కొండా సురేఖకు హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు కొండా సురేఖకు గురువారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురయింది. ఎమ్మెల్యే అనర్హత విషయంలో నిర్ణయం తీసుకునేందుకు డిప్యూటీ స్పీకర్‌కు అన్ని అధికారాలు ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. తనపై అనర్హత వేటువేసే అధికారం డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేదని కొండా సురేఖ హైకోర్టుకు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి స్పందించిన కోర్టు ఉపసభాపతికి ఆ అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు తుది తీర్పుకు లోబడే డిప్యూటీ స్పీకర్ నిర్ణయం ఉంటుందని చెప్పింది. సురేఖ వేసిన గడువు పెంపు అంశాన్ని కూడా కోర్టు నిరాకరించింది. కాగా కాంగ్రెసు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కొండా సురేఖపై కాంగ్రెసు ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

జగన్ కు వెంకయ్యనాయుడు ఝలక్

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు గురువారం మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన వ్యాఖ్యల ద్వారా ఝలక్ ఇచ్చారు. బిజెపితో కలవనని ఒకవేళ కలవాలనుకుంటే ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ తీసుకు వస్తానని బుధవారం తన ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే పలు మీడియా సంస్థలు జగన్ వ్యాఖ్యలను ప్రముఖంగా టెలికాస్ట్ చేయడంతో జగన్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలకు బిజెపి ఘాటుగానే స్పందించినట్టుగా కనిపిస్తోంది. గురువారం విలేకరుల సమావేశంలో వెంకయ్యనాయుడు తమ పార్టీ మత ప్రాతిపదికన రిజర్వేషన్‌లకు వ్యతిరేకమని చెప్పారు. దేశంలో అన్ని మతాలను సమానంగా చూస్తామని, ఏ ఒక్క మతానికో ప్రాధాన్యత కల్పించే పరిస్థితికి తమ పార్టీ వ్యతిరేకం అని స్పష్టం చేశారు.

జగన్ పార్టీ గెలిచే అవకాశాలు లేవు

కడప: వైయస్ జగన్ పార్టీ గెలిచే అవకాశాలు లేవని, జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో లక్ష కోట్ల రూపాయలు సంపాదించి తన తనయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టారని ఆయన గురువారం తన ప్రచారంలో భాగంగా జమ్మలమడుగులో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా లేదా కానీ జగన్‌కు మాత్రం ఊరూరా కోట్లాది రూపాయల విలువ చేసే ఇళ్లు ఉన్నాయని ఆరోపించారు. బిజెపితో పొత్తు ఉంటుందని చెప్పకనే చెప్పారని అన్నారు. కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో సంబంధాలు పెట్టుకొని బిజెపితో లాలూచి పడుతున్నారని ఆరోపించారు. అసమర్థ కాంగ్రెసు పార్టీ, అవినీతి జగన్‌కు ఓటు వేయవద్దని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.

బాబా వీలునామా రాయలేదన్న ట్రస్ట్

అనంతపురం: బాబా పేర ఎలాంటి ఆస్తులు లేవని, ఎలాంటి వీలునామాలు లేవని, బాబాకు భక్తులు మాత్రమే ఉన్నారని ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్టు సభ్యులు మద్రాసు శ్రీనివాసన్ వెల్లడించారు. అన్ని ఆస్తులు ట్రస్టు పేరు మీదే ఉన్నాయని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఇక వీలునామా ప్రస్తావన ఎందుకు వస్తుందని చెప్పారు. బాబా ఆస్తిపాస్తుల వంటి భవబంధాలు లేని వ్యక్తి అని వారు వివరించారు. సత్యజిత్‌కు తనకూ ఎటువంటి విభేదాలూ లేవని రత్నాకర్ ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. సత్యజిత్ కేవలం ట్రస్టు ఉద్యోగి మాత్రమేనని, అతనిని ట్రస్టులోకి తీసుకునే ఉద్దేశం లేదని, బాబా కూడా అటువంటి ఉద్దేశాన్ని ఎన్నడూ వ్యక్తీకరించలేదని ఆయన వివరించారు. ట్రస్టు ఛైర్మన్‌గా ట్రస్టు సభ్యులలో ఒకరిని ఎన్నుకోనున్నామని వారు చెప్పారు. బాబా ఆజ్ఞతోనే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించానని ఒక ప్రశ్నకు సమాధానంగా రత్నాకర్ చెప్పారు. ఆదికేశవులునాయుడు కేవలం బాబాకు భక్తుడు మాత్రమే అని అన్నారు. ఆయనకు ట్రస్టుతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ట్రస్టులో తమిళుల ఆధిపత్యం లేదన్నారు. బాబా నియమించిన వారే ట్రస్టులో ఉన్నారని చెప్పారు. బాబా ఆరోగ్యం గురించి మీడియాలో వచ్చిన కథనాలు వాస్తవ విరుద్ధమైనవని వారు పేర్కొన్నారు. బాబా ఆరోగ్యం గురించి రకరకాల కథనాలు ప్రచురించిన ఒక పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాగానంద్ వెల్లడించారు. ట్రస్టునుంచి బంగారం తరలించారన్న ఆరోపణలలో నిజం లేదని శ్రీనివాసన్ చెప్పారు. గతంలో ట్రస్టు ఆవరణలో జరిగిన హత్యలపై అడిగిన ప్రశ్నలకు ఆ హత్యలపై ప్రభుత్వం ఎప్పుడో దర్యాప్తు జరిపిందని ఆయన వివరించారు. శవపేటిక వివాదంతో ట్రస్టుకు సంబంధం లేదని కూడా ఆయన చెప్పారు. షిర్డీ తరహాలో అఖండ జ్యోతిని ఏర్పాటు చేసే విషయంతో పాటు బాబా సమాధిని దర్శించుకునే విజ్ఞప్తులను పరిశీలిస్తామని బాబా సోదరుడి తనయుడు రత్నాకర్ చెప్పారు. ఇప్పటి వరకు బాబాకే చెక్ పవర్ ఉందని ఇకముందు చెక్ పవర్ ఎవరికి ఉండాలో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చెక్ పవర్ ఇద్దరికి ఉండాలని తాను సూచిస్తానని రత్నాకర్ చెప్పారు.  ఇప్పటివరకూ బాబా నియమించినవారే ట్రస్టు వ్యవహారాలు చూశారని ట్రస్టు సభ్యులు వివరించారు. కేవలం కార్యదర్శిగా మాత్రమే ఉండడంవల్ల ఇప్పటివరకూ తాను మీడియా ముందుకు రాలేదని ఈ సమావేశంలో పాల్గొన్న చక్రవర్తి వివరించారు.

దుష్ప్రచారం వెనుక పెద్ద కుట్ర

పుట్టపర్తి: భగవాన్ శ్రీ సత్యసాయి ట్రస్టు కార్యకలాపాలపై సాగుతున్న దుష్ప్రచారం పట్ల ఆ ట్రస్ట్ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. ఈ దుష్ప్రచారం వెనుక పెద్ద కుట్ర ఉందని సభ్యులు ఆరోపించారు. ఇరవై ఏళ్ల తర్వాత గురువారం శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు తొలిసారి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు శ్రీనివాసన్, రత్నాకర్, చక్రవర్తి తదితరులు మాట్లాడుతూ.. సత్యసాయి ట్రస్టు కార్యకలాపాలపై దుష్ప్రచారం జరగడం వెనుక కొన్ని స్వార్థపర శక్తుల కుట్ర దాగి వుందని ఆరోపించారు. ట్రస్టు సభ్యుడు మద్రాసు శ్రీనివాసన్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయిబాబా సెంట్రల్ ట్రస్టు కార్యకలాపాలపై, దానికి ఉన్న ఆస్తులపై ఆయన సవివరమైన ప్రకటన చేశారు. బాబా ఆరోగ్యంపై తాము దృష్టి పెట్టామని, బాబా అనారోగ్యం కారణంగానే తాము ఇంత కాలం మీడియాతో మాట్లాడలేకపోయామని ఆయన అన్నారు. ట్రస్ట్ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చట్ట ఉల్లంఘనకు తావులేదని స్పష్టం చేశారు. ట్రస్టు చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమాలు ఇకపై కూడా కొనసాగుతాయని, నిర్వహణలో గోప్యత ఏదీ ఉండదని వివరించారు. ట్రస్ట్ ఆదాయం ఖర్చుల వివరాలను ఎప్పటికపుడు ఆడిటింగ్ చేస్తామన్నారు. వీటిని ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆడిటింగ్ సంస్థ తనిఖీ చేస్తోందన్నారు. ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని చెప్పారు. ఇకపోతే.. ట్రస్ట్ సభ్యుల్లో ఎలాంటి విభేదాలు లేవని అందరం ఐక్యంగానే ఉన్నట్టు చెప్పారు. ట్రస్ట్ సారథి ఎవరన్న విషయంపై ట్రస్ట్ తదుపరి సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. అలాగే, ట్రస్ట్ వ్యవహారాల్లో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేదని ఆయన చెప్పారు. అంతకుముందు సత్యసాయి నిర్యాణంపై ట్రస్ట్ బోర్డు సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇతపోతే సత్యసాయి ట్రస్ట్ ఏడాది వ్యయం రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటుందని శ్రీనివాసన్ వెల్లడించారు. అలాగే సత్యసాయి మెడికల్ ట్రస్టుకి ఏటా రూ.100 నుంచి రూ.130 కోట్ల వరకూ విరాళాలు అందుతున్నాయని చెప్పారు. సత్య సాయి ట్రస్టు చేపట్టిన మంచినీటి ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ దేశ, విదేశాల నుంచి వచ్చే విరాళాలతో సాగుతున్నాయని ఆయన అన్నారు. తాము ఏ విధమైన చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్తులను వాణిజ్య కార్యకలాపాలకు వాడడం లేదని, కేవలం సేవా కార్యక్రమాలకు మాత్రమే వాడుతున్నామని ఆయన చెప్పారు. తాము కొన్న భూములకు లెక్కలు, రశీదులు ఉన్నాయని ఆయన చెప్పారు. ట్రస్టుకి విరాళాలు కావాలని సత్యసాయి బాబా ఏనాడు భక్తులను కానీ, మరెవ్వరిని కానీ కోరలేదని తెలిపారు. సత్య సాయి బాబా కోసం తాము శవపేటికకు ఆర్డర్ ఇవ్వలేదని, ఓ భక్తుడు ఆర్డర్ ఇచ్చాడని శ్రీనివాసన్ చెప్పారు. ఈ విషయంపై అనుబంధ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.

పోచారం రాజీనామా ఆమోదం

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పోచారం శ్రీనివాసరెడ్డిని శాసనసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలంటూ తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన కొట్టిపారేశారు. పోచారం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినందున అనర్హునిగా ప్రకటించాల్సిన అవసరం లేదని నాదెండ్ల మనోహర్  అభిప్రాయపడినట్టు సమాచారం. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆయన తెదేపాకు పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. తెరాసలో చేరిన తర్వాత శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో పోచారంపై అనర్హత వేటు వేయాలని తెదేపా డిప్యూటీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

శక్తివంతమైన వ్యక్తిగా సత్యజిత్

పుట్టపర్తి : పుట్టపర్తి సత్య సాయిబాబా అస్పత్రిలో చేరడంతో సత్యజిత్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆయనను వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఆయన ఎవరు, సత్య సాయి బాబాకు ఎలా దగ్గరయ్యారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు నేతృత్వం వహించే స్థాయి రావడం వెనక ఉన్న నేపథ్యం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. తమిళనాడుకు చెందిన సత్యజిత్ పుట్టపర్తి విద్యాసంస్థలోనే ఎల్‌కెజి నుంచి ఎంబిఎ వరకు చదివారు. గత పదేళ్లుగా ఆయన సత్య సాయి బాబాతో ఉంటున్నారు. 2003 జూన్ 4వ తేదీన సత్య సాయిబాబా బాత్రూంలో పడిపోయిన సంఘటన వారిద్దరి మధ్య బంధాన్ని పటిష్టం చేసింది. చికిత్స జరుగుతున్నప్పుడు 24 గంటలూ బాబాను అంటి పెట్టుకునే ఉన్నారు. బ్రహ్మచారి అయిన సత్యజిత్ బాబాతో పాటు యజర్ మందిర్‌లోనే ఉండేవాడు. బయటకు వెళ్లినప్పుడు కూడా బాబా వెంటే ఉండేవారు. దీంతో అనతి కాలంలోనే ప్రశాంతి నిలయంలో సత్యజిత్ శక్తివంతమైన వ్యక్తిగా మారిపోయారు. సత్య సాయిబాబాకు గంజిలో నిద్ర మాత్రలు ఇచ్చేవారని, ఇందులో సత్యజిత్ కుట్ర ఉందని, దాంతో సత్య సాయిబాబా ఆరోగ్యం చెడిపోయిందని, ఆరోగ్యం చెడిపోయినా బాబాకు వైద్య సేవలు అందించలేదని బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో సత్యజిత్‌కు వ్యతిరేకంగా ఆశ్రమవాసులు, భక్తులు స్పందించడం ప్రారంభించారు. పుట్టపర్తి సత్య సాయి బాబా పార్ధివ దేహాన్ని ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాల్లో సమాధి చేస్తారని వార్తలు వెలువడిన వెంటనే కుల్వంత్ అంటే ఏమిటి, ఆ పేరు ఎలా వచ్చిందనే ఆసక్తి ప్రారంభమైంది. సాయి కుల్వంత్ అలియాస్ కుల్వంత్ రాయ్ న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఔరంగజేబ్ లేన్ నివాసి అయిన కుల్వంత్ రాయ్ న్యూఢిల్లీలోని శ్రీ సత్య సాయి సంస్థ రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేసేవారు. సత్య సాయి బాబా భక్తుడైన కుల్వంత్ 1993 - 94లో బాబా ప్రవచనాలు ఇవ్వడానికి, భక్తులను దీవించడానికి ప్రశాంతి నిలయం ఆవరణలో అద్భుతమైన హాల్‌ను నిర్మించారు. ఆ హాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత దానికి సత్య సాయి బాబా సాయి కుల్వంత్ అని పేరు పెట్టారు. ఢిల్లీలో ఉన్నప్పుడు సత్య సాయి బాబా కుల్వంత్ నివాసంలోనే ఉండేవారు. ఆ తర్వాత 11 ఏళ్లకు సత్య సాయి బాబా 2010 ఏప్రిల్ 9వ తేదీన కుల్వంత్ ఇంటికి వెళ్లారు. కుల్వంత్ కుటుంబ సభ్యులను దీవించి అక్కడే రాత్రి భోజనం చేశారు.

మీడియాపై భగ్గుమన్న జగన్

కడప: మీడియా వార్తలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప లోకసభ స్థానం అభ్యర్థి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాపై భగ్గుమన్నారు. మీడియాలోని ఓ వర్గం తన మాటలను వక్రీకరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో బిజెపితో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే తాను ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తానని చెప్పిన మాటలను ఆధారం చేసుకుని వైయస్ జగన్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారని మీడియా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యానంపై జగన్ బుధవారం సాయంత్రం స్పందించారు. బిజెపితో పొత్తు పెట్టుకోనని పదే పదే తాను చెబుతూ వస్తున్నానని, అయినా మీడియా అటువంటి వార్తలను ప్రసారం చేసిందని ఆయన అన్నారు.

సత్య సాయి ఆస్తుల వివరాలు కోర్టుకు

పుట్టపర్తి: ఆస్తుల వివరాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏం చేయాలనే విషయంపై శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు మల్లగుల్లాలు పడుతోంది. ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే వెల్లడించడానికి ఉన్న అవకాశాలను సత్యసాయి ట్రస్టు తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇతర ప్రత్యామ్నాయాలను కూడా ట్రస్టు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. న్యాయ నిపుణులతో కూడా ట్రస్టు సంప్రదిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్‌.భగవతి ట్రస్టు సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. భారతీయ వారసత్వచట్టం 317 నిబంధన ప్రకారం ఇన్వెంటరీ అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆస్తులకు సంబంధించిన సమస్త వివరాలుగల జాబితాను జిల్లా కోర్టులో దాఖలు చేస్తారు. జిల్లా న్యాయమూర్తికి అందజేసిన ఆ సమాచారాన్ని బయటకు వెల్లడించాల్సిన అవసరంలేదు. అందులో వివరాలు తెలియకుండా ఆరోపణలు చేయడానికి వీలుండదు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని ఇన్వెంటరీ దిశగా ట్రస్టు అడుగు లేస్తున్నట్లు తెలిసింది. ట్రస్టు నిర్వహణలో కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రస్టు కార్యక్రమాలు సవ్యంగా జరిగినంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి జోక్యం చేసుకొనే అవకాశంలేదు. మంగళ, బుధవారాల్లో పుట్టపర్తిలో ఉన్న ముఖ్యమంత్రితో సత్యసాయి ట్రస్టుతో సంబంధమున్న కొందరు మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. బాబాకు అన్నిరకాల సఫర్యలు చేస్తూ సన్నిహితునిగా గుర్తింపు పొందిన సత్యజిత్‌ను పూర్తిగా దూరంగా పెట్టేలా చూడాలని కొందరు ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

