కేసీఆర్ ఎత్తుకు బీజేపీ పైఎత్తు.. 

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ, టిఆర్ఎస్ ల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగిన సంగతి తెల్సిందే. ఎన్నికల తరువాత రైతుల ఆందోళన నేపథ్యంలో జరిగిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించింది. అటు బంద్ పూర్తి కాగానే కొత్త పార్లమెంట్ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీని, సీఎం కేసీఆర్ ప్రశంసిస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల సమయంలో ఉప్పు నిప్పుగా ఉన్న టీఆర్ఎస్ బీజేపీ సంబంధాలపై పలువురు సందేహాలు వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కూడా కలవడం విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.   అయితే సీఎం కేసీఆర్ పర్యటన వెనుక పెద్ద లాజిక్ ఉందని తాజాగా తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత అనూహ్యంగా పెరుగుతుండటం, రాష్ట్రంలో తమ పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో గులాబీ దళం విషయంలో తమ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. ఈ వ్యూహం మేరకు కేసీఆర్‌ నాయకత్వంపై టీఆర్‌ఎస్ పార్టీ ‌నాయకుల్లోనే విశ్వాసం సన్నగిల్లే దిశగా పావులు కదుపుతోంది. దీంట్లో భాగంగా, కేసీఆర్‌పై కేసుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తనపై ఉన్న కేసుల భయంతోనే ఢిల్లీకి కేసీఆర్‌ వెళ్లారన్నది తెలంగాణ ప్రజల కంటే కూడా ముందు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు గుర్తించాలన్నదే తమ లక్ష్యం అని బీజేపీ నాయకులు చెపుతున్నారు.   మరోపక్క సరిగ్గా ఏడాది కిందట, గత డిసెంబరు మొదటివారంలో కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ లభించలేదని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దానికి భిన్నంగా మోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం వెనుక పెద్ద కారణమే ఉందని వారు వివరిస్తున్నారు. ఢిల్లీ బయలుదేరే ముందు ‘‘తనకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవచ్చునని కేసీఆర్‌ భావించారు. అయితే ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్‌ కొద్దిరోజుల కిందట ప్రధానిని కలుసుకున్నారు. ఈ రెండు కారణాలను సాకుగా చూపి తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందంటూ బద్నాం చేయాలని గులాబీ ముఖ్యనేతలు ప్లాన్‌ చేసారని బీజేపీ నాయకులు చెపుతున్నారు. అయితే దీనికి సంబంధించి తమకు ముందే ఉప్పందడంతో మా వ్యూహం మార్చాం. ఈసారి అడిగి అడగగానే కేసీఆర్‌కు మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ ‌లు లభించాయి’’ అని బీజేపీ నాయకులు చెపుతున్నారు. తన సొంతపార్టీ ఎమ్మెల్యేలతోపాటు మంత్రులకు సైతం సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని, దీనిని తాము హైలైట్ చేయబోతున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ జాతీయ నాయకత్వం కూడా కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే కేసీఆర్ దానిని తమపై ఎదురుదాడికి వాడుకునే అవకాశం ఉంటుందని.. అందుకే, తమపై ఆ అపవాదు రాకుండా జాగ్రత్తపడ్డామని బీజేపీ నాయకులు తెలిపారు. .   దీంతో సీఎం కేసీఆర్ డిల్లీ పర్యటనకు ముందే తమ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించిందని.. దీంతో కేవలం జిమ్మిక్కులు చేయడానికే కేసీఆర్ ఢిల్లీకి‌ వెళ్లారని బీజేపీ నాయకులు చెప్తున్నారు, అంతేకాకుండా అయన పర్యటనలో లోన జరిగేదొకటి, బయటకు ఆయన చెప్పేదొకటి ఉంటుందంటూ సీఎం పర్యటన తొలిరోజే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ముందే ప్రకటన చేశారని వారు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా తాజా పరిణామమాలతో సీఎం కేసీఆర్‌కు నిద్రకరువయ్యే ఢిల్లీకి వచ్చారని బీజేపీ కేంద్ర, రాష్ట్ర సమన్వయకర్త బాల్‌రాజ్‌ వ్యాఖ్యానించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో ఆయన ఢిల్లీలో చక్కర్లు కొట్టారని తెలిపారు. మజ్లీస్ తో స్నేహం కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్ కు గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో ముందునుయ్యి..వెనుక గొయ్యిలా మారిందని అయన అభిప్రాయపడ్డారు.

400 మంది విద్యార్థుల కిడ్నాప్.. రంగంలోకి ఆర్మీ!

నైజీరియాలోని ఓ ప్రభుత్వ పాఠశాలపై దాడి చేసిన బందిపోట్లు.. అక్కడ చదువుతున్న 400 మంది విద్యార్థులను కిడ్నాప్‌ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నైజీరియాలోని నార్త్‌ వెస్ట్రన్‌ ప్రాంతం కట్సీనా రాష్ట్రంలో జరిగింది. బందిపోట్ల ముఠా ఆయుధాలతో ‘గవర్నమెంట్‌ సైన్స్‌ సెకండరీ స్కూల్‌’లోకి చొరబడి.. అక్కడున్న విద్యార్థులపై దాడికి దిగింది. మొత్తం 600మంది విద్యార్థులు ఆరోజు పాఠశాలకు హాజరయ్యారని పాఠశాల యాజమాన్యం చెబుతుండగా.. దుండగులు దాడి చేసిన తరువాత 400 మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు. తమ బిడ్డలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, కిడ్నాప్ అయిన విద్యార్థుల ఆచూకీని కనుగొనేందుకు నైజీరియా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. పోలీసులు కూడా పెద్దఎత్తున కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు.   కాగా, ఆరేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు ఓ బాలికల పాఠశాలపై దాడి చేసి 276 మంది బాలికలను కిడ్నాప్‌ చేశారు. వారిలో 100 మంది బాలికలు తప్పించుకోగా, మిగిలిన వారి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.

కరోనాకు తోడు ఫంగస్ ఇన్ఫెక్షన్.. సోకిందంటే అత్యంత ప్రమాదమే

ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న సామాన్య జనాన్ని తాజాగా మరో ముప్పు వణికిస్తోంది. కొన్ని రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు మనిషికి సోకితే దాని ప్రభావంతో తీవ్ర నష్టం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతారు. అయితే తాజాగా కరోనా బాధితుల్లో కనిపిస్తున్న ఒక అరుదైన ఫంగస్ ఇన్ఫెక్షన్ వారి కంటిచూపుతో పాటు ప్రాణాలను కూడా హరించి వేస్తోందని భారత వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. "మ్యూకార్ మైకోసిస్" అని పిలవబడుతున్న ఈ అరుదైన ఫంగస్ కరోనాతో బాధపడుతున్న పేషంట్ల పైనేకాకుండా, కరోనా నుండి కోలుకున్నవారిపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోందని వారు గుర్తించారు.   అహ్మదాబాద్ కు చెందిన ఆక్యులర్ ట్రామా సర్జన్ పార్థ్ రాణా దృష్టిలోకి ఇలాంటివి పలు కేసులు వచ్చాయి. ఈ ఫంగస్ సోకిన వారిలో దాదాపు 50 శాతం మంది మరణించారని, అంతేకాకుండా దీని నుండి ప్రాణాలతో బతికి బయటపడిన వారి కంటి చూపు పోయిందని పార్థ్ రాణా తెలిపారు. ఈ ఫంగస్ సోకినవారిలో కనుగుడ్లు పెద్దవిగా మారి, పొడుచుకువచ్చినట్టుగా మారిపోయాయని అయన తెలిపారు. సాధారణంగా కరోనా సోకని వారిలో "మ్యూకార్ మైకోసిస్" వ్యాప్తి చెందడానికి 15 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటుందని, అయితే కరోనా రోగులకు మాత్రం ఇది 2 నుంచి 3 రోజుల్లోనే సోకుతోందని అయన అన్నారు.   ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ అతుల్ పటేల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన దృష్టికి గత మూడు నెలల్లో ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు 19 వచ్చాయని అయన తెలిపారు. కరోనా వ్యాప్తి లేని సమయంతో పోల్చితే ఇప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు 4 నుండి 5 రెట్లు ఎక్కువగా ఉందని అయన తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ సోకితే రోగి ప్రాణం పోయేందుకు 50 శాతం అవకాశాలు ఉన్నాయని, అందుకే దీనిపై ఆసుపత్రుల యాజమాన్యాలు మరింత అప్రమత్తంగా ఉండాలని అయన స్పష్టం చేశారు.

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు! 

కర్ణాటకలో ఉన్న ఐఫోన్ తయారీ ప్లాంట్ లో ఆ కంపెనీ ఉద్యోగులు విధ్వంసం సృష్టించారు. బెంగళూరుకు సమీపంలో కోలార్ జిల్లాలోని నర్సాపురలో ఈ  ప్లాంట్ ఉంది. వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఉద్యోగులు ప్లాంట్ పై దాడి చేశారని చెబుతున్నారు. అసెంబ్లింగ్ యూనిట్లను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు సీనియర్ పోలీసు అధికారులు అదనపు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సుమారు 130 మందిని అరెస్టు చేశారు.    తైవానీస్ టెక్ జెయింట్ విస్ట్రన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఈ కంపెనీ ప్లాంట్‌లో ఉదయం షిఫ్ట్‌లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారని తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు తమ ఫోన్లతో తీసిన వీడియోలలో పలు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అద్దాలు, డోర్లను పగలగొట్టడం, కార్లను తలకిందులు చేయడం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల కార్యాలయాలపై దాడి చేయడం వంటివి ఈ వీడియోల్లో ఉన్నాయి.    అయితే ఐఫోన్ తయారీ ప్లాంట్ లో జరిగిన హింసపై ఇంత వరకు విస్ట్రన్ కార్పొరేషన్ స్పందించలేదు. బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో కోలార్ సమీపంలోని నర్సాపుర ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ప్లాంట్ ఉంది. 43 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. రూ. 2,900 కోట్ల పెట్టుబడి పెడతామని, 10 వేల మందికి పైగా ఉపాధిని కల్పిస్తామనే ఒప్పందంతో ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 43 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

కుటుంబ నియంత్రణపై బలవంతం చేయలేం.. అది దంపతుల ఇష్టం

కుటుంబ నియంత్రణ పాటించాలని దేశ ప్రజలను బలవంతపెట్టలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జనాభా నియంత్రణపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ పై కేంద్రం తాజాగా న్యాయస్థానానికి తమ అఫిడవిట్‌ సమర్పించింది. ఈ అఫిడ‌విట్‌ లో.. తమకు ఎంతమంది పిల్లలు కావాలో అది పూర్తిగా దంపతుల ఇష్టమేనని, కుటుంబ నియంత్రణపై ఎలాంటి ఒత్తిడి చేయలేమని స్పష్టం చేసింది. కుటుంబ నియంత్రణపై బలవంతపు చర్యలను భారత్‌ నిస్సందేహంగా వ్యతిరేకిస్తోందని, ఒకవేళ నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే పిల్లలు ఉండాలని ప్రజలను బలవంతపెడితే అది ప్రజల నుంచి నిరసనలకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే భారత్‌ లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోందని.. 2000 సంవత్సరంలో సంతానోత్పత్తి రేటు 3.2శాతంగా ఉండగా.. 2018 నాటికి అది 2.2 శాతానికి తగ్గిందని పేర్కొంది. 2025 నాటికి సంతానోత్పత్తి రేటు 2.1 శాతంగా ఉండేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపింది.   కాగా, జ‌నాభా నియంత్ర‌ణకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అలాగే ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న‌ను తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాల‌ని బీజేపీ నేత, న్యాయ‌వాది అశ్వినీకుమార్ ఢిల్లీ హైకోర్టులో మొద‌ట పిటిష‌న్ వేశారు. జ‌నాభా నియంత్ర‌ణ పెరుగుద‌ల‌తో కాలుష్యం, నిరుద్యోగం పెర‌గ‌డంతో పాటు క‌నీస అవ‌స‌రాలు ప్ర‌తి ఒక్క‌రికీ అంద‌డం లేద‌ని పేర్కొన్నారు. అంతేగాక, జ‌నాభా పెరుగుద‌ల అవినీతికి కార‌ణ‌మ‌వు తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే జ‌నాభా నియంత్ర‌ణపై చ‌ట్టాలు చేసేది చ‌ట్ట‌స‌భ‌లు మాత్ర‌మేన‌ని, కోర్టులు కాద‌ని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఆ పిటిష‌న్‌ను కొట్టివేసింది. దీంతో, ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ అశ్వినీకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల‌పై తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.

కేసీఆర్ కు వరుస షాకులు! అసలు కారణం ఇదేనట?

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. కొన్ని నెలలుగా పరిపాలనలో ఆయనకు ఏది కలిసి రావడం లేదు. ప్రభుత్వం కొత్తగా తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలన్నిఫెయిలవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెరిగిపోతోంది. మంచి కోసం పోతే తమ కొంప ముంచేలా పథకాలు తయారయ్యాయని అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. అటు పార్టీ పరంగానూ గతంలో ఎప్పుడు లేనంతగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుస పరాజయాలతో పార్టీలో అలజడి పెరిగిపోతోంది. సొంత గడ్డలోనూ  కేసీఆర్ పై వ్యతిరేకత కనిపించడం కారు పార్టీ నేతలను కలవరపెడుతోంది.    కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు వరుసగా తగులుతున్న షాకులపై ఆసక్తి కర చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. భక్త విశ్వాసాలను పాటిస్తూ యాగాలు, హోమాలు ఎక్కువగా చేస్తారు. అయితే ఆయన చేసిన యాగంలో తేడా వల్లే... ఆయనకు గడ్డు కాలం వచ్చిందనే చర్చ పండితుల నుంచి వస్తోంది. 2019 జనవరి 21వ తేదీన తలపెట్టిన చండీయాగం నుంచే కేసీఆర్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయని చెబుతున్నారు. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు  అనుకున్నదానికంటే ఎక్కువ సీట్లే వచ్చాయి. ఆ సంతోషం, కృతజ్ఞతతోనే  2019 జనవరి 21 నుంచి ఆయన యాగాన్ని నిర్వహించారు. అయితే జనవరి 22వ తేదీన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ పెళ్ళి రిసెప్షన్ కార్యక్రమానికి ఢిల్లీకి వెళ్ళారు. ఆ సమయానికి చండీయాగం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీక్ష తీసుకున్న తర్వాత పూర్తిచేయకుండా మధ్యలో ఢిల్లీ వెళ్ళిడం వల్లే ఆయనకు చెడు జరుగుతుందని కొందరు పండితుల మాట.    యాగం మొదలుపెట్టిన తర్వాత అది పూర్తిగా ముగిసేంత వరకు ఆ పరిధి దాటి బైటకు వెళ్ళరాదన్నది నియమం. కానీ కేసీఆర్ ఢిల్లీ వరకు విమానంలో వెళ్ళి  వచ్చారు. ఇది యాగ సంప్రదాయానికి విరుద్ధమని  వేద పండితులు చెబుతున్నారు. అప్పటి నుంచే ఆయనకు కాలం కలిసి రావడం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.  నిజంగానే కేసీఆర్ కు 2019 జనవరి నుంచి కలిసి రావడం  లేదు. 2019 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో  ఆయన కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు వస్తాయని చెప్పిన కారు పార్టీ.. అనూహ్యంగా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలాగా ఉన్న దుబ్బాక అసెంబ్లీ కారు ఫల్టీ కొట్టింది.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ  గతంలో కంటే భారీగా నష్టపోయింది టీఆర్ఎస్.    పార్టీ పరంగానే కాక పాలనలోనూ ఏడాదిన్నరగా కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో రైతు బంధు ఇచ్చినా అన్నదాతల్లో కేసీఆర్ పై వ్యతిరేకత వచ్చింది. గత అక్టోబర్ కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. వందల కోట్ల రూపాయల్లో నష్టం జరిగింది. వరద బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వరద బాధితులకు సాయంగా అందించిన 10 వేల రూపాయల సాయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  సర్కార్ కు ప్రతికూలంగా మారింది. కొత్త రెవిన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్ స్కీం అమలుతో ప్రభుత్వం ప్రజల్లో విలన్ గా మారిపోయిందనే చర్చ జరుగుతోంది.    మొదటి నుంచి కేసీఆర్‌ ఏ పని తలపెట్టినా పండితుల సలహాలు తీసుకుంటారు. ఆలయాల సందర్శన తర్వాతనే ముందడుగు వేస్తారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే  2015లో ఎర్రవల్లిలోని తన సొంత ఫామ్ హౌజ్‌లో ఆయుత చండీయాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 2018లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేముందు అధికారంలోకి మళ్లీ రావాలంటూ రాజశ్యామల యాగాన్ని జరిపించారు. గెలిచిన తర్వాత 2019 జనవరిలోనూ అదే తరహా యాగాన్ని నిర్వహించారు. అయితే  ఆ యాగ సమయంలో చేసిన తప్పిదం వల్లే కేసీఆర్ కు గతంలో ఎప్పుడు లేనంతగా సమస్యలు వచ్చాయని పండితులు పక్కాగా చెబుతున్నారు. మళ్ళీ యాగం చేసి పరిహారం సమర్పించుకుంటే తప్ప కేసీఆర్ కు మంచి రోజులు రావంటున్నారు.

రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు- ప్రధాని మోడీ 

కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. రైతుల ఆదాయం పెంచడానికే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చామన్నారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్య ఉన్న అడ్డుగోడలు కొత్త సాగు చట్టాలతో తొలగిపోయాయన్నారు ప్రధాని. కొత్త చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్నామ్నాయాలను వెతుక్కొవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఫిక్కీ 93వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. కొత్త వ్యవసాయ బిల్లులపై స్పష్టత ఇచ్చే  ప్రయత్నం చేశారు.    కొత్త చట్టాలతో రైతులు తామ పండించిన పంటలను మార్కెట్లు లేదా బయట ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉందని ప్రధాని మోడీ చెప్పారు. రైతులకు ఉపయోగపడేలా దేశ వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలను ఆధునికీకరిస్తామని తెలిపారు. కొత్త సాగు చట్టాలతో భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచి.. వారి జీవితాల్ని మరింత సుభిక్షంగా మార్చాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాల్ని తీసుకొచ్చామని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు.    మరోవైపు రైతుల ఆందోళనలు 17వ రోజుకు చేరాయి. దీంతో ఢిల్లీ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతుల సంఘాల ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. ఉద్యమాన్ని విరమించి సంప్రదింపులకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ విజ్ఞప్తి చేశారు.  అయితే కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటిస్తే తప్ప తాము ఉద్యమాన్ని ఆపేది లేదని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఐ డోంట్ కేర్... కూల్చిన కబ్జా గోడను మళ్ళీ కట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే 

ఎన్ని ఆరోపణలు వచ్చినా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఎంత మాత్రం వెనక్కు తగ్గడం లేదు. భూ కబ్జాలు, అధికారుల పై జులుం వంటి ఘటనలకు సంబంధించి కొంత కాలంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే వరుసలో జ‌న‌గామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డిపై ఇప్పటికే ఎన్నో భూక‌బ్జా ఆరోప‌ణ‌లు వచ్చాయి. ఆయ‌న తన ఇలాకాలోని ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను, చెరువు భూముల‌ను వ‌ద‌లిపెట్ట‌ర‌ని స్థానికంగా అనేక ప్ర‌చారాలున్నాయి. తాజాగా చేర్యాల మండ‌లం పెద్ద చెరువు మ‌త్త‌డి స్థ‌లాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క‌బ్జా చేసి, ఆయ‌న కూతురు పేరుపై రిజిస్ట్రేష‌న్ చేశార‌ని జ‌న‌గాంలో అఖిల‌ప‌క్ష నాయ‌కులు ఆరోపించారు. దీనిపై వారు చేర్యాల బంద్ కు కూడా పిలుపునిచ్చి నిన్న (శుక్ర‌వారం) అక్క‌డ నిర్మించిన ప్ర‌హ‌రీగోడ‌ల‌ను కూల్చివేశారు. దీంతో ఎమ్మెల్యే గారు బుద్ధి తెచ్చుకుని వెన‌క్కి త‌గ్గుతార‌ని స్థానిక ప్రజలు నాయకులు భావించారు. అయితే ఎమ్మెల్యే గారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా నిన్న రాత్రికి రాత్రే కూల్చిన గోడను మ‌ళ్లీ నిర్మించేశారు. అంతేకాకుండా పోలీస్ ప‌హారాలో అయన గోడ తిరిగి నిర్మించార‌ని, అయినా ఎమ్మెల్యే పదవిలో ఉండి మ‌రీ ఇంత బ‌రితెగిస్తారా అంటూ ఇటు స్థానిక నాయ‌కులు ప్ర‌జ‌లు ముత్తిరెడ్డిపై మండిప‌డుతున్నారు.

బొల్లారం ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 120మంది కార్మికులు

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో వింద్య ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలడంతో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 120 మంది కార్మికులున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా కార్మికులకు గాయాలవగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పొగలు దట్టంగా అలుముకోవటంతో లోపల ఎంత మంది కార్మికులు చిక్కుకున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

బంజారాహిల్స్ లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి

హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్ అంబేద్కర్ నగర్ లో దారుణం జరిగింది. అన్యం పుణ్యం ఎరుగని నాలుగేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.   అంబేద్కర్‌ నగర్‌లో నివాసం ఉండే చెన్నయ్య అనే వృద్ధుడు ఇంటి పక్కన ఉన్నవారితో స్నేహం పెంచుకున్నాడు. ఆ ఇంట్లోని నాలుగేళ్ల చిన్నారిని చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకున్నాడు. అయితే.. చిన్నారి తల్లి పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న నాలుగేళ్ల చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తల్లి పనినుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చిన్నారి లేకపోవడంతో.. ఇంటి చుట్టు పక్కల వెతుకుతుండగా చెన్నయ్య ఇంట్లో నుంచి చిన్నారి వస్తూ కనిపించింది. చిన్నారి ఏడుస్తుండడం గమనించిన తల్లి.. ఏమయింది అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం చెన్నయ్య పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

డిసెంబర్ 31న కొత్త పార్టీ! తమిళనాట రజనీ బర్త్ డే సందడి

తమిళనాడులో కొత్త  రాజకీయ పార్టీ ఏర్పాటుపై మూడేళ్లుగా నాన్చుతూ వస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అభిమానులు, తన అనుచరులతో ముమ్మర సంప్రదింపుల తర్వాత ఆయన రాజకీయ అరంగ్రేటం ఖాయమైందని తెలుస్తోంది. డిసెంబర్‌ 31న పార్టీ స్థాపనపై రజనీకాంత్ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. పార్టీ పేరును రిజిస్టర్‌ చేయడంలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వద్ద మక్కల్‌ మన్రం అగ్రనేతలు బిజీబిజీగా గడుపుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి న్యాయవాదుల నుంచి సలహా లు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు, పతాకం, చిహ్నంపై రజనీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మూడు పేర్లను సీఈసీ వద్ద నమోదు చేస్తే అందులో ఏదో ఒకదాన్ని అధికారులు ఆమోదిస్తారు. ఈ ప్రక్రియ నెలాఖరుకు పూర్తయితే 31న పార్టీ పేరును రజనీ అధికారికంగా ప్రకటిస్తారని అంచనా.    రాజకీయాల్లోకి రావడం ఖాయమని రజనీకాంత్‌ 2017 డిసెంబర్‌లో చెప్పారు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాని ప్రకటన చేసిన మూడేళ్ల వరకు పార్టీ ఏర్పాటుపై ముందడుగు పడలేదు. ఇంతలోనే అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అది నిజమేనన్నట్లుగా రజనీకాంత్ సంకేతమిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో రజనీకాంత్ పార్టీ ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది. కాని గత నెల నుంచి మళ్లీ రాజకీయ పార్టీ దిశగా రజనీకాంత్ అడుగులు వేశారు. పార్టీ స్థాపనపై మక్కల్‌ మన్రం నిర్వాహకులతో రజనీకాంత్‌ ఇటీవల చెన్నైలో సమాలోచనలు జరిపారు. ప్రధాన సమన్వయకర్త అర్జున్‌మూర్తి, పర్యవేక్షకులు తమిళరువి మణియన్ సహా ముఖ్య నేతలతో చర్చల తర్వాత పార్టీకి ఓకే చెప్పినట్లు చెబుతున్నారు.     ఈనెలాఖరులో పార్టీని ప్రకటించబోతున్న తరుణంలో శనివారం రజనీకాంత్‌ 71వ జన్మదినోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో అభిమానులు సందడి చేస్తున్నారు. రజనీకాంత్‌కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని, ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని ప్రార్థిస్తూ మక్కల్‌ మన్రం నిర్వాహకులు ఎన్నూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. వెస్ట్‌మాంబళంలోని శంకరమఠంలో  గోపూజ జరిపారు. అశోక్‌నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం, మహిళా విభాగం అధ్వర్యంలో రంగరాజపురంలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కబ్జా నేలమట్టం! సీఎం సొంత జిల్లాలో సంచలనం  

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యా మార్పులు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలకు విపక్షాల నుంచే కాక జనాల నుంచి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జనగామ నియోజకవర్గ  అధికార పార్టీ ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి భూ వివాదంలో చిక్కుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పెద్దచెరువుకు చెందిన 21గుంటలు కబ్జా చేశారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. స్థానికులతో కలిసి చెరువు వద్ద స్థలం చుట్టూ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి నిర్మించిన ప్రహరీ గోడను మూకుమ్మడిగా కూల్చివేశారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎం), ఏఐఎఫ్‌బీ, ఎమ్మార్పీఎస్ నాయకులంతా ఏకమై  ఈ కూల్చివేతలో పాల్గొన్నారు.    చేర్యాల పెద్ద చెరువు కింద 1402 సర్వే నెంబర్‌లో 21గుంటల భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన కూతురు తుల్జా భవానిరెడ్డితో పేరిట 2018లో కొనుగోలు చేశారు. ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ చేశాడు. అ స్థలం బఫర్ జోన్‌ కావడంతో మునగకుండా కాంక్రీట్‌‌తో కాలువ నిర్మించాడు.   2012లో జీవో నెంబర్ 168 ప్రకారం 25ఎకరాల ప్రభుత్వ శిఖం భూమి కంటే ఎక్కువ ఉన్నచో కట్ట కింద100 ఫీట్ల వరకు ఎలాంటి తవ్వకాలు, నిర్మాణాలు, భూ లావాదేవీలు జరుపకూడదు. సర్కార్  ఉత్తర్వులను తుంగలో తొక్కిన ఎమ్మెల్యే తన కూతురు పేరిట కొనుగోలు చేసి ఆ భూమి ముంపునకు గురికాకుండా పక్కా ప్లాన్‌తో కాలువ నిర్మాణం చేపట్టారు. దశాబ్దాలుగా ఆ స్థలం పశువుల సంత కొనసాగుతుండటంతో పాటు ఇతర ప్రజా అవసరాలకు వినియోగిస్తున్నారు. అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టనీయొద్దని గతంలో స్థానికులు కూడా తీర్మానం చేశారు. అయినా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాంక్రీట్ కాలువ నిర్మించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    ముత్తిరెడ్డి తన కూతురు పేరు మీద కొన్న భూమి రిజిస్ట్రేషన్ వివాదంగానే ఉంది. ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ కన్నా ముందే ఎలాంటి టైటిల్ లేకుండా 2018లో ఎమ్మెల్యే కూతురి పేరిట చేర్యాల గ్రామపంచాయతీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. చేర్యాల 2018లో మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపల్ ఏర్పడక ముందే ఆగమేగాల మీద గ్రామపంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూమి కొనుగోలు అంశం వివాదాస్పదంగా మారడంతో ఫైలును మాయం చేశారని చేర్యాల పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ పర్మిషన్ మీద చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కొంత మంది కోర్టును కూడా ఆశ్రయించారు.   జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రతిపక్ష నేతలు చాలా కాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుకు చేర్యాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా నిరసన తెలుపుతున్నారు. పట్టణ వాసులు శుక్రవారం చేర్యాల బంద్‌ నిర్వహించారు. తాజాగా స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నేతల అంతా ఒక్కటై  ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరోసారి రోడ్డెక్కారు. రూ.10కోట్ల విలువైన భూమిని ఆక్రమించడమేగాక అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ .. ఈ భూమి చుట్టూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కట్టిన ప్రహారి గోడను కూల్చేశారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

స్పీడ్ పెంచిన కిషన్ రెడ్డి! ఆ భయం వెంటాడుతుందా?  

సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. గతంలో ఉమ్మడి అంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ బీజేపీలో అగ్రనేతగా ఉన్న కిషన్ రెడ్డి కొన్ని నెలలుగా యాక్టివ్ గా లేరు. కేంద్ర మంత్రిగా ఉన్నా ఆయన బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదనే చర్చ ఆ పార్టీలోనే వస్తోంది. తెలంగాణ పార్టీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ అర్వింద్ లు దూకుడుగా వెళుతున్నా.. కిషన్ రెడ్డి మాత్రం వాళ్లను అందుకోలేకపోయారు. దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఆయన పెద్దగా ప్రచారం చేయలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసినా బండి, ధర్మపురి రేంజ్ లో కేడర్ లో జోష్ నింపలేకపోయారు.    ఇంతకాలం సైలెంట్ గా ఉంటూ వస్తున్న కిషన్ రెడ్డి సడెన్ గా స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి వేగం పెంచారని చెబుతున్నారు. రోజూ ఆయన ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గతంలో కిషన్ రెడ్డి ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారు. కాని ఇప్పుడాయన జిల్లాలు కూడా చుట్టేస్తున్నారు. శుక్రవారం వరంగల్ లో పర్యటించి నగర అభివృద్ధిపై వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొన్ని గంటల పాటు అక్కడే ఉన్నారు. పార్టీ నేతల సమావేశంలోనూ పాల్గొన్నారు. వరంగల్ కార్పొరేషన్ కు త్వరలో ఎన్నికలు జరగనుండటంతోనే కిషన్ రెడ్డి వచ్చారని చెబుతున్నారు. తర్వాత నల్గొండ జిల్లాలో పర్యటించారు. కిషన్ రెడ్డి పర్యటనలు ఇప్పుడు తెలంగాణతో పాటు బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారాయి.     కిషన్ రెడ్డి స్పీడ్ పెంచడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఇందు కోసం రాష్ట్రం నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉండగా.. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా, బండి సంజయ్ పార్టీ చీఫ్ గా ఉన్నారు. ఇక మిగిలిన ఇద్జరు ఎంపీల్లో సోయం బాపురావుపై పలు కేసులు నమోదై ఉన్నాయి. ఇక మిగిలిన ఎంపీ అర్వింద్ కే మోడీ మంత్రివర్గంలో సహాయ మంత్రి పదవి రావచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే తెలంగాణతో పాటు బీజేపీలోనూ కిషన్ రెడ్డి ప్రాధాన్యత మరింత తగ్గుతుందని చెబుతున్నారు. కేసీఆర్ పై చేసే ఘాటు విమర్శలతో అర్వింద్ ఇప్పటికే పాపులర్ అయ్యారు. కేంద్ర మంత్రి పదవి కూడా వస్తే ఆయన మరింత బలమైన నేతగా ఎదగడం ఖాయం. ఈ సంకేతం ఉండటం వల్లే కిషన్ రెడ్డి సడెన్ గా దూకుడు పెంచారని చెబుతున్నారు. వరంగల్ కార్పొరేషన్ లో పార్టీని గెలిపించి హైకమాండ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఆయన భావిస్తున్నారట. దాంతో పాటు తెలంగాణలో తన హవా తగ్గకుండా చూసుకోవాలని కిషన్ రెడ్డి వ్యూహమని చెబుతున్నారు.     కిషన్ రెడ్డి దూకుడుపై మరో వాదన కూడా వినిపిస్తోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీజేపీ నేతలే అసంతప్తిగా ఉన్నారట. ముఖ్యంగా సిద్దిపేటలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించినా.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించలేదనే ఆరోపణలు వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ తో కిషన్ రెడ్డి లోపాయకారి ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు కూడా వెళ్లాయంటున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి తీరుపై బీజేపీ పెద్దలు ఆరా తీశారని చెబుతున్నారు. తెలంగాణలో అధికారం కోసం తాము వ్యూహాలు రచిస్తుండగా.. కేంద్రమంత్రిగా ఉండి సైలెంట్ గా ఉంటే ఎలా అని పార్టీ పెద్దలు కిషన్ రెడ్డిని మందలించారని తెలుస్తోంది. హైకమాండ్ అక్షింతల వల్లే కేంద్ర మంత్రి  స్పీడ్ పెంచారని కూడా కొందరు కమలం నేతలు అంతర్గత సంబాషణల్లో చెబుతున్నారు.

బంగ్లాదేశ్ బాలికలతో వ్యభిచారం.. 21 మంది అమ్మాయిలకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి...

బంగ్లాదేశ్ నుంచి బాలికలను అక్రమంగా తీసుకువచ్చి మన దేశంలో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. బంగ్లాదేశ్ బాలికలను ఇండోర్ నగరానికి తీసుకువచ్చి వారితో వ్యభిచారం సాగిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. బంగ్లాదేశ్ బాలికలతో వ్యభిచారం సాగిస్తున్న 9మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామని, 21 మంది బంగ్లాదేశ్ బాలికలను రక్షించామని సీఎం పేర్కొన్నారు.    బాలికలను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకువచ్చి వారికి డ్రగ్స్ ఇచ్చి వారితో వ్యభిచారం చేయించారని సీఎం తెలిపారు. ఈ ముఠాలో నైజీరియా డ్రగ్ రాకెట్ పాత్ర కూడా ఉందని చెప్పారు. తమ రాష్ట్ర పోలీసు బృందం గుజరాత్ తోపాటు ఇతర రాష్ట్రాలను కూడా సందర్శించి దర్యాప్తు చేసిందని తెలిపారు. ఇండోర్ లో కొందరు జిమ్ ట్రైనర్స్ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారని గుర్తించినట్లు చెప్పారు. జిమ్ ట్రైనర్స్ యువకులకు డ్రగ్స్ ను అలవాటు చేశారని సీఎం పేర్కొన్నారు.

కుక్కను కారుకు క‌ట్టేసి ఈడ్చుకెళ్లాడు

'కుక్కలు ఉన్నాయి జాగ్రత్త' అని రాసి మనుషులకు జాగ్రత్తలు చెప్పే రోజులు పోయి.. 'మనుషులు ఉన్నారు జాగ్రత్త' అని రాసి కుక్కలకు జాగ్రత్త చెప్పే రోజులు వస్తాయేమో అనిపిస్తుంది. అతడు సినిమాలో 'ముసలోడే కానీ మహానుభావుడు' అన్నట్టుగా.. కేర‌ళ‌లోని ఎర్నాకులం జిల్లాలో ఓ ముసలి మహానుభావుడు.. బ‌తికున్న కుక్క‌ను కారు వెనుకాల క‌ట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కుక్క బాగా మొరుగుతూ.. ఇబ్బంది పెడుతోంది. దీంతో యూసుఫ్(62) అనే వ్య‌క్తి ఆ కుక్క అరుపులు భ‌రించ‌లేక దాన్ని అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లాలని భావించాడు. త‌న కారుకు వెనుకాల కుక్క‌ను క‌ట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాల‌ను బైక్‌ పై వెళ్తున్న అఖిల్ అనే యువ‌కుడు చిత్రీక‌రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు, గాయపడిన ఆ కుక్కను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. తర్వాత దానిని జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించాడు. కాగా, అఖిల్ పోస్ట్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు పోలీసుల‌కు చేర‌డంతో.. కుక్క‌ను కారుకు క‌ట్టేసి ఈడ్చుకెళ్లిన యూసుఫ్‌ ను అరెస్టు చేశారు. 

అసాంఘిక శక్తుల అడ్డాగా వైసీపీ! పోలీసులపై నమ్మకం పోయిందన్న చంద్రబాబు 

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డి తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో వరుస దాడులు, దౌర్జన్యాలతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో టీడీపీ నేతలపై జరిగిన దాడి ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి మాఫియా శక్తులు రెచ్చిపోతున్నాయని ఆ లేఖలో ఆయన ధ్వజమెత్తారు. చట్టబద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు. పోలీసుల్లో ఒక వర్గం అధికార వైసీపీ నేతలతో కుమ్మక్కై వారి చెప్పుచేతుల్లో పనిచేయడం దురదృష్టకరమని చంద్రబాబు దుయ్యబట్టారు.       చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఈ ప్రాంతంలో ప్రజలపై వేధింపులు, చిత్రహింసలు, హత్యల కేసు ఎక్కువగా నమోదయ్యాయని చంద్రబాబు విమర్శించారు. ఎస్సీలపై వరుస దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రతి సంఘటనలో నిందితులు అధికార వైసీపికి చెందినవారైతే, బాధితులంతా సామాజికంగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాలవారేనన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే అసాంఘిక శక్తుల అడ్డాగా అధికారపార్టీ మారిందని ఆక్షేపించారు. ఇలాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ఈ అరాచక శక్తులను ఇంకా ప్రోత్సాహిస్తూనే ఉన్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు, దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే ప్రజలకు పోలీసు వ్యవస్థపై గల నమ్మకం పూర్తిగా నశిస్తుందన్నారు. బాధితులను పోలీసులు వేధించడం కాకుండా భద్రతగా నిలబడాలని డీజీపీని టీడీపీ అధినేత కోరారు.   మరోవైపు చిత్తూరు జిల్లా అంగళ్లులో టీడీపీ నేతలపై శుక్రవారం జరిగిన దాడికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి టీడీపీ పిలుపు ఇచ్చింది. దీంతో టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. తిరుపతిలో  నరసింహయాదవ్‌, పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, కలికిరిలో నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, తంబళ్లపల్లెలో శంకర్‌యాదవ్‌, చిత్తూరులో నాని, దొరబాబు, శాంతిపురంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తంబళ్లపల్లె  వెళ్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కరోనా దృష్ట్యా చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి అనుమతి లేదని, తంబళ్లపల్లె నియోజకవర్గంలో 30 పోలీసు యాక్టు అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు.

పట్టు వదలని శ్రీలక్ష్మి.. ఏకంగా కేడర్ నే మార్చుకున్నారు 

ఏపీ సీఎం గా జగన్ పదవి చేపట్టగానే ఇద్దరు తెలంగాణ కేడర్ అధికారులను ఏపీకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. వారిలో ఒకరు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కాగా మరొకరు ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర. ఈ ఇద్దరు అధికారులు గతంలో ఉమ్మడి ఏపీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ముఖ్యమైన పదవులలో పని చేసారు. దీంతో ఇటు సీఎం జగన్ కూడా ఆ అధికారుల డిప్యుటేషన్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెల్సిందే. ఐతే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అప్పట్లో అది సాధ్యం కాలేదు.   అయితే సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మాత్రం పట్టు వదలకుండా తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు ఏకంగా తన కేడర్ ను ఏపీకి మార్చుకున్నారు. మొదట్లో డిప్యూటేషన్ మీద తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాలని ఆమె ప్రయత్నించారు. అయితే ఆమె ప్రత్నాలు ఫలించకపోవడంతో చివరకు ఆమె తన తెలంగాణ క్యాడర్‌ను త్యాగం చేసేసి.. ఏపీ కేడర్ కు మారిపోయారు. ఏమైనా సరే ఏపీకి వెళ్లిపోవాలని నిశ్చయించిన ఆమె తన కేడర్ ను మార్చుకునేందుకు క్యాట్‌ను ఆశ్రయించారు. తమది అసలు స్వతహాగా ఏపీ లోని శ్రీకాకుళం జిల్లా అని.. అయితే తమ తండ్రి రైల్వే అధికారి కావడంతో వృత్తిరీత్యా తెలంగాణకు వెళ్లామని, రాష్ట్ర విభజన సమయంలో తన పోస్టల్ చిరునామా ఆధారంగా తెలంగాణ కేడర్ కు కేటాయించారని ఆమె క్యాట్ కు విన్నవించుకున్నారు. దీంతో తనకు తన సొంత రాష్ట్రాన్ని కేటాయించాల్సిందేనని ఆమె క్యాట్ ముందు వాదించారు. దీంతో ఈ వాదనలు విన్న క్యాట్ ఆమె వాదనను అంగీకరించి ఏపీ కేడర్ ను కేటాయించింది. దీంతో ఆమె నిన్న శుక్రవారం అమరావతిలోని ఏపీ జీఎడీలో రిపోర్టు కూడా చేశారు.   అయితే జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని తీవ్రంగా కెరీర్ నష్టపోయిన ఐఏఎస్ లలో శ్రీలక్ష్మి ఒకరు. అతి చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన ఆమె… ఆ కేసుల్లో ఇరుక్కోకపోతే.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా అత్యధిక కాలం పని చేసే అధికారిగా రికార్డు సృష్టించేవారు. అయితే కేసుల్లో ఇరుక్కోవడంతో ఆమె పదోన్నతులు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు… ఆమె ఏపీకి రావడంతో సీఎం జగన్ సీఎంఓలో అత్యంత కీలకమైన పదవి ఇస్తారని అంచనా వేస్తున్నారు. తాజాగా శ్రీలక్ష్మి ఏపీ కేడర్ కు మారిపోవడంతో ఏపీ అధికార వర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.

బీజేపీకి షేక్ హ్యాండ్.. హస్తానికి బూస్ట్! ఢిల్లీ టూర్ తో కేసీఆర్ నయా ప్లాన్ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన మూడు భేటీలు.. ఆరు చర్చలుగా జరుగుతోంది. ఢిల్లీకి వెళ్లిన రోజే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడం ఆసక్తిగా మారింది. కేసీఆర్ హఠాత్తుగా హస్తిన వెళ్లడమే అనేక చర్చలకు తావివ్వగా.. అమిత్ షాతో సమావేశం కావడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు కేసీఆర్. కేంద్రం మీద యుద్ధం కూడా ప్రకటించారు. అంతలోనే  కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి వర్చువల్‎గా హాజరవుతానని ప్రధానికి లేఖ రాశారు. మరుసటి రోజే ఏకంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు.  దీంతో కేసీఆర్ గంటల వ్యవధిలోనే  యూ టర్న్ తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. రణం చేయడానికి బదులుగా కేంద్రంతో కాళ్ల బేరానికి వెళ్లారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. పాత కేసులు తిరగదోడకుండా ఉండేందుకు రాజీపడ్డారని ఆరోపించారు.   అయితే కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికి అందకుండా ఉంటాయని, ఏ ప్రయోజనం లేకుండా ఆయన నిర్ణయాలు తీసుకోరని చెబుతున్నారు. గులాబీ బాస్ ఢిల్లీ పర్యటన వెనక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. ఢిల్లీలో కేసీఆర్ పర్యటన ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా సాగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో  తమకు ఇబ్బందిగా మారిన తెలంగాణ బీజేపీ నేతల దూకుడుకు బ్రేక్ వేయడంతో పాటు కాంగ్రెస్ కు బూస్ట్ ఇవ్వడమే కేసీఆర్ లక్ష్యమంటున్నారు. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగినందున కాంగ్రెస్ బలంగా ఉంటేనే తమకు కలిసి వస్తుందని కారు పార్టీ అధినేత భావిస్తున్నారట. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉండటం వల్లే బీజేపీకి ప్లస్ అయిందని టీఆర్ఎస్ నేతలు అంచనాకు వచ్చారట. కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపించక పోవడంతో కాంగ్రెస్ కేడర్ తో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా కమలానికి మళ్లినట్లు ఎన్నికల ఫలితాలు కూడా చెబుతున్నాయి.    తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు 30 శాతానికి పైగానే సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇది 20 శాతానికి పైగానే ఉంటుంది. అయితే దుబ్బాకలో పీసీసీ నేతలంతా శ్రమించినా కాంగ్రెస్ కు 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఎలాగూ గెలవలేదనే భావనతో హస్తం సానుభూతి పరులు, కేసీఆర్ పని తీరుపై కసిగా ఉన్న జనాలంతా కమలానికి జై కొట్టారని  తేలింది. దుబ్బాకలో దాదాపు 10 శాతం కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మళ్లాయంటున్నారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంక్  బీజేపీ వైపు వెళ్లింది. అందుకే జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు కేవలం 6 శాతం ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. కాంగ్రెస్ బలంగా ఉంటే దుబ్బాకతో పాటు గ్రేటర్ లో మంచి విజయం సాధించే వారమని గులాబీ నేతలు అంటున్నారు. ఈ లెక్కలన్ని బేరీజు వేసుకున్న కేసీఆర్.. ఇలా నరుక్కొస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    ఢిల్లీలో కేసీఆర్.. అమిత్ షా సహా బీజేపీ పెద్దలను కలవడంతో కాంగ్రెస్ కు అస్త్రం దొరికినట్లైంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అనే వ్యాఖ్యలు ఆరేండ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. కేసీఆర్ తాజా పర్యటనతో ఇది రుజువైందని కాంగ్రెస్ జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. రైతుల బంద్ కు సపోర్ట్ చేసిన కేసీఆర్.. ఢిల్లీ సరిహద్దుకు వెళ్లి అన్నదాతలను కలవకుండా కమలం నేతల సమావేశాలు పెట్టడమేంటనే విమర్శలు వస్తున్నాయి. కేసుల కేసుమే కేసీఆర్ బీజేపీతో రాజీ పడ్డారని, కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన బీజేపీ కూడా ఇప్పుడు ఆయనతో ఫ్రెండ్ షిప్ చేస్తుందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇవన్ని కాంగ్రెస్ బలపడానికి పనికొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ బలపడితే అంతిమంగా ఆ ప్రయోజనం మళ్లీ కారు పార్టీకే దక్కనుంది. ఈ దిశగానే కేసీఆర్ ఢిల్లీ అడుగు పడిందని భావిస్తున్నారు.   మరోవైపు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేసిన ఘాటు విమర్శల వేడి ఇంకా తగ్గకముందే ఢిల్లీలో కేసీఆర్ కు కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వడం తెలంగాణ బీజేపీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది.  వరుస గెలుపులతో బీజేపీ బలపడుతున్న సమయంలో  ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు తమకు  బ్రేక్ వేసినట్లయిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం టీఆర్ఎస్‌పై చేసిన పోరాటమంతా వృథా అయిందని, ఇకపై రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకుని తిరగాలన్న ఆవేదనను  కొందరు  వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్న సమయంలో పార్టీలో  ఇలాంటి సమస్యే వచ్చింది.  అధికార పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ యుద్ధం చేస్తూ ఉంటే కేంద్ర మంత్రులు ఇక్కడ పథకాలను ప్రశంసిస్తుండడం, ఢిల్లీలో సమావేశమవుతుండడం పార్టీ ఎదుగుదలకు ఆటంకంగా మారిందని బహిరంగంగానే నేతలు గతంలో ఆవేదన వెలిబుచ్చారు.

సోనియా దెబ్బకు కాంగ్రెస్ పతనం.. మోడీ ఒక నియంత.. ఆత్మకథలో ప్రణబ్ కామెంట్స్ 

భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ రాసిన తన ఆత్మకథ లో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ప్రస్తుత ప్రధాని మోడీలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి. తాను భారత దేశ రాష్ట్రపతి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ దృష్టికోణం నుంచి పక్కకు జరిగిందని, అదే సమయంలో సోనియాగాంధీ పార్టీ వ్యవహారాలను సరిగా నిర్వర్తించలేకపోయారని ప్రణబ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో పార్టీ నాయకత్వ మార్పు పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు వెలుగు చూడడం పలువురిలో ఆసక్తిని రేపుతోంది. 84 ఏళ్ల వయసులో ప్రణబ్ గత జులై 31న కరోనాతో కన్నుమూశారు. అయితే దానికి ముందే అయన తన ఆత్మకథను పూర్తి చేసారు.   అప్పటి ప్రధాని మన్మోహన్ ‌సింగ్‌కు, ఎంపీలకు మధ్య వ్యక్తిగత సంప్రదింపులు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పతనమైందని ప్రణబ్ తన ఆత్మకథ లో పేర్కొన్నారు. "ద ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్" అనే పేరుతో అయన రాసిన ఆత్మకథ వచ్చే నెలలో రూప పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితం కానుంది. ఈ నేపథ్యంలో ఇందులోని కొన్ని వ్యాఖ్యలను రూప పబ్లికేషన్స్ బహిర్గతం చేసింది.   2004లో తాను కనుక ప్రధాని అయి ఉంటే 2014లో కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర ఓటమి నుంచి బయటపడేదని చాలామంది పార్టీ నాయకులు తనతో చెప్పారని.. అయితే వారి అభిప్రాయాన్ని తాను అంగీకరించలేదని తన ఆత్మకథలో పేర్కొన్నారు. అయితే, తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత పార్టీ హైకమాండ్ రాజకీయ దృష్ణి కోణం కోల్పోయిందని, అంతేకాకుండా పార్టీని నడిపించడంలో సోనియా విఫలమయ్యారని పేర్కొన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రభుత్వంలోని కూటమిని రక్షించుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని అయన అన్నారు.   మరో పక్క బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపైనా ప్రణబ్ విమర్శలు చేశారు. మోదీ తన తొలి ఐదేళ్ల పాలనలో నియంతృత్వాన్ని అనుసరించినట్టే కనిపిస్తోందన్నారు. మోడీ మొదటి ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం, చట్టసభలు, న్యాయవ్యవస్థ మధ్య చేదు సంబంధాలు నెలకొన్నాయని ప్రణబ్ పేర్కొన్నారు. ఇక మోడీ రెండోసారి అధికారంలోకి రావడంతో ఈసారి అది మరింత స్పష్టంగా అర్థమవుందా? అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని ప్రణబ్ పేర్కొన్నారు.   ఇక అమెరికా అధ్యక్షుడు ఒబామా 2015లో భారత పర్యటన సందర్భంగా అయన కారులో కూర్చోమన్నారని.. అయితే దీనిని గౌరవంగానే గట్టిగా తిరస్కరించినట్లు ప్రణబ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు భారత రాష్ట్రపతితో కలిసి ప్రయాణించేటప్పుడు భారత భద్రతా వ్యవస్థల ఏర్పాట్లపై విశ్వాసం ఉంచాలని అమెరికా అధికారులకు తెలియచేయండని విదేశాంగ శాఖకు చెప్పానని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.