తెరాస ఐడియాలకు జేజేలు

  బహుశః మన రాష్ట్ర రాజకీయ నాయకులలో కేసీఆర్ కుటుంబ సభ్యులంతా మాటకారులు మరెవరూ లేరేమోననిపిస్తుంది వారి మాటలు విన్న ప్రతీసారి. నిజామాబాద్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న కేసీఆర్ కుమార్తె కవిత ఈరోజు అక్కడ ప్రచారం ప్రారంబించి, ఆమె ఒక సరికొత్త సిద్ధాంతం ప్రతిపాదించారు. “బీజేపీకి ఓటు వేస్తే అది సీమాంధ్రుడయిన చంద్రబాబుకు వేసినట్లేనని, ఎందుకంటే బీజేపీ చంద్రబాబు జేబు సంస్థగా మారిపోయిందని” అని సూత్రీకరించారు.   ఒకవేళ తెదేపాతో పొత్తులు బెడిసికొడితే బీజేపీతో తామే పొత్తులు పెట్టుకొందామని తెరాస తెరవెనుక ప్రయత్నాలు చేసినప్పుడు,వారికి బీజేపీ మంచిగానే కనబడింది. కానీ తెదేపాతో పొత్తులు పెట్టుకోగానే, బోడి గుండుకి మోకాలికి ముడేసినట్లు, బీజేపీని చంద్రబాబుతో ముడేసి, దానిపై కూడా ‘ఆంధ్రా బ్రాండు’ ముద్ర గుద్దేయవచ్చనే ఆలోచన కేవలం తెరాస నేతలకే సాధ్యం.   కాంగ్రెస్ మీద అవినీతి ముద్ర, వైకాపా, తెదేపాలకు, తెదేపాతో పొత్తు పెట్టుకొన్నబీజేపీ మీద ‘ఆంధ్రా ముద్రలు’ గుద్దేసి అన్ని పార్టీలు కూడా తెలంగాణాలో పోటీకి అనర్హమయినవిగా ప్రకటించేసి, తమ పార్టీకి మాత్రం ‘ఇంటి పార్టీ’ అని ముద్రవేసుకొని ప్రజలను ఆకట్టుకోవాలనే ఐడియా నిజంగా అమోఘం. నిజానికి తెరాసకే అధికారం ఉండి ఉంటే, తెలంగాణాలో తమ పార్టీ తప్ప మరే ఇతర పార్టీలు లేకుండా నిషేదించేసేదేమో!

గండం గడిచిన విజయశాంతి

      రాములమ్మ విజయశాంతికి గండం గడిచింది. మెదక్ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయాలని మొదట్లో అనుకున్న విజయశాంతి ఆ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నట్టు తెలియడంతో ఎందుకొచ్చిన రిస్క్ అని ఆమె మెదక్ అసెంబ్లీ స్థానానికి షిఫ్ట్ అయిపోయారు. అయితే మెదక్ అసెంబ్లీ స్థానం మీద ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేశారు. నియోజకవర్గం మీద మంచి పట్టు వున్న శశిధర్‌రెడ్డి రెబల్‌గా నామినేషన్ వేయడంతో విజయశాంతి కంగారుపడిపోయారు.   రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అయితే బిత్తరపోయింది. శశిధర్‌రెడ్డి నామినేషన్ వేసిన రోజు నుంచి కాంగ్రెస్ నాయకులు శశిధర్‌రెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని గడ్డం, కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నా ఆయన మెట్టు దిగలేదు. దాంతో రాములమ్మకి బీపీ హై పిచ్‌కి చేరుకుంది. మొత్తానికి కాంగ్రెస్ నాయకులు చేసిన మంతనాలు, హామీలు, బుజ్జగింపులు ఫలించి శశిధర్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవాడానికి అంగీకరించాడు. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే పోటీ నుంచి తప్పుకుంటున్నానని, మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి విజయశాంతి గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని ప్రకటించాడు. దాంతో విజయశాంతి బీపీ డౌనయి శాంతించింది. గండం గడిచిందని ఊపిరి పీల్చుకుంది.

హుస్నాబాద్: బీజేపీకి దెబ్బమీద దెబ్బ!

      తెలంగాణలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి దెబ్బపడింది. హుస్నాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన అసలు అభ్యర్థితోపాటు డమ్మీ అభ్యర్థి నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. ఈ నియోజకవర్గానికి 21 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ స్థానంలో బీజేపీ గెలిచే అవకాశాలు కూడా వున్నాయి. అయితే నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి మధుసూదన్ బీజేపీ అభ్యర్థి దేవిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్‌ని తిరస్కరించారు.   నామినేషన్‌తోపాటు ఏ, బీ ఫారాలను అందజేయాల్సి వుండగా శ్రీనివాసరావు కేవలం బీ ఫామ్ మాత్రమే జతచేశారు. దాంతో ఆయన నామినేషన్ తిరస్కరణకి గురైంది. సర్లే ప్రధాన అభ్యర్థి నామినేషన్ పోతే పోయింది. డమ్మీ అభ్యర్థి నామినేషన్ ఉంది కదా అనుకున్న బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ డమ్మీ అభ్యర్థి పోలు లక్ష్మణ్ ఏ ఫారంతోపాటు బీ ఫారం కూడా దాఖలు చేయకపోవడంతో ఈయన నామినేషన్‌ కూడా గల్లంతయింది. ఇలా ఈ నియోజకవర్గంలో బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడిపోవడంతో రాష్ట్ర బీజేపీ లబోదిబో అంటోంది.

ఓటు వేయని మీరాకుమార్!

      ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ భారీ స్థాయిలో ప్రచారం చేస్తూ వుంటుంది. ఓటు అనేది హక్కు కాదు బాధ్యత అని స్టేట్ మెంట్లు ఇస్తూ వుంటుంది. అయితే ఇవన్నీ సామాన్య ప్రజలకు చెప్పే నీతులు. బాధ్యత కలిగిన వారు ఓటు వేయకుండా తప్పించుకుంటున్నరు. ఇక సామాన్య ప్రజల సంగతి చెప్పేదేముంది? లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ గారు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. బీహార్‌లోని ససారం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మీరాకుమార్ గతంలో రెండుసార్లు ఇక్కడి నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు. ముచ్చటగా మూడోసారి కూడా గెలవాలన్న ఉద్దేశంతో పాపం కష్టపడి ప్రచారం చేస్తున్నారు. ఆమె ఓటేమో ఢిల్లీలో వుంది. ఢిల్లీకి ఫ్లయిట్‌లో వెళ్ళి ఓటు వేసే తీరిక కూడా లేనంతగా ప్రచారం చేస్తున్న మీరాకుమార్ గారు ఓటు వేయడం కంటే ప్రచారం చేసుకోవడమే ముఖ్యమనుకుని ఓటు వేయలేదు. లోక్‌సభ స్పీకర్ స్థానంలో వుండి ఓటు వేయకుండా ఊరుకున్న మీరాకుమార్ ధోరణిని ప్రజాస్వామ్యవాదులు గర్హిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో మలేసియా విమానం?

      మలేసియా ఎయిర్‌లైన్స్‌ కి చెందిన ఎంహెచ్370 విమానం అదృశ్యమై నెలరోజులు దాటుతోంది. ఈ విమానం కోసం ఎన్నో దేశాలు వెతుకుతున్నా విమానం ఎక్కడ వుందో ఆచూకీ ఎంతమాత్రం తెలియడం లేదు. అయితే తాజాగా రష్యాకి చెందిన ఇంటెలిజెన్స్ సీక్రెట్ సర్వీస్ సంస్థ ఎఫ్ఎస్‌బి ఈ విమానానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించినట్టు ఎఎన్ఐ వార్తాసంస్థ చెబుతోంది. రష్యన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ చెబుతున్నదాని ప్రకారం.... ఇంతవరకూ అందరూ ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని అనుకుంటున్నారు. కానీ ఈ విమానం హైజాక్‌కి గురైంది. విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్లు పాకిస్తాన్ సరిహద్దులో వున్న ఆఫ్ఘనిస్తాన్ భూ భాగంలో విమానాన్ని దించారు. విమానంలో వున్న 259 ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. మొత్తం ప్రయాణికులను ఏడు బృందాలుగా విభజించి ఒక్కో బృందాన్ని ఒక్కోచోట వుంచారు. ప్రయాణికులందరూ మట్టితో చేసిన చిన్న చిన్న పాకల్లో ఆహారం లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. అలాగే ఆసియాకి చెందిన 20 మందిని పాకిస్తాన్‌లో ప్రత్యేకంగా నిర్మించిన బంకర్లలో వుంచారు. రష్యన్ సీక్రెట్ సర్వీస్ సంస్థ వెల్లడించిన విషయాలు నిజాలా లేక కాకమ్మ కథలా అనే విషయం త్వరలో తెలుస్తుంది.

