భారత సైన్యం విజయం కోసం హోమాలు.. గోమాతలకు శ్రీమంతం వేడుక

పాకిస్థాన్ తో  యుద్ధంలో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ మంగళగిరి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్డపూడి గ్రామంలోని భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరం గోశాలలో హోమాలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ చార్జ్, మాజీ జడ్పీ చైర్మర్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో ఈ హోమాలు జరిగాయి. అలాగే గోశాలలో గోవులకు సీమంతం వేడుక, గోపారాయణం పూజలు నిర్వహించారు.   ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశన, గోమాతకి పంచామృతాభిషేకం, శాంతి హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. మూడు గోమాతలకు సీమంతం, దంపతీ పూజ నిర్వహించారు. గోశాల కన్వీనర్ పాతూరి శ్రీనివాసరావు, శ్రీమతి రాధిక దంపతులు ఈ పూజలు జరిపారు. మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో మన యాత్రికులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతిచర్య ద్వారా ఉగ్రవాదులకు బుద్ధి చెబితే, తిరిగి పాకిస్తాన్ మ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లలో దాడులకు పాల్పడుతున్నదనీ,  భారత సైన్యానికి కులమతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మద్దతుగా ఉండాలనీ పాతూరి నాగభూషణం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,  ఈ ధర్మ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించాలనీ ఆకాంక్షిస్తూ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.  

ఐపీఎల్ 2025 వాయిదా.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌  2025 వారం రోజుల పాటు వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. పాకిస్థాన్ తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధవాతావరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్ భాగస్వాముందరితో సమగ్రంగా చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తసుకున్నట్లు పేర్కొంది. శుక్రవారం ( మే9) నుంచి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లన్నిటినీ వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.   ప్రస్తుతానికి సస్పెన్షన్ ఒక వారం పాటు ఉంటుందని, తదుపరి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామనీ బీసీసీఐ ఆ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే  గురువారం ( మే 8 )న ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ ను భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి వివరాలు మరలా తెలియజేస్తామని బీసీసీఐ తెలిపింది.ఐపీఎల్ లో ఇంకా 12  మ్యాచ్ లు జరగాల్సి ఉంది. వీటిలో రెండు క్వాలిఫయిర్లు, ఒక ఎలిమిటేర్  ఉన్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, మంబైలు టాప్ ఫోర్ లో ఉన్నాయి.  

పాక్ కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం

పాకిస్తాన్  జమ్ముకాశ్మీర్ లో జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళీనాయర్ వీరమరణం చెందారు. మురళీనాయక్ మృతిచెందినట్లు అధికారవర్గాలు ధృవీకరించాయి.   శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలోని కల్లి తండాకు చెందిన మురళి నాయక్  సోమందేపల్లి మండల పరిధిలోని నాగినాయని చెరువు తండాలో పెరిగారు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. . పంజాబ్ లో పని చేస్తున్న ఆయన రెండు రోజుల కిందటే విధుల నిమిత్తం జమ్మూకు వెళ్లారు.  గురువారం పాక్ చొరబాటుదారులను అడ్డుకునే ఆపరేషన్ లో పాలుపంచుకున్నారు. ఆ క్రమంలో పాక్ నుంచి జరిగిన కాల్పుల్లో అసువులు బాసారు.   మురళినాయక్ మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు అధికారులు చేరవేశారు. మురళీనాయక్ భౌతిక కాయం రేపు ఆయన స్వగ్రామమైన కల్లి తండాకు చేరనుంది.  మురళి మరణ వార్తతో ఆయన స్వగ్రామంలోనే కాకుండా ఏపీవ్యాప్తంగా విషాధ ఛాయలు అలముకున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడకు వీరజవాన్ మురళీనాయక్ మృతి పట్ల ప్రగాఢ సంతాపంతెలిపారు. యుద్ధంలో మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సదరు సంతాపంలో చంద్రబాబు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళికి నివాళి అర్పించిన బాబు… మురళి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్  మంత్రులు అనగాని సత్యప్రాసాద్ తదితరులు  మురళి వీర మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మురళీనాయక్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

బ‌లూచ్ కి స్వేచ్ఛ ల‌భిస్తే.. చైనా కూడా పాక్ కి హ్యాండిస్తుందా?

పాక్ చేజారిన క్వెట్టా?..  బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ స్వాధీనం? క్వెట్టా నుంచి పాక్ సైనికుల పరార్ పాక్ సైనికులు? అస‌లేంటీ  బ‌లూచిస్తాన్ గొడ‌వ‌? బలూచిస్తాన్  పాక్ చేజారితే.. చైనా సపోర్టు హుళక్కేనా?  బ‌లూచిస్తాన్ పాకిస్థాన్ మ‌ధ్య గొడ‌వ ఈ నాటిది కాదు దాదాపు ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ పోరాటం.  బ‌లూచిస్థాన్ తొలుత స్వ‌తంత్రంగా ఉండేది. భార‌త్ నుంచి పాక్ 1947 ఆగస్ట్ 15న విడిపోయిన‌ప్ప‌టి నుంచి.. బ‌లూచిస్తాన్ స్వేచ్ఛ‌గా ఉండేది.  ఖాన్ ఆఫ్ క‌లాత్ అనే రాజు పాల‌న‌లో ఈ ప్రాంతం ప్రజలు హాయిగా జీవించేవారు.  కానీ 1948 మార్చిలో పాక్ ప్ర‌భుత్వం సైనిక చ‌ర్య ద్వారా బలూచిస్తాన్ ని త‌మ దేశంలో విలీనం చేసుకుంది. పాకిస్థాన్ విస్తీర్ణంలో బ‌లూచిస్తాన్ వాటా 44 శాతం. అయితే పాక్ జ‌నాభాలో బ‌లూచ్ ప్ర‌జ‌ల శాతం మాత్రం కేవ‌లం 7 నుంచి 8 శాత‌మే.  పాక్ దురాక్ర‌మ‌ణ నాటి నుంచి ఈ ప్రాంత ప్ర‌జ‌లు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. త‌మ దేశంలో తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండ‌లేక పోతున్నామ‌న్న‌ది వీరి ఆవేద‌న.  వీరికి అక్క‌డి పౌరుల‌కున్నంత స్వేచ్ఛ లేదు. క‌నీసం విద్యా, వైద్య స‌దుపాయాలు అంద‌ని దుస్థితి. ఒక‌ర‌కంగా చూస్తే పాక్ త‌మ‌ను బానిస‌ల‌ను చూసిన‌ట్టు చూస్తోందన్నది వారి ఆరోపణ. అందుకే వీరి నినాదం బ‌లూచిస్తాన్ ఈజ్ నాట్ పాకిస్తాన్. ఆ నినాదంతో బలూచిస్థానీయులు  త‌ర‌చూ రోడ్ల‌పైకి వ‌చ్చి   నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తుంటారు.  దానికి తోడు ఈ ప్రాంత వ‌న‌రుల‌ను చైనాతో క‌ల‌సి దోచుకుంటోంది పాకిస్థాన్. మ‌రో విచిత్ర‌మైన స‌మ‌స్య ఏంటంటే.. ఈ ప్రాంతానికి చెందిన యువ‌కుల‌ను పాక్ సైన్యం అప‌హ‌రిస్తోంది. అలా అదృశ్య‌మ‌యిన వారి జాడ ఇప్ప‌టికీ తెలియ‌డం లేదంటే ఇక్క‌డి ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇదీ బ‌లూచీల దుర్బ‌ర గాథ‌. బలూచిస్తాన్‌లో విస్తారమైన ఖనిజ వనరులున్నాయి. గ్యాస్, యురేనియం, బంగారం, రాగి వంటి వనరులు ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలకు అందుతోన్న‌ అభివృద్ధి అంతంత మాత్ర‌మే. గ్వాదర్ పోర్ట్ చైనాకు కీలకం కావడంతో, సీపెక్ ప్రాజెక్ట్ ప‌నులు ముమ్మ‌రంగా  జ‌రుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ   ఉద్ధృతంగా పోరాడుతోంది చేసింది.   హైబ్రిడ్ రోడ్లు, రైల్వే మార్గాలు దాడులకు గురవుతుండటంతో చైనా ఓ ఎయిర్‌పోర్ట్ నిర్మించింది. చైనా ఇంజినీర్లు, పెట్టుబడిదారులపై వరుసగా దాడులు చేస్తోంది బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ. బలూచ్ ప్రజలు సైతం తమ వనరుల దోపిడిని నిరసిస్తూ చైనా పైనా విరుచుకుప‌డుతున్నారు. 2025 మార్చి 11న.. క్వెట్టా-పెషావర్ మధ్య జాఫర్ ఎక్స్ప్రెస్‌ను హైజాక్ చేసింది బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ. 214 మంది పాకిస్తాన్ మిలిటరీ సిబ్బందిని హత్య చేసినట్లు ప్రకటించింది . పాకిస్తాన్ ప్రభుత్వం ఇది అబద్ధమని, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఒక‌ ఉగ్రవాద సంస్థ అని ఆరోపించింది. ఇపుడీ బ‌లూచిస్తాన్ కారణంగానే పాక్  చైనా మధ్య సత్సంబంధాలున్నాయి.  ఒక వేళ ఇదే   బ‌లూచిస్తాన్ పాకిస్థాన్ నుంచి చేజారి పోతే.. ఇక చైనా సైతం పాక్ కి సాయం చేయ‌డం ఆపేస్తుంది. వారు గానీ ఇదే యుద్ధంలో తమ‌కు తాము స్వాతంత్రం ప్ర‌క‌టించుకుని ప్ర‌త్యేక దేశంగా మారితే.. ఇక పాక్ ప‌ని దాదాపు ఖ‌త‌మే.  కార‌ణం పాకిస్థాన్ భూ భాగంలో స‌గం బ‌లూచిస్తాన్ దే. ఇటు దేశంలో స‌గ భాగం కోల్పోవ‌డం మాత్ర‌మే కాక అటు చైనా సాయం కూడా కోల్పోతే.. ఇక పాక్ ప‌ని అయిపోయిన‌ట్టే లెక్క‌. ఈ వ్య‌వ‌హారాన్ని ఎంతో సునిశితంగా గమనిస్తోంది చైనా. ఒక వేళ బలూచిస్తాన్ లిబ‌రేష్ ఆర్మీ గ‌నుక క్వెట్టాను పూర్తి స్వాధీనం చేసుకుంటే ఇక పాక్ స‌గం ముక్క‌గా మిగిలిపోవ‌డం ఖాయం. ఇప్ప‌టికే క్వెట్టాను బీఎల్ఏ చేజిక్కించుకున్న‌ట్టు వార్త‌లు అందుతున్నాయి. ఇక్క‌డి నుంచి పాక్ సైన్యం కూడా ప‌రార‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. వీట‌న్నిటిని బ‌ట్టీ  చూస్తే ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల్లా ఒక్క యుద్ధం ఇటు పాక్ పీచ‌మ‌ణ‌చ‌డం అటు పాక్ నే స‌గం ముక్క‌గా మిగ‌ల్చ‌డం జ‌రిగిన‌ట్టే భావించాలి. అందుకే అజిత్ దోవ‌ల్ ఎప్ప‌టి నుంచో   మ‌రో ముంబై త‌ర‌హా దాడి జ‌రిగితే.. పాక్ బ‌లూచిస్తాన్ ని మ‌ర‌చిపోవ‌ల్సి వ‌స్తుంద‌ని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ బ‌లూచిస్తాన్ వేరుగా ఏర్ప‌డితే..  చైనా నేరుగా ఈ దేశాన్నే ప్ర‌స‌న్నం చేసుకోడానికి ప్ర‌య‌త్నిస్తుంది.  చైనా ఉల‌బలాట‌మంతా బ‌లూచిస్తాన్ లోని వ‌న‌రుల కోస‌మే తప్ప పాకిస్థాన్ పై ప్రేమ కాదన్నది తెలిసిందే. ఆ కారణంగానే బలూచిస్థాన్ పాక్ చేజారితే మన దాయాది దేశం ఒక ఒంటరే.   ఇక సింధ్, గిల్గిట్- బ‌ల్టిస్తాన్ గొడ‌వ సంగ‌తి స‌రే స‌రి. వీటికి తోడు పాకిస్థాన్ ఆక్ర‌మిత జ‌మ్మూ కాశ్మీర్ సైతం భార‌త్ ప‌ర‌మైతే.. పాకిస్తాన్ పిట్ట రెట్టంత‌ దేశంగా మారిపోవ‌డం త‌థ్యం.

చంచల్ గూడా జైలులో గాలి.. మామూలు ఖైదీయే.. ప్రత్యేక సదుపాయాలు లేవు

మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డి చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో గాలి జనార్దన్ రెడ్డి ఇదే జైలుకు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కడా ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఊచలు లెక్కించారు. అయితే అప్పట్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఈ జైలుకు వచ్చారు. దాంతో అప్పట్లో కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి జైలులో కొన్ని ప్రత్యేక వసతులకు అనుమతించింది. అయితే ఈ సారి మాత్రం ఆయన ఓబులాపురం మైనింగ్ కేసులో దోషిగా నిర్ధారణకు గురై కోర్టు ఆదేశాల మేరకు ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించడానికి వచ్చారు. దీంతో ఈ సారి ఆయనను  చంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీగానే పరిగణిస్తారు. సాధారణ ఖైదీగా ఆయన ఖైదీలకు ఇచ్చే సాధారణ యూనిఫారం అంటే తెల్లటి దుస్తులే ధరించాల్సి ఉంటుంది. ఇక ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ ఉండవు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఈ కేసులో శిక్ష పడిన ఆయన సమీప బంధువు శ్రీనివారెడ్డి, రాజ్ గోపాల్, అలీఖాన్ ను కూడా అదే జైలులో, అదే బ్యారక్ లో ఉన్నారు. ఇలా ఉండగా గాలి జనార్ధన్ రెడ్డిని ఆయన భార్య, కుమార్తె, సోదరుడు ములాఖత్ ద్వారా  కలిశారు. సాధారణ జైలు దుస్తుల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని చూసి ఆయన భార్య, కుమార్తె కన్నీటి పర్యంతమయ్యారు.  

గాలిపై అనర్హత వేటు.. శాసనసభ సభ్యత్వం రద్దు

మైనింగ్ మాఫియా డాన్, బీజేపీ ఎమ్మెల్యే  గాలి జనార్దన్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా నిర్దారించి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన శాసనసభ సభ్యత్వం రద్దైంది. ఈ మేరకు  ఈ మేరకు కర్ణాటక శాసనసభ కార్యదర్శి ఎం.కె. విశాలాక్షి గురువారం (మే8)న నోటిషికేషన్ విడుదల చేశారు.  ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి  కర్ణాటక శాసనసభ సభ్యుడు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించిన కారణంగా ఆయన శాసనసభ సభ్యత్వానికి అనర్డుడిగా ప్రకటిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.   భారత రాజ్యాంగంలోని   ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం గాలి జనార్దన రెడ్డిపై అనర్హత వేటు పడింది.   గాలి జనార్దన్ రెడ్డికి విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే.. ఆయన శిక్ష అనుభవించి విడుదలైన తరువాత కూడా మరో ఆరేళ్ల పాటు అనర్హత కొనసాగుతుంది. గాలి జనార్ధన్ రెడ్డి అనర్హత తీర్పు వెలువడిన ఈ నెల 6 నుంచి అమలులోకి వచ్చిందని విశాలాక్షి ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 6న తీర్పు ఇచ్చిన సంగతి విదితమే.   అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.884 కోట్ల నష్టం కలిగించారని పేర్కొంటూ గాలి జనార్ధన్ రెడ్డిపై 2009లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.  ఆ కేసులోనే జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల ఖైదు విధిస్తూ తీర్పు వెలువడింది. 

పాక్ కకావికలు!

  లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి సహా పలు నగరాలపై ఇండియన్ ఆర్మీ భీకరదాడులు సురక్షిత ప్రాంతానికి పారిపోయిన పాక్ ప్రధాని భారత్ ధాటికి బెంబేలెత్తుతున్న పాక్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా దాయాది పాక్ భారత్‌లోని పలు ప్రాంతాల్లో వరస దాడులకు పాల్పడుతోంది. గురువారం రాత్రి జమ్ము వర్సిటీ సమీపంలో పాక్ ప్రయోగించిన 2 డ్రోన్ల బాంబులను భారత భద్రతా దళాలు కూల్చివేశాయి. పంజాబ్‌లోని జలంధర్‌లోనూ పాక్ మిస్సైల్స్‌తో విరుచుకు పడింది. ఇక ఉదంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్, కథువా, రాజౌరి, అమృత్‌సర్ ప్రాంతాల్లో దాడులకు తెగబడింది.   ప్రముఖ వైష్ణోదేవి ఆలయంపైకి డ్రోన్ దాడికి కూడా యత్నించింది.అయితే ఈ దాడులను భారత్ దీటుగా తిప్పికొట్టింది.  పాక్ డ్రోన్లను ఎస్-400 సాయంతో ధ్వంసం చేసింది. అలాగే పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చి వేసింది. అలాగే పాక్ దాడులకు దిగిన ప్రాంతాలన్నిటిలోనూ క్లాక్ అవుట్ ప్రకటించింది.  పాక్ దాడులకు దిగిన కొద్ది వ్యవధిలోనే భారత్ ఆర్మీ ఎదురుదాడులకు దిగింది.   లాహోర్‌, సియోల్‌కోట్‌‌, పాక్ ఆర్థిక రాజథాని కరాచీ, ఇస్లామాబాద్ లపై దాడులు చేసింది.  అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. పరిస్థితి వివరించారు.   అంతకు కొద్ది సేపటి ముందు  రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశమై.. పాక్ కు గట్టి బుద్ధి చెప్పాలని సూచించారు. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆ వెంటనే భారత్ పాక్ లోకి కీలక ప్రదేశాలు లక్ష్యంగా దాడులకు దిగింది.  కరాచీ పోర్టు లక్ష్యంగా దాడులకు దిగింది. అలాగే పాకిస్థాన్ గగన రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేస్తూ లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ సహా 9 నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో అటాక్ చేసింది. ఇస్లామాబాద్ లోని ప్రధాని నివాసానికి సమీపంలో కూడా దాడులకు పాల్పడింది. దీంతో పాక్ ప్రధాని అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు.  ఇలా ఉండగా ఒక వైపు భారత్ భీకరదాడులు, మరో వైపు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులే లక్ష్యంగా పాల్పడుతున్న దాడులు, ఇంకొ వైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ఆందోళనలతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అయిపొతొంది. పాకిస్థాన్ ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తూ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఇస్లామాబాద్ లో భారీ ర్యాలీ జరిగింది.  మొత్తం మీద భారత్ ఒక్కసారిగా విరుచుకు పడటంతో పాకిస్థాన్ కకావికలైందనే చెప్పాలి.  

యుద్ధం మొదలైంది! జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లలో బ్లాకవుట్

భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలైంది. పాక్ బరితెగింపు కారణంగా ఇరు దేశాల మధ్యా వార్ సైరన్ మోగింది. తొలుత జమ్మూ లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడింది.   జమ్మూ విమానాశ్రయం, సహా జమ్మూలోని ఏడు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ చేసిన దాడులకు  భారత్ దీటుగా స్పందించింది. దీంతో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్లుగా పరిస్థితి మారింది. బాంబుల మోతలతో సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. జమ్మూ సహా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆయా రాష్ట్రాలపై పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత దళాలు చాలా వరకూ కూల్చివేశాయి. ఆ రాష్ట్రాలలో పూర్తి అంధకారం అలుముకుంది. విద్యుత్ సరఫరా నిలిపివేసి కంప్లీట్ బ్లాక్ అవుట్ ప్రకటించారు.  . పాక్‌ దాడులను భారత సైన్యం   గగనతల రక్షణ వ్యవస్థలతో  నిర్వీర్యం చేస్తోంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. మొత్తంగా ఇప్పటివరకు ఎనిమిది డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు తెలిసింది.  భారత్‌-పాక్‌ మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహ్మద్‌, లష్కరే తొయిబా వంటి ఉగ్రసంస్థలు   దాడులకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ జారీ చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పంజాబ్ అంతటా కరెంట్ బంద్ చేశారు. అలాగే రాజస్దాన్ లోనూ హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అత్యవసర మంత్రివర్గ సమావేశం పరిస్థితిని సమీక్షించి తీసుకోవలసిన చర్యలపై చర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. సున్నితమైన ప్రాంతాలలో బ్లాక్ అవుట్ ప్రకటించింది. 

పాక్ దాడుల నేపథ్యంలో దేశమంతటా హై అలర్ట్

ఢిల్లీ ప్రభుత్వోద్యోగులకు సెలవులు రద్దు  హైదరాబాద్ పాత బస్తీలో వ్యాపారాల మూసివేత భారత్ లోని పఠాన్ కోట్, జైసల్మేర్ లోని వాయుసేన స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ గురువారం (మే8) దాడులకు తెగబడింది. ఈ దాడులను భారత్ దీటుగా తిప్పి కొట్టింది.   ఎస్- 400 రక్షణ వ్యవస్థ ఈ డాడులను దిగ్విజయం అడ్డుకుని పాక్ డ్డ్రోన్లను కూల్చివేసింది. అలాగే జమ్మూలోని తొమ్మిది ప్రాంతాలపై కూడా పాకిస్థాన్ ఆత్మాహుతి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. దీంతో  దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసి బ్లాక్ ఔట్ పాటిస్తున్నారు. జైసల్మీర్ లోని వైమానికి స్థావరం పై  కూడా పాక్ ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. వీటిలో ఎంత మేర నష్టం జరిగిందనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సరిహద్దులో భారీ ఎత్తున దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఉత్తర భారతమంతా ఆర్మీ సైరన్లు మోగాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటి వరకూ భారత్ సైనిక దళాలు ఎనిమిది పాకిస్థాన్  మిస్సైళ్లను కూల్చివేశాయి. పాకిస్తాన్ దాడుల కారణంగా ధర్మశాలలో జరగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ను మధ్యలోనే నిలిపిసి రద్దు చేశారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం తన ఉద్యోగులకు సెలవులను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎవరికీ సెలవులు లేవని ఉత్తర్వులు జారీ చేసింది.  అలాగే హైదరాబాద్ లోని చార్మినార్ సహా పాతబస్తీలోని వ్యాపార సముదాయలన్నీ మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు.  చార్మినార్ చట్టుపక్కల ఉన్న తోపుడుబండ్ల వ్యాపారాలను మూసి వేశారు. పాతబస్తీలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. 

పంజాబ్, ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేత...భద్రతా దృష్ట్యా మ్యాచ్ రద్దు

  ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. పాక్ అనూహ్య దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. గ్రౌండ్ వదిలి వెళ్లాలని ప్రేక్షకులకు అధికారులు ఆదేశించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ స్థానికంగా బ్లాక్ అవుట్ విధించినట్లు సమాచారం. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇవ్వనున్నారు.భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌ రాష్ట్రాలలో బ్లాక్ అవుట్ వాతావరణం ఏర్పడింది. జమ్ము విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాలను పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.  డ్రోన్ దాడులు జరుగుతున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో పాకిస్థాన్ డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసింది. అమృత్‌సర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకునేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం కోసం 0172-2741803, 0172-2749901 నంబర్లలో రెవెన్యూ విపత్తు నిర్వహణ పర్యవేక్షణ కేంద్రాన్ని సంప్రదించవచ్చని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.  

అఖిల పక్షం.. ఒకటే స్వరం!

గుర్తుండే ఉంటుంది, గతంలో భారత సైనికులు గుట్టు చప్పుడు కాకుండా పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి అక్కడి ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్  నిర్వహించిన సమయంలో ప్రతిపక్షాలు ఎలా స్పందించింది గుర్తుండే ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్స్  పై అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆధారాలు చూపమని డిమాండ్ చేశాయి.  అంతే కాదు. ముఖ్యంగా పుల్వామా బాంబు దాడికి ప్రతీకారంగా  మన సైనికులు బాలాకోట్  పై జరిపిన  వైమానిక దాడుల విషయంలో అధికార, విపక్షాల మధ్య యుద్ధాన్ని తలపించే విధంగా మాటల తూటాలు పేలాయి. చివరకు  అధికార, విపక్ష పార్టీలు  పుల్వామా ఉగ్రదాడిని  ఉగ్రవాద స్థావరాలపై  భారత సైనికులు జరిపిన మెరుపు దాడి అంశాన్నిఎన్నికల అస్త్రం చేసుకున్నాయి.  ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో  ప్రతిపక్ష పార్టీలు అధికార బీజేపీ పుల్వామా బాంబు దాడిలో మరణించిన సాయుధ దళాల త్యాగాలను రాజకీయం  చేస్తున్నదనీ, ఎన్నికల  ప్రయోజనానికి  ఉపయోగించుకుంటోందనీ ఆరోపించాయి. అలాగే  ఆ తర్వాత  బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. బాలాకోట్‌లో వైమానిక దాడులతో పాకిస్తాన్‌కు జరిగిన నష్టానికి సంబంధించి ప్రధాని మోదీ ప్రభుత్వం ఆధారాలు  చూపాలని  కాంగ్రెస్  డిమాండ్ చేసింది.  ఇదనే కాదు..  2016లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మోదీ ప్రభుత్వం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్  మొదలు ఉద్రిక్తల నడుమ భారత పభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని,ప్రతి చర్యను విపక్షాలు విమర్శిస్తూనే వచ్చాయి. నిజానికి కార్గిల్ యుద్ధం సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పాక్ అనుకూల వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించాయనీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికీ  బీజేపీ విజయానికి అదీ ఒక కారణంగా, విశ్లేషణలు వినిపించాయి. నిజానికి భారత్, పాక్ శత్రు-మిత్ర సంబంధాల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉత్తర దక్షిణ దృవాల మధ్య ఉన్నంత వ్యత్యాసం వుంది.   అయితే, గతం ఎలా ఉన్నప్పటికీ  పహల్గాం ఉగ్రదాడి విషయంలో.. అలాగే  ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సైన్యం, భారత ప్రభుత్వం చేపట్టిన  ఆపరేషన్ సిందూర్  విషయంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ  ప్రభుత్వానికి సంపూర్ణ మద్దదు ప్రకటించాయి. సరే  మధ్య మధ్యలో చిన్న చిన్న పొరపొచ్చాలోచ్చినా గురువారం (మే8) ఆపరేషన్ సిందూర్  సమాచారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో  అధికార, ప్రతిపక్ష పార్టీలు చెక్కుచెదరని  ఐక్యతను  ప్రదర్శించాయి.  భారత దేశం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించదని, మరో మారు, ప్రపంచానికి స్పష్టం చేసింది.  గత నెల   22న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, జరిపిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సేనలు  ఆపరేషన్ సిందూర్  పేరిట గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. మన భద్రతా బలగాలు మంగళవారం ( మే 6) అర్ధరాత్రి దాటాక అత్యంత కచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్ర వాదులను మట్టు పెట్టడం పట్ల  దేశమంతా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.  సమావేశం అనతరం మీడియాతో క్లుప్తంగా మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆపరేషన్ సిందూర్  విషయంలో ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి అండగా ఉన్నాయని అన్నారు. అలాగే, ఉగ్రవాద నిర్మూలన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రతి చర్యకు ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.   ప్రతిపక్ష పార్టీ నాయకులు పరిస్థితిని అర్థం చేసుకుని పరిణతిని చూపారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు. ఇతర విషయాలు, వివ్దాలు ఎలా ఉన్నా,దేశ భద్రత, ఉగ్రవాద సమస్య వంటి విషయాల్లో రాజకీయాలకు తావులేదని, అధికార, ప్రతి పక్ష నాయకులు ముక్త కంఠంతో ఒకటే స్వరాన్ని వినిపించారు.

జ‌మ్ము ఎయిర్‌పోర్ట్‌పై పాక్ దాడులు..స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టిన భారత ఆర్మీ

  జమ్మూ లక్ష్యంగా పాకిస్థాన్‌ మరోసారి రెచ్చిపోయింది. ఓ వైపు  సరిహద్దు గ్రామాలపై  దాడుల‌కు పాల్ప‌డుతునే జ‌మ్ము ఎయిర్‌పోర్టు సమీపంలో ఆత్మాహుతి డ్రోన్‌ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆత్మాహుతి డ్రోన్ల‌తో పాక్ దాడుల‌కు దిగింది. ఎయిర్‌పోర్టుకు స‌మీపంలో రెండు శ‌క్తివంత‌మైన పేలుళ్ల శ‌బ్దాలు వినిపించాయి. పాకిస్తాన్ దాడుల‌ను భార‌త బ‌ల‌గాలు స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొడుతున్నాయి. పాక్‌కు చెందిన డ్రోన్ల‌ను ఇండియ‌న్ ఆర్మీ కూల్చివేసింది. ఈ క్ర‌మంలో స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌ల‌ను సైర‌న్ల‌తో భార‌త సైన్యం అప్ర‌మ‌త్తం చేసింది. ప్ర‌జ‌లంతా త‌మ నివాసాల్లోనే ఉండాల‌ని భార‌త సైన్యం హెచ్చ‌రించింది. జ‌మ్ములోని కిష్టావ‌ర్‌లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేశారు. బ్లాక్ అవుట్ పాటిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. రంగంలో దిగిన భారత ఆర్మీ ఆ డ్రోన్లను నేలకూల్చినట్లు తెలుస్తోంది. పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి.  అఖ్నూర్‌ సెక్టార్‌ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీచేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలుచోట్ల కరెంటు నిలిపివేశారు. అఖ్నూర్‌, కిష్త్‌వార్‌లో విద్యుత్‌ సరఫరా పూర్తిగా బంద్‌ చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.పాకిస్థాన్ లోని దాదాపు 15 నగరాలపై భారత్ డ్రోన్లతో దాడి చేసింది. మరోవైపు, భారత్ పై సరిహద్దుల నుంచి పాక్ మిస్సైళ్లు, రాకెట్లతో దాడి చేస్తోంది. వాటిని మన బలగాలు నిర్వీర్యం చేశాయి. కొన్ని అమృత్ సర్ సమీపంలో పడినట్టు సమాచారం. మరోవైపు, చీకటి పడటంతో పాక్ దాడిని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ ను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో మన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్ముకశ్మీర్ లోని జమ్ము, అక్నూర్ లలో సైరన్ మోగించింది. ఆర్మీ సైరన్ మోగించిందంటే... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. పాక్ దాడుల నేపథ్యంలో ఈ రాత్రి భారత్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.  

బరి తెగించిన పాక్.. జమ్ములో డ్రోన్ దాడులు.. భారత గగనతలంలోకి చొరబాటు యత్నం

పాకిస్థాన్ బరితెగించింది. జమ్ముపై డ్రోన్ దాడులకు తెగబడింది. భారత్ గగన తలంలోకి చొరబాటు యత్నం చేసింది. అయితే భారత సాయుధ దళాలు వెంటనే స్పందించి యూఏవీఎస్ లు వినియోగించి గగనతల చొరబాటు యత్నాలను అడ్డుకుంది. అలాగే పలు డ్రోన్లను గాలిలోనే నాశనం చేశాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.   కాగా పాక్ డ్రోన్ దాడుల నేపథ్యంలో జమ్మూడివిజన్ లోని పలు ప్రాంతాలలో బ్లాక్ అవుట్ అంటే విద్యుత్ ను పూర్తిగా నిలిపివేశారు. కుప్వారాలోని పఠాన్ కోట్ వైమానిక స్థావరం లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు చెబుతున్నారు. అలాగే జమ్ములో ఆర్మీసైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు.  అలాగే జమ్ములో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలంటూ కేందరం హెచ్చరించింది. ఇలా ఉండగా జమ్మూ విమానాశ్రం లక్ష్యంగా పాకిస్థాన్ రాకెట్ దాడికి పాల్పడింది. అలాగే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై కూడా పాక్ దాడికి పాల్పడింది. మొత్తం జమ్మూలో ఏడు చోట్ల భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. 

ఆదర్శ రైతు మంత్రి రామానాయుడు..సొంత పొలంలో ఎన్ని బస్తాలు వడ్లు పండించారంటే?

  రైతు బిడ్డగా వ్యవసాయం గురించి, రైతుల కష్టాల గురించి  తెలిసిన మంత్రి రామానాయుడు  ఆదర్శ రైతుగా నిలిచారు. ఆయన సొంత పొలంలో దాల్వా వరి సాగులో  ఎకరానికి 65 బస్తాలు అధిక దిగుబడులు సాధించారు. అతి తక్కువ పెట్టుబడులతో  యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల  సూచనలు సలహాలతో అధిక దిగుబడులు సాధించినట్లు  పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకురాలు  అద్దాల పార్వతి, పాలకొల్లు మండల వ్యవసాయ అధికారి  కే రాజశేఖర్ లు తెలిపారు. పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో   ఇరువురు వివరాలను వెల్లడించారు. పాలకొల్లు మండలం ఆగర్తి పాలెం గ్రామంలో మంత్రి రామానాయుడు తన ఆరు ఎకరాల  విస్తీర్ణంలో  వరి పి ఆర్  126  సన్న రకం ( గ్రేడ్ A) దాల్వా సాగు  చేశారు.  ఎకరానికి 65 బస్తాలు చొప్పున ఆరెకరాల్లో  390 బస్తాలు దిగుబడి సాధించారు. అతి తక్కువ  పెట్టుబడులతో అధిక లాభాలు పొందారు.ఆయన  ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలను తీర్చడంలోనూ, మరోపక్క  కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా  ఎంత బిజీగా, ఒత్తిడితో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఉండే రెండు రోజుల్లో  కొద్దిపాటి సమయం దొరికినప్పుడల్లా  పొలం కి వెళ్లి   స్వయంగా వ్యవసాయ పనులు చేశారు. నాట్లు వేయడం దగ్గర నుంచి  కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగుమందులు  చల్లడం ఇలా ప్రతి పనిలోనూ వ్యవసాయ కూలీలతో కలిసి మేమేకమయ్యేవారు. పంటకు కావలసిన యాజమాన్య పద్ధతులు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా సస్య సంరక్షణ చర్యలు తీసుకోవడం వంటివి చేశారు.  ఎక్కడ పోల్లు గింజలు లేకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. సకాలంలో నారు పోసి నాట్లు వేయడం, ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులు, పురుగులు, తెగుళ్లు  నివారణ చర్యలు, నీటి ఎద్దడి లేకుండా  ఎప్పటికప్పుడు మురుగునీరు బయటికి తీసి పిలక దశలో చేనును ఆరబెట్టడం ద్వారా  పైరు,వేర్లకు గాలి వెళ్తురు బాగా తగలడం, అధికంగా పిలకలు మొలవడం వంటివి అధిక దిగుబడులకు సాధ్యమైంది. మరీ ముఖ్యంగా  వ్యవసాయ అధికారులు,శాస్త్రవేత్తల సూచనలు సలహాలను  ఎప్పటికప్పుడు పాటిస్తూ అధిక దిగుబడులతో మంచి ఫలితాలు సాధించారు. ప్రతి రైతు  ఈ విధంగా వ్యవసాయంలో  ప్రత్యేకమైన శ్రద్ధను కనపరిస్తే మంచి దిగుబడులు పొందవచ్చునని  ఏడీఈ పార్వతి, ఏడి రాజశేఖర్ లు తెలిపారు. ఆదర్శ రైతుగా నిలిచిన  మంత్రి రామానాయుడు ను వ్యవసాయ శాఖ తరపున  ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు  చెప్పారు.  

భారత్ తలచుకుంటే ప్రపంచ పటంలో పాక్ ఉండదు : సీఎం రేవంత్‌రెడ్డి

  పహల్గమ్ ఉగ్రవాదాడి నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో శక్తివంతమైన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి నగరంలోని యువత పెద్ద ఎత్తున తరలి వచ్చింది. సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత దేశ సార్వభౌమత్వంపై ఎవరైనా దాడి చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. తమ శాంత స్వభావాన్ని చేతకానితనంగా భావించవద్దని హెచ్చరించారు. భారత భూభాగంలో కాలు మోపి, తమ ఆడబిడ్డల నుదుటి సిందూరాన్ని తుడిచి వేయాలనుకుంటే 'ఆపరేషన్ సిందూర్' ఇందుకు సమాధానం అని రేవంత్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ వంటి వాటి ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి భారత వీర జవాన్లకు ఉందని అన్నారు.  ఆ వీర జవాన్లకు 140 కోట్ల మంది భారతీయులు అండగా ఉంటారని అన్నారు. ఇండియా వైపు కన్నెత్తి చూస్తే మీకు నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. బ్రిటిష్ వాళ్ల నుంచి శాంతి ద్వారానే భారత్‌తో పాటు పాక్‌కు కూడా స్వేచ్ఛా వాయువులు అందించి మహాత్మా గాంధీ అమరులయ్యారని, ఆయన చేసిన శాంతియుత పోరాటం వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని అన్నారు.సెక్రటేరియట్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు సాగి, అక్కడి నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టెర్రరిస్టుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించడంతో పాటు, వారిని స్మరిస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు.  

తీరు మార్చుకోని లేడీ పోలీస్‌ ఆఫీసర్‌...నకిలీ ఏసీబీ అధికారి పేరిట బెదిరింపులు

  వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఇన్స్పెక్టర్ స్వర్ణలత మరొకసారి పోలీసులకు చిక్కింది. పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలుగా టిడిపి నాయకులపై తీవ్ర హెచ్చరికలు చేసిన ఆమె చివరికి ఒక నకిలీ ఏసీబీ అధికారికి సహకరించి పట్టుబడింది. గతంలో విశాఖలో ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన స్వర్ణలత ప్రస్తుతం గుంటూరు ఏఆర్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయంలో ఆ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు సన్నిహితంగా మెలిగింది. దీంతో ఆమె హడావుడి ఉత్తరాంధ్రలో మహారాణిల సాగింది. ఆ సమయంలో నోట్ల రద్దుతో ప్రజాప్రతినిధి నోట్లను మార్పిస్తానంటూ తన సొంత వాహనంలో తరలిస్తూ పోలీసులకు చిక్కింది.  ఈమెకు సహకరించిన డ్రైవర్ కానిస్టేబుల్ తో పాటు స్వర్ణ లత ను  అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు.  బెయిల్ లభించడంతో  గుంటూరులో ఆమె పోస్టింగ్ పొందారు ఈ దశలో ఇటీవల బాలకృష్ణ అనే వ్యక్తి జీవీఎంసీ... సబ్ రిజిస్టర్ ఆఫీసుల వద్ద తాను ఏసీబీ అధికారి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అనుమానం వచ్చిన సబ్ రిజిస్టార్ నిలదీయగా తాను ఏసీబీ అధికారిని అవునో కాదో నిర్ధారించుకోమంటూ స్వర్ణలతకు ఫోన్ చేసి మాట్లాడించారు. ఆమె బాలకృష్ణ ఏసీబీ అధికారి ఆయన చెప్పినట్టు నడుచుకోండి అని సలహా ఇచ్చింది. కానీ సబ్ రిజిస్ట్రా ర్ అనుమానంతో ఏసీబీ అధికారులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. ఈ దశలో బాలకృష్ణ ఏ ఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత కలిసి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో బాలకృష్ణతో పాటు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.  సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో పోలీస్ శాఖలోకి చేరిన ఆమె తొలి దశ నుంచి వివాదాస్పద అధికారిగా కొనసాగారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకుల పై తీవ్ర విమర్శలు ఆమె చేసిన విషయాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. విశాఖపట్నం మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణిని బెదిరించిన కేసులోనూ స్వర్ణలత పాత్ర ఉన్నట్లు తేల్చారు పోలీసులు. నకిలీ ఏసీబీ ఇన్స్‌పెక్టర్‌ సుధాకర్‌ను అడ్డుపెట్టుకుని డబ్బు కోసం సబ్ రిజిస్ట్రార్‌ని బెదిరించినట్లు తేల్చారు. సుధాకర్‌ కాల్‌ లిస్ట్‌ ద్వారా స్వర్ణలత బండారాన్ని బయటపెట్టారు. గతంలో 2000 రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్టయ్యారు స్వర్ణలత. సినిమాల్లో నటించాలన్న పిచ్చితో డబ్బులు కూడగట్టేందుకు దొంగ పోలీస్ అవతారమెత్తారు. నటనలో శిక్షణ తీసుకోవడమే కాదు… డ్యాన్సులు నేర్చుకున్నారు. అంతేకాదు ఏపీ 31పేరుతో ఓ సినిమా పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఆమె డ్యాన్స్ వీడియోలు, సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

హైడ్రా అంటే కూలగొట్టడానికే కాదు...ప్రభుత్వం, ప్రజల ఆస్తులను రక్షించేది : సీఎం రేవంత్‌

    హైదరాబాద్ బుద్ధభవన్‌లో హైడ్రా తొలి పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయి అక్కడ ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు సైతం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఢిల్లీలో పాటు దేశంలోని అనేక మెట్రో పాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు ఉన్నాయని.. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు . హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేది.. ఇది ప్రజలు గుర్తించాలని అన్నారు.  చిన్న వర్షం పడితే హైదరాబాద్ నగరం మొత్తం అల్లకల్లోలం అవుతుంది.. ఇంటి నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి ఉండదు.. కాలనీలన్నీ చెరువులను తలపిస్తాయని గుర్తుచేశారు. భవిష్యత్‌లో అలాంటి పరిస్థితి ఏర్పడొద్దనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా హైడ్రా శరవేగంగా పని చేస్తుందని  హైడ్రా కమిషనర్ రంగనాథ్  వెల్లడించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూముల రక్షణలోనే కాదు విపత్తుల నిర్వహణలోనూ హైడ్రా విశేషంగా కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ స్టేషన్‌లో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారు.

డ్రోన్లతో పాక్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్

  కరాచీ, లాహోర్, సహా ఇతర ప్రధాన నగరాలపై దాడి చేయడానికి భారతదేశం డ్రోన్‌లను ఉపయోగించిందని పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు క్షిపణి దాడులు చేసిన ఒక రోజు తర్వాత, లాహోర్, కరాచీలపై భారతదేశం డ్రోన్ దాడులు ప్రారంభించిందని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది.ఇలా ఉండగా, భారత్ ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగిస్తోంది. పాక్ కు చుక్కలు చూపిస్తోంది. పాక్‌ దాడులను తిప్పికొడుతూ భారత్‌ భారీగా ఎదురుదాడులు చేస్తోంది. తాజాగా పాక్‌ ఆర్మీ హెడ్‌ క్వార్టర్‌పై భారత్‌ డ్రోన్‌ దాడి చేసింది. పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది.  అటు, రావల్పిండి హెడ్‌ క్వార్టర్‌ పైనా భారత్‌ డ్రోన్‌ దాడి చేసింది. దీంతో పాకిస్థాన్ మీడియా ముందుకొచ్చి ప్రపంచ దేశాలతో లబోదిబోమంటూ మొరపెట్టుకుంటోంది.లాహోర్, కరాచీ ఇంకా పాకిస్థాన్ లోని ఇతర ప్రదేశాలలో భారత్ వరుస డ్రోన్ దాడులు నిర్వహించిందని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. మరోవైపు, కరాచీ విమానాశ్రయాన్ని సాయంత్రం 6 గంటల వరకు మూసివేసినట్లు పాకిస్థాన్ ప్రకటించగా, ఇస్లామాబాద్, లాహోర్‌లలో సాంకేతిక కారణాల వల్ల కొంత సమయం మూసివేసినట్లు పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థ తెలిపింది.