20 నుంచి ‘టోల్’తీసేస్తారేమో జాగ్రత్త బాబులూ....

లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి టోల్ వసూలు నిలిపివేసిన నేషనల్ హై వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ( ఎం హెచ్ ఏ ఐ ),  20 నుంచి మళ్లీ వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తూ, కేంద్రానికి లేఖ రాసింది. అయితే, ఆదుకోవాల్సిన సమయంలో ఇది సరికాదని,  రవాణా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గత నెల రోజులుగా ఆగిన టోల్ వసూళ్లు మళ్లీ మొదలుకానున్నాయి. ఈ నెల 20 నుంచి టోల్ రుసుమును వసూలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) రంగం సిద్ధం చేస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గత నెల 24న కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే, అంతర్ రాష్ట్రాల పరిధిలో నిత్యావసర సరుకులు మోసుకెళ్లే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలపై భారం తగ్గించేందుకు కేంద్రం టోలు వసూలును నిలిపివేసింది. గత నెల 25 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తాజాగా, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్ఏఐకి లేఖ రాస్తూ ఏప్రిల్ 20 నుంచి టోలు వసూలు మొదలుపెట్టాలని సూచించింది. కేంద్రం సూచనపై రవాణా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైందని, ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిత్యావసర సరుకుల రవాణా కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం సరికాదని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ఆవేదన వ్యక్తం చేసింది.

5 కిలోల బియ్యం, కేజి పప్పు పరిస్థితి ఏంటి?

మొదటి లాక్ డౌన్ పీరియడ్ మార్చి 22 నుండి ఏప్రిల్ 15 వరకు   రాష్ట్ర ఆర్థిక సాయం 1500 రూ. 12 కిలోల బియ్యం. మొదటి విడ‌త‌లో ఇచ్చిన రేషన్ లో కేంద్రం, రాష్ట్రం కలిపి ఇచ్చే వాటా 17 కిలోల బియ్యం మరియు కేజీ పప్పు. కేవలం 12కిలోల బియ్యం మాత్రమే లబ్ధి దారులకు అందాయి మరి మిగతా 5కిలోల బియ్యం, కేజి పప్పు పరిస్థితి ఏంటి? ఇవి ఎవరూ ఇవ్వాలీ  కేంద్రమా, రాష్ట్రమా? ఎప్పుడు ఇస్తారు? మరి రెండవ విడ‌త‌ లాక్ డౌన్ ఏప్రిల్ 16 నుండి మే 1 వరకు ప్ర‌క‌టించారు. మ‌ళ్లీ లాక్‌డౌన్ సంద‌ర్భంగా ఆర్థిక సాయం 1500 రూ, 12 కిలోల బియ్యం రాష్ట్రం ఇస్తుందా లేదా? అర్హులైన అందరినీ ఆహార భద్రత కిందికి ఎందుకు తీసుకురావ‌డం లేదు?  2013 లో PDS ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో  70%,పట్టణ ప్రాంతాల్లో 50% ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేశారు. అనగా 100 మందిలో 67 మందికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారు. 2011 సం. లో దేశ జనాభా 121 కోట్లు,ఇప్పుడు 2020 సం. లో దేశ జనాభా 137 కోట్లు. ఇంచుమించు 16 కోట్ల జనాభా పెరిగింది.దాదాపు 80 కోట్ల జనాభాకు ఆహార భద్రత కార్డులు ఇవ్వడం జరిగింది.  ప్రతి 10 సం. ఒక సారి సెన్సెక్స్ జరుగుతుంది.అంటే 2021 సం. లో జరగాలి.కరోన విపత్తు నేపథ్యంలో పెరిగిన జనాభా దృష్ట్యా ఇప్పుడు వారందరికీ ఆహార భద్రత కార్డులు ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా 9 నుంచి 10 కోట్ల జనాభాకు రేషన్ కార్డులు కొత్తవి  ఇవ్వాలి. ఈ లెక్క‌న చూస్తే తెలంగాణలో దాదాపు 20 లక్షల రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వాలి. ప్ర‌స్తుతం తెలంగాణలో కొత్త  రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు 16 నుంచి 18 ల‌క్ష‌ల మంది ఉన్నారు.  

ఆ వైర‌స్‌ కంటే దేవుడే గొప్ప! అన్న బిష‌ప్ కరోనాతో మృతి!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బ‌కు రెండు మిలియన్ల మంది ఆస్పత్రి పాలయ్యారు. మరో లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌కు కులం, మతం, రంగు, దేశం, ప్రాంతం అంటూ తేడా ఏం లేదు. దీనికి అందరూ ఒక్కటే. అందర్నీ సమానంగా చూస్తోంది ఈ మహమ్మారి.  కరోనాను చూసి ఎవరూ భయపడొద్దని.. దేవుడి కంటే కరోనా గొప్పేం కాదు అంటూ మార్చి 22న ఇవాలజలికల్ చర్చ్.. వ్యవస్థాపకుడైన బిషప్ గెరాల్ట్‌ గ్లెన్‌.. సామూహిక ప్రార్ధనలు నిర్వహించాడు. ఆ ప్రార్ధనల్లో ఈ వైర‌స్‌పై ప్ర‌త్య‌క ప్ర‌సంగం చేశారు. కరోనాను చూసి ఎవరూ భయపడొద్దు. దేవుడి కంటే కరోనా గొప్పేం కాదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వైరస్‌ కంటే కూడా దేవుడే గొప్ప అని నమ్ముతానంటూ చర్చ్‌కు వచ్చిన వారి ముందు ప్రసగించాడు. అయితే ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన అస్వస్థతకు గురయ్యాడు. చివరకు ఆ వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా వర్జీనియాలోని న్యూ డెలివరెన్స్‌ ఇవాలజలికల్ చర్చ్.. వ్యవస్థాపకుడైన బిషప్ గెరాల్ట్‌ గ్లెన్‌.. కరోనా సోకడంతో మరణించాడు. ఏప్రిల్ 4న ఆ పాస్టర్‌తో పాటు ఆయన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన కూతురు వెల్లడించింది. ఆ తర్వాత ఇద్దర్నీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే తాజాగా.. ఆ బిషప్ చికిత్స పొందుతూ కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. పాస్టర్ గ్లెన్‌ మరణించిన నేపథ్యంలో.. ఆయన చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను చర్చ్‌ యూట్యూబ్‌ చానల్‌ నుంచి తొలగించింది.

జ్వరం, గొంతు నొప్పి మందులను ఏమైనా కొన్నారా?

ఇటీవల జ్వరం, గొంతు నొప్పి నివారణకు మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాడానికి  డ్రగ్ ఇన్ స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీలలోని ఫార్మసి అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమీక్షించాలని తెలంగాణా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ప్ర‌భుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సొంత వైద్యం మరింత ప్రమాదక‌ర‌మని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఇటీవ‌ల జ్వరం, గొంతు నొప్పి నివారణకు మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసిన వారు వెంట‌నే స్వ‌చ్ఛందంగా ముందుకు రావాల‌ని, అలా చేస్తే పెద్ద ప్ర‌మాదాన్ని నివారించ‌డానికి వీలౌతుంద‌ని మంత్రి తెలిపారు. పారాసిట‌మాల్‌తో జ్వ‌రం త‌గ్గిన‌ట్లు క‌నిపించిన‌ప్ప‌ట్టికీ ఒక వేళ క‌రోనా వైర‌స్ అలాంటి వారికి ఉన్న‌ట్లైతే వారితో ద్వారా జ‌బ్బు చాలా మందికి విస్త‌రిస్తోంది క‌నుక వెంట‌నే మెడిక‌ల్ షాపుల ద్వారా మందులు కొన్న‌వారు స్థానిక ప్ర‌భుత్వ మెడిక‌ల్ అధికారుల‌కు, లేదా ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ను సంప్ర‌దించాలి.  రోజు రోజుకీ తెలంగాణాలో హైద‌రాబాద్‌తో స‌హా జిల్లాల్లో పాజిటివ్ సంఖ్య పెరుగుత‌న్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు స‌హ‌క‌రించి క‌రోనా ప్ర‌మాదాన్ని నియంత్రించ‌డానికి ప్ర‌భుత్వంతో క‌లిసిరావాల‌ని కేటిఆర్ పిలుపునిచ్చారు. లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నందున ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే ఉండాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు మ‌రో సారి తెలిపారు. మార్చి నుండి లాక్ డౌన్ విధించినందున వలస కార్మికులు తమ రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లేందుకు తొందరపడుతున్నప్పటికీ, రోడ్లపైకి ఎవరిని అనుమతించరాదని తెలిపారు.  ఒకవేళ వలస కార్మికులు రోడ్లపైకి వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ వ్రుధా అవుతాయని పేర్కొన్నారు.

కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమిస్తే వెంట‌నే కేసు నమోదు!

