మరో ఎస్సై ఆత్మహత్య...

  ఈమధ్య పోలీసు అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే చూశాం. ఇలాంటి ఘటనే మరోసారి చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన ఎస్సై కిరణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని ఆప్పాలో శిక్షణ పొందుతుండగా కిరణ్ కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయన శిక్షణ పూర్తి కాకుండానే ఇంటికొచ్చేశాడు. అప్పటి నుండి విశ్రాంతి తీసకుంటున్న కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ కు భార్య రెండు నెలల కుమారుడు ఉన్నారు. మరోవైపు ఎస్సై ఆత్మహత్యకు కారణం అధికారులు వేధింపులే అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కిరణ్ కు పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు వేధించారని.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

జగన్ యువభేరి.. వెంకయ్యపై మండిపాటు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరులో యువభేరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన దుమ్మెత్తిపోశారు. హోదా విషయంలో బిజెపి, టిడిపిలు మోసాలు, అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. హోదా కోసం రెండేళ్లుగా పోరాటం సాగుతోందన్నారు. ప్రత్యేక హోదా సంజీవని అని ఆనాడు ఊదరగొట్టారు.. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెబుతున్నారు.. వెంకయ్య ప్లేట్ ఫిరాయించారు.. అలాంటి హోదాకు పాతరేసిన వెంకయ్యకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు అంటూ మండిపడ్డారు.  ఆనాడు హోదాపై ఎన్నో మాట‌లు మాట్లాడిన వెంక‌య్యనాయుడు ఈరోజు మ‌రోలా స్పందిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. మోదీ, వెంకయ్య అధికారం రాక‌ముందుకు అలా ఎందుకు మాట్లాడారు? అధికారంలోకి వ‌చ్చాక ఇలా ఎందుకు మాట్లాడుతున్నార‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నామని.. అర్ధరాత్రి జైట్లీ ప్రకటనతో ఏపీకి ఒరిగేది లేదని అన్నారు.

లంచ్ బ్రేక్.. టీమిండియా 105/1

ప్రతిష్టాత్మక 500 వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. భారత్-న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా రంగంలోకి దిగింది. ఛటేశ్వర్ పూజార, కేఎల్ రాహుల్ ను ఒపెనర్లుగా బరిలో దించగా.. భారత బ్యాట్స్ మన్ కు కివీస్ బౌలర్లు స్వేచ్ఛగా బ్యాటు ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు. కట్టుదిట్టమైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టారు. అయితే టీమిండియా బ్యాట్స్ మన్ కూడా తామేం తక్కువ తినలేదన్నట్టు ఎలాంటి బంతిని సంధించినా అడ్డుకున్నారు. విలియమ్సన్ స్పిన్నర్లను రంగంలోకి దించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (32) వికెట్ ను శాంటనర్ దక్కించుకున్నాడు. దీంతో తొలిరోజు లంచ్ విరామ సమయానికి 31 ఓవర్లు ఆడిన టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 105 పరుగులు చేసింది. ఛటేశ్వర్ పుజారా (34), మురళీ విజయ్ (39) మరోవికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.

జలమయమైన గుంటూరు జిల్లా.. న‌లుగురు యువ‌కులు గల్లంతు..

  తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమైపోతున్నాయి. ఒక పక్క హైదరాబాద్ లో భారీ వర్సపాతం వల్ల నగరం మొత్తం నీటితో నిండిపోగా.. ఇప్పుడు ఏపీలో కూడా పలు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల.. గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.  చాలా చోట్ల ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నీళ్ల‌లో మునిగిపోయాయి. ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాడు సాయంతో వారు చెరువుల‌ని త‌ల‌పిస్తున్న నీటిలో న‌డుస్తూ ఒక చోటు నుంచి మ‌రోచోటుకి వెళుతున్నారు. మరోవైపు  నాదెండ్ల మండ‌లం గ‌ణ‌ప‌వ‌రం వ‌ద్ద వ‌ర‌ద ప్ర‌వాహం ముంచుకురావడంతో కప్పగంజి వాగులో న‌లుగురు యువ‌కులు కొట్టుకుపోయారు.

