సొంత బంధువులను దూరంగా ఉంచాలన్న శశికళ...

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పార్టీ బాధ్యతలు పన్నీర్ సెల్వం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సీఎంగా పార్టీ బాధ్యతలు చేపట్టినా పెత్తనం మొత్తం శశికళదే అని ఆరోపణలు వస్తున్న సంగతి కూడా విదితమే. జయలలిత మరణం తరువాత శశికళపైనా చాలా ఆరోపణలు, ఒక రకంగా జయ లలిత మృతికి శశికళే కారణమంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శశికళ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. తన కుటంబసభ్యుల్లో ఎవరికి పార్టీ తరపున సీట్లుకానీ.. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంచాలని. దీనిలో భాగంగానే ఆమె జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్స్‌లో తన వాళ్లందరితో నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె ఈ విషయం చెప్పినట్లు సమాచారం. తన కుటుంబ సభ్యులలో ఎవరైనా ఏం చెప్పినా అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రులు, పార్టీ కీలక నేతలందరికీ కూడా ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి శశికళ పోయెస్ గార్డెన్స్ నివాసంలోనే ఉంటారని సమాచారం. ప్రస్తుతానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారని, కానీ తర్వాత వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత ఆమె వదిన ఇళవరసి మాత్రం శశికళతో ఉంటారని చెబుతున్నారు. అయితే.. తాజా విమర్శల నేపథ్యంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, ప్రజలు వేలెత్తిచూపే పరిస్థితి వస్తుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

విరాట్ ఖాతాలో మరో రికార్డ్..

  టీమిండియా టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పుడు మరో రికార్డ్ ను సొంత చేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో మూడో రోజు ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్ లో 35 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లి... ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులను సాధించాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్గా నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్(1997), రాహుల్ ద్రవిడ్(2006)లు మాత్రమే ఈ ఘనతను సాధించిన భారత కెప్టెన్లు. విరాట్ సాధించిన వెయ్యి పరుగుల్లో రెండు డబుల్ సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 మ్యాచ్ల్లో 17 ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి ఈ మార్కును చేరాడు. ఇదిలా ఉండగా ఒక ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగులు సాధించిన ఆటగాళ్లలో సచిన్ ముందంజలో ఉన్నాడు.

ట్రంప్ నిర్ణయం.. భారతీయులపై ప్రభావం..

  అమెరికా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడే డొనాల్డ్ ట్రంప్ విదేశీయులు, అమెరికన్లు ఉద్యోగాలు తన్నుకుపోతున్నారని.. నేను కనుక అధికారంలోకి వస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అందుకు తగ్గట్లే నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. లోవాలోని జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన విదేశీ ఉద్యోగులను తెచ్చి, అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోనని, అలా వచ్చే హెచ్-1బీ వీసా దారులను అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. హెచ్-1బీ వీసాలతో వచ్చి అమెరికన్ల ఉద్యోగాలు ఆక్రమించేవారిని అనుమతించే ప్రసక్తే లేదని.. "ప్రతి అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు మనం పోరాడాల్సిన అవసరం ఉందని" తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ కనుక అలాంటి నిర్ణయమే తీసుకుంటే అది భారత ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నోట్ల రద్దు.. కేంద్రంపై సుప్రీం ప్రశ్నల వర్షం..

  నోట్ల రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారించిన సుప్రీం కోర్టు కాస్త గట్టిగానే కేంద్రాన్ని మందలిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. నోట్ల రద్దు తరువాత సామాన్య ప్రజలు పడుతున్న కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలోనే దీనిపై స్పందించిన సుప్రీం.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సూచించింది. ఇప్పుడు తాజాగా మరోసారి కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టగా..నోట్ల రద్దు తీసుకునే ముందు అసలు కేంద్రం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా? లేక ఆషామాషీగా నోట్ల రద్దును ప్రకటించారా? అని ప్రశ్నించింది. "రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన వేళ, మీరనుకున్నంత మేరకు కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టారా? అసలెంత కొత్త కరెన్సీ కావాలని అంచనా వేశారు? మీ వద్ద ఏదైనా ప్లాన్ వుందా? రూ. 10 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వస్తాయని భావిస్తే, అంత మొత్తం కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తూ, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. మరి సుప్రీం ప్రశ్నలకు కేంద్రం ఎలాంటి సమాధానాలు చెబుతుందో చూద్దాం.

శేఖర్ రెడ్డిని పదవి నుంచి తొలగింపు..

  టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై ఐడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా ఐటీ శాఖ సోదాలు జరుపుతుండగా.. తవ్వే కొద్ది నల్లధనం బయటపడుతూనే ఉంది. ఇప్పటికే 70 కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, 120 కిలోల బంగారం బయటపడగా.. ఇప్పుడు మరింత కరెన్సీ బయటపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనను పదవినుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత కరెన్సీని కొత్త నోట్లలోకి మార్చినట్టు, ఆపై మిగిలిన పాత కరెన్సీతో బంగారం కొన్నట్టు శేఖర్ రెడ్డి అంగీకరించగా, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రత్యేక ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. టీటీడీలో ఓ తమిళ వ్యక్తికి భాగం కల్పించాలన్న ఉద్దేశంతో జయలలిత సిఫార్సుతో శేఖర్ రెడ్డికి బోర్డు సభ్యుడి హోదా దక్కిన సంగతి తెలిసిందే. ఇక జయలలితకు సన్నిహితుల్లో ఒకరిగా పేరున్న శేఖర్ రెడ్డి ఇంటిపై ఆమె చనిపోయిన తరువాత ఐటీ దాడులు జరగడం విశేషం.   ఇదిలా ఉండగా శేఖర్ రెడ్డి ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శేఖర్ రెడ్డి అనుచరులు ప్రేమ్, శ్రీనివాస్ రెడ్డి ఇళ్లల్లో కూడా దాడులు చేస్తున్నారు. అంతేకాక శేఖర్ రెడ్డి బంగారం కొనడం, కరెన్సీ నోట్లు మార్పుపై బంగారం వ్యాపారులు, బ్యాంకు అధికారుల పాత్రపై త్వరలో విచారణ చేపట్టనున్నట్టు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. దాంతో పాటు ఈ కేసును ఈడీ కి అప్పగించాలని ఐటీ శాఖ భావిస్తోంది.

అగస్టా వెస్ట్ ల్యాండ్.. ఎస్పీ త్యాగి అరెస్ట్..

అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో వైమానికదళ అధిపతి త్యాగి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుండి సీబీఐ అధికారులు విచారిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు త్యాగిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. త్యాగితో సహా ఢిల్లీకి చెందిన లాయ‌ర్ గౌత‌మ్ ఖైతాన్‌, సంజీవ్ త్యాగిల‌ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీవీఐపీ హెలికాప్ట‌ర్ల కొనుగోలులో అక్ర‌మాల‌కు సంబంధించి ఈ ముగ్గురిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 12 వీవీఐపీ హెలికాప్ట‌ర్ల కొనుగోలు విష‌యంలో ఉన్న‌తాధికారులు, రాజ‌కీయ నేత‌లు లంచం తీసుకున్నట్లు విచారణలో తేలింది.

జయలలితకు అభిమాని గుడి.. ఉద్యోగానికి రాజీనామా చేసి...

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అక్కడ ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ అంటే ప్రాణాలిచ్చే అభిమానులు సైతం అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ అభిమాని ఇప్పుడు ఏకంగా జయలలితకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నాడో లేదో తన ఉదోగ్యానికి సైతం రాజీనామా చేశాడు. ఇంతకి అతను ఎవరు.. అసలు కథ ఏంటో ఓ సారి చూద్దాం..  వేల్‌మురుగన్‌ అనే వ్యక్తి థేని జిల్లాలోని ఒడ‌ప‌ట్టి పోలీస్ స్టేష‌న్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈయన జయలలితకు వీరాభిమాని. ఇప్పుడు ఆమె చ‌నిపోవ‌డంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను జయలలితకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు గుడి క‌ట్టించాల‌న్న ఉద్దేశంతోనే ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టాన‌ని..జ‌య‌ల‌లిత పుట్టిన‌రోజు అయిన ఫిబ్ర‌వ‌రి 24న సీఎం ప‌న్నీర్‌సెల్వం చేతుల మీదుగా గుడిని ప్రారంభించాల‌ని వేల్‌మురుగ‌న్ భావిస్తున్నాడట. కాగా అత‌నిపై ఆధార‌ప‌డి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

