్యంతర ఎన్నికలలో నరసాపురం నుంచి లోక్ సభకు ఎన్నికై వాజ్ పేయి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి  చేతిలో పరాజయం పాలయ్యారు.   2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరి రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత నుంచి కృష్ణంరాజు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ,  2014లో కృష్ణంరాజు మళ్లీ బీజేపీలో చేరారు.   అటు రాజకీయ రంగంలోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూఆజాత శత్రువుగా, మంచి మనిషిగా అందరి మన్ననలూ అందుకున్న కృష్ణం రాజు మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కృష్ణం రాజు అంత్యక్రియలు సోమవారం(సెప్టెంబర్ 12) జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

తండ్రీ కొడుకుల సవాల్.. తెలంగాణలో కొత్త చిత్రం

తెలంగాణ రాజకీయాలు ఎటు పోతున్నాయి, రాష్ట్రంలో ఏమి జరుగుతోంది? ముఖ్యంగా, అధికార తెరాస పార్టీలో ఏమి జరుగుతోంది? ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, కుటుంబంలో ఏమి జరుగుతోంది? అంతర్గతంగా అంతా బాగుందా? అంటే లేదు అనే సమాధానమే వస్తోంది. ఇటు ప్రభుత్వం  అటు పార్టీ పైకి మేడి పండులా నిగనిగ లాడుతూ కనిపిస్తున్నా, లోపలి లుకలుకలు రోజు రోజుకూ మరింతగా వికటిస్తున్నాయని అంటున్నారు. ఒక విధంగా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లుగా అంతర్గత లుకలుకలు భగ్గుమంటున్నాయని  అంతర్గత వేగులు అందిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అంతే కాదు, ఇంతవరకు ప్రగతి భవన్ నాలుగు గోడల మధ్య ఎంతో కొంత గుట్టుగా, గుంభనంగా  సాగుతున్న, కల్వకుట్ల ఫ్యామిలీ డ్రామా, ఇప్పడు తెలంగాణ భవన్ కు చేరిందని, ‘ప్రగతి భవన్’ సన్నిహిత వర్గాలు  ఆధారాలతో సహా విపులంగా వివరిస్తున్నాయి.   నిజమే, ముఖ్యమంత్రి కేసీఆర్  ఇప్పుడు కాదు, చాలా కాలంగా జాతీయ రాజకీయాల గురించి ముచ్చటిస్తూనే ఉన్నారు. వ్యూహాలు రచిస్తున్నారు.  ఉపన్యాసాలలో వినిపిస్తున్నారు. నిజానికి  2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అయితే, కేసేఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానం అప్పుడూ ఇప్పుడూ కూడా  ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగానే సాగుతోంది.  అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ సందర్భం ఏదైనా జాతీయ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. తాజగా, నిజామాబాద్ సభలోనూ కేసీఆర్, మీరు ఊ.. అంటే చాలు జాతీయ రాజకీయాల్లోకి దూకేస్తా  అంటూ తెలంగాణ ప్రజల ఆనతి కోరారు. అంతే కాదు, 2024 ఎన్నికల తర్వాత,కేంద్రంలో వచ్చేది మన ప్రభుత్వమే అని భరోసా ఇచ్చారు. జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్నా.నిజామాబాద్‌ సభ సాక్షిగా నిర్ణయం తీసుకుంటున్నా,వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడేది మన ప్రభుత్వమే. దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తును ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తాం అని ప్రకటించారు. జనం చప్పట్లు కొట్టారు. బై ,బై గణపతి స్టైల్లో   వీడ్కోలు పలికారు.   అదలా ఉంటే, ముఖ్యమత్రి అర్జెంటుగా, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పోవాలని, తెరాస జిల్లా అధ్యక్షుల సాముహికంగా చేసిన డిమాండ్ ఇప్పుడు, ముఖ్యమంత్రి జాతీయ రాజకీయ వ్యూహంలో కొత్త కోణాన్ని అవిష్కరించిందని అంటున్నారు. నిజానికి, తెలంగాణ భవన్ లో జరిగిన తెరాస జిల్లా అధ్యక్షుల సాముహిక డిమాండ్ వైనక చాలా పెద్ద రాజకీయమే ఉందని అంటున్నారు. ముఖ్యమత్రి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం, ఆ వెంటనే కల్వకుట్ల తారక రామారావు .. అను నేను ... అంటూ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకేసారి, ఒక దాని కొకటి సమాంతరంగా సాగుతాయని అందరూ అనుకుంటున్నదే. అందులో రహస్యం ఏమీ లేదు. నిజానికి, 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిందే అందుకని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే, అది జరగలేదు. ఆ కారణంగానే, సుమారు రెండు నెలలకు పైగా, మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి ముహ్మదాలీ ఇద్దరే, పరిపాలన సాగించారు.  ఇక అక్కడి నుంచి, కేటీఆర్ పట్టాభిషేకానికి ఎన్ని సార్లు సనాహాలు జరిగాయో, ఎన్ని ముహూర్తాలు మురిగి పోయాయో, లెక్కలేదు. నిజానికి ఒక దశలో, తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కేటీఆర్ పట్టాభిషేకం గురించి బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కానీ, వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు కేటీఆర్ పట్టాభిషేకానికి ఎప్పటి కప్పుడు  విఘ్నాలు అడ్డుపడుతున్నాయి. ఈ కారణంగానే తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరిగిందని అంటున్నారు.  ఈ నేపధ్యంలో   శుక్రవారం (ఆగస్టు9) జరిగిన తెరాస జిల్లా అధ్యక్షులు సామూహికంగా విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ వినిపించారని అంటున్నారు. ఒక విధంగా పరోక్షంగానే అయినా  కీటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయమని జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారని అనుకోవచ్చని అంటున్నారు. నిజానికి, ఈ డిమాండ్ చేసింది జిల్లా అధ్యక్షులే అయినా చేయించింది మాత్రం, కేటీఆర్ అని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటు చేసి  కేసీఆర్ మకాం ఢిల్లీకి మారిస్తే, ఆ విధంగా అయినా కేటీఆర్ కల నిజమవుతుందని, పార్టీలో, ఫ్యామిలీలో కేటీఆర్ వర్గం భావిస్తోంది. అయితే, జాతీయ పార్టీ పెట్టినా, కేసీఆరే, ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే జిల్లాల అధ్యక్షుల సామూహిక మీడియా సమావేశంలో డిమాండ్ చేయడం కొసమెరుపు. ఈ కొస మెరుపుతో, కేటీఆర్, చివరి ఆశ కూడా నీరుగారిపోయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సో కేసీఆర్ కు సీఎం కావాలన్న అశ.. ఇప్పటికైతే అడియాశగానే మిగిలిపోయింది. సో కేటీఆర్ కి ముఖ్యమంత్రి యోగం లేదని, కనీసం ఈ సారికి అయితే, ఆ అవకాశం లేనట్లే అంటున్నారు. అయితే, దేశ, రాష్ట్ర రాజకీయాలు చకచకా మారిపోతున్న నేపధ్యంలో రేపు ఏమైనా జరగవచ్చని, అంటున్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు 60 ఏళ్ళు దాటినా ఓపిగ్గా ఎదురు చూశారు, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను పక్కకు నెట్టి 40లలోనే ముఖ్యమంత్రి అయ్యారు... ఎవరి ఆలోచనలు వారివి ... ఎవరి పంథా వారిది .. రేపు ఏమి జరుగుతుందో ... ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో .. ఎవరికి తెలుసు..అంటున్నారు.

బైక్ రైడ‌ర్స్ ...స్లిప్ప‌ర్ల‌తో తిరిగినా జ‌రిమానా! 