సోనియా మంత్రగత్తె: నరేంద్ర మోడీ

      బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ‘మంత్రగత్తె’ (Black Magician) గా అభివర్ణించారు. భారతదేశాన్ని గత పది సంవత్సరాలుగా మంత్రగత్తె పరిపాలిస్తోందని ఆయన అన్నారు. అంతకు ముందు సోనియాగాంధీ మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ ఒక మాంత్రికుడిని రంగంలోకి దించింది అని మోడీని ఉద్దేశించి అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ మోడీ సోనియాగాంధీని మంత్రగత్తెగా అభివర్ణించారు. జంషెడ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. సోనియాని మంత్రగత్తె అన్నప్పుడు సభలో వున్న జనం నుంచి మంచి ప్రతిస్పందన వచ్చింది. సదరు మంత్రగత్తె నుంచి తమను తాము కాపాడుకోవడానికి, దేశాన్ని కాపాడటానికి ప్రతి పౌరుడూ ఉద్యమించాలని మోడీ పిలుపు ఇచ్చారు. నేను పేదరికంలో పుట్టాను. పేదల కష్టాలు నాకు తెలుసు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్ళకి పేదల కష్టాలు, కన్నీళ్ళు ఏం తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు.

చిట్టీల చిట్టెమ్మా.. గుట్టంతా చెప్పమ్మా!

      టీవీ, సినిమా వాళ్ళ చెవుల్లో చిట్టీల పేరుతో పూలు పెట్టి, కోట్ల రూపాయలను మూటగట్టుకుని వెళ్ళిపోయిన టీవీ నటి, ఇప్పుడందరూ ముద్దుగా ‘చిట్టీల చిట్టెమ్మ’ అని పిలుచుకుంటున్న విజయరాణిని ఎట్టకేలకు పోలీసులు వెతికీ వెతికి పట్టుకున్నారు. బెంగుళూరు విద్యారణ్య కాలనీలో వున్న బంధువుల ఇంట్లో హయిగా రెస్టు తీసుకుంటున్న విజయరాణిని పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ప్రస్తుతం విజయరాణిని పోలీసులు విజయారాణి చేత అసలు గుట్టంతా బయట పట్టించడానికి వాళ్ళదైన శైలిలో ‘విచారణ’ చేస్తున్నారు. చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో జనాన్ని ఎలా మోసం చేసిందీ, ఎలా బుట్టలో వేసిందీ చిట్టీల చిట్టెమ్మ వివరంగా చెబుతుంటే, ఆమె తెలివితేటలు చూసి పోలీసులే నోళ్ళు తెరుస్తున్నారట.

మోడీ హవా లేదు: జోకులేసిన ప్రియాంక

      దేశంలో మోడీ హవా లేదని సోనియాగాంధీ పుత్రికా రత్నం ప్రియాంక తనకు అంతా తెలిసినట్టు చెప్పేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలలో ఓటు వేయడానికి తన భర్త రాబర్ట్ వధేరాతో కలసి పోలింగ్ స్టేషన్‌కి ప్రియాంక వచ్చారు. ఓటు వేసిన అనంతరం మొగుడూ పెళ్ళాలిద్దరూ తమ చూపుడు వేళ్ళ మీద వున్న ఇంకు గుర్తులను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా మీడియా వాళ్ళు దేశంలో మోడీ గాలులు వీస్తున్నాయంటున్నారు. ఈ విషయంలో మీరేమంటారని ప్రశ్నిస్తే, ‘మోడీ గాలులు వీస్తున్నాయా? ఆ గాలులేవీ నాకు కనిపించలేదు’ అని ప్రియాంక జోకేసింది. దేశంలో ఎక్కడా మోడీ హవా లేదని ఆ తర్వాత తన జోక్‌ని విడమరచి చెప్పింది. చూడమ్మా ప్రియాంకా.. గాలి కనిపించదు.. దాని ప్రభావం మాత్రం త్వరలో నీకు కనిపిస్తుందని అక్కడున్నవాళ్ళు మనసులో అనుకోకుండా వుండి వుంటారా?

