టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే మణిగాంధీ.. ఇప్పటికి 8మంది

  వైసీపీ ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అభివృద్ధి చూసే టీడీపీలో చేరా.. కోడుమూరు అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ..మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే టీడీపీలో చేరుతున్నారు.. ఎవరిని ప్రలోభపెట్టాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వాన్ని కూలుస్తానని జగన్ చేసిన వ్యాఖ్యలకు ఈ చేరికలే జవాబు.. ఇంకా ఐదారుగురు నేతలు టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు.. ప్రతిపక్షం లేకుండా పోతుందని జగన్ భయపడుతున్నారని అన్నారు. కాగా మణిగాంధీతో కలిపి.. ఇప్పటికి 8మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు.

కిరణ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ కు దరిద్రం.. వీహెచ్

  కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం వ్యవహారంపై పార్లమెంట్లో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. కార్తీ చిదంబరం అక్రమ మార్గాల ద్వారా వేలాది కోట్లు సంపాదించారని, ఎయిర్ టెల్-మ్యాక్సిస్ డీల్‌లో నిందితుడైన ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. సభలు ప్రారంభమైన వెంటనే వెల్ లోకి వెళ్లి కార్తీ చిదంబరంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు స్పందిస్తూ కార్తీ చిదంబరం వల్లే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన వల్లే కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి దక్కిందని.. ఆయన సీఎం అయిన తర్వాతే కాంగ్రెస్‌కు దరిద్రం పట్టుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే.. దేవినేని

  కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత పురంధేశ్వరి పోలవరంకు కేవలం రూ.100 కోట్లు రావడానికి ఏపీ ప్రభుత్వమే కారణమని..పట్టిసీమను పోలవరం నిర్మాణ వ్యయంలో ఎందుకు చేర్చారో చెప్పాలని విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను టీడీపీ నేత దేవినేని ఉమ ఖండించారు. పోలవరం ప్రాజెక్టుపై పురంధరేశ్వరీ చేసిన వ్యాఖ్యలు అవాస్తమని.. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమేనని ఆయన అన్నారు.పోలవరం అథారిటీకి జలవనరుల శాఖ సహకరిస్తుంది.. పోలవరం బడ్జెట్ పై ఉమాభారతితో చంద్రబాబు మాట్లాడారు.. ఈవారంలోపు చంద్రబాబు ఆమెను కలుస్తారు.. పోలవరంను సకాలంలోనే పూర్తిచేస్తామని తెలిపారు.

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన రోజా..

  అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలసిందే. అయితే సస్పెన్షన్ సవాల్ చేస్తూ రోజా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ వ్యాజ్యాన్ని ఈనెల 9కి వాయిదా వేసింది. ఇప్పుడు దీనికి ప్రశ్నిస్తూ రోజా డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదిస్తూ..  శాసన సభ వ్యవహారాల శాఖ, అసెంబ్లీ కార్యదర్శులు కౌంటర్లు దాఖలు చేయకుండా వాయిదా కోరారని.. కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏదో ఒక సాకుతో వాయిదా కోరుతున్నారని తెలిపారు. అంతేకాదు.. ఈనెల 5 నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో 9కి వాయిదా వేస్తే పిటిషనర్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కోల్పోతారని అన్నారు.   దీనిపై ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. గత నెల 17న ఇచ్చిన నోటీసులు అసెంబ్లీ కార్యదర్శికి 24న అందాయని.. వాదనలు చెప్పాలని తనను కోరారని, ఆ విషయాన్నే కోర్టుకు చెప్పి వాయిదా కోరానని తెలిపారు. ఈ వాదనలు విన్న హైకోర్టు సింగిల్‌ జడ్జి ముందున్న కేసు విచారణను 9వ తేదీ కంటే ముందుగానే చేపట్టాలని కోరతామని స్పష్టం చేస్తూ విచార ణను ఈనెల 3వ తేదీకి వాయిదా వేసింది.

జెఎన్ యూ.. అవి అసలైన వీడియోలు కాదు.. తేల్చేసిన ఫొరెన్సిక్

జ్యాతి వ్యతిరేక నినాదాలు చేశారంటూ.. దేశ ద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్ పై వచ్చిన వీడియోలు మార్ఫింగ్ చేసినవి అని.. అసలు వీడియోలు కాదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఫోరెన్సిక్ అధికారులు వాటిని పరిశీలించిన అనంతరం.. అవి అసలైనవి కావని.. మార్ఫింగ్ చేసినవే అని తేల్చి చెప్పింది. ఈ వీడియోలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఫొరెన్సిక్ విభాగాన్ని ఆదేశించగా హైదరాబాద్ లోని అధికారులు వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు చెబుతూ.. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం ఏడు వీడియోలు రాగా.. అందులో రెండింటిని ముందే ఎడిట్ చేశారని.. గొంతులు కూడా కలిపారని.. దీనికి సంబంధించిన నివేదికను ఢిల్లీ ప్రభుత్వానికి అందించామని తెలిపారు.

బుల్లితెర నటి ఆత్మహత్య.. ఉరేసుకొని

  బుల్లితెరపై నటించే శృతి అనే నటి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగుళూరులో టెలివిజన్ నటి శృతికి రమేష్ అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితమే వివాహమైంది. వీరిద్దరికి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే శృతికి తన ఇంటికి సమీపంలో శ్రీకాంత్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శృతి నిన్న రాత్రి శ్రీకాంత్ ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలో  ఇరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన కొద్ది సేపటికి శ్రుతి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాంత్ అతని స్నేహితుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే శృతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంది. దాంతో శ్రీకాంత్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు శృతి భర్త రమేష్ తన భార్య చనిపోవడానికి కారణం శ్రీకాంతే అంటూ.. అతనే శ్రుతిని ఆత్మహత్యకు ప్రేరేపించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకాంత్ పై కూడా కేసు నమోదు చేశారు.

జగన్ ను రెండో పెళ్లి చేసుకోమన్నా..చంద్రబాబుకి కులపిచ్చి..

  వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అయిన ఆదినారాయణ రెడ్డి అప్పుడే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఎలాగో అనేక అడ్డంకులు ఎదురైనా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారు. అయితే అలా చేరారో లేదో అప్పుడే మైక్ దొరికింది కదా అని చెప్పేసి జగన్ పై విమర్శనాస్త్రాలు విసిరారు. అంతేకాదు పార్టీ అధినేత చంద్రబాబుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ లక్ష కోట్లు సంపాదించాడని.. వాటికి రూపాయి లెక్క వడ్డీ వేసుకున్నా ఆరు లక్షలవుతుందని.. అన్నారు. అంతేకాదు తను ఎంట్రీకి అడ్డుపడిన రాంసుబ్బారెడ్డిని ఉద్దేశించి కూడా వ్యాఖ్యానించారు. అతనితో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని.. ఒకవేళ తాను కనుక ఇబ్బంది పెడితే.. నేను రెండింతలు ఇబ్బందులు పెడతానని హెచ్చరించారు.   అక్కడితో ఆగకుండా ఇంకా అనేక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఇద్దరూ ఆడపిల్లలే ఉన్నారని.. ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పానని..  అన్నారు. ఇక చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. అలాగే...  చంద్రబాబుకు కులపిచ్చి ఉందని... అది మార్చుకోవాలని ఆయనకు చెప్పానని అన్నారు. వైఎస్ హయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా జరిగాయని.. అంతకంటే వేగంగా చేయాలని చంద్రబాబుకు సూచించానన్నారు. మరి పార్టీలోకి వచ్చిన కొత్తలోనే ఇంతలా మాట్లాడుతున్నాడు.. అందునా చంద్రబాబు గురించి కూడా మాట్లాడుతున్నాడు.. ఇలానే మాట్లాడితే పార్టీలో ఏమాత్రం ఇమడగలడో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆదినారాయణ రెడ్డిగారు నోరు కాస్త ఆదుపులో పెట్టుకుంటే మంచిదని.. అనుకుంటున్నారు.  

భారత్ పాక్ మ్యాచ్ పై కొత్త సస్పెన్స్

టి20 వరల్డ్ కప్ ఈ ఏడాది ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దాయాదులు ఇండియా పాకిస్థాన్ దేశాలు, ఈ నెల 19న ధర్మశాలలో తలబడబోతున్నాయి. వరల్డ్ కప్ ఫిక్స్చర్స్ ప్రకటించి చాలా కాలమైనా నోరు మెదపని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఈ మ్యాచ్ కు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఇలాంటి పాలిటిక్స్ చేస్తోందని, దీని వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ విమర్శలు చేశారు బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్. ఈ నేపథ్యంలో, ఇండియా పాక్ మ్యాచ్ పై సస్పెన్స్ నెలకొంది. ఈ విషయమై బిసిసిఐ ఎలాంటి కసరత్తు చేస్తుందో చూడాలి

ఫ్రీగా వడాపావ్ ఇవ్వలేదని చితకొట్టిన శివసేన ఎమ్మెల్యే..

శివసేన.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేది. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ నేతలు నోటికి కాకుండా చేతికి పనులు చెబుతున్నారు. అధికారం ఉంది కదా అని సామాన్య ప్రజలపై తమ రౌడీయిజాన్ని చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే శివసేన నేత లేడి కానిస్టేబుల్ పై దాడి చేశాడు. ఆ ఉదంతం అయిందో లేదో.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే షాపు యజమానిపై తన ప్రతాపాన్ని చూపించాడు. వివరాల ప్రకారం శివసేన ఎమ్మెల్యే పాటిల్ 100 వడాపావ్ లు ఫ్రీగా పార్శిల్ చేసి ఇంటికి పంపించమన్నాడు. అయితే షాపు యజమాని దీనికి నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే కర్రతో అతనిపై దాడి చేశాడు. విచక్షణ లేకుండా చితకబాదుడు బాదాడు. అయితే సదరు ఎమ్మెల్యే గారు చేసిన నిర్వాకం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డవడంతో అసలు విషయం బయటపడింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియా హల్ చేస్తుంది. ఇది చూసిన స్థానికులు ఎమ్మెల్యే పై.. పార్టీ పై మండిపడుతున్నారు. దీంతో చేసేది లేక పార్టీ ఆఎమ్మెల్యేను సస్పెండ్ చేసింది.

ఎర్రబెల్లి ఆ విషయంలో హర్ట్ అయ్యారా..? అందుకే పార్టీ వీడారా..?

తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి.. అనేక సంవత్సరాలు పార్టీకి నమ్మిన బంటులా ఉన్న ఎర్రబెల్లి ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే దశాబ్దాల తరబడి పార్టీని వెన్నంటి ఉన్న ఎర్రబెల్లి అంత సడెన్ గా పార్టీ మారడానికి కారణాలేంటి.. అంటే ఇప్పుడో కొత్త వాదన వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో.   ఒకేపార్టీ అయినప్పటీకీ రేవంత్ రెడ్డికి, ఎర్రబెల్లికి అనేక విషయాల్లో విబేధాలు ఉండేవి. వీరిద్దరి మధ్య తరుచూ ఏవో గొడవలు వస్తూనే ఉండేవి. అలా వారు గొడవ ప్రతిసారీ పార్టీ అధినేత చంద్రబాబు వారిని బుజ్జగించడం కామన్.. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఒక పని వలన ఎర్రబెల్లి బాగా హర్ట్ అయ్యారంట. అదేంటంటే.. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల బరిలో దిగిన అభ్యర్ధుల ఖర్చు నిమిత్తం ఎన్నికల వ్యవహారానికి సుమారు రూ.60 కోట్లు నిధులు వచ్చాయంట. అయితే ఈ డబ్బుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకోమని చంద్రబాబు రేవంత్ రెడ్డిని పురమాయించారట. అంతే దీంతో ఎర్రబెల్లి దీన్ని అవమానంగా భావించి.. సైకిల్ దిగి కారెక్కారంట. మరి ఇది వాదన మాత్రమే.. నిజంగా అదే జరిగిందా.. ఎంత వరకూ నిజమో ఎర్రబెల్లికే తెలియాలి.

నేను ఏ తప్పు చేయలేదు.. రోహిత్ పేరు రాయలేదు.. దత్తాత్రేయ

లోక్ సభలో రోహిత్ ఆత్మహత్యపై దుమారం రేగుతూనే ఉంది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.. మాయవతి మధ్య మాటలయుద్ధమే జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మొదటిసారిగా లోక్ సభలోనోరు విప్పారు. అయితే ఆయన తన ప్రసంగం ప్రారంభించారో లేదో..  విపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. అనంతరం  ఆయనమాట్లాడుతూ.. నాకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది.. ఈ 40 ఏళ్లలో నేను ఏ తప్పు చేయలేదని అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. రోహిత్ విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు.. అసలు హెచ్ఆర్డీకి రాసిన లేఖలో రోహిత్‌ పేరు ప్రస్తావించలేదని చెప్పారు. విపక్షాలు అనవసరంగా నాపై విమర్శలు చేస్తున్నారని.. నాపై దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు.

ఆత్మహుతి బాంబుదాడులతో అట్టుడుకుతున్న ఇరాక్..

ఇరాక్ లో ఆత్మహుతి బాంబుల దాడులు ఎక్కువయ్యాయి. రెండు రోజుల క్రితమే ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో రెండు బాంబు పేలుళ్లు.. ఒక ఆత్మహుతి బాంబు దాడి జరిగాయి. మరోప్రాంతమైన ముగ్దాడియా పట్టణంలో కూడా ఆత్మహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో  34 మందికి పైగా మరణించారు. అయితే ఈ దాడులకు పాల్పడింది తామే అని ఇస్లామిక్ మిలిటెంట్లు అంగీకరించారు. దీంతో ఇప్పుడు బాగ్దాద్, ముగ్దాడియా ఘటనలపై ఐక్యరాజ్యసమితి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏడుగురు షియా మిలిటెంట్లు ఈ ఉగ్ర ఘాతుకాలకు పాల్పడి ఉండొచ్చునని అధికారిక ప్రకటనలో ఐరాస పేర్కొంది. కాగా బాగ్ధాద్ లో, ముగ్దాడియా ఆత్మహుతి బాంబు దాడివలన మొత్తం 87 మంది చనిపోగా మరో 117 మందికి గాయాలైనట్టు తెలుపుతున్నారు.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జగన్ కంప్లైట్..

వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి చేరుతున్నారు. భూమా నాగిరెడ్డి తో ప్రారంభమైన ఈ వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీ పార్టీలోకి చేరగా.. ఇప్పుడు మరో వైసీపీ నేత.. పాతపట్నం ఎమ్మెల్యే వెంకట రమణ టీడీపీలోకి చేరబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ వరుస పార్టీ ఫిరాయింపులపై జగన్ సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తన పార్టీ నుంచి టిడిపిలో చేరిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జగన్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు ఫిర్యాదు చేయనున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పెద్దలు.

జగన్ ఆస్తి 6 లక్షల కోట్లు.. చిట్టా విప్పుతా..

కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సి.ఆదినారాయణ ఇటీవలే టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఎన్నో నెలల నుండి పార్టీని వీడి టీడీపీలోకి చేరదామనుకున్న ఈయనకు రామసుబ్బారెడ్డి అడ్డుకోవడంతో లేట్ అయింది. ఎట్టకేలకు చంద్రబాబు రామసుబ్బారెడ్డిని బుజ్జగించడం.. ఆది నారాయణ రెడ్డి టీడీపీ లోకి రావడం జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఆయన వైసీపీ అధినేత అయిన జగన్ పై విమర్శల బాణాలు వదిలారు. జగన్ కు సంబంధించి అక్రమాస్తుల గురించి చిట్టా విప్పుతా అని అంటున్నారు. ఆదినారాయణ నియోజక వర్గం జమ్మలమడుగులో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జగన్ అక్రమాస్తులు విలువ రూ.6 లక్షల కోట్లని..  జగన్ లక్ష కోట్లు సంపాదించాడని, రూపాయి వడ్డీ వేసినా నేడు రూ.6 లక్షల కోట్లు అవుతుందన్నారు. జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల చిట్టాను ఆయన ఇలాకా పులివెందులలోని అంగళ్ళ ముందే విప్పుతానని వ్యాఖ్యానించారు. జగన్‌ కుళ్లు రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకే తాను చంద్రబాబు చెంతకు చేరినట్టు ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు తనకు టీడీపీలో ఎవరితో బేధాలు లేవని.. రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేస్తానని ఆయన అన్నారు.