సాయి మరణం మిస్టరీ

హైదరాబాద్: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మట్టిలో కలిసిపోయారు. కానీ.. ఆయన మరణంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మృతిపై వస్తున్న వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు శవపేటికకు ఆర్డర్ ఇచ్చిన వైనంపై దుమారం చెలరేగుతోంది. దీనిపై టీవీ చానెళ్లలో వార్తాకథనాలు ప్రసారమవుతున్నాయి. సత్య సాయిబాబా మృతికి 20 రోజుల ముందే శవపేటికకు ఆర్డరిచ్చారని చెబుతున్నారు. అప్పటికే సత్య సాయి బాబా మరణించారా, మరణిస్తారని ఊహించారా అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది.అనారోగ్యంతో బాబా మార్చి 28న సత్యసాయి ఆస్పత్రిలో చేరగా రెండు రోజులకే అంటే మార్చి ముప్పయ్యో తేదీనే శవపేటిక తయారీకి బెంగళూరుకు చెందిన ఒక సంస్థకు ఆర్డర్ ఇవ్వడం చూస్తే అప్పటికే మరణించారా లేక ఇక ఒకటి రెండు రోజుల్లో మరణిస్తారన్న ఉద్దేశంతో శవపేటిక తయారీకి ఆర్డర్ ఇచ్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బాబా భౌతిక కాయాన్ని ఉంచిన శవపేటికను తయారు చేసిన సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన సంభాషణలను కన్నడ టీవీ చానళ్ళు ప్రసారం చేస్తున్న అంశాలు తాజా వివాదానికి కారణమయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీన కోయంబత్తూర్‌ కంపెనీకి ఈ ఆర్డర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఐదవ తేదీన దాన్ని కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని మల్లేశ్వరంలో గల కుమార్ అండ్ కుమార్ ఇంటర్నేషనల్ కంపెనీ స్వీకరించి, శవపేటికను తయారు చేసిందని చెబుతున్నారు. దాన్ని ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాదు మీదుగా పుట్టపర్తి తరలించారని వార్తాకథనాల వెల్లడి. ప్రత్యేక ఎసి సదుపాయం గల శవపేటికను తయారు చేయించినట్లు చెబుతున్నారు. శవపేటిక నమూనాను మెయిల్ ద్వారా పంపినట్లు చెబుతున్నారు. కాగా, మరో విధమైన కథనం కూడా ప్రచారంలో ఉంది. కన్నడ నటుడు రాజ్‌కుమార్ చనిపోయినప్పుడు తయారు చేసిన శవపేటిక దెబ్బ తిన్నదని, దాంతో దాన్ని పక్కన పడేశారని, దానికే మరమ్మతులు చేసి పుట్టపర్తికి పంపించారని మీడియాలో ప్రచారమవుతోంది. దాని విలువ 57 వేల రూపాయలుగా చెబుతున్నారు. అందుకు సంబంధించిన రశీదు ప్రతిని టీవీ చానెళ్లలో చూపించారు. సత్య సాయిబాబా శవాన్ని ఉంచిన శవపేటికను టీవీల్లో చూసిన తర్వాత దీన్ని తామే తయారు చేశామని కుమార్స్ అండ్ కుమార్స్ కంపెనీ సిబ్బంది చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సత్యజిత్‌ను లక్ష్యంగా చేసుకున్న ఆదికేశవులు

పుట్టపర్తి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు పుట్టపర్తి సత్య సాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌ను టార్గెట్ చేశారు. సత్య సాయి బాబాకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలో ఐసియులోకి సత్యజిత్‌ను ఎలా అనుమతించారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. కుటుంబ సభ్యులను కూడా అనుమతించనివారు సత్యజిత్‌ను ఎందుకు ఐసియులోకి అనుమతించారని ఆయన అడిగారు. సత్య సాయిని గత నెల 28వ తేదీన ఆస్పత్రిలో చేర్చడానికి ముందు ఏం జరిగిందనే విషయంపై ప్రభుత్వం విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. చెక్ పవర్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై సత్య సాయి సెంట్రల్ ట్రస్టు నిర్ణయం తీసుకుంటుందని, సత్య సాయి బాబా సోదరుడు జానకీరామయ్య కుమారుడు రత్నాకర్ కోసం తాను లాబీయింగ్ చేయడం లేదని ఆయన చెప్పారు. ట్రస్టు సత్య సాయిబాబా ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలను కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యుడిగా ఉండాలని తనకు ఏమీ లేదని ఆయన చెప్పారు.

