కడపలో 13 లక్షల పట్టివేత

కడప: కడపజిల్లా రాజుపాలెం చెక్‌పోస్టు వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా బళ్ళారి నుంచి కడపకు వస్తున్న స్కార్పియా వాహనంలో తరలిస్తున్న 13 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి తాను బంగారం వ్యాపారస్తుడునని, నెల్లూరు జిల్లాలో ఎక్కువగా వ్యాపారం చేస్తుంటానని, ఈ నేపథ్యంలో తీసుకువస్తున్న డబ్బని పోలీసులకు వివరించాడు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు డబ్బుతోపాటు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ వర్గానికి చెందిన డబ్బుగా పోలీసులు భావిస్తున్నారు.

జగన్ పై విమర్శల వర్షం

హైదరాబాద్: మాజీ పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం ఎక్కువైంది. జగన్ అవినీతి, అక్రమాలపై ఓ వైపు కాంగ్రెసు, తెలుగుదేశం, ప్రజారాజ్యం మరోవైపు జీవిత రాజశేఖర్ దంపతులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాక్షిలో వచ్చిన ఓ కథనంపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఢిల్లీలో ధ్వజమెత్తారు. సాక్షిలో వచ్చిన కథనాలకు జగనే బాధ్యత వహించాలని సూచించారు. ఇక వి హనుమంతరావు కూడా జగన్‌ను రాష్ట్రానికి పట్టిన శనిలా పేర్కొన్నారు. ఆయనపై తప్పకుండా కనిమొళి, సురేష్ కల్మాడి తీరులో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జగన్ అక్రమాలకు లెక్కే లేదని చెప్పారు. ఇక కడప ఉప ఎన్నికలలో తన ప్రచారాన్ని శుక్రవారమే ప్రారంభించిన ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి జగన్‌పై మొదటి సారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ అవినీతిపరుడని, తనను ముఖ్యమంత్రిని చేయమంటూ తన వద్దకు వచ్చాడని విమర్శించారు. తనపై ఉన్న ప్రేమను కాంగ్రెసుకు ఓటు వేసి చూపించాలని ఓటర్లను కోరారు. జగన్ పార్టీ విధివిధానాలపైనా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా తన ప్రచారంలో జగన్ అవినీతిపై ఒంటికాలుతో లేచారు. జగన్ తప్పకుండా బిజెపితో కలుస్తారని భవిష్యత్తును చెప్పారు. బిజెపితో లోపాయికారి ఒప్పందం ఉన్నందువల్లే వారు పోటీ చేయడం లేదని చెప్పారు. వీరంతా తమ తమ రాజకీయాలలో భాగంగా జగన్‌పై ధ్వజమెత్తగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంత వరకు ఆయన వెన్నంటి ఉండి, జగన్ విజయవాడ జలదీక్షలో పాల్గొన్న జీవిత, రాజశేఖర్ దంపతులు జగన్‌ను ఓ పట్టు పట్టారు. జగన్ సంపాదించినది అంతా అవినీతి సొమ్ము అని, అవినీతి సొమ్ము కాదని జగన్ నిరూపిస్తే జగన్ దగ్గర పడి ఉండటానికి సిద్ధమని సవాల్ విసిరారు. తండ్రి ఆశయ సాధన పేరుతో త్వర త్వరగా ముఖ్యమంత్రి కావాలని జగన్ అత్యాశ పడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మళ్ళీ సొంతగూటికి జీవిత రాజశేఖర్?

హైదరాబాద్: సినీ హీరో రాజశేఖర్, జీవిత దంపతులు తిరిగి సొంత గూటికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవిని ఎదుర్కోవడానికి రాజశేఖర్ దంపతులను వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో కాంగ్రెసులో చేర్చుకున్నారు. ఈ చేరికకు అప్పట్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, పార్టీలో రాజశేఖర్‌కు గానీ జీవితకు గానీ ఏ విధమైన పదవి ఇవ్వలేదు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వారిద్దరు ఆయన కుమారుడు వైయస్ జగన్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. వారిని జగన్ కాదనలేదు గానీ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. తమకు తగిన ప్రాధాన్యం లభిస్తుందనే ఆశతో వారు ఇంత వరకు జగన్ వెంట ఉన్నప్పటికీ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో వారు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ అసంతృప్తి కారణంగానే వారు తమ మార్గాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తుండడంతో రాజశేఖర్ దంపతులు కాంగ్రెసులోకి వెళ్లే అవకాశాలు లేవు. చిరంజీవిని వారు తమ ప్రధాన శత్రువుగానే పరిగణిస్తున్నారు. పైగా, చిరంజీవికి కాంగ్రెసులో అత్యధిక ప్రాధాన్యం లభిస్తోంది. కాంగ్రెసులోకి వెళ్తే చిరంజీవికి లభించే ప్రాధాన్యం తమకు లభించదనే విషయం వారికి తెలుసు. అందుకే, వారు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నిజానికి, రాజశేఖర్ స్వర్గీయ ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడు. దాంతో రాజశేఖర్ దంపతులు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆకర్ష్ పథకంలో భాగంగా వారు కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. చిరంజీవిపైనే కాకుండా వైయస్ జగన్‌పై కూడా రాజశేఖర్ దంపతులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌వన్నీ అక్రమాస్తులేనని వారు దుయ్యబట్టారు. జగన్‌కు కావాల్సింది అధికారమేనని అన్నారు. దీన్ని బట్టి కడప ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే ఉద్దేశంతో వారిద్దరు జగన్‌కు, చిరంజీవికి వ్యతిరేకంగా ఈ సందర్భంలో మీడియా ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు.

రెండు పార్టీలు మాత్రమే ప్రభావితం చేశాయి

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి కుక్కచావు తప్పదని ఆ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె.తారక రామారావు (కేటీఆర్) జోస్యం చెప్పారు. ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వచ్చి మధ్యలోనే కాలగర్భంలో కలిసి పోయాయన్నారు. ఇలాంటి వాటిలో చిరంజీవి, దేవేంద్ర గౌడ్ పార్టీలు ఉన్నాయన్నారు. అయితే, రెండు పార్టీలు మాత్రం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాలను సైతం ప్రభావితం చేశాయన్నారు. ఆ పార్టీలే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం, కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పుకొచ్చారు. కేవలం ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన తెరాస.. గత దశాబ్దకాలంగా అందుకోసం కృషి చేస్తోందన్నారు. ఇకపోతే.. తెలంగాణ ఉద్యమ వేడి చల్లారిపోలేదన్నారు. వచ్చే మే, జూన్ నెలల్లో తెలంగాణపై కేంద్రం ఒక ప్రకటన చేస్తుందనే ఆశతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. అలా ప్రకటన చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి కుక్కచావు తప్పదని కేటీఆర్ జోస్యం చెప్పారు.

జగన్ ఓ శాడిస్టు: విహెచ్

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఓ శాడిస్టు అని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రాష్ట్రానికి పట్టిన శని అని అన్నారు. కడప ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీదే విజయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెసుకు ఓటు వేయాలని విహెచ్ కడప ఓటర్లకు సూచించారు. రాష్ట్రాన్ని అవినీతితో దోచుకున్న అక్రమార్కుడు జగన్ వద్ద ఓటర్లు డబ్బులు తీసుకుంటే తప్పులేదని ఆయన అన్నారు. బిజెపి కన్నా జగన్ చాలా డేంజర్ వ్యక్తి అని అన్నారు. బిజెపికు దగ్గర కావాలనే ఉద్దేశంతోనే జగన్ సోనియాను విమర్శిస్తున్నారని విహెచ్ ఆరోపించారు. జగన్ ఎప్పుడు, ఎక్కడ వదిలేస్తారో ఎవరికీ తెలియదన్నారు. బిజెపి సీనియర్ నాయకుడు అన్నీ మాట్లాడుతారు కానీ జగన్ అవినీతిపై ఎందుకు మాట్లాడరని దుయ్యబట్టారు. బిజెపి జగన్ అక్రమాలపై ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు. కడప బరిలో జగన్ గెలిస్తే ముస్లింలకు నష్టం అని అన్నారు. బిజెపితో లోపాయకారి ఒప్పందం కారణంగా బిజెపి తమ అభ్యర్థిని బరిలోకి దింపలేదని అన్నారు. బలం లేకనే పోటీ చేయడం లేదనే అనటం సిగ్గు చేటు అన్నారు. కనిమొళి, సురేష్ కల్మాడిపై చర్యలు తీసుకున్నట్టుగానే జగన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.

జగన్, చిరుపై మండిపడ్డ రాజశేఖర్

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ సింపతీతో త్వరగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పార్టీలో తానే ఫోకస్ కావాలని జగన్ అనుకుంటారని, ఇతరులు ఫోకస్ కావడం జగన్‌కు అసలు ఇష్టం ఉండదని హీరో రాజశేఖర్ కంట తడి పెట్టారు. జగన్, ఆయన పార్టీ నేతలు తమని కావాలనే దూరంగా ఉంచారని ఆరోపించారు. విజయవాడ జగన్ జలదీక్షలో తమకు వచ్చిన ప్రతిస్పందన చూసి జగన్ అసూయపడ్డారన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనే స్వార్థంతోనే పార్టీ స్థాపించారని ఆరోపించారు. తండ్రి ఆశయాలు సరిగా అమలు చేయడం లేదని హైకమాండ్‌కు తప్పుగా చూపించి సిఎం కావాలని అనుకున్నారని అన్నారు. జగన్ చేసేది సరియైనదే అయితే ఆయన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి కాంగ్రెసులో ఎందుకు ఉంటారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ఇప్పుడు కామెంట్ చేయడం అంటే చచ్చిన పామును కొట్టినట్లేనని అన్నారు. పిఆర్పీని స్థాపించి దానిని నడపలేక రెండున్నర సంవత్సరాలకే కాంగ్రెసు పార్టీలో కలిపేశారని అన్నారు. పార్టీని నడపడం చేతకాకనే విలీనం చేశారని అన్నారు. మొదటి నుండి కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్న చిరంజీవిని తీసుకోవడం విచారకరమన్నారు. పార్టీకి ఎంతో చేసిన తమను విస్మరించారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, త్యాగాలు చేసిన తమను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, నాటి రాష్ట్ర ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలోనే కాంగ్రెసులో చేరిన విషయం గుర్తు చేశారు. వైయస్ దూరం కావడం దురదృష్టకరం అన్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా తాము అప్పుడు ఉన్నందునే మమ్మల్ని కాంగ్రెసులోకి ఆహ్వానించారని అన్నారు. గత సాధారణ ఎన్నికల్లో కూడా చిరంజీవికి పట్టున్న చోటనే తమ చోట ప్రచారం చేయించారని అన్నారు.

