భయపడను.. బులెట్ లా దూసుకెళ్తా.. చంద్రబాబు

రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో అసలు సూత్రధారి వేరే ఉన్నారని, చంద్రబాబు ఫోన్ సంభాషణలు మాదగ్గర ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నాయిని చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తమపై చేసే తప్పుడు వ్యాఖ్యలకు భయపడమని, బుల్లెట్ లా దూసుకెళ్తామని అన్నారు. ముందు తెదేపా ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్ పై కేసు పెట్టాలని, అసలు జగన్ ఏ అర్హతతో తమ పార్టీని విమర్శిస్తున్నారో తెలియడంలేదు, 16 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ కు ఆ హక్కు లేదని ఎద్దేవ చేశారు.   మరోవైపు నాయిని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ తమ దగ్గర చంద్రబాబు సంభాషణలు ఉన్నాయి అంటున్నారు.. మా ఎమ్మెల్యేలతో కేసీఆర్, కేటీఆర్, కవిత మాట్లాడిన వాయిస్ రికార్డింగులను ముందు బయట పెట్టండి అని మండిపడ్డారు. ఏసీబీ మీ ఒక్కరికే కాదు మాకు కూడా ఉంది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని మరిచిపోతున్నారని విమర్శించారు.

వాళ్ల తాటాకు చప్పుళ్లకు టీడీపీ భయపడదు.. యనమల

తెలంగాణ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు టీడీపీ భయపడదని ఏపీ ఆర్ధికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వారికి టీడీపీని సూటిగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా దొంగదారిలో రేవంత్ రెడ్డిని ఇరికించారని మండిపడ్డారు. అసలు ఇలాంటి స్టింగ్ ఆపరేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు గతంలోనే వెల్లడించిందని అన్నారు. ఇలాంటి అక్రమ కేసుల వల్ల రేవంత్ రెడ్డికి ఎలాంటి నష్టం లేదని ఈ కేసు నుండి రేవంత్ రెడ్డి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మీద పగ సాధించాలనే కేసీఆర్, జగన్ కుమ్మక్కయి ఇలాంటి పనులు చేస్తున్నారని, ఆంధ్రా ప్రజలు జగన్ ను ఎట్టి పరిస్థితిల్లోనూ క్షమించరని విమర్శించారు.

చంద్రబాబు విచారణకు గవర్నర్ అనుమతి?

  నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ట అయిన నేపథ్యంలో ఏసీబీ ఇంకా కేసుకు సంబంధిన మొత్తం సమాచారం కోసం గట్టి ప్రయత్నమే చేస్తుంది. రేవంత్ రెడ్డి ఒక్కడే ఈ పని చేశాడా.. లేక ఎవరైనా చేయించారా.. అనే విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నప్పటికీ తెర వెనుక ఉన్న పాత్రధారి మాత్రం చంద్రబాబునాయుడే అని ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఇంటిలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కలిసి సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అవడమే దీనికి నిదర్శనమని చెప్పొచ్చు. మరోవైపు ఈ కేసులో పక్కా ఆధారాలను ఏసీబీ సేకరిస్తుంది. ఈ ఆధారాలతోనే చంద్రబాబును విచారించేందుకు ఏసీబీ గవర్నర్ దగ్గర అనుమతి కూడా తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఏసీబీ చంద్రబాబుకు ఈ వారం కాని వచ్చే వారం కాని నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఆన్ లైన్ ద్వారా పుష్కర జలాలు

