రాజకీయంగా మద్దాలి గిరికి ఇక ఫుల్ స్టాపేనా?

గుంటూరు తూర్పు శాసనసభ నియోజక వర్గానికి వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా షేక్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, పశ్చిమ నియోజకవర్గానికి తెలుగుదేశం ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రతినిధ్యం వహిస్తున్నారు. అయితే మద్దాలి గిరి వైసీపీలో కి జంప్ అయిన విషయం తెలిసిందే. దాంతో గుంటూరు రెండు నియోజకవర్గాలు వైసీపీ చేతిలోకి వచ్చేసినట్లైంది. అలా నాలుగేళ్లు గడిచి పోయాయి. కానీ మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ రెండు నియోజకవర్గాలలో ఎవరికి ఇవ్వాలనే దానిపై జిల్లా ఇన్‌ఛార్జ్‌ విజయసాయి రెడ్డి ఇటీవల సమీక్షా సమావేశం జరిపారు. తూర్పు నియోజకవర్గం మహమ్మద్ ముస్తఫా షేక్ పనితీరు, ఐప్యాక్ నివేదిక అంతా బాగానే ఉందంటూ నివేదిక ఇవ్వడంతో  సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫాకే మళ్లీ టిక్కెట్ ఖాయమని భావిస్తున్నారు. అయితే ఈసారి తనకు బదులు తన కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు అవకాశం ఇవ్వాలని ముస్తాఫా జగన్‌ను అభ్యర్ధించారు. అందుకు... విజయసాయి రెడ్డి సమీక్షా సమావేశంలో చర్చించి   సుముఖత వ్యక్తం చేశారు. దీంతో గుంటూరు తూర్పు అభ్యర్థి ఎవరన్న విషయంలో వ్యవహారం అంతా సాఫీగానే ముగిసినట్లైంది. అయితే  గుంటూరు వెస్ట్  నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక మాత్రం వైసీపీకి తలనొప్పి  తెస్తున్నది. గుంటూరు పశ్చిమ టికెట్‌ కోసం గత ఎన్నికలలో పోటీ చేసి... మద్దాలి గిరి చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధి ఏసు రత్నంకి జగన్‌ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా నేటికీ ఆయననే పశ్చిమ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిస్తున్నారు.   కనుక మళ్ళీ తనకే ఎమ్మెల్యే టికెట్‌ వస్తుందనే నమ్మకంతో ఆయన నియోజకవర్గంలో పని చేసుకొంటున్నారు. నియోజకవర్గంలో కులాల లెక్కల ప్రకారం చూసినా మళ్ళీ తనకే టికెట్‌ గ్యారెంటీ అను ఏసురత్నం ధీమాగా ఉన్నారు.  అయితే విజయసాయి రెడ్డి  నిర్వహించిన సమీక్షా సమావేశంలో వీరిద్దరిలో ఎవరికి టికెట్‌ ఇవ్వాలనే విషయం తేల్చ లేదు. దీంతో   గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు నిలబడతారన్న విషయంలో పార్టీ వర్గాల్లోనే కాకుండా ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న మద్దాలి గిరి, ఏసురత్నంలలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసే విషయంలో  అటు గిరి ఇటు ఏసురత్నం ఇద్దరూ పట్టుదలగా ఉన్నారు.  ఒకవేళ ఏసురత్నంకే టికెట్‌ కేటాయిస్తే తెలుగుదేశం నుంచి    వైసీపీలోకి జంప్ చేసిన మద్దాలి గిరి రాజకీయ జీవితానికి చుక్కప డినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గన్నవరంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు... వైసీపీ టిక్కెట్ తో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావ్... మళ్లీ టిక్కెట్ వచ్చే పరిస్థితి లేదన్న విషయం నిర్ధారణ అయిపోవడంతో తెలుగుదేశం గూటికి చేరి ఆ పార్టీ టికెట్ ను దాదాపుగా దక్కించేసుకున్నారు.  అయితే మద్దాలి గిరి  తెలుగుదేశం నుంచి విజయం సాధించి వైసీపీ గూటికి చేరి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

స్టాలిన్-శివకుమార్ మధ్య వర్తులుగా వైఎస్ ఆస్తుల పంపకం.. షర్మిల, జగన్ మధ్య డీల్ ఒకే!

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం ఆయన కుటుంబం ఏకతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ మరణాంతరం ఆయన రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆశపడ్డారు. అయితే వైఎస్ఆర్ సీఎంగా పనిచేసింది ఆయన సొంత పార్టీ కాదు కనుక అది సాధ్యపడలేదు. అప్పటికే కాంగ్రెస్ పెద్దలు రెండు మూడుసార్లు జగన్ క్రమశిక్షణ విషయంలో వైఎస్ఆర్ కు క్లాస్ కూడా పీకిన నేపథ్యంతో జగన్ ను సీఎం చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు అంగీకరించలేదు. అదే సమయంలో జగన్ కాంగ్రెస్ లో విభేదించి అప్పటికే తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న వైఎస్ఆర్ పార్టీని హస్తగతం చేసుకొని సొంత కుంపటి పెట్టుకున్నారు. ఈ సమయంలో కూడా వైఎస్ కుటుంబం అంతా జగన్ వెంటే ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలల పాటు జైల్లో ఉండగా.. ఆ కుటుంబమే పార్టీని కాపాడింది.  ముఖ్యంగా జగన్ జైల్లో ఉండగా.. తల్లి విజయమ్మను వెంటపెట్టుకొని సోదరి షర్మిల రంగంలోకి దిగారు. జగన్ స్థానంలో పాదయాత్రను పరుగులు పెట్టించి జగనన్న వదిలిన బాణంగా పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఎక్కడా ఈ కుటుంబంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, జగన్ సీఎం అయ్యాక ఈ కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యంగా జగన్.. ఆయన భార్య భారతి ఒకవైపు.. మిగిలిన కుటుంబ సభ్యులంతా మరొక వైపు అన్నట్లుగా చీలిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక చెల్లి షర్మిలను దూరం పెట్టడం తల్లి విజయమ్మను బాధించగా.. వివేకా హత్య ఆ కుటుంబంలో మిగతా వారిని జగన్ కు దూరం చేసింది. ఈ రాజకీయ, వ్యక్తిగత సమస్యల కారణంగానే వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాలలో వివాదాలు కూడా బయటపడినట్లు తెలుస్తుంది. ఈ వివాదాల కారణంగానే షర్మిల, విజయమ్మలను జగన్ బెదిరించారని కూడా  మీడియాలో కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఫైనల్ గా వైఎస్ఆర్ ఆస్తుల పంపకం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ నాయకురాలిగా మారిపోతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని  ప్రచారం కూడా జరిగింది. పరిణామాలన్నిటినీ గమనించిన వైఎస్ జగన్ సోదరి షర్మిలతో వివాదాలను చక్కదిద్దుకొనే పనిలో భాగంగా ఆస్తి పంపకాల వివాదాలను సరిచేసుకున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. వైఎస్ కుటుంబ ఆస్తి పంపకాలు ఇద్దరు బడా నేతల సమక్షంలో జరిగినట్లు తెలుస్తుంది. దక్షణాది రాజకీయాలలో కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ కు ట్రబుల్ షూటర్ గా పేరున్న సంగతి తెలిసిందే. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం క్రెడిట్ కూడా  శివకుమార్ దే. కాగా  ఇప్పుడు ఆయనే   వైఎస్ ఆస్తి పంపకాల విషయంలో కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తున్నది. శివకుమార్ షర్మిల తరపున ఈ పంపకాలలో పాల్గొనగా.. వైఎస్ జగన్ తన తరపున తమిళనాడు సీఎం స్టాలిన్ ను పంపినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వైఎస్ ఆస్తి పంపకాల వివాదం ఈ ఇద్దరి సమక్షంలో పరిష్కారమైనట్లు, ముఖ్యంగా సీఎంగా వైఎస్ సంపాదించిన తెలంగాణ ఆస్తులలో షర్మిల వాటా తేల్చి అప్పగించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ఆస్తి పంపకాలతో షర్మిల సంతృప్తి చెందగా.. ఇకపై జగన్ వాటా ఆస్తులతో షర్మిలకు ఎలాంటి సంబంధం లేకుండా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు, షర్మిల భవిష్యత్తులో ఏపీ రాజకీయాలలోకి అడుగుపెట్టరాదన్నట్లుగా కూడా ఒప్పందం  జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల ఇకపై ఏపీ తప్ప మిగతా ఏ రాష్ట్రం నుండైనా రాజకీయాలు చేసుకోవచ్చని, అలాగే కుటుంబ, వ్యక్తిగత విషయాలపై షర్మిల ఎలాంటి విమర్శలు చేయకూడదని స్టాలిన్, శివకుమార్ సాక్షిగా డీల్ కుదిరినట్లు చెప్తున్నారు. ఈ పంపకాలు, వివాదాల తర్వాతనే షర్మిల ఏపీ రాజకీయాలలోకి వెళ్లే విషయంలో వెనక్కి తగ్గినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

రూట్ మార్చిన కేవీపీ!

మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో వైఎస్ఆర్‌పై రాసిన రైతే రాజు అయితే... పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేవీపీ  తెలంగాణలో కాంగ్రెస్  అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తనను ఆంధ్రావాడు అని అనవద్దన్నారు. తాను తెలంగాణకు చెందిన వ్యక్తినని  స్పష్టం చేశారు.  దేశవిదేశాల్లో సైతం మనవాళ్లను లోకల్‌గా గుర్తిస్తున్నారని   గుర్తు చేశారు.  వీలైతే.. తనను కూడా సగం తెలంగాణ వాడిగా అయినా గుర్తించండంటూ సభా ముఖంగా కేవీపీ విజ్జప్తి చేశారు. 1980లో హైదరాబాద్ వచ్చానని.. నాటి నుంచి తాను హైదరాబాద్‌లోనే ఓటు హక్కు వినియోగించుకొన్నానన్నారు. తాను తెలంగాణ మట్టిలోనే కలిసిపోతానని ఆయన తన ప్యామిలీ సాక్షిగా ప్రమాణం చేసి మరీ స్పష్టం చేశారు. కేవీపీ వ్యాఖ్యలు.. పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే కేవీపీ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం.. పరమార్థం.. ఏమై ఉంటాయా అనే ఓ సందేహం కూడా ఆ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది.  కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉండమే కాకుండా.. అధికార బీఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థిగా మారిందని.. అదీకాక బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదని.. దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో సాగుతోంది.  మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయిందని.. రామాయణంలో ఆంజనేయుడు సంజీవని పర్వతం తెచ్చినా.. ఆ పార్టీ ఆ రాష్ట్రంలో బతికి బట్టకట్టే పరిస్థితుల్లో   ఆ పార్టీ లేదని.. అలాంటి ఏపీలో కాంగ్రెస్ పార్టీ భాద్యతలు వైఎస్ షర్మిల చేపడితే.. హస్తం పార్టీలో చురుకుదనం, చలాకీదనం వచ్చే పరిస్థితి మాత్రం లేదని.. అటువంటి పరిస్థితుల్లో ఏపీలో వైఎస్ షర్మిల వెంట ఉండాలంటూ హస్తం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. మనస్సు ఒప్పకోకపోయినా.. ఆ ఆదేశాలకు కట్టుబడి ఆమె వెంట వెళ్లాల్సి ఉంటుందని.. అందుకే ముందుగా కేవీపీ.. పార్టీ నేతలకు ముందరి కాళ్ల బంధం వేసి.. ముందే తెలంగాణ వాడిగా గుర్తించమంటూ  మార్చి రాజకీయం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     ఓ వేళ రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏదో ఒక పోస్టింగ్ అంటే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవీపీకి కేటాయించిన లాంటి పోస్టింగ్ ఇచ్చినా... మరో అయిదేళ్లు అలా.. అలా.. గడిచిపోతాయని కేవీపీ భావిస్తున్నారంటున్నారు. ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీలో.. వైఎస్ఆర్ టీపీ వీలినం చేసేందుకు ఇప్పటికే వైయస్ షర్మిల సంసిద్దత వ్యక్తం చేశారు. ఆ క్రమంలో హస్తం పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీతో భేటీ అయి ఆమె చర్చించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో వైయస్ షర్మిల ఎంట్రీ దాదాపుగా ఖయమైపోయింది. ఇక సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత పేరుతో భారీ ర్యాలీని నిర్వహించనున్నారు.  ఈ ర్యాలీలో వైఎస్ షర్మిల పాల్గొంటారని సమాచారం. అదే రోజు.. పార్టీ వీలినం కూడా జరిగే అవకాశాలున్నాయన్న ప్రచారం సాగుతోంది.  ఓ వేళ... అదే రోజు పార్టీ వీలినం అయితే.. తెలంగాణలో వైఎస్ షర్మిలకు సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ కేవీపీకి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. ఆయనకు అంతకంటే కావాల్సింది ఏముందనే ఓ చర్చ   పోలిటికల్ సర్కిల్స్ లోవాడి వేడిగా నడుస్తోంది.

జ‌గ‌న్‌కు ఎక్కుపెట్టిన బాణమా.. జగన్ వదిలిన బాణమా!?

వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల తన వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల ఏపీకి వెళ్తారా?, తెలంగాణలోనే రాజకీయం చేస్తారా? తెలంగాణలోనే షర్మిల రాజకీయాలంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటారా? అసలు షర్మిల అన్నతో విభేదిస్తే పార్టీ పెట్టాల్సింది ఏపీలోనే కదా.. మరి తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టారు? ఇప్పుడు తెలంగాణలో ఆమెకి ప్రోత్సాహకం, ఆదరణ లేక కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నప్పుడు మళ్ళీ ఆమె తెలంగాణ రాజకీయాలలోనే ఉండడం ఎందుకు? ఏపీకి చెందిన వైఎస్ఆర్ కుమార్తె, ఏపీ సీఎంకు సొంత సోదరి తెలంగాణ రాజకీయాలలోనే ఉండాలని పట్టుబట్టడం వెనక మతలబు ఏంటి? కాంగ్రెస్ పెద్దలు ఏపీకి వెళ్ళమంటే షర్మిల ఎందుకు ఇష్టపడడం లేదు? షర్మిల ఏపీలోకి వద్దని వైసీపీ పెద్దలే బెదిరిస్తున్నారా? లేక విభేధాలున్నా అన్న మీద మమకారంతోనే షర్మిల ఏపీకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదా? గత మూడు నెలల నుండి ఇలా ఎన్నో విశ్లేషణలు సాగిపోతున్న సంగతి తెలిసిందే. షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖరారు కాగా ప్రస్తుతానికి అయితే దాదాపుగా ఆమె తెలంగాణ రాజకీయలకి పరిమితం కానున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో కర్ణాటక నుండి షర్మిలను రాజ్యసభకు పంపడం కూడా ఖాయమేనని రాజకీయ వర్గాలు బలంగా చెప్తున్నాయి. అయితే, ఆమె ఏపీకి వెళ్ళమన్నా వెళ్లకుండా.. కాంగ్రెస్ లో విలీనానికి మొగ్గు చూపడం వెనక ఇప్పుడు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ లోకి చేరి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటే వైసీపీకి భారీ నష్టం తప్పదని ఇప్పటి వరకూ విశ్లేషణలు సాగిన సంగతి తెలిసిందే. షర్మిల కాంగ్రెస్ లో ఉంటే వైసీపీలోని పాత కాంగ్రెస్ నేతలు కొందరు తిరిగి సొంత గూటికి వస్తారని, వైసీపీ క్యాడర్ లో అసంతృప్తులు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని.. తద్వారా ఏపీలో వైసీపీ ఐదు నుండి పది శాతం ఓటు బ్యాంకు నష్టపోవాల్సి వస్తుందని అంచనా విశ్లేషణలు సాగాయి. కాగా, ఇప్పుడు అసలు షర్మిల జగనన్న వదిలిన బాణంగానే కాంగ్రెస్ లోకి చేరారా.. అన్నకు మేలు చేసేందుకే షర్మిల కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారా? వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు ప్రతిపక్షాల వైపు వెళ్లకుండా తన వైపుకు తిప్పుకోనేందుకే షర్మిల కాంగ్రెస్ పల్లకి ఎత్తుకున్నారా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. అన్నతో విభేదాలున్నాయని, అందుకే షర్మిల కొత్త పార్టీ పెట్టుకున్నారని అందరూ చెప్పుకొన్నదే. తల్లి విజయమ్మ కూడా కుమారుడు జగన్ చేసిన అన్యాయాన్ని సహించలేకనే వైసీపీకి రాజీనామా చేసి షర్మిలతో ఉంటున్నారని కూడా రాజకీయ వర్గాలలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇంత జరుగుతున్నా షర్మిల ఇప్పటి వరకు అన్న జగన్ ను ఒక్క మాట అన్న దాఖలాలు లేవు. నేరుగా జగన్ ను విమర్శించిన దాఖలాలూ లేవు. దీంతో షర్మిల రాజకీయాలు కూడా అన్న జగన్ వ్యూహాలలో భాగమేనా అన్న కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ కేంద్రంలో బీజేపీతో తెరవెనక  మైత్రి సాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఏపీలో పొత్తులు ఖరారైతే బీజేపీతో వైసీపీ స్నేహం వదులుకోవాల్సిందే. మరోవైపు కేంద్రంలో అసలు బీజేపీ ప్రభుత్వం వస్తుందా లేదా అన్న అనుమనాలు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రోజురోజుకూ పుంజుకుంటున్నదని పరిశీలకులు విశ్లేషణలతో సహా చెబుతున్నారు. ఒకవేళ కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే కాంగ్రెస్ నుండి గత జ్ఞాపకాల వేధింపులు మళ్ళీ పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో చెల్లి షర్మిల కాంగ్రెస్ లో ఉంటే కేంద్రంలో ఇండియా కూటమి వచ్చినా జగన్ మోహన్ రెడ్డికి అండా దండా దొరకడం ఖాయం. ఈ వ్యూహాలతోనే షర్మిల జగనన్న వదిలిన బాణంగానే కాంగ్రెస్ పంచన చేరారా అన్న అనుమానాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరి ఇందులో ఏది వాస్తవమో? ఏది ఎవరి వ్యూహమో? ఎవరు ఎవరికి శత్రువులో? ఎవరు ఎవరి పక్షాన ఉన్నారో ముందుముందు చూడాల్సి ఉంది. ఇలా ఉండగా..  ఏపీ సీఎం జగన్.. ఆయన సోదరి షర్మిల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే గింటే అవి వారి తండ్రి వైఎస్ ఆస్తుల విషయంలోనేనని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారిరువురి మధ్యా సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ నాయకుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రంగంలోకి దిగారని చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్ తరఫున తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, షర్మిల తరఫున డీకే శివకుమార్ లు రంగంలోకి దిగి వారిరువురి మధ్యా రాజీ కుదిర్చారని రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  తెలంగాణలో ఉన్న భూములు, అలాగే నగదు పంపిణీల విషయంలో ఇరువురి మధ్యా రాజీ కుదిరిందనీ, ఈ డీల్ పట్ల షర్మిల సంతృప్తి వ్యక్తం చేశారనీ కూడా అంటున్నారు. దీంతో షర్మిల తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఆమె తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దూరంగా ఉండేలా డీల్ కుదిరిందని చెబుతున్నారు. అంటే షర్మిలకు కాంగ్రెస్ లో కీలక పదవి ఇచ్చి సముచిత స్థానం ఇస్తారనీ, అయితే ఆమె కోరుకున్నట్లుగా తెలంగాణ రాజకీయాలలో చురుకుగా ఉండే అవకాశం ఉండదనీ, అలాగే ఆమె డిమాండ్ చేస్తున్న విధంగా పాలేరులో పోటీకి అవకాశం ఉండదనీ చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఆమె పోషించే పాత్ర రెండు తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. 

పార్టీకి మొహం చాటేస్తున్న వైసీపీ క్యాడర్!

అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్త అంటే ఆ ధైర్యం.. ఆ ఠీవి.. ఆ పొగరు వేరే లెవెల్ లో ఉంటుంది. పల్లెలకి వెళ్లి చూస్తే ఓ పంచాయతీ లీడర్ కూడా తన పార్టీ అధికారంలో ఉందంటే.. తానే ఓ మంత్రిలా ఫీలైపోతుంటారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ అధికారులు నిర్వహిస్తుంటే.. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఈ కార్యకర్తలు, నేతలే అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఖర్చుకు వెనకాడకుండా పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలలోకి తీసుకెళ్తుంటారు. పార్టీకి సంబంధించి ఏ చిన్న కార్యక్రమం తలపెట్టినా దగ్గరుండి సొంత ఇంట్లో వేడుకలా నిర్వహిస్తుంటారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ లో  కూడా  రెండు మూడేళ్ళ కిందటి వరకూ ఇలాంటి పరిస్థితే కనిపించేది.  వైఎస్ఆర్ జయంతి, వర్థంతి.. సీఎం జగన్ బర్త్ డే.. పార్టీ ఆవిర్భావం దినోత్సవం.. జగన్ ప్రభుత్వానికి ఏడాది, రెండేళ్ల వరకు ఇలా అన్ని కార్యక్రమాలనూ వైసీపీ క్యాడర్ తమ సొంత ఇంటి వేడుకల్లా ఘనంగా, భారీగా నిర్వహించేది. అయితే వైసీపీ క్యాడర్ లో ఆ ఆసక్తి  తగ్గిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్ స్థాయి నేతలు బాగానే వెనకేసుకున్నారు. ఎక్కడికక్కడ ముడుపుల కొండలను అనకొండలా మింగేశారు. అక్కడక్కడా ఇసుక దందాలు, అక్రమ మట్టి తవ్వకాలతో పెట్టిన ప్రతి రూపాయికి పదింతలు వసూలు చేసి ఖజానా నింపుకున్నారు. కానీ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతల నుండి కింది స్థాయి కార్యకర్తల వరకూ  చివరికి మిగిలింది నిరాశే. ఇంకా చెప్పాలంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పార్టీ నట్టేట ముంచేసింది అని చెప్పొచ్చు. ఏదో ఆశించి వైసీపీ పెద్దలను నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నేతలు పూర్తి స్థాయిలో దివాలా తీశారు. జగన్ కాంగ్రెస్ ను విభేదించిన రోజు నుండి పదేళ్లకు పైగా పార్టీ కోసం కష్టపడి భారీగా ఖర్చు పెట్టుకున్నారు. అధికారంలోకి రావడంతో వీరి సంతోషం అంతా ఇంతా కాదు. మీకెందుకు మేమున్నామంటూ అధికారంలోకి వచ్చాక కూడా వీరితో భారీగానే ఖర్చు పెట్టించారు.  కానీ  పదేళ్లలో పెట్టినదాంట్లో పది శాతం కూడా వెనక్కి రాలేదు. అధికారంలోకి వచ్చాక పెట్టిన ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి.  ఒకవేళ పనిచేస్తే ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియక వాటి వడ్డీలు కట్టడానికి కూడా చేతి చమురు వదిలించుకోవాల్సి వచ్చింది.  ఇక గ్రామాలలో, పట్టణాలలో నేతల విషయానికి వస్తే వార్డు వాలంటీర్ కి ఉన్న మర్యాద కూడా వీరికి లేకుండా పోయింది. గ్రామాలలో, పట్టణాలలో వీరితో పని లేకుండా పోగా.. ఏదైనా అభివృద్ధి పనులు చేసుకొని అయినా కాస్త పార్టీ పరంగా లబ్ది దొరుకుతుందని భావించిన వీరందరికీ నాలుగేళ్ళలో మొండి చేయే మిగిలింది. నిధుల కొరతతో వీరికి కేటాయించేందుకు పనులు లేవు.. దారి తప్పి ఎక్కడైనా పనులు చేస్తే ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో కూడా ఎవరికీ క్లారిటీ ఉండదు. దీంతో అసలు కరుడు గట్టిన కార్యకర్తలు అనే వారు కూడా ఇప్పుడు మాదేముందిలే, మనకెందుకు వచ్చిన గొడవలే అంటూ మొహం తిప్పుకొని వెళ్లే పరిస్థితికి వచ్చేశారు.   గత ఏడాది నుండి చూస్తే వైసీపీకి ఆ పార్టీ క్యాడర్ దూరమవుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. అంతకు ముందు పార్టీ కార్యక్రమాలను భారీగా నిర్వహించిన కార్యకర్తలు అన్నదానాలు, రక్తదానాలు చేసేవారు. సంబరాలు చేసుకుంటూ ఊరువాడా దుమ్మరేపేవారు. పేపర్లు, టీవీలలో ప్రకటనలిచ్చి రీ సౌండ్ చేసేవారు. కానీ  ఈ మధ్య కాలంలో ఈ వేడుకలు చప్పగా మారిపోయాయి. కొన్ని చోట్ల తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. మరికొన్ని చోట్ల దాదాపుగా అసలు చేయడం లేదు. గతంలో పార్టీ కార్యక్రమాలకు  ఎమ్మెల్యే, మంత్రి వస్తుంటే ఆ దారి ఫ్లెక్సీల మయమై కనిపించేది. కానీ, ఇప్పుడు వాలంటీర్ల ఫ్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప నేతల ఫ్లెక్సీలు కాగడాపెట్టి వెతికినా కనిపించడం లేదు. నేతలు ఎలాగూ ఫ్లెక్సీలు పెట్టడం లేదు కనుక పార్టీ పరువు పోకుండా కనీసం వాలంటీర్లకు ఈ ఫ్లెక్సీల బాధ్యత అప్పగించినట్లు తెలుస్తున్నది. ఈ మధ్యనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని వైసీపీ భావించినా క్యాడర్ నుండి స్పందన లేక గతంలో ఉన్న వారినే కొనసాగించాలని తీర్మానం చేశారంటే వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఏ స్థాయిలో దూరమైందో అర్ధం చేసుకోవచ్చు.