స్కూల్లో పిల్ల‌ల్ని దింప‌డానికి పిల్ల‌ల్ని ఎక్కించుకుని ర‌య్‌న హైవేలో ఇష్టం వ‌చ్చిన‌ట్టు వెళ్ల‌డానికి  ఇక కుద ర‌దు. గ‌ర్ల్‌ఫ్రెండ్‌ని ఎక్కించుకుని ప‌వ‌ర్‌స్టార్‌లా భావించుకుని వేగంగా రివ్వున వెళ్లేవారికి ఇక క‌ష్ట‌మే అంటు న్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్ప‌టికే ఉన్న ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌కు తోడు మ‌రింతగా జ‌రిమానాల దాడులు పెరిగే అవ‌కాశం ఉంది.  ఇక‌నుంచి నోట్లో బ్రెష్ పెట్టుకుని స్లిప్ప‌ర్ల‌తో, నిక్క‌ర్ టీ ష‌ర్టుతో చాలా చిరాగ్గా టూవీల‌ర్ మీద బ‌య‌టికి వెళ్లే వారికి భారీ జ‌రిమానా ప‌డే అవ‌కాశం ఉంది. మ‌రంచేత క‌డు జాగ్ర‌త్త‌. ఫ్రెండ్ ఫోన్ చేశాడ‌ని, బ‌స్ స్టాప్ ప‌క్కనే ఉందిగ‌దా అని స్లిప్ల‌ర్లేసుకుని, చాలా నిర్ల‌క్ష్యంగా బండిమీద బ‌య‌టికివ‌స్తే వెయ్యి రూపా య‌ల  జ‌రిమానా ప‌డే అవ‌కాశం ఉంది. ఆన‌క పోలీసువారితో గొడ‌వ‌ప‌డటం, జ‌రిమానా త‌గ్గించాల‌ని వేడుకోవడానికి అవకాశం ఉండ‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక లెక్క‌, ఇక నుంచి వేరే.. అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు, మోటార్ వాహ‌నాల చ‌ట్టం మ‌రింత క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌నుంది.  మ‌రో క‌ఠిన నిబంధ‌న ఏమిటంటే టీ ష‌ర్టు, షార్టులు వేసుకుని అస్స‌లు డ్రైవ్ చేయ‌ద్దంటున్నారు. జిమ్‌కి వెళుతున్నాను, స‌ర‌దాగా తిర‌గ‌డానికి ఇలానే వెళ‌తాను అంటే కుద‌ర‌దు. ఇక నుంచి షార్ట్‌తో, టీ ష‌ర్టుతో వెళ్ల‌బోయే ముందు ఒక్క‌సారి జ‌రిమానాను గుర్తుచేసుకోవాలి. ఈ నిబంధ‌న‌ను కాద‌ని పోలీసులను ప‌ట్టిం చుకోకుండా, ప‌క్క గ‌ల్లీల్లోంచి వెళ్ల‌చ్చు అనుకుంటే స‌రే. అన్ని అనుకూలిస్తే ఇంటికి వెళ‌తారు. లేక‌పోతే రూ.2000 జ‌రిమానా క‌ట్టి మ‌రీ ఇంటికి వెళ్ల‌వ‌ల‌సి వ‌స్తుంది. అందువ‌ల్ల బైక్ మీద వెళ్లే అంద‌రూ త‌ప్ప‌కుం డా హెల్మెట్ పెట్టుకోవ‌డం, సంబంధిత ప‌త్రాల‌తో పాటు ఈ చిన్న‌పాటి నిబంధ‌న‌ల‌ను కూడా త‌ప్ప‌కుం డా, సీరియ‌స్ గా ప‌ట్టించుకోవాలి. లేక‌పోతే జ‌రిమానాకు దొరికిపోతారు.

క్వీన్ ని ఆక‌ట్టుకున్న ట్రినిటీ చ‌ర్చి

క్వీన్ ఎలిజ‌బెత్‌-2కు జంట‌న‌గ‌రాల‌తో ఆత్మీయ అనుబంధం ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ బొల్లారం లోని హోలీ ట్రినిటీ చ‌ర్చి అంటే ప్ర‌త్యేక అనుబంధం. ఎలిజ‌బెత్ దంప‌తులు త‌మ 36వ వివాహ వార్షి కోత్సవాన్ని అక్క‌డే జ‌రుపుకున్నారు. విక్టోరియా రాణి ఇచ్చిన నిధుల‌తోనే  1847లో ఈ చ‌ర్చి నిర్మాణం జ‌రిగింది. అందు వ‌ల్ల ఆ చ‌ర్చిప‌ట్ల ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. విక్టోరియా రాణి మునిమ‌నవ‌రాల‌యిన ఎలిజ‌బెత్‌-2 ఇక్క‌డి బిష‌ప్ ల ప్ర‌త్యేకాహ్వానం మేర‌కు చ‌ర్చిని సంద‌ర్శించారు. అంద‌రినీ ఎంతో ప్రేమ‌తో ప‌ల‌క‌రిం చారు.   ఎలిజ‌బెత్ -2 1983లో భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైద‌రాబాద్ వ‌చ్చారు. ఆ ఏడాది న‌వంబ‌ర్‌లో హైద‌రా బాద్ వ‌చ్చారు. రాణి దంపతులకు అప్పటి సమైక్య రాష్ట్ర గవర్నర్‌ రామ్‌లాల్‌, ముఖ్యమంత్రి నంద మూరి రామారావు స్వాగతం పలికారు. నాలుగు రోజులుపాటు సాగిన ఈ పర్యటనలో నగరంలోని బీహెచ్‌ ఈఎల్‌, ఇక్రి శాట్‌, కుతుబ్‌షాహి సమాధులను సందర్శించారు.   1947లో క్వీన్‌ ఎలిజబెత్‌-2 వివాహం  సందర్భంగా అప్పటి నిజాం ప్రభువు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆమెకు అత్యంత విలువైన వజ్రాలహారాన్ని బహుమతిగా అందజేశారు. లండన్‌కు చెందిన నగల తయారీ సంస్థ కార్టియర్‌ ప్రతినిధులను రాణి వద్దకు పంపిన నిజాం ప్రభువు.. కానుకను ఎంచుకోవాలని కోరారు. దీంతో 300 వజ్రాలు పొదిగిన ఓ ప్లాటినం నెక్ల‌స్‌ను ఆమెను ఎంపిక చేసుకు న్నారు. క్వీన్‌ ఎలిజబెత్‌-2 వివిధ సందర్భాల్లో ఆ హారాన్ని ధరించారు.

రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాటకు ఇదా వేదిక.. అసోం సీఎం తీరును తప్పుపడుతున్న జనం

