అరుణాచల్ సీఎం ఆచూకీపై వీడని ఉత్కంఠ

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ ఆచూకీపై ఉత్కంఠ వీడలేదు. ఆయన ఆచూకీ కోసం రెండోరోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఖండూ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ శనివారం ఉదయం గల్లంతైంది. ఆయనతో పాటు మరో నలుగురు హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తున్నారు. తవాంగ్ నుంచి శనివారం ఉదయం 9.56 గంటలకు బయల్దేరిన హెలికాప్టర్ 11.30 గంటలకు ఈటానగర్ చేరాలి. అయితే బయలుదేరిన 20 నిమిషాలకే సీలాసాన్ మీదుగా ఎగురుతున్నప్పుడు హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయి. సీఎం ఆచూకీ కోసం శనివారం చేసిన ప్రయత్నాలు వాతావరణం సరిగాలేక ఫలించలేదు. దీంతో ఈ ఉదయం సైన్యం, ఎన్ ఎన్ బీ, ఐటీబీపీ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. వైమానిక దళం కూడా గగనతలం నుంచి గాలింపు చర్యలు చేపట్టింది. ఖండూ అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను కేంద్రప్రభుత్వం అప్రమత్తం చేసింది.   

2జీ నివేదికను సమర్పించిన జోషీ

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం స్కామ్‌పై రూపొందించిన నివేదికను ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు అందజేశారు. ఆ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆమెను కోరారు. ‘నేను నివేదికను సమర్పించాను. స్పీకరు దానిని ఆమోదించి, పార్లమెంట్లో ప్రవేశపెడతారని అనుకుంటున్నాను’ అన్నారు. స్పీకర్ అభిప్రాయమే అంతిమమన్నారు. నివేదికలో ప్రధానమంత్రి మన్మోహన్‌ను, నాటి ఆర్థికమంత్రి చిదంబరంను, ప్రధానమంత్రి కార్యాలయాన్ని తీవ్రంగా అభిశంసించారు. అయితే, ఆ నివేదికను కమిటీలోని యూపీఏ సభ్యులు తిరస్కరించిన విషయం తెలిసిందే. 21 మంది సభ్యుల కమిటీలో 11 మంది తిరస్కరించారు కాబట్టి ఆ నివేదిక చట్టబద్ధం కాదని యూపీఏ వాదిస్తోంది. యూపీఏ వాదనను రాజ్యాంగ విరుద్ధమైనదిగా జోషి కొట్టివేశారు. ఆ నివేదికలోని ప్రతి పేరాను సభ్యులందరూ చదివి, చర్చించారు కాబట్టి.. తిరస్కరించడానికి అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. పీఏసీ సమావేశాల్లో సభ్యుల ప్రవర్తనను కూడా ఆయన తప్పుబట్టారు. సమాధానాలివ్వవద్దంటూ యూపీఏ సభ్యులు సాక్షులతో చెప్పారని, కమిటీ సభ్యులే అడ్డుకుంటుంటే.. ఇక విచారణకు అర్థమేముందని ఆయన వాపోయారు. ‘ఏప్రిల్ 4 వరకు అంతా బావుంది. చైర్మన్ మంచివాడు, నమ్మకమైనవాడు, నిష్పక్షపాతంగా వ్యవహరించేవాడు. పీఏసీ ఉండగా జేపీసీ ఎందుకు అని కూడా అన్నారు. ప్రధాని కూడా పీఏసీ ముందు హాజరవుతానన్నారు. ఆ తరువాతే అంతా మారిపోయింది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారులను, సీబీఐ డెరైక్టర్‌ను, కేబినెట్ కార్యదర్శిని, అటార్నీ జనరల్‌ను పీఏసీ ముందుకు పిలవాలన్న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సమస్య ప్రారంభమైందని జోషి వివరించారు. పీఏసీ నివేదికను చెత్తబుట్టలో వేయాలని ఒక మంత్రి వ్యాఖ్యానించడంపై జోషి విచారం వ్యక్తంచేశారు. ‘ఇప్పుడు పీఏసీ నివేదికను చెత్తబుట్టలో వేస్తారు.. రేపు పార్లమెంటు ప్రతిపాదనలను, ఆ తరువాత సుప్రీంకోర్టు ఆదేశాలను చెత్తబుట్టలో వేస్తారు.. ఇలా ఎంత దూరం వెళ్తారు?’ అని ప్రశ్నించారు. సమయాభావం వల్లనే మాజీ టెలికాం మంత్రి రాజాను పీఏసీ ముందుకు పిలవలేదని వివరించారు. కాగా, పీఏసీ చైర్మన్ జోషిపై బురదజల్లే కార్యక్రమం ప్రధాని నిర్దేశకత్వంలోనే నడుస్తోందని బీజేపీ ఆరోపించింది.

