అమ్మ ఆరోగ్యంపై చేతులెత్తేసిన లండన్ డాక్టర్..

  అమ్మ ఆరోగ్యం గురించి తమిళనాట ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా అమ్మ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయగా..ఆస్పత్రి ఆవరణ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమ్మ ఆరోగ్యం విషమంగానే ఉందని... ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నామని..వైద్యులు ప్రకటించారు. మరోవైపు  లండ‌న్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు రిచ‌ర్డ్ బేలె కూడా ప‌రిస్థితిని ప‌రిశీలించి ఓ ప్ర‌క‌ట‌న చేశారు. జ‌య‌లలిత ఆరోగ్యం చాలా విష‌మంగా ఉంద‌ని.. జయ‌ల‌లిత ఆరోగ్య ప‌రిస్థితిని ప్రస్తుతం మిగ‌తా వైద్యుల‌తో క‌లిసి తాను కూడా స‌మీక్షిస్తున్న‌ట్లు చెప్పారు. అధునాత‌న వైద్య ప‌రిక‌రాల సాయంతో ఆమెకు చికిత్స అందుతోంద‌ని.. అభిమానుల ప్రార్దనలే ఆమెను కాపాడాలని అన్నారు

బీసీసీఐ-లోథాకమిటీ.. తుది తీర్పు

  బీసీసీఐ-లోథా కమిటీల మధ్య వార్ నడుస్తూనే ఉంది. ఈ రోజు కూడా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ కాస్త అస్వస్థతతో ఉండడంతో సోమవారం విచారించాల్సిన కేసును ఈనెల 9కి వాయిదా వేశారు. ఆరోజే తుది తీర్పు వెల్లడించే అవకాశముంది.   కాగా లోథా కమిటీ లోధా కమిటీ ప్రతిపాదించిన కొన్ని సంస్కరణల అమలుపై బీసీసీఐ వ్యతిరేక వైఖరిని కొనసాగించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల వయోపరిమితి 70 ఏళ్లు, రెండు పదవుల మధ్య 3 ఏళ్ల విరామం (కూలింగ్‌ ఆఫ్‌ పిరియడ్‌), ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటి కొన్ని అంశాలను అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని బోర్డు వ్యతిరేకిస్తోంది. మరి తుది తీర్పు ఏం వస్తుందో వెయిట్ చేయాల్సిందే.

సెప్టెంబర్22-డిసెంబర్4.. అమ్మ ఆరోగ్యం.. ఏం జరిగింది..?

  సెప్టెంబర్.. సెప్టెంబర్ 22 జ్వరం, డీ హైడ్రేషన్ తో అపోలోలో చేరిన జయలలిత సెప్టెంబర్ 23 కోలుకుంటున్నారని అపోలో వర్గాల హెల్తె బులెటిన్ సెప్టెంబర్ 25 జయ హెల్త్ పై వచ్చిన పుకార్లను ఖండించిన వైద్యులు సెప్టెంబర్ 27 కావేరి జలాలపై తీర్పును సమీక్షించిన జయ సెప్టెంబర్ 29 జయపై ఆరోగ్యంపై డీఎంకే డిమాండ్ అక్టోబర్.. అక్టోబర్ 1 జయలలితను పరామర్సించిన గవర్నర్ అక్టోబర్ 2 జయ అబ్జర్వేషన్లో ఉన్నారన్న అపోలో వైద్యులు అక్టోబర్ 8 లంగ్ ఇన్పెక్షన్ తీవ్రంగా ఉందన్న వైద్యులు అక్టోబర్ 12 పన్నీరు సెల్వంకు జయకు సంబంధించిన శాఖల బదలాయింపు అక్టోబర్ 20 జయ డిశ్చార్జ్ పై అన్నాడీఎంకే ప్రకటన అక్టోబర్ 22 జయ కూర్చోగలుగుతున్నారన్న అపోలో అక్టోబర్ 29 బై పోల్ నామినేషన్లపై వేలి ముద్రలు వేసిన జయలలిత నవంబర్.. నవంబర్ 16 పునర్జన్మ పొందానని స్వయంగా చెప్పిన జయలలిత నవంబర్ 18 జయ డిశ్చార్జ్ కు సిద్దమవుతున్న అపోలో డిసెంబర్.. డిసెంబర్ 4 డిసెంబర్ 4 సాయంత్రం గుండెపోటు.. క్రిటికల్ కేర్ యూనిట్ కు తరలింపు డిసెంబర్ 5 జయ ఆరోగ్యం అత్యంత విషమం..

జయలలిత వారసుడు ఖరారు..

  చెన్నైలోని అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమ్మ ఆరోగ్యం విషమంగా ఉందని..ఆమెకు ఎక్మో పద్దతి ద్వారా చికిత్స అందిస్తున్నామని అపోలో సిబ్బంది హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆస్పత్రి వద్దకు అభిమానులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా మరోపక్క అమ్మ వారసుడిపై చర్చలు జరుగుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలందరూ సమావేశమై జయలలిత వారసుడిగా పన్నీరు సెల్వం పేరును ఖరారు చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయలను సేకరించి..ఏకాభిప్రాయంగా పన్నీరు సెల్వం పేరును ఖరారు చేశారు. అయితే అధికారింగా సాయంత్రం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మోడీ జపం చేస్తానన్న కేజ్రీవాల్...

  పెద్ద నోట్లు రద్దు చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొదటి నుండి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కేజ్రీవాల్ మోడీపై మండిపడ్డారు. తన దృష్టిలో నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తుందని..  తక్షణం ఈ నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకుని గతంలో మాదిరిగానే లావాదేవీలకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డీమానిటైజేషన్ కారణంగా కార్మికులు, రైతులు, వ్యాపారులు, ప్రజలు తమ ఆదాయ మార్గాలను కోల్పోయారని, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో అవినీతి పూర్తిగా అంతమైతే, తాను 'మోదీ మోదీ' అని మోదీ నామస్మరణ చేసేందుకు సిద్ధమని అన్నారు.

జయలలిత కు ఎక్మో ద్వారా వైద్యం... ఎక్మో అంటే ఏమిటి..?

జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి బృందం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జయ ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని... జయకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నామని.. జయ ఎప్పుడు కోలుకుంటారో చెప్పలేమని తెలిపారు వైద్య బృందం. అసలు ఈ ఎక్మో ఏంటి... ఎక్మో చికిత్స ఏంటో చూద్దాం ఒకసారి. ఎక్మో అంటే ఎక్స్‌ట్రాకార్పోరియ‌ల్ మెంబ్రేన్ ఆక్సిజ‌నేష‌న్‌. అసలు దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే.. గుండెపోటు వ‌చ్చినా, శ్వాస సంబంధ ప్ర‌క్రియ‌లు నిలిచిపోయినా ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. సాధార‌ణంగా ఎక్మోను చివ‌రి అస్త్రంగా భావిస్తారు. సాధార‌ణ చికిత్సా ప‌ద్ధ‌తుల‌కు రోగి స్పందించ‌ని క్ర‌మంలో ఎక్మో మెషీన్‌తో చికిత్స‌ను అందిస్తారు.సిరల(వీన్స్‌) నుంచి ఎక్మో మెషీన్ ర‌క్తాన్నీ పీలుస్తుంది. ఆ ర‌క్తానికి ఆక్సిజ‌న్ జోడించి, అందులో నుంచి కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను తొలిగిస్తుంది. ఇదే ప్ర‌క్రియ‌లో ర‌క్తాన్ని ఎక్మో మెషీన్ కొంత వేచ్చ‌గా కూడా మారుస్తుంది. ఆ త‌ర్వాత ఎక్మో మెషీన్ ర‌క్తాన్ని ధ‌మ‌నులు(ఆర్ట‌రీ)ల‌కు పంప్ చేస్తుంది. అంతే కాదు, మొత్తం శ‌రీరం కుండా రక్తం ప్ర‌వ‌హించేలా ఆ మెషీన్ చేస్తుంది. మరి లాస్ట్ స్టేజ్ లో ఈ పద్దతిని ఉపయోగించే నేపథ్యంలో జయ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు అర్ధమవుతోంది. మరి ఈ గండం నుండి ఆమె గట్టెక్కి ఆరోగ్యంతో బయటపడతారో లేదో చూద్దాం..

ట్రంప్ ను కూడా వెనక్కి నెట్టిన మోడీ..

  ప్రధాని నరేంద్ర మోడీ కీర్తి రోజు రోజుకి పెరిగిపోతుంది అని చెప్పడంతో ఎలాంటి సందేహంలేదు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేపడుతున్న కార్యక్రమాలు.. అంతేకాదు ఇతర దేశాలతో పెంచుకుంటున్న సత్సంబంధాలు.. వీటన్నింటివల్లే మోడీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే.. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఆయన ఎన్నికయ్యారు. టైమ్ పత్రిక ఒక సర్వే నిర్వహించగా.. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎవరంటే.. మోదీయేనని ఎక్కువమంది ఓటేశారు. అయితే, టైమ్ పత్రిక ఎడిటర్లు మాత్రం ఇంకా తమ పత్రిక తరఫున పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎవరనే విషయాన్ని నిర్ణయించాల్సి ఉంది. ఆ నిర్ణయం ఈనెల 7వ తేదీన వెలువడనుంది. ప్రస్తుతానికి ప్రజల సర్వే ఫలితాలు మాత్రం వెల్లడయ్యాయి.   ఈ సర్వే గడువు ముగిసేసరికి నరేంద్రమోదీకి అత్యధికంగా 18 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థులు బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జూలియన్ అసాంజే.. వీళ్లందరికీ కూడా కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌కు 4 శాతం, మార్క్ జుకర్‌బర్గ్‌కు 2 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయులతో పాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ ప్రాంతాల వారు కూడా మోదీకి అనుకూలంగా బాగా ఓటుచేసినట్లు తెలుస్తోంది..

జయలలిత ఇక లేరా..? మొదలైన గాసిప్ప్..

జయలలిత నిన్నరాత్రి గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. అపోలో ఆస్పత్రి సిబ్బంది ఇప్పటికే అమ్మకు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమ్మ ఆరోగ్యంపై ఇప్పటికే పుకార్లు షికార్లు చేయడం మొదలుపెట్టాయి. ఒకపక్క జయలలితకు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే... కొంతమంది మాత్రం అత్యుత్సాహంతో ఆమె చనిపోయారని ప్రచారం మొదలు పెట్టారు. అంతేకాదు వికీపీడియాలో ఆమె డిసెంబర్ 5న గుండెపోటుతో మరణించినట్టు ఒక పేజీని కూడా క్రియేట్ చేసి దుమారం రేపుతున్నారు. ఇక సోషల్ మీడియా సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలియగానే ఇక రుమర్లు స్టార్ట్ అయ్యాయి. క్షణక్షణానికీ ఫేస్ బుక్, వాట్స్ యాప్ లో జయలలిత మరణించారని 'రిప్'లు వెల్లువెత్తుతున్నాయి. ఇక దీనిపై స్పందించిన పోలీసులు ఈ తరహా ప్రచారాలు చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

పార్లమెంట్ ఉభయసభలు.. సేమ్ సీన్..

  ఈరోజు కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు యథావిధిగా ప్రారంభించాయి. ప్రారంభమైన వెంటనే రోజూలాగే ఈరోజు కూడా పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భ‌ల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. పెద్ద నోట్ల రద్దుపైనే ఈరోజు కూడా ఉభయసభల్లో విప‌క్ష స‌భ్యులు త‌మ ప‌ట్టుని విడ‌వ‌డం లేదు. పెద్దనోట్ల ర‌ద్దు అనంత‌రం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, వారి వ‌ద్ద ఉన్న డ‌బ్బంతా బ్యాంకుల్లో వేశార‌ని రాజ్య‌స‌భ‌లో విప‌క్ష సభ్యులు అన్నారు. బ్యాంకుల నుంచి మ‌ళ్లీ డ‌బ్బు తీసుకోవాలంటే ఎన్నో క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయ‌ని, వారి డ‌బ్బు వారికి ఇచ్చేయాల‌ని విప‌క్ష నేత‌లు ఛైర్మ‌న్‌ పోడియం వ‌ద్ద‌కు దూసుకువెళ్లారు. మ‌రోవైపు పెద్ద‌నోట్ల రద్దు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ టీఎంసీ నేత‌లు ఈ రోజు పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్రహం వ‌ద్ద ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నిర‌స‌న తెలిపారు.

జయలలితకు గుండెపోటు కాదంటా..?

  ముఖ్యమంత్రి జయలలిత నిన్న గుండెపోటుకు గురవ్వడంతో ఒక్కసారిగా తమళినాడు మొత్తం మళ్లీ షాక్ కు గురైంది. ఆమెను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే జయలలితకు వచ్చినది గుండెపోటు కాదని.. ఆమె గుండె కొద్దిసేపు ఆగిందని (కార్డియాక్ అరెస్ట్) అపోలో ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నాయి. ఈ కారణంగానే ఆమెకు సోమవారం ఉదయం ఒక ఆపరేషన్ కూడా జరిగినట్లు పార్టీ ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు. కార్డియాక్ అరెస్టుకు, గుండెపోటుకు నిజానికి చాలా తేడా ఉందని వెల్లడించారు. శరీరంలోని వివిధ భాగాలకు రక్తసరఫరాను గుండె ఆపేసినప్పుడు కార్డియాక్ అరెస్టు సంభవిస్తుంది. పేషెంటు ఉన్నట్టుండి కుప్పకూలి, సాధారణంగా ఊపిరి తీసుకోకపోవడం, స్పందనలు లేకపోవడం లాంటి లక్షణాలు ఇందులో సంభవిస్తాయి.. వెంటనే సరైన చికిత్స అందిస్తే, కార్డియాక్ అరెస్టు నుంచి కూడా కోలుకునే అవకాశాలున్నాయని తెలిపారు. మరి జయలలిత ఆరోగ్యంపై ఇప్పటివరకూ ఎలాంటి వార్తలు వైద్య బృందం ప్రకటించలేదు. ఇక అమ్మ ఆరోగ్యంపై ప్రస్తుతం ఎలా ఉందో.. కోలుకున్నారో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

తమిళనాడులో భద్రత కట్టుదిట్టం..

నిన్న రాత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుకు గురవ్వడంతో తమిళనాడు మొత్తం ఆందోళనలో ఉంది. అమ్మ ఆరోగ్యం సీరియస్ గా ఉందన్న విషయం తెలియగానే పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివస్తున్నారు. ఇక ఆడవాళ్లు అయితే కన్నీరు మున్నీరవుతున్నారు. అమ్మ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మండలస్థాయి నుంచి పోలీసులను భారీగా మోహరించారు. ఇక పోలీసులకు సెలవులకు రద్దు చేస్తూ ఆ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల్లో ఉన్న పోలీసులు విధుల్లో త్వరగా చేరాలని, ప్రతి ఒక్కరూ యూనిఫాంలోనే విధి నిర్వహణ చేయాలని ఆదేశించారు. అపోలో ఆస్పత్రి, జయలలిత నివాసం, అన్నాడీఏంకే కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్‌తో పాటు పోలీసులు భారీగా మోహరించారు.

తమిళనాడులో దుకాణాల మూసివేత.. కార్యక్రమాలు, ప్రయాణాలు రద్దు

  గత రెండు నెలలుగా చెన్నై ఆపోలో ఆస్పత్రిలో ముఖ్యమంత్రి జయలలిత చికిత్స సొందుతున్న సంగతి తెలిసిందే. జ్వరం, డీహైడ్రేషన్‌ సమస్యతో ఆస్పత్రిలో చేరగా ఆమెకు చికిత్స అందించగా ఆమె కాస్త కోలుకున్నారు అని ఇప్పటి వరకూ పలు బులెటిన్ లు విడుదల చేశారు.  దాదాపు రెండు నెలల పాటు సీసీయూలోనే ఆమెకు వైద్య చికిత్సలు కొనసాగాయి. అయితే నిన్న సడెన్ గా ఆమెకు గుండె పోటు రావడంతో వెంటనే ఆమెను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకూ అమ్మ ఆరోగ్యంపై ఎలాంటి బులెటిన్ లు ప్రకటించకపోవడంతో, పార్టీ నేతలతో పాటు, అభిమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు ఆస్పత్రి వద్దకు తరలివస్తున్నారు.   మరోవైపు జయలలితకు గుండెపోటు వచ్చిందని తెలిసిన వెంటనే నగరంలోని పలు చోట్ల దుకాణాలు, హోటళ్లను మూసివేశారు. నుంగంబాక్కం, మైలాపూర్‌, కోడంబాక్కం, థౌజంట్‌లైట్స్‌ తదితర ప్రాంతాల్లో పెట్రోలు బంక్‌లు మూతపడ్డాయి. చెన్నైలో ఆదివారం రాత్రి జరగాల్సిన కార్యక్రమాలను చాలా వరకు రద్దు చేశారు.డీఎంకే కోశాధికారి స్టాలిన్‌ తూత్తుకుడిలోని తన పర్యటనను రద్దు చేసుకుని చెన్నైకి తిరుగు ప్రయాణమయ్యారు. ఇతర పార్టీల నేతల ప్రయాణాలు కూడా రద్దయ్యాయి.

జయలలితకు గుండెపోటు.. మళ్లీ ఆందోళనలు..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించగా.. ఆతరువాత అమ్మ ఆరోగ్యం కుదుటపడిందని.. మాట్లాడుతున్నారని.. ఏ క్షణంలోనైనా ఆమె డిశ్చార్జ్ అవ్వచ్చని ఇప్పటికే ఆస్పత్రి సిబ్బంది నుండి.. పార్టీ నేతలు ఎన్నో సార్లు చెప్పారు. అయితే ఇప్పుడు మళ్లీ అమ్మ ఆరోగ్యంపై ఆందోళనలు మొదలయ్యాయి. నిన్న ఆమె గుండెపోటుకు గురవ్వడంతో తమిళనాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమెకు అపోలో ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు   ఇదిలా ఉండగా అమ్మ ఆరోగ్యంపై పార్టీ నేతలు తీవ్ర ఆందోళకు గురవుతున్నారు. నిన్న రాత్రి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. ఇక రాత్రి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి చేరుకొని జయ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. రాజ్‌భవన్ నుంచి కూడా అమ్మ ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంశాఖకు గవర్నర్ వివరాలు తెలియజేశారు. ఆస్పత్రి లోపలికి వెళ్తున్న అన్నాడీఏంకే నేతలు బయటకు వచ్చినప్పటికీ ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. మరోవైపు జయలలిత ఆరోగ్యం బాలేదన్న వార్త వినగానే ఆస్పత్రి వద్దకు అమ్మ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

ట్రంప్ కు క్షమాపణ చెప్పిన ఛానల్...

  అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్  మైక్‌ పెన్స్‌ వస్తున్న విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయిందని.. తర్వాత అదంతా జోక్‌గా చెప్పానని  సీఎన్ఎన్ వార్తా ఛానెల్ కు చెందిన ప్రొడ్యూసర్‌లలో ఒకరైన సుజాన్నే మాల్వేక్స్‌  వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి గాను సీఎన్‌ఎన్ డొనాల్డ్‌ ట్రంప్‌కు క్షమాపణలు చెప్పింది. కాగా ఈ వార్త రాగానే వెంటనే ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దీంతో అమెరికా అధ్యక్షుడి గురించి ఓ అంతర్జాతీయ వార్తా ఛానెల్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ట్రంప్‌ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇక వెంటనే విషయం తెలుసుకున్న ఛానల్ ట్రంప్ కు క్షమాపణలు చెప్పింది.

మనం నోరు మూసుకుంటే సరిపోదు...

  ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు 6వ అమాత్యుల హార్ట్ ఆఫ్ ఆసియా సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టెర్రరిజాన్ని ఓడించడానికి మనం సమైక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే తీవ్రవాదం ఆగిపోతుందని తెలిపారు. తీవ్రవాదంపై మనం నోరు మూసుకుని కూర్చుంటే సరిపోదని.. ఇండియా-అఫ్ఘనిస్థాన్ మధ్య బలోపేతమైన సంబందాలు నెలకొనాల్సి ఉందన్నారు. తీవ్రవాదం, విదేశీ చొరబాట్లు అఫ్ఘన్‌కు భయంకరంగా మారిందని తెలిపారు. సల్మా డ్యాం అక్కడి ప్రజల పురోగతికి ఉపయోగపడిందన్నారు. ఇంకా అఫ్ఘనిస్తాన్ అద్యక్షుడు అశ్రఫ్ ఘనీ మాట్లాడుతూ.. 1.25 బిలియన్ల భారతీయుల అండదండలు తమకున్నాయని పేర్కొన్నారు. తమ చారిత్రక సహకారం రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మళ్లీ పెద్ద నోట్లపై స్వామి సంచలన వ్యాఖ్యలు...

భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్ప ద వ్యాఖ్యలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అలాగే మరోసారి పెద్ద నోట్ల రద్దుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కామెంట్లు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఓ ఆంగ్ల న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ.. దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలనే ధ్యేయంగా నవంబర్‌ 8న ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశంలో నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దకపోతే ప్రజాదరణ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఆరు నెలల పాటు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందనీ.. ఆ తర్వాత ప్రజాదరణ అంతా ఆమెకు ప్రతికూలంగా మారిందని గుర్తుచేశారు.