తెలంగాణలో సందర్బం ఉన్నా లేకున్నా వివాదం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశం వినా బీజేపీకి మరో లక్ష్యం, ధ్యేయం లేదన్నట్లుగా ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఉన్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. మత సామరస్యానికీ, సామాజిక సామూహికత్వానికి ప్రతీకగా జరిగే ఈ కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలూ మమేకమై రాజకీయాలకు అతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా జరుపుకునే ఒక పండుగ. అటువంటి కార్యక్రమంలో కూడా రాజకీయ లబ్ధిని వెతుక్కునే కార్యక్రమానికి పార్టీలు ఉపక్రమించడం పట్ల సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా సందడి కోల్పోయిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఈ ఏడాది కన్నుల పండువగా సాగింది. భక్త జనం తండోపతండాలుగా ఈ వేడుకను తిలకించేందుకు కదలి వచ్చారు. అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ వేడుకలో పాలకుండలో ఉప్పుకణిక పడిన చందంగా మొజాంజాహీ మార్కెట్ వద్ద జరిగిన సంఘటన శోభాయాత్రకు ఓ మచ్చలా పరిణమించింది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందకు వచ్చిన అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ, ఆ పనిని పక్కన పెట్టి రాజకీయ ప్రసంగం చేయడం పట్ల సర్వత్రా నిరసన, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అసోం నుంచి వచ్చిన ఆయన ఇక్కడ రాజకీయ రచ్చకు కారణం అవ్వడాన్ని అంతా ఎత్తి చూపుతున్నారు. గతంలో ఎన్నడూ శోభాయాత్ర సందర్భంగా ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని గుర్తు చేసుకుంటున్నారు. బీజేపీ కారణంగానే రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన శోభాయాత్రలో అనవసర వివాదం తలెత్తిందని విమర్శిస్తున్నారు.  మొజాంజాహీ మార్కెట్ వద్ద గణనాథులను ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన వేదిక పై ప్రసంగించిన అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ రాజకీయాలు మాట్లాడడమే వివాదానికి కారణమైంది. తెరాస నేత నందూలాల్ అసోంసీఎం ప్రసంగాన్ని అడ్డుకుని ఆయన చేతిలో మైకు లాక్కోవడానికి ప్రయత్నించారు.   రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమంలో హేమంత్ బిశ్వశర్మ రాజకీయ ప్రస్తావన తీసుకురావడం ఉద్రిక్తతకు కారణమైంది. ఇదే కాకుండా అంతకు ముందు కూడా ఇదే ఎంజీఎం మార్కెట్ దగ్గర ఫ్లెక్సీల విషయంలో కూడా వివాదం నెలకొంది. అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ ఫ్లెక్సీకి పోటీగా మంత్రి తలసాని ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు వచ్చిన తెరాస కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు, గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు.  ఆ తరువాత హేమంత్ బిశ్వశర్మ రాజకీయ ప్రసంగం ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడేందుకు కారణమైంది. కాగా గణేష్ నిమజ్జన శోభాయాత్రలో రాజకీయ ప్రసంగాలేమిటని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రతీ రోజు రాజకీయ విమర్శలతో ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకునే తెరాస, బీజేపీలు ఒక్క రోజు తమ రాజకీయ విమర్శలకు, ప్రసంగాలకూ విరామం ప్రకటించేపాటి నియంత్రణను కూడా కోల్పోయాయా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ గణేష్ శోభాయాత్రను కూడా రాజకీయ వేదికను చేయడానికి ప్రయత్నించడం పట్ల రాజకీయ వర్గాలలో సైతం విమర్శలు వ్యక్తమౌతున్నాయి.  హైదరాబాద్ లో వినాయక శోభయాత్రను చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్న అసోం సీఎం హేమంత్​ బిశ్వ శర్మ అక్కడితో ఆగకుండా.. తెలంగాణ లో కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి కానీ.. కుటుంబ పక్షాన ఉండకూడదన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు కేవలం ఒక్క ఫ్యామిలీ మాత్రమే అనుభవిస్తోందని , అలా కాకుండా మిగిలిన అన్ని కుటుంబాలకు మంచి జరిగేలా చూడాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నాననీ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా   తెలంగాణలో టీఆర్ఎస్ పాలన రజాకార్ల పాలనను తలపిస్తోందని, కేసీఆర్ పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించాలని పిలుపు నిచ్చారు.   దీంతో ఈ వేదికపై రాజకీయ విమర్శలేమిటని పేర్కొంటూ టీఆర్ఎస్ నేత నందూ బిలాల్  మైకు లాక్కునేందుకు ప్రయత్నించగా ఆయనను గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు వేదికపై నుంచి లాగేశారు.  ఏది ఏమైనా తెరాస కూడా ఒకింత నియంత్రణ పాటించి ఉంటే శోభాయాత్రకు రాజకీయ మరక అంటి ఉండేది కాదని సామాన్యులు సైతం అంటున్నారు. అదే సమయంలో అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ తీరును తప్పుపడుతున్నారు.

రాహుల్ గాంధీ సై.. అంటారా ?.. నై అంటారా?

రాబోయే రోజుల్లో కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు, ఇదే  కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన ప్రశ్న. నిజానికి, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామ చేసినప్పటి నుంచి,కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఖాళీగానే వుంది. అనివార్య పరిస్థితుల్లో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా, ఆమె పార్టీ బాధ్యతలను నిర్వహించలేక పోతున్నారు. ఓ వంక వయో భారం, మరో వంక అనారోగ్యం, ఆమెను వెంటాడుతున్నాయి. ఈ కారణంగా ఆమె క్రియాశీలంగా వ్యవహరించలేక పోతున్నారు. మరో వంక పార్టీ సీనియర్ నాయకులు ఒకరొకరుగా పార్టీని వదిలి పోతున్నారు.  ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముహుర్తహం ఖరారు చేసింది. ఓ 15/20 రోజుల కిందట పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ అనివార్యమైతే అక్టోబరు 17న పోలింగ్‌ జరుగుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో అర్హులైన పార్టీ సభ్యులు ఎవరైనా పోటీ చేయవచ్చని, పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే ఎవరు పోటీ చేస్తారు? అసలు ఎవరైనా పోటీ చేస్తారా? అనే విషయంలో ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఓ వంక  కాంగ్రెస్ ఎంపీ శశి  థరూర్ సహా మరికొందరి పేర్లు వినిపిస్తున్నా,ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా, ఖాయంగా పోటీ చేస్తామని ప్రకటించలేదు. అదలా ఉంటే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం ఏమిటి అనే విషయంలో మొదటి నుంచి ఉన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. నిజానికి, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలోనే తమ మనసులోని మాటను స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు మరో మారు తీసుకునేది లేదని తేల్చి చెప్పేశారు.  అంతే కాదు  గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తులు పార్టీ అధ్యక్ష బాద్యత తీసుకోవాలని, సిడబ్ల్యూసీ సంవేసంలోనే తెగేసి చెప్పారు. మూడేళ్ళుగా అయన అదే మాట మీదున్నారు.  అయినా, ఇంకెవరు ముందుకు రాకపోవడం వల్లనే, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నెట్టుకొస్తున్నారు.  మరో వంక ఆమె నిరాసక్తత కారణంగానే కావచ్చును కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా స్వతత్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విమర్శలు ఎదుర్కుంటున్నారు. రాహుల్ గాంధీ అప్రకటిత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని, జీ 23 నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ సదిగ్ధ వైఖరి కారణంగానే పార్టీ నష్ట పోయిందని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. నిన్న మొన్న పార్టీని వదిలి వెళ్ళిన, పార్టీ సీనియర్  నాయకుడు గులాంనబీ ఆజాద్,ఇంకా పార్టీలోనే ఉన్నఆనంద శర్మ, మనీష్ తివారీ వంటి ఇతర సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ నిర్వాకం వల్లనే పార్టీ కోలుకోలేని విధంగ్ బలహీనమైందని, మండి పడుతున్నారు.నిజానికి, ఇప్పటికైనా రాహుల గాంధీ తెగించి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు, సై అంటే అధ్యక్ష ఎన్నిక అవసరమే ఉండదు. కానీ ఇప్పటికీ అయన దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. తాజాగా, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ శుక్రవారం (సెప్టెంబర్9) విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ... అదే సందిగ్ధత, అదే సస్పెన్స్ కొనసాగించారు. అధ్యక్ష బాధ్యతల విషయంలో తాను ఎప్పుడో  నిర్ణయం తీసేసుకున్నాననీ, ఈ విషయంలో తనకెలాంటి అయోమయమూ లేదనీ చెప్పారు. తాను  అధ్యక్షుడిని అవుతానో లేదో ఎన్నిక జరిగినప్పుడు స్పష్టత వస్తుంది. అప్పటివరకు వేచి చూడండి  అంటూ, అటూఇటూ కాని, సమాధానం ఇచ్చారు. అంతే కాదు, ఒకవేళ పోటీ చేయకుంటే విలేకరులు తనను అడగొచ్చని.. అందుకు జవాబు చెబుతాను  అంటూ మరో మెలిక పెట్టారు. అంటే రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్డమయ్యారని అనికోవాలా?  లేదని సరిపుచ్చుకోవాలా  అర్థం కాక కాంగ్రెస్ శ్రేణులే తలలు పట్టుకుంటున్నాయి.  అదలా ఉంటే రాహుల్ గాంధీ సాగిస్తున్న, భారత్ జోడో యాత్ర లక్ష్యం విషయంలోనూ అదే సందిగ్దత వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నాయకులు, ఓ వంక ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్న యాత్ర కాదని అంటారు. మరో వంక, యాత్ర ద్వారా రాహుల్ గాంధీ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తున్నారని అంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ, అధ్యక్ష పదవి విషయంలో సందిగ్దత తోలిగితేనే కానీ, కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటన్నది తేలదని, రాహుల్ గాంధీ, ఇప్పటిలా బాధ్యతలు లేని అధికారం చెలాయించాలని కోరుకుంటే, పార్టీ పరిస్థితి కూడా  ఇప్పటిలానే దినదిన ప్రవర్తమానంగా దిగాజారుతుందని అంటున్నారు.

పైథాన్ క‌డుపు చీలిస్తే.. మ‌నిషి శ‌వం బ‌య‌ట‌ప‌డింది!

నాన్న ఊరునించి రాగానే పిల్ల ప‌రుగున వెళ్లింది. సూట్‌కేస్ తెరిచి పిల్ల‌దానికి చాక్లెట్ ఇచ్చాడాయ‌న‌. బాబాయి వ‌చ్చిన‌పుడు జేబులోంచి మ‌రో చాక్లెట్ తీసిచ్చాడు. త‌ల్లి పోపుల డ‌బ్బాలోంచి ప‌ది రూపాయ‌లు తీసి కాలేజీకి వెళ్లే అబ్బాయికి ఇచ్చింది. కానీ ఇండోనేషియాలో ఒక గ్రామ‌స్తులు పైథాన్ క‌డుపులోంచి మ‌నిషి మృత‌దేహాన్ని బ‌య‌టికి తీశారు! అన‌కొండ సినిమాలో పేద్ద అన‌కొండ జీపుల్లో వెళ్లేవారిని వెంటాడ‌టం గుర్తుండే ఉంటుంది. చివ‌రికి క్యాంప్ లో ఒక్క‌డిని చూసి అమాంతం చుట్టేసి చంపేస్తుంది. పెద్ద తెర‌మీద అతిపెద్ద పాము  దృశ్యాన్ని చూసి ఒక్కింత అంద‌రూ భ‌య‌ప‌డ్డారు. చీక‌ట్టో వెళ్లేట‌పుడు పాము గాని అడ్డంగా పోయిందా, కాళ్ల‌కేమైనా త‌గిలిం దా అని చాలారోజులు ఆ సినిమా ప్ర‌భావంతో తిరిగారు అంద‌రూ!  ఇండోనేషియా, సల్వేసీ ద్వీపంలో తోట ప‌నిచేసేవారి హ‌డావుడి ఎక్కువే. అక్క‌డే నివాసం ఉంటూ కాలం గ‌డుపుతున్నారు. వారికి పాముపుట్రా భ‌యం ఎప్పుడూ లేదు. కానీ హ‌ఠాత్తుగా ఆమ‌ధ్య ఓ అన‌కొండ వారి నివాస ప్రాంతాల్లోకి వ‌చ్చేసింది. సైలెంట్‌గా ఒక వ్య‌క్తిని అమాంతం అర‌టిపండు మింగిన‌ట్టు మింగే సింది. త‌మ‌తోపాటు నిన్నమొన్నా క‌లిసి ప‌నిచేసిన అక్బ‌ర్ క‌న‌ప‌డ‌టం లేద‌ని తోట‌ప‌నివారంతా తెగ కంగారు ప‌డి అంతా వెతికారు. ఎక్క‌డా క‌న‌ప‌డ‌లేదు. అప్పుడు ఒక వ్య‌క్తి  ఒక పైథాన్ క‌ద‌ల‌కుండా ప‌డుంది, అది ఎవ‌రో మ‌నిషిని మింగేసిన‌ట్టుంది. క‌డుపు ద‌గ్గ‌ర మ‌రీ ఎత్తుగా క‌న‌ప‌డింది. అది బ‌హుశా మీరు వెతికే అక్బ‌ర్  అయే ఉంటాడ‌న్నాడు. అంతే ప‌రుగున పెద్ద‌వాళ్లు, న‌లుగురు యువ‌కులు అటు వెళ్లారు. పైథాన్ మ‌నిషి ని మింగ‌గానే కొంత‌సేపు అల‌సిపోయిన‌ట్టు ప‌డుకుంటుంది. వీళ్లు వెళ్లింది స‌రిగ్గా అలాంటి స‌మ‌యం లోనే. అందుకే వీరి మీద అది దాడి చేయ‌క ప‌డుకునుంది.  అంతే వెంట‌నే పెద్ద పెద్ద క‌త్తులు తీసి మావాడినే మింగేస్తావా.. అంటూ దాని పొట్ట‌ని చీల్చి అక్బ‌ర్ శ‌రీరా న్ని బ‌య‌టికి తీశారు. ఒక మ‌నిషిని బ‌తికి ఉండ‌గానే అమాంతం పైథాన్ మింగేయ‌డం ఇదే మొద‌టి సారిట‌. పైథాన్ అత‌న్ని మింగ‌గానే దాని శ‌రీరంలో ఆహారాన్ని మెత్త‌గా చేసే జ్యూస్ ఉత్ప‌న్న‌మ‌వుతాయి. కానీ అందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. క‌నుక గ్రామ‌స్థుల‌కు దాని పొట్ట చీలిస్తే మ‌ర‌ణించిన అక్బ‌ర్ శ‌రీరం దొరికింది. అందుకు సంతోషించారు. 

టీడీపీ వైపు పురందేశ్వరి చూపు?

టీడీపీ వ్యవస్థాపకుడు, తన కన్న తండ్రి, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీకి ఆయన కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి దగ్గర అవుతారనే చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతోంది. బీజేపీలో ఆమెకు క్రమేమీ ప్రాధాన్యం తగ్గుతోందనే అభిప్రారం వ్యక్తం అవుతోంది. ఎన్టీఆర్ వారసురాలిగా యూపీఏ ప్రభుత్వంలో పురందేశ్వరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఒకసారి ఆమెకు యూపీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రిగా సముచిత స్థానం ఇచ్చింది.  రాష్ట్ర విభజన తర్వాత పురందేశ్వరి బీజేపీలో చేరారు. బీజేపీ అధిష్టానం కూడా పురందేశ్వరికి ఒకింత ప్రాధాన్యత ఇచ్చిందనే చెప్పాలి.  ఎనిమిదేళ్లుగా బీజేపీలోనే ఆమె కొనసాగుతున్నారు. కానీ.. కొన్ని నెలలుగా పురందేశ్వరి కుటుంబంలోనూ, రాజకీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆమె తండ్రి స్థాపించిన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పకపోయినా.. తన ఏకైక కుమారుడు చెంచురాం హితేష్ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంటుకుని ఆమె తెలుగుదేవం గూటికి చేరాలన్న యోచనలో ఉన్నారని ఆమె సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా   లేకపోవడంతో ఆమె తన కుమారుడి రాజకీయ ప్రవేశం తెలుగుదేశం పార్టీ ద్వారా జరగాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.   తన ఏకైక కుమారుడి కోసం పురందేశ్వరి సమీప భవిష్యత్తులో ఎలాంటి కీలక నిర్ణయమైనా తీసుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం.. పురందేశ్వరికి పార్టీలో ప్రాధాన్యం తగ్గించినట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం పురందేశ్వరిని ఒడిశా పార్టీ బాధ్యతల నుంచి తప్పించిన బీజేపీ అధిష్టానం తాజాగా ఛత్తీస్ గఢ్ పార్టీ ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి కూడా ఉద్వాసన పలికిందంటున్నారు. ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబుతో కొన్నేళ్లుగా రాజకీయంగా విభేదించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు- పురందేశ్వరి కొద్ది రోజులుగా కుటుంబంలో జరిగిన పరిణామాల్లో దగ్గరయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు చంద్రబాబు దంపతులు వెళ్లి పరామర్శించారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కుమార్తె ఎంగేజ్ మెంట్ సందర్భంగా తోడల్లుళ్లు చంద్రబాబు- వెంకటేశ్వరరావు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. అంతే కాకుండా కాసేపు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వెంకటేశ్వరరావు- పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణించినప్పుడు కూడా చంద్రబాబు, దగ్గుబాటి దగ్గరుండి అన్ని కార్యక్రమాలూ నిర్వహించారు. ఇలాంటి సందర్భాల్లో దగ్గుబాటి- నారా కుటుంబాల మధ్య మళ్లీ సఖ్యత ఏర్పడిందనే అంచనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పురందేశ్వరి బీజేపీ వ్యవహారాలకు గతంలోలా పెద్ద ప్రాధాన్యం చూపించడం లేదనే అంచనాకు ఆ పార్టీ అధిష్టానం వచ్చిందనే వ్యాఖ్యలు బీజేపీ వర్గాల నుంచి వస్తున్నాయి. దాంతో పాటు బీజేపీ అధినాయకత్వం పట్ల పురందేశ్వరి కూడా అసంతృప్తితో ఉన్నారంటున్నారు. నిజానికి పురందేశ్వరి సమర్థతను గుర్తించిన బీజేపీ హైకమాండ్ ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించింది. పురందేశ్వరి అధ్యక్షతన ‘ఏపీలో విస్తృత చేరికల కమిటీ’ ఏర్పాటు చేసినా ఫలితం లేదనే అభిప్రాయం బీజేపీ ముఖ్య నేతల్లో ఉందనే వాదన కూడా వస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా బీజేపీలో ప్రాధాన్యం ఇచ్చినా.. పార్టీకి మేలు జరిగేలా ఆమె వ్యవహరించలేకపోతున్నారనే అనుమానం బీజేపీ  వర్గాల్లో ఉందంటున్నారు. వలసల కమిటీ చైర్మన్ గా పురందేశ్వరి తన తండ్రి స్థాపించిన పార్టీ టీడీపీ నుంచి ఒక్క నాయకుడిని కూడా బీజేపీ వైపు తీసుకురాలేకపోయారనే అసంతృప్తి హై కమాండ్ లో ఉందంటున్నారు. కాగా.. ఎన్టీఆర్ కుమార్తె  అయినా.. కేంద్ర మంత్రిగా సమర్థంగా పనిచేసినట్లు రుజువు చేసుకున్నా.. పురందేశ్వరికి తగిన ప్రాధాన్యం బీజేపీలో దక్కలేదనేది ఆమెతో పాటు ఆమె అనుచరులు కూడా చెబుతున్నారు. ఏపీ నుంచి రాజ్యసభ సీటు కూడా పురందేశ్వరికి ఇవ్వలేదు. మొత్తం మీద అటు బీజేపీ అధిష్టానం, ఇటు పురందేశ్వరి మధ్య గ్యాప్  పెరుగుతున్న నేపథ్యంలో ఆమె రాజకీయ భవిష్యత్తుపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పురందేశ్వరి తన తండ్రి స్థాపించిన పార్టీ టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. ఈ క్రమంలో పురందేశ్వరి బీజేపీకి ఝలక్ ఇస్తారా? టీడీపీ వైపు అడుగులు వేస్తారా? అనేది త్వరలో తేలిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

