ఒక పరాజయం 100 తప్పులు.. బాబుని కార్యకర్తలకు దూరం చేసింది ఆ 'చౌదరే'నా?

  మన దగ్గర ఏమీ లేనప్పుడు అందరితో మంచిగా ఉండటం గొప్ప కాదు.. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరితో ఉండటం గొప్ప. అలాగే రాజకీయాల్లో.. పార్టీ క్రియాశీల కార్యకర్తగా ఉన్నప్పుడు మిగతా కార్యకర్తలతో మంచిగా ఉండటం గొప్పకాదు, పార్టీలో తగిన గుర్తింపు వచ్చి మంచి స్థాయికి వెళ్ళాక కూడా కార్యకర్తలతో మంచిగా ఉండటం గొప్ప. ఇది లేకనే టీడీపీలో ఒక నేత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఓ రకంగా టీడీపీ ఓటమికి కూడా కారణమయ్యారు. ఆయనే టీడీపీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ వీవీ చౌదరి. వీవీ చౌదరి అప్పట్లో తెర వెనుక నుండి టీడీపీ కోసం క్రియాశీల కార్యకర్తగా తన వంతు కృషి చేసారు. మరి ఈయన బాబు తనయుడు లోకేష్ దృష్టిలో ఎలా పడ్డారో తెలీదు కానీ.. ఆయనకు బాగా దగ్గరయ్యారు. ఎంతలా అంటే ఫోను చేసి స్వేచ్ఛగా మాట్లాడే అంత. తరువాత పార్టీ ఆఫీస్ లో కూడా వీవీ చౌదరి హవా కొనసాగింది. ఆయన హవానే నిజమైన కార్యకర్తలను పార్టీకి దూరమయ్యేలా చేసింది. దురుసుగా ప్రవర్తించడం, ఎవర్ని లెక్క వేయకుండా మాట్లాడం, కార్యకర్తలు ఏదైనా సమస్యను పార్టీ దృష్టికి తీసుకొస్తే పట్టించుకోకపోవడం. ఇలా సొంత పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారు. పార్టీలో అంతా నేనే అన్నట్లుగా లోకేష్, బాబులకు దగ్గరైన ఈయన.. కార్యకర్తలను దూరం చేసాడు. దీన్ని గుర్తించడంలో బాబు విఫలమయ్యారు. అందుకే ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు.

కృష్ణా నది మీద నింద మోపుతున్న బీజేపీ మాజీ ఎంపీ

  హనుమంతుడు దళిత వర్గానికి చెందినవాడు  - "బీజేపీ" నేత, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు ‘జాట్’ కులానికి చెందినవాడు - "బీజేపీ" నేత, యూపీ మంత్రి లక్ష్మీ నారాయణ చౌదరి  మహాభారత కాలం నుంచే భారత్‌లో ఇంటర్‌నెట్ -  "బీజేపీ" నేత, త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్  మహాభారత కాలం నుంచే జర్నలిజం ఉంది -   "బీజేపీ" నేత, యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ తొలి విమానాన్ని కనిపెట్టింది భారతీయుడే -   "బీజేపీ" నేత, కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్    ప్లాస్టిక్ సర్జరీ దేవుడు-వినాయకుడు - "బీజేపీ" నేత, ప్రధాని నరేంద్ర మోడీ కృష్ణానది మా భూమిని ఆక్రమించింది - "బీజేపీ" నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఇవన్నీ చూస్తోనే నవ్వొస్తోందా మీకు, నవ్వుకోండి నవ్వుకోండి. మిగతా విషయాలు పాతవే కాబట్టి వాటి సంగతి ప్రస్తుతం ప్రస్తావానర్హం కాదు. ఇక గోకరాజు గంగరాజు గారి గురించి మనం మాట్లాడాల్సి వస్తే, ప్రస్తుతం ఏపీ మొత్తం మీద అక్రమ కట్టడాల కూల్చివేతల అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా నది కరకట్టపై ఉన్న కట్టడాలను అక్రమ కట్టడాలుగా తేల్చిన సీఆర్డీఏ అధికారులు ఆయా యజమానులకు కూల్చివేత నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  అందరితో పాటే బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసుల మీద గోకరాజు గారి స్పందనే ఆసక్తికరంగా మారంది. కరకట్టను తాము ఆక్రమించుకోలేదన్న ఆయన కృష్ణా నదే తమ భూములను ఆక్రమించిందని చెప్పిన లాజిక్ కి మైండ్ బ్లాక్ కావడం విలేఖరుల వంతు అయింది. నదీ భూములను తాము ఆక్రమించలేదని నిజానికి తమ భూములను కృష్ణా నదే కబ్జా చేసిందని అంటున్నారు.  25 ఏళ్ల క్రితం నుంచి ఉండవల్లిలో 25 ఎకరాల భూమి ఉందని చెప్పుకొచ్చారు. తాను కట్టిన గెస్ట్ హౌస్ కు వైఎస్సార్ హయాంలో మల్లాది విష్ణు ఉడా చైర్మన్ గా ఉండగానే ఉడా, ఇరిగేషన్ శాఖల అనుమతి తీసుకునే కట్టానని గంగరాజు చెప్పారు. బీపీఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేశామని, అనుమతి రాలేదని చెప్పారు. దీంతో గతంలో ఇరిగేషన్ అధికారులు 30 అడుగులు మాత్రం వదిలి భవనం నిర్మించుకోమని పర్మిషన్ ఇచ్చినట్లుగా గోకరాజు తెలిపారు. నదిలో కూడా‌ మాకు ఇంకా ల్యాండ్ ఉందని వరద వచ్చినప్పుడల్లా మా ల్యాండ్ కొంత కోల్పోతున్నామని ఆయన అంటున్నారు. ఫాంహౌస్ కట్టుకున్న తర్వాత నదికి 100 మీటర్ల లోపల కట్టకూడదని జీవో వచ్చిందని గోకరాజు చెప్పారు. ప్రజావేదికను కూల్చిన విధంగా అన్నీ కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నది వెంబడి ఉన్నటువంటివి ఎన్నో కూల్చాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  తాను కట్టిన భవంతి విలాసవంతమైనది కాదని కేవలం ఫాం హౌస్ మాత్రమే అని వివరించారు. చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తారన్న గోకరాజు అందరి మీద చర్యలు తీసుకున్న తర్వాత తన మీద తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని అంటున్నారు. గోకరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చకు దారితీశాయి. ఆయన మాటలతో అంతా అవాక్కవుతున్నారు.    

చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకున్న బీజేపీ

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టిన బీజేపీ, రెండు తెలుగు రాష్ట్రాలలో వీలయినంత మందిని చేర్చుకునే పనిలో పడింది. ఆ చేర్చుకునేది ఏదో పేరున్న నాయకులనో, నలుగురు చేయెత్తి నమస్కారం పెట్టగలిగిన వ్యక్తులనో చేర్చుకుంటే ఫర్వాలేదు కానీ ఒక అరవై ఏళ్ళు పైబడిన మహిళను తనను లైంగికంగా వేధించిందని పరువు తీసిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడంతో ఇప్పుడు పరువు తీసుకుని, దానిని కవర్ చేసుకునే పనిలో పడింది. తాజాగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ – ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి తనను లైంగిక వేధింపులకు గురి చేసిందంటూ ఎన్నికలా సమయంలో  ఫిర్యాదు చేసిన కోటి అనే వ్యక్తిని కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.  అయితే కోటి కావాలనే లక్ష్మీ పార్వతి పరువు తీయడానికే ఇలా చేశాడని హైదరాబాద్ పోలీసులు తేల్చారు, అంతేకాదు పూనమ్ కౌర్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియోలని వైరల్ చేసింది కూడా ఇతనే అని పోలీసులు గుర్తించారు. కోర్టుకు వెళ్లి నం బెయిలబుల్ వారెంట్ తెద్దాం అనుకునే లోపే ఈ కోటి వెళ్లి బెయిలు తెచ్చేసుకున్నాడు. అయితే అప్పుడు మిస్సయ్యిన కోటి నిన్న బీజేపీ అధ్యక్ష్యుల వారి కండువాలో కనపడ్డాడు. ఈ క్రమంలో ఇలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడంపై సామాన్య ప్రజల్లో సైతం ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్మీపార్వతి వైసీపిలో ఉంది కాబట్టి ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాటి నుంచి తప్పించుకోవడానికి ఆయన బీజేపీలో చేరి ఉంటాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.  సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళను ఆర్ధిక ఉగ్రవాదులు అంటూ తెలుగు ప్రజల్లో ప్రాజెక్ట్ చేసిన బీజేపీ పెద్దలు ఆ తర్వాత ఏమాత్రం తొణకకుండా వారిని పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజకీయాల్లో ఇలాంటివి సహజమే అని జనం సరిపెట్టుకుని ఉండచ్చు, కానీ ఒక మహిళ అది కూడా వృద్ద మహిళను ఇలా అసభ్య రీతిలో చిత్రీకరించిన ఇలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ కోటి పార్టీలో చేరడం వలన ఒరిగేది ఏమీ లేకున్నా పెద్ద నష్టం కలిగేలా ఉండడంతో బీజేపీ నేతలు వెంటనే దీనిపై వివరణ ఇచ్చుకున్నారు.  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గానికి చెందిన 80 మంది టీడీపీ కార్యకర్తలు నిన్న పార్టీలో చేరారని వారిలో కోటి కూడా ఉన్నాడని అతనిని ప్రత్యేకంగా ఏమీ చేర్చుకోలేదని, ఇంకా బీజేపీలో కోటికి సభ్యత్వం ఇవ్వలేదని. అతడు బీజేపీ సభ్యుడు కాదని క్లారిటీ ఇచ్చింది. అయినా తాను 100 మందితో వచ్చి జాయిన్ అయ్యానని, మోడీ పాలన నచ్చే జాయిన్ అయ్యానని కోటి చెబుతుంటే బీజేపీ మాత్రం తమకు సంబంధం లేదని అంటోంది. అయినా విషయం తెలియక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది చెప్పండి.

విత్తన సంక్షోభం : గత ప్రభుత్వ నిర్లక్ష్యమా....ఈ ప్రభుత్వ అనుభవలేమా ?

ఏపీ ప్రభుత్వ అనుభవ లేమి ప్రతి విషయంలోనూ కొట్టోచ్చిన్నట్టు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం పాలన మొదలుపెట్టి నెల రోజులయింది. అయితే ఈ ప్రభుత్వానికి మొట్టమొదటి దెబ్బ రైతుల నుండే తగిలింది. విత్తనాల లేమితో  రైతులందరూ రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఎదురయింది. తడ నుండి ఇచ్చాపురం దాకా విత్తనాల సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే పలు చోట్ల రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. విత్తన పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. పడిగాపులు పడుతున్నారు. కానీ విత్తనాలు మాత్రం అందడం లేదు. అయితే విత్తన సమస్యను తీర్చే చర్యల గురించి చెప్పాల్సిన మంత్రి టీడీపీ ప్రభుత్వం మీద నిందలేసి తాము పరిశుద్దులం అనిపించుకునే ప్రయట్నం చేస్తున్నారు.  ఈ నెల రోజుల్లో వ్యవసాయ సీజన్‌ కు రైతులకు కావాల్సినవి అందుబాటులో ఉంచారో, లేదో మాత్రం సమీక్ష చేయలేకపోయారు ఏపీ మంత్రి వర్యులు. అవినీతి మీద సమీక్ష అంటూ సమయం వృధా చేసిన సర్కార్ ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా వ్యవసాయ సమస్యలపై సమీక్షించలేదు. ఫలితంగా విత్తన సంక్షోభం రైతులను ఏడిపిస్తోంది. ఏదో ఒకటి చేసి విత్తనాలు రైతులకు ఇవ్వాల్సిన సర్కారు గత ప్రభుత్వం దగ్గర ప్రణాళికే లేదని, నాణ్యమైన విత్తనాల పంపిణీలో గత ప్రభుత్వం విఫలమయిందని మంత్రి కన్నబాబు చెప్పుకొస్తున్నారు. విత్తన సేకరణకు, పంపిణీకి గత ప్రభుత్వానికి.. ఒక స్పష్టమైన కార్యాచరణ లేదని మండిపడ్డారు. అయితే సుమారుగా 25 రోజుల క్రితమే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కన్నబాబు, వ్యవసాయశాఖ శాఖ మీద పట్టు సాదించలేకపోయారు అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న రైతులకు ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు పంపించేయాలి మన దగ్గర ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయి అని వ్యవసాయశాఖ అధికారులు దగ్గర సమాచారం ఉంటుంది, కానీ అవి ఏమి తెలుసుకోకుండా మంత్రి అట్టహాసంగా జూన్ 15 తేదీన విత్తన పంపిణీ ప్రారంభించారు. అయితే విత్తన పంపిణీ విషయంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందడంతో రైతులు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు.  ఆలస్యంగా మేలకున్న మంత్రి కన్నబాబు చంద్రబాబు మీదకే నెపం నెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు విత్తనాల కోసం 10 రోజుల్లో మరో వెయ్యి కోట్లు విడుదల చేస్తామని గొప్పగా ప్రకటించారు. ఎక్కువ ధర ఇచ్చైనా నాణ్యమైన విత్తనాలు సేకరిస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది 4.43 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉంటే తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి 50 వేల క్వింటాళ్లనే సేకరించారన్నారు. తాము అధికారంలోకి వచిన తర్వాత 2.70 లక్షల క్వింటాళ్లను సిద్ధం చేసి రైతులకు అందజేశామని, మరో 50 వేల క్వింటాళ్లను అందుబాటులో ఉంచినట్టు చెబుతున్నారు. ఇది జగన్ ప్రభుత్వ అనుభవ లేమితోనే జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీ కొంప ముంచిన NRI ముఠా

  దూరపు కొండలు నునుపు అన్నట్టుగా.. కొందరు ఎన్నారైల మాయలో పడి, వారినేదో గొప్పవారిలా ఊహించుకొని చంద్రబాబు దెబ్బతిన్నారా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నారైలు ఇక్కడ నుంచి విదేశాలకు బ్రతుకుదెరువు కోసం వెళ్లిన వారు మాత్రమే. కానీ బాబు, లోకేష్ లు మాత్రం.. కొందరు ఎన్నారైలను ఆకాశం నుంచి దిగొచ్చిన వారిలా చూస్తూ.. వారి భజనకి, వారి మాయమాటలకు పడిపోయి.. తానా అంటే తందానా అన్నారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఎన్నారైలు నాలుగు డాలర్లు వెనకేసుకునే సరికి.. వారికి టికెట్, వీరికి పదవి అంటూ బాబు, లోకేష్ ల వద్ద పైరవీలు చేసారు. దీంతో నిజమైన కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడిన సరైన గుర్తింపు లేక చిన్నగా పార్టీకి దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు వేమూరి రవి వంటి వారు APNRT పేరుతో చేసిన హడావుడి అంతాఇంతా కాదు. అదేదో ప్రభుత్వ సంస్థనో, పార్టీ అనుబంధ సంస్థనో అన్నట్లు చేసారు. అంతేనా ఎన్నారైలు తిరుమల వస్తే వారికి ప్రత్యేక దర్శనం టికెట్లు అంట. వారేమన్నా దైవాంశ సంభూతులా? లేక మంత్రులు, ప్రధాన మంత్రులా?. ఇలా వారిని నెత్తికి ఎక్కించుకొని బాబు తీవ్ర విమర్శలు పాలయ్యారు. బాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎన్నారైలు.. టీడీపీ తమ కులానికి చెందిన పార్టీ అన్నట్టుగా అత్యుత్సాహం చూపడం కూడా పార్టీ ప్రతిష్టతను దెబ్బతీసింది. టీడీపీ మొదటినుంచి అండగా ఉన్న అనేక కులాలను దూరం చేసింది. ఈ ఎన్నారై ముఠా ఇంకా చాలా కార్యాలు వెలగబెట్టింది. అవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి.

ప్రజాదర్బార్ కాదని....సహస్ర చండీ యాగమా జగన్ ?

  విభజన తర్వాత పదమూడు జిల్లాలతో ఏర్పడ్డ ఏపీకి రెండవ సీఎంగా వైసీపీ అధ్యక్ష్యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాద్యతలు చేపట్టి నిన్నటితో నెల రోజులు పూర్తయ్యాయి. దీంతో చాలా వరకూ మీడియా సంస్థలు, వెబ్ సైట్స్ ఆయన నెల రోజుల పాలన భేష్ అంటూ ఏక పక్ష తీర్మానాలు ఇచ్చేశాయి. అయితే నిజానికి కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే ఆయన ఏమేరకు పని చేస్తున్నారు అనే విషయం అందరికీ ఇట్టే అర్ధం అవుతుంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు బానే ఉంటున్నాయి, కానీ కొన్ని మాత్రం ఆచరణ సాధ్యమా కాదా అనే విషయాన్ని పట్టించుకోకుండా మొండిగా ప్రకటన చేసి ముందుకు వెళ్ళడం వలన అది జగన్ ప్రభుత్వం మీద పెద్ద మచ్చగా మిగిలిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.  ఎందుకంటే ఏ విషయం అయినా చేసేయగలం అనే నమ్మకంతో ప్రకటనలు చేసి ప్రజల ముందు లోకువ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటిదే ప్రజా దర్బార్, ఆయన తండ్రి రాజన్న మాదిరిగానే ప్రజలను నేరుగా కలుస్తారని ఆయన క్యాంప్ ఆఫీసులోనే ప్రజలతో మమేకం అయ్యి వారి సమస్యలు తీరుస్తారని జూన్ 29వ తేదీన సీఎంవో నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. జూలై ఒకటి నుండి ఆయన ప్రతీ రోజూ ప్రజాదర్బార్‌లో పాల్గొన్న తర్వాతే రోజువారీ అధికారిక కార్యక్రమాలల్లో పాల్గొంటారని ప్రకటించారు.  ఈ విషయం మీద ముందు నుండీ సమన్వయం ఉందో లేదో తెలీదు కానీ నిన్న జగన్ తో భేటీ ఐన మంత్రులు, ఈ నెలలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని అవి పూర్తయ్యాక వచ్చే నెలలో ఈ దర్బార్ మొదలవుతుందని ప్రకటించారు. అయితే సీఎంవో ప్రకటన మాత్రం వేరేలా ఉంది, ప్రజల వసతి కోసం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదని అందుకే ఆగస్టు ఒకటో తేదీకి ప్రజాదర్బార్‌ను వాయిదా వేసినట్లుగా ప్రకటించారు. అదొక ఎత్తు అయితే జగన్ ఇంటికి ఈరోజు ప్రజాదర్బార్ వాయిదా పడిన విషయం తెలియక కొంతమంది ప్రజలు వచ్చి జగన్ కోసం ఎదురు చూస్తున్నారు.  అయితే వారికి మాట మాత్రం అయినా ఈ వాయిదా విషయాన్ని చెప్పని జగన్ తమ పార్టీ ఏర్పాటు చేసిన సహస్ర చండీ యాగంలో పాల్గొనేందుకు వెళ్ళిపోయారు. జగన్ అలా వెళ్తున్న విషయాన్ని తెలుస్కున్న ఇంటికి చేరుకున్న ప్రజలు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించి తొక్కిసలాటకి లోనయ్యారు. వైసీపీ ఆధ్వర్యంలో తాడేపల్లి సీఎస్ఆర్ కళ్యాణమండపంలో సహస్ర చండీయాగం జరుగుతోంది. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని కోరుతూ ఏడాది క్రితం వైసీపీ నేతలు ఈ యాగాన్ని చేపట్టారు.  ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి సహకారంతో సాగిన ఈ యాగంలో పార్టీ ముఖ్యనేతలు కూడా పాల్గొంటూ వచ్చారు. ఈరోజు పూర్నాహుతి కార్యక్రమంలో జగన్ పాల్గొని ఈరోజుతో యాగానికి ముగింపు పలికారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో జగన్ దైవ కార్యాలకి వెళితే ఎవరూ తప్పు పట్టరు, కానీ ఆయన ఇలా తన కోసం ఎదురు చూస్తున్న జనానికి మాట మాత్రం అయినా చెప్పకుండా అలా వెళ్ళిపోవడం, అనుభవ లేమితో ప్రకటనలు, వాయిదాలు ఖచ్చితంగా ప్రభుత్వం మీద నెగటివ్ అభిప్రాయం ఏర్పరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటివి ఇప్పటికి అయినా పొరపాట్లు అనుకుని దిద్దుకునే చర్యలు చేపట్టకుంటే ప్రభుత్వానికి ఇబ్బందే !   

