మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాలకు టీకా!
posted on Jan 11, 2021 @ 9:50AM
కోవిడ్ వ్యాక్సినేషన్ కు తెలుగు రాష్ట్రాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఏపీ, తెలంగాణకు సోమవారం రాత్రి వరకు కరోనా టీకాలు రానున్నాయి. మొదటి దశలో ఆంధ్రప్రదేశ్ కు 7 లక్షలు, తెలంగాణకు ఆరున్నర డోసులు వస్తాయని చెబుతున్నారు.హెడ్ క్వార్టర్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ డోస్లు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంటాయి. పోలీసు భద్రత నడుమ గ్రామస్థాయి వరకు వ్యాక్సిన్ వెళ్లినట్లుగానే వీటి నిల్వ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే చేపట్టేలా ఫ్రీజర్లు, ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్లను వైద్యారోగ్య శాఖ సమకూర్చింది. డోస్లు భద్రపరిచిన చోట కూడా పోలీసు భద్రత కొనసాగనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. హెల్త్ కేర్ వర్కర్లకు తొలి డోస్ ఇవ్వడానికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉన్నందున అప్పటికల్లా మరోసారి కొత్త స్టాక్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నెల 16వ తేదీన వ్యాక్సినేషన్ లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రతీ వ్యాక్సినేషన్ కేంద్రంలో డాక్టరుతో పాటు వ్యాక్సిన్ వేయడానికి శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలర్జీ, రియాక్షన్ లాంటివాటిని పరిశీలించడానికి అబ్జర్వేషన్ రూమ్లు, హెల్త్ కేర్ సిబ్బంది వేచి ఉండడానికి వెయిటింగ్ హాళ్ళు.. ఇలా అన్నీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటయ్యాయి.ఇప్పటికే సిరంజీలు వచ్చి రెడీగా ఉన్నాయి. వ్యాక్సిన్లు వచ్చిన తర్వాత వాటిని నిల్వ చేయడానికి వీలుగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కోల్డ్ స్టోరేజీ చైన్ సిస్టమ్ రెడీ అయింది. వ్యాక్సిన్ వేయించుకునే ప్రతిఒక్కరూ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి. వ్యాక్సినేషన్ అయిపోయిన అనంతరం వీరి వివరాలు కో–విన్ సాఫ్ట్వేర్లో నమోదుచేస్తారు.
వ్యాక్సిన్ పంపిణి కోసం తెలంగాణలో తొలి రోజు 139 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందులో 40 ప్రైవేటు ఆసుపత్రులలో ఉంటే మిగిలిన 99 ప్రభుత్వాసుపత్రులలోనే ఏర్పాటయ్యాయి. ప్రతీ కేంద్రంలో రోజుకు వంద మంది చొప్పున తొలి రోజు తెలంగాణలో మొత్తం 13,900 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా రంగం సిద్ధమైంది. ‘కొవిన్’ సాఫ్ట్వేర్ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఇప్పటికే సుమారు 2.90 లక్షల మంది పేర్లు ‘కొవిన్’లో నమోదయ్యాయి. తొలి రోజున 13,900 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ ఉంటుంది. 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాలలో మొత్తం 1400 సెషన్లలో వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. కొన్ని చోట్ల అనుబంధ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటవుతున్నందున రోజుకు 1.40 లక్షల మందికి ఇవ్వాలని ప్లాన్ రెడీ అయింది.
హెల్త్ కేర్ సిబ్బందితో పాటు ఆ తర్వాతి క్రమంలో పోలీసు, రెవెన్యూ, పారిశుద్య కార్మికులకు కూడా ఇవ్వనున్నందున మొత్తం తొమ్మిది లక్షల మందికి తొలి డోస్ ఇవ్వడానికి సుమారు రెండు వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ వర్గాల అంచనా. హెల్త్ కేర్ సిబ్బంది వివరాలన్నీ ‘కొవిన్’లో నమోదై సిద్ధంగా ఉన్నా పోలీసు, రెవెన్యూ, పారిశుద్య కార్మికుల వివరాలు మాత్రం ఇంకా నమోదు చేసే స్థాయిలోనే ఉన్నాయి. హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి వీరి పేర్లు కూడా ‘కొవిన్’లోకి చేరితే వారికి కూడా పంపిణీ మొదలవుతుంది.