లక్ష్మీ పార్వతి వైసీపీకి ప్లస్సా మైనస్సా?

స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు స‌తీమ‌ణి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తికి రాజ‌కీయా లు, సాహిత్యం రెండూ ప్ర‌త్యేకాంశాలు. సాహిత్య‌స‌భ‌లు, స‌మావేశాల్లో ఆమె రాజ‌కీయాల గురించి ప్ర‌స్తా విం చ‌రు.  రాజ‌కీయ వేదిక‌ల మీద సాహిత్యం గురించి ప్ర‌స్తావించ‌రు. 1996 నుంచి  99 వ‌ర‌కూ పాత ప‌ట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ పోటీ చేసిన‌పుడు ఆమె అదే నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు.  దాంతో క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు.  అయితే 2014 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక ఆమె జ‌గ‌న్ ఆహ్వానం మేర‌కు వైసీపీలోకి వెళ్లారు. అప్ప‌టికే టీడీపీ, చంద్ర‌బాబు నాయుడు మీద ఆమె ఆగ్ర‌హం అనేక వేదిక‌ల మీద వ్య‌క్తం చేస్తువస్తున్నారు.   వైసీపీ పంచ‌న చేరిన‌ప్ప‌టి నుంచి అందుకు రెండింత‌లు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతూ వ‌చ్చారు.  టీడీపీ అధికారంలోకి రావ‌డం, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావ‌డం వెనుక చాలా కుట్ర‌లు జ‌రిగాయ‌ని ల‌క్ష్మీ పార్వ‌తి చేసిన ఆరోప‌ణ‌లు వైసీపీకి అప్ప‌ట్లో  టీడీపీపై విరుచుకుప‌డేందుకు అస్త్రాలుగా మారాయి. క్ర‌మేపీ ఆమె జ‌గ‌న్ కు అభిమానపాత్రురాలయ్యారు. దాంతో  తెలుగు అకాడ‌మీ ఛైర్మ‌న్ ప‌ద‌వి దక్కింది. అప్పటి నుంచీ వీలు దొరికిన‌పుడ‌ల్లా టీడీపీ మీద ఆమె విమర్శల వాగ్బాణాలు సంధిస్తూనే ఉన్నారు. ల‌క్ష్మీపార్వ‌తి చేస్తున్న ఆరో ప‌ణ‌ల్లో ప‌స ఎంత అనేది వైసీపీ నాయ‌కులు అంచ‌నా వేశారో లేదో తెలీదు గాని ఆమె గ‌ట్టిగా వాదించ డం, చంద్ర‌బాబు మీద తీవ్ర ఆగ్ర‌హంతో ర‌గిలిపోవ‌డాన్ని జ‌గ‌న్ త‌మ‌కు అనుకూలించే విధంగా మార్చుకునే య‌త్నాలు చేశారు. అయితే క్ర‌మేపీ ఆమె వాక్చాతుర్యం, ఆరోప‌ణ‌లు ఏవీ కూడా వైసీపీకి పెద్ద‌గా ఉప‌యోగ ప‌డే విధంగా లేవ‌న్న‌ది వైసీపీ నాయ‌కులు గ‌మ‌నించార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.  ఆమె ప్ర‌తీ మాట,ప్రతి విమర్శా కేవ‌లం ఎ చంద్ర‌బాబు ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయ‌డ‌మే ల‌క్ష్యంగా  ఉంది తప్ప టీడీపీని ఇరుకున పెట్టే ప‌దున‌యిన బాణాల్లా ఎంత మాత్రం లేవు.  దీంతో జ‌గ‌న్‌తో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ల‌క్ష్మీపార్వ‌తిని కేవ‌లం ‘గౌరవ’ పాత్రకే పరిమితం చేసేశారు.  కాలం మారుతున్నా, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు, వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతున్నా, ల‌క్ష్మీపార్వ‌తి మాత్రం చంద్ర‌బాబు నామ స్మ‌రణ మాన‌లేదు.  కొంత కాలం క్రితం చంద్ర‌బాబు ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ   కోర్టు మెట్టెక్కారు.  కోర్టు కేసు కొట్టేసింది. దీంతో  సుప్రీం మెట్టెక్కారు. విచార‌ణ‌ల అనంత‌రం సుప్రీం కోర్టు  అస‌లు టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆస్తుల‌ను ప్ర‌శ్నించ‌డానికి లక్ష్మీపార్వతి అర్హ‌త ఏమిట‌ని ప్రశ్నించింది.     ఆమెకు బాబు ఆస్తుల గురించి అడిగే అధి కారం, చ‌ట్ట‌ప‌రంగా   హ‌క్కూ లేద‌ని క‌రాఖండీగా సుప్రీం చెప్పింది.  నిత్యం బాబు జ‌పంతో కాలంగ‌డుపుతున్న ల‌క్ష్మీపార్వ‌తికి సుప్రీం మొట్టికాయ‌ల వ‌ల్ల వైసీపీ ప్ర‌భుత్వానికి కూడా ఎదురుదెబ్బ తగిలిందనడంలో సందేహం లేదు. లక్ష్మీ పార్వతి చంద్రబాబుపై సంధిస్తున్న విమర్శల వల్ల వైసీపీకి ఎటువంటి ప్రయోజనం చేకూరకపోవడం అటుంచి,  నష్టం కూడా వాటిల్లుతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  

బాబు రావాలి, ఏలాలి... బాల‌వాక్కు బ్ర‌హ్మ‌వాక్కేనా?!