మద్దతు కోసం ఎమ్మెల్యేలను పంపారు: చిరు

కడప: కడప లోకసభ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి తరఫున  ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కడప నియోజకవర్గంలో శుక్రవారం తన ప్రచారాన్ని ప్రారంభించారు. చింతకొమ్మ దిన్నే మండలం నుంచి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించగానే, తండ్రి అంతిమ సంస్కారం చేయకముందే మద్దతివ్వాలని కోరుతూ జగన్ తన వద్దకు ఎమ్మెల్యేలను పంపారని చిరంజీవి ఆరోపించారు. వారసత్వంగా పదవులు ఇవ్వడానికి ఇది రాజరికం కాదని ఆయన అన్నారు. ప్రజలు అంగీకరిస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారని, దాన్ని గుర్తించకుండా ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి శవం అక్కడ ఉండగానే జగన్ ముఖ్యమంత్రిని చేయడానికి మద్దతు ఇవ్వాలని అడిగారని, ఇది మన సంప్రదాయం కాదని తాను చెప్పానని, అంతగా జగన్‌లో అధికార దాహం పేరుకుపోయిందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా వ్యవహరించారని ఆయన అన్నారు. జగన్ అధికార దాహం వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని విమర్శించారు. జగన్ అహంకారానికి, సోనియా ఆత్మగౌరవానికి ఈ ఎన్నికలు పోటీ పెడుతున్నాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత అమ్మను సరిగా చూసుకోవాలని చెప్పినందుకు వైయస్ జగన్ సోనియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. సోనియా తనను అవమానించారని జగన్ అనడం అబద్ధమని ఆయన అన్నారు. పేరు పెట్టకుండా వైయస్ జగన్‌ను చిరంజీవి ఎత్తిపొడిచారు. వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలో నిజం లేదని, వైయస్ పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన చెప్పారు. తాను మానసికంగా కాంగ్రెసు మనిషిని అని చెప్పుకున్నారు. కాంగ్రెసు తరఫున రాజకీయంగా సేవలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. రాయలసీమలో ఈ అభిమానం తన జన్మకు చాలునని ఆయన అన్నారు. లౌకిక పార్టీ అయిన కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెసు పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు.

గాలి డైరెక్షన్... జగన్ యాక్షన్

కడప: కకర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి డైరెక్షన్ చేస్తుంటే వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నటిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. కడప ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ యాక్షన్ చేస్తున్నారని దీనిని మైనార్టీలు గుర్తించాలని ఆయన సూచించారు. బిజెపితో కలిసి జగన్ పని చేస్తున్న విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పారు. దీనిని మైనార్టీలు గుర్తించాలని ఆయన సూచించారు. బిజెపితో కలిసి జగన్ పని చేస్తున్న విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పారు. జగన్ నిజ స్వరూపం ఈ ఉప ఎన్నికల్లో బయటపడిందని అన్నారు. జగన్ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఏనాడో చెప్పామన్నారు. అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా జగన్ ఎదురుదాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

రెండు నెలల క్రితమే జగన్ కలిశారు

కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు నెలల క్రితమే భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలను కలిశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కడప జిల్లాలో విమర్శించారు. జగన్ మొత్తానికి తన మనసులోని మాట బయటపెట్టాడని అన్నారు. బిజెపితో కలవనని చెబుతూనే కలిస్తే 10 శాతం రిజర్వేషన్ కోరతానని చెప్పడం ద్వారా పరోక్షంగా కలుస్తానని చెప్పడమే అని అన్నారు. జగన్ వెంట ఉన్న శాసనసభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీకి మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. సామాజిక న్యాయం పేరుతో పార్టీని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేయడాన్ని నారాయణ తప్పు పట్టారు. పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయడం అనైతికమన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో జరుగుతున్న అధికార దుర్వినియోగం, డబ్బుపంపిణీ రాష్ట్రంలో మరెక్కడా లేదన్నారు.

ఉప ఎన్నికలపై సిఇసి డేగ కన్ను

హైదరాబాద్ : కడప ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఎన్నికల అక్రమాలను నియంత్రించడానికి కఠిన చర్యలు చేపట్టింది. మంత్రులకు కూడా నోటీసులు జారీ చేసి సమాధానం తెప్పించుకుంది. దాదాపు 10 వేల మందిని బైండోవర్‌ చేసింది. ధన ప్రవాహాన్ని అడ్డుకొనడంలో భాగంగా ఇప్పటికే రూ. 2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు 32 కేసులు నమోదు చేసింది. నిబంధనావళి ఉల్లంఘనకు సంబంధించి సుమారు 7 వేలకు పైగా కేసులు నమోదయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కడప ఉప ఎన్నికల ప్రచారంలో అడుగడుగున నిఘాను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ కడపకు బయలుదేరి వెళ్తున్నారు. ఏర్పాట్లను సమీక్షించి, పోలింగ్‌ ప్రశాంతంగా జరగడానికి సంబంధిత అధికారులకు మార్గనిర్ధేశం చేయబోతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఆరుగురు కేంద్ర పరిశీలకులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో రాజకీయ పక్షాలు కోడ్‌ ఉల్లంఘించే చర్యలను అరికట్టే విధంగా షాడో టీమ్‌లు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాయి. అత్యాధునిక కెమెరాలతో రాజకీయ పార్టీల ప్రచారాన్ని చిత్రీకరించి ఉల్లంఘనలు పరిశీలిస్తున్నారు. అభ్యర్ధుల వ్యయం పై కూడా గట్టి నిఘా వేశారు. ఆదాయ పన్ను శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ ఆర్‌. మోహన్‌ కుమార్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం. మురళీమోహన్‌లు ప్రత్యేకంగా కడప ఉప ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, బహుమతులను అందచేయడం లాంటి అభ్యర్ధుల చర్యలను పసిగడుతున్నారు. పరిశీలకుల సెల్‌ ఫోన్‌ నెంబర్లను ఇప్పటికే నియోజకవర్గంలో బహిరంగంగా ప్రకటించారు. ఈ నెంబర్లకు వస్తున్న ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నారు.

మంత్రి శంకర్రావు పై సీఎంకు కంప్లైంట్

హైదరాబాద్: చిన్నతరహా పరిశ్రమల మంత్రి శంకర్రావు తీరుపై పరిశ్రమలశాఖ అధికారులసంఘం మండిపడింది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, దీనిపై సీఎంకు ఫిర్యాదు చేయాలని గురువారం సంఘం సమావేశంలో నిర్ణయించారు. సంఘం సొంత ఖర్చులతో తీసుకున్న భవనాన్ని ఖాళీ చేయాలంటూ కొద్దిరోజులక్రితం మంత్రి వ్యవహరించిన తీరు ను సమావేశం ఖండించింది. సంబంధం లేని విషయాల్లో మంత్రి జోక్యం చేసుకుంటున్నారని విమర్శించింది. అదేవిధంగా పరిశ్రమలశాఖ అదనపు డెరైక్టర్లపై విజిలెన్స్ విచారణ జరపాలంటూ మంత్రి లేఖలు రాయడంపైనా సంఘ నేతలు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలశాఖ జనరల్‌మేనేజర్ విషయంలోనూ మంత్రి బుధవారం వ్యవహరించిన తీరును ఖండించారు.

కుల్వంత్‌ హాల్‌ మూతపడనుందా?

హైదరాబాద్: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవించి ఉన్నంత వరకు ప్రవచనాలు, దివ్య సందేశాలతో మార్మోగిన సాయి కుల్వంత్‌ హాల్‌ ఇకపై మూతపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 24వ తేదీన నిర్యాణం చెందిన బాబాను.. ఆయన ప్రవచనాలు వినిపించిన చోటనే మహా సమాధి చేసిన విషయం తెల్సిందే. ఈ మహాసమాధిపై సత్యసాయి బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సత్యసాయి ట్రస్ట్ నిర్ణయించింది. అయితే, బంగారు విగ్రహ నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందని భావించిన సాయి ట్రస్ట్ సమాధి దర్శనాన్ని పరిమితం చేయనుంది. ముఖ్యంగా మహా సమాధిని సందర్శించటానికి కేవలం బుధ, గురువారాల్లో మాత్రమే అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత సమాధిపై బాబా స్వర్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలన్న ఆలోచన ఉండటం, అందుకు ప్రతిపాదనలూ సిద్ధం కావటంతో ప్రస్తుతానికి కుల్వంత్‌ హాల్‌ను మూసి వేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బాబా సజీవులు కారు కాబట్టి, అక్కడ ప్రవచనాలు, దివ్వ సందేశాలు ఇచ్చే అవకాశం లేనందున కుల్వంత్‌ హాల్‌ను మూసి వేస్తే నష్టమేమీ లేదన్న ఆలోచనతో ట్రస్టు ఉన్నట్టు చెబుతున్నారు. హాల్‌ను తెరచి ఉంచి సమాధిని సందర్శించటానికి జనాలను అనుమతిస్తే విగ్రహ నిర్మాణం పనులకు అంతరాయం ఏర్పడుతుందని ట్రస్టు భావిస్తోంది. ట్రస్ట్ చేస్తున్న ఆలోచనలపై అటు భక్తులు.. ఇటు బాబా కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల హృదయాలలో కొలువై ఉన్న బాబాను కనీసం సమాధి రూపంలో అయినా దర్శించుకునేందుకు వీలు కల్పించకపోతే ఘోరమైన తప్పిదం చేసినట్టవుతుందని వారంటున్నారు.