జగన్ పార్టీకి ఎన్టీఆర్ ప్రచారం?

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. గుడివాడ నుంచి అసెంబ్లీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో వున్న కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)కి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. కొడాలి నాని హరికృష్ణకి, జూనియర్‌కి సన్నిహితుడు. గతంలో నాని తెలుగుదేశంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. నాని వైకాపాలోకి వెళ్ళినప్పటి నుంచి వీరిమధ్య వ్యక్తిగతంగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ రాజకీయంగా ఎలాంటి బంధం లేకుండా పోయింది.   చంద్రబాబు తనను, జూనియర్ ఎన్టీఆర్ని పట్టించుకోవడం లేదన్న కోపంలో వున్న హరికృష్ణ రాష్ట్ర విభజన సాకుచూపించి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. అలాగే తాజాగా హరికృష్ణ తనకు హిందూపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని వుందని నోరు తెరిచి అడిగినా, తెలుగుదేశం పార్టీలో దాన్ని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. ఈసారి ఎన్నికలలో హరికృష్ణ వర్గానికి చెందిన వారికి టిక్కెట్లు వచ్చే అవకాశం లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ని అవమానాలు భరిస్తున్న హరికృష్ణ వైసీపీ అభ్యర్థిగా పోటీలో వున్న కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడమే ఆ అవమానానికి సరైన ప్రతీకారం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కిరణ్ కి కలిసి వచ్చే విభజన విచారణ

  ఎన్నికల అనంతరం జూన్ 2న ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు విడిపోయేందుకు అధికారికంగా ముహూర్తం కూడా ఖరారు అయినప్పటికీ, ఇంకా నేటికీ రాష్ట్ర విభజన వ్యవహారం సుప్రీంకోర్టులో నలుగుతూనే ఉంది. మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు విభజనను వ్యతిరేఖిస్తూ వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మే 5న విచారణ చెప్పట్టనుంది. అంతకు ముందు ఈ అంశంపై సంజాయిషీ కోరుతూ సుప్రీంకోర్టు నుండి నోటీసులు అందుకొన్న కేంద్ర ప్రభుత్వం విభజనను, అది జగిరిగిన తీరుని, అందుకు తనకు గల హక్కులను గట్టిగా సమర్దించుకొంది. రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ పడిన అనేక పిటిషన్లను ఇదివరకు త్రోసిపుచ్చిన జస్టిస్ దత్తు బెంచే ఈ సారి కూడా విచారణ చెప్పట్టబోతోంది. కనుక ఈసారి కూడా ఈ పిటిషన్లను కొట్టివేయవచ్చును. పైగా ఇప్పుడు రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో కూడా మళ్ళీ చాలా ఏళ్ల తరువాత పూర్తి ప్రశాంత వాతావరణం ఏర్పడి ఉంది. ప్రజలు, పార్టీలు అందరూ కూడా మానసికంగా విభజనకు సిద్దపడి ఉన్నారు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మళ్ళీ ఈ సమస్యను కెలికేందుకు అంగీకరించక పోవచ్చును.   కానీ, ఇదే సమస్యను ఆధారంగా చేసుకొని జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి ఏటికి ఎదురీదుతున్న కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం ఈ కోర్టు, విచారణ వ్యవహారం ఎన్నికల ప్రచారానికి వాడుకొనేందుకు మాత్రం ఉపయోగపడవచ్చును. బహుశః నేడో రేపో కిరణ్ ఈ అంశాన్ని పట్టుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

