సత్యసాయిబాబా మహా సమాధి
పుట్టపర్తి : తన భక్తులను బంగారు అని ప్రేమగా పిలిచే సత్యసాయి బాబా శాశ్వత సమాధిలోకి వెళ్లిపోయారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బుధవారం ఉదయం 8 గంటల నుండి క్రతువు ప్రారంభమయింది. బాబా సోదరుడి తనయుడు రత్నాకరరాజు క్రతువుని నిర్వహించారు. మహాక్రతువుకు అనీల్ కుమార్ వ్యాఖ్యానం చేశారు. ప్రభుత్వం తరఫున బాబాకు గౌరవ వందనం సమర్పించారు. ఆయన పార్థివ శరీరంపై జాతీయ జెండాను కప్పారు. వేదమంత్రోచ్ఛరణాల మధ్య హారతి ఇచ్చారు. పుణ్య నదుల క్షేత్రాల మట్టిని తీసుకు వచ్చారు. సరస్వతీ నది నుండి కూడా మృత్తికను తీసుకు వచ్చారు. సాయి సమాధిని ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలులో సమాధి చేశారు. బాబా శిరస్సు దక్షిణం వైపు ఉంచారు. సాయికి మహాహారతితో మహాసమాధి పూర్తి అయ్యింది. మహా సమాధి కార్యక్రమానికి బాబా కుటుంబసభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, గవర్నర్ నరసింహన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, బీజేపీ నేతలు ఎల్కె అద్వానీ, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్రెడ్డి, మర్రి శశిథర్రెడ్డి, డీజీపీ అరవిందరావు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, పంజాబ్ గవర్నర్ శివరాజ్పాటిల్, వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్, పలు రాష్ట్ర మంత్రులు, వీఐపీలు హాజరు అయ్యారు. బాబా లేరనే వార్తను భక్తులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సత్యసాయి మరలా తమకు దర్శనం ఇస్తాడనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ మానవాళికి ప్రేమతత్వం సేవాతత్పరతలను చాటిచెప్పి కోట్లాది మంది భక్తుల హృదయాల్లో కొలువై ఉన్న సత్యసాయి బాబా భక్తకోటిని శోకసంద్రంలో ముంచి శివైక్యం చెందారు.