మంత్రి కుమారుడి మీద నిర్భయ చట్టం

  అసలే మంత్రి కుమారుడు, ఆపై తాగి ఉన్నాడు. దారిన పోతూ ఉన్న ఒక మహిళ మీద అసభ్యంగా ప్రవర్తించాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌పై నిన్న వచ్చిన ఈ ఆరోపణతో రాజకీయ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి కుమారుడు కావడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. తెలంగాణకు చెందిన నేతలు స్వయంగా రంగంలోకి దిగి సుశీల్‌ మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల మీద ఒత్తిడిని తీసుకువచ్చారు. దాంతో సుశీల్ మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న సుశీల్‌ మాత్రం, తాను ఎలాంటి అఘాయిత్యానికీ పాల్పడలేదనీ, చిన్నపాటి గొడవను పెద్దది చేస్తున్నారంటూ తన ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చుకున్నాడు. ఒక రాష్ట్ర మంత్రి కుమారుడి మీద నిర్భయం చట్టం కింద కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ కేసులో సుశీల్‌ కనుక దోషిగా తేలితే ఏడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలు గారాల బిడ్డలు ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం కొత్త కాదు. కానీ ప్రతిసారీ ఏదో ఒక వివరణలతో వారు తప్పించుకుపోయేవారు. కానీ ఈసారి పరిస్థితి ఏమంత అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మరి ఈ విషయంలో రావెల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి! కానీ ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో మాత్రం రాజకీయ యువ నేతల పట్ల మరింత విముఖత ఏర్పడే అవకాశం ఉంది.

సెక్యూరిటీ గార్డే చంపడం మొదలుపెడితే....

  అది ముంబైలోని ఒక గృహ సముదాయం! ఆ సముదాయంలో ఓ ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజన్సీ రక్షణ బాధ్యతలను నిర్వహిస్తోంది. సదరు సెక్యూరిటీ ఏజన్సీ తరఫున రఫీక్‌ చౌదరీ అనే వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. కొద్దిరోజుల క్రితం సదరు గృహ సముదాయం ఒక సమావేశాన్ని నిర్వహించి, ఇకమీదట తమకు ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీ అవసరం లేదనీ తేల్చిచెప్పింది. మరికొద్ది రోజులలో రఫీక్‌ చౌదరీని పని నుంచి తీసేయాల్సిందిగా కూడా నిర్ణయించుకుంది. దీంతో రఫీక్ మనసులోకి ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ‘అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండంటం వల్లే కదా, సెక్యూరిటీ ఏజన్సీని పీకిపారేస్తోంది! ఒకవేళ అక్కడ ఏదన్నా హత్య జరిగితే, జనం తిరిగి రక్షణ కోసం తమని నియమించుకుంటారు కదా!’ అనుకున్నాడు. అంతే! అదను చూసి ముంతాజ్‌ అనే వృద్ధురాలిని చంపిపారేశాడు. గృహసముదాయంలో ఎక్కడెక్కడ సీసీ టీవీ కెమెరాలు ఉంటాయో రఫీక్‌కు తెలుసు కాబట్టి, చాలా జాగ్రత్తగా తన పనిని కానిచ్చేశాడు. ఈ కేసుని విచారించే పోలీసులు అతడిని ప్రశ్నించిన ప్రతిసారీ, ఏవో పొంతన లేని జవాబులు చెప్పడంతో, అధికారులకు రఫీక్‌ మీద అనుమానం వచ్చింది. తమదైన శైలిలో వారు ‘గట్టిగా’ ప్రశ్నించడంతో అతను నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు!

భోపాల్- అక్కడి ఇళ్లు పేలిపోతున్నాయి

  భోపాల్‌లోని దమోహ్‌ జిల్లాలో నిన్న ఒక ఇల్లు పేలిపోయిన సంఘటనలో ఓ వృద్ధురాలు మరణించగా, ఆ ఇంట్లో నివసిస్తున్న జంట తీవ్రంగా గాయపడింది. ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు మొదట అనుమానించారు. కానీ ప్రమాదానికి అసలు కారణం తెలిసేసరికి వారికి దిమ్మ తిరిగిపోయింది. పేలుడు సంభవించిన ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు సహజమేననీ, నీటి కోసం తవ్విన బోర్ల నుంచి విషపూరిత వాయువులు నీళ్ల పైపుల్లోకి ప్రవేశించి, తరచూ ఇలాంటి పేలుళ్లు సంభవిస్తూ ఉంటాయని స్థానికులు చెప్పడంతో అధికారులు బిత్తరపోయారు. అధికారుల పిలుపుతో అక్కడికి చేరుకున్న భూగర్భ శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. శాస్త్రవేత్తల మాటల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉండే నేల కాస్త విభిన్నమైనది. ఇక్కడి భూగర్భంలో రెండురకాల భూమి పలకలు ఉన్నాయి. ఆ రెండు రకాల పలకల మధ్యకీ బోరు వేసినప్పడు, వాటి మధ్య ఉన్న వాయువులు బయటకు వెలువడుతుంటాయి. అవే ఈ పేలుళ్లకి కారణమవుతుంటాయి! ఎడాపెడా బోర్లని వేసేయడం, వాటి నుంచి నీటి పైపులను నేరుగా ఇళ్లలోకి మళ్లించడం చేసినన్నాళ్లూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

మోదీకి ‘రాహుల్ ఫోబియా’ పట్టుకుంది- కాంగ్రెస్‌

  కొంతమందికి ఎంత వయసు వచ్చినా వారి బుద్ధి వికసించదనీ, అలాంటివారు బాదం పప్పులు తిన్నా ఉపయోగం ఉండదనీ.... రాహుల్‌ గాంధిని మోదీ పార్లమెంటులో పరోక్షంగా ఏకేసిన విషయం తెలిసిందే! అంతకుముందు రాహుల్‌ తనని వ్యక్తిగతంగా విమర్శించినందుకు మోదీ ఇలా ఘాటుగా సమాధానం చెప్పారు. కానీ మోదీ మాటలు కాంగ్రెస్‌ పెద్దలను బాగానే నొప్పించినట్లున్నాయి. అందుకనే ఆ పార్టీ ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ మాట్లాడుతూ, మోదీ వ్యక్తిగత దూషణలకు దిగారని విమర్శించారు. 70 ఏళ్ల పార్లమెంటు చరిత్రలో ఎవరూ ఇలాంటి ఉపన్యాసం ఇచ్చి ఉండరని వాపోయారు. మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారనీ, ఆయనకు రాహుల్‌ ఫోబియా అనే జబ్బు పట్టుకుందనీ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధి అడిగిన ప్రశ్నలకు తట్టుకోలేక, మోదీ ఇలాంటి విమర్శలు చేశారన్నది అభిషేక్ ఆవేదన. రాహుల్‌గాంధికి వీరవిధేయులైన కాంగ్రెస్‌ నేతలు ఇంకెన్ని మాటల తూటాలు పేలుస్తారో చూడాలి మరి!

ముందు జాగ్రత్తలో ఉత్తర కొరియా.. సిద్దంగా అణ్వాయుధాలు

తాము బలహీనులమని ప్రత్యర్ధులకు తెలియకుండా ఉండాలంటే.. తాము బలమైన వాళ్లమని నిరూపించుకోవాల్సి వస్తుంది. అప్పుడే అవతలి వ్యక్తి మనపై దాడి చేయడానికి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఉత్తర కొరియా పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది. శత్రుదేశాల నుండి తమను కాపాడుకోవాడానికి ముదు జాగ్రత్తగా అణ్వాయుధాలను సిద్దంగా ఉంచుకోవాలని చూస్తుంది. దీనికి సంబంధించి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి ఐక్యరాజ్యసమితి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనే ఆణ్వాయుధాలు తయారు చేసి ప్రయోగించిన నేపథ్యంలో ఐకాస ఆభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉత్తర కొరియా నూతనంగా తయారు చేసిన రాకెట్ లాంచర్ ను పర్యవేక్షించిన సందర్బంగా..  అణ్వాయుధాల సంఖ్యను, నాణ్యతను పెంచాలని, ఇది దేశ రక్షణకు అత్యవసరం అని కిమ్ జోంగ్ చెప్పారు. అయితే ఈవిషయంపై అమెరికా రక్షణ శాఖ అధికారి బిల్ అర్బన్ స్పందించి.. ఉద్రిక్త పరిస్థితులలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటానికి బదులుగా అంతర్జాతీయ ఒప్పందాలు, బాధ్యతలకు కట్టుబడి ఉండాలని కోరారు.

బాలకృష్ణ కోరిక తీర్చిన కేసీఆర్..