తెలంగాణాలో 260 కంటైన్మెంట్ జోన్ లు! హైద‌రాబాద్‌లో 146 జోన్లు ఏర్పాటు చేశారు. కోవిడ్-19ను అరికట్టుటకు కంటైన్మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కే తారక రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో జిహెచ్ఎంసి పరిధిలోనే 146 జోన్లు ఉన్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీలలో మిగిలిన 114 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్లలో వున్న ప్రజలను ఇండ్లకే పరిమితం చేశారు.  మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల స్థానికంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు.  పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్ ను  ఇండ్ల వద్దకే సరఫరా చేస్తున్నారు. తదనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నియమించిన వాలెంటీర్లు, సిబ్బందిచే మాత్రమే నిత్యవసరాలను డోర్ డెలవరీ చేయించాలని మంత్రి కేటీఆర్ అధికారుల‌కు ఆదేశించారు. వాలెంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలని నిర్ణ‌యించారు.  కంటైన్మెంట్ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కేటీఆర్ అధికారుల‌ను హెచ్చ‌రించారు.  కంటైన్మెంట్ జోన్ లోని కుటుంబాల సెల్ నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకుంటున్నారు. కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లను తొలగించనున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు.  కొత్త కేసులు నమోదు కాకుండా కంటైన్మెంట్ నిబంధనలపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.  శానిటేషన్, స్ప్రేయింగ్, ఫీవర్ సర్వేలను తగు జాగ్రత్త లతో  నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. శానిటేషన్, స్ప్రేయింగ్ సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించేవిధంగా మానిటరింగ్ చేయాలని తెలిపారు. సోడియం హైఫో క్లోరైట్ ద్రావనం నిల్వలను ముందస్తుగా తెప్పించుకోవాలని తెలిపారు. శానిటేషన్ తో పాటు మురుగునీటి వ్యవస్థలను మానిటరింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. కంటైన్మెంట్ నిబంధనల అమలులో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, వాటర్ వర్క్స్ /ప్రజారోగ్య విభాగాలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటిఆర్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లను మానిటరింగ్ చేసేందుకు చేపట్టాల్సిన 12 ప్రధాన అంశాల గురించి అధికారులకు మంత్రి కె.టి.ఆర్ వివరించారు. 1) సరైన విధంగా బారీకేడింగ్ చేయాలి., 2) సంబంధిత శాఖల సిబ్బందిని నియమించాలి. 3) ఫీవర్ సర్వే కై పారమెడికల్ సిబ్బందిని నియమించాలి. 4) శానిటేషన్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి. 5) నిత్యవసర వస్తువులను ఇంటింటికి అందించుటకై ఏర్పాట్లు చేయాలి. 6) పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా కంటైన్మెంట్ నిబంధనలు పాటించాలని కోరుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి ప్రచారం చేయాలి. 7) ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయాలి. 8) ప్రతిరోజు మెడికల్ టీమ్, అధికారులు ప్రతి ఇంటిని సందర్శించాలి. 9) సీనియర్ అధికారులు కంటైన్మెంట్ ఏరియాని తనిఖీ చేయాలి. 10) కంటైన్మెంట్ జోెన్లలోని ప్రజలను ఇంటికే పరిమితం చేయాలి, వారి కదలికలను నియంత్రించాలి. 11) అత్యవసర వైద్య సేవలకై  అంబులెెన్స్ ను సిద్దంగా ఉంచాలి. 12)  బియ్యాన్ని పంపిణీ చేయాలి.

హైద‌రాబాద్ క‌రోనాకు హాట్‌స్పాట్ గా మారింది!

శుక్రవారం నాడు కొత్తగా మరో 66 కేసులు నమోదు కావ‌డంతో తెలంగాణాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 766కు చేరింది. ఇందులో 37కేసులు హైద‌రాబాద్‌కు చెందిన‌వి. హైద‌రాబాద్‌లో ఈ వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది.  గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఇప్ప‌ట్టి వ‌ర‌కు 409 కేసులు న‌మోదైయ్యాయి. ఇందులో 44 మంది కోలుకున్నారు. 12 మంది చ‌నిపోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల్ని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ వెల్లడించారు. కరోనా సోకిన వారిని కలిసిన వ్యక్తులకు కూడా వైద్య పరీక్షలు చేసినట్టు ఆయన తెలిపారు.  పాతబస్తీలో కరోనా వేగంగా విస్తరిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  పాతబస్తీలో మర్కజ్ లింకులు ఉండడం.. అలాగే ఆయా కుటుంబాల్లో ఎవరైనా వృద్ధులు చనిపోతే అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురు మాత్రమే అంత్యక్రియలకు హాజరవ్వాలని.. కానీ ఇటీవల జరిగిన రెండు సంఘటనల్లో అంత్యక్రియలకు వారి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మూడు రోజుల వ్యవధిలో 50కి పైగా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. పాతబస్తీలో మూడు ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. తలాబ్ కట్ట, రమ్నస్‌పురా, అలీబాగ్.   హైద‌రాబాద్‌లో రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో పోలీసు వాహ‌నాల ద్వారా  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక పరికరంతో ఫాగ్ శానిటైజేషన్ చేస్తున్నారు.  ప్రతి పోలీసు వాహనంలో ఫాగ్ శానిటైజేషన్ చేయిస్తున్నారు. దాని వలన వచ్చే మూడు నెలల వరకు ఎలాంటి బ్యాక్టీరియా వాహనాల్లోకి చేరదన్న ఉద్దేశంతో ఫాగ్ శానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల గుర్తింపు రద్దు

కార్పొరేట్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాక్  శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు నోటిసులు జారీ చేసింది. ఈ 68 కాలేజీలలో శ్రీచైతన్యకు సంబంధించినవి 18, నారాయణవి 26 కళాశాలలు ఉన్నాయి. సదరు కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. గతంలో నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలో అక్రమాలపై విచారణ చేపట్టి.. గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయాలనీ సామాజిక కార్యకర్త రాజేశ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టి రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలల వివరాలపై నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డును సూచించింది. అయితే మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపధ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్ధులపై ప్రభావం పడుతుందని.. అందుకే పరీక్షలు ముగిసిన తర్వాత గుర్తింపు లేని, నిబంధనలు పాటించిన కాలేజీలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. వాదోపవాదనలు విన్న హైకోర్టు ఎన్‌ఓసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకొని ఏప్రిల్‌ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు తాజాగా నిబంధనలు పాటించని కాలేజీలపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.

పెద్దోళ్ళు ఏది చేసినా, `నెట్టింట' అది వైరలే మరి.. ఏటంటారు!

అది కె సి ఆర్ ఫ్యామిలీ మెంబర్ల సరదా కాబట్టి, సోషల్ మీడియా అంతా ఒకటే హల్ చల్ అవుతోంది. లాక్ డౌన్ దెబ్బకి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన జుట్టుకు రిలీఫ్ ఇద్దామంటే, అదేనండీ 'కేశ సంస్కారం' చేద్దామనుకుంటే, ఒక్క సెలూన్ తెరిచి లేదాయె.. ఇంకేమి చేయాలో తెలియని ఒక పెద్ద మనిషిని ట్విట్టర్ వేదికగా కె టీ ఆర్ కు తన కేశ వేదన ను విన్నవించుకోవడం, తదనంతర నెట్టింటి సంభాషణలు మీరే చదవండి. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించడంతో బ్యూటీపార్లర్లు, సెలూన్లు కూడా మూతపడటంతో కటింగ్, షేవింగ్ చేసుకోవడం కూడా పెద్ద ఇబ్బందిగా మారింది. లాక్‌డౌన్‌ ఎత్తేసే వరకు ఇంకా ఎన్నిరోజులు పడుతుందో..హెయిర్ కటింగ్ చేసుకోకుండా ఇంకా ఎన్నిరోజులు ఉండాలనే దానిపై ఆందోళన చెందుతున్నారు. బార్బర్‌ షాపులు, సెలూన్లు ఎప్పుడెప్పుడు ఓపెన్‌ చేస్తారా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.  ఈ నేపథ్యంలో శరత్‌ చంద్ర అనే వ్యక్తి ఏప్రిల్‌ 20 తర్వాత సెలూన్లు ఓపెన్‌ చేసే అవకాశం ఉందా అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. లేకపోతే..తన భార్య హెయిర్‌ కట్‌ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని తెలిపాడు. అదే జరిగితే, లాక్‌డౌన్ తర్వాత కూడా తాను ఇంటికి పరిమితం కావాల్సి వస్తుందని సరదాగా వ్యాఖ్యానించాడు. దీనిపై కేటీఆర్‌ కూడా తమాషాగా బదులిచ్చారు.  భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లీనే తనకు హెయిర్ కట్‌ చేయడానికి తన భార్య అనుష్క శర్మకు అవకాశం ఇచ్చాడని గుర్తు చేశారు. నువ్వెందుకు ఆ అవకాశం ఇవ్వకూడదూ? అని కేటీఆర్ బదులిస్తూ..నవ్వుతున్న ఎమోజీని జత చేశారు.  కేటీఆర్ ట్వీట్‌కు మాజీ ఎంపీ కవిత కూడా స్పందిస్తూ.. ‘అన్నయ్యా.. బాబీకి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా ?!  అని అడిగారు. ప్రస్తుతం ఈ సంభాషణపై నెటిజన్లు  ఆసక్తికరంగా కామెంట్లు చేస్తుండటంతో ట్విటర్‌లో వైరల్‌గా మారింది. అదండీ సంగతి.

