పరారీ నేరస్తుడిగా మాల్యా గుర్తింపు.. భారత్ రావాల్సిందే..

  విజయ్ మాల్యాకు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. మల్యాను భారత్ కు అప్పగించేందుకు లైన్ క్లియరైనట్టు తెలుస్తోంది. జయ్ మాల్యా కేసులో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అవ్వగా.. ఇప్పుడు మాల్యాను ‘ప్రొక్లెయిమ్ డ్ అఫెండర్’ (పరారీలో ఉన్న నేరస్తుడు) గా గుర్తించాలని కోర్టులో పిటిషన్ వేసింది. అయితే దీనిపై విచారించిన కోర్టు మాల్యాను ప్రొక్లయిమ్ డ్ అఫెండర్ గా ప్రకటించింది. నెల రోజుల్లో కోర్టు ముందు హాజరుకావాలని సూచించింది. దీంతో మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. అంతేకాదు మాల్యాను అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడైనా మాల్యా భారత్ వస్తారో లేదో చూద్దాం..  

కాంగ్రెస్ కు షాక్.. జానారెడ్డి రాజీనామా.. అందుకేనా..?

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు నేతలు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు, మాజీ ఎంపీ వినోద్, మాజీ ఎమ్మెల్యే వినోద్ టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు వారికి తోటు మరో నేత కూడా గులాబి కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ప్రకటించాడు. నల్గొండ డీసీసీ చీఫ్ రాంరెడ్డి కూడా కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు చెప్పారు.   అయితే ఇప్పటికే వరుస జంపింగ్ లతో దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్న కాంగ్రెస్ కు జానారెడ్డి మరో షాక్ ఇచ్చారు. నిజంగా వరుస పార్టీ ఫిరాయింపులతో ఆయన విసుగెత్తి పోయారో లేక ఇంకా ఏదైనా ఉందో తెలియదు కాని ఆయన కూడా తన పదవులకు రాజీనామా చేస్తానని చెప్పి షాకిచ్చాడు. దీంతో ఇప్పుడు ఇది చర్చాంశనీయంగా మారింది. కాంగ్రెస్ నేతల ఫిరాయింపులపై మాట్లాడిన జానారెడ్డి సీఎల్పీతో పాటు మిగతా అన్ని పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. అంతేకాదు తన రాజీనామా వెనుక కారణం కూడా వివరించాడు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు లోను చేశాయని.. ఫిరాయింపుల నేపథ్యంలో ఈ పదవుల్లో కొనసాగడం అవసరమా..?, ఎందుకు నాకీ పదవులు..? అనిపించినందువల్లే ఫిరాయింపులకు వ్యతిరేకంగా పదవులన్నింటిని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేశారు. రాజీనామాపై తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో చర్చించాక వెల్లడిస్తామని ప్రకటించారు. మరి నిజంగానే జానారెడ్డి చెప్పింది నిజమేనా.. లేకపోతే తరువాత ఏదైన ట్విస్ట్ ఇస్తారా.. చూడాలి మరి.

ఎమ్మెల్యేలు కావాలనుకునే వారికి జగన్ చిట్కాలు..

ఎంత డబ్బు ఉన్నా..ఎంత పేరున్నా పొలిటికల్ పవర్ ముందు దిగదుడుపే..అందుకే జీవితంలో ఒక్కసారైనా ఖద్దరు బట్టలు వేసుకోవాలనుకుంటారు చాలామంది. కాని అది అనుకున్నంత ఈజీ కాదు. అలాంటి వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మంచి చిట్కాలు చెబుతున్నారు.  రాజకీయ నాయకులు కావాలంటే ఘనమైన వారసత్వం కావాల్సిన అవసరం లేదని, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదన్నారు. అందుకు చక్కన అవకాశం తాను కల్పిస్తున్నానన్నారు. రోజుకి నాలుగు గంటల చొప్పున, 5 నెలల పాటు రోజుకొక పంచాయతీ చొప్పున ప్రచారం కల్పిస్తే..విజయం మీ సొంతమవుతుందని ఆయన తెలిపారు.  ప్రతి ఇంటికీ వెళ్తే..మనతో ఉన్నదెవరు, మాటలు చెబుతున్నదెవరు, మన వెంట నడిచేదెవరు? అన్న క్లారిటీ వస్తుందన్నారు. ఆ సమయంలో బూత్ ఏజెంట్లు, గ్రామ పెద్దలు, ఇలా వివిధ స్థాయిల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలకు క్లారిటీ వస్తుందని ఆయన చెప్పారు.  వైఎస్సార్‌సీపీ ఇచ్చే పాంప్లేట్‌ను గడపగడపకు ఇచ్చి, అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయించడం ద్వారా ప్రజల స్పందన తెలుస్తుందని..జూలై 8 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.   

