బట్టలు ఉతకనందుకు మెమో

  ప్రభుత్వం రంగంలో ఉండే ఉన్నతాధికారులు, తమ సహాయకుల చేత నానాచాకిరీ చేయించుకుంటారన్న విషయం బహిరంగ రహస్యమే! ఈ విషయం మీద ఎన్ని విమర్శలు వినిపిస్తూనే ఉన్నా, జరిగే పని జరుగుతూనే ఉంది. కానీ ఏకంగా తన బట్టలు సరిగా ఉతకడం లేదంటూ ఓ జడ్జిగారు తన సహాయకురాలికి మెమో ఇచ్చిన వార్త ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. ‘నా ఇంట్లో బట్టలను, ముఖ్యంగా లోదుస్తులను సరిగా ఉతకడం లేదంటూ, ఇదేంటని ప్రశ్నించిన నా భార్యకి అమర్యాదగా బదులిచ్చినందుకు... నీ మీద ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఏడు రోజులలోగా బదులు ఇవ్వాలి’ అంటూ డి.సెల్వం అనే సదరు జడ్జిగారు, వసంతి అనే సదరు సహాయకురాలికి ఘాటుగా ఓ శ్రీముఖాన్ని జారీచేశారు. ఈ మెమోని చూసి భయపడిపోయిన వసంతి ‘తప్పు జరిగినందుకు మన్నించమనీ, మున్ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాననీ’ వివరణను అందించారు. కాకపోతే ఈ మెమో కబురు కాస్తా బయటకు పొక్కడంతో, ఉద్యోగ సంఘాలు ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నాయి.

సూరీడుతో జగన్ చెక్ పెట్టనున్నారా..?

  దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. వైఎస్ కు అత్యంత ముఖ్య అనుచరుడు అయిన సూరీడు చంద్రబాబును కలవడంలో ఆంతర్యం ఏమిటా అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   సూరీడు.. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరీడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. పార్టీలో ఉన్న అందరి నేతల కంటే రాజశేఖర్ రెడ్డికి సూరీడు నమ్మిన బంటులా ఉండేవాడు.. అంతేకాదు వైఎస్ దగ్గర ఏదైనా పనులు కావాల్సి వస్తే సూరీడుని కలిస్తే చాలు అయిపోతుంది అనే నమ్మకం కలిగిన వ్యక్తి. అయితే వైఎస్ మరణానంతరం మాత్రం సూరీడు రాజకీయాలకు దూరంగా జగన్ కు కూడా కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయన చంద్రబాబును కలవడంపై ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.   అయితే సూరీడు తన వ్యక్తిగత పనుల మీద చంద్రబాబును కలవడానికి వచ్చారా..? లేక జగన్ టీడీపీ నేతలపై అమరావతి భూములు కొన్నారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. జగన్ గురించి ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు టీడీపీనే సూరీడును పిలిపించిందా..? సూరీడు ద్వారా జగన్‌కు చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నారా? అని చర్చ సాగుతోంది. మరి ఎందుకు కలిశారో ఇద్దరిలో ఒక్కరైనా నోరు విప్పితేనే తెలుస్తోంది.

జైలు జీవితంపై బుక్ రాస్తా.. కన్హయ్య కుమార్

జేఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్హయ్య కుమార్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తీహార్ జైలు నుండి కన్హయ్య బయటకు వచ్చారు. అయితే కన్హయ్య బయటకు వచ్చిన నేపథ్యంలో క్యాంపస్లో ఒక పక్క సంబరాలు జరుపుకుంటుంటే.. మరోపక్క ఏబీవీపీ సంఘ నేతలు మాత్రం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య మాట్లాడుతూ.. తనపై ఎన్ని కేసులు పెట్టిన బయపడేది లేదని, జెఎన్‌యు విద్యార్థి ఉద్యమ వారసత్వం తనకు అట్లాంటి ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. అంతేకాదు.. నేను ఎలాంటి దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదు.. ఏబీవీపీ నేతలు కావాలనే అలాంటి వీడియోలు స్పంష్టించారని ఆరోపించారు.   అంతేకాదు ఈ సందర్భంగా కన్హయ్య ప్రధాని మోడీ గురించి కూడా ప్రస్తావించి.. చిన్న, చిన్న ఘటనలతో పూర్తిగా జెఎన్‌యునే మూసివేసే కుట్ర జరిగిందని, ప్రభుత్వ కుట్రలను విద్యార్థులు, ప్రొఫెసర్లు అడ్డుకున్నారని.. ఇందిరా గాంధీ లాంటి వారే జెఎన్‌యు వద్ద తల దించుకున్నారనీ మోడీ ఆ రూచి చూసే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఇక జైలు జీవితంపై బుక్ కూడా రాస్తానని కన్హయ్య చెప్పారు.