తెలంగాణకు కేసీఆరే విలన్!

మహబూబ్‌నగర్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు ఇష్టం లేదని, తెలంగాణకు ఆయనే ప్రధాన అడ్డంకిగా మారారని దేవాదాయశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర సాధనకు ప్రజలను చైతన్యవంతులను చేసే లక్ష్యంతో తాను చేపట్టిన ప్రజాభియాన్ యాత్రపై కేసీఆర్ అర్థం లేని విమర్శలు చేయడం బాధాకరమన్నారు. శనివారం ద్దమందడి మండలంలో ఆయన పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ, ‘‘తెలంగాణ సాధనలో భాగంగా మంత్రి పదవికి రాజీనామా చేసి మా పార్టీ అధినేత్రికి పంపించా. ప్రజలన చైతన్యం చేసేందుకు పాదయాత్ర చేస్తున్నా.. నీకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడాలి’ అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. జూన్‌లో తెలంగాణ రాష్ర్టం ఏర్పడుతుందన్న విశ్వాసం తనకు ఉందని, లేని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అవసరమైతే హైదరాబాద్ నగరాన్ని ముట్టడించేందుకు ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల మధ్య ఐక్యత లేనందునే రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు. తెలంగాణ కోసం ఎందరో విద్యార్థులు బలిదానాలు చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో చలనం రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

మీసం మెలివేసి తొడకొట్టిన చిరు

పులివెందుల ‌: ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ఎక్కడికైనా వెళ్లి ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకోవచ్చని, అయితే కోడిగుడ్లు, చెప్పులు విసిరి పులివెందుల ప్రాంత చరిత్రకు మచ్చతెచ్చారని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఇలాంటివాటికి తాము భయపడమని వారికి ప్రజలే బుద్ధిచెప్తారన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల మండలాల్లో శనివారం చిరంజీవి రోడ్‌షోలు నిర్వహించి ప్రసంగించారు. పులివెందులలో శుక్రవారం తనపై జరిగిన దాడిని ఖండించారు. అంతకుముందు అభిమానుల కోరిక మేరకు సింహాద్రిపురంలో చిరంజీవి మీసం మెలేసి, తొడగొట్టారు. ప్రజల ఆశీస్సులతో త్వరలో ఒక సినిమాలో నటిస్తానని ప్రకటించారు.

మీ గుండెల్లో నిద్రపోతా బాబు

కడప: పులివెందులలో గత రాత్రి చిరంజీవి కాన్వాయ్‌పై చెప్పులు, కోడిగుడ్లతో దాడి... తెల్లారేసరికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుపై రాళ్ల దాడి. పులివెందులలోని కోమునూతల గ్రామంలో రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబుపై జగన్ వర్గానికి చెందిన కార్యకర్తలు చెప్పులు, రాళ్లు విసిరి బీభత్సాన్ని సృష్టించారు. ఈ దాడిపై చంద్రబాబు తీవ్ర నిరసనను తెలియజేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఇటువంటి ఉడుత ఊపులకు బెదిరే ప్రసక్తే లేదన్నారు. కడపలో కొంతమంది చిల్లర నాయకులు ఇచ్చిన ప్రేరణతోనే ఇటువంటి దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఈ దాడుల వెనుక ఉన్న నాయకుల గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. తరిమికొట్టడం తమ సంస్కృతి కాదనీ, ప్రజాస్వామ్యంగా మట్టికరిపించడమే తమ సంస్కృతి అని అన్నారు. త్వరలో ఈ దాడులకు కారణమైన నాయకులకు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. సీనియర్ నాయకుడు ఎర్రంనాయుడు మాట్లాడుతూ... పులివెందుల నియోజకవర్గంలో తెదేపా సమావేశాలు సక్సెస్ అవుతున్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఇటువంటి దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. భయభ్రాంతుల్ని చేసి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రిగ్గింగ్‌కు పాల్పడేవారనీ, 85 శాతం ఓట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యేవని మరో తెదేపా నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు.