  నందమూరి బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి ఉన్న కొన్ని సమస్యల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అలా విన్నపాలు చేశారో లేదో.. కేసీఆర్ వెంటనే ఆయన కోరికను తీర్చేశారు. దీనిలో భాగంగానే ఆ ఆస్పత్రి నిర్మాణాల్లో బీపీఎస్‌ కింద విధించవలసి ఉన్న 5.73 కోట్ల రూపాయలను మినహాయించేస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. కాగా ఆ ఆస్పత్రిలో ఇటీవలి కాలంలో సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు, కొత్తబ్లాకులు చేసేశారు. వాటిని రెగ్యులరైజ్‌ చేయడం గురించి కొన్ని నెలల కిందట బాలకృష్ణ ప్రత్యేకంగా వెళ్లి కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కేశినేని కూతురు

  అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్.. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌లు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సూపర్ ట్యూజ్ డే ప్రైమరీల్లో వారిద్దరూ తమ తమ పార్లీల్లో భారీ విజయాలు సాధించారు. అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి పార్టీ నామినేషన్లు పొందేందుకు తమ తమ పార్టీల్లో ప్రత్యర్ధుల కన్నా చాలా ముందుకు దూసుకొచ్చారు. అయితే ఇప్పుడు హిల్లరీ క్లింటన్ తరుపున ప్రచార బాధ్యతలు చూసుకునే అవకాశం ఓ తెలుగు అమ్మాయికి దక్కడం విశేషం. అది కూడా విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ కూతురు శ్వేత. ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ప్రచార బాధ్యతలు నిర్వహించే బృందంలో శ్వేతను చేర్చుకున్నారు హిల్లరీ క్లింటన్. కేశినేని శ్వేత అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయవాడలో నాని తరపున శ్వేత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

తండ్రితో కలిసి కిడ్నాప్‌ డ్రామా ఆడిన యువతి

  స్నాప్‌డీల్ సంస్థలో పనిచేసే దీప్తి అనే యువతి, గత నెల ఒక కిడ్నాప్‌ ప్రమాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే! చివరకు దీప్తిని పీకల్లోతు ప్రేమించిన వ్యక్తే ఆమెను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించాడని తెలియడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ సంఘటనను మరువక ముందే, నోయ్‌డాకు చెందిన శిప్రా మలిక్‌ అనే 29 ఏళ్ల ఫ్యాషన్‌ డిజైనర్‌ కిడ్నాప్ అయిన వార్త సంచలనం సృష్టిస్తోంది . ఈ సోమవారం నుంచి కనిపించకుండా పోయిన శిప్రా నిన్న గుర్‌గావ్ వద్ద క్షేమంగా దొరికింది. ఒక ముగ్గురు వ్యక్తులు తనను నోయ్‌డాలో కిడ్నాప్ చేశారనీ, నాలుగు రోజుల తరువాత వారు గుర్‌గావ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాననీ ఆమె చెబుతోంది. కానీ పోలీసులు శిప్రాను విచారించిన ప్రతిసారీ ఒకోరకంగా మాట్లాడుతూ ఉండటంతో, శిప్రా చెబుతున్న విషయాలు ఎంతవరకు నిజమో అని పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో శిప్రాని కిడ్నాప్ చేశారని చెప్పిన సమయం దగ్గరనుంచి ఆమె కదలికలను విచారించిన పోలీసులకు, శిప్రా చెబుతున్నదంతా అబద్ధం అని తేలిపోయింది. శిప్రాను మరోసారి కటువుగా విచారించడంతో తను పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి ఉన్నాననీ, వాటి నుంచి బయటపడేందుకు ఈ కిడ్నాప్‌ నాటకం ఆడేందుకు ప్రయత్నించాననీ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ నాలుగు రోజులూ రాజస్థాన్‌లోని ఒక ఆశ్రమంలో తలదాచుకున్నట్లుగా కూడా శిప్రా చెప్పుకొచ్చిందట. శిప్రా ఆడిన ఈ కిడ్నాప్‌ నాటకంలో ఆమె సోదరుడు, తండ్రి కూడా పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిప్రా కనిపించకుండా పోవడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవడంతో, ఆమె తన నాటకాన్ని చాలించి తిరిగి వచ్చేసి ఉంటుందని భావిస్తున్నారు.