వాజ్ పేయి అసమర్ధుడు కాదు....మానవాతావాది

  గతంలో పుల్వామాలో సైనికుల మీద పాక్ లో తలదాచుకున్న ఉగ్రవాద సంస్థ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల గురించి తెలిసిందే. ఈ దాడుల గురించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతుంటారు. అసలు దాడులే జరగలేదని పాకిస్తాన్ చెప్పగా, భారత్ దాడులతో పెద్దగా నష్టం జరగలేదని అప్పట్లో అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. మరో వైపు బీజేపీ మాత్రం బాలాకోట్‌ లో మూడు వందల మంది ఉగ్రవాదులు మృతి చెందారని ప్రచారం చేసింది.   ఏది ఏమైనా జైషే మహమ్మద్ స్థావరంపై మెరుపు దాడులు చేయించటం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మన దేశ పరువుప్రతిష్టలను ఇనుమడింపజేశారని, ప్రపంచం దృష్టిలో మన గౌరవ మర్యాదలను మరింతగా పెంచారు. వ్యూహాత్మకంగా చేసిన వైమానిక దాడి ద్వారా పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పారని విశ్లేషకులు మోడీని పొగిడారు. అలాగే పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ధైర్యంతో వ్యవహరించలేదని, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పాకిస్తాన్‌ ని భయపెట్టలేక పోయారని విశ్లేషకుల వాదన. పాక్‌పై యుద్ధానికి సన్నద్ధం అన్నట్టుగా సైన్యాన్ని సరిహద్దులకు తరలించినా ఆ తరువాత ఎందుకో వాజపేయి వెనక్కి తగ్గారు. అమెరికా ఒత్తిడి వల్ల పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో వెనుకంజ వేసినందుకు గాను వాజపేయి ప్రతిష్ట తగ్గిందని అప్పటి విశ్లేషకులు ఏవేవో చెబుతూ ఆయన ప్రతిష్ట దిగజార్చే వ్యాఖ్యలు, విశ్లేషణలు చేశారు. అయితే దీని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. నిజానికి 13 డిసెంబరు 2001లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారత పార్లమెంటుపై దాడికి పాల్పడింది.  దేశం మొత్తాన్ని పట్టి కుదిపివేసిన ఈ దాడి తర్వాత అప్పటి ప్రధాని వాజ్‌పేయి పాకిస్థాన్ ఆర్మీ ఆధ్వరంలో నడుస్తున్న ఉగ్ర స్థావరాలపై బాలాకోట్ తరహా వాయు దాడులు చేయాలని భావించారట. జైషేకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడికి దిగి తొమ్మిది మందిని చంపిన తర్వాత త్రివిధ దళాధిపతులు అప్పటి రక్షణ శాఖా మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను, జాతీయ భద్రతా సలహాదారు బ్రజేశ్ మిశ్రాను కలిసి చర్చించారట. ఈ సమయంలోనే  పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయాలన్న నిర్ణయానికి వచ్చారట.  మిరేజ్-2000 ఫైటర్ జెట్స్‌తో ఈ దాడికి రూపకల్పన కూడా జరిగిందని అయితే భారత్ దాడులకు సిద్ధమయ్యే అవకాశం ఉందని ముందే గ్రహించిన పాకిస్థాన్ ఆర్మీ జైషే ఉగ్ర స్థావరాలను ఓ స్కూలు, మరో పెద్ద ఆసుపత్రి మధ్యలో ఏర్పాటు చేయడంతో ఈ దాడుల విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. దాడి కారణంగా ఊహకు అందని నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో ఆ ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చిందని, భారత ఆర్మీని ఆరునెలల పాటు బోర్డర్ లో ఉంచి కూడా వెనక్కి రప్పించడానికి అదే కారణం అన్నమాట.  అయితే అప్పుడు వెలుగులోకి రాని విషయాలను ఇప్పుడు వెలుగులోకి ఎలావచ్చాయంటే ఈ విషయాలను అన్నిటినీ ఏ ప్రైమ్‌ మినిస్టర్‌ టు రిమెంబర్‌: మెమరీస్‌ ఆఫ్‌ ఏ మిలటరీ చీఫ్‌ పేరుతో అప్పటి నౌకాదళాధిపతి సుశీల్‌ కుమార్‌ రాసిన పుస్తకంలో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆ పుస్తకం శుక్రవారం విడుదలయింది. ఈ పుస్తకంలోనే ఆయన ఈ విషయాలు అన్నీ రాసుకొచ్చారు. నిజానికి అప్పట్లో రక్షణ, దేశ దౌత్యంకి సంబందించిన విషయాలు అన్నీ రహస్యంగా ఉంచేవారు. ఇప్పటిలా అప్పుడు మీడియా ప్రాబల్యం లేనందువలన ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చేవి కావు, కానీ ఇవేమీ పట్టని విశ్లేషకులు ఒక సమర్ధ ప్రధానిని కూడా అసమర్ద ముద్ర వేసి ప్రచారం మాత్రం చేస్తారు. 

జగన్ నెల రోజుల పాలన.. హిట్టా? ఫట్టా?

  రాష్ట్ర విభజన తరువాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకి పట్టంకట్టిన ఏపీ ప్రజలు.. రెండోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పట్టంకట్టారు. జగన్ ఏపీ సీఎంగా మే 30 న ప్రమాణం స్వీకారం చేసారు. అంటే జగన్ సీఎంగా ప్రమాణం చేసి నెల రోజులు పూర్తయింది. మరి జగన్ మొదటి నెలరోజుల పాలన ఎలా ఉంది?. బాబుని కాదనుకొని ఒక్క ఛాన్స్ ఇచ్చిన ఏపీ ప్రజల మనసు జగన్ గెలుచుకున్నారా? మొదటి నెలరోజుల పాలనలో బాబు కంటే మెరుగ్గా పాలించారా? వంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయడానికన్నా ముందే.. కేంద్రాన్ని ఓ విషయంలో పట్టుబట్టారు. తెలంగాణలోని 7 పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణం చేస్తానన్నారు. అనుకున్నది సాధించారు. పోలవరం ముంపు మండలాల విషయంలో విజయం సాధించిన బాబు.. సీఎం హోదాలో తొలి సంతకాలు చేసిన కొన్ని అంశాలపై మాత్రం పూర్తిగా విజయం సాధించలేకపోయారనే చెప్పాలి. సీఎంగా ప్రమాణం చేసిన బాబు అప్పుడు ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. తొలి సంతకం.. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, చేనేత రుణ మాఫీ ఫైలుపై సంతకం చేసారు. అయితే ఇవి ఐదేళ్లల్లో పూర్తిస్థాయిలో జరగలేదనే చెప్పాలి. రెండో సంతకం.. వృద్ధులు, వితంతువులకు రూ. 1000 పెన్షన్, వికలాంగులకు రూ. 1500 పెన్షన్ ఫైలుపై చేసారు. ఈ విషయంలో బాబు మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు తరువాత పెన్షన్ ని రెట్టింపు కూడా చేసారు. మూడో సంతకం.. అన్ని గ్రామాలకు తాగునీరు అందించే 'ఎన్టీఆర్ సుజల స్రవంతి' పథకం ఫైలుపై చేసారు. రూ.2 కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. కానీ ఈ పథకం పూర్తిస్థాయిలో ఆచరణ సాధ్యం కాలేదు. నాలుగో సంతకం.. బెల్టు షాపుల రద్దు ఫైలుపై చేసారు. ఈ విషయంలో బాబు విఫలమయ్యారనే చెప్పాలి. ఇక ఐదో సంతకం.. ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచే ఫైలుపై సంతకం చేశారు. ఈ విషయంలో బాబు మాట నిలబెట్టుకున్నారు. బాబు ఐదేళ్ల పాలన చూసాం కాబట్టి తొలి ఐదు సంతకాల అంశాలు నెరవేర్చారో లేదో ఓ స్పష్టత ఉంది. అయితే జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకొని నెలరోజులే అవుతుంది కాబట్టి.. ఈ నెల రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలు గురించి ప్రధానంగా చర్చిద్దాం.  సీఎంగా ప్రమాణం చేసిన జగన్.. రూ.2000 ఉన్న పెన్షన్ ను రూ.2250 కు పెంచుతూ తొలి సంతకం చేసారు. అయితే ఈ విషయంలో జగన్ కాస్త విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో పెన్షన్ రూ.3000 లకు పెంచుకుంటూ పోతామని క్లియర్ గా రాసినప్పటికీ, ఎన్నికల ప్రచారంలో మాత్రం పెన్షన్ రూ.3000 చేస్తామని పదేపదే చెప్పారు. దీంతో ప్రజలు జగన్ సీఎం కాగానే పెన్షన్ రూ.3000 చేస్తారనుకున్నారు. తీరా సీఎం అయ్యాక మేనిఫెస్టోలో రాసినట్టే పెంచుకుంటూ పోతామని సంతకం చేసారు. దీంతో కాస్త విమర్శలు ఎదురయ్యాయి. జగన్ తన మంత్రివర్గంలో అన్ని సామజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రశంసలు అందుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో 50 శాతం చోటు కల్పించారు. దళిత మహిళను హోంమంత్రిగా నియమించారు. ఇక అమ్మఒడి పథకంపై కొన్ని విమర్శలు ఎదురైనప్పటికి జగన్ కి ఈ విషయంలో మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి. పాఠశాలకు కి పిల్లల్ని పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని జగన్ ప్రకటించారు. అయితే ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తిస్తుందని కొందరు నేతలు చెప్పడంతో.. పెన్షన్ లో మెలిక పెట్టినట్టే ఈ పథకంలో కూడా మెలిక పెట్టారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో తరువాత మళ్ళీ ఏ పాఠశాలలో చదివినా వర్తిస్తుందని నేతలు చెప్పుకొచ్చారు. అయితే విశ్లేషకులు మాత్రం ఈ పథకాన్ని  ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయడం కూడా మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జగన్  ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తానని, రెండేళ్లలో వాటి రూపు రేఖలే మారిపోతాయని చెప్తున్నారు. అందుకే ఆ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముందనేది విశ్లేషకుల భావన. అంతేకాదు ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన వారికి కూడా పథకం వర్తిస్తే.. బడ్జెట్ మరింత భారమవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఫిరాయింపులను ప్రోత్సహించనని, ఒకవేళ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలనుకుంటే.. కచ్చితంగా రాజీనామా చేసి రావాల్సిందేనని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ నెల రోజుల్లో జగన్ ని బాగా ఇబ్బంది పెట్టిన అంశం ఏదైనా ఉందా అంటే ప్రత్యేకహోదా అనే చెప్పాలి. జగన్ హోదా విషయంలో మొదటి నుంచి దృఢ నిశ్చయంతో ఉన్నారు. హోదా వచ్చే వరకు పోరాడతామని చెబుతూ వస్తున్నారు. అయితే సీఎం అయ్యాక మాత్రం కేంద్రంలో బీజేపీకి పూర్తీ మెజారిటీ ఉందని, బ్రతిమాలడం తప్ప గట్టిగా అడగలేం అన్నట్టుగా మాట్లాడారు. దీనికి తోడు బీజేపీ హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో జగన్ హోదా విషయంలో ఎలాంటి అడుగులు వేస్తారోనన్న ఆసక్తి నెలకొంది. అవినీతిరహిత పాలన అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతున్న జగన్.. గత ప్రభుత్వ అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. అంతేకాదు అక్రమ కట్టడాలపై చర్యలు అంటూ.. ఏకంగా గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికనే కూల్చేసి సంచలం సృష్టించారు. అయితే ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ప్రజాధనాన్ని వృథా చేసారని విమర్శించారు. అయితే కొందరు మాత్రం.. 'మార్పు మననుంచే మొదలు కావాలి అంటారు. అందుకే జగన్ మొదట ప్రభుత్వ అక్రమ కట్టడాన్ని కూల్చేసి, తరువాత మిగతా అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టారు.' అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ సన్నిహితంగా ఉంటూ.. నీళ్ల పంపకం, విభజన సమస్యలు పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. మరి ముందు ముందు జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

జమిలీ వెనుక మెయిన్ రీజన్...మోడీ ఏజ్ ఫ్యాక్టర్ ?