మంత్రి పదవికి రాజీనామా.. హాట్ టాపిక్ ఇదే..

    ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఇది ఢిల్లీలో హాట్ టాపిక్ అయింది. మంత్రి గారు రాజీనామా చేయడానికి.. అందరూ చర్చించుకోవడానికి కారణం ఏంటనుకుంటున్నారా..? ఎందుకంటే బస్సుల కుంభకోణంలో గోపాల్‌ రాయ్‌ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో గోపాల్ రాయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు గోపాల్ రాయ్ మాత్రం అనారోగ్యం కారణంగానే రవాణా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే గోపాల్ రాయ్ మెడలో ఉన్న బుల్లెట్ను వైద్యులు తొలగించారు. దీంతో ఆయన ఏడాది పాటు పక్షవాతానికి కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలో తాను విశ్రాంతి తీసుకోనున్నట్లు గోపాల్ రాయ్ తెలిపారు.  కాగా గోపాల్ రాయ్ స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ...రవాణా శాఖ బాధత్యలను స్వీకరించనున్నారు.

మరోసారి తెరపైకి వచ్చిన ఫ్రీడమ్ 251 .. జూన్ 28 నుండి డెలివరీ

  ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్.. ఇది గుర్తుండే ఉంటుంది కదా.. రూ. 251 కే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని రింగింగ్ బెల్స్ సంస్థ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఈ హడావుడికి తగ్గట్టే విమర్శలు కూడా బాగానే వచ్చాయి. అయితే గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు మరో వార్తతో బయటకు వచ్చింది. జూన్ 28వ తేదీ నుంచి  తమ ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని  కంపెనీ డైరెక్టర్ మొహిత్ గోయల్ ప్రకటించారు. తమ ఫ్రీడం ఫోన్ల కోసం దాదాపు ఏడు కోట్లకు పైగా  రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, 30వేలమంది  కాఫ్ ఆన్ డెలివరీ కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. కాగా గత ఫిబ్రవరిలో  చేసిన సంస్థ ప్రకటనతో ముప్పై వేల మందికి పైగా ఫ్రీడమ్ 251 ఫోన్లను బుక్ చేశారు. మరో ఏడు కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో.. ఇది ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.

బాబు ముఖ్యమంత్రి అయ్యారు కానీ... లీడర్లు అవ్వాలంటే ఏం చేయాలి..

విజయవాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై, ప్రభుత్వం విమర్శల బాణాలు సంధించారు. బాబు ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. జాబు మాత్రం రావడం లేదు.. నిరుద్యోగ భృతి గురించి మాట కూడా మాట్లాడటం లేదు అని అన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లో కొంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలను కొంటే ఎన్నికల్లో గెలవలేరు.. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల గుండెల్లో చోటు సంపాదించాలి.. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలి అని వ్యాఖ్యానించారు.   అంతేకాదు లీడర్లు అవ్వాలంటే ఏం చేయాలో కూడా జగన్ సలహాలు ఇచ్చారు. రోజుకి నాలుగు గంటల చొప్పున, 5 నెలల పాటు రోజుకొక పంచాయతీ చొప్పున ప్రచారం చేస్తే... విజయం మీ సొంతమవుతుందని.. 5 నెలలు పూర్తయ్యే సరికి మీరు లీడర్లు అవుతారని ఆయన చెప్పారు.

బాయ్ ఫ్రెండ్ ముద్దు.. ప్రాణాలనే తీసింది..

  బాయ్ ఫ్రెండ్ పెట్టిన ముద్దు ఏకంగా ఆమె ప్రాణాలనే తీసింది. ఈ విచిత్రమైన ఘటన ఇంగ్లడ్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మరియమ్ లిమే అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ను కలిసింది. ఎంచక్కా ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆఖరిలో ఆమె తిరిగి వచ్చేటప్పుడు అతను ఆమెకు ఓ ముద్దు కూడా పెట్టాడు. అంతే కాసేపటికి ఊపిరి ఆడనట్టు అయిపోయి.. ఊపిరి తీసుకునేందుకు తీవ్రంగా కష్టపడి చివరికి ప్రాణాలు కోల్పోయింది మరియమ్ లిమే. ఆమెకు పోస్టు మార్టం చేసిన వైద్యులు కూడా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ముద్దు వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని తేల్చిచెప్పారు. అయితే ఆమె చనిపోవడానికి.. అతని ముద్దకు సంబంధం ఏంటనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆమెకు ఆస్తమా ఉంది. మరియమ్ ను ముద్దుపెట్టుకునే ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ పీనట్ (వేరు శనగ) బటర్ స్కాచ్ శాండ్ విచ్ తిన్నాడు. ఆస్తమాతో బాధపడేవారికి పీనట్ అలర్జీ ఉంటుంది.. అది కొద్దిగా తిన్నా ప్రాణాలకే ప్రమాదం. ఈ కారణంతోనే ఆమె చనిపోయింది.

హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సోనియా..

  తరచూ ఏదో ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కాస్త రిలీఫ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టున్నారు. అందుకే తన కూతురు ప్రియాంకగాందీతో కలిసి హాలిడే ట్రిప్ వెళ్లారు. తన కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి సిమ్లాలో ప్రత్యక్షమయ్యారు. ఇద్దరూ ఢిల్లీ నుంచి కలిసి వెళ్లి అక్కడి నుండి సిమ్లాలో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారట. అంతేకాదు హాలీడేస్ కే వెళ్లినప్పటికీ ఛారబ్రాలో తాము కొత్తగా కట్టుకుంటున్న ఇంటిని వారు ఓసారి పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చిన సదరు భవంతిని ప్రియాంకా గాంధీ తన అభిరుచికి అనుగుణంగా కట్టించుకుంటున్నారు.

నేను వస్తే ఇదంతా మారుతుంది.. ట్రంప్

  ఓర్లాండాలో జరిగిన నరమేథాన్ని అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ బాగానే ఉపయోగించుకుంటున్నట్టు ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ ఒబామాపై.. ప్రభుత్వంపై విమర్శలు కురిపించే పనిలో పడ్డారు. మన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.. ఎవర్ని దేశంలోకి రానిస్తున్నామో తెలియడం లేదు అని అన్నారు. తనిఖీల్లో అధికారులు ఫెయిలయ్యారు.. అయినప్పటికీ మన అధ్యక్షుడు బరాక్ ఒబమా మాత్రం ఇంటెలిజెన్స్ అధికారులను వెనుకేసుకొస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే ఇదంతా మారుతుంది' అని ట్రంప్ చెప్పారు. ముస్లింలను అమెరికాలోకి రానివ్వకూడదంటే నన్ను అందరూ తిట్టారు.. కానీ ఇప్పుడు నేనే కరెక్ట్ అంటున్నారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ అమెరికాని టార్గెట్ చేసింది.. రాడికల్ ఇస్లానిక్ భావాలతో ఉన్నారు.. వారిని దేశంలోకి రానివ్వకూడదు అని అన్నారు. అందుకే అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా ఓ తాత్కలిక నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కాగా అమెరికాలోని ఓర్లాండోలో మతీన్ అనే వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల కారణంగా దాదాపు 50మంది ప్రాణాలుకోల్పోయిన సంగతి తెలిసిందే.

గుత్తా పోవడంతో శని పోయింది.. కోమటిరెడ్డి

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు నేతలు టీఆర్ఎస్లోకి చేరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ నేతలపై మండిపడ్డారు. నల్గొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లిపోనుండడంతో కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని పోయింది అని ఆయ‌న అన్నారు. గుత్తా, భాస్క‌ర్ రావు పార్టీ కండువా మారుస్తోన్న సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు స‌హేతుక‌మైన‌వి కావని ఆయ‌న వ్యాఖ్యానించారు. వారు పార్టీని వీడుతున్నందుకు త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకుంటున్నార‌ని కోమటిరెడ్డి అన్నారు. పార్టీని వీడనున్న నేత‌లు రాజీనామా చేసి మ‌ళ్లీ గెలిస్తే తాను రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకుంటాన‌ని కోమ‌టిరెడ్డి ప్ర‌క‌టించారు. కాగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్, ఎమ్మెల్యే భాస్కరరావు టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏపీలో ఇకపై బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్..