చంద్రబాబు మాట వినని బాలకృష్ణ

      నందమూరి బాలకృష్ణ ఈ ఎన్నికలలో పోటీ చేయాలని ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాడు. ‘లెజెండ్’ హిట్ కావడంతో బాలకృష్ణ ఆత్మవిశ్వాసం బాగా పెరిగిపోయింది. ఈసారి ఎన్నికలలో తప్పనిసరిగా పోటీ చేయాల్సిందేనని బాలకృష్ణ గట్టి పట్టుదల మీద వున్నాడు. రాయలసీమ టూర్‌కి వెళ్ళినప్పుడు హిందూపూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించేశాడు. అక్కడి తెలుగుదేశం కార్యకర్తలకు తన నామినేషన్ వ్యవహారాల గురించి చర్చించినట్టు సమాచారం. అయితే హైదరాబాద్ తిరిగొచ్చాక బాలకృష్ణ ఉత్సాహం మీద చంద్రబాబు నీళ్ళు కుమ్మరించాడు.   బాలకృష్ణ అసెంబ్లీకి నిలబడి గెలిస్తే సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవికి తనకు పోటీ అవుతాడని భయపడ్డాడో లేక మరే కారణం వుందో గానీ, బాలకృష్ణ పోటీ చేసే విషయంలో చంద్రబాబు  సుముఖంగా కనిపిచండం లేదు. ఆ విషయాన్నే ఆయన విలేకరులకు చెప్పారు. బాలకృష్ణ హిందూపూర్ నుంచి పోటీ చేస్తాడట కదా అంటే, ఆ విషయాన్ని ఇంకా ఆలోచించలేదు బాలకృష్ణతో మాట్లాడి  చెబుతానని అనడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత చంద్రబాబు, బాలకృష్ణ మధ్య హాట్ హాట్ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నువ్వు పోటీ చేయొద్దు బావా.. నువ్వు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తే అదిరిపోతుందని చంద్రబాబు బాలకృష్ణని ఉబ్బేసినా బాలకృష్ణ బుట్టలో పడనట్టు తెలుస్తోంది. ఈసారి ఆరు నూరైనా తాను పోటీ చేయడం ఖాయమని చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు సమాచారం. చంద్రబాబు బాలకృష్ణని ఎంత వెనక్కి లాగాలని ప్రయత్నించినా బాలకృష్ణ తన పట్టు విడవనట్టు తెలుస్తోంది.  

ఎన్నికల ప్రచారం: భ్రమల్లో ప్రియాంక!

      ఇంతవరకూ తెలియలేదుగానీ, సోనియాగాంధీ కూతురు ప్రియాంకకి తన గురించి తానే ఎక్కువగా ఊహించుకునే సమస్యేదో ఉన్నట్టుంది. తాను ఎన్నికల బరిలో దిగి ప్రచారం మొదలెడితే కాంగ్రెస్ పార్టీ సూపర్‌గా గెలిచేస్తుందనే భ్రమల్లో ఉన్నట్టుంది. ఆ భ్రమలు ఆమెకి సోనియా, రాహులే కల్పించినట్టున్నారు. ఈ ఎన్నికలలో సోనియా, రాహుల్ గెలుపే ప్రశ్నార్థకంగా వుంది. ఈ భయంతోనే రాయబరేలి, అమేథి నియోజకవర్గాలలో ప్రియాంక చేత కూడా ప్రచారం చేయించాలని అనుకుంటున్నారు.   అమ్మకోసం, సోదరుడి కోసం ప్రచారం చేయడానికి ఒప్పుకున్న ప్రియాంక కేవలం ఆ రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. సోనియా, రాహుల్‌ని గెలిపించుకోవడం తన బాధ్యత అన్నట్టుగా ప్రియాంక భారీ సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతోంది. తనచేత ప్రచారం చేయించుకోవాలని చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులు ఉవ్విళ్ళూరుతున్నానని, తాను మాత్రం కేవలం తన కుటుంబ సభ్యులు ఇద్దరికి మాత్రమే ప్రచారం చేస్తానని అంటోంది. ప్రియాంక మాటలు వింటుంటే తాను ప్రచారం చేస్తే ఎవరైనా గెలిచేస్తారన్న అతి విశ్వాసం కనిపిస్తోంది.

డైలాగ్స్ రచయిత పొన్నాల!

      ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దగా బెంగ పెట్టేసుకోకుండా చక్కగా తెలంగాణ సినిమాలకు మాటల రచయితగా సెటిలైపోవచ్చు. పొన్నాల తన రాజకీయ ప్రత్యర్థుల మీద సంధించే మాటలను వింటుంటే పొన్నాల రాజకీయాల కంటే సినిమా మాటల రచయిగా బాగా షైన్ అవుతాడన్న అభిప్రాయం కలుగుతూ వుంటుంది.   లేటెస్ట్ గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అడపాదడపా పొన్నాల విసురుతున్న డైలాగ్స్ అదిరిపోతున్నాయి. మొన్నామధ్య కేసీఆర్ని పొన్నాల బుడబుక్కల వాళ్ళతో, పిట్టలదొరతో పోలుస్తూ డైలాగ్స్ కొట్టాడు. అలాగే నిన్నగాక మొన్న సన్నాసుల బాష మాట్లాడే కేసీఆరే అందరికన్నా పెద్ద సన్నాసి అని ఘాటు డైలాగ్ కొట్టాడు. లేటెస్ట్ గా రావణుడికి రంగు వేస్తే రాముడు అవుతాడా అని కేసీఆర్‌ని ఉద్దేశించి సూపర్ డైలాగ్ కొట్టాడు. పొన్నాల డైలాగ్స్ కి కేసీఆర్ తరఫు నుంచి పెద్దగా స్పందన రాకపోయినా, తెలంగాణ సినిమా వర్గాలు మాత్రం పొన్నాలలోని డైలాగ్ రచయితని ఆశగా చూస్తున్నాయి.