విషమంగానే అక్బర్ పరిస్థితి

హైదరాబాద్: నాలుగు రౌండ్లు బుల్లెట్లు, తీవ్రమైన కత్తిపోట్లకు గురైన అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఆందోళకరంగానే ఉన్నట్లు సమాచారం. ఎడమ చేతి నుంచి, లోపలి శ్వాస నాళానికి సంబంధించి బ్లాస్ట్ కావడంతో అక్కడ కుట్లు వేశారు. అయితే తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఓవైసీని మెరుగైన వసతులు, మెరుగైన వైద్య పరికారాలకోసం బంజారాలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్బరుద్దీన్ ఆరోగ్యంపై మరో 24 గంటలు దాటే వరకూ ఏమీ చెప్పలేమని వైద్యులు చెపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని అంటున్నారు. మొత్తమ్మీద తాజా దాడులతో పాతబస్తీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలావుండగా ఘటనకు ప్రధాన కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ ఫైయిల్మాన్ తో సహా మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జగన్ సంచలన వ్యాఖ్యలు

కడప: కడప లోక్ సభ స్థానంలోని గుంతపల్లి రోడ్ షోలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, ఆరు నెలలకో, ఏడాదికో ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం వైయస్సార్ సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తోందని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావాలని, అందుకు తమను గెలిపించాలని ఆయన అన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వం మనుగడ సాగించదని తేల్చి చెప్పారు.

ప్రభుత్వం మజ్లీస్ కొమ్ము కాస్తోంది

హైదరాబాద్: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ గన్‌మెన్‌లే తమ మనుషులపై కాల్పులు జరిపారని కాల్పుల ఘటనకు ప్రధాన కారకుడిగా ప్రచారమైన మహ్మద్‌ పహిల్వాన్‌ తెలిపారు. దాడిని తప్పించుకునేందుకు తమ వాళ్లు ప్రతిఘటించినా ప్రాణాపాయం తప్పలేదన్నారు. సంఘటన జరిగిన సమయంలో తాను అసలు అక్కడ లేనేలేనని, కాల్పులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను పరామర్శించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మజ్లీస్ మాఫియా పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం మజ్లీస్ కొమ్ము కాస్తోందని ఆయన అన్నారు. అక్బరుద్దీన్ మనుషుల కాల్పుల్లో గాయపడిన తమవారిలో ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. మజ్లీస్ అక్రమాలను అడ్డుకోవడానికి తాను ప్రయత్నిస్తుండడం వల్లనే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. కాగా,  ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీని మెరుగైన చికిత్స నిమిత్తం కేర్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఆయనకు చికిత్స నిమిత్తం కేర్ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

చంద్రబాబు ప్రచారంలో జగన్ వర్గం దాదాగిరి

కడప: కడప లోకసభ స్థానంలో ప్రచారం సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రచారంలో జగన్ వర్గం దాదాగిరి చేశారు. జగన్ వర్గం ఫాక్షన్ తరహాలో పెట్రేగింది. పులివెందుల శాసనసభా నియోజకవర్గం పరిధిలోని కోమునూతల గ్రామంలో చంద్రబాబు ప్రచారానికి వచ్చినప్పుడు శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోకి రాకుండా చంద్రబాబును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ సమయంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. సంఘటనకు నిరసనగా చంద్రబాబు నాయుడు అక్కడే బైఠాయించారు. కాగా, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వైనంగా కృష్ణాజిల్లా ఇంఛార్జ్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను గ్రహించాలని ఎన్నికల సంఘానికి సూచించారు.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి క్షేమం

