హ్యాట్సాఫ్ విజయ్ కాంత్.. మీ స్ఫూర్తి మా తెలుగు హీరోలకు మేలుకొలుపు కావాలి 

* కరోనా మృతుల ఖననానికి తన కాలేజీ భూములను వాడుకోమన్న తమిళ సూపర్ స్టార్  * విజయకాంత్ కు అభినందనలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్  మానవత్వం పరిమళించిన మంచి మనసుకు స్వాగతం అంటూ ఇప్పుడు అందరూ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ ను వేనోళ్ళ కీర్తిస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్‌ సోకింది. పరిస్థితి విషమించి ఆదివారం ఆయన మృతి చెందాడు. వైద్యుడి మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లగా.. స్థానికులు వ్య‌తిరేకించారు. ఈ ఉదంతం చ‌ర్చ‌నీయాంశంగా మారటంతో, విజయ్‌కాంత్ స్పందించారు. క‌రోనా మృతుల్ని ఖ‌న‌నం చేయ‌డానికి త‌న కాలేజీలో స్థ‌లం ఇస్తాన‌ని ముందుకొచ్చారు. విజ‌య్‌కాంత్‌కు చెన్నై శివార‌ల్లో ఆండాళ్‌ అళగర్ పేరుతో ఇంజినీరింగ్‌ కళాశాల ఉంది. దీని ప్రాంగణంలోని కొంత భాగాన్ని క‌రోనా మృతుల ఖ‌న‌నానికి ఇస్తాన‌ని విజ‌య్ కాంత్ ప్ర‌క‌టించారు. కరొనతో  మృతి చెందినవారిని ఖననం చేయటంతో వైరస్‌ వ్యాపించెందదని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయ‌న కోరారు. విజ‌య్ కాంత్ ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఆయ‌న పెద్ద మ‌న‌సును జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా గుర్తించాడు. ‘కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేయడానికి స్థానికులు నిరాకరించారు. కానీ, డీఎండీకే నాయకుడు, సూపర్‌స్టార్ విజయ్‌కాంత్‌ తన కళాశాల భూమిలో కొంత భాగాన్ని కరోనా బాధితుల కోసం ఇవ్వడం నిజంగా అద్భుతమైన విషయం. ఆయనది ఎంతో గొప్ప వ్యక్తిత్వం’అని ట్విట్ట‌ర్లో ప‌వ‌న్ పేర్కొన్నారు. 

వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఫైర్!

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఫ్యాక్షన్‌ లీడర్‌ ఏపీ సీఎం కావడం ప్రజల దురదృష్టమని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైసీపీ మంత్రులు, నేతల భాషను మార్చుకోవాలని, వారి తీరుని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. వైసీపీ నేతల తీరుతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల వల్లే కరోనా సామాజిక వ్యాప్తి చెందుతుందని చెప్పారు. కేంద్ర సాయాన్ని కూడా తమ సాయంపై చెప్పుకుంటున్నారని కన్నా మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయిందని, వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఏపి బీజేపీ ఘాటుగా విమ‌ర్శ‌లు చేసింది. 20 కోట్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా అమ్ముడుపోయారాని విజయసాయిరెడ్డి ఆరోపించడాన్ని బిజెపి త‌ప్పుప‌ట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కు క్షమాపణ చెప్పకపోతే రానున్న కాలం లో తీవ్ర పరిణామాలు తప్పవని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఏ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు కరోనా ను అడ్డుపెట్టుకుని కలెక్షన్లు చేస్తున్నారన్నారు.

ఏపీ కోవిడ్ ఆస్పత్రులలో వంద మంది స్పెషలిస్టులు నియామకం

ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్ ఆసుపత్రులకు 100 మంది స్పెషలిస్ట్ డాక్టర్ల ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ మెడిసిన్, అనస్తీషియా , పల్మనాలజిస్ట్ స్పెషలిస్టులను నియమించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 48 గంటల్లో విధుల్లో జాయిన్ కావాలనీ, వారివారి ఇమెయిల్స్ కు అప్పాయింట్ ఆర్డర్లు పంపించామని ప్రభుత్వం ప్రకటించింది. డిఎంఇ ద్వారా ఇచ్చిన ప్రకటనకు స్పందించి దరఖాస్తులు పంపించిన వాటినుంచి ఎంపిక చేశామనీ, ఎంపికైన వారికి భవిష్యత్తు నియామకాల్లో 15 శాతం వెయిటేజ్ ఇస్తామనీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.

కన్నా కు అర్దరాత్రి గుండెపోటు వస్తుంది. తెల్లారేసరికి పోతుంది!

* బీ జె పీ రాష్ట్ర అధ్యక్షుడిపై అంబటి రాంబాబు ఫైర్  * కాణిపాకం వినాయకుడి ముందు ఐదు ప్రమాణాలు చేస్తారా, అంటూ సవాల్  పాలక వై ఎస్ ఆర్ సి పి ఫైనల్ గా పార్టీ ఎంఎల్ ఏ అంబటి రాంబాబు ను తెర మీదకు తీసుకు వచ్చేసింది. కన్నా, సుజనా చౌదరి ల దాడి కి ప్రతి దాడి ప్రతి దాడి మొదలెట్టింది. ప్రతిపక్షనేత చంద్రబాబు రెండురోజులకొకసారి లేదా రోజూ యాప్ ద్వారా వచ్చి సూక్తిముక్తావళి చెబుతున్నారంటూ- చంద్రబాబు ను తన స్టైల్ లో రఫ్ ఆడేశారు. " టెస్టింగ్ కిట్స్ సౌత్ కొరియానుంచి తెప్పిస్తే దానిలో కమీషన్ కొట్టేశామంట...కక్కుర్తిపడి కోట్ల రూపాయలు కాజేశామని చంద్రబాబు మాట్లాడతారు.దానికంటే ముందు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణగారు ట్వీట్ చేస్తారు. ఎందుకు ట్వీట్ పెట్టారని అడిగితే నేను డౌట్ వచ్చి క్లారిఫికేషన్ కోసం పెడితే గుమ్మడికాయల దొంగఎవరంటే భుజాలు తడుముకుంటున్నారని కన్నాలక్ష్మీనారాయణగారు మాట్లాడుతున్నారు. గుమ్మడికాయలదొంగ ఎవరంటే భుజాలు మేం తడుముకున్నామా...అని అడుగుతున్నాను....కరోనా కిట్లలో కూడా కమీషన్ కొడతారా అంటారా....అది సమాచారం కోసం అడిగారా...లేదా మీ ట్వీటా...ఇదేం ధోరణి. దీనిపై విజయసాయిరెడ్డిగారు కూడా చాలా వివరంగా చెప్పారు.మీరు బిజేపి రాష్ర్ట అధ్యక్షుడుగా ఉండి టిడిపికి 20 కోట్లకు అమ్ముడుపోయారు...దానిపై ఆధారాలు ఉన్నాయి...అని చెబితే కన్నాగారు విరుచుకుపడిపోయారు...ఒళ్లు  దగ్గరపెట్టుకుని మాట్లాడండి...నన్ను కొనేవాడు ఎవరూ లేరు ఈ రాష్ట్రంలో ....నీతి,నిజాయితీకి నిప్పులాంటివాడ్నినేను అని ప్రగల్భాలు పలికారు. కన్నాలక్ష్మీనారాయణగారు...మీరు బిజేపి  రాష్ట్ర అధ్యక్షుడు ఎలా అయ్యారు.బిజేపిలో పుట్టి,బిజేపిలో పెరిగి,ఆర్ ఎస్ ఎస్ లో పనిచేసి బిజేపి సిధ్దాంతాలన్ని మీరు ఆకళింపు చేసుకుని అధ్యక్షులయ్యారా...లేక హఠాత్తుగా అధ్యక్షులయ్యారా....మీరు కాంగ్రెస్ పార్టీలో పుట్టారు..అక్కడే పెరిగారు...మంత్రిగా చేశారు...కాంగ్రెస్ దయాదాక్షిణ్యాల వల్ల ఎదిగినమీరు...ఆ కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోతే దానిని వదిలివేసి బిజేపిలోకి జంప్ అయ్యారు.మీకు బిజెపి అధ్యక్షపదవి ఇవ్వకపోతే అలిగారు.అలిగి ఏం చేశారు మరిచిపోయారా," అంటూ అంబటి రాంబాబు కన్నా పై విరుచుకు పడ్డారు. ఈరోజు ప్రాంతీయపార్టీలు గురించి ఆయన మాట్లాడుతూ అవన్ని కులం,కుటుంబం,అవినీతి,మతంతో అవినీతి అయ్యాయని అంటూ జాతీయపార్టీలు బాగుంటాయని చెబుతున్నారు.మరి మీరు జాతీయపార్టీనుంచి ప్రాంతీయపార్టీలోకి ఎలా రావాలనుకున్నారో సమాధానం చెప్పండి. మీరు జగన్ గారివద్దకు వెళ్లి, వైయస్సార్ కాంగ్రెస్ లోకి రావాలనుకుని 2018 ఏప్రిల్ 25 వతేదీన ముహుర్తం పెట్టుకున్నమాట వాస్తవమా.... కాదా ,బిజేపి అధ్యక్షపదవి ఇవ్వకపోతే అలిగి బేరసారాలు ఆడుకున్నమాట వాస్తవమా... కాదా.....ఇదేనా మీ నైతికత...చేరాలనుకున్నారు చేరారా.....చేరలేదు...ఆఫర్ వస్తే మానుకున్నారు.దానిలోనే ఉన్నారు....అధ్యక్షులయ్యారు. ఏప్రిల్ 24,2018 వతేదీ అర్దరాత్రి మీకు చమటలు పట్టాయి.తీవ్రఅస్వస్ధతకు గురయ్యారు.లలితాసూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలో చేరారు.ఎందుకు చేరారు.ఆఫర్ కోసం గుండెపోటు తెప్పించుకున్న కన్నాలక్ష్మీనారాయణ మాకు నీతులు వల్లెవేస్తారా...బిజేపి అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడు పోయి ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేస్దాయి మీకు ఎక్కడిది అని అడుగుతున్నాను.అర్దరాత్రి గుండెపోటు వస్తుంది.తెల్లారేసరికి పోతుంది.టిడిపితో కూడా బేరాలు ఆడతారు.తిరిగి బిజేపిలో ఉండి అధ్యక్షులవుతారు. మీరు అన్నారు నిన్న....విజయసాయిరెడ్డిగారిని అడిగారు...కాణిపాకంలో వినాయకుడు ముందు ప్రతిజ్ఞ ప్రమాణం చేస్తారా అని..ఎస్... మేం చేస్తామని అడుగుతున్నాను.నీవు 20 కోట్లకు అమ్ముడుపోయావు.చంద్రబాబు మనిషివి.చీడవి అని ప్రమాణం చేయడానికి సిధ్దంగా ఉన్నాం. ఆరోజు నాకు నిజంగానే గుండెపోటు వచ్చిందని ప్రమాణం చేస్తారా....అంతేకాదు....మీ సంగతి చాలా ఉంది.కన్నాగారు...వైయస్ రాజశేఖరరెడ్డిగారు మరణించిన తర్వాత రోశయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.రోశయ్యగారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిగారు సిఎం అయ్యారు.ఆయన మారతారనే టాక్ వచ్చింది. అప్పుడు మీరు ఢిల్లీ వెళ్లి 20 కోట్ల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో సిఎం పదవి కొనుక్కోవాలనే ప్రయత్నం చేశారా లేదా....20 కోట్లు లంచం ఇచ్చారు ఒకాయనకు...ఆయన టోపి పెట్టారు అది వేరే విషయం.అది పత్రికలలో రాకపోయినా జగమెరిగిన సత్యం. 20 కోట్ల రూపాయలు ఇచ్చి సిఎం పదవి కొనుక్కోవాలనుకునే నీవా నైతికత గురించి మాట్లాడేది.అలా ముఖ్యమంత్రి అయ్యి రాష్ర్టాన్ని ఏం చేద్దామనుకున్నావు. దీనికి కూడా సిధ్దంగా ఉన్నావా...కాణిపాకం వచ్చి వినాయకుడి చెంతన కాంగ్రెస్ పార్టీలో సిఎం పదవి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయడానికి సిధ్దంగా ఉన్నావా... బిజేపిలో చాలామంది అధ్యక్షపదవికి పోటీ పడినా మీరు ఎలా అధ్యక్షుడు అయ్యారు.ఇటీవల ఎన్నికలలో బిజేపి పంపిన పార్టీ ఫండ్ కొట్టేశావా... లేదా...లెక్క చెప్పకుండా తప్పించుకు తిరుగున్నావా... లేదా...అధిష్టానం కోపం గా ఉందని చెప్పి జగన్ గారిపై దూకుడుగా వెళ్తే ఏదో జరుగుతుంది.నీకుి చంద్రబాబు కాపాడతాడనే ఉద్దేశ్యంతో చంద్రబాబుకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నావు. బిజేపిలో ఉన్న కన్నా,సుజనాచౌదరి టిడిపి కోవర్టులు.ఇది దయచేసి బిజేపినేతలు తెలుసుకోమని చెబుతున్నాను.బిజేపి రాష్ట్ర శాఖని అమ్మేస్తారు.ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసే మనస్తత్వం కలిగిన కన్నాగారు విజయసాయిరెడ్డిగారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. సూట్ కేసు కంపెనీలు పెట్టారంట...16 మాసాలు జైలులో ఉన్నారంట...ఇది అందరికి తెలిసిన తర్వాతే జగన్ గారికి ప్రజలు ఓట్లు వేసి రాష్ట్రంలో  అధికారంలోకి తీసుకువచ్చారు. కన్నాగారు...మీరు పార్లమెంట్ కు నిలబడితే ఎన్ని ఓట్లు వచ్చాయి.ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారు.ఖర్చు పెట్టకుండా నొక్కేశారు.డిపాజిట్లుకూడా రాని దౌర్భాగ్యపరిస్దితులలో ఉండి మీరు మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కన్నాగారికి చెబుతున్నాను...మీరు సిధ్దంగా ఉన్నారా...విజయసాయిరెడ్డిగారు...మేం....కాణిపాకం వస్తాం...వినాయకుడి ఆలయంలో ప్రమాణం చేస్తాం...చేయడానికి మీరు సిధ్దంగా ఉన్నారా లేదా సమాధానం చెప్పండి. సిధ్దంగా ఉంటే..టైం ,డేట్ చెప్పండి.మీరు చెబితే రావడానికి మేం సిధ్దంగా ఉన్నాం.గుర్తుపెట్టుకోండి.  మొత్తం ఐదు ప్రమాణాలు 1.ఏప్రిల్ 24 వతేదీన నాకు గుండెపోటు వచ్చి నేను ఆస్పత్రిలో చేరాను అని ప్రమాణం చేయాలి. 2.కాంగ్రెస్ పార్టీలో సిఎం అవ్వడానికి నేను 20 కోట్లు ఇవ్వలేదని ప్రమాణం చేయాలి. 3.బిజేపి అధ్యక్షుడుగా ఎన్నికలలో నాకు ఇచ్చిన ఫండ్ ను సద్వినియోగం చేశాను అని ప్రమాణం చేయాలి. 4.చిన్నస్దాయిలో ఉన్ననేను ఇన్ని వందల కోట్లకు అధిపతి కావడానికి సొంతంగా కష్టపడి సంపాదించాను తప్ప రాజకీయ అవినీతి చేయలేదు అని ప్రమాణం చేయాలి. 5.చంద్రబాబుకు అమ్ముడు పోలేదు అని ప్రమాణం చేయాలి.  ఈ ఐదు ప్రమాణాలు చేయడానికి మీరు సిధ్దపడండి.డేట్ ,టైమ్ చెప్పండి. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఈ ఐదింటికి సమాధానం చెప్పి మాత్రమే మీరు ప్రెస్ మీట్ పెట్టి  నిజాయితీని నిరూపించుకోవాలి తప్ప ఏవేవో పిచ్చి మాటలు ఒళ్లు దగ్గర పెట్టుకోండి...అధికారమదంతో మీరు విర్రవీగుతున్నారు.మర్యాదగా మాట్లాడండి ...ఇలాంటి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడవద్దు. అదేమంటే అంటున్నారు...పరువునష్టం దావా వేస్తా అంటున్నారు...వేయండి.మీరు చాలామందిపై వేశారు....అలా వేసి గుంటూరులో కోర్టుకు తిరుగుతున్నారు.అలాంటి దావాలు వేసి కూడా డబ్బులు సంపాదించాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి మీరు. చంద్రబాబు,మీరు కలసి ఏదోవిధంగా జగన్ గారి ప్రభుత్వంపై బురదచల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన పద్దతి కాదు. మేం ఈ రాపిడ్ కిట్స్ కొనే విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా తప్పుచేయలేదు. కేంద్రప్రభుత్వం 795 రూపాయలకు కిట్ కొన్నది.దీనిని మీరు ఎందుకు ప్రశ్నించరు అంటే విజయసాయిరెడ్డిగారిని పార్లమెంట్ లో అడగమనండి అంటున్నారు.పక్కనే ఉన్న కర్నాటక ప్రభుత్వం కూడా 795 రూపాయలకు కిట్ కొన్నది. ఐసిఎంఆర్,కర్నాటక ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువధరకు కొన్నాయని చంద్రబాబును అడిగితే అదేమన్నా ఎక్స్యుక్యూజా అంటున్నారు...అంటే పక్క రాష్ట్రాన్ని గాని,కేంద్ర ప్రభుత్వాన్ని గాని  అడిగే దమ్ము లేదా, అంటూ రాంబాబు , కన్నా లక్ష్మీనారాయణ పై విరుచుకుపడ్డారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ,   కన్నాగారు ఎన్నికలలో డిపాజిట్ తెచ్చుకుంటే పదిలక్షలు ఇస్తామని టిడిపి చెప్పింది.ఇప్పుడు పదిలక్షలు కాదు 20 కోట్లు ఇచ్చారు.కన్నాగారు ఢిల్లీలో పొగొట్టుకున్న 20కోట్లు సుజనా చౌదరి ద్వారా ఢిల్లీలోనే సంపాదించారు.లోటు పూడ్చుకున్నారు.గతంలో కాంగ్రె్స్ పార్టీలో  బ్రోకర్ కు ఇచ్చి పొగొట్టుకున్నారు.నేడు బ్రోకర్ గా ఉన్న సుజనా చౌదరి ద్వారా సరిచేసుకున్నారు. సత్తెనపల్లిలో యువకుడు మరణించారు.అది చాలా భాధాకరం.ఆ కుర్రవాడ్ని పోలీసులు చితకబాదారని అందుకే చనిపోయాడని ఛానల్స్ లో వచ్చింది.అయితే చితకబాదినమాట అవాస్తవం.అతనిపై ఒక దెబ్బ వేశారు.అతను సృహతప్పాడు.ఆస్పత్రికి వెళ్లిన తర్వాత మరణించాడు.ఇది నేను చెప్పిన మాట కాదు అతని తండ్రి ఆదాం చెప్పిన మాట.అతను పదిసంవత్సరాల క్రితంనుంచి గుండెజబ్బుతో బాధపడుతున్నాడు.బలహీనంగా ఉన్నాడు.అందువల్లే మరణించాడు.అతని  కుటుంబానికి సహాయం చేయాలని ముఖ్యమంత్రిగారిని కోరడం జరిగింది.సిఎంఓ కూడా ఆదుకుంటామని చెప్పింది.పార్టీ తరపున కూడ ఆదుకుంటాం.ఇది జరిగిన వాస్తవం. సంఘటన జరగగానే పోలీసు విభాగం కూడా స్పందించింది.కొట్టిన ఎస్ ఐ ని సస్పెండ్ చేసింది.విచారణ చేస్తున్నారు.తప్పు చేస్తే సహించేది లేదు.వాస్తవాన్ని ప్రజలు గమనించాలని అంబటి రాంబాబు అన్నారు.

క‌రోనా దెబ్బ‌కు హ‌లీం దుకాణాలు బంద్‌!

హలీం తినాలంటే మ‌రో ఏడాది ఆగాల్సిందే. ఈ సంవ‌త్స‌రం రంజాన్ సంద‌ర్భంగా ఏ హోట‌ల్ లోనూ హ‌లీం త‌యారు చేయ‌రాద‌ని హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి రంజాన్ నెల ప్రారంభం అవుతుంది. రంజాన్ పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. ప్రతీ ఏటా రంజాన్ మాసం ప్రారంభమైందంటే ముస్లీంలతో పాటు హైదరాబాద్ వాసులంతా హలీమ్ తినేందుకు క్యూ కట్టేవారు. చికెన్, మటన్, వెజ్ హలీమ్‌లను లొట్టలేసుకుంటూ తినేవారు. హైద‌రాబాద్ ను ప్ర‌పంచ వ్యాప్తంగా పాపులర్ చేసిన ఫుడ్ ఐట‌మ్స్ లో హ‌లీమ్ ఒక‌టి. రంజాన్ మాసంలో మాత్ర‌మే దొరికే హ‌లీమ్ ను ఇష్ట‌ప‌డ‌ని వారంటూ ఉండ‌రు. చాలామంది హ‌లీం ప్రియులు రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా ఎప్పుడు హ‌లీం తిందామా అని కూడా వెయిట్ చేస్తుంటారు.రంజాన్ పండ‌గ స‌మయంలో త‌ప్ప‌కుండా తినాలనిపించే ఆహార‌ప‌దార్థాలు చాలా ఉన్నాయి. హ‌లీం, ఖుర్బానీ కా మీఠా, డ‌బుల్ కా మీఠా, రుమాలీ రోటి, చికెన్ టిక్కా, షామీ, ద‌హీవ‌డ ప్ర‌ధాన‌మైన‌వి. మంచి రుచితో పాటు...ఉప‌వాస స‌మ‌యంలో ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన‌.. శక్తిని కూడా అందివ్వ‌డమే ఈ రుచుల ప్రత్యేక‌త‌. హైద‌రాబాదీ ఫుడ్ వెరైటీల‌లో ముఖ్య‌మైన‌ది మాత్రం హ‌లీం. మ‌ట‌న్, చికెన్, బీఫ్‌, ఒంటె... మాంసాల‌తో... హ‌లీమ్ తయారు చేస్తుంటారు. రోజా స‌మ‌యంలో హ‌లీం తింటే వెంట‌నే శ‌క్తినిచ్చే ఫుడ్ అని ప్ర‌సిద్ధికెక్కింది. కానీ కరోనాతో హలీంకు ఎఫెక్ట్ పడింది.హైదరాబాద్ హలీం తయారీ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హలీం తయారు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు హలీం మేకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పిస్తా హౌస్ ఎండీ ఎంఏ మాజిద్ తెలిపారు. లాక్ డౌన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి కరోనా నివారణకు ప్రభుత్వం చేసిన పోరాటానికి సహరించాలని కోరారు. ప్రతి రంజాన్ సీజన్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే రూ.1200 కోట్ల మేర హలీం అమ్మకాలు జరుగతాయని అంచనా. ఇక్కడి నుంచి హలీం రుచులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.

మాయాబజార్ ఎస్వీఆర్ స్టైల్ లో విజయసాయి 'పవర్ పంచ్'

*కమలానికి అసమదీయులెవరో, తసమదీయులెవరో తెలుసుకోవాలంటూ ఆ పార్టీ కి ఝలక్  *ఏపీ బీజెపీ ఇంకా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందంటూ ఘాటైన వ్యాఖ్యలు  మాయాబజార్ సినిమాలో ఘటోత్కచ పాత్రధారి చేత కథారచయిత ఒక అద్భుతమైన ప్రయోగం చేయిస్తాడు... "ఎవరు పుట్టించకపోతే, కొత్త పదాలెలా పుట్టుకొస్తాయి," అంటూ ఘటోత్కచ పాత్రధారి ఎస్ వీ రంగారావు చేత ఒక సందర్భోచిత వ్యాఖ్యానం చేయిస్తాడు.. రాక్షస భృత్యులు అసస్మదీయులు అనటానికి బదులుగా అసమదీయులు అనటం, దానికి విరుద్ధ పదం గా 'తసమదీయులు' అనే కొత్త పదం సృష్టించటాన్ని అప్పటి ప్రేక్షకులు, ఇప్పటి ఆడియెన్స్ కూడా పరిపూర్ణంగా ఆస్వాదించారు, ఆస్వాదిస్తున్నారు. అంతటి మహత్తరమైన లెగసీ ని క్యారీ ఫార్వార్డ్ చేయటానికి, ఎస్ వీ రంగారావు స్ఫూర్తిగా, వైఎస్ ఆర్ సి పీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి నడుం బిగించారు.  తెలుగు ప్రజానీకానికి కావాల్సినంత స్టఫ్ అందించే క్రమంలో, ఆయన కూడా ఎస్ వీ రంగారావు మాదిరి కొత్త పదాలు పుట్టిస్తున్నారు, పొలిటికల్ పార్టీలను కన్ఫ్యూజ్ చేయటానికి....  తాజాగా ఆయన కనిపెట్టిన పదం..తెలుగు జాకాల్స్ పార్టీ ( టీ జె పీ)...అంటే, దాని భాష్యం ఏమిటంటే..తెలుగుదేశం లో నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు పంపగా వచ్చి చేరిన వారి తో కలిసి (సుజనా చౌదరి, టీ జె వెంకటేష్, సి ఎం రమేష్ బోటివారన్న మాట) , బీ జె పి కాస్తా టీ జె పీ అయిందన్న మాట. ఇలాంటి ఒక కొత్త పదం పుట్టించిన విజయసాయి రెడ్డి, అభియోగమల్ల ఏంటంటే, కన్నా లక్ష్మీనారాయణ ( ఈయన కూడా కాంగ్రెస్ నుంచి బీ జె పీ లోకి ఇంపోర్ట్ అయిన వారే) కు సుజనా ముడుపులిచ్చారనీ, ఆయన ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కోసం పని చేస్తూ పసలేని ఆరోపణలు చేస్తున్నారనీ... ఇంతకీ, దీనికి నేపధ్యమల్లా, సుజనా చౌదరికి, విజయసాయి రెడ్డి కి మధ్య నడుస్తున్న పవర్ వార్.. ఢిల్లీ లాబీల్లో గడిచిన ఐదేళ్లుగా విజయసాయిరెడ్డి నిర్మించుకున్న 'పవర్ లాబీ' సామ్రాజ్యానికి, అలాగే బీ జె పీ హెడ్ క్వార్ట్రర్స్ తో ఆయనకున్న అవినాభావ సంబంధానికి , సుజనా చౌదరి పని కట్టుకుని గండి కొడుతున్నారని విజయ్ సాయి రెడ్డి అనుమానం, నమ్మకం కూడా. అందుకనే, ఆయన సుజనా చౌదరి ఆర్ధిక అవకతవకలపైన రాష్ట్రపతికి, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కూ లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయటం మొదలెట్టి, సుజనా చౌదరి ని ఉక్కిరి బిక్కిరి చేయటం మొదలెట్టారు.  ఇది తట్టుకోలేని సుజనా చౌదరి, సహజంగానే, ప్రతి వ్యూహం సిద్ధం చేసి, కన్నా లక్ష్మీ నారాయణ ను తన క్యాంప్ వైపు లాక్కోవటం మొదలెట్టారు. కన్నా కూడా విధి లేని పరిస్థితుల్లో సుజనా కు దగ్గరవడం, ఎలాగూ పోయే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ని నిలుపుకోవటం కోసం సుజనా ద్వారా లాబీ చేయించుకోవాలని చూడడటం వంటి కారణాలు, విజయసాయి రెడ్డి -సుజనా క్యాంప్ ని టార్గెట్ చేయటానికి కారణమయ్యాయి.  ఇప్పుడు విజయసాయి వ్యూహమల్లా ఒకటే... అసలు సిసలు బీ జె పీ వారు ఎవరైనా ఆరోపణలు చేస్తే, సమాధానం ఇవ్వటానికి తాను సిద్ధమేనని, టీ డీ పీ నుంచి దిగుమతి అయిన సుజనా లాంటి ఆర్ధిక నేరగాళ్లు చేసే ఆరోపణలకు, అలాగే కన్నా లక్ష్మీనారాయణ లాంటి అవినీతిపరులు చేసే ఆరోపణలకు తానూ జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ- బీ జె పి హెడ్ క్వార్ట్రర్స్ నే ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఏతా వాతా, ఏపీ బీ జె పీ ఇంకా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే నడుస్తోందనే మెసేజ్ ను ఆయన నేరుగా ఢిల్లీ అశోకా రోడ్ లోని కమలదళాధినేతలకు పంపేశారు. విభజించి పాలించే సిద్ధాంతాన్ని అప్లై చేయటం ద్వారా , ఆయన ఢిల్లీ కమలదళానికి, రాష్ట్ర బీ జె పీ కి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నాన్ని సక్సెస్ ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్ర బీ జె పీ లో అసమదీయులెవరో, తసమదీయులెవరో తేల్చుకోవాలంటూ , మాయాబజార్ లో ఎస్ వీ ఆర్ స్టైల్ లో విజయసాయి విసిరిన పవర్ పంచ్ పై ఇప్పుడు -బీ జె పీ లో సుదీర్ఘ చర్చ నడుస్తోంది.

ఏపీ లో ఆ నాలుగు జిల్లాలే హడలెత్తిస్తున్నాయి!

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్‌-19 నివారణ చర్యలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కరోనా కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. పంటలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు పండించిన పంటను సరైన ధరకు కొనుగోళ్లు చేసి వారికి అండగా నిలబడాలన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారుల కోసం గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో మాట్లాడానని పేర్కొన్నారు. తెలుగు మత్స్యకారులును అన్ని రకాలుగా ఆదుకుంటామని, వెంటనే అధికారులకు ఆదేశాలిస్తానని తనతో చెప్పారని వెల్లడించారు.  అంతకుముందు కరోనా నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్‌ల పంపిణీ కార్యక్రమం ఊపందుకుందన్నారు. రెడ్‌, ఆరెంజ్‌ జోన్ల వారిగా మాస్క్‌లును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా నిలిచాయని, ఇంతవరకు అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 225 ట్రూనాట్‌ కిట్స్‌తో విస్తారంగా కరోనా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కాగా సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 5022 కరోనా పరీక్షలను(ర్యాపిడ్‌ టెస్టులు కాకుండా)నిర్వహించామన్నారు. కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చాలని నిర్ణయించామని, గవర్నమెంట్‌ ఆసుపత్రుల్లో ఉన్నవారిని మిగతా ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పీపీఈ కిట్లు, మాస్క్‌లను ఎక్కువ స్టాక్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్లాస్మా థెరఫీని ప్రారంభించడానికి అనుమతి కోరినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వేల ద్వారా గుర్తించిన 32వేల మందిలో ఇప్పటికే 2వేల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, మిగతావారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఇప్పటివరకూ 7100 మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.

పలాస ఎమ్మెల్యేకి తాకిన కరోనా ఎఫెక్ట్

లాక్ డౌన్ నిబంధ‌న‌ల్ని సైతం ఉల్లగించి వైసిపి శాస‌న‌స‌భ్యుడు సీదిరి అప్పలరాజు విజయవాడలో పర్యటన చేయ‌డం వివాదాస్ప‌దం అయింది. శాస‌న‌స‌భ్యుడితో పాటు ఆయ‌న అనుచ‌రులు సోషల్ డిస్టన్స్ పాటించకుండా  కారులో పలువురు ప్రయాణం చేశారు. అయితే వీరిని నిబంధ‌న‌ల ప్ర‌కారం క్వారంటైన్‌కు పంపించాల్సిందేన‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శాస‌న‌స‌భ్యుల‌తో పాటు అత‌ని అనుచ‌రుల‌తో జిల్లా వాసుల‌కు ప్ర‌మాదం పొంది వుంద‌ని కాబ‌ట్టి  కోరంటైన్‌కి తరలించాలని స్థానిక నేతలు కొంత మంది పోలీస్,రెవిన్యూ అధికారులకు పిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు తో పలాస లో రాజకీయ వాతావరణం  వేడెక్కింది. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటార‌నే అంశంపై సర్వత్ర ఆసక్తి నెల‌కొంది.

ఈ పరిస్థితుల్లో బడాయి కి పోవడం అవసరమా.? రోజక్క

క‌రోనా, లాక్‌డౌన్ లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఉన్నా వైసిపి నేత‌లేమో ప్రారంభోత్స‌వాల్లో ఎంజాయి చేస్తున్నారు. మ‌రికొంత మంది అయితే పూలాభిషేకాలు చేయించుకుంటూ త‌మ తొట్టి గ్యాంగ్‌తో జేజేలు ప‌లికించుకుంటున్నారు. వాట‌ర్‌మోట‌ర్ ప్రారంభోత్స‌వానికి వెళ్ళిన ఎమ్మెల్యే రోజాకు స్థానికులు పూలతో స్వాగతం ప‌లికారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం పుత్తూరు మున్సిపాల్టీ ప‌రిధిలోని సుంద‌ర‌య్య‌న‌గ‌ర్‌లో స్థానికంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న త్రాగునీటి స‌మ‌స్య‌ను ఎమ్మెల్యే రోజా ప‌రిష్క‌రించారు. ఈ కాల‌నీలో 50కు పైగా ఇళ్ళు వున్నాయి. వారి ఇళ్ల‌కు నీటి పైప్ లైన్ లేదు. ధీర్ఘ‌కాలంలో మంచినీటి స‌మ‌స్య‌తో సుంద‌ర‌య్య‌న‌గ‌ర్ వాసులు బాధ‌ప‌డుతున్నారు. వీరి స‌మ‌స్య‌ను ఎమ్మెల్యే రోజా ప‌రిష్క‌రించారు. నీటి మోట‌ర్‌ను కూడా అక్క‌డ ఏర్పాటు చేశారు. అయితే ఈ నీటి మోట‌ర్‌ను ప్రారంభించ‌డానికి వ‌చ్చిన ఎమ్మెల్యే రోజా కాళ్ల‌పై పూలు చల్లి స్థానికులు త‌మ అభిమానాన్ని చాటుకున్నారు.

3 రోజులు నడిచి ప్రాణాలు కోల్పోయిన బాలిక!

తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు 3 రోజుల పాటు నడిచి ప్రాణాలు కోల్పోయింది 12 ఏళ్ల బాలిక. 150 కిలోమీటర్లు నడిచింది. కేవ‌లం ఇంటికి 14 కిలోమీటర్ల దూరంలో మృతి చెందింది. ఒక్కగానొక్క కూతురిని తల్లిదండ్రులు కోల్పోయారు. పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందింద‌ని  వైద్యులు చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ బంద్ అయింది.  లాక్‌డౌన్‌ను పొడిగించడంతో కూలీలు తమ సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్నారు. ఈ క్రమంలో తొందరగా ఇంటికి వెళ్లాలని అటవీ మార్గాన కూడా నడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.  అండొరం మక్డం (32), సుకమతి (30) కి జామ్లో మక్డం(12) అనే ఒక్కగానొక్క కూతురు ఉంది. తెలంగాణలోని ఓ గ్రామానికి రెండు నెలల  క్రితం ఆ కుటుంబంతో పాటు మరి కొంత మంది  మిర్చి ఏరవేత కూలీ పనులకు వచ్చారు. లాక్‌డౌన్‌తో 13 మంది ఛత్తీస్‌గఢ్‌లోని సొంత గ్రామానికి కాలి నడకన వెళ్లాలని ప్రయాణం ప్రారంభించారు. బీజాపూర్ జిల్లా సరిహద్దుకు చేరుకోగానే జామ్లోకు కడుపునొప్పి వచ్చి, అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి మృతి చెందింది. దీంతో  భండర్‌పాల్ గ్రామస్తుల సాయంతో కుటుంబ సభ్యులు జామ్లో ఆరోగ్య పరిస్థితి గురించి పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న బీజాపూర్‌కు చెందిన వైద్యులు వారిని క్వారంటైన్ కు తరలించారు. ఆమె పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం బాలిక కుటుంబానికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది.

ఉద్యోగుల్నిఆఫీస్‌కు పిల‌వ‌డానికి తొందర పడం!

ఐటీ సంబంధిత సంస్థలన్నీ తమ ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాయి. తొందర పడి కార్యాలయాలకు వారిని పిలిచి వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టే అవసరం లేదని భావిస్తున్నాయి. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయిస్తున్నారు. కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడకపోవడం, చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించడంతో ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్ర వంటి సంస్థలు తమ ఉద్యోగులను మరి కొన్ని వారాల పాటు ఇంటి నుంచి పనిచేయాలని చెబుతున్నాయి.  తమ రాష్ట్రాల్లోని ఐటీ సంస్థలను మూసే ఉంచాలని ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాలు తెలిపాయి. నెమ్మదిగా వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ నుంచి కార్యాలయాలకు ఉద్యోగులను రమ్మంటామని, ఇందులో తొందర పడబోమని ఇన్ఫోసిస్‌ ప్రతినిధి  తెలిపారు. తమ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని మరో మూడు-నాలుగు వారాల్లో కార్యాలయాలకు రమ్మంటామని వివరించారు. అలాగే, తర్వాత దశలో 15 నుంచి 20 శాతం మందిని నెమ్మదిగా కార్యాలయాలకు రమ్మనే ప్రణాళిక వేసుకున్నామని చెప్పారు. ఉద్యోగుల రక్షణ కోసం తాము అనేక చర్యలు తీసుకుంటున్నామని, వారి శరీర ఉష్ణోగ్రతను చెక్ చేస్తామని, సామాజిక దూరం పాటించేలా చేస్తామని తెలిపారు. తమ సంస్థలోని అత్యధిక మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని టెక్‌ మహీంద్రకు చెందిన ఓ అధికారి తెలిపారు. తమ సంస్థలో పనిచేసే ఐటీ, సెక్యూరిటీ ఉద్యోగులను క్రమంగా విధుల్లోకి రమ్మంటామని చెప్పారు.  మొదటి దశలో  15-20 శాతం ఉద్యోగులను మాత్రమే కార్యాలయాలకు రప్పించాలని ఇప్పటికే నాస్కామ్ సూచనలు చేసింది. కరోనా పరిస్థితులను పరిశీలిస్తూ నెమ్మదిగా ఆ సంఖ్యను పెంచాలని చెప్పింది.  ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఏప్రిల్‌ 20 నుంచి 50 శాతం మేర కార్యాలయాలకు రప్పించుకోవచ్చని ఇప్పటికే హోం శాఖ మార్గ దర్శకాలు జారీ చేసింది.

సి.ఎం గారు! రాజప్రాసాదం దాటి ప్ర‌జ‌ల్లోకి రాలేరా?

క‌రోనా దెబ్బ‌కు తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తన ఫాం హౌస్ ను వ‌దిలి పెట్టి, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకొని పాల‌న చేస్తున్నారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి మాత్రం తాడేప‌ల్లిలో తాను నిర్మించుకున్న రాజ‌భ‌వ‌నం అదే సి.ఎం.క్యాంప్ ఆఫీస్ వ‌దిలి ప్ర‌జ‌ల్లోకి రావ‌డం లేదని తెలుగుదేశం పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తూ ట్వీట్‌లు పెడుతోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కరోనా నివారణ చర్యల తో పాటు ప్రజల్ని కాపాడుకోవడానికి దేశంలోని ఎంతో మంది ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని, ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే రాజప్రాసాదంలో కూర్చుని పాలిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ శాసనసభపక్ష ఉపనాయకులు, కింజరాపు అచ్చెన్నాయుడు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. 65 ఏళ్ళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గ్రౌండ్ లో పని చేస్తున్నారు. 65 ఏళ్ళ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్షేత్రస్థాయిలో ఉన్నారు. 63 ఏళ్ళ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని సహాయక కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటున్నారు. 58 ఏళ్ళ అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ క్షేత్రస్థాయిలో కరోనా నివారణ చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 61 ఏళ్ళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహన్ గ్రౌండ్ లెవల్ లో తిరుగుతూ రైతుల కష్టాలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. మేఘాలయా ముఖ్యమంత్రి కోనార్డ్ సంగ్మా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలకు సహాయం అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గ్రౌండ్ లో పని చేస్తున్నారు. 77 ఏళ్ళ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్షేత్ర స్థాయిలో ఉండి కరోనా పై పోరాటం చేస్తున్నారు. అయితే యువ ముఖ్యమంత్రిని అనే చెప్పుకునే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేపల్లి రాజప్రసాదం దాటి ఎందుకు బ‌య‌టికి రావ‌డం లేదు. ప్ర‌జ‌ల గోడు మీకు ప‌ట్ట‌దా? బయటకు రారా? రాజకీయమే ముఖ్యమా? అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

కాణిపాకం ఏమిటి, తిరుమలకైనా వస్తా

కన్నా వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీ జె పీ నేతలకు ఎదురు ఛాలెంజ్ విసిరారు. తానూ ఎక్కడా అవినీతికి పాల్పడలేదని,  కాణిపాకమే కాదు.. వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని ప్రకటించారు. అవినీతికి పాల్పడలేదని కన్నా, సుజనా చౌదరి ప్రమాణం చేస్తారా, అంటూ ఎదురు ఛాలెంజ్ చేశారు. సుజనాచౌదరి.. బోగస్ కంపెనీలు సృష్టించి.. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారని, కన్నా లక్ష్మీనారాయణ ఓ అవినీతిపరుడు, నేను మళ్లీ చెబుతున్నా.. రూ.20 కోట్లకు కన్నా అమ్ముడుపోయారంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కన్నా లాంటివాళ్లు.. ప్రశ్నించేందుకు అనర్హులు అంటూ కూడా వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకు పడ్డారు.

జగన్ చేత ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టించగలరా!

*వై ఎస్ ఆర్ సి పి కి తెలుగుదేశం అభిమానుల ఫేస్ బుక్ ఛాలెంజ్  * కనీసం ప్రెస్ మీట్ పెట్టలేరు, ఇక ఇలాంటి లైవ్ ఏమి పెట్టగలరంటూ ఎద్దేవా  తెలుగుదేశం అభిమానులు , పాలక వై ఎస్ ఆర్ సి పి తీరుపై విరుచుకుపడ్డారు. Nara Chandrababu Naidu #TeluguDiaspora తో #ConferenceCall ద్వారా ఆలోచనలు పంచుకుంటూ వాళ్ళ అభిప్రాయాలు/సూచనలు తీసుకోవటం మీద పాలకవర్గాలు ఎందుకు ఇంతగా ఉలికిపడుతున్నాయంటూ సోషల్ మీడియా లో ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనా? లేక #NRI లకి నైతిక మద్దతుగా ఆయా దేశాల్లో వాళ్లు పడుతున్న అవస్థల మీద కనీసం స్పందించని #APNRT అని మీ మీద మండిపడుతున్నారనా?? దేనికి ఇంత ఆక్రోశం, అంటూ వై ఎస్ ఆర్ సి పి ని చీల్చి చెండాడేశారు.  మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే #NRI ల పట్ల #Empathy ఉంటే మీరు కూడా YS Jagan Mohan Reddy గారి చేత ఒక #ConfCall పెట్టించండి..ప్రపంచంలో #corona బాధిత దేశాల్లో మన తెలుగువాళ్లు మరీ ముఖ్యంగా #Frontline సైనికులుగా ఉన్న డాక్టర్లు/హెల్త్కేర్ వర్కర్లు/రెస్సెర్చ్ స్కాలర్లతో అనుసంధానమయి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి...రోజూ మన మీడియా ఎంతోమంది నిపుణుల సూచనలు/సలహాలు తమ తమ పేపర్లు/ఛానెల్స్లో ప్రసారం అవగాహన చేస్తున్నారే మీరు కనీసం ఒక మంత్రి గాని ఒక MLA/MP గానీ కనీసం ఒక అధికారి అయినా NRIలతో మాట్లాడే ప్రయత్నం చేశారా...CBN నిన్ననే 70వ పుట్టినరోజు చేసుకున్నాడు..42 ఏళ్ల రాజకీయ అనుభవం..15 ఏళ్లు ముఖ్యమంత్రి.. కానీ కనీసం 90 నిముషాలు విదేశాల్లో ఉన్న #NRI లు చెప్పేది ఓపిగ్గా వింటూ పెన్ను పేపరు పట్టుకుని రాసుకుంటూ కూర్చున్నాడు..అందులో పనికివచ్చేవి ఉన్నాయా లేదా అనేది ఆయన తరవాత చూసుకుంటాడు..కానీ చెప్పేవాడికి కొండంత కాన్ఫిడెన్స్..నేను చెప్పిన నాలుగు ముక్కలు ఆయన రాసుకున్నాడు..నా పేరు రాసుకున్నాడు...జీవితంలో అదిచ్చే కాన్ఫిడెన్స్ విలువ ఎంతో తెలుసా...మీరు కనీసం ప్రెస్మీట్ పెట్టలేరు ఇక ఇలాంటి లైవ్ ఏం పెట్టగలరు.... అధికారం వచ్చిన ఆనందం కూడా లేకుండా ఇంకా ఆయన వాళ్ళతో.మాట్లాడుతున్నాడు, వీళ్ళకి సలహాలు ఇస్తున్నాడు అని ఏడిస్తే ఏమోచ్చిద్ది....#CoronaLessons మీరు ఏం నేర్చుకున్నారో మాకు తెలీదు గానీ జనంలో మాత్రం ఆయన ఉంటే ధైర్యంగా ఉండేది అనే ఫీలింగ్ మాత్రం బలపడుతుంది..ఇక మీ ఇష్టం, అంటూ ఒక తెలుగు దేశం అభిమాని ఉచిత సలహా కూడా ఇచ్చేశాడు. మరి, పాలక వై ఎస్ ఆర్ సి పి ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

క‌రోనా చికిత్స‌కు గాంధీ, గ‌చ్చిబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్!

చంద్రబాబు ఎప్పుడో 18 ఏళ్ల కిందట కట్టించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అక్కరకు వచ్చింది. 2002 లో హైదరాబాద్ లో జాతీయ క్రీడలు నిర్వహించినప్పుడు గచ్చిబౌలి లో స్పోర్ట్స్ విలేజ్ కట్టించారు. అందులో కొంత అమ్మి కొంత ప్రభుత్వం కింద ఉంచారు. 14 అంతస్థుల తో 540 గదులు ప్రభుత్వం కింద ఉన్నాయి. హైదరాబాద్ లో స్పోర్ట్స్ ఈవెంట్లు జరిగినప్పుడు వస్తున్న వారికి వసతి కోసం ఇన్నాళ్లు వాడారు. ఇప్పుడు అందులో టిమ్స్ పేరుతో హాస్పిటల్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క పైసా ఖర్చు లేకుండా రెడీమేడ్ గా ఉన్న భవనంలో దీనిని పెడుతున్నారు. అధికారం లో ఉన్నప్పుడు ముందుచూపుతో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే తర్వాత అవి ఎలా ఉపయోగ పడతాయనడానికి ఇది ఒక ఉదాహరణ.  హైదరాబాద్ లో ముషీరాబాద్ లో ఉన్న జైలు తొలగించి చంద్రబాబు ప్రభుత్వం గాంధీ హాస్పిటల్ కొత్త భవనం కట్టింది. ఇప్పుడు అందులోనే గాంధీ ఆస్పత్రి నడుస్తోంది. 2004 లో చంద్రబాబు దిగిపోయి ఇప్పటికి 16 సంవత్సరాలు. హైదరాబాద్ లో ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఒక్క కొత్త ఆస్పత్రి భవనం కట్టలేదు. ఉస్మానియా ఆసుపత్రి కి కొత్త భవనం కడతామని హడావుడి చేశారు. కట్టలేదు. ఈ 16 ఏళ్లలో హైదరాబాద్ జనాభా రెట్టింపు అయింది. ఇప్పుడు ఇన్ని రోజులకు ఒక కొత్త ఆస్పత్రి పెడతామని అంటున్నారు. అదీ చంద్రబాబు కట్టించిన భవనంలో.  హైదరాబాద్ లో బొక్కల ఆస్పత్రి గా పిలిచే నిమ్స్ ను ఎన్టీఆర్ బాగా డ‌వ‌ల‌ప్ చేశారు. అమెరికా నుంచి డాక్టర్ కాకర్ల  సుబ్బారావు ను పిలిపించి ఆయన చేతికి నిమ్స్ అప్పగిస్తే దానిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చి దిద్దారు. చంద్రబాబు హయాంలో అది ఇంకా పెరిగింది. మంత్రులు కూడా అక్కడే చికిత్స చేయించుకొనేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో హైదరాబాదులోని గచ్చిబౌలిలో నిర్మించిన జి.ఎం.సి.బాలయోగి క్రీడామైదానం ఆరోగ్యశాఖకు అప్పగించారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ నేతలు గత టిడిపి ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో దీని ద్వారా నైనా గుర్తించాలని టిడిపి నేత‌లంటున్నారు.

బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.. కరోనా టైం లో ఇలాంటివేవో జరుగుతాయని...

లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ఆ నలుగురు అమ్మాయిలకు మద్యం ఎక్కడ దొరికిందో ఏమో... నలుగురు యువతులు పీకల్దాకా మందుకొట్టి, ఖాళీగా ఉన్న రోడ్లపైకి విహారానికి వచ్చారు. అంతేనా, పోలీసు చెక్ పోస్ట్ వద్ద వీరంగం సృష్టించారు. ఆపై పోలీసుల చేజింగ్ ను తప్పించుకుని పారిపోయారు. బెంగళూరులోని లీలా ప్యాలెస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం,  లీలా ప్యాలెస్ వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసిన పోలీసులు, అక్కడికి వచ్చే వారి వాహనాలను నిలిపి, వారు ప్రయాణిస్తున్న కారణాన్ని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కారును ఆపగా, అందులో నలుగురు యువతులు కనిపించారు. వారిని ప్రశ్నిస్తుంటేనే, తమ వద్ద పాస్ ఉందని, హైయ్యర్ అఫీషియల్స్ తమకు తెలుసునని అనవసర వాగ్వాదానికి దిగారు. వీరు మందు కొట్టి ఉంటారన్న అనుమానం పోలీసులకు రావడంతో, బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆ యువతులు, పోలీసులపైకి వాహనాన్ని దూకించే ప్రయత్నం చేసి, కారులో పారిపోయారు. పోలీసులు తమ వద్ద ఉన్న బైక్ పై వారికి ఓ కిలోమీటర్ దూరం వరకూ చేజ్ చేశారు. కానీ, కారును వేగంగా నడిపిన అమ్మాయి, వారి కనుచూపు నుంచి వాహనాన్ని తప్పించింది. అప్పటికే కారు నంబర్ ను గుర్తించిన పోలీసులు, దాని ఆధారంగా కేసును విచారిస్తున్నట్టు వెల్లడించారు.

చైనా బాబులూ... మేము చెప్పింది సరిగ్గా అర్ధం చేసుకోండి: భారత్

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో భారత్‌ కొత్త నిబంధనలను ప్రకటించి, నిర్దిష్ట దేశాల నుంచి ఎఫ్‌డీఐలు రాకుండా కట్టుదిట్టమైన నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా అభ్యంతరాలు కూడా తెలిపింది. ఇటువంటి నిబంధనలు పెట్టడం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలను ఉల్లంఘించడమేనని చైనా హెచ్చరిస్తూ ప్రకటన చేసింది. జీ20 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఇండియా చర్యలు వ్యతిరేకమని చైనా వాపోయింది. అయితే, చైనా చేసిన వ్యాఖ్యల పట్ల భారత్‌ స్పందించి దీటుగా సమాధానం ఇచ్చింది. తాము తీసుకొచ్చిన కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో ఎలాంటి ఉల్లంఘనలు లేవని భారత్‌ స్పష్టం చేసింది. తాము తీసుకొచ్చిన నిబంధనలు పొరుగున ఉన్న దేశాల ప్రత్యక్ష పెట్టుబడులను పూర్తిగా అడ్డుకోబోవని, వాటి అనుమతి పద్ధతులు మాత్రమే మారతాయని తెలిపింది. కాబట్టి ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది. కాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో భారత్ తీసుకొచ్చిన మార్పులు సరికాదని నిన్న చైనా మండిపడ్డ విషయం తెలిసిందే. భారత నిర్ణయం వివక్ష పూరితమంటూ, ఇది స్వేచ్ఛా వాణిజ్యానికి వ్యతిరేకమంటూ పలు అభ్యంతరాలు తెలిపింది. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని హెచ్చరిక చేసింది. భారత్‌ తెచ్చిన మార్పుల ప్రకారం సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఇప్పటికే కొన్ని దేశాలపై భారత్ గతంలోనే ఇటువంటి ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆ జాబితాలో చైనాను కూడా చేర్చింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే భారత్‌లోకి ప్రవేశించే అవకాశం చైనా సంస్థలకు ఉండేది.

అర్చకులు, ఇమామ్స్, పాస్టర్ లకు ఏపీ లో రూ.5,000 ఆర్ధిక సాయం 

కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో, దేవాలయాలు, మసీదులు, చర్చి లో మత పరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్ లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గుర్తింపు పొందిన మసీదు వారికే కాకుండా, గుర్తింపు పొంది ని వారికి ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే అర్చకులకు కూడా ఇవ్వాలని గతం లో నే ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం , ఇందుకు అర్హులైన వారిని గుర్తించాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వేతనం పొందుతున్న వారికి ఈ పథకం వర్తించదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.