డిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరు ఈరోజు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసిన తరువాత వారందరూ రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర విభజనను ఆపమని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము రాష్ట్రపతికి విన్నవించుకొన్న విషయాలను తెలిపారు. “ఇరుప్రాంతల వారికి ప్రయోజనం కలుగుతుందని భావించినప్పుడే రాష్ట్ర విభజన చేయాలి తప్ప ప్రభుత్వం తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను ఆశించిచేయడం తగదు. కేంద్రం చేస్తున్న ఈ రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ మూడు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పాలవుతారు. తెలంగాణా ప్రజలు నీళ్ళు, విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటే, ఆంధ్ర,రాయలసీమ ప్రజలు ఉన్నత విద్య, వైద్య ఉద్యోగ సమస్యలను ఎదుర్కోక తప్పదు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభ విభజన బిల్లును మూజువాణి ఓటుతో తిరస్కరించింది. అటు ప్రజలు, ఇటు రాష్ట్ర శాసనసభ విభజనను వ్యతిరేఖిస్తున్నపుడు కూడా కేంద్రం మొండిగా రాష్ట్ర విభజన చేసేందుకు పూనుకోవడం అప్రజాస్వామ్యం. రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన లోపభూయిష్టమయిన విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్దం. ఇంతవరకు ఒక శాసనసభ తిరస్కరించిన బిల్లుని పార్లమెంటు ఎన్నడూ ఆమోదించలేదు. రాజ్యాంగ వ్యతిరేఖంగా సాగుతున్న ఈ విభజన ప్రక్రియను అడ్డుకొని, రాష్ట్ర విభజనను వెంటనే నిలిపివేయమని కేంద్రాన్నిఆదేశించవలసిందిగా రాజ్యాంగ రక్షకుడయిన గౌరవ రాష్ట్రపతి గారిని మేము అందరం కోరాము. ఆయన మా విన్నపాన్ని అంగీకరిస్తారని మేము భావిస్తున్నాము,” అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ రాజ్యసభ ప్లాన్

      కాంగ్రెస్ ప్రభుత్వం కూల్‌గా ఈనెల 10న రాజ్యసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణ బిల్లు చుట్టూ ఏర్పడిన పరిస్థితులను చూస్తే ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించేలా చేసి, లోక్‌సభలో బిల్లుకు జెల్లకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని, లోక్‌సభలో బిల్లుకు చిల్లు వేయడం ద్వారా సీమాంధ్ర ప్రాంతాన్ని సంతృప్తి పరచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ గండాన్ని ఇలా గట్టెక్కించి మిగతా విషయాన్ని వచ్చే ఎన్నికల తర్వాత చూసుకోవచ్చనే యోచనలో కేంద్రం ఉన్నట్టు భావిస్తున్నారు.

లోక్ సభలో గందరగోళ౦...రేపటికి వాయిదా

      15వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. ఇటీవల మృతి చెందిన పార్లమెంట్ మాజీ సభ్యులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. ఆ తరువాత వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దీగారు. 15 లోక్ సభ చివరి సమావేశాలకు అందరూ సహకరించాలని కోరిన సభ్యులు వినకపోవడంతో సభను మొదట 12గంటల వరకూ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రాంభమైన వెంటనే సీమాంధ్ర, తెలంగాణ సభ్యులు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే సభలో కొద్దిపాటి చర్చ జరిగింది. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ తెలంగాణపై మాట్లాడుతూ.. ఈ బిల్లుపై కాంగ్రెస్ సభ్యుల మధ్యే విభేదాలున్నాయన్నారు. ఒకే పార్టీ ఎంపీలు రెండు రకాలుగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ముఖ్యమంత్రే దీక్ష చేస్తున్నారని సుస్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు. విద్యార్థి నిడో హత్యను ఖండిస్తున్నట్లు సుష్మా తెలిపారు. ఢిల్లీలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని, ఈశాన్య విద్యార్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఈశాన్య విద్యార్థులకు బీజేపీ కార్యకర్తలు అండగా ఉంటారని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు.