డిఎస్‌కు సురేఖ లేఖ

వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యురాలు కొండా సురేఖ బుధవారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ పంపిన నోటీసులకు సమాధానం ఇచ్చారు. డిఎస్‌కు ఆమె మూడు పేజీల బహిరంగ లేఖను పంపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను ఎప్పుడూ పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా తాను వ్యవహరించలేదని చెప్పారు. కేవలం మీడియాలో వచ్చిన వార్తలను మాత్రమే పరిగణలోకి తీసుకొని తనపై చర్యలు తీసుకోవడానికి నాపై సిఫారసు చేసినట్లుగా కనిపిస్తోందని అన్నారు. తనకు నోటీసులు ఇవ్వడం వెనుక అదృశ్య శక్తులు ఉన్నట్టుగా కనిపిస్తోందని వారెవరో తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెలంగాణ కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారికి ఇవ్వని నోటీసులు తనకు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనందున తనకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆమె కోరారు.

కోదండరామ్ కు రాజ్‌నాథ్ మద్దతు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని బిజెపి సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు హామీ ఇచ్చారు. కోదండరామ్ బుధవారంనాడు రాజ్‌నాథ్ సింగ్‌ను, సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్‌ను, జెడియు నేత శరద్ యాదవ్‌ను కలిశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి మద్దతిస్తామని ఆయన చెప్పారు. న్యూఢిల్లీ స్థాయిలో కోదండరామ్ 13 మందితో ఓ తెలంగాణ జెఎసిని, తెలంగాణ మిత్రులు సంస్థలను ఏర్పాటు చేశారు. తాము మే నెల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నట్లు కోదండరామ్ జాతీయ నాయకులకు చెప్పారు. అందుకు వారి మద్దతును కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం గురించి, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 177 నెంబర్ జీవో గురించి వారికి వివరించారు.

నాగం పై మరోసారి మోత్కుపల్లి ధ్వజం

హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డిపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నరసింహులు మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణ సాధన కోసం తెలంగాణ యాత్ర చేపట్టాలనే నాగం జనార్దన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నాగం జనార్దన్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు తాము మద్దతు ఇవ్వబోమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే నాగం జనార్దన్ రెడ్డి ఏకాకిగా మిగిలిపోతారని ఆయన అన్నారు. తెలంగాణ ఫోరంలో ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే కార్యక్రమాలకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కలిసికట్టుగానే ఉన్నారని, ఒకరిద్దరు విభేదిస్తే విభేదించవచ్చునని ఆయన అన్నారు.

'రాజకీయాల్లోకి కాకతాళీయంగా వచ్చా'

