లగడపాటి రాజీనామా ఆమోదించిన స్పీకర్

      విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామాను లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ఆమోదించారు. లగడపాటి రాజీనామాను ఆమె సభలో చదివి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడంపై మనస్థాపం చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను స్పీకర్ మీరా కుమార్ కి ఫ్యాక్స్ చేశారు.   రాష్ట్ర విభజనను ఆపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని, ఇలాంటి రాజకీయాల్లో తాను ఇమడలేనని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రావొద్దన్నారు. ఈ ఘటన కొత్త రాష్ట్రాల డిమాండ్‌కు ఊతమిస్తుందని లగడపాటి వెల్లడించారు. ఇక నుండి ప్రజలంతా భారతీయులుగా, తెలుగువారిగా కలిసి మెలిసి ఉండాలని, రాష్ట్ర విభజన గురించి తాను ఇప్పుడు ఏం మాట్లాడిన ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.  

కిరణ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. కిరణ్ రాజీనామాపై మీడియా సమావేశం అయిన వెంటనే క్యాంపు కార్యాలయం నుంచి రాజభవన్ బయలుదేరి వెళ్లి గవర్నర్ కు రాజీనామాను లేఖను సమర్పించారు. దీంతో గవర్నర్ వెంటనే ఆమోదముద్ర వేశారు. కిరణ్ ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని గవర్నర్ కోరకపోవడం విశేషం. కిరణ్ రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం తేలిగ్గా తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. కిరణ్ రాజీనామా ఉహించినదేనని, అందులో విశేషం ఏమిలేదని అన్నారు. రాష్ట్ర విభజన్ జరిగిన తరువాత కిరణ్ రాజీనామా చేయక తప్పదని అన్నారు.   రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు షిండే సమాధానం చెప్పలేదు.

కాంగ్రెస్ కి, సీఎం పదవికి కిరణ్ రాజీనామా

      సీట్ల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం తెలుగుజాతిని విడగొట్టి, తీవ్రనష్టం కలిగించిన దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి, సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తమ పార్టీల లాభం కోసం, ప్రజల ఓట్ల కోసం అన్ని పార్టీలు కాంగ్రెస్, జగన్, చంద్రబాబు, బిజెపి, కేసిఆర్ లు తెలుగు జాతికి నష్టం చేశారని మండిపడ్డారు.   రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు కష్టాలు ఎదుర్కొంటారని అన్నారు.  విభజన వల్ల ప్రజలకు లాభం చేకురాలి కాని ఈ విభజన వల్ల విద్యార్ధుల, రైతుల, ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అన్నారు.  రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాజ్యంగా, సంప్రదాయ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు. దొంగలమాదిరి టీవీ ప్రత్యక్ష ప్రసారాలు ఆపివేసి,బిల్లు ఆమోదించడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  విభజన ప్రక్రియతో సిగ్గుతో తలవంచుకోవల్సి వచ్చిందని అన్నారు. నాకు నా భవిష్యత్తు ముఖ్యం కాదు, తెలుగు ప్రజల భవిష్యత్తు ముఖ్యమని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకి నేను వ్యతిరేఖం కాదు. ఇరుప్రాంత ప్రజల మేలు కోసమే ఇన్ని రోజులు పోరాటం చేశానని, ఎవరినైనా నొప్పించి వుంటే క్షమించాలని కిరణ్ కోరారు.  

ఈ 'చిన్నమ్మ'ను గుర్తుపెట్టుకోవాలి: సుష్మా

      తెలంగాణ బిల్లు ఎప్పుడు తెచ్చినా మద్దతిస్తామని చెప్పాం...ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని బిజెపి నేత సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అనేక మంది బలిదానాలు చేసుకున్నారు. అలాంటి వారి స్వప్నాలు నేరవేరే బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు విశ్వాస ఘాతుకానికి ఎలా పాల్పడతాం? అని ప్రశ్నించారు. అయితే తెలంగాణ ఇచ్చిన సోనియా అమ్మను గుర్తుచేసుకోనేటప్పుడు..ఈ చిన్నమ్మ చేసిన సహాయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని లోక్ సభలో వ్యాఖ్యానించారు.   హైదరాబాద్‌ను తెలంగాణకు ఇవ్వడం వల్ల తెలంగాణకు లాభమేనని, అదే సమయంలో సీమాంధ్రకు వచ్చే నష్టాన్ని ఎలా పూరిస్తారని సుష్మ ప్రశ్నించారు. కేవలం హామీలతో లాభం లేదని, ఎంత మొత్తం కేటాయిస్తారో ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. సీమాంధ్రలో ఏర్పాటు చేసే కీలకమైన సంస్థలన్నిటికీ ప్రణాళికా సంఘం అనుమతి ఇప్పించాలని, ఈ తాత్కాలిక బడ్జెట్‌లోనే కొంత మొత్తాన్ని కేటాయించాలని ఆమె కోరారు.

కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే

  సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ ఎంతగా వంచించిందో, సీమాంధ్రకు న్యాయం చేయకపోతే బిల్లుకి మద్దతు ఈయబోమని చెపుతూవచ్చి చివరికి బిల్లుకి మద్దతు ఇచ్చిన బీజేపీ కూడా అంతకంటే ఎక్కువగానే వంచించిందని చెప్పక తప్పదు. పైగా తాము మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుకి కట్టుబడి ఉన్నదునే బిల్లుకి మద్దతు ఇచ్చామని, కానీ కాంగ్రెస్ పార్టీయే బిల్లు విషయంలో ద్వంద వైఖరి అవలంబించిందని గొప్పగా చెప్పుకొన్నారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ఆడిన ఈ నాటకంలో సీమాంధ్ర ప్రజలు మోసపోయారు. అయితే ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే బీజేపీ సీమాంధ్రకు అన్యాయం జరిగిందని, దానికోసం రాజ్యసభలో పోరాడుతామని మొసలి కన్నీరు కారుస్తోంది. కానీ, రెండు పార్టీలు కలిసి సీమాంధ్ర ప్రజలను ఇంత దారుణంగా వంచించిన తరువాత కూడా ఆ పార్టీలు ప్రజలని మభ్యపెట్టాలని ప్రయత్నించడం, తమ మాటలను ప్రజలు నమ్ముతారని భ్రమలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.   కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో , కేంద్రంలో తిరిగి అధికారంలోకి రాగలిగినపుడు ఆ హామీలకు విలువ ఏమయినా ఉంటుంది. లేకుంటే, తరువాత అధికారంలోకి వచ్చే బీజేపీ వాటిలో ఎన్ని అమలు చేస్తుందో, ఎన్నిటికి కొర్రీలు వేసి తప్పించుకొంటుందో ఎవరికీ తెలియదు. గతంలో విడిపోయిన రాష్ట్రాలకే ఇంతవరకు అతీగతీ లేనప్పుడు, లక్షల కోట్లు ఖర్చు వెచ్చించి మళ్ళీ మొదటి నుండి పునర్నిర్మాణం చేయవలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, కాంగ్రెస్, బీజేపీలు పట్టించుకొంటాయని భావించడం అడియాశే అవుతుంది. కాంగ్రెస్ చేసిన ఈ దుశ్చర్యకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కనీసం మరో ఒకటి రెండు దశాబ్దాలపాటు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అందుకు ప్రతిగా తమను ఇంత ఘోరంగా వంచించిన కాంగ్రెస్, బీజేపీలు కూడా త్వరలో జరగనున్న ఎన్నికలలో తగు మూల్యం చెల్లించుకొనేలా ప్రజలే శిక్షించాలి. తమ ఆత్మాభిమానంపై చావుదెబ్బ తీసిన ఆ రెండు పార్టీలకు తగిన గుణపాటం చెప్పవలసి ఉంటుంది.

పురందేశ్వరి దంపతులు కాంగ్రెస్ కి గుడ్ బై

  రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈ రోజు చాలా మంది మంత్రులు, శాసనసభ్యులు తమ పదవులకు, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామాలు చేసారు. అందులో ప్రముఖంగా పేర్కొనవలసిన వారు కేంద్రమంత్రి పురందేశ్వరి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పార్ధ సారధి, ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్ ఉన్నారు. ఇంకా శాసనసభ్యులలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, యూవీ రమణ మూర్తి (యలమంచిలి), షాజహాన్ బాష (మదనపల్లి), రమేష్ బాబు( పెందుర్తి, వైజాగ్); రామారావు (తెదేపా-కొవ్వూరు) శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా మరికొందరు కూడా రేపు రాజీనామా చేయనున్నారు. అయితే అందరికంటే ముందుగా రాజీనామా చేస్తారనుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంకా ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియలేదు. బహుశః రేపు ఉద్యమ 10.30గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన తరువాత రాజీనామా చేయవచ్చని సమాచారం. ఆయనతో బాటు కనీసం పాతిక మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రేపటితో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపు సగంపైగా ఖాళీ అయిపోవచ్చును. విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ తను రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం దీనికి సిద్దపడే ముందుకు వెళ్ళింది గనుక పెద్దగా చింతించకపోవచ్చును. అదేవిధంగా ఇప్పుడు వీరందరూ రాజీనామాలు చేసినందున కొత్తగా ఒరిగేదేమీ ఉండదు.   బహుశః రేపటి నుండి బొత్ససత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతారేమో.ఇంట్లో శవం లేచి లేస్తే ఒకళేడుస్తుంటే, పోనీలే మంచం ఖాళీ అయిందని మరొకరు సంతోషించినట్లుంది ఆయన పని.  

విభజన బిల్లుపై సుప్రీంకు కావూరి

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యంగా విరుద్దమని, దీనిపైన సుప్రీం కోర్టుకు వెళ్తానని కేంద్రమంత్రి సాంబశివరావు అన్నారు. కోర్ట్ ఈ బిల్లుని కొట్టివేస్తుందని అయన అన్నారు. మరోవైపు విభజన అనంతరం పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండనుంది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్‌కు కట్టబెట్టడంపై తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే రాజ్యసభకు తీసుకొస్తామన్నారు. లోకసభలో విభజన బిల్లుకు మొత్తం 38 సవరణలు ఆమోదం పొందాయని తెలిపారు.

ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడంపై మనస్థాపం చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనను ఆపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని, ఇలాంటి రాజకీయాల్లో తాను ఇమడలేనని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రావొద్దన్నారు. ఈ ఘటన కొత్త రాష్ట్రాల డిమాండ్‌కు ఊతమిస్తుందని లగడపాటి వెల్లడించారు. ఇక నుండి ప్రజలంతా భారతీయులుగా, తెలుగువారిగా కలిసి మెలిసి ఉండాలని, రాష్ట్ర విభజన గురించి తాను ఇప్పుడు ఏం మాట్లాడిన ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఇక తాను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగలేనని, ప్రజాస్వామ్య దేశంలో రాచరికపు పోకడలు అన్యాయమని ఆయన బాధను వ్యక్తం చేశారు.

మజువాణితో తెలంగాణ బిల్లు ఆమోదం

      తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. తెలంగాణ బిల్లుపై కేవలం 23 నిమిషాలు మాత్రమే చర్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును లోక్ సభ ఆమోదించింది. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అధికారికంగా పూర్తయినట్టే. ఇక బిల్లును రేపు లేదా ఎల్లుండి రాజ్యసభకు పంపనున్నారు. అక్కడ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే కావచ్చు. 60 ఏళ్ల తెలంగాణ కల నెరవేరిందని, తెలంగాణ వాదులు సంయమనంతో ఉండాలని, సీమాంధ్ర సోదరులను అక్కున చేర్చుకుని అండగా ఉంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా కలిసింది, రెండు రాష్ట్రాలుగా విడిపోయిందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. ఈ విజయం కేసీఆర్, జయశంకర్ లదే అని చెప్పారు. హైదరాబాదులో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ నగరంలో అందరూ హాయిగా బతకవచ్చని చెప్పారు. కోట్లాదిమంది తెలంగాణ కలను సోనియాగాంధీ నిజం చేసిందని, ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు.

మంత్రి గంటా రాజీనామా

      కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాష్ట్ర ఓడరేవులు, మౌలిక సదుపాయాల కల్పనా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని గంటా తొలుత నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గతంలో మంత్రి పదవికి ఆయన రాజీనామా కూడా చేశారు. దానిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదించలేదు. గంటా శ్రీనివాస రావు తన రాజీనమా లేఖను గవర్నర్ నరసింహన్‌కు ఫాక్స్ ద్వారా పంపించారు. గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు కొంత మంది కాంగ్రెసు శాసనసభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారని అంటున్నారు.

సోనియాకి దమ్ము౦దా?: మోదీ

      కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలపై బీజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ కర్ణాటక దావణగెరె సభలో ప్రసంగిస్తూ...కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కురిపించారు. యూపీఏను అధికారంలోకి తీసుకువచ్చిన ఆంధ్రప్రజలకి కాంగ్రెస్ వెన్నుపోటు పోడిచిందని అన్నారు. ఆంధ్రాలో అడుగుపెట్టే దమ్ము సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వున్నాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని అన్నారు. సీమాంధ్రకు న్యాయం చేసే పరిస్థితులలో కాంగ్రెస్ లేదని, విభజనపై ఆహంకారంతో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే కొత్త ముఖ్యమంత్రి?

  మరికొద్ది సేపటిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, బహుశః పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నారు. ఆయన వెంట ఎంత మంది మంత్రులు, శాసనసభ్యులు బయటకి వెళ్లేందుకు సిద్దపడుతారనే దానిపైనే ఆయన కొత్తపార్టీ భవిష్యత్తు, రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విదించవలసిన అవసరం ఉందా లేదా? అనే సంగతులు స్పష్టమవుతాయి. ఒకవేళ ఆయన తనతో కనీసం 25మందికి తక్కువ కాకుండా బయటకు తీసుకువెళ్ళగలిగినట్లయితేనే కొత్తపార్టీకి పూర్తి మద్దతు ఉందని భావించవచ్చును. లేకుంటే కొత్తపార్టీ ఆలోచన కూడా అనవసరమేనని చెప్పవచ్చును. ఇక, ఒకవేళ ఆయన వెంట కనీసం 25 మంది శాసనసభ్యులు బయటకు వెళ్లేందుకు సిద్దపడినట్లయితే రాష్ట్రపతి పాలన అనివార్యమవుతుంది. బయటకు వెళ్లకుంటే వారు ప్రభుత్వంలోనే కొనసాగుతున్నట్లవుతుంది గనుక, కేంద్రం శాసనసభను తాత్కాలికంగా నిద్రావస్థలో ఉంచి, పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందగానే, మళ్ళీ సభను సమావేశపరిచి, రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను, పీసీసీ అధ్యక్షులను నియమించవచ్చును. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డితో కేవలం పది లేదా పదిహేను మందిని మాత్రమే బయటకువెళ్ళినట్లయితే, తెరాస, మజ్లిస్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోవచ్చును. మరొక రెండు నెలలలో ఎన్నికలు జరుగనున్నందున తన ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకే కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించవచ్చును తప్ప రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపకపోవచ్చును.

తెలంగాణ బిల్లును గట్టేక్కిస్తాం: కమల్‌నాథ్

      లోక్ సభలో తెలంగాణ బిల్లును ఆరునూరైనా గట్టేకిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుపై సభలో చర్చ జరగకపోయినా పార్టీకి వచ్చే నష్టం ఏమిలేదని అన్నారు. మూజువాణి ఓటుతోనైనా సరే తెలంగాణ బిల్లును గట్టెక్కిస్తామని వివరించారు. బిల్లుపై అర్ధవంతమైన చర్చ జరపాల్సిన బాధ్యత భారతీయ జనత పార్టీ పైన ఉందని అన్నారు. సీమాంద్ర కు బిజెపి ఎలాంటి న్యాయ౦ చేయాలనీ భావిస్తున్నారో అది వారే తేల్చుకోవాలని చెప్పారు. సభలో చర్చ జరిగేందుకు సీమాంధ్ర నాయకులు సహకరించాలని...ఆందోళనలు మాని చర్చలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ బిల్లుపై ప్రారంభమైన చర్చ

      లోక్ సభ వాయిదా అనంతరం ప్రారంభమవగానే స్పీకర్ మీరా కుమారి ప్రశ్నోత్తరాలపై చర్చ చేపట్టారు. సీమాంధ్ర ఎంపీలు తమ ఆందోళనలను మాత్రం అదే విధంగా కొనసాగిస్తున్నారు. ప్లకార్డులు చేతపట్టి.. స్పీకర్ పోడీయంను చుట్టూ ముట్టి సమైక్యనినాదాలు చేస్తుండడంతో సభలో తీవ్ర గందరగోళ వాతవరణం నెలకొంది. వీరితో పాటు తమిళజార్లకు న్యాయం చేయాలంటూ తమిళ ఎంపీలు కుడా ఆందోళనకు దిగడంతో సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆందోళకర పరిస్థితుల మధ్యే హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు అనుమతించాలని స్పీకర్ ను కోరారు. ఈ సమయంలో షిండే కు రక్షణగా తెలంగాణ ఎంపీలు చుట్టూ నిలబడ్డారు. చర్చ ప్రారంభమైనప్పుడు సభలో సోనియా, మన్మోహన్ సింగ్ లేరు. వెంటనే సభ మళ్ళీ 12.45 వరకు వాయిదా పడింది.

విభజన రాష్ట్ర సమస్య కాదు..దేశ సమస్య: బాబు

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం అధికారముందని ఇష్టంవచ్చినట్లు వ్యవహరిస్తుందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా, రాజ్యంగా ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది తెలుగుజాతికి సంబంధించిన సమస్యకాదని, దేశ సమస్య అని బాబు అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతింటే దేశంలో తీవ్రమైన ప్రభావాలు వుంటాయని హెచ్చరించారు. వ్యక్తులు ముఖ్యం కాదు... వ్యవస్థలు, రాజ్యంగం ముఖ్యమన్నారు. కాంగ్రెస్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కుట్ర రాజకీయాలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎంపీ హర్షకుమార్ అవిశ్వాసం నోటిసు

      పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించేందుకు సిద్దమవుతున్నయూపీఏ ప్రభుత్వం అనకాపల్లి ఎంపీ హర్షకుమార్ అవిశ్వాసం తీర్మానం నోటిసు ఇచ్చారు. ఈ రోజు లోక్ సభలో మధ్యాహ్నం తెలంగాణ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఆయన అవిశ్వాసం తీర్మానం ఇచ్చారు. అదే విధంగా సభ నుంచి సస్పెండ్ అయిన సీమాంధ్ర ఎంపీలను సభలోకి అనుమతించాలని మరో నోటిసు కుడా ఇచ్చారు. సభలో నిరసనలు కొనసాగించాలని ఈ సీమాంధ్ర ఎంపీలు నిర్ణయించుకోవడంతో లోక్ సభ ప్రారంభమైన వెంటనే 12గంటల వరకువాయిదా పడింది. తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ పార్టీ ఎంపీలకు మంగళవారం ఉదయం విప్ జారీ చేసింది.

లోక్ సభ 12గంటల వరకు వాయిదా

      పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండు నిమిషాలకే ఉభయ సభలు వాయిదాపడ్డాయి. లోక్ సభ ప్రార౦భమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు సమైక్య నినాదాలతో సభలో గందరగోళం సృష్టించడంతో సభను స్పీకర్ 12గంటల వరకు వాయిదా వేశారు. ఈరోజు పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఎలాంటి అవాంచనీయ సంఘటలను జరగకుండా చూడాలని కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీలను భద్రతా సిబ్బంది పార్లమెంట్ లోనికి అనుమతించడం లేదు. దీంతో సస్పెండ్ అయిన సీమాంధ్ర ఎంపీలు సభలో వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభంకాగానే సీమాంధ్ర ఎంపీలు వెల్‌లో నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలపడంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను గంటపాటు వాయిదా వేశారు.