వైసీపీ నేత బైరెడ్డికి చేదు అనుభవం.. కోడి గుడ్లతో దాడి..

  వైసీపీ నేత, రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పులి వెందుల పర్యటనకు వెళ్లిన ఆయనపై ప్రజలు కోడి గుడ్లతో దాడి చేశారు. లింగాల మండలం  పార్నపల్లెలో పర్యటనకు వెళ్లిన ఆయన టీడీపీపై విమర్శలు చేశారు. ‘రాయలసీమ ప్రజల గొంతు కోసి ఆంధ్రాలో అమరావతి పేరుతో రాజధాని నిర్మిస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో టీడీపీ హామీలు గుప్పించింది. ఇప్పటివరకు రుణాల మాఫీ, జాబులు, నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలా ఎక్కడా కనిపించలేదు’’ అని వ్యాఖ్యానించారు. అంతే ఆయన వ్యాఖ్యలకు ఆగ్రహం చెందిన గ్రామ యువకులు ‘రుణాలు ఎక్కడ మాఫీ కాలేదో చెప్పండి’’ అంటూ బైరెడ్డిని నిలదీశారు. అంతేకాదు అబద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో షాక్ కు గురైన బెరెడ్డి ప్రసంగం మధ్యలోనే ఆపి అక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది.

జింబాబ్వే సిరీస్ సొంతం చేసుకున్న భారత్..

  జింబాబ్వే రాజధాని హరారే వేదికగా టీమిండియా-జింబాబ్వే వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి రెండు వన్డేలు జరగగా.. రెండింటిలో భారత్ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు కేవలం 34.4 ఓవర్లలో 126 పరుగులు చేసి అలౌట్ అయింది. ఇక అనంతరం 127 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 26.5 ఓవర్లలో 127 పరుగులు సాధించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మూడు వికెట్లు తీసిన చాహల్ నిలిచాడు. దీంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది.

అలా చేస్తే మిమ్మల్ని ఉప రాష్ట్రపతి చేయరు.. కేజ్రీవాల్

  ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌కు మధ్య తరచూ వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ కు లేఖ రాస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీకి మద్దతుగా ఉండి ప్రజావ్యతిరేక పనులు చేస్తే ఆయనేమీ మిమ్మల్ని దేశ ఉపరాష్ట్రపతిని చెయ్యరు అంటూ ఘాటుగా లేఖలో పేర్కొన్నారు. ఆప్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పనిలో కేంద్రం అడ్డుతగులుతోందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మా ప్రభుత్వం నిన్ననే వంద సీట్లతో మెడికల్‌ కళాశాల ప్రారంభించింది.. ఇక దానిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెయ్యమని మీ ఏసీబీ టీంతో చెప్పండి, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ ఇంటిపై దాడలు చేయించమని ప్రధాని మోదీతో చెప్పించండి.. అంటూ కేజ్రీవాల్‌ లేఖలో రాశారు.

సచిన్ కు రాసిన లేఖ.. 76 లక్షల నిధుల‌ు గ్రాంట్

  రాజ్య‌స‌భ స‌భ్యుడు, టీమిండియా మాజీ క్రికెట‌ర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాసిన లేఖ.. ఒక స్కూల్ దుస్థితినే మార్చేసింది. పశ్చిమబెంగాల్ పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని స్వర్ణమయి సస్మల్ శిక్షా నికేతన్ స్కూల్ పరిస్థితి అద్వానంగా మారింది. అయితే దీనిపై స్కూల్ యాజమాన్యం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం మాత్రం శూన్యం. దీంతో ఆఖరికి విద్యార్ధులు, ఉపాధ్యయులు  సచిన్ టెండూల్కర్ కి త‌మ స్కూలు దుస్థితిని వివ‌రిస్తూ ఓ లేఖ రాశారు. ఇక లేఖను అందుకున్న స‌చిన్ ఆ స్కూలుకి తన ఎంపీలాడ్‌ పథకం ద్వారా రూ. 76 లక్షల నిధుల‌ను ఇచ్చారు. దీంతో స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్కూల్లో ప్రస్తుతం 900 మంది విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు. స‌చిన్ స్పందించ‌డంతో త‌మ స్కూలు ఇక బాగుప‌డుతోంద‌ని విద్యార్థులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

పంజాబ్ డ్రగ్స్ పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు...

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లోని జ‌లంధ‌ర్ వ‌ద్ద ఈరోజు మ‌హా ధ‌ర్నా కార్య‌క్ర‌మం చేప‌ట్టగా.. ఆకార్యక్రమంలో పాల్గొన్న ఆయన డ్రగ్స్, లా అండ్ ఆర్డర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ దందాలు పేట్రేగిపోతున్నాయని.. తామకి కనుక విజయాన్ని అందించి.. అధికారం కట్టబెడితే డ్రగ్స్ లేకుండా చేస్తామని అన్నారు. పంజాబ్ లో డ్ర‌గ్స్ అత్యంత తేలికైన వ్యాపారంగా మారిపోయింద‌ని, వాటిని అరిక‌ట్ట‌డంలో పంజాబ్ లోని శిరోమణి అకాళీదళ్ ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న అన్నారు. మ‌త్తు ప‌దార్థాలు స‌ర‌ఫ‌రా చేసే వారి నుంచి పంజాబ్ ప్ర‌భుత్వం లాభం పొందుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌ధాన మంత్రి మోదీ కూడా ఈ అంశంపై నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. మరి రాహుల్ వ్యాఖ్యలపై మోడీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వంపై రచ్చ... భారత్‌ కన్నా పాకిస్థాన్‌కే ఎక్కువ అర్హత

ఎన్ఎస్జీ (న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్) లో భారత్ కు సభ్యత్వం లభిస్తుందా లేదా అన్న విషయంపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఎస్జీ కూటమిలో సభ్యత్వంపై చైనా తన నిరసనను తెలియజేసినట్టు వార్తలు వినిపించాయి. దాని వెంటే వియన్నా భేటీలో భారత దరఖాస్తుపై అసలు చర్చే జరగలేదని.. భారత దరఖాస్తుపై అసలు చర్చే జరగకుండా తానెలా అభ్యంతరం వ్యక్తం చేస్తానని చైనా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. వియన్నాలో జరిగిన భేటీలో భారత్ సహా ఏ ఒక్క దేశానికి కూటమిలో సభ్యత్వంపై చర్చ జరగలేదని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. భేటీలో భారత్ సభ్యత్వంపై చర్చ జరిగిందంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ఆ దేశం పేర్కొంది.   మరోవైపు దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. న్యూక్లియర్‌ సప్లయర్‌ గ్రూప్‌(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం సాధించేందుకు భారత్‌ కన్నా పాకిస్థాన్‌కే ఎక్కువ అర్హత ఉందని పాకిస్థాన్‌ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ పేర్కొన్నారు. ఎన్‌పీటీ(నాన్‌ ప్రొలిఫరేషన్‌ ట్రీటీ)పై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం ఇవ్వడానికి గ్రూప్‌ అంగీకరించి.. ఒకేతరహా విధానాన్ని ఏర్పాటుచేస్తే అందులో చేరేందుకు భారత్‌ కన్నా పాకిస్థాన్‌కి ఎక్కువ అర్హతలున్నాయని ఆయన అన్నారు.

"హే డొనాల్డ్ ట్రంప్.. ఐ లవ్ యూ".. వర్మ ట్వీట్

  కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్ ద్వారా ట్రంప్ పై ప్రశంసలు కురిపించాడు. అమెరికాలోని ఓర్లాండో గే నైట్ క్లబ్ పై దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ట్రంప్..  "మంచి వారికి చెడు జరిగితే, చెడ్డ వారిపై మరింత ఉక్కుపాదం మోపాలి" అని వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రామ్ గాపాల్ వర్మ గుర్తు చేస్తూ.. "హే డొనాల్డ్ ట్రంప్, ఇలా చెప్పినందుకు ఐ లవ్ యూ" అని ట్వీట్ చేశాడు. అంతేకాదు.. "అమెరికన్లకు ఇప్పుడు రెండే చాయిస్ లున్నాయి. వారిని ట్రంప్ ఆశీర్వదించాలి, లేదంటే అల్లా ఆశీర్వదించాలి" అని కూడా అన్నాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే ట్రంప్ బెటర్ ఆప్షన్ అన్నాడు

ఐదో రోజుకి ముద్రగడ దీక్ష.. క్షీణిస్తున్న ఆరోగ్యం..

  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, తుని అల్లర్ల కేసులో అరెస్ట్ చేసిన నిందితులను విడుదల చేయాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ముద్రగడ మాత్రం వైద్య పరీక్షలకు నిరాకరిస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు ముద్రగడ దీక్ష చేపట్టి ఈరోజుతో ఐదో రోజుకి చేరుకోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. వైద్య బృందాలు ఎంత ప్రయత్నించి నప్పటికీ ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నారని.. రాజమండ్రి సూపరింటెండెంట్  డా.రమేష్ కిషోర్ మీడియాకు తెలిపారు. ఆయన భార్య పద్మావతి, కోడలు సిరి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వారికి వైద్యసేవలందించేందుకు ముద్రగడ అనుమతించారు. దీంతో వారికి సెలైన్లు ఎక్కించామని కిషోర్ చెప్పారు. ముద్రగడ కుమారుడు గిరి మంచినీరు మాత్రమే తీసుకుంటున్నారని తెలిపారు.