పిల్ల‌లు భ‌గ‌వ‌త్ స్వ‌రూపులు. వారు ఏది మాట్లాడినా ముద్దు ముద్దుగా బాగుంటుంది. అంతే నిజం  కూడా ఉంటుంది. ఎవ‌రెన్ని అనుకున్నా, ఎన్ని అడ్డంకులు పెట్టినా  బాల‌వాక్కు  బ్ర‌హ్మ‌వాక్కుగా  ప‌నిచేస్తుందన్న విశ్వాసం జనంలో ఉంది. ఏపీలో చంద్ర‌బాబునాయుడు అధికారంలోకి  రావాల‌ని, తెలుగు దేశం మ‌ళ్లీ రాజ్యం చేయాల‌ని ఓ చిన్నారి తన ఆకాంక్షను వెలిబుచ్చాడు.      చిన్న‌పిల్ల‌లు ఏం మాట్లాడినా అది జరిగి తీరుతుందన్న విశ్వాసం చాలా కాలంగా జనంలో ఉంది. చాలా సంద‌ర్భాల్లో చిన్నారుల వాక్కు బ్రహ్మవాక్కుగా  మారి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయంటారు.   ఛాందస్త‌మ‌నో, మూఢ‌న‌మ్మ‌కం అని కొట్టి పారేసేవారు కూడా ఉంటారు. ఈ పిల్ల‌వాడు ఎవ‌రోగాని త‌న మ‌న‌సులో మాట‌నే బ‌య‌టికి అన్నాడు. తన తల్లిదండ్రులో, చుట్టుపక్కల వారో తెలుగుదేశం అధికారంలోకి రావాల‌ని, ఏపి   మ‌ళ్లీ అభి వృద్ధి ప‌థంలో వేగంగా ముంద‌డుగు వేయాల‌ని అనుకుంటుంటే ఆ బాలుడు వినే ఉంటాడు.  టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగాలు టీవీలలో చూసే ఉంటాడు.  ఆ బాలుడికి  రాజ‌కీయ అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు. కానీ ఊహ‌కందిన మేర‌కు పిల్ల‌వాడు మ‌న‌సులో స్థిరంగా ఏర్ప‌డిన అభిప్రాయాన్ని అలా చెప్పాడు. తెలుగు దేశం నేత నారా లోకేష్ చెప్పినంత గ‌ట్టిగా ఈ పిల్ల‌వాడు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే పిల్ల వాడు చిన్న వ‌య‌సులోనే ఇంతటి న‌మ్మ‌కాన్ని ప్ర‌చారం చేశాడు.  అంబ ప‌లికె, జ‌గ‌దాంబ ప‌లికే, పిల్లాడు ప‌లికె .. ఇక ఎన్నిక‌లే ఆల‌స్యం. ఆ బాలుడి ప్రసంగం వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నది.

మరోసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు జగన్ నిర్ణయం.. రోజాకు ఉద్వాసనేనా?

ఏపీ సీఎం జగన్ మరో సారి తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారా? ఇటీవల కేబినెట్ సమావేశం అనంతరం ఆయన కొందరు మంత్రులను ఉద్దేశించిన నేరుగా, మరి కొందరిపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు, వ్యక్తం చేసిన ఆగ్రహం, మంత్రి పదవులు పీకేస్తా జాగ్రత్త అంటూ చేసిన హెచ్చరికలను  బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తుంది. ఆయన హెచ్చరికల అనంతరం కూడా కేబినెట్ మంత్రులలో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో మంత్రివర్గాన్ని మరో సారి పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. మోస్ట్లీ నవంబర్ లో జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతారనీ, ప్రస్తుత కేబినెట్ లో కనీసం అరడజను మందికి ఉద్వాసన తప్పదనీ కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం గత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పర్యాటక శాఖ మంత్రి పదవి దక్కిన రోజాకు తదుపరి పునర్వ్యవస్థీకరణలో అంటే నవంబర్ లో ఆమె పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉందనీ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆమెకే కాకుండా మరో మహిళా మంత్రి విడదల రజనికి కూడా ఉద్వాసన తప్పకపోవచ్చునని అంటున్నారు. రోజాపై జిల్లాలోనే కాకుండా, మంత్రి పదవి చేపట్టిన తరువాత ఆమె వ్యవహారశైలిపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తారనీ, ఇక మరో మహిళా మంత్రి విడదల రజనీ అయితే సామాజిక మాధ్యమంలో సొంత ప్రచారంపై పెడుతున్న శ్రద్ధ, పార్టీ వ్యవహారాలలోనూ, విపక్ష విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలోనూ చూపడం లేదన్నది జగన్ భావనగా చెబుతున్నాయి. అందుకే జగన్ ఆరు నెలల వ్యవధిలోనే తన మంత్రివర్గాన్ని మరో సారి పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఆరు నెలల కిందట జగన్ కొత్త టీమ్ ను ఎంపిక చేసిన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి. 2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేబినెట్ కూర్పు చేసిన సందర్భంగా ఈ కేబినెట్ ను రెండున్నర సంవత్సరాలు మాత్రమేననీ, రెండున్నర సంవత్సరాల అనంతరం కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకుంటాననీ జగన్ విస్పష్టంగా చెప్పారు. అన్నట్లుగా సరిగ్గా రెండున్నర సంవత్సరాలకే కాకుండా మూడేళ్లు కావస్తుండగా జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. అయితే ఆయన ముందుగా చెప్పిన విధంగా మొత్తం కేబినెట్ ను మార్చేయలేదు. కొందరు పాతవారిని కొనసాగిస్తూ కొందరిని తప్పించి కొత్తవారికి స్థానం కల్పించారు. ఈ కారణంగానే ఉద్వాసనకు గురైన మంత్రులలో అసంతృప్తి భగ్గు మంది. కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరి కొందరు మౌనం దాల్చి తన నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తంగా జగన్ 2.0 టీమ్ లో గట్టిగా మాట్లాడేవారు కానీ, విపక్ష విమర్శలను దీటుగా ఎదుర్కొనేవారు కానీ లేరన్న భావన సీఎం జగన్ లోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే జగన్ సతీమణి భారతిపై ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భంగా కేబినెట్ సహచరులే కాదు.. పార్టీలో ఎవరూ కూడా దీటుగా స్పందించకపోవడంతో జగన్ లో అసహనం కట్టలు తెంచుకుందంటున్నారు. ఆ కారణంగానే కేబినెట్ సహచరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మరోసారి మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించి నోరున్న మంత్రులకు చోటు కల్పించాలన్న నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనివార్యమని నిర్ధారణ అయిన తరువాతనే కొడాలి నాని మళ్లీ తన గొంతు సవరించుకున్నారనీ, చంద్రబాబుపై, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పూర్వంలా పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి మంత్రివర్గంలో పదవి కోల్పోయిన కొడాలి నానికి మలి పునర్వ్యవస్థీకరణలో పదవి గ్యారంటీ అని పరిశీలకులు అంటున్నారు. 

లిక్కర్ దందా...బయటపడుతున్న తాడేపల్లి ప్యాలస్ లింకులు!?

ఢిల్లీ లిక్కర్ స్కారం విషయంలో విపక్షం తన సతీమణి భారతిపై ఆరోపణలు చేస్తుంటే కౌంటర్ ఇవ్వకుండా సైలంట్ గా ఉంటారా? అంటూ జగన్ తన మంత్రివర్గ సభ్యులపై ఫైర్ అయినే మంత్రి పదవులు ఊడబీకి పారేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించినా ఎవరూ కూడా పెదవి విప్పకపోవడానికి కారణమేమిటన్నది మెల్లమెల్లగా బయటకు వస్తోంది. ఏ ఢిల్లీ లిక్కర్ స్కాంపై జగన్ సతీమణి భారతిపై ఆరోపణలు వచ్చాయో అదే లిక్కర్ స్కార్ డొంక మెల్లిమెల్లిగా కదులుతోంది. తాజాగా జరిగిన ఈడీ రైడ్స్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి పాత్ర ఉందని బయటపడింది. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రఘునందనరావు మీడియాకు వెల్లడించారు. తాజాగా ఈడీ జరిపిన సోదాల్లో విజయసాయి అల్లుడి పేరు బయటపడింది. సృజన్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీలపై దాడులు నిర్వహించిన ఈడీ దాడుల్లో ఇందుకు సంబంధించి ఆధారాలు లభ్యమయ్యయని ఆయన మీడియా ముందు చెప్పారు. విజయసాయి లింకులు ఢిల్లీ లిక్కర్ దందాలో ఉన్నాయంటే.. వాటి వెంబడే తాడేపల్లి లింకులు కూడా బయటపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం లో తన సతీమణిపై వచ్చిన ఆరోపణలతో జగన్ తీవ్ర అసహనానికి లోనయ్యారని చెబుతున్నారు. అయితే జగన్ ఎంతగా బెదరించినా, హెచ్చరికలు జారీ చేసినా ఆయన కేబినెట్ సహచరులు జగన్ కోరుకున్న విధంగా విపక్షం విమర్శలను అగ్రసివ్ గా ఖండించకపోవడమే.. విపక్షాల ఆరోపనల్లో ఏదో మేరకు వాస్తవం ఉందనడానికి నిదర్శనంగా వారు చెబుతున్నారు. ఇలా ఉండగా జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసన చెబుతానని హెచ్చరించిన తరువాత అమాత్యుల నుంచి మర్యాద గీత దాటిన ఖండనలు మాత్రమే రావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  మంత్రి పదవులు ఇచ్చింది బుగ్గకార్లు ఎక్కి తిరగడానికా ? అంటూ కొందరు మంత్రులకు జగన్ ముఖం మీదనే క్లాసు పీకారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  కొందరు మంత్రులు ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల విషయంలో అంటీ ముటగ్టనట్టు వ్యవహరిస్తున్నారనీ, అటువంటి వారికి ఉద్వాసన తప్పదనీ సీఎం ఘాటుగానే హెచ్చరించారని కూడా అంటున్నారు. ఇంత ఘాటు హెచ్చరికలు చేసిన మంత్రులలో ఏ మాత్రం స్పందన లేకపోవడం.. కేబినెట్ లో సీఎంకు పట్టు సడలిందనడానికి తార్కాణమని అంటున్నారు.  అందుకు కారణం మంత్రులు, ఎమ్మెల్యేలలో పలువురికి సీఎం తీరు పట్ల తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం కావడమేనని పరిశీలకులు అంటున్నారు. సీఎం మీటలు నొక్కి తన గ్రాఫ్ బ్రహ్మాండంగా ఉందని అనుకుంటున్నారనీ, ప్రభుత్వం, పార్టీపై వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకత అంతా మంత్రులు, ఎమ్మెల్యేల వల్లనేనని సమయం, సందర్భం వచ్చినా రాకున్నా పదేపదే చెబుతూ తమ ప్రతిష్టను జనాలలో చిన్నబుచ్చడానికే ప్రయత్నిస్తున్నారన్నది వారి అసహనానికి, ఆగ్రహానికీ కారణంగా చెబుతున్నారు. 

గెలుపే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు.. జగన్ కు కౌంట్ డౌన్ స్టార్టేనా?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఇరవై నెలల సమయం ఉంది. అయినప్పటికీ సీఎం జగన్ ను, వైసీపీని ఓడించేందుకు టీడీపీ అధినేత  కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభించారు. వైసీపీ సర్కార్ ఏర్పాటైన తొలి నాళ్లలో ఫీల్ గుడ్ అని భావించిన జనాల్లో ఇప్పుడు ఫీల్ బ్యాడ్ ఒపీనియన్ బాగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని పలు సర్వేల్లో వెల్లడవుతోంది. వైసీపీ సర్కార్ పని తీరు పైనా, జగన్ పైనా జనం పూర్తి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్లు పలు సర్వేల్లో వస్తోంది. దానికి తోడు వైసీపీ సర్కార్ గ్రాఫ్ గత ఆరు నెలల్లో బాగా పడిపోయిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు. ‘పార్టీ కోసం త్యాగాలు చేయాలి.. మీ కోసం పార్టీ త్యాగం చేయదు’ అని పార్టీ నేతలకు ఆయన కచ్చితంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే దిశగా కృషిచేయాలని, అందు కోసం త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఓడిపోతారని సర్వేల్లో తేలితే సీనియర్లు అయినా పక్కన పెట్టేయడానికి సిద్ధమనే సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు. పనితీరు సరిగా లేకపోతే గతంలో మంత్రులుగా పనిచేసిన వారికి కూడా టికెట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రకరకాల కార్యక్రమాలతో తాను ప్రజల మధ్యే ఉండటం కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలు నిత్యం రాష్ట్ర ప్రజల మధ్యనే  ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అది ‘బాదుడే బాదుడు’ కావచ్చు.. లేదా తాను స్వయంగా చేస్తున్న జిల్లాల పర్యటనలు కావచ్చు.. ఏపీలో నెలకొన్న వివిధ సమస్యలపై టీడీపీ నేతల్ని వారి వారి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించేలా పురమాయించడం కావచ్చు.. ఏదైతేనేం వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ.. చంద్రబాబు అండ్ కో జనం మనసులో మరింత దృఢమైన స్థానం సంపాదించుకునే యత్నం  చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుభవానికి ప్రజలు పట్టం కట్టారు. ఆ క్రమంలోనే ఒక పక్కన ఆంధ్రుల ప్రజా రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించారాయన. మరో చేత్తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా నడిపించారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించారు. అయితే.. ఒక్క ఛాన్స్ అంటూ ప్రభుత్వ పగ్గాలు అందుకున్న జగన్ ఈ మూడున్నరేళ్లలో చేసిందేమీ లేదని, పైగా రాష్ట్రాన్ని అన్నింట్లోనూ అధోగతిపాలు చేశారనే ఆగ్రహం ప్రజల్లో బాగా వచ్చేసింది. ఇద్దరి పరిపాలనా విధానాలను, వారి అనుభవాలను, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ఎవరు పరుగులు పెట్టించగలరనే అంశాలపై జనం బేరీజు వేసుకుంటున్నారంటున్నారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే వినాయక చవితి తర్వాత జగన్ సర్కార్ ఉండదని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో వ్యక్తిగత నైతిక విలువలను జగన్ పాతిపెట్టేశారనేది విష్ణుకుమార్ రాజు ఆరోపణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఏపీలో సంచలన పరిణామాలు చూస్తారని కామెంట్ చేయడం గమనార్హం. కరోనా కాలం రెండేళ్లలో ఏపీ అన్ని విధాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. ఈ దశలో ఏపీలో ఏమి అభివృద్ధి జరుగుతోందనే ప్రశ్న జనం మదిలోకి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, రోడ్ల దుస్థితి, ఆ రోడ్లపై నిత్యం ప్రత్యక్ష నరకం చవిచూస్తుండడం, విద్యుత్, బస్సు చార్జీల పెంపు తమ జీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తుండడంతో జగన్ సర్కార్ పై జనంలో పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనితో పాటు అధికారపక్షం వాయిస్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. విపక్షాల వాయిస్ జనంలోకి పూర్తిగొ చొచ్చుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా చంద్రబాబు స్వయంగా రంగంలో దిగారు. టీడీపీ కొంచెం వీక్ గా ఉందనిపించిన నియోజకవర్గాలపై ఆయనే దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి వాటిలో కృష్ణా జిల్లాలోని గుడివాడపై చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెంచారంటున్నారు. వైసీపీని మరోసారి అధికారంలోకి రాకుండా చేయడం.. మరో పక్కన టీడీపీపైన, తన కుటుంబంపైన వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ నేతలను మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని ఆయన కంకణం కట్టుకుని వ్యూహాలు రచిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్న మాట.