న్యూఢిల్లీ: ఆచూకీ తెలియకుండా పోయిన అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం దోర్జి ఖండూ హెలికాప్టర్‌ ఆచూకీ లభ్యమైంది. ఆయన హెలికాప్టర్‌ భూటాన్‌లో దిగినట్లు తెలిసింది. ఆయన క్షేమంగానే ఉన్నారని వైమానిక దళ అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ప్రయాణిస్తున్న పవన్ హన్స్ హెలికాప్టర్ శనివారం కనిపించకుండా పోయింది. ఈ హెలికాప్టర్ తవంగ్ నుంచి ఇటానగర్‌కు శనివారం ఉదయం బయలుదేరింది. తవంగ్ నుంచి ఉదయం పది గంటలకు బయలుదేరిన హెలికాప్టర్ పదకొండున్నర గంటలకు ఇటానగర్ చేరుకోవాల్సి ఉంది. అయితే, ఆ హెలికాప్టర్ ఇటానగర్‌లో దిగలేదు. తవంగ్ సమీపంలోని సేలా పాస్ వద్ద హెలికాప్టర్ నుంచి చివరి సంకేతాలు అందాయి. చాపర్‌లో ముఖ్యమంత్రితో పాటు మరో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రక్షణ మంత్రిత్వ శాఖను కూడా అప్రమత్తం చేశారు. దీంతో ఆందోళన తీరిపోయింది. ఖండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దాదాపు పది గంటల పాటు కనిపించకుండా పోయింది.

అక్బరుద్దీన్ కు తప్పిన ప్రాణాపాయం

హైదరాబాద్: కాల్పుల్లో గాయపడిన అక్బరుద్దీన్ కు ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై వారు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. ఎమ్మెల్యేకు శస్త్రచికిత్స చేసి భుజం, పొట్టలోనుంచి రెండు బుల్లెట్లను బయటకు తీశామని ప్రాణాపాయం లేదని ప్రకటించారు. కాల్పుల్లో స్వల్పంగా గాయపడిన మరో ఎమ్మెల్యే బలాల్ కు ప్రాధమిక చికిత్స చేశామన్నారు. కాగా, అక్బరుద్దీన్ క్షేమం అంటూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ ఆస్పత్రి వద్ద ప్లకార్డు ప్రదర్శించారు. ఘటనలో గాయపడిన కార్పోరేటర్ హవలా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అక్బరుద్దీన్ సోదరుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అక్బరుద్దీన్ ఒవైసీని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, హొం మంత్రి సబిత పరామర్శించారు. ఆస్పత్రికి వచ్చిన ముఖ్యమంత్రిని హత్తుకొని ఎమ్మెల్యే బలాల్ కంటతడిపెట్టారు.

కాల్పుల ఘటనపై అస్పష్టత

హైదరాబాద్ : ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై అహ్మద్ పహిల్వాన్, అతని అనుచరులు ముందుగా కత్తులతో దాడి చేసి అనంతరం కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే కాల్పుల ఘటనపై ఇంకా అస్పష్టత నెలకొనే ఉంది. ముందుగా ఎవరు... ఎవరిపై కాల్పులు జరిపారనే విషయంలో స్పష్టత లేదు. బార్కాస్‌లోని ఓ స్థల వివాదం విషయంలో అక్బరుద్దీన్ శనివారం చాంద్రాయణగుట్టలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన తన వాహనంలో కూర్చొబోతున్న సమయంలో పహిల్వాన్, అతని అనుచరులు కత్తులతో దాడి చేసి తర్వాత నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అక్బరుద్దీన్‌ను చికిత్స నిమిత్తం సంతోష్‌నగర్‌లోని ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. కాగా నిందితులు గుర్రాలపై పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దాడిలో పాల్గొన్న వారిలో పహిల్వాన్ బావమరిది ఇర్ఫాన్‌పై ఎంఐఎం కార్యకర్తలు ఎదురు దాడి చేశారు. మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడి ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దాడి జరిపిన వారిపై అక్బరుద్దీన్ ప్రతిదాడి

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ దాడి ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి మరణించాడు. అక్బరుద్దీన్ పై మహ్మద్ పహిల్వాన్, అతని బామర్డులు, ఇద్దరు మేనల్లుళ్లు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తనపై దాడికి పాల్పడినవారిపై అక్బరుద్దీన్ కాల్పులు జరిపారు. ఎదురు దాడిలో నలుగురు మహ్మద్ పహిల్వాన్ వర్గానికి చెందిన వ్యక్తులు గాయపడ్డారు. వారిని హైదరాబాదులోని యశోదా ఆస్పత్రికి తరలించారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహ్మద్ పహిల్వాన్ బావమరిది ఇర్ఫాన్ మరణించినట్లు చెబుతున్నారు. అతను కాల్పుల్లో గాయపడ్డాడు. ఇర్ఫాన్ తో సహా ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అక్బరుద్దీన్‌పై దాడి ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పాతబస్తీకి పెద్ద యెత్తున పోలీసు బలగాలను తరలించారు. అక్బరుద్దీన్ చికిత్స పొందుతున్న ఓవైసీ ఆస్పత్రి వద్ద మజ్లీస్ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. బార్కాస్‌లో ఇరు వర్గాల మధ్య గొడవ తర్వాత ఘర్షణ జరిగిందని, ఈ ఘర్షణలో ఇర్ఫాన్ గాయపడ్డాడని చెబుతున్నారు. అక్బరుద్దీన్‌పై దాడితో తమకు సంబంధం లేదని ఎంబిటి ప్రకటించింది.

హెచ్చరికలను ఖాతరుచేయని అక్బరుద్దీన్

హైదరాబాద్: హైదరాబాదు పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం పరిధిలోని బార్కాస్ రావద్దని మహ్మద్ పహిల్వాన్ ఇంతకు ముందే హెచ్చరించాడని చెబుతున్నారు. మహ్మద్ పహిల్వాన్ బెదిరింపులను పట్టించుకోకుండా బార్కాస్‌లో పాదయాత్రకు మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ వెళ్లినట్లు సమాచారం. బార్కాస్ ప్రాంతం చిన్న చిన్న సందులు, గల్లీలు ఉంటాయి. దీన్ని అవకాశంగా తీసుకుని మహ్మద్ పహిల్వాన్, అతని అనుచరులు అక్బరుద్దీన్‌పై, హైదరాబాద్ మలక్‌పేట శాసనసభ్యుడు అహ్మద్ బిన్ బలాలపై దాడులు చేసినట్లు చెబుతున్నారు. మహ్మద్ పహిల్వాన్ గత ఎన్నికల్లో ఎంబిటికి మద్దతిచ్చాడు. సల్లావుద్దీన్ ఓవైసీకి మద్దతుదారుగా ఉన్న మహ్మద్ ఆయన కుమారులు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీలతో విభేదించాడు. ఓవైసీని పరామర్శించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఆయనను పరామర్శించారు. చికిత్సపై ఆయన ఆరా తీశారు. అక్బరుద్దీన్‌పై జరిగిన దాడిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అసదుద్దీన్ ఒవైసీకి ఫోన్ చేసి తెలుసుకున్నారు. ప్రజలు సమన్వయంతో వ్యవహరించాలని జగన్ పిలుపునిచ్చారు.

నగరం లో హై అలర్ట్

హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు పాతబస్తీలో హై అలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా ఒవైసీ ఆస్పత్రి సమీపంలో ఉన్న దుకాణాలను మూసివేయించారు. అలాగే ఎంఐఎం పార్టీ నగరం లో బంద్ కు పిలుపునిచ్చింది.  ఆస్పత్రి సమీపంలో భారీగా పోలీసులు మోహరించారు.ఇదిలా ఉండగా ఒవైసీ ఆస్పత్రికి భారీగా అక్బరుద్దీన్ అభిమానులు చేరుకుంటున్నారు. కాగా కాల్పుల ఘటనతో పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. సెలవుపై వెళ్లినవారు తక్షణమే విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే దాడి జరిగిన సంఘటనా స్థలానికి పోలీసులు ఎవరినీ అనుమతించటం లేదు. నగర పోలీస్ కమిషనర్ ఏకేఖాన్ ఒవైసీ ఆస్పత్రికి చేరుకున్నారు.

విజయమ్మపై వివేకా వ్యాఖ్యలు

కడప: పులివెందుల శానససభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి తన ప్రత్యర్థి, వదిన విజయమ్మపై విమర్శలు చేశారు. ఆయన శనివారం తన ప్రచారంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి విజయమ్మపై వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు ఆయన తనను గెలిపించాలని, తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానని చెబుతూ వచ్చారే తప్ప విజయమ్మపై పల్లెత్తు మాట అనలేదు. తన వదిన విజయమ్మను గెలిపిస్తే ఆమె బెంగళూర్‌లో ఉంటారో, హైదరాబాదులో ఉంటారో తెలియదని, ప్రజలకు అందుబాటులో ఉండరని ఆయన అన్నారు. తనను గెలిపిస్తే అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. విజయమ్మను గెలిపిస్తే ఇంచార్జీలను పెడతారని చెప్పారు.