ఇండియా కాదు భారత్ మాత్రమే.. పార్లమెంటులో తీర్మానానికి మోడీ సర్కార్ సమాయత్తం?!

ఇండియా.. ఈ పేరు వింటే కమలనాథులకు గుండెల్లో వణుకు పుడుతోందా? నిన్న మొన్నటి దాకా భుజాన మోసిన ఇండియా పేరంటేనే వెగటైపోయిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. గత తొమ్మదేళ్లకు పైగా కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో విర్రవీగిన కమలనాథులు ఇప్పుడు ఇండియా అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ఇండియా అని బెంగటిల్లుతున్నారు. అధికారం చేతిలో ఉంది కనుక ఇండియా పేరునే కనుమరుగు చేస్తే పోలా? ఇండియా అనే పేరును చరిత్ర గర్భంలో కలిపేసి భారత్ అన్నది మాత్రమే దేశం నామధేయంగా పార్లమెంటులో తీర్మానం చేసేస్తే పోలా అన్న భావనకు వచ్చారు. ఇందుకోసం ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోనే తీర్మానం చేసి రాజ్యాంగ సవరణ చేసేయాలని భావిస్తున్నారు. చేతిలో అధికారం ఉండటంతో ఏం తలుచుకుంటే అది చేసేయగలమన్న ధీమాతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉంది. అసలు ఇండియా పేరంటేనే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే హ్యాట్రిక్ ధీమాతో నిన్న మొన్నటి వరకూ ధీమాతో ఉన్న మోడీ సర్కార్..  ఇటీవలి కాలంలో దేశంలో రాజకీయ మూడ్ మారుతున్న పరిస్థితిని గుర్తించి కంగారు పడుతోంది. మోడీ సర్కార్ పై పెరుగుతున్న వ్యతిరేకత.. సమాంతరంగా విపక్షాల ఐక్య కూటమికి సానుకూలంగా మారుతున్న సంకేతాలతో  అధికార బీజేపీ కంగారుపడుతోంది. ఈ నేపథ్యంలోనే విపక్షాల ఐక్య కూటమి  ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇనక్లూజివ్ అలయెన్స్ అలియాస్ ఇండియా పేరు కారణంగానే ఆ సానుకూలత సాకారమైందా అన్న అనుమానం వ్యక్తం అవుతున్నది. విపక్షాల ఐక్య కూటమి ఇండియాగా అవతరించిన క్షణం నుంచీ ఆ పేరుపై బీజేపీ విషం చిమ్ముతూనే ఉంది. ఆ పేరును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అవేమీ చాలవన్నట్లుగా దేశం పేరు ఇండియా కాదు కేవలం భారత్ మాత్ర్ మాత్రమే అంటూ కొత్త రాగం అందుకుంటోంది. ఈ విషయంగా కేంద్రం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలవడకపోయినప్పటికీ.. ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు సంకేతాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  జీ 20 శిఖరాగ్ర సదస్సు ఈ నెలలో భారత్ అధ్యక్షతన జరగనున్న సంగతి విదితమే. ఆ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సుకు హాజరు కానున్న పలు దేశాల అధినేతలకు రాజ్ భవన్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ నెల 9న జరిగే ఆ విందుకోసం ముద్రించిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంతో బీజేపీ ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయి.. అడుగులు ఎటు పడుతున్నాయి అన్న విషయం తేటతెల్లమైపోయిందని పరిశీలకులు అంటున్నారు. సాధారణంగా ఆంగ్లంలో దేశం పేరును ఇండియాగా, ఇతర భాషల్లో భారత్ అని పేర్కొనడం కద్దు. ఇప్పటి వరకూ ఇదే ఒరవడి నడుస్తున్నది. కానీ రాష్టపతి ముర్ము ఆహ్వానపత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఆంగ్లంలో ముద్రించడంతో ఇండియా పేరు ఎక్కడ కనిపించకూడదన్న లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముందుగా ఆహ్వాన పత్రికలో దేశం పేరును ఆంగ్లంలో కూడా భారత్ అని ముద్రించడాన్ని గుర్తించిన కాంగ్రెస్ కేంద్రంలోని మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఏకపక్ష నిర్ణయాలతో మోడీ సర్కార్ ఫెడరల్ స్ఫూర్తిని దేబ్బతీస్తోందని విమర్శించింది. అంతే కాకుండా ఇండియా అన్న పేరు అంటేనే వణికి పోతున్న మోడీ.. ఆ పేరుకు శాశ్వతంగా సమాధి కట్టే దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని దుయ్యబట్టింది. ఇండియా పేరును శాశ్వతంగా చెరిపేసే దిశగా వేస్తున్న అడుగులలో భాగమే రాష్ట్రపతి ఆహ్వానపత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జమిలి, ఇండియా పేరు తుడిచేయడం వంటి ప్రత్యేక అజెండాతోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోందని అంటున్నారు. ఆ అజెండాను అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అనివార్యమని.. అందుకే ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి.. నయానో భయానో కలిసి వచ్చే పార్టీలను అలంబనగా చేసుకుని కాగల కార్యాన్ని సాధించేందుకు మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదంటున్నారు.  ఇండియా పేరును ఎరాడికేట్ చేసేయాలన్న బీజేపీ తపన వెనుక విపక్షాల ఐక్య కూటమిని దెబ్బతీయడంతో పాటు.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఇండియా అన్న పేరును పలుచన చేయడమన్న లక్ష్యం కూడా ఉందంటున్నారు. భారతీయ జనతా పార్టీ పేరులో ఉన్న భారత్ అన్న పదమే దేశానికి ఏకైక ప్రతీకగా నిలుస్తుందన్న భావన కూడా ఉందని చెబుతున్నారు. 

గజమాలలు.. లోకేష్ పాదయాత్రలో కొత్త ఒరవడి!

అడుగడుగునా అభిమానుల పలకరింపులు.. వారితో కుశల ప్రశ్నలు, యువతీయువకులతో భవిష్యత్తుపై చర్చ, అవ్వతాతలతో క్షేమం.. సంక్షేమంపై ప్రశ్నలు, అంకుల్ ఆంటీలతో మాట మంతి, యువతీయువకులతో సెల్పీలు, చిన్నారులకు చాకెట్లు, సభలు, సమావేశాలు వీటికి పోటెత్తుతోన్న జనం..ప్రభంజనం.. గజమాలలతో స్వాగతం.., పూల వర్షంతో సుస్వాగతం.. అక్కడక్కడా శాలువాలతో సత్కారం, మహిళా లోకం ఇస్తున్న హరతులు టోటల్‌గా నారా లోకేశ్‌ పాదయాత్ర  ప్రారంభమైన  ఉమ్మడి చిత్తూరు జిల్లా మొదలుకొని.. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాల మీదుగా ప్రస్తుత పాదయాత్ర జరుగుతోన్న పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం అడుగడుగునా కనిపిస్తున్న దృశ్యాలు.   అయితే ఈ పాదయాత్రలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంటున్నది. నారా లోకేశ్ పాదయాత్రలో వివిధ ప్రాంతాల్లో ఆయనకు గజమాలలతో పార్టీ శ్రేణులు, ప్రజలు  స్వాగతం పలుకున్నారు.  అది కూడా చాలా వెరైటీల గజమాలలు రూపొందించి.. వాటితో లోకేశ్‌కు స్వాగతం పలుకుతుండడం.. పార్టీ శ్రేణులనే కాదు.. ప్రజలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.  సాధారణంగా.. బంతిపూల గజమాలలో.. లేదా గులాబీల గజమాలలు ఉంటాయి. కానీ కూరగాయాలు, టమాటాలు, ఎండు మిర్చి, కూరగాయాల్లో కూడా ఆల్ వెరైటీలు, చేపలు, అరటి కాయలు, కొబ్బరి బొండాలు, అరిసెలు, పంపరపనస కాయలు.. అలాగే నారా లోకేశ్ యువగళం పేరుతో చిన్న సైజ్ కార్డులతో రూపొందించిన గజమాలలతో నారా లోకేశ్‌కు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలకో.. పార్టీ శ్రేణులకో వస్తున్న ఆలోచనలకు ఓ కార్యరూపం ఇస్తూ.. వివిధ రకాల వస్తువులు, పదార్ధాలతో గజమాలలు తయారు చేసి వాటితో లోకేష్ కు స్వాగతం పలుకుతున్నారు. దీంతో వివిధ రకాల గజమాలలు లోకేశ్ పాదయాత్రలో అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాదు.. ఇటువంటి... ఇలాంటి.. ఈ తరహా వెరైటీ గజమాలలు.. గతంలో రాష్ట్రంలో పాదయాత్ర చేసిన ఏ రాజకీయ నాయకుడికి వేయలేదని.. ఆ  గౌరవం  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మాత్రమే దక్కింది. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రిగా  ఆయన తీసుకొన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడమే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైంది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు, తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజా సమస్యలు తీరుస్తామంటూ ప్రజలకు నారా లోకేశ్ స్పష్టమైన భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలో ఆయన చేపట్టిన పాదయాత్ర 2 వందల రోజులు దాటగా... దాదాపు 3 వేల కిలోమీటర్ల చేరువలో ఉంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఈ పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. లక్ష్యసాధన దిశగా.. నారా లోకేశ్ అడుగులు వడి వడిగా దూసుకు వెళ్తున్నాయి.

భారీ వర్షంతో చిగురుటాకులా వణికిన విశ్వనగరం

భారీ వర్షంతో విశ్వనగరం చిగురుటాకులా వణికిపోయింది. మంగళవారం (సెప్టెంబర్ 5) తెల్లవారు జామునుంచీ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మహానగరం తడిసి ముద్దైంది. జలమయమైంది. ట్రాఫిక్ జామ్ లతో జనం నరకయాతన అనుభవించారు. పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించినా, గతంలోలాగే  ఆ సెలవు ప్రకటన ఆలస్యంగా వెలువడటంతో విద్యార్థులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది.  ఇక స్వల్ప సమయంలోనే హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలలో రికార్డు స్థాయిలో అత్యధిక వర్ష పాతం నమోదైంది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులయ్యాయి. కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. మొత్తంగా నగరం నరకాన్ని తలపించింది. ఇక గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాంతాలలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. మియాపూర్ లో  14.7 సెంటీమీటర్లు,  కూకట్పల్లిలో 14.3 సెంటీమీటర్లు, శివరాం పల్లిలో 13 సెంటీమీటర్లు, గాజుల రామారావు లో 12.5 సెంటీమీటర్లు,  బోరబండ లో 12.5 సెంటీమీటర్లు,  జీడిమెట్లలో 12.1 సెంటీమీటర్లు,  షాపూర్, మూసాపేట్,జూబ్లీ హిల్స్ లో 12 సెంటీమీటర్లు,  కుత్బుల్లాపూర్ లో 11.5 సెంటీమీటర్లు, మాదాపూర్ లో 11.4 సెంటీమీటర్లు, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ లో 11.2 సెంటీమీటర్లు, బేగంపేట్, కెపిహెచ్బి, అల్వాల్, శేలింగంపల్లిలో 10 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే  ముషీరాబాద్ లో 9.9,  గోషామహల్ లో 9.5, మలక్ పేటలో 9.4 , ఫలక్ నూమాలో 9.2, కార్వాన్ లో 8.8 , సరూర్ నగర్ లో 7.9 ఎల్బీనగర్, అంబర్పేట్ లో 6.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక మల్కాజ్ గిరి, మౌలాలిలో 4.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  భారీ వర్షం కారణంగా పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. లింగంపల్లి అండర్ పాస్ వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.   ఇక నాలాల సమీపంలో నివసిస్తున్న వారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు.  యధా ప్రకారంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దనీ జీహెచ్ఎంసీ ఒక ప్రకటన విడుదల చేసేసింది. ఇలా ఉండగా భారీ వర్షం కారణంగా ఉస్మాన్ సాగర్ లోకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేసి నీటికి కిందకి విడుదల చేశారు.  

టీటీడీ బోర్డు సభ్యుడిగా శరత్ చంద్రారెడ్డి ప్రమాణం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పి. శరత్ చంద్రారెడ్డి మంగళవారం ( సెప్టెంబర్ 5)న ప్రమాణ స్వీకారం చేశారు.  అయితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకంలో నేరచరితులకు స్థానం కల్పించడం వివాదాస్పదంగా మారింది. ఈ నియామకాలను సవాల్ చేస్తు ఏపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది.  నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. టీటీడీ బోర్డు సభ్యులుగా  ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన ఆ పిటిషన్ లో సవాల్ చేశారు. ఈ ముగ్గురిరీ టీటీడీ సభ్యులుగా తొలగించాలని పిటిషన్‌లో రోరారు.  తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని అటువంటి బోర్డులో నేర చరితులు, మద్యం వ్యాపారులకు స్థానం కల్పించడం సరికాదని  పేర్కొన్నారు.  అదలా ఉండగా కలియుగ   దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం విషయంలో ఏపీ ప్రభుత్వం లెక్కలేని తనంగా నిర్ణయాలను తీసుకుంటున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టీటీడీ చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియగానే ఆ స్థానంలో భూమన కరణాకర రెడ్డిని కూర్చోబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి.   నాస్తికుడైన భూమనకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తాయి. భక్తులపై చిరుతల దాడులు, నడక మార్గంలో వన్య ప్రాణుల సంచారం, భక్తుల భద్రతకు టీటీడీ చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తగా.. కాలినడకన వెళ్లే భక్తులకు ఊత కర్రలు ఇచ్చి క్రూర మృగాలను తరమాలనడంపై కూడా  సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ విమర్శలు అలా కొనసాగుతుండగానే జగన్ సర్కార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను నియమించింది.  జగన్ సర్కార్ ప్రకటించిన బోర్డు సభ్యులలో ఇద్దరి నియామకం తీవ్ర వివాదాస్పందంగా మారింది.   వారిలో ఒకరు డిల్లీ లిక్కర్ స్కాంలో  అరెస్టై, అప్రూవర్‌గా మారి బెయిలుపై వచ్చిన శరత్‌చంద్రారెడ్డి కాగా, మరొకరు 2001లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఉంటూ అక్రమాలకు పాల్పడి అరెస్టై ఉద్వాసనకు గురైన  యూరాలజిస్ట్ డాక్టర్ కేతన్ దేశాయ్. వీరిరువురినీ టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడంతో టీటీడీ దొరికిపోయిన దొంగలకు పునరావాస కేంద్రంగా మారిందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే కేతన్ దేశాయ్ ఇప్పటికే టీటీడీ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేయగా.. తాజాగా ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి స్వయానా సోదరుడు.

నటుడు రజినీకాంత్ కు గవర్నర్ పదవి.. బీజేపీ వ్యూహం అదేనా?

నటుడు రజనీకాంత్ ను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించనున్నారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలపై రజనీకాంత్ ఇప్పటి వరకూ స్పందించకపోయినప్పటికీ ఆయన సోదరుడు సత్యనారాయణ మాత్రం అ వార్తలు నిజమైతే చాలా సంతోషిస్తామని అన్నారు. తన సోదరుడు రజనీకాంత్ తనంత తానుగా పదవుల కోసం పాకులాడరని చెప్పిన ఆయన పదవి వస్తే మాత్రం ఆయన తిరస్కరించరని చెప్పారు. అంతా దేవుడి చేతుల్లో ఉందన్నారు. కాగా రజనీకాంత్ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేసుకుని ఆ తరువాత ఆరోగ్య కారణాలు చూపుతూ ఆవిర్భావానికి ముందే తన పార్టీని మూసేశారు. పార్టీ ఏర్పాటు కోసం తన అభిమానులతో విస్తృత స్థాయి సమావేశాలు కూడా నిర్వహించి ఆ తరువాత రాజకీయాలు తనకు సరిపడవని మిన్నకున్నారు. ఆయన పార్టీ యోచన చేసినప్పుడూ, ఆ తరువాత కూడా బీజేపీకి ఒకింత సానుకూలతనే వ్యక్తం చేశారు. దీంతోనే రజనీకాంత్ కు గవర్నర్ పదవిని కట్టబెట్టడం ద్వారా బీజేపీ తమిళనాడులో బలోపేతం కావాలన్న యోచనలో ఉందని పరిశీలకులు అంటున్నారు. దీనికి తోడు రజనీకాంత్ ఇటీవలి కాలంలో  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంలతో రజనీ భేటీ కావడంతో రజనీకాంత్ కు గువర్నర్ గిరీ వార్తలకు బలం చేకూరుతున్నది. మొత్తం మీద తమిళనాడులో పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ ప్రయత్నంలో భాగంగా విశేష అభిమాన బలం ఉన్న రజనీకాంత్ కు గవర్నర్ పదవిని ఆఫర్ చేసిందనీ, ఆయనను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తే..తమిళనాడులో ఆయన అభిమానులు బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశాలు మెండుగా ఉంటాయన్నది బీజేపీ ఉద్దేశంగా చెబుతున్నారు.