ఫైన‌ల్ రిహార్స‌ల్‌లా సూప‌ర్ 4.. పాక్‌పై లంక 5 వికెట్ల‌తేడాతో విజ‌యం

ప‌థుమ్ నిస్సాంక 55 పరుగులతో అజేయంగా రాణించడంతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన చివరి సూపర్ 4 ఆసియా కప్ మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. అతనికి తోడు భానుక రాజపక్సే 24 పరు గులు చేయగా, దసున్ షనక 21 పరుగులు చేశాడు. మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే శ్రీలంక విజయభేరి మోగించడంతో వనిందు హసరంగా చివ‌ర‌గా ఒక‌ ఫోర్ కొట్టి జ‌ట్టు విజ‌యం ఖ‌రారు చేశాడు.  ఆసియాక‌ప్ సూప‌ర్ 4 చివ‌రి మ్యాచ్‌లో శుక్ర‌వారం శ్రీ‌లంక 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై గెలిచింది. ఆట మొత్తం ఫైన‌ల్‌కి రిహార్సిల్ లాగానే అనిపించింది. రెండు జ‌ట్లు అంత సీరియ‌స్‌గా ఆడుతున్న‌ట్లు క‌న‌ప‌డ‌లేదు. కానీ శ్రీ‌లంక మాత్రం ఈ టోర్నీలో ఆరు పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో నిలిచి ఫైన‌ల్లో పాక్‌కు గ‌ట్టి పోటీనిచ్చేస్థాయిలో ఉంది. ఆదివారం జ‌రిగే ఫైన‌ల్లో ఈ జ‌ట్ల‌మ‌ధ్య హోరా హోరీ పోరునే క్రికెట్ వీరాభిమానులు ఆశిస్తున్నారు. లంక జ‌ట్టు త‌మ అల్‌రౌండ్ ప్ర‌తిభ‌తో త‌ప్ప‌కుండా పాకిస్థాన్‌కు అంత సులు వుగా ఫైన‌ల్ సాగ‌నిచ్చేట్టు లేద‌న్న‌ది శుక్ర‌వారం మ్యాచ్ లో పాక్ జ‌ట్టును అడ్డుకున్న తీరు తెలియ‌జేసింది. లంకే క‌దా అనుకు న్న పాక్ కు లంక బౌల‌ర్లు బెద‌ర‌గొట్టేరు. 19.1 ఓవ‌ర్ల‌లో 121 ప‌రుగుల‌కే పాక్ కుప్ప‌కూలి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కొంత ఫైన‌ల్ చేరామ న్న ధీమాతో ఆడిన‌ప్ప‌టికీ అజామ్ సేన చాలా పేల‌వంగా ఆడింది. ఓపెనర్‌ నిస్సాంక (55) అజేయ అర్ధసెంచరీ సాధించగా, రాజ పక్స (24), షనక (21) ఆకట్టుకున్నారు. రౌఫ్‌, హస్నైన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హసరంగ నిలి చాడు.

బిగ్ బాస్ నాగ్ పొలిటికల్ ఎంట్రీ?

నిజానికి, అక్కినేని నాగార్జునకు అలాంటి ఆలోచన లేదు.   ఆ ఉద్దేశమూ లేదు. అయినా ఆప్పుడే, అంతా అయిపోయినట్లే ప్రచారం జరుగుతోంది. కనీసం వన్ సైడ్ లవ్ అయినా లేకుండానే, ఏకంగా ట్రైయాంగిల్ లవ్ స్టొరీ అల్లేసిన విధంగా, సోషల్ మీడియా క్రియేటివ్ రైటర్స్ జగన్, అక్కినేని నాగార్జున మధ్య  పొలిటికల్ లవ్ స్టొరీ ని అల్లేశారు.  అవును మనం,మాట్లాడు కుంటోంది బిగ్ బాస్ నాగార్జున పొలిటికల్ ఎంట్రీ గురించే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఆయన ప్రేమలో పడ్డారంటూ వస్తున్న కథనాల గురించే. గత కొద్ది రోజులుగా, సోషల్ మీడియాలో కొంత వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇలాంటి వదంతులు బాగా షికారు చేస్తున్నాయి. నాగార్జున త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని, వైసేపీలో చేరుతున్నారని, అదే విధంగా విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని, వండి వార్చిన కథనాలు చాలానే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, గాలి కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే  వైసీపీ సోషల్ మీడియాలో ఈ ‘వంటక’ స్టొరీ బాగా వైరల్ అవుతోంది.  అయితే, ఇందులో అంతా కాకున్నా కొంతైనా నిజం ఉందా అంటే, అసలే లేందంటున్నారు, ఆ ఇద్దరినీ ఎరిగిన సినీ, రాజకీయ రంగ ప్రముఖులు. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి, ముఖ్యంగా ఆయనకు సినిమా రంగం గురించి, సినిమా హీరోలు, నిర్మాతల గురించి ఉన్న ‘గౌరవ’ భావం తెలిసిన ఎవరు, ఆయనతో రాజకీయ సంబంధాలు పెట్టుకునే సాహసం చేయరని  అంటున్నారు. అలాంటిది, అందాల నటుడు,  అక్కినేని నాగేశ్వరరావు వారసుడు,అన్నిటినీ మించి,నాగేశ్వరరావు నుంచి నటనతో పాటు వ్యాపార సూత్రాలనూ బాగా వంట పట్టించుకున్న నాగ్  అలాంటి తప్పు అసలే చేయరని అంటున్నారు.   నాగార్జున ప్రధానంగా నటుడే కావచ్చును,కానీ, అంతకు మించి ఆయన,ఓ మంచి బిజినెస్ మ్యాన్, అయన వేసే ప్రతి అడుగులో ‘నా కేంటి?’ అని ఒకటికి పది సార్లు బేరీజు వేసుకుని ఆ తర్వాతనే ముందడుగు వేస్తారని అంటారు. అన్నిటినీ మించి ఆయనకు రాజకీయ సొద అసలే గిట్టదని అంటారు.అలాగని ఆయనకు రాజకీయ సంబంధాలు లేవా అంటే ఉన్నాయి.. అయితే... అవన్నీ కూడా వ్యాపార సంబధాలతో ముడి పడిన రాజకీయ సంబంధాలే తప్ప, రాజకీయ రంగులు పూసుకునే సంబంధాలు కాదని అంటారు. కారల్ మార్క్స్, ‘మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే’ అంటూ చేసిన సూత్రీకరణను కమ్యూనిస్టులు ఎంతవరకు నమ్ముతారో ఏమో కానీ, అక్కినేని నాగార్జున మాత్రం పూర్తిగా నమ్ముతారని, ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఆడుకు ముందుకు వేయరని అంటారు.  అవును, ఆయన వైఎస్  ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆరోగ్య‌శ్రీ ప్రకటనలో నటించారు. అలాగే జగన్ రెడ్డి పాద యాత్ర సమయంలోనూ ఆయన వైసేపీకి మద్దతు తెలిపినట్లు ప్రచారం జరిగింది కానీ, ఆయన ఎప్పుడూ బహిరంగంగా అలాంటి  ప్రకటన చేయలేదు. నాగర్జున, నాగ చైతన్య అభిమాన సంఘం అధ్యక్షుడి పేరున బి,రాము అనే వ్యక్తి చేసిన ప్రకటనను నాగార్జునకు ముడి పెట్టి వైసేపీ నాయకులు ప్రచారం చేసుకున్నారని అంటారు. నాగార్జున అప్పుడు గానీ, ఇప్పడు గానీ, ఎప్పుడూ ఒక్క వైసీపీ కనే కాదు ఏ పార్టీకి కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు.  అదలా ఉంటే గతంలో రాజ్యసభ టికెట్’ కు సంబంధించి చిరంజీవితోనూ జగన్ రెడ్డి ఇలాంటి కథనే నడిపించారు. లంచ్ కి పిలిచి సోషల్ మీడియాలో రాజ్యసభ టికెట్ జరిపించారు.   చివరకు మెగా స్టార్ నవ్వుల పాలయ్యారు. మీడియా ముందు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు .ఇక పోసానీ, అలీ, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇదిగో అదిగో అంటూ నామినేటెడ్ పదవులను .. చూపించడమే కానీ.. ఇచ్చింది లేదని, చివరకు ఇచ్చినా వద్దనే స్థితికి వారిని నేట్టివేశారని అంటారు.  అయితే ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు విజయవాడ నియోజక వర్గం నుంచి పోటీచేసేందుకు, వైసీపీకి సరైన అభ్యర్ధి లేరు. గత  (2019) ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి కేసీనేని నాని గెలిచారు. ఆయనపై పోటీచేసిన వైసీపీ అభ్యర్ధి పొత్తూరి వరప్రసాద్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాగే, 2014లో పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ కూడా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.సో .. అభ్యర్ధి వేటలో ఉన్న వైసీపీ  నాగార్జునను తెర మీదకు తెచ్చిందని అంటున్నారు. అయితే, సహజంగానే వ్యాపార రాజకీయాలు తప్పించి ప్రత్యక్ష రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదనే అంటున్నారు.