ఇటీవలి కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫలాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరైంది. దీంతో ప్రభుత్వపరంగా ఏం కావాలన్నా ఆధార్ కార్డు కావాల్సిందే. ఇక నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ కార్డ్ జారీ చేసే నూతన విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి రానుంది.   భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తొలుత హర్యానాలో ఈ కార్యక్రమం ప్రారంభించగా విజయవంతమైంది. దీంతో రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో జనన ధ్రువీకరణ పత్రం తయారు చేయడం కోసం వివరాలు నమోదు చేసే సమయంలోనే తల్లి లేదా తండ్రి ఆధార్ సంఖ్య, ఫోన్ నెంబర్ వివరాలు జత చేస్తారు. ఆ వెంటనే ఆ బిడ్డకు 14 అంకెలతో కూడిన ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ వస్తుంది. దీని ఆధారంగా ఆ బిడ్డకు శాశ్వత ఆధార్ నెంబర్ మూడు రోజుల్లోనే మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత పేరు పెట్టగానే కార్డులో మార్పు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల వయసు దాటిన తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా జులై నుంచి అమలు చేయనున్నారు.

క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యం.. ఆరో రోజుకి దీక్ష

  కాపునేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష ఆరో రోజుకు చేరింది. మరోవైపు ముద్రగడ మాత్రం వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు వైద్యం చేయడానికి ముద్రగడ అంగీకరించారని, ఆయనకు వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారని అన్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో రక్తపరీక్షలు చేయాలని కలెక్టర్‌ నుంచి ఆదేశాలు అందాయని, పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.   కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని.. తుని అల్లర్ల కేసులో అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ముద్రగడ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

ఫ్రిజ్ సమస్య తీర్చమంటూ సుష్మాకి ట్వీట్... నేను ఏం చేయలేను..

సోషల్ మీడియా ఎక్కుప ప్రాచుర్యం పొందిన తరువాత రాజకీయ నాయకులు ప్రజలకు మరింత చేరువయ్యారనే చెప్పవచ్చు. ఏకంగా వాటి ద్వారానే తమ సమస్యలను నేతలకు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన సమస్యను వివరిస్తూ విదేశాంగ శాఖ, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ కు ట్వీట్ చేశాడు.  ట్విట్టర్లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. తాము ఆపదలో ఉన్నామంటూ చిన్న ట్వీట్‌ చేస్తే చాలు.. సుష్మాస్వరాజ్‌ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు. అలాంటి ఆమె సదరు ట్వీట్ చూసి ఒకింత షాక్ కు గురై.. ఆతరువాత ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు. ఇంతకీ సుష్మ షాక్ అయ్యేలా చేసిన ట్వీట్ ఏంటనుకుంటున్నారా..!   కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్‌, రామ్‌విలాస్‌ పాసవన్‌ను ట్యాగ్‌ చేస్తూ.. వెంకట్‌ అనే పేరుతో ఉన్న ట్విట్టర్‌ నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. అదేంటంటే.. ‘డియర్‌ మినిస్టర్స్‌.. ఓ కంపెనీ నాకు చెడిపోయిన రిఫ్రిజిరేటర్‌ అమ్మింది. అడిగితే.. వారు ఫ్రిజ్‌ వెనక్కి తీసుకోడానికి సిద్ధంగా లేరు సరి కదా.. బాగుచేయించుకోమని సలహా ఇచ్చారు’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు సుష్మాస్వరాజ్‌ చాలా నిజాయతీగా జవాబిచ్చారు. ‘రిఫ్రిజిరేటర్‌ విషయంలో తాను సాయం చేయలేనని.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తాను బిజీగా ఉన్నానని’ సుష్మ ట్వీట్‌ చేశారు.

వాటర్ ట్యాంకులో మృతదేహాలు..

  తిరుపతిలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. వాటర్ ట్యాంకులో మూడు మృతదేహాలు లభ్యమవ్వడంతో స్ధానికులు భయాందోళలో ఉన్నారు. వివరాల ప్రకారం.. తిరుపతి రైల్వే స్టేషన్‌ సమీపంలోని వాటర్‌ ట్యాంకు నుండి దుర్వాసన రావడంతో రైల్వే కూలీలు వాటర్‌ ట్యాంకులో చూడగా అందులో 3 మృతదేహాలు ఉన్నాయి. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసులు మూడు మృతదేహాలను బయటకు తీశారు. అందులో ఒకటి రైల్వేస్టేషన్‌లో వాటర్‌ బాటిల్స్‌ విక్రయించే అబ్దుల్లాగా కూలీలు గుర్తించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఏటీఎం కార్డు లేదా నో ప్రాబ్లమ్...

  అప్పుడప్పుడు ఏటీఎం కార్డులు మర్చిపోతుంటాం.. అది సహజం. దాని కోసం మళ్లీ వెనక్కి వెళ్లడం.. డబ్బులు డ్రా చేసుకోవడం.. చాలా టైం వేస్ట్. అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ఓ సరికొత్త వెసులుబాటు తీసుకొచ్చారు. ఆధార్‌ సంఖ్య, వేలిముద్ర ఆధారంగా పనిచేసే ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. బెంగళూరు నగరంలో తొలిసారిగా ఏర్పాటైన ఈ కేంద్రాన్ని ఆధార్‌ రూపకర్త నందన్‌ నీలెకని ప్రారంభించారు. ఇక్కడి జయనగరలోని డీసీబీ బ్యాంకు ప్రాంగణంలో సోమవారం ఈ సేవలు మొదలయ్యాయి. ఈ యంత్రం ద్వారా ఏటీఎం కార్డు పిన్‌నెంబరు అవసరం లేకుండానే ఖాతాదారులు.. ఆధార సంఖ్య, వేలిముద్రల ఆధారంగా నగదును తీసుకోవచ్చు.

మరోసారి ఉలిక్కిపడ్డ పారిస్.. ఉగ్రవాది కాల్పులు

  పారిస్ లో మరోసారి ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. మాగ్నావిల్‌ లో ఓ ఉగ్రవాది కాల్పులతో విరుచుకుపడగా.. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి, ఆయన భార్య మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఉగ్రవాదిని హ‌త‌మార్చారు. కాగా మాగ్నావిల్‌ ప్రాంతంలో దాడికి దిగింది తామేన‌ని అనంత‌రం ఇస్లామిక్ స్టేట్ ప్ర‌క‌టించింది. పారిస్‌లో భ‌ద్ర‌త‌ను పెంచారు. అక్క‌డి ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే గతంలో జరిగిన ఉగ్రదాడులకు పారిస్ ప్రజలు భయపడుతుంటే.. ఇప్పుడు ఈ కాల్పులతో ఆ ప్రాంతం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

'లింక్ డ్ ఇన్' కొనుగోలు చేసిన మైక్రో సాఫ్ట్.. చక్పం తిప్పిన సత్య నాదెళ్ల..

  ఇక నుండి 'లింక్ డ్ ఇన్' టెక్నాలజీ దిగ్గజం మైక్రో సాఫ్ట్ తో కలిసి తన ప్రయాణం సాగించనుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. లింక్ డ్ ఇన్ కొనుగోలు చేస్తున్నట్టు నిన్న అమెరికాలో ఓ ప్రకటన చేశారు. దాదాపు రూ.2,620 కోట్ల డాలర్లు (రూ.1.75 లక్షల కోట్లు)తో లింక్ డ్ ఇన్ ను సొంతం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాదు తాను మొదటి నుంచి లింక్ డ్ ఇన్ కు పెద్ద అభిమానిని అని పేర్కొన్నారు. లింక్ డ్ ఇన్ తో కలిసి కొత్త అవకాశాలను సృష్టిస్తామని కూడా సత్య ప్రకటించారు.   అయితే ఈ డీల్ కుదరడం వెనుక సత్య నాదేళ్ల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పటినుండో 'లింక్ డ్ ఇన్' ను చేజిక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ గతంలో చాలా సార్లు యత్నించిందట. కానీ ఫలితం లేదు. అయితే సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సత్య నాదెళ్ల.. ఆ సంస్థను టేకోవర్ చేసుకునేందుకు ఫిబ్రవరిలో చర్యలు ప్రారంభించారట. విడతలవారీగా జరిగిన చర్చల ఫలితంగా లింక్ డ్ ఇన్ ను మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసే పనిని నాదెళ్ల విజయవంతగా ముగించారు.