ముంబై తీర ప్రాంతంలో హై అలర్ట్..

  ముంబైలోని ఉరాన్ లో నలుగురు ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం రావడంతో హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నలుగురు వ్యక్తులు నల్లని దుస్తువులు ధరించి ఆయుధాలతో సంచరిస్తున్నారని స్కూల్ విద్యార్ధులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు వారు ముంబై తీర ప్రాంతంలో తిరుగుతున్నారన్న అనుమానం రావడంతో ముంబై తీరం వెంట నౌకాదళం ముమ్మరంగా గస్తీ నిర్వహించింది. ముంబై, నవీ ముంబై తీర ప్రాంతంలో పశ్చిమ నౌకాదళ కమాండ్ (డబ్ల్యూఎన్సీ) హై అలర్ట్ ప్రకటించింది. గేట్ వే ఆఫ్ ఇండియా, రాజ్‌భవన్, బాంబే హైకోర్టు, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను పెంచామని డీజీపీ సతీశ్ మాథుర్ ప్రకటించారు. సముద్రతీర ప్రాంత పోలీస్‌స్టేషన్లన్నీ నౌకాదళ అధికారుల సమన్వయంతో గస్తీ నిర్వహిస్తున్నాయని తెలిపారు.

భారత్ కు పాక్ వార్నింగ్.. మా సత్తా ఏంటో భార‌త్‌కు తెలుస‌ు

  భారత్, పాక్ ల మధ్య పరిస్థితి ఇప్పుడు పచ్చగడ్డి వేస్తేనే మండిపోయేంతగా మారిపోయింది. యూరీ దాడి తరువాత ఆగ్రహంతో ఉన్న భారత్ అక్కడి సరిహద్దుల్లోని ఉగ్రవాదులను ఏరివేసే పనిలో పడింది. అయితే ఇప్పుడు భారత్ కు పాక్ హెచ్చరికలు జారీ చేసింది. భార‌త్‌లో ల‌క్ష్యాల‌ను ఎంచుకున్నామ‌ని, అటు నుంచి ఏ చిన్న దాడి జ‌రిగినా బ‌లంగా తిప్పికొడ‌తామ‌ని పాకిస్థాన్ హెచ్చ‌రించింది. ఇప్పటికే బ‌ల‌గాల‌ను మోహ‌రించామ‌ని, స‌మీప భ‌విష్య‌త్తులో ఎలాంటి ప‌రిణామాలు ఎదురైనా పాకిస్థాన్ సైన్యం మాత్రం ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగానే ఉంటుంద‌ని ర‌క్ష‌ణ‌శాఖ వ‌ర్గాలు స్ప‌ష్టంచేశాయి. త‌మ సత్తా ఏంటో భార‌త్‌కు తెలుస‌ని కూడా పాక్ హెచ్చ‌రించింది. అంత‌ర్గ‌తంగా త‌మ స్థావ‌రాల‌ను కాపాడుకుంటూనే స‌రిహ‌ద్దులో భార‌త్‌కు స‌రైన స‌మాధాన‌మివ్వ‌డానికి ఆర్మీని సంసిద్ధం చేసిన‌ట్లు చెప్పింది. మరి దీనికి భారత్ ఎలా సమాధానమిస్తుందో చూడాలి.

వారికి జీఎస్టీ బిల్లు వర్తించదు..

  కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్లు సమావేశాల్లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇంకా పలు రాష్ట్రాల నుండి అమోదం వచ్చిన వెంటనే.. వచ్చే ఏడాది నుండి అమల్లోకి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ బిల్లుకు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఎంత ఆదాయ పరిమితిని విధించాలనే దానిపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారుల వార్షిక ఆదాయం ఈ పరిమితి కన్నా తక్కువగా ఉంటే జీఎస్‌టీ నుంచి మిహాయింపు లభిస్తుందని తెలిపారు. రూ.20లక్షల టర్నోవర్‌ పైబడిన వారికి జీఎస్‌టీ వర్తించనుందని... ఆదాయ పరిమితిని రూ.20లక్షలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల్లో ఉన్న వారికి ఈ పరిమితిని రూ.10లక్షలుగా ఖరారు చేసినట్లు తెలిపారు.

నర్సు పై సర్పంచ్ దాడి.. ఐదు నెలల గర్భవతి

  ఓ సర్పంచ్ నర్సు అందునా.. గర్భవతి అయిన ఆమెపై దాడి చేసిన ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం అంతా సీసీ కెమెరాల్లో రికార్డవడంతో అసలు విషయం బయటపడింది. వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని మోగా ప్రాంతంలో అకాలీదళ్ పార్టీకి చెందిన ఓ స‌ర్పంచ్ ఆసుపత్రిలో తన బంధువుని డిశ్చార్జీ చేయించుకునే క్ర‌మంలో బిల్లు కట్టించుకోవాలని అక్క‌డి సిబ్బందిని తొందర పెట్టాడు. దీంతో అక్కడ ఉన్న ఓనర్సు కొంచెం వెయిట్ చేయాలని చెప్పడంతో.. సదరు సర్పంచ్ ఆమెను పక్కకు నెట్టివేయడంతో ఆమె కింద‌ప‌డిపోయింది. అక్కడితో ఆగకుండా త‌న అనుచ‌రుల‌తో న‌ర్సుపై స‌ర్పంచ్ దాడి చేశాడు. ఆమె ఐదు నెలల గర్భవతి. అయితే ఈ తతంగమంతా కెమెరాల్లో చిక్కాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

జియో దెబ్బకి.. ఎయిర్ టెల్ కొత్త ఆఫర్..

  రిలయన్స్ జియో ధాటికి ఇతర నెట్ వర్క్ లు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చుస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ఆఫర్లు ప్రకటించిన ఎయిర్ టెల్ ఇప్పుడు తాజాగా మరో ఆఫర్ తో ముందుకొచ్చింది. 4జీ ప్యాక్ ద్వారా త‌మ వినియోగ‌దారులు 90 రోజుల పాటు ఉచితంగా ఇంటర్నెట్‌ను వాడుకోవ‌చ్చ‌ని పేర్కొంది. ఈ ప్యాక్ కావాల‌నుకునే త‌మ పాత క‌స్ట‌మ‌ర్లు రూ.1,495తో రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపింది. కొత్తగా త‌మ సిమ్‌కార్డుల‌ను తీసుకున్న వారు రూ.1,494తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పింది. ఈ ప్యాక్ తొలుత ఢిల్లీలో మాత్రమే లభ్యం కానుందని పేర్కొంది. దేశంలోని మిగ‌తా అన్ని రాష్ట్రాల్లోనూ త్వ‌ర‌లోనే ఈ ఆఫ‌ర్‌ను అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపింది.

‘బహమాస్’ పేపర్ల సంచలనం.. నిమ్మగడ్డ ప్రసాద్ పేరు

  'పనామా పేపర్స్' ఈ పేరు వింటేనే గతంలో కొంత మంది పెద్దలకి చెమటలు పట్టేవి. నల్ల కుబేరుల పేర్లు పనామా పేపర్ లీక్స్ చేస్తున్న సమయంలో ఎప్పుడు తమ పేరు బయటకు వస్తుందా అని టెన్షన్ పడేవాళ్లు. అయితే కొద్ది రోజులు హడావుడి చేసిన ఈ వ్యవహారం ఇప్పుడు సద్దుమణిగింది అనే లోపునే ఇప్పుడు అదే తరహాలో ‘బహమాస్’ పేపర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. నల్లకుబేరుల జాతకాలు బయటపెడుతున్నాయి. దేశంలోని 475 మంది నల్లకుబేరుల జాతకాలను బట్టబయలు చేశాయి. ఈ 475 మంది పేర్లతోనే లక్షా 75 వేల సంస్థలున్నట్లు ‘బహమాస్’ లీక్ చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురి పేర్లు ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పేరు వినపడుతోంది. సికింద్రాబాద్ లోని ఒకే అడ్రస్ నుంచి 20 సంస్థలున్నట్లు ‘బహమాస్ ’ బయటపెట్టింది. మరి ఇంకా ఎంతమంది పేర్లు  ‘బహమాస్’ పేపర్లు బయటపెడతాయో చూడాలి.

నిజాం పేటకు పొంచి ఉన్న ప్రమాదం..

  హైదరాబాద్లో ఎడతెరపి లేని వర్షాల వల్ల నగరం మొత్తం జలమయమైంది. రోడ్లన్నీ ఎక్కడికక్కడ నీటితో నిండిపోవడంతో కనీసం బయటకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ప్రమాదం పొంచి ఉన్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. బాచుపల్లి, మైటాస్‌, హిల్‌కౌంటీ కాలనీల నుంచి భారీగా వరదనీరు చేరుతుండటంతో నిజాంపేటలోని తురకచెరువు ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో సెల్లార్‌, మొదటి అంతస్థుల్లో ఎవరూ ఉండొద్దని పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అంతేకాదు దిగువ ప్రాంతమైన భండారీ లేఅవుట్‌లోని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అలుగు, తూముల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో ముందు జాగ్రత్తగా సహాయచర్యలు చేపట్టారు.

ఓటుకు నోటులో మేం కల్పించుకోలేం... సుప్రీం

ఓటుకు నోటు.. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు బయటపడినప్పటినుండి విచారణ జరుగుతూ ఉంది. ఇటీవలే ఈ కేసు పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కూడా ఓటుకు నోటు కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున ఆ కేసు విష‌యంలో తాము క‌ల్పించుకోబోమ‌ని చెప్పింది. అంతేకాకుండా దీనిపై హైకోర్టుకు కూడా కొన్ని సూచనలు చేసింది. నాలుగు వారాల తర్వాత కేసుపై విచార‌ణ చేప‌ట్టి, వీలైనంత త్వరగా పూర్తిచేయాల‌ని సూచించింది.

హత్య కేసులో లాలు కొడుక్కి కోర్టు నోటీసులు..

  ఆర్జీడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు.. రాష్ట్ర మంత్రి తేజ్‌ ప్రతాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తేజ్ ప్రతాప్ తో పాటు ఇటీవలే 12 ఏళ్లు జైలులో ఉండి ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన ఆర్జేడీ మాజీ ఎంపీ షాబుద్దీన్‌కు కూడా నోటీసులు పంపింది. బిహార్‌లో జర్నలిస్ట్ రాజ్ దేవ్ రంజన్ హత్య సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. రాజ్‌దేవ్‌ రంజన్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, షార్ప్‌ షూటర్‌ మహ్మద్‌ కైఫ్‌తో తేజ్‌ప్రతాప్‌, షాబుద్దీన్‌ కలిసి దిగిన ఫొటోలు బయటకు రావడంతో ఇది వివాదాస్పదంగా మారింది. దీంతో బిహార్‌ పోలీసులపై తమకు విశ్వాసం లేదని, కేసు విచారణను దిల్లీకి బదిలీ చేయాలని రంజన్‌ భార్య ఆశా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దీనిపై విచారించిన న్యాయస్థానం వీరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసును దర్యాప్తు చేపట్టి.. అక్టోబర్‌ 17లోగా నివేదికను అందించాలని సీబీఐని ఆదేశించింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 318.. ఆచితూచి ఆడుతున్న కివీస్

  భారత్-న్యూజిలాండ్ మధ్య 500వ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి టెస్టు మ్యాచ్‌లో 318 పరుగుల వద్ద భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 291/9తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ జట్టు.. రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు కేవలం 27 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. 300 పరుగుల మైలురాయిని అందుకోగలిగింది.   ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టు ఆచితూచి ఆడుతోంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేస్తున్నప్పటికీ ఎలాంటి తడబాటు లేకుండా న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఓపెనర్లు గుప్తిల్ (21), లాతమ్ (20) క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. పదో ఓవర్లో మ్యాజిక్ చేసిన ఉమేష్ యాదవ్ అద్భుతమైన బంతిని సంధించి గుప్తిల్ ను ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. అనంతరం లాతమ్ కు కెప్టెన్ విలియమ్సన్ (7)జత కలిశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు తొలి సెషన్ లో 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 56 పరుగులు చేసింది.

సుబ్రతోరాయ్ పై కోర్టు ఆగ్రహం... కస్టడీలోకి తీసుకొండి..

సహారా ఇండియా అధినేత సుబ్రతోరాయ్ కు కోర్టులో చుక్కెదురైంది. గత కొద్ది రోజుల క్రితం ఆయన తల్లి మరణించిన నేపథ్యంలో పెరోల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తల్లి అంతిమ సంస్కారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని.. అంతేకాకుండా కోర్టు సూచించిన మొత్తం సమీకరిస్తానని సుప్రీంకోర్టుకు చెప్పగా కోర్టు సుబ్రతోరాయ్ కు పెరోల్ కింద బయటకు రావడానికి అనుమతినిచ్చింది. కానీ సుబ్రతోరాయ్ న్యాయస్థానం విధించిన గడువులోగా ష్యూరిటీ చెల్లించలేదు. దీంతో ఇప్పుడు సుబ్రతోరాయ్ పెరోల్ రద్దు చేసి ఆయనను అదుపులోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

కోర్టుకు హాజరైన జగన్..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సాక్షిలో పెట్టుబడులపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో భాగంగా ఈడీ కోర్టు సమన్లు జారీ చేయగా.. నాంపల్లిలోని గగన్ విహార్ లోని ఈడీ, సీబీఐ కోర్టులకు జగన్ హాజరయ్యారు. జగతి పబ్లికేషన్స్ లో రాంకీ పెట్టిన 10 కోట్ల రూపాయల పెట్టుబడులు అక్రమమని పేర్కొంటూ ఈడీ అభియోగపత్రం దాఖలు చేసింది. విచారణకు జగన్ తోపాటు విజయసాయిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, అయోధ్యరామిరెడ్డిలు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆదేశించింది. దీంతో వారంతా నేడు కోర్టుకు హాజరయ్యారు.

తడిసిముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు...

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దవుతున్నాయి. హైదరాబాద్ నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్లన్నీ నీటితో నిండిపోగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. హైదరాబాదుతో పాటు నల్గొండ జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఇక ఏపీలో కోస్తాంధ్రా మొత్తం భారీ వర్షపాతంతో నిండిపోయింది. ఐదు జిల్లాల్లో చెరువులు నిండిపోయాయి. వాగులు, వంకలు, నదులు పరవళ్లుతొక్కుతున్నాయి. కాగా కురిసిన వర్షాల ధాటికి భారీ ఎత్తున పంటనష్టం వాటిల్లింది. ఇక రెండు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.

మరో భారీ ప్రయాగానికి ఇస్రో..

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి ఎనిమిది శాటిలైట్లను ప్రయోగించనున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట వేదికకానుంది. సెప్టెంబర్ 26న సోమవారం ఉదయం 9:12 నిమిషాలకు.. పీఎస్ఎల్‌వీ రాకెట్ ద్వారా ఒకేసారి ఎనిమిది శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం ద్వారా తొలిసారిగా రెండు వేరు వేరు కక్ష్యల్లోకి ఒకే రాకెట్ ప్రయోగం ద్వారా శాటిలైట్లను ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో అధికారులు గురువారం తెలిపారు. ఈ ఎనిమిది శాటిలైట్లలో వాతావరణ అధ్యయన శాటిలైట్ ఎస్‌సీఏటీఎస్ఏటీ-1 తో పాటు రెండు దేశీయ శాటిలైట్లు, మరో ఐదు విదేశీ శాటిలైట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

భారత కుబేరుడు.. మళ్లీ ముఖేశ్ అంబానీనే

  భార‌త వ్యాపార‌వేత్త‌, రిల‌యెన్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఈసారి కూడా భార‌త‌దేశ అత్యంత సంప‌న్నుడిగా తన స్థానాన్ని అలాగే నిలుపుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇది తొమ్మిదో సారి కూడా ఆయనే  ఫోర్బ్స్ జాబితాలో భార‌త‌దేశ అత్యంత సంప‌న్నుడిగా నిలిచారు. రూ.1,52,145 కోట్ల సంప‌ద‌తో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నారు ముఖేశ్ అంబానీ. ఈయన తరువాత రెండో స్థానంలో స‌న్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి రూ.1,13,291 కోట్ల‌తో నిలిచారు. హిందూజా ఫ్యామిలీ 1.01,877 కోట్ల‌తో మూడోస్థానానికి ఎగ‌బాకింది. రూ.ల‌క్ష కోట్ల సంప‌ద‌తో విప్రో అజీమ్ ప్రేమ్‌జీ నాలుగోస్థానానికి దిగ‌జారారు. ఇవన్నీ ఒకెత్తు అయితే టాప్ 100 జాబితాలో ప‌తంజ‌లి ఆయుర్వేద అధినేత ఆచార్య బాల‌కృష్ణ చోటు సంపాదించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. యోగా గురు రాందేవ్ బాబాకు స‌న్నిహితుడైన ఆయ‌న‌.. రూ.16756 కోట్ల సంప‌ద‌తో 48వ స్థానంలో నిలిచారు.

మళ్లీ హైదరాబాద్ ను ముంచేసిన వర్షం..

  మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి చూస్తుంటే. ఇప్పటికే గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేని వర్షాల వల్లా నగరం మొత్తం నీట మునిగిపోతే.. మళ్లీ ఈరోజు భారీగా వర్షం పడి ఇంకా అతాలకుతలం చేసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నగరంలో పరిశీలించారు. నగరంలోని నాలాలు, నాలాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ వార్షిక సగటు వర్షాపాతం 32 సెం.మీ అని తెలిపారు. కానీ ఇవాళ ఒకే రోజు ఈ ప్రాంతంలో సుమారు 23 సెం.మీ వర్షం కురిసిందన్నారు. దీంతో నిజాంపేటతోపాటు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయని వివరించారు. ఇలాంటి ప్రకృతి వైఫరీత్యాలు ఏర్పడినపుడు ప్రభుత్వం చేసే సహాయ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.