జగన్ కి సీబీఐ కోర్టులో చుక్కెదురు

  జగన్మోహన్ రెడ్డి బెయిలుపై విడుదలయినప్పటి నుండి ఇంతవరకు అతను చేసిన ఏ అభ్యర్ధనను తిరస్కరించని సీబీఐ, కోర్టుకు హాజరు కాకుండా తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పెట్టుకొన్నపిటిషనుపై సీబీఐ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో సీబీఐ కోర్టు ఆయన పిటిషన్నుతిరస్కరించింది. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే షరతుపైనే జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకి రాగలిగారని ఆరోపణలున్నాయి. బహుశః ఆ కారణంగానే ఆయన జైలు నుండి బయటకి వచ్చిన తరువాత ఆయనపై సీబీఐ కేసుల ఒత్తిడి కనబడలేదు. కానీ ఇప్పుడు మొట్ట మొదటిసారిగా సీబీఐ ఆయన పిటిషనును వ్యతిరేఖించడం చూస్తే, కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన కయ్యానికి కాలు దువ్వుతున్న కారణంగానే కాంగ్రెస్ మళ్ళీ ఆయనకు చిన్న జలక్ ఇచ్చిందా? అనే అనుమానం కలుగుతోంది.

ఎపీ భవన్ వద్ద ఉద్రిక్తత, తోపులాట

      ఎపీ భవన్ లో సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కు వ్యతిరేకంగా దీక్ష చేయనున్న నేపథ్యంలో ఆయన కాన్వాయ్ లోకి దూసుకెళ్లేందుకు తెలంగాణావాదులు ప్రయత్నించారు. సీమాంధ్ర ప్రాంత నేతలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు ప్రాంతాల నేతల మధ్య తోపులాట జరిగి పలువురు నేతలు కింద పడిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తత౦గా మారింది. అంతలోనే పోలీసులు ఇరుప్రాంతాల నేతలను అదుపు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. సీఎం కు వ్యతిరేకంగా తెలంగాణ వాదులు నినాదాలు చేయగా...సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర నేతలు నినాదాలు చేశారు. ఎపీ భవన్ లో ఇరుప్రాంత నేతల నినాదాలతో తీవ్ర గందరగోళం నెలకొంది.

అవిశ్వాస౦ నోటిసులు ఇచ్చిన ఉండవల్లి, టిడిపి

      పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును అడ్డుకొనేందుకు సీమాంధ్ర నేతలు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. యూపీఎ ప్రభుత్వం పై సీమాంధ్ర ప్రాంత నేత, పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణకుమార్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఇకపై ప్రతి రోజు ఒక ఎంపీ పేరుతో అవిశ్వాస తీర్మానం నోటిసు ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ తాము పార్లమెంటులో నిరసనకు దిగుతామని కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు తెలిపారు. తాము తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి కూడా తోసిపుచ్చుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టిడిపి ఎంపీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చారు. ఎంపీలు కొనకళ్ళ నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కృష్ణప్ప, శివ ప్రసాద్ లు స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం నోటిసు అందజేశారు.

చంద్రబాబు వ్యూహం ఫలించేనా?

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ బిల్లు యధాతధంగా ఆమోదింపబడినట్లయితే రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగదని, అందుకే దానిని తాము వ్యతిరేఖిస్తున్నామని ఆయన వాదిస్తున్నారు. ఆయన వాదన నిజమే అయినప్పటికీ, ఆయన తెలంగాణా ఏర్పాటుని అడ్డుకొంటున్నారనే భావన తెలంగాణా ప్రజలలో వ్యాపిస్తే అందుకు తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఇది తెలిసినప్పటికీ చంద్రబాబు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయడం సాహసమేనని చెప్పక తప్పదు. అయితే, బీజేపీ కూడా బిల్లుకి మద్దతు ఇచ్చే ఆలోచనను దాదాపు విరమించుకొన్నట్లే కనబడుతోంది గనుక, ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలనుకొంటున్న చంద్రబాబు, బీజేపీ అధిష్టానం చేత “రానున్నఎన్నికల తరువాత కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడగానే ఉభయ ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేస్తామని” ప్రకటింపజేయగలిగినట్లయితే కొంత ఉపశమనం ఆశించవచ్చును. అయినప్పటికీ తేదేపాకు తెలంగాణాలో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. అయితే, చంద్రబాబు బిల్లుకి వ్యతిరేఖంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టాలని చేస్తున్న ప్రయత్నాల వలన తెలంగాణా ఏర్పాటు ఆగినా, ఆగకపోయిపోయినా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ప్రజల ఆదరణ పెరగవచ్చును. కానీ, సీమాంధ్రపై పట్టు కోసం ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు గనుక, వారిరువురు నుండి తెదేపా రానున్న ఎన్నికలలో గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు.

