రాందేవ్ బాబా ఫుడ్ పార్కులో తుపాకులు

రాందేవ్ బాబా ఫుడ్ పార్క్ వద్ద ఏడు తుపాకులు, లాఠీలు కనపడటంతో కలకలం రేగింది. హరిద్వార్ లోని పతంజలి పేరుతో రాందేవ్ అమ్మే హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ ఈ ఫుడ్ పార్క్ లోనే తయారవుతాయి. అయితే ఈ మందులను సరఫరా చేసే విషయంలో ట్రాలీ యూనియన్ నాయకులకు, పార్క్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒక వ్యక్తి చనిపోగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి పార్క్ ను తమ ఆధీనంలోకి తీసుకొని సోదాలు జరిపారు. ఈ సోదాలో పార్క్ లో 7 తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు దొరికాయని, వాటిని సీజ్ చేసి స్టేషన్కు తరలించామని గర్వాల్ ఐజీ సంజయ్ గుంజ్యాల్ చెప్పారు. అనంతరం రాందేవ్ సోదరుడు రాంభరత్ను ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు ప్రైవేటు గార్డులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

వేరుపడనున్న ప్రగతి రధ చక్రాలు

  వచ్చే నెల 2వ తేదీకి అధికారికంగా రాష్ట్రం విడిపోయి ఒక సంవత్సరం పూర్తవుతుంది. కానీ ఇంకా ఏపియస్ ఆర్టీసీ మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతోంది. ఇంతవరకు ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపకాలు పూర్తికాకపోవడంతో ఆర్టీసీ విభజన ఆలశ్యమవుతోంది. కానీ జూన్ 3వ తేదీ నుండి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు వేరువేరుగా పనిచేసేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ లో గల బస్‌భవన్‌లోని ఏ బ్లాక్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ, బీ బ్లాక్ నుండి తెలంగాణ ఆర్టీసీ తమతమ కార్యకలాపాలు మొదలుపెట్టనున్నాయి. కానీ వీలయినంత త్వరగా ఆంద్రప్రదేశ్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.   ఇక రెండు రాష్ట్రాల ఆర్టీసీలు వేర్వేరుగా పనిచేయడం ప్రారంభిస్తున్నందున, హైదరాబాద్ లో స్థిరపడిన ఆంద్రప్రదేశ్ కి చెందిన ఉద్యోగుల పరిస్థితే కొంచెం అయోమయంలో పడింది. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులయితే తమకు బస్ భవన్ లో కేటాయించిన ఏ బ్లాక్ లో పనిచేసుకోవచ్చును. కానీ డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్కులు, డిపో సిబ్బంది వంటి వారిని సర్దుబాటు చేయడమే చాలా కష్టం అవుతుంది. వారందరూ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ విడిచిపెట్టి ఆంధ్రాకి తరలిపోవడం సాధ్యం కాదు. అలాగని అక్కడే కొనసాగలేని పరిస్థితి. జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో ఆర్టీసీ ఉద్యోగులను విభజిస్తామని ఆర్టీసీ యండీ సాంబశివరావు తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసినప్పటికీ, ఈ సమస్యను పరిష్కరించడం కొంచెం కష్టమేనని చెప్పవచ్చును. ఇక ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన లెక్కలు చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలాభిడే కమిటీ గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. కానీ ఇంకా దాని పని పూర్తి కాకపోవడంతో మరో రెండు మూడు నెలలయినా గడువు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ పవర్ వాళ్లకు తెలుసు.. అందుకే కలిశారు.. అమిత్ షా

నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ పొత్తు కలుపుకున్నా బీహార్ లో తమ పార్టీకి ఎటువంటి బాధ లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీహార్ లో జీజేపీ కి చాలా సపోర్ట్ ఉందని, పార్టీకి అనుకూల వాతావరణమే ఉందని, ఎన్నికల్లో గెలవడం ఖాయమేనని స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా ఒకరినొకరు విమర్శించుకుంటూ, నీకా నాకా అంటూ ఒకరికొకరు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు ఇప్పుడు ఒకే వేదికపై ఉండటం, పైగా తమ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దీనికి కారణం కూడా బీజేపీనేనని.. ఎందుకుంటే బీజేపీ చాలా శక్తివంతమైన పార్టీగా ముందే గుర్తించి చేతులు కలిపారని అమిత్ షా అన్నారు.

అప్పట్లో పెత్తనం సోనియాదే.. మోడీ

ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో ఆయన మరోమారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై, ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శల వర్షం కురిపించారు. అధికారాలన్నీ పీఎంవో చేతిలో కేంద్రీకృతమయ్యాయన్న ఆరోపణలపై మోడీ స్పందించి, ప్రధాని, అతని కార్యలయం రాజ్యాంగంలోని భాగం... కానీ గతంలో యూపీఏ హయాంలో పీఎంవో పై పెత్తనమంతా సోనియాదేనని, ఆమె అధికారం చలాయించేవారని మండిపడ్డారు. కానీ ఎన్డీఏ హయాంలో రాజ్యాంగబద్ధ పాలన మాత్రమే జరుగతుందని స్పష్టం చేశారు. అందుకే ఎన్నికల్లో మట్టికరుచుకు పోయిన కాంగ్రెస్ పార్టీ సూటు-బూటు సర్కార్ అంటూ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు.

అందగాడు తప్పు చేస్తే ఆడవాళ్లకు ఓకె

తప్పులు ఎవరైనా చేస్తారు అది సహజం. కాని తప్పు చేసినవాళ్లను క్షమించే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ క్షమించడంలో కూడా మనిషి అందాన్ని బట్టి తేడా చూపిస్తారట మహిళలు. అదేంటీ అనుకుంటున్నారా... అవునండీ దీనిపై అమెరికాలో అధ్యయనం కూడా జరిగిందట. అసలు విషయం ఏంటంటే అమెరికాలోని ఈస్టన్ కెంటకీ యూనివర్సిటీకి చెందిన జెరెమీ గిబ్బన్, జొనాథన్ గోర్ అనే పరిశోధకులు ఈ అంశంపై పరిశోధన జరిపారు. దాదాపు 170 కాలేజీలకు చెందిన అమ్మాయిలను, అబ్బాయిలను పరిశోధించారట. అమ్మాయిలకు అందంగా ఉన్న అబ్బాయిలను, లేని అబ్బాయిలను చూపించి సందర్బాన్ని సృష్టించి వాళ్లలోని రియాక్షన్స్ బట్టి ఓ నివేదిక తయారుచేశారు. పరిశోధనలో తేలిందేంటంటే కాస్త అందంగా, ఆకర్షణీయంగా ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఈజీగా క్షమించేస్తారట.. కానీ అందంగా లేని వారిని కొంత సమయం వరకు క్షమించినా ఆఖరికి వారికి చెప్పుదెబ్బలు తప్పవంటున్నారు పరిశోధకులు.

కాంగ్రెస్ వాళ్లు చవటలు.. టీఆర్ఎస్ వాళ్లు సన్నాసులు.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెదేపా మహానాడులో ఎప్పటిలాగే తన వాక్చాతుర్యాన్ని చూపించారు. మహానాడులో ప్రసంగిస్తూ ఆయన కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ప్రస్తావిస్తూ కేసీఆర్ గారు సర్వే పేరిట 12 గంటల్లో ఇంట్లో ఎంత మంది ఉన్నారు, ఎన్ని కోళ్లు ఉన్నాయి, ఎన్నిపందలు ఉన్నాయి అని లెక్కలు చూశారు కానీ 12 నెలలైనా అమర వీరుల లెక్కలు మాత్రం తేల్చలేకపోయారని ఎద్దేవ చేశారు. తెలంగాణ తొలి ఉద్యమంలో అసువులు బాసిన 369 మందికి, మలి ఉద్యమంలో పాల్గొన్న 1200 మంది అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ తీర్మానం చేశారు. ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెచ్చుకున్న తెలంగాణను.. ఉద్యమానికి నాయకత్వ వహించాడన్న ఒక్క కారణంతో కేసీఆర్‌ను నమ్మి ఆయన చేతిలో పెట్టారని అన్నారు. ఓ వైపు చవటలు కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ ఇచ్చామంటారు... మరోవైపు సన్నాసులు టీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ తెచ్చినం. అంటారు. వీళ్లు ఇచ్చినప్పుడు, వాళ్లు తెచ్చుకున్నప్పుడు ఉద్యమంలో అంతమంది చావులకు కారకులెవరని ప్రశ్నించారు. ఉద్యమంలో చనిపోయిన వారికి రూ. 10 లక్షలు అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆ విషయమే మర్చిపోయిందని, తాము కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ. వెయ్యికోట్లు పెట్టి అమరవీరుల స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. బాలకృష్ణ

తెదేపా 34వ మహానాడు కార్యక్రమం రెండోరోజు సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తనదైన శైలిలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ పాలనలోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపించారని అన్నారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాలు అధికారంలో ఉన్నాయంటే అది ఎన్టీఆర్ చలవేనని, వాళ్లను అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే నని వెల్లడించారు. చాలా దారుణంగా ఒక్కటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారని, విభజన తరువాత రాష్ట్రాన్నికాపాడగలిగేది ఒక్క చంద్రబాబు మాత్రమే అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఒబామా కూతురికి కట్నంగా 50 ఆవులు, 70 గొర్రెలు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూతురు మాలియా ఒబామా ఓ యువ లాయర్ మనసును దోచేసింది. కెన్యాకు చెందిన ఫెలిక్స్ కిప్రోనోది అనే యువ లాయర్ 2008 నుండి మాలియా ఒబామాను ప్రేమిస్తున్నానని, ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులతో కూడా చర్చించానని చెప్పాడు. అంతే కాదండోయ్ ఆమెకు కట్నంగా 50 ఆవులు, 70 గొర్రెలు, 30 మేకలు కూడా ఇస్తానని చెప్తున్నాడు ఈ వన్‌సైడ్ లవర్. తనది నిజమైన ప్రేమని, డబ్బు మీద ఆశతో మాలియాను లవ్ చేయడం లేదని, మాలియాను పెళ్లి చేసుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. మాలియాతో పెళ్లి విషయాన్ని జులైలో కెన్యా పర్యటనకు రానున్న ఒబామాతో మాట్లాడతానని, పర్యటనకు మాలియాను కూడా తీసుకురావల్సిందిగా లేఖ రాస్తానని తెలిపాడు. ఒకవేళ మాలియా వస్తే తనకు పాలు పితకడం, కెన్యా వంటకం ఎలా చేయాలో నేర్పిస్తానని అప్పుడే కలల లోకంలో విహరిస్తున్నాడు కిప్రోనో.

కిషన్ రెడ్డి ఎదుటే ఆత్మహత్యాయత్నం

ఓ వైపు సభ జరుగుతుంది మరోవైపు అందరూ నిశ్సబ్దంగా వింటున్నారు ఇంతలో ఓ యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నల్లొంగ జిల్లాలో 'ప్రజా పునరంకిత' సభలో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడి ఉన్న వారంతా ఉలిక్కిపడి అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. భాజపా నేత కిషన్ రెడ్డికి అయితే మాట పడిపోయి షాక్ కు గురయ్యారు. అక్కడ ఉన్న జీజేపీ కార్యకర్తలు మాత్రం ఆ యువకుడిని రక్షించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొంత సేపటికి షాక్ నుంచి తేరుకున్నకిషన్ రెడ్డి హాస్పిటల్ కి వెళ్ళి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు కంటే లోకేశ్ కే ఎక్కువ రెస్పాన్స్

బుధవారం జరిగిన 34వ తెదేపా మహానాడులో నారా లోకేశ్ కు మాత్రం మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా ప్రజలలోకి వెళ్లడం, రాష్ట్ర రాజధాని అభివృద్ధి విషయంలో అమెరికా పర్యటన చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన విషయంలో నారా లోకేశ్ పాత్ర చాలానే ఉంది. దీంతో ప్రజలలో ఆయనపై నమ్మకం పెరిగింది. దీనికి గాను నిన్న జరిగిన మహానాడులో కూడా ఎంతో మంది సీనియర్ తెదేపా నాయకులు ఉన్నా, ఆఖరికి చంద్రబాబు కంటే కూడా నారా లోకేశ్ కే ఎక్కువ స్పందన లభించింది. దీంతో లోకేశ్‌ కృషికి ప్రశంసలు లభించడం పార్టీలో ఆయన పాత్ర పెరగబోతోందన్న దానికి సూచికని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే చంద్రబాబు ఈ మహానాడులో లోకేశ్ కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్నప్పటికీ.. మహానాడులో ఆయన కలిసేవారు.. ఆయనను కలిసేవారిని చూస్తుంటే మాత్రం రాజోయే రోజుల్లో లోకేశ్ పార్టీకి కీలకమని తెలుస్తోంది.

అమరావతికి లైన్ క్లియర్

  తుళ్ళూరు మండలంలో రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి నేటి వరకు కూడా అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ వాటినన్నిటినీ అధిగమించుకొంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయినా ఇంకా దానికి అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి.   సారవంతమయిన పంట భూములలో ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపడుతోందని దాని వలన సామాజిక, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని, అదే విధంగా కృష్ణా నదీ తీరాన్న నిర్మించడం వల్ల రాజధానికి వరదల ప్రమాదం కూడా పొంచి ఉందని, కనుక అక్కడ రాజధాని నిర్మించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి (‘స్టే’) ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన పందలనేని శ్రీమన్నారాయణ జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) లో ఒక పిటిషను వేశారు.   ఆయన వాదనలు విన్న జస్టిస్‌ యూడీ సాల్వి, జస్టిస్‌ ఎన్‌ఎస్‌ నంబియార్‌, నిపుణులు డాక్టర్‌ దేవేంద్ర కుమార్‌ అగర్వాల్‌, ప్రొఫెసర్‌ ఏఆర్‌ యూసుఫ్‌, బిక్రంసింగ్‌ సజ్వన్‌తో కూడిన విస్తృత ధర్మాసనం రాజధాని నిర్మాణంపై స్టే ఇచ్చేందుకు తిరస్కరించింది. కానీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఈ పిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ అంశంపై విచారణను జూలై 27కి వాయిదా వేసింది.

కడుపులో 173 నాణేలు

ఓ వ్యక్తి కడుపులోంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 నాణేలు తీసి అరుదైన శస్త్ర చికిత్స చేశారు కర్ణాటకలోని విజయనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యులు. వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలో స్థిరపడ్డాడు. అయితే అతనికి మతిస్థిమితం లేని కారణంగా అప్పుడప్పుడు తనకు తెలియకుండా నాణేలు మింగేవాడు. దీంతో అతనికి విపరీతమైన కడుపునొప్పి, మూత్ర విసర్జన సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు అతనిని ఆస్పత్రిలో చేరిపించగా స్కానింగ్ లో అతని కడుపులో నాణేలు ఉన్నట్టు చెప్పారు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేసి 173 రూపాయి నాణేలు, ఐదు.. పది రూపాయల నాణేలు బయటకు తీశారు.

స్వర్గీయ ఎన్టీఆర్ కు ప్రముఖుల నివాళి

  స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, హరి కృష్ణ, జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు ఇంకా అనేకమంది తెదేపా నేతలు వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు, కళారంగానికి అపారమయిన సేవ చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్నఅవార్డు ఇచ్చి గౌరవించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అందుకోసం ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా కేంద్రం మీడియా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

విజయవాడలో రైల్వే జోన్ ఏర్పాటుకి డిమాండ్

  మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టి ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్వయంగా రాష్ట్రానికి వచ్చి ఆంద్రప్రదేశ్ కి రైల్వే జోన్ మంజూరు చేసినట్లు ప్రకటిస్తారని సమాచారం అందుకోగానే దానిపై కూడా అప్పుడే రాజకీయాలు మొదలయిపోయాయి. రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని మొదటి నుండి అనుకొంటున్నదే. కనుక ఇక నేడో రేపో రైల్వే మంత్రి వచ్చి ఆ ప్రకటన చేయడమే ఆలశ్యమని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో దానిని విశాఖలో కాక విజయవాడ-గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయాలంటూ రైల్వే మజ్దూర్ యూనియన్ అదనపు కార్యదర్శి అవధానుల హరి డిమాండ్ చేసారు. రాజధాని అమరావతి దగ్గర రైల్వే జోన్ ఏర్పాటు చేసి, నల్లపాడు-బీబీనగర్ ల మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేసినట్లయితే ఆంద్ర, తెలంగాణా రాజధానులు మరింత బాగా అనుసంధానం అవుతాయని అన్నారు. అలాకాదని రాజకీయ కారణాలతో రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటుచేసినట్లయితే అది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని ఆయన వాదించారు. కొసమెరుపు ఏమిటంటే సురేష్ ప్రభు వచ్చేరు కానీ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించలేదు. దానిపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని త్వరలోనే శుభవార్త వింటారని ప్రకటించడంతో అందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటికే అనేక అంశాల మీద రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి కనుక ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియని ఆ రైల్వే జోన్ కోసం ప్రజలు వాదోపవాదాలు చేసుకోవడం రాష్ట్రానికి మేలు చేయదని అందరూ గ్రహించాలి.

దరువు అంజన్న కిడ్నాప్?

  ప్రజా గాయకుడు, తెలంగాణ పోరాటంలో తన గళం విప్పి ఉద్యమించిన కళాకారులు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు దరువు అంజన్న కిడ్నాప్‌కి గురైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన భర్త కిడ్నాప్ అయ్యాడంటూ దరువు అంజన్న భార్య సునీత హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నుంచి తన భర్తకు బెదిరింపు కాల్ వచ్చిందని, ఆ తర్వాత తన భర్త కనిపించకుండా పోయాడని, ఎమ్మెల్యే రసమయి బాలకిషనే తన భర్తను కిడ్నాప్ చేయించి వుంటాడని అనుమానిస్తున్నానని అంజన్న భార్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రసమయి బాలకిషన్‌కి వ్యతిరేకంగా అంజన్న గత కొద్దిరోజులుగా ధూంధాం నిర్వహిస్తున్నారు. అందువల్లే రసమయి బాలకిషన్ తన భర్తను కిడ్నాప్ చేయించి వుండవచ్చని అంజన్న భార్య తెలిపారు.