చంద్రబాబు మంత్రివర్గ సభ్యుల పేర్లు

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు మంత్రివర్గం ఖరారయింది. ఈరోజు ఉదయం గవర్నరు నరసింహన్ కు పంపిన జాబితాలో చంద్రబాబుతో బాటు మొత్తం 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలియజేసారు. వారెవారంటే:   అచ్చెన్నాయుడు (శ్రీకాకుళం); కి మిడి మృణాళిని(విజయనగరం); అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్‌రావు(విశాఖపట్నం); యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప(తూర్పు గోదావరి జిల్లా); పీతల సుజాత(పశ్చిమ గోదావరి); దేవినేని ఉమా, కొల్లు రవీంద్రబాబు (కృష్ణా); ప్రతిపాటి పుల్లారావు, రావెల్ల కిషోర్ (గుంటూరు); సిద్దా రాఘవరావు(ప్రకాశం) ; నారాయణ(నెల్లూరు); బొజ్జ గోపాలకృష్ణారెడ్డి (చిత్తూరు); కేఈ కృష్ణమూర్తి (కర్నూలు); పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత (అనంతపురం). బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్ మరియు మాణిక్యాల రావులకు కూడా చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది.   వీరిలో బీసీలకు 6, కమ్మ-6, కాపు-3 , రెడ్డి- 2, ఎస్సీ-2, వైశ్య-ఒకరికి చొప్పున మంత్రి పదవులు దక్కనున్నాయి. కేఈ కృష్ణమూర్తి, చిన రాజప్పలు ఉపముఖ్యమంత్రులుగా నియమితులవబోతున్నట్లు సమాచారం.

పోలీసుల మీద అలిగిన తెలుగు తమ్ముళ్లు!

  ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వస్తున్న లక్షలాదిమంది తెలుగుదేశం కార్యకర్తల్లో కొంతమందికి పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం 7 గంటల తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం వుండగా, ఆదివారం ఉదయం నుంచే కార్యకర్తలు రావడం మొదలైంది. అయితే కొంతమంది కార్యకర్తలను పోలీసులు ప్రమాణ స్వీకారం చేసే ప్రాంగణానికి బయటే ఆపేశారు. పాసులు లేకపోవడం వల్లే వారిని ఆపేశారని పోలీసులు చెబుతున్నప్పటికీ కార్యకర్తలు మాత్రం తమకు పాసులు వున్నప్పటికీ లోపలకి పోనివ్వకుండా పోలీసులు ఆపేశారని ఆరోపిస్తున్నారు. అయితే బయటే వుండటం వల్ల ఎండ వేడికి తాళలేక తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. కుర్చీలు విరగ్గొట్టి నిరసన తెలిపారు. అయితే తెలుగుదేశం నాయకులు సర్దిచెప్పడంతో వాతావరణం చల్లబడింది.

చంద్రబాబు ప్రమాణానికి సర్వం సిద్ధం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు రాత్రి గం.7.27 నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికోసం నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానం ముస్తాబైంది. నాగార్జున యూనివర్సిటీకి కిలోమీటర్ల పరిధిలో తెలుగుదేశం జెండాలు, బ్యానర్లతో పసుపుమయమైంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపి నాయకులు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, పలువురు కేంద్రమంత్రులు, ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌ వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని చంద్రబాబు ఆహ్వానించినప్పటికీ వారు హాజరు కావడం లేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 5 లక్షలమంది తెలుగుదేశం కార్యకర్తలు హాజరు అయ్యే అవకాశం వుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

రుణమాఫీ చేస్తాం: లోకేష్

  చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, ఈరోజు మధ్యాహ్నం నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద తన తండ్రి ప్రమాణ స్వీకారోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చేరు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తను కేవలం అక్కడ జరుగుతున్నఏర్పాట్లను పరిశీలించేందుకే వచ్చేనని అన్నారు. తాను ప్రభుత్వ వ్యవహారాలలో ఎన్నడూ జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయనని అన్నారు. తన తండ్రి రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెపుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత బాధపడిపోతున్నారు అని ప్రశించారు. ఎవరు ఎంతగా ఏడ్చినప్పటికీ తన తండ్రి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణాలు మాఫీ చేయబోతున్నారని ప్రకటించారు. ఇంతవరకు తెదేపా సీనియర్ నేతలు అనేకమంది ఇదే విషయాన్ని దృవీకరించారు. కానీ ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా రుణాలు మాఫీ చేయబోతున్నట్లు చెప్పడం చూస్తే, చంద్రబాబు నాయుడు అందుకు పూర్తి సంసిద్దంగా ఉన్నట్లు భావించవచ్చును. అయితే అన్ని వేల కోట్ల రూపాయలు ఇటువంటి క్లిష్ట సమయంలో ఏవిధంగా మాఫీ చేస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఆయన రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేసి అందుకు బదులుగా బ్యాంకర్లకు ప్రభుత్వ బాండ్లు జారీచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః అందుకే లోకేష్ తో సహా తెదేపా నేతలందరూ రునమాఫీపై అంత దృడంగా, నమ్మకంగా పదేపదే హామీ ఇవ్వగలుగుతున్నారు. ఏమయినప్పటికీ రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం తరువాత అయన అనుసరించే విధానం బట్టి ఈ రుణమాఫీలపై తెదేపా, వైకాపాల నడుమ జరుగుతున్న యుద్ధం పతాక స్థాయికి చేరుకోవచ్చును లేదా వైకాపా మళ్ళీ భంగపడవచ్చును.

మళ్ళీ లిక్కర్ సిండికేట్ మూత తెరిచినా ఏసీబీ

  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒకవెలుగు వెలుగుతున్న రోజులలో తనకు పక్కలో బల్లెంలా తయారయిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను దారికి తెచ్చుకోవడానికి, మద్యం సిండికెట్లపై ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారు. ఏసీబీ అధికారులు రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే బొత్స వ్యాపారాలు సాగుతున్న విజయనగరం జిల్లాపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, కేసు మూలాల వరకు చొచ్చుకుపోయారు. దానితో బొత్స సత్యనారాయణ ఉరుకుల పరుగుల మీద డిల్లీ వెళ్లి అధిష్టానంతో మొరపెట్టుకోవడం వెంటనే ఏసీబీ అధికారులు వెనక్కి తగ్గి కేవలం కొంతమంది ఎక్సయిజ్ శాఖా అధికారులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం జరిగింది.   కానీ మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు మారడంతో ఏసీబీ అధికారులు అటకెక్కించిన ఆ మద్యం ఫైళ్ళను దుమ్ము దులుపి బయటకు తీస్తున్నారు. అయితే ఈసారి వారు మొదట విజయనగరం నుండి కాక, శ్రీకాకుళం జిల్లా నుండి పని మొదలుపెట్టడం విశేషం.   వైకాపా నేతలు ధర్మాన ప్రసాదరావు వ్యక్తిగత కార్యదర్శులు రవి శంకర్ మరియు పొన్నాడ అప్పరావులను, ధర్మాన క్రిష్ణదాసు యొక్క అనుచరుడు సాయి శ్రీనివాస్ శర్మ ముగ్గురినీ మద్యం సిండికేట్ వ్యవహారంలో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకమ్మని ఏసీబీ అధికారులు సమన్లు జారీచేసినట్లు సమాచారం. అంతే గాక ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామమనోహర్ నాయుడు (చిన్ని), శ్రీకాకుళంలో మద్యం సిండికేట్ నడిపిస్తున్న ఓరుగంటి ఈశ్వర్రావులను అరెస్ట్ చేసి జైలుకి తరలించినట్లు తాజా సమాచారం. అంతేగాక ఈ కేసుతో సంబంధం ఉన్న ధర్మాన ప్రసాదరావుకి చెందిన వర్జిన్ రాక్స్ గ్రనైట్ కంపెనీలో డైరెక్టరు అప్పారావుకు కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.   దీనిపై ధర్మాన స్పందిస్తూ చంద్రబాబు ఇంకా అధికారం చెప్పట్టక మునుపే తన రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం ఆరంభించారని విమర్శించారు. కానీ వాన్ పిక్ భూముల వ్యవహారంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీలో ఉండగానే సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆకేసులో ఆయనను కాపాడేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి నిమిషం వరకు చాల కష్టపడ్డారు, కానీ మంత్రిపదవి పోయింది. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించిన మద్యం సిండికేట్ వ్యవహారమే ఇప్పుడు ధర్మాన తలకు చుట్టుకోవడం విచిత్రమయితే, అందుకు ఆయన కిరణ్ కుమార్ ని బదులు ఇంకా అధికారం చెప్పటని చంద్రబాబును నిందించడం మరో విచిత్రం.

చంద్రబాబు మూడు సంతకాల ముచ్చట్లు

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి పీఠం మీద మరోసారి నారా చంద్రబాబునాయుడు కూర్చోబోతున్నారు. ఆదివారం సాయంత్రం గుంటూరు సమీపంలో జరిగే ఒక భారీ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు ఫైళ్ళ మీద సంతకాలు చేయనున్నారు. ఆ మూడు ఫైళ్ళ ముచ్చట్లు ఇవి.. ఆదివారం సాయంత్రం 7.27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు రాత్రి 8.35 నిమిషాలకు తన మొదటి సంతకాన్ని చేయనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన మొదటి సంతకాన్ని రైతు, డ్వాక్రా రుణమాఫీ ఆదేశాల పైల్ మీద చేయనున్నారు. రెండో సంతకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో బెల్టు షాపులను రద్దుచేసే ఆదేశాల మీద చేయనున్నారు. ముచ్చటగా మూడో సంతకాన్ని ఎన్టీఆర్ సుజల పథకం కింద అన్ని గ్రామాలకూ తాగునీరు ఇచ్చే ఆదేశాల మీద సంతకం చేయనున్నారు. ఇలా మూడు ముఖ్యమైన సంతకాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ వేదిక సాక్షిగా నిలవనుంది.

మోడీ ఫ్యాషన్ అదుర్స్: అమెరికా మీడియా

      భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని అమెరికా మోడీ పొగడ్తలతో ముంచెత్తుతోంది. భారతదేశంలో గొప్ప ప్రజాదరణ పొందిన నేతగా మాత్రమే కాకుండా సరికొత్త ఫ్యాషన్‌కి చిరునామాగా కూడా మోడీని అమెరికా మీడియా పేర్కొంటోంది. మోడీ ధరించే కుర్తాపైజమాను ఫ్యాషన్‌కి కొత్త ట్రేడ్ మార్క్‌గా పేర్కొంటూ, మోడీని నూతన ఫ్యాషన్ సృష్టికర్తగా అమెరికా మీడియా కీర్తిస్తోంది. ఇలా కీర్తిస్తున్న అమెరికా మీడియాలో ప్రఖ్యాత టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వున్నాయి. అసలు గొప్ప నాయకుడి వేషధారణ అంటే మోడీలాగానే వుండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక మోడీని భారీగా పొగిడేసింది. మోడీ అనుసరిస్తున్న ఫ్యాషన్ పంథాను ఫ్యాషన్ విద్యార్థులు ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చని కూడా సూచించింది.

ఏడుగురు పిల్లల ప్రాణాలు తీసిన లిచీ పళ్ళు!

      విదేశాల నుంచి దిగుమతి అయ్యే లిచి పండు గురించి చాలామందికి తెలుసు. రేటుకూడా చాలా ఎక్కువ అయిన లిచీ పండును కొంతమంది ఇష్టంగా తింటారు. పుల్లగా వుండే ఆ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని అనుకుంటారు. అయితే ఆ పండులో ఏర్పడే వైరస్ ప్రాణాలను తీసే అవకాశం కూడా వుంది. అవును ఇదినిజం.. రిస్క్ తీసుకోవద్దు.. లిచీ పండు తినవద్దు. దాని జ్యూస్ తాగవద్దు. ఎందుకంటే లిచీ పండు ద్వారా వ్యాపించే 'లిచీ సిండ్రోమ్' వైరల్ ఇన్పెక్షన్ కారణంగా పశ్చిమ బెంగాల్‌లో ఏడుగురు చిన్నారులు అన్యాయంగా చనిపోయారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్‌ అధికారులు వెల్లడించారు. మంగళవారం నుంచి లిచీ వైరస్ కారణంగా బెంగాల్‌లో మరణాల పరంపర మొదలైంది. ఇప్పటి వరకు ఏడుగురు పిల్లలు మరణించారు. వీరందరూ 2 నుంచి 4 సంవత్సరాల వయసు లోపు వారే! లిచీ సిండ్రోమ్ వ్యాధి సోకిన వారి మెదడు వాస్తుందని ఆ తర్వాత ఐదు నుంచి ఆరు గంటల లోపు మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి మొదట చైనాలో కనిపించింది. అప్పుడప్పుడు భారతదేశంలో కూడా కనిపిస్తూ వుంటుంది. 2012లో పశ్చిమ బెంగాల్‌లోనే ఈ వ్యాధి కనిపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు గానీ, పెద్దలు గానీ లిచీ పండు తినడం ఎంతమాత్రం మంచిది కాదని. రిస్కు తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పటికే లిచీ పళ్ళు తినడం గానీ, లిచీ పళ్ళ రసం తాగడం గానీ చేసిన వారు వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

మైనర్‌ని పెళ్ళాడనున్న క్రికెటర్ అఖ్తర్

      పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ వయసు దాదాపు 40 సంవత్సరాలు. ఈ లేటు వయసులో ఈయనగారు పెళ్ళి చేసుకోబోతున్నారు. ఆ పెళ్ళికూతురు వయసెంతో తెలిస్తే మీరు ఆశ్చర్యంతో నోరు నొక్కుకుంటారు. అఖ్తర్‌కి ఈ పోయేకాలమేంటని తిట్టుకుంటారు. అఖ్తర్ పెళ్ళాడబోయే అమ్మాయి వయసు అఖ్తర్ వయసులో సగం కంటే తక్కువ. అంటే ఆ అమ్మాయి వయసు కేవలం 17 సంవత్సరాలు. అంటే మైనర్. ఇండియాలో మైనర్‌ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే లోపలేస్తారు. పాకిస్థాన్‌లో ఆ చట్టం వున్నట్టు లేదు. పాకిస్థాన్‌లోని హరిపూర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ముస్తక్ ఖాన్ కుమార్తె అయిన పదిహేడేళ్ళ రుబబ్తో షోయబ్ పెళ్లి నిశ్చయమైంది. ప్రముఖ క్రికెటర్‌ సంబంధం దొరికిందన్న ఆనందంలో రుబబ్ తండ్రి వధూవరుల వయసులను ఎంతమాత్రం పట్టించుకోకుండా పెళ్ళి జరిపించడానికి ఒప్పుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ నెల మూడో వారంలో అఖ్తర్, రుబబ్ వివాహం జరగనుంది. పాపం రుబబ్!

మోడీ విషయంలో తొందరొద్దు: థరూర్‌కి డిగ్గీ సూచన

      వినేవాడికి చెప్పేవాడెప్పుడూ లోకువే అన్నట్టు ఇప్పుడు శశిథరూర్ దిగ్విజయ్‌సింగ్‌కి లోకువైపోయాడు. దిగ్విజయ్‌సింగ్‌కి తనకు, టీవీఛానల్ యాంకర్‌కూ మధ్య వున్న రిలేషన్‌ విషయంలో క్లారిటీ లేదుగానీ, శశిథరూర్‌కి సలహాలిస్తున్నాడు. అమెరికాలోని ఓ వెబ్‌సైట్‌కి శశిథరూర్ రాసిన వ్యాసంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని పొగిడాడు. అది కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వుండి వీలైతే నరేంద్రమోడీని తిట్టాలిగానీ, పొగడ్డమేంటని చాలామంది కాంగ్రెస్ నాయకులు ఫీలయ్యారు. మణిశంకర్ అయ్యర్ అయితే శశిథరూర్‌ని ఏకంగా ఊసరవెల్లితో పోల్చాడు. ఇదిలా వుంటేఈ విషయంలో శశిథరూర్ అడక్కపోయినా డిగ్గీరాజాకి సలహా ఇవ్వాలని అనిపించినట్టుంది. వెంటనే ఇచ్చేశాడు. ‘‘ప్రధాని నరేంద్రమోడీ విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి, అభిప్రాయానికి రావొద్దు. కొంతకాలం గడిచిన తర్వాతే, మోడీ మరో అవతారం బయట పడిన తర్వాతే ఒక అభిప్రాయానికి రావాలి’’ అన్నట్టుగా శశిథరూర్‌కి ఉచిత సలహా ఇచ్చాడు. ఇదిలా వుంటే మోడీపై తన వ్యాఖ్యల పైన థరూర్ వివరణ ఇచ్చాడు. ఇప్పుడు మోడీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల్లాగే గతంలో ఆయనను విమర్శిస్తూ చేసిన ప్రతి వ్యాఖ్యకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని, భవిష్యత్తులో ఆయన చర్యలను గమనిస్తూ ఉంటామని థరూర్ గురువారం ట్విట్టర్‌లో ట్విట్ చేశాడు.

వదినని నరికాడు.. వాడు చచ్చాడు!

      వదిన తల్లితో సమానమని అంటారు. తల్లిని ఎంత గౌరవిస్తామో వదిననీ అంతే గౌరవించాలని అంటారు. అయితే వదినతో ఏ విషయంలో గొడవొచ్చిందో ఏమో గానీ, ఉత్తర ప్రదేశ్‌లోని లలిత్‌పూర్ ప్రాంతానికి చెందిన రామ్ సహాయ్ (22) అనే యువకుడు తన వదిన సరోజ్ (24) మీద గొడ్డలితో దాడి చేసి నరికాడు. తన వదినని నరికిన తర్వాత భయపడిపోయిన సహాయ్ గుర్తు తెలియని విష పదార్థాన్ని మింగేశాడు. తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరకి నడుచుకుంటూ వెళ్ళి తాను తన వదినని నరికిన విషయం, తాను విషం మింగిన విషయం పోలీసులకు చెప్పాడు. రామ్ సహాయ్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా అక్కడ అతడు మరణించాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే రామ్ సహాయ్ నరికిన అతని వదిన సరోజ్ ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటోంది.

బాబు దారిలోకి జూనియర్: ప్రమాణానికి హాజరు

      ఎన్నికల సమయంలో మూతి ముడుచుకుని ప్రచారానికి కూడా రాకుండా బెట్టు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎందుకైనా మంచిదని చంద్రబాబు చెంతకు చేరుతున్నాడు. చంద్రబాబు గెలవగానే హరికృష్ణ దారిలోకి వచ్చాడు. చంద్రబాబు ఇంటికి వెళ్ళి అభినందించాడు. మహానాడులో కూడా చాలా బుద్ధిగా పాల్గొన్నాడు. అయితే ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి సౌండ్ చేయలేదు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు కుటుంబ సమేతంగా విజయవాడ వెళ్లనున్నారు. అక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సొంత ఊరైన నిమ్మకూరుకు వెళ్ళి వెళ్లి ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఈ ఫ్యామిలీ హాజరవుతుంది.

కేసీఆర్ కు మద్దతు, చంద్రబాబుతో యుద్ధం?

  ఎన్నికలలో ఓడిపోయిన తరువాత చల్లబడిపోయిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి క్రమంగా ఆ షాకు నుండి తేరుకొని పార్టీ సమీక్షా సమావేశాల పేరిట ఓదార్పు కార్యక్రమం నిర్వహించిన తరువాత, తమ ఓటమికి కారణం ఏమిటో ఆయనే ప్రకటించేశారు. చంద్రబాబు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని భూటకపు హామీలు ఇవ్వడం వలననే ప్రజలు ఆయనను నమ్మిఓటేసారని, కానీ తను మాత్రం ఆచరణ సాధ్యం కాని అటువంటి హామీలు ఇవ్వనందుకే ఓడిపోయానని తను కనుగొన్న గొప్ప సత్యాన్ని తన పార్టీ నేతలందరికీ తెలిజేసారు.   తను అధికారం కోసం రాజకీయాలలోకి రాలేదని ప్రజల కిచ్చిన మాట కోసమే వచ్చేనని, అందువల్ల తను అధికారం కంటే విస్వసనీయతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారం దక్కించుకోవడం కోసమే అనేక భూటకపు హామీలు ఇచ్చేరని, ఇప్పుడు తన మెడకు గుదిబండలా చుట్టుకొన్నవాటి నుండి ఏవిధంగా బయటపడాలా? అని ఆలోచిస్తున్నారని జగన్ ఎద్దేవా చేసారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున ఆయన ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తానని ప్రకటించారు.   జగన్మోహన్ రెడ్డి పార్టీ సమీక్షా సమావేశాలు పెట్టుకోవడం వెనుక ముఖ్యోదేశ్యం ఎన్నికలలో పార్టీ ఓటమికి గల కారణాలను కనుగొని, లోపాలను సవరించుకోవడం. అయితే ఆయన ఆ పనిచేయకపోగా తన ఓటమికి చంద్రబాబు భూటకపు హామీలు చేయడమే కారణమని వాపోవడం విడ్డూరం. చంద్రబాబు ప్రభుత్వం ఇంకా అధికారం చేప్పట్టనేలేదు. ఆయన హామీలను అమలు చేస్తారో లేదో? చేస్తే ఏవిధంగా అమలు చేస్తారో? ఎవరికీ తెలియదు. కానీ అప్పుడే జగన్మోహన్ రెడ్డి అవన్నీ భూటకపు హామీలని తేల్చి చెప్పేస్తున్నారు.   అసలు చంద్రబాబు రైతుల, డ్వాక్రా సంఘాల రుణమాఫీలు చేయడంలో విఫలమవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుకొంటున్నారు? అని ఆలోచిస్తే ఆయన విఫలమయితే ప్రభుత్వంపై యుద్ధం చేసి, మళ్ళీ ప్రజలలో మంచిపేరు సంపాదించుకోవాలనే ఆరాటమేనని చెప్పవచ్చును.   గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పుయాత్రలు, షర్మిలమ్మ పాదయాత్రలు, ఒట్టొట్టి సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఐదురోజుల ఆమరణ నిరాహార దీక్షలు అన్నీ కూడా అధికారం కోసమేనని అందరికీ తెలుసు. చివరికి తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరణంతో ప్రజలలో ఏర్పడిన సానుభూతిని, ఆయన చేపట్టిన సంక్షేమ పధకాలను కూడా తను అధికారం సంపాదించుకోనేందుకు పెట్టుబడిగానే వాడుకొన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. తండ్రి చనిపోయిన తరువాత ఆయనకు అంత్యక్రియలు జరుగకముందే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయిపోదామని సంతకాల సేకరణ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే స్వంతం. ఇంత అధికార దాహం కల వ్యక్తి తాను కేవలం ప్రజలకు ఇచ్చిన మాట కోసమే రాజకీయాలలోకి వచ్చేనని చెప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   చంద్రబాబు భూటకపు వాగ్దానాలు చేసారని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి, తను కూడా అనేక ఆచరణ సాధ్యం కానీ వాగ్దానాలు చేసిన సంగతి మరిచిపోయారు. నిజానికి అన్ని సర్వేనివేదికలు వైకాపాయే పూర్తి మెజార్టీతో గెలుస్తుందని బల్ల గుద్ది చెప్పడం వలన, గెలుపుపై ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రుణాలమాఫీ చేస్తానని హామీ ఇవ్వలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి తన గెలుపుపై ఏమాత్రం అనుమానం ఉన్నా, పాత రుణాలే కాదు వచ్చే ఐదేళ్ళలో రైతులు తీసుకోబోయే అన్ని రుణాలను కూడా మాఫీ చేస్తానని ప్రకటించేవారేమో?   తెలంగాణలో అధికారం చేప్పట్టిన కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు వెనుకంజ వేస్తుంటే నోరుపెగలని, జగన్మోహన్ రెడ్డి, ఇంకా అధికారం చెప్పట్టని చంద్రబాబు ప్రభుత్వం రుణాలమాఫీపై యుద్దానికి సిద్దం అనడం మరో విశేషం. రాష్ట్ర విభజనకు కారణమయిన కేసీఆర్ నోరు తెరచి అడగకముందే ఆయన ప్రభుత్వానికి అంశాల వారిగా మద్దతు ఇస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వంపై మాత్రం అప్పుడే యుద్ధం ప్రకటించేయడం మరో విశేషం.   చంద్రబాబు భూటకపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని జగన్ అనడం చూస్తే, ప్రజలు గొర్రెలు వారికి ఆలోచించే జ్ఞానం లేదు అందుకే చంద్రబాబుని గుడ్డిగా నమ్మి ఓటేసేసారని అభిప్రాయపడుతున్నట్లు ఉంది. ఆయన ఆవిధంగా మాట్లాడటం ప్రజల పట్ల ఆయనకు ఎంతటి చులకన భావం ఉందో తెలియజేస్తోంది.   నిజానికి ప్రజలు చంద్రబాబు హామీల కంటే ఆయన పరిపాలనా సామర్ద్యం, అనుభవం, కార్యదక్షత, కేంద్రంతో ఆయనకున్న సత్సంబంధాలు వంటి అంశాల కారణంగానే ఎన్నుకొన్నారు. పరిపాలనానుభావం ఉన్న ఆయనయితేనే రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టగలరని నమ్మకంతోనే ఓటేసే గెలిపించారు. కానీ వైకాప ఓటమికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణమని చెప్పవచ్చును. అక్రమ సంపాదన, సీబీఐ చార్జ్ షీట్లు, కోర్టులు, కేసులు, బెయిళ్ళు, జైలు జీవితం, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీతో, ఆంద్ర ప్రజలను ఘోరంగా అవమానిస్తున్నకేసీఆర్ తో రహస్య సంబందాలు, ఇంకా మున్ముందు కోర్టు కేసులు.. ఇటువంటి గొప్ప ట్రాక్ రికార్డ్ కలిగిన అతని వలననే వైకాపా ఓడిపోయిందని చెప్పక తప్పదు. కానీ ఆవిషయం మరుగునపరచి చంద్రబాబుని తప్పు పట్టడం అవివేకం. అధికార దాహంతో అలమటిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికయినా నిజాయితీగా వ్యవహరించగలిగితే, ప్రజలలో వచ్చే ఎన్నికల నాటికయినా ప్రజలలో ఆయన పట్ల ‘విశ్వసనీయత’ ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెండు రాష్ట్రాల అభివృద్ధే మా లక్ష్యం: నిర్మల

      ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిర్మల సీతారామన్ హైదరాబాద్ వచ్చారు. ఆమెకు షంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ను రాష్ట్ర బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి వుందన్నారు. రెండు రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. రెండు రాష్ట్రాలలో ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను అభివృద్ధికి తనవంత సహకారం అందిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు అధికమవుతాయని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ముంపు గ్రామాలను కలిపింది బంగ్లాదేశ్‌లో కాదు: వెంకయ్య

      పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అనే అంశం మీద టీఆర్ఎస్ నాయకులు లబోదిబో అని మొత్తుకుంటూ నానా హడావిడి చేస్తున్నారు. వీరి మీద బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయకుడు సెటైర్ వేశారు. పోలవరం ముంపు ప్రాంతంలోని ఏడు మండలాలను తాము కలిపింది మన దేశంలో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేనని బంగ్లాదేశ్‌లాంటి పరాయి దేశంలో కాదని వ్యాఖ్యానించారు. ఆ మండలాలలను అటు కలిపినా, ఇటు కలిపినా పోయేదేమీ లేదని అన్నారు. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల తెలంగాణకు నష్టం రాదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ఆంద్ర ప్రజల జీవన రేఖ అని ఆయన అభివర్ణించారు. రాజకీయ లబ్ధికోసం ఇరు ప్రాంతాల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించవద్దని ఆయన అలా విభేదాలు సృష్టిస్తున్న వారికి సలహా ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తప్పక లభిస్తుందని వెంకయ్య పునరుద్ఘాటించారు. కొందరు ఆ నాయుడు,ఈ నాయుడు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యలు చేస్తున్నారని, అది సరికాదని చెబుతూ నాయుడు అంటే నాయకుడు అని వెంకయ్య నాయుడు అర్థం వివరించారు.

ఉత్తర ప్రదేశ్‌లో మరో అత్యాచారాల పర్వం

      ఉత్తర ప్రదేశ్‌లో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం యు.పి.లో అక్కాచెళ్లపై అత్యాచారం చేసి, ఆపై చెట్టుకు ఊరేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృప్టించింది. అత్యాచార సంఘటనలు సృష్టించిన సంచలనం కంటే అత్యాచారాల మీద ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందిస్తున్న తీరు ఇంకా సంచలనాత్మకం అయింది. ఇదిలా వుంటే, అక్కాచెల్లెళ్ళ అత్యాచార ఘటన జరిగి వారంరోజులు కూడా గడవకముందే, యు.పి.లో మళ్లీ అటువంటి ఘటనే జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ఇటా జిల్లాలోగల సియపూర్ గ్రామంలో 14, 15 సంవత్సరాల వయసున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. వీరిద్దరిని ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సమీపంలో వున్న అటవిప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ముగ్గరినీ అరెస్టు చేశారు.

ఢిల్లీ టూర్: కేసీఆర్ టార్గెట్ ప్రత్యేక హోదా!

      ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రత్యేక హోదా సాధించడమేనని స్పష్టమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ శనివారం తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈదఫా పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో సమావేశం అవుతారు. ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాల్సిన అంశాలపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి కేసీఆర్ వ్యూహరచన చేశారు. అలాగే, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కేసీఆర్ ప్రధానిని కోరనున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూడా కోరబోతున్నారు.

బామ్మా.. నువ్వు సూపరెహె!

    ఆమె వయసు 91 సంవత్సరాలు. అందులోనూ కేన్సర్ వ్యాధికి గురై ఈమధ్యే కోలుకుంటున్న ముసలమ్మ... అయినా సరే 42 కిలోమీటర్ల దూరం మారథన్ రన్ చేసింది. ఈ దూరాన్ని 7 గంటల 7 నిమిషాల 42 క్షణాల్లో పూర్తిచేసింది. అమెరికా వాషింగ్టన్‌లోని లుకేమియా లింఫోమియా సొసైటీకి నిధుల సేకరణ కోసం నిర్వహించిన మారథాన్ పరుగులో ఆరోగ్యం సహకరించకపోయినా హారియట్ థాంప్సన్ అనే ఆ బామ్మ ఉత్సాహంగా పాల్గొంది. మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి మారథాన్‌లో చాలా సంవత్సరాల క్రితం ఒక బామ్మ పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిందట. ఇప్పుడు మన హారియట్ థాంప్సన్ రెండో బామ్మ. 42 కిలోమీటర్ల మారథాన్‌లో సగం పరిగెత్తేసరికి తన పని అయిపోయిందని తాను భావించానని, కానీ, తన మారథాన్‌ను చూస్తు్న్న వారు ఇచ్చిన ప్రోత్సాహమే తనకు మారథాన్ పూర్తి చేసే ఉత్సాహాన్ని ఇచ్చిందని బామ్మ చెప్పింది. బామ్మ విజయవంతంగా మారథాన్ పూర్తి చేసినందుకు ఈ మారథాన్ నిర్వహించిన సంస్థకు 90 వేల డాలర్లు దక్కాయి. మన బామ్మ గతంలో ఒకసారి మారథాన్లో పాల్గొంది. అప్పుడు పరుగుకు నాలుగు వారాల ముందు వరకు ఆమె 11 రోజుల పాటు రేడియేషన్ చికిత్స తీసుకుంది. దాని ఫలితంగా రెండు కాళ్ల మీద విపరీతంగా గాయాలయ్యాయి. వాటికి బ్యాండేజిలు కట్టుకుని మరీ ఆమె పరుగు తీసింది. ఈసారి పరిగెత్తినప్పుడు బామ్మగారి 55 ఏళ్ల కొడుకు బ్రెన్నెమన్ కూడా ఆమెతో పాటు పరిగెత్తి, ఆమెకు సాయం చేశాడు. వచ్చే సంవత్సరం నాటికి తాను బతికుంటే.. మరోసారి మారథాన్ రన్ చేస్తానని బామ్మ ఉత్సాహంగా చెబుతోంది. అందుకే.. బామ్మా.. నువ్వు సూపరెహె!