కోదండరామ్ ను ఏమనొద్దు.. కేసీఆర్ ఆదేశం

  కేసీఆర్ పాలనను విమర్శించినందుకు గాను కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పలువురు నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కోదండరాంపై దుమ్మెత్తి పోశారు. ఈ నేపథ్యంలో కోదండరామ్ పై సానుభూతి తెలిపిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన కేసీఆర్ పార్టీ నేతలకు కొన్ని ఆదేశాలు జారీ చేశారంట. కోదండరామ్ పై విమర్శలకు దిగితే దానిని విపక్షాలు అనుకూలంగా తీసుకుంటాయని అందుకే కోదండరామ్ ను, జేఏసీ నేతలను విమర్శించవద్దని సూచించారంట. జేఏసీలో మిగిలిన నేతలంతా కోదండరామ్ వెనకే నడుస్తామని చెప్పడం, ఆయన్ను విమర్శిస్తే, ప్రభుత్వం పట్ల ప్రజల్లో అపనమ్మకం రావచ్చన్న అంచనాలు కూడా ఆయన తాజా ఆదేశాలకు కారణమని తెలుస్తోంది. మరి కేసీఆర్ మాటపై టీఆర్ఎస్ నేతలు ఎంత వరకూ నిలుస్తారో చూడాలి.

కాకి వాలిందని కారునే మార్చిన సీఎం..

  కాకి వాలిందని కారునే మార్చేశారు ఓ ముఖ్యమంత్రిగారు. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.. ?నిరంతరం వివాదాలతో వార్తల్లో నిలిచే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. అసలు సంగతేంటంటే.. పది రోజుల క్రితం సిద్దరామయ్య ఇంట్లో ఆయన కారు పార్క్‌ చేసి ఉన్నపుడు దానిపై ఓ కాకి కూర్చుంది. విచిత్రం ఏంటంటే.. ఆకాకి కూడా ఎంత ఎగరగొట్టడానికి ప్రయత్నించినా.. పది నిముషాలపాటు కారుపైనే కూర్చుంది. కాకి అలా కూర్చోవడం శని అని, వెంటనే సీఎం కారును మార్చాలంటూ జోతిష్యులు టీవీ చర్చల్లో సూచనలు కూడా చేశారు. దీంతో సిద్దరామయ్య కొత్త కారును కొన్నారు. కొత్త కారు కోసం సీఎం దాదాపు రూ.35 లక్షలు వెచ్చించారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. తనను తాను నాస్తికుడిగా, మూఢ విశ్వాసాలను నమ్మనివాడిగా చెప్పుకునే సిద్దరామయ్య ఈ పని ఎలా చేశారని కొంత మంది అంటుంటే.. ప్రజల ధనం ఇలా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి మరికొంతమంది విమర్శిస్తున్నారు.

కాంగ్రెస్ కు భారీ షాక్.. కీలక నేతలు టీఆర్ఎస్ లోకి

తెలంగాణ రాష్ట్రంలో వలసలు ఇంకా జోరుగానే సాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు నేతలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి జంప్ అవ్వగా.. ఇప్పుడు మరో నలుగురు కాంగ్రేస్ నేతలు గులాబీ కండువా కప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎంపీ గుత్తా, మాజీ ఎంపీ వివేక్ మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ లు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈసందర్బంగా గుత్తా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను వీడటం బాధాకరంగా ఉందని..తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఆకర్షించాయి.. అందుకే కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో చేరుతున్నాం.. ప్రభుత్వానికి, కేసీఆర్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అని అన్నారు.   ఇంకా మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు కొన‌సాగించ‌డానికి తెలంగాణ‌ ప్ర‌భుత్వానికి సంపూర్ణ మ‌ద్ద‌తునిస్తామ‌ని, ఈనెల 15న టీఆర్ఎస్‌లోకి చేరుతున్నామ‌ని పేర్కొన్నారు. ము గ‌తంలో తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ నివేదిక ఇచ్చామ‌ని, ఆ నివేదిక‌లో ఉన్న ఆ అంశాలు ఇప్పుడు కేసీఆర్ చేసి చూపుతున్నారని వివేక్ వ్యాఖ్యానించారు.

అమెరికాలో కాల్పుల కలకలం.. 50 మంది మృతి

  అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. బర్లాండ్ లోని గే నైట్ క్లబ్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 50 మంది మృతి చెందారు. అయితే ఈ దాడులకు పాల్పడింది ఒమర్ మతీన్ గా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం..  ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలస వచ్చి ఫ్లోరిడాలో స్థిరపడ్డ దంపతుల కుమారుడు ఒమర్ మతీన్. అయితే ఒమర్ మతీన్ ఐఎస్ వైపు ఆకర్షితుడయ్యాడు. దీంతో గతంలోనే దీనిపై అతను అతడిని ఎఫ్ బీఐ అధికారులు ప్రశ్నించిన సందర్బాలు కూడా ఉన్నాయట. అయితే నిన్న  ఓర్లాండో నైట్ క్లబ్ లో కాల్పులకు దిగింది కూడా ఒమర్ మతీనే అని.. అంతేకాదు.. "అమక్" ఐఎస్ వార్తా సంస్థ... ఓర్లాండోలో బీభత్సం సృష్టించిన దుండగుడు ఐఎస్ కు చెందిన ఫైటరేనని ప్రకటించింది.