హైదరాబాద్: రాజకీయాల్లోకి కాకతాళీయంగా మాత్రమే వచ్చానని మంత్రి, కడప కాంగ్రెసు పార్లమెంటు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి సిఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సన్నిహితంగా ఉండాలని, అందరితో కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాను ఉన్నానని చెప్పారు. మధ్య తరగతి కుటుంబంలో నుండి వచ్చిన తాను కాంగ్రెసు పార్టీ ద్వారా శాసనసభ్యునిగా, మంత్రిగా ఎదిగానని అన్నారు. తనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన కాంగ్రెసు పార్టీ కడప జిల్లాలో గడ్డు పరిస్థితి ఉందని అందరూ సృష్టించారని అలాంటి సమయంలో ఎంపీగా పోటీ చేయమని అధిష్టానం తనను ఆదేశించిందని చెప్పారు. పార్టీ అదేశించింది చేయడమే తన ఉద్దేశ్యం అన్నారు. ఏప్రిల్ 9వ తేదికి ముందు కడపలో కాంగ్రెసు లేదని, మీడియా, మరికొందరు సృష్టించారన్నారు. గత ముప్పయ్యేళ్లుగా దివంగత వైయస్ కుటుంబం కడప రాజకీయాల్లో ఉండటంతో జగన్ విగ్రహాలు స్థాపించడానికి వచ్చినప్పుడు భారీగా కాంగ్రెసు కార్యకర్తలు రావడంతో ప్రజలు తన వెంటనే ఉన్నారని జగన్ భావిస్తున్నారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. అవినీతిలో కూరుకు పోయిన జగన్ పై పోరాటం చేస్తానని చెప్పాకే తాను మంత్రివర్గంలో చేరానని మంత్రి చెప్పారు. తాను ముఖ్యమంత్రి కావాలని ఏనాడు కోరుకోలేదని చెప్పారు. మంత్రి పదవిని కూడా తాను ఎప్పుడూ ఆశించలేదని చెప్పారు. వైయస్ మంచి పనులు చేశారు కాబట్టి ఆయనను పొగడటంలో తప్పు లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలోనే మా బలం తేలిపోయిందన్నారు. జగన్‌లా నేను ప్రచార రథంలో తిరగడం లేదన్నారు. పాదయాత్రలే చేస్తున్నానని అన్నారు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెసు ఓటు బ్యాంకు భద్రంగా ఉందని, తన గెలుపు ఖాయమని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడానికి వైయస్ ప్రోత్సాహం కూడా ఉందని చెప్పారు. 2004లో తర్వాత కాంగ్రెసు పార్టీపై గౌరవం పెరిగిందన్నారు. జగన్‌ను గెలిపిస్తే అవినీతికి పట్టం కట్టడమే అని చెప్పారు. జగన్‌ను పార్టీ నుండి ఎవరూ బయటకు పంపించలేదని చెప్పారు. అధికార దాహంతో ఆయనే పార్టీలో ఇమడలేక బయటకు వెళ్లిపోయారని చెప్పారు. పార్టీ ప్రకారం వ్యక్తులు నడవాల్సి ఉంటుంది. అంతేకానీ వ్యక్తుల ఇష్టానుసారం పార్టీ నడవదు అని చెప్పారు. జగన్ ఇదివరకు ఎంపీగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదని ఇప్పుడు కూడా ఆయన చేసేదేమీ లేదని చెప్పారు. జగన్ అవినీతి డబ్బు విచ్చలవిడిగా పంచి గెలవాలని చూస్తున్నారని ఆ తరువాత అధికారంతో కోట్లు సంపాదించాలని చూస్తున్నారన్నారు. చివరకు సొంత తల్లి ముఖ్యమంత్రి అయినా జగన్ ఒప్పుకోడన్నారు. జగన్ ను ఎవరూ ఓడించనవసరం లేదని ఆయన అవినీతే ఆయనను ఓడిస్తుందని అన్నారు.

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి

హైదరాబాద్: సత్య సాయి పరమపదించినా ఆయన నివాసం ఉన్న పుట్టపర్తి ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రశాంతి నిలయం, ట్రస్టు సేవా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ట్రస్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవలసిన అవసరం లేదన్నారు. బాబా సమాధి వేలాదిమంది ప్రముఖుల సమక్షంలో జరిగిందని ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. కాగా, అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం భక్తులను సమాధి దర్సనానికి అనుమతించారు. బాబా అంత్యక్రియలు చూడలేని భక్తులు భారీగా సమాధి దర్సనానికి తరలివచ్చారు.     

నల్లధనంపై కేంద్రం వివరణ ఇవ్వాలి: అద్వానీ

హైదరాబాద్: స్విస్ బ్యాంకులో దాగిఉన్న నల్లధనం అంశాన్ని కేంద్రం తేలికగా తీసుకుంటుందని బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ అన్నారు. పుట్టపర్తి నుంచి ఢిల్లీ వెళుతూ ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం ఎక్కువగా ఉందన్న అసాంజే వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని అద్వానీ డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలనపై ఐక్యరాజ్యసమితిలో భారత్ కన్వెషన్ ఆఫ్ కరప్షన్ ఒప్పందానికి ఇంతవరకూ పార్లమెంటు ఆమోదం పొందలేదన్నారు. కనీసం కేబినేట్ ఆమోదం కూడా లభించకపోవటం నల్లధనం నిర్మూలనలో కేంద్రానికి ఏమాత్రం చిత్తసుద్ధి ఉందో నిరూపిస్తోందని అన్నారు. గతంలో ఎన్డీయే చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు అసాంజే వెల్లడించారన్నారు. నల్లధనాన్ని తక్షణమే భారత్‌కు తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లధనంపై సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మండిపడ్డా కేంద్రం వివరణ ఇవ్వాలేదని అద్వానీ అన్నారు.