బాలినేని నిర్ణయం.. జగన్ విశ్వసనీయత ప్రశ్నార్థకం?

జగన్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. ఆయన బటన్ నొక్కి సొమ్ములు ఖాతాలలో జమ చేస్తున్నానంటూ ఏర్పాటు చేసిన సభల నుంచి జనం పారిపోతున్నారు. నాలుగు సంవత్సరాలలోనే జగన్ ప్రజల విశ్వసనీయతను కోల్పోయారని పరిశీలకులు పలు సంఘటనలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి గట్లు తెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. యిటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో అవగతమైంది. యిక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్ పట్ల తమ వ్యతిరేకతను తమ ఓటు ద్వారా తెలియజేశారు. అంతకు ముందే నెల్లూరు జిల్లాకు చెందిన యిద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ ను విభేదించి పార్టీకి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ అంటూ వారిని వారితో పాటు మరో యిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్నామని పించేశారు జగన్. అయితే ఆ అసమ్మతి, అసంతృప్తి నలుగురికే పరిమితమై లేదనీ, అది చాపకింద నీరులా పార్టీ మొత్తం వ్యాపించి ఉందనీ గడపగడపకూ కార్యక్రమంలో జనం వద్దకు వెళుతున్న వైసీపీ నాయకులను సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకుంటున్న సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి.   ఈ వరుస సంఘటనలను ఉదహరిస్తూనే జగన్ జనం విశ్వసనీయత కోల్పొయారని పరిశీలకులు అంటున్నారు. యిక పార్టీలో కూడా జగన్ పై విశ్వసనీయత సన్నగిల్లిందనడానికి ఎక్కడికక్కడ వినిపిస్తున్న అసమ్మతి గళమే నిదర్వనమంటున్నారు. అవన్నీ అలా ఉంచితే  జగన్‌ను సొంత బంధువులు కూడా నమ్మడం లేదనడానికి తాజా తార్కానం.. బాలినేని అలక. పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేయడమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బాలినేని పార్టీ పదవికి రాజీనామా వార్తలకు విస్తృత ప్రచారం జరగడంతో జగన్ బుజ్జగింపు చర్యలకు ఉపక్రమించారు. సీఎంవో అధికారుల ద్వారా బాలినేనిని సంప్రదించారు. పార్టీ పదవికి రాజీనామా చేయకుండా ఉండటానికి ఏం కావాలని అడిగితే.. బాలినేని ఏమీ వద్దు.. నియోజకవర్గానికే పరిమితమౌతానని స్పష్టం చేశారని విశ్వసనీయంగా తెలిసింది. తాను పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడానికి అనారోగ్యం కారణమని ఆయన చెబుతున్నప్పటికీ.. ఆ మాటలను ఎవరూ నమ్మడం లేదు. జగన్ తీరు పట్ల, ఆయన వ్యవహారశైలి పట్ల విసిగిపోయే బాలినేని ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మొదటి నుంచీ జగన్ తో ఉన్న తనను మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటూ కేబినెట్ నుంచి తొలగించడం, తన జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేష్ ను కొనసాగించడం తో మొదలైన బాలినేని అసంతృప్తి.. ఆ తరువాత వరుస సంఘటనతో పెరుగుతూ వచ్చిందనీ, తాజాగా ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనతో  పతాక స్థాయికి చేరిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాలినేనిని అలకపాన్పు దిగేలా చేసేందుకు జిల్లాలో సుబ్బారెడ్డి కంటే బాలినేనికే అధిక ప్రాధాన్యత యిస్తానని కూడా జగన్ ప్రతిపాదించినా ఫలితం లేకపోయిందనీ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.   మొత్తం మీద జగన్ మాటలపై విశ్వాసం లేకపోవడం వల్లే బాలినేని ఆయన చేసిన ఏ ప్రతిపాదననూ అంగీకరించకుండా రాజీనామా నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని అంటున్నారు. పార్టీకి దూరం కాలేదనీ, కేవలం కోఆర్డినేటర్ పదవికే రాజీనామా చేస్తున్నానని బాలినేని చెప్పినప్పటికీ ఆయన యిక ముందు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పొల్గొనే అవకాశాలు అంతంతమాత్రమేనన్నచర్చ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. 

ఖమ్మంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం ఈ ఏడాది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఖమ్మంలో లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న అన్నగారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని మే 28.. అయన జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు. బేస్‌మెంట్‌తో కలిసి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం తల భాగం అయిదు అడుగులు, కాళ్ల భాగం అయిదు అడుగులు, ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు 45 అడుగులు ఉండనుంది.  తానా అసోసియేషన్‌తోపాటు పలువురు ప్రముఖుల సహకారంతో దాదాపు 4 కోట్ల రూపాయిల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌లో బుద్దుడి విగ్రహాం వలే.. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహా ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్.. జూనియర్ ఎన్టీఆర్‌తో  చర్చించారు. మంత్రి అజయ్ కుమార్.. విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం.. జూనియర్ ఎన్టీఆర్ వస్తుండడం పట్ల ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయతే ఈ విగ్రహావిష్కరణ రాజకీయాలకు అతీతంగా జరుగుతోన్నట్లు సమాచారం.   మరోవైపు మే 28 తేదీన పసుపు పార్టీ పండగ.. మహానాడు రాజమండ్రి వేదికగా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు వాయువేగంతో సాగుతున్నాయి. ఇంకో వైపు గతేడాది టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సారథ్యంలో ఖమ్మంలో నిర్వహించిన టీ టీడీపీ శంఖారావ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అలాగే సైకిల్ పార్టీ ఆవిర్భావ సభ సైతం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఏప్రిల్ 28వ తేదీన విజయవాడ వేదికగా.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.

గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ సర్కార్.. ఫైట్ కంటిన్యూస్!