టీమిండియా కోచ్ క్రేజ్.. రవిశాస్త్రి సహా 57 మంది దరఖాస్తులు..

టీమిండియా కోచ్ పదవి చాలా కాలంగా ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పదవికి మాత్రం చాలా క్రేజ్ ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ పదవికి బాధ్యతలు చేపడతామంటూ పెద్ద సంఖ్యలోనే మాజీ క్రికెటర్లు బీసీసీఐ ముందు క్యూ కట్టారు. రవిశాస్త్రితో పాటు మరో మాజీ దిగ్గజం సందీప్ పాటిల్ సహా మొత్తం 57 మంది క్రికెటర్లు కోచ్ పదవి చేపడతామంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 10తో దరఖాస్తులకు గడువు ముగిసిన నేపథ్యంలో కోచ్ పదవికి ఎంతమంది దరఖాస్తు చేశారన్న విషయంపై బీసీసీఐ నిన్న ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం  దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే కోచ్ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేస్తామని బీసీసీఐ ఆ ప్రకటనలో తెలిపింది.

ఇంటర్ పోల్ కు ఈడీ పూర్తి సమాచారం.. మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు..!

  విజయ మాల్యాను అరెస్ట్ చేయడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయమని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌) ఇంటర్ పోల్ ను కోరిన సంగతి తెలిసిందే. దానికి ఇంటర్ పోల్ ను కూడా మాల్యా కేసు గురించిన ఇంకా సమగ్ర సమాచారం అందించమని ఆదేశించింది. అయితే ఇప్పుడు దానిపైమొత్తం సమాచారాన్ని పొందుపరుస్తూ నిన్న ప్రత్యుత్తరమిచ్చింది. దీంతో నేడో, రేపో మాల్యాపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే మాల్యాను  ‘ప్రొక్లెమ్ డ్ అబ్ స్కాండర్’ గా ప్రకటించాలని కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టులో నేడు విచారణ జరగననున్న నేపథ్యంలో దీనిపై కూడా సానుకూల ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మొత్తానికి 17 బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలు ఎగవేసి లండన్ చెక్కేసిన లిక్కిర్ కింగ్ విజయ్ మాల్యాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టిగానే ఉచ్చు బిగుస్తుంది.

కాపుల కోసం రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

ఆర్ధికంగా వెనుకబడిన కాపుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు పథకాలను ప్రవేశపెట్టిందని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ రామానుజయ్య తెలిపారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాపు యువకుల కోసం "విద్యోన్నతి" పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు.   ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడి, సివిల్స్ వంటి ఉన్నతోదోగ్యాల కోసం సన్నద్ధమవుతున్న యువకులు లబ్దిపొందుతారని ఆయన చెప్పారు. ఈ పథకం కింద ప్రతి ఏటా 500 మందికి ఉచిత శిక్షణ కల్పించనున్నామని రామానుజయ్య తెలిపారు. అలాగే "విదేశీ విద్యా దీవెన" పేరిట మరో పథకాన్ని కూడా కాపు యువత కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు. దీని ద్వారా విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లే 500 మంది విద్యార్థులకు సాయం అందజేయనున్నామన్నారు. అయితే ఈ రెండు పథకాలలో లబ్థిపోందాలంటే కాపు కార్పోరేషన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి ఉండాలని ఆయన సూచించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆస్ట్రేలియన్ మాస్టర్స్ విజేత సైనా నెహ్వాల్

ఆస్ట్రేలియన్ మాస్టర్స్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను..భారత బ్మాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గెలుచుకుంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా ఇవాళ సిడ్నీలో జరిగిన ఫైనల్‌ పోరులో సైనా చైనాకు చెందిన సున్ యు‌ను 11-21, 21-14, 21-19 తేడాతో చిత్తుచేసింది. తొలి గేమ్‌లో కాస్త తడబడిన సైనా ఆ గేమ్‌ను కోల్పోయింది. ఆ తరువాత వెంటనే పుంజుకుని ఆధిపత్యం కొనసాగించింది. సున్ యు నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదర్కొన్న సైనా ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ట్రోఫిని సొంతం చేసుకుంది. 2014లో తొలిసారి సైనా ఈ టోర్నీని గెలిచింది.