మరో నెలరోజుల్లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి.. అయితే ఎంతో ప్రాముఖ్యం ఉన్న గోదావరి పుష్కరాలకు వెళ్లలేని వారు చాలామంది ఉంటారు. అలాంటి వారు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుష్కరాలకు వెళ్లలేనివారికి మేము సైతం సేవలందిస్తామంటూ ముందుకొచ్చింది పోస్టల్ డిపార్ట్ మెంట్. అదేంటంటే గోదావరి పుష్కరాలకు వెళ్లలేనివారికి పోస్టాఫీసుల ద్వారా గోదావరి నుంచి సేకరించిన నీటికి పంపిణీ చేసేందుకు సన్నద్దమయ్యారు. అంతేకాదు ఈ నీటి కోసం www.appost.in/eshop అనే సైట్ ద్వారా ఆన్ లైన్ బుకింగ్ ఏర్పాటు కూడా చేశారు. జూన్ 3 నుండి జులై 14 అన్ని పోస్టాఫీసుల్లో ఈ బుకింగ్ సేవలు వరకు అందుబాటులోకి వస్తాయని, జూలై 14 నుంచి 25 వరకు... గోదావరి జలాలను పంపిణీ చేస్తామని ఏపీ ప్రధాన పోస్ట్‌మాస్టర్‌ బీవీ సుధాకర్‌ తెలిపారు. డెలివరీ చార్జెస్‌తో కలిపి 500 ఎంఎల్‌ బాటిల్‌ ధర 20 రూపాయలుగా నిర్ణయించామని సుధాకర్ అన్నారు.

ఏపీ రాజధాని శంఖుస్థాపనపై మళ్లీ అయోమయం

ఆంధ్రరాష్ట్ర నూతన రాజధాని శంఖుస్థాపనపై మళ్లీ అయోమయం నెలకొంది. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా జూన్ 6వ తేదీన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి వస్తుంది. అవి.. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఎటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు.. ఎటువంటి పర్యటనల్లో పాల్గొనకూడదు.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాము నిర్వహించే కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కి లేఖ పంపగా ఆయన ఈ లేఖను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు. ఈ లేఖపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు

  కేంద్రమంత్రి సుజనా చౌదరి మరియు ఆంద్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు నిన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీతో రాష్ట్రంలో నేషనల్ ఇన్సిటిట్యూట్ అఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటు కోసం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మొత్తం 480 సీట్లుతో రాష్ట్రంలో నిట్ ఉన్నత విద్యాసంస్థను ఏర్పాటు చేసేందుకు ఆమె అంగీకరించారు. అందులో 240 సీట్లు, అవి కాకుండా మరో 60 సూపర్ న్యూమరీ సీట్లు కలిపి మొత్తం రాష్ట్ర విద్యార్ధులకు 300సీట్లు కేటాయించేందుకు అంగీకరించారు. అయితే ఇదివరకు అనుకొన్నట్లు ఈ సంస్థ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో కాకుండా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.   నిట్ కు శాశ్విత భవనాలు నిర్మించే వరకు ఏలూరులో గల సి.ఆర్‌.రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ ఏడాది నుండే శిక్షణా తరగతులు మొదలుపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటుతో రాష్ట్రానికి మొత్తం 5 ఉన్నత విద్యాసంస్థలు మంజూరు అయ్యాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయం మరియు గిరిజన విశ్వవిద్యాలయం కూడా త్వరలోనే రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమయిన చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.

తెలంగాణాలో మళ్ళీ షర్మిల పరామర్శ యాత్ర!

  తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండుసార్లు ఆ రాష్ట్రంలో పరామర్శ యాత్రలు (ఓదార్పు యాత్ర) చేసిన షర్మిల మళ్ళీ చాలా రోజుల విరామం తరువాత మూడవసారి పరామర్శ యాత్రలకి బయలుదేరబోతున్నారు. ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఆమె నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేస్తారు. మొత్తం 509 కిమీ మేర సాగే ఆమె ఈ యాత్రలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించి 17 కుటుంబాలను పరామర్శిస్తారని ఆ పార్టీ తెలంగాణా ప్రధాన కార్యదర్శి శివకుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 49 మంది చనిపోగా వారిలో 32 కుటుంబాలను షర్మిల ఇప్పటికే పరామర్శించారు. ఆమె ఈసారి యాత్రలో మిగిలిన కుటుంబాలను కూడా పరామర్శిస్తారని తెలిపారు. తరువాత రంగారెడ్డి, హైదరాబాద్ లలో ఆమె పరామర్శ యాత్ర చేస్తారని తెలిపారు.

టాప్ 10 క్రిమినల్స్ లిస్ట్ లో మోడీ?

ఇప్పుడు ఫెస్ బుక్ లో, ట్విట్టర్ ఎక్కడ చూసినా ఓకే న్యూస్ హల్ చల్ చేస్తుంది. అదే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టాప్ 10 క్రిమినల్స్ లిస్ట్ లో ఉండటం. ఒసామా బిన్ లాడెన్, దావుద్ ఇబ్రహీం, అల్ జవహరి లాంటి కరడుగట్టిన క్రిమినల్స్ జాబితాలో మన ప్రధాని మోడీ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విషయం ఏంటంటే గూగుల్ సెర్చ్ లో టాప్ 10 క్రిమినల్స్ అని సెర్చ్ చేస్తే అందులో నరేంద్ర మోడీ ఫోటో కూడా వచ్చింది. అయితే ఇది ఏదైనా సాంకేతిక లోపం వల్ల వచ్చిందా లేక ఎవరైనా కావాలనే పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ వార్తపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ తన దేశ ప్రధానమంత్రి పేరు టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో ఉండటం ఒక భారతీయుడిగా తనకు సిగ్గుచేటని, సిగ్గుతో తల దించుకుంటున్నానని ట్విట్ చేశాడు.

నన్ను కలవడానికి ఎవ్వరికీ అనుమతి ఇవ్వద్దు.. రేవంత్ రెడ్డి

తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు లంచం ఇస్తూ తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం ఆయనకు 14రోజులు రిమాండి విధించి చంచల్ గూడ జైలుకు తరలించారు. అక్కడ బ్యారక్ లు సరిపోక రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తనను పరామర్శించడానికి వచ్చిన తెదేపా నేతలను కలవడానికి నిరాకరిస్తున్నట్ట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్, ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్లగా వారిని కలవడానికి నిరాకరించారు. అంతేకాదు కేవలం తన కుటుంబసభ్యులకు మాత్రమే తనను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని, వేరే ఎవ్వరికీ అనుమతి ఇవ్వద్దిని అధికారులను కోరారట.

వ్యభిచార కూపం నుండి బయటపడ్డ మరో టాలీవుడ్ నటి

సినిమాలో హీరోయిన్ అయిపోదామని సినీరంగుల లోకంలో అడుగుపెడతారు అమ్మాయిలు. అదృష్టం కలిసివచ్చిందా సరే లేకపోతే పడే పాట్లు అలా ఇలా ఉండవు. ముందు మంచి అవకాశాలు వచ్చినా తరువాత రానివారు కూడా ఉన్నారు. కొంతమంది ఇదే అదను చూసుకొని వాళ్లను రాంగ్ రూట్ లోకి లాగడానికి కూడా చూస్తారు. అలా తన సహాయకురాలి ద్వారా వ్యభిచార కూపంలోకి లాగబడింది ఓ టాలీవుడ్ నటి. తెలుగు, హిందీ భాషల్లో నటించిన ఓ టాలీవుడ్ నటి వ్యభిచారం కేసులో పట్టుబడింది. వివరాల ప్రకారం ఆనటికి సినిమాఛాన్సులు తగ్గడం ద్వారా తనను వ్యభిచారం కూపంలోకి లాగడానికి ఓ పథకాన్ని రచించింది తన సహాయకురాలు ఆయేషా సయ్యద్. దీనిలో భాగంగానే ఆనటి, ఆమె కలిసి పణజిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి చేరుకున్నారు. తరువాత కొంతసేపటికి ఓ బడాబాబు కూడా చేరుకున్నాడు. ఇంతలో సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే హోటల్ పై రైడింగ్ చేశారు. కానీ అతను తప్పించుకోవడంతో పోలీసులు నటిని, అయేషాను అదుపులోకి తీసుకున్నారు. అయితే తనను అయేషా బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నిస్తుందని చెప్పడంతో అయేషాపై కేసు నమోదు చేసి నటిని రెస్యూ హోంకు తరలించారు. అయితే నటి పేరు మాత్రం పోలీసులు తెలుపలేదు.

పట్టిసీమతో రాయలసీమకు నీళ్లిస్తా.. చంద్రబాబు

పట్టిసీమ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి రాయలసీమకు నీళ్లిస్తామని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా గొట్లూరులో నిర్వహించిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 5లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు కనుక వేయగలిగితే జిల్లాలో కరువు అనేదే ఉండదని, అంతేకాక రైతులకు 90శాతం రాయితీతో తుంపర్లు, బిందు సేద్యం పరికరాలు ఇస్తామని అన్నారు. జిల్లాలో 62 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డ్వాక్రా మహిళల రుణమాఫీ, కొత్త పించన్ల పంపిణీ కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

కాల్పులకు ఎదురుకాల్పులే సరి... శివసేన

ముల్లును ముల్లుతోనే తీయాలనే తరహాలో కాల్పులకు కాల్పులతోనే బుద్ధిచెప్పాలని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు పూంచ్ జిల్లాలో పాకిస్థాన్ జరిపిన కాల్పులపై శివసేన మండిపడింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్థాన్ వాళ్లు కాల్పులు జరుపుతున్నారని గతంలో కూడా ఇలాగే చేశారని శివసేన తెలిపింది. అలాంటి వారికి బుద్ధి రావాలంటే మనం కూడా నిబంధనలను ఉల్లంఘించి అయినా సరే ఎదురు కాల్పులు జరపాలని సూచించింది. పాకిస్థాన్ చేసే ఈ దుశ్చర్యల వల్ల సరిహద్దుల్లో ఉండే ప్రజలు వారి నివాసాలను వీడిపోవాల్సి వస్తుందని శివసేన అంది.

రూ.5 తీశాడని కొడుకుకి నిప్పంటించిన తల్లి

పిల్లలు ఎన్ని తప్పులు చేసినా వాళ్ల తప్పులను క్షమిస్తుంది తల్లి అదే అమ్మలోని మాతృత్వం. కానీ ఓతల్లి తన కొడుకు చేసిన చిన్న తప్పుకు ఏకంగా నిప్పటించింది. ఇంతటి భయంకరమైన ఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతానికి చెందిన రుక్సానా అనే ఆమెకు ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే ఆ బాలుడు చిరుతిండి కోసం పెట్టెలోంచి ఐదు రూపాయలు తీసుకొంటుండగా రుక్సానా చూసింది. అంతే రుక్సానాకు కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. దీంతో కొడుకు అని కూడా చూడకుండా ఆబాలుడికి నిప్పంటించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని కాపాడి ఆస్పత్రికి తరలించి, రుక్సానాపై నయా శహర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

చంద్రబాబు సంభాషణలు ఏసీబీ దగ్గర ఉన్నాయి.. నాయిని

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లంచం ఇస్తూ పట్టుబడిన వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ తో రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయని, అంతేకాక ఈ వ్యవహారంతో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా సంబంధం ఉంది.. తన పేరును కూడా చేర్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయని అన్నారు. తెర వెనుక ఉండి కథ మొత్తం నడిపించింది చంద్రబాబే అని, దానికి సంబంధించిన ఆధారాలు.. ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడిన సంభాషణలు ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నాయని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని నాయిని స్పష్టం చేశారు.

జగన్ దీక్షపై బాబు ఫైర్

వైకాపా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా మంగళగిరి వై జంక్షన్ సమీపంలో సమరదీక్ష ను చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనప్పటికీ ఏపీకి మాత్రం సరైన న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీటుగా స్పందిస్తూ కేసీఆర్ తో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జగన్ అడ్డంకిగా మారాడని, ఇందులో భాగంగానే ఈ సమరదీక్షను చేపట్టాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ తో కుమ్మక్కయి జగన్ చేస్తున్న దీక్షను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులతో పాటు ఏపీ ప్రజలకు పిలిపునిచ్చారు చంద్రబాబు. జగన్ దీక్ష వల్ల ప్రజలకు ఒరిగేది ఏమి లేదని దీక్ష పేరుతో తెదేపా పార్టీని విమర్శించడమే జగన్ పని అని ఎద్దేవ చేశారు.

జగన్ సీమాంధ్ర ద్రోహి... సోమిరెడ్డి

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని విడదీసి తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన కేసీఆర్ కు జగన్ మద్దతు ఇవ్వడం జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. జగన్ కేసీఆర్ కు మద్దతివ్వడంతో సీమాంధ్రులకు ద్రోహిగా మారారని అన్నారు. వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ జగన్ కుమ్మక్కయి ఎన్ని కుట్రలు చేసినా తెలుగు దేశం పార్టీని ఏం చేయలేరని ప్రజలకు టీడీపీ పై నమ్మకం ఉందని అన్నారు.