తెలంగాణ ప్రభుత్వం.. గవర్నర్ తమిళిసై మధ్య వివాదాలు అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు మూడేళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ఏర్పడిన అగాధం ఇప్పట్లో పూడే  అవకాశాలు కనిపించడం లేదు. పెండింగ్ బిల్లుల వివాదం ఇంకా కొనసాగుతుండగానే తాజాగా తెలంగాణ కొత్త సెక్రటేరియెట్ ప్రారంబోత్సవానికి ఆహ్వానం విషయంలో మరో వివాదం మొదలైంది.  అత్యంత వైభవంగా జరిగిన తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాలేదు. ఆమె హాజరు వ్యవహారం గురించి కనీసం మీడియా కూడా పట్టించుకోలేదు. ఇతర రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానం వెళ్లింది. అయితే బండి సంజయ్ హాజరు కాబోనని ముందే ప్రకటించేశారు. రేవంత్ ప్రారంభోత్సవం జరిగిన మరునాడు సచివాలయానికి వెళదామని ప్రయత్నించినా పోలీసులు వెళ్లనీయలేదు. ఇది పక్కన పెడితే  కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాలేదంటూ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆహ్వానం పంపామనీ, అయినా గవర్నర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ గైర్హాజరయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు.  గవర్నర్ రాలేదంటూ తమిళసై సౌందరరాజన్ పై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంత్రి విమర్శలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మంత్రి విమర్శలపై గవర్నర్ కార్యాలయం  స్పందించింది. నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ కు ప్రభుత్వం నుంచి ఆహ్వానమే అందలేదని స్పష్టం చేసింది. దీంతో సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపిందా? పంపినా ఆమె హాజరు కాలేదా? లేక గవర్నర్ ను ప్రభుత్వం పూర్తిగా విస్మరించి, ఇప్పుడు మంత్రుల చేత ఎదురు విమర్శలు చేయిస్తోందా అన్న చర్చ జోరందుకుంది. మొత్తానికి గవర్న్, ప్రభుత్వం మధ్య సెక్రటేరియెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరో కొత్త వివాదానికి తెరలేపింది.

భజరంగ్ దళ్, పిఎఫ్ఐపై కాంగ్రెస్ నిషేధం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఈ నెల 10వతేదీన కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో   ఆసక్తి రేకెత్తించింది.  కర్ణాటకలో భజరంగ్ దళ్ , పిఎప్ఐ  విద్వేష ప్రసంగాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాయని  కాంగ్రెస్  ఆరోపిస్తుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే, పిసిసి ప్రెసిడెంట్  శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భజరంగ్ దళ్, హిందూ మతోన్మాదాన్ని, పీఎఫ్ ఐ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు.    కాగా గత నెల బీజేపీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తూ కేవలం భజరంగ్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై  మాత్రమే నిషేధం విధించింది. హోమ్ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తూ నిషేధిత భజరంగ్ దళ్ గూర్చి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం . 

రజనీకాంత్. . నేనొక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లే!

బాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లే.. తమిళ స్టార్ రజనీకాంత్ కూడా అంతే.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ చంద్రబాబు విజన్ పై చేసిన వ్యాఖ్యలూ అంతే. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు చేస్తున్న రాద్ధాంతం, విమర్శలపై ఒక్క ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం అధినేత చంద్ర బాబు కూడా రజనీకాంత్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల వ్యాఖ్యలు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేశారు. అయితే రజనీకాంత్ మాత్రం వైసీపీ నేతల విమర్శలపై వ్యాఖ్యలపై ఇసుమంతైనా స్పందించలేదు. ఈ నేపథ్యంలో   తెలుగుదేశం అధినేత చంద్రబాబు రజనీకాంత్ కు ఫోన్ చేశారు. ఆ సందర్భంగా  తన విజనరీ వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా చెప్పానని అన్నారు. మనసులో ఏముందో అదే చెప్పాననీ చెప్పారు. దీనిపై వచ్చిన విమర్శలను పట్టించుకోననీ తేల్చేశారు.  ఉన్న విషయాలే చెప్పాను.. మీ విజన్ విషయంలో ఎవరేమన్నా, ఎన్ని విమర్శలు చేసినా నా అభిప్రాయం మారదంటూ స్పష్టం చేశారు. నా అభిమానులకు కూడా అదే చెప్పాను. వైసీపీ విమర్శలపై స్పందించొద్దు, సంయమనం పాటించాలని చెప్పానని రజనీకాంత్ చంద్రబాబుకు వివరించారు.  

పాతికేళ్ల పోరాటం.. 18 రోజుల ఉద్యోగం!

కష్టపడి చదువుకున్న మధ్య తరగతి ప్రజలకు ప్రబుత్వ ఉద్యోగం సాధించడం ఓ కల. ఆ కల సాకారం చేసుకోవాలని తొమ్మది వే మంది డీఎస్సీ అభ్యర్థులు పాతికేళ్లుగా ఎదురు చూస్తున్నారు.  1998లో డీఎస్సీలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం చేస్తున్న నిరీక్షణ ఆంధ్రప్రదేశ్ లో ఫలించింది. గత నెల 12న 4072 మంది డిఎస్సీ 1998 అభ్యర్థుల నియామకాలు జరిగాయి.  అయితే వారిలో ఎక్కువ మంది కొద్ది నెలలు మాత్రమే టీచర్లుగా సేవలందించబోతున్నారు. పాతికేళ్లుగా ఎదురు చేసి పాతిక రోజులు కూడా  ఉపాధ్యాయులుగా పని చేయేకపోయిన కొంత మంది ఏప్రిల్ 30న రిటైర్ అయ్యారు. వీరికి 60 ఏళ్లు కటీఫ్ విధించడంతో అన్నమయ్య జిల్లా గుర్రం కొండలో ఓ టీచర్ 18 రోజులకే రిటైరయ్యారు. ఆయన పేరు వెంకట శివారెడ్డి. ఊరు ఎల్లుట్ల. 1998 డీఎస్సీకి ఎంపికయ్యారు. డీఎస్సీ 1998 ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంతో వెంకటశివారెడ్డి ఈ నెల 13న దౌలత్ ఖాన్ పల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. ఆయన అప్పటి కి గుర్రం కొండ సింగిల్ విండో చైర్మన్. అయితే ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న అభిమానం, గౌరవంతో  సింగిల్ విండో చైర్మన్ పదవికి రాజీనామా చేసి మరీ టీచర్ గా విధుల్లో చేరారు. ఆయనకు ఈ నెల 30తో 60 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో  పాతికేళ్లు ఎదురు చూసి ఎదురు చూసి చేరిన ఉద్యోగంలో కేవలం 18 రోజులు మాత్రమే పని చేసి రిటైర్ అయ్యారు.   సింగిల్‌ విండో చైర్మన్‌గా ఉన్న ఆయన ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో రాజీనామా చేయడం, ఇప్పుడు ఉద్యోగం నుంచి బయటకు రావడంతో అటు రాజకీయంగా..ఇటు ఉపాధ్యాయుడిగా హోదా లేకపోయింది. ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాననీ, ఇపుడు మళ్లీ రాజకీయాలలో రాణిస్తాననీ ఆయన చెబుతున్నారు.  సింగిల్‌ విండో చైర్మన్‌ పదవి దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. 