పుణ్యక్షేత్రంగా పుట్టపర్తి: రఘువీరా

అనంతపురం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశ, విదేశాల్లోని భక్తులకు భగవాన్ సత్యసాయిబాబా 70 ఏళ్లుగా ఆధ్యాత్మిక బోధనలు చేశారన్నారు. బాబా నిరాశ, నిస్పృహల్లో ఉన్న వారందరికీ మనోధైర్యం, ఆత్మస్థైర్యం నింపారన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతిని చాటి చెప్పడంలో బాబా పాత్ర ఎంతైనా ఉందన్నారు. అనంతపురం, మెదక్, మహబూబ్‌నగర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, తమిళనాడులోని చెన్నై ప్రాంతాలకు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆయా ప్రాంతాల ప్రజల దాహార్తి తీర్చిన ధన్యజీవి సాయి అన్నారు. సత్యసాయి తాగునీరు పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం పైపులైన్‌ల ద్వారా అందించి ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలిచారన్నారు. 30 సంవత్సరాల క్రితం డీమ్డ్ యూనివర్శిటీని స్థాపించి విద్యార్థులకు నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడానికి అంకుర్పారణ చేసిన మహోన్నత వ్యక్తి బాబా అన్నారు. నిరుపేదలకు ఉచిత వైద్యం అందించేందుకు పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను స్థాపించారన్నారు. ప్రభుత్వం కంటే సత్యసాయి ట్రస్టు ద్వారానే నీతి, నిజాయితీగా పూర్తిస్థాయిలో పనులు చేయవచ్చని ప్రపంచానికి బాబా తెలియచేశారన్నారు. బాబా ఆత్మ శరీరాన్ని వదిలిందే కానీ పుట్టపర్తిని వదల్లేదన్నారు. సాయిరాం అంటూ వలంటీర్లు పార్థివ దేహ దర్శనానికి వచ్చిన వారందరికీ సేవలు చేశారన్నారు. వేలాదిగా వచ్చిన పోలీసులు నెల రోజుల పాటు శ్రమించారన్నారు. వీరందరీ శ్రమ మూలంగా పుట్టపర్తి భవిష్యత్తులో గొప్ప పుణ్యక్షేత్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా సత్యసాయి ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకొంటుందని మంత్రి చెప్పారు. ఓ సాధువుకు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి అనంతపురం జిల్లాలో జన్మించడం మన అదృష్టం, పుణ్యమన్నారు. బాబా ఆశయాలను కొనసాగించడానికి సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తాయన్నారు.

పులివెందులలో ఫ్యాక్షన్ పాలిటిక్స్: గోరంట్ల

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప, పులివెందులలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ఇంఛార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందులలో రౌడీల రాజ్యం నడుస్తుందని అన్నారు. ఓటర్లు స్వతంత్రగా ఓటు వేయలేక పోతున్నారన్నారు. రౌడీ రాజకీయాల కారణంగా ఓటర్లు భయంతో ఓటు వేయడానికి కూడా రాలేకపోతున్నారని అన్నారు. జగన్ బిజెపితో పొత్తు పెట్టుకోవడం ఖాయమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపితో వైఎస్‌ కుటుంబ సభ్యులకు వ్యాపార లావాదేవీలు, ఆ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు. బిజెపితో జగన్‌కు ఎలాంటి ఒప్పందం లేనప్పుడు పులివెందులలో ఆ పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. భారీ అవినీతికి పాల్పడిన తనను కాంగ్రెసు పార్టీ మరో రాజాగా చేస్తుందని భావించే జగన్ కాంగ్రెసు పార్టీని వీడి బిజెపి చెంతకు చేరుతున్నారని ఆరోపించారు. జగన్‌తో కుదిరిన ఒప్పందం వల్లనే బిజెపి కడప, పులివెందులల పోటీ చేయడం లేదని ఆరోపించారు. కడప జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేసిందేమీ లేదన్నారు. వైయస్ అధికారంలో ఉన్నప్పుడు వారి బంధువులే లాభపడ్డారని విమర్శించారు.

ఇక ప్రేమసాయిగా బాబా

బెంగళూరు: పుట్టపర్తి సత్య సాయిబాబా కర్ణాటకలోని మాండ్యా జిల్లా దొడ్డమలూర్ గ్రామంలో ప్రేమ సాయిగా అవతరిస్తారని నమ్ముతున్నారు. పుట్టపర్తి సత్య సాయి బాబా భక్తుడు శ్రీ సత్య సాయి - ఆనందసాయి అనే శీర్షికతో రాసిన పుస్తకంలో ప్రేమ సాయి అవతారం ఇక్కడే జరుగుతుందని చెప్పాడని గ్రామస్థులు విశ్వసిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కలియుగంలో తాను మూడు అవతారాలు ఎత్తుతానని, తాను షిర్డీ సాయి బాబా అవతారాన్ని అని, మూడో అవతారం ప్రేమసాయిగా ఈ గ్రామంలో జరుగుతుందని దొడ్డమలూర్ గ్రామాన్ని సందర్శించినప్పుడు సత్యసాయి బాబా తనకు చెప్పినట్లు ఆ భక్తుడు రాశాడు. తాను చిన్న ఇంటిలో జన్మిస్తానని 1960 దశకంలో గ్రామాన్ని సందర్శించినప్పుడు చెప్పారని తెలిపాడు. సత్య సాయిబాబా అంచనా ప్రకారం ప్రేమ సాయి ఈ గ్రామంలో 2023లో పుడతాడని కృష్ణా చారిటబుల్ ట్రస్టు నడుపుతున్న రామదాసు అనే వ్యక్తి చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. తన వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ కస్తూరి స్త్రీగా జన్మిస్తాడని, భద్రావతి నది సమీపంలోని ఆ గ్రామంలో జన్మించిన స్త్రీ గ్రామానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకుని ప్రేమసాయికి జన్మ ఇస్తుందని సత్య సాయి చెప్పినట్లు ఆయన తెలిపారు.

జగన్‌ను జనం నమ్మరు : వీహెచ్

హైదరాబాద్ : బీజేపీతో రహస్య ఒప్పందం ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మాటలను కడప ఓటర్లు విశ్వసించరని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి కడప ఎన్నికలు, ప్రచారం తీరుతెన్నులపై ఆయన చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..బీజేపీతో జగన్ బంధంపై ముందు నుంచీ చెబుతూనే ఉన్నానని, తన వాదనే నిజమైందన్నారు. జగన్‌ను ఓడించి ..గట్టిగా బుద్ధి చెప్పాలని కడప ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో ఆయన ఇంట్లో కూర్చొని గెలుస్తారని అనుకున్నానని అయితే, ఆయనకు అంత సీన్ లేదని తేలిపోయిందని వీహెచ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జనాలను, కాన్వాయ్‌ని చూసి ఇంట్లో కూర్చుని కడప పార్లమెంటు ఉప ఎన్నికలలో గెలుస్తాడని అనుకున్నానని అయితే అందుకు విరుద్దంగా ఆయన తన గెలుపు కోసం గల్లీ గల్లీ తిరుగుతూ తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన విజయం నల్లేరుపై నడక కాదని ఇట్టే అర్థమైపోతోందన్నారు.

చిరుపై తిరగబడిన శోభారాణి

హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణి తమ పార్టీ అధినేత చిరంజీవిపై పోరాటానికి సిద్ధమయినట్లుగా కనిపిస్తోంది. గురువారం శోభారాణి ఎన్నికల సంఘ అధికారులను కలిశారు. ఎన్నికల సంఘానికి చిరంజీవిపై ఫిర్యాదు చేశారు. చిరంజీవి వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేసింది. సామాజిక న్యాయం అంటూ ప్రజలను నమ్మించి, గత సాధారణ ఎన్నికలలో ఏ పార్టీని అయితే తిట్టారో ఆ పార్టీలో విలీనం చేయడాన్ని ఆమె ప్రశ్నించారు. చిరంజీవి నుండి పార్టీని పీఆర్పీ నేతలకు అప్పగించాలని ఆమె ఈసిని కోరారు. కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనంపై స్పందించాలని ఆమె చిరంజీవిని కోరారు. పీఆర్పీకి ఓటు వేసిన వారికి సామాజిక న్యాయం చేయాలంటే పీఆర్పీ విలీనాన్ని ఆపాల్సిందేనని అన్నారు. తనకు చిరంజీవి నుండి వారంలోగా స్పందన కనిపించాలని డెడ్ లైన్ విధించారు. అప్పటిలోగా స్పందించకుంటే తాను నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

9న తెలంగాణ సభ జరిగి తీరుతుంది

హైదరాబాద్: వచ్చే నెల 9వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో తెలంగాణ సభ జరిగి తీరుతుందని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. ఎవరికి తోచిన పద్ధతిలో వారు ప్రజలకు సన్నిహితం కావాలని పార్టీ సూచించిందని, ఆ మేరకే తాను 9వ తేదీన తెలంగాణ సభను ఏర్పాటు చేశానని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ బహిరంగ సభలో తెలంగాణ ప్రజా సంఘాలు పాల్గొంటాయని ఆయన చెప్పారు. తెలంగాణ కోరుకునేవారంతా ఈ సభలో పాల్గొనవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తనను ఆహ్వానిస్తే వెళ్తున్నానని ఆయన చెప్పారు. 9వ తేదీ సభకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ వాదులంతా కలిసి పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సత్య సాయి సెంట్రల్ ట్రస్టుపై ఎవరూ విమర్శలు చేయకూడదని ఆయన అన్నారు.

ఆరునెలల్లో తిరగబడిందా?

కడప: పులివెందుల, కడప ఉప ఎన్నికలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు మధ్య జరుగుతున్న పోటీగా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఓ టీవీ ఛానల్ ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. వైయస్ ఎప్పుడూ కాంగ్రెసును వ్యతిరేకించలేదన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా వైయస్ ఉండేవారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి సోనియాను విమర్శించడం ద్వారా తండ్రి ఆత్మకు మానసిక క్షోభను కలిగిస్తున్నారని అన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెబుతున్న జగన్ చేసేవన్నీ అందుకు విరుద్ధంగానే ఉన్నాయన్నారు. తల్లి మీద, పెరిగిన వ్యవస్థ మీద కూడా జగన్‌కు గౌరవం లేదన్నారు. ఉప ఎన్నికల తర్వాత ఏదో జరిగి పోతుందని అందరూ అనుకుంటున్నారని అయితే జగన్ రాజీనామా చేసి ఆరునెలలు అవుతుందని ఇన్నాళ్లు ఏమీ జరగనిది ఇప్పుడు ఏమవుతుందని ప్రశ్నించారు. ఈ ఆరునెలల్లో ఏమైనా తిరగబడిందా అని ప్రశ్నించారు.