చంద్రబాబు.. మాట మీరు తప్పారా..? నేనా..?

కాపు సంఘ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం మరిచిపోయింది.. అదే విషయాన్ని నేను ప్రశ్నించినందుకు నన్ను ఓ దొంగ, ద్రోహీ అని టీడీపీ నేతలతో తిట్టించారు అని అన్నారు. నాపై వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబు.. మాట మీరు తప్పారా..? నేను తప్పానా..?.. కాపు డిమాండ్లను అవహేళన సమంజసమేనా.. అధికారంలో ఉన్నవాళ్లు అబద్దాలు చెబితే నిజమైపోతాయా అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈనెల 10 వ తేదీలోపు ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలి లేదంటే 11వ తేదీన దీక్ష చేపడతాం అని చెప్పారు.  

మరోసారి పవన్ ను టార్గెట్ చేసిన రోజా..!

వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో దిట్ట. ఆ విషయం ఇప్పటికి ఎన్నోసార్లు రుజువైంది. అయితే ఏపీ అధికార పార్టీపైన ఆ నేతలపైన విమర్శలు చేసే రోజా.. అప్పుడప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తుంటారు. గతంలో ప్రత్యేక హోదాపైన.. అమరావతి భూముల మీద పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అంటూ డిమాండ్ చేసేవారు. ఇప్పుడు మరోసారి భూ దందా వ్యవహారంలోకి పవన్ కళ్యాణ్ ను లాగారు. అమరావతిలో తెలుగుదేశం పార్టీ నేతల భూదందాపై పోరాడాలని..  ప్రశ్నించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై నోరుమెదపాలని.. అసలు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను చూసే ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారని అన్నారు. మొత్తానికి రోజా మాత్రం ఏదో ఒక విషయంపై పవన్ ను టార్గెట్ చేస్తూనే ఉంటారు. మరి ఈ విషయంపై పవన్ స్పందిస్తారో లేదో చూడాలి..

కేన్సర్‌ను ఎదుర్కొనే టీకాలు మొదలయ్యాయి!

  ఎంతటి ఆరోగ్యవంతుడైన మనిషినైనా నిర్వీర్యం చేసి, విషమ స్థితిలోకి నెట్టివేసే రోగం కేన్సర్‌. ప్రాథమిక దశలో ఉన్న కేన్సర్‌ను నిర్మూలించడం సాధ్యమైన విషయమే అయినా, అందుకోసం చేసే చికిత్స, శరీరాన్ని నిస్సత్తువకు గురిచేస్తుంది. పైగా కొన్ని రకాల కేన్సర్‌ మళ్లీ మళ్లీ తిరగబెట్టే ప్రమాదమూ ఉంది. ఒకవేళ కేన్సర్‌ను కనుక ఆఖరి దశలో గుర్తిస్తే, దాని నుంచి కోలుకోవడం కష్టం కావచ్చు. అందుకనే ఎలాంటి ప్రతిచర్యలూ లేని కేన్సర్‌ చికిత్స కోసం సుదీర్ఘకాలంగా ప్రపంచం వేచి చూస్తోంది. ఇప్పుడు ఆ శుభసమయం వచ్చేసినట్లే కనిపిస్తోంది. లండన్‌లోని గయ్స్‌ ఆసుపత్రి, మనిషిలోని కేన్సర్‌ కణతుల మీద దాడి చేసే విధంగా ఒక టీకాను అమలుచేస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ టీకాను, ఎంపిక చేసిన కొందరు రోగులకు అందించడం మొదలుపెట్టారు. ట్రాన్స్‌స్క్రిప్టేస్ అనే ఒక ఎంజైము ఆధారంగా రూపొందించిన ఈ టీకాను రోగికి ఇచ్చినప్పుడు, అది విచ్చలవిడిగా పెరిగిపోతున్న కేన్సర్‌ కణాలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేస్తుంది. భారతీయ సంతతికి చెందిన కేన్సర్‌ నిపుణుడు, హర్‌దేవ్‌ పండా కూడా ఈ ప్రయోగంలో ముఖ్యపాత్రను పోషించడం గమనార్హం.  

పరకాల ప్రభాకర్ ఎక్కడ..? ఏమైంది..?

  ఎప్పుడూ ఏదో ఒక విషయంపై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి.. మీడియాతో ఎప్పుడూ టచ్ లో ఉండే ఒక వ్యక్తి ఏపీ సర్కారు మీడియా అడ్వైజర్ గా ఉన్న పరకాల ప్రభాకర్ కొంత కాలం నుండి కనిపించడంలేదు.. దీంతో ఇప్పుడు అసలు పరకాలా ఎక్కడికి వెళ్లారు.. ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలు తెలత్తుతున్నాయి. అయితే ఈయన అంతగా కనిపించకపోవడానికి గల పలు కారణాలు రాజకీయ వర్గాలు చెబుతున్నారు. గత ఏడాది రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటు నోటు కేసుకు సంబంధించి మాట్లాడిన మాటల్లో తప్పు బాబు చేశారనే అర్దం వచ్చేలా కన్ఫ్యూజన్ లో ఇరికించారని బాబు ఆయన మీద కోప్పడ్డారట. అది అయిపోయిందంటే.. ఆ తరువాత జరిగిన గోదావరి పుష్కరాలకు సంబంధించి జరిగిన తప్పిదంలో.. ఏర్పాట్లు సరిగా చేయలేదని పరకాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారంట చంద్రబాబు. అంతేకాదు మీడియా సమావేశంలో కూడా విలేఖరులు ఏదో అడిగితే ఆయన మరేదో చెబుతుండటంతో…టీడీపీ ఇరుకున పడాల్సి వస్తుంది. దీంతో ఆయన్ను రాజకీయ పరమైన నిర్ణయాలకు దూరంగా ఉంచుతున్నారట చంద్రబాబు. అయితే ఇవన్నీ నిజమో కాదో తెలియదు కానీ.. పరకాల ప్రస్తుతం ఏదో అనారోగ్య సమస్య మీద ముంబై వెళ్లారని.. అక్కడ ఓ హాస్పిటల్లో చికిత్స చేయింటుకుంటున్నారని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. మరి అది ఎంత వరకూ నిజమో తెలియదు. ఏది ఏమైనా ఒకవేళ నిజంగానే పరకాల ఆస్పత్రిలో ఉంటే తొందరగా కోలుకోవాలని కోరుకుందాం..

నేనేం చంద్రబాబు బినామీని కాదు..

  ఏపీ నూతన రాజధానిలో టీడీపీ నేతలకు భూములు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆపార్టీ నేతలు జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై సినీ నటుడు.. టీజీపీ నేత మురళీ మోహన్ మాట్లాడుతూ.. మాపై జగన్ మీడియా లేనిపోని ఆరోపణలు చేస్తుందని..హాయ్ లాండ్ కొన్నానని లేనిపోని పుకార్లు సృష్టించార అని అన్నారు. నేను 1993 లో హైదరాబాద్ షిప్ట్ అయ్యాను.. అప్పటినుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను.. నా దగ్గర అపార్ట్ మెంట్లు కొన్నవారు హ్యాపీగా ఉన్నారు అని ఆయన తన గతాన్ని గుర్తుచేశారు. చంద్రబాబుకు నాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు.. నేను చంద్రబాబుకి బినామీని కాదు అని ఆయన అన్నారు. పీజేఆర్, వైఎస్సార్ కూడా నా మీద ఆరోపణలు నిరూపించలేకపోయారు అని చెప్పారు. ఎన్నికలకు ముందే భూములు కొన్నాను.. ఇప్పటి వరకూ అనుమతులు రాలేదు.. అనుమతులు రాకముందే బురద చల్లుతున్నారు అని ఆరోపించారు.

తండ్రి హత్య విషయంలో నో కామెంట్స్ అంటున్న రాహుల్..

  ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏం జరిగినా నేనున్నానంటూ వెంటనే అక్కడికి వెళ్లిపోతున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. ఇక జెఎన్ యూ, హెచ్ సీయూ ఘటనలు జరిగినప్పుడైతే చెప్పనవసరం లేదు.. ఆ యూనివర్శిటీల్లోకి వెళ్లి విద్యార్ధులకు మద్దతు పలికారు కూడా. రోహిత్ ఆత్మహత్య ఘటనలో రెండుసార్లు ఢిల్లీ నుండి వచ్చి మరీ దీక్షలో పాల్గొన్నారు. ఇక ఈ వ్యవహారంలో స్మృతీ ఇరానీపై కూడా ఆరోపణలు వస్తుండటంలో రాహుల్ రెచ్చిపోయారు. అయితే ఎవరో సామాన్య వ్యక్తుల కోసం ఇంతలా స్పందిస్తున్న రాహుల్ తన తండ్రి విషయంలో మాత్రం ఎందుకు నోరు తెరవడంలేదు అన్న సందేహాలు వస్తున్నాయి.   రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించాలని రాహుల్ ను కోరినప్పుడు మాత్రం నో కామెంట్ అని నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అంతేకాదు కొడుకుగా తాను ఈ విషయం మీద మాట్లాడలేనని చెప్పారు. దీంతో ఇప్పుడు కన్న తండ్రి వ్యవహారంలో మాట్లాడలేరు కానీ.. వేరే వ్యక్తుల విషయంలో మాత్రం మాట్లాడతారా అంటూ కామెంట్లు విసురుతున్నారు. అసలు ఎందుకు ఈ విషయంలో మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రాహుల్ ఎందుకు మాట్లాడటంలేదో వివరణ ఇస్తే బావుంటుంది. 

సెల్ఫీ తీసుకోబోయి.... ఐదుగురికి తీవ్ర గాయాలు!

  సెల్ఫీల పిచ్చిలో ప్రాణాల మీదకు తెచ్చుకునే వార్తలకు అంతులేకుండా పోతోంది. తాజాగా గోవాలోని ఒక కొండ మీద సెల్పీని తీసుకోబోయిన అయిదుగురు తీవ్ర గాయాలకు లోనయ్యారు. కొండ చరియ మీద ఉన్న ఒక తలుపుకి ఆనుకుని, సెల్ఫీని తీసుకుంటుండగా, అకస్మాత్తుగా తలుపు తెరుచుకోవడంతో.... అంతా కిందకి పడిపోయారు. వీరిలో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. వీరి వెన్నెముకకి తీవ్రగాయాలు కావడంతో మున్ముందు ఒకవేళ కోలుకున్నా, లేచి నడవడం అసాధ్యమని చెబుతున్నారు వైద్యులు. ఇలా ఉండగా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీలు తీసుకోబోయి కనీసం 27 మందన్నా మరణించి ఉంటారని వాషింగ్టన్‌ పోస్టు అనే పత్రిక పేర్కొంది. వీరిలో దాదాపు సగం మంది భారతీయులే అని తెలుస్తోంది. వీరంతా సముద్రాలలోనూ, కొండచరియల మీదా, రైళ్లు వస్తుండగా.... సెల్ఫీలు తీసుకోబోయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ఆరోజు మహిళా ఎంపీలే మాట్లాడాలి.. మోడీ

  ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో జెఎన్ యూ, హెచ్ సీయూ ఘటనలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. అధికార పక్ష, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఈ విషయాలపై మోడీ ఎలా స్పందిస్తారు.. విపక్ష నేతలకు ఎలా సమాధానమిస్తారు అని ఆసక్తిగా ఎదురుచూశారు. ఈనేపథ్యంలోనే తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ మొదట రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం.. సభను అడ్డుకోవటం సరికాదంటూ పలు  కోట్ చేసిన ఆయన.. అవన్నీ దివంగత ప్రధానులు నెహ్రు.. ఇందిరా.. రాజీవ్ గాంధీల కొటేషన్లు చెబుతూ కాంగ్రెస్ కు చురక పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. కమ్యూనిస్ట్ సీనియర్ నేత సోమ్నాథ్ చటర్జీ కోట్ లను ప్రస్తావిస్తూ.. వామపక్షాలకు డిఫెన్స్ లో పడే ప్రయత్నం చేశారు. ఇంకా ఈనెల 8వ తేదీ మహిళా దినోత్సవం కావడంతో ఆరోజు మహిళా ఎంపీలే మాట్లాడితే బావుంటుందని సూచించార. అంతేకాదు కొత్తగా ఎన్నికై తొలిసారి సభకు వచ్చే ఎంపీలకు చాలానే ఐడియాలు ఉంటాయని.. వారి భావాలు వినేందుకు ఒక వారం పాటు వారు మాత్రమే మాట్లాడే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నను సందించారు.

జగన్‌ది బినామీ బతుకు.. జగన్ కూడా మగాడైతే..

  టీడీపీ నేతలకు రాజధానిలో భూములున్నాయని.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పత్రిక అయిన సాక్షిలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన పయ్యావుల కేశవ్ మాత్రం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్‌ది బినామీ బతుకు అని, తాను అతనిలా బినామీ పేర్ల మీద ఆస్తులు కొనలేదని, మగాడిలా ఆస్తులు కొన్నానని వ్యాఖ్యానించారు. జగన్‌ది బినామీ బతుకు జగన్ కూడా మగాడైతే, ఆయన ఒంట్లో రాయలసీమ రక్తమే ఉంటే, బినామీ బతుకు కాకుంటే... రాజధాని నడిబొడ్డున తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు.

నన్ను కొనుక్కోండి.. ఫ్లిప్కార్ట్లో ఐఐటీ విద్యార్ధి పోస్ట్

  సాధారణంగా ఉద్యోగం కావాలంటే ఏం చేస్తాం.. రెజ్యూమ్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. అయితే ఓ విద్యార్ధి మాత్రం కొత్తగా ఆలోచించి తననే కొనుక్కోండంటూ అంటూ ఆఫర్ ఇచ్చాడు..అదీ ఏ కంపెనీకి అనుకుంటున్నారా.. ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ లో. వివరాల ప్రకారం.. ఆకాశ్ నీరజ్ మిట్టల్ అనే అబ్బాయి ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ చదువుతున్నాడు. అయితే తను ఉద్యోగం కోసం తిరుగుతున్న క్రమంలో  ఫ్లిప్కార్ట్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అయితే అందరిలా తాను రెజ్యూమ్ పట్టుకొని వెళితే ఏం బావుంటుందని ఆలోచించాడేమో.. ఆ వెబ్ సైట్లోనే  తాను అమ్మకానికి ఉన్నానంటూ.. తనకు సంబంధించిన వివరాలు తెలుపుతూ.. తనకు తాను రూ. 27,60,200 గా ధరను కూడా ఫిక్స్ చేశాడు. అంతేకాదు..  ఫ్రీ డెలివరీ, లైఫ్ టైం వారెంటీ అంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు. మరి మిట్టల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. అతని తెలివికి ఫ్లిప్ కార్ట్ సంస్థ ఇంప్రెస్ అయి ఉద్యోగం ఇస్తుందో లేదో చూడాలి.

ఛాలెంజర్ ఆఫ్ ది ఇయర్ గా కేటీఆర్..

  తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరో అవార్డు దక్కింది. మంత్రి కేటీఆర్ ను స్కోచ్ సంస్థ ఛాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో టీహబ్ వంటి వినూత్న ప్రాజెక్టులు చేపట్టి టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, కొత్త భారతదేశ ఆవిష్కరణ కోసం పని చేస్తున్నందుకు ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు స్కోచ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి, ఈ అవార్డును స్వీకరించేందుకు రావాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఇక తనకు ఈ అవార్డు రావడం పట్ల కేటీఆర్ స్పందిస్తూ ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాగా గతంలో కేటీఆర్ కు ఐకాన్ ఆఫ్ ధ ఇయర్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.