శివకుమార్ కు తప్పిన ప్రమాదం

కర్ణాటక కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం కోసం శివకుమార్ హెలికాప్టర్ లో బయలు దేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఓ డేగ ఢీకొట్టింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం డీకే శివకుమార్‌ ముళబాగిలులో ఎన్నికల ప్రచారం కోసం మధ్యాహ్నం హెలికాఫ్టర్ లో బయలుదేరారు.ఆ హెలికాప్టర్ హోసకోట్‌ సమీపంలో ల్యాండ్‌ అవుతుండగా ఓ డేగ వచ్చి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో డీకే శివకుమార్‌ కు ఏమీ కాకపోయినా, ఆయన కెమెరామెన్‌ కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అతనికి చికిత్స అందించారు.కర్ణాటకలో ఈ నెల 10 పోలింగ్ జరగనుంది. కూత వేటు దూరంలో ఎన్నికలు ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది.  శివకుమార్ ఏడుసార్లు ఎంఎల్ఏ గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల్లో ఒకరుగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో  ఆయన ముఖ్యభూమిక వహించారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శివకుమార్ అత్యంత సంపన్న రాజకీయ నేతగా రికార్డుల్లోకెక్కారు

మల్లారెడ్డి పోలవరం వ్యాఖ్యలు.. నవ్వించారా.. నవ్వుల పాలయ్యారా?

తెలంగాణ మంత్రులలో  చామకూర మల్లారెడ్డిది ఒక విలక్షణ శైలి. ఆయన విమర్శలకు కానీ, పొగడ్తలకు కానీ హద్దులు ఉండవు. ఆయన చేప్పే మాటలు కోటలు దాటేస్తాయి. అయితే అందులో విషయం మాత్రం గడప దాటే పాటి కూడా ఉండదు. ఒక సారి కాదు పలు మార్లు ఆయన తన విలక్షణ, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలోకెక్కారు. విద్యాసంస్థల అధిపతిగా మల్లారెడ్డి సంపాదనపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. అటువంటి విమర్శలను ఆయన ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. అయితే భూ కబ్జా ఆరోపణలపై ఆయన రేవంత్ రెడ్డికి సవాళ్లు విసిరి ఫన్ సృష్టించారు. ఆ తరువాత తన నివాసాలపై ఐటీ దాడులు జరిగిన  సమయంలో ఆయన విన్యాసాలు, ప్రసంగాలు ఏవీ కూడా ఆయనపై సానుభూతి కలిగించేవిగా కాకుండా నవ్వుకునేలా, నవ్వించేలాగే ఉన్నాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ లో పోవలరం ప్రాజెక్టు పూర్తి విషయంలో చేసిన వ్యాఖ్యలు ఔరా అనిపించేలా ఉన్నాయి. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా సామర్ధ్యం తెలంగాణ ముఖ్యమంత్రికే ఉందని ఆయన వాకృచ్చారు. పనిలో పనిగా ఏపీలో నోరూ జారారు. తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ స్థిరపడిన ఆంధ్రుల ఓట్లపై బీఆర్ఎస్ కన్నేసినట్లుగా కనిపిస్తోంది. అందుకే విశాఖ ఉక్కు విషయంలో ఉన్న పరువును గంగలో కలుపుకున్న బీఆర్ఎస్ అధినేతను ఆకాశానికెత్తేయడానికా అన్నట్లు ఏపీలో పోలవరం పూర్తి కావాలంటే ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడమొక్కటే మార్గమన్నారు. ఆ వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా కాపాడాలన్న కేసీఆరే దిక్కని అన్నారు. అక్కడితో ఆగలేదు. అవి రెండూ కావాలంటే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని మల్లారెడ్డి చెప్పారు. ఏదో ఏపీలో బీఆర్ఎస్ విజయం సాధించాలన్న ఆశాభావం వ్యక్తం చేసి ఊరుకోలేదాయన.. అక్కడ బీఆర్ఎస్ విజయం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పేశారు.  అయితే పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టనీ, అది పూర్తి చేయాలంటే కేంద్ర నిధులు అవసరమన్న సంగతిని మల్లారెడ్డి కన్వీనియెంట్ గా మరచిపోయారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రతి నెలా మొదటి తేదీన ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్న సంగతిని విస్మరించి ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామనీ, పోలవరం పూర్తి చేసేస్తామని మల్లారెడ్డి చెబుతున్న మాటల వెనుక ఉన్నది ముఖ్యమంత్రి ప్రాపకం కోసం పాకులాట వినా మరోటి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఉక్కు ఫ్యాక్టరీ గురించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. సొంత రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతి విస్మరించి పొరుగు రాష్ట్రంలో పరిశ్రమను ప్రైవేటీకరణ నుంచి కాపాడతామంటూ మల్లారెడ్డి చెబుతున్న మాటలు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు అన్న చందంగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలే ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లోనే బిడ్డింగ్ వేస్తానని హడావుడి చేసి సింగరేణి నుంచి బృందాన్ని కూడా పంపి తరువాత కేసీఆర్ చేతులెత్తేసిన విషయం గుర్తులేదా అని నెటిజన్లు మంత్రి మల్లారెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు.   అయితే జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్బవించిన ఇంత కాలానికి కూడా ఏపీలో ఒక్కటంటే ఒక్క సభ నిర్వహించని బీఆర్ఎస్ ఎప్పుడో ఏడాది తరువాత రాబోయే ఎన్నికలలో విజయం గురించి గప్పాలు కొట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తమ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడానికి ఏపీలో అభివృద్ధి లేమిని చూపితే చాలని తెలంగాణ మంత్రులు భావిస్తున్నారని విమర్శకులు అంటున్నారు. చిన్న గీతను పెద్దది చేయడానికి దాని పక్కన చిన్న గీత గీసినట్లుగా.. తెలంగాణ మంత్రులు ఏపీని, అక్కడి ప్రభుత్వ వైఫల్యాలనూ ఉపయోగించుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. 