మోడీ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత ఒక అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షుడ్ని ఆహ్వానించారు. మొత్తం ఐదు అంశాలు ఎజెండాగా చెప్పినప్పటికీ అసలు విషయం మాత్రం జమిలీ ఎన్నికలు అనేది అప్పటికే అందరికీ అర్ధం అయ్యే ఉంటుంది.  ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనే నినాదాన్ని భాజపా చాలా కాలంగా వినిపిస్తోంది. వాస్తవానికి జమిలి ఎన్నికలు నిర్వహణ మీద గతంలోనూ బిజెపి పాలనలోనే న్యాయశాఖ 1999లో జమిలికి జై కొట్టగా 2015లో పార్లమెంటు స్థాయి కమిటీ కూడా జమిలికి మద్దతుగా ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది.  మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సగానికి సగం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేసిజమిలీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అందు కోసం సాధ్యాసాధ్యాల పరిశీలనకు లా కమిషన్‌ను కూడా నియమించారు. ఆ కమిషన్ అన్ని పార్టీల దగ్గర్నుంచి అభిప్రాయాలు తీసుకుంది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే  ఎదురయ్యే సవాళ్లు అధిగమించాల్సిన మార్గాలతో నివేదిక సిద్ధం చేసింది. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని వ్యతిరేకించే ప్రతీ పార్టీ జమిలీ ఎన్నికలను అంగీకరించలేదు. అందుకే జమిలీ లేకుండానే మొన్నటి ఎన్నికలు అయిపోయాయి.  అయితే గతంలో జమిలీ ప్రతిపాదన వచ్చినప్పుడు లా కమిషన్ ముందు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ , టీడీపీ, బీఎస్పీ సహా పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ ఇప్పుడు కొన్ని పార్టీలు జమిలీ ఎన్నికలను స్వాగతించక తప్పని పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జమిలీ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. లా కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు.  అయితే ఇక్కడ అసలు విషయం ఇప్పుడు బయటకి వస్తోంది. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి మూడేళ్లలో కసరత్తు పూర్తి చేసి రెండేళ్ల ముందే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.  అంటే 2022లో జమిలీ ఎన్నికలు పెట్టొచ్చు. ఆ ఏడాది దాదాపుగా ఎనిమిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఏడాది మరో ఐదు రాష్ట్రాలకు జరగాల్సి ఉంది. 2021లో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటన్నింటినీ కలిపేసి.. 2022లో పెట్టడానికి.. బీజేపీ అంతర్గత కసరత్తు చేస్తోందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. జమిలీని పెడితే ఎలాంటి సమస్యలు వస్తాయన్న విషయాల మీద అనేక రకాలుగా పరిశీలన జరుపుతున్నారు అగ్రనేతలు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రప్రభుత్వాల కాలపరిమితి తగ్గించాలి లేదా పెంచాలి. అలా చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం.  అందుకే ఆ ప్రయత్నాలకి ఇబ్బంది కలగకుండా రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి రెండేళ్ల ముందే ఈ సారి ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యరం లేదని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి దీని వెనుక మోడీ బుర్ర ప్రధానం అని తెలుస్తోంది ! కానీ ఎందుకయ్యా అంటే, తాజాగా బీజేపీ పెద్దలు కొత్త రూల్ ఒకటి తెచ్చారంట. దాని ప్రకారం బీజేపీలో 75 ఏళ్ల పైబడిన ఎవరికీ టిక్కెట్లు ఇవ్వరట. అందుకే మొన్నటి ఎన్నికల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా లాంటి వాళ్ళని ఇళ్లకే పరిమితం చేశారు.  అయితే ఇప్పుడు ఇదే రూల్ మోడీ తలకు చుట్టుకునేలా ఉంది. అది ఎలా అంటే ప్రస్తుతం మోడీ వయసు 68, ఆయన లెక్క ప్రకరం మళ్ళీ పోటీ చేస్తే వచ్చే వయసు 73 ఏళ్ళు, అప్పటికి టికెట్ వచ్చినా ఆయనని ప్రధాని పదవి నుండి తప్పుకోమని ఆర్ఎస్ఎస్ అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే గడ్కరీ లాంటి నేతలను లైన్ లోకి తెస్తున్న ఆ సంస్థ మళ్ళీ మోడీ అంటే ఇబ్బంది పెట్టచ్చు. అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా   2022లో జమిలీ పెడితే ఇంకా నాలుగేళ్ళు ఉంటుందనే కారణంతో మోడీ మళ్ళీ ప్రధాని కావచ్చు. అలా మూడు సార్లు ప్రధానిగా పని చేసి అప్పుడు తప్పుకోవచ్చనేది ఆయన యోచనగా చెబుతున్నారు విశ్లేషకులు. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలీదు కానీ ఒక్క మనిషి అధికారం కోసం ఇంత చేయడం దేనికి సంకేతమో మరి ? 

చంద్రబాబు భద్రత...అక్రమ కట్టడాలు...జగన్ కి తలనొప్పే !

  నిన్నమొన్నటి దాకా ఏపీలో ప్రజావేదిక హాట్ టాపిక్ గా నిలవగా ఇప్పుడు అందరి దృష్టీ చంద్రబాబు భద్రత మీద పడింది. దానికి ముఖ్య కారణం ఆయన భద్రత తగ్గించడమే. గత పదేళ్ళుగా  ఆయనకు ఒక ఏఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో భద్రత ఉండేదని, ఇప్పుడు కేవలం ఒక షిఫ్టునకు ఇద్దరు కానిస్టేబుళ్లు మిగిలారని, కేవలం కక్షపూరితంగానే ఇలా చేశారనే వాదన వినిపిస్తోంది. గతంలో వైఎస్ మొదటి సారి ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబుకు భదత్ర తగ్గించాలని నిర్ణయించి ఎన్‌ఎస్జీ భద్రత కూడా అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసారు. అయితే అప్పట్లో టీడీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న ఎర్రన్నాయుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ను కలిసి ఆయనకు భద్రతా కల్పించాల్సిన విషయం మీద మాట్లాడితే మన్మోహన్‌ వెంటనే భద్రత పునరుద్ధరించడంమే కాక జడ్‌ ప్లస్‌, ఎన్‌ఎ్‌సజీ భదత్ర కల్పించారు.  కానీ జగన్ ఎన్ఎస్జీని ఏమీ చేయలేదు కానీ ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను కుదిస్తూ వస్తున్నారు. చివరికి ఇద్దరు కానిస్టేబుల్స్ ని ఉంచారు. అయితే ఈ విషయం మీద టీడీపీ నేతలు విమర్శలు చేస్తోంటే ఈ భద్రత తగ్గింపు అంశంపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ఏ కేటగిరీ వ్యక్తులకు ఎంత భద్రత కల్పించాలనేది భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఎవరూ కక్షపూరిత నిర్ణయం తీసుకోలేదని కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబుకు చట్టపరిధిలోనే భద్రత కేటాయింపు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ భద్రతా తగ్గింపు అనే అంశం మీద జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కు కి కూడా మోడీ ప్రభుత్వం సిబ్బందిని తగ్గించింది.  నిజానికి చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ, ఎన్ఎస్జీ కమాండోలతో రక్షణ కల్పించడానికి కారణం చంద్రబాబు మీద జరిగిన అలిపిరి హత్యాయత్నం. ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలను తీసుకువెళ్తున్న సమయంలో తిరుమల వెళ్లేముందు అలిపిరిలో ఈ బ్లాస్ట్ చేశారు మావోయిస్ట్ లు. దీంతో ఆనాటి నుండే ఆయనకు ఈ స్థాయి భద్రత కల్పిస్తూ వచ్చింది ప్రభుత్వం. అయితే వైఎస్ అప్పట్లో తగ్గించాలని చూసిన మన్మోహన్ దెబ్బకు వెనక్కి తగ్గారు, మన్మోహన్ ఉన్నంతవరకూ అంతెందుకు మోడీతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చంద్రబాబుకు భద్రతా తగ్గించలేదు కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండే ఈ భద్రతా తగ్గింపు స్పష్టంగా కనిపిస్తోంది. కక్షపూరితంగా చేయట్లేదని చెబుతున్నా అది స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఏపీ ప్రభుత్వం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి.  కానీ వాటి సంగతి పక్కన పెట్టి ముందుగా ఈ పని పడతా అన్నట్టు జగన్ చంద్రబాబుని తెలుగుదేశాన్ని, గతంలో ఆ ప్రభుత్వం చేసిన పనుల మీదే మెయిన్ ఫోకస్ పెట్టుకు కూర్చుంది. నిజానికి పోలవరం విషయంలో చంద్రబాబు సర్కార్ ని టార్గెట్ చేయచ్చని జగన్ భావించాడు. కానీ అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కేంద్రం చంద్రబాబు ప్రభుత్వం పంపిన అంచనాలను ఆమోదించింది. ఈ ఘటనతో మింగుడు పడనీ జగన్ ఏదో ఒక విధంగా బాబుని టార్గెట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ విషయంలో టీడీపీ నేతల స్పందన ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం హుందాగా స్పందిస్తున్నారు. ప్రభుత్వానికి తన మీద కోపం ఉండి భద్రత తగ్గిస్తే తగ్గించనివ్వండని,  ప్రజలే నాకు రక్షకులు దేవుడు, ప్రజల ఆశీస్సుల వల్లే అలిపిరి దాడిలో మృత్యువు నుంచి బయటపడ్డానని, తనకు తన భద్రత సమస్య కాదనీ రాష్ట్రంలో సామాన్యుల భద్రత ముఖ్యం అంటూ చెబుతున్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అవాంఛనీయ పరిస్థితుల పట్ల హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తున్న విధానం సరైంది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.  మొన్నటికి మొన్న ఒంగోలులో జరిగిన రేప్ గురించి స్పందిస్తూ ఎన్నో జరుగుతుంటాయి, అంతమాత్రాన ప్రతిచోట ఉండి కాపలా కాయలేం కదా అని ఆవిడ చెప్పుకొచ్చారు. హోంమంత్రే అంటే ఇక సామాన్యుడికి దిక్కెవరని బాబు ప్రశ్నించారు. ఇలాంటి ఘర్షణ వాతావరనం సృష్టించి ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద కొట్టుకుంటూ ఉంటే పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేదనే భావనతో పరిశ్రమలు రావని, యువతకు ఉపాధి అవకాశాలు నిర్వీర్యమవుతాయని, శాంతిభద్రతల అంశమే పెట్టుబడుల్లో కీలకమని ఆయన అంటున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే రాష్ట్ర అభివృద్ధికి తానుచేసిన కృషంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాంత రైతులు ఆయనను కలిసేందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. చంద్రబాబు మీద నమ్మకంతోనే తాము భూములు ఇచ్చామని ఇప్పుడు ఆయన ఇంటినే కూల్చే పరిస్థితి వస్తే వెలగపూడి, తుళ్లూరు, రావిపూడి గ్రామాల చుట్టుపక్కల ఆయన నివాసానికి స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్నారు. మరి అజేయ కళ్ళం లాంటి సీనియర్ ఐఏఎస్ లను తన సలహాదారులుగా చేర్చుకున్న జగన్ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తే జరిగే నష్టం గురించి వారితో చర్చించలేదా ? లేక వారు ఏదైనా సలహా ఇచ్చినా జగన్ పట్టించుకోవడం లేదా ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.  ఎక్కడైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముందుగా ద్రుష్టి పెట్టేది రాష్ట్ర అభివృద్ధి మీద, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం అక్రమం, అవినీతి అంటూ వేరేవాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తోంది. పాజిటివిటీ మీద పనులు చేసుకుంటూ వెళ్ళాల్సింది పోయి, నెగిటివిటీతో జరిగిన పనులను, ఇబ్బంది లేకున్నా అక్రమ కట్టడాల మీద చూపిస్తున్న జులుం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేదే, అది ఇప్పటికిప్పుడు ప్రభావం చూపకపోవచ్చు కానీ, జగన్ కి ఆ ప్రభావం ఖచ్చితంగా అర్ధం అయ్యే రోజు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఒక పరాజయం 100 తప్పులు.. నంద్యాల వాపును బలుపుగా భావించారా?

  క్రికెట్ టోర్నమెంట్ లో.. లీగుల్లో, సెమీ ఫైనల్లో గెలిచాం కదా అని.. ఫైనల్లో అతి విశ్వాసంతో నిర్లక్ష్యంగా ఆడితే ఆ టీంకి ఓటమి ఎదురయ్యే అవకాశాలున్నాయి. సరిగ్గా టీడీపీ విషయంలో కూడా అలాంటి అతి విశ్వాసమే దెబ్బతీసింది అనిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో.. ఆ ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు రూపంలో చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. అలాంటి వాటిల్లో నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ఉన్నాయి. ఆ రెండు ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించింది. కానీ ఆ విజయం ఎలా దక్కిందన్నదే ప్రశ్న.  ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అన్ని దారులు తొక్కిందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ధన ప్రవాహం ఓ రేంజ్ లో జరిగిందని బహిరంగ రహస్యం. అంటే ఆ ఎన్నికల ఫలితాన్ని బట్టి బాబు సర్కార్ పై ప్రజలు సంతృప్తితో ఉన్నారో లేదో అంచనా వేయలేం. ఇక కాకినాడ మున్సిపల్ ఎన్నిక కూడా అక్కడ స్థానిక నేతల పనితీరు మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. దీనిని బట్టి కూడా బాబు సర్కార్ పై ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడం కష్టం. కానీ టీడీపీ మాత్రం ఈ రెండు విజయాలతో.. 2019 ఎన్నికల్లో కూడా తమదే అధికారమని ధీమా వ్యక్తం చేసింది. ముఖ్యంగా నంద్యాల ఉపఎన్నికల ఫలితాన్ని చూసి మాకు తిరుగులేదని అతి విశ్వాసానికి పోయింది. అదే కొంపముంచింది. నంద్యాల ఉపఎన్నికలో ప్రజల నిజమైన నాడిని తెలుసుకోకుండా.. టీడీపీ రకరకాల దారులు తొక్కి గెలిచిందని ఆరోపణలు వచ్చాయి. దానికితోడు ఆ గెలుపుని చూసి ఇక మాకు తిరుగులేదని భ్రమల్లో తేలిపోయిందని అంటున్నారు.

జగన్ ప్లాన్ : ప్రజావేదిక మీద ఫోకస్....ప్రత్యేక హోదా మిస్సయ్యింది !

  గత మూడు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న ఏకైక న్యూస్ ప్రజావేదిక. మీడియా ఫోకస్ మొత్తం ఆ ప్రజావేదిక కూల్చివేత, దాని మీద ప్రముఖుల స్పందన, పబ్లిక్ టాక్స్ పెడుతూ అదే ఏపీకి జీవన్మరణ సమస్యలాగా కలరింగ్ ఇచ్చింది. దాదపు ప్రజలు కూడా అన్ని విషయాలూ వదిలేసి రెండు వర్గాలుగా విడిపోయి మరీ ఈ విషయాన్ని ఒకరు ఖండిస్తుంటే మరొకరు సమర్దిస్తూ ఇదొక జీవన్మరణ సమస్యలా చేస్తూ వెళ్ళారు. ఏపీ ప్రజల్లో ఇంతగా ఈ విషయం హైలైట్ కావాడానికి కారణం మీడియా అని చెప్పక తప్పదు. అయితే ఈ విషయం మీడియాలో ఇంతగా హైలైట్ కావడానికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే అందుకు పలు ఆసక్తికర అంశాలను విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీలో నూతనంగా పాలనా పగ్గాలు చేపట్టి పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారనే భావన ఏపీ ప్రజల్లో ఎర్పడుతూ వచ్చింది. దానికి కారణం ఆయన బీజేపీ అలాగే తెలంగాణా రాష్ట్రంతో వ్యవహరిస్తున్న వైఖరి అనే చెప్పొచ్చు. నిజానికి అధికారంలోకి వచ్చే ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది కూడా ప్రత్యేక హోదానే. ఎలాగైనా ఏపీకి హోదా సాధించి తీరుతామని కేంద్రంలో ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికి మద్దతు ఇస్తామని చెబుతూ వచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తానంటే కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశమే లేదని ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అది కేవలం వైసీపీ వలనే సాధ్యమని వైకాపా నేతలు ఎన్నికల ముందు గట్టిగా చెప్పారు.  జనం సైతం వారి మాటల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. కానీ గెలిచిన మరునాడే కేంద్రానికి పరిపూర్ణ బలం ఉంది కాబట్టి ఆ విషయంలో గట్టిగా మాట్లాడలేమని జగన్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఇన్ని సీట్లు రాకుండా ఉండాల్సింది అని ఆయన వ్యాఖ్యలు చేశారు . కానీ ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. దాని కోసం ప్రయత్నం చేస్తున్న జగన్ కు కేంద్రం ఝలక్ ఇస్తూ సరిగ్గా నాలుగు రోజుల క్రితమే హోదాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరి వెల్లడించింది. ‘హోదా ఇచ్చేది లేదు’ అని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్‌సభలో జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్‌ అడిగిన ఓ ప్రశ్నకు జగన్ ప్రజావేదిక లో కలెక్టర్ ల సదస్సు ఏర్పాటు చేసిన రోజే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, ఒడిసా, రాజస్థాన్‌, బిహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుంచీ ప్రత్యేక హోదా డిమాండ్లు వచ్చాయి. అయితే, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేవని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిజానికి గతంలో ప్రణాళిక సహకారంలో భాగంగా ఆయా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక హోదా ఇచ్చేది. కొండ ప్రాంతాలు, తక్కువ జన సాంద్రత, ఎక్కువ గిరిజన జనాభా, పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలు, ఆర్థిక, మౌలిక సదుపాయాల వెనుకబాటు, వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హోదా ఇచ్చేవారు.  కానీ ప్రత్యేక హోదాలో పారిశ్రామిక వృద్ధికి నిర్దిష్ట చర్యలేమీ లేవని ఆమె తన సమాధానంలో వివరించారు. ఈ విషయం మీడియాలోకి రాక ముందే జాగ్రత్త పడిన జగన్ జాగ్రత్త పడ్డారు, వెంటనే ఈ ప్రజావేదికని కూల్చివేస్తున్నామని ఆయన అప్పటికప్పుడు ప్రకటించారు. ఇక అప్పటికే పెద్దగా న్యూస్ లేక కరువులో ఉన్న తెలుగు మీడియాకి ఈ సమస్య పెద్ద బంగారు బాతులా కనపడి ఉండచ్చు, దీంతో వెంటనే పబ్లిక్ పల్స్ లూ, సెలెబ్రిటీ బైట్స్ అంటూ సినిమా కోసం ప్రమోషన్స్ చేసినట్టు ఈ ప్రజావేదిక విషయంలో కాన్సంట్రేట్ చేశారు. అంటే ఒక రకంగా జగన్ చేసిన చిన్న డీవిఏషన్ కి మీడియా పడిపోయింది. మరి తెలిసి అలా చేసిందో తెలియక అలా చేసిందో కానీ మొత్తానికి ఆ విషయాన్ని పక్కన పెట్టేసేలా వ్యవహరించింది. ఇక ఈ విషయం మీద మాట్లాడిన బీజేపీ నాయకురాలు పురందేశ్వరి  ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి జగన్ పక్కదోవ పట్టించరాదని హితవు పలికారు. నిజానికి ఆయన అప్పటికే పక్క దోవ పట్టించేశారు. ఈవిడకే కాస్త ఆలస్యంగా అర్ధం అయినట్టుంది.

ఒక పరాజయం 100 తప్పులు.. పుష్కరాల 'అతి' ఈ 'గతి' కి కారణమా?

  పుష్కరాల 'అతి' టీడీపీకి ఈ 'గతి' పట్టడానికి ఓ కారణమా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణ, గోదావరి రెండు పుష్కరాలు వచ్చాయి. భక్తితో చేయాల్సిన పుష్కరాలను వేల కోట్లు ఖర్చు పెట్టి భారీగా చేసి.. విమర్శలు పాలయ్యారు. అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. రాజధాని లేదు, ప్రాజెక్ట్ లు నిర్మాణం జరగాలి, లోటు బడ్జెట్. ఇవన్నీ తెలిసి కూడా దశాబ్దాల అనుభవమున్న బాబు.. పుష్కరాల పేరుతో వేలకోట్లు వృథా చేసారు. పోనీ అంత ఖర్చు పెట్టి పుష్కారాల ఏర్పాట్లు అయినా సరిగ్గా చేసారా అంటే అదీ లేదు. విపరీతమైన ప్రచారం చేసుకున్నారు కానీ, పుష్కర ఘాట్లు సరిగ్గా ఏర్పాటు చేయలేకపోయారు. అప్పటికప్పుడు నామినేషన్ల పద్దతిలో టెండర్లు ఇచ్చారు. వారు డబ్బులు తిని అరకొర ఏర్పాట్లు చేసారు. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వీటికితోడు పుష్కారాలను సినీ దర్శకుడితో షూట్ చేపించారు. అలాంటి వాటి వల్ల ప్రజాధనం వృధా అయింది కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అంతేకాదు, పుష్కారాల సమయంలో దివ్యమైన ముహూర్తం అంటూ ఒక సమయాన్ని ప్రచారం చేసారు. దీంతో ప్రజలందరూ అదే సమయంలో పుష్కర స్నానం చేయడానికి ఉత్సాహం చూపించారు. చివరికి సీఎం గా ఉన్న బాబు కూడా.. సకుటుంబ సమేతంగా అదే సమయానికి పుష్కర స్నానం చేసారు. ఆ ముహూర్తం పుణ్యమా అని తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పుష్కరాల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారంటూ టీడీపీ ప్రభుత్వం మీద అప్పుడే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలా పుష్కరాల పేరుతో ఓ వైపు కోట్ల రూపాయల ప్రజాధనం వృథా, మరోవైపు ప్రజల ప్రాణాలతో చెలగాటం.. దీంతో టీడీపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేకత ఓటమికి దారి తీసింది.

కాపు నేతల డిమాండ్....బాబు ఒప్పుకునేనా ?

పార్టీ ఓటమి పాలయ్యాక విదేశాలకి వెళ్లి రెస్ట్ తీసుకుని వచ్చిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు. ఆయన ఊరిలో లేనప్పుడు కాపు నేతలు అందరూ కాకినాడ వెళ్లి పార్టీ నేత తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున రాజ్యసభ ఎంపీలు నలుగురు పార్టీ ఫిరాయించి ఏకంగా టీడీపీ రాజ్యసభా పక్షాన్నే బీజేపీలో కలిపేశారు దీంతో ఈ కాపు నేతలు కూడా పార్టీ మారతారు అనే ప్రచారం గట్టిగా జరిగింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు వారి మీద ద్రుష్టి సారించినట్టు చెబుతున్నారు.  అదే కాక నిన్న తాను నిర్వహించిన సమావేశానికి అందుబాటులో ఉండి కూడా హాజరుకాని నేతలపై ఆరా తీసిన చంద్రబాబు వాళ్లు ఎందుకు సమావేశానికి రాలేదని పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన కాపు నేతలు బొండా ఉమా, జ్యోతుల నెహ్రు, తోట త్రిమూర్తులు, పంచాకర్ల రమేష్ బాబు లాంటి నేతల అసంతృప్తికి కారణం ఏమిటనే విషయాన్ని తెలుసుకోవాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. బాబు ఆదేశాలతో ఇప్పటికే వీరితో కాపు సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, చినరాజప్పలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.  అయితే వీరంతా పార్టీ మారాలని ఆ మీటింగ్ పెట్టుకోలేదని ఈ మీటింగ్ వెనుక ఒక ముఖ్య కారణం ఉందని అంటున్నారు. నిజానికి చంద్రబాబువ రేపు సాయంత్రం కాపునేతలతో భేటీ కానున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. కాకినాడ సమావేశానికి హాజరైన కాపు నేతలను చంద్రబాబు భేటీకి ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి వెళ్ళే వారు అందరూ ఓకే మాట మీద ఉన్నారని అంటున్నారు. పార్టీని బ్రష్టు పట్టించిన ఒక ఇద్ద‌రు నేత‌ల‌ను త‌ప్పించాల‌ని, అది కుదరని పక్షంలో ఎవరి దారి వాళ్ళం చూసుకుంటామని బాబుకి చెప్పనున్నట్టు సమాచారం.  నిజానికి కాకినాడ సమావేశంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపు అభ్య‌ర్దుల పైన వివ‌క్ష చూపించి లోకేష్ కమ్మ సామాజిక వర్గ అభ్యర్ధులకి స‌హ‌కారం ఎలా అందించించారనే విషయం మీదా వారి ప్రధాన చర్చ నడిచినట్టు సమాచారం.  లోకేశ్ పార్టీ వ్యవహారాల్లో ఉండడం వ‌ల‌నే పార్టీకి న‌ష్టం జ‌రిగింద‌ని, అదీ కాక ఎన్నిక‌ల వేళ‌ లోకేశ్ వ్య‌వ‌హ‌రించిన తీరు పైన కాపు నేత‌లు ఆగ్రహంతో ఉన్నారు. ఆయనతో పాటు గ‌త ప్ర‌భుత్వంలో ఆర్దిక శాఖా మంత్రిగా ప‌ని చేసిన య‌న‌మ‌ల సైతం త‌న‌ వారికే నిధుల మంజూరు చేసుకున్నారని ప్ర‌ధానంగా గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కాపు నేత‌ల విజ్ఞ‌ప్తుల‌ను ప‌ట్టించు కోలేద‌ని వారి ప్రధాన ఆరోపణ.  ఈ ఇద్దరినీ పక్కన పెడితే తప్ప తాము పార్టీలో ఉఉండే ప‌రిస్థితి లేద‌ని రేపు బాబుకి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీలోకి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో సుజనా చౌదరి అండతో బీజేపీ వైపు చూసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి కన్నకొడుకుని అత్యంత నమ్మకస్తుడు అయిన యనమలని పక్కన పెట్టేందుకు బాబు ఒప్పుకుంటారా ? లేదా ఒక్క సారిగా ఇంతమంది కాపు నేతలను వదులుకుంటారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మరి ఈ బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.      

బాబు పిరికివాడిలా పారిపోతాడా? లేక పోరాడతాడా?

  ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా 'ప్రజావేదిక' గురించే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా, మీడియా అన్న తేడా లేకుండా ఎక్కడైనా ప్రస్తుతం ప్రజావేదికే హాట్ టాపిక్ అయింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ కట్టడమని భావించిన సీఎం జగన్.. ఆ భవనాన్ని కూల్చి వేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రజావేదిక నేలమట్టమైంది. ప్రజావేదిక అక్రమ కట్టడమని, రేకుల షెడ్డు కోసం రూ.9 కోట్లు ఖర్చు చేసి.. టీడీపీ అవినీతికి పాల్పడిందని వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే వైసీపీ ఆరోపిస్తున్నట్లు అది రేకుల షెడ్డో, కోళ్ల‌ఫారమో కాదని.. ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడి ఆ నిర్మాణం చేసారని తెలుస్తోంది. దీనికో ప్ర‌త్యేక‌త కూడా ఉందట. జాగ్ర‌త్త‌గా నిపుణులు ఈ నిర్మాణాన్ని డిస్‌మేంట‌ల్ చేస్తే.. ఇందులో 80 శాతం మెటీరియ‌ల్‌తో మ‌ళ్లీ ఇలాంటి నిర్మాణం ఇంకోటి చేయొచ్చట. కానీ జగన్ సర్కార్ ముందు వెనుక ఆలోచించకుండా జేసీబీలతో కూల్చేసి నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియ‌ల్‌ ని వృధా చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. వైసీపీ ఆరోపిస్తున్నట్లు ప్రజావేదిక నిర్మాణానికి రూ.9 కోట్లు ఖర్చు కాలేదట. ప్రజావేదిక నిర్మాణం కోసం ఆర్‌ అండ్‌ బి శాఖ 4.4.2017న జీఓ నెం.ఆర్‌.టి.104ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రజావేదిక నిర్మాణం కోసం రూ.90లక్షలు, పార్కింగ్‌ కోసం రూ.47లక్షలు, మట్టి చదును కోసం రూ.32లక్షలు, ప్రహారిగోడ కోసం రూ.14లక్షలు, సెక్యూరిటీ పోస్టు కోసం రూ.8లక్షలను విడుదల చేసింది. ప్రజావేదిక నిర్మాణం, ఇతర సదుపాయాల కల్పన కోసం అప్పటి ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.కోటి 91లక్షలు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం రేకుల షెడ్డు కోసం టీడీపీ రూ.9 కోట్లు ఖర్చు చేసి అవినీతికి పాల్పడిందని సోషల్ మీడియాలో ప్రచారం చేసాయి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో టీడీపీ శ్రేణులు విఫలమయ్యాయనే చెప్పాలి. టీడీపీ నేతలు కూడా ఈ నిర్మాణం గురించి, నిర్మాణానికి అయిన ఖర్చు గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేయలేదు. మరోవైపు మిగతా అక్రమ కట్టడాలను కూడా కూల్చే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బాబు నివాసముంటున్న ఇంటిని కూల్చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాబు రాజధాని ప్రాంతంలో మరో అద్దె ఇంటిని చూసుకుంటున్నారని కూడా వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఓ కొత్త విషయం తెరమీదకు వచ్చింది. జగన్ సర్కార్ బాబు నివాసాన్ని కూల్చివేయడానికంటే ముందు.. ఆ ఇంటికి వెళ్లే దారిని మూసివేయాలనుకుంటుందట. ప్రజావేదిక అంటే ప్రభుత్వ నిర్మాణం కాబట్టి వెంటనే కూల్చి వేసింది ప్రభుత్వం. కానీ బాబు ఉంటున్న నివాసం ఓ వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ నిర్మాణం. అది ఒకవేళ అక్రమ కట్టడమైనా దాన్ని కూల్చాలంటే ఓ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇప్పటికే దానిపై కోర్టులో కేసు కూడా ఉంది. దాన్ని కోర్టు ఆదేశాలతో కూల్చాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పట్టే అవకాశముంది. అందుకే జగన్ సర్కార్ బాబుని మరోలా ఇబ్బంది పెట్టాలని చూస్తోందట. ప్రజావేదిక, బాబు నివాసం అక్రమ కట్టడాలు అయినప్పుడు.. వాటికోసం వేసిన రోడ్ కూడా అక్రమమే అవుతుంది కదా. అందుకే ముందుగా బాబు నివాసానికి వెళ్లే దారిని మూసివేయాలి అనుకుంటుందట. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన జడ్పీ చైర్మన్ నివాసానికి వెళ్లే దారిని క్లోజ్ చేసారని వార్తలొచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు బాబుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఇప్పటికే బాబు కొత్తింటి వేటలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఒకవేళ బాబు నిజంగానే కొత్తింటికి వెళ్తే.. ఇన్ని రోజులు తాను ఉన్న నివాసం.. అక్రమ నిర్మాణమని ఒప్పుకున్నట్లు అవుతోంది. ఇన్నాళ్లు అక్రమ నిర్మాణమని తెలిసే బాబు అందులో ఉన్నారా అంటూ విమర్శలు వస్తాయి. అలాగే బాబు భయపడి పారిపోయాడనుకునే అవకాశముంది. అసలే బాబు పిరికివాడని, ప్రతి చిన్న దానికి భయపడతారని కొందరు విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు కొత్తింటికి వెళ్తే బాబుకి మళ్ళీ అలాంటి విమర్శలే ఎదురయ్యే అవకాశముంది. మరి బాబు విమర్శలు ఎదుర్కొంటారా లేక అక్కడే ఉండి పోరాడతారా?. ప్రజావేదిక కూల్చివేత పుణ్యమా అని బాబుకి పోరాడటానికి మంచి అవకాశం వచ్చిందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. బాబు అదే నివాసంలో ఉండి, ఒకవేళ రోడ్డు తవ్వేస్తే కట్ట మీద నడిచైనా రాకపోకలు సాగించాలని, అప్పుడే ఆయనలోని పోరాట యోధుడు ప్రజలకు కనిపిస్తాడని అంటున్నారు. ఒకవేళ బాబు అక్కడే ఉండి పోరాడితే బాబుకి అన్యాయం జరిగిందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది, అదేవిధంగా కార్యకర్తల్లో కూడా ధైర్యం నింపినట్లు అవుతుందని అంటున్నారు. అంటే బాబు కొత్తింటికి వెళ్తే పిరికివాడని అనిపించుకునే అవకాశముంది. అదే పాత నివాసంలోనే ఉంటే పోరాడే యోధుడు అనిపించుకుంటారు. మరి బాబు పారిపోతారో లేక పోరాడతారో చూడాలి.

ప్రజావేదిక నిర్మాణం ఖర్చు కోటీ తొంబై లక్షలు...మరి 9 కోట్లు ఎలా అబ్బా ?

ప్రజావేదిక కూల్చివేతతో మొదలయిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనపడడం లేదు. గత తెలుగు దేశం ప్రభుత్వం ఉండగా చంద్రబాబు ఉండవల్లి కరకట్ట మీద నదిని ఆనుకుని లింగమనేని ఎస్టేట్స్ ఓనర్ కట్టుకున్న ఇంటిలో అద్దెకు ఉండేవారు. అయితే బాబుని కలిసేందుకు ప్రజలు వస్తే వారిని కలిసేందుకు, వినతులు స్వీకరించేందుకు ఒక వేదికని నిర్మించింది అప్పటి బాబు సర్కార్. అయితే దానిని అక్రమ నిర్మాణంగా పేర్కొన్న జగన్ సర్కార్ దానిని కూల్చివేసేందుకు నిర్ణయించి నిన్నటితో ఆ ఘట్టాన్ని పూర్తి చేశారు. అయితే ఇది మామూలుగా జరగలేదు.  అమరావతి సెక్రటేరియట్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజావేదికలో కావాలనే జగన్ కలెక్టర్ ల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అంతకు ముందే పార్టీ నేతలు, ప్రజలు తనను కలవడానికి వస్తే వీలుగా ఉండేదుకు ఈ సముదాయాన్ని తనకి కేటాయించమని బాబు జగన్ సర్కార్ ని కోరారు. అప్పటి దాకా దాని మీద పెద్దగా అవగాహన లేని జగన్ మాజీ సీఎం లేఖతో అలెర్ట్ అయ్యి వెంటనే దాని మీద నివేదిక తెప్పించుకున్నారు. అయితే ఆ నివేదికలో ఆ కట్టడం అక్రమం అని, దానితో పాటు బాబు నివాసం కూడా అక్రమం అని తేలడంతో వ్యూహాత్మకంగా ప్రజా వేదికలో సదస్సులు ఏర్పాటు చేసి కూల్చి వేస్తున్నట్టు ప్రకటించారు.  అంతే కాక పర్యావరణ నిబంధనలు సహా అన్నింటినీ బేఖాతరు చేస్తూ ఈ ప్రజావేదికను నిర్మించిందని ముఖ్యమంత్రి స్థాయిలోనే ఇలా చేయడం అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నిస్తూ ఎవరూ కాదనలేని విధంగా కూల్చివెత ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒకరంగా బాబు ఉంటున్న ఇల్లు కూలగొట్టేందుకు వీలుగా విమర్శలు రాకుండా ప్రజావేదిక కూల గొట్టారు. అయితే ఈ విషయం మీద చాలా విమర్శలు ఎదురయ్యాయి. అయితే ప్రజావేదిక విషయంలో సీఆర్డీఏ ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు వైసీపీ, మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు. 5 కోట్లతో పూర్తి చేయాల్సిన భవనం కోసం 8 కోట్లు ఖర్చు చేశారని, అది కూడా ఓపెన్ బీడ్ వేయకుండా మంత్రి నారాయణ మౌఖిక ఆదేశాలతో అంచనాలు పెంచి ఖర్చు చేసినట్టు వైసీపీ ప్రచారం చేసింది.    అలా అని సీఆర్డీఏ నివేదిక ఇచ్చింది. ఇక ప్రజావేదిక నిర్మాణానికయిన ఖర్చును బాధ్యుల నుండి వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వేదికను కూల్చివేతను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం మీద నిన్న తెల్లవారు జాము 3.30 గంటలకు హైకోర్టు విచారణ జరిపింది. ప్రజావేదిక అక్రమ కట్టడమేనని పిటిషనర్‌ ఒప్పుకోవడంతో స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్‌ జనరల్‌ అక్రమ కట్టడానికి భారీ మొత్తంలో ఖర్చు చేశారని, ఆ మొత్తాన్ని బాధితుల నుండి రాబట్టడంతో పాటు, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు.  ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, అప్పటి పురపాలకశాఖ మంత్రి నారాయణను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించిన ధర్మాసనం కేసు విచారణను జులై 10వ తేదికి వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ విషయం మీద మాట్లాడిన మంత్రి పేర్ని నాని ప్రజావేదికను కూల్చడం లేదని, తరలిస్తున్నామని, దీనికి వినియోగించిన వస్తువులన్నీ ప్రభుత్వ స్థలంలో వేరేచోట అనుమతి తీసుకుని నిర్మించేందుకు ఉపయోగిస్తామని చెప్పారు. ఇక్కడే తాజాగా తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రజావేదిక నిర్మాణం కోసం ఎంత అయ్యిందనే విషయం బయట పెట్టింది.  2017వ సంవత్సరం ఏప్రిల్ నాలుగున జారీ అయిన జీవో ప్రకారం ఆర్ అండ్ బీ నుండి ఈ వేదిక నిర్మాణానికి 90 లక్షల రూపాయల నిధులు జారీ అయ్యాయి. ఆ నిధులు కేవలం నిర్మాణానికి ఉపయోగించారు. ఇక అక్కడే పార్కింగ్ స్థలాలను పూడ్చి రెడీ చేసేందుకు 47 లక్షల రూపాయలు, అలా మిగతా పార్కింగ్, సెక్యూరిటీ మొత్తం అన్నీ కలిపి కోటీ తొంబై లక్షలు ఖర్చు అయ్యాయి. సీఆర్డీఏ చెబుతున్న లెక్క ప్రకారం తొమ్మిది కోట్లు, అంటే మిగిలిన ఏడూ కోట్లతో ఏసీలు, ఫర్నీచర్, ప్రొజెక్టర్ లు లాంటివి ఖరీదు చేసి ఉండవచ్చు, మంత్రి చెబుతున్న దాని ప్రకారం వాటిని మళ్ళీ ఉపయోగిస్తారు, సో ప్రజల సొమ్ము వృధా అయ్యింది సుమారుగా రెండు కోట్ల రూపాయలన్న మాట. కానీ రాజకీయ లబ్దిని ఆశించి వైసీపే మాత్రం తొమ్మిది కోట్ల అవినీతి జరిగింది అంటూ విమర్శలు చేస్తోంది.  

ఒక పరాజయం 100 తప్పులు.. కోడెల ట్యాక్సే కొంప ముంచిందా?

  టీడీపీ ఘోర పరాజయంలో పలువురు నేతలు కీలక పాత్ర పోషించారు. వారిలో ముఖ్యంగా మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు గురించి చెప్పుకోవాలి. అసలు కోడెలను స్పీకర్ పదవికి ఎంపిక చేసి చంద్రబాబు తప్పు చేశారంటూ అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. రాజ్యాంగ బద్దమైన స్పీకర్ పదవికి నెమ్మదస్తులను, ఆచి తూచి మాట్లాడేవారిని ఎంపిక చేయకుండా.. దూకుడు స్వభావం ఉన్న కోడెలను ఎంపిక చేయడం ఏంటని బాబు నిర్ణయాన్ని పలువురు తప్పుపట్టారు. అయితే స్పీకర్ పదవి చేపట్టాక కోడెల దూకుడు కాస్త తగ్గిందేమో కానీ ఆయన కుటుంబం మాత్రం రెచ్చిపోయింది. ఆయన కుటుంబం పుణ్యమా అని గుంటూరు జిల్లాలో టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. నాయకుడు అనేవాడు ప్రజలకు అండగా ఉండాలి, అవసరానికి ఆదుకోవాలి. కానీ కోడెల కుటుంబం ప్రజలను అందిన కాడికి దోచుకుంది. నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల టాక్స్ పేరుతో ఆయన కొడుకు, కూతురు ప్రజలను పీక్కుతిన్నారు. ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలను కూడా వదలకుండా వసూళ్లకు దిగారు. దీంతో ఇటు పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ కోడెల కుటుంబం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ప్రభావం టీడీపీ మీద పడింది. నిజానికి కోడెల కుటుంబ ఆగడాలు ఎన్నికలకు ముందే చంద్రబాబు దృష్టికి వచ్చాయి. కానీ బాబు కోడెల కుటుంబాన్ని అదుపు చేసే ప్రయత్నం చేయలేదు. సీనియర్ నేత అని కోడెలని ప్రశ్నించలేకపోయారో, లేక తనని చూసి అన్ని నియోజకవర్గాల ప్రజలు టీడీపీకే ఓట్లేస్తారు అనుకున్నారో తెలీదు కానీ.. బాబు మాత్రం ఈ విషయంలో కోడెల కుటుంబాన్ని అదుపు చేయలేదు. అదే ఎన్నికల్లో బాబు కొంపముంచింది.  

జనసేనకి కుల ముద్ర....పవన్ మళ్ళీ తప్పు చేస్తున్నాడా?

  ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు చేయడం అంటే ఏమిటో ఏపీ ఓటర్లకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలీదేమో ? తాజా ఎన్నికల్లో హీరోలం అనుకునే వారిని జీరోలు చేసి, రూలర్స్ అనుకునే వారిని ఇంటికే పరిమితం చేసి పారేశారు. నిజానికి ఏపీ వోటర్లు రాజకీయ చైతన్యం కలవారే, కానీ ఏపీలో రాజకీయాలు చేయాలంటే ఎన్నో మెళుకువలు నేర్చుకోవాలి. చాలా చోట్ల కుల సమీకరణలతోనే ముందుకు వెళ్ళాలి. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా డిపాజిట్ లు కూడా లేకుండా పోతారు. ఈ విషయం మొన్నటి ఎన్నికలు బాగా క్లారిటీ ఇచ్చి మరీ చూపాయి. అయితే అయినా ఈ దెబ్బకి గుణ పాఠం నేర్చుకోని పవన్ మళ్ళీ జనసేన విషయంలో అదే తప్పు చేస్తున్నాడు.  నిజానికి పవన్ పార్టీ జనసేనకి కాపు పార్టీ అనే ముద్ర పడింది. అయినా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని ఆయన ఎన్నికల ముందు కూడా ఎంతో మంది కాపు నేతలను ఆయన పార్టీలో చేర్చుకున్నారు. జనం కోలుకోలేని విధంగా సమాధానం ఇచ్చారు. అయినా పవన్ తీరు మారినట్టు కనిపించడంలేదు. వంగవీటి వారసుడు రాధాకృష్ణని పార్టీ లో చేర్చుకోవాలని చూడడమే దానికి నిదర్శనం. అయితే ఏపీలో టీడీపీకి కమ్మ, వైసీపీకి రెడ్డి కులాల సపోర్ట్ నేరుగా ఉందని భావిస్తున్న పవన్ జనసేన పార్టీకి కాపు నాయకులని తీసుకున్నా ఫర్లేదని భావిస్తున్నారట. అయితే వంగవీటి రాధాని తీసుకోవడం వల్ల పవన్ కి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. మొన్నటి ఎన్నికల ముందు జగన్ ని తిట్టి టీడీపీలో చేరిన రాధాకు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. అయితే రాధా ఉత్తర కోస్తాలో పలు చోట్ల తిరిగి ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి కూడా బాలేకపోవడం వలన జనసేన వైపు చూస్తున్నారు.  నిజానికి ఆయన జనసేనలో చేరినా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయనకీ సొంతంగా చరిష్మా లేదు, తండ్రి రంగా పేరు చెప్పుకుని ఆయన ఇప్పటికీ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అతని వలన కాపు ఓట్లు కొన్నిఅయితే వచ్చాయి, కానీ ఆ తర్వాత వైసీపీ లోకి చేరిన తర్వాత రాధా ద్వారా వైసీపీ పెద్దగా చేకూరిన లాభం ఏమి లేదు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే మొన్న ఎన్నికల ప్రచారంలో తనను కాపుగా చూడకండి అని తాను అందరివాడిని అని ప్రసంగాలు దంచిన పవన్ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా గేట్లు తెరిచాడు అనేదే అర్ధం కాని విషయం. ఒక పక్క సొంత పార్టీలో ఉన్న ఆకుల సత్యనారయణ లాంటి వాళ్ళు నేరుగా పవన్ కి రాజకీయం రాదని విమర్శిస్తుంటే తాను రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాననేందుకే ఇలా చేస్తున్నాడా అనేది కూడా విశ్లేషణలకి అంతు చిక్కకుండా ఉంది.

జగన్ పదవికి గండం.. బాబుని కాపాడాల్సిన అవసరం వచ్చిందా?

  ప్రస్తుత రాజకీయాలలో ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యర్థి పార్టీ నేతలను భయపెట్టో, బ్రతిమాలో తమ పార్టీలో చేర్చుకొని ప్రత్యర్థి పార్టీని పూర్తిగా ఖాళీ చేయడం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి మాత్రం భిన్నంగా ఉంది.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. దీంతో జగన్ ఆ 23 లో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని టీడీపీని ఖాళీ చేస్తారని భావించారంతా. కానీ జగన్ మాత్రం అలాంటిదేం చేయకపోగా.. ఒకవేళ ఎవరైనా తమ పార్టీలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాలని స్పష్టం చేసారు. ఈరోజుల్లో ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెడుతున్నారు. అన్ని కోట్లు ఖర్చుచేసి గెలిచి, మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోయే సాహసం చేయలేరు. దీంతో చంద్రబాబు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే జగన్ వదిలినా బీజేపీ మాత్రం టీడీపీని వదల్లేదు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న బీజేపీ.. ఇప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకునే దిశగా పావులు కదుపుతుంది. అయితే ఈ విషయంలో బాబు & కో ఎంత ఆందోళన చెందుతున్నారో తెలీదు కానీ.. జగన్ మాత్రం బాగా ఆందోళన చెందుతున్నారట. టీడీపీ బ్రతికుండాలని కోరుకుంటున్నారట. మామూలుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని ఖాళీ చేయాలనుకుంటుంది. కానీ జగన్ మాత్రం టీడీపీ బ్రతకాలని, బాబుని కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది.  కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి బలమైన శక్తిగా ఎదిగింది. ఇప్పుడు బీజేపీ దృష్టి సౌత్ మీద పడింది. ముఖ్యంగా 2024 నాటికి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఏపీలో పావులు కదుపుతుంది. టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటుంది. మొదట టీడీపీ నేతలను చేర్చుకొని బలపడిన తరువాత వైసీపీని టార్గెట్ చేసే అవకాశముంది. ఎందుకంటే ఏపీలో టీడీపీ ఖాళీ అయితే.. అప్పుడు ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ, వైసీపీ అవుతాయి. అదే జగన్ భయం. టీడీపీకి ఇప్పుడున్న బలం అలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో జగన్ కి ఈజీ అవుతుంది. అలా కాకుండా బీజేపీ బలపడితే జగన్ కి కష్టాలు మొదలైనట్టే. బీజేపీని ఎదిరించలేడు. ఒకవేళ ఎదిరించే సాహసం చేస్తే పరిస్థితి బాబు కంటే దారుణంగా ఉంటుంది. జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో జైలుకి కూడా వెళ్లొచ్చారు. ఒకవేళ జగన్ బీజేపీని ఎదిరిస్తే వాటిని వెలికితీసి జైలుకి పంపినా ఆశ్చర్యం లేదు. అందుకే జగన్ బీజేపీ బలపడకూడదని, బాబుని కాపాడుకోవాలని చూస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఆ అవకాశం ఇచ్చేలా లేదు. నిజానికి బీజేపీ ఏపీలో బలపడటానికి కొన్ని నెలల ముందు నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా ముందుగా టీడీపీని టార్గెట్ చేసింది. ముఖ్యంగా టీడీపీకి ఆర్థికంగా అండగా ఉన్నవారికి గేలం వేసి దెబ్బ తీసింది. తరువాత మిగతా నేతలను టార్గెట్ చేసింది. కొందరు వ్యాపారాల కోసం, కొందరు భవిష్యత్తు కోసం ఇలా రకరకాల కారణాలతో టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. టీడీపీకి ముందు నుంచి బీసీ, కమ్మ సామాజికవర్గాలు అండ బలంగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారు టీడీపీకి దూరం జరిగారు. ఇప్పుడు వారికి బీజేపీ వల వేసింది. అదేవిధంగా పలు జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గ నేతలను కూడా ఆకర్షించే పనిలో బీజేపీ పడింది. ఇలా సామాజిక వర్గాల వారీగా టీడీపీని బలహీనపరుస్తూ తాను బలపడాలనేది బీజేపీ ప్లాన్. బీజేపీ ఒక్కసారి బలపడటం మొదలు పెడితే.. 2024 లో అధికారమే లక్ష్యంగా వైసీపీని టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే మోడీ తో సహా పలువురు బీజేపీ పెద్దలు ఏపీలో 2024 లో అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్నారు. దాన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు. బీజేపీ ఏపీ మీద ఎంత ఫోకస్ పెట్టిందో. అంటే ఏపీలో టీడీపీ బలహీనపడే కొద్దీ జగన్ కి కష్టాలు మొదలవుతాయి అనమాట. అందుకే జగన్ తన జాగ్రత్తలో తాను ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రధాన బలం హిందూ ఓటు బ్యాంకు. హిందువులు అందరూ గంపగుత్తుగా బీజేపీ వైపు చూడకుండా.. శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామితో సన్నిహితంగా ఉంటున్నారు. ఒకవేళ మెజారిటీ హిందువులు బీజేపీ వైపు వెళ్లినా.. తనకి అండగా ఉన్న రెడ్డి సామాజికవర్గం, క్రిస్టియన్ ఓటుబ్యాంకుతో బీజేపీని ఢీ కొట్టాలని చూస్తున్నారట. అందుకే ఇటీవల అధికారుల పదోన్నుతులలో కూడా రెడ్డిలకు, ముఖ్యంగా క్రిస్టియన్లకు పెద్ద పీట వేశారని తెలుస్తోంది. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి ఏ మాత్రం నచ్చని చర్య. అంటే జగన్ ఒకవైపు బాబుని కాపాడుకోవాలని చూస్తూనే.. మరోవైపు అవసరమైతే బీజేపీతో పోరుకి సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారని అర్ధమవుతుంది. మరి జగన్ బీజేపీని ఎదిరించి నిలబడగలరా?. అసలే ప్రత్యర్థుల మీద సీబీఐ, ఈడీ వంటి వాటిని ఉపయోగించి ముప్పు తిప్పలు పెట్టే బీజేపీ.. జగన్ ని మాత్రం వదులుతుందా?. అదే జరిగితే జగన్ సీఎం పదవి మూడునాళ్ళ ముచ్చట అయ్యే ప్రమాదముంది. అది జరగకూడదంటే జగన్ బాబుని కాపాడుకోకతప్పదు. మరి జగన్ ఈ కమల గండం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.