మూడో మ్యాచ్ టై.. న్యూజిలాండ్ తో టి20 సిరీస్ భారత్ దే
posted on Nov 22, 2022 @ 4:55PM
నేపియర్లోని మెక్లీన్ పార్క్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో టీమ్ ఇండియా సిరీస్ ను 1-0 తేడాతో కేవశం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది.
ఈ దశలో వరుణుడు ఆటంకం కలిగించాడు. భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో తదుపరి ఆట సాధ్యం కాలేదు. ఔట్ ఫీల్డ్ చిత్తగా మారింది. మైదానాన్ని పరీక్షించిన అంఫైర్లు ఆట కొససాగించడం సాధ్యం కాదని తేల్చేశారు. దీంతో డక్త్వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ టై అయ్యింది. డీఎల్ఎస్ ప్రకారం మ్యాచ్ టైగా ముగియడం చాలా అరుదుగా జరుగుతుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే .. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 9 ఓవర్లలో విజయానికి భారత్ 76 పరుగులు చేయాల్సి ఉండగా.. సరిగ్గా అందుకు ఒక్క పరుగు వెనుక బడింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంతో సిరీస్ను సొంతం చేసుకుంది. తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణం కాగా. . రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టైగా ముగిసిన ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా సిరాజ్ నిలిచాడు. కాగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సూర్యకుమార్ యాదవ్ కు దక్కింది. 161 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. ఇషాన్ కిషన్(10), పంత్(5), సూర్యకుమార్ యాదవ్(13) లు స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో భారత్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కెప్టెన్ హార్దిక్ పాండ్య(30 నాటౌట్; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టాడు. అతడికి దీపక్ హుడా (9 బంతుల్లో 9 నాటౌట్ ) చక్కని సహకారం అందించాడు. అయితే.. తొమ్మిదో ఓవర్ పూర్తి కాగానే వరుణుడు తన ఆట మొదలెట్టేశాడు. అంతకు ముందు న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో కాన్వే(59; 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫిలిప్స్(54; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, సిరాజ్లు చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. ఒక బ్యాటర్ రనౌట్ అయ్యాడు.