హైదరాబాద్ లో వర్ష బీభత్సం

 హైదరాబాద్ నగరంలో ఈ తెల్ల వారు జామునుంచీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బీభత్సం సృష్టిస్తోంది.  రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, నార్సింగీ, మణికొండ, గండిపేట, బండ్లగూడ భారీ వర్షం కారణంగా రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చిమ్మ చీకటిలో చుట్టు నీటితో పలు కాలనీలలో ప్రజలు నరకం చూస్తున్నారు. ఉప్పర్ పల్లి 191 ఫిల్లర్ వద్ద నీరు భారీగా చేరింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాజేంద్రనగర్ శివరాంపల్లి వద్ద రహదారి చెరువును తలపిస్తోంది. ఈ తెల్లవారు జాము (సెప్టెంబర్ 5)నుంచి ఇప్పటి వరకూ శేరిలింగంపల్లిలో 11.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మియాపూర్ వద్ద 9.78, హైదర్ నగర్9.78, మారేడ్ పల్లి, బహదూర్ పురాలలో 4.98, అల్వాల్, ముషీరాబాద్ లో 5,03 సెంటీమీటర్ల చొప్పున వర్ష పాతం నమోదైంది. హిమాయత్ సాగర్ కు పెరిగిన ఇన్ ఫ్లో కారణంగా రెండు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.  

తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు

నెల రోజుల విరామం అనంతరం తెలుగు రాష్ట్రాలలో  వర్షాల జోరు మొదలైంది. గత రెండ్రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.   భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో మంగళ, బుధవారాలలో (సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 6) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో బుధవారం (సెప్టెంబర్ 6) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమలో మంగళవారం (సెప్టెంబర్ 6) భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. రాబోయే రెండ్రోజుల్లో 11.56 సెంమీ నుంచి 20.44 సెంమీ వరకు రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఇక తెలంగాణలోనూ వర్షాల దంచి కొడుతున్నాయి. ఉపరితల అవర్తనం మంగళవారానిని అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలో మరో ఐదు రోజులు, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వానలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్,  మరో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.  జగిత్యాల, వికారాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, మెహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఇక కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడావాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో వాన బీభత్సం సృష్టించింది. నామనంక పల్లి దగ్గర వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  ఇక హైదరాబాద్ లో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచింది. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

76 మందితో టీడీపీ తొలి జాబితా రెడీ?!

ఒకవైపేమో దేశమంతా ఒకేసారి ఎన్నికలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాదిలోనే ఏపీలో కూడా ఎన్నికలు జరిగినా ఆశ్చర్యమే లేదనిపిస్తుంది. ఒకవేళ జమిలి ఎన్నికల ప్రతిపాదన అమల్లోకి రాకపోయినా ఏపీలో  ఎన్నికలకు   ఏడెనిమిది నెలలే  సమయం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ  అభ్యర్థుల పనితీరు, సర్వేల ఫలితాల మీద దృష్టి పెట్టాయి. అధికార వైసీపీని తీసుకుంటే ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం, మరోవైపు ప్రభుత్వ వర్గాలతో రహస్య సర్వే, మరో రెండు ప్రైవేట్ సంస్థలతో చేయించిన సర్వేల ఫలితాల ఆధారంగా లెక్కలేసుకుంటుంది. త్వరలో రాబోతున్న సర్వేల తుది ఫలితాల ఆధారంగా వైసీపీ తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక, ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే దూకుడుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ నేతలలో బయటపడుతున్న అసంతృప్తి, టీడీపీ నేతలు ఎక్కడకి వెళ్లినా క్లియర్ కట్ గా ప్రజలు కోరుకుంటున్న మార్పు టీడీపీకి ఎక్కడ లేని జోష్ తీసుకొస్తున్నాయి. నో డౌట్ గెలుపు మనదే అన్నట్లు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలు మెచ్చే అభ్యర్థులు, గెలుపు తెచ్చే అభ్యర్థుల కోసం ముమ్మర వేట ప్రారంభించారు. టీడీపీ కూడా రెండు మూడు రకాల సర్వేలు చేయిస్తున్నది. ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం చేపట్టిన సర్వేతో పాటు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులైన వారితో మరో సర్వే చేయించుకుంటున్నారు. ఇవి రెండూ కాకుండా మరో ప్రైవేట్ సంస్థ కూడా టీడీపీ కోసం సర్వే చేపడుతున్నది.  ఈ సర్వేల ఫలితాలన్నీటితో కలిపి ఇప్పటికే తొలి విడత జాబితా సిద్ధంకాగా త్వరలోనే ఈ తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.   టీడీపీ తొలి జాబితాలో 76 మంది పేర్లు ఉంటాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఏపీలో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి జిల్లాకు అయిదారుగురు వంతున ఈ తొలి జాబితాలో చోటు దక్కనుందని అంటున్నారు. వైసీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను పక్కన పెడితే మిగిలిన పందొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఈ జాబితాలో ఉంటాయని.. అలాగే ఎలాంటి గ్రూపులూ లేకుండా, బలంగా ఉంటూ ప్రలలతో మమేకం అవుతున్న అభ్యర్థులను కూడా ఈ జాబితాలో ప్రకటించే అవకాశం ఉందనీ  పార్టీ వర్గాల సమాచారం. అంటే ఈ తొలి జాబితాలో ఎలాంటి వివాదాస్పద వ్యవహారాలు లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు ఉండనున్నారు. కాగా, చాలా కాలంగా ఏపీలో పొత్తులు ఉంటాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కుదిరితే టీడీపీ-జనసేన-బీజేపీ.. లేకపోతే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ తొలి జాబితా విడుదల సమయానికి ఈ పొత్తుల వ్యవహారం తేలుతుందా అన్న చర్చ తెరపైకి వస్తున్నది. అయితే, పొత్తులు ఉన్నా సరే టీడీపీ అత్యధిక స్థానాలలో పోటీ చేస్తుందని చెప్పడానికే తొలి జాబితాలో టీడీపీ బిగ్ నంబర్ తో వస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తమకు పాతిక స్థానాలు ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నది. మరోవైపు జనసేన కూడా భారీగానే ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే టీడీపీ 76 మందితో తొలి జాబితా ప్రకటించి పొత్తులలో అప్పర్ హ్యాండ్ సాధించాలని   భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అదే నిజమై పొత్తులతో సంబంధం లేకుండా టీడీపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తే జనసేన, బీజేపీలపై ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది.  

2018లోనే జమిలికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!