పార్లమెంటులో ఆందోళనకు అధికార, విపక్షాలు సిద్దం

  ఈరోజు నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవనున్నాయి. నిన్నరాత్రి జరిగిన కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశంలో సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు లగడపాటి, హర్ష కుమార్, రాయపాటి తాము ఈరోజు నుండి పార్లమెంటులో ఆందోళన చేసి సభా కార్యక్రమాలు జరగకుండా చేసి బిల్లుని అడ్డుకొని తీరుతామని గట్టిగా చెప్పారు. ఇక యంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకతరం రెడ్డి తాము బిల్లుకి వ్యతిరేఖంగా ఓటువేస్తామని ఖరాఖండిగా చెప్పారు. చిరంజీవి, జేడీ.శీలం తదితర సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనను వ్యతిరేఖించినప్పటికీ, వారందరూ అధిష్టానం కనుసన్నలలోనే మెలిగే అవకాశం ఉంది గనుక వారివల్ల కాంగ్రెస్ అధిష్టానానికి ఎటువంటి సమస్య ఉండకపోవచ్చును. ఇక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా సభలో పోడియం వద్దే నిలిచి ఆందోళన చేస్తానని ప్రకటించారు. తెదేపా సీమాంధ్ర సభ్యులు కూడా వీరికి తోడవడం ఖాయం గనుక ఇక పార్లమెంటు సమావేశాలు ఏవిధంగా జరుగబోతున్నాయో ముందే ఊహించుకోవచ్చును.   పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ మొన్ననిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో, బీజేపీతో సహా అనేక పార్టీలు ఈసారి కేవలం రెండు వారాలు మాత్రమే సాగే పార్లమెంటు సమావేశాలలో39 బిల్లులపై చర్చ చేప్పట్టి ఆమోదించవలసి ఉంది గనుక, తెలంగాణా బిల్లుని సభలో ప్రవేశపెట్టవద్దని, పెడితే కాంగ్రెస్ యంపీలే ఆందోళన చేసి సభ జరగకుండా అడ్డుపడతారని హెచ్చరించాయి. ఇప్పుడు సరిగ్గా అదే జరుగబోతోంది. గత సమావేశాలలో ఆందోళన చేస్తున్నసభ్యులను సస్పెండ్ చేసి సభా కార్యక్రమాలను నిర్వహించడాన్నికూడా ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. కనుక ఇప్పుడు సభలో ఆందోళన చేయబోతున్న కాంగ్రెస్, తెదేపా, వైకాపా, తెరాస యంపీలను సభ నుండి సస్పెండ్ చేయడానికి కూడా ఆలోచించక తప్పదు.   ఓట్-ఆన్-అకౌంట్ ద్వారా కీలకమయిన సాధారణ, రైల్వేబడ్జెట్లను సభలో ఆమోదించవలసిన ఈ తరుణంలో సభలో తెలంగాణాకు అనుకూలంగా, వ్యతిరేఖంగా కాంగ్రెస్ సభ్యులే ఆందోళనకు దిగితే, అది కాంగ్రెస్ అధిష్టానానికే అవమానం. ‘కాంగ్రెస్ అధిష్టానం తన యంపీలు, ముఖ్యమంత్రినే అదుపులో ఉంచుకోలేకపోతోందని’ బీజేపీ నేత సుష్మాస్వరాజ్ విమర్శ అక్షరాల నిజమని ఈరోజు సభలో కాంగ్రెస్ యంపీలు, జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ధర్నాచేయనున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, వారి ధర్నాను వ్యతిరేఖిస్తూ రాజ్ ఘాట్ వద్ద ధర్నాచేయబోతున్న టీ-కాంగ్రెస్ నేతలు నిరూపించబోతున్నారు.

టీ-బిల్లుకి నో ప్రాధాన్యం!

  తెలంగాణ బిల్లు విషయంలో నానా హడావిడి చేస్తూ తొందరపడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి తన బుర్రతిరుగుడు వ్యవహారశైలిని బయటపెట్టుకుంది. ఈ సమావేశాల్లో ఎలాగైనా తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటామని పైకి చెబుతున్నప్పటికీ, లోపల్లోపల మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. కాంగ్రెస్ వ్యవహార శైలి చూసి విభజనవాదుల గుండెల్లో రాయి పడింది. సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లుతో సహా మొత్తం 39 బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వీటిలో ఆరు బిల్లులు చాలా ప్రాధాన్యత వున్న బిల్లులని, ఈ బిల్లుల మీద ఎట్టి పరిస్థితులలోనూ చర్చ జరిపి, బిల్లులను తప్పనిసరిగా ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 39 బిల్లులలో ప్రాధాన్యం వున్న బిల్లులు ఆరు. ఈ ఆరు బిల్లులలో తెలంగాణ బిల్లు లేకపోవడం విభజనవాదుల్లో దడ పుట్టిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా దీన్ని చూసి బిత్తరపోతున్నారు. తెలంగాణ బిల్లుమీద నానా హడావిడి చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ బిల్లుని ప్రాధాన్యం లేని బిల్లుల జాబితాలో చేర్చడాన్ని విభజనవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాధాన్యం వున్న బిల్లుల లిస్టు ఆరుతో సరిపెట్టకుండా ఏడు వరకు పొడిగించి తెలంగాణ బిల్లును కూడా ప్రభుత్వం ఆ లిస్టులో చేర్చొచ్చు కదా అని గొణుక్కుంటున్నారు. పైకి మాత్రం తెలంగాణ ఇస్తామని బిల్డప్పు ఇస్తోందే తప్ప కేంద్ర ప్రభుత్వానికి నిజంగా తెలంగాణ ఇచ్చే ఉద్దేశం వుందా, లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎంత వినయం.. ఎంత వినయం..

  దొరబిడ్డ కేసీఆర్ నోరు తెరిస్తే సీమాంధ్రులని తిట్టడం మినహా మరోపదం రాదు. సారుగారు సీమాంధ్రులని మాత్రమే తిడతారు. ఇంకెవర్నీ తిట్టరు. పైగా మిగతావాళ్ళ దగ్గర చాలా వినయంగా వుంటారు. ఢిల్లీకి వెళ్ళారంటే ఆ వినయం రెండు మూడింతలు అవుతుంది. ఢిల్లీ వెళ్ళేముందు సమైక్యవాదులని తిట్టిపోసిన కేసీఆర్ ఢిల్లీ వెళ్ళగానే తన నోటికి తాళం వేశారు. తన దొరతనాన్ని ఇంట్లోనే పెట్టి బయటకి వెళ్తున్నారు. జాతీయ పార్టీల నాయకులని కలిసినప్పుడు కేసీఆర్ ఒలికిస్తున్న వినయ విధేయతలని చూడటానికి అక్కడున్నవారికి రెండు కళ్ళూ చాలటం లేదంట. కేసీఆర్ జాతీయ నాయకులను కలవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మర్యాపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కేసీఆర్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. కేవలం షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా? వాళ్ళని ఇంప్రెస్ చేయడం ఎలా? అడ్డగోలు విభజనకు మద్దతు సాధించడం ఎలా? అందుకే షేక్ హ్యాండ్ ఇస్తూనే కేసీఆర్ వాళ్ళ ముందు వినయంగా ఒంగిపోతున్నారు. బాడీని బాగా వంచేసి, తల పూర్తిగా దించేసి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా వినయంగా, ఒద్దికగా, చూసేవాళ్ళకి శాంతిదూతలా కనిపిస్తున్నాడట. రాముడు మంచి బాలుడిలా, నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకుడిలా వున్న ఇంత వినయసంపన్నుడిని సీమాంధ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అని సదరు జాతీయ నాయకులు అనుకుంటున్నారో ఏం పాడో!

సీమాంధ్ర ఎంపీలని నమ్మొచ్చా?

  తెలంగాణ అంశం మీద గత పార్లమెంటు సమావేశాల్లో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నానా హడావిడి చేశారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు అలా చేశారో... తమ సొంత బుద్ధితో చేశారోగానీ మొత్తానికి గడచిన రెండు సెషన్స్ లోనూ తెలంగాణ ఇష్యూ మీద పార్లమెంటులో హోరెత్తించారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు సభని సజావుగా సాగనిచ్చే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. సభ సజావుగా సాగకుంటే ఏ బిల్లూ చర్చకూ వచ్చే అవకాశం లేదని అన్నారు. ఇక తెలంగాణ బిల్లు విషయానికి వస్తే అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సభని సజావుగా సాగించే అవకాశం లేదు కాబట్టి, అధికారపార్టీ సభను సజావుగా నడపుతామని హామీ ఇస్తేనే తెలంగాణ బిల్లు గురించి చర్చిస్తామని సుష్మా స్వరాజ్ స్పష్టంగా చెప్పారు. దాంతో కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల నోళ్ళు మూయించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను గప్ చుప్‌గా కూర్చోపెట్టే పథకరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకున్న సీమాంధ్ర ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీల విషయంలో ఆందోళన పడుతున్నారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడే విషయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను ఎంతవరకు నమ్మాలన్న విషయం గురించే ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వేసే ఎత్తులకు సీమాంధ్ర ఎంపీలు చిత్తు కారన్న నమ్మకమేమీ లేదు. గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ ఎంపీలు అధిష్ఠానం చెప్పినట్టల్లా తలూపారు. ఇప్పుడీ కీలక సందర్భంలో కూడా అదే మార్గాన్ని అనుసరిస్తే తెలుగుజాతికి తీరని ద్రోహం జరిగే ప్రమాదం వుందని సమైక్య వాదులు భయపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా కనిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ని బుజ్జగించి, దారిలోకి తెచ్చే ప్రయత్నంలో వున్న కాంగ్రెస్ నాయకత్వం తన ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకంతో వుంది. ఎంపీలు కూడా తాను గీసిన గీత దాటకుండా వుండేలా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

కేసీఆర్ గొంతులో వెలక్కాయ!

  తెలంగాణ సాధించుకునే ఢిల్లీ నుంచి తిరిగి వస్తానని, తాను తిరిగి అడుగుపెట్టేది తెలంగాణ రాష్ట్రంలోనేనని ప్రతిజ్ఞ చేసి ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్ అక్కడ ఎదురవుతున్న పరిస్థితులను చూసి డంగైపోతున్నారు. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. మైకు ముందుకు వస్తేచాలు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని పూనకం స్థితికి వెళ్ళిపోయే కేసీఆర్ ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే తిరిగొస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ విభజనవాదుల్లో ఉత్సాహాన్ని నింపింది. సోమవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంలో జరిగిన పరిణామాలు కేసీఆర్‌తోపాటు విభజన వాదులందరికీ టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈసారి పార్లమెంట్ సమావేశాలను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకే పరిమితం చేయాలని దాదాపు అన్ని పార్టీలు పట్టు పట్టడం, తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ చేసిన కామెంట్లు కేసీఆర్ అండ్ బ్యాచ్ కట్టుకున్న గాలిమేడని కూల్చేశాయి. అసలు తెలంగాణ బిల్లు పార్లమెంటులో చర్చకి వస్తుందా, రాదా అనే సందేహాలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో అయితే దోచుకున్నారు, సీమాంధ్ర దోపిడి లాంటి పడికట్టు పదాలు ఉపయోగించి, నోరు వేసుకుని మీద పడిపోయి నెగ్గుకురావొచ్చు. అయితే ఇప్పుడు సీన్ ఢిల్లీకి మారింది. బాల్ జాతీయ పార్టీల కోర్టులో వుంది. తెలంగాణ బిల్లు పార్లమెంటులో నెగ్గే విషయం అటుంచితే, చర్చకు వచ్చే విషయమే డౌటుగా వుంది. ఈ నేపథ్యంలో విభజనవాదుల బీపీ డౌన్ అయిపోవడంతో కేసీఆర్ ఆ బీపీని పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణవాదులు డంగైపోవాల్సిన అవసరం లేదని అర్జెంటుగా సందేశం ఇచ్చేశారు. తాను ముందుగా నోరు జారినట్టుగానే తెలంగాణ ఏర్పడిన తర్వాతే తిరిగి వస్తానని మరోసారి నోరుజారారు. కేసీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ విభజనవాదుల్లో ఉత్సాహం కలిగించిందో లేదోగానీ, ఢిల్లీలో విభజన బిల్లు పరిస్థితి మాత్రం అంతకంతకూ దిగజారుతోంది. అజిత్ సింగ్, రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి నాయకులు తప్ప ప్రధాన పార్టీల నాయకులెవరూ తెలంగాణ బిల్లు మీద ఆసక్తి చూపించడం లేదు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో వున్న బిల్లుల విషయం ఆలోచించాలా? హడావిడిగా తెచ్చిన తెలంగాణ బిల్లు విషయం ఆలోచించాలా అని నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం, కీలక బిల్లుల ఆమోదం తర్వాతే ఏ విషయమైనా అంటున్నారు.

ఆమ్ ఆద్మీ ముష్టి తెలివి!

  ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజల్లో పరువు పూర్తిగా పోయింది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు ఊడ్చిపారేయాలని కలలు కన్న కేజ్రీవాల్ కలలు కల్లలైపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఏర్పడిన అంచనాలనీ భ్రమలన్నీ తేటతెల్లం అయిపోయాయి. అధికారం చేపట్టి నెల రోజులు పూర్తి చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం ఢిల్లీలో దినదినగండంగా నెట్టుకొస్తోంది. జనాల్లో నమ్మకం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ రోజుకో ముష్టి తెలివిని ప్రదర్శిస్తూ జనాల్లో పోయిన పరువుని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మొన్నీమధ్య అవినీతిపరుల లిస్టు ఒకదాన్ని విడుదల చేసింది. దాంతోపాటు అవినీతిని అరికట్టడం తనవల్ల తప్ప మరొకరి వల్ల కాదన్నట్టు బిల్డప్పులిస్తూ ఆచరణ యోగ్యంగా లేని లోక్‌పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో ఆమోదించేసింది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని కొనసాగిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులని పేరుపేరునా తిట్టిపోస్తోంది. ఆమ్ ఆద్మీ ఎంత తిడుతున్నా కాంగ్రెస్ దులిపేసుకుంటూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తోంది. దీన్నే రాజకీయం అంటారేమో! ఇదంతా ఇలా వుంటే మదన్‌లాల్ అనే ఓ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కొత్త ఇష్యూని ఒకదాన్ని లేవదీశాడు. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ కుట్ర పన్నారనేది ఆ ఇష్యూ సారాంశం. ఎవరో ఇద్దరు వ్యక్తులు తన దగ్గరకి వచ్చి ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూలిస్తే ఇరవై కోట్లు ఇస్తామని చెప్పారట. ముఖ్యమంత్రిని కూడా చేస్తామని ఆశ చూపించారట. నరేంద్రమోడీకి సన్నిహితుడినని ఆ వ్యక్తులు చెప్పారట. అలాగే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తనకి ఫోన్ చేసి తనతో బీజేపీ అగ్ర నాయకుడొకరు మాట్లాడుకుంటున్నారని చెప్పారని, ఎవరా వ్యక్తి అని అడిగితే అరుణ్ జైట్లీ అనిచెప్పారని ఆరోపించాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా మదన్‌లాల్ చేసిన ఈ ఆరోపణలని బీజేపీ నాయకులు ఖండించారు. రాజకీయ వర్గాలు కూడా ఈ ఆరోపణలని రాజకీయ మైలేజీ కోసం, జనాల్లో పోయిన పరువుని తిరిగి సంపాదించడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పనుల్లో భాగంగా భావిస్తున్నారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయంగా మరింత దిగజారిపోయే అవకాశం వుందని విశ్లేషిస్తున్నారు. ‘పిచ్చి ముఖ్యమంత్రి’గా పేరు సంపాదించుకున్న కేజ్రీవాల్ తన పార్టీ నాయకులతో ఆడిస్తున్న ఇలాంటి నాటకాలను కట్టిపెట్టాలని సూచిస్తున్నారు.

నేడు ప్రపంచ కేన్సర్ దినం

  ఈరోజు (ఫిబ్రవరి 4) ప్రపంచ కేన్సర్ దినం. గత కొన్నేళ్ళుగా ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ కేసులు విపరీతంగాపెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలు కేన్సర్ కారణంగానే జరుగుతున్నాయి. అందుకే ఈ వ్యాధి విషయంలో అవగాహన, చైతన్యం పెరగాల్సిన అవసరం వుంది. దీన్ని గుర్తించిన జెనీవాకు చెందిన యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కేన్సర్ కంట్రోల్ సంస్థ 2008లో ఫిబ్రవరి 4వ తేదీని ప్రపంచ కేన్సర్ దినంగా ప్రకటించింది. ఈరోజున ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేన్సర్ గురించి అవగాహన పెంచే కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా చేపడతారు.

టీ-బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడం కూడా వీలుకాదా?

  ఇంతవరకు తెలంగాణా ఏర్పాటుపై చాల ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ నిన్న జరిపిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల వైఖరి చూసి కంగుతింది. రేపటి నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణా బిల్లుని ప్రవేశపెడితే, ఆంధ్ర, తెలంగాణా ప్రాంత సభ్యుల ఆందోళన కారణంగా అసలు సభ జరిగే అవకాశమే ఉండదని, అందువల్ల ఈ సమావేశాలలో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టవద్దని, ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు వంటి అత్యంత ముఖ్యమయిన బిల్లులను మాత్రమే సభలో ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల సూచనతో కాంగ్రెస్ అధిష్టానం నోటమాటలేకుండా పోయింది. కేవలం రెండు వారాలు మాత్రమే సాగే ఈ సమావేశాలలో ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు ఆమోదించడం అత్యంత అవసరం. అదిగాక మరో 39 బిల్లులపై సభలో చర్చజరిపి ఆమోదించవలసి ఉంది. వాటిలో కొన్ని రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్టను పెంపొందించే ఉద్దేశ్యంతోనే ప్రవేశపెట్టబడుతున్నాయి. తమ రాజకీయ ప్రత్యర్ధికి మేలు చేకూర్చే అటువంటి బిల్లులకు తామెందుకు మద్దతు ఈయాలి? అని భావించడంతో బీజేపీతో సహా ప్రతిపక్ష నేతలు కేవలం ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు మరికొన్ని ముఖ్యమయిన బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టాలని సూచించాయి.   తెలంగాణా బిల్లుని ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలేయమని వారు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం తను అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణా బిల్లుని సభలో ఆమోదింపజేయడం మాట సంగతెలా ఉన్నా, దానిని అసలు సభలో ప్రవేశపెట్టవద్దని ప్రతిపక్షాలు కోరడం కాంగ్రెస్ అధిష్టానం జీర్ణించుకోవడం చాలా కష్టమవుతోంది. తెలంగాణా బిల్లుని సభలో ప్రవేశపెట్టడానికే అభ్యంతరం చెపుతున్న ప్రతిపక్షాలు, వాటి మాట కాదని ప్రవేశపెట్టినా దానికి మద్దతు ఇస్తాయని నమ్మకం లేదు.   బీజేపీ నేత సుష్మాస్వరాజ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ యంపీలపై ఆ పార్టీకి ఎటువంటి అదుపు లేదు. అందువల్ల వారు మళ్ళీ సభా కార్యక్రమాలను జరుగకుండా స్తంబింపజేయడం తధ్యం. అటువంటి పరిస్థితిలో కీలకమయిన బిల్లులపై ఏవిధంగా చర్చించలము? అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముందుగా తన సభ్యులను అదుపులో ఉంచుకొని సభను నిర్వహించమనండి. అప్పుడు బిల్లులకు మా మద్దతు గురించి అడగవచ్చును,” అని అన్నారు.

రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ

  రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరుకోవడంతో రాష్ట్ర రాజకీయ వర్గాలన్నీ ఢిల్లీలోనే మకాం వేశాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తూ రాష్ట్రాన్ని విభజిస్తోందని నినదిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో హల్‌చల్ చేస్తున్నారు. శరద్ యాదవ్ లాంటి పలువురు జాతీయ నాయకులను కలసి సమసపై వారికి పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకు చంద్రబాబు భేటీ అయ్యారు. అరగంట పాటు ఆయనతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా వుందంటూ రాసిన ఓ పుస్తకాన్ని ఆయన రాష్ట్రపతికి ఈ సందర్భంగా అందజేశారు. అలాగే ఓ వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఒక ప్రహసనంలా మార్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రపతికి వివరించినట్టు తెలిసింది.

రాష్ట్ర విభజనపై సుప్రీంలో పిటిషన్లు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో మూడు వ్యక్తిగత పిటిషన్లు. ఒకటి ప్రజాహిత వ్యాజ్యం. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, విశాలాంధ్ర మహాసభ వేరు వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా, ఢిల్లీకి చెందిన ఎం.ఎల్.శర్మ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. వీటిలో మూడు పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టనున్నామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని శనివారం నాడు విచారణకు చేపట్టనున్నామని చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.