ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
posted on Dec 9, 2020 @ 11:38AM
ఏలూరులో ప్రబలుతున్న వింత రోగంపై ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వందల సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నందున ఏలూరులో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏలూరు పరిస్థితులపై సీఎం జగన్మోహన్రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. రోజుకో రీతిలో రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని ఆయన అందులో పేర్కొన్నారు. రేపు ఏం జరుగుతుందనే భయాందోళనలను ప్రభుత్వం తొలగించాలని కోరారు.
తాగునీటిలో సీసం, నికెల్ ఉన్నాయనే సమాచారంతో ప్రజలు భయపడుతున్నారన్నారు చంద్రబాబు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రస్తుత పరిస్థితి తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఏలూరులో ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు అందజేయాలని సూచించారు చంద్రబాబు. దీర్ఘకాలిక ప్రాతిపదికపై ప్రతి రోగిని నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య నిపుణులతో బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలన్నారు. హెల్ప్ లైన్ ఏర్పాటు ఆలోచన రాకపోవడం ప్రభుత్వ మరో వైఫల్యమని చంద్రబాబు విమర్శించారు. తక్షణమే బాధితుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. సత్వర ఉపశమన, సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి బాధితుడికి ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించాలన్నారు చంద్రబాబు.