శాసన సభలోగందరగోళం..స్పీకర్ కు సలహా

      సోమవారం ఉదయం శాసన సభ ప్రారంభం అయిన కాసేపటికే గందరగోళం చెలరేగటంతో వాయిదా పడింది. సభలో పలు తీర్మానాలు చేయాలని సభ్యులు ఇచ్చిన వినతిపత్రాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అదే విధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసును కూడా తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తూ పోడియం చుట్టుముట్టారు. సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని, బిల్లును వెనక్కి పంపాలని సీమాంధ్ర నేతలు పోడియం చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం రేగింది. సభలో చర్చ జరిగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు సహకరించకపోవడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.   మరోవైపు సభాపతి నాదెండ్ల మనోహర్‌కు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రపతి పంపించింది డ్రాఫ్ట్ బిల్లు కాదని అసలు బిల్లేనని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా నోటీసు ఇచ్చారని, దానిని తిరస్కరించాలని కోరారు. నోటీసు పైన తుది నిర్ణయం స్పీకర్‌దేనని చెప్పారు. మరోవైపు కిరణ్ ఇచ్చిన లేఖను తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత మంత్రులు మరోసారి సభాపతికి లేఖ రాశారు.  

మెజార్టీతో గెలిపించండి: రాష్ట్రపతి

  గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశ్యించి ప్రసంగించిన రాష్ట్రపతి “వచ్చేఎన్నికలలో ప్రజలు ఏదో ఒక పార్టీకి స్పష్టమయిన మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉందని, అప్పుడే దేశంలో స్థిరమయిన రాజకీయ వ్యవస్థ ఏర్పడి, దేశం అన్ని రంగాలలో నిలకడగా అభివృద్ధి సాధించగలదని” అన్నారు. రాహుల్-మోడీల రాజకీయ భవిష్యత్తుని నిర్దేశించబోయే వచ్చేఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక, ఆ రెండు పార్టీల మధ్య జరిగే తీవ్రమయిన పోటీలో దేశప్రజలు రాహుల్-మోడీల మధ్య రెండుగా చీలిపోతే ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవచ్చని ఆయన అభిప్రాయం కావచ్చును.   గత పది సం.లలో దేశంలో ప్రాంతీయ పార్టీలు బాగా బలపడటంతో, అవి కేంద్రప్రభుత్వ మనుగడను కూడా శాసించే స్థాయికి ఎదిగాయి. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు పేరుకి జాతీయపార్టీలే అయినా, వాటంతట అవి పూర్తి మెజార్టీ సాధించే పరిస్థితులు లేవు. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రావాలన్నాతప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సర్వసాధారణమే అయినప్పటికీ, రాజకీయాలలో, పార్టీలలో, ప్రజాప్రతినిధులలో నైతిక విలువలు దిగజారిన ఈ పరిస్థితుల్లో, కేంద్రానికి మద్దతు ఇస్తున్నకారణంగా ప్రాంతీయ పార్టీలు, అదేవిధంగా పెద్దన పాత్ర పోషిస్తున్నకారణంగా కేంద్రం ప్రాంతీయ పార్టీలను తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఒకరినొకరు తరచు చెయ్యి మెలిపెట్టుకొంటూ పరిపాలన సాగిస్తుంటే కేంద్రంలో, రాష్ట్రాలలో కూడా బలహీనమయిన ప్రభుత్వాలు ఏర్పడటం వలన దేశ అభివృద్ధి కుంటుపదుతుంది. గనుకనే, ప్రజలందరూ సరయిన పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టాలని రాష్ట్రపతి కోరారు.   కాంగ్రెస్, బీజేపీలు ఆయన సూచనను ఆహ్వానించినప్పటికీ, రెంటికీ గెలుపు అత్యావశ్యకం గనుక పోటాపోటీగా ప్రచారం చేసి ప్రజలను తమవైపు త్రిప్పుకొనే ప్రయత్నం చేస్థాయి. వీటికి తోడు ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలతో వాటి పొత్తులు, ప్రాంతీయ సమస్యల తీవ్ర ప్రభావంతో ప్రజలు కూడా ఆ రెండు పార్టీల మధ్య చీలిపోవడం ఖాయం. కానీ ఇంతవరకు వెలువడుతున్న సర్వేలనీ దేశ వ్యాప్తంగా ప్రజలు నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఈ సారి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేకపోయినట్లయితే, ఆయనకి మళ్ళీ ఎప్పుడూ ఆ అవకాశం వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు గనుక, వచ్చేఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్ తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. ఆ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. కానీ ఎవరికి పట్టం కట్టదలచుకొన్నా పూర్తి మెజార్టీతో పట్టం కట్టమని రాష్ట్రపతి సలహా.

అండమాన్ లో పడవ బోల్తా: 32మంది మృతి

      బంగాళఖాతం సముద్ర౦లో పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడడంతో 32మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 45 మందికి పైగా పర్యాటకులున్నారని స్థానిక వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పడవ సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చర్యలు చేపట్టారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. పర్యాటకుల్లో 30 మందితోకూడిన ఒక బృందం తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందినవారని... ప్యాకేజీ టూర్‌పై గురువారంనాడు పొర్ట్ బ్లెయిర్‌కు వచ్చారు. ఈ దుర్ఘటనపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం లక్ష పరిహారంగా ప్రకటించింది.

ఆప్ నుంచి ఎమ్మెల్యే బిన్నీ సస్పెండ్

      ఆమ్ ఆద్మీ పార్టీ తమ రెబెల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించింది. అధినేత కేజ్రీవాల్ పైన తీవ్రవిమర్శలు చేసి క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించడంతో ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నామని, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తనను పార్టీ నుండి బహిష్కరించడంపై బిన్నీ స్పందించారు. ఢిల్లీ సమస్యల పైన తాను మాట్లాడానని, అలాంటప్పుడు వారు తనను పార్టీ నుండి తొలగించడం కంటే మించి ఏమీ చేయలేరని విమర్శించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పైన బిన్నీ కొద్దిరోజుల క్రితం తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్, తాగునీటికి సంబంధించిన హామీలను పూర్తిగా అమలు చేయలేకపోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎఎపి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. కేజ్రీవాల్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటిగా ఉందన్నారు. హామీల అమలును కేజ్రీవాల్ పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు.

ముఖ్యమంత్రి తీర్మానంపై సభలో ప్రతిష్టంభన

  శాసనసభ, శాసనమండలిలో తెలంగాణా సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు అరగంటసేపు వాయిదా పడ్డాయి. ముఖ్యమంత్రి టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఇచ్చిన తీర్మానాన్ని సభలో ప్రేవేశపెట్టవద్దంటూ తెరాస నేతలు ఇచ్చిన తీర్మానాన్ని సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించడంతో తెరాస నేతలు సభలో ఆందోళనకు దిగారు. టీ-కాంగ్రెస్, టీ-తెదేపా, తెరాస సభ్యులందరూ ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్న తీర్మాన్న్ని ముక్తకంఠంతో వ్యతిరేఖిస్తున్నందున బహుశః మిగిలిన నాలుగు రోజులు కూడా ఉభయ సభలలో బిల్లుపై ఇక ఎటువంటి చర్చజరుగకపోవచ్చును. ఈ సమస్యను పరిష్కరించేందుకు సభాపతి బిజినస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ కూడా అదే పరిస్థితి తలెత్తవచ్చును. గనుక, ఇక బిల్లుపై ఎటువంటి చర్చ, తీర్మానం, ఓటింగ్ జరగకుండానే రాష్ట్రపతికి త్రిప్పి పంపబడే అవకాశాలే ఎక్కువ. బహుశః కేంద్రం కూడా అలాగే జరగాలని కోరుకొంటోందేమో.

రాజ్యసభ ఎన్నికలతో చంద్రబాబుకు తలనొప్పులు

  తెలుగుదేశం పార్టీకి ఉన్న రెండు రాజ్యసభ సీట్ల కోసం దాదాపు ఐదారు మంది పోటీ పడుతూ చంద్రబాబుకి బీపీ పెరిగేలాచేస్తున్నారు. రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి తెలంగాణా కు, మరొకటి సీమాంధ్రకు కేటాయించవలసి ఉంటుంది. తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తాను పార్టీకి చేసిన సేవలకి ప్రతిగా రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్లు గట్టిగానే చెపుతున్నారు. ఇంతకాలంగా చంద్రబాబుపై ఈగ కూడా వాలనీయకుండా కాపాడుకొంటూ వచ్చిన తనకు ఆయన తప్పకుండా రాజ్యసభ సీటు ఇస్తారని నమ్ముతున్నానని మోత్కుపల్లి అంటున్నారు. అయితే, పార్టీలో కార్పోరేట్ వర్గం తనకు టికెట్ రాకుండా అడ్డుకొంటుందేమోననే భయం కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తెలంగాణా నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా రాజ్యసభ సీటుపై ఆసక్తి చూపకపోయినా, మొత్కుపల్లికి మద్దతు ఇచ్చేందుకు కూడా ముందు రాలేదు. పార్టీలో మరికొందరు నేతలు వరంగల్ కు చెందిన తెదేపా జనరల్ సెక్రెటరీ గరికపాటి రామ్మోహన్ రావుకు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.   ఇక వీరు కాక నన్నపనేని రాజకుమారి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కే. రామ్మోహన్ తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో నన్నపనేని రాజకుమారి, చంద్రబాబు తనకు తప్పకుండా రాజ్యసభ సీటు ఇస్తారని చెప్పుకొంటున్నారు. హరికృష్ణ రాజీనామాతో ఖాళీ అయిన సీటుని ఆయన సోదరుడు బాలకృష్ణకే ఇద్దామని మొదట అనుకొన్నపటికీ, ఆయనను వచ్చే ఎన్నికలలో శాసనసభకు పోటీ చేయించడం వలెనే పార్టీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావించడంతో ఆయన ఈ పోటీ నుండి దాదాపు విరమించుకొన్నట్లే. కానీ పోటీలో మిగిలిన ఇంత మంది అభ్యర్ధులలో ఎవరిని కాదన్నా అలకలు బుజ్జగింపులు తప్పవు. ఈనెల 28న నామినేషన్లు వేయవలసి ఉంటుంది గనుక రేపే తెదేపా తన ఇద్దరు అభ్యర్దుల పేర్లు ఖరారు చేయవచ్చును. గనుక ఎల్లుండి నుండి తెదేపాలో అలకపాన్పు సీన్లు మొదలవుతాయేమో.

కిరణ్ దిగ్విజయ్ కి మొహం చాటేస్తారా

  రాజ్యసభ ఎన్నికలలో సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులు పార్టీ అభ్యర్ధికి వ్యతిరేఖంగా తమ అభ్యర్ధిని నిలబెత్టేందుకు సిద్దమవుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ డిల్లీ వెళ్లి పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో రాజ్యసభ అభ్యర్ధుల విషయంలో మంతనాలు చేస్తున్నారు.   కాంగ్రెస్ అధికారిక అభ్యర్ధుల మాటెలా ఉన్నా, తిరుగుబాటు అభ్యర్దులలో కూడా మళ్ళీ తీవ్రమయిన పోటీ నెలకొంది. ఇంతవరకు జేసీ.దివాకర్ రెడ్డి, గంటా శ్రీనివాస రావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటే ఇప్పుడు వారికి ఉండవల్లి అరుణ్ కుమార్, యం.యల్సీ. చైతన్య రాజు కూడా తోడయ్యారు. వారిలో జేసీ దివాకర్ రెడ్డి తనకు 40మంది శాసనసభ్యుల మద్దతు ఉందని చెప్పుకొంటుండగా, చైతన్యరాజు తనకి 52మంది మద్దతు ఉన్నట్లు చెప్పుకొంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవేళ రేపు పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ని కలిసేందుకు డిల్లీ వెళ్ళినట్లయితే ఈ పరిస్థితులు మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఈరోజు శాసనసభలో తెలంగాణా బిల్లుని చాలా ధాటిగా త్రిప్పికొట్టిన ఆయన రేపు డిల్లీకి వెళ్ళకుండా తమ తరపున వీరిలో ఎవరో ఒకరి పేరుని ఆయన ప్రతిపాదించవచ్చును.

బిల్లుని తిప్పి పంపేయమని కోరిన ముఖ్యమంత్రి

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ నిన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి తెలంగాణా బిల్లును వీలయినంత త్వరగా చర్చ ముగించి వెనక్కి పంపాలని కోరినట్లు చెప్పారు. బహుశః అందుకేనేమో, ఈరోజు శాసనసభలో తెలంగాణా బిల్లుపై చర్చలో మాట్లాడుతూ లోపభూయిష్టమయిన టీ-బిల్లుని, దానిని ఆవిధంగా రూపొందించిన హోంశాఖను, కేంద్రాన్ని, చివరికి తన అధిష్టానాన్ని కూడా తూర్పార బట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇటువంటి తప్పుల తడక బిల్లుపై ఇంకా సభలో చర్చఅవసరం లేదని దానిని వెంటనే వెనక్కి త్రిప్పిపంపమని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు నోటీసు ద్వారా కోరారు.    ఆ తరువాత మాట్లాడిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన తరువాత ఆయన కూడా ఇటువంటి లోపభూయిష్టమయిన బిల్లుపై చర్చించవలసిన అవసరం లేదని వెంటనే త్రిప్పి పంపమని స్పీకర్ ను కోరారు. అదేవిధంగా శాసనమండలిలో మంత్రి సి.రామచంద్రయ్య కూడా సరిగ్గా ఇదే కారణాలతో బిల్లును వెనక్కి త్రిప్పిపంపాలని మండలి చైర్మన్ చక్రపాణికి నోటీసులు ఇచ్చారు.   ఒకవైపు బిల్లుపై చర్చ జరగడానికి ఇంకా గడువు కావాలంటూనే, ఏవో కారణాలు చెప్పి బిల్లుని గడువు కంటే ముందే వెనక్కి త్రిప్పిపంపేయాలని కోరడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ గమ్మతయిన విషయం ఏమిటంటే, బిల్లుని ఎంత త్వరగా వెనక్కి పంపుదామా అని ఎదురు చూస్తున్న టీ-కాంగ్రెస్ నేత కే.జానారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రపతి సభలో చర్చించమని పంపిన బిల్లును ఒక ముఖ్యమంత్రో లేక ప్రతిపక్ష నాయకుడో త్రిప్పి పంపమని అడిగే అధికారం ఉందా? తెలుపమని స్పీకర్ ని కోరారు. ఆయన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ, మనం ఎవరికీ బానిసలు కామని, సభ్యులందరికీ స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని అన్నారు. బిల్లు లోపభూయిష్టంగా ఉన్నట్లయితే త్రిప్పి పంపమని అడిగే హక్కు ఉంటుందని ఆయన అన్నారు   రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి త్రిప్పి పంపాలని స్పీకర్ కి నోటీసులిచ్చిన ముఖ్యమంత్రి బిల్లుని ఏకమొత్తంగా తిరస్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి హోదాలో ఒక తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు తాజా సమాచారం. ఆవిధంగా చేయడం ద్వారా అధిష్టానం ఆదేశాల మేరకు బిల్లుని వీలయినంత త్వరగా వెనక్కి త్రిప్పి పంపుతున్నపటికీ, తనపై ఎటువంటి  నింద పడకుండా, తాను బిల్లును గట్టిగా వ్యతిరేఖిస్తున్నట్లు చెప్పుకొనే సౌలభ్యం కూడా ఆయనకి ఉంటుంది. బిల్లుని తిరస్కరిస్తూ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, దానిపై తెలంగాణా సభ్యులందరూ ఆయనపై చెలరేగిపోవడం ఖాయం గనుక అది కూడా ఆయనకు సీమాంధ్రలో సానుభూతిని సంపాదించి పెడుతుంది.     అదేవిధంగా తెలంగాణా సభ్యులందరూ ఆయన పెట్టబోయే తీర్మాన్నాన్ని, ఆయనని ఎంతగా విమర్శించినప్పటికీ, ఆ తీర్మానం వలననే బిల్లు గడువు కంటే ముందుగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందని తెలుసు గనుక ఆయనకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండరు.    .  

టీ-బిల్లుని ఎండగట్టిన ముఖ్యమంత్రి

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా బిల్లుపై ఈరోజు శాసనసభ లో జరుగుతున్నచర్చసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేసేందుకు బిల్లు రూపొందిస్తున్నపుడు అందులో తప్పనిసరిగా పేర్కొనవలసిన అనేక అంశాలను కేంద్రం, హోంశాఖ పూర్తిగా విస్మరించాయని, కనీసం ఆ వివరాలను కోరినప్పుడయినా పొంతనలేని సమాధానాలు చెపుతూ ఇవ్వడానికి నిరాకరించిందని కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగంలో సూచించిన కొన్నినియమాలను చదివి వినిపించి, కేంద్రం కనీసం రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా నయినా బిల్లు రూపొందించలేకపోయిందని ఆక్షేపించారు.   ఒక రాష్ట్రాన్ని విభజిస్తున్నపుడు దానివలన రెండు ప్రాంతాలకు, ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం కలుగుతుందో, విభజనకు కేంద్రం ఏవిధమయిన ఏర్పాట్లు చేస్తోందో, అందులో ఇమిడి ఉన్నఅనేక ఆర్ధిక అంశాలను ఏవిధంగా పరిష్కరించబోతోందో, నిధులను ఏవిధంగా సమకూర్చదలచుకొందో వంటి ముఖ్యమయిన వివరాలను బిల్లులో పొండుపరచకుండా, చేస్తాం, చూస్తాం, ఆలోచిస్తాం, పరిశీలిస్తాం అంటూ చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిందని తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రం తనేవిధంగా రాష్ట్ర విభజన చేయదలచుకున్నదీ వివరించకుండా, ఇటువంటి అసమగ్రమయిన బిల్లుని శాసనసభకి పంపితే తాము దానిపై ఏవిధంగా చర్చించగలమని ఆయన ప్రశ్నించారు. అసలు ఇది బిల్లా లేక ముసాయిదా బిల్లో కూడా తెలియని పరిస్థితని ఆయన ఆక్షేపించారు.

తెలంగాణా ఏర్పాటుకి తెరాస విలీనంతో లంకె ఉందా

  రాష్ట్ర విభజనతో ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను దెబ్బతీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే కారణంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతల తిరుగుబాటుని, ప్రజలలో వ్యతిరేఖతని ఎదుర్కోకతప్పడం లేదు. అయితే ఇది కూడా ప్రతిపక్షాలను ఏమార్చడానికి వేసిన ఎత్తుగడ అయినా ఆశ్చర్యం లేదు. ఎన్నికలలోగా రాష్ట్ర విభజన చేస్తామని చెపుతున్న కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేస్తున్నకారణంగా అభ్యర్ధులను ఖరారు చేయలేకపోతుంటే, తెరాస తమతో విలీనం అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉండటం వలన తెలంగాణాలో అభ్యర్ధులను ఖరారు చేయలేకపోతోంది. అందువల్ల సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డో మరొకరో కొత్తపార్టీ స్థాపించిన తరువాత, పార్టీలో ఇంకా ఎంత మంది మిగులుతారో లెక్కలు సరిచూసుకొని అప్పుడే తన అభ్యర్ధులను ప్రకటించవచ్చును.   అదేవిధంగా తెలంగాణాలో తెరాసతో పొత్తులు, విలీనం లెక్కలు తెలితేగానీ, ఆ రెండు పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించలేవు. తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు డిశంబర్ రెండవ వారంలోనే తమ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటిస్తానని గతంలో చెప్పినప్పటికీ ఇంతవరకు ప్రకటించలేకపోవడానికి కారణం కూడా బహుశః ఇదే అయిఉండవచ్చును. ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో చేతులు కలుపుతాయా లేదనే సంగతి పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టిన తరువాతనే తేలవచ్చును.   అయితే, వచ్చేఎన్నికలలో తెరాసకే మెజార్టీ రావచ్చని సర్వేలు స్పష్టం చేస్తుండటంతో, తెలంగాణా బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా తెరాస కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు ఇష్టపడకపోవచ్చును. అదే జరిగితే, రాష్ట్ర విభజన చేసి రెండు ప్రాంతాలలో లబ్ది పొందాలని ఎత్తువేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కూడా ఘోరంగా దెబ్బతినడం ఖాయం. ఒకవేళ ఎన్నికలలోగా కాంగ్రెస్ తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ, ఆ క్రెడిట్ మొత్తం తెరాస ఎత్తుకుపోవడం ఖాయం. ఎందుకంటే, వచ్చే ఎన్నికలలో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది గనుక, దానిని, తెరాసను తట్టుకొని కాంగ్రెస్ ఒంటరిగా గెలవలేదు. గనుక, ఎట్టిపరిస్థితుల్లో పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందక మునుపే, కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం లేదా ఎన్నికల పొత్తుల కోసం ఒత్తిడి చేయవవచ్చును. ఒకవేళ తెరాస విలీనానికి లేదా పొత్తులకి అంగీకరించకపోయినట్లయితే, తెలంగాణా బిల్లును రాష్ట్రపతి వద్ద త్రోక్కిపెట్టించో లేకపోతే బీజేపీని రెచ్చగొట్టి బిల్లుకి మద్దతు ఈయకుండా చేసి నెపం దానిమీద పెట్టో పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదింపజేయకుండా తప్పుకొని, సీమాంధ్రలో తన రహస్య మిత్రులను గెలిపించుకొనే ప్రయత్నం చేయవచ్చును. తద్వారా కొంత మేరయినా నష్టం తగ్గించుకోగలదు.

ఎన్టీఆర్ మానవతా వాది: రేవంత్

      నందమూరి తారకరామారావు సమైక్యవాది అని ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ ఆయన గొప్ప మానవతా వాది అని రేవంత్ రెడ్డి అన్నారు. విభజన బిల్లుపై చర్చ సంధర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడానికే ఎన్టీఆర్ టిడిపి పార్టీ స్థాపించారని అన్నారు. తెలంగాణ యువతకు అన్యాయం జరిగిందని ఎన్టీఆర్ భావించారని, ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగానే కేసీఆర్, ఎర్రబెల్లి, బాలయోగి, ఎర్రన్నాయుడు, యనమల, దేవేందర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు తదితర ఆణిముత్యాల వంటి నేతలు ఈ దేశానికి లభించారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ పేదల పక్షపాతి అని, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకువచ్చి ఆయన ప్రజలకు మేలు చేశారని అన్నారు.

డిఎంకె పార్టీలో రచ్చకెక్కిన విభేదాలు

      డిఎంకె పార్టీలో కుటుంబ, పార్టీ విభేదాలు రచ్చకెక్కాయి. కరుణానిధి ఏకంగా తన తనయుడినే పార్టీ పదవుల నుండి బహిష్కరించడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ నుండి బహిష్కరణకు గురైన కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి పార్టీపై మండిపడ్డారు. తన తండ్రిని కొ౦త మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం లెదని..కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో బహిష్కరించారని అన్నారు. డిఎంకె పార్టీ విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెతో పొత్తు ప్రయత్నాలు చేస్తోంది. దీనిని అళగిరి, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కరుణ వ్యూహం అమలు కానున్న తరుణంలో ఎంపీ అళగిరి ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌కాంత్‌పై విమర్శలకు దిగారు. విమర్శలు చేసినందుకు అళగిరిని కరుణ తీవ్రంగా మందలించారు. డిఎంకెలో కీలక బాధ్యతలు చేపట్టే విషయంలో కరుణానిధి కుమారులు అళగిరి, స్టాలిన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.

తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయ౦: కమల్‌నాథ్

      ఫిబ్రవరి 5 నుంచి మొదలుకానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలు పొడిగించైనా తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూస్తామని పేర్కొన్నారు. పార్లమెంటులో బిల్లును త్వరగా ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని' దృష్టిలో ఉంచుకుని గడువు వారం మాత్రమే పెంచుతున్నట్లు రాష్ట్రపతి తన ఆదేశాల్లోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కమల్‌నాథ్ చేసిన ప్రకటనతో వచ్చేనెలలో బిల్లు ప్రవేశపెట్టడం ఖాయమని తెలిసిపోతోంది. వచ్చేనెల 5 నుంచి 20వ తేదీ వరకు పార్లమెంటు సమావేశ పరచాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోపాటు మరికొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అనూహ్య హత్య: షిండేని కలిసిన తండ్రి

      ముంబై నగర శివార్లలో కాలిన శవమై లభించిన మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య తండ్రి ప్రసాద్ శుక్రవారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేని కలిసి తమకు న్యాయం చేయాలని, దోషులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన కూతురిని వెతుకుతూ తాను అనుభవించిన మనోవేదన ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఆయన షిండేతో అన్నారు. అనంతరం ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ జరిగిన దుర్ఘటన గురించి షిండేకు తెలిమజేశామని అన్నారు. కేసు విషయంలో పోలీసులు కూడా తమకు సహాయపడడంలేదని, తమ కుమార్తె అదృశ్యమైనప్పటి నుంచి ఆచుకీ కోసం స్వయంగా తామే గాలించామని, చివరికి పదిరోజుల తరువాత తను మృతదేహం లభించింది. మాకు కలిగిన ఈ బాధ మరే తల్లిదండ్రులకి రాకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శాసనసభలో టీఆర్ఎస్ వర్సెస్ టిడిపి

      తెలంగాణ బిల్లుపై శాసనసభలో తీవ్ర గందరగోళం మధ్య చర్చ జరుగుతోంది. సభలు పలుమార్లు టీఆర్ఎస్, టిడిపి సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. విభజన బిల్లుపై టీఆర్ఎస్ నేత జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణకు ప్రధాన అడ్డంకి చంద్రబాబు నాయుడే అని, టీడీపీ వైఖరి వల్లే వేలాది మంది ఆత్మహత్య చేసుకున్నానరని జోగు రామన్న ఆరోపించారు. దీనిపై సభలో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. జోగురామన్న వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అవకాశవాదం వల్లే తెలంగాణలో వేలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలకు అడుగడునా ఆదుకున్నది టీడీపీనే అని తెలియజేశారు.

సల్మాన్ 'జయహో': అసద్ కు కౌంటర్

      బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మీద ప్రశంసల జల్లు కురిపించి మద్దతు ప్రకటించడంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ సినిమాలను బహిష్కరించాలని తన మద్దతుదారులకు పిలునిచ్చారు. తాజాగా దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించారు. నరేంద్ర మోదీని కలవడాన్ని ఆయన సమర్ధించుకున్నారు.   జయహో చిత్రం ప్రోమోషన్ కోసం గుజరాత్ వెళ్లానని..పతంగులు ఎగురవేశానని చెప్పారు. తాను సగం హిందూ..సగం ముస్లీంనని అన్నారు. అలాగే తన తండ్రి ముస్లిం అని, తన తల్లి హిందువు అని చెప్పారు.గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు బాగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. ''జయహో'' మంచి మెసేజ్ వున్నా చిత్రమని అందరూ తప్పక చూడాలని అన్నారు.      

కాంగ్రెస్ లోకి అరవింద రెడ్డి!

      ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరవింద రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో తనకు సీటు ఇస్తామని హామీ ఇస్తే పార్టీలో చేరతానంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలిసి చెప్పినట్లు సమాచారం. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అరవింద్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన మాట వాస్తవమేనని..తెలంగాణ ప్రజల పక్షానే ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌తో ఆయనకు సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు.

విజయవాడ టికెట్ ఇస్తే పొట్లూరి తెదేపా గూటికి

  కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు సినీ నిర్మాత పొట్లూరు వర ప్రసాద్ త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, విజయవాడ నుండి పోటీ చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని పార్టీలో ఎక్కువకాలం కొనసాగడం కష్టమని గ్రహించిన ఆయన వైకాపాలో చేరే ఆలోచనను విరమించుకొన్నారు. అయితే, ఇదంతా జగన్మోహన్ రెడ్డిని, వైకాపాని అప్రదిష్టపాలు చేసేందుకు చంద్రబాబు, ఆయనకి అనుకూలంగా ఉండే మీడియా చేసిన కుట్రే తప్ప తామేనాడు పొట్లూరిని పార్టీలోకి ఆహ్వానించలేదని, టికెట్ కూడా ఆఫర్ చేయలేదని వైకాపా వాదించింది.   తాజా సమాచారం ఏమిటంటే పొట్లూరి తెదేపాలో చేరే ప్రయత్నంలో కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రముఖ తెదేపా నాయకుడుని వెంటబెట్టుకొని మొన్న చంద్రబాబుని కలిసి విజయవాడ లోక్ సభ టికెట్ కోసం అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. కానీ, ఆ సీటు ఇప్పటికే కేశినేని నానికి కేటాయించినందున దానిని ఆయనకు ఇవ్వడం సాధ్యం కాదని, వేరెక్కడి నుండయినా పోటీ చేసేందుకు సిద్దపడితే ఆలోచిస్తామని చంద్రబాబు జవాబు చెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు విజయవాడ సీటుని ఆశిస్తున్న వల్లభనేని వంశీని తప్పించి, కేశినేని నానికి అప్పగించారు. దానితో వంశీ చాలా ఆగ్రహించినపుడు, ఆయనకు గన్నవరం శాసనసభ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని సమాచారం. అందువల్ల ఇప్పుడు పొట్లూరి విజయవాడ టికెట్ ఆశించినా ఇవ్వలేని పరిస్థితి.   పొట్లూరి కృష్ణాజిల్లాలో కొందరు తెదేపా శాసనసభ్యులను కలిసి వారి మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నం చేసారు. కానీ వారెవరూ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేఖంగా వెళ్లేందుకు సిద్దపడకపోవడంతో పొట్లూరి చివరి ప్రయత్నంగా నేరుగా చంద్రబాబునే కలిసి మాట్లాడారు, కానీ ఫలితం లేకపోయింది. ఈసారి ఎన్నికలలో పోటీ చాలా తీవ్రంగా ఉండబోతునందున, చంద్రబాబు అభ్యర్దుల ఎంపికలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. మరో పక్క నారా లోకేష్ కూడా వేరేగా ఎప్పటికప్పుడు నియోజక వర్గాల వారిగా సర్వేలు నిర్వహింపజేయిస్తూ గెలుపు గుర్రాల పేర్లను తండ్రికి సూచిస్తునట్లు సమాచారం.   ఒకవేళ పొట్లూరి విజయవాడ కోసం పట్టుబట్టకుండా వేరే చోట నుండి పోటీకి అంగీకరించినప్పటికీ, తెదేపా టికెట్స్ కోసం చాలా ఒత్తిడి ఉన్నకారణంగా ఆయనకు ఎక్కడి నుండి టికెట్ కేటాయించాలన్నాచాలా కష్టమే అవుతుంది. అయినప్పటికీ, ఒకవేళ పొట్లూరి అందుకు అంగీకరిస్తే చంద్రబాబు ఏదోవిధంగా సర్దుబాటు చేయవచ్చునేమో! ఒకవేళ పొట్లూరి విజయవాడ టిక్కెటే కావాలనుకొంటే, ఆయన తరువాత గమ్యం కాంగ్రెస్ పార్టీ కావచ్చును. ఎందుకంటే విజయవాడ కాంగ్రెస్ యంపీ లగడపాటి రాజగోపాల్ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసి కిరణ్ కుమార్ రెడ్డి లేదా తనే స్వయంగా స్థాపించబోయే కొత్త పార్టీ టికెట్ మీద పోటీ చేయబోతున్నారు గనుక, పోట్లూరికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ దొరికే అవకాశం ఉంది. కానీ, సీమాంధ్రలో తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయడమంటే అది మరొక వర్ణ చిత్రమే అవుతుంది ఆయనకు. గనుక తన కల నెరవేర్చుకోవడానికి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయవలసి ఉంటుంది. కానీ, అది కూడా చాలా భారీ ఖర్చు, రిస్కుతో కూడిన వ్యవహారమే గనుక, పొట్లూరి ఏమి చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.