సొంత ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.. విశాఖలో ఎంపీ సాయిరెడ్డి రక్తదానం...

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం రక్తదాన శిబిరాలపై నిషేధం విధించింది. స్వచ్చంద సంస్ధలు కానీ, రాజకీయ నేతలు కానీ, బ్లడ్ బ్యాంకులు కానీ రక్తదాన శిబిరాలు నిర్వహించడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ధిక్కరించారు. సొంత ప్రభుత్వమే కదా ఏం చేస్తుందని భావించారో ఏమో ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ.. వైజాగ్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని విజయసాయిరెడ్డి ప్రారంభించారు. తాను కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.  అయితే ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా రక్తదాన శిబిరాలనుద్దేశించి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నెల 14న ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రక్తదాన శిబిరాలపై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటనలో పేర్కొంది. అయితే తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే వారిని దృష్టిలో పెట్టుకుని నిబంధనల్లో కొన్ని సడలింపులు చేసింది. రోగుల రక్తమార్పిడి, చికిత్స, సేవల కొరకు సంబంధిత ఆసుపత్రులకు వెళ్లడానికి వీలుగా ఆ సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులను, రక్తమార్పిడి అవసరాన్ని తెలిపే ఆధారాలను పోలీసులకు చూపించి అనుమతి తీసుకోవాలని తెలిపింది. రెగ్యులర్‌గా ఆసుపత్రులను సందర్శించే వీలుగా పాస్‌లను జారీ చేస్తారని ప్రకటించింది. ఆ తర్వాతే రక్తదానం చేయాలి. ఈ నిబంధనను అస్సలు పట్టించుకోలేదు. ఇక రక్తదాన శిబిరంలోనూ భౌతిక దూరం పాటించే విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. విజయసాయిరెడ్డి రక్తదానం చేస్తుంటే వైసీపీ నేతలు ఆయన చుట్టూ చేరి గుంపుగా నిల్చున్నారు. దీనికి తోడు వైద్య సిబ్బంది సాధారణ మాస్కులు ధరిస్తే.. విజయసాయిరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్-95 మాస్కులు ధరించి ఉన్నారు.దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా ఈ విధంగా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు ఇలా నిబంధనలకు తూట్లు పొడిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

విశాఖ కరోనా కేసుల లెక్కపై భిన్నాభిప్రాయాలు.. కావాలనే దాస్తున్నారా?

ఏపీ కొత్త రాజధానిగా ప్రభుత్వం ఎంపిక చేసిన విశాఖపట్నంలో పది రోజులుగా ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్మగలరా ? అవును ఇదే నిజమంటోంది వైసీపీ సర్కారు. అంతర్జాతీయ విమానాశ్రయం కలిగిన విశాఖపట్నంలోనే కరోనా తొలి నాళ్లలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా నమోదవుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటివరకూ సాగర తీరంలో నమోదైన కేసుల సంఖ్య 20 మాత్రమే. అందులోనూ 10 మంది ఇప్పటికే చికిత్స పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. మరో పది మంది మాత్రమే ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స తీసుకుంటున్నారు. రేపోమాపో వీరిని కూడా విడుదల చేసే అవకాశముంది.  విశాఖపట్నంలో కొత్త రాజధాని రాబోతున్న నేపథ్యంలో అంత కంటే ముందే వచ్చేసిన కరోనా వైరస్ ప్రభావాన్ని ఎలా తగ్గించాలా అని ఏపీ ప్రభుత్వం ఆలోచించని రోజు లేదు. ఇప్పటికే అక్కడ విమ్స్ ప్రత్యేక కోవిడ్ 19 ఆస్పత్రితో పాటు క్వారంటైన్ చర్యలు కూడా ఘనంగా సాగుతున్నాయి. దీంతో అక్కడ నిత్యం ఒక్క కొత్త కేసు కూడా నమోదు కావడం లేదు. ఇదీ వైసీపీ ప్రభుత్వ వాదన. కానీ అక్కడ పరిస్ధితి అంత గొప్పగా ఉందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్దితి. నిన్నటికి నిన్న కేజీహెచ్ లో పేషెంట్లకు కరోనా చికిత్స అందిస్తున్న ఐదుగురు నర్సులకు కోవిడ్ 19 లక్షణాలు కనిపించాయి. వీరికి నిబంధనల ప్రకారం రోజువారీ డ్యూటీలు చేయించాల్సి ఉండగా, అదనపు గంటలతో పాటు అదనపు రోజుల్లోనూ సేవలకు వాడుకుంటున్నారు. దింతో వీరికి కోవిడ్ 18 లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు. పని చేయకపోతే ఉద్యోగాలు పోతాయన్న భయంతో నర్సులు రోజువారీ విధులకు హాజరవుతూ కరోనా బారిన పడినట్లు స్ధానికంగా ప్రచారం జరుగుతోంది. ఇదే కోవలో విశాఖ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ లక్షణాలతో జనం ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కొత్త కేసే నమోదు కాలేదని చెబుతోంది. ఇదే అంశంపై ఇవాళ మాట్లాడిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం ప్రభుత్వ లెక్కలపై అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. త్వరలో విశాఖకు రాజధానిని తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం కావాలనే కరోనా ప్రభావాన్ని తక్కువ చేసి చూపుతోందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. స్ధానికంగా జరుగుతున్న ఇతర పరిణామాలను బట్టి చూసినా ప్రభుత్వ వాదనపై అనుమానాలు తప్పడం లేదు. కానీ రాష్ట్రంలోనే కరోనా లేదని చెప్పే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నియంత్రణ చర్యలకు దిగినట్లు.. విశాఖలోనూ పరిస్ధితి అదుపు తప్పితే అప్పుడు వాస్తవాలు ఒప్పుకోక తప్పదనే వాదన వినిపిస్తోంది. 

కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ లో లేరా, అంటూ బొత్స సెటైర్లు!

* విశాఖలో కరోనా రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారా..?కరోనా కేసులను మేం దాస్తే.. చంద్రబాబు బయటపెట్టొచ్చుగా..? ఏంటండి ఈ మాటలు: బొత్స  * ప్రజల్లో ఆందోళన పెంచే విధంగా చంద్రబాబు కామెంట్లు చేస్తున్నారు: బొత్స  * రాయపాటి ఈరోజు ఒకటి మాట్లాడతారు...తర్వాత నా భావం అదికాదంటారు....అతనేదో ఓ భావం చెబితే మనం కరెక్ట్ గా రియాక్ట్ అవ్వచ్చు కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నారా, లేరా అనే డౌట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సడెన్ గా వచ్చింది.  కరోనా పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై  శ్వేతపత్రం ప్రకటించాలని రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారనే అంశాన్ని, బొత్స ముందు ప్రస్తావించగా, ఆయన పై విధంగా స్పందించారు.  " ప్రతిరోజు కరోనా నియంత్రణ చర్యలు, ఇతర అంశాలపై ప్రభుత్వం వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడి చేస్తోంది. కన్నాలక్ష్మీనారయణగారు ఈ రాష్ట్రం లో లేరా", అని మంత్రి బొత్సవ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం,వ్యవసాయఉత్పత్తులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా మధ్దతు,గిట్టుబాటుధరలు వచ్చేవిధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, కరోనా లాక్ డౌన్ అంశంలో కేంద్రప్రభుత్వంతో రాష్ట్ర అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా టెస్టుల సామర్ధ్యం పెంచుకున్నాం.ఫిబ్రవరి లో 50 మందికి కూడా టెస్ట్ లు చేసే సామర్ధ్యం లేని పరిస్దితినుంచి నేడు రోజుకు 2 వేల పైబడి నిర్ధారణ టెస్టులు నిర్వహించేలా చేయగలిగామని బొత్స పేర్కొన్నారు. పది నిమిషాల్లో టెస్టు రిజల్ట్స్ వచ్చే ఎక్విప్ మెంట్  సిద్దంగా ఉంది.లక్ష కరోనా టెస్టింగ్ కిట్లను స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలనుంచి తెప్పించి అందుబాటులోకి తెచ్చామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటరీవ్యవస్ద ద్వారా ప్రతి ఇంట్లో ఆరోగ్యపరిస్దితులు తెలుసుకుని, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.  రెడ్ జోన్లలో మందులు,నిత్యావసరాలు,కూరగాయలు అందిస్తున్నాం.నిత్యం ముఖ్యమంత్రి సమీక్షచేస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ రకంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు, టీడీపీ చేసే తప్పుడు ప్రచారం బాధ కలిగిస్తోందని బొత్స వాపోయారు. " పేదల ప్రాణాలతో ఆడుకోవద్దని చంద్రబాబు అంటున్నారు.సూటిగా ఆయనను అడుగుతున్నాను. హైదరాబాదులో కూర్చొన్న చంద్రబాబుకు,ఆయన కుమారుడికి ఏపీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. మీకున్న ఛానల్స్,పత్రికలు రాజకీయకోణంలో ఆలోచన చేస్తున్నారు తప్పితే మరేం చేయడంలేదు.దేశంలో కరోనా టెస్ట్ లు అత్యధికంగా చేస్తున్న ఐదారు రాష్ట్రాలలో ఏపి ఉందా... లేదా... ఇది వాస్తవం కాదా," అని బొత్స ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరి కాదు.పరీక్షల విషయంలో ఏపీ మిగిలిన రాష్ట్రాలకంటే ముందంజలోనే ఉంది. చంద్రబాబు మాట్లాడుతున్నమాటలు దివాళాకోరు రాజకీయాలు కాదా... .ఇక్కడ పొరపాట్లు జరిగాయని చెప్పండి. లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటాం.. కానీ అడ్డగోలుగా రాష్ట్రంలో ఏమీ జరగడంలేదు.. ఏం చేయడం లేదంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. విశాఖలో కరోనా పరీక్షలు చేయడం లేదని....వాస్తవాలు చెప్పడం లేదని ఎందుకంటే.... రాజధానిని అక్కడకు తరలిస్తారని, ఆ ఎఫెక్ట్ పడుతుందనే దిశగా టీడీపీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  " హైదరాబాదులో పాజిటీవ్ కేసులున్నాయని తెలంగాణ రాజధానిని మార్చేస్తారా..?...ముంబైలో పాజిటీవ్ కేసులున్నాయని మహారాష్ట్ర రాజధానిని మార్చేస్తారా..?మీకు ఆలోచన ఉందా...భాధ్యతఉందా...మీరు మనుషులా...విమర్శలు చేసే ముందు అర్ధం ఉండక్కర్లేదా..? కరోనా కేసులు దాచేస్తే.. ఎంత ప్రమాదమో మాకు తెలీదా..? ప్రతి అంశాన్ని సూక్ష్ణస్దాయిలో పరిశీలన చేసి సిఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు," అని బొత్స తీవ్ర స్వరంతో చెప్పారు.  మీ నేతలకు ఏమైంది బుధ్ది....విశాఖలో రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి.పెద్ద పెద్ద ఆస్పత్రులు పది ఉన్నాయి.అక్కడ ఉన్నవాటిని స్టాండ్ బైలో పెట్టాం.అత్యవసరపరిస్థితులు వచ్చినా తట్టుకునేవిధంగా కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని కూడా మంత్రి వివరించారు. పేషంట్లకు ఎలా చికిత్స అందించాలి.ఎంతమంది డాక్టర్లు ఉండాలి అనే ఇతర అంశాలను సైతం పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. శాంపిల్ లెక్కలు చెబుతుంటే ఈ లెక్కలకు ఆ లెక్కలకు పొంతనలేదంటూ మాట్లాడుతున్నారు.ఇదేమైనా ఆర్దికలెక్కలా...ఏ ఒక్కరికైనా సరే ఆరోగ్యానికి సంబంధించిగాని,క్వారంటైన్ సెంటర్లలో ఇబ్బందులు ఉంటే అవి మాకు చెప్పండని కూడా బొత్స సూచించారు.

