భారత్ బయోటెక్ లో విదేశీ ప్రతినిధులు! కరోనా టీకా తయారీని వివరించిన డాక్టర్ కృష్ణ ఎల్లా 

హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ ఫార్మా సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి వస్తోంది. కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ ఫార్మాను ప్రపంచ దేశాల ప్రతినిధులు సందర్శిస్తున్నారు. భారత్‌లో కరోనా టీకాల తయారీపై అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్న 64 దేశాల రాయబారులు జినోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ, ఇప్పటివరకు రెండు దశల ప్రయోగాల్లో వచ్చిన ఫలితాలు, దేశ అవసరాలకు సరిపోయే స్థాయిలో తయారుచేసే సామర్థ్యం తదితర అనేక అంశాలపై వీరు సమీక్షించారు. టీకా కోసం జరుగుతున్న పరిశోధనల సమాచారాన్ని ఈ సందర్భంగా విదేశీ రాయబారులతో పంచుకున్నారు  భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా.  కొవాగ్జిన్‌ టీకా వివరాలతో పాటు సంస్థ ప్రస్థానాన్ని ఆయన వివరించారు.  టీకా రంగంలో భారత్‌ ఎన్నో ప్రయోగాలు చేస్తోందని చెప్పారు డాక్టర్‌ కృష్ణ ఎల్లా. అనేక విదేశీ సంస్థలతో భారత్‌ బయోటెక్‌ ప్రయోగాలు చేస్తోందన్నారు. సానుకూల దృక్పథంతో తమ సంస్థ ముందుకు సాగుతోందని  డాక్టర్‌ కృష్ణ ఎల్లా చెప్పారు.       భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు మన దేశంలో ఉన్న వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, ఆ దేశాలకు చెందిన వైద్య నిపుణులు, వైద్యారోగ్య రంగంలో పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తున్నారు. హెడ్స్ ఆఫ్ మిషన్ అనే పేరుతో వస్తున్న 80 దేశాలకు చెందిన ప్రతినిధుల్లో అరవై మంది ఆయా దేశాల అంబాసిడర్లు (రాయబారులు) ఉన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, డెన్మార్క్, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్… ఇలా చాలా దేశాలకు చెందినవారు ఉన్నారు. ఇందులో భాగంగా రెండు బృందాలుగా హైదరాబాద్ కు వచ్చారు విదేశీ ప్రతినిధులు. ఒక బృందం జినోమ్‌వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను.. మరో బృందం బయోలాజికల్‌-ఇ సంస్థను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించాయి. భారత్‌ బయోటెక్‌ను గతంలో ఎందరో ప్రముఖులు సందర్శించారు. పదిరోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ కూడా వచ్చి వెళ్లారు.

రీ ట్వీట్లలో విజయ్, లైకుల్లో కోహ్లి! ఈ ఏడాది ట్విట్టర్ టాప్ లిస్ట్ ఇదే 

కరోనా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, హాథ్రస్‌ అత్యాచారం, షాహిన్‌బాగ్‌ అల్లర్లు, రైతుల నిరసన.. ఇవి ఈ ఏడాది  ట్విటర్‌లో ఎక్కువ చర్చనీయాంశమైన అంశాల జాబితాలో నిలిచాయి. రామాయణ్, మహాభారత్‌ కార్యక్రమాలను తిరిగి టీవీలో ప్రసారం చేయడంపైనా ఎక్కువ మంది ట్విటర్‌లో చర్చించుకున్నారు.  స్టూడెంట్‌ లైవ్స్‌ మ్యాటర్ కూడా ట్విట్టర్ లో ట్రెండింగులో నిలిచాయి. ఈ ఏడాది  ట్రెండింగ్‌లో నిలిచిన ట్వీట్లను ట్విటర్‌ ఇండియా సంస్థ  అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో జనవరి 1 నుంచి నవంబరు 15 మధ్య ట్రెండ్ అయిన  ట్వీట్లకు ఈ జాబితాలో స్థానం కల్పించింది.    తమిళ సూపర్ స్టార్ విజయ్‌ రీ ట్వీట్లలో టాప్ గా నిలిచారు. అభిమానులతో కలసి తీసుకున్న విజయ్ సెల్ఫీకి అత్యధికంగా 1.61 లక్షలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన సతీమణి అనుష్కశర్మ ప్రెగ్నెన్సీ విషయాన్ని పంచుకుంటూ చేసిన ట్వీట్‌ 6.44 లక్షలకు పైగా లైకులు సాధించి తొలి స్థానంలో నిలిచింది.  కొవిడ్‌ సంక్షోభ సమయంలో భారతీయుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఇళ్లలో దీపాలు వెలిగించాలని ఏప్రిల్‌ 3న ప్రధాని నరేంద్ర మోడీ  చేసిన ట్వీట్‌కు ట్విట్టర్  ప్రత్యేక గుర్తింపు దక్కింది. రాజకీయ రంగానికి సంబంధించి ఈ ఏడాది అత్యధిక రీట్వీట్‌లు పొందిన ట్వీట్‌గా ప్రధాని మోడీ ట్వీట్  నిలిచింది. పీఎం ట్వీట్‌ను 1.18 లక్షల మందికి పైగా రీట్వీట్‌ చేయగా, 5.13 లక్షల మంది లైక్‌ చేశారు.    భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ చేసిన ఓ ట్వీట్‌ క్రీడారంగంలో అత్యధిక రీట్వీట్లు పొందిన ట్వీట్‌గా నిలిచింది. తను క్రికెట్‌ నుంచి రిటెర్మెంట్‌ ప్రకటించినప్పుడు ప్రధాని మోడీ తనకు ప్రత్యేకంగా రాసిన లేఖను పంచుకుంటూ ధోనీ ఆ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌తో కుదేలైన వర్గాల ప్రజలను ఆదుకుంటానంటూ రతన్‌ టాటా చేసిన ట్వీట్‌ వ్యాపార రంగంలో అత్యధిక రీట్వీట్లు సాధించింది. బాలీవుడ్‌ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ తనకు కరోనా సోకిన విషయాన్ని పంచుకుంటూ చేసిన ట్వీట్‌ను ట్విటర్‌ ఇండియా గోల్డెన్‌ ట్వీట్లలో ఒకటిగా ఎంపిక చేసింది.

రైతుల ఆందోళనతో దిగొస్తున్న కేంద్రం! వ్యవసాయ చట్టాల్లో సవరణలకు సుముఖం? 

అన్నదాతల అలుపెరగని పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగొస్తున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు మోడీ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలు, ఏపీఎంసీల్లో ఓకే ట్యాక్స్‌‌పై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నూతన వ్యవసాయ చట్టాల్లో ఐదు సవరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.  ఏపీఎంసీలను బంద్‌ చేయబోమని, రైతులు-వ్యాపారుల మధ్య ఒప్పంద వివాదాలను పరిష్కరించే ఎస్‌డీఎం అధికారాలను రైతుల సూచనల మేరకు సవరిస్తామని, కనీస మద్దతు ధరకు లిఖితపూర్వక హామీ ఇస్తామని, విద్యుత్తు చట్ట సవరణ బిల్లుపై రైతులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని, పంజాబ్‌లో పంట కోతల తర్వాత వెలువడే వ్యర్థాల దహనానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం రైతు సంఘాల ప్రతినిధులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.    మోడీ సర్కార్ తీసుకొచ్చిన  కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ  సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా  సింఘు, టిక్రీ రహదారులపై వేలాది మంది రైతులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు మంగళవారం నిర్వహించిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. బంద్ కు పలు రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు  మద్దతు ప్రకటించాయి. పలు రాష్ట్రాల్లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. రైతులతో పాటు పలు పార్టీల రాజకీయ నాయకులు కూడా రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.    భారత్ బంద్ తో  కేంద్ర సర్కార్ లో కదలిక వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రైతు నేతల మధ్య బుధవారం చర్చలు జరగాల్సి ఉండగా..  ఒకరోజు ముందుగానే అమిత్ షా రైతు నాయకులతో సమావేశమయ్యారు. అయితే ఈసారి కూడా రైతులు ప్రభుత్వం ప్రతిపాదనలను అంగీకరించలేదు. దీంతో బుధవారం  జరగాల్సిన చర్చలను రద్దు చేశారు. అయితే సవరణలకు సంబంధించిన అంశాలను బుధవారం లిఖితపూర్వకంగా అందిస్తామని, వాటిపై ఇతర రైతు సంఘాలతోనూ చర్చలు జరపాలని అమిత్‌షా సూచించారు. దీనికి రైతులు అంగీకరించినట్లే కన్పించింది. సవరణల జాబితాను ప్రభుత్వం లిఖితపూర్వకంగా అందించిన తర్వాత  సింఘ సరిహద్దులో 40 రైతు సంఘాల ప్రతినిధులు సమావేశమై.. కేంద్ర సర్కార్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఆ తర్వాతే ఆందోళన కొనసాగిస్తారా లేక కేంద్రంతో చర్చలకు వెళతారా అన్నది నిర్ణయించనున్నారు.

సచివాలయం కోసమే సెంట్రల్ విస్టాకు ప్రశంసలు! కమలం నేతలు ఇక కామేనా? 

రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దిట్టగా చెప్పుకుంటారు. కొన్ని సార్లు ఆయన ఎత్తులు విఫలమైనా ఎక్కువ సార్లు ఆయన సక్సెస్ అయ్యారనే చెబుతారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన ఎప్పటికప్పుడు తన ప్లాన్స్ మారుస్తూ వస్తున్నారు. పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురైనా, ప్రజల్లో తమపై వ్యతిరేకత వచ్చినట్లు గుర్తించినా, విపక్షాలను దెబ్బకొట్టాలన్నా కొత్త కార్యాచరణ రూపొందిస్తుంటారు గులాబీ బాస్. తాజాగా  ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ రాసిన లేఖ కూడా అందులో భాగమేననే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటోంది బీజేపీ. ఈ పరిస్థితుల్లో కేంద్ర సర్కార్ నిర్మించ తలపెట్టిన కొత్త పార్లమెంట్ నిర్మాణాన్ని ప్రశంసిస్తూ ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.    ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కొత్త పార్లమెంట్ దేశ ఆత్మగౌరవానికి, జాతికే గర్వకారణమని అభివర్ణించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేస్తుందని పేర్కొన్నారు.  కొత్త పార్లమెంట్ పనులకు శంకుస్థాపన చేయడం గర్వకారణమని మోడీని అభినందించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని  కోరుకుంటున్నానని తెలిపారు.   ప్రధానిని ప్రశంసిస్తూ కేసీఆర్ లేఖ రాయడం వెనక బలమైన కారణం ఉందంటున్నారు. హైదరాబాద్ తో తాము నిర్మించ తలబెట్టిన కొత్త సచివాలయ నిర్మాణం  కోసమే ప్రధానిని కేసీఆర్ అభినందిస్తున్నారని చెబుతున్నారు. కొత్త సచివాలయం నిర్మాణాన్ని బీజేపీ సహా ప్రతి పక్షాలన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేశాయి. కొత్త సచివాలయ నిర్మాణంపై  విపక్షాలు, జనాల నుంచి వస్తున్న వ్యతిరేకతకు చెక్ పెట్టేందుకు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కేసీఆర్ అస్త్రంగా మార్చుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    హైదరాబాద్ లో  కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారు కేసీఆర్.  విపక్షాలు ఎంతగా ఆందోళనలు చేసినా వెనక్కి తగ్గలేదు. సచివాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. కొత్త నిర్మాణాల కోసం పాత సచివాలయాన్ని కరోనా సమయంలో అర్ధరాత్రి హడావుడిగా కూల్చేశారు. సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి. అయితే కొత్త సచివాలయ నిర్మాణంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. ప్రజా ధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తోంది. కొత్త సచివాలయ నిర్మాణంపై జనాల్లో కూడా వ్యతిరేకత కనిపించింది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఉన్న భవనాన్ని కూల్చేసి.. కొత్తది కట్టాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలు ప్రజల నుంచి వచ్చాయి. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విపక్షాలు సచివాలయ అంశాన్ని కూడా ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. సచివాలయం అంశం ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిందని కూడా చెబుతున్నారు.    కొత్త సచివాలయంపై విపక్షాలు, జనాల నుంచి విమర్శలతో నిర్మాణ పనులపై జాప్యం చేస్తూ వస్తోంది కేసీఆర్ సర్కార్. ఇప్పుడు ఢిల్లీలో కొత్త పార్లమెంట్ నిర్మాణానికి కేంద్ర సర్కార్ డిజైన్ ఫైనల్ చేయడం, శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయడంతో కేసీఆర్ కు ఇదో మంచి అవకాశంగా నిలిచింది. దీంతో వెంటనే యాక్షన్ లోకి దిగారు కేసీఆర్. ఢిల్లీలో కట్టబోతున్న కొత్త పార్లమెంట్ నిర్మాణాలను స్వాగతిస్తూ ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాసేశారు  పార్లమెంట్ కొత్త భవనాన్ని స్వాగతించడం ద్వారా కొత్త సచివాలయంపై విమర్శలు చేస్తున్న తెలంగాణ బీజేపీ నేతలను కట్టడి చేసే వ్యూహంలో  భాగంగానే కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారాని భావిస్తున్నారు. ఢిల్లీలో పార్లమెంట్ కు కొత్త భవనం కడుతున్నందున.. రాష్ట్రంలో నిర్మించబోతున్న సచివాలయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తే.. ఆ పార్టీ వైఖరి ప్రజలకు తెలిసిపోతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. బీజేపీతో పాటు ఇతర విపక్షాలు కూడా ఇప్పుడు గతంలో  ఉన్నంత  దూకుడుగా సచివాలయ నిర్మాణ విషయంలో కేసీఆర్ ను టార్గెట్ చేసే అవకాశం ఉండదని రాజకీయ అనలిస్టుల అభిప్రాయం. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రం ఇది చాలా ఇబ్బంకరంగా మారే అంశమని, కొత్త సచివాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా తెలంగాణ కమలం నేతలు ఇకపై మాట్లాడకపోవచ్చనే అభిప్రాయం పొలిటికల్ అనలిస్టుల నుంచి వస్తోంది.

అనంతపురంలో మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన

అనంతపురం జిల్లాలోని మూడు రిజర్వాయర్లకు ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్ల అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి భూమిపూజ చేశారు. వెంకటంపల్లి వద్ద ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ, అప్పల రాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.    ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని అన్నారు. గత ప్రభుత్వం జీవో ఇచ్చి, పనులు మాత్రం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు స్టోరేజీ కెపాసిటీని కూడా పెంచామన్నారు. ఈ పనుల వల్ల రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్లు.. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలించనున్నట్లు తెలిపారు.  దాంతో 7 మండలాలకు మేలు జరుగుతోందన్నారు. రిజర్వాయర్లు, ప్రధాన కాల్వల కోసం రూ. 800 కోట్లు విడుదల చేశామని సీఎం చెప్పారు.  

ఏపీ సీఎం జగన్ పై విష్ణుకుమార్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ 

ఏపీ సీఎం జగన్‌ పై బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌ను నియంత అయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో పోలుస్తూ విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి అని సంబోధిస్తూ.. జగన్‌కు ప్రజల కష్టాలు ఏమాత్రం తెలియడం లేదని విమర్శించారు. గతంలో రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని సీఎం జగన్ చెప్పారని.. అయితే రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చని అయన ఎద్దేవా చేశారు. ఉపముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే.. ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎంని చేసి జగన్ చరిత్ర సృష్టించాలని అయన అన్నారు. జగన్ సతీమణి భారతి రాష్ట్రానికి తదుపరి సీఎం అయితే ప్రజలు సంతోషిస్తారని.. అంతేకాకుండా ఆమె ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని... మొన్న మార్చిలో అక్రమాలు జరిగినందున ఏకగ్రీవాలను రద్దు చేయాలని విష్ణుకుమార్‌ రాజు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

సీఎం జగన్ సొంత ఊరిలోని మహిళకే రక్షణ లేదు.. లోకేష్ ఫైర్ 

ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని అయితే వాటిని అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేసారు. సాక్షాత్తు సీఎం జగన్ గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అయన విమర్శించారు. ప్రభుత్వం కేవలం చట్టాల పేరు చెబుతూ కాలయాపన చేస్తోంది తప్ప మృగాళ్లను శిక్షించింది లేదని అయన మండిపడ్డారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా లోకేష్ ఈ విమర్శలు చేశారు.   "రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో ఓ దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైంది. అయితే ఈ విషయం బయటకి రాకుండా చెయ్యడానికి జగన్ ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ.. మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి. అంతేకాకుండా ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి అత్యంత కిరాతకంగా నాగమ్మని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి" అని లోకేశ్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

కొత్త పార్లమెంట్ జాతికే గర్వ కారణం! ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ 

భారత ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. వర్చువల్ ద్వారా కొత్త పార్లమెంట్ శంకుస్థాపనకు హాజరవుతానని లేఖలో కేసీఆర్ వెల్లడించారు. కొత్త పార్లమెంట్ దేశ ఆత్మగౌరవానికి, జాతికే గర్వకారణమని అభివర్ణించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేస్తుందని పేర్కొన్నారు.  కొత్త పార్లమెంట్ పనులకు శంకుస్థాపన చేయడం గర్వకారణమని మోడీని అభినందించారు కేసీఆర్. ఈ ప్రాజెక్టు ప్రారంభం విషయంలో చాలా కాలంగా జాప్యం జరుగుతోందన్నారు.  ప్ర‌స్తుత‌మున్న పార్ల‌మెంటు, కేంద్ర సచివాలయ భ‌వనాలు ప్రభుత్వ పనులకు పూర్తిస్థాయిలో స‌రిపోవ‌డం లేద‌న్నారు కేసీఆర్. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని  కోరుకుంటున్నానని తెలిపారు తెలంగాణ సీఎం. ప్రస్తుతం  తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.    పార్లమెంట్ కోసం కొత్తగా నిర్మించనున్న సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు  ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్స్‌ సంస్థ ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంటుగా వ్యవహరిస్తోంది.  'సెంట్రల్ విస్టా' ప్రాజెక్టు  మొత్తం వ్యయం దాదాపు రూ. 20,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రాజెక్ట్ కోసం గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ అందించింది. ఇందులో భాగంగా త్రిభుజాకారపు పార్లమెంట్ భవనంతో పాటు ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు ఉండే మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరిస్తారు.

ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ 

ఏలూరులో ప్రబలుతున్న వింత రోగంపై ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వందల సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నందున  ఏలూరులో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏలూరు పరిస్థితులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. రోజుకో రీతిలో రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని ఆయన అందులో పేర్కొన్నారు.  రేపు ఏం జరుగుతుందనే భయాందోళనలను ప్రభుత్వం తొలగించాలని కోరారు.    తాగునీటిలో సీసం, నికెల్‌ ఉన్నాయనే సమాచారంతో ప్రజలు భయపడుతున్నారన్నారు చంద్రబాబు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రస్తుత పరిస్థితి తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఏలూరులో ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ కార్డులు అందజేయాలని సూచించారు చంద్రబాబు. దీర్ఘకాలిక ప్రాతిపదికపై ప్రతి రోగిని నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య నిపుణులతో బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలన్నారు. హెల్ప్ లైన్‌ ఏర్పాటు ఆలోచన రాకపోవడం ప్రభుత్వ మరో వైఫల్యమని చంద్రబాబు విమర్శించారు. తక్షణమే బాధితుల కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత డిమాండ్‌ చేశారు. సత్వర ఉపశమన, సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి బాధితుడికి ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించాలన్నారు చంద్రబాబు.  

నెరేడ్ మెట్ లో టీఆర్ఎస్ విజయం! గ్రేటర్ లో 56కు చేరిన బలం 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిపోయిన నేరెడ్‌మెట్ డివిజన్ ఫలితం వెల్లడైంది.  668 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. నేరెడ్ మెట్ గెలుపుతో  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. నేరెడ్ మెట్ ఎన్నికల్లో మొత్తం 25 వేల 177 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు పూర్తయ్యాక టీఆర్ఎస్ కు మొత్తం 10, 330 ఓట్లు రాగా, బీజేపీ కు 9 వేల 662 ఓట్లు పోలయ్యాయి.    జీహెచ్‌ఎంసీ ఫలితాలు వచ్చిన ఈ నెల 4వ తేదీనే నేరేడ్‌మెట్‌ డివిజన్‌ లెక్కింపు చేపట్టారు. అయితే  టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీలో ఉన్నప్పటికీ ఇతర ముద్రతో ఉన్న ఓట్లు 544 ఉన్నాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ డివిజన్‌ ఫలితాన్ని ప్రకటించలేదు. తాజాగా ఇతర ముద్రలు ఉన్న ఓట్లు పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతించడంతో నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో లెక్కింపును చేపట్టారు. సైనిక్‌పురిలోని భవన్స్‌ వివేకానంద కళాశాలలో లెక్కింపు కొనసాగింది. ఇతర గుర్తులున్న 544 ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇంతకుముందు ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థే ఇక్కడ విజయం సాధించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం నుంచి కంటతడి పెడుతూ బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు బయటకు వచ్చారు. ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.

మోడీతో చేతులు కలిపి సిగ్గుపడ్డాను! ఒబామా పేరుతో నకిలీ ట్వీట్ వైరల్ 

అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా పేరుతో ఓ నకిలీ ట్వీట్ వైరల్ గా మారింది. భారతదేశ ప్రధానమంత్రిపై ఒబామా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఆ పోస్టు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే అది ఫేక్ ట్వీట్ అని తేలడంతో అంతా కూలయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో తాను చేతులు కలిపిన వేళ, ఎంతో సిగ్గుపడ్డానని బారక్ ఒబామా వ్యాఖ్యానించినట్టు ఆ ట్విట్టర్ పోస్ట్ ఉంది. డిసెంబర్ 5న ఒబామా తన సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా స్క్రీన్ షాట్ చూపుతుండగా, అది నకిలీదని తేలింది.    నరేంద్ర మోడీ, బారక్ ఒబామా ఇద్దరూ కలిసిన వేళ, షేక్ హ్యాండ్ ఇచ్చుకోగా, ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ "ఈ మనిషితో నేను ఇవాళ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి రావడం చాలా సిగ్గుచేటు" అని ఒబామా వ్యాఖ్యానించినట్టు ఆ ట్వీట్ కనిపిస్తోంది.. ఈ పోస్ట్ వైరల్ కాగానే దీనిలో ఎంత నిజముందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తర్వాత ఈ ట్వీట్ ను ఫేక్ ట్వీట్ గా తేల్చారు. నరేంద్ర మోడీ గురించి ఒబామా ఎన్నడూ అలా మాట్లాడలేదని ట్విట్టర్ 'అడ్వాన్డ్స్ రీసెర్చ్' సెట్టింగ్స్ ను వాడి కనిపెట్టారు. టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా దీన్నే నిర్ధారించింది. ఒకవేళ ఒబామా ఆ వ్యాఖ్యలు నిజంగా చేసివుంటే అది అంతర్జాతీయ వార్తగా మారి ఉండేదని, దీన్ని చూడగానే ఇది ఫేక్ ట్వీట్ అనే భావించామని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.

కేసీఆర్ పై రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది: విజయశాంతి

నియంతృత్వ పాలన సాగిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రిపై రైతులు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. భారత్‌ బంద్‌కు కేసీఆర్ మద్దతు తెలపడం పట్ల ఆమె ట్విట్టర్ ద్వారా  తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు బంధునని చెప్పుకుని, ఫాంహౌస్ రాజకీయాలతో రాబంధులా వ్యవహరించే సీఎం దొరగారి నిజ స్వరూపం తెలియడం వల్లే .. ఆయన తుపాకి రాముడు మాటలను నమ్మలేక దుబ్బాక ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని విజయశాంతి అన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన రైతులు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందని విజయశాంతి చెప్పారు.    కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలో జరిగిన బంద్‌లో చివరి క్షణంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం క్రెడిట్‌ని హైజాక్ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు తెగ ఆరాటపడ్డారు.. కాని సీఎం గారి ఎత్తుగడలు జీర్ణించుకోలేక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కొత్త వ్యూహంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయని విజయశాంతి ట్వీట్ లో  చెప్పారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన బంద్ చేశామని చెబుతున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు త్వరలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలపై ఆందోళన చెయ్యాలని నిర్ణయించినట్లు ఆ పార్టీల నేతలు చెబుతున్నారన్నారు. దీని ద్వారా కేసీఆర్‌ను కూడా ఇరకాటంలో పెట్టాలని వారి వ్యూహమని అని విజయశాంతి చెప్పారు. రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల బంద్ పిలుపునకు మద్దతిచ్చిన కేసీఆర్ గారు, మరి ఆ పార్టీలు తెలంగాణలో చేసే ఆందోళనల్ని కూడా సమర్థిస్తారా? అని విజయశాంతి ప్రశ్నించారు.

భారతీయులందరికి గొప్ప శుభవార్త.. డిసెంబర్ 25 నుండి వ్యాక్సిన్ పంపిణి షురూ

భారతదేశం మొత్తం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. గత 9 నెలలుగా దేశం లోని ప్రతి ఒక్కరిని భయ పెడుతున్న కరోనా మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్ ఈ డిసెంబర్ 25 నుండి భారత్ లో అందుబాటులోకి రానుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినమైన డిసెంబర్ 25న భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు కానుంది. భారత ప్రధాని మోడీ స్వయంగా టీకా పంపిణీని ప్రారంభిస్తారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకూ తెలియజేసింది. తొలిదశ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 20 రోజుల వ్యవధిలో.. అంటే, జనవరి 15 నాటికి కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన వైద్యసిబ్బందికి, పారిశుధ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత నుండి సామాన్య ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నారు.   వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే "కోవిన్" పేరిట ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారు కాగా.. దీనికి సంబంధించి లైవ్‌ డెమాన్‌స్ట్రేషన్‌పై.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. కొవిడ్‌ టీకా కార్యక్రమ ఏర్పాట్లను వేగవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్రాల అధికారులకు సూచించింది. ఈ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్ లో టీకాలు ఎలా అందించాలనే విషయాన్నివివరించింది. ఈ సాఫ్ట్ వేర్ లో పేరు నమోదైతేనే వ్యాక్సిన్ వేయాలని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు తరువాత కనీసం అరగంట పాటు అక్కడే ఉండాలని, వారికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ లేకుంటేనే ఇంటికి వెళ్లాల్సి వుంటుందని అధికారులు స్పష్టం చేసారు. ఇక ఈ "కోవిన్" సాఫ్ట్ వేర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఆధార్ కార్డు నంబర్ ను నమోదు చేయాల్సిన అవసరం లేదని, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను వైద్య బృందం తనిఖీ చేస్తుందని, ఆపై వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి గుర్తింపు కార్డు చూపి టీకాను తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.   వ్యాక్సిన్ తీసుకున్న వారి మొబైల్ ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుందని, ఆపై మూడు వారాల తరువాత రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన తేదీ గురించిన సమాచారాన్ని పంపుతామని, అంతేకాకుండా రెండు డోస్ లను తీసుకున్న వారికి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక ధ్రువపత్రం అందుతుందని తెలియజేశారు. ఇక వ్యాక్సిన్ కేంద్రంలో స్పాట్ రిజిస్ట్రేషన్ కు ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు మొదట ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ తీసుకున్నారో మూడు వారాల తర్వాత అదే కంపెనీ వ్యాక్సిన్‌ ను తీసుకోవాల్సి ఉంటుంది. మొదట ఒక కంపెనీ టీకా, రెండోసారి మరో కంపెనీ టీకా తీసుకుంటామంటే మాత్రం కుదరదు. ఇండియాలో ఇచ్చే వ్యాక్సిన్‌ మైనస్‌ 2, మైనస్‌ 8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ ఉండేదే వస్తుందని అధికారులు చెబుతున్నారు   ఇదిలావుండగా, ఇప్పటికే డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) వద్ద మూడు వ్యాక్సిన్ సంస్థలు అత్యవసర అనుమతి కోరుతూ దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు సమావేశం కానున్న నిపుణుల కమిటీ ఈ మూడింటిపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తొలి దశలో మొత్తం మూడు కోట్ల డోస్ ల వ్యాక్సిన్లను నిల్వ చేసేలా ఎక్కడికక్కడ ఫ్రీజర్ బాక్స్ లను సిద్ధం చేసారు. మరోపక్క 80 దేశాల రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణలో ఉన్న భారత బయోటెక్‌‌, ఇ-బయోలజికల్‌ లిమిటెడ్‌లో కరోనా వ్యాక్సిన్లను తయారు చేసే పరిశోధన కేంద్రాలను ఈరోజు సందర్శించనున్నారని.. తిరిగి వెళ్లే ముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉన్న హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో కేంద్రాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. గ్లోబల్‌ రవాణాకు వీలుగా ఎన్నో సదుపాయాలు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు కార్గోలో ఉన్నాయని వెల్లడించాయి. అటు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూడా వ్యాక్సిన్‌ ఎగుమతి, దిగుమతులకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో నిర్మలమ్మ

ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మేగజైన్‌ విడుదల చేసిన ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో పలువురు భారతీయ వనితలకూ చోటు దక్కింది. ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో తొలి స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ కు నిలిచారు. ఇక భారత్ కు చెందిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (41 వ స్థానం), టెక్ దిగ్గజం హెచ్సీఎల్ సీఈఓ రోష్నీ నాడార్‌ మల్హోత్రా(55), బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(68) లకు స్థానం లభించింది. ఈ జాబితాలో అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ కూ స్థానం దక్కింది. ఇక యూరప్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టిన్‌ లగార్డే వరుసగా రెండో ఏడాది కూడా రెండోస్థానంలో నిలవడం విశేషం. 10 దేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, 38 కంపెనీల సీఈవోలు, వినోద రంగానికి చెందిన ఐదుగురు ప్రముఖులనూ ఫోర్స్బ్ తన జాబితాలో శక్తిమంతమైన మహిళలుగా పేర్కొంది.

కొత్త చట్టాలు వద్దేవద్దని తెగేసి చెప్పిన రైతు సంఘాలు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల పై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. రైతులకు బాసటగా నిన్న దేశ వ్యాప్త బంద్ విజయవంతమైన తరువాత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు ఆయనతో రైతు సంఘాలు నిన్న సాయంత్రం సమావేశమయ్యాయి. అయితే ఇరు పక్షాలు కూడా తమ పూర్వ వాదనలకే కట్టుబడ్డాయి. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో ఈరోజు బుధవారంనాడు జరగాల్సిన ఆరో రౌండ్‌ చర్చలు రద్దయ్యాయి. అయితే కొత్త చట్టాల రద్దుకు ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వం వాటిలో తామెలాంటి సవరణలు తేదల్చుకున్నదీ వివరిస్తూ ఒక ప్రతిపాదనను ఈరోజు రైతులకు పంపనుంది. ఈ సవరణల పై రైతు సంఘాల నేతలు బుధవారం 12 గంటలకు సింఘూ సరిహద్దు కేంద్రం వద్ద సమావేశమై చర్చించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తారని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు. అయితే మంగళవారం జరిగిన భారత్‌ బంద్‌ చాల రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపడం, దేశ విదేశాల్లో ప్రభుత్వ ఇమేజి దెబ్బతింటూండడంతో హోమ్ మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు. ఓ పక్క బంద్‌ జరుగుతున్న సమయంలోనే ఆయన రైతు సంఘాల నాయకులకు కబురు పంపారు. దాంతో సింఘూ సరిహద్దుల నుంచి 13 మంది రైతు సంఘం నేతలు నిన్న రాత్రి ఆయనను కలిశారు.   అయితే షా నివాసంలో చర్చలకు కొందరు రైతు నేతలు విముఖత చూపడంతో పూసా ఏరియాలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద సమావేశం రెండు గంటల ఆలస్యంగా రాత్రి తొమ్మిది గంటలకు మొదలైంది. ఈ సమావేశంలో పాల్గొన్న 13 మందిలో ఎనిమిది మంది పంజాబీ రైతు సంఘాల వారు కాగా మిగిలిన ఐదుగురూ దేశంలోని వివిధ యూనియన్లకు చెందినవారు. ఆలిండియా కిసాన్‌ సభకు చెందిన హన్నన్‌ మొల్లా, భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన రాకేశ్‌ తికాయత్‌ వారిలో ఉన్నారు. అసలు దీనిపై అమిత్‌ షాతో చర్చించేందుకు ఏమీ లేదని, "చట్టాలను రద్దు చేస్తారా లేదా... అవును లేదా కాదు... అన్నది మాత్రమే అడుగుతున్నామని" రైతు నేత రుద్రు సింగ్‌ మాన్సా సమావేశానికి ముందే చెప్పారు. దీంతో సమావేశం కూడా అదే తరహాలో సాగింది. అయితే రైతు నేతలిచ్చిన సమాచారం ప్రకారం... కొత్తగా చేసిన చట్టాల్ని రద్దు చేయడం అసాధ్యమని అమిత్‌ షా తేల్చి చెప్పారు. చట్టాల రద్దు తప్ప ఏ తరహా సవరణలకైనా సిద్ధంగా ఉన్నామని అమిత్ షా చెప్పారు. అయితే చట్ట సవరణలకు తాము వ్యతిరేకమని, తమ వాదనలో మార్పు లేదని రైతు నేతలు తేల్చిచెప్పారు. ఆ సమయంలో షా వారి ముందు మరో ప్రతిపాదన ఉంచారు. "చట్టాలపై మీకున్న 39 అభ్యంతరాలనూ మేము పరిశీలించాం. ప్రభుత్వం ఏమేం సవరణలు చేయదలిచిందీ మీకు రేపటికి పంపిస్తాం... పరిశీలించండి" అని కోరారు. దీంతో రైతు సంఘాల నేతలు అందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈరోజు బుధవారం మంత్రులు నరేంద్ర తోమర్‌, పీయూష్‌ గోయల్‌ సారథ్యంలోని ప్రభుత్వ బృందంతో తాము జరిపే చర్చలను రద్దు చేసినట్లు కిసాన్‌ సభ నేత హన్నన్‌ మోలా రాత్రి 11-30 గంటలకు మీడియాకు తెలిపారు. "ఈ సాయంత్రం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అమిత్ షా తో సమావేశానికి రావాలని.. అయితే సమావేశానికి వెళ్లినా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఏమీ చెప్పలేదు" అని రైతుల నేత రాకేశ్ తికైత్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంపై తమకు విశ్వాసం కలగడం లేదని చెప్పిన మరి కొందరు రైతు ప్రతినిధులు ఆందోళనను మరింత ఉధృతం చేయడమే మార్గాంతరమంటున్నారు. దీంతో బుధవారం రైతులు తమలో తాము జరిపే చర్చల్లో ఏ విషయమూ తేలవచ్చని తెలుస్తోంది.   ఇది ఇలా ఉండగా రైతుల నిరసనలో భాగమయ్యేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, సిపిఎం నేత సీతారాం ఏచూరి ఈ విషయంపై చర్చలు జరిపారు. ఈరోజు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు రాహుల్‌, పవార్‌, ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డిఎంకె నేత టిఆర్‌ బాలులతో కూడిన అయిదుగురు సభ్యుల ప్రతినిధి బృందం రాష్ట్రపతి కోవింద్‌ను కలుసుకోనుంది. రైతాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న సాగు చట్టాలను రద్దు చేసేలా రాష్ట్రపతి జోక్యం కోరనున్నట్లు ఏచూరి వెల్లడించారు.

‘వ్యవసాయ’ విన్యాసాలు చూడతరమా...

కోరస్ కలిపిన పార్టీలే కదం తొక్కుతున్న వైచిత్రి   గళం మార్చిన పవార్, కేజ్రీవాల్, జగన్, బాబు   తెలంగాణలో టీఆర్‌ఎస్-బీజేపీ కార్టూన్ల యుద్ధం   మన రాజకీయ పార్టీలకు రైతులపై టన్నుల కొద్దీ పొంగుకువస్తున్న ప్రేమానురాగాలు చూస్తుంటే.. రైతులంటే వారికి ఇంత సానుభూతి ఉందా అనిపిస్తుంది. పాపం రైతన్నలు కూడా రాజకీయ పార్టీలు తమ పట్ల ప్రదర్శిస్తున్న మద్దతు, సానుభూతి చూసి మురిసిముక్కలవుతున్నాడు. అంతా కట్టకట్టుకుని, తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి, దేశమంతా బందు పెట్టినందుకు పాపం ఆ పిచ్చి మారాజులు,  తమ జన్మధన్యమయిందనుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు తమకు దన్నుగా ఉన్న ఇవే పార్టీలు.. కొద్దికాలం క్రితం కొత్త చట్టం తెచ్చిన సర్కారుకు, పార్లమెంటు సాక్షిగా సాగిలబడ్డాయన్న నిజాన్ని,  నిలకడమీద గానీ తెలుసుకోలేకపోయారు. నరేంద్రమోదీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై.. వివిధ రాజకీయ పార్టీల విన్యాసాలు చూస్తే,  ఊసరవెల్లి కూడా సిగ్గుపడక తప్పదేమో?   మోదీ సర్కారు తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు.. బీజేపీ వాదిస్తున్నట్లు రైతులకు మేలు చేయవచ్చు. అదే సమయంలో విపక్షాలు ఆరోపిస్తున్నట్లు రైతు ప్రయోజనాలను అంబానీ- అదానీలకు తాకట్టుపెట్టేలా ఉండవచ్చు. ఎవరి కోణం వారిది. ఎవరి వాదన వారిది. కాబట్టి ఎవరి కోణంలో వారిదే రైటనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వారంతా ఏ సమస్యలయినా తమ కళ్లతో చూసి, తమ మెదడుతో ఆలోచిస్తారు కాబట్టి! అయితే.. ఆయా అంశాలపై మొదట వినిపించిన వాణి, ఆ తర్వాత సమయానుకూలంగా మారి,  అవకాశవాద మలుపు తీసుకోవడమే అభ్యంతరం, అనైతికం. ఒక అంశంపై ప్రాంతీయ-జాతీయ పార్టీలన్నీ నిర్లజ్జగా యూటర్ను తీసుకోవడమే రోత. దేశ ప్రజలంతా చూస్తుండగా, బిల్లుకు మద్దతునిచ్చిన అవే స్వరాలు.. బయటకొచ్చి రంగుమార్చి, అందుకు భిన్నంగా గళమెత్తడమే ఇప్పటి (అ)రాజకీయం!   ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ బిల్లును  పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు.. ఆమ్ ఆద్మీ, వైసీపీ, టీడీపీ వంటి పార్టీలన్నీ సమర్ధించాయి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అయితే.. బీజేపీ కంటే ఎక్కువగా బిల్లును సమర్థించారు. బిల్లును సమర్ధించని వారంతా దళారీనన్న వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలాంటి బిల్లు తీసుకురావలసిన అవసరం ఉందని సమర్ధించారు. టీడీపీ దానికి కొన్ని సవరణలు చేసింది. మద్దతుధర, కార్పొరేట్ల పెత్తనంతో వచ్చే నష్టం, కాంట్రాక్టు ఫార్మింగు వల్ల రైతులకొచ్చే నష్టం వంటి అంశాలను ప్రస్తావించింది. కానీ బిల్లును మాత్రం వ్యతిరేకించలేదు.   ఇప్పుడు మాట మార్చిన వైసీపీ స్వరాన్ని, విజయసాయిరెడ్డి ప్రసంగాలతో కలిపి టీడీపీ మీడియాకు విడుదల చేసింది. ఆ రకంగా ఏపీకి సంబంధించినంత వరకూ,  రెండు ప్రధాన పార్టీలు బిల్లును సమర్ధించాయి. కాకపోతే.. తాము బిల్లుకు సవరణలు ప్రతిపాదించామని వాదించేందుకు, టీడీపీ ఒక వెసులుబాటు కల్పించుకుంది. ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా బిల్లును సమర్ధించాయి. ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే బిల్లును వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా అది రైతులకు మద్దతుగానే రోడ్డెక్కింది. అయితే రైతులకు మద్దతుపై టీఆర్‌ఎస్ వైఖరిని విమర్శిస్తూ బీజేపీ.. ఎన్డీఏ రైతులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ, టీఆర్‌ఎస్...  సోషల్‌మీడియా వేదికగా సంధించుకుంటున్న కార్టూన్ల యుద్ధం ఆసక్తికలిగిస్తోంది. తాజాగా  రైతులు రోడ్డెక్కి, ఢిల్లీని ముట్టడించిన అంశంపై అగ్గిరాజుకుంది. దీనితో బీజేపీ మినహా అన్ని పార్టీలూ,  తమ మనుగడ కోసం  రైతుల వెంట నడవటం అనివార్యమయింది. ఫలితంగా మంగళవారం భారత్‌బంద్‌కు పిలుపునివ్వడంతో, బీజేపీ మినహా అన్ని పార్టీలూ దానికి మద్దతునివ్వక తప్పని పరిస్థితి. విచిత్రమేమిటంటే... యుపిఏ హయాంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న శరద్‌పవార్..  వ్యవసాయంలో చట్టాలు, సంస్కరణలు తీసుకురావల్సిన అవసరం ఉందని వాదించారు. ఆ మేరకు ఆయన  ఢిల్లీ-మధ్యప్రదేశ్ సీఎం లయిన షీలాదీక్షిత్, శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖలు కూడా రాశారు. ఇప్పుడు ఆయన పార్టీ కూడా, రైతు ఉద్యమానికి మద్దతునివ్వడం విస్మయకరం. అయితే, తాను ఆ లేఖ రాసిన మాట నిజమేనని ఇప్పుడు అంగీకరించడం కొంత నయం. ఇప్పుడు రైతు సమస్యపై గత్తర చేస్తున్న పంజాబ్ కిసాన్ యూనియన్.. 2018లో దళారుల వల్ల తమకు మద్దతుధర లభించడం లేదని, తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసే అవకాశం కార్పొరేట్లకు ఇవ్వాలని నానా యాగీ చేసింది. ఆ మేరకు ప్రతి ఏటా  కేంద్రానికి లేఖ రాస్తూనే ఉంది.  ఆ తర్వాత చాలా ఏళ్లకు మోదీ సర్కారు రైతుచట్టం తెచ్చింది. కానీ విచిత్రంగా అదే పంజాబ్ కిసాన్ యూనియన్, ఇప్పుడు రోడ్డెక్కిన రైతులకు నాయకత్వం వహిస్తోంది. తాను కోరిన రైతుచట్టాన్నే తెచ్చిన మోదీ సర్కారును దునుమాడుతోంది. ఇక పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతునిచ్చిన ఆమ్ ఆద్మీ.. ఇప్పుడు ఢిల్లీలో రోడ్డెక్కిన రైతులకు అన్నపానీయాలు సమకూరుస్తోంది.  ఇది అవసరార్ధ రాజకీయాలకు పరాకాష్ఠ కాదా?   ఇక పార్లమెంటులో బేషరతుగా బిల్లు ఆమోదించిన వైసీపీ...ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పక్షానే బంద్‌కు మద్దతునివ్వడం, అప్పుడు పార్లమెంటులో బిల్లును వ్యతిరేకించకుండా ఉన్న టీడీపీ కూడా,  రైతన్నకు మద్దతునివ్వడం రోత రాజకీయాలకు పరాకాష్ఠ. అన్నట్లు.. ఓవైపు వైసీపీ ఈ బిల్లును ఇప్పుడు వ్యతిరేకిస్తుంటే, ఆ పార్టీకి చెందిన నేత పొట్లూరి మాత్రం.. బ్రహ్మాండంగా ఉన్న బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదని, ట్వీట్ చేయడం మరో ట్విస్టు.   చిరాఖరుగా బీజేపీ కూడా వ్యవసాయంపై రాష్ట్రానికో రకంగా స్పందించడం మరో వైచిత్రి. రైతులు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని ప్రధాని మోదీ చెబుతున్నారు. కానీ అదే పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మాత్రం తన రాష్ట్రంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి రైతులెవరయినా వచ్చి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తే వారి లారీలు జప్తు చేసి, జైల్లో పెడతామని హెచ్చరించడం.. బీజేపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.  ఈవిధంగా.. వ్యవసాయ బిల్లులో,  రాజకీయ పార్టీల విన్యాసాలు చూసిన వారికెవరికయినా.. ‘స్టేట్‌మెంట్లు మార్చని వాడు పొలిటీషియనే కాదు పొమ్మన్న’ గిరీశం ఉపదేశం గుర్తుకురావడం ఖాయం! -మార్తి సుబ్రహ్మణ్యం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. కాళ్లు, చేతులు నరుకుతా

పటాన్‌ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రెచ్చిపోయారు. ఓ మీడియా ప్రతినిధితో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. భూ కబ్జాలపై ఓ కథనాన్ని రాసిన సదరు రిపోర్టర్‌ కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. నీవు ఎవ్వడివిరా? అంటూ బూతు పురాణం అందుకోవడమే కాదు.. వస్తావా? లేదా ఎక్కడున్నావో చెప్పు.. నేనే వస్తా.. కాళ్లు, చేతులు నరుకుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. కావాలంటే నేను మాట్లాడేది రికార్డు చేసుకో.. దిక్కు ఉన్న చోట చెప్పుకో.. పోలీసులకు ఫిర్యాదు చేసుకో.. అంటూ బూతులు తిట్టారు. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అయింది. జర్నలిస్టు పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి.

కేజ్రీవాల్ ప్లాన్ లీక్.. దీంతో సీఎం హౌస్ అరెస్ట్

దేశ వ్యాప్తంగా ఈరోజు రైతులకు బాసటగా నిర్వహించిన ఒక రోజు బంద్ విజయవంతమైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల పై రైతులు దేశ వ్యాప్తంగా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ బంద్ జరిగింది. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో కలిసి ధర్నా చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఈ సంగతి లీక్ కావడంతో ఆయనను అడుగు బయట పెట్టకుండా ఢిల్లీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అయితే తాను సీఎం హోదాలో కాకుండా ఓ మామూలు వ్యక్తిలా రైతుల్ని కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అయితే తాను బయల్దేరే సమయంలో పోలీసులకు తమ ప్లాన్ తెలిసిపోవడంతో బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ సరిహద్దులో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కలవడానికి బయల్దేరిన కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలోనే నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే బంద్ ముగియడంతో ఆయనకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది.   అయితే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గృహ నిర్బంధంపై ఆప్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కేజ్రీవాల్‌ను, రైతులను చూసి మోదీ ప్రభుత్వం భయపడుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. దీంతో ఆప్ కార్యకర్తలతో కలిసి కేజ్రీవాల్ ఇంటి ముందు సిసోడియా ధర్నా నిర్వహించారు.