500వ ప్రతిష్ఠాత్మక టెస్ట్ మ్యాచ్.. బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

  క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్ భారత్, కివీస్ ల మధ్య జరగనుంది. దాదాపు 84 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో 500వ ప్రతిష్ఠాత్మక టెస్టు కావడం దీని ప్రత్యేకం. ఈ మ్యాచ్ కు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానం వేదికైంది. ఇక టాస్ గెలిచిన కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎందుకంటే పేరుకే ఇది గ్రీన్ పార్క్ కానీ.. మైదనంలో ఎక్కడా పెద్దగా పచ్చిక కనిపించదు. అందుకే ఆడుతున్న కొద్ది పిచ్ మందుకొడిగా మారి స్పిన్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాదు బ్యాటింగ్ చేయడానికి కూడా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే మరో ఆలోచన లేకుండా కోహ్లీ ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ గెలిచిన భారత్ జట్టు.. ఛటేశ్వర్ పూజార, కేఎల్ రాహుల్ ను ఒపెనర్లుగా బరిలో దించనుంది.

20 మంది తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం..

  పాక్ సరిహద్దు ఎల్వోసీ లో దాదాపు 20 మంది తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే యూరీ దాడి నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న భారత్.. ఎల్‌ఓసీ దాటి హెలికాప్టర్‌లో వెళ్లి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాదాపు ఇరవై మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ అయితే, ఈ విషయమై భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. యూరి దాడి పైన చాలా సీరియస్‌గా ఉన్నట్లు ప్రకటించారు. యూరి దాడికి ఎలా ప్రతీకారం తీసుకోవాలో ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ అంశం పైన చాలా సీరియస్‌గా ఉన్నట్లు చెప్పారు.   ఇదిలా ఉండగా.. కాశ్మీర్ లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం ఆర్మీకి అందింది. బందిపొర జిల్లాలోని అర్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం అందడంతో.. గ్రామానికి చేరుకున్న సైనికులు తనిఖీలు నిర్వహిస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆ ఇంటిని చుట్టుముట్టిన సైనికులు ఒక ముష్కరుడిని మట్టుపెట్టారు. మిగిలిన వారి పని పట్టేందుకు అదను కోసం వేచి చూస్తున్నారు.

ఇంకా జలదిగ్భందంలోనే హైదరాబాద్ నగరం..

  హైదరాబాద్ నగరంలోని కొన్ని కాలనీలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగరం నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగిపోయాయి. రోడ్లు మొత్తం నీటితో నిండిపోయాయి. కనీస నిత్యవసర వస్తువులు కూడా కొనుక్కునేందుకు బయటకు రాని పరిస్థితి ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ వరద నీటికి నగరం మొత్తం మీద సుమారు సుమారు 2 వేల కార్లు, 6 వేల ద్విచక్రవాహనాలు, వేల సంఖ్యలో ఆటోలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సానికి కొన్ని ద్విచక్రవాహనాలు సైతం కొట్టుకుపోయాయి. ఇంకా నిజాంపేట, మూసాపేట వంటి ప్రాంతాల్లో వర్షం ధాటికి నీరు నిలిచిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అపార్ట్ మెంట్లలో ఉన్న నీటిని ఫైరింజన్ల ద్వారా బయటకు పంపుతున్నారు.

తమిళనాడుకు కావేరి జలాలు వదిలేది లేదు..

  కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే సుప్రీం కోర్టు రోజుకి తమిళనాడుకి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని ఆదేశించగా.. కర్ణాటక మాత్రం రోజుకి 3 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తామని.. కావేరిలోనే నీరు లేనప్పుడు వారికి మాత్రం ఎలా విడుదల చేయాలని సీఎం సిద్దరామయ్య సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కావేరీ జలాలను తమిళనాడుకు ఈనెల 23వ తేది వరకు వదిలేది లేదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈనెల 23వ తేది తరువాత ఉభయ సభల్లో ఈ విషయం చర్చించి ఓ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతిని కలుస్తామని..  ఆరోజు కావేరీ జలాల పంపిణిపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మాకే నీళ్లు లేవు, ఇక తమిళనాడుకు ఎక్కడి నుంచి నీళ్లు వదిలిపెట్టాలని ఆయన ప్రశ్నించారు. కాగా కావేరి జలాలను ఈనెల 21వ తేది నుంచి 27వ తేది వరకు తమిళనాడుకు వదిలిపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అమెరికా సైన్యంపై ఐసిస్ తొలి రసాయన దాడి..

  ఒకపక్క అగ్రరాజ్యమైన అమెరికా సైన్యం ఇరాక్, సిరియాలోని ఉగ్రవాదులను హతం చేసే పనిలో నిమగ్నమై ఉండగా.. వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాక్ లో ఉన్న అమెరికా సైన్యం ఉగ్రవాదులతో పోరుడుతుండగా వారిపై ఐసిస్ ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకరమైన రసాయన పదార్ధాలు కూర్చిన బాంబులతో  దాడి చేశారు. ఇందులో మస్టర్డ్ గ్యాస్ ను వాడారు.  ఈ రసాయనం ఎంత ప్రమాదకరం అంటే.. ఇది తగిలితే శరీరం కాలిపోవడం.. అంధత్వం, శాశ్వత వికలాంగత్వం సంభవిస్తాయి. అయితే అదృష్టవశాత్తు ఈ దాడి వలన సైన్యానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని... సైనికులు ఎవరూ గాయపడలేదని.. మను తాము కాపాడుకునేందుకు గ్యాస్ మాస్కులు సహా, అన్ని రకాల రక్షణ సాధనాలూ యూఎస్ సైన్యం వద్ద ఉన్నాయ నేవీ కెప్టెన్ డేవిస్ తెలిపారు. అంతేకాదు.. అమెరికాపై రసాయన దాడి జరగడం ఇదే తొలిసారి అని వెల్లడించారు. 

అక్టోబర్ 3 నుండి వెలగపూడిలోనే..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులు ఏపీకి వచ్చేయాలని.. ఇక్కడి నుండే పరిపాలన సాగించాలని ఎప్పటి నుండో చెబుతున్నారు. ఆయన చెప్పినట్టు ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఏపీ రాజధాని చేరుకున్నారు కూడా. అయితే ఇప్పుడు వచ్చే నెల 3 నుండి ఏపీ తాత్కాలిక సచివాలయం నుండే పరిపాలన సాగించాలని జీఏడీ అన్ని శాఖల కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచే తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని.. ఈ నెల 30వ తేదీకల్లా హైదరాబాద్ సచివాలయంలోని ఫైళ్లు, కంప్యూటర్లను వెలగపూడికి తరలించాలని సూచించింది. ఇక వచ్చే నెల 1, 2 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలైనందున 3 నుంచి పూర్తిస్థాయిలో వెలగపూడి నుంచే విధులు నిర్వహించాలి అని ఆదేశించింది.

అపెక్స్ కౌన్సిల్ భేటీ... మూడు అంశాలపై ఏకాభిప్రాయం..

  అపెక్స్ కౌన్సిల్ భేటీ ముగిసింది. ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ నిర్వహించగా.. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు పాల్గొన్నారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాల పంపిణీ.. కొత్త ప్రాజెక్టులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉమా భారతి మాట్లాడుతూ.. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఇరు రాష్ట్రాల సీఎం ప్రజెంటేషన్లు చూశామని.. మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది.. ఇంకా రెండు అంశాలపై ఏకాభ్రిపాయం కుదరలేదని.. నివేదిక వచ్చిన తరువాత సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి అని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర, రెండు రాష్ర్టాల ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నాము.. నదీ పరీవాహక ప్రాంతాల్లో నీటి లభ్యతను కమిటీ అంచనా వేస్తుందని తెలిపారు. కమిటీ అధ్యయనం చేసిన నివేదికను ట్రైబ్యునల్ కు అందజేస్తుందని చెప్పారు. నీటి లభ్యత ఆధారంగా ట్రైబ్యునల్ సూచనల మేరకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

దేవుడా.. అభిషేకానికి 5వేలు

  ఆఖరికి దేవుని పేరుతో కూడా వ్యాపారం చేసే రోజులు వచ్చాయి. ఏదో భక్తితో దేవునిని దర్శించుకుందామా అని వచ్చే భక్తులకు.. దేవాలయాల్లోని టికెట్లు ధరలు చూస్తుంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నంత పని అవుతుంది. ఇందులో శ్రీశైలంలోని మల్లన్న ఆలయం ముందు ప్లేస్ లో ఉంది. గత కొంత కాలంగా శ్రీశైలం మల్లన్న అధికారులు ఆలయాన్ని ఆలయ కేంద్రంగా మార్చేశారు అన్న విమర్శలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టికెట్ ధరలు అమాంతం పెంచేసి అది నిజమే అని తేల్చేశారు. కొత్తగా పెంచిన ధరలు చూసి భక్తులు షాకవ్వడం ఒకటే తరువాయి.. ఆలయ అధికారులు పెంచిన ధరులపై ఓ లుక్కేస్తే.. * గర్భాలయ అభిషేకం సేవను 5 వేలకు నిర్ణయించారు. *సామూహిక అభిషేకం టికెట్ ధర రూ. 1000 నుండి 1500 కు పెంచారు. అయితే ఇంతకు ముందు సామూహిక అభిషేకం ధర మామూలుగా రూ. 1000 ముందుగా బుక్ చేసుకుంటే 1500 ఉండేది. ఇప్పుడు రెండింటికి ఒకటే రేటు 1500 ఫిక్స్ చేసేశారు. * ఇంకా కుంకుమార్చన టికెట్ రూ 350 నుండి ఏకంగా రూ. 1000 రూపాయలు పెంచారు. * రుద్రహోమం.. చండీహోమం టికెట్లు ధరలు రూ. 1200 నుండి రూ.1500 పెంచారు. * ఇక సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే శీఘ్ర దర్శనం టికెట్ ను రూ.50 నుండి రూ. 100కి పెంచారు.   ఇంకా గుడ్డి కంటే మెల్ల నయం అన్న చందాన కొన్ని టికెట్ల ధరలు తగ్గించి భక్తులకు కాస్త ఊరట కలిగించారు. అందులో కళ్యాణోత్సవం టికెట్ రూ. 1000 నుండి రూ.500కి.. సుప్రభాతం సేవ టికెట్ ను రూ. 1000 నుండి రూ.500కి తగ్గించారు.   మొత్తానికి ఇలానే ధరలు పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలకి అయితే ఆఖరికి దేవుని దగ్గరకి వెళ్లాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్.. లైంగిక ఆరోపణలు

  ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం.. అరెస్ట్ అవడం కామన్. ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను  కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే గారి బంధువు అయిన ఓ మహిళ ఆయనపై లైంగిక వేదింపుల కింద పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఖాన్‌ తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతపెడుతున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అయితే అందరూ చెప్పినట్టే ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తనపై కుట్ర చేస్తున్నారని ఖాన్‌ ఆరోపించారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఆయనే నిన్న స్వయంగా జమియా నగర్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. కానీ పోలీసులు మాత్రం అతనిని అరెస్ట్ చేయకుండా తమ దర్యాప్తు ప్రకారమే ముందుకెళ్తామని చెప్పి పంపించేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వారే స్వయంగా వెళ్లి.. ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.

రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. తొమ్మిది రోజులు రైళ్లు రద్దు..

  ఒకపక్క వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు రద్దు అయి ఇప్పటికే ప్రయాణికులు అవస్థలు పడుతుంటే ఇప్పుడు మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా తొమ్మిది రోజుల పాటు కొన్ని రైళ్లను రద్దు చేసింది విజయవాడ రైల్వే. అసలు సంగతేంటంటే.. ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు సిగ్నలింగ్‌ వ్యవస్థ ఆధునికీకరణ పనులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 300 రైళ్లు రాకపోకలు సాగించే విజయవాడ రైల్వే స్టేషన్లో సుమారు 50 రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ఈ సందర్బంగా సీనియర్‌ డీసీఎం ఎం.యల్వేందర్‌యాదవ్‌ మాట్లాడుతూ.. రైల్వే సిగ్నలింగ్ ఆధునీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశామని.. దీనిని గుర్తించి ప్రయాణికులు రెల్వే చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. అంతేకాదు విశాఖ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లు...విజయవాడ మీదుగా విశాఖ రావాల్సిన ఏ ఒక్క రైళ్లు సిగ్నలింగ్‌ పనులు పూర్తయ్యేంత వరకు విజయవాడ స్టేషన్‌కు వెళ్లవని స్పష్టం చేశారు.

రైల్వే బడ్జెట్ కు మంగళం..

రైల్వే బడ్జెట్ ను సామాన్య బడ్జెట్ లో విలీనం చేయడంపై గత కొద్ది రోజులుగా కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బడ్జెట్ కు మంగళం పాడేసింది కేంద్ర కేబినెట్. 92 ఏళ్ల సాంప్రదాయానికి తెర‌ప‌డింది. రైల్వే బ‌డ్జెట్‌ను సాధార‌ణ బ‌డ్జెట్‌లో విలీనం చేయాల‌న్న‌ ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. కేంద్రం ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ విధమైన ప్రకటన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇక మీదట ఒకే బడ్జెట్ ఉంటుందని.. రైల్వేస్ క‌న్వెన్ష‌న్ క‌మిటీ కూడా ర‌ద్ద‌వుతుంది. రైల్వే రెవెన్యూ లోటు, మూల‌ధ‌న వ్య‌యాన్ని ఆర్థిక శాఖ‌కు బ‌దిలీ చేస్తారని ఆయన తెలిపారు. కాగా 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి రైల్వేకు ప్ర‌త్యేక బ‌డ్జెట్ ఉండ‌దు.