విపత్తు సమయంలో ఏపీ సీఎం ముందుచూపు

* బీమాలో ప్రభుత్వం వాటా వెంటనే చెల్లింపు * రూ. 400 కోట్ల బీమా చెల్లింపునకు జగన్ నిర్ణయం * గత ఏడాది నవంబర్‌ నుంచి క్లెయిమ్‌లను పరిష్కరించని ఎల్‌ఐసీ * ఇప్పటికే పలుమార్లు ప్రధాన మంత్రి సీఎం లేఖలు * ప్రధానమంత్రి నుంచి ఎల్‌ఐసీకి లేఖ * అయినా పరిష్కారానికి నోచుకోని బీమా క్లెయిములు * దీనికోసం పోరాటం కొనసాగిస్తూనే ప్రభుత్వ వాటాను నేరుగా బీమాదారులకు చెల్లించాలని సీఎం నిర్ణయం * రేపటి నుంచి (శనివారం) చెల్లింపులకు నిర్ణయం * ఎల్‌ఐసీ ఇవ్వకుంటే.. మిగిలిన మొత్తాన్ని కూడా రాష్ట్రఖజానానుంచే ఇవ్వాలని సీఎం ఆదేశం విపత్తు సమయంలో  ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బీమా క్లెయిములు ఎల్‌ఐసీ మంజూరుచేయకున్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ నిర్ణయించారు. గడచిన నవంబర్‌ నుంచి పరిష్కారం కాని క్లెయిముల కుటుంబాలకు వెంటనే చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఈమేరకు శనివారం ( రేపటి ) నుంచి డబ్బులను ఆయా కుటుంబాలకు అందించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లాంటి సదుపాయాల్లేని వారు, కూలిపనులు చేసుకునేవారు, చిన్న  జీతాలతో నెట్టుకు వస్తున్న వారు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు  సహజమరణం చెందినా, లేదా ప్రమాదవశాత్తూ మరణించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎల్‌ఐసీ కలిసి బీమాను అందించేవి. వయస్సుల వారీగా, సహజ మరణానికి ఒక తరహా బీమా, ప్రమాదవశాత్తూ మరణిస్తే మరో రకమైన బీమాను చెల్లించేవి. అయితే గడచిన నవంబర్‌ నుంచి ఈ క్లెయిములు పరిష్కారం నిలిచిపోయింది. ఈ అంశంపై వెంటనే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి  4 సార్లు లేఖ రాశారు. ప్రధాని మోదీకూడా ఎల్‌ఐసీకి లేఖరాశారు. అయినా సరే ఇప్పటివరకూ క్లెయిమ్‌లను మంజూరుచేయలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సహజ మరణాలవల్లో, ప్రమాదాల వల్లో పెద్ద దిక్కును కోల్పోయిన ఆయా కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. క్లెయిమ్‌ల మంజూరు కోసం పోరాటం చేస్తూనే, దానితో ఆగిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా సుమారు రూ. 400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.  ఒకవేళ బీమా సంస్థ తాను ఇవ్వాల్సిన దాన్ని చెల్లించకున్నా.., బీమా సంస్థ ఇవ్వాల్సిన మొత్తాన్నికూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాలని సీఎం  నిర్ణయించారు. కరోనా లాంటి విపత్తు నెలకొన్న పరిస్థితుల్లో, ప్రభుత్వం ఆదాయం పడిపోయిన సమయంలోకూడా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీక్షా రాజ‌కీయాలతో వేడిపుట్టిస్తున్న నేత‌లు!

ఓ వైపు కరోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. మ‌రో వైపు రాజ‌కీయ నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌డానికి కారణాలు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా విపక్ష టీడీపీ, సీపీఐ పార్టీల నేతలు కరోనా సాయం పేరిట ఎవరి ఇళ్ళలో వారు ధర్నాలు, దీక్షలంటూ కూర్చుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాలను రక్తికట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలోనూ రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్ర‌చారం చేసుకుంటూ బిజీగా గ‌డ‌ప‌డానికే ఏపీ నేత‌లు ఉత్సాహం చూపుతున్నారు. వీరి నినాదం ఒక్క‌టే పేద‌ల‌కు ఆర్థిక స‌హాయం చేయాలి. క‌రోనాను వెంట‌నే నియంత్రించాలి. ఇదే రాజ‌కీయం. విశాఖ, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ, సీపీఐ నేతలు దీక్షలు నిర్వహించారు. వీరిలో కొందరు పేదలకు కరోనా సాయం కింద 5 వేల నుంచి 10 వేల రూపాయల దాకా ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తే మరికొందరు అఖిల పక్ష సమావేశాలు నిర్వహించి, కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని విఙ్ఞప్తి చేశారు. ఆర్థిక సాయం పేరిట నిరాహార దీక్షలకు దిగుతున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వర రావు తన ఇంట్లోనే 12 గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. రేషన్ కార్డు ఉన్నా, లేకపోయినా పేదలందరికీ 5000 రూపాయలు ఇవ్వాలని, అన్నా క్యాంటీన్లు తెరిచి పేదలకు టిఫిన్, భోజనం అందించాలని, కరోనా వైరస్‌పై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఇతర అధికారులందరికీ నాణ్యమైన రక్షణ కిట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. క్వారెంటైన్ పీరియడ్ పూర్తి చేసిన ప్రతి ఒక్క పేదకు 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్, మాల్యాద్రి నిరాహారదీక్షకు కూర్చున్నారు. లాక్ డౌన్ నేపద్యంలో ఒక్కో పేదవాడికి 10 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలను ప్రారంభించిన ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వీరి దీక్షలను ప్రారంభించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ స్థాయిలో మోదీ అందరితో మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యలను తీసుకుంటుంటే.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఒంటెద్దుపోకడలకు పోతోందని రామకృష్ణ విమర్శించారు.