వృద్దుని వద్ద కోటిన్నర కొత్త నోట్లు...

పెద్ద నోట్ల రద్దు తరువాత సామాన్య ప్రజలు బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద నిల్చొని అష్టకష్టాలు పడుతుంటే.. మరోపక్క పెద్ద పెద్ద వ్యాపార వేత్తల నుండి మాత్రం పెద్ద మొత్తంలో నగదు బయటపడుతుంది. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అవి కూడా కొత్త నోట్లు కావడమే.. ఇప్పటికే పలువురి దగ్గర భారీగా కొత్త నోట్లు బయటపడగా.. ఇప్పుడు తాజాగా వ్యాపారవేత్త వద్ద కోటికిపైగా కొత్త నోట్లు బయటపడ్డాయి. వివరాల ప్రకారం.. అసోంలోని 85 ఏళ్ల వృద్ధుడైన ఓ వ్యాపారవేత్త ఇంట్లో పోలీసులు  కోటిన్నర రూపాయల విలువ చేసే కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ...గువాహటి నగరానికి చెందిన బెల్టోడా ప్రాంతంలోని హర్దీప్ సింగ్ బేదీ ఇంట్లో సోదాలు చేయగా, కొత్త 500, 2000 రూపాయల నోట్లలో మొత్తం రూ. 1,54,81,000 నగదు లభ్యమైందన్నారు. అందులో 75వేల రూపాయలకు కొత్త 500 నోట్లు ఉండగా, మిగిలినవి 2వేల రూపాయల నోట్లని..కేవలం అద్దెల మీద మాత్రమే ఆధారపడి బతికే ఈయన వద్ద ఇంత మొత్తం ఎక్కడినుంచి వచ్చిందో అర్థంకావట్లేదని  అన్నారు. దీనిపై అతనిని విచారిస్తున్నామని తెలిపారు.

అమ్మకు రెండోసారి అంత్యక్రియలు...

  దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఆమెకు మెరీనా బీచ్ ఎంజీఆర్ ఘాట్ పక్కనే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇప్పుడు మరోసారి జయలలితకు అంత్యక్రియలు నిర్వహించారు. జయలలితకు వరుసకు సోదరుడయ్యే వరదరాజు కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో పవిత్ర కావేరీ నది ఒడ్డున పశ్చిమవాహినిలో రెండోసారి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సోదరి నాస్తికురాలు కాదని...ఆమె హిందూ ఆచారాలను గట్టిగా పాటిస్తారని... అందుకే ఆమెకు మళ్లీ అంత్యక్రియలను నిర్వహించామని చెప్పారు. జయలలిత రూపానికి ప్రతిరూపంగా ఉండేలా ఓ బొమ్మను చేయించి, దానికి అంత్యక్రియలు నిర్వహించారు.   చెన్నైలో జయ అంత్యక్రియలను హిందూ ఆచారాల ప్రకారం నిర్వహించలేదని... ఆమెను దహనం చేయకుండా, ఖననం చేశారని... దీంతో ఆమె ఆత్మకు మోక్షం లభించదని... అందుకే ఆమెకు మళ్లీ అంత్యక్రియలు నిర్వహించామని ప్రముఖ పూజారి రంగనాథ్ అయ్యంగార్ తెలిపారు.

పార్లమెంట్లో ప్రధాని మోడీ..

  నాలుగు రోజుల తర్వాత ఇవాళ మళ్లీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఎప్పటిలాగే ఈరోజు కూడా పార్లమెంట్లో పెద్ద నోట్ల రద్దుపైనే విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈరోజు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పార్ల‌మెంట్‌లో మాట్లాడే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.  అన్ని పార్టీలు త‌మ స‌భ్యులు స‌భ‌కు క‌చ్చితంగా రావాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మోడీ రానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో  స‌మావేశాల‌కు ముందు ప్ర‌ధాని మోదీ త‌న క్యాబినెట్ మంత్రుల‌తో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు.   కాగా నోట్ల ర‌ద్దు అంశం వ‌ల్ల‌ శీతాకాల స‌మావేశాలు దాదాపు జరగలేదు. ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఈ మూడురోజులైన సభ సజావుగా సాగుతుందో లేదో చూడాలి.

తమిళనాడుకు మరో ముప్పు...

  ఇప్పటికే వార్ధా తుఫాను వల్ల తమిళనాడు మొత్తం కకావికలం అయిపోయింది. ఈరోజు కాస్త పరిస్థితి కుదుటపడింది అనుకునేలోపు మరో ముప్పు తమిళనాడుకు రానుంది.  రానున్న 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా సోమవారం ఒక్కసారిగా విరుచుకుపడిన వర్దా  తుపానుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ తుపాను దెబ్బకు రెండు రాష్ట్రాల్లో దాదాపు 12 మంది ప్రాణాలు విడిచారు. తుపాను దెబ్బకు పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.   మరోవైపు వర్దా తుపాను సంభవించినప్పటికీ ఈ నెల 16 నుంచి చెన్నైలోని చెపాక్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లండ్‌ ఐదో టెస్టు మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారం యథాతథంగా జరగనుంది.

రాజకీయ నాయకులకి ఈసీ ఝలక్...

  రాజకీయ నాయకులకి ఎన్నికల సంఘం షాకివ్వడానికి రెడీ అయింది. ఇప్పటి వరకూ రాజకీయ నేతలు రెండు స్థానాల నుండి ఒకేసారి పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే 1996కు ముందు వరకు సాధారణ ఎన్నికల్లో కానీ, ఉప ఎన్నికల్లో కానీ ఎన్నిస్థానాల్లో అయినా పోటీ చేసే అవకాశం ఉండేది. ఆ తరువాత చట్ట సవరణతో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసేలా పరిమితి విధించారు. ఇప్పుడు అది కూడా తీసేసి కేవలం ఒక్క స్థానంలోనే పోటీ చేసే విధంగా చట్ట సవరణ తీసుకురావాలని ఎన్నికల సంఘం కేంద్రాన్ని కోరింది. ఎందుకంటే రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన తరువాత..మళ్లీ ఒక స్థానానికి రాజీనామా చేయడం.. ఆతరువాత మళ్లీ ఆ స్థానానికి ఉప ఎన్నిక జరపడం ఇదంతా ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చు అని సూచించింది.  అంతేకాదు ఒక వేళ రెండు స్థానాల్లో పోటీ చేసే నిబంధనను కొనసాగించాలనుకుంటే... గెలిచిన అభ్యర్థి, రెండో స్థానానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికకు కారణమైతే... ఆ ఎన్నికకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వానికి చెల్లించేలా నిబంధన తీసుకురావాలని సూచన చేసింది. మరి కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం..

జయకు పనికిరాని ఎక్మో సాఫ్ట్ వేర్ కు పనికొచ్చింది...

  చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో అత్యాధునిక చికిత్సను సైతం జయలలితకు అందించారు. అంతేకాదు ఆఖరి అస్ర్తంగా ఎక్మో పద్దతిని కూడా ఉపయోగించారు. కానీ ఇవేమీ అమ్మ ప్రాణాలను మాత్రం నిలుపలేకపోయాయి. అయితే ఈ ఎక్మో పద్దతి అమ్మ ప్రాణాలను అయితే కాపాడలేకపోయింది కానీ... ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాలు మాత్రం కాపాడింది. అసలు సంగతేంటంటే.. బెంగుళూరుకు చెందిన 43 ఏళ్ల శ్రీనాథ్ సాప్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే హఠాత్తుగా అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో వెంటనే అతని కుటుంబసభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వెద్యులు జయలలితకు చేసిన ఎక్మో చికిత్సను శ్రీనాథ్ కు చేశారు. 24 గంటలు తిరిగేలోపల శ్రీనాథ్ గుండెను మామూలుగా కొట్టుకునే స్థితికి తీసుకువచ్చారు. ఆ తరువాత కోలుకున్న శ్రీనాథ్ మాట్లాడుతూ.. తనకు పునర్జన్మ ఎత్తినట్టు ఉందని తెలిపాడు. మొత్తానికి అమ్మకు పనిచేయని చికిత్స.. ఓ సాప్ట్ వేర్ ప్రాణాలను మాత్రం నిలబెట్టింది.   నారాయణ హృదయాలయ ఇప్పటివరకు 500 మందికి ఎక్మో చికిత్సను అందించిందట. ఈ చికిత్సకు రూ.  3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

కేంద్రమంత్రిపై అవినీతి ఆరోపణలు... చెప్పుతో కొడతారు..

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప‌వ‌ర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై అవినీతి ఆరోపణలు తలెత్తుతున్నాయి. స్థానిక చీఫ్ విజిలెన్స్ ఆఫీస‌ర్ ఇటీవల ఓ రిపోర్ట్ ను విడుదల చేశారు. అందులో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కిరణ్ రిజిజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంత్రి కిరణ్‌ రిజిజు బంధువు, కాంట్రాక్టరైన గోబోయ్‌ రిజిజు, నార్త్‌ ఈస్ట్రన్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఈఈపీజీఓ)కి చెందిన మరికొంత మంది అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రిజ్జూ నియోజ‌క‌వ‌ర్గ‌మైన వెస్ట్ కామింగ్‌లోనే 600 మెగావాట్ల‌ జ‌ల విద్యుత్తు ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ కాంట్రాక్ట్‌లో అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి రిజిజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక దీనిపై స్పందించిన కాంగ్రెస్ కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి రిజిజూను తొలిగించాల‌ని డిమాండ్ చేసింది. రిజిజూ అవినీతికి పాల్ప‌డ్డార‌ని, దానికి సంబంధించిన ఆడియో టేపులు కూడా త‌మ ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధి ఆర్ఎస్ సూరెజ్‌వాలా తెలిపారు. ప‌వ‌ర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 450 కోట్ల అవినీతి జ‌రిగిన‌ట్లు సీవీసీ త‌న నివేదిక‌లో పేర్కొన్నారు.   ఈ ఆరోపణలపై స్పందించిన రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు అరుణాచల్‌ప్రదేశ్‌ వస్తే వారిని స్థానికులు చెప్పుతో కొడతారని మండిపడ్డారు. సొంత ప్రజలకు సాయం చేయడం అవినీతి అవుతుందా అని ఆయన ప్రశ్నించారు.

భారత్-పాక్ లకు వరల్డ్ బ్యాంక్ బ్రేక్...

  పాకిస్థాన్ ఉరి దాడులు జరపడం.. దానికి ప్రతీకారంగా భారత్ సర్జికలు దాడులు చేయడం.. ఇక ఆ తరువాత సరిహద్దు ప్రాంతంలో యుద్ద వాతావరణమే నెలకొంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందం కూడా తెరపైకి వచ్చింది. ఈ జలాల ఒప్పందంపై ప్రస్తుతం రెండు దేశాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ దూకుడికి ప్రపంచ బ్యాంక్ బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. సింధు నదీ జ‌లాల ఒప్పందాన్ని ర‌క్షించ‌డానికే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. రెండు దేశాల మధ్య ఉన్న వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూడాల‌ని రెండు దేశాల‌కు సూచించింది. ఈ సందర్భంగా వ‌ర‌ల్డ్ బ్యాంక్ అధ్య‌క్షుడు జిమ్ యాంగ్ కిమ్..  రెండు దేశాల ఆర్థిక మంత్రుల‌కు వేర్వేరుగా లేఖ‌లు రాసినట్టు సమాచారం. అంతేకాదు కోర్ట్ ఆఫ్‌ ఆర్బిట్రేష‌న్ చైర్మ‌న్ లేదా న్యూట్ర‌ల్ ఎక్స్‌పెర్ట్ నియామ‌కాన్ని కూడా వ‌ర‌ల్డ్ బ్యాంక్ నిలిపేసింది.   కాగా జ‌మ్ముక‌శ్మీర్‌లో భార‌త్ చేప‌డుతున్న కిష‌న్‌గంగ‌, రాట్లె జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టుల‌పై పాకిస్థాన్ ప్ర‌పంచ‌బ్యాంక్‌కు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. ఆ దేశం ఫిర్యాదు మేర‌కు గ‌త నెల‌లో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్‌ను ఏర్పాటుచేసి, న్యూట్ర‌ల్ ఎక్స్‌పెర్ట్‌ను నియ‌మిస్తామ‌ని, డిసెంబ‌ర్ 12లోగా ఈ ప్ర‌క్రియ పూర్తిచేస్తామ‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ తెలిపింది. అయితే దీనిపై భార‌త్ తీవ్ర నిర‌స‌న తెల‌ప‌డంతో వెనుకంజ వేసింది.

జయలలిత మరణంపై శశికళ పుష్ప సంచలన వ్యాఖ్యలు...

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితమే ఓ రహస్యం. ఇప్పుడు ఆమె మరణం కూడా పెద్ద రహస్యంగానే మారింది. ఇప్పటికే జయలలిత మృతిపై పలువురు పలు అనుమానాలు  వ్యక్తం చేశారు. సినీ నటి గౌతమి అయితే ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాసింది. ఇంకా మరో లాయర్ జయలలిత మృతికి శశికళే అని.. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. ఇంకా జయ మేనకోడలు దీప కూడా శశికళ పైనే ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో ఎంపీ శశికళ పుష్ప కూడా చేరిపోయారు. అమ్మ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందునుండే శశికళ పుష్ప ఆరోపణలు చేస్తునే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. గత ఐదు సంవత్సరాలుగా ఏదో కలిపిన ఆహారాన్ని జయలలితకు అందించారని.. ఆసుపత్రిలో జయలలితకు ఎలాంటి చికిత్స అందించారనే విషయం కూడా ఎవరికీ తెలియదని... అత్యంత గోప్యతను పాటించారని మండిపడ్డారు. జయ మరణం వెనుక కుట్ర ఉందని అన్నారు.

పీవీ నరసింహారావు కుమారుడు మృతి...

  దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రెండో కుమారుడు పీవీ రాజేశ్వర్‌రావు మృతి చెందారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆయనకు జనరల్ ఫిజీషియన్ ఎంవీరావు నేతృత్వంలో వైద్యుల బృందం చికిత్స అందిస్తుంది. ఆదివారం డయాలసిస్ సైతం నిర్వహించగా ఫలితం లేకుపోవడంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆదర్శ్‌నగర్‌లోని స్వగృహానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఆదర్శ్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో పార్థివదేహాన్ని ఉంచారు.   కాగా పీవీ రాజేశ్వర్‌రావు 1946 ఆగస్టు 14న కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో జన్మించారు. 1996లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శిగాను, భాగ్యనగర్ ఖాదీ సమితి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. పీవీ రాజేశ్వర్‌రావుకు భార్య రాధిక, నలుగురు పిల్లలు ఉన్నారు.

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు తుది తీర్పు.. శిక్షలు ఖరారు

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసును విచారించిన కోర్టు ఆరుగురిని దోషులుగా తేల్చి.. దోషులకు శిక్షలు ఖరారు చేసింది. అయితే కోర్టు సోమవారం తుది తీర్పు ప్రకటించనుంది.   కాగా 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు జంట పేలుళ్లకు పాల్పడిన విషయం విదితమే. పేలుళ్లలో 18 మంది ప్రాణాలు కలోపోగా, 138 మంది గాయపడ్డారు. ఈ కేసులో రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్‌లు నిందితులుగా ఉన్నారు. వీరిలో రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు.

50 కోట్లు ఇవ్వకపోతే సీఎంను చంపేస్తాం..

  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 కోట్లు ఇవ్వాలని... లేదంటే సీఎం ను చంపేస్తానని బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ ఆ సీఎం ఎవరనుకుంటున్నారా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బెదిరింపు లేఖ వచ్చింది సీఎంకు కాదు.. తూర్పు రైల్వేకు. ఉన్నపలంగా రూ.50 కోట్లు సమకూర్చాలని లేదంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తామని, హౌరా రైల్వేస్టేషన్ను పేల్చుతామని తీవ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్ నుంచి తూర్పు రైల్వే కార్యాలయానికి ఈ లేఖ అందింది. జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చెందిన ఓ తీవ్రవాది చేతివ్రాతతో ఈ బెదిరింపు లేఖ హెడ్క్వార్టర్స్కు వచ్చింది. ఆ లేఖలో తమ గ్రూప్ కోసం రూ.50 కోట్లను తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ అందించాలని, ఒకవేళ తమ డిమాండ్ నెరవేర్చకుంటే హౌరా రైల్వేస్టేషన్ను ఐఈడీతో పేల్చి, లక్షలాది మంది ప్రయాణికులను చంపేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మమతా బెనర్జీని కూడా తమ ఆర్గనైజేషన్ హతమారుస్తుందని బెదిరించారు. దీంతో లేఖను డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆర్‌ బద్రినారాయణ్‌ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ లేఖను మాజీ దూరదర్శన్ ఉద్యోగి ఎస్సీ దాస్ రాసినట్టు.. గత కొద్ది కాలంగా ఉగ్రవాదులకు తన ఫ్లాట్స్లో ఆయన ఆశ్రయం ఇస్తున్నట్టు తెలుస్తోంది.  

కోహ్లీకి లతా మంగేష్కర్ భిన్నమైన గిఫ్ట్..

టీమిండియా టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉండి పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఇక ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో రికార్డులు సైతం నమోదుచేసుకున్నాడు. అతని ఆట తీరును పొరుగు దేశం క్రికెటర్లు కూడా ప్రశంసిస్తారంటేనే ఆలోచించుకోవాలి. మన దేశంలో ప్రముఖులు సైతం కోహ్లీ ఆటను ప్రశంసించిన వారు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆ జాబితాలో గాయని లతా మంగేష్కర్ కూడా చేరిపోయారు. ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన కోహ్లీని ఆమె అభినందించారు.  235 పరుగులు చేసిన కోహ్లీకి నా అభినందనలు అంటూ ఆమె ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అంతేకాదు తాను పాడిన 'ఆకాశ్ కే ఉస్ పార్ భీ' అనే పాట యూట్యూబ్ లింక్ ను జతచేస్తూ కోహ్లీ ప్రతిభ ఆకాశాన్నంటుతోందనే భావనతో కాస్త విభిన్నంగా బహుమతిని అందించారు.