కర్ణాటకలో దూసుకెళ్తున్న కాంగ్రెస్

కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని తేలింది. రెండో స్థానంలో బీజేపీ, మూడోస్థానంలో జెడీ(ఎస్) ఉంది. అయితే జేడీఎస్ ముఖ్య భూమిక వహించనుంది. జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం.కన్నడ మీడియా సంస్థ ఎడీనా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు రానున్నాయి. కర్ణాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు రానుంది. మే 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 132 నుంచి 140 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకోనుందని ఎడీనా పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224. అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలవనుంది. 57 నుంచి 65 స్థానాల్లో ఆ పార్టీ గెలవనుందని సర్వే తెలియజేసింది. జనతాదళ్ (ఎస్) కింగ్ మేకర్ గా అవతరించనుంది. కింగ్ మేకర్ అయినప్పటికీ ఆ పార్టీకి 19  నుంచి 25 స్థానాలు రానున్నాయి.  కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల వారిగా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ కర్ణాటక(31 నుంచి 37 స్థానాలు), ముంబయ్ కర్ణాటక (40 నుంచి 46), సదరన్ కర్ణాటక(26 నుంచి 32 ), బెంగుళూరు(16 నుంచి 20) స్థానాలు ఉన్నాయి. బిజేపీ హైదరాబాద్ కర్ణాటక(2 నుంచి 4)స్థానాలు, కోస్తా కర్ణాటక(10నుంచి 14 స్థానాలు), సెంట్రల్ కర్ణాటక ( 19 నుంచి 23 ) స్థానాలు కైవసం చేసుకోనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుందని సర్వే రిపోర్టును అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ మరో 100 ఏళ్ల వరకు అధికారంలో రాదని జోస్యం చెప్పారు. అస్సాం ముఖ్యమంత్రి కర్ణాటకలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోని తూమకూరు అసెంబ్లీనియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనడానికి ఆయన వచ్చారు. అవినీతి, అసమర్ధత నియోజకవర్గంలో రాజ్యమేలుతుందని బిశ్వాస్ చెప్పారు. ఇక్కడ 342 గ్రామాల్లో తాగునీరు, రోడ్ల  సౌకర్యం లేదు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ స్వరూపం మారిపోతుందని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. ఎడీనా సంస్థ  సర్వే ప్రకారం కర్ణాటకలో కాంగ్రేస్ మెజారిటీ స్థానాల్లో గెలుచుకుంటుందని, అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి ఖాయమని  ఘంటాపథంగా చెబుతోంది. ఇదిలా వుండగా కర్ణాటకలో బీజేపీ, కాంగ్రేస్ పార్టీలు నువ్వానేనా అన్నట్లు తలపడతాయని ఏసియా న్యూస్ జన్ కీ బాత్  ఓపినియన్ పోల్  జోస్యం తెలియజేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 11 వరకు 30 వేల మంది ఓటర్లను సర్వే చేస్తే ఈ విషయం వెల్లడైంది. కోస్తా కర్ణాటకలో అధికార పార్టీ పట్టు బిగుస్తోంది. సెంట్రల్ కర్ణాటకలో బీజేపీ  పరిస్థితి బాగా లేదు. 

పులివెందుల సస్పెన్స్ థ్రిల్లర్

సస్పెన్స్ నవలలు, సస్పెన్స్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా పొలిటికల్ సస్పెన్స్ నడుస్తోంది.  కడప జిల్లా వాసులు ఆసక్తిగా చర్చించుకుంటున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ప్రధాన సూత్రధారి వైఎస్ అవినాష్ రెడ్డి. కడప పార్లమెంట్ మెంబర్ అయిన అవినాష్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలలో పెద్దగా ప్రజలకు కనిపించింది లేదు. 2019 మార్చి 15వ తేదీన జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరవాత పరిణామాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా మీడియాలో అంతా  అవినాష్ పైనే చర్చ జరిగింది. వారం రోజులుగా ఆచ్చ తగ్గుముఖం పట్టి ఇప్పుడు దాదాపు అదృశ్యమైంది.  దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అవినాష్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. నియోజకవర్గంలొగడనగడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  ఇది ఒక వైపు నడుస్తుంటే.. మరో వైపు సీబీఐ అధికారులు అవినాష్ వెంట నీడలా అనుసరిస్తున్నారు.  అవినాష్ పర్యటనల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెంటాడుతున్నారు.  ఢిల్లీ, హైదరాబాద్ నుండి వచ్చిన సీబీఐ బృందం ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవచ్చన్న వదంతులు కడపలో జోరుగా షికారు చేస్తున్నాయి. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో మకాం వేసి ఉన్న సీబీఐ బృందం ఓవరితోనూ మాట్లాడటం లేదు. సీబీఐ మౌనం వెనుక వ్యూహం ఏమిటో అర్దం కాక స్థానిక వైసీపీ శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. అయితే సీబీఐ వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని కొందరు బాహాటంగానే చెబుతున్నారు. వివేకా హత్య కేసు తమను ఇంత ఇబ్బంది పెట్టదని తొలుత వైసీపీ భావించినా, సీబీఐ, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలతో అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకోవాల్సి వచ్చింది. మైసూరు నుంచి విజయ్ కుమార్ గురూజీని, గుజరాత్ నుంచి పరిమళ్ నత్వానీని వైసీపీ అధిష్ఠానం రంగంలోకి దింపింది. ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద పారిశ్రామిక వేత్తల సమూహం విజయ్ కుమార్ గురూజీని పనిలో పెట్టగా, బీజేపీ అధినాయకత్వం పరిమళ్ నత్వానీని రంగంలోకి దించింది.రాజ్యసభకు పంపించిన వైసీపీని పరిమళ్ నత్వాని సరైన సమయంలో ఆదుకున్నాడని కడప వాసులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 30లోగా అవినాష్ అరెస్టు ఖాయమని పందాలు కాసి ఔత్సీహికులు కొందరు జేబులు ఖాళీ చేసుకున్నారని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో ఒకే రోజు 18 మందికి నోటీసులిచ్చి హడావుడి చేసిన సీబీఐ ఎందుకు వేచి చూస్తోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. అరెస్టు చేయాలనుకుని కోర్టు ఆదేశాలతో వెనక్కు తగ్గిన సీబీఔ ఇంకా కడపలోనే  ఎ:దుకు మకాం పెట్టిందో అనేది మరో సస్పెన్స్. తనను అరెస్టు చేస్తే ఆందోళనలకు దిగవద్దంటూ అభిమానులకు సంకేతాలిచ్చిన అవినాష్, ఇప్పుడు అదేమీ పట్టనట్టు పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనతో వివేకా హత్య కేసు పరిశోధనలో కీలక మార్పులు జరిగాయనీ, వివేకా హత్య కేసు కూడా మిగిలిన కేసుల్లా నత్తనడకలా సాగబోతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ భాస్కరరెడ్డి అరెస్టు జరిగినంత పకడ్బందీగా  అవినాష్ అరెస్టు కూడా జరగబోతోందని కడపలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

వారం పాటు తెలంగాణలో పాలన స్టాండ్ స్టిల్!?

తెలంగాణ ప్రభుత్వం అత్యంత  ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియట్ లోకి విపక్ష నేతలూ, సామాన్యులనే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ నో ఎంట్రీయే. సచివాలయ ప్రారంభోత్సవం అయితే ఆర్భాగంగా చేసేశారు కానీ, సచివాలయంలో ఉద్యోగుల విధినిర్వహణ, సచివాలయంలోనికి వారు ప్రవేశించాల్సిన మార్గం తదితర అంశాలపై ఒక క్లారిటీకి రాకపోవడంతో ప్రారంభం అయిన మరుసటి రోజు నుంచే అంతా గందరగోళంగా మారిపోయింది.   సోమవారం (మే 1)న సీఎస్ ను కలవడం కోసం సచివాలయానికి బయలు దేరిన కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టెలిఫోన్ భవన్ వద్దే పోలీసులు నిలువరించి సచివాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని అడ్డుకున్నారు. సరే అదే రోజు సచివాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా అనుమతి లేదంటూ అక్కడి భద్రతా సిబ్బంది వెనక్కు పంపేశారు. ఇదే అనుకుంటే.. సచివాలయ ఉద్యోగులకు సైతం ప్రవేవం లేదంటూ సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు.  ఏ గేటు నుంచి ఎవరికి ఎంట్రీ అన్న విషయంలో ఉన్నతాధికారులు ఎటువంటి క్లీరిటీ ఇవ్వకపోవడంతో సెక్రటేరియెట్ నో ఎంట్రీ భవన్ గా మారిపోయిందని చెబుతున్నారు.  దీంతో రాష్ట్ర సచివాలయం ప్రారంభం రోజు నుంచే అన్నిశాఖల అధికారులు విధులు నిర్వర్తిస్తారని చెప్పిన ప్రభుత్వం మాటలు అమలులోకి రాకుండా పోయాయి. సచివాలయంలో ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసేశామని ప్రభుత్వం ప్రకటించేసింది. అంతే కాదు  తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ నుంచి శాఖలకు సంబంధించిన పైళ్లను నూతన సచివాలయానికి తరలించేందుకు మూడ్రోజులు గడువు కూడా విధించింది. అలాగే ఏ సమయంలో ఏ శాఖలను తరలించాలన్న గైడ్ లైన్స్ తో  ఆధికారులకు ఆదేశాలు  కూడా జారీ చేసింది.  కానీ ప్రభుత్వం విధించిన గడువు సరిపోలేదో... ఆయా శాఖలకు కేటాయించిన ఫ్లోర్లలో మౌలిక సదుపాయాలు కల్పించలేదో  కారణమేదైనా  కొన్నిశాఖలకు చెందిన ఫైళ్లు, డేటా తరలింపు పూర్తి కాలేదు.  ఇంటర్నెట్ సౌకర్యం సైతం కల్పించలేదు. దీంతో సచివాలయం ప్రారంభం అయ్యిందే కానీ అక్కడ పనులు మొదలు కాలేదు. ఉద్యోగులు ఖాళీగా ఉంటున్నారు. మొత్తం మీద సచివాలయంలో పూర్తి స్థాయిలో ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు కనీసంలో కనీసం వారం రోజులు పడుతుందని సంబంధిత అధికారులే అంటున్నారు.   అంటే తెలంగాణలో పాలన కనీసం వారం రోజుల పాటు స్తంభించిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  

పాక హోటల్ లో ఇడ్లీ భేష్.. వెంకయ్య

వెంకయ్యనాయుడు.. మాజీ ఉపరాష్ట్రపతి.. అంతకంటే ముందు రాజకీయ నాయకుడు, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. యిలా అన్ని దశలూ సక్సెస్ ఫుల్ గా దాటి వచ్చిన నేత. రాజకీయ నాయకుడిగా గానీ, కేంద్ర మంత్రిగా కానీ, ఆ తరువాత ఉప రాష్ట్రపతిగా కానీ ఆయన ఎక్కడా వివాదాల జోలికి వెళ్ల లేదు. వివాదరహితుడిగానే పేరొందారు. తన వాక్చాతుర్యంతో, వాగ్ధాటితో తోటి రాజకీయ నాయకులనే కాకుండా సామాన్యులను సైతం మెప్పించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే సమయంలో ఆయన ఏపీకి న్యాయం కోసం గళమెత్తారు. కొన్ని హామీలు పార్లమెంటు సాక్షిగా సాధించగలిగారు కానీ, ఆ తరువాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కీలక శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టినా పార్లమెంటు సాక్షిగా పొందిన హామీలను అమలు చేయించే విషయంలో సొంత ప్రభుత్వాన్నే ఒప్పించలేకపోయారు. అయితే వాటిపై అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ గళమెత్తి.. సొంత ప్రభుత్వానికే తలనొప్పిగా  మారారు. అంతే ఆయనకు పదోన్నతి అంటూ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయించి ఏకంగా ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెట్టేసి రాజకీయాలకు దూరం చేసేసింది  మోడీ సర్కార్. ఉప రాష్ట్రపతిగా రాజకీయాలు మాట్లాడకూడదన్న విలువకు కట్టుబడి ఆయన ఏపీ ప్రయోజనాల గురించి నోరెత్తలేదు. ఆయన ఉప రాష్ట్రపతిగా వెళ్లడం వల్ల ఏపీకి నష్టం జరిగిందనే వారూ లేకపోలేదు. అయితే అదంతా గతం. తన మొత్తం పొలిటికల్ కెరీర్ అంతా బీజేపీ కోసం పాటుపడిన వెంకయ్యకు ఉప రాష్ట్రపతిని చేసి పార్టీ రుణం తీర్చుకుందని చెప్పుకోవడానికి లేకుండా.. మరో సారి ఆ అవకాశం ఇవ్వకుండా.. రాష్ట్రపతి అయ్యే చాన్స్ కూడా ఇవ్వకుండా బలవంతపు రిటైర్మెంట్ ఇచ్చేసింది మోడీ సర్కార్. ఈ విషయంలో తన అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైన వెంకయ్యనాయుడు.. బహిరంగంగా మాత్రం హుందాగా.. రిటైర్మెంట్ లైఫ్ గడిపేస్తున్నారు. తెలిసిన వారూ, అభిమానించే వారు ఆహ్వానిస్తున్న కార్యక్రమాలకు హాజరౌతూ.. ప్రసంగాలలో  ఏవో మంచి మాటలు చెబుతూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా ఆయన విజయవాడలోని మునిసిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న ఎస్ఎస్ఎస్ హోటల్ లో కూర్చుని ఇడ్లీలు తిన్నారు. ఆ ఎస్ఎస్ఎస్  హోటల్ గుబురు చెట్ల నీడలో ఉండే ఓ పాక హోటల్. చక్కగా అందరూ బొంబాయ్ చట్నీ అనే శనగపచ్చడి, అల్లం చట్నీ, కారప్పొడి, నెయ్యితో ఇడ్లీలను ఆరగించిన వెంకయ్య నాయుడు ఆ హోటల్ యజమానిని అభినందించి, గతంలో కూడా ఓ సారి తాను ఇక్కడ ఇడ్లీలు తిన్న విషయాన్ని చెప్పి ఊరుకోకుండా అలవాటు ప్రకారం ఇడ్లీల ప్రాశస్థ్యం, వాటి వల్ల ఆరోగ్యానికి చేకూరే  మేలు వంటి విషయాలపై కూడా ప్రసంగించేవారు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలని సూచనా ఇచ్చేశారు. 

సరిహద్దులో ’విషం‘ కక్కిన బంగ్లా!

భారత్.. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం.. ఎప్పుడూ బీఎస్ఎఫ్ దళాలు గస్తీలో ఉంటాయి.. చీమ చిటుక్కుమన్నా.. కొంచెం అనుమానం వచ్చినా భద్రతా దళాలు అప్రమత్తమవుతాయి.. అలాంటి సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్ జరుగుతోందని సమాచారం అందడంతో.. సైన్యం అప్రమత్తమైంది.. సరిగ్గా అర్దరాత్రి ఇద్దరు వ్యక్తులు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా.. వారిని వారిని బీఎస్ఎఫ్ దళం అడ్డుకుంది. వారిపై కాల్పులు జరపగా.. వారిద్దరూ తప్పించుకున్నారు. ఈ క్రమంలో వారు జారవిడిచిన చిన్న కూజా లాంటి బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అది ఎంటా అని చూడగా.. దెబ్బకు షాక్ అయ్యే విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు స్మగ్లర్లు బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి.. అక్రమంగా రవాణా చేయాలనుకున్న రూ.13 కోట్ల విలువైన పాము విషం. దానిని స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్‌ వెల్లడించింది. బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని హిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోష్‌పూర్ బీఓపీ ప్రాంతంలో.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత.. సుమారు 12.30 గంటల ప్రాంతంలో ఇద్దరు స్మగ్లర్లు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. వారిపై సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే, ఓ సిసాను స్మగ్లర్లు వదిలిపెట్టి పోగా.. దానిని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో పాము విషం ఉండటాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సీసాపై రెడ్ డ్రాగన్ కో ‘మేడ్‌ ఇన్‌ ఫ్రాన్స్‌’ అని రాసి ఉందని.. బాటిల్‌లో ఉన్న విషం కోబ్రాదని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హిలి ప్రాంతంలో BSF 137వ బెటాలియన్ స్వాధీనం చేసుకున్న రూ.13 కోట్ల విలువైన పాము విషాన్ని బలుఘాట్ అటవీ శాఖకు అప్పగించినట్లు రేంజర్ సుకాంత్ ఓజాన్ తెలిపారు.

విశాఖవాసుల నుంచి నిరసన

విశాఖపట్టణం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అని రెండునెలల క్రితం అనౌన్స్ చేసినప్పటికీ నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తొలగలేదు. ఏప్రిల్ 23, 2015న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే,  2020లో, రాష్ట్రం ఒక చట్టం ద్వారా అమరావతి, విశాఖపట్నం మరియు కర్నూలు అనే మూడు రాజధాని నగరాలను నోటిఫై చేసింది. ఈ నోటిఫై తర్వాత విశాఖలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి.  విశాఖలో జనజాగరణ సమితి ఆధ్వర్యంలో 'అమరావతి సత్యం - మూడు రాజధానులు భ్రమ' అనే అంశంపై యువజన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల ప్రతినిధులు, పెద్దఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. విలువైన భూములు దోచుకునేందుకే వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని... సదస్సులో పాల్గొన్న యువత అభిప్రాయపడింది. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనజాగరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చాలనే కొత్త సంప్రదాయానికి తెరలేపడం మంచిది కాదన్నారు. ప్రజలను గందరగోళ పరచకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. విశాఖలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంలో వైఎస్ ప్రభుత్వం మనసు మార్చుకుంది. విశాఖ పెట్టుబడులకు ఆహ్వానించింది. రెండ్రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్   సుమ్మిట్లో ముఖ్యమంత్రి వైజాగ్ రాజధాని అని అనౌన్స్ చేశారు. నేను కూడా విశాఖకు వచ్చేస్తానని హామి ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనౌన్స్ చేసే సమయానికి అమరావతి రాజధాని కేసు విషయం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. సుప్రీంలో కేసు విచారణ దశలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ రాజకీయ కారణాలచేత వైజాగ్ క్యాపిటల్ అని అనౌన్స్ చేశారని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మెన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అమరావతి క్యాపిటల్ అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాజధాని విషయంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జనజారణ సమితి మరోసారి ఆందోళన చేపట్టనుంది. బుధవారం ముఖ్యమంత్రి జగన్ వైజాగ్ , విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు.ఇదే అవకాశంగా తీసుకున్న జనజాగరణ సమితి జగన్ కు వ్యతిరేక ప్లెక్సీలను వైజాగ్ లో అంటించింది. ‘‘రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం, సుస్వాగతం అనే ప్లెక్సీలు వైజాగ్ లో అడుగడుగునా దర్శనమిస్తున్నాయి.   

ఔను వాళ్లిద్దరూ కలిశారు.. ఇక వైసీపీ పని దబిడి దిబిడే!

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడుపు ఖరారైందన్న సంకేతాల మధ్య వైసీపీలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిపోయింది. అందుకే ఆ పార్టీ నాయకులు జనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ వంటి స్టార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలే కాదు దూషణలకు కూడా వెనుకాడటం లేదు. ఒక ఎమ్మెల్యే అయితే జనాగ్రహాన్ని తట్టుకోలేక, సొంత పార్టీ శ్రేణులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోవడాన్ని సహించలేక సొంత పీఏపైనే చేయి చేసుకుని ఫ్రస్ట్రేషన్ ను బయటపెట్టుకున్నారు. ఇక ఆ పార్టీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణం రాజు తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిశాయంటే వైసీపీ ఔట్ అని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలూ కలిస్తే వసీపీ బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోవడం తథ్యమన్నారు.  ఏపీకి విశాలమైన తీర ప్రాంతం ఉంది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే..  ఆ విశాల  తీర ప్రాంత గర్భంలో  వైసీపీ కలిసిపోతుందని రఘురామ రాజు జోస్యం చెప్పారు. నెల్లూరు టు శ్రీకాకుళం, రాయలసీమ యిలా  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయన అన్నారు.  అవినాష్ రెడ్డి అరెస్టుపై  దాగుడుమూతల పర్వం  సాగుతున్నప్పటికీ.. ఆయన అరెస్టు కావడం ఖాయమన్న అభిప్రాయాన్ని రఘురామ రాజు సోమవారం(మే1)  రచ్చబండ లో భాగంగా మీడియాతో చెప్పారు.  యిప్పటికే ఏపీ ప్రజలు రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే వైసీపీని వదిలించుకోకతప్పదన్న నిర్ణయానికి వచ్చేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు.  ఇక తెలుగుదేశం, జనసేన పార్టీలతో బీజేపీ కూడా కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి  చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రఘురామ రాజు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తుంటే బీజేపీకి తెలుగుదేశం, జనసేనలతో కలవక తప్పదనే అనిపిస్తోందన్నారు.  రానున్న ఎన్నికల్లో  రాష్ట్రంలో రెండవ స్థానంలో  అధికార వైసీపీ కచ్చితంగా ఉంటుంది. యిది యిప్పటికే ప్రజలు తీసేసుకున్న నిర్ణయం. సో ప్రజల నిర్ణయాన్ని గౌరవించి రాష్ట్రంలో విపక్షాలన్నీ ఏకం కావాలి. అవుతాయి అని రఘురామ అన్నారు.  క్షేత్రస్థాయిలో ఇప్పటికే టిడిపి, జనసేన కార్యకర్తలు కలిసి పని చేస్తున్నారు.  అంటే రెండు పార్టీల క్యాడర్ ఎప్పుడో కలిసిపోయింది. యిప్పుడు నాయకులు కలుస్తున్నారు. అది వారికి అనివార్యంగా పార్టీ క్యాడర్ మార్చేసింది. దీంతోనే వైసీపీకి బ్యాడ్ టైం మొదలైంది అని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.  రాష్ట్రంలో గతం లో వైసీపీకి 50 % ఉన్న ఓటు బ్యాంక్  గణనీయంగా తగ్గింది. టీడీపీ కి కష్టకాలంలోనూ  40% ఓటు బ్యాంకు ఉండగా, ఇప్పుడు అది భారీగా పెరిగిందని చెప్పిన వైసీపీ రెబల్ ఎంపీ.. ఏ విధంగా చూసినా వైసీపీ రానున్న ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని అధికారాన్ని కోల్పోవడం ఖాయమని చెప్పారు. 

లోకేష్ పాదయాత్రలో జనసేన జెండా రెపరెప!

ఏపీ  రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత వచ్చేసింది. నిన్న మొన్నటి దాకా పొత్తులు, ఎత్తులు, సమీకరణాలపై నెలకొన్న అస్పష్టత మబ్బులు విడిపోయినట్లు విడిపోతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పొత్తు ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.  తెలుగుదేశం అధినేత  చంద్రబాబునాయుడితో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  తాజాగా జరిపిన సుదీర్ఘ భేటీ అనంతరం ఈ రెండు పార్టీలే కాదు.. బీజేపీ కూడా వీటితో కలిసి అడుగులు వేయడం తథ్యమన్న సంకేతాలనిచ్చింది.   బీజేపీ తన భవిష్యత్  రాజకీయ అవసరాల కోసం తటస్థంగానో.. లేకపోతే తెలుగుదేశం, జనసేన కూటమికి దూరంగా ఉన్నా.. లోపాయికారీ మద్దతు మాత్రం తెలుగుదేశం, జనసేన కూటమికే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం- జనసేన పొత్తు మాత్రం ఖాయమన్న సంకేతాలు చంద్రబాబు, పవన్ తాజా భేటీ ద్వారా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  ప్రభుత్వ వ్యతిరేక ఓటును  చీల నివ్వనంటూ పదే పదే చెప్పిన, చెబుతున్న పవన్ కల్యాణ్ తాజాగా బాబుతో జరిపిన భేటీతో జనసైనికులకు ఇక ఎలాంటి సందేహాలకూ తావు లేకుండా మనం తెలుగుదేశంతోనే కలిసి నడుస్తున్నామన్న సంకేతాలు ఇచ్చేశారు. పవన్ సినిమాలలో బిజీగా ఉండి.. ఎన్నికలు దగ్గరపడుతున్నా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో అనుమానంలో ఉన్న జనసైనికులకు తాజా బేటీతో స్పష్టత ఇవ్వడమే ఈ బేటీ ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. యిక ఈ భేటీ తరువాత  జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ , సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన ఇక ఎటువంటి సందేహాలకూ తావు లేకుండా చేసింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేకుండా పొత్తులు ఉంటాయని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పొత్త విషయంలో అధికారిక ప్రకటన కంటే ముందే ప్రజలలోకి ఆ విషయాన్ని తీసుకు వెళ్లాలని యిరు పార్టీలూ నిర్ణయానికి వచ్చినట్లు పరిశీలకులు చెబుతున్నారు. జనసేనాని వారాహి యాత్రకు ముందే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు కలిసి పని చేసే వాతావరణం ఏర్పడేందుకు పవన్, చంద్రబాబు తాజా భేటీ దోహదం చేస్తుందని అంటున్నారు.  రెండు పార్టీలూ కూడా క్షేత్రస్థాయిలో  క్యాడర్‌ను పొత్తుకు అనుకూలంగా సన్నద్ధం చేయడం కోసమే.. తాజా భేటీ జరిగిందని అంటున్నారు.  అంటే  ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై చేసే ఆందోళనలో ముందు ముందు రెండు పార్టీలు కలిసి పాల్గొనే వాతావరణం ఏర్పడేందుకు ఈ భేటీ దోహదం చేసిందని అంటున్నారు.  ఈ భేటీ తరువాతే లోకేష్ పాదయాత్రలో జనసేన జెండాల రెపరెపలు మొదలయ్యాయి.  దమ్ముంటే అన్ని సీట్లకూ పోటీ చేయండి  అని  తెలుగుదేశం, జనసేన పార్టీలను సవాల్ చేస్తూ వైసీపీ ఆడుతున్న మైండ్‌గేమ్‌ కు ఈ భేటీ ఫుల్ స్టాప్ పెట్టేసినట్లేనని అంటున్నారు.      

భారీగా భూములు కొనుగోలు చేసిన కవిత.. ఈడీ అభియోగం!

ఢిల్లీ  మద్యం కుంభకోణంలో  ఈడీ అధికారులు తాజాగా  దాఖలు చేసిన మూడో ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్త అనిల్ పేరు కూడా చేర్చారు. ఈ చార్జిషీట్ లో కవితపై కీలక అభియోగాలు మోపారు. ప్రధానంగా  సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక విషయాలను ఈడీ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. ఎమ్మెల్సీ కవిత ఆమె భర్తతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది. తాజా చార్జిష్టీట్లో పలు కీలక అంశాలను, పలు కొత్త కోణాలను పొందుపరిచింది. మద్యం వ్యాపారంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఈడీ ఈ చార్జిషీట్ లో పొందుపరిచింది.  మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ, కవిత, శరత్ చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు హవాలా రూపంలోనే ఇచ్చారన్న దర్యాప్తు సంస్థ. ముడుపులు యివ్వడం ద్వారా తమకు అనుకూలంగా మద్యం పాలసీ రూపొందేలా  చేశారనీ, దీంతో హోల్ సేల్, రిటైల్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ భారీగా లబ్ది పొందిందని దర్యాప్తు సంస్థ ఈడీ పేర్కొంది. హవాలా రూపంలో నగదు బదిలీ, ముడుపులు చెల్లింపుతో పాటు భూముల కొనుగోళ్ళ వ్యవహారాలను కూడా ఈడీ ఈ చార్జ్ షీట్ లో పొందు పరిచింది.  అలాగే కీలకమైన  వాట్సాప్, సిగ్నల్, ఈ మెయిల్, కాల్ డేటా, హోటల్ రికార్డ్స్ ను జత చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు, మాగుంట రాఘవ తాజాగా వెల్లడించిన కీలక సమాచారాన్ని కూడా ఛార్జ్ షీటులో పొందుపరిచారు. ఛార్జిషీటులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనిష్ సిసోడియా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ, బీఆర్ ఎస్ ఎంఎల్ సి కవితపై పలు అభియోగాలు మోపింది.  ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో కవిత అరుణ్ పిళ్ళై ద్వారా హైదరాబాద్ లో భూములు కొన్నారని,  భూముల కొనుగోలుకు పిళ్ళై బ్యాంకు అకౌంట్ల ద్వారానే నగదు లావాదేవీలు జరిగాయనీ పేర్కొంది. హైదరాబాద్ లో కవిత మూడు ఆస్తులు కొనుగోలు చేశారని, తనకు వున్న రాజకీయ పలుకుబడి కారణంగా తక్కువ రేటుకు కవిత భూములు దక్కించుకున్నారని ఈడి పేర్కొంది. ఈడి ఛార్జిషీటులో కవిత తో పాటు భర్త అనిల్ కుమార్ పేరును ప్రస్తావించిన ఈడి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ పేరునూ ప్రస్తావించింది. లిక్కర్ లాభాలతో భూములు కొనేందుకు కవిత కు ఫీనిక్స్ కు చెందిన శ్రీహరి సహకరించారని పేర్కొంది.  

నిరసన సెగలతో ఫ్రస్ట్రేషన్.. సొంత పీఏ చెంప ఛెళ్లు.. వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం

వైసీపీ నాయకుల్లో  ఫ్రస్ట్రేషన్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో వారేం చేస్తున్నారో,  ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియకుండా వ్యవహరిస్తున్నారు. ఒక మంత్రిగారు మీ కోసం మా ప్రభుత్వం ఎంతో చేస్తోంది. అయినా మీరు చప్పట్లు కొట్టడం లేదంటూ జనంపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు యిస్టముంటే మాకు ఓట్లేయండి లేకపోతే మానేయండి అంటే వార్నింగ్ లాంటి వ్యాఖ్యలు చేశారు. యిది జరిగిన రోజు వ్యవధిలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే సొంత పార్టీ వారే సమస్యలపై నిలదీసే సరికి తట్టుకోలేక సొంత పిఏపైనే చేయి చేసుకున్నారు. అదీ బహిరంగంగా జనం మధ్యలో.. యింతకీ ఆ పీఏ చేసిన నేరమేమిటంటే జనంపైకి దూసుకెళుతున్న ఎమ్మెల్యేను వారించడమే.. ఔను ఎమ్మెల్యే కన్నబాబురాజు అచ్యుతాపురం మండలంలోని మత్స్యకార గ్రామం పూడిమడకలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో సొంత పార్టీకే చెందిన మంత్రి అమర్నాథ్ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీఐఐసీ పైపులైన్ ప్యాకేజీ ఇప్పించడంతో పాటు గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార యువతకు ఉపాధి కల్పించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గోబ్యాక్ నినాదాలు చేశారు. సొంత పార్టీ నేతలే నిలదీయడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారిపైకి కన్నబాబురాజు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆయన పీఏ నవీన్ వర్మ వారించే క్రమంలో ఆయన చేయి పట్టుకుని వెనక్కిలాగారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే.. పీఏ చెంప ఛెళ్లుమనిపించారు. అనంతరం పోలీసుల జోక్యంతో సొంతపార్టీ నేతల నిరసనల మధ్యే కార్యక్రమం  కొనసాగింది. గతంలో కూడా ఈ ఎమ్మెల్యే దురుసువర్తన వార్తలకు ఎక్కింది. తనకు విద్యాదీవెన పథకం మంజూరు కాలేదని తెలిపిన విద్యార్థిపై ఎమ్మెల్యే గతంలో దురుసుగా ప్రవర్తించారు. కొద్దిరోజుల క్రితం మునగపాక మండలం నాగులాపల్లిలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. మళ్ల శంకర్ అనే వ్యక్తి ఇంటి వద్దకెళ్లి ఆయన కుమార్తెను అమ్మఒడి పథకం అందిందా అని ప్రశ్నించారు. అందిందని ఆమె తెలిపింది. తాను ఐటీఐ పూర్తిచేశానని విద్యాదీవెన మంజూరు కాలేదని శంకర్ కుమారుడు శివాజీ ఎమ్మెల్యేకు తెలిపాడు. నువ్వు చదువుకున్న పాఠశాల యాజమాన్యానికి మంజూరైందని ఎమ్మెల్యే వివరించారు. వాళ్లకు మంజూరైనప్పుడు తనకు చెప్పడమెందుకని యువకుడు ఎదురు ప్రశ్నవేశాడు. దీంతో ఎమ్మెల్యే కన్నబాబు తీవ్రంగా స్పందిస్తూ పథకం మంజూరై కూడా ఎదురు ప్రశ్నవేస్తావా? ఇక్కడి నుంచి వెళ్లు అంటూ ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకోసం మళ్లీ మా వద్దకు రారా అని శివాజీ ఎదురు సమాధానం చెప్పేసరికి మరింత ఆగ్రహించిన ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నావ్. పళ్లు పీకేస్తా అంటూ విద్యార్థిపైకి దూసుకువెళ్లారు. ఎమ్మెల్యే ప్రవర్తన అప్పట్లో చర్చనీయాంశమైంది. పథకాలు అందరికీ అందించలేని అధికార ప్రతినిధులు.. వాటి గురించి ప్రశ్నిస్తే..ఇలా దురుదుగా ప్రవర్తించడమేమిటని ప్రజలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.