స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లోపు రంగులు తొలగించాలి

*పంచాయితీ కార్యాలయాలకు వై సి పి రంగులపై హైకోర్టు ఆదేశం *రంగుల తొలగింపునకు 3 వారాల గడువు ఇచ్చిన హై కోర్ట్  మొత్తానికి ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయం లో హైకోర్టు చెప్పినట్టే చేస్తానని మాట ఇచ్చింది.  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లోపు రంగుల తొలగింపు పూర్తి చేయాలని ఈ రోజు హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  వాస్తవానికి జనవరి 27 వ తేదీనే, జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూదని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.  పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున ఇప్పుడున్న వైసీపీ రంగులను తొలగించాలని సూచించింది. గుంటూరు జిల్లాలో పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగు వేశారంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానికి చెందినవని.. ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి పార్టీ రంగులూ ఉండకూడదని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో బాధ్యత తీసుకోవాలని, కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు జనవరి 27 వ తేదీనే ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత, రెండు వాయిదాలు తీసుకుంది. ఈ రోజు ఫైనల్ గా హై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

బీజేపీపై వైసీపీ ఎదురుదాడి వ్యూహం.. వారిని లక్ష్యంగా చేసుకుని... 

ఏపీలో కరోనా వైరస్ కిట్ల వ్యవహారం బీజేపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. కరోనా వైరస్ టెస్టింగ్ కు వాడే కొరియా ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లలో భారీగా డబ్బు చేతులు మారిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఎదురుదాడి వ్యూహాన్ని ఎంచుకున్నారు. అదీ బీజేపీలో టీడీపీ నుంచి వచ్చిన నేతలను లక్ష్యంగా చేసుకుని. దీంతో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ల వ్యవహారం కాస్తా వాస్తవాలని దాటి ఫక్తు రాజకీయ కోణంలోకి మారిపోయింది. కొరియా కిట్ల ధరల్లో వ్యత్యాసం ఉందంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలు వైసీపీకి మింగుడు పడలేదు. వీటిపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వంలోని ముఖ్య నేతలంతా రంగంలోకి దిగాల్సిన పరిస్ధితి. అయితే కొరియా కిట్లను అడ్డుపెట్టుకుని తమను టార్గెట్ చేస్తున్న బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ విషయంలో ఎలా స్పందించాలా అని ఆలోచించిన వైసీపీ చివరకు విభజించు పాలించు సిద్ధాంతాన్నే ఎంచుకుంది.  ఎలాగో బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న నేతలకూ, టీడీపీ నుంచి వచ్చిన నేతలకూ మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. వీటినే టార్గెట్ చేసుకుని ఎదురుదాడి మొదలుపెట్టాలని భావించిన వైసీపీ వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డితో విమర్శలు చేయించడం మొదలుపెట్టింది. ఏపీ బీజేపీ నేతలు ప్రశ్నిస్తే తాను సమాధానం చెబుతాను కానీ టీజేపీ నేతలు అంటే టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతలు ప్రశ్నిస్తే తాను సమాధానం చెప్పబోనంటూ విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కాషాయ పార్టీలో విభేధాలను వాడుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో విజయసాయి ట్రాప్ లో పడకూడదని భావిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ అవినీతి కేసుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ విధంగా చూసినా బీజేపీ నేతలను విజయవంతంగా దారి మళ్లించామని వైసీపీ సంబరపడుతోంది.

కరోనా వేళ స్ధానిక ఎన్నికల ప్రయత్నాలా? జగన్ సర్కారుపై జనాగ్రహం...

ఏపీలో ఓవైపు కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఒక్కరోజే 75 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 700 దాటిపోయింది. అయితే ప్రభుత్వం మాత్రం లక్ష కొరియా కిట్లు తెప్పించి, భారీగా పరీక్షలు నిర్వహించినట్లు చూపించి లాక్ డౌన్ ఎత్తేయగానే స్ధానిక ఎన్నికలకు రంగం సిద్దం చేస్తోంది. దీంతో ఇప్పుడు జగన్ సర్కారు వైఖరిపై జనంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కరోనా వైరస్ ప్రభావం ఆరంభమైన కొత్తలోనే ఒకట్రెండు కేసులు మాత్రమ నమోదయ్యాయని, దీనిపై స్ధానిక ఎన్నికలు వాయిదా వేస్తారా అంటూ ప్రశ్నించిన సీఎం జగన్... తాజాగా స్ధానిక ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నారన్న వార్తలు జనంలో ఆందోళన నింపుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో బిజీగా ఉన్నారు. పోలీసులు లాక్ డౌన్ అమల్లో బిజీగా కనిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరో రెండు వారాల్లో లాక్ డౌన్ ఎత్తేయగానే స్ధానిక ఎన్నికల వ్యూహాలకు తెరదీయాలని ప్రభుత్వం భావించడం వెనుక మర్మమేంటో కూడా అర్ధం కాని పరిస్ధితి. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా ఆగిపోయే వరకూ విద్యాసంస్దలు, మాల్స్, దేవాలయాలను సైతం తెరిచి పరిస్ధితి కనిపించడం లేదు. అలాంటిది ఎన్నికల నిర్వహణకు ఎలా సిద్దమవుతారని మేథావులు, సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ప్రజల పరిస్ధితి ఏమైనా పర్వాలేదు కానీ నాకు మాత్రం ఎన్నికల నిర్వహణే ముఖ్యమన్న సంకేతాలను సీఎం జగన్ పంపుతున్నారా అన్న వాదన వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చూసినా మే 3 తర్వాత లాక్ డౌన్ పూర్తిగా సడలించే పరిస్దితి లేదు. తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటికే మే 7వ తేదీ వరకూ లాక్ డౌన్ తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఏపీతో పాటు స్ధానిక ఎన్నికలు వాయిదా పడిన రాష్ట్రాలు సైతం ఎన్నికల గురించి ఆలోచించే పరిస్ధితే లేదు. అలాంటిది ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పరిస్ధితులను ఎలా అనుకూలంగా మార్చుకుందామా అని ఆలోచించడం దారుణమనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి ఒక వేళ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే వైరస్ వ్యాప్తి పెరిగి ఒక్కసారిగా రాష్ట్ర్రమంతా పాకితే అప్పుడు పరిస్ధితిని అదుపు చేయడం ఎవరికీ వీలు కాదు. ఓసారి పరిస్ధితి చేదాటి పోయే అప్పుడు కేంద్రం కూడా చెసేదీమీ లేదు.

అసోం రాష్ట్రాన్ని అయోమయంలో పడేసిన కరోనా

అదేదో సినిమాలో అప్పాలన్నీ కప్పలవు గాక. కప్పలన్నీ అప్పాలవుగాక అని మాంత్రికుడు మ్యాజిక్ చేసినట్టు, కరోనా కూడా అసోం రాష్ట్రం లో మ్యాజిక్ చేసింది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ లుగా తేలిన చాలా కేసుల్లో, చికిత్స మొదలెట్టిన తర్వాత ఆ లక్షణాలే కనపడకుండా పోయిన విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మిమంత బిష్వా శర్మనే స్వయంగా వెల్లడించారు.  కరోనా మహమ్మారి మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. తాము కరోనా బారిన పడ్డామన్న విషయాన్ని కూడా తెలియనివ్వకుండా నిలువెత్తు మనిషిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. టక్కుటమారి కరోనా ఊహించిన దానికంటే ప్రమాదకరమేనని వెల్లడవుతోంది. అసోంలో పాజిటివ్‌గా తేలిన 82 శాతం మందికి కరోనా లక్షణాలు కనపడలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మిమంత బిష్వా శర్మ ప్రకటించారు. 'ఈ వైరస్‌ నిశ్శబ్దంగా తన పనిచేసుకుపోతోంది. చికిత్స చేస్తోన్న సమయంలోనూ చాలా మందికి కరోనా లక్షణాలు కనపడలేదు' అని శర్మ వెల్లడించారు. అసోంలో 34 మంది కరోనా బారినపడ్డారు. 12 మంది కోలుకున్నారు. కరోనాతో బాధపడుతున్న వారి వయసు 18 నుంచి 71 కి మధ్య ఉంది. వారిలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారే అధికంగా ఉన్నారు. ఇప్పటివరకు 4,400 మందికి పరీక్షలు చేశారు. సగటున పది లక్షల మందిలో 120 మందికి పరీక్షలు చేసిన రాష్ట్రంగా అసోం నిలిచింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అసోంలో పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య చాలా అధికం. ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ కంటే అసోంలో అధికంగా టెస్టులు చేశారు. ఢిల్లీ, కేరళలో కంటే అసోంలో తక్కువగా చేశారు. అసోంలో గోవాల్పరా, గోలఘాట్, నల్బరీ, ధుబ్రి, మోరిగావ్ జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా ప్రకటించారు.

'కన్నా' ను వెనకేసుకొచ్చిన సీఎం రమేశ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమ్ముడుబోయి మాట్లాడుతున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత సీఎం రమేశ్ స్పందిస్తూ విజయసాయిరెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు.'కరోనా టెస్టింగ్ కిట్స్ కొనుగోలులో అవినీతి జరిగింది అని ప్రజలు, మీడియా మొత్తం కోడై కూస్తోంటే బాధ్యత గల బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ గారు ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి.. అంతేగానీ ఇలా అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి బురద చల్లడం సమంజసం కాదు' అని విమర్శించారు. 'విజయసాయిరెడ్డి గారు తమరు అధికారంలో ఉన్నారని... ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తించండి. మీరెన్ని విమర్శలు చేసినా ప్రజా ప్రయోజనం విషయంలో వారి పక్షాన బీజేపీ ఏపీ పోరాడుతూనే ఉంటుంది.. ప్రశ్నిస్తూనే ఉంటుంది. కన్నా గారి మీద మీ విమర్శలను ఖండిస్తున్నాను' అని ట్వీట్లు చేశారు.

గంటకు 3 చొప్పున, ఏపీ లో ఒక్క రోజులో 75 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. 24 గంటల్లో ఏపీలో అమాంతం 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 722 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించింది. వారిలో 92 మంది డిశ్చార్జ్ అయ్యారని, 20 మంది మరణించారని పేర్కొంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 610గా తెలిపింది.  ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో అత్యధికంగా 174 కేసులు నమోదు కాగా, వారిలో 168 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఐదుగురు మృతి చెందగా, ఒకరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 149 కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు చెప్పింది. గుంటూరులో 130 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, 15 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.   ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా కృష్ణా జిల్లాలో 80 మందికి కరోనా సోకగా, 60 మందికి చికిత్స అందుతోంది.. 14 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా, 65 మందికి చికిత్స అందుతోంది. ఒకరు డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  చిత్తూరులో 24 గంటల్లో 25 మందికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 53కి చేరింది. ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

నిమ్మగడ్డ కేసులో ఫైనల్ హియరింగ్ 28 న...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఈ రోజు హై కోర్టు లో గంట సేపు వాదనలు, ప్రతి వాదనలు జరిగాయి.   అడిషనల్ కౌంటర్ దాఖలు చేస్తామన్న అడ్వకేట్ జనరల్. ఈ నెల 24 లోగా అడిషనల్ కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్ట్ ఆదేశించింది.  ప్రతిగా కౌంటర్ దాఖలు చెయ్యటానికి పిటిషనర్లకు 27 వరకు గడువు ఇస్తూ,  ఫైనల్ హియరింగ్ 28 న ఉంటుందని హై కోర్ట్ స్పష్టం చేసింది.   తేదీల విషయంలో ప్రభుత్వానికి , పిటిషనర్ల కు ఎటువంటి మినహాయింపులు ఉండవని కూడా పేర్కొంది.  ఎన్నికల కమిషనర్ పదవి కాలం కుదించడంతో బాటు మాజీ న్యాయమూర్తిని నియమించటానికి చేసిన చట్ట సవరణ ఇప్పుడు ఐ ఏ ఎస్ సర్కిల్స్ మధ్య పెద్ద అంతరానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, ప్రస్తుతం, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసే అడిషనల్ పిటీషన్ ప్రాధాన్యం సంతరించుకోనుంది. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ జారీ చేసిన 617, 618 జీవోలే చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీకి, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ ద్వివేదీకి మధ్య గ్యాప్ పెరగటానికి కారణంగా తెలుస్తోంది.  కొత్తగా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్డినెన్సు చట్టబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారు. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసుకు వెళ్ల కుండా నేరుగా పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ నే జీవోలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టులో అడిషనల్ కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడిన విషయం తెలిసిందే.

చెప్పడానికి మనసుకు కష్టంగా ఉంది, అయినా చెప్తున్నా: జగన్మోహన్ రెడ్డి 

కరోనా కారణంగా, ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవలసిందిగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం.జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. " ఈ రంజాన్‌మాసంలో మీరంతా కూడా సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా, మీ అందర్నీ అభ్యర్థిస్తున్నా", అని ఆయన చెప్పారు.  ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయాలేననీ, కరోనా వైరస్‌ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామనీ చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి -ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ ఇళ్లల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు. " ఇప్పుడు రంజాన్‌ కూడా వచ్చింది. ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రంజాన్‌మాసంలో మీరంతా కూడా సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా, మీ అందర్నీ అభ్యర్థిస్తున్నా. ఈ విషయాన్ని అందరికీ చెప్పండం," టూ ముస్లిం మత పెద్దలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి అని సీఎం చెప్పారు.

విందు కోసం కింగ్ కోబ్రాతో పండ‌గ చేసుకున్నారట‌!

కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్ డౌన్ కారణంగా దేశంలో కొన్నిచోట్ల ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా నోరు చ‌ప్ప‌బ‌డిందంటూ  కొందరు వేటగాళ్లు ఆహారం కోసం అడవిలో వేటకు వెళ్లారు. కింగ్ కోబ్రాను వేటాడారు. ఈ సంఘ‌ట‌న అరుణాచల్ ప్రదేశ్ అడువుల్లో జ‌రిగింది. విందు కోసం 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను వేటగాళ్ల బృందం చంపేసింది. అనంతరం కింగ్ కోబ్రా మాంసాన్ని ముక్కలుగా చేసి విందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కోబ్రా మాంసాన్ని శుభ్రపరించేందుకు అరటి ఆకులను వేశారు. కింగ్ కోబ్రాను చంపిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. కింగ్ కోబ్రాను చంపిన వేటగాళ్ల బృందం విషపూరితమైన కింగ్ కోబ్రాను తమ భుజాలపై వేసుకుని ఫోటో స్టిల్స్ ఇచ్చారు.  వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.  తిన‌డానికి ఏమీలేక పోవ‌డంతోనే తాము ఆహారం కోసం వేటాడామ‌ని వారు చెబుతున్నారు. ఆహారం కోసం వెతుకుతూ అడవికి వెళ్లామని, అక్కడే తమకు కింగ్ కోబ్రా దొరికిందని తెలిపారు. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ఈ ముగ్గురు వేటగాళ్లపై కేసు నమోదైందని, ముగ్గురిలో ఒకరు పరారీలో ఉన్నారు. కింగ్ కోబ్రా చట్టం ప్రకారం రక్షిత సరీసృపాలు, వాటిని చంపడం బెయిల్ మంజూరు చేయలేని నేరంగా పరిగణిస్తారు. 

పోలీసులు గద్దించటంతో సత్తెనపల్లి లో గుండెపోటుతో యువకుడి మృతి

సత్తెనపల్లి పట్టణంలో పోలీస్ గట్టిగా గద్దించటం తో, యువకుడు మృతి చెందినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై పరస్పర భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సత్తెనపల్లి వెంకటపతి కాలనీ కి  చెందిన మొహమ్మద్ గౌస్ (28), ఉదయం 9 గంటలకు నిత్యావసర సరుకుల కోసం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయిన మొహమ్మద్ గౌస్ ను పోలీస్ వాహనం లో హాస్పిటల్ కు తరలించగా  చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చనిపోయిన మొహమ్మద్ గౌస్ కు పెళ్లి అయినది. ఇద్దరు చిన్న పిల్లలు సత్తెనపల్లిలో చనిపోయిన గౌస్ ముందునుండి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.బయటకు ఎందుకొచ్చావ్ అని ప్రశ్నించిన పోలీసులకు సరైన సమాధానం ఇవ్వని గౌస్. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో భయంతో కుప్పకూలిపోయిన గౌస్. ఈ ఘటనపై శాఖపరమైన విచారణ జరుపుతున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  గుంటూరు ఐజి ప్రభాకర్ రావు వెల్లడించారు.  కాగా, సత్తెనపల్లిలో మృతుడి బంధువుల ఆందోళనలు ఉద్రిక్తం. శవంతో రోడ్డుపై ఆందోళనలు.సంఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పీ, ఏఎస్పీలు. మృతుడి బంధువులతో చర్చిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు. ఘటన పై విచారణ ప్రారంభించినట్లు ఏఎస్పీ ప్రకటన. ఈ రోజు మధ్యాహ్ననికి జిల్లా ఎస్పీకి నివేదిక అందచేస్తామన్నారు. కాగా, సత్తెనపల్లిలో ఉద్రిక్తతలపై చంద్రబాబు దిగ్భ్రాంతి. ముస్లిం యువకుడు గౌస్ మృతి చెందడంపై చంద్రబాబు దిగ్భ్రాంతి. గౌస్ పై పోలీసుల దాడిని ఖండించిన చంద్రబాబు. మందుల దుకాణానికి వెళ్లిన ముస్లిం యువకుడిపై దాడి గర్హనీయం. మృతుడి కుటుంబానికి ఎక్స్  గ్రేషియా చెల్లించి ఆదుకోవాలి.  పోలీసులు, ప్రజల మధ్య పరస్పర సమన్వయం ఉండాలి. పోలీసులు దురుసుగా వ్యవహరించరాదు. అన్నివర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఈ విపత్కర సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. పరస్పర సహకారం, సమన్వయం, సోదరభావంతో వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.

చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్! 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఇలాగే పూర్తి ఆరోగ్యంతో, చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుతూ ముఖ్య‌మంత్రి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. రాజ‌కీయాల్లో అధికార ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ పూరిత వాతావ‌ర‌ణం వుంటుంది. ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకుంటూ నేత‌లు వేడిపుట్టిస్తూ వుంటారు.  అయినప్పటికీ చంద్రబాబు పుట్టిన రోజు అనగానే సీఎం జగన్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయనకు విషెస్ తెలిపారు. ప్రస్తుతం 71వ సంవత్సరంలోకి వెళ్తున్న చంద్రబాబు... తన పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులూ ఎలాంటి వేడుకలూ నిర్వహించవద్దని కోరారు. కరోనా లాక్‌డౌన్ అమల్లో ఉంది కాబట్టి... దాన్ని పాటిస్తూ... ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండటమే అసలైన అభిమానం అని చంద్రబాబు చెప్పారు.  ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రతిపక్షంలో ఉంటూ... చంద్రబాబు... ఎంతో యాక్టివ్ రోల్ పోషిస్తూ... కరోనాపై పోరాటంలో... దేశానికీ, ఏపీకీ అండగా ఉంటున్నారని ప్రశంసిస్తూ అభిమానులు ట్వీట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు అందిస్తున్నారు.

చంద్ర‌బాబు 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం...

పట్టుదల, క్రమశిక్షణ, సేవాతత్వం, విలక్షణాలతో అత్యున్నతమైన నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎదిగారు.1978లో రాజకీయాల్లో ప్రవేశించి 2020 ఫిబ్రవరి 27 నాటికి 42ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా సేవలందిస్తున్నారు. చిన్నప్పటి నుంచే చంద్ర‌బాబునాయుడికి ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువ‌. చ‌దువుకునే రోజుల్లోనే చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరారు. చిత్తూరు జిల్లాలో యువనాయకుడిగా గుర్తింపు పొంది 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఐ నుంచి పోటీ చేశారు. 20 వేల మెజార్టీతో గెలిచి విశ్వవిద్యాలయం నుంచి శాసనసభలోకి అడుగు పెట్టారు. ఏపీ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 28 ఏళ్ల వయసులో సినిమాటోగ్రఫి, పురావస్తుశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత సాంకేతిక విద్యాశాఖమంత్రిగా బాధ్యతలు చేప‌ట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబునాయుడు సారధ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చారిత్ర సృష్టించింది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కర్షక పరిషత్‌ అధ్యకక్షుడిగా సేవలందించారు. 1989లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పుడు, అసెంబ్లీని ఎన్టీఆర్‌ బహిష్కరించినప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేప‌ట్టి అప్ప‌ట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగ‌ట్టారు. తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్‌.టి.ఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 17వ వ్యక్తిగా చంద్రబాబునాయుడు చరిత్రలో నిలిచారు. 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేప‌ట్టి రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. 1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. కేంద్రంలో బి.జె.పి అధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నాడు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి దీనికి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్‌ పార్టీని ఒప్పించాడు. ఇందులో భాగంగా దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్‌ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్‌ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు చ‌క్రం తిప్పారు. రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన నారాయణన్‌ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించాడు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్‌ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చచెప్పి ఒప్పించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా చేసిన కృష్ణకాంత్‌ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు. బాబ్లి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆ నిర్మాణం ఆపాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మహారాష్ట్రలో అరెస్ట్‌ అయి 3 రోజులు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో 16-12-2010 నుండి 22-12-2010 వరకు 8 రోజుల పాటు అన్న పానీయాలు మరచి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రాణాలకు తెగించి చంద్రబాబు నిరవధిక నిరహారదీక్ష చేశారు. రాష్ట్ర విభజన నేప‌థ్యంలో ఏపి భవన్‌లో 6 రోజులు నిరవధిక దీక్ష చేసి తెలుగువారి సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కాళ్లు బొబ్బలెక్కినా ప్టించుకోకుండా 208 రోజులు 7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. 102 స్థానాలను కైవసం చేసుకుంది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ (నవ్యాంధ్ర) కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు.

సి.ఇ.ఒ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చ‌రిత్ర సృష్టించారు!

నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి మొద‌టి ముఖ్యమంత్రి గా ప‌నిచేశారు. ప‌దేళ్ళు ముఖ్య‌మంత్రిగా, 10 ఏళ్ళు ప్ర‌తిప‌క్ష నాయ‌కునిగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్‌డం ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ లు హైదరాబాదు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర‌బాబు నాయుడును కలిసారు.  అమెరికన్ మ్యాగజైన్ "టైమ్"కు చెందిన అపరిసిమ్‌ ఘోష్, " కేవలం ఐదు సంవత్సరాలలో, అతను గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని, భారత దేశ కొత్త సమాచార-సాంకేతిక కేంద్రంగా మార్చాడు." అని తెలిపాడు. ఆ పత్రిక అతనిని "సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్"గా అభివర్ణించింది.  ఇండియా టుడే నుండి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్", టైమ్స్ ఆసియా నుండి "సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందారు.  2016 జనవరి 30 న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్, ఎం.ఐ.టి స్కూల్ అపహ్ గవర్నెన్స్ తో కలసి "ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం". మే 2017లో "ట్రాన్స్‌ఫార్మాటివ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డు పొందారు. "సి.ఇ.ఒ ఆఫ్ ఆంధ్రప్రదేశ్"గా ఆయనను పిలిచేవారు. భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి చంద్ర‌బాబునాయుడు "విజన్ 2020" పేరుతో  ప్రణాళికను రూపొందించారు. దీనిని యు.ఎస్. కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీతో కలసి కొన్ని ప్రతిపాదనలు చేసాడు. 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత   దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబరు 1న ప్రారంభించారు.  ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనంద దాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు.  సాంకేతికాభివృద్ధిని అర్ధం చేసుకొని 1998లో హైటెక్‌ సిటీని ప్రారంభించి, అనతి కాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు.  ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో 1998 సెప్టెంబర్‌ 10న ‘పచ్చదనం–-పరిశుభ్రత’ కార్యక్రమంలో దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. 2000 ఏప్రిల్‌-అక్టోబరు మధ్య "నీరు-మీరు" కార్యక్రమాన్ని మొదలు పెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు.  రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం సృష్టించారు చంద్ర‌బాబునాయుడు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు చేసాడు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్థితో చేపట్టారు. ప్రధానంగా నగరాలు విదేశీ పెట్టుబడులకు ప్రత్యేకంగా "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ ఔట్సోర్సింగ్ సర్వీసెస్" వంటి ముఖ్య విభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టారు.   "బై బై బెంగళూర్, హలో హైదరాబాద్" నినాదాన్నిచ్చాడు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు సెంటర్‌ను స్థాపించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సీటెల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం.  ఇతర ఐ.టి కంపెనీలను (ఐ.బి.ఎం., డెల్, డెలోఇట్ట్‌, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఓరాకిల్) హైదరాబాదులో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్నందించాడు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సి.ఇ.ఓ లను ఒప్పించేందుకు కృషిచేసాడు. 2013-14 లో ఐటి ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి.  దీని ఫలితంగా హైదరాబాదులో IT & ITES రంగాలలో 320,000 మందికి ఉపాధి లభించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం ఏప్రిల్ 20 పురస్కరించుకుని తెలుగు ఒన్ త‌ర‌ఫున‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

ఆరోగ్య శ్రీ కార్డులను లెక్క చేయని తెలంగాణ కార్పొరేట్ ఆస్పత్రులు

ఈ పారిశుధ్య కార్మికుడి పేరు అశోక్, హైదరాబాద్ లోని మెహిదిపట్నం ఎల్ ఐ సి కాలనీ ప్రాంతం లో నిత్యం చెత్త తీసివేసి, వీధులను పరిశుభ్రంగా ఉంచుతాడు. ఇతనికో కష్టం వచ్చిపడింది. ఇతని భార్య పేరు హేమలత. ఆమెకు మెదడు లో బ్లడ్ క్లాట్ అయినా కారణంగా , ప్రస్తుతం ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. సర్జరీ కి రెండు లక్షలపైమాటే ఖర్చవుతుంది. ఆ ఆస్పత్రి వాళ్లేమో ఇతని ఆరోగ్యశ్రీ కార్డును ఖాతరు చేయటం లేదు, ఆ హాస్పిటల్ మాత్రమే కాదు, ఏ కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఆరోగ్యశ్రీ కార్డును అంగీకరించటం లేదు. ఎల్ ఐ సి కాలనీ వాసులందరూ తలో కాస్తా ఆర్ధిక సాయం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కార్డులకార్డులను అనుమతిచేలా తగిన చర్యలు తీసుకోవాలని అశోక్ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్ధించాడు. ఆ పారిశుధ్య కార్మికుడు అశోక్ ఫోన్ నెంబర్: 7671905578.

ఈరోజు నుంచి అమ‌లులోకి వ‌చ్చిన లాక్‌డౌన్ మినహాయింపులు!

సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతున్న నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌క‌టించిన సడలింపులు ఈ రోజు నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి. కరోనా ప్రభావం తీవ్రంగాలేని ప్రాంతాల్లో, ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమలయ్యేలా పలు మినహాయింపులు ఇచ్చింది. 1. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలైయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ దాని అనుబంధ రంగాలు... మార్కెటింగ్‌, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభానికి కేంద్రం అనుమతించింది. వీటితోపాటు మునిసిపల్‌ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు అనుమ‌తించారు. 2. దేశంలోని 377 జిల్లాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పనులకు వెసులుబాటు ఇచ్చారు. అన్ని వస్తువుల సరఫరాకు ఈ-కామర్స్‌ సంస్థలకు ఇటీవల మినహాయింపునిచ్చిన కేంద్రం, ఆదివారం ఈ అనుమతులను రద్దు చేసింది. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా అత్యవసర కాని వస్తువుల సరఫరా కు అనుమ‌తించ‌లేదు. అవసరమైన వాటికి మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. 3. కేంద్రం మినహాయింపులు ఇచ్చినా తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా లాంటి రాష్ట్రాలు మాత్రం లాక్‌డౌన్ ఆంక్షల్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. కార్యకలాపాలు పునః ప్రారంభించే సమయంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండరాదని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. వెసులుబాట్లు ఇచ్చిన ప్రాంతాల్లో ఇప్పుడున్న పరిస్థితిని యతాతథంగా కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నించాలని సూచించింది. అవసరమని భావిస్తే కేంద్రం విధించిన ఆంక్షలకు అదనంగా మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకోవచ్చని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే బాగా తెలుస్తాయి కాబట్టి అదనపు జాగ్రత్తలు, చర్యలు తీసుకొనే అధికారం వాటికే వదిలిపెట్టింది. 4. నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దు. 5. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదు. 6. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు మూసివేస్తారు. 7. సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం. 8. మతప్రదేశాలలో పెద్ద ఎత్తున ప్రార్థనలపై నిషేధం. 9. ట్యాక్సీ సర్వీసులకు అనుమతి లేదు. 10. హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిలేదు. హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. 11. ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలు యధాతథంగా సాగుతాయి. ఔషధ పరిశ్రమలలో ఉత్పత్తికి అనుమతులు. 12. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలు. వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలు ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలకు అనుమ‌తి. 13. బ్యాంకు కార్యకలాపాలకు అలాగే, వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవు. 14. ఉపాధి హామీ పనులు, భవన నిర్మాణ పనులు.. సమీపంలో ఉన్నవారితోనే పనులు చేపట్టాలి. ఉపాధి కూలీలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. 15.ఎరువులు, పురుగుల మందులు, విత్తనోత్పత్తి దుకాణాలు తెరుచుకుంటాయి. 16. పాల ఉత్పత్తులు, వ్యాపారాలు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగుకు అనుమ‌తి. 17. జాతీయ రహదారులు పక్కన దాబాలు, వాహన మరమ్మత్తుల దుకాణాలకు కేంద్రం అనుమతించింది. 18. ఐటీ సంస్థల్లో 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతి. 19. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం. 20. వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి. 21. ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి 22. రక్షణ, పారామిలటరీ, ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ, విపత్తు నిర్వహణ, ఎన్ఐ‌సీ, ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, యువ కేంద్రాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. 23. మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల్లోని డిప్యూటీ సెక్రెటరీలు అంతకంటే ఎక్కువస్థాయి అధికారులు 100 శాతం హాజరుకావాలి.. మిగతా అధికారులు, ఇతర సిబ్బంది 33 శాతం వరకూ ఆఫీసులకు హాజరుకావాలి. 24. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం సహా గుట్కాలు, ఖైనీ, మద్యపానం నిషేధం. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే శిక్షార్హులవుతారు. 25. పనులు ప్రారంభించే భారీ పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక సముదాయాల ప్రాంగణాల్లోనే కార్మికులకు వసతి సౌకర్యాలు కల్పించ‌డానికి అనుమ‌తి. 26. గుట్కా, పాన్‌ మసాలాలు, నమిలే పొగాకు, సిగరెట్ల అమ్మకాలను మే 3వ తేదీ వరకు పూర్తిస్థాయిలో నిషేధం అమలవుతుంది. 27. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే వారంతా మాస్క్‌లు ధరించాల్సిందే. ఇందులో మినహాయింపు లేదు. పనిచేసేందుకు అనుమతించిన ప్రాంతాల్లోనూ మాస్కులు, శానిటైజర్‌ల వినియోగించాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రాలు తప్పనిసరి. 28. ప్రజా రవాణాకు అవకాశం లేదు. కారులో ఇద్దరు, బైక్‌పై ఒక్కరే! జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు బంద్‌. 29. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్‌ సంస్థలను మూసివేయాల్సిందే. 30.దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నీ బంద్‌. రైళ్లు, మెట్రో, ప్రజారవాణాకు సంబంధించిన బస్సులు తిరగవు.

కరోనా రోగి పారిపోయాడు! ఆచూకీ చెబితే 50వేల బహుమతి!

పారిపోయిన కరోనా రోగిని పట్టుకునేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. అత‌నికి సంబంధించి బంధువుల ఇళ్ల‌న్నీ గాలిస్తున్నారు. అయినా ఆ ద‌రిద్రుడు దొర‌క‌క‌పోవ‌డంతో అత‌న్ని ప‌ట్టిచ్చిన వారికి 50 వేల రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామ‌ని డీజీపీ ప్ర‌క‌టించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన జావేద్ ఖాన్‌కు జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని రావడంతో అతన్ని జబల్‌పూర్ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యకళాశాల ఆసుపత్రిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ వారి కళ్లు గప్పి కరోనా రోగి జావేద్ ఖాన్ పారిపోయాడు. ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల నగదు బహుమతి ఇస్తామని మధ్యప్రదేశ్ డీజీపీ వివేక్ జోహ్రీ ప్రకటించారు. అంతే కాదు కరోనా రోగి పారిపోయేందుకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరుతో పాటు నలుగురు పోలీసు గార్డులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పారిపోయిన కరోనా రోగిని పట్టుకునేందుకు పోలీసులు ప్ర‌త్యేక బృంధాలుగా ఏర్ప‌డి గాలిస్తున్నారు. కరోనా రోగి పారిపోయినందున స్థానిక‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జబల్ పూర్ జిల్లా మెజిస్ట్రేట్ భరత్ యాదవ్ హెచ్చ‌రించారు.

క‌రోనా త‌గ్గ‌డంలేదు! ఉధృతంగా ఉంది! ఇళ్ల‌కే ప‌రిమితం అవ్వండి! సి.ఎం.

రోజు రోజుకు కేసులు పెరుగుతూనే వున్నాయి. కాబ‌ట్టి మ‌రింత క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లుచేస్తున్నాం. ఇప్ప‌ట్టికే 50 వేల వాహ‌నాల్ని పోలీసులు సీజ్ చేశారు. కాబ‌ట్టి ద‌య‌చేసి ఇళ్ల నుంచి ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్దు. వ్యాధి త‌గ్గ‌లేదు. వైర‌స్ నియంత్ర‌ణ‌లో లేదు. మ‌రింత ఉధృతంగా వుంది కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా వుండ‌మ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచించారు. ఏమైనా అవ‌స‌ర‌మైతే డ‌య‌ల్ 100కు ఫోన్ చేయండి. మీక‌ష్టాల్ని తొల‌గించ‌డానికి అధికారులు సిద్ధంగా వున్నారు. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం క‌లిసి క‌రోనాను ఎదుర్కొంటే ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ‌తాం. ఇప్ప‌ట్టి వర‌కూ ఈ వ్యాధికి మందు లేదు. ఆ విష‌యం గుర్తు పెట్టుకోమ‌ని ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రోగానికి మందు లేదు. వేరే మార్గం లేదు. ఉప‌శ‌మ‌న‌చ‌ర్య‌లే. వ్య‌క్తి గ‌త నియంత్ర‌ణ పాటించ‌డం. లాక్ డౌన్ ఇంత‌కు మించిన ఆయుధం ప్ర‌స్తుతం మ‌రొక‌టి లేదు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి కొన్ని దేశాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్న విష‌యాల‌ను ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.    14 అంత‌స్థుల  స్పోర్స్ట్ కాంప్లెక్స్‌ను హెల్త్ డిపార్టెమెంట్‌కు బ‌దిలీ చేస్తూ క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. నిమ్స్ కంటే ఎక్కువ స‌దుపాయాల‌తో కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కు ధీటుగా తెలంగాణా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ అండ్‌ రీస‌ర్చ్ టిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. ప్ర‌స్తుతం దీన్ని క‌రోనా ప్ర‌త్యేక ఆసుప‌త్రిగా ఉప‌యోగిస్తాం. 1500 బెడ్‌ల‌ను సిద్ధం చేశాం. రేప‌టి నుంచి గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి ఉప‌యోగంలోకి వ‌స్తుందని ముఖ్య‌మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రోజుకు 1500 మందికి టెస్ట్‌లు చేసే స‌దుపాయం వుంది.  జూన్‌ 7వ వ‌ర‌కు ఫంక్ష‌న్ల‌కు అనుమ‌తి ఇవ్వం. కాబ‌ట్టి ఫంక్ష‌న్ హాళ్ల‌ను తాత్కాలిక గౌడ‌న్లుగా వాడుకొని రైతుల‌కు ఆదుకోమ‌ని అధికారుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.  మే 7వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు త‌న వ్య‌క్తి గ‌త నిర్ణ‌యం కాదు. ప్ర‌భుత్వం స‌ర్వే ద్వారా ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన స‌మాచారంతో క్యాబినెట్‌లో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

మే 3 వరకూ ప్రార్ధన మందిరాలు తెరుచుకోవు: లవ్ అగర్వాల్

ఈ నెల 20 తర్వాత కూడా ‘కరోనా ’హాట్ స్పాట్స్ లోని కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్  తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ జోన్లలో సినిమా హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లు, ప్రార్థనా మందిరాలు మే 3 వరకూ తెరచుకోవని స్పష్టం చేశారు. ‘కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కొన్ని రకాల మినహాయింపులు ఉంటాయని అన్నారు. గడచిన 28 రోజుల్లో పుదుచ్చేరిలోని మహి, కర్ణాటకలోని కొడగులో కొత్తగా ‘కరోనా’ కేసులు నమోదు కాలేదని చెప్పారు. గడచిన పద్నాలుగు రోజుల్లో మరో 54 జిల్లాల్లో కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. ‘కరోనా’ బాధితులను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న  వైద్య బృందాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించాలని సూచించారు. ‘కరోనా’ నివారణ వ్యాక్సిన్ అభివృద్ధికి చర్యలు ముమ్మరం చేశామని, ఇందుకు సంబంధించిన అభివృద్ధి పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. నిబంధనల ప్రకారమే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని తెలిపారు. గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1334 అని, 27 మంది మృతి చెందారని చెప్పారు. దీంతో, దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 15,712కి చేరిందని అన్నారు. ఇప్పటి వరకే ‘కరోనా‘ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 2,231 మంది కాగా, 507 మంది మృతి చెందారు.

ప్రజా ఖజానాకు మేము కాపలాదారులం: ఆళ్ళ నాని 

ర్యాపిడ్‌ కిట్ల కొనుగోలు పారదర్శకం గానే జరిగిందనీ, ఎక్కడ తక్కువ రేటుకు ఇచ్చినా ఆ రేటు మాత్రమే చెల్లించేలా షరతు, ఆ మేరకే చెల్లింపులు కూడా జరుగుతాయనే డెప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్ళ నాని స్పష్టం చేశారు. అన్ని పత్రాలనూ బయటపెట్టాం, తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, అసత్య ప్రచారాలతోనే టీడీపీ రాజకీయం చేస్తోందని అయన విరుచుకు పడ్డారు. ప్రజల ఖజానాకు మేం కాపలాదారులమనీ, దోపిడీదారు కాబట్టే చంద్రబాబుకు అలాంటి  ఆలోచనలు వస్తున్నాయనీ, ప్రజలు చీత్కరించుకుంటున్నా చంద్రబాబు కుటిలరాజకీయలు మానడంలేదని ఆళ్ల నాని విమర్శించారు.   అతితక్కువ కాలంలోనే రాష్ట్రంలో 9 ల్యాబులను ఏర్పాటు చేసుకోగలిగామని,  మరో వారంరోజుల్లో మొత్తంగా 12 ల్యాబులు పనిచేస్తాయని ఆయన చెప్పారు. ట్రూనాట్‌కిట్ల ద్వారా, ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల ద్వారా కోవిడ్‌ –19 పరీక్షలు రోజుకు 17,500 వరకూ చేసే సామర్థ్యానికి మనం అతితక్కువ కాలంలో చేరుకుంటున్నాం. కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో ఇది అత్యంత కీలకమైన అంశం. మన రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బంది అకుంఠిత శ్రమ కారణంగా ప్రతి 10 లక్షల జనాభాకు టెస్టుల నిర్వహణలో దేశంలోనే రెండో స్థానానికి చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు.   ఈ పక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, జన సమూహంలో వైరస్‌ వ్యాప్తిని గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ కోసం గత కొన్ని రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు.  210 దేశాల్లో, సుమారు 24 లక్షల మంది వైరస్‌ బారినపడ్డారు. ఈ పరిస్థితుల్లో ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌కు అమాంతమైన డిమాండ్‌ నెలకొంది. వీటిని తయారుచేస్తున్న దేశాల్లో కూడా వైరస్‌ వ్యాప్తి ఉండడం వల్ల వీటిని తెప్పించడం అత్యంత ప్రయాసతో కూడిన వ్యవహారంగా మారింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా వైద్య ఆరోగ్యశాఖ కొరియా కంపెనీ నుంచి లక్ష కిట్స్‌ను త్వరగా తెప్పించుకోగలిగింది. అన్ని రాష్ట్రాలకంటే ముందుగా ఇవి మనకు చేరాయి. అంతేకాక జిల్లాలకు ఈ కిట్స్‌ పంపిణీకూడా ప్రారంభం అయ్యింది. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ... ప్రభుత్వం, అధికారులు చేసిన విశేష ప్రయత్నాలు వల్ల మన రాష్ట్రానికి ఈ కిట్స్‌ చేరాయన్నారు.  ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌ ఎవరి నుంచి కొనుగోలు చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్‌) వివిధ కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ఐసీఎంఆర్‌ అనుమతి పొందిన కంపెనీలు తమతమ కొటేషన్లను సంబంధిత డీలర్ల ద్వారా ఆయా రాష్ట్రాలకు సమర్పించినట్టే మన రాష్ట్రానికి కూడా సమర్పించాయి. ఐసీఎంఆర్‌ కూడా అవే కంపెనీలనుంచి కొనుగోలు ప్రారంభించిందని చెప్పారు. కొటేషన్లు సమర్పించిన తర్వాత ఎంత త్వరగా ఇవ్వగలరు? ధర ఎంత అని రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు సార్లు పరిశీలించుకుని కొరియన్‌ కంపెనీ ఎస్‌.డి.బయో సెన్సర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి కొనగోలును ఖరారు చేశామన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం 7 వ తారీఖున (జీఎస్టీకాకుండా) ఒక్కో కిట్‌కు రూ. 730ల చొప్పున 2 లక్షల కిట్లకు పర్చేజ్‌ ఆర్డర్‌ జారీచేయడం అయ్యింది. ప్రస్తుతం కోవిడ్‌–19 నివారణా చర్యలకోసం ఉపయోగిస్తున్న వైద్య పరికరాలు, అలాగే వ్యాధి నిర్ధారణ, వ్యాప్తిని తెలుసుకునేందుకు వినియోగిస్తున్న టెస్టు కిట్స్‌కు సంబంధించి మార్కెట్‌ ధరల్లో నిరంతరం హెచ్చు తగ్గులున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పర్చేజ్‌ ఆర్డర్‌లో ఒక షరతును క్లాజు రూపంలో పెట్టిన విషయాన్నీ కూడా డెప్యూటీ సి ఎం గుర్తు చేశారు. ఈ క్లాజు ప్రకారం... సదరు కంపెనీ ఎక్కడైనా తక్కువ ధరకు అమ్మినా, లేదా తన అనుబంధ సంస్థలద్వారా ఇంతకంటే తక్కువ ధరకు విక్రయించినా, ఆ డిఫరెన్స్‌ మొత్తాన్ని తుది బిల్లునుంచి మినహాయించుకుంటామని స్పష్టంగా పేర్కొన్నామని వివరించారు.