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. మే 19 కౌంటింగ్

  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీం జైదీ ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు.  పశ్చిమ్‌బంగాలే, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరికి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదలైంది. అసోంలో 126, తమిళనాడులో 234, బంగాల్‌లో 294, పుదుచ్చేరిలో 30శాసనసభా స్థానాలకు ఎన్నికల నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. మొత్తం 5 రాష్ట్రాల్లో 1070 మిలియన్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.   అస్సాం అస్సాంలో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 4 న మొదటి దశ ఏప్రిల్ 11న రెండో దశ   పశ్చిమ్‌బంగాల్ పశ్చిమ్‌బంగాల్ లో 6దశల్లో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 4, 11న మొదటి దశ, 17 న రెండో దశ, 21 న మూడో దశ, 23 నాలుగు, 30 ఐదు, మే 5న అఖరి దశ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మే 16న పోలింగ్ ఐదు రాష్ట్రాల్లో మే 19 న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.

77 ఏళ్ల వయస్సులో పది పరీక్షలు.. 47వసారి

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 77 ఏళ్ల నుండి పదో తరగతి పాసవడానికి ప్రయత్నిస్తున్నాడు ఓ వ్యక్తి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా అది నిజం. ఈ విచిత్రమైన ఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని శివరాజన్ అనే వ్యక్తి 1968లో మొదటిసారి పదో తరగతి పరీక్షలు రాశాడు. అయితే ఆ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అలా అప్పటినుండి ఇప్పటి వరకూ రాస్తూనే ఉన్నాడు. కానీ రాసిన ప్రతి సంవత్సరం ఏదో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పదో తరగతి పాసయ్యేంతవరకు పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. ఇప్పుడు అతనికి 77 ఏళ్లు. ఒంటరిగా ఉంటూ.. ప్రభుత్వం తరఫున వచ్చే పింఛను, గుడిలో పెట్టే ప్రసాదంతో బతికేస్తున్నాడు.. ఈ 77 ఏళ్లలో 46 సార్లు పరీక్షరాశాడు..ఇప్పుడు 47వ సారి పరీక్ష రాయడానికి సిద్దపడుతున్నాడు. దీనికోసం ప్రత్యేకంగా ట్యూషన్‌ కూడా పెట్టించుకున్నాడట. మరి ఇప్పుడైనా తను పరీక్ష పాసవాలని కోరుకుందాం..

భారత్‌కు వచ్చేందుకు తీవ్రవాదులు... సొరంగం తవ్వేశారు

  పాకిస్తాన్‌ నుంచి మన దేశంలోకి ప్రవేశించేందుకు తీవ్రవాదులు చేయని ప్రయత్నమంటూ లేదు. తాజాగా మన దేశంలోకి భారీ ఆయుధాలతో సహా చొరబడేందుకు, తీవ్రవాదులు 90 అడుగు సొరంగాన్ని తవ్విపారేశారు. ఆర్‌.ఎస్‌. పురా సెక్టారులోని సరిహద్దులో పాకిస్తాన్ వైపు నుంచి ఇండియాలోకి వచ్చేందుకు తవ్విన ఈ సొరంగాన్ని సైన్యం కనిపెట్టడంతో, భారీ ముప్పు తప్పింది. త్వరలోనే మొదలయ్యే అమర్‌నాధ్‌ యాత్రలో భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నాలలో భాగంగానే తీవ్రవాదులు ఈ సొరంగాన్ని తవ్వినట్లు తెలుస్తోంది. భూమికి 10 అడుగుల దిగువున నాలుగడుగుల వెడల్పుతో తవ్విన ఈ సొరంగాన్ని భారత్‌ భూభాగంలోని ‘అల్లాహ్ మాయి దే కోతే’ అనే ప్రదేశంలో కనుగొన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే భారత సైన్యాధికారులు, తమ తోటి పాకిస్తాన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎప్పటిలాగే... తమకేమీ తెలియదంట పాకిస్తాన్ సైన్యం నిమ్మకుండిపోయింది!

చక్రి తల్లి, సోదరుడు అరెస్ట్..

దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రి ఆస్తిపై గత మూడు రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. చక్రి భార్య శ్రావణికి.. చక్రి కుటుంబసభ్యులకు ఆస్తి వ్యవహారంలో వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చక్రి తల్లి, సోదరుడు మహిత్ నారాయణ్‌ సోమాజిగూడలోని వరుణ్ స్వర్గం విల్లా అపార్ట్‌మెంట్ వద్ద దీక్ష చేపట్టారు. అయితే వీరిని గురువారం రాత్రి 11 గంటలకు పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే తమను అరెస్ట్ చేయడంపై మహిత్ నారాయణ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్నమమ్మల్ని అరెస్ట్ చేయడం అమానుషం.. దీని వెనుక  ఫ్లాట్ నం. 504ను ఆక్రమించుకున్న అట్లూరి మాధవి హస్తముందని.. ఇంకా ఎవరెవరు ఉన్నారో బయటపెడతానని అన్నారు.