జమిలీ ఎన్నికలు, లేదంటే కనీసం మినీ జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించి ఒకే దేశం-ఒకేసారి ఎన్నికల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న చర్చ దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అదే జరిగితే ఒకే దేశం..ఒకేసారి ఎన్నికలు అనేది చట్టరూపం దాలుస్తుంది.  నిజానికి ఒకే దేశం ఒకే ఎన్నిక కొత్తదేమీ కాదు. కేంద్రంలో బి‌జే‌పి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వినబడుతూనే ఉంది. కేంద్రంలో లోక్‌సభ ఎన్నికలు, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఎన్నికల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గడంతో పాటు సమయం కలిసొస్తుందని, అలాగే ఎన్నికల కోడ్ పేరిట ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలకు అడ్డు ఉండదంటూ కేంద్రం ఇప్పటి వరకూ చెప్పుకుంటూ వస్తున్నది. ఇప్పుడు ఏకంగా సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టింది. దీంతో సహజంగానే   తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటన్న చర్చ సాగుతున్నది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఈ ఒకే దేశం-ఒకే ఎన్నికల నినాదానికి ఒప్పుకుంటారా అన్న చర్చ  తెరమీదకు వచ్చింది.  షెడ్యూల్ ప్రకారం అయితే  ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటుకు వచ్చే ఏడాది ఎన్నికల జరగనున్నాయి. కేంద్ర ప్రతిపాదన ఒకే అయితే.. తెలంగాణ అసెంబ్లీకి, పార్లమెంటుకు కూడా ఒకేసారి ఎన్నికల జరగుతాయి. తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగిసిపోతుంది. ఆలోగా ఎన్నికలు పూర్తిచేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ లెక్కన చూస్తే ఈ ఏడాదిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అలా జరగలేదంటే అసెంబ్లీ గడువు పూర్తి అయినప్పటి నుంచి.. ఎన్నికలు జరిగేదాకా పరిపాలన గవర్నర్ చేతికి వెడుతుంది. ఒకవేళ ఈ ఏడాది ఎన్నికల జరపకుండా వచ్చే ఏడాదిలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుని ఆ మేరకు పార్లమెంటు ఆమోదం పొంది చట్టం చేస్తే..  తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలలో గవర్నర్ పాలన తప్పదు. అలా కాకుండా ఈ ఏడాదే పార్లమెంట్ రద్దు చేసి కలిసి వచ్చే రాష్ట్రాలతో మినీ జమిలీ ఎన్నికల జరిపితే తెలంగాణలో అసెంబ్లీతో పాటు పార్లెమెంట్ ఎన్నికల జరగుతాయి. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎన్నికల ఎప్పుంటాయా అన్నది తెలంగాణ రాజకీయాలలో ఆసక్తిగా మారింది.  జమిలి ఎన్నికలు, లేదా మినీ జమిలీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు అనుకూలంగా ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో మాత్రం కాస్త కలవరపాటు వ్యక్తం అవుతోంది. డిసెంబర్‌ లోపే ఎన్నికలుంటాయని బీఆర్ఎస్ ఇప్పటికే  అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. కాంగ్రెస్ కూడా హెవీ లోడింగ్ తో టికెట్ల పంపకంపై ప్రకటనకు సిద్దమవుతున్నది. వచ్చే ఏడాదికి ఎన్నికలు వాయిదా పడితే ఇప్పటి నుండి అప్పటి వరకూ ఈ నేతలను భరించడం సామాన్యమైన విషయం కాదు. ఈ క్రమంలో తెలంగాణలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. నిజానికి అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికల జరపాలని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంటే జమిలి ప్రతిపాదనకు కేసీఆర్ ఐదేళ్ల కిందటే అంటే 2018లోనే సై అనేశారు. అసెంబ్లీ, లోక్‌సభలకు ఒకేసారి ఎన్నికలు జరపడమే ఉత్తమమని 2018లోనే సీఎం కేసీఆర్ కేంద్రానికి తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటుకు విడివిడిగా ఎన్నికల జరపడం వలన ఐదేళ్లలో రెండుసార్లు ఎలక్షన్ కోడ్ రావడంతో అభివృద్ధి కుంటుపడుతుందని, ఐదేళ్లలో రెండుసార్లు ఎన్నికలతో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అధికారులు, మంత్రుల సమయం వృధా అవుతుందని, అన్నిటికీ మించి ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని.. అందుకే ఒకేసారి ఎన్నికలు ఉత్తమమని  కేసీఆర్ అప్పట్లో విస్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు, దేశమంతా ఒకేసారి ఎన్నికలపై తమ అభిప్రాయాన్ని కోరిన కేంద్రానికి కృతజ్ఞతలు కూడా తెలిపిన సీఎం కేసీఆర్..  అప్పుడు ఆ విధానాన్ని అమలు చేస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ తో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కేంద్రానికి పూర్తి మద్దతు తెలిపారు. మరి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అదీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. అలా కాకపోయినా.. కేంద్రంతో ఏ మాత్రం సత్సంబంధాలు లేని ప్రస్తుత తరుణంలో తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంటుకు ఒకే సారి ఎన్నికల వల్ల బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం వాటిల్లు తుందన్న అంచనాల నేపథ్యంలో కేసీఆర్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది తెలియాల్సి ఉంది.  అయినా మాట అనడం ఆ తరువాత మార్చడం ఈ తొమ్మిదేళ్లలో పలు మార్లు చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఏ నిర్ణయం ప్రకటించినా అది తనకూ, తన పార్టీకీ ప్రయోజనకరంగా ఉండేలా చూసుకుంటారని పరిశీలకులు అంటున్నారు. 

కేశినేని నాని బెంగటిల్లుతున్నారా? దెబ్బతీస్తున్నారా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని తన రాజకీయ భవిష్యత్ పై బెంగటిల్లుతున్నారా? తన స్థాయిని మరిచి మరీ  సొంత పార్టీ తెలుగుదేశంపై, ఆ పార్టీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించిన కేశినేని నాని అదే సమయంలో అధికార వైసీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా వారిపై పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కేశినేని నాని వైఖరితో, వ్యవహరిస్తున్న తీరుతో విసుగెత్తిన తెలుగుదేశం ఆయన పార్టీలో ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అని ఫిక్స్ పోయింది. విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని నాని సోదరుడిని నిలబెట్టి గెలిపించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లు విస్పష్ట సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో  కేశినేని నాని వైసీపీ గూటికి చేరడం ఖాయమనీ, దీంతో బెజవాడ లోక్ సభ బరి అన్నాదమ్ముల సవాల్ గా మారుతుందనీ అంతా భావించారు. అంతలోనే ఏమైందో ఏమో కేశినేని నాని బెజవాడ లోక్ సభ బరిలో తెలుగుదేశం అభ్యర్థిగా తాను రంగంలో ఉంటానని తనకు తానే ప్రకటించేసుకున్నారు.  టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటా నంటూ నేల విడిచి సాము చేసిన చందంగా ప్రకటనలు గుప్పించిన కేశినేని నాని ఇప్పుడు తెలుగుదేశం వినా గత్యంతరం లేదన్నట్లు బేలగా మాట్లాడుతున్నారు.  విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మూడోసారి పోటీ చేసి లోక్ సభలో అడుగుపెడతానని , వచ్చే ఎన్నికలలో 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ బేగ్ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  పిలుపునిచ్చేశారు. తనకు పార్లమెంట్ టిక్కెట్ ప్రకటించుకోవడమే కాకుండా… తనతో పాటు బేగ్ అనే నేతకూ  ఏకపక్షంగా తెలుగుదేశం టికెట్ ప్రకటించేయడం ద్వారా కేశినేని నాని  తన సోదరుడికి చెక్ పెట్టే వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   లోకేష్ పాదయాత్ర బెజవాడలో సాగిన సందర్భంలో పార్టీ ఎంపీ అయి ఉండి కూడా కేశినేని నాని కనీసం అటువైపు చూడలేదనీ, ఇప్పుడు ఇలా ఏకపక్షంగా తనే తెలుగుదేశం అభ్యర్థినంటూ బాహాటంగా ప్రకటనలు గుప్పించడం వెనుక తెలుగుదేశం క్యాడర్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే వ్యూహం ఉందనీ తెలుగుదేశం శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి.  ఇప్పటికే బెజవాడలో కేశినేని నానికి ప్రత్యామ్నాయంగా ఆయన సోదరుడు కేశినేని చిన్నిని తెలుగుదేశం అధినేత ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించే  తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ   నియోజకవర్గాల్లో  తెలుగుదేశం రెబల్ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పార్టీని దెబ్బతీయాలన్న వ్యూహంతో కేశినేని నాని అడగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రామా కనవేమి రా!

గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. దీంతో ఎమ్మెల్యే సీటు ఆశించిన వారు.. హామీ ఇచ్చినా.. ఎమ్మెల్యే టికెట్ దక్కని వారు.. అలాగే ప్రస్తుత సిట్టింగ్‌లకు.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కక పోవడం..వంటి కారణాలతో వారంతా ఆసంతృప్తి జీవులుగా మారి.. ఆందోళన రాగాన్ని అందుకొన్నారు. ఆ క్రమంలో వారంతా కారు పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీకి ప్రయత్నిస్తున్నా.. వారికి అపాయింట్‌మెంట్  దొరకడం లేదు.      దీంతో పలువురు  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితతో సమావేశం అవుతున్నారు. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. రానున్న ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యే సీటు బండారు లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో ఉప్పల్ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌.. కవితతో బేటీ అయ్యారు. ఈ భేటీలో వారు మా ఇద్దరిలో ఎవరికీ ఎమ్మెల్యే సీటు ఇచ్చినా.. ఓకే.. అంటూ  వినతి పత్రం  అందజేసి వచ్చారు. అయినా అటు వైపు నుంచి ఎటువంటి సమాధానం  రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్‌తో భేటీ కోసం అసంతృప్త జీవులంతా వేచి చూస్తున్నారు. కేటీఆర్ వద్ద తమ ఆవేదన విన్నవించుకొనేందుకు వీరంతా  ప్రయత్నిస్తున్నారని సమాచారం.    అయితే కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. వాస్తవానికి ఆయన శుక్రవారం( సెప్టెంబర్ 1)నే తన విదేశీ పర్యటన నుంచి తిరిగి రావాల్సి ఉంది.  ఆయనతో కలిసి వెళ్లిన ఉన్నతాధికారులంతా ఇప్పటికే హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. కానీ కేటీఆర్ మాత్రం ఇంకా రాలేదు. దీంతో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఆసంతృప్తి జీవుల్లో బీపీ అంతకంతకు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక కేటీఆర్.. సెప్టెంబర్ 3వ తేదీన హైదరాబాద్ తిరిగి వస్తారన్న ప్రచారం జరిగినా ఆ తేదీకి కూడా ఆయన హైదరాబాద్ చేరుకున్న దాఖలాలు లేవు.   మరోవైపు కేటీఆర్.. తన అమెరికా పర్యటన మరికొన్ని రోజుల పాటు పొడుగించుకొన్నారనే  ప్రచారం జోరుగా సాగుతోంది.   రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్వయంగా పలువురికి హామీలు ఇచ్చారనీ, వారంతా కేటీఆర్  కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని... అలాగే తమ బాధ చెప్పుకొనేందుకు ప్రస్తుతం అసంతృప్తి జీవులు సైతం కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారనీ,  దీంతో  తాను వెంటనే హైదరాబాద్ వస్తే ఈ తాకిడి తట్టు కష్టమన్న ఉద్దేశంతోనే కేటీఆర్ తన విదేశీ పర్యటనను పొడిగించుకున్నారన్న చర్చ  పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.   కేసీఆర్ అభ్యర్థుల ప్రకటించక ముందే కేటీఆర్ అమెరికా వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. కేటీఆర్ తన కుమారుడు హిమాన్ష్‌ను అమెరికాలో ఓ కాలేజీలో జాయిన్ చేయించేందుకు యూఎస్ వెళ్లారని.. దీంతో పాటు అధికార పర్యటన సైతం  పెట్టుకున్నారని... అందులోభాగంగా తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల అధినేతలను ఒప్పించేందుకు అధికారులను   ఆయన వెంట తీసుకు వెళ్లారనే ఓ చర్చ   నడుస్తోంది.  మరి కేటీఆర్ ఎప్పుడు హైదరాబాద్ తిరిగి వస్తారో.. ఈ అసంతృప్తి జీవులు వేదనలు.. ఆవేదనలు ఎప్పుడు వింటారో.. వారికి టికెట్.. వస్తుందో రాదో చెప్పే వారు లేక.. తమకు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో రామా కనవేమి రా అని ఎవరికి వారు ఆరున్నొక్క రాగంలో పాడుకుంటున్నారన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.  

భూములు తెగనమ్మెందుకు కుట్ర!.. అమరావతి వినాశనమే జగన్ అజెండా?!

ఏపీ రాజధాని అమరావతి.. ఈ మాట వినేందుకు కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఏపీకి మూడు రాజధానులు అనే కొత్త నినాదాన్ని అందుకున్నారు. రాజధానిగా అమరావతి ఉండేందుకు జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత నాలుగేళ్లుగా అందరూ అంటున్నది. వింటున్నది అదే.  ఏది ఏమైనా అమరావతి రాజధాని కాకూడదన్నదే వైసీపీ నినాదం, విధానం. అజెండా.  ఇందుకోసం కమ్మ రాజధాని, రాజధాని భూములలో అవినీతి, రాజధాని కట్టేందుకు నిధులు లేవు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలు చెబుతూ సీఎం జగన్ ఇప్పటి వరకూ కాలం గడిపేశారు. సీఎంగా జగన్ ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేసినా ఆ రాజధాని క్రెడిట్ అంతా అందుకు పునాది రాయి వేసిన చంద్రబాబుకే వెళ్తుంది. ముందు ముందు తరాలు అమరావతి చరిత్ర తీస్తే ముందు పేరు చంద్రబాబుదే వస్తుంది. ఆ కారణంగానే జగన్ అమరావతి అంటేనే ముఖం చిట్లిస్తున్నారు. దానిని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రగతిని, ప్రయోజనాలనూ కూడా పక్కన పెట్టేశారు.  సవాలక్ష కారణాలు చెబుతూ అమరావతిని నాశనం చేస్తున్నారు. వైసీపీ నేతలు సైతం అమరావతి రాజధానిగా ఒప్పుకొనే పరిస్థితిలో లేరు. కోర్టులు మొట్టికాయలు వేసినా.. అమరావతి రైతులు తమ బాధ ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ప్రభుత్వంలో  చలనమే లేదు. అందుకే జగన్ సర్కార్  అధికార పగ్గాలు చేపట్టీ పట్టడంతోనే అమరావతిని స్మశానంతో పోల్చారు. అంతకు ముందు రేయింబవళ్లు పెద్దఎత్తున సాగిన రాజధాని నిర్మాణ పనులను ఎక్కడిక్కడ నిలిపేశారు. గతంలో చంద్రబాబు దేశ విదేశాల కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి వారిని వెళ్లగొట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సర్కార్ ఈ నాలుగేళ్ళలో  ఒక్క  ఇటుక పెట్టిన పాపాన పోలేదు. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ మభ్య పెట్టడమే తప్ప ఒక్క రాజధానికి కూడా కనీసం భూమి పూజ చేసిన పాపాన కూడా పోలేదు.  గత ప్రభుత్వం మొదలు పెట్టిన నిర్మాణాలు ఈ నాలుగేళ్ల కాలంలో శిథిల దశకు చేరుకుంటున్నా పట్టించుకో లేదు. గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం కూడా రాజధాని అమరావతిని పట్టించుకుని ఉండే ఇప్పటికే దాదాపుగా   పనులు పూర్తయ్యేవి. లక్షల కోట్లతో మొదలైన అమరావతి.. ఇప్పటికే వేలకోట్ల సంపద సృష్టించే నగరంగా మారి ఉండేది. కానీ, కక్ష పూరిత విధానాలతో ఈ ప్రభుత్వం రాజధానిని నాశనం చేయడమే కాకుండా.. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం  ప్రభుత్వం వచ్చినా అమరావతి ముందుకు కదలకుండా ఉండేందుకు  రకరకాల కుయుక్తులు పన్నుతోంది. ఇం దులో భాగంగానే ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలిస్తాం.. ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం పన్నిన కుట్రను కోర్టులు భగ్నం చేశాయి. ప్రస్తుతం ఈ పట్టాలు, ఇళ్ల నిర్మాణం వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఆ విషయంలో నవంబర్ వరకూ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.   ఇళ్ల పట్టాలు, గృహనిర్మాణాల కుట్రను కోర్టు భగ్నం చేయడంతో జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కుట్రకు తెరతీసింది.  ఏకంగా ఆదాయం కోసం అమరావతి భూములను తెగనమ్మేందుకు నడుం బిగించింది.  తాజాగా రాజధానిలో భూముల అమ్మకం కోసం జగన్ ప్రభుత్వం రెండు (389, 390) జీవోలు జారీ చేసింది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం స్పెషల్‌ జోన్‌లో ఉన్న మంగళగిరి మండలం నవులూరు రెవెన్యూలో పది ఎకరాలు, తుళ్ళూరు మండలం పిచుకలపాలెం రెవెన్యూలో నాలుగు ఎకరాలను అమ్మకానికి పెట్టారు. స్పెషల్‌ జోన్‌లో ఉన్న రాజధాని భూములను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కోర్‌ క్యాపిటల్‌లో రెండు చోట్ల 14 ఎకరాలను ఎంపిక చేసిన ప్రభుత్వం.. నవులూరులో ఎకరా 5.94 కోట్లు, పిచ్చికలపాలెంలో 5.41 కోట్లుగా ధర నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ వేలం ప్రకటన జారీ చేసింది.  అయితే అమరావతి అభివృద్ధి కోసమే తాము భూముల వేలానికి  పెడుతున్నట్టు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇలా అమరావతి భూములను వేలానికి పెట్టడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలోనూ ఇలాగే వేలం ప్రకటన చేశారు. కానీ స్పందన లేక ఆగిపోయారు. ఇప్పుడు ఈ వేలానికి వచ్చే స్పందనకు అనుగుణంగా తదుపరి ప్రణాళికలను రచించనున్నారు. అంటే ఈ భూముల వేలానికి వచ్చే స్పందనను బట్టి మిగతా భూములను కూడా వేలం వేయనున్నట్లు ప్రభుత్వం   చెప్పకనే చెబుతోంది. మరోవైపు వేలం పేరిట ప్రకటనను ఇచ్చేసి.. కోట్లు పలికే ఆ భూములను తమ వారికి అప్పనంగా కేటాయించే ఆలోచనలో ఉన్నారా అన్న అనుమానాలు కూడా రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. మరి భేముల వేలం ప్రకటనకు వచ్చే స్పందన ఎలా ఉంటుందో? ఈ ప్రకటనపై అమరావతి రైతుల రియాక్షన్ ఏమిటో చూడాల్సి ఉంది.  అసలు రాజధాని వేలం ప్రకటనపై అమరావతి రైతులు కోర్టుకు వెల్లి స్టే తెచ్చుకునే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.