టీఆర్ఎస్ ప్రచారం: అల్లు అర్జున్‌కి కేసీఆర్ నో?

      టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కి పిల్లనిచ్చిన మామ శేఖర్‌రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు వారి వియ్యంకుడు టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచీ అల్లు అర్జున్ మామగారికి ప్రచారం చేస్తాడా చేయడా... అల్లు అర్జున్ ముగ్గురు మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, శేఖర్‌రెడ్డి మధ్యలో ఇరుక్కుపోయాడు.   ఇప్పుడేం చేస్తాడో అనే చర్చలు, ఊహాగానాలు గత రెండు రోజులుగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ కూడా ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయాలా వద్దా అనే డైలమాలో వున్నట్టు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్‌కి అంత శ్రమ అవసరం లేకుండా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అల్లు అర్జున్ ప్రచారం అవసరం లేదని శేఖర్‌రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సీమాంధ్రుడి చేత ప్రచారం చేయించుకుని ఇబ్రహీంపట్నం సీటు గెలవాల్సినంత ఖర్మ టీఆర్ఎస్‌కి పట్టలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు అల్లు అర్జున్ ప్రచారం డైలమాని కేసీఆరే తీర్చేశాడు.

చేసిన మేలు మరచే చంద్రబాబు: జయప్రద కామెంట్!

      తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు మేలు చేసిన వారిని మరచిపోయే వ్యక్తి అని ప్రముఖ సినీ నటి, లోక్‌సభ సభ్యురాలు జయప్రద వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానెల్‌కి ఇచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చంద్రబాబు మీద విమర్శలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తాను ఎన్నో త్యాగాలు చేసి ఎన్టీఆర్ వెంట నడిచానని, పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత తాను చేసిన త్యాగాలన్నిటికీ గుర్తింపు లేకుండా పోయిందని ఆమె బాధపడ్డారు. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చాక తనకు సాయం చేసిన వారిని మరచిపోవడం అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో వున్న విలువలు ఇప్పుడు లేవని జయప్రద అన్నారు.

అమెరికాలో దారుణం: ఉన్మాది @ విద్యార్థి!

      అమెరికాలోని విద్యావిధానం కారణంగా విద్యార్థులు స్ట్రెస్‌కి గురై దారుణాలకు ఒడిగడుతున్నారో లేక అక్కడి పెంపకమే దారుణంగా వుందో గానీ, విద్యాలయాల్లో దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తోటి విద్యార్థుల మీద దాడులు, దారుణ హత్యలు చేస్తున్న సైకోల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇప్పుడు మరో సైకో ఉదంతం వెలుగులోకి వచ్చింది. పెన్సిల్వేనియా రాస్ట్రంలోని మరీస్ విల్లే ప్రాంతంలోని ఓ విద్యాలయంలో ఒక విద్యార్థి దారుణంగా బిహేవ్ చేశాడు. చేతిలో కత్తి పట్టుకుని విద్యాలయంలో వీరవిహారం చేశాడు. తమలో ఒకడిగా వున్న విద్యార్థి సడెన్‌గా ఉన్మాదిలా మారి కత్తితో దాడి చేయడంతో విద్యార్థులందరూ చెల్లాచెదురైపోయారు. పారిపోతున్నవారిని కూడా వదలకుండా సదరు ఉన్మాది వాళ్ళని కసితీరా పొడిచి గాయపరిచాడు. మొత్తం ఇరవై మందిని దారుణంగా పొడిచిన ఉన్మాదిని ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. టైమ్ బాగుండి ఉన్మాద విద్యార్థి చేతిలో గాయపడిన వారెవరికీ ప్రాణాపాయం లేదు.