సుమిత్రా మహాజన్ కు కూడా కోపం తెప్పించారు... సెల‌వు పెట్టి వెళ్లండి

  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇంకా మూడు రోజులు మాత్రమే జరగనున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దుపై ఆందోళనలు తప్ప ఎలాంటి చర్చలు జరగలేదు. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు సభల్లో చేస్తున్న ఆందోళనలకు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎల్‌కే అద్వానీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈరోజు కూడా సభ అలానే జరిగింది. దీంతో ఈరోజు స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు స‌భ మొద‌లైన‌ప్ప‌టి నుంచీ నోట్ల ర‌ద్దుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయినా స్పీక‌ర్‌ జోరో హ‌వ‌ర్ నిర్వ‌హించ‌డంతో స‌భ్యులు మ‌రింత గ‌ట్టిగా నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌.. జావ్ స‌బ్ చుట్టీ ప‌ర్ ( అంద‌రూ సెల‌వు పెట్టి వెళ్లండి) అంటూ ఆగ్ర‌హం వ్యక్తంచేశారు. సభను బుధవారానికి వాయిదా వేశారు. మరి ఆఖరి మూడు రోజులైనా సభ సజావుగా సాగుతుందా..? లేక ఇలానే కొనసాగుతుందా..?చూడాలి.

నోట్ల రద్దు వెనుక ఉన్నది వారే...

  పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చాలా పగడ్బందీగా, ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా.. ముఖ్యంగా నల్ల కుబేరులకు ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా నిర్ణయం తీసుకొని వారికి ముచ్చెమటలు పట్టించారు. అయితే మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నా.. నల్లధనం దాచుకున్న వారికి మాత్రం ఏం చేయాలో తెలియట్లేదు. అయితే మోడీ నవంబర్ 8న రాత్రి నిర్ణయం తీసుకున్నా.. ఈ నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని వేరే చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని మోడీనే స్వయంగా చెప్పారు. నోట్ల రద్దు నిర్ణ‌యం రాత్రికి రాత్రి తీసుకున్న‌ది కాదు.. దాని వెనుక ప‌ది నెల‌ల క‌స‌ర‌త్తు దాగి ఉంద‌ని ఆయన అన్నారు. క‌నీసం కేబినెట్‌లోని మంత్రుల‌కు కూడా తెలియ‌కుండా అంత ప‌క‌డ్బందీగా, ర‌హ‌స్యంగా ఈ ఆప‌రేష‌న్ ఎలా జ‌రిగింద‌న్న అనుమానాలు ఇప్ప‌టికీ ఉన్నాయి. చివ‌రి నిమిషం వ‌ర‌కు అంతా ర‌హ‌స్య‌మే. అయితే ఇంత రహస్యంగా చేసిన ఆపరేషన్ వెనుక ముఖ్యంగా ఆరుగురు వ్యక్తులు ఉన్నారని ఇప్పుడు తెలుస్తోంది. ఇంకా అశ్యర్యపడే విషయం ఏంటంటే.. అదీ కూడా ప్ర‌ధాని మోదీ ఇంటి నుంచే కావ‌డం. ఇందులో ప్రధానమైన వ్యక్తి హ‌ష్ముఖ్ అధియా. ఈయన మోడీకి నమ్మినబంటు. అందుకే ఇంత పెద్ద బాధ్యతని ఆయన తన భుజ స్కంధాలపై మోసుకున్నారు. ఇంకా ఈయనతోపాటు మరో ఐదుగురు అధికారులతో కలిసి మోడీ ఇంట్లోనే పది నెల‌ల‌పాటు అత్యంత ర‌హ‌స్యంగా కసరత్తు చేసి ఇంతటి బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు.

నిజంగానే పన్నీర్ సెల్వం అలా అవుతాడా..?

  చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించిన సంగతి తెలిసిందే. అయితే జయలలిత అనంతరం ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించినా ఆ తరువాత  అతనిపై పలు విమర్సలు వచ్చాయి. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ.. ఆయన జయలలిత నిచ్చెలి అయిన శశికళ చేతిలో కీలు బొమ్మగానే మారతారు అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే పన్నీర్ సెల్వం ఈరోజు నుండి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే బాధ్య‌త‌లు చేప‌ట్టే ముందు ప‌న్నీర్‌సెల్వం మ‌రోసారి శ‌శిక‌ళ‌ను క‌లిశారు. నిన్న కొంద‌రు సీనియ‌ర్ మంత్రుల‌తో క‌లిసి పోయెస్‌గార్డెన్ వెళ్లిన ఆయ‌న‌.. ఇవాళ ఉద‌య‌మే మ‌రోసారి అక్క‌డికి వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఈరోజు కూడా ఆ మంత్రులంద‌రూ ప‌న్నీర్‌సెల్వం వెంట ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ జ‌రుగుతున్న స‌మావేశాలు అనుమానాల‌కు తావిస్తున్నాయి. జయలలిత తరువాత త‌దుప‌రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళే అన్న వాద‌న‌కు వీళ్ల స‌మావేశాలు బ‌లం చేకూరుస్తున్నాయి. మరి చూద్దాం భవిష్యత్ రాజకీయాలు ఎలా మారుతాయో..

మాల్యా ట్విట్టర్‌ హ్యాక్..పాస్‌వర్డ్‌లు తెలుసుకున్నాం..

సాధారణంగా రాజకీయ నేతల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడం కామన్. ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌మాల్యా ట్విట్టర్‌ ఖాతా కూడా హ్యాక్ కు గురైంది. ‘హల్లో.. మేము మాల్యాకి వివిధ బ్యాంకుల్లో ఉన్న ఖాతాల పాస్‌వర్డ్‌లను తెలుసుకుని మళ్లీ వచ్చేశాం’ అంటూ హ్యాకర్లు మాల్యా ఖాతాలో ట్వీట్‌ చేశారు. వివిధ బ్యాంకుల్లో మాల్యాకున్న ఆస్తులు, ఆయన లావాదేవీలకు సంబంధించిన పాస్‌వర్డులు తమకు తెలుసని పేర్కొన్నారు. అంతేకాకుండా మాల్యాకి సంబంధించి వివిధ అంశాలపై జరుగుతున్న విచారణ పూర్తవగానే మాల్యాకి సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్లు, విదేశాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని..చూస్తూ ఉండండి.. అని కూడా ట్వీట్‌ చేశారు. మాల్యాని తాము బ్లాక్‌మెయిల్‌ చేయలేదని, ఆ విధంగా అతను చేస్తున్న ప్రచారం, ఆరోపణలన్నీ అవాస్తవాలేనని అన్నారు.

లంచ్ టైం.. ఇంగ్లండ్ స్కోర్.. 385/8

  భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదటిరోజు ఇంగ్లండ్ టీమ్  288 పరుగులు తీసి ఐదు వికెట్లు కోల్పోయింది. ఇందులో నాలుగు వికెట్లు రవిచంద్రన్‌ అశ్విన్‌ తీసుకున్నాడు. అయితే ఈరోజు బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. రెండో రోజు లంచ్‌ సమయానికి మూడు వికెట్ల నష్టపోయి 97పరుగులు చేసింది. దీంతో లంచ్‌ విరామానికి ఇంగ్లాంగ్‌ జట్టు 8 వికెట్ల నష్టానికి 385పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్‌ 64, బాల్‌ 29... క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీశారు.

నేను మాట్లాడితే మోదీ కాళ్ల కింద భూకంపం..

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శల బాణాలు వదిలారు. లోక్ సభలో ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుపై ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మోడీ సభకు రావాలని.. నోట్ల రద్దుపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మాట్లాడిన రాహుల్ గాంధీ... లోక్ సభలో తాను మాట్లాడేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం అనుమతించడం లేదని, తాను మాట్లాడితే ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ల కింద భూకంపం వస్తుందని, ఎక్కడ తమ పునాదులు కదిలిపోతాయన్న భయంతోనే ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుపై చర్చించకుండా తప్పించుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం చర్చకు దూరంగా పారిపోతోందని.. దేశ చరిత్రలో నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణమని, లోక్ సభలో తాను మాట్లాడతానని కోరుతుంటే, ఆ అవకాశం ఇవ్వడం లేదని అన్నారు.

స్పిన్ మాంత్రికుడు అశ్విన్‌ ఖాతాలో మరో రికార్డ్....

  టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో అరుదైన ఘనతను సాధించాడు. భారత్ జట్టులో తనదైన ముద్ర వేసుకున్న అశ్విన్ ఎన్నో కీలకమైన వికెట్లను తీసి జట్టు విజయంలో పాత్ర పోషించాడు. అశ్విన్ అరంగేట్రం చేసిన తరువాత భారత్ ఎనిమిది టెస్టు సిరీస్లు గెలిచింది. అందులో  ఏడుసార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను అశ్విన్ గెలుకున్నాడంటే అతని పాత్ర ఏమిటో అర్థమవుతోంది. ఈ క్రమంలోనే అతని ఖాతాలో ఎన్నో రికార్డులు చేరాయి. ఇప్పుడు మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ముంబైలో నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కోల్పోయిన ఏడు వికెట్లలో ఐదు వికెట్లను అశ్విన్ తీసినవే. దీంతో భారత్ తరపున ఐదు వికెట్లను 23 సార్లు సాధించిన మాజీ దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ సరసన నిలిచాడు. ఈ ఘనతను సాధించి అత్యధికంగా 5 వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు.