రాజ్యసభ ట్విస్ట్: చైతన్యరాజు తప్పుకున్నారు..

      రాజ్యసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చైతన్యరాజు చివరి నిమిషంలో బరిలో నుంచి వెనక్కి తప్పుకున్నారు. ఈ రోజు ఉదయం చైతన్యరాజు , సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటి అయ్యారు. కిరణ్ ఆయనతో చర్చలు నామినేషన్ ఉపసంహరణకు ఒప్పించినట్లు తెలుస్తోంది. మంత్రులు గంటా, ఏరాసు, శైలజానాథ్, ఎంపీ ఉండవల్లితో కలిసి చైతన్యరాజు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఉపసంహరణ లేఖను అందజేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకే నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు చైతన్య రాజు కూడా చెప్పారు. సమైక్యవాదానికి మద్దతుగా అని చెప్పిన చైతన్యరాజు, రాష్ట్ర సమైక్యతపై ఏం హామీ ఎవరి నుంచి పొంది నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారో!

టీ ఉద్యోగుల బెదిరింపు సెక్షన్

      తెలంగాణ వస్తుందన్న కలలు మెల్లమెల్లగా కరిగిపోతూ వుండటంతో విభజనవాదులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. గొడవ పడి అయినా, దొమ్మీ చేసి అయినా సీమాంధ్రుల మీద ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టున్నారు. సీమాంధ్రుల మీద తొలుత మాటల దాడి చేసి భయభ్రాంతులకు గురిచేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను అసెంబ్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకూ విజయవంతంగా అమలు చేసే ఉద్దేశంలో కృతనిశ్చయులై వున్నారు.   అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ జరిగే చివరిరోజున తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సృష్టించిన రాద్ధాంతం చరిత్ర ఎన్నటికీ మరచిపోలేదు. ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలు తెలంగాణ ప్రజలు కూడా హర్షించే విధంగా లేవు. అన్నదమ్ముల మాదిరిగా విడిపోదామంటూనే సీమాంధ్రుల పట్ల ఆగర్భ శత్రువుల్లా వ్యవహరిస్తున్న విభజనవాదుల తీరు ఎంతోమందికి ఆవేదన కలిగిస్తోంది. అసెంబ్లీలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తమపై భౌతిక దాడులు జరిగే అవకాశం వుందని, తమకి రక్షణ కల్పించాలని స్పీకర్‌కి మొర పెట్టుకున్నారంటే పరిస్థితి  ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క అసెంబ్లీలో మాత్రమే కాదు... అన్ని రంగాల్లోనే ఇలాంటి ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టించడానికి విభజనవాదులు ప్రయత్నిస్తున్నారు. సచివాలయంలో ఉద్యోగుల హౌసింగ్ సొసైటీకి సంబంధించి జరుగుతున్న సమావేశంలో విభజనవాదులు లేనిపోని రాద్ధాంతం సృష్టించి పోలీసు కేసుల వరకూ వెళ్ళారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడిన మాటలు భవిష్యత్తులో నిజంగానే తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజల పరిస్థితి ఎలా వుంటుందన్నదానికి అద్దం పట్టేలా వున్నాయి. ఓ తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకుడు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసై, రాష్ట్రపతి సంతకం అయ్యే వరకూ వేచి చూస్తాం. ఆ తర్వాత సీమాంధ్రులకు పట్టపగలే చుక్కలు చూపిస్తాం అని వ్యాఖ్యానించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా బతికి వుండగానే ఇలాంటి బెదిరింపు సెక్షన్‌కి పాల్పడుతున్న విభజనవాదులు పొరపాటునో, గ్రహపాటునో రాష్ట్ర విభజన జరిగితే ఎంతకు తెగిస్తారన్నది తలచుకోవడానికి భయం వేసేలా వుంది. ఇలాంటి విపరీత ధోరణులను అరికట్టాల్సిన బాధ్యత అందరిమీదా వుంది.  

కేకే ఓటమి ఖాయమా?

      పాపం కే.కేశవరావుకి ఒక వీక్నెస్ వుంది. ఆయన ఎప్పుడూ ఏదో ఒకపదవిలో వుండాలి. లేకపోతే ఆయనకి ఊపిరి ఆడదు. దాంతో ఆయన ఏ పార్టీలోవుంటే ఆ పార్టీలో వాళ్ళకి ఊపిరి ఆడకుండా చేస్తూ వుంటారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఒకసారి రాజ్యసభకి పంపించింది. రెండోసారి రాజ్యసభకు పంపకపోవడంతో అలిగిన ఆయన తెలంగాణ ఉద్యమంలో మరోసారి ఒక్క ఉదుటున దూకేశారు. కాంగ్రెస్ పార్టీలో వుంటూనే ఉద్యమం పేరు చెప్పి బోలెడన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. తన ధాటికి కాంగ్రెస్ అధిష్ఠానం బెదిరిపోయి తనను మళ్ళీ ఏ రాజ్యసభకో పంపిస్తుందని ఎదురు చూసిన ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.   ఇక కాంగ్రెస్ అధిష్ఠానం తన బెదిరింపులకు లొంగే అవకాశం లేదని స్పష్టంగా అర్థం చేసుకున్న ఆయన ఓ ఫైన్ మార్నింగ్ టీఆర్ఎస్ లోకి జంప్ జిలానీ అయ్యారు. ఆయన పార్టీ వదిలిపోయినందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం ఫీలవకుండా ప్రశాంతంగా వుంది. తాజాగా రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఆరు స్థానాలు ఖాళీ కావడంతో కేకే గారికి మళ్ళీ రాజ్యసభ మీద మోజు మొగ్గ తొడిగింది. గెలిచే అవకాశం లేదని తెలుస్తూనే వున్నా ఆయన రాజ్యసభకు పోటీ చేయాలని ముచ్చటపడ్డారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో తనకాళ్ళమీద పడేవాళ్ళు చాలామంది వున్నారని, వాళ్ళు తనకు తప్పకుండా ఓటేస్తారని కేకే నమ్మకం పెట్టుకున్నారు. ఈ పాయింట్‌ని సాకుగా చూపించి టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ బరిలో నిలబడటానికి కేసీఆర్‌ని ఒప్పించారు. ఈయన కోరికను కాదంటే మళ్ళీ పార్టీ వదిలి ఎక్కడ వెళ్ళిపోతారని అనుకున్నారో లేదా ఆయన మోజుని ఎందుకు కాదనాలని అనుకున్నారోగానీ కేసీఆర్ కేకేని తమ పార్టీ తరఫున రాజ్యసభ బరిలో నిలబెట్టారు. అప్పటి నుంచి కేకే కాలికి బలపం కట్టుకుని కాంగ్రెస్, సీపీఐ, మజ్లిస్ పార్టీల మద్దతు కూడగట్టుకోవడానికి తిరుగుతున్నారు. అయితే కేకే ఎన్ని తంటాలు పడినా ఆయన గెలిచే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. స్వతంత్ర్య అభ్యర్థులుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చైతన్యరాజు, ఆదాల ప్రభాకరరెడ్డిలో ఎవరో ఒకరు గెలిచే అవకాశమే వుందని అంటున్నారు. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఓటు వేసే అవకాశం వుందని అంటున్నారు. అది కూడా కేంద్రమంత్రి పల్లంరాజు ఆశీస్సులు దండిగా వున్న చైతన్యరాజుకే ఎక్కువ ఛాన్స్ వుందని భావిస్తున్నారు. కేకేకి ఓటమి తప్పదని ఊహిస్తున్నారు.

కాంగ్రెస్ కిరణ్ ని ముందుకు తీసుకువస్తోందా

  శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతయిన చంద్రబాబు నాయుడు మొన్న సోమవారంనాడు సభలో రాష్ట్ర విభజన అంశంపై ప్రసంగించేందుకు సిద్దమయ్యారు. కానీ, ముఖ్యమంత్రి అకస్మాత్తుగా బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం పెట్టాలని నోటీసు ఇవ్వడంతో, సభ స్థంభించిపోయింది. దానితో చంద్రబాబుకి సభలో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. దానిఅపి ఆగ్రహిస్తూ ఆయన కొన్ని ఆసక్తికరమయిన విషయాలు మాట్లాడారు. అదేవిధంగా కొన్ని ఆసక్తికరమయిన ప్రశ్నలు లేవనెత్తారు.   1. సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు అవకాశం ఎందుకు ఈయలేదు?   2. ప్రధాన ప్రతిపక్ష నేత హక్కులను కాపాడవలసిన బాధ్యత స్పీకర్ కు లేదా?   3. శాసనసభ్యులు సభ నుండి ఇంకా మీడియా పాయింటు కూడా చేరుకోకముందే, డిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్ బిల్లుపై చర్చ ముగిసిందని ఏవిధంగా ప్రకటించారు?   4. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నానని చెపుతూ బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం కూడా చేయించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజన కోసం అన్ని ఫైల్స్, వివరాలు పంపమని కేంద్రం కోరినపుదు తిరస్కరించకుండా, ఎప్పటికప్పుడు ఎందుకు పంపించి కేంద్రానికి సహకరించారు?   ఇక చంద్రబాబు చెప్పిన ఆసక్తికరమయిన విషయాల కొస్తే, జగన్మోహన్ రెడ్డి సమైక్యవాదిగా ఎదగడానికి ఇంతకాలం సహకరించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ కీర్తి కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందని అన్నారు. డిల్లీ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే ముఖ్యమంత్రి తీర్మానం నోటీసు ఇవ్వడం, సభలో కాంగ్రెస్, తెరాస, వైకాపాలు కలగలిసి నాటకమాడి, సభ జరగకుండా అడ్డుపడి గడువు కంటే ముందే చర్చ ముగించేసి చేతులు దులుపుకోన్నారని ఆయన అన్నారు. పార్టీ తయారు చేసిచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారమే కిరణ్, బొత్స, దామోదర ముగ్గురూ వ్యవహరించి బిల్లుని సజావుగా వెనక్కి త్రిప్పి పంపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.   ఈ మొత్తం వ్యవహారాన్ని వైకాపా వీలయినంత త్వరగా చుట్టబెట్టేయాలని తాపత్రయపడిందని, కానీ వారి ఆంతర్యం బయటపడటంతో మరో కొత్త నాటకం ఆడారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్న ముఖ్యమంత్రి కేంద్రానికి పరోక్షంగా సహకరిస్తున్నపటికీ, ఆయన చేతే సభలో బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం చేయించడం ద్వారా ఆయనను సీమాంధ్ర ప్రజల దృష్టిలో సమైక్య ఛాంపియన్ గాఎదిగేందుకు కాంగ్రెస్ సహకరించిందని చంద్రబాబు అభిప్రాయం కావచ్చును.   బిల్లుపై చర్చ ముగిసిన వెంటనే డిల్లీ నుండి మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ “బిల్లుపై చర్చించమని తామే తమ నేతలకు అనుమతి ఇచ్చామని వారు ఆ పనిని సక్రమంగా పూర్తి చేసారని” కితాబు ఇవ్వడం బహుశః అందుకే కావచ్చును.   ఇక కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని వెనక్కి నెట్టి, కిరణ్ కుమార్ రెడ్డిని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు అనడం చూస్తే కాంగ్రెస్ వ్యూహం మారిందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు అనుకోవచ్చును. అదే నిజమయితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కష్టకాలం మొదలవుతుందేమో!

ఆమ్ ఆద్మీ మీద కాంగ్రెస్ కత్తి!

      అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టి నెలరోజులు పూర్తయ్యాయి. ఈ నెలరోజుల్లోనే కేజ్రీవాల్ ఏ స్థాయి పరిపాలనా దక్షుడో ఢిల్లీ ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ఆయన పార్టీ అభ్యర్థులను అనవసరంగా ఎమ్మెల్యేలుగా గెలిపించామన్న పశ్చాత్తాపంతో ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కుమిలిపోతున్నారు. దేవుడి దయవల్ల ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే అటు కాంగ్రెస్‌ని, ఇటు కేజ్రీవాల్‌ని జాయింట్‌గా ఇంటికి పంపించేసి బీజేపీకి పట్టం కట్టాలని భావిస్తున్నారు.   కేజ్రీవాల్ చెప్పేదొకటి చేసేదొకటి అనే విషయం ఈ నెలరోజుల్లో అనేక సందర్భాలలో రుజువైంది. దీనికితోడు ఆమ్ ఆద్మీ పార్టీలో అధికారం కోసం కుమ్ములాటలు, ఒక ఎమ్మెల్యే తిరుగుబాటు చేయడం, ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించడం ఢిల్లీ ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీని చులకన చేసేశాయి. కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఓ మంత్రిగారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా, సినిమా ఫక్కీలో దాడులు, సోదాలు చేస్తూ వుండటం ప్రజలకు మింగుడు పడటం లేదు. నిర్భయ సంఘటనను ఆధారంతా చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజులకే ఢిల్లీలో ఓ విదేశీ వనిత మీద అత్యాచారం జరిగింది. ఈ సంఘటన విషయంలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యత తీసుకోకుండా తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోంది. అందుకే తాము చేసిన పొరపాటును దిద్దుకోవడం కోసం ఢిల్లీ ఓటర్లు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాగలకార్యం గంధర్వులే తీర్చుతారన్నట్టుగా ఢిల్లీ ప్రజలు కోరుకున్న రోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని త్వరలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఎన్నికలలో నిలబడింది. సదరు పార్టీ పునాదుల్లోనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వుంది. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత అదే పార్టీ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ తనని ఎంతగా తిట్టినా వాటినన్నిటినీ మర్చిపోయినట్టు నటిస్తూ కాంగ్రెస్ పార్టీ తగుదునమ్మా అంటూ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఒకపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతూనే మరోపక్క కాంగ్రెస్ పార్టీని నాన్‌స్టాప్‌గా తిడుతూనే వుంది. దీంతో మంచి ముహూర్తం చూసి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఉపసంహరించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేసి, మళ్ళీ ఎన్నికలు వచ్చేలా చేస్తే తాను మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం వుందని కాంగ్రెస్ కలలు కంటోంది.

కాంగ్రెస్ లో అధికార వికేంద్రీకరణ సాధ్యమేనా

  ఇటీవల రాహుల్ గాంధీ ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీ అధికారాన్ని మోడీ ద్వారా కేంద్రీకృతం చేయాలని భావిస్తుంటే, తాను అధికార వికేంద్రీకరణ జరిగి, సామాన్యులు కూడా అందులో భాగాస్వాములవ్వాలని కోరుకొంటున్నాని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అధికార (వి)కేంద్రీకరణ ఎంత గొప్పగా అమలవుతోందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నఏ రాష్ట్ర ప్రభుత్వమయినా ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నావెంటనే డిల్లీకి పరిగెత్తడం అందరూ చూస్తేనే ఉన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదన్నట్లు హైకమాండ్ ఆజ్ఞ లేనిదే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ నిర్ణయమూ స్వయంగా తీసుకోలేవని అందరికీ తెలుసు. అయినా యువరాజవారు అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడటం చూస్తే ఆయన మాటలకి చేతలకీ పొంతన ఉండదని స్పష్టమవుతోంది. సామాన్యులు అధికారంలో భాగస్వాములవడం మాట దేవుడెరుగు. కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికలలో పోటీ చేయగలవారికే పార్టీలో దిక్కు లేదు.   ఇంతకీ ఈ ఉపోద్గాతం అంతా ఎందుంటే, బొత్ససత్యనారాయణ తాను, ముఖ్యమంత్రి, మరికొందరు కాంగ్రెస్ పెద్దలు కలిసి ఎంపిక చేసిన పార్టీ రాజ్యసభ అభ్యర్ధులకు వ్యతిరేఖంగా పోటీలో ఉన్న తిరుగుబాటు అభ్యర్ధులు వెంటనే పోటీ నుండి విరమించుకోవాలని, అదేవిధంగా కాంగ్రెస్ శాసనసభ్యులందరూ విధిగా పార్టీ అభ్యర్దులకే ఓటేయాలని, అలా కాకుండా ఇతరులకి ఓటేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.   ఆయన, తను మరి కొందరు కాంగ్రెస్ పెద్దలు కలిసి అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసామని చెపుతున్నారు. కానీ, నిజానికి వారు అభ్యర్ధుల జాబితాను పట్టుకొని డిల్లీ వెళ్లి అధిష్టానం ఆమోదముద్ర వేయించుకోకుండా తమంతట తాము అభ్యర్ధులను ఖరారు చేయలేరు. మరప్పుడు ఎవరికీ కూడా ఈ అధికార వికేంద్రీకరణ గురించి ఆలోచన కూడా రాలేదు. చివరికి కాంగ్రెస్ శాసనసభ్యులు ఎవరికి ఓటు వేయాలో కూడా పార్టీయే నిర్ణయిస్తుంది. బహుశః అది కూడా అధికార (వి) కేంద్రీకరణగానే అందరూ అర్ధం చేసుకోవలసి ఉంటుంది.   ప్రధానమంత్రయి దేశాన్ని ఏలాలనుకొంటున్న రాహుల్ గాంధీ, కీలకమయిన రాష్ట్ర విభజన సమస్య గురించి ఎన్నడూ దైర్యంగా మాట్లాడలేదు. సమస్యను సామరస్యంగా పరిష్కరించలేకపోయారు. ఆ భాద్యతను పార్టీ సీనియర్ల నెత్తిన పడేసి, వీలుచిక్కినప్పుడల్లా తను ఆచరించి చూపలేని తన ఆశయాలు గురించి ఈవిధంగా ఉపన్యాసాలు ఇవ్వడం వలన ఆయనకి కానీ, పార్టీకి గానీ ఒరిగేదేమీ ఉండదు. అసలు స్వంతపార్టీలోనే ముఖ్యమంత్రితో సహా నేతలందరూ పార్టీపై తిరుగుబాటు చేస్తున్నప్పుడు, ముందుగా పార్టీని చక్కబెట్టుకోకుండా దేశాన్ని చక్కబెట్టేస్తానని చెప్పడం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

టీ-బిల్లుపై కాంగ్రెస్ పెద్దల కొత్త కబుర్లు

  రాష్ట్ర విభజన అంశం మళ్ళీ డిల్లీకి మారింది. ఇంతవరకు బిల్లుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తలోమాట మాట్లాడితే, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంలో పెద్దలు తలోమాట మాట్లాడటం మొదలు పెట్టారు. శాసనసభ బిల్లుని తిరస్కరించిన వార్త వెలువడిన వెంటనే స్పందించిన దిగ్విజయ్ సింగ్, దాని వల్ల బిల్లుకొచ్చే నష్టమేమీ లేదని, రాష్ట్ర విభజన ఆగబోదని ప్రకటించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన హోం మంత్రి షిండే బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి తమకు కొంత సమయం అవసరమని, బిల్లుని శాసనసభ వ్యతిరేఖించినందున అటార్నీ జనరల్ని సంప్రదించి న్యాయసలహా తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 4వతేదీన జరిగే మంత్రుల బృందం సమావేశంలో శాసనసభ లేవనెత్తిన అన్నిఅంశాల గురించి చర్చించి తగు నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు. బిల్లుపై స్పందించిన ఇద్దరిలో ఒకరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే, మరొకరు న్యాయసలహా తీసుకొంటామని చెప్పడం విశేషం. బహుశః త్వరలో చాకో, ఆజాద్, తివారీ, జైపాల్ రెడ్డి వంటి మరికొందరు మీడియా ముందుకు వచ్చి బిల్లుపై మరిన్నికొత్త కబుర్లు చెపుతారేమో!

తెలంగాణతో తిరిగొస్తా: కెసిఆర్

      ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ వచ్చితీరుతుందని, రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళుతున్నానని, తిరిగి వచ్చేది తెలంగాణ రాష్టంలోకేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు తిరస్కరణకు గురికావడంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ 15 రోజులలో తెలంగాణ ప్రజల కల సాకారం కాబోతుందని, ఎవరూ నిరాశ చెందవద్దని, సంతోషంగా ఉండాలని, సంబరాలు చేసుకుందామని, స్వీట్లు తినిపిస్తానని స్పష్టం చేశారు.   ముఖ్యమంత్రి కిరణ్‌కు, ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏం మాట్లాడాలో తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి అనుకుంటే శాసనసభనే రద్దు చేయగలని, వాళ్ళవి చిల్లర వ్యాఖ్యలని ఆయన విమర్శించారు. ఇంత జరిగిన తర్వాత ఇక కలిసి ఉండలేమని, మానసికంగా విడిపోయామని కేసీఆర్ పేర్కొన్నారు. సీమాంధ్రకు ఏం కావాలో కేంద్రం కోరుకోమని అంటే, కోరుకోకుండా ఏదో మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రజలు నిర్భయంగా ఉండాలని, ఈరోజుతో అసెంబ్లీ అయిపోయిందని, ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు నాయుడులు ఏం చేయలేరని, ఇక జరగాల్సింది ఢిల్లీలోనేనని కేసీఆర్ పేర్కొన్నారు.  

జగన్ తండ్రిని పొగిడినా సహించలేడుట!

  వైకాపా నుండి బయటపడేవారు అందరూ చెప్పే మాట ఒక్కటే! జగన్మోహన్ రెడ్డికి చిన్నాపెద్ద అనే గౌరవం లేదని! పార్టీలో నుండి బయటకి పోయేవారు పార్టీపై, పార్టీ అధినేతపై ఏదో ఒక ఆరోపణలు చేసి పోవడం సహజమే అయినప్పటికీ, ఈవిధంగా అందరూ ఒకే రకమయిన ఆరోపణలు చేస్తుండటం చూస్తే, జగన్మోహన్ రెడ్డి ఎటువంటివాడో, పార్టీలో సీనియర్ల పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది.   నరసాపురం నుండి వైకాపా లోక్ సభ అభ్యర్ధిగా పేర్కొనబడిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడుతున్నరంటూ ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేయబడిన తరువాత, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిపై ఇంచుమించు ఇవే రకమయిన ఆరోపణలు చేసారు.   ఆయన మీడియాతో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డి పైకి చాలా గట్టిగా సమైక్యవాదం చేస్తున్నా, ఆయన సమైక్య ముసుగులో పనిచేస్తున్న విభజనవాది. పార్టీలో ఎవరయినా గట్టిగా సమైక్యవాదం చేస్తే ఆయన సహించలేరు. పార్టీలో పెద్దవాళ్ళకి, సీనియర్లకి ఆయన తగిన గౌరవం ఈయకపోయినా అందరూ ఆయనని గౌరవంగా ‘సర్’ అని మాత్రమే సంభోదించాలి. లేకుంటే ఆయనకు చాలా కోపం వస్తుంది. చివరకి ఎవరయినా ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని పొగిడినా ఆయన తట్టుకోలేడు. ఆయన అహంభావం తట్టుకోవడం చాల కష్టం. ఆయనకీ తగిన బుద్ధి చెప్పెందుకే నేను రాజకీయాలలో కొనసాగాలనుకొంటున్నాను. త్వరలో నా రాజకీయ భవిష్యత్ ప్రణాళిక గురించి తెలియజేస్తాను,” అని తెలిపారు. రఘురామ కృష్ణంరాజు నిన్న బీజేపీ నేత వెంకయ్య నాయుడిని కలిసినట్లు సమాచారం. బహుశః ఆయన బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారేమో!   ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి చాలా సహనం, అందరినీ కలుపుకుపోగల నేర్పు ఉండాలి. కానీ, కేవలం వ్యక్తిగత ఆకర్షణతోనే ఎల్లకాలం పార్టీని నడుపుదామనుకొంటే ఆ ఆకర్షణ కనుమరగయిననాడు, పార్టీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అందుకు ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చును. 

బిల్లు ఓటమితో విభజన ఆగిపోతుందా?

  విభజన బిల్లుని ఉభయ సభలలో ఓడించినందుకు సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చుతుండగా, తెలంగాణాలో ప్రజలు ఆగ్రహంతో ముఖ్యమంత్రి తదితరుల దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఒకరు విజయం సాధించామని సంబరపడుతుంటే, వేరొకరు ఓడిపోయిన భావనతో ఆక్రోశం వ్రేళ్ళగ్రక్కుతున్నారు. అయితే ఈ విజయం, పరాజయం రెండూ తాత్కాలికమేనని ప్రజలందరూ గ్రహించాల్సి ఉంది. ఈరోజు శాసనసభ లో బిల్లును ఓడించడం ద్వారా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోదని అందరికీ చాలా బాగా తెలుసు. సీమాంధ్ర నేతలకు నిజంగా రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొనే ఆలోచనే ఉండి ఉంటే, పరిస్థితిని ఇంతవరకు రానిచ్చేవారే కాదు. కానీ, పార్టీ టికెట్స్, మంత్రి పదవులకు,కాంట్రాక్టుల కోసం ఆశపడి ప్రజలని మభ్యపెడుతూ పరిస్థితులను ఇంతవరకు తీసుకు వచ్చారు. ఇప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంటున్నట్లు విభజన బిల్లుని సభలో ఓడించి తామేదో చాలా ఘన కార్యం చేసామని చెప్పుకొంటున్నారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజలకు ఈ మాత్రమయిన ఉపశమనం కలగించి వారిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నమే ఇది. అందుకే వివిధ రాజకీయ పార్టీల అధ్వర్యంలో కార్యకర్తలు రోడ్లమీధకు వచ్చి టపాసులు కాల్చి ప్రజాభిప్రాయానికి అడ్డం పడుతున్నట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   అయితే ఈ విజయం, ఆనందం రెండూ తాత్కాలికమేనని ఆ నేతలందరికీ తెలుసు. ఆదేవిధంగా సభలో బిల్లుని ఓడించినందుకు తెలంగాణా ప్రజల ఆక్రోశం వ్యక్తం చేయడం సహజమే. కానీ శాసనసభలో బిల్లుని ఓడించడం వలన విభజన ప్రక్రియపై ఎటువంటి ప్రభావం చూపదని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ చెప్పడం గమనిస్తే, ఈ కారణంగా మాత్రం తెలంగాణా ఏర్పాటు ఆగదని స్పష్టమవుతోంది. కానీ, ఈ కారణంగా ఒకవేళ రాష్ట్రపతి బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, సుప్రీం కోర్టులో పిటిషన్లు పడినప్పుడు, బిల్లు రాజ్యాంగ విరుద్దంగా ఉందని కోర్టు అడ్డుపడినా, పార్లమెంటులో బిల్లుకి బీజేపీ మద్దతు ఈయకపోయినా రాష్ట్ర విభజన ఆగవచ్చును. అంతే తప్ప కేవలం ఈ కారణంగానే విభజన ప్రక్రియ ఆగే అవకాశం లేదు.   అందువల్ల సీమాంధ్ర నేతలు ఏదో ఘన కార్యం సాధించినట్లు కాలరు ఎగురవేసుకొని తిరుగనవసరం లేదు. బిల్లు శాసనసభలో ఓడిపోయినందుకు తెలంగాణా ప్రజలు దిగులు చెందనవసరం లేదు. అయితే, తన రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్దంగా రాష్ట్ర విభజనకు పూనుకొని తెలుగు ప్రజల మధ్య ఇంత అగాధం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ, దాని అధిష్టానం మాత్రం ఈ పరిస్థితులను చూసి సిగ్గుపడకపోగా నిర్లజ్జగా మాట్లాడటం సిగ్గు చేటు.

విభజన బిల్లును ఉభయసభలు తిరస్కరించాయి...

      ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ బిల్లును ఉభయసభలు తిరస్కరించాయని మంత్రి ఆనం రా౦నారాయణరెడ్డి, మంత్రి టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. సభలో తెలంగాణ నేతలు కూడా బిల్లు తిరస్కరణకు అనుకూలంగా ప్రవర్తించారని అన్నారు.రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా మండలిలో, శాసన సభలో తీర్మానం జరిగిందన్నారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రం కూడా రాష్ట్ర అభిప్రాయాలను గౌరవించాలని అన్నారు. శాసనసభ తిరస్కరించిన బిల్లు పార్లమెంటులో పెట్టలేరన్నారు.   ఇది చారిత్రాత్మకమైన రోజు: ఆనం వివేకా   తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు మీద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తే బాల్ పెవీలియన్ దాటి ఢిల్లీలో పడిందని, ఇది చారిత్రాత్మకమైన రోజని, దీనిని సువర్ణాక్షరాలతో లిఖించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఓపికతో, సహనంతో సీమాంధ్ర శాసనసభ్యులు, సీమాంధ్ర ప్రజలు ఏమి కోరుకున్నారో ? దానిని సాధించారని, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రజలు హర్షించే నిర్ణయం తీసుకున్నారని అభినందించారు.

సీఎం, స్పీకర్ దొంగ దారిలో...

    తెలంగాణ బిల్లును తిప్పిపంపుతూ సీఎం చేసిన తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంమంత్రి, స్పీకర్ దొంగదారిలో పనికిరాని తీర్మానాన్ని ఆమోది౦చుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిల్లుపై చర్చలో ఎటువంటి పరిష్కారాలు చూపకుండా మూజువాణి ఓటింగ్‌తో తీర్మానాన్ని ఆమోదించి పైశాచిక ఆనందాన్ని పొందారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో సీఎంకు రాజకీయ సన్యాసం తప్పదని, ప్రజలే సీఎంకు బుద్ది చెబుతారని హెచ్చరించారు. మరోవైపు టిడిపి తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్, ముఖ్యమంత్రి కుట్రలో బాగంగానే తీర్మానాన్ని ఆమోది౦చుకున్నారని విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన కీలక సంఘటన ఎంత బలమైనదో తెలిసినా, దాన్ని పట్టించుకోనట్టు మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత నాయకులది అమాయకత్వం.  

కిందపడ్డా పైచెయ్యే!

      విభజన వాదులు ఓటమిని ఓ పట్టాన ఒప్పుకోరు. సమైక్య వాదుల విజయాన్ని కూడా తమ అకౌంట్లో వేసుకుని తమదే విజయమని అంటూ వుంటారు. ఇలాంటి వాళ్ళ కోసమే కిందపడ్డా పైచేయి అనే సామెత పుట్టినట్టుంది. తెలంగాణ బిల్లును తిప్పిపంపుతూ సీఎం చేసిన తీర్మానం గురువారం నాడు భారీ గందరగోళం మధ్య అసెంబ్లీ ఆమోదం పొందింది. ఇటు శాసన సభలో, అటు శాసనమండలిలో కూడా తెలంగాణ బిల్లును తిరస్కరించే తీర్మానం ఆమోదం పొందింది.     గురువారం నాడు సీమాంధ్ర సభ్యుల మీద దౌర్జన్యం చేసి అయినా సీఎం ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కార తీర్మానంపై ఓటింగ్ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు వ్యూహరచన చేశారు. అయితే స్పీకర్ మనోహర్ క్షణాల్లో విభజన బిల్లును తిరస్కరించే తీర్మానానికి ఓటింగ్ నిర్వహించడం, మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందడం జరిగిపోయింది. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో షాకైన విభజనవాదులు కొద్ది నిమిషాలు నోట మాట రాకుండా వుండిపోయినా, ఆ తర్వాత తమదైన శైలిలో గళం విప్పారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ ముగిసిందని, ఇక తెలంగాణ రావడం ఖాయమని మీడియా పాయింట్లో స్టేట్‌మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని తిరస్కరించినందువల్ల నష్టమేమీ లేదని, పార్లమెంటులో బిల్లుకు ఆమోదం లభిస్తుందని అతి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అసలు అసెంబ్లీ అభిప్రాయానికి విలువే లేదని తేల్చేసి చెప్పేశారు. మరి అసెంబ్లీ అభిప్రాయానికి విలువ లేకపోతే బిల్లు అసెంబ్లీకి రావాలని పట్టు పట్టడం ఎందుకో, చర్చ జరగాలని గొడవ చేయడమెందుకో, సీమాంధ్రుల వాణి వినపడకుండా గందరగోళం సృష్టించడమెందుకో విభజనవాదులకే తెలియాలి. అసెంబ్లీ బిల్లును తిరస్కరించినా కేంద్రం హాయిగా రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించే అవకాశమే వుంటే అసలు బిల్లును రాష్ట్రానికి పంపడం ఎందుకో విభజనవాదులే చెప్పాలి. ఏది ఏమైనా కీలక సమయంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోని సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఏకతాటి మీద నిలిచి విభజన వ్యతిరేక తీర్మానానికి మద్దతు పలకడం శుభ పరిణామం. అసెంబ్లీలో జరిగిన కీలక సంఘటన ఎంత బలమైనదో తెలిసినా, దాన్ని పట్టించుకోనట్టు మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత నాయకులది అమాయకత్వం.  

తెలంగాణ బిల్లు తిరస్కరణ..వెనక్కి వెళ్ళదు

      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలంగాణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర విభజనపై ఎలాంటి ప్రభావం చూపదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ బిల్లుపై సభలో ఓటింగ్  జరగలేదని అన్నారు. తెలంగాణ బిల్లును సభకి అభిప్రాయం కోసమే పంపించాం కాని ఓటింగ్ కోసం కాదని అన్నారు. కేబినేట్ సమావేశం అనంతరం కేంద్రం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుందని అన్నారు. సవరణలపై కేబినేట్ చర్చించి సలహాలు వుంటే పొందుపరుస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు బిల్లును వ్యతిరేకించిన పార్టీలన్నీ ఒకప్పుడు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని గుర్తుచేశారు.

కిరణ్ పంతం నెగ్గింది..తెలంగాణ బిల్లు తిరస్కరణ

      అసెంబ్లీలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్రపతి పంపించిన తెలంగాణ బిల్లును తిరస్కరించాలంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. మూజువాణి ఓటింగ్‌తో సీఎం ఇచ్చిన నోటీసును అసెంబ్లీ ఆమోదించింది. దాంతో తెలంగాణ బిల్లును అసెంబ్లీ తిరస్కరించినట్లయింది. సభలో అందోళనల మధ్యే స్పీకర్ సీఎం తీర్మానంపై ఓటింగ్ చేపట్టారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పారు. సభలో 86 మంది సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారని తెలిపారు. బిల్లుపై 9,076 సవరణలు వచ్చాయన్నారు. సభను నిరవధికంగా వాయిదా వేశారు. సీఎ౦ కిరణ్ సమైక్యాంధ్ర నినాదాలు చేసుకుంటూ సభ నుంచి బయటకు వచ్చారు.      

జగన్ పార్టీ నుంచి కృష్ణంరాజు బిజేపిలోకి జంప్

  గత మూడు నాలుగు రోజులుగా వైకాపా నేత రఘురామకృష్ణంరాజు పార్టీ వీడి కాంగ్రెస్ లోకో, బీజేపీలోకో వెళ్లిపోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి2న తను స్వయంగా జగన్మోహన్ రెడ్డి తో సమావేశమయిన తరువాత తగిన నిర్ణయం తీసుకొంటానని ఆయనే స్వయంగా ప్రకటించారు కూడా. అయితే ఆయన నిన్నబీజేపీ నేత వెంకయ్య నాయుడిని వెళ్లి కలవడంతో బీజేపీలో చేరబోతున్నట్లు దాదాపు ఖాయమయిపోయినట్లే భావించవచ్చును. ఆయన నరసాపురం నుండి పోటీ చేసేందుకు వైకాపా అంగీకరించినట్లు సమాచారం. కానీ కొందరు స్థానిక పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేఖంగా వ్యవహరిస్తుండటంతో ఆయన ఈవిషయాన్ని జగన్ దృష్టికి తీసుకు వెళ్ళినా ఆయన నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో బాధపడిన రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి తన గోడు వెళ్ళబోసుకోవలనుకొన్నారు. కానీ, ఇంతలోనే ఏమయిందో తెలియదు కానీ ఆయన వెంకయ్య నాయుడిని వెళ్లి కలిసి వచ్చారు.   అదేవిధంగా మల్కాజ్ గిరీ కాంగ్రెస్ శాసనసభ్యురాలు  జయసుధ ఈసారి అక్కడి నుండే లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నందున, ఆ సీటు సిట్టింగ్ యంపీ సర్వే సత్యనారాయణకే కేటాయించే అవకాశం ఉండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో జేరేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే  టికెట్ కోసం పార్టీలు మారే ఇటువంటి వారికి పార్టీలు, సిద్దాంతాలు, సమైక్య, విభజన వాదనలు ఏవీ కూడా అడ్డుకావని అర్ధం అవుతోంది.

మానవుడే మహనీయుడు

    గుండెనిండా స్వేచ్చా వాయువులు పీల్చినపుడల్లా అందులో ఎందరో మహనీయుల త్యాగం అంతర్లీనంగా మనలని స్పృశిస్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే మన జాతిపిత గాంధీ భారతీయుల ప్రతిశ్వాసలో ఈనాటికి ఉన్నారంటే అతిశయోక్తి కాదు, అలా౦టి మహానుభావుడి వర్ధంతి ఈ రోజు, స్మరించుకోవడం, మనసులో కృతజ్ఞతలు తెలియజేయడం, అయన చూపిన మార్గంలో నడవాలని సంకల్పించుకోవడం మనందరని కనీస ధర్మం . అహింస, శాంతి,సహనం, నిత్యం మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో అవసరపడే పదునైన ఆయుధాలు, వాటిని పరీక్షించి ఫలితాలని కూడా మనముందుంచారు. బాపూజీ నిస్సంకోసంగా వాటిని వాడొచ్చు మనందరం. మహానుభావుడు పూజ్యుడు,ఆరాధ్యుడు అంటూ గాంధీని మాటలతో పూజిస్తాం కాని నిజంగా ఆయనకి గుడి కట్టి నిత్యం ధూపదీపాలతో అర్చనలు చేస్తారంటే నమ్మగలరా, కాని నిజం మన దేశంలో రెండుచిట్ల అలా గాంధీజీ ఆలయాలు ఉన్నాయి.   కర్ణాటక రాష్ట్రంలో మంగళూరులోని కంకనాడిలో ఉందా గుడి. అక్కడ గాంధీయే దేవుడు. ఈ గుడి 1948 లోనే నిర్మించారు. నరసప్పసాలియాన్, సోమప్ప పండితే, వెంకటప్ప అనే వారికీ గాంధీ అంటే ప్రాణం గాడ్సే తుపాకీ గుళ్ళకి అయన నేలకొరిగారన్న వార్త విన్నాక అంతటి మహాత్ముడికి మరణం లేడు అని నమ్మి ఆయనకి గుడి కట్టారు ఈ ముగ్గురు. అప్పటినుంచి ఆ ఆలయంలో గాంధీజీ పూజలు అందుకుంటున్నారు.   నేటికి నిత్యం అర్చనలు జరుపుతారు. జాతీయ పర్వదీనాల్లో ఆ ఆలయం జన సందోహంతో కిక్కిరిసిపోతుందట. దూర దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం మహాత్ముడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబదతారట. ఇక గాంధీ జయంతి నాడు పల్లకీసేవ ప్రత్యేకంగా ఓ ఉత్సవంలా నిర్వహిస్తారు అంతే కాదు ఆ ఆలయం చుట్టూ ప్రజల గట్టి నమ్మకం కూడా ఒకటుంది. గాంధీజీ ఆలయం గురించి దాని చుట్టూ ప్రజలఅల్లుకున్న విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మద్యపానం,ధూమపానం,జూదం వంటి వ్యసనాలకు బానిసయిన వారిని ఈ ఆలయానికి తీసుకు వచ్చి ప్రమాణం చేయిస్తే వారు ఆ వ్యసనాల జోలికి ఇక వెళ్ళారని ఆ చుట్టుపక్కల గ్రామస్తుల నమ్మకం. అలాగే మానసిక ఆరోగ్యం సరిగా లేనివారిని ఈ ఆలయానికి తీకుసువస్తే స్వస్థత చేకూరుతుందని కూడా నమ్ముతారు. మొక్కలు కడతారు చెల్లిస్తారు.గాంధీజీ జీవిత చరిత్ర వారికీ నిత్య  పారాయణ గ్రంధం. ఇక గాంధీజీకి ఒరిస్సాలో కూడా ఓ గుడి వుంది. గాంధీజీ తన జీవితంలో ఒకేఒకసారి ఒరిస్సాలో పర్యటించారు. అయితేనేం అక్కడ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసారు గాంధీజీ వారినేంతగా ప్రభావితం చేశారంటే ఆ రాష్ట్రంలో సంబాల్పూర్ కూ సమీపంలో బాత్రా అనే గ్రామంలో ఆయనకో గుడి కట్టించారు. అక్కడ జాతీయపర్వదీనాలు పెద్ద పండగలుగా, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ గ్రామం చుట్టు పక్కల ఇప్పటికీ ఖాదీ మాత్రమే ధరిస్తారు. ఆ ఆలయం గోడలానిండా స్వాతంత్రోద్యమ ఘట్టాలు చెక్కించారు. 'రఘుపతి రాఘవ రాజారాం' అన్నా గీతాన్ని వారు నిత్యం స్మరిస్తారు. మహాత్ముడికి గుడి కట్టడమెందుకని అడిగితే వారెంమంటారో తెలుసా...ఈ గుడిలో మేము మహత్ముడిని కాదు..మానవత్వాన్ని పూజిస్తున్నాం. గాంధీజీ జీవిత చరిత్ర మాకు నిత్య పారాయణ గ్రంథం..దాని నుంచి ఎంతో స్పూర్తి పొందుతాం. అందుకే ఆయన మాకు దేవుడు అంటారు. ఇంకా ఏమంటారో తెలుసా..''ఈ ఆలయాన్ని చూడగానే రక్తమాంసాలున్న ఇటువంటి మనిషి ఈ భూమ్మిద నడిచాడంటే ముందుతరాల వారు నమ్మరు..అన్న ఐన్ స్టీన్ మాటలు గుర్తుకు రావాలి అందరికి...అన్న వారి మాటలు మానవుడే మహనీయుడు అని నీరుపిస్తున్నాయి. ఆ మహనీయుడి స్పూర్తితో ముందడుగు వేద్దాం. .....రమ

కాంగ్రెస్ తో కాశ్మీరీ పార్టీ కటీఫ్

  కాంగ్రెస్ అధిష్టానం ఒకపక్క కొత్త పార్టీలను దువ్వుతూ వచ్చే ఎన్నికలలోగా ఎలాగయినా మచ్చిక చేసుకొని వాటితో పొత్తులు పెట్టుకొని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలని తిప్పలు పడుతుంటే, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం ఖాయమని పసిగట్టి కాంగ్రెస్ దోస్తులు కొందరు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఇప్పటి నుండే ఎన్డీయే కూటమిలోకి దూకేందుకు సిద్దం అవుతున్నారు.   యూపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నకాశ్మీరుకి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత మాజీ కాశ్మీరు ముఖ్యమంత్రి అయిన ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ, "మా పార్టీ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగాలా వద్దా అనే సంగతిని మా అబ్బాయి ఒమర్ అబ్దుల్లా నిర్ణయిస్తాడు. అతను ఏవిధంగా చెపితే పార్టీ ఆవిధంగా చేస్తుంది. అయితే ఇంకా అతను, మేము ఈవిషయంలో ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు,” అని అన్నారు.   ఆయన మీడియా అడిగిన మరో ప్రశ్నకు జవాబిస్తూ, “ఒకవేళ దేశప్రజలు మోడీని ప్రధానిగా ఎన్నుకొంటే వారి అభిప్రాయాన్ని మా పార్టీ గౌరవిస్తుంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలదే అంతిమ నిర్ణయం,” అని అన్నారు.   గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు దానితో అంటకాగిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, అది ఎన్నికలలో ఓడిపోగానే దానిని వదిలి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే కూటమిలోకి జంపయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేఖ గాలులు వీస్తూ, మోడీ భజన మారుమ్రోగిపోవడం చూసి ‘స్వంత గూటికి’ వచ్చేయాలని ఈ తండ్రీ కొడుకులు ఆరాటపడుతున్నట్లున్నారు. ఏ ఎండకి ఆ గొడుగు అంటే ఇదేనేమో!

సభ మొదటి వాయిదా షురూ

  ఊహించినట్లుగానే ఈరోజు శాసనసభ సమావేశమవగానే ఆంధ్ర తెలంగాణా సభ్యుల నినాదాలతో దద్దరిల్లిపోయింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ విజయమ్మ తదితరులు సమైక్య తీర్మానం కోసం ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బహుశః ఈరోజు సాయంత్రం వరకు సభలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చును. అయితే, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు ప్రకారం సభలో టీ-బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకే నిశ్చయించుకొన్నారు గనుక, దానిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణా సభ్యులను బయటకి తరలించేందుకు అదనపు పోలీసు బలగాలను రప్పించి సిద్దంగా ఉంచారు. ఈ రోజే టీ-బిల్లుకి ఆఖరి రోజు గనుక, తెలంగాణా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసి బహుశః సాయంత్రంలోగా ఆయన సభలో బిల్లుపై ఓటింగ్ నిర్వహించవచ్చును.