పాకిస్థాన్ ను పొగిడితే ముక్కలుగా నరుకుతా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

  బీజేపీ నేతలు మాత్రం తమ నోటిని ఏ మాత్రం అదుపులో పెట్టుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఒకపక్క దేశంలో ఇప్పటికే మతపరమైన ఘటనలు జరుగుతుంటే ఇప్పుడు వారు చేసే వ్యాఖ్యలవల్ల ఇంకా దుమారం రేగుతోంది. తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో యువత ఎవరైనా పాకిస్థాన్ జిందాబాద్ అన్నా.. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా, పాకిస్థాన్‌ను పొగుడుతూ నినాదాలు చేసినా తలలు తీస్తానంటూ..  పై నుంచి కిందకు నిలువునా చీరేస్తాం.. ఆరు అంగుళాల ముక్కల చొప్పున నరుకుతాం అంటూ హెచ్చరించారు. మరి ఈయన చేసిన వ్యాఖ్యలకు ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

మీరు టాయిలెట్లు కట్టి ఉంటే అయిపోయేది.. రాహుల్ పై మోడీ

  ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మోడీ మీద విరుచుకుపడిన రాహుల్ గాంధీకి మోడీ నిన్న జరిగిన సభలో బానే చురకలు అంటించారు. కొందరికి వయసు పెరుగుతుంది కాని బుర్ర పెరగదని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఆ సమయంలో సభ నుండి రాహుల్ గాంధీ వెళ్లడానికి ప్రయత్నించగా..  ప్రధాని మోడీ.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ లోకసభా పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కూడా చెప్పడంతో రాహుల్ తిరిగి వచ్చి కూర్చున్నారు. అనంతరం మళ్లీ మోడీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తమపై చాలా బాధ్యతలు వదిలేసిందని.. పేద ప్రజలకు చేయాల్సిన చాలా పనులను తమపై వదిలేసిందని.. అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక టాయిలెట్లు కట్టి ఉంటే మాకు ఆ పని తప్పేదని.. అందరికీ కరెంట్ ఇవ్వకుండా తమకు వేలాది ఇళ్లకు విద్యుత్ ఇచ్చే పనిని అప్పగించారన్నారని విమర్శించారు. దేశం బలహీనంగా ఉన్నట్లు చూపించడం సరికాదని స్వర్గీయ ఇందిరా గాంధీ అన్నారని మోడీ గుర్తు చేశారు. మొత్తానికి మోడీ తన మార్కును మరోసారి చూపిస్తూ.. అటు మాపై బాధ్యత పెట్టారు అంటూనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని మాట్లాడారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

  దిల్లీ నుంచి ముంబైకి ప్రయాణించిన జెట్‌ ఎయిర్‌వేస్ భారీ ప్రమాదాన్ని తృటిలో తప్పించుకుంది. నిన్న ఈ విమానం ముంబైలో దిగే సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ మొరాయించడంతో, ఒక్కసారిగా విమానం రన్‌వే మీదకి ఒరిగిపోయింది. ఈ సమయంలో విమానంలో 127మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ల్యాండింగ్‌ అయ్యే సమయంలో పైలట్‌ ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా తమ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవన్న ఊహ ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. విమానం రన్‌వే మీద అదుపుతప్పే సమయంలో దగ్గరలో మరో విమానం లేకపోవడం వల్లగానీ, ఎలాంటి షార్ట్ సర్క్యూట్ ఏర్పడకపోవడం వల్లగానీ... పెను ముప్పు తప్పినట్లు భావిస్తున్నారు. విమానం కుప్పకూలిన చోట నుంచి ఒక్క అంగుళం కూడా మరి కదిలేందుకు మొరాయించడంతో... ముంబై విమానాశ్రయ అధికారులు ప్రత్యామ్నాయ రన్‌వేలను ఉపయోగిస్తున్నారు.

రేపటినుండే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటినుండి ప్రారంభంకానున్నాయి. దీనిపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో మొదట గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారని అన్నారు. అంతేకాదు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలకుండా విపక్ష సభ్యులు సంయమనం పాటించాలని కోరారు. ఈ సమావేశాలు 18 రోజులు జరగుతాయని.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పదో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తారని కోడెల అన్నారు. కాగా ఏపీ, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెలలోనే జరగనున్న నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు.