నెరేడ్ మెట్ లో టీఆర్ఎస్ విజయం! గ్రేటర్ లో 56కు చేరిన బలం
posted on Dec 9, 2020 @ 11:01AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిపోయిన నేరెడ్మెట్ డివిజన్ ఫలితం వెల్లడైంది. 668 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. నేరెడ్ మెట్ గెలుపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. నేరెడ్ మెట్ ఎన్నికల్లో మొత్తం 25 వేల 177 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు పూర్తయ్యాక టీఆర్ఎస్ కు మొత్తం 10, 330 ఓట్లు రాగా, బీజేపీ కు 9 వేల 662 ఓట్లు పోలయ్యాయి.
జీహెచ్ఎంసీ ఫలితాలు వచ్చిన ఈ నెల 4వ తేదీనే నేరేడ్మెట్ డివిజన్ లెక్కింపు చేపట్టారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీలో ఉన్నప్పటికీ ఇతర ముద్రతో ఉన్న ఓట్లు 544 ఉన్నాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ డివిజన్ ఫలితాన్ని ప్రకటించలేదు. తాజాగా ఇతర ముద్రలు ఉన్న ఓట్లు పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతించడంతో నేరేడ్మెట్ డివిజన్లో లెక్కింపును చేపట్టారు. సైనిక్పురిలోని భవన్స్ వివేకానంద కళాశాలలో లెక్కింపు కొనసాగింది. ఇతర గుర్తులున్న 544 ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇంతకుముందు ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థే ఇక్కడ విజయం సాధించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం నుంచి కంటతడి పెడుతూ బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు బయటకు వచ్చారు. ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.