ఆ కేసుల దర్యాప్తు సీబీఐకి అగ్నిపరీక్షే

న్యూఢిల్లీ: ప్రముఖుల కేసుల దర్యాప్తు సీబీఐకి అగ్నిపరీక్ష అని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటుచేసిన సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్యాప్తు సంస్థల్లో సీబీఐకి ప్రత్యేక స్థానం ఉందని, , సీబీఐ తన పనితీరును మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందని అన్నారు. ఎవరికీ భయపడకుండా, దోషులు ఎంతటివారైనా వారిపై సీబీఐ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టాలను ఉల్లంగించేవారు ఎంతటివారైనా సీబీఐ చర్యలు తీసుకోవాలన్నారు. దర్యాప్తు చేస్తున్నప్పుడు అమాయకులను సీబీఐ వేధించకూడదని సూచించారు.

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాల్పులు

హైదరాబాద్ : మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై శనివారం బార్కాస్ వద్ద దుండగులు కాల్పులు జరిపి కత్తులతో దాడి చేశారు. చాంద్రాయణగుట్ట వద్ద ఆయనతో పాటు మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై కూడా దాడి జరిగింది. వీరు పాదయాత్ర చేస్తుండగా ఉదయం 11.15 నిమిషాలకు ఒవైసీపై నాలుగు రౌండ్లు కాల్పులతో పాటు కత్తులతో దాడి చేశారు. ఒవైసీ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్‌ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. మహ్మద్ పహిల్వాన్ అనే వ్యక్తి ఈ కాల్పులు చేయించినట్లు సమాచారం. స్మశాన వాటిక స్థల విషయంలో ఒవైసీకి, మహ్మద్ పహిల్వాన్‌కు మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ సమాచారం అందుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనతో పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది.

సచివాలయానికి పక్షవాతం

ఒంగోలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తన నోటికి మరోసారి పనిచెప్పారు. ‘సచివాలయానికి పక్షవాతం వచ్చింది... ఉప ఎన్నికల తర్వాత సచివాలయం కోమాలోకి వెళ్లిపోతుందంటూ’ వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 19మంది మంత్రులు కడపలో మకాం వేసి రాష్ట్ర ప్రజల గురించి మరిచిపోయారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నా, మనసు మాత్రం కడపలోనే ఉందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను కాంగ్రెస్ తుంగలోకి తొక్కిందని నారాయణ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ పథకాలను 2014 వరకూ కొనసాగించాలన్నారు. మంత్రులకు పదవుల్లో కొనసాగే హక్కు లేదని ఆయన అన్నారు. పథకాలను కొనసాగించలేకపోతే మంత్రులు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజల విశ్వాసం పొందాలని సవాల్ విసిరారు. తెలంగాణలో ఇతర పార్టీలను లేకుండా చేయటం కేసీఆర్ తాత తరం కూడా కాదని నారాయణ ఎద్దేవా చేశారు. ముందు కేసీఆర్ తన ఉనికిని కాపాడుకోవాలని సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు కాడని ఆయన అన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా ఇంకా కొనసాగుతోందని, మైనింగ్ మాఫియాను ప్రభుత్వం అరికట్టాలని అన్నారు. కడప ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులదే విజయమని ఆయన దీమా వ్యక్తం చేశారు.

పట్టువీడని పైలట్లు

న్యూఢిల్లీ : ఎయిరిండియాలోని ఓ వర్గం పైలట్లు చేపడుతున్న సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరింది. విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న యాజమాన్యం అల్టిమేటం జారీ చేసినా సమ్మెను విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. పైలట్ల సమ్మెతో ఎయిరిండియాకు రూ.26 కోట్ల నష్టం వాటిల్లింది. నలభై వేలమంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా 280 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఏఐలోని ఇతర పైలట్లతో సమానంగా తమకు వేతనాలు చెల్లించాలంటూ ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్(ఐసీపీఏ)కు చెందిన దాదాపు 800 మంది పైలట్లు సమ్మె చేస్తుండటం తెల్సిందే. కాగా,  పైలట్లు చేస్తున్న సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. పైలట్లతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని సీపీఎం డిమాండ్ చేసింది. కాగా సమ్మె కారణంగా వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పేర్కొంది.

ప్రలోభాలకు లోనైతే దొంగల రాజ్యమే

కడప: కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల ప్రలోభాలకు లోనై ఓట్లు వేస్తే దొంగల రాజ్యం వస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలకు నిలయంగా మారిన ఆ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కడప ప్రజలు పౌరుషానికే కాదు నీతి, నిజాయితీకి ఆదర్శంగా నిలుస్తారన్న భావన దేశ వ్యాప్తంగా చాటాలని బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం, పోరుమామిళ్ల మండలాల్లో బాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు కంకణ బద్దులవ్వాలన్నారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయడంతో పాటు నేతలను సైతం కొనుగోలు చేస్తున్న ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. ఆయన తన పార్టీలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని మీ పార్టీలో ఎలా చేర్చుకుంటారని జగన్‌ను చంద్రబాబు నిలదీశారు. ఎమ్మెల్యేలకు ధైర్యముంటే తమ పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 సంవత్సరాల్లో సామాన్యుడి ఆదాయం పెరగలేదని, కానీ కాంగ్రెస్ నేతల ఆదాయం మాత్రం భారీగా పెరిగిందన్నారు. కడప జిల్లాలో మొదటి నుండి బిసి, ఎస్సీ, ఎస్టీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని, ఇప్పుడు కూడా అండగా నిలవాలని ఆయన కోరారు. ‘మీరు మీ వరకు నాకు ఎంతో చేయూతనిచ్చారు, ఈ రుణం తీర్చుకోలేనిది, భవిష్యత్తులో ఈ వర్గాలకు ఎంతో సహాయం చేస్తాను’ అని బాబు భరోసా ఇచ్చారు. బిజెపితో తాము సంబంధాలు కొనసాగించే ప్రసక్తే లేదన్నారు. 100 శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చినా తాము బిజెపితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదన్నారు. ఎంపీగా గెలిచిన జగన్మోహన్‌రెడ్డి పార్లమెంటులో నోరుమెదపలేదని, కానీ మైసూరారెడ్డి 900 సార్లు పార్లమెంటులో ఫిర్యాదులు చేశారన్నారు. మైసూరా లాంటి వ్యక్తిని ఎన్నుకుంటే కడప ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు.

కాటసాని, శోభా నాగిరెడ్డికి నోటీసులు

హైదరాబాద్: ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డికి ఉప సభాపతి నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్‌పై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు వేయాలని ప్రజారాజ్యం శాసనసభాపక్ష విప్‌ వంగా గీత, తదితరులు ఇటీవల డిప్యూటీ స్పీకర్‌కు పిటిషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దాన్ని ఆధారం చేసుకుని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉప సభాపతి నోటీసులు జారీ చేశారు. ఆ ఇద్దరితో కలుపుకుని ఇప్పటివరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఉప సభాపతి నోటీసులు ఇచ్చారు.

బిజెపితో దోస్తీపై జగన్ సమాధానం చెప్పాలి

హైదరాబాద్: బిజెపితో దోస్తీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమాధానం చెప్పాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. అలాగే వై.ఎస్.జగన్ అవినీతిపై బీజేపీ ఎందుకు మాట్లాడదని డీఎస్ ప్రశ్నించారు. వైయస్ జగన్ బిజెపితో దోస్తీకి సిద్ధంగా ఉన్నారనే విషయం బిజెపి నేత సిహెచ్. విద్యాసాగర రావు మాటల ద్వారా కూడా తెలుస్తోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కడప, పులివెందుల లోక్ సభ ఉప ఎన్నికలను మామూలు ఎన్నికల లాగానే పరిగణిస్తున్నామని, వాటికి ఏ విధమైన ప్రత్యేకత లేదని ఆయన అన్నారు. ఆధారాలు లేకుండా తమ పార్టీ శాసనసభ్యులపై చర్యలు ఉండవని, ఆధారాలు ఉన్నాయి కాబట్టే నలుగురు శాసనసభ్యులకు షోకాజ్‌లు ఇచ్చామని, షోకాజ్‌లకు వారి నుంచి వివరణలు వచ్చాయని ఆయన చెప్పారు. వైయస్ జగన్ అనాలోచిత నిర్ణయం వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని, ఎవరి మీదా కుట్ర చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు.

సూరి హత్య కేసులో చార్జిషీటు

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నగర సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సూరి హత్యకు కేవలం ఆర్ధిక, భూ లావాదేవీలే ప్రధాన కారణమని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు సూరితో పాటు మొత్తం ఐదుగురిని నిందితులుగా చేర్చారు. ఈ ఏడాది జనవరి 3న యూసఫ్‌గూడ సమీపంలోని మధురానగర్ వద్ద సూరి దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగి దాదాపు మూడు నెలల దాటిన తర్వాత సిసిఎస్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. కేసు దర్యాప్తు సిసిఎస్ నత్తనడకన సాగిస్తోందన్న విమర్శల మేరకు దర్యాప్తును ఇటీవలే సిసిఎస్ నుంచి సిఐడికి బదిలీ చేస్తూ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. సిఐడి అధికారులు ఇంకా దర్యాప్తును పూర్తి స్ధాయిలో చేపట్టలేదు. దీంతో మొదట దర్యాప్తు చేసిన సిసిఎస్ పోలీసులే తొలి చార్జిషీట్ దాఖలు చేయాలని ఇటీవల జరిగిన ఉన్నత స్ధాయి సమీక్షలో నగర పోలీసు కమీషనర్‌ను డిజిపి ఆదేశించడంతో సిసిఎస్ అధికారులే ఏడో అదనపు మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ పరారీలో ఉండగా, అతనికి సహకరించిన మన్మోహన్‌సింగ్, సుబ్బయ్య, హరి, ఆవుల వెంకటరమణలను అరెస్టు చేసినట్లు సిసిఎస్ పోలీసులు కోర్టుకు వివరించారు. సిఐడి దర్యాప్తు చేపట్టిన తర్వాత మరిన్ని వివరాలతో మరో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి.

జగన్‌ను నిలదీసిన ఉండవల్లి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని సమర్థించేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదంటూ కొత్తరాగం ఆలాపించటం వెనుక ఉన్న మతలబేమిటో వివరించవలసిందిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజమంత్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. తగినంత సంఖ్యాబలం సమకూరినప్పుడు సోనియాగాంధీని సమర్థించి మంత్రి పదవులు దక్కించుకుంటానని జగన్ చెప్పినట్లు ఒక జాతీయ పత్రికలో వచ్చిన వార్తను ఉండవల్లి ప్రస్తావిస్తూ ఈ డిమాండ్ చేశారు. సోనియాగాంధీని బలపరిచి రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనే ఉంటే పార్టీకి రాజీనామా చేయవలసిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. బిజెపికి మద్దతు ప్రకటించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్టు ఒక పక్క ప్రచారం జరుగుతున్న తరుణంలో తాజాగా ఈ కొత్త ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. చనిపోయేంత వరకూ లౌకికవాదానికి, కాంగ్రెస్‌కే అంకితమైన రాజశేఖరరెడ్డి తనయుడైన జగన్ తండ్రి వ్యవహరించిన తీరుకు పూర్తి విరుద్ధంగా నడుస్తున్నారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. కాగా రాజకీయంగా తనకు ఉన్నత స్థానాలను కల్పించిన కాంగ్రెస్‌ను విడిచిపెట్టే ప్రసక్తిలేదని ఆయన తెలిపారు. బాబాయి వివేకానందరెడ్డికి మంత్రి పదవి లభించిన వెంటనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయటం జగన్‌కు సబబా? అని ఆయన ప్రశ్నించారు. తనను ఊసరవిల్లిగా అభివర్ణిస్తూ జగన్‌కు చెందిన ప్రచారసాధనాలు చేసిన ప్రచారానికి ఆయనే బాధ్యత వహించక తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. రాజకీయాల్లో లేకుండా ఉంటే తనపై బురదజల్లుతున్న వారిని ఉపేక్షించేవాడిని కాదని ఆయన అన్నారు.

జగన్ పై చిరు ఎటాక్

కడప: కడప ఉపఎన్నికల గడవు సమీపిస్తున్నకొద్దీ నేతల సందడి ఎక్కువైంది. కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరపున పీఆర్పీ చీఫ్ చిరంజీవి మరోవైపు వైఎస్ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చిరంజీవి కడప నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటూ పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తండ్రి పార్థీవ శరీరాన్ని కూడా తరలించక ముందే అధికారం కోసం అర్రులు చాచిన జగన్‌ను ఓడించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సోనియా గాంధీ కాస్త ఓపిక పట్టమని చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టి పార్టీపై తిరుగుబాటు చేసి రాష్ట్రంలో అనిశ్చితి పరిస్థితికీ, ఈ ఎన్నికలకు జగన్ కారణమయ్యాడంటూ విమర్శించారు. కడప ప్రజలు ఓట్లుకు అమ్ముడుపోతారంటూ కొంతమంది చేస్తున్న వాదనలన్నిటిపైనా చెంపదెబ్బ కొట్టి కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయాన్ని అందించాలన్నారు. కాగా,  చిరంజీవి ప్రసంగిస్తున్న వాహనంపైకి కొంతమంది గుర్తు తెలియని కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. ఓ చెప్పు చిరంజీవి ప్రక్కనే ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డికి తగిలింది. ఈ దాడితో పులివెందులలోని పూల అంగడి సెంటర్లో ఆగకుండా నేరుగా వెళ్లిపోయారు చిరంజీవి. ఆ తర్వాత రాజుపాలెం మండలం తొండలదిన్నెలో డీఎల్ రవీంద్రా రెడ్డి మాట్లాడుతుండగా ఆయనపై చెప్పులు విసిరారు. చిరంజీవి మాట్లాడితే ఓట్లు రావంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు పెద్దపెట్టు నినాదాలు చేశారు. మొత్తమ్మీద ఉద్రిక్తతల నడుమ చిరంజీవి రోడ్ షో సాగుతోంది. పలుచోట్ల అడ్డంకులు ఎదురవుతుండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

బాలచందర్‌కు ఫాల్కే పురస్కారం

న్యూఢిల్లీ:  ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు, నిర్మాత కె.బాలచందర్‌ (81)ను కేంద్ర ప్రభుత్వం 2010 సంవత్సరానికిగాను దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసింది. సినిమా రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులకు ప్రతి ఏటా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందచేస్తున్న సంగతి తెలిసిందే. 1970లలో తమిళ సినిమా రంగంలో నూతన ప్రయోగాలకు అంకురార్పణ చేసి పరిశ్రమను కొత్త పథంలో నడిపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాలచందర్‌. 1930లో తంజావూర్‌ జిల్లాలో జన్మించిన బాలచందర్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ర్యాలయంలో పనిచేస్తూ కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం సినీ దర్శకుడిగా వినూత్న కథలతో చిత్రాలు నిర్మించారు. ఎంజిఆర్‌ చిత్రం 'దైవతా యి'తో సంభాషణల రచయితగా కెరీర్‌ ప్రారంభించిన బాలచందర్‌ తరువాత పరిశ్రమలోని ఆ తరం పెద్ద నటులు ఎవరితోనూ పని చేయకపోవడం గమనార్హం. బాలచందర్‌ను 1987లో కేంద్రప్రభుత్వం 'పద్మశ్రీ'తో సత్కరించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుండి పలు పురస్కారాలను ఆయన అందుకున్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం కింద స్వర్ణకమలం, రూ.10 లక్షల నగదు, శాలువతో ప్రభుత్వం సత్కరించనుంది. కె బాలచందర్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు కె చిరంజీవి వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు. బాలచందర్‌ అరుదైన గొప్ప దర్శకుడని, ఎన్నో ఆఫ్‌బీట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా ప్రతిభావంతులైన నటీనటులను గుర్తించి సినీరంగానికి పరిచయం చేసి భారత చలనచిత్రరంగ ప్రమాణాలను పెంచారని కొనియాడారు. భవిష్యత్తులో బాలచందర్‌ ఎన్నో అవార్డులు అందుకోవాలని వారు ఆకాంక్షించారు.

గాలికి సుప్రీం షాక్

న్యూఢిల్లీ: కర్ణాటక అక్రమ మైనింగ్ 'ఘనుల'కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బళ్లారి-హోస్పేట ప్రాంతంలోని 19 ఇనుప ఖనిజం మైనింగ్ లీజులను సుప్రీం కోర్టు నిలిపేసింది. వీటిలో కర్ణాటక పర్యాటక మంత్రి గాలి జనార్దనరెడ్డి భార్య అరుణ భాగస్వామిగా ఉన్న కేపీ పార్వతమ్మ మైనింగ్ కంపెనీ సహా ఆయన పరోక్షంగా మైనింగ్ నిర్వహిస్తుంటారనే ఆరోపణలున్న పలు ఇతర కంపెనీ లూ ఉన్నాయి. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ అక్కడ తవ్వకాలూ జరపరాదని సుప్రీం కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే తవ్విన ఖనిజం తరలింపును సైతం నిషేధించింది. బళ్లారి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) రెండు నివేదికలను సమర్పించింది. వీటి ఆధారంగా సుప్రీం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. "తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆ 19 గనుల్లో ఎలాంటి తవ్వకాలూ జరపకూడదు. ఇప్పటికే తవ్విన ఖనిజాన్ని తరలించకూడదు'' అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా నేతృత్వంలోని ప్రత్యేక అటవీ బెంచ్ ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ బెంచ్‌లో జస్టిస్ అఫ్తాబ్ ఆలం, కేఎస్ రాధాకృష్ణన్ కూడా ఉన్నారు. ఈ కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడి మైనింగ్ నిర్వహిస్తున్నాయంటూ సీఈసీ ఏప్రిల్ 15న సమర్పించిన నివేదికలో పేర్కొంది. మైనింగ్ సందర్భంగా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు సీఈసీ తన మూడు, నాలుగో నివేదికల్లో పేర్కొన్న మరో 68 లీజుదారుల విషయాన్ని తదుపరి విచారణ సందర్భంగా పరిశీలిస్తామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వారిలో దాదాపు 30 మంది లీజు హోల్డర్లు కర్ణాటక హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొందారని ధర్మాసనం తెలిపింది. ఆ సంస్థలపై బదలాయింపు పిటిషన్‌ను దాఖలు చేయాలని అమికస్ క్యూరీ ఏడీఎన్ రావును బెంచ్ కోరింది. ఆ తర్వాత వాటి గురించి నిర్ణయం తీసుకుంటామని పే ర్కొంది. మిగిలిన 68 లీజులనూ నిలిపేయాలన్న విజ్ఞప్తిని తిరస్కరిస్తూ.. "ఒకరిని మైనింగ్‌కు అనుమతిస్తూ, మరొకరిని నిలిపేస్తూ రెండు సమాంతర ఉత్తర్వులు ఉండవు. మేం వారందరినీ పిలిచి ఖాళీ చేయమని అడగాల్సి ఉంది'' అని బెంచ్ తెలిపింది. ఈ విషయంలో అందరి అభిప్రాయాలూ తీసుకుంటామని కోర్టుకు హా జరైన మైనింగ్ కంపెనీలు, వాటి సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చింది. అదే సమయంలో సీఈసీ ఎలాంటి మధ్యంతర దరఖాస్తునూ దాఖలు చేయనందున మైనింగ్ లీజులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వరాదని వారు చేసిన విజ్ఞప్తిని బెంచ్ నిరాకరించింది. దీనిపై.. సీఈసీ నివేదికను మధ్యంతర దరఖాస్తుగా మార్పు చేస్తామని తెలిపింది. సమాజ్ పరివర్తన్ సముదాయ అనే స్వచ్ఛంద సంస్థ తన వాదనలు వినిపిస్తూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అక్రమ మైనింగ్‌ను నిరోధించలేక పోవడంతో స్థానిక ప్రజలు ప్రత్యేకించి గ్రామీణ పేదల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. అక్రమ మైనింగ్ వల్ల 1100 హెక్టార్ల అటవీ భూమి కబ్జా అయిందని తెలిపింది. సుప్రీం కోర్టు నిలిపేసిన మై నింగ్ లీజుల్లో ఎస్‌బీ మినరల్స్, మునీర్ ఎంటర్‌ప్రైజెస్, ట్రైడెంట్ మినరల్స్, వీయమ్, ఆదర్శ ఎంటర్‌ప్రైజెస్, స్పార్క్‌లైన్ మైనింగ్, వీఎస్ఎల్ మైనింగ్ కంపెనీ, కతికేశ్వర్ మైనింగ్ అండ్ ఐరన్ ఓర్, మిత్ర మినరల్ ఎంటర్‌ప్రైజెస్, కేపీ పార్వతమ్మ మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది.  ఐరన్ ఓర్ అనేది కేంద్రం పరిధిలో ఉంటుందని, కనుక తాము వాటిని నిలిపివేయలేమని చెప్పారు. ఇందుకు బెంచ్ ప్రతిస్పందిస్తూ.. అక్రమ మైనింగ్‌ను మీరు నిలిపేయలేకపోతే.. మేం నిలిపేస్తాం. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తాం'' అని ప్రతిస్పందించింది. చెల్లుబాటయ్యే పర్మిట్ లేకుండా 2003 నుంచి 2010 మధ్య ఈ ప్రాంతం నుంచి 15,245 కోట్ల రూపాయలు విలువ చేసే 304.91 లక్షల టన్నుల ఐరన్ ఓర్ తరలిపోయిందని సీఈసీ తన నివేదికలో పేర్కొంది. లోకాయుక్త దీనిపై నివేదిక ఇచ్చినా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకోలేక పోయిందని తెలిపింది.

జగన్ తో పొత్తుకు నో చెప్పిన కిషన్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తో తమ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వైయస్ జగన్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ స్పష్టీకరణ చేశారు. అంతర్గత కుమ్ములాటలను తమపై రుద్దవద్దని, ఒకటి వైయస్సార్ కాంగ్రెసు అయితే మరోటి సోనియా కాంగ్రెసు అని, రెండు కూడా కాంగ్రెసు పార్టీలేనని, వాటితో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. తాము రాష్ట్రంలో ఒంటరిగానే ఎదగాలని అనుకుంటున్నామని, మరో పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు. తమ పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించి కడప ఉపఎన్నికల్లో లబ్ధిపొందాలని కొన్ని పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. కడపలో తమకు తగిన బలం లేకపోవడంతోనే ఎన్నికలకు దూరంగా ఉన్నామని ఆయన తెలిపారు. అంతమాత్రాన తమ పార్టీని కించపర్చే విధంగా మాట్లాడటం సరికాదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ముస్లీం, మైనార్టీలంతా తమవైపే ఉన్నారని ప్రేమ ఒలకపోసే కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో డీఎస్‌ ఎందుకు ఘోరంగా ఓటమి పాలయ్యారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కడప ఎన్నికల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టి, ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఆయన కోరారు.

వైభవంగా విలియమ్ - కేట్ల పెళ్లి

లండన్: బ్రిటన్ యువరాజు విలియమ్స్, కేట్ మిడిల్‌టన్‌ల వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది.  వెస్ట్ మినిస్టర్ ఎబే చర్చిలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక జరిగింది. కేట్ వేలికి ఐరిష్ గార్డ్ యూనిఫామ్ లో ఉన్న విలియం ఉంగరం తొడిగారు. కేట్ తెల్లటి లేస్ గౌను ధరించారు. వీరిద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విలియమ్ కంటే కేట్ ఆరు నెలల పెద్ద. కేట్ డయానాకు తగిన కోడలని అందరూ ప్రశంసిస్తున్నారు. యువరాజుకు శుభాకాంక్షలు చెప్పడానికి బకింగ్ హ్యామ్ ప్యాలెస్ నుండి వెస్ట్ మినిస్టర్స్ ఎబె చర్చ్ వరకు బ్రిటన్ ప్రజలు బారులు తీరారు. ఈ వివాహ వేడుకకు దేశవిదేశాల నుంచి 1900 మంది అథిధులు హాజరైయ్యారు. లండన్'లో పండుగ సందడి నెలకొంది. యువరాజు పెళ్లి సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం సెలవు దినంగా అధికారికంగా ప్రకటించింది.  సెంట్రల్ లండన్'ని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఈ వేడుక జరుగుతుంది. 30 ఏళ్ల తరువాత ఈ రాజ కుటుంబంలో జరిగిన పెళ్లి ఇది. ఈ పెళ్లికి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. విలియమ్స్, కేట్‌ల వివాహాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది చూశారని అంచనా.

జగన్ హామీల మీద హామీలు

కడప: మన ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకుందామని, వైయస్ రాజశేఖర రెడ్డి స్వర్ణయుగాన్ని సాధించుకుందామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప లోక్ సభ అభ్యర్థి వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. సిగ్గు లేకుండా కాంగ్రెసు పార్టీ తనపై రోజుకో అభాండం వేస్తుందని  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం కొత్తపల్లి, తదితర గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. మంత్రులు తనను, తన తల్లిని ఓడించడానికి డబ్బు సంచులు పట్టుకుని తిరుగుతున్నారని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూమి లేని ప్రతి పేదవానికి భూమిని కేటాయిస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తామన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా వ్యవసాయం సాగు చేసుకునేలా చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు.